Showing posts with label వనం వారి కృష్ణా పురం. Show all posts
Showing posts with label వనం వారి కృష్ణా పురం. Show all posts

Wednesday, July 17, 2013

డబ్బై దశకంలో భూస్వాముల దాడులు-కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు: వనం జ్వాలా నరసింహారావు

డబ్బై దశకంలో భూస్వాముల దాడులు
కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు
వనం జ్వాలా నరసింహారావు

          డబ్బై దశకంలో మా చుట్టు పక్కల గ్రామ పంచాయితీలున్న పాలేరు సమితి, ఖమ్మం పంచాయితీ సమితిగా మారడం, మా గ్రామాలన్నీ అందులోకి రావడం జరిగింది. సమితి సభ్యులలో గణనీయమైన సంఖ్య కలిగి వున్న కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) బలమైన ప్రతి పక్షంగా వ్యవహరిస్తుండేది. జిల్లా రాజకీయాలకు సంబంధించినంతవరకు, కాంగ్రెస్ పార్టీ రెండు ముఠాలుగా చీలిపోయి, ఒక వర్గం శీలం సిద్దారెడ్డి నాయకత్వంలో, మరో వర్గం జలగం వెంగళ్ రావు నాయకత్వంలో పని చేయసాగాయి. ఇద్దరూ కొంతకాలం మంత్రులే. జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా వెంగళ్ రావు ముఠాకు చెందిన వ్యక్తి వుండేవాడు. ఖమ్మం సమితికి ఆయన అనుంగు శిష్యుడు సామినేని ఉపేంద్రయ్య అధ్యక్షుడు. సమితి అధ్యక్షుడుగా వుంటూ, ఆ అధికార దర్పంతో, గ్రామాలలో ముఠా తగాదాలను ప్రోత్సహించేవాడని ఆయనకు పేరుంది. ఖానా పురం, ముదిగొండ, వల్లభి గ్రామాలలో కక్షలు ప్రబలిపోవడానికి ఆయనే కారణం. కాంగ్రెస్ పార్టీలోనే పని చేస్తుండే, ఖానా పురం గ్రామ వాసి వేదాద్రి హత్యలో అతడి పాత్ర వుందనేవారు.

          కాంగ్రెస్ పార్టీ ముఠా తగాదాలు, చివరకు సమితి అధ్యక్షుడు ఉపేంద్రయ్యపై, సిద్దారెడ్డి వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టడానికి దారి తీశాయి. నాడు సిపిఎం పార్టీ పక్షాన ఖమ్మం ఎమ్మెల్యేగా వున్న రజబ్ అలీ సహాయంతో, సమితిలోని ఆ పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకుని, తన పదవిని నిలబెట్టుకున్నాడు ఉపేంద్రయ్య. తనకు సహాయం చేసిన పార్టీ అన్న విశ్వాసం కూడా లేకుండా, అదే పార్టీ కార్యకర్తలపై, మా చుట్టుపక్కల గ్రామాల కమ్యూనిస్టులపై దాడులు ప్రారంభించాడు ఉపేంద్రయ్య. బాణాపురం గ్రామంలో గండ్లూరి కిషన్ రావు నాయకత్వాన సాగుతున్న వ్యవసాయ కార్మిక రైతు కూలీ పోరాటాన్ని అణచివేయాలని పథకాలు పన్నుతున్న భూస్వాములను చేరదీశాడు. మా నాన్న పట్వారీగా పనిచేస్తున్న అమ్మపేట గ్రామ సర్పంచ్, కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరుడైన కోయ వెంకట్రావును, కాంట్రాక్టుల ప్రలోభం చూపించి తనవైపు తిప్పుకున్నాడు. కోయ వెంకట్రావు సహాయంతో గంధ సిరి గ్రామం మీద దాడి చేయించాడు. ఆ దాడిని గ్రామ ప్రజలు సంఘటితంగా తిప్పికొట్టారు. నాటి నుంచి వెంకట్రావు, ఉపేంద్రయ్యకు కుడి భుజంగా వ్యవహరించసాగాడు. బాణా పురంలో వుంటుండే వెంకట్రావు తమ్ముడు, కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని కోయ సత్యంను తన వైపు తిప్పుకున్నాడు అన్న. భవిష్యత్‍లో బాణా పురంతో సహా పరిసర గ్రామాలలో జరిగిన అనేక దాడులలో అన్నదమ్ములిద్దరు ముందుండేవారు. వారిద్దరితో పాటు మా మరో సరిహద్దు గ్రామం పమ్మికి చెందిన చిన కోటయ్య, పెద కోటయ్యలను కూడా చేరదీశాడు ఉపేంద్రయ్య. మిగిలిన గ్రామాల విషయం ఏమైనప్పటికీ, బాణా పురంలో మాత్రం కిషన్ రావు నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే పట్టుదలతో పని చేయసాగాడు ఉపేంద్రయ్య. ఆ గ్రామ భూస్వాములను చేరదీసి, డబ్బు పోగు చేశాడు. దెబ్బ తీయడానికి కాచుక్కూర్చున్నాడు. వారి పథకంలో భాగంగా, వారి పంచన పడి వున్న భూస్వాములకు అనుకూలంగా వ్యవహరించేందుకు, బాణా పురం, పమ్మి, పెద మండవ, అమ్మ పేట లాంటి కీలక గ్రామాలలో పోలీసు క్యాంపులు వెలిశాయి.


