Showing posts with label వాల్మీకి రామాయణం. Show all posts
Showing posts with label వాల్మీకి రామాయణం. Show all posts

Wednesday, December 12, 2012

దిక్కుతోచని స్థితిలో బ్రాహ్మణులు: వనం జ్వాలా నరసింహారావు


దిక్కుతోచని స్థితిలో బ్రాహ్మణులు


ఒక నాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన బ్రాహ్మణుల పరిస్థితి గతులు రోజు-రోజుకూ క్షీణించి పోతున్నాయి. క్రిస్టియన్ మిషనరీల రాకతో, అంతకు ముందు ముస్లింల పాలనలో, ప్రారంభమైన బ్రాహ్మణ వ్యతిరేకత, బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో బలపడి, స్వతంత్ర భారత దేశంలో పతాక దశకు చేరుకుంది. దశాబ్దం క్రితం మండల కమీషన్ నివేదికతో ఆ వ్యతిరేకత వేళ్లూనుకుని పోయింది. బ్రిటీష్ పాలనలో బ్రాహ్మణులను ఇబ్బందులకు గురిచేయడం యాధృఛ్చికంగా జరిగిందేమీకాదు. భారత దేశ సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణుల పాత్ర ఎంత ప్రాముఖ్యమైందో బ్రిటీష్ వారికి మొదట్లోనే అవగతమైంది. పవిత్రమైన సాంస్కృతిక-సాంప్రదాయక బవబంధాల నేపధ్యంలో దేశ ప్రజలను ఐక్యంగా-సమైక్యంగా మలచడంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రాహ్మణులను కట్టడి చేయాలన్న ఆలోచన ఆంగ్లేయులకు కలగడం సహజం. విభజించి పాలించు అనే సంస్కృతిని అనుసరించే బ్రిటీష్ ప్రభుత్వం, భారత సమాజాన్ని విడదీయాలంటే, మొదలు బ్రాహ్మణులను దెబ్బ తీయాలని భావించింది. అలనాడు ఆ ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే స్వతంత్ర భారత దేశంలో మండల్ కమీషన్ అనుసరించింది. చదువుకున్న బ్రాహ్మణుల మూలాన, భారతదేశంలో తమ గుత్తాధిపత్యానికి ప్రమాదం వుందని భావించింది బ్రిటీష్ ప్రభుత్వం. జాతీయోద్యమంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణులు పాల్గొనడమే కాకుండా నాయకత్వం వహించడం వారి అనుమానాన్ని మరింత ధృఢ పరిచింది.

అనాదిగా వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా, పౌరాణిక-ఐతిహాసిక కథనాల ప్రకారం, చాతుర్వర్ణ వ్యవస్థలో అత్యున్నతమైంది బ్రాహ్మణ్యం. బ్రాహ్మణులంటే బ్రహ్మ జ్ఞానం కలవారని. అదొక సామాజిక వర్గం. హైందవ మతంలో, ఆచారంలో, ఒక భాగం. అగ్ర కులంగా, అగ్ర వర్ణంగా బ్రాహ్మణులకు వైదిక కాలం నుంచి కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంటూ వస్తోంది. భారతీయ మనుస్మృతి ప్రకారం క్షత్రియులు (యోధులు, చట్టం అమలు, పరిపాలకులు), బ్రాహ్మణులు (పండితులు, ఉపాధ్యాయులు, అగ్ని పూజారులు), వైశ్యులు (వ్యవసాయదారులు, వ్యాపారులు, బ్యాంకర్లు), శూద్రులు (సేవకులు) అనే నాలుగు "వర్ణాలు" లేదా తరగతులు ఉన్నాయి. నాలుగు వర్ణాలుగా అనాది నుంచీ విభజన జరిగిన వాటిలో మొదటిది బ్రాహ్మణులు కాగా, మిగిలిన మూడింటిని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులనీ పిలవడం మొదలెట్టారు. అగ్ర కులంగా, అగ్ర వర్ణంగా బ్రాహ్మణులకు దక్కిన ప్రత్యేక హోదా నాటి నుంచీ నేటి దాకా ఒక విధంగా కొనసాగుతూనే వుంది. వాళ్ల గొప్పతనానికి, ఆధిపత్యానికి, ఇప్పటికీ గౌరవం లభిస్తున్నప్పటికీ, అనాదిగా వారికి దక్కిన హక్కుల విషయంలో మాత్రం అడుగడుగునా కోతలు ఎప్పటి నుంచో మొదలైంది. ఇతర కులాల వారు, వర్ణాల వారూ చేయలేని అనేక పనులను, వైదిక కర్మ కాండలను చేయగల సామర్థ్యం కేవలం ఒక్క బ్రాహ్మణులకే నేటికీ వుందనడంలో అతిశయోక్తి లేదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే జ్ఞాన సముపార్జన వాళ్లకే చాలా కాలం వరకూ పరిమితమై పోయింది. కాలానుగుణంగా వస్తున్న మార్పులలో ఇతర వర్ణాల వారు, కులాల వారు, జ్ఞాన సముపార్జన విషయంలో వీరితో పోటీ పడి నెగ్గుకొస్తున్నప్పటికీ, సాంప్రదాయిక వైదిక విద్యా సముపార్జన మాత్రం ఇంకా వీరి అధీనంలోనే చాలా వరకు వుందనాలి. వాళ్లకు సంఘంలో వున్న గౌరవం వల్లనైతేనేమి, సాంప్రదాయకంగా వారికి లభిస్తున్న విద్య వల్ల నైతేనేమి, బ్రాహ్మణులు మత పరమైన వ్యవహారాలనే కాకుండా లౌకిక వ్యవహారాలను కూడా చక్కదిద్దే స్థాయికి ఎదిగారు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటు పడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదాలలో ప్రావీణ్యం కల వారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభిస్తోంది. వారు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వేద-పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై చక్కటి అవగాహన కలిగి ఉంటారు.

