Showing posts with label ఇందిరాగాంధి. Show all posts
Showing posts with label ఇందిరాగాంధి. Show all posts

Monday, July 8, 2013

1968 నాటి "ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం": వనం జ్వాలా నరసింహారావు

1968 నాటి 
"ప్రత్యేక తెలంగాణ 
రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం"
వనం జ్వాలా నరసింహారావు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కేవలం "భావించడం" మాత్రమే కాకుండా, దాన్ని సాధించడం కొరకు, రకరకాల మార్గాలను ఎంచుకోవడం ఆరంభమయింది 1956 నుంచే. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు మూడూ, ఆంధ్ర ప్రదేశ్ లో కలిసున్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన రాయితీలను తెలంగాణ ప్రాంతం వారికి మాత్రమే చట్ట రీత్యా కలిగించడం ద్వారా, తెలంగాణ వే()ర్పాటు నినాదాన్ని, పాలక పక్షం విజయవంతంగా పక్కదారి పట్టించగలిగింది మొదట్లో. పెద్దమనుషుల ఒప్పందమనీ, ఫజలాలీ సంఘం నివేదికనీ, ముల్కీ నిబంధనలనీ రకరకాల మార్గాలద్వారా తెలంగాణ కోరుకునే వారిలో కొన్ని ఆశలు రేకెత్తించి, కొన్నేళ్లు ఉద్యమాన్ని బలహీనపరచగలిగింది (కాంగ్రెస్) ప్రభుత్వం. తెలంగాణ ప్రాంతానికి వలసవచ్చిన కొందరు తెలంగాణే తరులు , ఎప్పుడైతే తమ "పరోక్ష దోపిడీ" విధానాన్ని "ప్రత్యక్ష దోపిడీ" విధానంగా మార్చడం మొదలయిందో, అప్పుడే దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలలో "దోపిడీకి ఎదురుతిరగాలన్న కాంక్ష బలీయం కావడం మొదలయింది. క్రమేపీ ఉద్యమరూపంగా మార్పుచెంద సాగిందా కాంక్ష. బంగారు భవిష్యత్ పై కొండంత ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రాంత విద్యార్థులకు, తమ ఆశలు అడియాశలవుతాయేమోనన్న భయం పట్టుకుంది. ఆ భయంలోంచే ఉద్యమం రూపుదిద్దుకోవడం మొదలయింది. ఆ ఉద్యమ బీజమే, నాలుగు దశాబ్దాల క్రితం (మా) ఖమ్మం జిల్లాల్లో-ఖమ్మం, కొత్తగూడెం పట్టణాలలో, ఆరంభమైన "ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం". ఆ బీజమే "ఇంతై-ఇంతింతై-వటుడింతై" అన్న చందాన ఒక వట వృక్షమైంది. బలమైన గాలి వీచినప్పుడు కొమ్మలు విరిగినా, తిరిగి, బలం పుంజుకొని, ఉద్యమాన్ని సజీవంగా వుంచి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా దూసుకుపోతుందానాటి-నేటి ఉద్యమం. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందన్న నమ్మకం కలిగినట్లే కలిగి, కనుమరుమగుతూ కవ్విస్తున్నది.

 1968 లో తెలంగాణ ప్రజా పోరాటానికి "రక్షణల ఉద్యమం" పేరుతో ఖమ్మం జిల్లా పాల్వంచ థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రంలో అంకురార్పణ జరిగింది. కొత్తగూడెం సింగరేణి సంస్థలో పనిచేస్తుండే ఒక చిరుద్యోగి సర్వీసుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో అతడు తెలంగాణ వాడు కావడంవల్ల జరిగిన తీరని అన్యాయంవల్ల, ఆయన సహోద్యోగులందరూ కలిసి తమ న్యాయమైన హక్కులకొరకు పోరాటం సాగించారు. ఆ పోరాటమే చిలికి చిలికి గాలివానగా మారి, జిల్లా అంతటా పాకి, ఖమ్మం పట్టణం చేరుకుంది. ఖమ్మం స్థానిక కళాశాలలో చదువుకుంటున్న "రవీంద్రనాథ్" (మా జూనియర్) అనే విద్యార్థి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ "గాంధి చౌక్" లోని గాంధి విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. నాకు తెలిసినంతవరకు అతడే మొట్టమొదటి సారిగా తెలంగాణకొరకు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నవ్యక్తి. ఆ నేపధ్యంలో నాకు గుర్తున్నంతవరకు, హక్కుల రక్షణ సమితి పక్షాన ఒక ప్రతినిధి వర్గం ముఖ్యమంత్రిని కలుసుకుని విజ్ఞాపన పత్రం సమర్పించారు. వారి విజ్ఞాపనకు ముఖ్యమంత్రి స్పందించిన తీరు సరైందిగా లేదని భావించిన ప్రతినిధి వర్గంలోని ప్రముఖులు తెలంగాణ విడిపోవడమే సమస్యకు పరిష్కారంగా భావించారు.

కొత్తగూడెం-ఖమ్మంలో ఉద్యమం మొదలవడానికి సుమారు ఆరు నెలల క్రితం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని "" హాస్టల్లో, నాటి విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి (నా కంటే ఏడాది సీనియర్) రూమ్ లో, మాజీ లోక్ సభ సభ్యుడు అప్పట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి, స్వర్గీయ మల్లికార్జున్ తో సహా పలువురు విద్యార్థి నాయకులు సమావేశమయ్యారు. "విద్యార్థి కార్యాచరణ కమిటీ" పేరుతో ఒక సంస్థను నెలకొల్పి ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమించాలని తీర్మానించారు. వాస్తవానికి శ్రీధర్ రెడ్డి, భవిష్యత్ లో రూపు దిద్దుకోనున్న, బ్రహ్మాండమైన వేర్పాటు ఉద్యమానికి తొలి రాష్ట్ర స్థాయి నాయకుడనాలి.

ఆయన నాయకత్వంలోని విద్యార్థులందరూ స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని కలిసి, ఉద్యమానికి నాయకత్వం వహించమని కోరారు. వందేమాతరం రామచంద్ర రావు వేసిన ఎన్నికల పిటీషన్ లో, ఉన్నత న్యాయస్థానం తీర్పు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా వచ్చిన నేపధ్యంలో, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడైనందున, తన రాజకీయ పునరావాసానికి ప్రయత్నం చేస్తున్న రోజులవి. చెన్నారెడ్డి ఉద్యమానికి నాయకత్వం చేపట్టడానికి ముందే, ఉద్యమం వూపందుకోవడం-మధ్యలో ఖమ్మంలో విద్యార్థి వుద్యమం మొదలవడం, ఒకటి వెంట ఒకటి జరిగాయి. చెన్నారెడ్డి నాయకత్వం వహించడానికి పూర్వమే జరిగిన ఉద్యమంలో శ్రీధర్ రెడ్డి, బద్రి విశాల పిట్టి, మల్లికార్జున్, ఆమోస్ లాంటి ప్రముఖులు అరెస్ట్ కావడం-జైలుకెళ్లడం జరిగింది. ఆ ఉద్యమం సాగుతున్న రోజుల్లోనే మాజీమంత్రి స్వర్గీయ మదన్ మోహన్ నాయకత్వంలో "తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ " పేరుతో మరో సంస్థ ఆవిర్భవించింది. చివరకు అన్నీ కలిసి ఉమ్మడిగా ఉద్యమించాయి. ఏకమైన సంస్థలన్నీ కలిసి మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో "తెలంగాణ ప్రజా సమితి" పేరుతో బ్రహ్మాండమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపాయి.

