Monday, May 28, 2012

ఒక్క మోపిదేవేనా!: సమిష్ఠి బాధ్యత సంగతేమిటి?: వనం జ్వాలా నరసింహారావు


ఒక్క మోపిదేవేనా!: సమిష్ఠి బాధ్యత సంగతేమిటి?
సూర్య దినపత్రిక (27-05-2012)
వనం జ్వాలా నరసింహారావు

మనసులో చెప్పుకోలేని అనుమానంతో, మే నెల 24 గురువారం ఉదయం తన అధికారిక వాహనంలో దిల్‌కుషా అతిథి గృహానికి రెండో రోజు విచారణకు వచ్చిన రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం అందరూ ఊహించిందే. ఆయన ముఖంమీద ఎప్పుడూ కనిపించే చిరునవ్వు... మాయమైంది! ఆ స్థానంలో ఉత్కంఠ కనిపించింది! ఇక అరెస్ట్ తరువాత కధ మామూలే. ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, ప్రత్యేక కోర్టుకు తరలించడం, కస్టడీకి తీసుకోవడం, దరిమిలా... మంత్రి పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగింది. మోపిదేవి మొదట్లో రాజీనామా చేయడానికి విముఖత వ్యక్త పరిచారని, స్నేహితుల సలహా మేరకు రాజీనామాతో పాటు ఒక సుదీర్ఘమైన లేఖను ముఖ్యమంత్రికి రాశారని వార్తలొచ్చాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒత్తిడి వల్లే తాను వాన్ పిక్ వ్యవహారంలో ప్రభుత్వ ఉత్తర్వులపై సంతకం చేసానని, తనకు ఇష్టం లేకపోయినా అల నాడు నెలకొన్న ప్రత్యేక రాజకీయ నేపధ్యంలో ఫైలుపై సంతకం చేయకుండా వుండలేకపోయానని లేఖలో పేర్కొంటూ, తన నిర్దోషిత్వాన్ని బలపరిచేలా అనేక అంశాలను అందులో ప్రస్తావించారు. సహజంగానే ఆయన చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి గవర్నర్ ఆమోదం కొరకు పంపడం, ఆమోదించడం జరిగిపోయింది. ఇదింతటితో ఆగుతుందా? ఇరవయ్యారు జీవోలతో సంబంధం వున్న మిగతా ఐదుగురు మంత్రులకు కూడా ఇది చుట్టుకుంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమై పోయింది. మోపిదేవి అరెస్టు అనంతరం అందుబాటులో వున్న మంత్రులతో సమావేశమైన ముఖ్యమంత్రితో ఈ విషయాన్నే సమావేశంలో పాల్గొన్న పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కన్నేసిన మంత్రుల్లో ప్రత్యేకించి కలవరం పుట్టింది. "ఇలాగైతే మన గతి ఎలా?" అనే ఆందోళన వారంతా ముక్తకంఠంతో వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంత్రులే అరెస్టయితే, ఇక ప్రభుత్వం పరువు-ప్రతిష్ట ఏం కావాలి? అన్న మీమాంస మొదలైంది. మంత్రులే కటకటాల వెనక్కి వెళితే... సర్కారుకు చేటే అని హెచ్చరించేవరకు వెళ్లారు మంత్రులు. ముఖ్యమంత్రిని నిలదీశారనే అనాలి . పాపం....ఆయన మాత్రం ఏం చేయగలుగుతారు?
మోపిదేవి వెంకటరమణ అరెస్ట్ సబబా? కాదా? ఆయన దోషి అవునా?కాదా? అన్న మీమాంస లేవదీసే ముందు మంత్రి మండలికి, వ్యక్తిగతంగా మంత్రులకు ఏ విధమైన బరువు బాధ్యతలు వుంటాయో చర్చించుకోవడం మంచిది.  రాజ్యాంగం ప్రకారం, రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ముగిసిన వెంటనే, శాసనసభలో మెజారిటీ స్థానాలను పొందిన రాజకీయ పార్టీ-లేదా-సంకీర్ణ కూటమికి చెందిన నాయకుడిని (నాయకురాలిని) ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించడం ఆనవాయితీ. ఆ నాయకుడినే ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తారు. అలా ముఖ్యమంత్రిగా నియమించబడిన వ్యక్తి సూచనమేరకు మాత్రమే, గవర్నర్ ఇతర మంత్రులను, మంత్రి మండలి సభ్యులుగా నియమించడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే, ముఖ్యమంత్రి తనతో "సమాన హోదా కలిగిన ఇతర మంత్రులలో ప్రథముడు" మాత్రమే (First among the equals). ఇక అప్పటినుంచి, విధాన పరమైన ప్రభుత్వ పాలన యావత్తు "మంత్రి మండలి సమిష్టి బాధ్యత" అన్న రాజ్యాంగ ప్రాధమిక సూత్రం ఆధారంగానే జరుగుతుంది-జరిగి తీరాలి. ఈ నిబంధనకు ఎవరూ అతీతులు కాదు. అలా కావడం అంటే రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా నడచుకున్నట్లే! ఇక మంత్రిగా కాబినెట్‌లో చేరిన వ్యక్తికి రెండు రకాల బాధ్యతలుంటాయి. అందులో మొదటిది ఆయనకు అప్పజెప్పిన శాఖాపరమైన దైనందిన బాధ్యత. దానికి పూర్తి బాధ్యుడు స్వయంగా ఆ మంత్రి మాత్రమే. రెండోది విధానపరమైన నిర్ణయాలలో యావత్ మంత్రి మండలి సభ్యులతో పాటుగా సమిష్టి బాధ్యత. అంటే, ఒకటి వ్యక్తిగతమైంది మరొకటి సమిష్టిది. రొటీన్‌గా వెలువడే ప్రభుత్వ ఉత్తర్వుల విషయంలో బాధ్యత మొత్తం తనది, సంబంధిత అధికారి(రులది)ది అవుతుంది. కాబినెట్ నిర్ణయం తీసుకునే ఉత్తర్వుల విషయంలో తనకు, తనతో పాటుగా ఇతర మంత్రులకు బాధ్యత వుంటుంది. దానర్థం, వాన్ పిక్ వ్యవహారంలో, వ్య్తక్తిగతంగాను-సమిష్టిగాను తన బాధ్యత నుంచి మోపిదేవి తప్పించుకునే ప్రసక్తే లేదు. ఆ నిర్ణయం కాబినెట్ నిర్ణయం అవుతే, ఆయనతో పాటు ఇతర మంత్రులకు కూడా బాధ్యత వుండి తీరుతుంది.
          వివరాలలోకి పోతే, స్టాంపులు-రిజిస్ట్రేషన్ చట్టం కింద ఇచ్చిన మినహాయింపులు కాని, వాన్ పిక్ రాయితీల ఆమోదం కాని, భూసేకరణ ముసాయిదాకు అనుమతి కాని, ప్రకాశం-గుంటూరు జిల్లాలలో వేలాది ఎకరాల భూ కేటాయింపు కాని, ఇండియా సిమెంట్స్ కు భూమి లీజుల పొడిగింపు కాని-కృష్ణా నదీ జలాల కేటాయింపు కాని, పెన్నా సిమ్మెంట్స్ కు భూ కేటాయింపు-సున్నపు రాయి గనుల లైసెన్స్ మంజూరు కాని, రఘురాం సిమెంట్స్ వ్యవహారం కాని, సరస్వతీ పవర్ లిమిటెడ్ కు సున్నపు రాయి గనుల లీజు కాని, రాంకీ ఫార్మా సిటీ విషంలో కాని, ఈశ్వర సిమెంట్స్ సంగతి కాని, బ్రాహ్మణి ఇన్ ఫ్రా టెక్ కు సీలింగ్ చట్టం నుంచి మినహాయింపు వ్యవహారంలో కాని విడుదలైన వివాదాస్పద ప్రభుత్వ జీవోలు ఒక విధంగా సంబంధిత శాఖా మంత్రిని వ్యక్తిగతంగా బాధ్యుడిని చేస్తే, మరో రకంగా అదే మంత్రిని ఇతర సహచర మంత్రులతో పాటు సమిష్టి గా బాధ్యుడిని చేస్తాయి. "ముఖ్యమంత్రి సంతకం పెట్టమంటే పెట్టాను కాని తనదేం తప్పు లేద" ని వాదించడం సబబు కాదు. ముఖ్యమంత్రితో పాటు, తనది-తనతో పాటు ఇతర మంత్రులది సమిష్టి బాధ్యత కింద తప్పే!
