Showing posts with label జయప్రకాశ్ నారాయణ. Show all posts
Showing posts with label జయప్రకాశ్ నారాయణ. Show all posts

Thursday, September 1, 2011

వైఎస్‌ ఫోటో పుస్తకం - కథ కమామీషు ఎందుకీ అనాయాస ప్రయాస ?: వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (2-09-2011)

మనది వారసత్వ రాజకీయ భారతం, పార్టీ ఏర్పాటుకు అందరూ మీన మేషాలు లెక్కించిన వారే, నిముషాల్లో ఏర్పాటైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, అడ్డుకునేందుకే వైఎస్సార్‌ పుస్తకావిష్కరణ, జగన్‌కు చెక్‌ పెట్టే వ్యూహమేనా?-ఎడిటర్ సూర్య

రాజకీయాలతో పోటీపడగల (సరదా) క్రీడ బహుశా మరేదీలేదేమో! రాణించడం సంగతి పక్కన పెడితే, నేర్చుకోవడం కూడా అంతగా కష్టం కాని ఆట కూడా అదేనేమో! సాధారణంగా ఏ ఆట నేర్చుకోవాలన్నా, చిన్నతనంలోనే మొదలెట్టి తీరాలంటారు. మనిషి పెరిగి పెద్దయినాకొద్ది, నేర్చుకోవడానికి పిన్న వయసులో వుండే చురుకుదనం, తగ్గిపోతుందనేది నిపుణుల అభిప్రాయం. కొందరి విషయంలో-నేర్చుకోవడానికి అన్ని హంగులూ ఏర్పాటు చేసుకునే పుట్టు బంగారు బాతు కూనలకు, అంతో-ఇంతో జన్యుపరమైన నైపుణ్యం వున్న వారికి-మాత్రం, మరీ చిన్నతనంలో కాకపోయినా, ఏ వయసులోనైనా, అనుకున్నదే తడవుగా-కోరుకున్న ఆటలో ప్రావీణ్యం పొందడానికి అవసరమైన శిక్షణను పొందవచ్చు. అలా పొందినవారు మిగతా వారికంటే ఎక్కువగా రాణించవచ్చు కూడా. రాణించి, ఇతరుల అవకాశాలకు గండికొట్టవచ్చు. జాతీయ-అంతర్జాతీయ క్రీడల్లో వారి స్థానం పదిలం చేసుకోనూవచ్చు. మిగతా ఆటలకన్నా రాజకీయం ఆటలో మాత్రం ఇది నూటికి నూరుపాళ్లు నిజం. వారసత్వ రాజకీయాలకు నిలయమైన భారతావనిలో, అందునా ఆంధ్రా వనిలో, అది నూటికి వేయిపాళ్లు నిజం.

అశేష ప్రజాదరణ, లక్షలాది మంది అభిమానుల అండదండలున్న ఎన్ టీ రామారావు లాంటి గొప్ప వ్యక్తి రాజకీయాలలో దిగడానికి చాలాకాలం ఆలోచించాల్సి వచ్చింది. తెలుగు దేశం పార్టీ స్థాపించడానికి బహుశా ఎంతో తర్జన-భర్జన జరిగే వుంటుంది. సరే పెట్టిన తర్వాత ఏం జరిగిందో చెప్పాల్సిన పని లేదు. ఆ మహానుభావుడికి సైతం గెలుపు-ఓటములు తప్పలేదు. ఆయనంత కాకపోయినా, దాదాపు అంతే మోతాదులో అభిమానుల బలం అపారంగా వున్న, చిరంజీవి కూడా రాజకీయ పార్టీ పెట్టడానికి ఎంత వూగిసలాడిందీ అందరికీ తెలిసిందే. ఓటమి (స్వయంగా ఆయనే ఒక నియోజక వర్గంలో, ఆయన పార్టీ రాష్ట్రంలో) రుచితో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో విలీనం వరకు సాగిందిప్పటివరకు. ఇరవై సంవత్సరాల పాటు ఉన్నత పదవులను చేపట్టి, ఒక ఐఏఎస్ అధికారిగా రాష్ట్రంలోని వివిధ శాఖలలో పనిచేసి మంచి పేరు గడించి, పదవీ విరమణ చేసి, ప్రభుత్వేతర సంస్థ గొడుగు కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రజోపయోగమైన అనేక కార్యక్రమాలను నిర్వహించిన డాక్టర్ జయప్రకాశ్ నారాయణకు రాజకీయ పార్టీ పెట్టడానికి కనీసం నాలుగు సంవత్సరాల పాటు ఆలోచన చేయాల్సి వచ్చింది. గతంలో కాంగ్రెస్ నుంచి వేరుపడిన కొందరు నాయకులైనా, ఇతర పార్టీల నుంచి బయట కొచ్చిన మరికొందరైనా, వేరు కుంపటి పెట్టుకోవడానికి, మీన-మేషాలు లెక్కించే వారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ సంగతై తే, మిగిలిన రాష్ట్రాలలోనూ అంతే. అతిరథ-మహారథులనుకునే కురువృద్ధ రాజకీయ నాయకులు సహితం ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి చాలా సమయం తీసుకునే వారు. అలాంటిది, ఆంధ్ర ప్రదేశ్ లో, తనను కాదన్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీని లెక్క చేయకుండా, అర నిమిషమైనా ఆలోచించకుండా, దానికి ధీటుగా "వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ" ని స్థాపించి, అతి కొద్ది సమయంలోనే, ఆ పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు అఖండ మెజారిటీతో ఎన్నికై, అదే పార్టీ నుంచి అంతే భారీ మెజారిటీతో తన తల్లిని శాసనసభకు కూడా ఎన్నిక చేయించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే, కాంగ్రెస్ అధిష్టానానికి భయం లేకుండా వుంటుందా? భయాన్ని కప్పి పుచ్చుకుని, ఆయనను దెబ్బతీయడానికి, ఆ పార్టీ తన సర్వ శక్తులను ఫణంగా పెట్టకుండా వుంటుందా? అలా చేయడానికి, ధీటైన నాయకులను వెతుక్కోకుండా వుంటుందా? ఆ కోణంలో జరిగిన ఆలోచన పర్యవసానమే మొన్న ఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ సంరంభం.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించి, ఎప్పుడైతే సొంత కుంపటి పెట్టారో, ఆ మరుక్షణమే, వైఎస్ బతికున్నప్పుడు ఆయన దూరంగా పెట్టిన-ఆయనకు దూరంగా వున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయక మహాశయులు కొందరు, జగన్ బలం లేనివాడుగా చిత్రీకరించేందుకు "అధిష్టానం వందిమాగధుల" పంచన చేరారు. వారి ద్వారా సోనియాను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. రాజశేఖర రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డిని కూడా ముందుకు తోసారు. రాజకీయ క్రీడ ప్రారంభమైంది. "అధిష్టానం ఆదేశిస్తే" జగన్మోహన్ రెడ్డిని "ఢీ" కొంటానని డీఎల్ రవీంద్రారెడ్డి ముందుకొచ్చారు. అఖండ విజయం తనదేనని-జగన్ కు డిపాజిట్ కూడా రాదని తొలుత మాట్లాడిన డీఎల్, ఆ తర్వాత తన మెజారిటీని తానే తగ్గించుకుంటూ, చివరకు తన డిపాజిట్ కోల్పాయారు. పాపం వివేకాకు అదే గతి పట్టించారు. నైతిక విలువలంటూ మంత్రి పదవికి రాజీనామా చేసిన వివేకా రెంటికి చెడ్డ... సామెతకు గురయ్యారు. అధిష్టానానికి ఎవరేంటో తెలిసొచ్చింది. ఎవరి బలం ఎంతో అవగాహన కొచ్చింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలరో నిర్ణయానికొచ్చింది. పావులు కదపడం మొదలెట్టింది. కలిసొచ్చే రోజున...నడిచొచ్చే...అన్న చందాన, శంకర్ రావు కోర్టులో వేసిన కేసుతో సిబిఐ రంగంలోకి దిగడంతో, కాంగ్రెస్ పార్టీకి కొంత వెసులుబాటు వచ్చింది. దెబ్బమీద దెబ్బ కొట్టడానికి రంగం సిద్ధమైంది. రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం అనంతరం, క్రియాశీలక రాజకీయాలకు కొంత "బ్రేక్" ఇచ్చిన ఆయన సన్నిహితుడు-హితుడు కేవీపీ రామచంద్రరావు అధిష్టానం వేసిన "అంజనం" లో పెద్దలకు కనిపించారు. ఆయన కూడా అవకాశం కొరకు ఎదురు చూస్తుండడంతో, కార్యాచరణ ప్రణాళిక అమలు మొదలైంది. తొలి అంకం "పుస్తకావిష్కరణ" తో ప్రారంభమైంది. ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి జగన్ చేసిన తప్పిదాలను చట్టపరంగా వాడుకుంటున్న కాంగ్రెస్ ఆయన "రాజకీయ క్రీడ" కట్టడికి మరో దిక్కునుంచి ఈ విధంగా అడుగులు వేయ సాగింది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై రూపొందించిన "వైఎస్ ఆర్-మాన్ ఆఫ్ పీపుల్" అనే ఛాయాచిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా మారడానికి ప్రధాన కారణం, వైఎస్ రాజకీయ వారసత్వం ఎట్టి పరిస్థితుల్లోను జగన్మోహన్ రెడ్డిది కాదని చెప్పడానికే! జగన్ కేవలం రాజశేఖర రెడ్డి "ఆస్తులకు" మాత్రమే వారసుడని ఇన్నాళ్లూ చెప్తూ వస్తున్న వైఎస్ వ్యతిరేక కాంగ్రెస్ నాయకులు, ఆ వారసత్వం ఆయనకు ఆపాదించడానికి వెనుకనున్న కారణం, అదే ఆరోపణపై జగన్ ను ఇబ్బందుల పాలు చేయడమే. వ్యతిరేకుల వైఖరికి భిన్నంగా వైఎస్ అనుయాయులమని చెపుకుంటున్న వారి వ్యూహం మరో విధంగా వుంది. వైఎస్ రాజకీయ వారసత్వం తనదేనని ఆయన కుమారుడుగా జగన్ ప్రచారం చేసుకుంటున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీలోని వైఎస్ అభిమానులను- సన్నిహితులను, ఏదో ఒక కారణాన ఒకే వేదికపై తెచ్చి, సంఘటితం చేయడంతో పాటు, మరుగున పడిపోతున్న తన రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. ఆయనకు తెలియకుండానే, ఆయనతో ఈ కార్యక్రమం, ఆయనొక్కడే ఒంటి చేత్తో చేస్తున్నానన్న భావన కలిగించింది అధిష్టానం. ఫలితంగా భారీ స్థాయిలో పుస్తకావిష్కరణ తంతు నడిచింది. స్వయంగా కేవీపి పలువురిని ఆహ్వానించారు. సోనియాగాంధి కార్యక్రమంలో పాల్గొంటుందన్న ప్రచారమూ జరిగింది. వైఎస్ మరో దగ్గరి స్నేహితుడు, ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా, సోనియా సభకు రాలేకపోయిన విషయాన్ని బహిర్గతం చేశారు. యావత్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ యోధానయోధులు, కేంద్ర మంత్రి మండలిలోని ఉద్దండులు, రాష్టంలోని వైఎస్ అభిమాన భజన మండలి, వారు-వీరు అనే తేడా లేకుండా, సభలో ప్రత్యక్షమయ్యారు. వైఎస్ రాజకీయ వారసులం తామే అంటూ ఉపన్యాసాలిచ్చారు. అవును మరి! వైఎస్ వల్ల అంతో-ఇంతో లబ్ది పొందిన వీరంతా ఆయన వారసులమని చెప్పుకోకుండా వుండే ధైర్యం వుందా? సోనియా గాంధీ ఢిల్లీలో వుండి వున్నట్లయితే ఆమె ఆ సభకు హాజరై వుండేదా? అనుమానమే! సోనియా కోరుకుంటున్నది తన సారధ్యంలోని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, పార్టీలోని అందరినీ కూడగట్టుకుని జగన్ కు చెక్ పెట్టాలని తప్ప, వైఎస్ వారసులుగా మాత్రం కానే కాదు. ఒకవేళ ఆమె వైఎస్ వారసత్వంతో పటిష్టమయ్యే కాంగ్రెస్ పార్టీ మాత్రమే కావాలనుకుంటే, ఏనాడో ఒకనాడు జగన్మోహన్ రెడ్డినే ఆహ్వానింస్తుందికాని పరోక్షంగా ఇలా మాత్రం చేయదు. జగన్ ను, ఆయన ఎవరి వారసుడుగా చెప్పుకుంటున్నడో ఆ రాజశేఖర రెడ్డిని ఓడించడమే సోనియా లక్ష్యం అయ్యుండాలి.