1968 (నవంబర్-డిసెంబర్ నెలల్లో అనుకుంటా) లో జరిగిన "రక్షణల అమలు" ఉద్యమానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహాయం చేసినవారిలో అలనాటి తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు జె. చొక్కా రావు, రాష్ట్ర పంచాయితీ మండలి అధ్యక్షుడు జలగం వెంగళరావు, నూకల రామచంద్రారెడ్డి, జి. సంజీవరెడ్డి వున్నారు. వారి అనుయాయులు కొందరు అలనాటి ఉద్యమంలో పాల్గొన్నారు కూడా. క్రమేపీ టి. అంజయ్య, ఎం. ఎం. హాషిం, జి. వి. సుధాకర్ రావు, బి. రాజారాం, కె. ఆర్. ఆమోస్, ట్. సదా లక్ష్మి, ఎస్. బి. గిరి లాంటి వారు కూడా ప్రజా సమితి సమావేశాలలో చురుగ్గా పాల్గొనడం మొదలెట్టారు. కొన్నాళ్లకు కొండా లక్ష్మణ్ బాపూజి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో ఉద్యమం క్రమేపీ మిలిటెంటుగా మార సాగింది. హింసాత్మకంగా మారిన ఉద్యమంలో మూడొందల మంది పైగా యువకులు, విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు. కోదాడ, నందిగామలలో జరిగిన కొన్ని దుర్ఘటనలు నల్గొండ, వరంగల్ విద్యార్థులను రెచ్చగొట్టాయి. మొత్తం మీద అరాచకాలు ప్రబలిపోసాగాయి.

పునాదులు కదిలిన ప్రభుత్వం పోలీసుకు సహాయపడేందుకు, సైన్యాన్ని పిలిపించింది. సైనికులు పోలీసుల సహకారంతో పాశవికంగా ప్రవర్తించారని నాటి పత్రికలు పేర్కొన్నాయి. ఎందరో విద్యార్థులను, అమాయకులను జైళ్లలో నిర్బంధించారు. వేలాదిమంది తెలంగాణ ప్రజా సమితి నాయకులు, విద్యార్థి నాయకులు జైళ్లలో బంధించబడిన దరిమిలా, రెచ్చిపోయిన ప్రజలు ఉద్యమాన్ని ఉదృతం చేశారు. పరిస్థితిని అదుపులో తేవడానికి వ్యూహాత్మకంగా నాటి ప్రధాని ఇందిరా గాంధి, కొందరు తెలంగాణ ప్రముఖులతో ఢిల్లీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆహ్వానించబడినవారిలో తెలంగాణ వాదులు డాక్టర్ చెన్నారెడ్డి (అప్పటికింకా ప్రజా సమితి నాయకత్వం స్వీకరించలేదు), కొండా లక్ష్మణ్ బాపూజి, రామచంద్రారెడ్డి, చొక్కా రావు లతో పాటు ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చే పలువురున్నారు. ప్రతిపక్షాల నాయకులను కూడా ఆహ్వానించారు. అసలు సిసలైన పలువురు తెలంగాణ ప్రజా సమితి నాయకులను పిలవలేదు. మదన్ మోహన్ జైల్లో వున్నారప్పుడు. మరోవైపు తెలంగాణ ప్రాంతమంతా సత్యాగ్రహ శిబిరాలు వెలిశాయి. సామూహిక నిరాహార దీక్షలు మొదలయ్యాయి. ఢిల్లీ సమావేశంలో ఏ అంగీకారం కుదరలేదు. ప్రధాని ఏకపక్షంగా ఒక అష్ట సూత్ర కార్యక్రమాన్ని ప్రకటించడం, దాన్ని  డాక్టర్ చెన్నారెడ్డి, రామచంద్రారెడ్డి, చొక్కా రావులు సంయుక్తంగా వ్యతిరేకించడం జరిగింది

వి. బి. రాజు చొరవతో, ఉద్యమంతో సంబంధం వున్న నాయకులతో ప్రధాని చర్చలు జరపడానికి రంగం సిద్ధమైంది. మదన్ మోహన్, వెంకట్రామరెడ్డి, ఎస్. బి. గిరి, మల్లిఖార్జున్, శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి ప్రభృతులకు ఆహ్వానాలు అందాయి. అణచివేత విధానాన్ని, హింసా కాండను కొనసాగిస్తున్న ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రయోజనం లేదని భావించిన నాయకులు ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఈ దశలో డాక్టర్ చెన్నారెడ్డి రంగప్రవేశం చేశారు. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారు. అదే సందర్భంలో విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి పోటీ ప్రజా సమితిని స్థాపించి తన వ్యతిరేకతను వ్యక్త పరిచాడు. చెన్నారెడ్డి అధ్యక్ష పదవిని చేపట్టగానే, ప్రజా సమితి రాజకీయంగా బలాన్ని పుంజుకుంది. కొన్ని వనరులు కూడా చేకూర సాగాయి. ఉద్యమం కూడా తీవ్రమైంది. సాయుధ పోలీసుల రక్షణ లేకుండా ముఖ్యమంత్రి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కొంతకాలానికి ఎన్. జీ. వోల సంఘం నాయకుడు ఆమోస్‍ను ఉద్యోగం నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సత్యాగ్రహాలు చేసి కొన్ని వందల-వేల మంది అరెస్ట్ అయ్యారు. లాఠీ చార్జీలు నిత్యకృత్యమయ్యాయి. పరిస్థితి రోజురోజుకు దిగజారిపోసాగింది. రాజధాని హైదరాబాద్‌లో కర్ఫ్యూ విధించబడింది. ఢిల్లీలో వున్న ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు చొక్కా రావును వెంట పెట్టుకుని ప్రధాని ఇందిరాగాంధి, హుటాహుటిన ఒకనాడు హైదరాబాద్ వచ్చింది. నగరంలో రాత్రికి రాత్రే పర్యటించి తెల్లవారు ఝామున ఢిల్లీ వెళ్లి పోయారు.  

కొద్ది దినాల తరువాత, ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది. దాంతో పాటే మరో విడత చర్చలకు చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ ప్రభృతులను ప్రభుత్వం ఆహ్వానించింది. చర్చలవలన ఏ ఫలితం చేకూరలేదు. ఉద్యమం నిలుపు చేయాలని మొరార్జీ దేశాయ్, వై. బి. చవాన్ ప్రభుత్వ పక్షాన కోరడం, అది అసంభవమని చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ లు స్పష్టం చేయడం జరిగింది. హైదరాబాద్ తిరిగి వచ్చిన నాయకులకు ఘన స్వాగతం లభించింది. ఇదిలా వుండగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జి. వెంకట స్వామిపై హత్యా ప్రయత్నం జరిగింది. ఆ హత్యా ప్రయత్నాన్ని నిరసిస్తూ ఆ మర్నాడు తెలంగాణ అంతటా సంపూర్ణ హర్తాళ్ జరిగిందిడాక్టర్ జి. ఎస్. మెల్కోటే, సంగం లక్ష్మీబాయి తమ రాజీనామా లేఖలను ప్రజా సమితి అధ్యక్షుడికి అందచేశారు. అదే రోజు రాత్రి నారాయణ గుడాలోని స్నేహితుడు డాక్టర్ సుదర్శన రెడ్డి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న డాక్టర్ చెన్నారెడ్డిని ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్టు చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించసాగారు పోలీసులు. చెన్నారెడ్డితో పాటే, ఏడెనిమిది మంది శాసన సభ సభ్యులను, సుమారు పాతిక మంది ఇతర ప్రముఖులను కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. మరుసటి రోజునుంచి వందల సంఖ్యలో విద్యార్థి నాయకులను ప్రజా సమితి కార్యకర్తలను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. పోలీసులు చెన్నారెడ్డిని తీసుకెళ్తున్న కారును సూర్యాపేటలో ఆందోళనకారులు అడ్డగించారు కొద్ది సేపు. చెన్నారెడ్డి స్థానంలో మదన్ మోహన్ ప్రజా సమితి అధ్యక్షుడయ్యాడు. ఆయనను కూడా అరెస్ట్ చేసిన తరువాత సదా లక్ష్మి ఆ బాధ్యతలు నిర్వహించారు.

