Tuesday, May 30, 2023

బ్రాహ్మణ సంక్షేమంలో దేశానికే దిక్సూచి! ..... వనం జ్వాలా నరసింహారావు

 బ్రాహ్మణ సంక్షేమంలో దేశానికే దిక్సూచి!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (30-05-2023)

సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి శాయశక్తులా కృషిచేసినవారిలో అందరితోపాటు బ్రాహ్మణులు కూడా వున్నారు. ఆధునిక నవసమాజ, సమసమాజ  నిర్మాణంలో సహితం బ్రాహ్మణులు తమ శక్త్యానుసారం ప్రతిభావంతమైన, కీలకమైన పాత్ర పోషించారు. సాంఘిక సంస్కరణల నుండి ఆధునిక శాస్త్ర విజ్ఞానం దాకా, సాహిత్యం నుండి సినిమాల దాకా, రాజకీయాల నుండి ప్రజా పరిపాలన దాకా, అద్ద్యాత్మికత నుండి కమ్యూనిజం వరకూ, సాంప్రదాయ విలువల నుండి ప్రగతిశీల ఆలోచనల వరకు బ్రాహ్మణులు ఎవరికీ తీసిపోకుండా తమవంతు కృషి సల్పారు. భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత కొంతకాలం దాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రధాన భూమిక పోషించడంలోను బ్రాహ్మణులకు అవకాశాలు దక్కాయి. దరిమిలా వీరి ఎదుగుదలను సహించలేని కొన్ని రాష్ట్రాలలో, ముఖ్యంగా దక్షిణాదిలో, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు మొదలయ్యాయి.

ఆ ఉద్యమాల ప్రభావంవల్ల వారి హక్కులకు భంగం వాటిల్లడంతో పాటు ఆధునిక సమాజంలో వారికి చేకూరాల్సిన ఉపాధి అవకాశాలు క్షీణించసాగాయి. ఆర్థికంగా బ్రాహ్మణులు బాగా చితికి పోయారు. కులవృత్తితో పాటు వ్యవసాయం మీద, భూమి మీద కూడా ఆధారపడిన బ్రాహ్మణులు, చట్టాల పుణ్యమా అని ఆ రకమైన ఉపాధిని కోల్పోయారు. పూజారులుగా, అర్చకులుగా, వేద పండితులుగా, కర్మకాండలు నిర్వహించే వారిగా, వివాహాలలో, అంత్యక్రియలలో, ఇతర పూజా పునస్కారాలలో మాత్రమే వుండిపోయి, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుదలకు నోచుకోలేక, బీదరికంలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. ఏ కొద్దిమందినో మినహాయించి, చాలామందిది ఇదే పరిస్థితి. ‘అందరూ సమానులే అన్న రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం. బ్రాహ్మణుల ఈ స్థితికి బీజాలు ఆంగ్లేయుల పాలనలోనే పడ్డాయి. భారత దేశ సామాజిక వ్యవస్థలో, బ్రాహ్మణుల ప్రాముఖ్యం బ్రిటీష్ వారికి మొదట్లోనే అవగతమైంది. జాతీయోద్యమంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణులు పాల్గొనడమే కాకుండా ఇతరులులతో పాటు నాయకత్వం వహించడం తమ గుత్తాధిపత్యానికి ప్రమాదమని భావించిన బ్రిటీష్ ప్రభుత్వం బ్రాహ్మణులను కట్టడి చేసింది.

ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 60 ఏండ్ల  ఆంధ్రా వలస పాలనలో సమాజంలోని  అన్ని వర్గాల ప్రజలతో పాటు, తెలంగాణ ఏర్పాటయ్యేదాకా, వివిధ రంగాలలో బ్రాహ్మణుల పట్ల కూడా తీవ్రమైన వివక్ష స్పష్టంగా వుండేది. రాష్ట్రావతరణ తరువాత తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని, అందునా ఆర్థికంగా వెనుకబడిన వారి సంక్షేమాన్ని కాంక్షించి, పలు పథకాలకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, అదే క్రమంలో, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటు తనంలో వున్న పేద బ్రాహ్మణుల కోసం, వారి పరిస్థితులను సానుభూతితో అర్థం చేసుకుని, ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, బ్రాహ్మణుల పట్ల ఆయనకున్న అభిమానానికి, గౌరవానికి, వారు బాగు పడాలన్న తపనకు నిదర్శనం.

అలా ఆవిర్బవించిందే కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకోవాల్సిన ‘తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్. 17 మంది సభ్యులతో, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి అధ్యక్షతన జనవరి 2017 లో, దేశంలో ఎక్కడాలేని విధంగా, మొట్టమొదటిసారిగా, ఒక రిజిస్టర్డ్ సొసైటీగా నెలకొల్పారు దీన్ని. గత ఆరు సంవత్సరాలుగా ఈ పరిషత్ ఆధ్వర్యంలో బ్రాహ్మణుల సంక్షేమానికి అనేక పథకాలను రూపొందించి, సుమారు 6500 మందికి పైగా వ్యక్తులకు లబ్దిచేకూర్చింది. బ్రాహ్మణ సమాజం గోడు అర్థం చేసుకున్నందుకు తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం విశాల దృక్పథాన్ని అభినందించి తీరవలసిందే.

హైదరాబాద్ నగరంలో, బాగా రద్దీగా వుండే పాత్రికేయుల కాలనీ పక్కనవున్న గోపనపల్లి ప్రాంతంలో, డిసెంబర్ 2016 లో, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఆరెకరాల విశాలమైన స్థలంలో నిర్మించిన ‘తెలంగాణ బ్రాహ్మణ సదన్ భవన సముదాయం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చేపట్టిన ప్రాధాన్యత సంతరించుకున్న కార్యక్రమం. భవిష్యత్తులో బ్రాహ్మణుల సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు, అమలుకు అవసరమైన కార్యాచరణ పథకాలకు ఇది కేంద్ర బిందువు కానున్నది. ఈ భవన సముదాయానికి మంత్రి కేటి రామారావు ఫిబ్రవరి 2017 లో భూమిపూజ చేసి పునాది వేశారు. ఈ సముదాయంలో, ప్రస్తుతానికి రు. 12.50 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తిచేసుకున్న కళ్యాణమంటపం, సమాచార కేంద్రం, పీఠాదిపతుల వసతి గృహాలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మేనెల 31, 2023 న లాంఛనంగా ప్రారంభిస్తున్నారు.

         ఆద్యతన భవిష్యత్తులో విస్తరణలో భాగంగా, మినీ ఆడిటోరియం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, బాలుర హాస్టల్, బాలికల హాస్టల్, మెస్ సదుపాయంతో కూడిన సాధారణ వసతి సముదాయం, మహిళా కేంద్రం, దేవాలయాల సముదాయం నిర్మాణం జరుగనున్నది. సూర్యాపేట, మధిర, ఖమ్మం, పెద్దపల్లి, బీచ్పల్లిలలో వివిధ స్థాయిలలో బ్రాహ్మణ సదన్ల నిర్మాణం పురోగతిలో వున్నాయి. ‘తెలంగాణ బ్రాహ్మణ సదన్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి రాష్ట్రం, దేశం వివిధ ప్రాంతాల నుండి పీఠాదిపతులు, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, బ్రాహ్మణ సామాజికరంగ ప్రముఖులు, వేద పండితులు, ద్వాదశ జ్యోతిర్లింగాలతో సహా దేశవ్యాప్తంగా వున్న ప్రముఖ దేవాలయాల అర్చకులతో సహా సుమారు పదివేల మంది పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ప్రారంభోత్సవం రోజున చండీయాగం, సుదర్శన యాగం నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.  

         ఆరోజున చేయాల్సిన కార్యక్రమాలను, కార్యాచరణను సమీక్షించడానికి, మే నెల 13, 2023న రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి అధికార-అనధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వ భావజాలమైనా, తత్త్వమైనా,సర్వజన హితం’ అనీ,మనుషులందరినీ ప్రేమించడం’ అనీ, తదనుగుణంగానే అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పేదలయిన బ్రాహ్మణ వర్గాల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నదని, పూజారుల సంక్షేమానికి పాటు పడుతున్నదని,  ప్రభుత్వం అందించిన సహకారంతో పేద బ్రాహ్మణ పిల్లలకు చక్కటి చదువు అందుతున్నదని, వేదాలు చదువుతూ దైవకార్యంలో మునిగిన  అర్చకుల్లో భరోసా పెరిగిందని అన్నారు. బ్రాహ్మణ సదన్ భవన సముదాయ నిర్మాణానికి భూమిని కేటాయించి ప్రత్యేకంగా నిధులు విడుదల చేశామన్నారు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా బ్రాహ్మణుల సంక్షేమానికి వార్షిక బడ్జెట్ కేటాయింపులు రు 100 కోట్లు అని తెలుసుకున్న ఉత్తర ప్రదేశ్ లాంటి పలు రాష్ట్రాల ప్రముఖ బ్రాహ్మణ నాయకులు ఆశ్చర్యం, విస్మయం వ్యక్తం చేసిన విషయాన్నివివరించారు కేసీఆర్.

