Showing posts with label రెడ్డి. Show all posts
Showing posts with label రెడ్డి. Show all posts

Thursday, May 30, 2013

బీసీలకు అధికారం ఎండమావేనా?: వనం జ్వాలా నరసింహారావు

బీసీలకు అధికారం ఎండమావేనా?
వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు విడి-విడిగానే పనిచేసేవి. అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చొరవతో, జులై 1957 లో, అల్లూరి సత్యనారాయణ రాజు అధ్యక్షతన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆవిర్భవించింది. భారత జాతీయ కాంగ్రెస్ కి రాజకీయ పార్టీకుండాల్సిన లక్షణాలు లేవనే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితీ అంతే. ప్రజల మద్దతున్న పార్టీ అయినప్పటికీ, అందులో అంతా నాయకులే తప్ప సుశిక్షితులైన అనుచరుల (కాడర్) కొరతుందనే అనాలి. ఆవిర్భావం నుంచి, చాలా కాలం వరకు, పెద్ద చదువులు చదువుకున్న పట్టణ ప్రాంతం వారితో ను, అగ్ర కులాలుగా పిలువబడే వారితో ను-అందునా అధిక సంఖ్యా కులు బ్రాహ్మణ కులానికి చెందినవారితో ను, పార్టీ నాయకత్వం పనిచేసేది. పట్టాభి, అయ్యదేవర, ప్రకాశం, ముట్నూరి, దుగ్గిరాల, కొండా, వీవీ గిరి, మాడపాటి, బూర్గుల, నీలం, కాశీనాథుని, పింగళి, వామన్ నాయక్, మెల్కొటె, జమలాపురం, కెవి రంగారెడ్డి లాంటి వారిని ఆ జాబితాలో ఉదహరించవచ్చు. స్వతంత్రం రాక పూర్వం పరిస్థితి అలా వుంటే, ఇక ఆ తర్వాత, బ్రాహ్మణే తర కులాలకు చెందిన ధనిక భూస్వామి వర్గాలలోని కమ్మ, రెడ్డి, కాపు, క్షత్రియ, వెలమ వారి ఆధిపత్యం మొదలైంది. ఇంకా కొనసాగొతుందిప్పటికీ. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టడంతో, ఈ తరగతులకు చెందిన వారిదే పూర్తి పెత్తనంగా మారడం, వారే ముఖ్యమంత్రులు-మంత్రులు-జిల్లా పరిషత్ అధ్యక్షులు-ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కావడం మొదలైంది. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. అప్పటినుంచి కొంత మార్పొచ్చింది.

ఒక గురుమూర్తో, ఒక ముసలయ్యో, ఒక హనుమంతరావో, ఒక సంజీవయ్యో, ఒక అంజయ్యో తప్ప ముఖ్యమంత్రులైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనా, జిల్లా పరిషత్ చైర్మన్లు అయినా, అగ్ర వర్ణాల వారో, ధనిక వర్గాల వారో కావడమే కాని, వెనుకబడిన వర్గాల వారికి అవకాశాలు ఎక్కువగా రాలేదనే అనాలి. ఇందిరా గాంధి నాయకత్వంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో మొదటి సారి చీలి కొచ్చిన తర్వాత, జరిగిన మధ్యంతర ఎన్నికలప్పటినుంచి, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కొంత మార్పు కనబడ సాగింది. వెనుకబడిన వర్గాల వారికి, దళితులకు కొంత ప్రాధాన్యత లభించడం మొదలైంది. సంఖ్యాపరంగా వారు మెజారిటీలో వుండడం, వారి ఓట్లు గెలుపుకు ముఖ్యం కావడం, ఈ మార్పుకు ప్రధాన కారణం. అయితే, జన్మతః అందరు వెనుకబడిన వర్గాలకు చెందిన వారైనప్పటికీ, అవకాశాల విషయానికొచ్చేటప్పటికి, కొందరికే ప్రాధాన్యత లభించింది. సామాజికంగా-ఆర్థికంగా పుంజుకున్న వారు, విద్యాధికులకే పైకి పోయే అవకాశాలు లభించాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో వీరి అవసరం రీత్యా పలువురికి అవకాశాలు రాసాగాయి. అయితే, మొదటి నుంచి కూడా, కాంగ్రెస్ నాయకత్వం ధనికుల-అగ్ర వర్ణాల వారి చేతుల్లో వున్నప్పటికి, పార్టీకి మద్దతిచ్చే వారిలో అధికులు దళితులు, వెనుక బడిన వర్గాల వారు, మైనారిటీలు కావడం విశేషం. ఇప్పటికీ, పూర్తిగా అవకాశం చేతికందకపోయినా, 1972 ఎన్నికల అనంతరం, అధిక సంఖ్యలో వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, దళితులు చట్ట సభల్లో ప్రవేశించే వీలు కలిగింది. పీవీ నరసింహా రావు మంత్రివర్గంలో సగానికి పైగా ఆ వర్గాల వారికే స్థానం లభించడం విశేషం.