బ్రాహ్మణులను "విప్ర" ("ప్రేరణ"), లేదా ""ద్విజ"" ("రెండుసార్లు జన్మించిన") అని కూడా పిలుస్తారు. ఆధునిక వాడుక భాషలో అందరూ "బ్రాహ్మణులు" అయినప్పటికీ, ప్రాంతీయ మత ఆచార సాంప్రదాయ వ్యవహారాలు-వేద పాఠశాలల (శాఖలు) వలన వారు వివిధ ఉప కులాల వారీగా విభజించబడ్డారు. బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా ఆలయం పూజారులు అయినప్పటికీ, అందరు బ్రాహ్మణులు అగ్ని (హోత్ర) పూజారులు కారు. ఇటీవలి కాలంలో కొద్ది మంది బ్రాహ్మణులు మాత్రమే వేద విద్య నేర్చుకోవడం చేస్తున్నారు. మరి కొందరు పౌరోహిత్య విధులు నిర్వర్తిస్తున్నారు. పురాతన భారత సామాజిక నిర్మాణం పతనం కారణంగా, వివిధ వృత్తుల్లో, ఉద్యోగాలలో బ్రాహ్మణులు కూడా తమ అవకాశాలు వెతుక్కుంటున్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు బ్రాహ్మణుల వలసలు కూడా సాగుతున్నాయి.

రామాయణ కాలం నాటి బ్రాహ్మణులు బాహ్యేంద్రియాలను, అంతరేంద్రియాలను, జయించారు. పరులను వంచించాలనే దురాచారానికి దూరంగా వుండేవారు. ఎటువంటి అనాచారానికి లోనుకాకుండా, సత్యాన్నే పలుకుతూ, భగవత్ కథలనే వల్లించి కాలయాపన చేస్తూ, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ, నిర్మల బుద్ధితో వుండేవారు. వేదాల్లో చెప్పిన కర్మ కార్యాలను నెరవేరుస్తూ, అడిగిన వారికి లేదనకుండా శక్తికొలది దాన ధర్మాలు చేస్తుండేవారు. ఆరంగాల (శిక్ష-వ్యాకరణం-ఛందస్సు-నిరుక్తం-జ్యోతిష్యం-కల్పం) వేదాధ్యయనం చేయడం వారికి నిత్య కృత్యం. పెద్ద మనసుతో పుణ్య కార్యాలను చేస్తూ, దేవర్షులతో-మహర్షులతో సమానంగా, సూర్య చంద్రుల తేజస్సుతో-వర్ఛస్సుతో భగవధ్యానం చేస్తూ, సదాచార సంపన్నులై మెలగుతుండేవారు. అలాంటి వారు ఇప్పటికీ పలువురు వున్నారు. కాకపోతే ఆధునిక రాజకీయ, సామాజిక మార్పులకు, ఆర్థిక ఇబ్బందులకు అనుగుణంగా ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. బ్రాహ్మణులను ద్విజాతులని, వేదషడంగ పారగోత్తములని, అహితాగ్నులని, సహస్రదులని, మహామతులని, సత్యవచస్కులని, హిమకర మిత్ర తేజులనిఋషులని ఆంధ్ర వాల్మీకి రామాయణ గ్రంధ కర్త శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు పోల్చారు. వారినే, హృష్ఠ మానసులని, శాస్త్ర చింతన పరాయణులని, స్వస్వతుష్టులని, త్యాగశీలురని, భూరి సంచయులని వర్ణించారు తన రామాయణంలో. తమ వర్ణానికి, ఆశ్రమానికి శాస్త్రోక్తమైన విహిత కర్మ ఏదో, దానినే బ్రాహ్మణులు శ్రద్ధతో ఆచరిస్తూ, విద్యా దానంలో, అధ్యయనంలో ఉత్తములై , వశ్యేంద్రులై, జితమనస్కులై, దానానికి పాత్రులై వుండేవారు.