అందుకే జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో కింది నుంచి పైదాకా చాలామందిది-మంత్రులందరిది తప్పే. జగన్ తో పాటు వీరందరిని విచారించాల్సిందే. మోపిదేవి వెంకటరమణను ఏ విధంగానైతే వాన్ పిక్ రాయితీల ఆమోదం విషయంలో కాని, భూసేకరణ ముసాయిదాకు అనుమతి విషయంలో కాని, ప్రకాశం-గుంటూరు జిల్లాలలో వేలాది ఎకరాల భూ కేటాయింపు వ్యవహారంలో కాని, ఆరోపణలకు గురి చేశారో, అదే విధంగా, మిగతా ఐదుగురు మంత్రులను కూడా, అదే బాట పట్టించాలి. వారందరినీ, సిబిఐ దర్యాప్తుకు పిలిచే లోపుగానే మంత్రి మండలి నుంచి తొలగించాలి. సిబిఐ పిలవడం, విచారణ మొదలవడం, అరెస్ట్ పర్వం ఆరంభమవడం, అప్పుడు రాజీనామా కోరడం కన్నా ఇదే సరైన మార్గం. అంతే కాదు... సమిష్టి బాధ్యత కింద, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన ఇతర మంత్రులందరిని కూడా తొలగించి, మంత్రి మండలిని పునర్వ్యవస్థీకరించాలి. అప్పుడే దీనికి ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. లేకపోతే, ఒక్క మోపిదేవిని మాత్రమే బలి పశువును చేసినట్లవుతుంది.
ఇదిలా వుండగా...ఇక...జగన్ వ్యవహారం...ఇప్పుడిప్పుడే ముదిరి పాకాన పడుతున్నట్లుంది. "విచారణకు పిలిపించిన సీబీఐ ఈనెల 25 జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయొచ్చు" అన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఐతే, సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు ఒకరోజు క్రితం ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో జగన్‌ను అరెస్టు చేసే పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చనే ఊహాగానాలూ మొదలయ్యాయి. అనుకున్నట్లు గానే 25వ తేదీన న విచారణకే పరిమితం చేసి, 26న కూడా రమ్మని ఆదేశాలిచ్చింది సిబిఐ. వాస్తవానికి, జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ప్రారంభమై తొమ్మిది నెలలు దాటుతోంది. ఈ కేసులో ప్రథమ ముద్దాయి అయిన జగన్ సీబీఐ ఎదుట హాజరు కావడం ఇదే తొలిసారి. కాకపోతే, ఓబులాపురం మైనింగ్ కేసులో గతంలో సీబీఐ ముందుగా సాక్షిగా ఒక సారి హాజరయ్యారు జగన్. "అరెస్టు తప్పదు" అన్న నిర్ణయానికి వచ్చిన జగన్ ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్టు చేస్తుందనే ఆందోళన ఆయన భయం నుంచే పుట్టిందని, ఈ ఆందోళనకు కారణాలేవీ కనిపించడం లేదని తెలిపింది. కేసు దర్యాప్తు కీలక సమయంలో కూడా జగన్‌ను సీబీఐ అరెస్టు చేయలేదని, మే నెల 28న కోర్టుకు హాజరు కమ్మని సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేస్తుందని కోర్టు భావించడం లేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా, మధ్యంతర ముందస్తు బెయిల్ ఇస్తే సీబీఐకి జగన్ సహకరించకపోవచ్చేమోనన్న సందేహం కూడా కోర్టు వ్యక్తం చేసింది.
సీబీఐ విచారణకు జగన్ హాజరైన సందర్భంగా అంతా హై డ్రామానే. జగన్ అనుచరులు సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే, "రాజు వెడలె రవి తేజము వెడలె" అన్న చందాన, జగన్ తన బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియోలో విచారణ జరగాల్సిన దిల్ కుషా అతిధి గృహానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానిటీడీపీ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంవి మైసూరా రెడ్డి కూడా జగన్ నివాసానికి వెళ్లారు. తొలి రోజు విచారణ ముగిసిన తర్వాత జగన్ దిల్ కుషా నుంచి నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. అప్పుడు కూడా పెద్దఎత్తున పార్టీ నేతల వాహనాలు ఆయన వాహన శ్రేణిని అనుసరించాయి. విచారణ అనంతరం బయటికి వచ్చిన జగన్... బయట వేచి చూస్తున్న మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. "సీబీఐ విచారణ చాలా కూల్‌గా జరిగింది. సీబీఐ అడిగిన ప్రశ్నలకు వివరణాత్మక సమాధానాలు ఇచ్చాను. రేపు ఉదయం పదిన్నర కు మళ్లీ వస్తున్నాను'' అని మీడియాకు చెప్పారు. ఇంతకీ సిబిఐ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తుందా? చేయదా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదమిద్ధంగా సమాధానం ఇదీ అని అనలేం కాని విశ్లేషణ చేయవచ్చు. తొమ్మిది నెలల పాటు అరెస్ట్ చేయని సిబిఐ ఇప్పుడు జగన్‌ను అరెస్టు చేయాల్సిన ఆగత్యం ఏంటి? అన్న ప్రశ్న ఉదయించక మానదు.
ఏదైనా నేరారోపణ మీద ఒక వ్యక్తిని అరెస్టు చేసే ముందర అరెస్టు అనివార్యమా? కాదా? అన్న విషయాన్ని దర్యాప్తు సంస్థ తప్పక ఆలోచిస్తుంది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే, తప్పించుకు పోతాడన్న అనుమానం కానీ, సాక్ష్యాలను తారుమారు చేస్తాడని కానీ, విదేశాలకు పారిపోతాడని కానీ భావించినప్పుడు అరెస్టు చేసి తీరుతుంది. జగన్ కేసు మొదలై తొమ్మిది నెలలు దాటింది. ఆయన మొదటి ముద్దాయి కూడా. ఐనా, ఇంతవరకు ఆయనను, కారణాలేవైనా, అరెస్టు చేయలేదు. పైగా సహ నిందితులను కొందరిని అరెస్టు చేసింది సిబిఐ. వారిలో కొందరిని సుదీర్ఘంగా విచారించింది కూడా. విజయ సాయి రెడ్డి లాంటి వారి బెయిల్ పిటీషన్‌ను కూడా వ్యతిరేకించింది. ఐనా, మొదటి ముద్దాయి జగన్‌ను అరెస్ట్ చేయలేదు. అంటే, అరెస్టు చేయకపోవడానికి బలవత్తరమైన న్యాయపరమైన కారణాలుండి తీరాలి.
ఇదిలా వుంటే, వైఎస్సార్సీపి లోకి వలసల భయం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు తమకు నష్టమేనని ఇరు పార్టీల నాయకత్వాలు విశ్లేషించు కొంటున్నాయి.
(ఈ వ్యాసం ప్రచురించిన నాడే-ఆదివారం సాయంత్రం-జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. ఆ మర్నాడు కోర్టు ఆయనను 14 రోజుల జుడిషియల్ రిమాండు విధించి చంచల్‍గుడా జైలుకు పంపింది)