1970 జనవరి నెల రెండో వారంలో, ఉపేంద్రయ్య కుట్రలను వివరించడానికి, కమ్యూనిస్ట్ పార్టీ గ్రామగ్రామాన బహిరంగ సభలు ఏర్పాటు చేసింది. ఒకనాటి రాత్రి పమ్మి గ్రామంలో జరుగుతున్న బహిరంగ సభలో గండ్లూరి కిషన్ రావు ప్రసంగిస్తున్న సమయంలోనే, అంతకు ముందే సిద్ధం చేసుకున్న ఒక పథకం ప్రకారం, బాణా పురంలో కోయ సత్యం నాయకత్వాన భూస్వాములు-వారి అనుయాయులు, స్థానిక పోలీసు క్యాంపు సహకారంతో, గ్రామంలో వున్న కమ్యూనిస్టులపై కవ్వింపు చర్యలకు దిగారు. ఎదురు తిరిగిన వారిని అమానుషంగా కొట్టారు. అంతటితో ఆగకుండా, గ్రామంలో లేని కిషన్ రావుపైన పోలీసు కేసులు పెట్టించారు మర్నాడు. అలనాటి సర్కిల్ ఇన్ స్పెక్టర్ దుర్గా ప్రసాద రావు తోడ్పాటుతోనే ఇదంతా జరిగిందని బహిరంగంగానే అనుకుండేవారు. పమ్మిలో మీటింగు ముగించుకుని గ్రామం చేరుకున్న కిషన్ రావును, ఆయన వెంట వచ్చిన జిల్లా సిపిఎం నాయకుడు రావెళ్ల సత్యం గారిని పోలీసులు విచారణ పేరుతో క్యాంపుకు పిలిపించారు. గ్రామంలోని సుమారు వంద మంది కమ్యూనిస్ట్ కార్యకర్తలను కూడా క్యాంపుకు పిలిపించారు. ఒక విధంగా అందరినీ అక్కడ బంధించారనాలి. ఆ తరువాత గుండాలు, పోలీసుల సహాయంతో దాడులు చేశారు. ఇదేం అన్యాయమని నిలదీసిన రావెళ్ల సత్యం గారిని గ్రామం విడిచి వెళ్లమని హుకుం జారీ చేశారు. ఎదురు తిరిగిన సత్యం గారిని ఏమీ చేయలేక పోయారు. గ్రామంలోనే వుండి పోయిన సత్యం గారు, చిత్ర హింసలకు గురైన గ్రామస్తులకు అండగా నిలిచారు. పోలీసు క్యాంపులో వున్న గండ్లూరి కిషన్ రావును, ఆయన సహచర కమ్యూనిస్ట్ నాయకులైన ముక్కా చిన నర్సయ్యను, అప్పి రెడ్డిని హింసించారు పోలీసులు. ఇదంతా సరిపోదన్నట్లు, అందరినీ తాళ్లతో బంధించి, నేలకొండపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