ఇది జరిగిన కొన్నాళ్లకు, ఉద్యమం ఇంకా ఉదృతంగా కొనసాగుతున్న నేపధ్యంలోనే, బి. వి. గురుమూర్తి మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరి కొందరి మంత్రుల రాజీనామాను ఆపు చేసేందుకు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వ్యూహాత్మకంగా తన రాజీనామాను అధిష్టానానికి సమర్పించారు. ఆ రాజీనామాను తమ విజయంగా భావించిన లక్షలాది మంది తెలంగాణ వాదులు రోడ్ల పైకొచ్చి పండుగ చేసుకున్నారు. ఊరేగింపులు, సభలు, సమావేశాలు జరుపుకున్నారు. పరిస్థితి పోలీసుల అదుపు తప్పే స్థాయికి చేరుకుంది మరో మారు. ముఖ్యమంత్రి తరహాలోనే కొందరు తెలంగాణ మంత్రులు కూడా రాజీనామా చేశారు. రాజీనామా అయితే చేశాడు కాని, పదవిలో కొనసాగడానికి కాసు చేయని ప్రయత్నం లేదు. అధిష్టానం దూతలుగా హైదరాబాద్ వచ్చి, ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ పేరుతో కాసుకు మద్దతు కూడగట్టారు కామరాజ్ నాడార్, నిజలింగప్పలు. బ్రహ్మానంద రెడ్డి కొనసాగాడు. ఆయన మంత్రివర్గంలో జె. వి. నరసింగ రావుకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు.

ఆ తరువాత జరిగిన శాసన సభ సమావేశాలలో, గవర్నర్ ఖండూభాయ్ దేశాయ్ ప్రసంగం, అర్థాంతరంగా ముగిసింది. జై తెలంగాణ నినాదాలతో సభ మార్మోగింది. సమావేశాలు జరుగుతుండగా, కొందరు విద్యార్థులు అసెంబ్లీ ఆవరణలో ప్రవేశించి, మంత్రులపై కోడి గుడ్లు, టొమాటోలు విసిరారు. మరో సంఘటనలో ఒక యువకుడు పోలీసు కంట్రోల్ రూమ్‌పైన బాంబు విసిరాడు. అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న నాయకుల విడుదలకు న్యాయ పరమైన చర్యలు తీసుకున్నారు. చివరకు డిటెన్యూలందరినీ విడుదల చేయాలని హైకోర్టు తీర్పిచ్చింది. దరిమిలా ఉద్యమ ఉదృతి అనేక కారణాల వల్ల తగ్గింది.


1971 సాధారణ ఎన్నికల్లో "టీ పీ ఎస్" పేరుతో రాజకీయ పార్టీగా బరిలోకి దిగిన తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీచేసి, 11 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రజాభిప్రాయం తెలంగాణ ఏర్పాటేనని స్పష్టంగా ఓటర్లు తెలియచేశారు. అప్పుడే నైతికంగా తెలంగాణ ఏర్పాటు జరిగిపోయుండాల్సింది. కాని జరగలేదు. నాయకత్వం మరో మారు ఉద్యమానికి వెన్ను పోటు పొడిచింది. నాటి ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి తన ప్రజా సమితిని విలీనం చేశారు. తెలంగాణ ఏర్పడడానికి బదులు మరికొన్ని రాయితీలను ఉపశమనంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఉవ్వెత్తున లేచిన ఉద్యమం మోసంతో అణచబడింది. ఉద్యమంలో పాలుపంచుకొని రాజకీయ లబ్ది పొందిన పలువురు నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పదవులనుభవించారు-ఇంకా అనుభవిస్తూనే వున్నారు. కొంద రైతే వారసత్వంగా అనుభవిస్తున్నారు. కాకపోతే వారిలో కొందరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే తమ ఉనికిని కాపాడుకునేందుకు, ప్రజలు తమను మరిచిపోకుండా వుండేందుకు, అడపాదడపా "తెలంగాణ" అంటూ గొంతు చించుకుంటుంటారు. ఇటీవల పదవులకు రాజీనామా చేస్తున్న కొందరు కాంగ్రెస్ నాయకులు "ఆ కోవకు" చెందినవారే. వారికి కావాల్సింది "రాజకీయ భద్రత" గాని, తెలంగాణ ఏర్పాటు కాదు.

Saturday, May 18, 2013

కాంగ్రెస్‌ చీలికలతో నీలం సంజీవరెడ్డి అనుబంధం: వనం జ్వాలా నరసింహారావు


నీలం సంజీవరెడ్డి శత జయంతి ఉత్సవాలు ఆరంభం కానున్న నేపధ్యంలో....

కాంగ్రెస్‌ చీలికలతో నీలం సంజీవరెడ్డి అనుబంధం
వనం జ్వాలా నరసింహారావు

 (ఇందిరాగాంధి ప్రధాన మంత్రిగా తాను అమలు పరచాలనుకున్న విధానాలను
పటిష్టంగా అమలు పరిచే అవకాశం లభించిన 1969 నాటి పరిణామాలు)

అవి నేను నాగపూర్ లో ఎం. ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న రోజులు. 1969-1971 మధ్యకాలం. ప్రత్యేక తెలంగాణ-జై ఆంధ్ర ఉద్యమాల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లోని కళాశాలలు, విశ్వ విద్యాలయాలు మూత బడడంతో డిగ్రీ పూర్తి చేసుకున్న నాలాంటి కొందరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొరకు నాగపూర్ లాంటి ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో ఇందిరాగాంధి ప్రధానమంత్రిగా తనదంటూ రాజకీయాలలో ఒక ముద్ర వేసుకుంటున్న రోజులు. సిండికేట్ గా పిలువబడే అతిరథ-మహారథులైన కాంగ్రెస్ ఉద్దండ పిండాలను ఆమె మట్టికరిపిస్తున్న రోజులవి. భారతదేశ చరిత్రలో మొట్ట మొదటిసారి-చివరిసారి, ప్రధాన మంత్రిగా, దేశంలోని అత్యున్నత పదవికి తన పార్టీ పక్షాన తానే ప్రతిపాదించిన వ్యక్తికి వ్యతిరేకంగా తనపార్టీవారినే ఓటేయమని ఇందిరాగాంధి ప్రోత్సహించిన రోజులవి. ఒక విద్యార్థిగా, రాష్ట్రపతి పదవికి ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఎలెక్టోరల్ కాలేజి అంటే ఏమిటి లాంటి విషయాలతో పాటు, రాజకీయాలలో సమీకరణలు ఎలా వుంటాయో అర్థం చేసుకుంటున్న రోజులవి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలపై నేను రాసుకున్న నోట్స్ ఆధారంగా ఇప్పుడు రాసిన వ్యాసం ఇది.

ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలకు ఎంతో విలు వుంది. నిర్ణయాలు మెజార్టీ సభ్యుల ఆమోదంతో తీసుకున్నవైనప్పటికీ, సంఖ్యా పరంగా అతి కొద్దిమంది ఆలోచనలను, సూచనలను గౌరవించినప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపిస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం జరిగినప్పటినుంచికూడా, మోడరేట్లనీ-అతివాదులనీ భిన్నాభిప్రాయాలవారున్నప్పటికి, వారందరి ధ్యేయం-లక్ష్యం స్వాతంత్ర్య సాధనొక్కటే. స్వాతంత్ర్యం వచ్చిన పిదప కూడా కాంగ్రెస్ పార్టీలోని భిన్నాభిప్రాయాలవారందరు కలివిడిగా జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో పనిచేశారు. వారిలో అతివాద, మితవాద భావాలవారున్నారు. అతివాద సిద్ధాంతాలకు దగ్గరైన సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా పాలన చేసిన నెహ్రూ, పార్టీలోని మితవాద భావాల వారినుండి అడపాదడపా ఎదురైన ప్రతిఘటనలను అధిగమించుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకుపోయారు. పార్టీని నడిపించారు. నాటి పరిస్థితుల్లో పార్టీపరంగా ఆయన అవలంబించిన మధ్యేమార్గం చక్కగా పనిచేసింది. ఆయన మరణానంతరం, పార్టీలోని బలీయమైన మైనార్టీ మితవాద శక్తులు, అభివృద్ధి మార్గాన్ననుసరిస్తున్న నాటి ప్రధాన మంత్రికి అడ్డంకులు-అవరోధాలు కలిగించడంతో, భారత జాతీయ కాంగ్రెస్ లో చీలి కొచ్చి, దరిమిలా కాంగ్రెస్ (ఐ) ఆవిర్భవించి, ఈ నాటికీ దేశ రాజకీయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని, వర్తమాన రాజకీయాల్లో ఒక అతి ముఖ్యమైన ఘట్టంగా పరిణమించిందనవచ్చు.