         బ్రాహ్మణ సదన్ సముదాయం నేటి, భావితరాలవారికి, శాంతిని, భక్తి భావనలను పంచే ఆధ్యాత్మిక కేంద్రంగాను, అన్ని వర్గాలవారికి అందుబాటులో వుండే ఒక సామాజికి కేంద్రంగాను ఖ్యాతికెక్కాలని సిఎం ఆకాంక్షించారు. దైవ భక్తిని, ధ్యానాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించే దిశగా ఆధ్మాత్మిక గ్రంధాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వంటి సాహిత్యంతో కూడిన పుస్తకాల, డిజిటల్ గ్రంధాలయాన్ని ఏర్పాటు చేయాలని, అక్కడికి వచ్చేవారికి దైవ కార్యాలకు సంబంధించిన యజ్ఞయాగాదులు, క్రతువులు, సత్యనారాయణ వ్రతం లాంటి వివిధ వ్రతాలు, దీక్షలు పట్టే విధానం తెలుసుకోవడానికి అవసరమైన సమాచారం లభ్యమవ్వాలని కేసీఆర్ సూచించారు. సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో, శైలిలో పుస్తకాలను ప్రచురించాలని, డాక్యుమెంటరీలను రూపొందించాలని  సీఎం అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణ సదన్ భక్తి, ఆధ్మాత్మిక భావజాలవ్యాప్తికి సంబంధించిన ఒక సమగ్ర సమాచార కేంద్రంగా, శిక్షణా శిబిరంగా, వనరుల కేంద్రంగా కూడా అభివృద్ధి చెందాలన్నారు.   

దేశంలో ఎక్కడాలేని విధంగా, మొట్టమొదటిసారిగా, ఈ తరహా బ్రాహ్మణ సదన్ కాని, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కాని ఏర్పాటు కావడానికి ఒక గుణాత్మక నేపధ్యం వున్నది. ఆరున్నర సంవత్సరాల క్రితం, అక్టోబర్ 23, 2016 న, హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి, పక్క రాష్ట్రం నుండి, సుమారు నూరుమంది బ్రాహ్మణ ప్రముఖులతో ఒక మేథోమధన బ్రాహ్మణ సంక్షేమ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్, బ్రాహ్మణులు సమాజానికి సంబంధించిన చేస్తున్నారని, అయినా వారిలో చాలామంది పరిస్తితి దీనంగా వుందని, మంగళహారతి పళ్లెంలో భక్తులు వేసే డబ్బులకోసం అర్చకులు ఎదురు చూసే దుర్భర పరిస్థితులున్నాయని, వీటిని అధిగమించదానికి ప్రభుత్వం, మేధావులు కలిసి బ్రాహ్మణుల సంక్షేమానికి ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు.

ఇందులో భాగంగానే మొదలు అన్ని హంగులతో కూడిన ఒక రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ సదనాన్ని హైదరాబాద్ లో నిర్మించుకుందాం అని అంటూ, దాని నిర్వహణ బాధ్యత కోసం ఒక ధర్మకర్తల మండలి ఏర్పాటు చేద్దామని,  ఆ కేంద్రంలో బ్రాహ్మణ సాంప్రదాయ పరమైన కార్యక్రమాలు జరుపుకునేందుకు ఏర్పాటు చేసుకుందామని సీఎం అన్నారు.  అలా బీజం పడి రూపుదిద్దుకున్నదే ‘తెలంగాణ బ్రాహ్మణ సదన్’. దాని నిర్వహణ కోసం ఏర్పాటయిందే ‘తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్’. క్రమేపీ పరిషత్ అమలుపరుస్తున్న పథకాల ద్వారా బ్రాహ్మణుల సంక్షేమం దిశగా తెలంగాణ ఒక ‘రోల్ మోడల్’ అయింది.

బ్రాహ్మణ సదన్ తో పాటు, పరిషత్ అమలుపరుస్తున్న కార్యక్రమాలలో ప్రధానమైనవి: విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు రు.20 లక్షలు మించకుండా ఆర్ధిక సహాయం అందించే వివేకానంద విదేశీ విద్య పథకం (780 మంది లబ్దిదారులు); స్వయం ఉపాధికి రు. 5 లక్షలు మించకుండా బ్రాహ్మణుల ఔత్సాహిక పథకం (5074 మంది లబ్దిదారులు); శ్రీ రామానుజ ఫీజు రీఇంబర్స్ పథకం (436 మంది లబ్దిదారులు); వేదం పాశాలలకు ఏక కాల గ్రాంట్ (32 పాశాలలకు లబ్ది); వేదాధ్యయనం చేసిన విద్యార్థులకు జీవనోపాధి అలవెన్స్; వేదాధ్యయనం చేస్తున్న విద్యార్థులకు నెలకు రు. 250 స్తైపెండ్ (245 మంది లబ్దిదారులు); నెలకు రు. 2500 చొప్పున వేదాల, శాస్త్రాల పండితులకు గౌరవ వేతనం (64 మంది లబ్దిదారులు); నూరు సాంప్రదాయ పాశాలలకు ఆర్ధిక సహాయం లాంటివి వున్నాయి. పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రు. 250 కోట్లకు పైగా విడుదల చేసింది.   

         ఆనాడు సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశం తీసుకున్న నిర్ణయాలు బ్రాహ్మణుల సంక్షేమం దిశగా ఒక బహుముఖ వ్యూహం రూపొందించుకునేందుకు దోహద పడుతున్నాయి. వైదిక విద్యకు ప్రోత్సాహం, ఆధ్యాత్మిక భావనలు పెంపొందించే వారికి ఆర్థిక చేయూత, సంప్రదాయలు కాపాడే వారికి, ఆధ్యాత్మిక రచనలు చేసే వారికి ఆర్థికంగా ప్రోత్సాహం, బ్రాహ్మణుల విద్య, వైద్య వివాహాది అంశాలకు ప్రాధాన్యత, ప్రతిభావంతులైన పేద బ్రాహ్మణ విద్యార్థులకు తగు ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి, యువ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటుకు, తదితర కార్యక్రమాల అమలుకు దారి తీస్తున్నది.

హైదరాబాద్ లో నిర్మించిన బ్రాహ్మణ సదన్ బ్రాహ్మణ సమాజోధ్ధరణ వేదికగా ఉపయోగపడుతుంది. వేరే ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, పండితులు వచ్చినా అక్కడ బస చేసే వీలు కలగడంతో పాటు, ఆచార, సంప్రదాయాల పరిరక్షణకు వీలు కలుగుతుంది. ధర్మ సంరక్షణకు, బ్రాహ్మణ సంక్షేమానికి ఇంతకంటె ఇంకేం కావాలి? అనాదిగా ధర్మాన్ని, అర్య సంస్కృతిని, నాగరకతను, సంప్రదాయాలను సంరక్షించుకుంటూ వస్తున్న బ్రాహ్మణులకు, వాటిని భవిష్యత్ లో కూడా కొనసాగించడానికి ప్రభుత్వ పరంగా చేయూత లభించనున్నది కదా! అందుకే తెలంగాణ బ్రాహ్మణుల సంక్షేమ పథకం దేశానికే ఆదర్శం, దిక్సూచి!!! (వ్యాస రచయిత తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్)

Monday, May 29, 2023

అవధాన కళను రక్షించుకోవాలి! ..... వనం జ్వాలా నరసింహారావు

అవధాన కళను రక్షించుకోవాలి!

వనం జ్వాలా నరసింహారావు

సాక్షిదినపత్రిక (29-052023)

         అనుకోకుండా అవకాశం, అదృష్టం లభించడం అంటే ఇదేనేమో!