కాంగ్రెస్ పార్టీలో ప్రాంతీయ విభేదాలెంత మోతాదులో వుంటాయో, అంతకంటే ఎక్కువ మోతాదులో కుల-మత విభేదాలుంటాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎన్నుకొనేటప్పుడు (ఎంపిక చేసేటప్పుడు), శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ల పంపకమప్పుడు, ఎన్నికల అనంతరం శాసనసభ పక్షం నాయకుడి ఎన్ని కప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల విషయంలో, జిల్లా పరిషత్-మునిసిపల్ చైర్మన్ ఎన్ని కప్పుడు కుల రాజకీయాలకు అధిక ప్రాధాన్యతుంటుంది. ఇంతవరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో, అడపాదడపా తప్ప, సర్వసాధారణంగా రెడ్డి, కమ్మ కులస్తులకే ఎక్కువ స్థానాలు ఎక్కువ సార్లు లభించాయి. స్థానిక సంస్థల్లో అంజయ్య పుణ్యమా అని రిజర్వేషన్లు కలిగించడంతో, వెనుకబడిన వర్గాల వారు అధిక సంఖ్యలో ఎన్నిక కాగలుగుతున్నారు. అంతకు ముందు, జిల్లా పరిషత్ చైర్మన్లు గాని, సమితి అధ్యక్షులు గాని ఒక పథకం ప్రకారం అగ్ర వర్ణాల వారే ఎన్నికయ్యేవారు. అందునా, తెలంగాణలో-రాయలసీమలో రెడ్లు, కోస్తాంధ్రలో కమ్మ వారు, ఉత్తరాంధ్రలో క్షత్రియులు ఎన్నికయ్యేవారు.

కాంగ్రెస్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో అవతరించిన మరో రాజకీయ పార్టీ జనత పార్టీ. అంతకు ముందే కమ్యూనిస్ట్, ప్రజా సోషలిస్ట్, స్వతంత్ర లాంటి పార్టీలున్నప్పటికీ, ఇందిరా గాంధి విధించిన ఎమర్జెన్సీ నేపధ్యంలో మొట్టమొదటి కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి పార్టీగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా జనత పార్టీకి ప్రాధాన్యముందనాలి. ఆ పార్టీ కూడా అగ్ర కులాల ఆధిపత్యంలోనే పనిచేసింది. నీలం సంజీవరెడ్డి జనత ఆంధ్ర విభాగం ఏర్పాటును లాంఛనంగా ప్రకటించి, దాని అధ్యక్షుడుగా తెన్నేటి విశ్వనాథంను నియమించారు. ఇప్పటి జాతీయ స్థాయి నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు అప్పట్లో విద్యార్థి విభాగం కన్వీనర్. జనత పార్టీ రాష్ట్ర కమిటీలో కేవలం ఇద్దరు మాత్రమే షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు, నలుగురు వెనుకబడిన వర్గాలకు చెందిన వారుండగా, మిగిలిన 85% మంది ఇతరులున్నారు. కాకపోతే, వారిలో ఒక ముస్లిం, ఇద్దరు మహిళలు కూడా వున్నారు. 1977 ఎన్నికల ముందు ఏర్పాటుచేసిన అడహాక్ కమిటీ పరిస్థితి కూడా అంతే. అందులో షెడ్యూల్డ్ కులాల వారు, తెగల వారు, వెనుకబడిన వర్గాల వారందరు కలిసి కేవలం 23% మంది మాత్రమే సభ్యులయ్యారు. ఆ తర్వాత కొన్ని మార్పులు-చేర్పులు చేసినా, అవన్నీ రాజకీయ కోణం నుంచే కాని వెనుకబడిన వర్గాల వారి ప్రాధాన్యతను పెంచేందుకు కాదు. 1977 లోక్ సభ ఎన్నికల్లో ఇద్దరు వెనుకబడిన వర్గాల వారు, ఒక్క ముస్లిం అభ్యర్థి తప్ప మిగిలిన అందరూ ఇతరులే. ప్రజల-ఓటర్ల మద్దతు పొందేందుకు 1978 శాసనసభ ఎన్నికల్లో సుమారు 40% స్థానాలను ఆ వర్గాల వారికి కేటాయించింది జనత పార్టీ నాయకత్వం.