అయితే భారత జాతీయ కాంగ్రెస్ లో అంతకుముందు చీలికలు లేవనిగాని-రాలేదనికాని అనలేం. 1907 లో నాగపూర్ లో జరగాల్సిన అఖిలభారత కాంగ్రెస్ సభలు వాయిదాపడి, తర్వాత, సూరత్ లో జరిగాయి. అతివాద భావాల వారికి నాయకత్వం వహిస్తున్న బాలగంగాధర తిలక్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎంపికకావడం ఇష్టపడని మాడరేట్లు, సభలను సూరత్ కు మార్చి, రాష్ బిహారీ ఘోష్ కు నాయకత్వం అంటగట్టారు. సభా ప్రాంగణంలో వాగ్యుద్ధాలు తీవ్రస్థాయిలో జరిగాయి. పాత తరం నాయకత్వమని-కొత్తతరం నాయకత్వమని, రెండు వర్గాలుగా పార్టీ చీలిపోయింది. అతివాద భావాల వారు వేరుకుంపటి లాంటిది పెట్టుకొని, తమను తాము అసలైన జాతీయ వాదులుగా వర్ణించుకున్నారు. ఇక ఆ తర్వాత ఏడెనిమిది సంవత్సరాల వరకు పార్టీపై మాడరేట్లే ఆధిపత్యం. దరిమిలా పరిస్థితుల్లో మార్పు కనబడ సాగింది. అతివాదులుగా ముద్రపడిన వారంతా మాతృసంస్థైన కాంగ్రెస్ లో తిరిగి చేరడంతో, భవిష్యత్ లో జరుగనున్న పరిణామాలకు సూచనలు పొడచూపాయి. నాయకత్వంలో కూడా మార్పులు-చేర్పులు చోటుచేసుకోవడం ఆరంభమయింది.


1969నాటి చీలిక, 1951లో సంభవించిన నాసిక్ సంక్షోభం, ఓ మోస్తారు అనాలి. కాకపోతే, అధ్యక్ష పదవికి అతి తీవ్రంగా జరిగిన పోటీలో, ఆచార్య జె. బి. కృపలానీని ఓడించిన పురుషోత్తమ దాస్ టాండన్, దరిమిలా చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా, రాజీనామా చేశారు. చేసి తన రాజనీతిజ్ఞతను చాటుకున్నారు. కాంగ్రెస్ లో చీలికను నివారించారప్పట్లో. 1969లో దీనికి విరుద్ధంగా, నాటి అధ్యక్షుడు నిజలింగప్ప వ్యవహరించడంతో, చీలిక అనివార్యమయింది.

నవంబర్ 1969లో భారత జాతీయ కాంగ్రెస్ చీలిపోవడానికి ప్రధాన కారణం, అంతకు కొద్ది నెలలక్రితం, జులై నెలలో, బెంగుళూర్ లో జరిగిన పార్టీ సమావేశంలో తలెత్తిన వివాదమే. అప్పట్లో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. స్వాతంత్ర్యోద్యమ కాలంలోను, జవహర్లాల్ నెహ్రూ హయాంలోను, సామాజిక-ఆర్థిక-విధానపరమైన విషయాలలో భేదాభిప్రాయాలు-భిన్న ధృక్ఫధాలున్నవారు అనేకమంది వున్నప్పటికీ, వారంతా కాంగ్రెస్ గొడుగు కింద పనిచేసి, ఐకమత్యంగా పార్టీ బలపడేందుకు ఉమ్మడిగా కృషిచేశారు. నాలుగో సాధారణ ఎన్నికలనంతరం, ముఖ్యంగా 1969లో జరిగిన మధ్యంతర ఎన్నికల తర్వాత, దేశ రాజకీయాల్లో సంభవించిన పరిణామాల నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీలోపలా-వెలుపలా, తరచూ, "అతివాద-మితవాద" శక్తుల-వ్యక్తుల ప్రస్తావన రావడం ఆరంభమయింది.

ఇదొక్క కాంగ్రెస్ కే పరిమితమై పోలేదు. అన్ని పార్టీలలోనూ ఈ సంఘర్షణ మొదలైంది. ఆ రోజుల్లో "సిండికేట్" గా సంబోధించబడే కాంగ్రెస్ నాయకులైన మొరార్జీ దేశాయ్, ఎస్. కె. పాటిల్, అతుల్య ఘోష్, నిజలింగప్ప (పార్టీ అధ్యక్షుడు), నీలం సంజీవరెడ్డి లాంటి వారితో, పార్టీలో అతివాదులుగా ముద్రపడిన వారు బహిరంగంగానే విభేదిస్తుండేవారు. బాంకులను జాతీయం చేయడానికి అతివాదులు మద్దతిస్తే, సిండికేట్ వర్గం వారు వ్యతిరేకించారు. బెంగుళూర్ సమావేశంలో ప్రభుత్వరంగ సంస్థల పనితీరుపై వచ్చిన విమర్శల లాంటివి ఇరువర్గాల మధ్య తీవ్ర అభిప్రాయభేదాలకు దారితీశాయి. ప్రధానమంత్రి ఇందిరాగాంధి నాయకత్వాన్ని పూర్తిగా బలపరుస్తున్న అతివాద వర్గం, సిండికేట్ వర్గం వారిని "సామ్యవాద-లౌకికవాద" విధానాలను వ్యతిరేకించేవారన్న నిర్ణయానికి వచ్చారు.

ఇందిరాగాంధి తీసుకున్న బాంకుల జాతీయం నిర్ణయాన్ని వ్యూహాత్మకంగా బలపరుస్తూనే, సిండికేట్ ఒక అడుగు ముందుకు వేసి, నీలం సంజీవరెడ్డి పేరును రాష్ట్రపతి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించాడు నిజలింగప్ప. ఇందిరాగాంధి సూచించిన వి. వి. గిరి పేరును గానీ, జగజీవన్ రాం పేరును గానీ పరిగణలోకి తీసుకోలేదు. ప్రధాన మంత్రిగా తాను సూచించిన అభ్యర్థిని కాకుండా వేరే వ్యక్తిని పార్లమెంటరీ బోర్డ్ ఎంపిక చేయడాన్ని, దాని వెనుక నున్న ఉద్దేశాన్ని తప్పుబట్టింది ఇందిరాగాంధి. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయాల్సిన అభ్యర్థి విషయంలో మెజారిటీ నిర్ణయంకన్నా ఏకాభిప్రాయం ముఖ్యమని తేల్చిచెప్పిందామె. దెబ్బకు దెబ్బగా, మొరార్జీ దేశాయ్ ని ఆర్థిక శాఖనుంచి తొలగిస్తూ నిర్ణయం ప్రకటించింది. భవిష్యత్ లో తాను తీసుకోదలచిన ఆర్థికపరమైన విధానాల అమలు బాధ్యతను మొరార్జీ మీద మోపలేనంటూ తన అభిప్రాయాన్ని వెల్లడిచేసింది. వేరే శాఖను నిర్వహించడానికి ఇష్టపడని మొరార్జీ రాజీనామా చేశాడు.