దర్శనమ్ శర్మ గారి సోదరుడు, చిరకాల మిత్రుడు, మరుమాముల దత్తాత్రేయ శర్మ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఏర్పాటైన, ‘అవధాన విద్యా వికాస పరిషత్’ ఆధ్వర్యంలో పద్మారావునగర్ శ్రీ శివానంద ఆశ్రమంలో ఈ నెల (మే) 14 న నిర్వహించిన రెండవ అవధాన శిక్షణా శిబిరం విజయోత్సవ సభలో పాల్గొనడం ఒక అదృష్టం. సభాధ్యక్షులుగా జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్య అతిథిగా పంచ సహస్రావధాని, తిరుమల తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్ట్ మాజీ సంచాలకులు డాక్టర్ మేడసాని మోహన్, గౌరవ అతిథిలుగా డాక్టర్ బులుసు అపర్ణ, ఆముదాల మురళి, డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ, తాతా సందీప్ శర్మ, బంకుమళ్ల రమేశ్ శర్మ, కళ్ళే గిరిప్రసాద్ శర్మ, ఆహుతులను ఆహ్వానించి సభకు పరిచయం చేసిన డాక్టర్ బి ఓంప్రకాష్, వ్యవస్థాపక అధ్యక్షులు మరుమాముల దత్తాత్రేయ శర్మ తదితరులు వేదికను అలరించారు. నా అదృష్టం కొద్ది, అనుకోని ఆత్మీయ అతిథిగా నేను కూడా వేదికమీద వున్నాను. నా స్నేహితుడు భండారు శ్రీనివాసరావును వేదికమీదకు సాదరంగా ఆహ్వానించినా, ఆయన సున్నితంగా తిరస్కరించారు.

అమోఘమైన మేడసానివారి ఉపన్యాసం ముందర మాట్లాడిన నేను, చివర్లో, నా రెండు పుస్తకాలను (‘శ్రీమద్రామాయణం ‘ఆంధ్ర వాల్మీకం’ వచనం, ఆంధ్రవాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు) వారి అనుమతితో అందచేసే అవకాశం లభించడమే అనుకోని అదృష్టం, అవకాశం. సభలో మాట్లాడిన వక్తలందరూ అవధాన ప్రక్రియ తెలుగు భాషకే గర్వకారణమని, తెలుగుభాషలో వున్న ఈ అద్భుత ప్రక్రియ ప్రపంచంలో మరేభాషలో లేదని, ఇది ఒక మనోవైజ్ఞానిక ధారణతో కూడుకున్న తెలుగుజాతి తరగని ఆస్తి అని అన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ మేడసాని మోహన్ చివరగా అరగంటకుపైగా చేసిన ఉపన్యాసంలో తన తొలిపలుకుల్లోనే నా ప్రస్తావన తేవడం మరో అదృష్టం. సత్కారాలు, సన్మానాలు అంటే అంతగా ఇష్టపడని తనకు, వనం జ్వాలా నరసింహారావు అనువక్తగా రాసిన శ్రీమద్రామాయణం ‘ఆంధ్ర వాల్మీకం’ వచనం, దానికి అదనంగా మరో పుస్తకం ‘ఆంధ్రవాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు’ తనకు ఇవ్వడమే ఈ రోజున తనకు జరిగిన గొప్ప సత్కారమని అన్నారు. ఆయన ఉపన్యాసం ఆసాంతం నొక్కి వక్కాణించిన ఏకైక పదం,అవధానంలో ఏకాగ్రత.

 మేడసాని మోహన్ గారు తన ఉపన్యాసంలో కొంత మేరకు తన జీవనయానాన్ని కూడా ఆవిష్కరించారని అనాలి. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తాను చిన్నతనంలో సుదీర్ఘకాలం కడుపునొప్పితో బాధ పడ్డానని, ఎన్ని మందులు వాడినా ఉపశమన వైద్యమే కాని శాశ్వత నివారణ కాలేదని, ఆ సమయంలో భగవదనుగ్రహం వల్ల, స్నేహితుల సలహా మేరకు తిరుపతి-మద్రాసు రహదారిలో వున్న ఒక అవధూత ఆశ్రమానికి అయిష్టంగానే తన తండ్రి తీసుకెళ్ళాడని, ఆయన ఒక పరమౌషధం ఇచ్చారని అన్నారు. ఆ అవదూతగారు నెలలో కేవలం ఒక్క అమావాస్యనాడే దర్శనం ఇచ్చేవారని, ఎవరితో మాట్లాడరని, చెప్పదల్చుకున్నది ఒక పలకమీద రాస్తే శిష్యులు అది చదివి, ఆయన సూచన మేరకు, అవధూతగారి దగ్గరికి వచ్చినవారికి అవసరమైన వివిధ పరిష్కారాలు చెప్తారని అన్నారు మేడసానిగారు. తనకు ఒక ఔషధం ఇచ్చి, దాన్ని ఆవుపాలలో కలుపుకొని 150 దినాలు వదలకుండా తాగాలని, కడుపునొప్పి శాశ్వతంగా తగ్గిపోతుందని అవధూత చెప్పారట. ఒకవేళ పది-పదిహేను రోజుల్లో మెరుగైనా, ఆపకుండా ఖచ్చితంగా చికిత్స కొనసాగించాలని కూడా చెప్పారు. మేడసాని మోహన్ గారు అవధూత చెప్పినట్లే, అది చేదుగా ఉన్నప్పటికీ, తనతల్లి ప్రోద్బలంతో 150 దినాలు తాగానని, ఇక ఆ తరువాత తనలో ఎదో మార్పు రావడం ప్రారంభమైందని అన్నారు.

ఆ తరువాత అవధూత సూచన మేరకు తన తల్లితండ్రులు కూడా పూర్తి శాఖాహారులుగా మారారని, తనను అవధూత వుండే ఆశ్రమం సమీపంలో పాశాలలో ఆయన సలహా మేరకు చేర్పించారని అన్నారు మేడసాని మోహన్. తనకు దేవీ దర్శనం, అనుగ్రహం కలిగిందని, ఫలితంగా తొమ్మిదవ తరగతిలోనే పద్యం రాయడం ఆరంభించానని అన్నారు. తన గురువుగారు తన పద్యాలలోని చంధస్సు తప్పొప్పులు సరిచేసేవారని, ఆయన ఒకసారి శివుడిమీద పద్యం చెప్పమంటే చెప్పానని, ఆ పద్యం వినిపించారు. పదవతరగతి చదువుతున్నప్పుడే అవధానం చేయడం మొదలు పెట్టానని, భగవదనుగ్రహం వల్ల అది నిరంతరాయంగా కొనసాగిందని, ఇప్పటికి ఖండాంతరాలలో చేసిన 300 కు పైగా చేసినవి కలుపుకొని, మొత్తం 1200 పైగా అవధానాలు చేశానని, విదేశాలలో అవధానం చేసిన మొట్టమొదటి వ్యక్తిని తానేనని అన్నారు. ఆయనగారి అవధానాలలో, అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు, ద్విసహస్రావదానాలు, పంచసహస్రావధానాలు ఉన్నాయన్నారు. తాను చేసిన ఆయా అవధానాలలో సందర్భోచితంగా ఆశువుగా పూరించిన పద్యాలను ఉదహరించారు. తన మొదటి అవధానం దివాకర్ల వెంకటావధాని సమక్షంలో జరిగినప్పుడు తనకు భయం వేసిందని, కాని తన ప్రారంభ పద్యాన్ని వినగానే ఆయన తనను అభినందించిన తీరు ఎప్పటికీ జ్ఞాపకం వుంటుందని అన్నారు.

ఒకప్పటికి, ఇప్పటికే అవధానాల తీరుతెన్నులలో, పృచ్చకుల నుండి ఎదుర్కుంటున్న ప్రశ్నల సవాళ్ల విధానంలో చాలా మార్పులు వచ్చాయని, తెలుగుభాషలో ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృతం, ఆ మాటకొస్తే కొన్ని సందర్భాలలో మరెన్నో పరాయి భాషల పదాలు చందోబద్ధంగా వాడాల్సిన అవసరం, ఆగత్యం, ఏర్పడిందని అన్నారు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ, అవధాని చేసే అపురూపమైన సాహితీ విన్యాసంలో కాలానుగునంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా నేటి తరం అవధాని కూడా ఏకాగ్రతతో మారాల్సి వస్తున్నదని అన్నారు. పాతరోజుల్లో సమస్యాపూరణం, దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, వివర్గాక్షరి, నిర్దిష్టాక్షరి లాంటి అవధాన ప్రక్రియలో పాల్గొనే పృచ్చకులు ప్రశ్న సంధించే విధానంలో ఇప్పుడు మార్పులు వచ్చాయన్నారు. నలుగురు సినిమా నటీమణుల పేర్లు చెప్పి సరస్వతీ స్తోత్రం చేయమనో; నాలుగు ఆంగ్లపదాలు ఇచ్చి విష్ణుమూర్తిని వర్ణించమనో; పాకిస్తాన్, అప్ఫ్గానిస్తాన్, ఖజకిస్తాన్ లాంటి ఉర్దూ పదాలు ఇచ్చి వెంకటేశ్వర స్వామిని స్తుతించమనో; ఇలా ఏమేమో అడుగుతున్నారని వారి ప్రశ్నలకు అనుగుణంగా సమస్యాపూరణ చేయాల్సి వస్తున్నదని అన్నారు. ఒక్కో సందర్భానికి చెందిన ఒక్కో పద్యాన్ని తాను సందర్భోచితంగా పూరించిన విధానాన్ని, ఆ పద్యాల్ని చదివి వినిపించారు. అలా ఆయన ఉపన్యాసం ఆసాంతం ఆసక్తిగా, ఎన్నో విషయాలు నేర్చుకునే విధంగా కొనసాగింది. ఏదేమైనా ‘ఏకాగ్రత వుంటే అన్ని సమస్యలూ తొలగిపోతాయని, అదిలేని నాడు అవధానం కష్టమని ఆయన స్పష్టం చేశారు.