కమ్యూనిస్టు రాజకీయాలపై కూడా కుల ప్రభావం పడిందనాలి. ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ-సామాజిక-ఆర్థిక నేపధ్యంలో అవి తప్పవేమో! స్వతంత్రం రాక పూర్వం రాష్ట్రంలోని జాతీయోద్యమం బ్రాహ్మణుల నాయకత్వంలో చాలావరకు నడి చేది. రాయలసీమలోని రెడ్లు, కోస్తాలోని కమ్మ వారు, ఆధిపత్యం కొరకు బ్రాహ్మణులపై పోరాడారు. కోస్తాలోని కమ్మ వారికి, బ్రాహ్మణులను ఎదిరించేందుకు సరైన ఆయుధం కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో లభించింది. అలానే రాయలసీమ రెడ్డి వారు కూడా. నిజా-నిజాలెంతో కాని, 1952 లో జరిగిన ఎన్నికల్లో, కమ్యూనిస్ట్ వ్యూహం కాంగ్రెస్ పార్టీలోని కమ్మ-రెడ్డి విభేదాలను ఉపయోగించుకునే రీతిలో వుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కమ్యూనిస్టుల్లో కులం ముఖ్యమైనా-కాకపోయినా, చాలా కాలం వరకు అగ్ర కులాల వారి ఆధిపత్యంలోనే నాయకత్వం కొనసాగింది. ఇటీవలి కాలంలో పార్లమెంటరీ పంథాకు అలవాటు పడి, బూర్జువా పార్టీల ధోరణులన్నీ వంటబట్టించుకున్న అతివాద-మితవాద-తీవ్రవాద కమ్యూనిస్టులు, కులం విషయంలో కూడా ఏమీ తీసిపోలేదనిపిస్తున్నారు.