బాణా పురం గ్రామంలో జరిగిన దాడులకు నిరసనగా, వేలాది మంది చుట్టు పక్కల గ్రామాల వారు, వూరేగింపుగా వెళ్లి, ఖమ్మంలో బస చేస్తున్న నాటి హోం మంత్రి వెంగళ్ రావుకు మెమొరాండం ఇచ్చారు. ఆ నాడు జరిగిన బహిరంగ సభకు సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి మోటూరు హనుమంత రావు హాజరై, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. హోం మంత్రిగారు ఉత్తుత్తి వాగ్దానాలు చేశారు కూడా. బాణా పురంలో అలనాడు జరిగిన హింసా కాండలో ముక్కా చిన నర్సయ్య, పెరుమాళ్ల చంద్రయ్య లతో సహా కిషన్ రావు కూడా శారీరకంగా బాధలకు గురయ్యారు చాలా రోజుల వరకు. గుండాల దాడులు, కవ్వింపు చర్యలు, పోలీసులు బనాయించే దొంగ కేసులు నిత్య కృత్యమయ్యాయి. ఈ నేపధ్యంలో, కమ్యూనిస్ట్ కార్యకర్తలిచ్చిన మెమొరాండాన్ని విచారించాల్సిన హోం మంత్రి జలగం వెంగళ్ రావు, అది చేయకపోగా, బాణా పురం గ్రామానికి స్వయంగా వచ్చి, భూస్వాములతో సమావేశమై, "మీకు నేను అండగా వుంటా" నని హామీ ఇచ్చి వెళ్లాడు! కాకపోతే, సుమారు రెండు వందల మంది పోలీసు బలగంతో మాత్రమే ఆయన ఆ రోజు బాణా పురం రాగలిగాడు! ఇది జరిగిన కొన్నాళ్లకు, మా గ్రామ సరిహద్దు గ్రామైన పమ్మిలో కమ్యూనిస్ట్ వ్యవసాయ కూలి సంఘ కార్యకర్త పెరుమాళ్ల చంద్రయ్యను పట్ట పగలే బండ రాళ్లతో కొట్టి చంపారు. ఆ వూళ్లో పోలీసు క్యాంపు కూడా వుండేదప్పుడు. కాకపోతే, క్యాంపులోని పోలీసులు గుండాలకే మద్దతిచ్చేవారు. కోర్టులో ఆ కేసు నీరు కారి పోయింది. చంద్రయ్యను చంపిన కొన్నాళ్లకు, మందా నారాయణ అనే మరో వ్యక్తి పోలీసు కాల్పుల్లో మరణించాడు అదే పమ్మి గ్రామంలో.