రాజకీయంగా అధికారం మరో అగ్ర వర్ణం వారైన క్షత్రియుల చేతుల్లో వున్నప్పటికీ, అమాత్యులుగా రాజులకు సలహాలనిచ్చే బాధ్యతను-హక్కును వారే కలిగి వుండడం కూడా అనాదిగా వస్తోంది. ఆంగ్లేయుల పాలనలో, బ్రాహ్మణులు, మేధ పరమైన తమ ఆధిపత్య నాయకత్వాన్ని పదిలంగా కాపాడుకున్నారు. వారి ఆ ఆధిపత్యం, తొలినాళ్లలో, ఆంగ్లేయుల ప్రభుత్వంలో ప్రాముఖ్యత సంతరించుకున్న ఉద్యోగాలలో పనిచేయడంతో ప్రారంభమై, జాతీయోద్యమంలో కీలక నాయకత్వం చేపట్టడం దాకా పోయింది. భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత కూడా వారి ఆధిపత్యం కొనసాగింది చాలా రోజుల వరకు. అధికారంలో వున్న భారత జాతీయ కాంగ్రెస్  పార్టీలో కీలక పదవులు పొందడంలోను, కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషించడంలోను బ్రాహ్మణులే ముందుండే వారు. వీరి ఈ ఎదుగుదలను సహించలేని కొన్ని రాష్ట్రాలలో-ముఖ్యంగా దక్షిణాదిలో, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు మొదలయ్యాయి. కాకపోతే, ఆ ఉద్యమాల ప్రభావం వారి హక్కులను హరించడం వరకే పరిమితమైనాయి తప్ప, పూజారులుగా, అర్చకులుగా, వేద పండితులుగా, కర్మకాండలు నిర్వహించే వారిగా, సంబంధిత కార్యక్రమాల నిర్వాహకులుగా కొనసాగే విషయంలో పెద్ద నష్టం జరగలేదు. వివాహాలలో, అంత్యక్రియలలో, ఇతర పూజా పునస్కారాలలో వారు లేకుండా వ్యవహారం నడవడం కష్టమే ఇప్పటికీ. క్రమేపీ, వీటికే పరిమితమై పోవడంతో, గతంలో మాదిరి రాజకీయంగా కాని, సామాజికంగా కాని, ఆర్థికంగా కాని ఎదుగుదలకు నోచుకోలేక, బీదరికంలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది చాలామందికి. దీనికి తోడు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అనుదినం చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వారిని కడు ఇబ్బందులకు గురి చేయసాగింది.