ఆంధ్రుల ఆత్మ గౌరవం ఢిల్లీ నడి వీధుల్లో తాకట్టు పెట్టారు కాంగ్రెస్ వారంటూ, ఆ పార్టీని ఓడించి, నేల నాలుగు చెరగు లా తెలుగు వాడి సత్తా నిరూపించాలని పిలుపిచ్చారు తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి ఆద్యుడు ఎన్ టీ రామారావు. ఆయన పిలుపునందుకొని వారు-వీరన్న తేడా లేకుండా ఆబాల గోపాలం ఆయన వెంట నడిచింది. కులమతాలకు అతీతంగా పార్టీ పక్షాన పోటీ చేసిన ప్రతి వారినీ విజయం వరించింది. అవినీతికి, అన్యాయానికి, వెనుకబడిన తనానికి వ్యతిరేకంగా ఎన్ టీ రామారావు మాట్లాడని రోజు లేదు. అంతవరకు బాగానే వుంది. మొదట్లో అవన్నీ పనికొచ్చాయి. క్రమంగా "ఆత్మగౌరవం" నినాదం స్థానంలో "రాజకీయ గౌరవం" ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్ టీ రామారావు ఆదర్శాలకు ఎదురుదెబ్బ తగిలి ప్రజాస్వామ్యం పరిహసించబడింది. ఆయన ప్రభుత్వాన్ని కూల దోసే నేపధ్యంలో కుల రాజకీయాలకే ప్రాధాన్యతుందనాలి. ఎన్ టీ రామారావును గెలిపించినప్పుడు కొందరు ఆయనను తమ కులానికి ప్రతినిధిగా మాత్రమే చూశారు. ఎప్పుడైతే అది కుదరలేదో, ఆ కులానికి చెందిన మరొకరిని ఆ పీఠంపై కూర్చొబెట్టే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన వ్యక్తులే, అదను చూసుకుని ఆయన అధికారంలో కొనసాగడం మంచిది కాదనుకుని నాయకత్వం చేపట్టారు. తెలుగు దేశం పార్టీ కూడా కుల ప్రాధాన్యత విషయానికొచ్చే సరికి అన్ని రాజకీయ పార్టీల మార్గాన్నే అనుసరించిందనాలి. లెక్కలు పక్కన పెట్టి తే, మూడు పర్యాయాలు ప్రభుత్వంలోకి వచ్చిన టిడిపి ఎమ్మెల్యేలలో కాని, మంత్రులలో కాని వెనుక బడిన వర్గాల వారి ప్రాధాన్యత మిగిలిన వారితో పోల్చి చూస్తే చాలా తక్కువే. నాయకత్వం సరిపడక పార్టీని వదిలి వెళ్ళి తిరిగొచ్చిన దేవేంద్ర గౌడ్ లాంటి వారు కూడా వెనుకబడిన వర్గాల వారి వాణిగా పేరు తెచ్చుకోలేక పోతున్నారు.

ఇక ఇటీవలి కాలంలో ధనవంతులైన కొందరు బీసీ నాయకులు పార్టీ పెట్టి తమ వారికి న్యాయం చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీ గా కూడా గెలిచారు. ఏమైందో-ఏమో, మళ్ళీ అవే రాజకీయాలు. కాంగ్రెస్ గూట్లో చేరారు. ఇలా ఉన్న ఒకటి-రెండు ఆశలను కూడా ఆ వర్గానికి చెందిన వారే అడియాసలు చేస్తుంటే ఎలా?

ఇవిలా వుండగా, కాంగ్రెస్ పార్టీని వీడిన వారు, అలిగి పోయిన వారు, రాజకీయ కారణాలతో కొంతకాలం బయటున్న వారంతా అగ్ర కులాల వారే. ఎన్జీ రంగా కేఎల్పీ పార్టీ, బ్రాహ్మణుల నాయకత్వంలో వెలిసిన కే.ఎం.పీ.పీ, మర్రి చెన్నా రెడ్డి డెమోక్రాటిక్ పార్టీ, స్వతంత్ర పార్టీ అలాంటివే. ఆధిపత్య పోరు కొరకే అవన్నీ. అందునా కుల ప్రాతిపదికన జరిగిన ఆధిపత్య పోరే అది. ఎదేమైనా-ఎవరెన్ని చెప్పినా, వెనుకబడిన వర్గాల వారికి రాజకీయ పెత్తనం అప్పగించడం ఇప్పటికీ ఇంకా మాటల్లోనే కాని ఆచరణలో కానే కాదు. ఒక వేళ వీరిలో ఎవరన్నా ఉన్నత స్థాయికి చేరుకోగల వారుంటే, వారికి కూడా ధన బలం తప్పని సరి. అది లేకపోతే, వారి వారే వెనక్కు పడవేయడం ఖాయం.