జులై 19, 1969న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, 14 భారీ వాణిజ్య బాంకులను జాతీయం చేయాలని నిర్ణయం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించ తల్చుకున్న విధానాలకనుగుణంగా, సమసమాజ నిర్మాణం జరగాలంటే, ఇలాంటి నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరముందని ఆమె ప్రకటించారు. ఇందిరాగాంధి తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు దారితీస్తే, వామపక్షాల సంపూర్ణ మద్దతు లభించిందామెకు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో సంభవించనున్న భారీ మార్పులకు-రాజకీయ సమీకరణలకు-పునరేకీకరణలకు తొలి సూచనలు కనబడసాగాయి. పార్టీ ప్రణాళికను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ వారిపై ఇందిరాగాంధి బహిరంగంగానే విమర్శలు చేయడంతో, ఆమెను నియంత్రించే ప్రయత్నాలు జరిగినా, అవేవీ ఫలించలేదు.

వి. వి. గిరి స్వతంత్ర అభ్యర్థిగా-వామ పక్షాల మద్దతుతో, రాష్ట్రపతి పదవికి పోటీకి దిగారు. ఆత్మ ప్రబోధం మేరకు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయమని, కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్-శాసనసభ సభ్యులకు ఆగస్ట్ 13, 1969, పిలుపునిచ్చింది ఇందిరాగాంధి. కాంగ్రెస్ అధ్యక్షుడుగా వున్న నిజలింగప్ప, తమ పార్టీ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తున్న స్వతంత్ర-జనసంఘ్ పార్టీల నాయకులకు, సంజీవరెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతూ లేఖ రాయడాన్ని తప్పుపట్టింది ఇందిరాగాంధి. ఆమె పక్షాన ఫకృద్దీన్ అలీ అహ్మద్, జగ్జీవన్ రాం కాంగ్రెస్ ఓటర్లకు ఆత్మ ప్రబోధం పిలుపివ్వడం జరిగింది. కాంగ్రెస్ విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్న వారి మద్దతు కోరడమంటే, ఏదో విధంగా ఎన్నికల్లో గెలుపు సాధించడమేనని, అది తప్పనీ, విలువలకు తిలోదకాలివ్వడమేననీ, ఇందిరాగాంధి స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీలో చీలికను నివారించడానికే తాను "ఆత్మ ప్రబోధం" నినాదాన్ని ఇచ్చానని ఆమె పేర్కొంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు వున్న కాంగ్రెస్ పార్టీ వారందరికీ ఆమె ఆగస్ట్ 18, 1969 న లేఖ పంపుతూ, అందులో, "సరళీకృత, సామ్యవాద, ఆర్థిక సంస్కరణలను తేవాలని-అమలుచేయాలని అనుకున్నప్పుడల్లా, స్వప్రయోజన పరులు వాటిని వ్యతిరేకిస్తుంటారు" అని పేర్కొని, వారందరి మద్దతు కోరింది ఇందిరాగాంధి. ఇదిలా వుండగా, పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపణ చేస్తూ, జగజీవన్ రాం, ఫకృద్దీన్ అలీ అహ్మద్ లకు కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప నోటీసులు పంపాడు. అయితే, పార్టీ విధానాలను పాటించనివారికి క్రమశిక్షణ గురించి మాట్లాడడంలో అర్థంలేదని ఇందిరాగాంధి పేర్కొంది. వివిధ రాష్ట్రాలలో కొందరు కాంగ్రెస్ నాయకులు తమ స్వప్రయోజనాల కొరకు అవలంబించిన విధానాల వల్ల, ఎలా అభిమానులు పార్టీని వీడిపోయారో వివరించిందామె. జగజీవన్ రాం, ఫకృద్దీన్ అలీ అహ్మద్ లు తామే నిజమైన కాంగ్రెస్ వాదులమని, కాంగ్రెస్ వాదులు, ప్రజలు తమ వెంటే వున్నారని అధ్యక్షుడిచ్చిన నోటీసును సవాలు చేశారు. పార్టీకి చెందిన మెజారిటీ పార్లమెంట్-శాసనసభ్యులు ఇందిరాగాంధికి మద్దతు పలకడంతో, వి. వి. గిరి రాష్ట్రపతిగా ఎన్నికవడం జరిగింది. పార్టీపై ఆమెకున్న ఆధిక్యత ఋజువైంది.

ఒక వైపు పార్టీలో ఆమెకు లభించిన ఆధిపత్యం, మరోవైపు వామపక్షాల నుండి లభిస్తున్న మద్దతు, ఇందిరాగాంధికి ముందుకు కొనసాగడానికి ధైర్యాన్నిచ్చింది. లౌకిక వాదం మీద, ప్రజాస్వామ్యం మీద, సామ్యవాద సిద్ధాంతాల మీద నమ్మకం వున్న వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపిచ్చిందామె. దేశాభివృద్ధిలో పాలు పంచుకోమని విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏ కొద్దిమంది హక్కుభుక్తం కాదని, పౌరులందరికీ దానిపై హక్కుందని స్పష్ట పరిచింది. మహాత్మాగాంధి, జవహర్లాల్ నెహ్రూల అడుగుజాడల్లో కాంగ్రెస్ పనిచేస్తుందని-దేశాభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పేందుకు, ప్రజల-పార్టీ శ్రేణుల మద్దతు కూడగట్టేందుకు, దేశవ్యాప్తంగా పర్యటించింది ఇందిరాగాంధి.

ఆమె తమిళనాడు పర్యటనకు కొద్దిరోజుల ముందు, కాంగ్రెస్ అగ్రనాయకుడు నిజలింగప్ప అనుకూల వాది కామరాజ్ నాడార్ తో వచ్చిన విభేదాలవల్ల, రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇందిరాగాంధి మద్దతుదారుడైన సి. సుబ్రహ్మణ్యం రాజీనామా చేశాడు. దాన్ని సాకుగా చూపి, ఆయన్ను వర్కింగ్ కమిటీ సభ్యుడుగా కొనసాగే విషయంలో పేచీ పెట్టాడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప. ఇరువర్గాలు కొద్దిరోజుల కింద కుదుర్చుకున్న ఐక్యతా ఒప్పందానికి నిజలింగప్ప తీసుకుంటున్న చర్యలు విరుద్ధమైన వని పేర్కొంటూ, ఇందిరాగాంధి, వై. బి. చవాన్, జగ్జీవన్ రాం, ఫకృద్దీన్ అలీ అహ్మద్, ఉమాశంకర్ దీక్షిత్, సి. సుబ్రహ్మణ్యంలు సంయుక్తంగా అధ్యక్షుడికి లేఖను పంపారు. ఇందిరాగాంధి, నిజలింగప్ప మద్దతు దారుల మధ్య విభేదాలు ముదిరిపోవడంతో, అక్టోబర్ 18, 1969, గడువుకంటే ముందే, నూతన అధ్యక్షుడు ని ఎన్నుకోవడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వర్కింగ్ కమిటీకి విజ్ఞప్తిచేశారు.

సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాసిన లేఖలో, గతంలో పార్టీ చేసిన తీర్మానాన్ని ఉదహరిస్తూ, సామ్యవాద-లౌకిక-అభివృద్ధికర విధానాలను ప్రభుత్వం పటిష్టంగా అమలు జరిపేందుకు పార్టీ ప్రజల మద్దతు కూడగట్టుకోవాలనీ-అందుకు పార్టీకి కొత్త అధ్యక్షుడు కావాలనీ, అందుకే అధ్యక్ష ఎన్నిక జరగాలనీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగడానికి ఒకరోజు ముందర, నవంబర్ 1, 1969, సి. సుబ్రహ్మణ్యం, ఫకృద్దీన్ అలీ అహ్మద్ లను సభ్యులుగా తొలగిస్తూ నిజలింగప్ప ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో, ఇందిరాగాంధి మద్దతు దార్లు సమావేశానికి హాజరు కాలేదు. ఏ. ఐ. సి. సీ సమావేశం జరపాలని లేఖ పంపిన వర్కింగ్ కమిటీ సభ్యులందరూ ఇందిరాగాంధి ఇంట్లో సమావేశమయ్యారు. మెజారిటీ ఏ. ఐ. సి. సీ సభ్యుల అభ్యర్థన మేరకు నవంబర్ 22--23,1969న ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహించాలని తీర్మానం చేశారా సమావేశంలో. నవంబర్ 12న ఇందిరాగాంధిని పార్టీనుంచి బహిష్కరించే చర్యలు నిజలింగప్ప చేపట్టడంతో, చీలికకు రంగం పూర్తిగా సిద్ధమయింది. అత్యధిక సంఖ్యాకులైన ఇందిరాగాంధి మద్దతు దారులు, నిజలింగప్ప ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని తప్పుబట్టి, నవంబర్ చివరి వారంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహించి, సి. సుబ్రహ్మణ్యంను తాత్కాలిక అధ్యక్షుడుగా ఎన్నుకోవడంతో భారత జాతీయ కాంగ్రెస్ చీలిపోయింది.

ఇందిరాగాంధి ప్రధాన మంత్రిగా తాను అమలు పరచాలనుకున్న విధానాలను పటిష్టంగా అమలు పరిచే అవకాశం లభించింది. అలా, అలనాడు, నీలం సంజీవరెడ్డి కారణాన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ చీలిపోయి, దరిమిలా కొన్నాళ్లకు, నేడు యుపిఎ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ (ఐ) గా అవతారమెత్తింది. ఆ తరువాత కాలంలో అదే సంజీవరెడ్డి ఏకగ్రీవ అభ్యర్థిగా రాష్ట్రపతి కాగలిగారు.

Thursday, January 7, 2010

భారత జాతీయ కాంగ్రెస్ లో చీలికలు… … నాగ్ పూర్ లో చదువుతున్నప్పటి జ్ఞాపకాలు

ఇందిరాగాంధి ప్రధాన మంత్రిగా తాను అమలు పరచాలనుకున్న విధానాలను పటిష్టంగా అమలు పరిచే అవకాశం లభించిన 1969 నాటి పరిణామాలు

వనం జ్వాలా నరసింహారావు

అవి నేను నాగపూర్ లో ఎం. ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న రోజులు. 1969-1971 మధ్యకాలం. ప్రత్యేక తెలంగాణ-ప్రత్యేక ఆంధ్ర-సమైక్య ఆంధ్ర ఉద్యమాల పుణ్యమా అని ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యాలయాలన్నీ మూత బడడంతో డిగ్రీ పూర్తి చేసుకున్న నాలాంటి వారు చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొరకు నాగపూర్ లాంటి ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. సుందర్ సింగ్ ఎబెన్ జర్, ఉమాశంకర్, అరుణ్ ఉపాధ్యాయ, వై. కె. మోహన్ రావు, పీ.వీ.ఎస్.ఆర్. దాస్, పిళ్లై, అయ్యర్, లోండే లు నా క్లాస్ మేట్స్.నందిరాజు వరప్రసాద్, తుర్లపాటి సాంబశివరావులు ఆదే రోజుల్లో నాగ్ పూర్ లో ఎమ్. కామ్, ఎం. ఎస్సీ (బయో కెమిస్ట్రీ) చదువుతుండేవారు. తెలుగువాడైన ప్రొఫెసర్ మూర్తిగారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన అధ్యాపకుడు. నార్త్ అంబ జారీ రోడ్డులోని లైబ్రరీ భవనంలో మాకు తరగతులు జరుగుతుండేవి. మూర్తిగారు తన క్లాస్ లో, సిలబస్ లో వున్న విషయాలకంటే, వర్తమాన సామాజిక-ఆర్థిక-రాజకీయాలకు సంబంధించిన విషయాలకే ప్రాధాన్యతనిచ్చేవారు. అప్పట్లో ఇందిరాగాంధి ప్రధానమంత్రిగా తనదంటూ రాజకీయాలలో ఒక ముద్ర వేసుకుంటున్న రోజులు. సిండికేట్ గా పిలువబడే అతిరథ-మహారథులైన కాంగ్రెస్ ఉద్దండ పిండాలను ఆమె మట్టికరిపిస్తున్న రోజులవి. భారతదేశ చరిత్రలో మొట్ట మొదటిసారి-చివరిసారి, ప్రధాన మంత్రిగా, దేశంలోని అత్యున్నత పదవికి తన పార్టీ పక్షాన తానే ప్రతిపాదించిన వ్యక్తికి వ్యతిరేకంగా తనపార్టీవారినే ఓటేయమని ఇందిరాగాంధి ప్రోత్సహించిన రోజులవి. మూర్తిగారి క్లాస్ రాష్ట్రపతి పదవికి ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఎలెక్టోరల్ కాలేజి అంటే ఏమిటి లాంటి విషయాలతో పాటు, రాజకీయాలలో సమీకరణలు ఎలా వుంటాయో నేర్చుకున్న రోజులవి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలపై నేను రాసుకున్న నోట్స్ ఆధారంగా ఏదో సందర్భంలో రాసిన వ్యాసం ఇది.

ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలకు ఎంతో విలు వుంది. నిర్ణయాలు మెజార్టీ సభ్యుల ఆమోదంతో తీసుకున్నవైనప్పటికీ, సంఖ్యా పరంగా అతి కొద్దిమంది ఆలోచనలను, సూచనలను గౌరవించినప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపిస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం జరిగినప్పటినుంచికూడా, మోడరేట్లనీ-అతివాదులనీ భిన్నాభిప్రాయాలవారున్నప్పటికి, వారందరి ధ్యేయం-లక్ష్యం స్వాతంత్ర్య సాధనొక్కటే. స్వాతంత్ర్యం వచ్చిన పిదప కూడా కాంగ్రెస్ పార్టీలోని భిన్నాభిప్రాయాలవారందరు కలివిడిగా జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో పనిచేశారు. వారిలో అతివాద, మితవాద భావాలవారున్నారు. అతివాద సిద్ధాంతాలకు దగ్గరైన సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా పాలన చేసిన నెహ్రూ, పార్టీలోని మితవాద భావాల వారినుండి అడపాదడపా ఎదురైన ప్రతిఘటనలను అధిగమించుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకుపోయారు. పార్టీని నడిపించారు. నాటి పరిస్థితుల్లో పార్టీపరంగా ఆయన అవలంబించిన మధ్యేమార్గం చక్కగా పనిచేసింది. ఆయన మరణానంతరం, పార్టీలోని బలీయమైన మైనార్టీ మితవాద శక్తులు, అభివృద్ధి మార్గాన్ననుసరిస్తున్న నాటి ప్రధాన మంత్రికి అడ్డంకులు-అవరోధాలు కలిగించడంతో, భారత జాతీయ కాంగ్రెస్ లో చీలి కొచ్చి, దరిమిలా కాంగ్రెస్ (ఐ) ఆవిర్భవించి, ఈ నాటికీ దేశ రాజకీయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని, వర్తమాన రాజకీయాల్లో ఒక అతి ముఖ్యమైన ఘట్టంగా పరిణమించిందనవచ్చు.