బ్రిటీష్ ప్రభుత్వ పాలనలో, జాతీయోద్యమంలో కీలక పాత్ర వహించిన బ్రాహ్మణుల నుంచి ఎదురైన సవాళ్లను అధిగమించడానికి, ఒక వైపున సైద్ధాంతికంగా వారిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ, మరో వైపున బ్రాహ్మణేతర అగ్ర కులాల వారిని, బ్రాహ్మణులతో సమానంగా పరిగణించబడాలన్న డిమాండుతో తెర పైకి తేవడం జరిగింది. ఆ తరువాత కాలంలో అదే పద్ధతిని ముస్లింల విషయంలో కూడా అవలంబించింది బ్రిటీష్ ప్రభుత్వం. భారత దేశ చరిత్రను తిరగ రాసే ప్రయత్నంలో, బ్రాహ్మణులను, ఇతర వర్ణాల వారికి వ్యతిరేకులుగా, పీడించే వారిగా, దుర్మార్గులుగా చిత్రించే ప్రయత్నం కూడా చేసింది. భారత సమాజాన్ని అభివృద్ది పరచడంలో బ్రాహ్మణులు వహించిన పాత్రను తక్కువ చేసి చూపడం జరిగింది. ఇదంతా కావాలనే చేసింది నాటి ప్రభుత్వం. ఆ ప్రయత్నాలే ఆ తరువాత స్వతంత్ర భారత దేశంలో కూడా మరో రూపంలో కొనసాగాయనవచ్చు.

సమాజాన్ని ఐక్యంగా, సమైక్యంగా వుంచడానికి బ్రాహ్మణులు అనాదిగా చేసుకుంటూ వస్తున్న అవిరళ కృషిని, మరుగుపర్చి, బ్రాహ్మణ వ్యతిరేకతను ప్రోత్సహించింది నాటి బ్రిటీష్ ప్రభుత్వం. ఆ వ్యతిరేకతే దరిమిలా కొనసాగి, అరవై ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో మరింత బలపడి, చరిత్రలో కనీ-వినీ ఎరుగని రీతిలో, బ్రాహ్మణులను అణగ దొక్కే స్థాయికి తీసుకుపోయింది. వాస్తవానికి శతాబ్దాల కాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణే తరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకునే స్థితికి చేరుకుందిప్పుడు. ఈ మార్పుల వల్ల వర్ణాశ్రమ ధర్మాలకు బదులుగా కులాల ప్రాధాన్యత వచ్చింది. రాజకీయ, సామాజిక, మతపర, సాంస్కృతిక వ్యవహారాలలో కులాల ప్రస్తావన లేకుండా ఏదీ జరగలేని స్థితికి చేరుకున్నాం. బ్రాహ్మణ వ్యతిరేకత చివరకు కులాల వ్యతిరేకతకు దారితీసింది. ఒక కులం వారు, మరో కులాన్ని దూషించే పరిస్థితులొచ్చాయి. అగ్ర కులాలని, వెనుకబడిన కులాలని, దళితులని బేధాలొచ్చాయి. బ్రాహ్మణ ద్వేషం బాగా ప్రబలిపోయింది.

చివరకు జరిగిందేంటి? ఆర్థికంగా బ్రాహ్మణులు బాగా చితికి పోయారు. వ్యవసాయం మీద, భూమి మీద ఆధారపడిన బ్రాహ్మణులు, చట్టాల పుణ్యమా అని ఆ రకమైన ఉపాధిని కోల్పోయారు. వున్న భూమి వ్యవసాయ భూపరిమితి చట్టం కింద ప్రభుత్వానికి పోయింది. రోజు గడవడం కష్టమైంది. ఒక నాటి పౌరోహిత్యం, పూజారి జీవితం, ఆయుర్వేద వైద్యం బ్రాహ్మణుల బ్రతుకు తెరువుగా కొనసాగడం కష్టమై పోయింది. వీటికి ఒకనాడు లభించిన గౌరవ మర్యాదలు కూడా కరవై పోయాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బ్రాహ్మణుల స్థితిగతులపై అధ్యయనం చేసిన ఒక సంస్థ, పలు ఆసక్తికరమైన నిజాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రంలోని దాదాపు పురోహితులందరూ దారిద్ర్యరేఖకు దిగువన వున్నవారేనట. సుమారు 55 శాతం మది బ్రాహ్మణులు జాతీయ సగటు వ్యక్తిగత ఆదాయం కంటే తక్కువగా, దారిద్ర్యరేఖకు దిగువగా జీవనం సాగిస్తున్నారు. అనాదిగా ఆచారంగా వస్తున్న వారి దుస్తుల విషయం కాని, పిలక జుట్టు కాని, ఆచార వ్యవహారాలు కాని, బ్రాహ్మణులను హేళనకు గురి చేస్తున్నాయని అధ్యయనంలో తేలింది. రిజర్వేషన్లు, దిగజారుతున్న ఆర్థిక స్తోమత, వారిని లౌకిక ఉద్యోగాలకు దూరం చేసింది. పాఠశాలలో, కళాశాలలో చదువుకునే బ్రాహ్మణుల సంఖ్య దిన-దినం తగ్గిపోసాగింది. 5-18 సంవత్సరాల వయసున్న బ్రాహ్మణ బాల-బాలికలలో సుమారు 44 శాతం మంది ప్రాధమిక స్థాయిలో, మరో 36 శాతం మంది హయ్యర్ సెకండరీ స్థాయిలో పాఠశాల విద్యకు స్వస్తి చెపుతున్నారు. బ్రాహ్మణే తరుల ఆదాయంతో పోల్చి చూస్తే, నూటికి తొంబై శాతం మంది ఆదాయం చాలా తక్కువ. అనాథ బ్రాహ్మణుల శాతం అఖిల భారత సాధారణ కేటగిరీ సగటు కంటే చాలా ఎక్కువ. ఇంటర్మీడియట్ స్థాయి దాటి చదువు కొనసాగించేవారు దాదాపు లేనట్లే!