అనుకున్నట్లే-ఆహ్వానించింది ఎవరైనా-పరోక్షంగా అధిష్టానం ఆశీస్సులున్నా లేకపోయినా-పిలుపు అందుకున్న వారు, అందుకోనివారు-వై ఎస్ రాజశేఖర రెడ్డి మీద నిజమైన ప్రేమ వున్న వారు, లేనివారు, అందరూ పుస్తకావిష్కరణ సభకు వచ్చారు. ఒకరిని మించి (మనసులో వుద్దేశం ఏదైనప్పటికీ) మరొకరు వై ఎస్ ఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. పనిలో పనిగా రాజశేఖర రెడ్డి విజయాల వెనుక కెవిపి రామచంద్ర రావు వున్నారన్న భావన కూడా వచ్చే ట్లు మాట్లాడారు వారంతా. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి-కేవీపీ రామచంద్ర రావులేనని సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నొక్కి వక్కాణించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్, ప్రవాస వ్యవహారాల మంత్రి వాయలార్ రవి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, కోశాధికారి, సీనియర్ నేత మోతీలాల్ వోరా తదితరులంతా వైఎస్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన అసలు సిసలైన కాంగ్రెస్ వాది అని, సోనియాకు అత్యంత విధేయుడని కూడా పొగిడారు.

ఇంతకూ కెవిపి రామచంద్రరావు మనసులో ఏముంది? పుస్తకావిష్కరణ ఆలోచన ఆయనదేనా? రెండేళ్లు పనికిరాని ఆయన హఠాత్తుగా అధిష్టానానికి ఇప్పుదెందుకు అవసర మయ్యాడు? కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ "విభజించి పాలించు" అన్నదే వ్యూహం. జగన్ నుంచి వివేకాను విడదీసి లబ్ది పొందుదాం అనుకుంటే, అది బెడిసి కొట్టింది. రోశయ్యకు మొదలు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇస్తే ఆశించిన ఫలితాలు రావడం లేదు. శంకరరావు లాంటి వారి పాత్ర పరిమితమైనదే. రాజశేఖర రెడ్డి వ్యవహార శైలి పరిపూర్ణంగా తెలిసిన ఏకైక వ్యక్తి కెవిపి రామచంద్ర రావు మాత్రమే. జగన్ ఎలాగూ ఎదురు తిరిగాడు. ఆయనను సరాసరి యుద్ధంలో ఓడించడం అంత తేలికైన విషయం కాదనే ది అధిష్టానం పసికట్టింది. ఏ ఎత్తులు-జిత్తులతోనైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కెవిపి తెలివితేటలు తోడ్పడ్డాయో, వాటితోనే ఆయన కుమారుడికి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగానే, ఈ పుస్తకావిష్కరణ తతంగం సాగింది. ఎలాగూ కేవిపికి "చంద్రగుప్తుడు"లాంటి పదవిపై కోరిక-కాంక్ష లేదు. ఆయన కోరుకునే "చాణక్యుడి పాత్ర" ఎందుకు ఆయనకే ఇవ్వకూడదనేది అధిష్టానం ఆలోచన. చాణక్య నీతిలో విజయం సాధిస్తే జగన్ ను కట్టడి చేయగలమనే ఆశతోనే ఇదంతా. ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు!

Wednesday, June 22, 2011

డోలాయమానంలో రాష్ట్ర ("భారత ఉక్కు వ్యవస్థ") ఐఏఎస్ లు?:వనం జ్వాలా నరసింహా రావు

ఐఏఎస్‌ లలో అసంతృప్తి !

సూర్య దిన పత్రిక (23-06-2011)

వనం జ్వాలా నరసింహా రావు

డోలాయమానంలో రాష్ట్ర ("భారత ఉక్కు వ్యవస్థ") ఐఏఎస్ లు?