Tuesday, May 22, 2012

అతిరాత్రం యజ్ఞ నిర్వహణకు సహాయ సహకారాలందించిన వారెందరో....అందరికీ ధన్యవాదాలు: వనం జ్వాలా నరసింహారావు


అతిరాత్రం యజ్ఞ నిర్వహణకు
సహాయ సహకారాలందించిన వారెందరో....
అందరికీ ధన్యవాదాలు
        వనం జ్వాలా నరసింహారావు           
ఆరేడు నెలల క్రితం...నాకు దగ్గర బంధువైన రవిని తీసుకుని, కేసా ప్రగడ హరిహరనాధ శర్మ, ఆయన కుమారుడు రాజశేఖర శర్మ, మరికొందరు మా ఇంటికొచ్చారు. అంతకు రెండు-మూడురోజుల క్రితం ఈ-మెయిల్ ద్వారా నన్ను సంప్రదించారు హరిహరనాధ శర్మ. గత ఏడాది పంజాల్‍లో జరిగిన అతిరాత్రంకు తాను వెళ్ళి వచ్చానని, ఆ యజ్ఞాన్ని తాము కూడా ఎందుకు మన రాష్ట్రంలో చేయకూడదని అనుకున్నామని, ఆ క్రమంలో కేరళలో కొందరిని సంప్రదించామని, వారి సలహా మేరకు నన్ను కలవడానికి వచ్చామని చెప్పారు శర్మ గారు. కారణం అర్థం ఐంది. పంజాల్‍లో జరిగిన యజ్ఞం గురించి నేను రెండు-మూడు వ్యాసాలను రాయడం వల్ల నాకు ఇందులో ప్రమేయం వుందన్న భావనతో వారు నా దగ్గరకు వచ్చారు. నన్ను వారితో కలిసి-మెలిసి పనిచేయాలని కోరారు. అదొక అంది వచ్చిన అదృష్టంలా భావించిన నేను, నా అంగీకారాన్ని తెలిపాను. నాకు చేతనైనంత సహాయాన్ని చేస్తానని, యజ్ఞం పూర్తయ్యేంతవరకు వారితో కల్సి పనిచేస్తానని హామీ ఇచ్చాను. తక్షణమే, రెండు-మూడు రోజుల్లో నాకు బాగా పరిచయమున్న ఆప్తులు దర్శనం శర్మ గారిని, ఆర్.వి.ఆర్ కృష్ణా రావుగారిని, మరో ఇద్దరు-ముగ్గురిని నాకు జతగా అతిరాత్రం పుణ్య యజ్ఞంలో భాగస్తులను చేశాను. అలా మొదలైంది కేవలం పది-పదిహేను మందితో మా అతిరాత్రం ప్రయాణం ఆరేడు నెలల క్రితం. పదిహేను మందితో ఆరంభమైన ఆ కార్యక్రమాన్ని వీక్షించడానికి పదిహేను లక్షల మంది వచ్చారంటే దానికి కారణం అచిర కాలంలోనే సహాయ సహకారాలను అందించిన వారెందరో కావడమే.
అందరిలోకి యాగ రక్షా పురుషుడుగా వ్యవహరించిన కేసా ప్రగడ హరిహరనాధ శర్మ మనో ధైర్యం, సడలని పట్టుదల, కార్యదీక్ష, అవసరమైనప్పుడు "మంకుతనం" బహుశా అతిరాత్రం ద్విగ్విజయంగా పూర్తవడానికి ప్రధాన కారణం అనడంలో అతిశయోక్తి లేదు. మిన్ను విరిగి మీద పడ్డ సందర్భాలలో కూడా ఆయనలో కొంచెమైనా నైరాశ్యం కనిపించలేదు. రూపాయి లేనప్పుడూ, లక్షలొచ్చినప్పుడూ ఒకే మనో ధైర్యం ఆయనలో వుండడం గొప్పగా చెప్పుకోవాలి. ఇక ఆయన కుమారుడు రాజశేఖర శర్మ తన అద్భుతమైన పాండిత్యంతో వెళ్ళిన ప్రతిచోటా-ప్రతివ్యక్తినీ ఆకర్షించు కోవడం నన్ను అబ్బుర పరిచింది. భూదేవికున్నంత ఓర్పు ఆయనది. ఆయనకెన్ని పనులు అప్పగించినా "ఇది నా చేత కాదు" ఆని ఒక్క నాడూ అనలేదు. ఆలశ్యంగానైనా ఆ పని చేసేవాడు. అన్నింటికన్నా మించింది ఆయన కున్న కంప్యూటర్ నాలెడ్జ్. అతిరాత్రానికి సంబంధించినంతవరకు ఆయనే సాఫ్ట్ వేర్, ఆయనే హార్డ్ వేర్ ఇంజనీర్. వెబ్ డిజైనర్ కూడా ఆయనే. అదనంగా అనేకానేక అదనపు బాధ్యతలు.
మాకు తోడుగా మరికొందరిని చేర్చుకున్నాం. స్నేహితుడు కళాధర్ కుమారుడు అనిరుధ్‌ను పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా తీసుకున్నాం. అనిరుధ్ ఆ పనీ-ఈ పనీ అని కాకుండా అన్ని పనులు చేయడమే కాకుండా, చివరకు, యజ్ఞం జరిగిన పన్నెండు రోజులు జనరేటర్‌కు కావాల్సిన డీజిల్ సరఫరా బాధ్యతను నెత్తిన వేసుకున్నాడు. అలాగే ఖమ్మంలో వుండే భండారు రమేష్. హైదరాబాద్ లో అనిరుధ్ ఎలాగో, ఖమ్మం జిల్లాలో రమేష్ అలా. జిల్లా అధికారులతో, అనధికారులతో సంప్రదింపులు జరపడం దగ్గర నుంచి, కేరళ నుంచి వచ్చే వారిని భద్రాచలం తీసుకెళ్ళడం లాంటి పనుల వరకు రమేష్ చూసుకునేవాడు.
హైదరాబాద్‌లో మా బృందంలో ప్రధానంగా బాధ్యతలు నిర్వహించింది (నాకు తెలిసినంతవరకు) దర్శనం శర్మ, ఆర్.వి.ఆర్. కృష్ణారావు, బుచ్చయ్య చౌదరి, రమాదేవి దంపతులు, ఆచార్య రాజారెడ్డి ప్రభృతులు. వీరిలో దర్శనం శర్మ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలానే కృష్ణా రావు, చౌదరిగారు కూడా. ఏదేమైనా మా ఈ చిన్ని బృందంతో పని అయ్యేటట్లు లేదని భావించిన మేము, ఒక కార్య నిర్వాహక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మాజీ టిటిడి కార్య నిర్వహణ అధికారి శ్రీ పీవీఆర్‍కె ప్రసాద్ సారధ్యంలో ఆయన చైర్మన్‌గా, నేను కో ఆర్డినేటర్ గా మరి కొందరు ప్రముఖులతో ఏర్పాటు చేసుకున్నాం సారధ్య సంఘాన్ని. శ్రీయుతులు రమణాచారి, ఎమ్ వీఎస్ ప్రసాద్, కె.ఎస్.శర్మ, సీవిఎస్‍కె శర్మ, శివశంకర రెడ్డి, గోపీనాధ్ రెడ్డి, ఎన్వీఎసెస్ ప్రభాకర్, రాయపాటి సాంబశివరావు, వుండవల్లి అరుణ్ కుమార్, కూనంనేని సాంబశివరావు, రామిరెడ్డి వెంకట రెడ్డి, సత్యవాణి, ఉప్పల శారద ప్రభృతులు సారధ్య సంఘం సభ్యులు. అందరూ ఎవరికి తోచిన సహకారం వారందించారు. పీవీఆర్‍కె ప్రసాద్ గారిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అనుక్షణం సారధ్య సంఘానికి అసలు సిసలైన నాయకత్వం అందించిన ఘనత ఆయనది. ఆయన అధ్యక్షతన నిర్వహించిన ప్రతి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు ఆయనే స్వయంగా మా వెంట వుండేవారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం కాని, టిటిడి సహాయం కాని, ఐటీసీ-సింగరేణి కాలరీస్, ఆ మాటకొస్తే, మాకందిన ప్రతి సహాయం వెనుక ఆయన హస్తం ప్రస్ఫుటంగా వుంది. చివరి మూడు రోజులు భద్రాచలంలోనే మకాం వేసి, అను క్షణం జిల్లా యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతూ, పూర్ణాహుతి అయ్యేంతవరకు మా వెంటే వున్న ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. రమణాచారి గారి అధ్యక్షతన కూడా ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎప్పటికీ మరువలేనిది. అలానే మావెంట వివిధ కార్యాలయాలకు వచ్చిన ఐఎఫెస్ అధికారి శివశంకర రెడ్డి గారు కూడా.
ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మా దాయ శాఖ నుంచి కామన్ గుడ్ ఫండ్ నుంచి రు. 50 లక్షల సహాయం అందించినందుకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి చిత్రారామచంద్రన్‍కు, కమీషనర్ బలరామయ్యకు, మంత్రి సి. రామచంద్రయ్యకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సంబంధిత ఫైలును చకచకా కదిలించడంలో తోడ్పడిన ముఖ్యమంత్రి ప్రిన్సిపాల్ కార్యదర్శి బినోయ్ కుమార్‍కు, ఆయన ఆంతరంగిక కార్యదర్శులు స్వామి-రంగాచారి గార్లకు ధన్యవాదాలు. ఇక టిటిడి నుంచి పాతిక లక్షల నిధులను మంజూరు చేసినందుకు ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం గారికి, బోర్డు సభ్యులకు ధన్యవాదాలు. టిటిడి మంజూరు చేసిన నిధులను విడుదల చేయించడంలో దర్శనం శర్మ, రాజశేఖర శర్మ తీసుకున్న చొరవను ప్రత్యేకంగా అభినందించాలి.
ఇక భద్రాచలం విషయానికొస్తేరామాలయం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కురిచేటి పాండురంగారావు గారు, ఆయన కుమారుడు డీసీఎంఎస్ ఛైర్మన్ రామచంద్రమూర్తి ఒంటిచేత్తో అక్కడి కార్యక్రమాన్ని నడిపించారు. వారి బృందం సభ్యులైన కృష్ణయ్య ప్రభృతులను ప్రత్యేకంగా అభినందించాలి. అన్నదానం విషయంలో వారు తీసుకున్న శ్రద్ధ అజరామరంగా వుండిపోతుంది. మీడియా సహకారం లభించడానికి ప్రధాన కారణం రామచంద్రమూర్తి మాత్రమే.


"ఈవెంటు” ను ఏర్పాటుచేసిన శ్రీనివాసరావు బృందం, ఆ పక్కనే తడికలను ఏర్పాటు చేయించిన భద్రాచలం టెంపుల్ ఈవో బదరీ నారాయణాచార్యులు బృందం, ఇంజనీర్ దయాకరరెడ్డిని అభినందించాలి.
ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, ఎస్పీ హరికుమార్, అడిషనల్ ఏస్పీ గజరాజ్ భూపాల్, పీవో ఐటిడిఏ ప్రవీణ్ కుమార్, సిఐ రామోజీ రమేశ్, ఎస్సై షుకూర్, ఆర్డీఓ పాల్వంచ, ఆర్డీవో కొత్తగూడెం, తహసీల్దార్ నరసింహారావు లకు ధన్యవాదాలు.
చివరిగా...కాకపోతే..అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నదైన, మీడియాకు అతిరాత్రం సారధ్య సంఘం ధన్యవాదాలు తెలుపుకుంటున్నది. మీడియా-ఎలెక్ట్రానిక్, ప్రింట్-వారి సహకారం వల్లే, ఇన్ని లక్షల మందికి తెలియడం, ఇంతమంది ఎటపాక రావడం జరిగింది. మీడియాకు సంబంధించినంతవరకు భద్రాచలంలో రాము చేసిన సమన్వయం మరువలేనిది. అలానే హైదరాబాద్‌లో "సూర్య యాడ్ సిస్టమ్స్", దాని అధినేత సూర్య, మీడియా కోఆర్డినేటర్ కృష్ణమోహన్ చేసిన సహాయం అపూర్వం. ఇక ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే... ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, నమస్తే తెలంగాణ ఛైర్మన్ రాజం ముందు వరుసలో వుంటారు. రెండు రోజులు ఉచితంగా వారిద్దరూ, వారి పత్రికలలో అడ్వర్టైజ్‌మెంట్లు ఇవ్వడం వల్లనే అంతమంది ప్రజానీకానికి అతిరాత్రం గురించి తెల్సిందంటే అతిశయోక్తి కాదు. అలానే భక్తి ఛానల్, ఎన్టీవి, ఐ న్యూస్ ఛానళ్ల ఛైర్మన్ నరేంద్ర చౌదరి గారు కూడా. వారి ఛానళ్లలో నిరంతరం లైవ్ ప్రసారాలు అందించడమే కాకుండా, ఆర్నెల్ల ముందునుంచే అతిరాత్రం ప్రచారానికి శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి వారు. వారికి మా ధన్యవాదాలు. ఇక ఎస్వీబీసీ ఛానల్ అలానే. ఆ ఛానల్ కు, టిటిడి ఈవో సుబ్రహ్మణ్యం గారికి మరోమారు ధన్యవాదాలు.
ఇక అతిరాత్రం యజ్ఞానికి విచ్చేసిన పదిహేను లక్షల మందికి ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చిన ప్రతివారూ, ప్రదక్షిణ చేసి తరించినందుకు మరీ-మరీ కృతజ్ఞతలు. పదిహేను లక్షల మందిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వారూ వున్నారు. మంత్రులు రాం రెడ్డి వెంకట రెడ్డి, రామ చంద్రయ్య, శ్రీధర్ బాబు, రఘువీరారెడ్డి; మాజీమంత్రి జలగం ప్రసాద రావు; మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు; శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క; శాసనమండలి అధ్యక్షులు చక్రపాణి; పార్లమెంటు సభ్యులు హనుమంతరావు, బలరాం నాయక్; శాసనసభ్యులు కుంజ సత్యవతి, తుమ్మల నాగేశ్వర రావు, సండ్ర వెంకట వీరయ్య, కూనంనేని సాంబశివరావు, రేగా కాంతారావు, మిత్ర సేన, అవంతి శ్రీనివాస్; శాసనమండలి సభ్యులు సుధాకరరెడ్డి, బాలసాని, పోట్ల నాగేశ్వరరావు ప్రభృతులున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి, వైస్రాయ్ హోటెల్ యజమాని ప్రభాకరరెడ్డి, కస్టమ్స్-సెంట్రల్ ఎక్సైజ్ కమీషనర్ రఘు చారి, న్యూమరాలజిస్ట్ దైవజ్ఞ శర్మ, ఇతర ప్రముఖులున్నారు. వారందరికీ ధన్యవాదాలు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులున్నారు. సహాయ సహకారాలందించిన వారందరికీ పేరుపేరునా మా ధన్యవాదాలు.