పమ్మి హత్యాకాండ, పోలీసు కాల్పులు, హంతకులకు సహాయ పడుతున్న పోలీసు వ్యవహార శైలి.....ఇవన్నీ...బాణా పురం భూస్వాములలో ఉత్సాహాన్ని నింపింది. ఒక పథకం ప్రకారం, గండ్లూరి కిషన్ రావు కుడి భుజంలా పని చేస్తున్న ముక్కా చిన నర్సయ్యను హత్య చేశారు. 1970 వ సంవత్సరం ఏప్రిల్ నెల మూడో వారంలో అనుకుంటా, చిన నర్సయ్య కోర్టు కేసుమీద ఖమ్మం వెళ్లాల్సి వచ్చింది. ఆయన వెళ్లే దారిలో, భూస్వాముల గుండాలు కాపు కాచి, గండ్ర గొడ్డళ్లు, బరిశెలతో ఆయనపై దాడి చేశారు. తప్పించుకునే వీలు లేకుండా దెబ్బ తీశారు. హత్య చేశారు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నేను ఖమ్మంలో వున్నాను. బాబాయి నర్సింగ రావుకు ఈ వార్త తెలిసింది. వెంటనే నేలకొండపల్లి వెళ్దామన్నాడు. తోడల్లుడు జూపూడి ప్రసాద్ కారు తీసుకుని నేలకొండపల్లి వెళ్లి నర్సింగ రావును అక్కడ దింపి వచ్చినట్లు గుర్తుంది. బహుశా అది అప్పటికి మూడో హత్య అనుకుంటా. ఇంతలో పంచాయితీ ఎన్నికలొచ్చాయి. ఏమైనా సరే.... సాధ్యమై నన్ని గ్రామ పంచాయితీలను గెలిచి, సమితిని, జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిని దక్కించుకోవాలని జలగం ముఠా, ఆయన అనుయాయుడు ఉపేంద్రయ్య పథకం రూపొందించారు. అన్నింటికన్నా ముఖ్యంగా బాణా పురం గ్రామ పంచాయితీని గెలవాలని పంతం పూనారు. కమలాపురం, గంధ సిరి గ్రామ పంచాయితీలు ఏకగ్రీవంగా కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) లకు దక్కాయి. మా గ్రామం వనం వారి కృష్ణా పురంలో, మొట్టమొదటి సారిగా కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసి, పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థిని గెలిపించుకుంది. పమ్మిలో పోటీ తీవ్రంగా వుండేది. అయినా కమ్యూనిస్టులే గెలిచారు. నాచే పల్లిలోనూ అంతే. తొలుత బాణా పురం ఎన్నికలు జరగకుండా హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు భూస్వాములు. ఎన్నికలు జరిగిన గ్రామాలలో చాలా భాగం కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు, లేదా, సిద్దా రెడ్డి వర్గం అభ్యర్థులు గెలిచారు. ఉపేంద్రయ్య వర్గానికి అతి తక్కువ సీట్లొచ్చాయి మా ప్రాంతంలో. బాణా పురంలో స్టే ఎత్తి వేసింది కోర్టు. ఎవరెన్ని ఎత్తులు వేసినా, ఒక్క వార్డు (భూస్వాముల ఇళ్లున్న వార్డు) మినహా అన్నీ సిపిఎం పార్టీ గెలుచుకుంది. గండ్లూరి కిషన్ రావు మళ్లీ సర్పంచ్ అయ్యాడు. ఎన్నికల సమయంలో భూస్వాములు చేయని అరాచకం లేదు. ఐనా, ఓటమి తప్పలేదు.

          ఖమ్మం సమితికి సిపిఎం అభ్యర్థి రాయల వీరయ్య అధ్యక్షుడుగా, గండ్లూరి కిషన్ రావు ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ సిద్దారెడ్డి వర్గానికి దక్కింది. సిపిఎం అభ్యర్థి టి. వి. ఆర్ చంద్రం జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడయ్యారు.

          ఎన్నికలు ముగిసినప్పటికీ, భూస్వామ్య గుండాల దాడులు-దౌర్జన్యాలు మాత్రం కొనసాగుతూనే వుండేవి. ఇంతలో 1971 లో లోక్ సభకు మధ్యంతర ఎన్నికలొచ్చాయి. ఎన్నికల ఓట్లు లెక్కింపు జరిగే నాటి సాయంత్రం, బాణా పురంలో జరిగిన కవ్వింపు సంఘటనలో, మరో కమ్యూనిస్ట్ కార్య కర్త బొల్లెద్దు రామనాధం ఒక బడా భూస్వామి చేతిలో, లైసెన్స్ లేని పిస్తోలు గుండుకు బలై హత్యకావించబడ్డాడు. చివరకు కోర్టు హత్య చేసినతనిని, ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపాడని నిర్దోషిగా తేల్చి వదిలేసింది!