ఇక్కడ ఒక్క మాట చెప్పుకోవాలి. ఛందస్సును విరివిగా ప్రచారంలోకి తీసుకొచ్చిన ప్రక్రియల్లో మొదటిగా పేర్కొనాల్సింది అవధానం. కాగితం మీద కలం పెట్టి, ఆలోచిస్తూ, ఛందోబద్ధమైన కవిత్వం చెప్పేవారు కొందరైతే, అలవోకగా, ఆశువుగా, శ్రోతలను ఆకట్టుకుంటూ అవధానం చేస్తూ ఛందోబద్ధమైన పద్యాలను ధారణ చేసేవారు మరి కొందరు. అవధానం చేయాలంటే పూర్వజన్మ సుకృతం వుండాలి. సరస్వతి నాలుకమీద నిలవాలి. అలా అవధానాలు చేయగలవారు అతికొద్దిమందే వుంటారు. కాలక్రమేణా మార్పులు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఆదిత్య అతి పిన్న వయస్సులోనే, స్వయంగా, సొంతంగా ఆన్ లైన్లో శిక్షణ పొంది ద్విభాషావధానం అద్వితీయంగా చేయడమే కాకుండా రికార్డ్ సమయంలో అష్టావధానం చేయగలిగారు. అలా ఎందరో ఇటీవల కాలంలో అవధానాలు చేస్తున్నారు. అయితే ఇంకా, ఇంకా ఎంతో మంది కొత్తవారు చేయాలి. చేస్తున్నవారిలో పరిపక్వత రావాలి.  

సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియైన అవధానం కవి యొక్క ఆశుకవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణా శక్తికి, పాండితీ ప్రకర్షకు అత్యున్నత పరీక్ష. పద్యాలన్నిటినీ ధారణ చేసి అదే క్రమంలో ఏక ధాటిగా చివరలో వాటిని అప్పగించడం మామూలు విషయం కాదు. ఈ యావత్ ప్రక్రియ కొందరికి అభ్యాసం ద్వారా కూడా సిద్ధిస్తుంది. నేర్చుకుంటే రానిదేదీ లేదు. అయితే, నేర్పేవారు వుండాలి. కాలం గడిసిపోతున్న కొద్దీ అవధానాలు చేసేవారు తగ్గిపోతున్నారు. ఆస్వాదించేవారూ తగ్గిపోతున్నారు. వేల యేండ్ల చరిత్ర గల ఈ ఛందశ్శాస్త్రం, అవధాన ప్రక్రియ అంతరించి పోకూడదని పూనుకున్నారు మరుమాముల దత్తాత్రేయ శర్మ. మరుమాముల సోదరులు ఇద్దరూ ఆధ్యాత్మికంగా, సాహితీ పరంగా ఎనలేని కృషి చేయడం మామూలు విషయం కాదు. అంతరించి పోతున్న ఈ విద్యకు పునరుత్తేజం కలిగించడానికి ఒక ఉచిత బృహత్తర శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు స్వయంగా అవధానైన మరుమాముల దత్తాత్రేయ శర్మ. ఆయన నెలకొల్పిన అవధాన విద్యా వికాస పరిషత్ రెండు శిక్షణా శిబిరాలను నిర్వహించింది.

మరుమాముల నిర్వహించిన శిక్షణా శిబిరాలకు హాజరైన వారిలో పదేళ్ల అమ్మాయి నుండి, ఎంబీబీఎస్ చదువుతున్న వారు, వయసు మీరినవారు, సుదూరం నుండి వచ్చినవారు వున్నారు. విజయోత్సవ సభలో అవధాన బోధనను విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులకు, శిక్షణలో భాగంగా అవధానం చేసిన కొందరికి, యోగ్యతాపత్రం ఇవ్వడం జరిగింది. అవధానం, పద్యవిద్య, చంధస్సు సార్వజనీనం కావాలి. పద్యం సాధారణ మానవుడినీ కదిలించాలి. ఈ అవధాన పరంపర నిర్విరామంగా, ఆచంద్రతారార్కం కొనసాగాలి. అవధాన పండుగలు నిర్వహించుకునే రోజులు మళ్లీ-మళ్లీ రావాలి. దీనికి మరుమాముల దత్తాత్రేయ శర్మగారి లాంటి వారు నడుం బిగించినందుకు ఆయన్ను మనసారా అభినందించాలి. ఆయన కృషిలో విజయం చేకూరాలి. ఆయన దగ్గర శిక్షణ పొందిన ప్రతిఒక్కరు అవధానాన్ని చేయగల స్థాయికి ఎదగడమే మరుమాముల వారికి గురుదక్షిణ.  

లక్ష్మీ నివాస స్థానాలను, విష్ణు భక్తిని, విష్ణువు బోధించిన తత్త్వాన్ని వివరించిన భీష్ముడు ..... ఆస్వాదన-122 : వనం జ్వాలా నరసింహారావు

లక్ష్మీ నివాస స్థానాలను, విష్ణు భక్తిని,

విష్ణువు బోధించిన తత్త్వాన్ని వివరించిన భీష్ముడు

 ఆస్వాదన-122

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (29-05-2023)

ముక్తికి సోపానమని భావించతగ్గ గరుత్మంతుడి కథ భీష్ముడి ద్వారా విన్న ధర్మరాజు అమితమైన ఆనందాన్ని పొంది, తన తరువాత ప్రశ్నగా, ‘లక్ష్మి ఎలాంటి వారిలో వుంటుందని, ఎక్కడెక్కడ నివసిస్తుందో తెలపమని అడిగాడు పితామహుడిని. సమాధానంగా భీష్ముడు లక్ష్మి అంటే కేవలం ధనం మాత్రమే కాదని, శుచీ-శుభ్రతా, సరళత, అందం అనీ అంటూ ఇంకా ఇలా వివరించాడు. ‘ఒకసారి లక్ష్మీదేవి రుక్మిణీదేవితో తన నివాస స్థానాలను గురించి ఇట్లా చెప్పింది. నిత్యసత్యులు, శౌచనిరతులు, గురుభక్తులు, అప్రమత్తులు, దక్షులు, నిర్మలమతులు, సత్కర్మపరులు, విజ్ఞానం, తపం, దానం, బ్రహ్మచర్యం, శమం మొదలైన గుణాలు కలవారున్న ప్రదేశాలు లక్ష్మీ నివాసస్థానాలు. క్రూరులు, నాస్తికులు, కృతఘ్నులు, దుష్టబుద్ధుల పాలిట లక్ష్మి ఉండదు. గృహనీతి గల స్త్రీలయందు లక్ష్మి ఉంటుంది. పతి వ్యతిరేకులు, కఠిన చిత్తలు, అధిక నిద్రాసక్తలు అయిన స్త్రీలయందు లక్ష్మి ఉండదు. సరస్సులలో, పూల తోటలలో లక్ష్మి నివసిస్తుంది’.