Wednesday, February 1, 2012

“సహ చట్టం” కమీషనర్ల ఎంపికలో "సంభావనా విధానం": వనం జ్వాలా నరసింహారావు


 వనం జ్వాలా నరసింహారావు

సమాచార హక్కు చట్టాన్ని అక్షరాలా తు. చ. తప్పకుండా అమలు పరచడానికి, హైకోర్టు ఆదేశాలమీద, ఎట్టకేలకు, ఎనిమిది మంది కమీషనర్లను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన త్రి సభ్య సంఘం ఎంపికచేసింది. ఇంకా మరొకరికి అవకాశం వుంది. ఎవరికోసం దీనిని ప్రస్తుతానికి ఖాళీగా వుంచారో, ఎప్పుడు భర్తీ చేస్తారో, అసలు చేయరో అన్న విషయం మిలియన్ డాలర్ల ప్రశ్న. (లాంఛనంగా గవర్నర్ ఆమోదముద్ర పడింది?). అంటే, ఈ ఎనిమిది మంది కమీషనర్లు, ఐదు సంవత్సరాల పాటు-లేదా వారికి అరవై ఐదు సంవత్సరాల వయసొచ్చేంతవరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాతో సమానమైన హోదా కలిగి బాధ్యతలను నిర్వహించుతారు. కమీషనర్లను ఎంపిక చేయడానికి ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్‌ చంద్రబాబు నాయుడు భేటీ అయి "ఏకగ్రీవం" గా వారిని ఎంపిక చేశారన్న వార్తలు ఎంతవరకు వాస్తవమోకాని, ఇంతవరకు ప్రతిపక్షనేత నుంచి, ఎలాంటి విమర్శలు అధికారికంగా మాత్రం వెలువడలేదు.

ఈ ఎనిమిదిని మందిని, ఎంతవరకు-ఏ మేరకు, సమాచార హక్కు చట్టంలో సూచించిన విధి-విధానాలకు అనుగుణంగా ఎంపిక చేశారనే విషయాన్ని పక్కన పెడితే, రాజకీయాలకు అనుగుణంగా, "సంభావనా విధానానికి", "పోషక విధానానికి" (అమెరికా దేశంలోని "స్పాయిల్స్ పద్ధతి") నూటికి నూరుపాళ్లు సరిపడే పద్ధతిలో మాత్రం ఎంపికచేసారనడంలో అతిశయోక్తి లేదు. అలానే వివిధ రంగాలకు చెందిన వారూ వున్నారన్న అర్థం స్ఫురించే రీతిలో జరిగిందీ ఎంపిక! అధికారులుగా పనిచేసిన వారు, అనధికారులుగా ముద్ర పడినవారు, సామాజిక కార్యకలాపాలలో పాలు పంచుకున్నట్లు అంతో-ఇంతో గుర్తింపు తెచ్చుకున్న వారు, వ్యవసాయ రంగంలో పేరు గడించినట్లు చెప్పుకో వీలున్న వారు, పాత్రికేయులు; కాపు, మాల, రెడ్డి, బీసీ, మాదిగ, మైనారిటీ వర్గాలకు చెందిన వారు; ....ఇలా రకరకాలుగా చెప్పుకోదగ్గ విధంగా సవివరంగా-సముచితంగానే ఎంపిక జరిగింది!. రాజకీయాలకు అచ్చు గుద్దినట్లు సరిపోయే విధంగా, రిజర్వేషన్లకు అనుగుణంగా, సామాజిక న్యాయం చేకూర్చే విధంగా, ఒక్క మాటలో చెప్పుకోవాలంటే సంభావనా విధానానికి, పోషక విధానానికి అద్దం పట్టే దిగా వుందీ ఎంపిక. ఇక సమాచార హక్కు చట్టం అమలు ఆ భగవంతుడికే తెలియాలి. వ్యక్తులుగా ఎవరి మీద సంధించిన విమర్శ ఇది కాకపోయినా, ఆయా రంగాలలో ఎంతో నిష్ణాతులైన వ్యక్తులనే ఎంపిక చేయాల్సిన కనీస బాధ్యతను విస్మరించిందే ప్రభుత్వం అన్న ఆరోపణ మాత్రం చేయకుండా వుండడం కష్టమే. ఏదేమైనా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకిష్టులైన వారిని ఎంపిక చేసుకోవడానికి, తనను ధిక్కరిస్తుండే ఉప ముఖ్యమంత్రిని, సాక్షాత్తు ప్రధాన ప్రతిపక్షనేతను, ఒప్పించ గలగడం అభినందించాల్సిన విషయమే. 