ఇదిలా వుండగా....మా గ్రామ మరో సరిహద్దు గ్రామం అమ్మ పేటలో కూడా పోలీసు క్యాంపు వుండేది. ఆ గ్రామ మాజీ సర్పంచ్ కోయ వెంకట్రావు (అతడు 1970 పంచాయితీ ఎన్నికలలో వార్డు మెంబరుగా లాటరీలో గెలిచాడు. సర్పంచ్ గా మా పెదనాన్న గారి కుమారుడు వనం వరదా రావు ఎన్నికయ్యాడు) పోలీసుల అండతో గ్రామంలో అనేక దౌర్జన్యాలు చేసేవాడు. అతడు తాగుబోతు కూడా. తన దగ్గరున్న ఒక లైసెన్సు లేని రివాల్వర్‌తో గ్రామంలో ఒకడిపై దాడి చేసే ప్రయత్నంలో అది విఫలమై పట్టుబడ్డాడు. పోలీసు కేసు అయింది. నాలుగు సంవత్సరాల శిక్ష పడడానికి ఒకటి-రెండు రోజుల ముందర 1972 జనవరి నెలలో హత్యకు గురయ్యాడు. ఆ హత్య పూర్వాపరాలు నాకింకా గుర్తున్నాయి. బహుశా సంక్రాంతి ముందు రోజనుకుంటా....నేను, మా ఆవిడ, మా ఇంటి నుంచి దగ్గర లోనే వున్న మా తోడల్లుడు ఇంటికి నడుచుకుంటూ వెళుతుంటే కనిపించాడు వెంకట్రావు. ఒకరినొకరు పలకరించుకున్నాం. అప్పట్లో గ్రామంలో అతడికి పూర్తి వ్యతిరేకత వున్న కారణాన భయంతో ఖమ్మంలోనే వుంటూ కోర్టు చుట్టూ తిరుగుతుండేవాడు. ఎందుకో ఆ నాడు బాగా తాగి మా వూరు వెళ్లే ప్రయివేటు బస్సు ఎక్కి వాళ్ల వూరుకు బయల్దేరాడు. అప్పుడు మా పెద్దమ్మాయి బుంటికి ఇంకా ఏడాది కూడా నిండలేదు. భోగి పండ్లు పోయడానికి మా అమ్మ ఖమ్మంలో ఆగింది. ఆ కార్యక్రమం అయిపోయింతర్వాత అమ్మను మా వూళ్లో దింపడానికి తోడల్లుడి కారులో రాత్రి పొద్దు పోయిన తరువాత బయల్దేరాం. వూళ్లోదాకా కారు పోయే వీలు లేనందున వూరి బయటే ఆపి అమ్మను ఇంటిదగ్గర దింపడానికి నడుచుకుంటూ పోయి దింపి వెనక్కు వచ్చాం. తిరిగి ప్రయాణమై ఖమ్మం చేరుకున్నాం. ఆ మర్నాడు మాకు తెలిసిన వార్త....కోయ వెంకట్రావును, మా గ్రామంలో బస్సు దిగగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకు పోయారని, అమ్మపేట తీసుకు పోయి హత్య చేసారని. సరిగ్గా అతడిని మా వూరి నుంచి తీసుకుపోయే సమయానికే నేను మా అమ్మను కారులో మా వూరికి వెళ్లడం యాధృఛ్చికం అయినప్పటికీ, నాకు కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలుండడం వల్ల, నాపై కూడా అనుమానం వచ్చింది కాని దానిని మా గ్రామ పటేల్ తుల్లూరి రామయ్య ఖండించాడు.