వనం జ్వాలా నరసింహా రావు

రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసిన సుమారు ఏబై మంది ఐఏఎస్‌ అధికారులలో పలువురు తమకు ప్రాధాన్యత పోస్టులు లభించలేదన్న అసంతృప్తితో వున్నారని వార్తలొస్తున్నాయి. వారిలో కొందరు తమ సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదని, మరి కొందరు తమను అంతగా ప్రజలతో సంబంధం లేని పదవులకు పంపారని-తామెంత బాగా పనిచేస్తున్నప్పటికీ తమ సమర్థతకు తగిన గుర్తింపు రాలేదని, ఎవరికి తోచిన రీతిలో వారు తమ అసంతృప్తులను బహిరంగంగానే వెల్లడి చేస్తున్నారట. వీరిలో కొందరు గతంలో పదవిలో వున్న ముఖ్య మంత్రుల దగ్గర వ్యక్తిగతంగా పలుకుబడి ఉపయోగించు కోగలిగిన వారైతే, ఇంకొందరు తెలుగు దేశం హయాంలో-రాజశేఖర రెడ్డి, రోశయ్యల కాలంలో, చాలా కాలం ఒకే పోస్టులో వుంటూ అధికారం-పెత్తనం పరోక్షంగా చెలాయించిన వారు కావడంతో ప్రస్తుతం బదిలీ చేసిన పోస్టులోకి వెళ్లాలన్న ఆలోచనను జీర్ణించుకొన లేక పోతున్నారు. ఇదిలా వుంటే, కొందరు మంత్రుల శాఖలకు సంబంధించి, సంబంధిత కాబినెట్ మంత్రికి కనీస సమాచారం కూడా లేకుండానే, అక్కడ పనిచేస్తున్న ఐఏఎస్‌ లందరినీ "మూకుమ్మడిగా" గా బదిలీ చేసింది ప్రభుత్వం. ఏదేమైనా, ప్రభుత్వ యంత్రాంగంలో-అందునా ఐఏఎస్‌ స్థాయిలో, ఫలానా పోస్టు ప్రాధాన్యతకలదని, మరోటి మామూలుదని, ఎవరైనా ఐఏఎస్‌ అధికారి భావించడమంటే, ఆ సర్వీసులో ఇంతకాలం పనిచేస్తున్న వారి అవగాహనా లోపమే అనాలి. సమర్ధుడైన అధికారికి ఏ బాధ్యతలను ఇచ్చినా, గతంలో పని చేసిన శాఖను అభివృద్ధి చేసినట్లే, అక్కడ కూడా రాణించగలరు. అసమర్థులకు ఏమిచ్చినా ఒకటే.

వివాదాల్లో చిక్కుకోవడం, రాజకీయ ప్రభావాలకు లోను కావడం, తమ పబ్బం గడుపు కోవడానికి సంబంధిత మంత్రులకు వంత పాడడం, కావాలనుకున్న పోస్టింగులను పొందడం, పక్షపాత వైఖరితో ఉద్యోగ ధర్మాన్ని విస్మరించడం, నైతిక విలువలను పాటించకపోవడం, కొందరు ఐఏఎస్ అధికారులకు అలవాటుగా మారిందన్న అపవాదు ఇటీవలి కాలంలో సాధారణ విషయమైపోయింది. పదవిలో వున్నా-విరమణ చేసినా, శతృవులు సహితం తప్పు బట్ట వీలులేని స్వర్గీయ ఎస్ ఆర్ శంకరన్, డాక్టర్ వి చంద్రమౌళి, పి వి ఆర్ కే ప్రసాద్, డాక్టర్ జయప్రకాశ్ నారాయణ లాంటి అధికారుల సంఖ్య క్రమేపీ తగ్గుతుందని అనాలి. అంతెందుకు.. ఇప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్, స్వర్గీయ ఎన్ టీ రామారావు ముఖ్య మంత్రిగా వున్నప్పటినుంచి, ప్రస్తుత ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరకు, తెలుగు దేశం అధికారంలో వున్నా-కాంగ్రెస్ అధికారంలో వున్నా, కీలకమైన బాధ్యతలు అత్యంత సమర్థవంతంగా నిర్వహించుకుంటూ, ఒకే రకమైన అనామికతో పని చేస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన లాగా కేంద్రంలోను, రాష్ట్రాలలోను పనిచేసిన-చేస్తున్న ఐఏఎస్ అధికారులున్నప్పటికీ అలాంటి వారు కొందరే వున్నారనక తప్పదు. దీనికి అనేక కారణాలుండవచ్చు. అత్యంత బాధ్యతతో కూడుకున్న పాలనాపరమైన పదవులు అతి పిన్న వయసులోనే వీరు పొంద గలగినందువల్లనో, అనుక్షణం మారుతున్న రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్లో, సివిల్ సర్వీసెస్ ప్రస్థానంలో సత్ సంప్రదాయాలు నెలకొన నందువల్ల నో, సంస్కరణలు కాగితాలపైన మాత్రమే కాని-ఆచరణలో నామ మాత్రమే ఐనందువల్లనో ఇలా జరుగుతుండవచ్చు. ఐఏఎస్ అధికారులను తమ గుప్పిట్లో వుంచుకుని, తమ పనులను చక్కబెట్టుకోవాలనే ఆలోచనలో కొందరు మంత్రులుండడం కూడా ఐఏఎస్ ల బాధ్యతారాహిత్యానికి కారణం కావచ్చు. ఈ నేపధ్యంలో, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు అవసరం, దాని ఆవిర్భావం, పరిణామక్రమం, భవిష్యత్ లో కొన సాగింపు ఎంతవరకు సమంజసం అనేవి చర్చనీయాంశమైన అంశాలు.

"భారత ఉక్కు వ్యవస్థ" గా సర్దార్ వల్లభాయ్ పటేల్ అభివర్ణించిన, "ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)", భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, అప్పటి వరకు, బ్రిటీష్ వారి పాలనలో అధికార స్వామ్యానికి ప్రతీకైన "ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్)" స్థానంలో ఆవిర్భవించింది. ఐఏఎస్ కు ఎంపికైన వారందరూ, సాహిత్యం నుండి వైద్య శాస్త్రం వరకు, ఒకటికి మించిన విభిన్న విద్యల్లో, తమదంటూ, ఒక ప్రత్యేకత వుందని నిరూపించుకున్న అసాధారణ తెలివితేటలు గల వ్యక్తులై వుంటారు. వీరిని ఆ సర్వీసులకు ఎంపిక చేసే విధానం కూడా, పలు రకాల వడపోత పద్ధతులను అవలంబించి, విస్తృతమైన-కఠినమైన రాత-మౌఖిక పరీక్షా విధానం ద్వారా, రాగద్వేషాలకు అతీతమైన కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుల నిర్ణయం ఆధారంగా జరుగుతుంది. వీరి ఉద్యోగాలకు రాజ్యాంగ పరమైన రక్షణ వుంటుంది. కర్తవ్య నిర్వహణలో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సిన ఆగత్యం లేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం కాని, ఒత్తిడులకు లోను కావడం కాని, ఏ మాత్రం లేదు. భారత్ దేశ భవిష్యత్ ఈ వ్యవస్థపై ఆధార పడి వుందని పటేల్ అనేవారు.

ప్రిలిమినరీ, మెయిన్స్, మౌఖిక పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులలో, పరీక్షల నిర్వహణకు ముందు, వివిధ రాష్ట్రాలలో, ఆ రాష్ట్ర ప్రభుత్వాల అవసరాల మేరకు, భర్తీచేయాల్సిన ఐఏఎస్ అధికారుల సంఖ్యకు అనుగుణంగా, అంత మందినే, రాంకుల వారీగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆ సంవత్సరానికి ఎంపికచేస్తుంది. అలా ఎంపికైన వ్యక్తులకు, ఏడాదిపాటు మసోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో అన్నిరంగాలకు చెందిన అంశాలలో కూలంకషమైన శిక్షణ ఇప్పిస్తుంది ప్రభుత్వం. ఏడాది తర్వాత, ఆయా అభ్యర్థులకు కేటాయించిన రాష్ట్రాలకు మరో ఏడాదిపాటు శిక్షణ నిమిత్తం పంపుతారు. ఒక్కొక్కరి ని ఒక్కో వెనుకబడిన జిల్లాకు పంపి, సంబంధిత కలెక్టర్ ఆధ్వర్యంలో, అన్ని శాఖలకు చెందిన అన్ని రకాల స్థాయి ఉద్యోగాలలో అవగాహన పొందే వీలుగా శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. వారందరినీ ఆ ఏడాది వరకు "శిక్షణలో వున్న అసిస్టెంటు కలెక్టర్" గా సంబోధించు తారు. ఏడాది మధ్యలో, మూడు-నాలుగు పర్యాయాలు, రాష్ట్ర రాజధానులలో వున్న ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ శిక్షణా సంస్థ (హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లాంటిది) లకు పంపి, రాష్ట్రానికి సంబంధించిన వివిధ సామాజిక-చారిత్రాత్మక-భౌగోళిక-రాజకీయ, తదితర అంశాలపై శిక్షణ ఇప్పించుతుంది ప్రభుత్వం. రాష్ట్రాలకు చెందిన అధికార భాషను (తెలుగు లాగా) వీరు నేర్చుకోవడం తప్పనిసరి కాబట్టి, అందులోను శిక్షణ ఇప్పించి, పరీక్షలు కూడా నిర్వహిస్తుంది ప్రభుత్వం.