అయితే భారత జాతీయ కాంగ్రెస్ లో అంతకుముందు చీలికలు లేవనిగాని-రాలేదనికాని అనలేం. 1907 లో నాగపూర్ లో జరగాల్సిన అఖిలభారత కాంగ్రెస్ సభలు వాయిదాపడి, తర్వాత, సూరత్ లో జరిగాయి. అతివాద భావాల వారికి నాయకత్వం వహిస్తున్న బాలగంగాధర తిలక్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎంపికకావడం ఇష్టపడని మాడరేట్లు, సభలను సూరత్ కు మార్చి, రాష్ బిహారీ ఘోష్ కు నాయకత్వం అంటగట్టారు. సభా ప్రాంగణంలో వాగ్యుద్ధాలు తీవ్రస్థాయిలో జరిగాయి. పాత తరం నాయకత్వమని-కొత్తతరం నాయకత్వమని, రెండు వర్గాలుగా పార్టీ చీలిపోయింది. అతివాద భావాల వారు వేరుకుంపటి లాంటిది పెట్టుకొని, తమను తాము అసలైన జాతీయ వాదులుగా వర్ణించుకున్నారు. ఇక ఆ తర్వాత ఏడెనిమిది సంవత్సరాల వరకు పార్టీపై మాడరేట్లే ఆధిపత్యం. దరిమిలా పరిస్థితుల్లో మార్పు కనబడ సాగింది. అతివాదులుగా ముద్రపడిన వారంతా మాతృసంస్థైన కాంగ్రెస్ లో తిరిగి చేరడంతో, భవిష్యత్ లో జరుగనున్న పరిణామాలకు సూచనలు పొడసూపాయి. నాయకత్వంలో కూడా మార్పులు-చేర్పులు చోటుచేసుకోవడం ఆరంభమయింది. 1969నాటి చీలిక, 1951లో సంభవించిన నాసిక్ సంక్షోభం, ఓ మోస్తారు అనాలి. కాకపోతే, అధ్యక్ష పదవికి అతి తీవ్రంగా జరిగిన పోటీలో, ఆచార్య జె. బి. కృపలానీని ఓడించిన పురుషోత్తమ దాస్ టాండన్, దరిమిలా చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా, రాజీనామా చేశారు-చేసి తన రాజనీతిజ్ఞతను చాటుకున్నారు. కాంగ్రెస్ లో చీలికను నివారించారప్పట్లో. 1969లో దీనికి విరుద్ధంగా, నాటి అధ్యక్షుడు నిజలింగప్ప వ్యవహరించడంతో, చీలిక అనివార్యమయింది.

నవంబర్ 1969లో భారత జాతీయ కాంగ్రెస్ చీలిపోవడానికి ప్రధాన కారణం, కొద్ది నెలలక్రితం జులై నెలలో బెంగుళూర్ లో జరిగిన పార్టీ సమావేశంలో తలెత్తిన వివాదమే. అప్పట్లో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. స్వాతంత్ర్యోద్యమ కాలంలోను, జవహర్లాల్ నెహ్రూ హయాంలోను, సామాజిక-ఆర్థిక-విధానపరమైన విషయాలలో భేదాభిప్రాయాలు-భిన్న ధృక్ఫధాలున్నవారు అనేకమంది వున్నప్పటికీ, వారంతా కాంగ్రెస్ గొడుగు కింద పనిచేసి, ఐకమత్యంగా పార్టీ బలపడేందుకు ఉమ్మడిగా కృషిచేశారు. నాలుగో సాధారణ ఎన్నికలనంతరం, ముఖ్యంగా 1969లో జరిగిన మధ్యంతర ఎన్నికల తర్వాత, దేశ రాజకీయాల్లో సంభవించిన పరిణామాల నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీలోపలా-వెలుపలా, తరచూ, "అతివాద-మితవాద" శక్తుల-వ్యక్తుల ప్రస్తావన రావడం ఆరంభమయింది. ఇదొక్క కాంగ్రెస్ కే పరిమితమై పోలేదు. అన్ని పార్టీలలోనూ ఈ సంఘర్షణ మొదలైంది. ఆ రోజుల్లో "సిండికేట్" గా సంబోధించబడే కాంగ్రెస్ నాయకులైన మొరార్జీ దేశాయ్, ఎస్. కె. పాటిల్, అతుల్య ఘోష్, నిజలింగప్ప (పార్టీ అధ్యక్షుడు) లాంటి వారితో, పార్టీలో అతివాదులుగా ముద్రపడిన వారు బహిరంగంగానే విభేదిస్తుండేవారు. బాంకులను జాతీయం చేయడాన్ని అతివాదులు మద్దతిస్తే, సిండికేట్ వర్గం వారు వ్యతిరేకించారు. బెంగుళూర్ సమావేశంలో ప్రభుత్వరంగ సంస్థల పనితీరుపై వచ్చిన విమర్శల లాంటివి ఇరువర్గాల మధ్య తీవ్ర అభిప్రాయభేదాలకు దారితీశాయి. ప్రధానమంత్రి ఇందిరాగాంధి నాయకత్వాన్ని పూర్తిగా బలపరుస్తున్న ఒక వర్గం, సిండికేట్ వర్గం వారు "సామ్యవాద-లౌకికవాద" విధానాలకు వ్యతిరేకులనే భావనకొచ్చారు.

ఇందిరాగాంధి తీసుకున్న బాంకుల జాతీయం నిర్ణయాన్ని వ్యూహాత్మకంగా బలపరుస్తూనే, సిండికేట్ ఒక అడుగు ముందుకు వేసి, నీలం సంజీవరెడ్డి పేరును రాష్ట్రపతి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించాడు నిజలింగప్ప. ఇందిరాగాంధి సూచించిన వి. వి. గిరి పేరును గానీ, జగజీవన్ రాం పేరును గానీ పరిగణలోకి తీసుకోలేదు. ప్రధాన మంత్రిగా తాను సూచించిన అభ్యర్థిని కాకుండా వేరే వ్యక్తిని పార్లమెంటరీ బోర్డ్ ఎంపిక చేయడాన్ని, దాని వెనుక నున్న ఉద్దేశాన్ని తప్పుబట్టింది ఇందిరాగాంధి. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయాల్సిన అభ్యర్థి విషయంలో మెజారిటీ నిర్ణయంకన్నా ఏకాభిప్రాయం ముఖ్యమని తేల్చిచెప్పిందామె. దెబ్బకు దెబ్బగా, మొరార్జీ దేశాయ్ ని ఆర్థిక శాఖనుంచి తొలగిస్తూ నిర్ణయం ప్రకటించింది. భవిష్యత్ లో తాను తీసుకోదలచిన ఆర్థికపరమైన విధానాల అమలు బాధ్యతను మొరార్జీ మీద మోపలేనంటూ తన అభిప్రాయాన్ని వెల్లడిచేసింది. వేరే శాఖను నిర్వహించడానికి ఇష్టపడని మొరార్జీ రాజీనామా చేశాడు. జులై 19, 1969న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, 14 భారీ వాణిజ్య బాంకులను జాతీయం చేయాలని నిర్ణయం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించ తల్చుకున్న విధానాలకనుగుణంగా, సమసమాజ నిర్మాణం జరగాలంటే, ఇలాంటి నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరముందని ఆమె ప్రకటించారు. ఇందిరాగాంధి తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు దారితీస్తే, వామపక్షాల సంపూర్ణ మద్దతు లభించిందామెకు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో సంభవించనున్న భారీ మార్పులకు-రాజకీయ సమీకరణలకు-పునరేకీకరణలకు తొలి సూచనలు కనబడసాగాయి. పార్టీ ప్రణాళికను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ వారిపై ఇందిరాగాంధి బహిరంగంగానే విమర్శలు చేయడంతో, ఆమెను నియంత్రించే ప్రయత్నాలు జరిగినా, అవేవీ ఫలించలేదు.