మెరికా దేశ రాజకీయాలలో అనాదిగా అనుసరిస్తున్న సాంప్రదాయిక-చట్టబద్ధ విధానాలలో "స్పాయిల్స్ సిస్టం" అత్యంత ప్రాధాన్యమైంది. దీన్నే అక్కడ "సంభావనా విధానం" గా, "పోషక విధానం" గా (పాట్రనేజ్ సిస్టం) పిలుస్తారు. ఈ విధానం ప్రకారం, అధ్యక్ష-ఇతర ఎన్నికలలో గెలిచిన అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఎన్నికలలో వారి విజయానికి కృషిచేసిన తమ పార్టీకి చెందిన ఓటర్లలో కొందరికి, వివిధ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో నియమిస్తారు. ఒక్కోసారి తమకు వ్యతిరేకంగా పనిచేసినా, తమతో పోటీ చేసి ఓడిపోయినా, తమ-తమ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్‍లో పనిచేస్తారన్న నమ్మకంతో, పదవులను కట్టబెడతారు. ఇలా పదవులను తమ వారికి కట్టబెట్టడంలో "మెరిట్" విధానానికి స్వస్తి పలకడం, తమకు అనుకూలురని భావించినవారికి మాత్రమే ఒక "బహుమానం" గా, ఇవ్వడం సాంప్రదాయం. ఇది అక్కడ అందరూ చేస్తుండే పనే. ఏ పార్టీ కూడా దీనిని ఆక్షేపించదు. "స్పాయిల్స్" అంటే "దోపిడీ ధనం" అని అర్థం. "గెలిచిన వాడిదే ఓడిపోయిన శత్రువుకు చెందిన దోపిడీ ధనం"  అని ఈ విధానానికి నిర్వచనం చెప్తూ, 1828 అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాట్ అభ్యర్థి జాక్సన్ విజయాన్ని పురస్కరించుకుని నాటి న్యూయార్క్ సెనేటర్ విలియం మెర్సీ వ్యాఖ్యానించారు. వారసత్వ పరంపరగా అధికారంలోకి వచ్చే ఆటవిక జాతుల, రక-రకాల నియంతృత్వ పోకడల ప్రభుత్వాలున్న దేశాలలో కూడా ఈ విధానం అమలులో వుంది. ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికాలో ఇదెందుకు అమల్లో వుందో అర్థంకాదు. అమెరికాలో అమల్లో వున్న ఈ పోషక విధానం, కేవలం చిన్న ఉద్యోగాలకే పరిమితం కాకుండా, అత్యంత ఉన్నత స్థాయి ఉద్యోగాల విషయంలో కూడా జరుగుతుంటుంది. ఇప్పుడదే జరిగింది సమాచార హక్కు చట్టం కమీషనర్లుగా ఎంపిక చేసిన వారి విషయంలో.