సచివాలయంలో వివిధ స్థాయిలలో జరిగే కార్యకలాపాలపై కూడా అవగాహన కలిగించేందుకు వారం-పది రోజుల పాటు సెక్రెటేరియట్ అనుబంధ శిక్షణ కూడా వుంటుంది. ప్రాజెక్టుల సందర్శన, సర్వే క్షణ శాఖతో అనుబంధం లాంటివి కూడా పూర్తైన తదుపరి, చివరగా, రెండు వారాల పాటు మరో మారు మసోరికి వెళ్లి, తిరిగొచ్చేసరికి, వారికి కేటాయించిన రాష్ట్రాలలోని ఏదో ఒక సబ్ డివిజన్ లో, సబ్ కలెక్టర్ గా మొట్టమొదటి పోస్టింగు దొరుకుతుంది. అసలు-సిసలైన అధికార రుచి చవి చూసే అవకాశం అలా లభిస్తుంది వారికి. దాంతో పాటే, ప్రజాసేవ చేసే అవకాశం కూడా ప్రప్రధమంగా కలుగుతుంది. సబ్ కలెక్టర్ గా పనిచేసిన కొందరిని, అక్కడి ప్రజలు ఎన్నటికి మరవ లేని స్థాయికి ఎదిగిన ఐఏఎస్ అధికారులు చాలా మంది వున్నారు. సబ్ కలెక్టర్ తర్వాత సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి గా-జాయింటు కలెక్టరు గా పదోన్నతి పొంది మరో మెట్టుకు ఎదుగుతారు. ఇక ఆ తర్వాత - సుమారు ఏడెనిమిది ఏళ్లకు, జిల్లా కలెక్టర్ గా నియామకం దొరుకుతుంది. ఈ అన్ని పదవుల కుండే మెజిస్టీరియల్ అధికారాలు, ఇక ఆ తర్వాత, ఎన్ని పదోన్నతులొచ్చినా వుండవు. కొందరు దురదృష్ట వంతులకు (రకరకాల కారణాల వల్ల) వీటిలో కొన్ని పదవులు దక్కకుండా, వాటికి సమానమైన పదవులు (ఉదాహరణకు, డిప్యూటీ కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా, కార్పొరేషన్లలో ఉన్నతాధికారిగా, మునిసిపల్ కమీషనర్లుగా) దొరుకుతాయి. ఇలా లూప్ లైనులలోకి మళ్లించబడే అలాంటి ఐఏఎస్ అధికారుల ఎదుగుదల సాదా-సీదాగా సాగుతుంది. వారికి ఏ పోస్టు ఇచ్చినా సర్దుకుని పోతుంటారు.

అఖిలభారత సర్వీసులలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకున్న ప్రత్యేకత, దానికి ఎంపికైనవారికి ఒక "జిల్లా కలెక్టర్" గా పని చేయడమే. ఆ పదవిలో వుండగా, కేవలం రెవెన్యూ సంబంధిత బాధ్యతలే కాకుండా, పలు అభివృద్ధి-సంక్షేమ పథకాల అమలులో, పర్యవేక్షణలో, కలెక్టర్ అంచనాలకు మించిన బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. 73, 74 రాజ్యాంగ సవరణలతో కలెక్టర్ల బాధ్యతలు ఇంకా రెట్టింపయ్యాయి. దాదాపు నూటికి పైగా జరిగే జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలకు కలెక్టరే చైర్మన్. అనేక జిల్లా స్థాయి కమిటీలకు అధ్యక్షుడుగా వ్యవహరిస్తూ, తాము తీసుకున్న నిర్ణయాలను తామే గుర్తుంచుకోలేని పరిస్థితుల్లో వుంటారు కొందరు. జిల్లా వ్యాప్తంగా పర్యటనలు, వారానికొక సారి ఏదైనా గ్రామంలో నిద్ర చేయడం లాంటివి కలెక్టర్ల అదనపు కర్తవ్యాలు. అంతులేని ఈ పని భారాన్ని మోసేటప్పుడు, ఎంత విస్తృత స్థాయిలో శిక్షణ పొందినా సహజంగా తప్పులు దొర్లడం సహజం. ఇక అడపదడప ముఖ్య మంత్రి, సంబంధిత శాఖ మంత్రి నిర్వహించే సమీక్షా సమావేశాలకు, వీడియో కాన్ఫరెన్సులకు విధిగా హాజరవ్వాలి.

కలెక్టర్ పదవిని సుమారు పది సంవత్సరాల పాటు, వివిధ జిల్లాలలో చేపట్టి (అందరూ కాకపోయినా కొందరైనా) శాఖాధిపతులుగా నో, కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లుగా నో, సచివాలయంలో వివిధ స్థాయిలలో సచివులుగా నో పని చేసేందుకు రాజధానికి చేరుకుంటారు. వారి-వారి సామర్థ్యాన్ని బట్టి, చాక చక్యాన్ని బట్టి, పలుకుబడిని బట్టి, జిల్లా కలెక్టర్లుగా పని చేసినప్పుడు రాజకీయ నాయకులతో పెంపొందించుకున్న సాన్నిహిత్యాన్ని బట్టి, మరి కొన్ని ప్రత్యేక తరహా నైపుణ్యాలను బట్టి వారికి పదవులు లభిస్తాయి. దేశ వ్యాప్తంగా వున్న సుమారు ఆరువందలు మంది జిల్లా కలెక్టర్లు, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు పునాది లాంటివారని, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అన్నారొకసారి. ఐఏఎస్ అధికారులకు పదవీ భద్రత వుందనీ, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో-అమలులో, దూరదృష్టితో వ్యవహరించడం వారి విద్యుక్త ధర్మమనీ, ప్రతి ఐఏఎస్ అధికారి ఒక రోల్ మోడల్ కావాలని కూడా మన్మోహన్ అన్నారు. ఒక ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్ పదవి నుంచి, రాష్ట్ర రాజధానికి చేరుకున్న తర్వాత-అటు పిమ్మట సొంత రాష్ట్రానికో, కేంద్ర సర్వీసులకో, విదేశాలలో పదవులకో వెళ్లిన తర్వాత, ఒక వైపు అట్టడుగు స్థాయి సేవలకు దూరమవడం, మరో వైపు అసలు-సిసలైన అధికారానికి దూరం కావడం జరుగుతుందనాలి. కలెక్టర్ పదవి తర్వాత అంత ప్రాధాన్యత కలిగిన ఏకైక పదవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నో, కేంద్ర కాబినెట్ కార్యదర్శిగా నో నియామకం కావడం. ఆ అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. అందుకే, ఇటీవల బదిలీ ఐన ఐఏఎస్ అధికారులలో కొందరు తమకు అ ప్రాధాన్యత పోస్టింగులు ఇచ్చారనడం సరైంది కాదు.

అలా భావించే ఐఏఎస్ అధికారులున్నారంటే, ప్రభుత్వ శాఖల్లో కొన్ని "అ ప్రాధాన్యత" గా చేసిన సచివులను, వారి సలహాలు తీసుకుంటున్న మంత్రులను తప్పు బట్టాలి!

Thursday, March 3, 2011

ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన తప్పదా?: వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన తప్పదా?
వనం జ్వాలా నరసింహారావు

విస్తరించిన రాజకీయ శూన్యత; అధిష్ఠానమే సాగిస్తున్న రాష్ట్ర పాలన;
నిరంతరంగా తెలంగాణ చర్చ; అగ్నికి ఆజ్యం పోస్తున్న సంఘటనలు;
తక్షణ రాజకీయ దృష్టివల్లనే చిక్కులు

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో నెల కొన్న పరిస్థితి లాంటిది, బహుశా స్వతంత్ర భారత దేశ చరిత్రలో, మరే రాష్ట్రంలోను-ఏనాడు నెలకొని లేదనొచ్చు. ఆ మాటకొస్తే, ఈ పరిస్థితి ఈనాటిది కాదు. రాజశేఖర రెడ్డి అకాల మరణంతో, కాంగ్రెస్ రాజకీయాలలో, మున్నెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో "శూన్యం" ఏర్పడి, రోశయ్య హయాంలో ఆ శూన్యం బలపడి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, ఆయన ప్రమేయం లేకుండానే మర్రి ఊడల్లాగా పెకిలించనలవికాని లోతుకు కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీకి "అధిష్టానం" అనేది వున్నదనే సంగతిని వైఎస్ రాజశేఖర రెడ్డి కార్యకర్తల మన ఫలకం నుంచి తీసేయగా, రోశయ్య తన పద్నాలుగు నెలల పాలనలో చేసిన ఏకైక పని మరిచిపోయిన అధిష్టానాన్ని అదే కార్యకర్తలకు గుర్తుచేయడమే! ఇక, ఆ తర్వాత, అధిష్టానమే ఇక్కడ పాలన చేసే స్థితికి రాష్ట్రం చేరుకుంది. ప్రత్యేక తెలంగాణ వాదన, జగన్మోహనరెడ్డి సవాలు, ప్రభుత్వోద్యోగుల నిరసనలు, తెలుగు దేశం గుప్పిస్తున్న ఆరోపణలు, ప్రాంతాలవారీగా కాంగ్రెస్ నాయకులు విడిపోయి ఇటు ముఖ్యమంత్రికి-అటు అధిష్టానానికి తల బొప్పి కట్టించడం, అవినీతి ఆరోపణలు, అధికారుల్లో అలసత్వం, పధకాల అమలులో నిర్లిప్తత....ఇలా...రకరకాల సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోయిన రాష్ట్రంలో, రాష్ట్రపతి పాలన మినహా గత్యంతరం లేని పరిస్థితులు రాబోతున్నాయా అన్న అనుమానం బలపడుతోంది ప్రతివారిలో.