కోయ వెంకట్రావు హత్యను అండగా చేసుకుని, ఉపేంద్రయ్య, కమ్యూనిస్ట్ పార్టీపై ధ్వజ మెత్తాడు. కమలాపురం గ్రామ సర్పంచ్ వనం నర్సింగరావును, గంధ సిరి గ్రామ సర్పంచ్ గండ్ర వీర భద్రా రెడ్డిని, బాణాపురం గ్రామానికి చెందిన బాజి హనుమంతును(శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో పోటీ చేస్తున్న), అమ్మ పేట గ్రామానికి చెందిన పలువురిని ఆ హత్య కేసులో ముద్దాయిలుగా చేర్పించాడు. గండ్ర వీర భద్రా రెడ్డి మొదటి ముద్దాయి కావడంతో మూడు నెలల పాటు బెయిలు కూడా దొరకలేదు. ఆయన జైలులో వుండగా గ్రామంలోని ఆయన వ్యతిరేకులు గూండాయిజం చేసి కమ్యూనిస్ట్ కార్యకర్తలను హింసించారు. ఆయనపై బలవంతంగా అవిశ్వాస తీర్మానం పెట్టించి నెగ్గించుకున్నారు. బెయిలుపై బయట కొచ్చిన గండ్ర వీర భద్రా రెడ్డిని గ్రామంలో ప్రవేశించ కుండా అడ్డుకున్నారు. గంధ సిరి గుండాలు ఆ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా అరాచకం చేశారు. గండ్ర వీర భద్రా రెడ్డి ఆ రోజుల్లో బాణా పురంలో కిషన్ రావు ఇంట్లో వుంటుండేవాడు. అయితే, గంధ సిరి గుండాలు బాణా పురంపైన మాత్రం దాడి చేయలేకపోయారు. అదే సమయంలో మరో హత్య కేసులో కిషన్ రావును, నర్సింగరావును పోలీసులు అక్రమంగా ఇరికించారు. ఏడాదిన్నర పైగా బయట వున్న గండ్ర వీర భద్రా రెడ్డి తన గ్రామం చేరుకున్నాడు. తిరిగి ఆయన నాయకత్వంలో కమ్యూనిస్టులు సంఘటితం కాసాగారు. అది చూసి ఓర్వలేని భూస్వామ్య గుండాలు పోలీసుల సహాయంతో, 1973 డిసెంబర్ నెలలో, బజార్లో వెళ్తున్న గండ్ర వీర భద్రా రెడ్డిని అతి దారుణంగా హత్య చేశారు.

అలా ఒకరి వెంట మరొకరు హత్యా రాజకీయాలకు బలై పోయారు. చివరకు ఉపేంద్రయ్య ముఠా వెనక్కు తగ్గింది. నిర్బంధాలు, హత్యలు కమ్యూనిస్టులను లొంగదీయ లేకపోయింది. కొంతకాలం ప్రశాంత పరిస్థితి నెలకొంది. అంతా సర్దు మణిగిందనుకుంటున్న స్థితిలో భయంకరమైన కుట్రకు 1976 ఫిబ్రవరి 7 వ తేదీన గండ్లూరి కిషన్ రావు బలై పోయాడు. ఖమ్మంలో సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయన ఇంటి సమీపంలో కాపుకాసిన హంతకులు కిషన్ రావుపై దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆయన హత్యతో ఒక శకం ముగిసి పోయింది. ఒక మహనీయుడు అస్తమించాడు.


దురదృష్టవశాత్తు, అలాంటి "ఎర్ర కోట" ల లాంటి గ్రామాలలో, నేడు ఒక్కటి కూడా కమ్యూనిస్టుల అధీనంలో లేదు. అలాంటి నాయకులూ లేరు. 

Monday, January 18, 2010

జ్వాలా మ్యూజింగ్స్-10 (వనం వారి కృష్ణా పురం)


"వనం వారి కృష్ణా పురం-సమీపంలోని నేలకొండపల్లి"

వనం జ్వాలా నరసింహారావు

వ్యవసాయం, కరిణీకం వృత్తిగా పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలో, సరైన రహదారి సౌకర్యంకూడా లేని కుగ్రామంలో నివసిస్తుండె, ఒక శుద్ధ ఛాందస కుటుంబంలో ఆగస్ట్ 8,1948 లో పుట్టాను నేను. నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తెలంగాణా సాయుధపోరాటం ఒకపక్క, వల్లభాయి పటేల్ ఆదేశాలతో పోలీస్ యాక్షన్ మరోపక్క జరుగుతున్న రోజులవి. మా కుటుంబం కాందిశీకులుగా ఆంధ్ర ప్రాంతంలో వున్న సరిహద్దు గ్రామం గండ్రాయిలో తలదాచుకుంటున్న రోజులవి. ఒక పేద పెరికవారి ఇంట్లో పుట్టాను. కొంతకాలానికి హైదరాబాద్ రాష్ట్రంకూడా భారత దేశంలో విలీనం కావడంతో మా కుటుంబం సొంత గ్రామానికి తిరిగొచ్చింది. నా బాల్యం చాలావరకు అమ్మా-నాన్నల దగ్గర, సొంత వూళ్లోనే గడిచింది. అయిదో తరగతి దాకా గ్రామంలోని పాఠశాలలో చదువుకున్నాను.

మా వూరిపేరు వనం వారి కృష్ణా పురం. మా కుటుంబం నిప్పులమీద నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకునేటంత ఛాందస కుటుంబం. మా వూరు ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో వుంది. అత్యధిక సంఖ్యలో గిరిజనులున్న జిల్లా మాది. షెడ్యూల్డ్ ప్రాంతంకూడా అత్యధికంగా వున్న జిల్లా మాదే. దండకారణ్యంలో, దేశంలో ప్రసిద్ధికెక్కిన భద్రాచల రామాలయం మా జిల్లాలోనే వుంది. రామాలయం కట్టించిన కంచర్ల గోపన్న-భక్త రామదాసు మా సమీప గ్రామం నేలకొండపల్లి వాస్తవ్యుడు. అది మా మేనమాముండే వూరు. నేలకొండపల్లిలో ఆయన పుట్టిన ఇంటిని భక్త రామదాసు ధ్యాన మందిరంగా ఇప్పటికీ పిలుస్తున్నారు. గ్రామంలో పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన నాలుగొందల ఏళ్ల క్రితం నిర్మించినట్లు చెప్పబడుతున్న వేంకటేశ్వరాలయం , భీమేశ్వరాలయం , వేణుగోపాల స్వామి , ఉత్తరేశ్వర ఆలయాలున్నాయి ఇక్కడే.

భక్త రామదాసుగా సుప్రసిద్ధమైన కంచర్ల గోపన్న తెలుగునాట జన్మించిన భక్త మహాశయులతో మహనీయుడు. ఆయన అచంచల రామ భక్తి జగత్‌ విఖ్యాతం. నేలకొండపల్లి గ్రామంలో అతి పేద కుటుంబంలో జన్మించి, చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న గోపన్న మేనమామలైన అక్కన్న, మాదన్న వద్ద పెరిగి పెద్దవాడయ్యాడు. ఆనాడు గోల్కొండను ఏలిన తానీషా వద్ద మంత్రులుగా వుండిన అక్కన్న, మాదన్న సాయంతో గోపన్న గోదావరి తీరంలోని భద్రాచలం పరగణాల తాహసీల్దారుగా నియమితుడయ్యాడు. మహా రామ భక్తుడైన గోపన్న పన్నుల రూపంలో వసూలు చేసిన ఆరులక్షలు వరహాలను వెచ్చించి భద్రాచలంలో శ్రీరాముడికి ఆలయం నిర్మించి, నవరత్న ఖచిత ఆభరణాలెన్నో చేయించాడు. విషయం తెలిసిన తానీషా గోపన్నకు 12 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించాడు. కారాగారంలో బందీ అయిన గోపన్న శ్రీరాముడిని భజిస్తూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, దెప్పుతూ, బెదిరిస్తూ, నిష్టూర మాడుతూ రోజు కొ కీర్తన చొప్పున కొన్ని వేల కీర్తనలు రచించాడు. గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై వచ్చి తానీషాకు గోపన్న చెల్లించవలసిన ఆరు లక్షల వరహాలు చెల్లించి గోపన్నను బంధ విముక్తుడిని చేశాడు. నాటి నుండి గోపన్న భక్త రామదాసుగా ప్రసిద్ధు డయ్యాడు. కారాగారవాసంలో రామదాసు రచించిన కీర్తనలే భద్రాచల రామదాసు కీర్తనలుగా ఖ్యాతి గడించాయి.