‘స్త్రీ పురుషుల రతిలో ఎవరికి ఎక్కువ సుఖ ముంటుందని అడిగాడు ఆ తరువాత ధర్మరాజు. జవాబుగా భీష్ముడు భంగాస్వనుడు అనే రాజుకథ చెప్పాడు. ‘భంగాస్వనుడు ఇంద్రుడికి ఇష్టం లేని యజ్ఞం చేసి నూరుగురు కొడుకులను పొందాడు. అతడు ఒకసారి వేటకు వెళ్ళినపుడు ఇంద్రుడి మాయవల్ల ఒక కొలనులో దిగి నీరు త్రాగి స్త్రీగా మారిపోయాడు. ఆశ్చర్యంతో అతడు నగరానికి తిరిగి వచ్చి, మంత్రులకు, బంధువులకు జరిగింది తెలియచెప్పి, కొడుకులకు రాజ్యం కట్టబెట్టి, అడవికి వెళ్ళి మునులతో కలిసి నివసించాడు’. (భారతంలో శిఖండి కథతో సహా ఒకతి-రెండు పర్యాయాలు లింగ పరిణామం గురించి చెప్పడం జరిగింది. ఇది సాధ్యమేనని, శాస్త్రీయంగా సత్యమేనని, ఇటీవల పరిశోధనలు నిరూపించాయి. ప్రతి స్త్రీ పురుషులలో తల్లి అంశ సగం, తండ్రి అంశ సగం వుంటుంది కాబట్టి ఇది సత్యమే, శాస్త్రీయమే అని విశ్లేషించారు డాక్టర్ తుమ్మపూడి కోటీశ్వరరావు గారు).  

భీష్ముడు చెప్పడం కొనసాగిస్తూ ఇలా అన్నాడు. ‘స్త్రీ రూపంలో ఉన్న అతడిని ఒక ముని ప్రేమించి వరుసగా ఆమెద్వారా నూరుగురు కొడుకులను పొందాడు. రాజు ఆ కొడుకులను కూడా పూర్వ పుత్రులతో, చేర్చి, రాజ్యసుఖాలను కలిగించాడు. ఇంద్రుడు ఆ శుభ పరిణామాలకు అసూయపడి రాకుమారుల నడుమ కలతలు రేపి, వారిని యుద్ధంలో చనిపోయేటట్లు చేశాడు. స్త్రీ రూపంలో ఉన్న ఆ రాజు రోదించాడు. ఇంద్రుడు కరుణించి కొందరు కొడుకులను బ్రతికిస్తానన్నాడు. స్త్రీ రూపంలో ఉన్న ఆ రాజు తాను స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కొడుకులను బ్రతికించుమని కోరాడు. ఇంద్రుడు దానికి కారణమడిగాడు. తల్లికి బిడ్డల మీద ప్రేమ ఎక్కువ అని అతడు సమాధానం చెప్పాడు. ఇంద్రుడు సంతోషించి అతడికి పోయిన మగతనాన్ని కూడా ఇస్తానన్నాడు. అప్పుడు ఆ రాజు తనను స్త్రీగానే ఉండనిమ్మని ఇంద్రుడిని కోరాడు. దానికి ఇంద్రుడు ఆశ్చర్యపడి కారణం అడుగగా “రతిలో పురుషులకంటే స్త్రీలకు సుఖమెక్కువ కాబట్టి నేను స్త్రీగానే ఉండి సుఖించాలని కోరుకొంటున్నాను” అని అన్నాడు’.

ఈ విధంగా భంగాస్వనుడు కథ చెప్పిన భీష్ముడు, దాని తాత్పర్యాన్ని అర్థం చేసుకొమ్మని ధర్మరాజుతో అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన ధర్మరాజు, ‘సంసార చక్రంలో పడి తిరుగకుండా ముక్తిని కలిగించే విష్ణుభక్తిని బోధించుమని’ ప్రార్థించాడు తాతగారిని. శాశ్వత సుఖం పేరే మోక్షమని, అదే నిర్వాణమని, పురుషాతీతంగా ప్రకృతి ఉంటుందని, దానిని నిర్దేశించడానికి కాని, ఇది అని చెప్పడానికి కాని, తర్కించడానికి కాని వీలుపడదని, అదే సంసార చక్రమని, దానిని త్రోసివేయటమే మోక్షమని భీష్ముడన్నాడు. ఆకృతికంటే వేరైనా ప్రకృతులన్నీ సంసార మార్గానికి అనుకూలంగా తోస్తూ వుంటాయని, అలా తోస్తూ వుండగా సంసార నిర్మూలనానికి కారణమైనది ఆకృతి స్ఫురణ మాత్రమే అని, అది కూడా కామంతో కప్పబడుతుందని అంటూ, కామక్రోధాలను జయించి మనస్సును సత్వగుణ భరితం చేసికొమ్మని, అదే వైష్ణవ ధర్మమని, దానిని అనుసరించి సంసార భయాన్ని జయించమని ధర్మరాజుకు చెప్పాడు.

‘ఆధ్యాత్మికం, అధిదైవం, అధిభూతం అనే మూడు తత్వాలకు ఆధారమై, వాటిలో తానూ జీవిస్తూ కర్తా, భర్తా, హర్తా అయిన భగవంతుడిని గురించి చెప్పుమని అడిగాడు ధర్మరాజు. భీష్ముడు ఆ ప్రశ్నకు సమాదానంగా ఇలా అన్నాడు. ‘సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, వసిష్ఠుడు, శంకరుడు ఈ ఆరుగురు బ్రహ్మకు కొడుకులు. ఆ తరువాత మరీచి, భృగుడు, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే వారు పుట్టారు. సనత్సుజాతుడు నారదుడికి చెప్పిన తత్త్వసారం నీ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది’.

‘అవ్యక్తమైన విష్ణువు తన స్వరూపంతో తానుంటాడు. అతడు పదివేల యుగాలు నిద్రపోయి లేచి బ్రహ్మను సృష్టించి దాని కతడిని భర్తగా నియమించాడు. అతడు అహంకారాన్ని పొంది పంచభూతాలనూ, గుణాలనూ సృష్టించాడు. వాటన్నిటిలో అహంకారం వ్యాపించి ఉంటుంది. అవన్నీ అవ్యక్త సముద్రంలో మునిగి తేలుతూ ఉంటాయి. ఈ సమస్త సృష్టి స్థితి లయాలకు ప్రభువై విష్ణుమూర్తి శుభాశుభాలను కల్పిస్తూ ఈ సంసార చక్రాన్ని తిప్పుతూ వినోదిస్తూ ఉంటాడు. ఆధ్యాత్మమంటే అనుభవించే జీవుడు. తాను ద్రష్ట చూచేవాడు. ఆధిభూతమంటే ద్రష్ట, అనుభవించే పరార్థ సృష్టిలోని గుణం దృశ్యం. ఆధిదేవత అంటే దృక్కు. చూచే శక్తి తేజస్సు. ఈ కెరటాలు వ్యక్తమయ్యే దానిని సృష్టి అంటారు. పంచభూతాలే దేవతలు. వాటి గుణాలే అధిభూతం’.

‘ఇవన్నీ విష్ణువన్న మహాసముద్రంలో పుట్టి, అణగారిపోయే అలల్లాంటివి. ఆయనకంటే పైన మరొక సత్యం లేదు. ఆయనే అన్నిటికీ ప్రభువు. అవ్యక్తం అంటే మూల ప్రకృతి. దానిలోకి పురుషుడు ప్రవేశిస్తే అది చైతన్యవంతమై సృష్టికార్యాన్ని నిర్వహిస్తుంది. విష్ణువు సమస్త సృష్టికి ఆధారం. ఆయన శివుడి అనుమతితో సమస్త బ్రహ్మాండాలు సృష్టించడం, లయించడం చేస్తూ వుంటాడు. ఇరవై నాలుగు తత్త్వాలకు మూలమైన తత్త్వం 25 వది. అది విష్ణువన్న పేరున వున్న పురుషుడు అనే పెరుకలది. అది పురాణ, వేదం, ఉపనిషత్తుల వల్ల ఎరుగనైనది. కాలానికి అంతకుడు, అద్వయుడు, అసంగుడు అతడే. అతడి పేరు విష్ణువు. 

‘నియమంతో అగ్నులను తమలో ఆవహింపజేసికొని మహాత్ములు పరమాత్ముడిని ఎట్లాంటి వాడినిగా భావిస్తారు’ అని ప్రశ్నించాడు ధర్మరాజు అ ఆతరువాత. సమాధానంగా భీష్ముడు, ఒకప్పుడు హిమాలయం మీద మునులు, సిద్ధులు కూర్చుని ఆధ్యాత్మిక చర్చ చేస్తున్నప్పుడు, అక్కడకు గరుత్మంతుడు వచ్చాడని, అప్పుడాయనకు నమస్కరించి వారంతా ఆయన్ను విష్ణువు గురించి పూర్తిగా చెప్పమని అడిగారని అంటూ ఇలా చెప్పాడు. అప్పుడాయన తనకు విష్ణువు బోధించిన తత్త్వాన్ని వారికీ విధంగా తెలియపర్చాడు. 