ఇంతకూ...తప్పెవరిది? ఒప్పెవరిది? అనేవి సమాధానం దొరకని ప్రశ్నలు. దొరికించుకునే ప్రయత్నం చేస్తే.....కర్ణుడి చావుకు కారకులెవరో-ఎందరెందరో అన్నది ఎలా భారతంలో పరోక్షంగా వివరించడం జరిగిందో, అలానే విశదమవుతుంది. వారూ-వీరూ అన్న తేడా లేకుండా, అన్ని రాజకీయ పార్టీలను, మొదటగా తప్పు పట్టాలి. అధికారంలో వున్నప్పుడొక మాట, ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడొక మాట మాట్లాడే రాజకీయ పార్టీల నాయకులున్నప్పుడు, ఎప్పటికైనా, ఇప్పుడేం జరుగుతుందో అదే జరిగి తీరుతుంది. మాట మార్చే రాజకీయ నాయకుల వల్లనే ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ నేపధ్యంలో... అలాంటి ఒకటి రెండు ఉదాహరణలు మననం చేసుకోవచ్చేమో!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న వాదన సమంజసమా?కాదా? అన్న చర్చ చాలా కాలంగా జరుగుతున్నదే. తెలంగాణ ఏర్పడినా, ఏర్పడకపోయినా, ఆ చర్చ ఏదో ఒక రీతిలో కొనసాగుతూనే వుంటుంది. ఒక వైపు చర్చ జరుగుతుండగానే, సమస్య పరిష్కారం కొరకు కాకుండా, అగ్నికి ఆజ్యం పోస్తున్న తరహాలో జరుగుతున్న సంఘటనలతోనే వచ్చిన చిక్కల్లా. రాజశేఖర రెడ్డి వున్నంతకాలం, అన్నీ తానే అయిపోయి, ఎంత బలంగా ప్రజల్లో నాటుకు పోయినప్పటికీ, తెలంగాణ సమస్యను తన అదుపులో వుంచుకోగలిగాడు. పరిస్థితులు కూడా అనుకూలించాయనొచ్చు. ఆ తర్వాత ఉవ్వెత్తున లేచిన ఉద్యమం అణచడం చేతకాని (కేంద్ర-రాష్ట్ర) ప్రభుత్వం, దొడ్డి దోవలు వెతకడం మొదలెట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడి ఆమరణ నిరాహార దీక్ష విరమింప చేసి, అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, అందరినీ ఏకాభిప్రాయానికి ఒప్పించినట్లు నటించి, డిసెంబర్ 9,2009 న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలెట్టినట్లు ప్రకటన చేసింది. చేసే ముందర అలా చేయడంలోని ఔచిత్యం కించిత్తైనా ఆలోచన చేయలేదు. కేవలం తక్షణ రాజకీయ ప్రయోజనాలే దృష్టిలో పెట్టుకుని అటు తెలంగాణ ప్రజలను, ఇటు, సీమాంధ్ర ప్రజలను, ఒక్కోరకంగా మోసం చేసింది. ఈ నాటి ఈ దుస్థితికి అంకురార్పణ అలా జరిగింది. మాట నిలబెట్టుకోలేక పోయింది. సీమాంధ్రులను, తెలంగాణ వారిని ఇష్టం వచ్చినట్లు రెచ్చగొట్టింది. పనిలో పనిగా, (కేంద్ర) ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి తనయుడిని ముప్పు తిప్పలు పెట్టే ప్రయత్నం చేసింది. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా, తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టింది. ఎన్ని రకాల వీలుంటే, అన్ని రకాల పద్ధతుల ద్వారా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, వాటిని పాలిస్తున్న కాంగ్రెస్ పాలకులు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, విభజించి-పాలించు తరహాలో, ఇబ్బందులకు లోను చేయడం దురదృష్టం.

ఈ నేపధ్యంలో, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఒకే ఒక్క కోణం నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కష్టం. ఎవరి ఆలోచనలు వారివే...ఎవరి ఆరోపణలు వారివే. కాంగ్రెస్-తెలుగుదేశం మధ్య మాచ్ ఫిక్సింగ్ అని తెరాస అంటుంటే, టిడిపి-తెరాస మధ్యనే మాచ్ ఫిక్సింగ్ అని కాంగ్రెస్ వాదిస్తున్నది. కాదు జగన్మోహన రెడ్డికి కేసీఆర్ కు మధ్య మాచ్ ఫిక్సింగ్ కుదిరిందని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. వీటితో సంబంధం లేకుండా, బహిరంగంగానే ఫిక్సయిపోయాడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీతో. శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టమని టిడిపిని డిమాండు చేసింది తెరాస పార్టీ. జగన్ వర్గం కూడా ఆ అర్థం స్ఫురించే రీతిలోనే మాట్లాడింది. ఒక వైపు తన తండ్రి గెలిపించి-అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టే వుద్దేశం తనకు లేదంటూనే, అదే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు జగన్. ఒకానొక సందర్భంలో, తమకున్న సంఖ్యా బలంతోనే, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్తామని అన్న తెరాస పార్టీ, ఆ పని చేయలేదెందుకో మరి.

ఇక బహిష్కరణల పర్వం, సహాయ నిరాకరణ పర్వాలు మొదలయ్యాయి. శాసనసభ సమావేశాలు మొదలైన తొలి రోజునే, తెరాస-టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అసలు సభకు రాకుండా, ఢిల్లీలో గడిపిన కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యేలు, తమదైన శైలిలో గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించారు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో, ఆదరాబాదరగ తన ప్రసంగాన్ని చదివాననిపించుకున్నారు గవర్నర్. చట్ట సభలో గవర్నర్ ప్రసంగం చేయలేని పరిస్థితి కలిగితే దాన్నే మని పిలవాలి? ఇక ఆ తర్వాత లోక్ సత్తా ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ-తెరాస ఎమ్మెల్యేల మధ్య జరిగిన ఘర్షణ, జేపీ పై దాడి ఎలా అర్థం చేసుకోవాలి. ఎవరిది తప్పు-ఎవరిది ఒప్పు అనేది పక్కన పెడితే, ప్రభుత్వం సజావుగా సాగుతున్నదనుకోవాలా? లేదా? అనేది ప్రధానంగా అలోచించాల్సిన విషయం. మర్నాటి నుంచి, ఇప్పటి దాకా, శాసన సభ కార్యకలాపాలు జరుగుతున్నది లేనే లేదు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ సర్వ సాధారణ విషయమైంది. బడ్జెట్ ప్రసంగం నామ మాత్రంగా ఆర్థిక మంత్రి చదవాల్సిన పరిస్థితులు మరీ దురదృష్టం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సభా సాంప్రదాయాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లేదనాలి. కొందరు "గౌరవ శాసనసభ సభ్యులు" స్పీకర్ పోడియంలో వున్నప్పుడు, ధన్యవాదాలు చెప్పే ప్రసంగం ముఖ్యమంత్రి చేయడం జరిగింది. సభా నాయకుడు నిలుచున్నప్పుడు, మరే సభ్యుడూ నిలుచుని వుండ కూడదనేది పార్లమెంటరీ సాంప్రదాయం-చట్ట సభల నిబంధన. అలాంటిది, వారు పోడియంలో వుండగా, సీఎం ప్రసంగం చేయొచ్చా? తప్పలేదనుకుని సమాధానం చెప్పుకోవాల్సి వస్తే, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కదా? అంటే... రాజ్యాంగ నియమ నిబంధనలకు అనుగుణంగా సభ నడవలేదనుకోవాల్నా? నిపుణులకే వదిలేద్దాం ఈ సంగతి!