వి. వి. గిరి స్వతంత్ర అభ్యర్థిగా-వామ పక్షాల మద్దతుతో, రాష్ట్రపతి పదవికి పోటీకి దిగారు. ఆగస్ట్ 13, 1969న, ఆత్మ ప్రబోధం మేరకు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయమని, కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్-శాసనసభ సభ్యులకు పిలుపునిచ్చింది ఇందిరాగాంధి. కాంగ్రెస్ అధ్యక్షుడుగా వున్న నిజలింగప్ప, తమ పార్టీ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తున్న స్వతంత్ర-జనసంఘ్ పార్టీల నాయకులకు, సంజీవరెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతూ లేఖ రాయడాన్ని తప్పుపట్టింది ఇందిరాగాంధి. ఆమె పక్షాన ఫకృద్దీన్ అలీ అహ్మద్, జగ్జీవన్ రాం కాంగ్రెస్ ఓటర్లకు ఆత్మ ప్రబోధం పిలుపివ్వడం జరిగింది. కాంగ్రెస్ విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్న వారి మద్దతు కోరడమంటే, ఏదో విధంగా ఎన్నికల్లో గెలుపు సాధించడమేనని, అది తప్పనీ, విలువలకు తిలోదకాలివ్వడమేననీ, ఇందిరాగాంధి స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీలో చీలికను నివారించడానికే తాను "ఆత్మ ప్రబోధం" నినాదాన్ని ఇచ్చానని ఆమె పేర్కొంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు వున్న కాంగ్రెస్ పార్టీ వారందరికీ ఆమె ఆగస్ట్ 18, 1969 న లేఖ పంపుతూ, అందులో, "సరళీకృత, సామ్యవాద, ఆర్థిక సంస్కరణలను తేవాలని-అమలుచేయాలని అనుకున్నప్పుడల్లా, స్వప్రయోజన పరులు వాటిని వ్యతిరేకిస్తుంటారు" అని పేర్కొని, వారందరి మద్దతు కోరింది ఇందిరాగాంధి. పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపణ చేస్తూ, జగజీవన్ రాం, ఫకృద్దీన్ అలీ అహ్మద్ లకు కాంగ్రెస్ అధ్యక్షుడు నోటీసులు పంపాడు. అయితే, పార్టీ విధానాలను పాటించనివారికి క్రమశిక్షణ గురించి మాట్లాడడంలో అర్థంలేదని ఇందిరాగాంధి పేర్కొంది. వివిధ రాష్ట్రాలలో కొందరు కాంగ్రెస్ నాయకులు తమ స్వప్రయోజనాల కొరకు అవలంబించిన విధానాల వల్ల, ఎలా అభిమానులు పార్టీని వీడిపోయారో వివరించిందామె. జగజీవన్ రాం, ఫకృద్దీన్ అలీ అహ్మద్ లు తామే నిజమైన కాంగ్రెస్ వాదులమని-ప్రజలు తమ వెంటే వున్నారని అధ్యక్షుడిచ్చిన నోటీసును సవాలు చేశారు. పార్టీకి చెందిన మెజారిటీ పార్లమెంట్-శాసనసభ్యులు ఇందిరాగాంధికి మద్దతు పలకడంతో, వి. వి. గిరి రాష్ట్రపతిగా ఎన్నికవడం జరిగింది. పార్టీపై ఆమెకున్న ఆధిక్యత ఋజువైంది.

ఒక వైపు పార్టీలో ఆమెకు లభించిన ఆధిపత్యం, మరోవైపు వామపక్షాల నుండి లభిస్తున్న మద్దతు, ఇందిరాగాంధికి ముందుకు కొనసాగడానికి ధైర్యాన్నిచ్చింది. లౌకిక వాదం మీద, ప్రజాస్వామ్యం మీద, సామ్యవాద సిద్ధాంతాల మీద నమ్మకం వున్న వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపిచ్చిందామె. దేశాభివృద్ధిలో పాలు పంచుకోమని విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏ కొద్దిమంది హక్కుభుక్తం కాదని, పౌరులందరికీ దానిపై హక్కుందని స్పష్ట పరిచింది. మహాత్మాగాంధి, జవహర్లాల్ నెహ్రూల అడుగుజాడల్లో కాంగ్రెస్ పనిచేస్తుందని-దేశాభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పేందుకు, ప్రజల-పార్టీ శ్రేణుల మద్దతు కూడగట్టేందుకు, దేశవ్యాప్తంగా పర్యటించింది ఇందిరాగాంధి. ఆమె తమిళనాడు పర్యటనకు కొద్దిరోజుల ముందు, కాంగ్రెస్ అగ్రనాయకుడు-నిజలింగప్ప అనుకూల వాది కామరాజనాడార్ తో వచ్చిన విభేదాలవల్ల, రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇందిరాగాంధి మద్దతుదారుడైన సి. సుబ్రహ్మణ్యం రాజీనామా చేశాడు. దాన్ని సాకుగా చూపి, ఆయన్ను వర్కింగ్ కమిటీ సభ్యుడుగా కొనసాగే విషయంలో పేచీ పెట్టాడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప. ఇరువర్గాలు కొద్దిరోజుల కింద కుదుర్చుకున్న ఐక్యతా ఒప్పందానికి నిజలింగప్ప తీసుకుంటున్న చర్యలు విరుద్ధమైన వని పేర్కొంటూ, ఇందిరాగాంధి-వై. బి. చవాన్-జగ్జీవన్ రాం-ఫకృద్దీన్ అలీ అహ్మద్-ఉమాశంకర్ దీక్షిత్-సి. సుబ్రహ్మణ్యంలు సంయుక్తంగా లేఖను అధ్యక్షుడికి పంపారు. ఇందిరాగాంధి, నిజలింగప్ప మద్దతు దారుల మధ్య విభేదాలు ముదిరిపోవడంతో, అక్టోబర్ 18, 1969న, గడువుకంటే ముందే, నూతన అధ్యక్షుడు ని ఎన్నుకోవడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వర్కింగ్ కమిటీకి విజ్ఞప్తిచేశారు.

సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాసిన లేఖలో, గతంలో పార్టీ చేసిన తీర్మానాన్ని ఉదహరిస్తూ, సామ్యవాద-లౌకిక-అభివృద్ధికర విధానాలను ప్రభుత్వం పటిష్టంగా అమలు జరిపేందుకు పార్టీ ప్రజల మద్దతు కూడగట్టుకోవాలనీ-అందుకు పార్టీకి కొత్త అధ్యక్షుడు కావాలనీ, అందుకే అధ్యక్ష ఎన్నిక జరగాలనీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగడానికి ఒకరోజు ముందర, నవంబర్ 1, 1969న, సి. సుబ్రహ్మణ్యం-ఫకృద్దీన్ అలీ అహ్మద్ లను సభ్యులుగా తొలగిస్తూ నిజలింగప్ప ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో, ఇందిరాగాంధి మద్దతు దార్లు సమావేశానికి హాజరు కాలేదు. ఏ. ఐ. సి. సీ సమావేశం జరపాలని లేఖ పంపిన వర్కింగ్ కమిటీ సభ్యులందరు ఇందిరాగాంధి ఇంట్లో సమావేశమయ్యారు. మెజారిటీ ఏ. ఐ. సి. సీ సభ్యుల అభ్యర్థన మేరకు నవంబర్ 22--23,1969న ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహించాలని తీర్మానం చేశారా సమావేశంలో. నవంబర్ 12న ఇందిరాగాంధిని పార్టీనుంచి బహిష్కరించే చర్యలు నిజలింగప్ప చేపట్టడంతో, చీలికకు రంగం పూర్తిగా సిద్ధమయింది. అత్యధిక సంఖ్యాకులైన ఇందిరాగాంధి మద్దతు దారులు, నిజలింగప్ప ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని తప్పుబట్టి, నవంబర్ చివరి వారంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహించి, సి. సుబ్రహ్మణ్యంను తాత్కాలిక అధ్యక్షుడుగా ఎన్నుకోవడంతో భారత జాతీయ కాంగ్రెస్ చీలిపోయింది.

ఇందిరాగాంధి ప్రధాన మంత్రిగా తాను అమలు పరచాలనుకున్న విధానాలను పటిష్టంగా అమలు పరిచే అవకాశం లభించింది.