‘నా స్వరూపం దేవతలకూ తెలియదు. సమస్తం నాలో పుట్టి, జీవించి, మరణించినా నేనా సంసార చక్రంలో బంధితుడను కాను. కాని, వాటికి లోబడి అన్నింటిలోనూ ఉంటాను. నా తత్త్వం జడులు కానివారూ, అహింసా ప్రవృత్తి కలవారూ, కామం లేనివారూ, అహంకారం లేనివారూ, దానంగా దేనినీ స్వీకరించనివారూ, కోపం లేనివారూ, స్వచ్ఛమైన జ్ఞానం కలవారూ, నిత్యతృప్తులూ, శాంతి, భక్తి కలవారూ, నిష్ఠ కలవారూ, తమలో అగ్నిని సన్నిహితం చేసికొంటే నన్ను పొందగలరు. రజస్తమస్సులతో మలినం కాని కేవల సత్యగుణాన్నే స్థిరంగా చేసికొన్న జ్ఞానంతో నన్ను ధ్యానించటమే ముక్తి మార్గం. నానా విధాలైన సంకల్పాలు, యజ్ఞాలు, విడిచి పెట్టి ఆత్మలో అగ్నిని ప్రతిష్ఠించుకొని విరక్తుడై విష్ణువులో మనస్సును లయం చేసినవాడు ముక్తిని పొందుతాడు'.

భీష్ముడు ఆవిధంగా విష్ణు రూప, జ్ఞాన పద్ధతులను కథారూపంలో ధర్మరాజుకు వివరించాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

 

Saturday, May 27, 2023

Brahmin Welfare: TS is Role Model for country (Emboldening the neglected) : Vanam Jwala Narasimha Rao

 Brahmin Welfare: TS is Role Model for country

The Hans India (28-05-2023)

Emboldening the neglected

Millennium Post (30-05-2023)

Vanam Jwala Narasimha Rao

(Learning of the budgetary provision of Rs 100 crores, for Telangana Brahmin Welfare, including Telangana Brahmin Sadan Complex, several prominent Brahmin Leaders of other states like UP where Brahmin population is more than other states, were astonished. No other state in the country is executing welfare programs like in Telangana state for the Brahmin community. The Complex is located in over nine acres land at Gopanapally in Hyderabad-Hand India Editor’s Note)

(Telangana’s Brahmin welfare model which entails encouragement of Vedic studies, financial assistance to spiritual thinkers, skill development etc. is worth replicating countrywide-Millennium Post Editor)

A significant number of Brahmins played an influential and key role, flawlessly to the precision, in the evolution of the modern society, from social reforms to modern science, from literature to cinema, from politics to public administration, from spirituality to communism, from traditional values to progressive thinking etc. Immediately after Independence also, Brahmins were in a position to get in to significant positions. However, with the passing of time, Brahmins allover, have become a target from many corners for various reasons, especially down the South of the country.

As a result, Brahmin community became very weak in the society and the opportunities were on the decline. Role of Brahmin Community was confined to be a Vedic scholar or a ritual performer or other related roles only. It became a suffering lot, politically, socially, and financially barring negligible few, although every citizen in the country is guaranteed equal rights in the Indian Constitution. For all this seeds were sown under the British Rule, at a time when Brahmins were in the forefront in the National Movement along with others.

In the erstwhile Andhra Pradesh and at the time of formation of Telangana there was lot of discrimination against Brahmins in several aspects. But, since the formation, progressively, benefits to economically backward Brahmin individual are on par with all others, thanks to the distinct interest evinced by Chief Minister K Chandrashekhar Rao. For the first time and as a first of its kind an exclusive organization ‘The Telangana Brahmin Samkshema Parishad’ (TBSP) as a brainchild of Chief Minister K Chandrashekhar Rao was constituted as a registered society with 17 members headed by Dr KV Ramana Chary as Chairman, in January 2017. For the past six years, TBSP has been initiating and implementing several welfare programs, benefitting over 6500 Brahmins.

The ‘Telangana Brahmin Sadan Complex’ in a sprawling over nine acres government allotted land in December 2016 in Gopanapally, now supposed to be a busy area in Hyderabad is the major initiative of the Parishad, which ultimately would become the center for Brahmins’ Welfare activities in Telangana. The Bhoomi Puja for the complex was performed by Minister KT Rama Rao in February 2017. On May 31, 2023, Chief Minister K Chandrashekhar Rao will inaugurate the magnificent ‘Telangana Brahmin Sadan Complex’ consisting of blocks of Kalyan Mandapam, Information Centre, Seers’ Accommodation etc. constructed at a cost of Rs 12.50 crores.

In addition, in future expansion, Mini Auditorium, Primary Health Centre, Boys Hostel, General Hostel and Mess, Girls Hostel, Women Centre, Staff Quarters, and Temple Complex will be constructed. Under land donation category, Brahmin Sadans at Suryapet, Madhira, Khammam, Peddapally and Beechpally are in different stages. An expected 10,000 plus gathering from across the state and country who among others include Peetaadhipathis, representatives of Brahmin associations, Brahmin Social personalities, Veda Pandits, Archakas from famous temples etc. likely to attend the meeting. On the suggestion of CM KCR both ‘Chandi Yagam and ‘Sudarshan Yagam’ will be performed on that day.

Reviewing the preparations expected to be organized at the time of inauguration on May 13, 2023 at Secretariat, CM KCR said that the ideology and philosophy of Telangana BRS Government has been ‘Welfare of All’ with the concept of ‘Love All Human Beings’. Accordingly, said CM KCR that the Government is determined for the welfare of Brahmins also in general and particularly the economically backward ones in the community.

Accordingly, said KCR that adequate funds are being provided on a regular basis to the Brahmin Parishad for its schemes and programs uninterruptedly, besides land for construction of Brahmin Sadan. When came to know the Annual budgetary provision of Rs 100 crores, several prominent Brahmin Leaders of other states like UP where Brahmin population is more than other states, were astonished since no other state in the country is executing welfare programs like in Telangana state for the Brahmin community.

KCR desires that the Telangana Brahmin Sadan Complexshould transform itself into a Spiritual and Community Center accessible to all communities to spread peace, tranquility, and devotion to the present and future generations and also to be equipped with adequate and relevant Library Books as well as a Digital Library. This shall consist of literature such as spiritual scriptures, Vedas, Upanishads, and Puranas etc. for guiding interested persons on performing Yagas, Vratas like Satyanarayana, various poojas, Deekshas etc. KCR also suggested that the Brahmin Sadan should be a Training Resource and information Center on above aspects spreading devotional and spiritual thoughts.

 For all this there was a qualitative background in conceiving and forming the first of its kind ‘Telangana Brahmin Samkshema Parishad’. A brainstorming Brahmin Welfare Meeting chaired by Chief Minister KCR was held on 23rd of October 2016 at Dr MCRHRD Institute in Hyderabad attended by about 100 Brahmin representatives from across the state as well as some experienced from neighboring state on invitation. Sharing his views, the Chief Minister had given emphasis to the role of Brahmins since ages and highlighted how they have been in the service to society and humanity.

KCR spoke eloquently on various hardships, issues and problems faced by Brahmin Community and cited several examples. In that context, he favored that the community should overcome these difficulties and obstacles through a well-conceived strategy and comprehensive plan of action. The proposal that he presented then was, to begin with, construct a complex to be known as ‘Brahmin Sadan’ making available all the facilities that the Brahmins require, and also as a center for all the traditional ceremonies, celebrations and other community activities of the Brahmins and to be organized under one roof and at one place. That was the Genesis of ‘Telangana Brahmin Sadan Complex’. At a time when Brahmins were badly in need of getting their due share of respect and material support from the governments, Telangana State became a unique exception and a ‘Role Model’ for other states to initiate Brahmin Welfare in a big way.  

Besides Brahmin Sadan, TBSP implements schemes like Vivekananda Overseas Education (Fee reimbursement for higher studies abroad with an upper limit of Rs 20 lakhs-780 beneficiaries), Brahmin Entrepreneurial (Financial Assistance not exceeding Rs 5 lakhs to set-up self-employment units-5074 beneficiaries), Sri Ramanuja (Fee reimbursement for post metric studies-436 beneficiaries), Grant to Veda Patashala (One time grant to impart Vedic education along with regular academic studies-32 Patashalas availed), Sustenance Allowance to Vedic Students, Vedic Students assistance (Stipend of Rs 250 per month-245 beneficiaries), Veda and Shastra Pandits Honorarium (Rs.2,500 per month-64 beneficiaries), Sampradaya Patashala (100 beneficiaries) etc. An amount of Rs 250 crores has been released for the above-mentioned schemes by the Government.       

The initative taken by CM KCR in October 2016 paved way and brought to light the true essence of Brahmin Welfare and the need of the society to preserve and protect them for larger interest of the society in general and country in particular in addition to assisting the community directly besides drawing a strategy for it. It also led to encouragement to Vedic studies, financial assistance to spiritual thinkers, provision for education, skill development, encouragement to entrepreneurs etc.

The ‘Telangana Brahmin Sadan Complex’ will be a platform for development of Brahmin community and provides for a traditional accommodation to Peetaadhipathis and Scholars coming from outside. This is in a way an all-round development plan of the Brahmin community. Telangana Brahmin Welfare is now a Role Model to other states.

(The Writer is Vice Chairman, Telangana Brahmin Samkshema Parishad and Chief Public Relations Officer to Chief Minister, Telangana)

{CM KCR to Inaugurate ‘Telangana Brahmin Sadan Complex’ on May 31, 2023}

Sunday, May 21, 2023

సత్కర్మ వల్ల కలిగే ఫలాలను, గరుత్మంతుడి మహాత్మ్యాన్ని వివరించిన భీష్ముడు .... ఆస్వాదన-121 : వనం జ్వాలా నరసింహారావు

 సత్కర్మ వల్ల కలిగే ఫలాలను,

గరుత్మంతుడి మహాత్మ్యాన్ని వివరించిన భీష్ముడు

ఆస్వాదన-121

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (22-05-2023)

‘మనిషి చేతిలో ఏమున్నదనీ, అంతా దైవానిదేననీ కొంతమంది అంటున్నారు కదా? అలాంటప్పుడు దైవం,  పౌరుషం ఈ రెండింటిలో ఏది గొప్పదని’ ధర్మరాజు భీష్ముడిని ప్రశ్నించాడు. పూర్వం ఇలాంటి ప్రశ్ననే వసిష్ఠుడు బ్రహ్మదేవుడిని అడిగాడని, ఆయన సమాధానంగా చెప్పిన మాటలను ధర్మరాజుకు చెప్తానని అంటూ భీష్ముడు ఈ విధంగా అన్నాడు.

‘పౌరుషం చేను, దైవం బీజం. ఈ రెండింటిని కలిపే ప్రయత్నం చేస్తే మానవుడు చక్కటి ఫలాన్ని పొందుతాడు. మనిషి ఏపనీ చేయకుండా కూర్చుంటే దైవం మాత్రం ఏం చేస్తుంది? మనుషులు పనులు చేస్తే ఆయా ఫలాలను దైవం ఇస్తుంది. దైవం సహకరించకపోతే పౌరుషం ఫలం పొందలేదు.  విత్తు తోడ్పాటు లేకుండా నెల బీడుపడ్డట్లు అవుతుంది తప్ప ఫలాన్ని ఇస్తుందా? మేలు చేస్తే రెండు లోకాలలో మేలే. కీడు చేస్తే కీడే. మనిషి ప్రయత్నానికి అనుకూలించే స్వభావం కల దైవం పని ఏదైతే అదే ఫలితాన్ని ఇస్తుంది. అగ్ని కొంచెమైనా గాలితో పెరిగి ప్రకాశించినట్లు మంచిపనులు చేయటంవలన దైవానుకూల్యం పెరుగుతుంది. నేయి తగ్గిపోతే దీపకాంతి తగ్గినట్లే మనిషి చేసే కర్మలలో పవిత్రత లోపిస్తే దైవానుకూలత కూడా లోపిస్తుంది. పరశురాముడు మొదలైన మహాత్ములు కూడా కర్మల ప్రభావానికి లోనుకాక తప్పలేదు. కాబట్టి కర్మ, దైవం తక్కువ కావు. ఒక పని ఫలవంతం కావడానికి దైవ పౌరుషాలు రెండూ వుండి తీరాలి. కాబట్టి ఆ రెంటిలో ఎక్కువ-తక్కువలు లేవు. రెండూ సమానమే’. 

భీష్ముడి పలుకులకు సంతోషించిన ధర్మరాజు, సత్కర్మవలన కలిగే ఫలాలు ఎట్లా ఉంటాయని అడిగాడు. సమాధానంగా భీష్ముడు, అలసిపోయిన బాటసారికి అన్నం పెట్టడం కంటే గొప్ప ధర్మం లేదని, దానివల్ల వచ్చే ఫలితాన్ని ఎంచడానికి వీల్లేదని, మంచివారికి దానం చేస్తే ఆయా ఫలితాలు వస్తాయని, వేదం పఠిస్తే సౌఖ్యం, దానికి అర్థం గ్రహిస్తే సుగతి కలుగుతాయని చెప్పాడు. సత్కర్మలకూ, దుష్కర్మలకూ తగిన సమయాలలో వాటికి తగిన ఫలితాలు కలుగుతాయని, లోకానురక్తులకు పాప పుణ్య కర్మలు దుఃఖాన్ని కలిగిస్తాయని, విరక్తులకు ఆ ఫలాలు కలుగవని చెప్పాడు.  

తమ జీవితాలకు ఆధారమైన యజమాని పట్ల ఆశ్రితులు ఎట్లా నడచుకోవాలని ఆ తరువాత ప్రశ్నించాడు ధర్మరాజు. తనను వీడిపోకుండా కాపాడిన యజమాని ఆశ్రితులు రక్షిస్తారని అంటూ భీష్ముడు ఉదాహరణగా ఒక కథ వినిపించాడు. కాశీ దేశంలో ఒక వేటగాడు విషబాణాన్ని ఒక లేడిపై ప్రయోగించగా అది గురితప్పి ఒక ఫలవృక్షాన్ని తాకింది. దాని ప్రభావం వలన చెట్టు ఎండిపోయింది. ఆ చెట్టు తొర్రలో నివసిస్తున్న చిలుక ఎండిపోయిన చెట్టును వీడిపోకుండా ఆ చెట్టు తొర్రలోనే ఉండసాగింది. ఇంద్రుడు మరొక ఫలవృక్షాన్ని ఆశ్రయించుమని దానికి సలహా ఇచ్చాడు. కాని, చిలుక 'చెట్టు పండినపుడు ఉండటం, ఎండినపుడు విడిపోవటం కృతఘ్నత కదా’ అని సమాధానం చెప్పింది. ఇంద్రుడు సంతోషించి చిలుకను వరం కోరుకొనుమన్నాడు. వెంటనే చిలుక 'స్వామి! ఈ చెట్టుకు పూర్వవైభవాన్ని అనుగ్రహించుము' అని కోరింది. ఆ విధంగా ఆశ్రితురాలివలన ఆ చెట్టుకు మేలు జరిగింది. ఇది ఆశ్రిత లక్షణం అని చెప్పాడు భీష్ముడు.

అలాంటప్పుడు, యజమానులు ఆశ్రితులలో ఎవరిని ఎట్లా ఆదరించాలని అడిగాడు ధర్మరాజు.  జవాబుగా భీష్ముడు ఇలా అన్నాడు: ‘రాజు బ్రాహ్మణుడిని గౌరవించి, కొడుకులాగా కాపాడాలి. గురువులాగా గౌరవించాలి. అగ్నిలాగా పూజించాలి. బ్రాహ్మణజాతికి అవమానం చేస్తే పూర్వం చేసిన పుణ్యం నశిస్తుందని ఋగ్వేదం చెప్పింది. అతడిని అవమానిస్తే ఆపద కలుగుతుంది. బ్రాహ్మణులకు చేసే దానం, జపం, హోమం మొదలైనవి వైదిక కర్మలకంటే ఎక్కువని యజుర్వేదం చెప్పింది. ఒక నెల బ్రాహ్మణుడిని పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని సామవేదం చెప్పింది. బ్రాహ్మణుడిని చూసి ఆదరించకుండా వుంటే అంతకంటే ఎక్కువ ఆపద లేదని అధర్వణవేదం చెప్పింది. వ్యాసమహర్షి శల్యుడితో జ్ఞానాలలో ఉత్తమ జ్ఞానమేది అనే అంశాన్ని వివరిస్తూ యజ్ఞమూర్తి విష్ణువు, అతడిని తెలియటమే ఉత్తమ జ్ఞానం అని అన్నాడు. ఆ విష్ణువే శ్రీకృష్ణుడు. ఆశ్రితుడైన శ్రీ కృష్ణుడే ఆశ్రయించదగిన పరమజ్ఞానమని తెలియటం ఉత్తమ జ్ఞానం. అదియే బ్రాహ్మణత్వ సిద్ధికి ఫలం అని చెప్పాడు’.