నాలుగు లక్షల మంది తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణ మరో కీలకాంశం. అదే రోజుల్లో కొంచెం ఇంచుమించుగా, జగన్మోహన రెడ్డి వారం రోజుల నిరాహార దీక్ష చోటు చేసుకుంది. విద్యార్థులకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ప్రారంభించిన ఫీజు రీఇంబర్స్ మెంటు జరగనందున, ప్రభుత్వాన్ని ఒప్పించడానికి చేసిన దీక్ష అది. ఇక్కడ కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. దీక్షకు సంబంధించిన మెరిట్-డీ మెరిట్ విషయాలు పక్కన పెట్టి, రాజకీయంగా ప్రాముఖ్యతున్న ఒక వ్యక్తి దీక్షకు దిగినప్పుడు, ప్రభుత్వం అంతో-ఇంతో స్పందించక పోవడం మంచి పద్ధతి కాదనిపిస్తోంది. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోను, నిజాం కళాశాల ప్రాంగణంలోను చెలరేగిన హింసా కాండ భవిష్యత్ లో ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుందో అర్థం కావడం లేదు. ఇక ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఆట విడుపు స్థలాలయ్యాయి. ఉద్యోగులు రావడం, సంతకాలు చేయడం, పెన్ డౌన్ సమ్మెలా సహాయ నిరాకరణ చేయడమంటే, ప్రభుత్వం స్తంభించి పోయినట్లే కదా! చివరకు పని చేసిన వారికీ-చేయని వారికీ జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో వుంది రాష్ట్ర ప్రభుత్వం. గవర్నర్ జీతమే ఆలశ్యమైంది. ముఖ్య మంత్రికి-మంత్రి వర్గ సభ్యులకు జీతాలు లేవు. వారికి రాకపోయినా గడుస్తుంది. జీతాలే జీవితంలాగా భావించే మధ్య తరగతి ఉద్యోగస్థుల గతేంటి? రెండు రోజుల రాష్ట్ర వ్యాప్త సమ్మె, మరో రోజున "పల్లె పల్లె పట్టాల" పైకి ఆందోళన కార్యక్రమంతో ప్రభుత్వానికి ఎం చేయాల్నో పాలుబోతున్నట్లు లేదు.

కేంద్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ సారధ్యంలోని యూపీయే ప్రభుత్వం పుణ్యమా అని, సీమాంధ్ర-తెలంగాణ సోదర-సోదరీమణుల మధ్య, సీమాంధ్ర-తెలంగాణ మధ్య భౌగోళిక విభజన స్థానంలో, శాశ్వత స్పర్ధలు చోటు చేసుకుంటున్నాయి. మాటల యుద్ధం-తూటాల యుద్ధంగా మారుతున్నది. మధ్యలో ఒక పెద్ద మనిషి "ఉత్తరాంధ్ర కలిసిన తెలంగాణ" అన్న నినాదం తెరపైకి తెచ్చాడు. ఐక్య కార్యాచరణ కమిటీ "మిలియన్ మార్చ్" పిలుపు నేపధ్యంలో, పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో అర్థం కావడం లేదు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ఏర్పాటు చేసుకోదల్చిన సమావేశానికి వ్యతిరేకంగా, ఎంపీ కావూరి సాంబశివ రావు ఇంటి దగ్గర తెలంగాణ న్యాయవాదుల ధర్నా విమర్శలకు దారితీసింది. మీసాలు మెలేసుకునే స్థితికి పోతోంది. ఆయన మాటలకు ప్రతిస్పందనగా, రాష్ట్ర మంత్రి జూపెల్లి కృష్ణారావు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను స్పీకర్ కు, సోనియా గాంధీకి పంపినట్లు పాత్రికేయులకు చెప్పారు. ఆయన బాటలోనే మరి కొందరు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకంటే ముందు, తెరాస, తెలుగుదేశం తెలంగాణ సభ్యులు, కాంగ్రెస్ తెలంగాణ సభ్యులు బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు కె. చంద్రశేఖర రావు, విజయశాంతి స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేయడంతో-వారికి కాంగ్రెస్ సభ్యుల, ఎన్డీయే సభ్యుల మద్దతు లభించడంతో, సభ పలు మార్లు వాయిదా పడి చివరకు మర్నాటికి వాయిదా పడింది. ఎంపీలు మధు యాష్కీ, సుఖేందర్ రెడ్డి, తమ పార్టీకి చెందిన కావూరిని రాజీనామా చేయమని సవాలు విసిరారు. యాష్కీ ఆయనపై కొన్ని ఆరోపణలు కూడా మోపారు.

ఎమెల్యేలు శాసన సభలో లేకుండా, మంత్రులు రాజీనామా బాట పడుతుంటే, (కాంగ్రెస్ పార్టీకి చెందిన)ఎంపీలు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటుంటే, ఏమీ చేయలేని స్థితిలో వున్న (రాష్ట్ర) ప్రభుత్వాన్ని రద్దు చేసి, అసెంబ్లీని సుషుప్తావస్థలో వుంచి రాష్ట్రపతి పాలన పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం వుందేమో అని అనుమానం వేస్తోంది. కాకపోతే, కిరణ్ స్థానంలో నరసింహన్ రావడమంటే, రాష్ట్రం పరిస్థితి పెనంలోంచి పొయ్యిలోకి పడ్డట్లే!

Monday, November 8, 2010

వీరప్ప మొయిలీ పాలనా సంస్కరణల కమిషన్ సిఫారసులు ఏమవుతున్నాయి? : వనం జ్వాలా నరసింహారావు

వీరప్ప మొయిలీ పాలనా సంస్కరణల కమిషన్
సిఫారసులు ఏమవుతున్నాయి?
వనం జ్వాలా నరసింహారావు

మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం, వీరప్ప మొయిలీ అధ్యక్షతన, ఆగస్ట్ 31, 2005 న ఏర్పాటు చేసిన పాలనా సంస్కరణల కమిషన్‌, మే నెల 31, 2009 న పదిహేను సుదీర్ఘమైన నివేదికల రూపంలో, అనేక రకమైన పాలనాపరమైన సిఫారసులు చేసింది. ఆ సిఫారసులను ఏఏ రంగాలలో-ఎంత మేరకు అమలు జరిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయంలో అధికారులకు కాని, మంత్రులకు కాని, వాటి అవసరం వున్న పౌరులకు కాని ఏ మాత్రం సమాచారం లేకపోవడం దురదృష్టకరం. అనేక రంగాలలో పాలనానుభవం కలిగిన వి. రామచంద్రన్, డాక్టర్ ఏపి ముఖర్జీ, డాక్టర్ ఏ హెచ్ కల్రో, డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, వినితారాయ్ లాంటి ప్రముఖులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్‌లో, సభ్యులుగా వున్నారు. వారి సిఫారసులు, గతంలో పాలనా సంస్కరణలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ-కమీషన్ల సిఫారసుల మాదిరిగా కాకుండా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం మర్చిపోయినట్లే స్పష్టమవుతోంది. అసలా మాటకొస్తే, కొత్త కమిషన్‌ని నియమించాలనే ఆలోచన చేసే ముందు ఇదివరకటి కమిటీలూ, కమిషన్‌లు చేసిన సూచనలూ, సిఫారసులపై ప్రభుత్వం దృష్టిసారించి, వాటి అమలుకు తగు చర్యలు చేపట్టి ఉంటే బాగుండేదేమో!

వీరప్ప మొయిలీ కమీషన్‌ను ప్రభుత్వం అనేక కీలకాంశాలపై అధ్యయనం చేయమని కోరింది. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థా స్వరూపం, పాలనలో నైతిక విలువలు, సిబ్బంది పాలన వ్యవహారాలను గాడిన పెట్టడం, ఆర్థిక యాజమాన్య పటిష్టత, రాష్ట్ర స్థాయి పాలనలో మార్పులు, జిల్లా పాలనా యంత్రాంగంలో మార్పులు, స్థానిక సంస్థల బలోపేతం, సోషల్ కాపిటల్, పౌర సదుపాయ పాలన, ఇ-పరిపాలనకు ప్రోత్సాహం, ఫెడరల్ స్ఫూర్తికి సంబంధించిన సమస్యలు, సంక్షోభ స్థితి యాజమాన్యం, పబ్లిక్ ఆర్డర్‌కు చెందిన పలు విషయాల్లో సూచనలివ్వమని కమీషన్‌ను కోరింది ప్రభుత్వం. కమీషన్ దశలవారీగా ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలను మూడు ప్రధాన విభాగాలుగా క్రోడీకరించింది. పాలనాపరమైన, సామాజిక-ఆర్థిక పరమైన, సెక్యూరిటీ పరమైన రంగాలకు చెందిన అంశాలుగా వాటిని పేర్కొన్నారు.