నేలకొండపల్లి గ్రామం గొప్ప చారిత్రక స్థలం. మహాభారతంతో ముడిపడ్డ కథలొకవైపు, బౌద్ధ అవశేషాల తాలూకు చారిత్రక వాస్తవాలు మరొక వైపు ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత నిస్తున్నాయి. మహాభారతంలో పాండవుల అజ్ఞాత కాలం నాటి విరాట నగరం నేలకొండపల్లి సమీపంలో వుంది. నేలకొండపల్లికి ఒక మైలు దూరంలో మహాభారత కథతో సంబంధం కలిగిన-విరాటరాజు కొలువుగా ఆ ప్రాంతం వాళ్లు భావిస్తున్న-పురా తత్వ శాస్త్రజ్ఞులు అంగీకరించిన, విరాటరాజు దిబ్బ, కీచక గుండం అనే స్థలాలున్నాయి. సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి వున్న విరాటరాజు దిబ్బ ప్రస్తుతం పురావస్తు శాఖ వారి అధీనంలో వుంది. సమీప గ్రామస్థులు కొన్నేళ్లకింద ఆ గడ్డను తవ్వగా అలనాటి నాణాలు దొరికాయని చెప్పుకుంటారిప్పటికీ. పాండవులు అజ్ఞాతవాస సమయంలో విరాట నగరాన్ని పాలించే విరాట రాజు కొలువులో మారువేషాల్లో చేరారు. విరాట రాజు బావమరిది కీచకుడు సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిని కామించగా, వలలుడి వేషంలో ఉన్న భీముడు కీచకుణ్ణి చంపేశాడు. ఆ విరాట నగరం ఈ ప్రాంతమేనని పౌరాణిక గాధ. మహాభారతం జరిగిందని చెప్పబడుతున్న కాలం నాటి అవశేషాలు ఇక్కడ దొరకడం విశేషం.

బౌద్ధమతానికి సంబంధించిన పలు అధారాలు నేలకొండపల్లి పరిసరాల్లో, పురా తత్వ శాఖ వారు కొనసాగిస్తున్న తవ్వకాల్లో బయటపడుతున్నాయి. ప్రపంచంలో కల్లా అతి పెద్ద దిగా భావించబడుతున్న, సుమారు రెండు కిలోమీటర్ల విస్తీర్ణమున్న బౌద్ధ రామం, ఈ ప్రాంతంలోని భూగర్భంలో వుందంటున్నారు పరిశోధకులు. 1977లో జరిపిన తవ్వకాల్లో బౌద్ధ అవశేషాలు, స్థూపాలు, విగ్రహాలు దొరకడంతో ఈ ప్రాంతంలో బౌద్ధమతం విలసిల్లిందని రూఢి పరిచారు పరిశోధకులు. అమరావతి, నాగార్జునకొండ, నేలకొండపల్లి ప్రాంతాలలో చెక్కిన బుద్ధ విగ్రహాలు ఇండోనేషియా, జావా, సుమిత్ర మొదలైన దేశాలకు ఎగుమతి అవుతుండేవట ఒకప్పుడు.