సామాన్యుల, ఆ మాటకొస్తే, అసామాన్యుల చేతికి సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధం లాంటిది. 2005 లో భారత పార్లమెంటు తెచ్చిన ఈ చట్టం అమలులో కొన్ని అవకతవకలున్నా, కొన్ని రాష్ట్రాలలో కొంత నిర్లిప్తత వున్నా, దేశవ్యాప్తంగా దాని పనితీరు గమనిస్తే, అంత నిరాశాజనకంగా అనిపించదనే అనాలి. భారతదేశంలోని ప్రతి పౌరుడి కీ, "పబ్లిక్ అథారిటీ" గా నిర్వచించిన ప్రతి సంస్థ-వ్యవస్థ నుండి, ఆచరణాత్మకంగా-అనుభవ పూర్వంగా, తమకు కావాల్సిన ఎలాంటి సమాచారాన్నైనా, ఒక క్రమపద్ధతి ప్రకారం రాబట్టుకొనే హక్కు కలిగించిందీ చట్టం. ప్రతి పబ్లిక్ అథారిటీ పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేసేందుకు వీలు కలిగించిందీ చట్టం. సమాచార హక్కు చట్టం అమలును సులభతరం చేయడానికి నిర్దేశించిన అనేక విధై విధానాలలో అత్యంత ప్రాముఖ్యమైంది కేంద్ర స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో "సమాచార కమీషన్ల" ఏర్పాటు. వాటితో నిబద్ధతతో పని చేయించడానికి పది మందికి మించకుండా సమాచార కమీషనర్ల-ఒక ప్రధాన సమాచార కమీషనర్ నియామకం. చట్టంలో పబ్లిక్ అథారిటీ అంటే ఏమిటో, సమాచారం అంటే ఏమిటో స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ప్రజాస్వామ్య-లౌకిక-సామ్యవాద-సార్వభౌమాధికార గణతంత్ర దేశంలో ఇవన్నీ పది కాలాల పాటు మనుగడ సాగించడానికి, భారత పౌరుడికి, తాను కోరుకున్న ప్రభుత్వ సమాచారం అందుబాటులోకి తేవాలన్న ఆకాంక్షే సహ చట్టం తేవడానికి కారణం. అవినీతి తొలగాలంటే, పాలితులకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా పాలన అందివ్వాలంటే, సహ చట్టం, త్రి కరణ శుద్ధిగా అమలు కావాలి. ఈ నేపధ్యంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, సహ చట్టం రాక ముందు-వచ్చిన తరువాత ప్రభుత్వేతర పరంగా గణనీయమైన ప్రగతి సాధించినప్పటికీ, ప్రభుత్వ పరంగా, కుంటి నడక నడుస్తుందనడంలో సందేహం లేదు. అల నాడు దివంగత ముఖ్యమంత్రి ఒక రిటైర్డు ఐఏఎస్ అధికారిని ప్రధాన కమీషనర్‌గా, రాజకీయాలతో ప్రత్యక్షంగానో-పరోక్షంగానో సంబంధం వున్న మరో ఇద్దరిని కమీషనర్లుగా, ఒక యువ పాత్రికేయుడిని ఇంకో కమీషనర్‌గా నియమించింది. వారి పని తీరు గురించి ఎవరి విశ్లేషణ వారే చేసుకోవచ్చు. మొత్తం మీద అంతో-ఇంతో సహ చట్టం అమలు మాత్రం జరిగిందనాలి.

రాజశేఖర రెడ్డి నియమించిన వారి పదవీ కాలం ముగిసిన తరువాత ఇంకా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా, బాధ్యతాయుతమైన పదవిలో వున్న మరో ఐఏఎస్ అధికారిని ప్రధాన కమీషనర్‌గా నియమించింది ప్రభుత్వం. అప్పట్లో అది వివాదాస్పదమైంది కూడా. ఆయనకు తోడుగా మరెవ్వరినీ నియమించక పోవడంతో గత కొద్ది కాలంగా కుంటి నడక నడుస్తున్న కమీషన్‌కు పూర్తి స్థాయిలో కమీషనర్ల నియామకం జరగాలని హైకోర్టు సూచించడంతో, ఆ ప్రక్రియను లాంఛనంగా పూర్తి చేసింది ప్రభుత్వం. ఒక రిటైర్డ్ ఐఎఫ్ఎస్‌ అధికారిని, మరో రిటైర్డ్ ఐపిఎస్‌ అధికారిని, అంతంత మాత్రంగా అతి కొద్ది సర్క్యులేషన్‍తో నడుస్తున్న ఒక దినపత్రిక సంపాదకుడిని, ఒక న్యాయవాదిని, (రాజకీయ) సామాజిక కార్యకర్తగా చెప్పుకుంటూన్న మరొకరిని, మరో (రాజకీయ) న్యాయవాదిని,  (రాజకీయాలలో వున్న) రిటైర్డ్ సివిల్‌ జడ్జిని,  విద్యావేత్తగా పిలిపించుకుంటున్న ఇంకొకరిని, పదవిలో వున్న ఒక ఐపిఎస్‌ అధికారిని  కమిషనర్లుగా నియమించారు. దీనికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు. వ్యక్తిగతంగా వీరందరూ పలుకుబడి కలిగిన వారే. కాని, సమాచారహక్కు చట్టం ఇలాంటి వారిని ఎంపిక చేయమని చెప్పలేదే! మరెందుకిలా జరిగింది? అందుకే దీనిని "అమెరికా తరహా స్పాయిల్స్ సిస్టం" అనాలి.