కమీషన్ చేసిన సిఫారసులలో తొమ్మిది ప్రధానమైన అంశాలున్నాయి. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉపసంహరించుకుని, ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రభుత్వపరమైన అంశాలను మాత్రమే జాతీయ బధ్రత చట్టం పరిధిలో చేర్చాలన్నది మొదటి సిఫారసు. సమాచార హక్కు చట్టం అమలు పర్చాల్సిన ఇన్ఫర్మేషన్ కమీషన్ సభ్యులలో ఏభై శాతం సివిల్ సర్వీసు అధికారిక నేపధ్యం లేనివారిని నియమించాలన్నది రెండోది. పక్షపాత ధోరణితో కూడిన సాయుధ బలగాల 1958 చట్టాన్ని రద్దుచేసి, 1967 నాటి చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం దాని స్థానంలో అమలులోకి తేవాలనే ది మరొక సిఫారసు. మహిళలకు 33% రిజర్వేషన్‌లను కలిగించడంతో సహా పోలీసు వ్యవస్థలో సమగ్ర సంస్కరణలను తేవాలనేది మరో అంశం. పాతిక వేల జనాభాకు తక్కువున్న ప్రదేశాలలో స్థానిక న్యాయ స్థానాలను ఏర్పాటు చేసి సత్వర న్యాయం కలిగించాలన్నది మరొకటి. నైతిక విలువలతో కూడిన పాలనను అందించడానికి, ప్రధాని మినహా, కేంద్ర-రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులందరినీ విచారణ పరిధిలోకి వచ్చేలా "నేషనల్ ఆంబడ్స్ మెన్" ఏర్పాటు; ఎంపీల-ఎమ్మెల్యేల నియోజక వర్గం అభివృద్ధి నిధుల పథకం రద్దు; కేంద్ర ఆర్థిక కమీషన్ తరహాలో రాష్ట్ర కమీషన్ల ఏర్పాటు; మేయర్లను నేరుగా ఎన్నుకునే విధానం అమలు పరచడం లాంటివి ఇతర సిఫారసులు. సిఫారసులన్నీ బాగానే వున్నాయి కాని, అమలు మాటేమిటనేదే జవాబులేని ప్రశ్న!

ఒక మార్పు మరో మార్పుకు దారితీస్తుంది. ఆర్ధిక సంస్కరణలు పాలనా సంస్కరణలను అనివార్యం చేశాయి. పరిపాలనా వ్యవహారాలలో మెరుగైన మార్పులను తీసుకురావాలనే సంకల్పానికి కొదువేమీ లేదు. స్వతంత్ర భారతంలో 45కు పైగా కమిటీలు, కమిషన్లు పాలనా వ్యవస్థలో తీసుకు రావలసిన మార్పులకు సూచనలు, సిఫారసులు చేశాయి. అవన్నీ అమలులోకి వచ్చాయా అన్న విషయాన్ని అటుంచితే ఆ కమిటీలు, కమిషన్లలో కొన్నిటి వ్యవహారాన్ని క్రమానుగతంగా సింహావలోకనం చేయాల్సిన అవసరం వుంది.

బ్రిటిష్, ముస్లిం అధికారుల నిష్క్రమణంతో ప్రభుత్వ అధికార క్రమంలో చోటుచేసుకున్న అనూహ్యమైన మార్పులు స్వతంత్ర భారత తొలి ప్రభుత్వానికి సమస్యాత్మకంగా పరిణమించాయి. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కడానికి 1947లో "సెక్రటేరియల్ రీ-ఆర్గనైజేషన్ కమిటీ” ని నియమించారు. అప్పటినుంచి ఇప్పటివరకు కూడా పెరుగుతూ వస్తున్న ప్రభుత్వ సిబ్బంది-క్షీణిస్తున్న వారి సామర్ధ్యం - అన్నిస్థాయిల్లో చోటుచేసుకుంటున్న అవినీతి అందరిని కలవర పరుస్తున్నది. ఈ కలవరాన్ని తగ్గించుకోవటానికి జరిగిన తొలి ప్రయత్నమే 1948లో ఏర్పాటైన "ఎకానమీ కమిటీ". ప్రభుత్వ యంత్రాంగ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి టాటెన్ హామ్ అనే బ్రిటిష్ పాలనా నిపుణుడు ఒక నివేదికను రూపొందించారు. క్రమబద్ధీకరించిన సూక్ష్మ స్థాయి సచివాలయ ఆవశ్యకతను ఆయన సమర్థించారు. మంత్రిత్వ శాఖలను నాలుగు ప్రధాన విభాగాలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ సచివాలయ వ్యవస్థాగత నిర్వహణకు గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ 1949లో కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల ఆధారంగా 1950లో డిఫెన్స్ కమిటీ, ఎకనామిక్ కమిటీ, పార్లమెంటరీ-న్యాయ వ్యవహారాల కమిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ కమిటీలను నియమించారు.ప్రణాళికా సంఘం 1950లో ఏర్పాటైంది. వెన్వెంటనే ఎ.డి. గొరాడియా కమిటీని నియమించారు. ఈ కమిటీ సమర్పించిన రెండు నివేదికల ఆధారంగా 1951లో పాలనా పరంగా చేపట్టవలసిన సంస్కరణల గురించి విస్తృత స్థాయి చర్చలు జరిగాయి.సాధించిందేమిటనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా!

అయ్యంగార్ నివేదికపై ఆర్.ఎ. గోపాలస్వామి 1952లో "ప్రభుత్వ యంత్రాంగం-సామర్ధ్యం పెంపుదల" పేరుతో ఒక నివేదిక సమర్పించారు. ఈ నివేదికను ఏలినవారు గోప్యంగా ఉంచారు. అమెరికన్ నిపుణుడు పాల్ ఏపెల్ బీ 1953-54లలో వరుసగా సమర్పించిన రెండు నివేదికలు మన పాలనా సంస్కరణలలో మైలు రాళ్లుగా ప్రశస్తిని పొందాయి. మెదటి నివేదికలో చేసిన 12 సిఫారసులలో "ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్" స్థాపన అతి ముఖ్యమైనది. అశోక్ చందా కమిటీ 1954లో సమర్పించిన "ప్రాజెక్టుల పూర్తి లో జాప్యాన్ని అరికట్టేందుకు అవసరమైన బడ్జెటరీ-ఆర్ధిక నియంత్రణల మార్పులు" అన్న నివేదికపై కేంద్ర మంత్రి మండలి అసలు చర్చించనేలేదు. ప్రభుత్వ సిబ్బందికి శాఖాపరమైన విషయాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇదే కాలంలో ఆర్ధిక మంత్రి చింతామణి దేశ్ ముఖ్ ఆర్థికపరమైన సంస్కరణలను అధ్యయనం చేసేందుకు చర్యలు చేపట్టారు. అఖిల భారత సర్వీసుల్లోనూ, గ్రూప్-1 కేంద్ర సర్వీసుల్లోనూ అభ్యర్ధుల నియామకానికి విశ్వవిద్యాలయ డిగ్రీ ఉండాల్సిన ఆవశ్యకతపై విద్యా శాఖ నియమించిన ఒక కమిటీ 1956లో నివేదిక సమర్పించింది. ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని నిరోధించేందుకు, 1962 లో సంతానం కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ 1964లో సమర్పించిన నివేదికపై పార్లమెంటులో విశేష చర్చ జరిగింది. అంతేకాక ప్రభుత్వోద్యోగులలో ప్రకంపనలు సృష్టించింది. కేంద్రమంత్రులకు ప్రవర్తనా నియమావళి ఉండాలని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటుచేయాలని గాంధేయవాది అయిన సంతానం సూచించారు. దరిమిలా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థను స్థానికంగా, సమితి-జిల్లా స్థాయిలలో ప్రవేశపెట్టడం వల్ల ఎదురయ్యే సమస్యలు, రాష్ట్రాల్లో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బంది పనితీరుకు సంబంధించిన వివిధ అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ప్రణాళికా సంఘం 1960లో వి.టి. కృష్ణమాచారి కమిషన్ ఏర్పాటు చేసింది. కృష్ణమాచారి 1962లో సమర్పించిన నివేదికలోని అన్ని సిఫారసులను ప్రభుత్వం అంగీకరించింది. ప్రజల ఆర్ధిక-సామాజికాభివృద్ధి అవసరాలకు అనుగుణంగా పనిచేయగల రీతిలో ఐ.ఎ.ఎస్. అధికారాల విస్తరణ జరగాలని, తదనుగుణంగా శిక్షణ ఇవ్వాలని కృష్ణమాచారి కమిషన్ సూచించింది. పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి, పనితీరు మెరుగయ్యేందుకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, సాంకేతిక సిబ్బంది సమన్వయంతో పనిచేయాలనీ, సహకారోద్యమం-సామాజికాభివృద్ధి కార్యక్రమం కలిసి పురోగమించాలని కూడా కృష్ణమాచారి సూచించారు. ప్రభుత్వ పాలనా వ్యవస్థ పనితీరును కూలంకషంగా అధ్యయనం చేసి, అది మరింత సమర్ధంగా పనిచేసేందుకు తగు సూచనలివ్వడానికి 1966లో మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన "అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్"(ఇదే మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్)ను నియమించారు. మొరార్జీ ప్రభుత్వంలో చేరిన దరిమిలా, ఆ కమిషన్‌కు కె. హనుమంతయ్య నేతృత్వం వహించారు. 20 అధ్యయన బృందాలు, నాలుగు నిపుణుల బృందాలు, ఒక టాస్క్ ఫోర్స్ నేర్పాటుచేసిన ఈ కమిషన్ నాలుగేళ్లు శ్రమించి 500కు పైగా సిఫారసులతో 20 నివేదికలను సమర్పించింది. రాజీవ్‌గాంధీ హయాంలో మాత్రమే ప్రభుత్వ సిబ్బందికి శిక్షణావశ్యకత అనే అంశం పాలనా సంస్కరణల్లో అతి ముఖ్యమైన అంశమని గుర్తించారు. 1980ల తొలినాళ్ళలో లక్ష్మీకాంత్ ఝా నేతృత్వంలో ఆర్ధిక పరిపాలనా సంస్కరణల కమిషన్ ఏర్పాటైంది. ప్రభుత్వ ప్రాధమ్యాలు నియంత్రణ నుంచి అభివృద్ధి దిశగా మార్పుచెందాలని ఝా సూచించారు. 1991లో ఆర్ధిక సంస్కరణలు ప్రారంభమవడంతో పాలనా సంస్కరణలకు సంబంధించి కూడా ప్రభుత్వ దృక్పథంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలో ఆర్ధిక క్రమశిక్షణ నెలకొల్పడానికి తగు సూచనలిచ్చేందుకు జాతీయ అభివృద్ధి మండలి, 1992లో అప్పటి ఒరిస్సా ముఖ్యమంత్రి బిజూపట్ణాయక్ అధ్యక్షతన, ఒక కమిటీ నేర్పాటుచేసింది. ఉద్యోగులకిచ్చే కరవుభత్యాన్ని స్తంభింప చేయాలన్న సిఫారసుని పాటించకపోవడంతో బిజూ ఆ కమిటీ బాధ్యతల నుంచి వైదొలిగారు. ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకతను కమిటీ నొక్కి చెప్పింది.