మహాత్ముడైన గరుత్మంతుడి కథనువినాలని వుందని, దానిని చెప్పుమని తాత భీష్ముడిని ప్రార్థించాడు ధర్మరాజు. భీష్ముడు చెప్పటం ప్రారంభించాడు ఇలా: ‘కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అనేవారు ఇద్దరు భార్యలు. భర్త వలన కద్రువ వేయిమందినీ, వినత ఇద్దరినీ కొడుకులుగా వరాలు పొందారు. తరువాత కద్రువకు వేయి, వినతకు రెండు గుడ్లు కలిగితే వారు వాటిని కుండలలో పెట్టి కాపాడుతున్నారు. 500 సంవత్సరాలు గడచిన తరువాత కద్రువ పెట్టిన గ్రుడ్లనుండి వేయి పాములు పుట్టాయి. వినత గ్రుడ్లు పగలనేలేదు. ఆమె అసూయతో ఒక గ్రుడ్డును పగులగొట్టింది. అందులోనుండి అవయవాలు సరిగ్గా ఏర్పడకుండా, సగం శరీరం గల అరుణుడు పుట్టి, తల్లి తొందరపాటుకు కోపించి, ఆమె కద్రువకు దాసి అయ్యేటట్లు శపించాడు. శాపానికి తల్లి బాధపడుతుంటే కొడుకు చింతించి, తన శాపం సృష్టికర్త సంకల్పం వల్ల వచ్చిందని, భయపడవద్దని ధైర్యం చెప్పాడు.  

‘ఆ తరువాత 500 సంవత్సరాలకు రెండవ అండం నుండి మహా బలవంతుడు, రెక్కలు కలవాడిన గరుత్మంతుడు జన్మించాడు. అతడు పుట్టి, తల్లికి దాస్యవిముక్తి చేస్తాడని అంతకు ముందే పుట్టిన అరుణుడు అనుగ్రహించాడు. గరుత్మంతుడు మహాబలశాలిగా పుట్టి స్వేచ్చగా అంతరిక్షంలో తిరుగుతూ బ్రహ్మ సూచించిన ఆహారాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. గరుత్మంతుడు పుట్టినదాకా తల్లిని కాపాడుకుంటూ వున్న అరుణుడు ఆ తరువాత సూర్యుడిని సేవించటానికి వెళ్ళాడు. ఒకనాడు కద్రువ, వినతలు విహారార్థం సముద్రతీరానికి పోయి అక్కడ ఉచ్చైశ్రవాన్ని (ఇంద్రుడి గుర్రాన్ని) చూశారు. ధవళకాంతులతో వెలుగొందుతున్న ఆ ఇంద్రాశ్వాన్ని చూచి వినత ఆశ్చర్యాన్ని ప్రదర్శించింది. కద్రువ ఆ గుర్రం తోక నల్లగా ఉన్నది కదా! అని అన్నది. వినత దానికి అంగీకరించలేదు.  తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేసేటట్లు పందెం వేసికొన్నారు’.

‘ఆనాడు పతిసేనకు సమయం కావటంతో ఇంటికి వెళ్ళి, మరునాడు ఉదయ వచ్చి సత్యాసత్యాలు నిరూపించుకొనాలని నిశ్చయించుకొన్నారు. ఆ రాత్రి కద్రువ కుటిలబుద్ధితో కొడుకులతో కుతంత్రం చేసింది. కొడుకులను తోకకు వ్రేలాడి అది నల్లగా తోచేట్లు చేయండని అడిగింది. చాలామంది అది అన్యాయమని భావించి తల్లి ఆనతిని తిరస్కరించారు. వారిని జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో హతులయ్యేట్లు కద్రువ నిర్దాక్షిణ్యంగా శపించింది. ఆ శాపానికి భయపడిన కొందరు నాగులు తల్లి మాటను పాటించి ఉచ్చైశ్రవ వాలానికి నల్లగా వ్రేలాడి నిలిచారు. వినత కద్రువకు దాసిగా ఉండవలసి వచ్చింది. సవతిని హీనంగా చూస్తూ దాస్య వృత్తిని చేయించుకొనేది కద్రువ. వినత గరుత్మంతుడివలన తనకు దాస్య విముక్తి కలుగుతుందని ఆశతో కాలం గడపసాగింది’.

‘ఒకనాడు నారదుడివలన ప్రబోధితుడై గరుత్మంతుడు మాతృదాస్యాన్ని తొలగించటానికి పూనుకొని కద్రువ వద్దకు వచ్చి వేడుకొన్నాడు. అమృతాన్ని తెచ్చి మాతృదాస్య విముక్తి చేసికొమ్మని కద్రువ గరుత్మంతుడిని ఆజ్ఞాపించింది. అమృతాన్ని తెస్తానని శపథం చేసి గరుత్మంతుడు వెంటనే కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని కోరుకొన్నాడు. ఇంద్రుడు అమృతాన్ని భద్రంగా రక్షిస్తుంటాడని, జలం మధ్య అగ్ని మండుతూ ఉండగా తీవ్రమైన ఆయుధాలతో భయంకర రాక్షసులు రక్షిస్తుండగా ఇనుప వలలో అమృతం సురక్షితంగా ఉంటుందని, దానిని సాధించటం దేవతలకైనా సాధ్యం కాదని, దానిని సాధించాలంటే గరుత్మంతుడు ఏంచేయాల్నో చెప్పాడు కశ్యప ప్రజాపతి.

‘తూర్పు సముద్రం చెంత ఉండే మహా పర్వతం మీద రెండు మహా గజ కచ్చపాలున్నాయి. ఆ రెండూ పూర్వకాలంలో మధుకైటభులు. పరస్పరం ఘర్షణపడుతుంటాయి. ఆ సందర్భంలో ఆ రెండింటినీ పట్టి భక్షిస్తే కలిగే బలంవలన గరుత్మంతుడు అమృతాన్ని హరించగలడని కశ్యపుడు సూచించాడు. గరుత్మంతుడు తన వాడి గోళ్ళతో ఆ గజ కచ్చపాలను పట్టి ఆకాశానికి ఎగిరి, ఐదు యోజనాల పొడవున ఉన్న ఒక మహావృక్షశాఖ మీద వాలాడు. ఆ బరువుకు ఆ కొమ్మ విరిగింది. ఆ కొమ్మ మీద మహామునులు తపస్సు చేసుకుంటున్నారు. అందువలన ఆ కొమ్మ కిందపడకుండా ముక్కుతో పట్టుకొని గరుత్మంతుడు ఎగిరాడు. మునులు ఆ మహాత్ముడి మహిమను చూచి కొమ్మనుండి దిగిపోయారు. ఆ కొమ్మను దురాచారాలతో అపవిత్రమైన కులింద దేశ సముద్ర ప్రాంతంతో వదలుమని ఆకాశవాణి చెప్పింది.

‘గరుత్మంతు డాపని చేసి, ఒక మహాగిరి శిఖరం మీద విశాల ప్రాంతంలో గజకచ్ఛపాలను భక్షించి మహాబలోపేతుడై అమృతమున్న స్థానానికి చేరాడు. దాని చుట్టూ మండుతున్న అగ్నిని దాటడానికి ఉపాయం కొరకు బ్రహ్మను ఆశ్రయించాడు. కొండంత వెన్నను అగ్నిపై ఉంచుమని పితామహుడు ఉపాయం చెప్పాడు. సప్రయత్నంగా వెన్నను సంపాదించి అగ్నిపై ఉంచి దాని ఉద్దృతి తగ్గటంతో అమృతభాండంపై లంఘించాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినా అది విఫలమైపోవటంతో అతడు విముఖుడయ్యాడు. గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చి కద్రువ ముందు పెట్టి తల్లి దాస్యానికి విముక్తి కలిగించాడు. అమృతం తేవటమే నియమం కాబట్టి తెచ్చి కద్రువకు చూపించి, మరల ఆ అమృతాన్ని ఇంద్రుడికి అప్పగించి గరుత్మంతుడు దేవతల మన్ననలను పొందాడు. పాములపై పగ సాధించాడు’.

ఇలా గరుత్మంతుడి కథ వినిపించిన భీష్ముడు, ఆయన్ను అంతా ప్రశంసించారని, ఇంద్రుడు గరుత్మంతుడిని సాక్షాత్ విష్ణువుగా కీర్తించి, భవిష్యత్కాలంలో యదువంశంలో శ్రీకృష్ణుడుగా అవతరించి లోకకల్యాణం నిర్వహిస్తాడని ప్రకటించాడని చెప్పి, ఆయన కథ విన్న ధర్మరాజుతో ఆ కథ ముక్తికి సోపానమని, గొప్ప ఆనందాన్ని కలిగిస్తుందని అన్నాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆనుశాసనిక పర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)