ఇంతకూ సహ చట్టం ఈ విషయంలో ఏం చెప్తోంది? మొదటిది: కేంద్రంలోను, రాష్ట్రాలలోను సమాచార కమీషన్ల ఏర్పాటు జరగాలి. రెండోది: ఆయా స్థాయిలలో ఒక ప్రధాన కమీషనర్‌ను, పది మందికి మించకుండా కమీషనర్లను నియమించాలి. మూడోది: ఈ సమాచార కమీషన్‌లకు స్వతంత్ర ప్రతిపత్తి వుండాలి. మరే ప్రభుత్వ సంస్థ నుంచి కూడా ఎలాంటి అధికారిక ఆదేశాలను-నిర్దేశాలను పాటించాల్సిన అవసరం లేదు. నాలుగోది: ప్రజా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగి, పేరు-ప్రఖ్యాతులు తెచ్చుకుని ప్రసిద్ధి చెందిన వారే కమీషనర్ల పదవులకు అర్హులు. అదనంగా, న్యాయ శాస్త్రంలో, విజ్ఞాన-సాంకేతిక శాస్త్రాలలోసామాజిక రంగంలో, యాజమాన్య రంగంలో, పాత్రికేయ వృత్తిలో, మాస్ మీడియా రంగంలో, పరిపాలనా రంగంలో, గవర్నెన్సులో నిష్ణాతులై వుండాలి. ఆయా రంగాలలో కేవలం "ప్రవేశం" కాకుండా, "ప్రావీణ్యం" వుండి తీరాలి. ప్రసిద్ధి చెందిన వారై వుండాలి. పార్లమెంటు ఉభయ సభలలో సభ్యులై వుండరాదు. ఏ "రాజకీయ పార్టీతో ను" సంబంధం వుండకూడదు.
అలాంటప్పుడు కేవలం ఒక పునరావాస కేంద్రంగా, ఏదో ఇతర నామినేటెడ్ పోస్టులను కట్టబెట్టినట్లుగా, సమాచార హక్కు చట్టంతో ఎలాంటి సంబంధం ఎన్నడూ ఏ విధంగా లేనటువంటివారిని, పదవీ విరమణ చేసిన వారిని, చేయడానికి సిద్ధంగా వున్న వారిని, రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం వున్న వారిని, రక-రకాల ఒత్తిడులకు లొంగి ఇలా సమాచార కమీషనర్లను నియమించడం ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం?. కిరణ్ కుమార్ రెడ్డి చేస్తుంటే ఎలా ప్రతి పక్ష నాయకుడు అంగీకరించాడు? విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల ఎంపిక ఎంతో రసాభాస చేసిన గవర్నర్ ఆమోద ముద్ర  ఎలా వేశారు? End
(Added on 22-02-2012: (ఎనిమిదిని సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎంపిక చేయగా, ఆ నిర్ణయానికి ప్రతిపక్షనేత మద్దతు ఇచ్చీ-ఇవ్వనట్లు వుండగా, వారిలో నలుగురు ఈ పదవులకు అర్హులు కాదంటూ గవర్నర్ నరసింహన్ ఫైలును తిప్పి పంపారు. తాంతియా కుమారి, ముత్తంశెట్టి విజయ నిర్మల, వర్రె వెంకటేశ్వర్లు, ఇంతియాజ్ అహ్మద్‌ల నియామకం విషయంలో పునః పరిశీలన అవసరమని స్పష్టం చేశారు. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రెడ్డి, ఐపీఎస్ అధికారి రతన్, మాజీ ఐఎఫ్ఎస్ మధుకర్‌రాజు, సీనియర్ జర్నలిస్టు విజయబాబుల ఎంపిక విషయంలో గవర్నర్ అభ్యంతర పెట్టలేదు. సమాచార కమిషన్‌లో పార్టీలతో సంబంధం ఉన్న వారికి చోటు దక్కడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపధ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు).