Sunday, February 27, 2022

రామలక్ష్మణులకు శివుడి వింటిని చూపించిన జనకుడు ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-97 : వనం జ్వాలా నరసింహారావు

                                 రామలక్ష్మణులకు శివుడి వింటిని చూపించిన జనకుడు                         

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-97

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (28-02-2022)

         జనకుడి మాటలను విన్న విశ్వామిత్రుడు ధనుస్సును చూపమని కోరాడు. దీర్ఘమైన-భయంకరమైన దేహాలున్న ఐదువేలమంది బలశాలులు, జనకుడి ఆదేశం ప్రకారం, అందరూ కలిసి ఇనుప పెట్టెతో సహా దాంట్లో వున్న పెద్దవింటిని తెచ్చారు వారున్న చోటికి. దివ్య ధనుస్సును తెచ్చామని వారు మహారాజుకు చెప్పగానే, తన ఆసనం పైనుంచి లేచి, ముకుళిత హస్తాలతో రామలక్ష్మణులను-విశ్వామిత్రుడిని చూసి, "మునీశ్వరా, ఇది జనకరాజులందరు పూజించే విల్లు. ఎంతటి మహాబలులని పేరున్న వారెవరూ విల్లెక్కుపెట్టలేక, గర్వమణిగి అవమానపడి మరలిపోయారు. మానవులైన రాజుల సంగతటుంచి, దేవతలు-రాక్షసులు-యక్షులు-కిన్నరులు కూడా విల్లెక్కపెట్టలేకపోయారు. నీకిష్టమైతే-చూపదల్చుకుంటే, రామలక్ష్మణులకు చూపించవచ్చు" అని జనకుడంటాడు. విశ్వామిత్రుడప్పుడు మహదానందంతో, రామచంద్రమూర్తిని చూసి, "నాయనా, రామచంద్రా, ఈ ధనుస్సును చూడు" అని చెప్పాడు. విశ్వామిత్రుడి ఆదేశం ప్రకారం శ్రీరాముడు, ధనుస్సుండే పెట్టె దగ్గరికిపోయి, దాని మూత తెరిచి, తాను వింటిని చూసానని-తాకానని చెప్పి, ఆయన ఆజ్ఞాపిస్తే బయటకు తీస్తానని అంటాడు. వింటిని బయటకు తీసి ఎక్కుపెడతానని కూడా అంటాడు. అలానే చేయమని జనకుడు, విశ్వామిత్రుడు చెప్పారు రాముడితో.

హరుడి విల్లు విరిచిన శ్రీరాముడు

          మాత్రం లక్ష్యంచేయకుండా, అవలీలగా వింటిని అరచేత్తో పట్టుకొని, బయటకు తీసి, రాజులందరు చూస్తుండగా అల్లెతాటిని బిగువుగా లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోయింది. (వింటి అల్లెతాడు ఒక కొన గట్టిగా కట్టబడి, రెండో కొనకు అవసరమొచ్చినపుడు మాత్రమే తగిలించే విధంగా తయారై వుంటుంది. విల్లెక్కు పెట్టేటప్పుడు, ఋజువుగా కట్టెలాగా వుంటుంది. విల్లెక్కుపెట్టాలనుకునేవాడు కొంచెం పైగా దండాన్ని పట్టుకొని, పైకెత్తి, అల్లెతాటిని ఈడ్చి, తనపిడికిలి కిందుండే కోపుకు తగిలిస్తాడు. ఇలా ఈడ్చి తగిలించడంలో, మితం కంటే ఎక్కువగా లాగితే దనుర్ధండం విరుగుతుంది. శ్రీరాముడదే చేశాడు. ఇది విలుకాడి బలాతిశయం తెలియచేస్తుంది). విరిగిన వింటి చప్పుడు పిడుగుపడినప్పుడు కలిగే ధ్వనిలా, కొండలు పగిలిపోతున్నట్లుగా, భయంకరమైన ధ్వనితో భూమి వణికింది. రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు, జనక మహారాజు తప్ప మిగిలిన వారందరూ, మనస్సు భ్రమించి స్మృతితప్పి నేలపై పడిపోయారు. కొంచెంసేపైంతర్వాత అక్కడున్నవారందరికి స్మృతి వచ్చింది. జనకుడు విశ్వామిత్రుడితో"నేనెందుకు ఇలాంటి ప్రతిజ్ఞ చేసాను? విల్లు ఎక్కుపెట్టగలిగే వారెవరైనా వున్నారా?నామాట దక్కేదెలా? సీతకు వరుడు దొరుకుతాడా? మానవుల్లో-దేవతల్లో అలాంటివాడు కనిపించడంలేదే? అని భయపడ్డాను. రామచంద్రమూర్తి అన్నివిధాలుగా నన్ను మెప్పించాడని,ఇతడు ఈ వింటిని ఎక్కుపెట్టగలడో-లేదోనని భయపడ్డాను. సీతనిస్తే బాగుంటుందని అనుకుంటుండగానే ఆయన విల్లు విరిచాడు.ఆయన అల్లుడయ్యే అదృష్టం నాకుందో-లేదో అనుకున్నాను.మునీంద్రా, రామచంద్రమూర్తి భుజబలం చూసాను. కళ్లారా చూసాను. రామచంద్రమూర్తి వింటిని విరిచాడు. ఇది వాస్తవానికి మిక్కిలి అసాధ్యమైన పని-ఆశ్చర్యకరమైన పని. మా సీత రామచంద్రమూర్తిని మగడిగా గ్రహించడమంటే అది నా అదృష్టం. నేను ధన్యుడనయ్యాను" అంటాడు. తన ముద్దుల కూతురు సీత దశరథ కుమారుడు శ్రీరామచంద్రుడిని భర్తగా పొందడంవల్ల తమ జనక కులానికి కీర్తి సంపాదించిపెట్టినట్లైందని కూడా అంటాడు జనకుడు విశ్వామిత్రుడితో.

దశరథుడి దగ్గరకు దూతలను పంపిన జనకుడు

"నా కూతురు వీర్యశుల్క అనేపేరుతో నేను చేసిన ప్రతిజ్ఞ ఫలించింది. నేనన్న మాట ప్రకారం, నా ప్రాణంకంటే ప్రియమైన భూపుత్రి సీతను గొప్ప గుణాలున్న శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేస్తాను" అని జనకుడు సీతను రాముడికి ధారాదత్తం చేసే ప్రయత్నం చేశాడుకాని, రాముడందుకు అంగీకరించలేదు. తనను విశ్వామిత్రుడు చెప్పిన పని చేయాల్సిందిగా తన తండ్రి ఆజ్ఞాపించాడని, ఆయన వింటిని చూడమంటే చూసానని, ఎక్కుపెట్టమంటే పెట్టానని, అది నిస్సారమైంది కనుక ఫెల్లున విరిగిపోయిందని అంటూ, వివాహమాడడానికి తనకు తండ్రి ఆజ్ఞలేదని జనకుడికి చెప్పాడు. ఆ కార్యం చేయడానికి తన తండ్రి స్వతంత్రుడు గాని తాను కానని, ఆయన మెచ్చి ఎవరిని చేసుకోమంటే ఆమెనే వివాహమాడుతానని, జనకుడి కోరికను నిరాకరించాడు. రామచంద్రమూర్తి ధర్మం చెప్పాడని విశ్వామిత్రుడంటూ దశరథుడుని పిలిపించమని చెప్పాడు. తన మంత్రులిప్పుడే అయోధ్యకు పోతారని అంటాడు జనకుడు. "దశరథ మహారాజా, నీ కుమారులు విశ్వామిత్ర మహాముని రక్షణలో, ఆయన వెంట మా నగరానికొచ్చారు. ఇక్కడ సభ వారందరూ చూస్తుండగా, రామచంద్రమూర్తి, అవలీలగా శివుడి ధనుస్సు విరచడంవల్ల వీర్యశుల్కైన నా కూతురు సీతను నీ కుమారుడు రామచంద్రమూర్తికిచ్చి వివాహం చేయదల్చాను. ఈ వార్త మీకు చెప్పి, మిమ్మల్ని ఇక్కడకు తీసుకొని రమ్మని జనక రాజు మమ్ము పంపాడు. మీరిక్కడకు రావాలని మా మహారాజు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాడు" అని నేను పంపిన వారు దశరథుడితో చెప్తారని అంటాడు జనకుడు. విశ్వామిత్రుడు అలానే చేయమని చెప్పగా, దశరథుడికి శుభలేఖ రాసిచ్చి దూతలను ఆయన దగ్గరకు పంపాడు జనకుడు.

Saturday, February 26, 2022

అర్జున విషాద యోగం – శ్రీకృష్ణుడి విశ్వరూప ప్రదర్శన, అర్జునుడికి తత్త్వజ్ఞానోపదేశం ..... ఆస్వాదన-61 : వనం జ్వాలా నరసింహారావు

 అర్జున విషాద యోగం –

శ్రీకృష్ణుడి విశ్వరూప ప్రదర్శన, అర్జునుడికి తత్త్వజ్ఞానోపదేశం

ఆస్వాదన-61

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (27-02-202)

ధర్మరాజు భీష్మ, ద్రోణ, కృపాచార్యుల దగ్గరికి పోయి వారి అనుమతి, ఆశీర్వాదం తీసుకుని మరలి వస్తున్న సమయంలోనే, తానున్నంతవరకు యుద్ధానికి రాకుండా భీష్ముడు నిషేధించిన కర్ణుడు, కురుపాండవ సేనల విన్యాసాలను చూడాలన్న వేడుకతో యుద్ధరంగానికి వచ్చాడు. కర్ణుడిని చూసిన శ్రీకృష్ణుడు అతడి దగ్గరికి వెళ్లి మర్యాదగా పలకరించాడు. భీష్ముడిమీద కోపంతో కర్ణుడు యుద్ధంలో పాల్గొనడం లేదని తెలిసిందని, కాబట్టి భీష్ముడు మరణించే వరకు సరదాగా అతడు పాండవ పక్షంలో చేరి యుద్ధం చేయగూడదా? అని, అలా చేసి భీష్ముడి మీద పగతీర్చుకోవచ్చుకదా? అని సరదాగా మాట్లాడాడు. ఇది ఒక విధంగా శ్రీకృష్ణుడి రాజనీతి చతురతకు చక్కటి ఉదాహరణ. కార్యసాధనకు సామ, దాన, భేద, దండోపాయాలు అవసరమని అంటారు. జవాబుగా కర్ణుడు తాను రారాజైన దుర్యోధనుడికి ఏనాడో తన ప్రాణం సమర్పించానని, వేరే పక్షంలో చేరే ప్రసక్తే లేదని, అలా చేయడం న్యాయం కాదని స్పష్టం చేశాడు. కర్ణుడి స్వామిభక్తికి ఇది చక్కటి ఉదాహరణ. శ్రీకృష్ణుడు వెనక్కు వచ్చాడు.

ధర్మరాజు మళ్లీ కవచం ధరించి యుద్ధానికి సన్నద్ధుడయ్యే ముందు ఒక పిలుపిచ్చాడు కౌరవ పక్షంలో వున్నవారికి. అటు నుండి ఎవరైనా వచ్చి పాండవ పక్షంలో చేరితే వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తానని అనగానే ధృతరాష్ట్రుడి కొడుకు యుయుత్సుడు వచ్చి చేరాడు. కౌరవపాండవ సేనలు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం చేరి యుద్ధానికి సంసిద్ధులై వున్నారు. కౌరవ సేనాపతైన భీష్ముడు సింహనాదం చేసి శంఖం వూదాడు. మిగిలిన రాజులు కూడా అలా చేయగానే ఆకాశం యుద్ధవాద్యాల ధ్వనితో నిండిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, ధర్మరాజు అనంతవిజయాన్ని పూరించారు. భీమ, నకుల సహదేవ, ద్రుపద, విరాట, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, శిఖండి మొదలైనవారు తమ శంఖాలను పూరించారు.

సరిగ్గా ఆ సమయంలో, యుద్ధం ఇక ఆరంభించాల్సి వుండగా, అర్జునుడు గాండీవాన్ని ధరించి, అల్లెతాటిని మోగించి, బాణాలు చేత్తో తీసుకుని, శ్రీకృష్ణుడితో, తానిప్పుడు ఎవరితో యుద్ధం చేయాలో నిర్ణయించుకోవాలని, కాబట్టి రథాన్ని యుద్ధం మధ్యలోకి తీసుకుపొమ్మని అన్నాడు. అర్జునుడు కోరినట్లే రథాన్ని రెండు సేనల మధ్య నిలిపాడు శ్రీకృష్ణుడు. బంధు మిత్రులను చూసిన అర్జునుడు దుఃఖానికి లోనయ్యాడు. తన గాండీవం జారిపోతున్నదని,  ఈ క్రౌర్యానికి తాను ఒడిగట్టలేనని, ఇంతమంది చచ్చిపోయాక కలిగే సౌఖ్యాలు ఏపాటివని శ్రీకృష్ణుడితో అన్నాడు. ఇంకా ఇలా అన్నాడు.

ఉ:       తాతల మామలన్ సుతుల దండ్రుల దమ్ముల నన్నలన్ గురు

వ్రాతము శిష్టకోటి సఖివర్గము దుచ్ఛజనానురూప దు

ర్నీతి వధించి యేబడయు నెత్తుటదోగిన రాజ్యభోగముల్

ప్రీతియొనర్చునే యశము పెల్లొడగూర్చునే పెంపొనర్చునే?

         (తాతలను, మామలను, కొడుకులను, తండ్రులను, సహోదరులను, గురువులను, స్నేహితులను, స్వార్ధ బుద్ధితో సంహరించి పొందే రాజ్యసుఖాలు రక్తంతో తడిసినట్టివి. అవేం సంతోషం కలిగిస్తాయి? ఎలాంటి కీర్తిని తెచ్చిపెట్ట గలవు? ఏ అభ్యున్నతిని చేకూర్చగలవు?). యుద్ధమార్గం తాను అంగీకరించ లేనన్నాడు అర్జునుడు. ఇంతటి పాపం చేయడానికి పూనుకోవడమా? రాజ్యం మీద ఆశతో బంధువులను చంపుకోవడమా? అని అర్జునుడు పలుకుతూ రథం మీద తన చేతిని ఆసరాగా చేసుకుని కూలబడి కూచున్నాడు. (దీన్నే అర్జున విషాదయోగం అని అంటారు. దీని పర్యవసానమే భగవద్గీత ఉపదేశం). అప్పుడు ఆర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేయడం ఆరంభించాడు.

         అర్జునుడికి ఇలాంటి ఆడంగితనం కూడదని, మనస్సులోని తక్కువ భావాన్ని విడిచిపెట్టి గొప్పవాడివి కమ్మని, యుద్ధానికి లెమ్మని హెచ్చరించాడు. అర్జునుడు అలాగే విషాద తన్మయత్వంతో రథం మీద కూలబడి కూచుని శ్రీకృష్ణుడికి జవాబిచ్చాడు. తాను భీష్మ, ద్రోణులలాంటి బంధుమిత్రులను చంపడం పరాక్రమం కాదని, కాబట్టి యుద్ధం చెయ్యలేనని అన్నాడు. తాను ధర్మం తెలియని మూఢుడినని, తనకు జ్ఞానోపదేశం చేసి కర్తవ్యం తెలియచేయాలని అర్జునుడు శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. ఏ మాత్రం దుఃఖించదగని వారికోసం అర్జునుడు దుఃఖిస్తున్నాడని, వున్నవారికి, విధివశం వల్ల తప్పనిసరిగా చనిపోయినవారికి దుఃఖించాల్సిన అవసరం లేదని, మనసు ఉజ్వలమైన వివేకంతో కూడినదైతే దుఃఖాలన్నీ నశిస్తాయని శ్రీకృష్ణుడు అన్నాడు.

         శ్రీకృష్ణుడు అర్జునుడికి తత్త్వజ్ఞానోపదేశం చేశాడు. చేస్తూ ఇలా అన్నాడు. ‘మానవదేహం బాల్యం, యౌవనం, వార్థక్యం అనే అవస్థలు పొందినట్లుగా, చినిగిపోయిన పాతబట్టలు విడిచి కొత్త బట్టలు ధరించినట్లు, ఆత్మ ఒక దేహాన్ని విడిచి మరొక దేహాన్ని పొందుతుంది. ఆత్మ దేహాంతరగమనం వల్ల నశించదు. నశిమ్చేది శరీరం మాత్రమే. ఆత్మకు పుట్టుక, చావు అనేవి లేవు. ఆయుధాలు శరీరానికే తప్ప ఆత్మకు హానిచేయలేవు. ఆత్మ (పురుషుడు) బాధించేవాడు కాదు; బాధను పొందేవాడూ కాదు. ఆత్మకు అభావం లేదు. ఆత్మ శాశ్వతం. శరీరం నశించేది. దానికి అస్తిత్వం లేదు. ఈ కారణం వల్ల ఎవరూ శోకించాల్సిన అవసరం లేదు. చావుపుట్టుకలు సహజ పరిణామం అని సరిపెట్టుకోవాలి. ఆత్ముడు నశిస్తాడు అని అనేవాడు, ఆత్ముడు నశింపచేస్తాడు అని అనేవాడు, ఇద్దరూ అవివేకులే! ఆత్మ నశించదు. ఎవరినీ నాశనం చేయదు. పురుషుడు, ఆత్మ అంటే నేనే! వేరొకడు కాదు. పురుషోత్తమత్త్వం అభివ్యక్తం కావడానికి ఆత్మత్వస్ఫూర్తి వుంటుంది. అదే సర్వక్రియలకూ పూనుకుంటుంది’.

         ఇలా ఎన్నో విధాలుగా శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆత్మకు బాధింపబడడం లేదని, బాధించడమూ లేదని వివరించాడు. అర్జునుడి అహంకార, మమకారాలను తొలగించాడు. అర్జునుడు యుద్ధానికి చేయాల్సిన స్వకర్మావలంబనం వదలరాదని తెలియచేసే మాటలను చెప్పాడు. క్షత్రియులకు ముఖ్య కర్తవ్యం యుద్ధమని, దానివల్ల స్వర్గం లభిస్తుందని, లేచి యుద్ధం చెయ్యమని బోధించాడు. ఇంక ఇలా అంటాడు:

         కం:      ఫలముల యెడ బ్రహ్మార్పణ, కలన పరుండగుచుఁ గార్య కర్మము నడపన్‌

వలయుం దత్త్వ జ్ఞానము, దల కొనినం గర్మ శమము దానై కలుగున్‌        

         (ఫలితాల పట్ల మమకారం విడిచి కర్తవ్యాలను నిర్వహించాలి. ఫలితాలు, జయాపజయాలు భగవదర్పితం చేయాలి. తత్త్వజ్ఞానం లభిస్తే ఇక కర్మ నాశనం తానంతట అదే కలుగుతుంది. ఈ పద్యాన్ని, సందర్భాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు ఇలా రాశారు: ‘ఈ పద్యం తిక్కన రాసిన భగవద్గీతకు కేంద్ర గరిమనాభి. ఇది భగవద్గీతాసారసంగ్రహం అనదగిన పద్యం’.)

         శ్రీకృష్ణుడు అనేకరకాల చెప్పి, అనేక మార్గాలను వివరించి, అర్జునుడు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి, అతడి అనుమానాలన్నిటినీ పోగొట్టాడు. ఇవన్నీ విన్న అర్జునుడు లేచి, నిలుచుని, శ్రీకృష్ణుడితో, ఆయన అందించిన సందేశం, చేసిన ఉపదేశం మిక్కిలి రహస్యమైనదని, తనమీద ఎంతో దయ వున్నది కాబట్టే ఇలాంటి ఆత్మజ్ఞానం తనకు కలిగించాడని, ఆయన చెప్పిన ఆధ్యాత్మికతత్త్వం వినడం వల్ల తన భ్రమ తొలగిందని, యోగీశ్వరులు చూడడానికి తహతహలాడే ఆయన రూపం తనకు దర్శింపచేయమని ప్రార్థించాడు. వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్యదృష్టి ప్రసాదించి తన విశ్వరూపాన్ని ప్రదర్శించగా, అర్జునుడు దానిని సందర్శించాడు. ఆ విశ్వరూపం వర్ణనాతీతం. సర్వ ప్రపంచంతో కూడిన, సమస్త సృష్టికి మూలకారణమైన, భూమ్యాకాశ దిక్కులన్నీ కలిగిన, దేదీప్యమానంగా వెలుగొందిన, ఆ విశ్వరూపాన్ని కాంచిన అర్జునుడు శ్రీకృష్ణుడిని పరిపరివిధాల స్తుతించాడు. తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, అసలాయన ఎవరో చెప్పమని వేడుకున్నాడు.

         జవాబుగా, తాను లోకాలన్నిటినీ నాశనం చేసే యముడిని సుమా! అన్నాడు శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర సంగ్రామ రంగంలో జనసందోహాన్ని సంహరించడానికి ఉద్యుక్తుడనయ్యానని, అర్జునుడు తాను చంపుతున్నట్లు భ్రమలో పడనక్కర లేదని, భీష్మద్రోణులంతా అవశ్యం చావాల్సినవారేనని, తాను చంపే వీరందరినీ అర్జునుడే చంపినట్లుగా భావించి విజయం కైకొని రాజ్యం ఏలుకొమ్మని అన్నాడు. అర్జునుడు నిమిత్తమాత్రుడే అని, లేచి యుద్ధం చెయ్యమని ఆదేశించాడు. ఆ ఆమాటలు విన్న అర్జునుడు వణకుతూ చేతులు జోడించి శ్రీకృష్ణుడికి నమస్కారం చేశాడు. తాను ఎక్కువసేపు ఆయన విశ్వరూపం చూడలేనని, శాంత స్వరూపం ధరించమని వేడుకున్నాడు. సామాన్యులు దర్శించలేని తన విశ్వరూపాన్ని అర్జునుడికి మాత్రమే చూపానని అంటూ వెనుకటి ఆకారాన్ని ధరించాడు శ్రీకృష్ణుడు.

         అర్జునుడికి రహస్యమైన జ్ఞానాన్ని అందించానని, అతడా సందేశాన్ని అవగాహన చేసుకుని, తనకు నచ్చిన రీతిలో ప్రవర్తించమని చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. ఇప్పుడు చెప్పినదానికంటే గొప్ప రహస్యం చెప్తానని అంటూ, ధర్మాలు ఎన్నో వున్నప్పటికీ, వాటికి ఎన్నో ప్రత్యామ్నాయాలు వున్నప్పటికీ, వాటన్నిటి కంటే రక్షించేవాడు తానే అని నమ్మి తన శరణు పొందమని, అలా చేస్తే పాపాలన్నీ పోగొట్టి సంతోషం చేకూరుస్తానని చెప్పాడు. శ్రీకృష్ణుడి మీద తనకు పరిపూర్ణ భక్తి విశ్వాసం కలిగాయని, అన్ని అనుమానాలు తొలగిపోయాయని, ఆయన విశ్వరూప సందర్శనం వల్ల తన జ్ఞానం ద్రుఢ౦గా పాదుకున్నదని, ఇక ఆయన చెప్పినట్లుగా నడచుకుంటానని అన్నాడు అర్జునుడు.

ఇలా అంటూ అర్జునుడు శ్రీకృష్ణుడికి భక్తితో సాష్టాంగనమస్కారం చేసి, గాండీవం ధరించి నిలిచాడు. భీష్ముడి మొదటి రోజు యుద్ధం ప్రారంభం అయింది.     

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

              

          

    

    

Thursday, February 24, 2022

'Bangaru Bharat': What is on KCR's mind? ...... Vanam Jwala Narasimha Rao and VJM Divakar

 'Bangaru Bharat': What is on KCR's mind?

Vanam Jwala Narasimha Rao

VJM Divakar

The Pioneer (25-02-2022)

Telangana State Chief Minister and TRS supremo K Chandrashekhar Rao has declared that he would pursue his idea of forging an alternative to the Bharatiya Janata Party at the Centre for the coming General Election and started taking initial steps in that direction. This is the right time and situation to assess, examine, study, and posit what would happen when KCR, going by his track record, succeeds in his lofty endeavor, marking a paradigm shift in national politics as well as governance of the country.

The Chief Minister has articulated the need for a sea-change in the country's political landscape, which has been in a rut for the past 75 years. He has hinted that he himself would be leading the emerging alternative. He has called for a qualitative change in the country's politics. For those who have been following KCR as a front-line leader who had spearheaded the Telangana statehood movement for 14 years as well as his governance as the Chief Minister for nearly the last eight years, the task envisaged by him is not at all difficult.

KCR has begun to specify what should be done to raise the country, which is now under a dispensation that has shattered the economy, disturbed peace, upset law and order situation, polarized people on religious and caste lines, harassed political opponents, criminalized politics, indulged in unprecedented corruption, shown total disregard for the poor, SCs, STs, BCs and minorities, and betrayed lack of understanding of ethics and values of democracy.

His angst towards the BJP-led Centre for undermining every institution, the powers of States and the very basic fabric of cooperative federalism should be understood in the right spirit.

The first and foremost thing that KCR would do, when he gets a chance to be at helm of affairs at the national level, is to strengthen the time-tested and age-old Ganja-Jamuna tehzeeb of this country.

He will get rid of communal polarization that began in 2014 and knit the secular fabric, making it strong once again. He would ensure that there is communal harmony in the country and no more targeting, attacking and persecuting of people based on their caste, creed and community. He would bring back the freedom of speech and expression, freedom to practice any religion; and restore people's right to eat what they want and dress the way they want.

Some people may be curious to know what exactly KCR meant when he talked about 'Bangaru Bharat (Golden India)'. For the unversed, some logical conclusions may drawn about his vision on the basis of his stellar achievements in Telangana as the state's first Chief Minister.

The three sectors that will get priority are Power, Irrigation and Agriculture. KCR would bring reforms in the power sector and tap 2 lakh MW of power generated and supply it to every nook and corner of the country. Thus, 24-hour, uninterrupted and quality power supply would be a reality across the country, not just in Telangana State. Major, medium and small irrigation projects would be launched to utilize 65,000 tmc of water available across the country.

In a scientific method, he would interlink the rivers to make all farmland in the country fertile and irrigated. Besides providing 24-hour water availability to the farm sector, he would address farmers' problems once and for all. KCR would launch his Rythu Bandhu and Rythu Bhima programmes all over the country.

He would create agriculture clusters all over the country and ensure that farmers would produce crops that are appropriate for the soils they have and which are in demand at national and international markets.

For Dalits, KCR would implement Dalit Bandhu scheme all over the country and ensure that the each and every Dalit family is self-reliant economically. For tribals, BCs, SC, ST and the minorities, he would launch schemes that would give them benefit and make them live with self-respect in society. Programmes like Kalyana Laxmi and Shaadi Mubarak will be implemented at the national level in all the states.

Residential educational institutions, especially for the BCs, SCs, STs and the minorities, would be launched and 50 per cent of them would be earmarked for girls.

KCR would make India a favorite destination for students abroad. Instead of our students going abroad for higher studies, students from other countries would swarm to India for their higher studies.

KCR would think of reversing certain decisions of the Modi government like implementation of faulty GST, usurping powers of the state governments, and trying to take control of subjects in the Concurrent List of the Constitution. He would pave way for the true federal spirit with which states and the Union governments ought to function. He would scrap all draconian laws that have been in vogue from the colonial times.

On the economy front, KCR would usher in new policies like the ones introduced by former Prime Minister late PV Narasimha Rao. KCR's reforms would be practical, people-friendly, and a win-win policy for the government as well as the taxpayer. His reforms would bring in major investments and India would become the most favorite investment destination in the world.

In other words, KCR's Bangaru Bharat would mean a peaceful, happy, and comfortable country -- a nation which would be the most-favored destination for investors, students, travelers, truth-seekers and globe trotters alike.

 

Sunday, February 20, 2022

రామ లక్ష్మణులకు శివుడి విల్లు చూపమని జనకుడికి చెప్పిన విశ్వామిత్రుడు ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-96 : వనం జ్వాలా నరసింహారావు

 రామ లక్ష్మణులకు శివుడి విల్లు చూపమని జనకుడికి చెప్పిన విశ్వామిత్రుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-96

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (21-02-2022)

         మర్నాడు ఉదయం జనకమహారాజు, ప్రాతః కాలకృత్యాలను తీర్చుకొని, శ్రీరామచంద్రమూర్తిని తీసుకొని రమ్మని విశ్వామిత్రుడికి కబురుపంపాడు. వారు రాగానే, వారి కోరికేంటో తెలియచేయమని అడిగాడు విశ్వామిత్రుడిని. "జనక మహారాజా, వీరు దశరథ మహారాజు కొడుకులు. సూర్యవంశాలంకారాలు. మహా వీరులు. ప్రపంచంలోనే ప్రసిద్ధికెక్కిన వారు.వీరికి నీదగ్గరున్న ధనుస్సును చూపిస్తే, వారి కోరిక ప్రకారం, అది చూసిన తర్వాత, వారిష్టప్రకారం వెళ్లిపోతారు" అని రామ లక్ష్మణులను చూపిస్తూ చెప్పాడు జనకుడితో విశ్వామిత్రుడు.

         సమాధానంగా జనకుడు, " మునీంద్రా, ఈ ధనుస్సు నాదగ్గర వున్న కారణం చెప్తాను. నిమికి ఆరవ వాడైన దివ్య మహిమగల-నిర్మల మనస్సుగల, దేవరాతుడనే రాజు దగ్గర దేవతలు ఈ వింటిని ఇల్లడగా వుంచి స్వర్గానికి పోయారు. దేవతలకు ఈ విల్లు దొరకడానికీ కారణముంది. దక్షుడు చేస్తున్న యజ్ఞాన్ని ధ్వంసం చేద్దామనుకున్న రుద్రుడు, యజ్ఞంలో భాగమైన దేవతలపై కూడా ఆగ్రహించాడు. యజ్ఞంలో దేవతలందరు వారి భాగం పంచుకొని తనకెందుకు లేకుండా చేసారని, తన భాగం ఇవ్వకపోతే వారందరి తలలు తనదగ్గరున్న వింటితో నరికి వేస్తానని భయపెట్టాడు. తెల్లబోయిన దేవతలందరు, రుద్రుడిని ప్రార్తించడంతో, సర్ప భూషణుడు వారిని క్షమించి ఆయన దగ్గరున్న ధనుస్సును వారికిచ్చాడు. దానిని దేవతలు తెచ్చి నా పూర్వీకుడికిచ్చారు. అప్పటినుంచి ప్రతిదినం పూజలందుకుంటూ నా ఇంట్లో వుందా ధనుస్సు. ఒకసారి యజ్ఞం చేద్దామన్న అభిప్రాయంతో, నాలుగు ఎద్దులతో కొంత భూమిని దున్నించాను. అప్పుడు నాగేటిచాలులో ఒక పసిపాప దొరికింది. నాగటిచాలంటే సీత అని, నాగటిచాలులో దొరికింది కనుక సౌందర్యవతైన ఆ పసి దానికి సీత అని పేరు పెట్టాను. సీత పవిత్రంగా జన్మించినదే అయినా, లోకంలో అందరిలాగా పుట్టింది కాదు. నేనామెను నా స్వంత కూతురులాగానే సాకాను. సీత వీర్యశుల్కని భావించి, ఎవరికిచ్చి పెళ్లిచేయకుండా వూరుకున్నాను. అయితే లోకంలోని రాజకుమాలెందరో వచ్చి, సీతను తమకిమ్మని కోరారు".

"అలా అడగడానికి వచ్చిన రాజకుమారులతో, సీత వీర్యశుల్కనీ, శక్తి ప్రదర్శన చేయడమే అమెకివ్వదగిన శుల్కమనీ, ఎటువంటి వస్త్రవాహనాది అలంకారాలు ఇవ్వాల్సిన పనిలేదనీ, నా దగ్గరున్న ధనుస్సును ఎక్కుపెట్టగలవాడికే నా కూతురు సీతను ఇస్తానని చెప్పాను. వచ్చినవారిలో ఎవరుకూడా వింటిని ఎక్కుపెట్టడం మాట అటుంచి, అల్లెతాడును ఎక్కించడంగాని, కనీసం వింటిని ఎత్తడంగాని చేయలేకపోయారు. వచ్చిన వారందరూ బింకపు బిరుదులుగలవారే కాని, నిజమైన బలవంతులు కాదని-అల్ప పౌరుషులని తెలుసుకొని, వారెవరికీ కన్యనీయనన్నాను. వారంతా నామీద కోపంతో యుద్ధానికి సిద్ధమై నా నగరాన్ని ముట్టడించే ప్రయత్నం చేసారు. అయినా నేనెవర్నీ లక్ష్యపెట్టలేదు. వారందరు ఏకమై, వ్యూహాత్మకంగా ఒక సంవత్సర కాలం మిథిలా నగరాన్ని ముట్టడించారు. సాధనాలన్నీ క్షీణించాయి. అప్పుడు దేవతలను నా తపస్సుతో తృప్తి పరిచాను. సంతోషంతో వారు నాకు చతురంగబలాలనిచ్చారు. ఆ బలగంతో నా విరోధులందరినీ తరిమికొట్టాను. ఇది ఈ ధనుస్సు వృత్తాంతం. దానిని శ్రీరామ లక్ష్మణులకు చూపిస్తాను. శ్రీరామచంద్రమూర్తి విల్లెక్కుపెట్టగలిగితే నేను అదృష్టవంతుడిని. అయోనిజైన సీతను ఆయన కిస్తాను" అని అంటాడు.

Saturday, February 19, 2022

మహా భారత యుద్దారంభం, కురుక్షేత్రానికి తరలిన కౌరవ-పాండవ సేనలు ..... ఆస్వాదన-60 : వనం జ్వాలా నరసింహారావు

 మహా భారత యుద్దారంభం, కురుక్షేత్రానికి తరలిన కౌరవ-పాండవ సేనలు

ఆస్వాదన-60

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (20-02-2022)

వేదవ్యాసుడిని మనసులో ధ్యానం చేసుకుని, సంజయుడు, తాను చూసిన, తనకు తెలియవచ్చిన భారత యుద్ధ విశేషాలను, యుద్ధం మొదలైనప్పటి నుండి ధృతరాష్ట్రుడికి వివరించసాగాడు. యుద్ధం ఆరంభం కావడానికి పూర్వం, దుర్యోధనుడు దుశ్శాసనుడితో మాట్లాడుతూ, కౌరవ సేనకు ముఖ్యుడైన భీష్ముడిని సైన్యం అంతా కలిసి రక్షిస్తే, అతడు సైన్యాన్ని మొత్తాన్ని రక్షించగలడని, శత్రువులను ధ్వంసం చేయగలడని అన్నాడు. భీష్ముడిని అంతా కలిసి రక్షించడం అంటే ఏమిటో కూడా చెప్పాడు దుర్యోధనుడు. తన ముందు యుద్ధంలో ఎవరూ నిలువలేరని, నిలిచి యుద్ధం చేస్తే జీవించలేరని, అయితే శిఖండితో మాత్రం తాను పోరాడలేనని, భీష్ముడు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ,  ఒకవేళ కౌరవ సైన్యం కన్నులు మూయకుండా భీష్ముడిని కాపాడలేకపోతే, శిఖండి చేతుల్లో ఆ మహావీరుడు మరణించవచ్చని, కాబట్టి గొప్ప-గొప్పవీరులంతా శిఖండిని ఎదిరించాలని దుర్యోధనుడు అన్నాడు.

మర్నాడు సూర్యోదయం కాగానే యుద్ధం ఆరంభం అయింది. సేనాపతైన భీష్ముడు ప్రత్యేక ఆకర్షణగా వెలుగొందాడు. ఆయన రథం, దానికి కట్టిన గుర్రాలు, ఆయన ధరించిన వస్త్రాలు, పట్టుకున్న ధనుస్సు, బంగారు తాడిచెట్టుతో రెపరెపలాడుతున్న జెండా, కాంతులీనే కవచం అన్నీ ప్రత్యేకంగా కనిపించాయి. ఇక మిగిలిన మహావీరుల రథాలు, జెండాలు ఎలా వున్నాయో తిక్కన ఈ కింది పద్యంలో వర్ణించాడు.

సీ:       కాంచనమయ వేదికా కనత్కేతనో జ్జ్వల విభ్రమం బొప్ప గలశజుండు

గనక గోవృషసాంద్ర కాంతి కాంతధ్వజ విభవ విలాసంబు వెలయ గృపుడు

మణిసింహ లాంగూల మహితకేతుప్రభా స్ఫురణంబు మెఱయంగ గురుసుతుండు

రత్నశిలారశ్మి రాజిత కదళికా మహిమ శోభిల్లంగ  మద్రవిభుడు

తే:       వెడలి తమ తమ చతురంగ వితతు లెల్ల,

నుచిత గతి నూల్కొనంగ జేయుచు గడంగి

సంగరోత్సవ సంభృతోత్సాహు లగుచు

నగుచు దగు మాట లాడుచు నడచి రెలమి

పూర్వం మహావీరులు తమ రథాలకు జెండాలను అమర్చేవారు. ఆ జెండా మీద వారిని స్ఫురింపజేసే ఒక చిహ్నం ఉండేది.  దూరం నుంచి చూడగానే, ఫలానా వీరుడని గుర్తు పట్టడానికి వీలుండేది. (కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవపక్షాన ఉన్న అతిరథ మహారథుల వైభవాన్ని, వారి రథాలకున్న కేతనముల ద్వారా తెలియజేసేదే ఈ పద్యం). ముందుగా, ద్రోణాచార్యులవారి జెండా గుర్తు బంగారంతో నిర్మింపబడిన యజ్ఞవేదిక. కలశజుడు అంటే కుండలో పుట్టినవాడు.  ద్రోణములో (కుండలో) పుట్టినవాడు ద్రోణాచార్యుడు.  ఇక కృపాచార్యులవారి జెండా బంగారం కాంతితో మెరసిపోయే ఆబోతు విలాస వైభవం కలిగింది.  గోవృషమంటే ఆబోతు.  ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ జెండా గుర్తు, వెలుగులు విరజిమ్మే మణి నిర్మితమైన సింహం తోక.  మద్రదేశాధీశుడు శల్యుడి జెండా గుర్తు, రత్నాల రాళ్లతో ధగ ధగా మెరిసిపోయే అరటిచెట్టు.  ఈ విధంగా ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, శల్యుడు, రథాలపై వారి జెండాలు రెపరెపలాడుతుండగా, ముచ్చట్లు చెప్పుకొంటూ, అమితోత్సాహంతో, చతురంగబలాలతో కదనరంగానికి కదలి వెళ్లారు పరిహాస వచనాలు వెదజల్లుకుంటూ.     

ఇంకా యుద్ధానికి బయల్దేరి వెళ్ళిన వారిలో యాదవ మహావీరుడు కృతవర్మ; సింధు దేశాధిపతి, మహావీరుడైన జయద్రథుడు; విందుడు, అనువిందుడు అనే రాజ సోదరులు; కళింగరాజు భగదత్తుడు; శకుని; (మూడు తరాలకు చెందిన) బాహ్లికుడు, ఆయన కుమారుడు సోమదత్తుడు, మనుమడు భూరిశ్రవుడు; కాంభోజ దేశాధినేత సుదక్షిణుడు; కోసల దేశరాజు బృహద్బలుడు; మాహిష్మతీ నగరాన్ని ఏలే నీలుడు; త్రిగర్త దేశాధిపతి సుశర్మ; రాక్షస నాయకుడు అలంబసుడు; హలాయుధుడు; సాల్వ, సౌవీర, శూరసేన, ఆభీర, యవన మొదలైన రాజులు యుద్ధభూమికి తరలి వెళ్లారు కౌరవుల పక్షాన. వీరివెంట పది అక్షౌహిణుల సైన్యం తరలి వెళ్ళగా, పదకొండో అక్షౌహిణి బలం వెంటరాగా సార్వభౌముడు దుర్యోధనుడు కదన రంగానికి కదిలి వెళ్లాడు. అతడి వెంట ఆయన తమ్ములు దుశ్శాసనుడు, దుర్మర్షణుడు, వివింశతి, వికర్ణుడు వెళ్లారు. (అక్షౌహిణి: 218170 రథాలు, 218170 గజాలు, 65610 గుర్రాలు, 109350 కాల్బలం)

(ఈ సందర్భాన్ని విశ్లేషిస్తూ, డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు ఇలా రాశారు: ‘మహాభారత యుద్ధంలో నేటి భారత దేశం ఎల్లలు దాటిన కాంభోజ దేశం నుండి సేనలు, యవనులు, రాక్షసులు పాల్గొనడం ఒక విశేషం. ఒక విధంగా అది తొలి ప్రపంచ యుద్ధం’).

ఆ సమయంలో భీష్ముడు రాజులందరినీ ఒక చోట సమావేశపరచి, రాజులకు యుద్ధం స్వర్గంలో ప్రవేశించడానికి తెరువబడిన ద్వారం అని, రణరంగమే రాజులకు పంట చేనని, యుద్ధభూమిని దర్శించడం అంటే రాజులు పెన్నిధిని చూసినట్లే అని అన్నాడు. భీష్ముడి మాటలు విన్న రాజులలో ఉత్సాహం పొంగిపోయింది. కర్ణుడు, అతడి స్నేహితులు, కొడుకులు, మంత్రులు, బంధువులు యుద్ధంలో పాల్గొనకూడదని దుర్యోధనుడితో అన్నాడు భీష్ముడు. ఆ విధంగా భీష్ముడు కర్ణుడిని యుద్ధ రంగానికి రాకుండా నిషేధించాడు. ఇది దుర్యోధనుడికి బాధ కలిగించే అంశమైనా, భీష్ముడిని ప్రశంసించాడు.

భీష్ముడిని చక్కటి యుద్ధ వ్యూహం పన్నమని అర్థించాడు దుర్యోధనుడు. భీష్ముడు మనుష్యాకారమైన ఒక గొప్ప ‘నరవ్యూహాన్ని’ అమర్చాడు. ఆ వ్యూహంలో భాగంగా యుద్ధం చేయడానికి తనతోపాటు ద్రోణుడిని, కృపాచార్యుడిని, అశ్వత్థామను, కృపవర్మను, శల్యుడిని, బాహ్లికుడిని, సోమదత్తుడిని, భూరిశ్రవుడిని నిలిపాడు. మధ్యలో దుర్యోధనుడు తన తమ్ములతో వుండేలా ఏర్పాటు చేశాడు ఆ వ్యూహాన్ని. ఆ వ్యూహంలో మరో విశేషం, ఆయా సైన్యాలను కాపాడడానికి రక్షగా ఏనుగులు అమర్చబడ్డాయి. వాటి ముందు రథాలు, రథాలకు రక్షగా అశ్విక బలాలు, అశ్విక బలాలకు రక్షగా విలుకాండ్రు, వారికి రక్షగా ఆయుధాలు ధరించిన సైనికులు నిలిచే ఏర్పాటు జరిగింది. ఇలాంటి దృఢమైన వ్యూహాన్ని కనీవినీ ఎరుగమని చూసిన వారంతా ఆశ్చర్యం చెందారు.

ఇదిలా వుండగా ఏడు అక్షౌహిణుల పాండవుల సేన సహితం యుద్ధ రంగానికి కదిలింది. ధర్మరాజు యుద్ధభూమికి తరలి వెళ్లాడు. ఆయన యుద్ధానికి వెళ్లడం శోభాయమానంగా పరిణమించింది. ఆయన వెంట యుద్ధ వినోద విహారానికి సన్నద్ధుడై భీముడు వచ్చాడు. అర్జునుడు యుద్ధ భూమికి బయల్దేరి వెళ్లాడు. దేదీప్యమానంగా ప్రకాశించే ఆంజనేయుడి జెండా వున్న ఆయన దివ్యమైన రథ సారథిగా శ్రీకృష్ణుడు వున్నాడు. దేవదత్తం అనే తన శంఖం పూరిస్తూ అర్జునుడు శోభతో వెలుగొందాడు. కవలలైన నకుల సహదేవులు యుద్ధాన్ని గురించి సల్లాపాలు ఆడుకుంటూ బయల్దేరి యుద్ధరంగానికి వచ్చారు. అభిమన్యుడు, ద్రౌపదీదేవి కొడుకులు ప్రతివింద్యుడు, శ్రుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనుడు రణరంగానికి కదలి వచ్చారు.

పాండవ పక్షాన యుద్ధం చేస్తున్న పాంచాల ప్రభువు ద్రుపదుడు, ఆయన కొడుకులు, తమ్ముళ్లు; మత్స్యరాజు విరాటుడు; యాదవ సైన్యాలతో సాత్యకి; చేకితానుడు; శిఖండి; మగధ దేశాధిపతి సహదేవుడు, ఆయన తమ్ముడు; ధృష్టకేతుడు; రాక్షసులతో సహా రాక్షస వీరుడు ఘటోత్కచుడు; పాండ్యరాజు; శిబి వంశీయుడైన రాజు; కాశ కరూశాది రాజులు; పంచ కేకయులు మొదలైన వారు యుద్ధానికి తరలి వచ్చారు. పాండవ పక్షంలో సర్వసేనాధిపతైన ధృష్టద్యుమ్నుడు దేదీప్యమానంగా వెలుగొందాడు. ఆయన ముందుండి పాండవ సైన్యాన్ని నడిపించాడు. పాండవ సేన కురుక్షేత్రానికి తరలి వెళ్లడాన్ని అభివర్ణిస్తూ, తిక్కన ఇలా రాశారు:

         సీ:       ఇల ధూళి యెగసిన బలుచగాకుండంగ రాసిన తొడవుల రాజము దొరగు

                     సమరవికాసంబు చెమట నొప్పరకుండ హేతి దీధితులు రేయెండ నొడుచు

                     భేరీధ్వనుల నింగి బీటలు వోకుండ గరికర శీకరోత్కరము దడుపు

                     దర్పంబు గనుజాటు దాకకుండగ గొడు గులపెల్లు ఖచర దృక్కోటి నాగు

           తే:       ననిన నిజమైనయట్లుండె మనుజనాథ ధరణి వడవడ వడకె దిక్తటము లద్రువ

                     భూరి చతురంగ చండ విస్ఫూర్తి బాండు నందనులసేన గలనికి నడుచునపుడు

         పాండవ సైన్యం శమంతక పంచకం చేరే సమయంలో ధర్మరాజుకు అన్నీ మంచి శకునాలు ఏర్పడ్డాయి. ఆ శుభ శకునాలకు ధర్మరాజు సంతోషించాడు. పాండవ సైన్యం ఉత్సాహంతో యుద్ధం చేయడానికి కురుక్షేత్రం చేరింది. కౌరవ సేనాపతి భీష్ముడు నర వ్యూహం పన్నాడని, దానికన్నా అనురూపమైన గొప్ప వ్యూహాన్ని పన్నమని అర్జునిడితో అన్నాడు ధర్మరాజు. అర్జునుడు పాండవ సేనాధిపతి ధృష్టద్యుమ్నుడితో ‘అచల వ్యూహాన్ని పన్నమని ఆదేశించాడు. ఆయన అలాగే అని చెప్పి అచల వ్యూహం అమర్చాడు. ఆ అచల వ్యూహంలో యుద్ధం చేయడానికి అభిమన్యుడు, ఇతర పాండవ కుమారులు, నకుల సహదేవులు, భీమసేనుడు, విరాటుడు, ద్రుపదుడు నిలిచారు. వ్యూహం మధ్య భాగంలో ధర్మరాజు రథం మీద కూచున్నాడు. ముందు భాగంలో అర్జునుడి రక్షణలో శిఖండి భీష్ముడికి ఎదురుబొదురుగా నిలిచాడు. వెనుక భాగంలో మహదా దేశానికి చెందిన సహదేవుడు, ధృష్టకేతుడు నిలిచారు.

         ఒకవైపు కౌరవ పక్షంలోని వారు, ఇంకొక వైపు పాండవ పక్షంలోని వారు పరస్పరం ఎదుర్కుంటూ భయంకరంగా ప్రకాశించారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్నీ, అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్నీ పూరించారు. ఇదిలా వుండగా కురుక్షేత్రానికి వచ్చిన ధర్మరాజు ఉన్నట్లుండి తన కవచాన్ని తీసేసి, ఆయుధాలతో పాటు రథం మీద పెట్టి, రథం దిగి, మౌనవ్రతం పూని, భీష్ముడున్న చోటుకు వెళ్లడం చూశారు అతడి తమ్ములు, శ్రీకృష్ణుడు, సాత్యకి మొదలైనవారు. ఆయనలా ఎందుకు చేస్తున్నాడో తెలియక కంగారు పడి వారంతా ఆయన్ను అనుసరించారు. వారి ప్రశ్నలకు జవాబు చెప్పకుండా నిరాయుధుడై, భీష్ముడిని సమీపించిన ధర్మరాజు పితామహుడైన భీష్ముడి దగ్గరికి పోయి అతడి పాదాలకు నమస్కారం చేశాడు.

         యుద్ధం చేయడానికి భీష్ముడి అనుమతి, ఆశీర్వాదం కావాలని కోరాడు ధర్మరాజు. ఆయనకు తన ఆశీస్సులని, ఆయన శత్రువులను జయిస్తాడని, ఆయనేదైనా వరం కోరుకుంటే ఇస్తానని అన్నాడు భీష్ముడు ధర్మరాజుతో. భీష్ముడిని యుద్ధంలో గెలిచే ఉపాయం చెప్పమని అడిగాడు ధర్మరాజు. తాను పట్టిన ఆయుధం పక్కకు పెట్టితే తప్ప తనను జయించడం దేవతలకు కూడా సాధ్యం కాదన్నాడు. తనను జయించడానికి ఉపాయం చెప్పడానికి ఇంకా సమయం రాలేదన్నాడు. ఆ తరువాత ధర్మరాజు ముందుకు పోయి ద్రోణుడు, కృపుడు, శల్యుడు వున్న చోటుకు వెళ్లి వారి పాదాలకు నమస్కారం చేసి, తాను వారితో యుద్ధం చేయడానికి అనుమతి, ఆశీర్వాదం కావాలని కోరాడు. ధర్మం ఎక్కడ వుంటుందో అక్కడ శ్రీకృష్ణుడు వుంటాడని, శ్రీకృష్ణుడు ఎక్కడ వుంటే అక్కడ విజయం సిద్ధిస్తుందని అన్నాడు ద్రోణాచార్యుడు. చేతిలో ఆయుధం ఉన్నంతవరకు తనను ఎవరూ చంపలేరన్నాడు. తనకు కీడుమాట వినిపిస్తేనే శస్త్ర సన్యాసం చేస్తానన్నాడు. యుద్ధంలో ధర్మరాజు గెలవాలని కృపాచార్యుడు, శల్యుడు దీవించారు. వారందరి దగ్గర సెలవు తీసుకుని ధర్మరాజు మరలి తన స్థానానికి వెళ్లాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)