Friday, May 18, 2012

జగన్ ఆస్తులకు ఏం జరుగబోతోంది?: వనం జ్వాలా నరసింహారావు


జగన్ ఆస్తులకు ఏం జరుగబోతోంది?
సూర్య దినపత్రిక (19-05-2012)
వనం జ్వాలా నరసింహారావు
అక్రమ మార్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తులను కూడగట్టుకున్నారంటూ, హైకోర్టు ఆదేశాల మీదకు దర్యాప్తు చేపట్టి కొనసాగిస్తున్న సిబిఐ ఒకటి వెంట మరొక చార్జ్ షీట్ వేసే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టింది. మొదటి చార్జ్ షీట్ కు సంబంధించిన కేసు వ్యవహారంలో ఒక అడుగు ముందుకు వేసి, కోర్టు ద్వారా నిందితులకు సమన్లు జారీ కూడా చేయించింది. సమన్లు అందుకున్న వారిలో సాక్షాత్తు మొదటి ముద్దాయిగా నమోదైన జగన్మోహన్ రెడ్డి కూడా వున్నారు. గత తొమ్మిది నెలలుగా కాశీ-రామేశ్వరం మజిలీ కథలలాగా అంచలంచలుగా మలుపులు తిరుగుతున్న సిబిఐ దర్యాప్తులో కీలకమైన అంశం జగన్‌కు చెందిన సాక్షి పత్రిక, సాక్షి ఛానళ్లను నడుపుతున్న ఆర్థిక సంస్థల అకౌంట్‌లను స్థంబింప చేయడం. సుమారు వారం రోజుల క్రితం సిబిఐ తీసుకున్న ఈ నిర్ణయానికి అనేకులు మద్దతు తెలిపితే, కొందరు మాత్రం ఇదేదో పత్రికా స్వాతంత్ర్యాన్ని హరించుకుని పోయే చర్య అని పబ్లిక్ గానే వాపోయారు. ధర్నాలు, ర్యాలీలు కూడా నిర్వహించారు. ఐనా అంతగా స్పందన రాలేదు. సిబిఐ మరో అడుగు ముందుకు వేసింది. సంబంధిత జగన్ ఆస్తుల జప్తుకు అనుమతిని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేక రాసింది. ఇదిలా వుండగా, సిబిఐ కోర్టులో అకౌంట్ల స్థంభనకు వ్యతిరేకంగా జగన్ దాఖలు చేసిన పిటీషన్‌కు చుక్కెదురవడంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.
సాక్షి గ్రూపు సంస్థల బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లు విచారణకు వచ్చాయి. బ్యాంక్ ఖాతాలు (కరెంట్ అకౌంట్స్) స్తంభింప చేయడంవల్ల సంస్థ రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతోందని, సంస్థల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 20వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారికి నెలసరి వేతనాల కోసం రూ.8కోట్లు, న్యూస్ ప్రింట్ కోసం రూ.20 కోట్లు, పరిపాలన (అడ్మినిస్ట్రేషన్) కోసం రూ.7కోట్లు కలిపి మొత్తం నెలకు రూ. 35కోట్లు వ్యయం అవుతోందని, ప్రకటనలు, పత్రిక అమ్మకాల ద్వారా ఆమేరకు ఆదాయం కూడా ఉందని సాక్షి మీడియా సంస్థల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. హైకోర్టులో విచారణలో భాగంగా, సాక్షి పత్రిక, సాక్షి టీవీల్లో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో చెప్పాలని, ఇతర ఆదాయ, వ్యయాల వివరాలను తమ ముందు ఉంచాలని జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలను హైకోర్టు ఆదేశించింది. సీబీఐ తమ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. సాక్షి పత్రికలో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని  కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కింది కోర్టు విషయాలను పరిగణనలోకి తీసుకోకుండానే తమ పిటిషన్లను తోసిపుచ్చిందని సాక్షి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఐతే, సాక్షిలో 20 వేల మంది ఉద్యోగులు లేరని, కేవలం 4,457 మంది మాత్రమే ఉన్నారని, ఇందుకు సంబంధించిన వివరాలను కార్మిక శాఖ నుంచి తీసుకున్నామని సిబిఐ న్యాయవాది పేర్కొన్నారు. బ్యాంక్ అకౌంట్లు స్తంభింప చేయడం వల్ల సంస్థలకు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీలేదు. నెల మధ్యలోనే ఉంది. ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపులకు ఇంకా చాలా రోజుల సమయం ఉంది. బ్యాంక్ అకౌంట్లు ఎందుకు స్తంభింప చేయాల్సి వచ్చిందో వివరిస్తూ కౌంటర్ వేస్తాం. అందుకు గడువు కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరారు. దీంతో ఉద్యోగుల సంఖ్య, ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్లను న్యాయమూర్తి ఆదేశిస్తూ, తదుపరి విచారణను నెల 22కి వాయిదా వేశారు.
ఇదిలా వుండగా, సాక్షి దినపత్రిక, సాక్షి టెలివిజన్లకు ప్రభుత్వ ప్రకటనలను నిలుపుదల చేస్తూ జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో కొంత ఎదురుదెబ్బ తగిలింది. ప్రకటనలు ఆపేస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. మేరకు న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకటనల నిలుపుదల మార్గదర్శకాలకు విరుద్ధంగా జీవో ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఒకవైపు హైకోర్టులో ఖాతాల స్తంభన వ్యవహారం నడుస్త్రుండగానే, ఖాతాల స్తంభనతో ఈ పాటికే అదరగొట్టిన సిబిఐ మరో అడుగు వేసింది. జగన్ మీడియా ఆస్తులను జప్తు చేసే దిశగా పావులు కదిపింది. ఆ విధంగా ప్రభుత్వాన్ని సిబిఐ కోరడం, దానికి దాదాపుగా అనుమతి లభించడం చకచకా జరిగిపోయింది. తరువాయి భాగం, న్యాయస్థానాల అనుమతి లభించడమే. ఇలా గత రెండు-మూడు రోజులుగా కాశీ మజిలీ కథలో మరికొన్ని కీలక  పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ అక్రమాస్తుల, ఎమ్మార్ కుంభకోణంపై తాము జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఆస్తులను కూడా అటాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ లేఖ పంపింది. కేసులతో సంబంధమున్న ఆస్తుల జాబితాను కూడా లేఖతో పాటు జత చేసింది. లేఖ తన దృష్టికి వచ్చిన వెంటనే, ముఖ్యమంత్రి స్పందించారని, నిశితంగా పరిశీలించారని, చట్టపరమైన చర్యలకు అనుమతించారని మీడియా కధనాలొచ్చాయి. ముఖ్యమంత్రి సూచనల మేరకు హో మంత్రి కూడా సంబంధిత ఫైలును పరిశీలించి తగు ఉత్తర్వులు జారీ చేసారని కూడా వార్తలొచ్చాయి. హోంమంత్రి, సీఎం సంతకాలు పూర్తి కావడంతో, అధికారిక కసరత్తు పూర్తయిందని, న్యాయశాఖ నుంచి కొన్ని వివరణలు తీసుకున్నారని, సిబిఐ కోరిన విధంగానే, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రా కంపెనీల ఆస్తుల అటాచ్‌ మెంట్‌కు అనుమతి లభించిందని పత్రికలు రాశాయి.  
అసలేం జరుగుతుంది? ఇదింతటితో ఆగుతుందా? ఇంకా ముందుకు సాగుతుందా? ఇంతటితో ఆగితే ఇంత గొడవెందుకు? ఖాతాల స్తంభన నాటినుంచి నేటిదాకా తీసుకుంటే, కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్‍లో జగన్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం-రాష్ట్ర ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించబోతోందో దాఖలాలతో సహా కనిపిస్తోంది. ఖాతాల స్తంభనతో సిబిఐ ద్వారా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన స్పష్టమైన సంకేతం, ఇక జగన్‌ను ఏ మాత్రం సహించేది లేదని. పార్టీని, చివరకు సోనియాను దూషించినా మౌనం వహించిన అధిష్టానం ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నదంటే దానికి కారణాలు అనేకం వుండవచ్చు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అతి ప్రధానమైన ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్ పేరిట ఒక అసంతృప్తి జ్వాల ఆకాశమంత ఎత్తుకు ఎదిగి, చివరకు, ఇంతై-ఇంతింతై-వటుడింతై అన్న చందాన, యావత్ కాంగ్రెస్ పార్టీనే కబళించి వేసే స్థాయికి ఎదుగుతుంటే చూసి సహించే స్థితిలో అధిష్టానం లేదని నిరూపించాలనుకుందేమో చక చకా ఒకటి వెంట మరొకటి జరిగిపోసాగాయి. మొదట్లో ఒక చిన్న సమిధ అనుకున్న జగన్, పక్కలో బల్లెం అయిపోయాడు. ఇక లాభం లేదనుకున్న అధిష్టానం, ముఖ్యమంత్రిని, బొత్స సత్యనారాయణను, చిరంజీవిని ఉమ్మడిగా-కలిసి కట్టుగా రంగంలోకి దింపింది రాజకీయ పరంగా. ఒకవైపు వారి ముప్పేట రాజకీయ దాడి సాగుతుండగానే, మరొక వైపు ఆర్థిక మూలాలపై సిబిఐ దాడిని పురికొల్పింది అనుకోవాలి. ఎంత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏజన్సీ అని సర్ది చెప్పుకున్నా కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో మెలిగేదే కదా సిబిఐ!
జగన్‌కు ఎన్ని ఆస్తులున్నా తరగని ఆస్తి-ఆయన తండ్రి ఆలోచించి ఈయన చేతికిచ్చిన అపురూపమైన ఆస్తి "సాక్షి" పత్రిక, "సాక్షి" చానల్. జగన్ ఎప్పుడు, ఎక్కడ, ఏం చేసినా, ఏం చేయదల్చుకున్నా, అతనికి అనుకూలంగా ప్రచారం చేసే ఏకైక సాధనం ఆ రెండూను. జగన్ మీద ఎక్కడ ఈగ వాలినా, ఆ ఈగ వివరాలను తుచ తప్పకుండా అఖిలాంధ్ర ప్రేక్షకులకు, శ్రోతలకు, పాఠకులకు తెలియచెప్పే పదునైన ఆయుధం అది. ఆ రెండింటినీ ఎంతో ఆలోచించి మరీ జగన్‌కు సమకూర్చాడు రాజశేఖరరెడ్డి. జగన్ మిగిలిన ఆస్తుల వ్యవహారంలో, ప్రభుత్వం ఏ విధమైన జోక్యం చేసుకున్నా గొంతు చించుకుని అరిచే ఈ ఆయుధాలను నిరుపయోగం చేయకపోతే, ప్రయోజనం లేదనుకుంది కేంద్ర ప్రభుత్వం-దాని కనుసన్నలలో నడిచే సిబిఐ. అది తప్పా-ఒప్పా అంటే యుద్ధం మొదలైతే, ధర్మం-అధర్మం అనేవి రెండూ సమానమే అన్న నానుడి ఇక్కడ వర్తింప చేసుకోవాలి. అందుకే, గురిచూసి మరీ దెబ్బ కొట్టింది సిబిఐ. మూడింటి లో చార్జ్ షీట్లు, ఒక చార్జి షీట్లో సమన్లు, మరో వ్యవహారంలో ఖాతాల స్తంభన, ఈ లోపుగా మరో చార్జ్ షీట్. వెంట-వెంట మరికొన్ని చార్జ్ షీట్లు. ఇదే వ్యూహం. ముప్పేట దాడి. ఊపిరి సల్పుకోకుండా దాడి. దెబ్బమీద దెబ్బ. కోలుకునే లోపుగా మరో దెబ్బ. దెబ్బ తెలియకుండా మరో దెబ్బ. దిమ్మ తిరిగి పడిపోయీ-పడిపోకుండా దెబ్బ. ఇదీ పరిస్థితి.
ఖాతాల స్తంభనతో, తన వెంట జర్నలిస్టు సంఘాలను చేర్చుకుంది జగన్ మీడియా. పత్రికా స్వాతంత్ర్యానికి ముప్పు వాటిల్లిందని వారితో ప్రచారం చేయించింది. పాత్రికేయులు రోడ్డున పడ్డారని వారితో గగ్గోలు పెట్టించింది. వాస్తవానికి పత్రికా స్వాతంత్ర్యానికి ఖాతాల స్తంభనకు సంబంధమే లేదు. జగన్ అక్రమంగా ఆస్తులను సమకూర్చుకున్నారని, అలా సమకూర్చుకున్న ఆస్తులతో పత్రికను, ఛానల్‌ను పెట్టారన్న ఆరోపణతో ఖాతాల స్తంభన జరిగింది. పత్రికలో ఫలానాది రాయాలనో-రాయొద్దనో ఆంక్షలు విధించితే అది పత్రికా స్వాతంత్ర్యానికి భంగం వాటిల్లినట్లవుతుంది కాని ఖాతాల స్తంభన ఎలా అవుతుంది? సమాధానం ఇవ్వకపోగా ఎదురుదాడికి దిగారు మద్దతు దార్లు. దెబ్బకు ఎదురుదెబ్బ అంటారు. అలాగే జరిగింది ఇప్పుడు. ఖాతాల స్తంభనతో ఆగకుండా, ఎదురుతిరిగిన నేరానికి, ఆస్తుల జప్తుదాకా వెళ్లింది వ్యవహారం ఇప్పుడు. అంతటితో ఆగకుండా, పెట్టుబడులు పెట్టిన వారి గుట్టు రట్టు చేయడం కూడా వేగంగా జరగ సాగింది. ఎనిమిదివందల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్‍ను, ఆయనకు సహకరించిన బ్రహ్మానందరెడ్డిని అరెస్టు చేసింది సిబిఐ. ఒక బడా పారిశ్రామిక వేత్తను అరెస్టు చేయడమంటే, దాని వెనుక ఎంతో పకడ్బందీ వ్యూహం వుండి తీరాలి. తీగ కదిలితే డొంక కదిలినట్లుగా, ఒక్క నిమ్మగడ్డ ప్రసాద్‍తోనే ఆగకుందా, జగన్ కంపెనీలలో పెట్టుబడులు (అక్రమంగా) పెట్టిన ఇతరుల బండారం కూడా సిబిఐ బయటపెట్టే పనిలో పడింది. ఇక ముందుంది ముసళ్ల పండుగ!
ఇదంతా ఒక రాజకీయ-ఆర్థిక వ్యూహం. తనను దెబ్బ తీయాలనుకునే వారిని ఎదురు దెబ్బ తీయకుండా ఎవరూ వుండరు. అదే జరుగుతుందిప్పుడు. కాంగ్రెస్ పార్టీని వీడిన జగన్మోహన్ రెడ్డి, తన మానాన తానున్నట్లయితే, అది వేరే సంగతి. అనవసరంగా పుట్టలో వేలు పెట్టాడు. "నా బంగారు పుట్టలో వేలు పెట్టితే నేను కుట్టనా" అంటోంది సోనియాగాంధీ! కుట్టించుకుంటాడా? కుడతాడా జగన్?End 


క్షీణిస్తున్న పార్లమెంట్ జవాబుదారీతనం: వనం జ్వాలా నరసింహారావు


క్షీణిస్తున్న పార్లమెంట్ జవాబుదారీతనం
నమస్తే తెలంగాణ (15-05-2012)
వనం జ్వాలా నరసింహారావు
భారత పార్లమెంట్ షష్టిపూర్తి జరుపుకుంది. ఆంధ్ర ప్రదేశ్‍కు చెందిన అలనాటి ఇద్దరు తొలితరం పార్లమెంటేరియన్లతో సహా మరో ఇద్దరు మాజీ పార్లమెంటేరియన్లను ఆ సందర్భంగా రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సత్కరించారు. అరుదైన అరవై ఏళ్ల ప్రస్తానం పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో, 1952 మే నెల 13 వ తేదీ నుంచి నేటి వరకు, భారత పార్లమెంటు, ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ప్రజస్వామ్య దేశపు పార్లమెంటుగా అనేకానేక మేలైన శాసనాలను, ప్రజారంజకమైన చట్టాలను తీసుకొచ్చి తనకంటూ ఒఅక్ గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యేకతను సంతరించుకున్న వ్యవస్థగా గుర్తుచేసుకోవాలి. బాంకుల జాతీయీకరణ, రాజాభరణాల రద్దు, స్థానిక సంస్థలకు సంబంధించిన సవరణలు, సమాచార హక్కు చట్టం లాంటి ఎన్నో శాసనాలను మన పార్లమెంటు చేసింది. ఈ సుదీర్ఘ కొద్ది కాలంలో అది సాధించింది స్వల్పమేమే కాకపోయినా సాధించాల్సింది ఇంకా ఎంతో వుందనేది మాత్రం వాస్తవం.
చట్టాల రూపకల్పనకు సంబంధించి పూర్తి అధికారాలను కలిగున్న ఏకైక వ్యవస్థ పార్లమెంటు. పార్లమెంటు సార్వభౌమాధికారం విషయంలో ఎవరికీ ఏవిధమైన అనుమానాలకు తావు లేదు. అదుపులు అన్వయాలకు లోబడి పార్లమెంటు ప్రజాస్వామ్య వ్యవస్థలైన చట్ట సభలు, కార్య నిర్వాహక అధికారి, న్యాయ వ్యవస్థలు పని చేస్తాయి-చేయాలి. ఈ మూడింటి లో ఒకటి ఎక్కువ మరోటి తక్కువ అనలేం. వాస్తవానికి, రాజ్యాంగానికి లోబడి చట్టాలను చేసే నిర్ణయాధికారం-సార్వభౌమాధికారం, నూటికి నూరుపాళ్లు పార్లమెంటు దే అయినా, ఒక సంస్థగా-వ్యవస్థగా, భారత పార్లమెంటుకు రాజ్యాంగ పరంగా సంక్రమించిన అధికారాలను కార్య నిర్వహణ సంస్థ చేతుల్లో పెట్టడంతో, పరోక్షంగా ఉనికిని కోల్పోతున్న నేపధ్యంలో, భవిష్యత్ లో దాని ప్రధాన బాధ్యతైన జవాబుదారీతనంతో వ్యవహరించడం క్లిష్టమౌతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టయిన పార్లమెంటు ఉభయ సభల, రాజ్యాంగపరమైన శాసనాధికార పర్యవేక్షణా సామర్థ్యం, జవాబుదారీ, క్రమేపీ క్షీణ దశకు చేరుకుంటున్నాయనవచ్చు. జవాబుదారీకి ప్రతీకలుగా, పార్లమెంటులో ప్రవేశ పెట్టి చర్చించాల్సిన వివిధ తీర్మానాలు, రాజ్యాంగ పరమైన పార్లమెంటు పర్యవేక్షణా బాధ్యతలు, సభా సంఘాల పనితీరు లాంటివి, నిర్వీర్యమై పోతున్నాయి. ప్రపంచీకరణ దిశగా దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ, పార్లమెంటు అధికారాలను హరించి వేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న పలు అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించి పార్లమెంటుకు సరైన పర్యవేక్షణ లేదు. ఆ ఒప్పందాల విషయంలో పార్లమెంటు వెలుపల తీసుకున్న నిర్ణయాలు తిరుగులేని విగా వుండడంతో, పార్లమెంటు  ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది. ఎన్నికల ద్వారా రాకుండా బాధ్యతాయుతమైన విధులు నిర్వహించే పలు వ్యవస్థలకు బదలాయించిన అధికారాలపై కూడా పార్లమెంటు పర్యవేక్షణ బలహీనంగా వుంది. అదుపులు-అన్వయాల విషయంలో పార్లమెంటుతో సమానమైన అధికారాలను కలిగున్న కార్య నిర్వహణ వ్యవస్థ తనను శాసించే దిశగా పార్లమెంటు అడుగులు వేస్తోంది. అలానే న్యాయ వ్యవస్థ కూడా పార్లమెంటును ఆదేశించే సందర్భాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. శాసనాధికారాలున్న చట్టసభల పరిస్థితి ఇలా కావడానికి కారణాలను రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్తలు, పార్లమెంటరీ అధ్యయన నిపుణులు అన్వేషించే ప్రయత్నం చేశాయి.
శాసన సంబంధమైన ప్రక్రియలో జాప్యం జరుగుతున్నదనే సాకుతో, చట్టాల రూపకల్పన-నిర్ణయాధికారం కలిగిన పార్లమెంటు, చట్టం స్థానంలో "ఆర్డినెన్సుల" ను తెచ్చేందుకు, కార్య నిర్వహణ వ్యవస్థకు (నిర్వహణాధికారికి-ప్రధానికి), అధికారాలను కట్టబెడుతూ పోవడం, భారత పార్లమెంటుకున్న అతి పెద్ద బలహీనతనాలి. మరో విధంగా చెప్పుకోవాలంటే, ఎగ్జిక్యూటివ్ అధికారాలను సమీక్షించే విషయంలో పార్లమెంటు నిష్ఫలత స్పష్టంగా కనిపిస్తోంది. పెరుగుతున్న సామాజిక అవసరాలకు-ఆధునిక పార్లమెంటరీ పద్ధతులకు అనుగుణంగా వ్యవహరించగల సామర్థ్యం-అభిరుచి చాలామంది పార్లమెంటు సభ్యులలో అంతగా లేకపోవడం కూడా జవాబుదారీ క్షీణించడానికి దోహదపడుతోంది. రోజు-రోజుకు పుట్టుకొస్తున్న రాజకీయ పార్టీలు సంస్థాగతంగా పటిష్ఠంగా వ్యవహరించలేక పోవడం, ఆ పార్టీల ప్రతినిధులు స్థానిక అవసరాల దృష్ట్యా చట్ట సభలకు ఎన్నిక కావడంతో, పార్లమెంటు సమిష్టి కార్యాచరణకు అవరోధాలు కలుగుతున్నాయి. జవాబుదారీ తనం తగ్గడానికి ఇది మరో కారణం.
పార్లమెంటు నిర్వర్తించాల్సిన విధులను, దానంతటదే పరిత్యజించడం ఆశ్చర్యకరమైన అంశంగా పరిగణించాలి. ఎన్నికల-పార్టీల రాజకీయాల కారణాన తప్పనిసరిగా తలెత్తే పరిస్థితులు, చట్టాల రూపకల్పనలో అలసత్వం-ఆలశ్యం జరగడానికి దోహదపడుతున్నాయి. పార్లమెంటు సభ్యులు, సరైన కారణాలు లేకపోయినా, చట్ట సభలో అవరోధాలు కలిగించి శాసన ప్రక్రియను ఆలశ్యం చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, క్రమం తప్పకుండా ఎన్నికలు జరగడం, శాంతియుతంగా అధికార మార్పిడి జరగడం, నిష్పాక్షికంగా వ్యవహరించే స్వతంత్ర న్యాయ వ్యవస్థ రూపు దిద్దుకోవడం, చైతన్యవంతమైన పౌర సమాజం బలీయం కావడం లాంటివి భారత దేశ ప్రజాస్వామ్యాన్ని కొంత మేరకైనా పటిష్టం చేశాయి. తరతరాలుగా, గుత్తాధిపత్యంతో కొందరు మాత్రమే రాజ్యాధికారం చలాయించే స్థితిలో వుండే భారతీయ సమాజంలో, నెమ్మదిగా సామాజిక చైతన్యం-విప్లవం వస్తుందని, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాధమిక హక్కులు కాపాడబడతాయని, సార్వజనీన ఓటు హక్కు మార్పుకు సంకేతమని భావించిన దేశ పౌరుల నమ్మకం వమ్మైందని అనాలి. తమ ఓటు హక్కు ద్వారా గెలిపించిన ప్రజా ప్రతినిధులుండే చట్ట సభల (పార్లమెంట్-శాసన సభలు) పని తీరు అసంతృప్తికి గురి చేస్తున్నాయన్న భావన కలుగుతోంది పౌరులకు.
భారత దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో చోటుచేసుకుంటున్న వైఫల్యాలకు-సాఫల్యాలకు, పార్లమెంటు బాధ్యత ఎంతనేది చర్చనీయాంశం. పార్లమెంటు పనితీరుకు సంబంధం లేకుండా, ప్రజాస్వామ్యం మనుగడ సాగే వీలు లేదు. అదే విధంగా పలు ప్రజాస్వామ్య సంస్థల పని తీరు కూడా పార్లమెంటు నిర్వహణా విధానంపైనే ఆధార పడి వుంటుంది. తమకు టికెట్ ఇచ్చి అవకాశం కలిగించిన రాజకీయ పార్టీల ఆలోచనా సరళి-ప్రభావం, పార్లమెంటు సభ్యులపై ప్రస్ఫుటంగా వుంటుంది. ఈ నేపధ్యంలో, తప్పైనా-ఒప్పైనా, అర్హతల-యోగ్యతల దృష్ట్యా కాని, నిబద్ధత దృష్ట్యా కాని, పార్లమెంటేరియన్ పనిలో నాణ్యత క్షీణిస్తున్నదనే నిపుణుల అభిప్రాయం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లతో పోల్చి చూస్తే, ఈ నాటి పార్లమెంటు సభ్యులలో చాలా మంది విద్యార్హతలు ఉన్నత స్థాయిలో వున్నప్పటికీ, ఎన్నికైన వారిలో గణనీయమైన సంఖ్యలో, నేరచరిత్ర కలిగినవారు కూడా వుండడంతో, దాని ప్రభావం కూడా పార్లమెంటు పనితీరుపై పడుతోంది.
భారతీయ ఓటర్లు తమదైన ప్రత్యేక శైలిలో, వారి-వారి ప్రాధాన్యతలను బట్టి, రాజకీయ అనుబంధాలకు అనుగుణంగా, మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ, ఎన్నుకునే విభిన్న మనస్తత్వాల కలగూరగంప పార్లమెంటు-అందునా ప్రత్యేకించి లోక్ సభ. మామూలు సాదాసీదా అభ్యర్థులను ఓటర్లు గెలిపించిన సందర్భాలు, యోధానుయోధులను మట్టి కరిపించిన ఉదాహరణలు కోకొల్లలు. ఒక గుర్తింపు పొందిన రాజకీయ పక్షాన పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలిచిన వ్యక్తి, పార్టీ వీడిన మరు క్షణం ఘోరంగా ఓటమి పాలైన సందర్భాలున్నాయి. ఎన్ని పార్టీలు మారినా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా, అఖండమైన మెజారిటీతో గెలిచిన వారూ వున్నారు. ఎవరిని, ఎప్పుడు ఎందుకు భారతీయ ఓటరు గెలిపించుతాడో-ఓటమి పాలు చేస్తాడో తెలుసుకోవడం అంత సులువైన విషయం కాదు. ఇలాంటి ప్రాధాన్యతలే, పార్లమెంటుకు గెలిచే అభ్యర్థుల సామాజిక కూర్పును ఒక్కో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేసరికి మారుస్తున్నది. ఒక నాడు ఆంగ్ల విద్యను అభ్యసించ గలిగిన లాయర్లు, అగ్రకులాలకు చెందిన విద్యావేత్తలు, ధనవంతులు మాత్రమే పార్లమెంటులో అడుగు పెట్టగల సత్తా వుండేది. కాలం మారింది. ధన బలం, అంగ బలం, కుల బలం వున్న అన్ని సామాజిక వర్గాల వారితో సహా, రిజర్వేషన్ల మూలాన, వెనుక బడిన వర్గాలకు, షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డు తెగలకు చెందిన వారు కూడా పార్లమెంటుకు-చట్ట సభలకు ఎన్నిక కాగలుగుతున్నారు. మహిళలకు ఇంకా రిజర్వేషన్లు కలిగించ లేకపోవడంతో, అనుకున్నంత మంది ఎన్నికవడం లేదు. మొత్తం మీద, మారుతున్న సామాజిక-ఆర్థిక-రాజకీయ పరిస్థితులకనుగుణంగా, వైవిధ్యంతో కూడిన సామాజిక ప్రయోజనాలను ప్రతిబింబించే విభిన్న వ్యక్తులతో పార్లమెంటు ఏర్పాటవుతోందిప్పుడు.
ఇందిరా గాంధి హయాంలో 1975 లో విధించిన అత్యయిక పరిస్థితి, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత విషాద సంఘటనగా పేర్కొనాలి. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకున్న దురదృష్టమైన నిర్ణయమది. అంతకు ఐదారు సంవత్సరాల క్రితం నుంచే, కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు బలమైన ముఠా నాయకులు, రాజకీయంగా లబ్ది పొందాలని పట్టుదలతో, జాతి ప్రయోజనాలను భంగం వాటిల్లే విధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం మొదలైంది. అదే క్రమంలో, కాంగ్రెస్ పార్టీతో సహా పలు రాజకీయ పార్టీలు సంస్థాగతంగా బలహీన పడడం, పార్లమెంటులోకి అడుగు బెట్టే రాజకీయ పార్టీల సంఖ్య ఒక నాటి ఐదు నుంచి సుమారు నలభైకి పెరగడం, ఒక సారి గెలిచిన వ్యక్తి మళ్ళీ గెలుస్తారో-లేదో అన్న అపనమ్మకంతో, "ఆయారం-గయారాం" రాజకీయాలకు ఒడిగట్టడం, పార్లమెంటు వ్యవస్థ జవాబుదారీ కుదించసాగాయి.
రాజ్యాంగ, ఆర్థిక, పాలనా పరమైన అధికారాలున్నప్పటికీ, పార్లమెంటు మౌలిక లక్ష్యం, చట్టాలను రూపొందించడం. రాజ్యాంగాన్ని సవరించే ఏకైక శక్తి పార్లమెంటు. పన్నులు విధించాలన్నా, నిధులు ఖర్చు చేయాలన్నా, పార్లమెంటు ఆమోదం తప్పని సరి. ఇంత పటిష్టమైన అధికారాలు కలిగిన పార్లమెంటును, 1975 లో ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో, పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుంది ఎగ్జిక్యూటివ్. ఎమర్జెన్సీ విధింపుతో సమాంతరంగా, ప్రాధమిక హక్కులను హరించి వేసే, రాష్ట్రపతి ఉత్తర్వులకు పార్లమెంటు ఆమోద ముద్ర వేయించుకో కలిగింది ఇందిరా గాంధి. అవిశ్వాస తీర్మానాల ద్వారా, ఇతర రకాలైన సభా తీర్మానాల ద్వారా, రాజ్యాంగ పరంగా సంక్రమించిన అధికారాలతో ప్రభుత్వాలను ఇబ్బందికి గురిచేయగల పదునైన ఆయుధాలు, తమ చేతులో వుంచుకున్న ప్రతి పక్షాలు సహితం, పార్లమెంటును జవాబుదారీగా వుంచడంలో విఫలమవుతున్నాయి. ఒకప్పుడు అధికారంలో కొచ్చిన రాజకీయ పార్టీలు కూడా, ప్రతిపక్ష పాత్ర సక్రమంగా పోషించలేక పోవడానికి కారణం, సంస్థాగతంగా సరైన నిర్మాణం లేకపోవడమే.
పార్లమెంటులో శాసన నిర్మాణానికి అంచలంచలుగా ప్రక్రియ వుంది. బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత, ముసాయిదాను చర్చకొరకు పరిశీలించేందుకు తక్షణమే ఓటింగు పెట్టవచ్చు. లేదా, ప్రవేశపెట్టిన సభా సభ్యుల సెలెక్ట్ కమిటీకి కాని, ఉభయ సభల సంయుక్త సెలెక్ట్ కమిటీకి కాని పంపవచ్చు. ప్రజాభిప్రాయ సేకరణకొరకు కూడా పంపవచ్చు. కాకపోతే ఈ ప్రక్రియ అరుదుగా జరుగుతుంటుంది. లోక్ పాల్ బిల్లు విషయంలో, ఈ ప్రక్రియకు అవకాశం వుండొచ్చేమో! సింహభాగం బిల్లులను సెలెక్టు కమిటీలకే పంపి తాత్కాలికంగా చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం. క్లాజు వారీగా బిల్లుపై చర్చ, సవరణల పరిశీలన, సవరణలకు మంత్రివర్గం ఆమోదం-తిరస్కారం, తర్వాత ఓటింగు జరుగుతుంది. సంబంధిత సభలో నెగ్గిన తర్వాత, మరో సభకు పంపి ఇదే ప్రక్రియను అనుసరిస్తారు. ఉభయ సభలలో ఓటింగు తర్వాత, రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపడం జరుగుతుంది. ఆమోదం పొందినంత మాత్రాన యాంత్రికంగా-స్వయం చలనంగా చట్టం కాదు. చాలా సందర్భాలలో (కావాలనే?) మరిచి పోవడంతో, రాజ్యాంగపరంగా జారీ చేయాల్సిన గెజెట్ నోటిఫికేషన్ ఆలశ్యం కావడం, చట్టం కాగితాలకే పరిమితమై పోవడం జరుగుతుంటుంది.
పార్లమెంటు సభా సమావేశాల సమయం క్రమేపీ తగ్గుతోంది. వాయిదా తీర్మానాల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోంది. అనేక సందర్భాలలో సభ్యులు మూకుమ్మడిగా నిల్చొని, ఎవరేం మాట్లాడుతున్నారో తెలియనందున, సభ నిర్వహణకు అంతరాయాలు కలగడం సభా సమయం తగ్గిపోవడానికి మరో కారణం. రాజ్యాంగపరంగా విధిగా కావాల్సిన "కోరం" లేకుండా కూడా సభను నిర్వహించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి ఒక్కో సారి. విధి లేని సందర్భాలలో సభాపతి వాయిదా మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తోంది. పార్లమెంటు సభ్యులకు తమ నియోజకవర్గ ఓటర్లతో నిరంతరం సంబంధాలుండడం తప్పనిసరి. నియోజక వర్గానికి పోవడం చేస్తున్నారు కాని, తమకు కేటాయించిన నియోజకవర్గ అభివృద్ధి నిధులను సక్రమంగా ఉపయోగించుకోలేక పోతున్నారు. దురదృష్టవశాత్తు, నియోజకవర్గానికి చెందిన పలువురి దృష్టిలో ఎంపీ అంటే, తమకు కావాల్సిన సొంత పనులు చేసిపెట్టే మనిషి మాత్రమే అన్న అభిప్రాయం వుంది. పార్లమెంటు సభ్యులకు కూడా వారి అవసరం వుండడంతో, వారు కూడా దానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. వెరసి ఇవన్నీ కూడా, జాతీయ ప్రాముఖ్యత సంతరించుకున్న అంశాలపై వారు శ్రద్ధ వహించకుండా వ్యవహరించేందుకు దోహద పడుతున్నాయి. జవాబుదారీ లోపించడానికి ఇవి కూడా కారణాలవుతున్నాయి.
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుందేమో కాని, ఆ వ్యవస్థకు మూలస్థంభమైన పార్లమెంటు జవాబుదారీ ప్రశ్నార్థకంగా మారిపోతోంది.

ఎన్సీుటీసీ ఏర్పాటు వ్యవహారంలో తప్పుడు సంకేతాలిచ్చిన చిదంబరం: వనం జ్వాలా నరసింహారావు


ఎన్‍సీటీసీ ఏర్పాటు వ్యవహారంలో తప్పుడు సంకేతాలిచ్చిన చిదంబరం
సూర్య దినపత్రిక (12-05-2012)
వనం జ్వాలా నరసింహారావు
"జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం"-ఎన్‍సీటీసీ ఏర్పాటు వ్యవహారాన్ని కూలంకషంగా చర్చించి అనుకూలమైన నిర్ణయం రాబట్టేందుకు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల ఐదో తేదీన కేంద్ర ప్రభుత్వం ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో వాడిగా-వేడిగా చర్చలు సాగాయి. ఎన్‍సీటీసీ ఏర్పాటు ప్రతిపాదనపై సీఎంల ఆమోదం పొందేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. తన ముందున్న సమస్త  అవకాశాలను ఉపయోగించుకుంది. వివిధ రాష్ట్రాలలో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‍సీటీసీ చర్య ప్రారంభించే ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తామని కేంద్రం హామీ ఇచ్చినా, కాంగ్రేసేతర పాలనలోని రాష్ట్రాలు విశ్వసించడం లేదు. ఎన్‍సీటీసీని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులకు దానిపట్ల ఉన్న భయాందోళనల్ని తొలగించేందుకు ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌, హోంమంత్రి చిదంబరం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాష్ట్రాల అధికారాలను కబళిస్తుందని, ఫెడరల్‌ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆందోళన చెందిన ముఖ్యమంత్రులు తమ పట్టు వీడలేదు. సమావేశం జరగడానికి ముందే, ఎన్‍సీటీసీ అమలుకు సంబంధించి రెండు ముసాయిదా పత్రాల్ని రాష్ట్రాలకు పంపింది కేంద్రం. ముఖ్య మంత్రులు ఆ ముసాయిదాల్ని చదివితే వారి సందేహాలు చాలావరకు తీరిపోతాయని హోంమంత్రి చిదంబరం భావించారు. ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం అధికారాలు, విధు లేమిటో ఆ ముసాయిదాలలో వున్నాయి. అలాగే ఎన్‍సీటీసీ ఏర్పాటు చేయాల్సిన అవసరం గురించి, ఎన్‍సీటీసీ అమలుచేయబోయే వివిధ సెక్షన్లు ఏంటి అన్నది కూడా ముందస్తుగానే వివరణ ఇచ్చింది కేంద్రం.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సహా పది రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి అభ్యంతరాలు రావడంతో "జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం"-ఎన్‍సీటీసీ ప్రస్తుతానికి ఆగిపోయింది. ముఖ్యమంత్రుల సబ్‌ కమిటీ వేసి.. దాని నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు, ఒడిసా సీఎంలు జయలలిత, నవీన్ పట్నాయక్ డిమాండ్ చేయగా, అసలు ఇది వద్దే వద్దని కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మమతా బెనర్జీ పట్టుబట్టారు. అసలు ఎన్‍సీటీసీ అనేది అక్కర్లేదని చెబుతూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకించారు. అరెస్టులు, స్వాధీన అధికారాలతో ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటుచేయడం వల్ల దేశంలోని సమాఖ్య స్ఫూర్తి దారుణంగా దెబ్బతింటుందని, ఇది రాష్ట్రాలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కానందున కేంద్రం దాని ఏర్పాటు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆమె అన్నారు. చివరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన తరుణ్‌ గొగోయ్ కూడా, కొన్ని సవరణలు చేసిన తర్వాత మాత్రమే ఎన్‍సీటీసీని ఆమోదిస్తామని స్పష్టం చేశారు. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ లాంటివారి నుంచి దీనికి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. కేంద్రం పురాతన కాలం నాటి వ్యవహారాలు చేస్తోందని, ఎన్‍సీటీసీ ఏర్పాటు వల్ల కేంద్రం అన్ని రాష్ట్రాల్లో పాలిస్తున్నట్లు, రాష్ట్రాలు దానిమీద ఆధారపడినట్లు తయారవుతుందని ఆయన అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్‍సీటీసీని పూర్తిగా సమర్థించారు. ఉగ్రవాదం విషయంలో రాజకీయాలకు అతీతంగా పరస్పర సర్దుబాటు చేసుకోవాలని, భౌతిక సరిహద్దులకు అతీతంగా ఆలోచించినప్పుడే ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోగలమని ఆయన చెప్పారు.  ఎన్‍సీటీసీని సమర్థించుకోడానికి కేంద్రం యథాశక్తిగా ప్రయత్నించింది. అయినా, విస్తృత ఏకాభిప్రాయం సాధనలో ప్రధాని మన్మోహన్‌సింగ్, హోం మంత్రి చిదంబరం విఫలం కావడంతో ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను పక్కన పెట్టక తప్పలేదు. కేంద్ర హోం మంత్రి చిదంబరం మానస పుత్రిక ఇక ఇప్పటికి ఇలా కొనసాగాల్సిందే! ఉగ్రవాద నిరోధం అనేది అందరూ పంచుకోవాల్సిన విషయమని, రాజ్యాంగం కూడా ఇదే చెబుతోందని, ఇదే బాధ్యతాయుతమైన మార్గం అని చిదంబరం అంటే, కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఉన్న అధికారాల పంపిణీని మార్చాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని ప్రధాని మన్మోహన్ అన్నారు. ఎన్‍సీటీసీ ఉగ్రవాదాన్ని నిరోధించడానికే గానీ, రాష్ట్రాల అధికారాలను అతిక్రమించేందుకు కాదని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారాయన.
అంటే దానర్థం ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు కేంద్ర హోంమంత్రి చిదంబరం తలపెట్టిన ఎస్‌సీటీసీకి చికాకులు తొలగలేదని. సీఎంల అనుమానాలను నివృత్తి చేయడానికి నిర్వహించిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదర లేదనేది స్పష్టమైంది. ముఖ్యంగా కాంగ్రేసేతర పార్టీల సీఎంలు గట్టిగా వ్యతిరేకించారు. దీంతో ఎన్‍సీటీసీ ఏర్పాటు అనిశ్చితిలో పడింది. ముంబయిలో ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత, ఇకముందు ఇలాంటి దాడులు జరగకుండా, ఉగ్రవాదంపై పోరాటానికి "జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం"-ఎన్‍సీటీసీ (నేషనల్‌ కౌంటర్‌ టెర్రరిజం సెంటర్‌) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచించింది. కేంద్ర హోంమంత్రి పి చిదంబరానికి ఎంతో ఇష్టమైన ఈ ప్రాజెక్టుకు ముంబయి దాడుల తర్వాత రూపకల్పన చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు నిజానికి మార్చి 1న ప్రారంభం కావలసి ఉంది. కానీ, ఎన్‍సీటీసీ పట్ల భయాలు, సందేహాలు వ్యక్తం చేస్తూ, దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రికి రాయడంతో దీనికి బ్రేక్‌ పడింది. "జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం"-ఎన్‍సీటీసీ, ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఒక విభాగంగా పనిచేస్తుంది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను నిర్వహిస్తుంది. ఉగ్రవాదానికి సంబంధించిన వివరాల్ని సేకరిస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి వివిధ ఏజెన్సీల ద్వారా ఉగ్రవాద సమాచారాన్ని సేకరిస్తుంది. టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. భారతదేశంలో ఎక్కడైనా, ఉగ్రవాదానికి సంబంధించి సోదాలు జరిపేందుకు, అరెస్టులు చేసేందుకు ఎస్‌సీటీసీకి అధికారం ఉంటుంది. అయితే, ఎస్‌సీటీసీకి ఉండే అధికారాలపట్ల రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఎన్‍సీటీసీ వేర్పాటు విషయంలో, రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి నెలలో నిర్వహణ పరమైన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌‍ను విడుదల చేయడం ఒక విధంగా ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమే. రాష్ట్రాల పరిధిలో ఉండే విషయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం అంత సబబు కాదేమో! ఇలాంటి చర్యలు కేంద్రం-రాష్ట్రాల మధ్య విశ్వాస రాహిత్యాన్ని ఎక్కువ చేస్తుంది. అందుకే వివాదాస్పద జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. కాంగ్రేసేతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ ప్రతిపాదనను ససేమిరా అంగీకరించడం లేదు. యూపీఏ సంకీర్ణంలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు సైతం తమ వ్యతిరేకతను వెలిబుచ్చాయి. ఈ ప్రాజెక్టును ఎప్పటిలోగా అమలు చేస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నలకు హోం మంత్రి చిదంబరం దగ్గర సమాధానం లేదు. సమాధానాన్ని దాటవేశారు. ఎన్‍సీటీసీ అధికారాల పై ముఖ్యమంత్రులు వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని చిదంబరం తెలిపారు. రాష్ట్రాలపై కేంద్రం ఆధిక్యత పొందటానికి ఇది ఏర్పాటు చేయటం లేదని ప్రధాని మన్మోహన్ ఎంతగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా, ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించటానికే దేశం చేసే ఉమ్మడి ప్రయత్నాల్లో ఎన్‍సీటీసీ ఏర్పాటు ఒక భాగమని తెలియచెప్పినా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో రాష్ట్రాల సామర్థ్యాలకు ఇది అదనపు బలం చే కూరుస్తుందని నమ్మ బలికినా, ఉగ్రవాదాన్ని నిర్మూలించటంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అభ్యర్థించినా ఫలితం కనపడలేదు.
ఏదేమైనప్పటికీ, ఒకటి మాత్రం వాస్తవం. చిదంబరం చెప్పినట్లు, ఉగ్రవాదం ఎదుర్కోవడం తప్పకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యతే. చిదంబరం మాటల్లో అర్థం చేసుకోవాలంటే, ప్రధాని మన్మోహన్ ప్రతిపాదన మేరకే ఎన్‍సీటీసీ ఏర్పాటుకు కేంద్రం సమాయత్తమయింది. ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉగ్రవాదులు సరిహద్దులను గుర్తించరు. దేశ రక్షణ కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిందే. అదే విధంగా, ప్రతిపక్షాలు- ప్రభుత్వం, పౌర సమాజ సంస్థలు-ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేసినప్పుడే, దేశానికి మరింత రక్షణ కల్పించడానికి వీలవుతుంది. అందులో సందేహం ఏ మాత్రం లేదు. అదే కాకుండా, చిదంబరం చెప్పినట్లు, ఉగ్రవాద కేసులు నమోదయినప్పటికి, సామర్థ్యం-నిర్ణయాత్మక శక్తి లోపించటంతో భద్రత ఏజెన్సీలు క్రియాశీలంగా పనిచేయలేక పోతున్నాయి.  ఈ పరిస్థితులలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలంటే జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం ఆవశ్యకత ఎంతైనా వుంది. ఎన్‍సీటీసీ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఉగ్ర వాదాన్ని తిప్పికొట్టే బలమైన వ్యవస్థగా రూపొందాల్సిందే. కాకపోతే, నిఘా సంస్థల సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకుంటూ బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. ఉగ్రవాద నిరోధానికి చేస్తున్న ప్రయత్నాలలో కేంద్ర, రాష్ట్రాల మధ్య వాహకంగా ఎన్‍సీటీసీ పనిచేయాలి. ఎన్‍సీటీసీ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపట్టే రాష్ట్రాలకు అనుబంధంగా పనిచేయాలి. జాతీయ భద్రతకు తీవ్రవాదం అత్యంత ముప్పుగా పరిణమించుతున్న నేపధ్యంల్లోనే, జాతీయ, రాష్ట్రాల స్థాయిలో సమర్ధవంతమైన తీవ్రవాద వ్యతిరేక యంత్రాంగం ఏర్పాటు సముచితమే.
ఇంత సముచితమైన, సహేతుకమైన నిర్ణయాన్ని, దేశ బధ్రత దృష్ట్యా తీసుకొస్తున్న ఈ చట్టాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలకు-ముఖ్యంగా కాంగ్రేసేతర రాష్ట్ర ప్రభుత్వాలకు, సరైన పద్ధతిలో వివరించడంలో కేంద్ర హో మంత్రి చిదంబరం పూర్తిగా విఫలమయ్యారు. ఆ మాటకొస్తే ఈ ఒక్క విషయంలోనే కాదు చిదంబరం అలా విఫలమవుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాని, అధిష్టానం వైఖరిని కాని సంబంధిత వ్యక్తులకు, రాజకీయ పార్టీలకు వివరించడంలోనూ చిదంబరం పూర్తిగా విఫలమయ్యారు. చంద్రబాబు నాయుడు తనను కలిసిన విషయాన్ని, తెలంగాణ వ్యవహారాన్ని తనతో సంప్రదించిన విషయాన్ని విశదీకరించడంలోనూ తప్పుడు సమాచారాన్ని సాక్షాత్తు పార్లమెంటుకే అందచేసిన ఘనత చిదంబరానిది. చిదంబరమే కనుక, ఉగ్రవాద నిరోధానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను, జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం ఆవశ్యకతను సరైన రీతిలో, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయానా వివరించి వున్నట్లైతే ఈ సమస్య తలెత్తేదే కాదు. భవిష్యత్‍లో ఎన్‍సీటీసీ అమలు జాప్యమైనా, అసలు చట్టంగా రాలేకపోయినా దానికి పూర్తి బాధ్యత చిదంబరానిదే. అందుకే ఎన్‍సీటీసీ ఏర్పాటు వ్యవహారంలో తప్పుడు సంకేతాలిచ్చిన చిదంబరం ఇప్పటికైనా జాగ్రత్త వహించి తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చే చర్యలు చేపట్టాలి. End 

Sunday, May 13, 2012

Athirathram-2012 at Etpaka Village: Vanam Jwala Narasimha Rao


Athirathram the world's oldest surviving 4000-year old fascinating, complex and the greatest Vedic Ritual was performed as per the Vedic Ritual hierarchy from Saturday the 21st April 2012 to Wednesday the 2nd May 2012 at Etpaka Village near Bhadrachalam in AP. 
About 15 Lakhs of people visited the Yajnashala and did Pradakshina during the time. Free Meals was provided to each and every one symbolizing social equality. Seetarama Kalyanam was performed during the time on one of the days at the site witnessed by a lakh of people.
On the last day when Poornahuti was performed the yajnasala was set to fire and lakhs of people did pradakshina at the time.
These are few photographs taken at the time. 
Jwala

Jwala in front of Yagasala

 
 Jwala in front of Yagasala

 Bricks brought from Kerala arranged in Garudakara

 Jwala with Deputy Speaker Bhatti Vikramarka

 Yagasala set to fire on 12th day-Poornahuti
 Yagasala set to fire on 12th day-Poornahuti

 Visaitors sitting in front of yagasala on 12th day evening

With Governor of AP while giving Yaga Prasadam

Saturday, May 5, 2012

Athirathram Yajna Prasadam given to Governor AP


PVRK Prasad and Jwala Narasimha Rao 
handing over Yajna Prasadam to Governor



Governor releasing Yajna Vaibhavam Special Issue