1997 మేలో పాలనా సంస్కరణల దిశగా మరో కీలకమైన ప్రయోగానికి అంకురార్పణ జరిగింది. అప్పటి ప్రధాని గుజ్రాల్ అధ్యక్షతన న్యూఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ప్రభుత్వాల పనితీరు, జవాబుదారీతనం, కార్య సాధనపైన ప్రజలకు రోజురోజుకూ నమ్మకం సన్నగిల్లుతోందని, పాలనా వ్యవస్థపై ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు అత్యవసరంగా కొన్ని చర్యలు చేపట్టాలనీ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దీని పర్యవసానమే ఒక కార్యాచరణ ప్రణాళిక, తద్వారా కేంద్రం, రాష్ట్రాల్లో ఫలవంతమైన, బాధ్యతాయుతమైన సుపరిపాలనను ప్రజలకు అందివ్వడం. ఈ సమావేశానికి ఏడునెలలక్రితం (1996నవంబర్లో) జరిగిన ప్రభుత్వ కార్యదర్శుల సమావేశంలో "బాధ్యతాయుతమైన ప్రభుత్వపాలన" అన్న అంశంపై ప్రారంభమైన జాతీయ చర్చకు ముఖ్యమంత్రుల సమావేశం ముగింపనీ, ఇక జరగాల్సింది తొమ్మిదంశాల కార్యాచరణ ప్రణాళిక అమలేనని, అది సత్వరమే పూర్తిచేస్తామని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు జాతికి వాగ్దానం చేశారు. కాలం చెల్లిన చట్టాలను సమీక్షించి కొత్త చట్టాలను రూపొంచుకోవాలని గుజ్రాల్ అన్నారు. చట్టం ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలేగాని ఇబ్బందులు కలుగజేయకూడదని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రులు ఇదే తీరులో గంభీరోపన్యాసాలు చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే గుజ్రాల్ ప్రభుత్వం పతనమైయింది. ఆ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులలో పలువురు ఉన్నత అధికారిక-అనధికారిక పదవులలో ఇప్పటికీ కొనసాగుతున్న వారున్నారు. మరి కొంతమంది ప్రతిపక్షంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు.

ముఖ్యమంత్రులందరూ నాడు ఏకగ్రీవంగా ఆమోదించి, నిర్ణీత కాలవ్యవధిలో అమలుచేయదలపెట్టిన కార్యాచరణ ప్రణాళికలోని తొమ్మిదంశాలేమిటి ? సిటిజన్ చార్టర్ తయారీ, జవాబుదారీ పరిపాలన, కట్టుదిట్టంగా త్వరితగతిన ప్రజల సాధక బాధకాలను నివారించగల వ్యవస్థ, గ్రామ-పట్టణ స్థాయిలలో స్థానిక సంస్థలకు అధికారాల నిచ్చే పౌర సేవలను వికేంద్రీకరించడం, చట్టాలను, ప్రభుత్వ నియమనిబంధనలు సమీక్షించటం, పారదర్శకత-సమాచార హక్కు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రజలకవసరమైన సమాచారాన్ని పొందే పౌర సదుపాయ కేంద్రాల ఏర్పాటు, ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసేవారికి ప్రవర్తనా నియమావళి, అవినీతి నెదుర్కొని పరిపాలనను ప్రక్షాళన చేయడం, ప్రభుత్వాధికారుల పదవీ కాలంలో స్థిరత్వం అనేవే ఈ తొమ్మిదంశాలు. బాధ్యతాయుత, జవాబుదారీ పరిపాలనందించడానికి ఈ కార్యాచరణ ప్రణాళికను దీర్ఘకాలిక, స్వల్పకాలిక చర్యల ద్వారా అమలుపర్చాలని ఆ సమావేశంలో తీర్మానించారు కూడా. ప్రతి అంశంపైనా తీర్మానం చేసిన ఆర్నెల్లు లోపుగా తగు చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ప్రతి అంశంపైన కేంద్ర-రాష్ట్రాల్లో సాధించిన ప్రగతిని కేంద్ర కేబినెట్, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో నిరంతరం సమీక్షించాలని కూడా నిర్ణయించారు. అయిదేళ్ళ అనంతరం సమీక్ష జరిగింది. రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికలన్నీ అసంతృప్తిగానే ఉన్నట్లు వెల్లడయింది. మళ్ళీ కధ మొదటికొచ్చింది. ఈ నేపధ్యంలో వీరప్ప మొయిలీ అధ్యక్షతన కేంద్రంలోని యు.పి.ఎ. ప్రభుత్వం మరో పాలనా సంస్కరణ కమిషన్ ఏర్పాటు చేసింది. కొత్త కమిషన్ ని నియమించాలనే ఆలోచన చేనే ముందు ఇదివరకటి కమిటీలు, కమిషన్‌లు చేసిన సూచనలు, సిఫారసులపై ఒకింత దృష్టి సారించి వాటి అమలుకు తగు చర్యలు చేపట్టి ఉంటే బాగుండేది. అసలా మాటకొస్తే సమాచార హక్కు చట్టం అమలులో ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నయో పరిశీలిస్తే చాలు. ఏ రాష్ట్రంలోనైనా చట్ట స్పూర్తితో సమాచార కమిషనర్ల ఎంపిక జరుగుతుందా ? సూచనలు, సిఫారసులను ప్రజోపయోగకరంగా అమలు చేయనప్పుడు కొత్త కమిషన్లను నియమించడమెందుకు ? పోనీ, నియమించిన కమీషన్ చేసిన సిఫారసులనన్నా అమలు పరిచే దిశగా ప్రభుత్వం ఏ మేరకు అడుగు లేసింది? ఇప్పటికైనా ఈ అంశాలపై దృష్టి సారిస్తే మంచిదే మో!