కడు బీదరికంతో అల్లల్లాడి పోతున్న పలువురు బ్రాహ్మణులు, పల్లెల నుంచి పట్టణాలకు ఉపాధి కొరకు వలసపోయే పరిస్థితులొచ్చాయి. చేతికందిన పని వెతుక్కుంటున్నారు. మొదట్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడిపోవచ్చని భావించారు. న్యాయవాద వృత్తిలోనో, వైద్య వృత్తిలోనో చేరుదామని కలలు కన్నారు. అదీ అందని ద్రాక్ష పండే ఐంది. రిజర్వేషన్ల మూలాన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు దొరక కుండా పోయాయి. ప్రయివేట్ గా ఏదన్నా చేసుకుందామంటే ఆర్థిక స్థోమత అడ్డొచ్చింది. చివరకు గృహ సంబంధమైన చాకిరీ చేసే వివిధ వృత్తులలో స్థిరపడి పోవాల్సి వచ్చింది. బ్రాహ్మణులలో నిరుద్యోగ శాతం దాదాపు 75 మేరకు చేరుకుంది. ఆ మధ్యన అమెరికా దేశానికి చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్, బ్రాహ్మణులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ఒకనాడు ప్రత్యేక హక్కులు కల వర్గంగా భావించబడిన బ్రాహ్మణులు, రారాజుల కనుసన్నలలో జీవనం సాగించిన బ్రాహ్మణులు, గత కొన్ని దశాబ్దాలుగా, భారత ప్రభుత్వ రిజర్వేషన్ చట్టాల మూలంగా, కనీ వినీ ఎరుగని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ జర్నల్ పేర్కొంది. జాతీయ ఆర్థిక జీవన స్రవంతిలో బ్రాహ్మణుల భాగస్వామ్యం లేకుండా పోతోందని కూడా రాసింది. ఒక నాడు ఇండియన్ సివిల్ సర్వీసులలోను, ఆ తరువాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులలోన, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అధికార స్వామ్యంలోను కీలకమైన స్థానాలలో వున్న బ్రాహ్మణులను, రిజర్వేషన్లు, వాటికి దూరం చేశాయని కూడా జర్నల్ రాసింది. చివరకు రైల్వే కూలీలుగా, రిక్షా కార్మికులుగా, సులభ శౌచాలయ నిర్వాహకులుగా కూడా పని చేస్తున్నారు పలువురు బ్రాహ్మణులు.

ఎప్పుడో, వేల ఏళ్ల క్రితం, అప్పటి బ్రాహ్మణులు ఏదో చేశారన్న నెపంతో, ఈ తరం బ్రాహ్మణులను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యమా? దోపిడీ చేసిన వారు, దోపిడీకి గురైన వారు అంతరించి పోయారు. ఇప్పుడున్నది సమ సమాజం. అందరూ భారత రాజ్యాంగ కింద సమాన హక్కులు కలవారే అంటున్నాం. అలాంటప్పుడు, సమాజంలోని ఒక వర్గం వారిని బ్రాహ్మణులన్న కారణాన చిన్న చూపు చూడడం సమంజసమా? ప్రత్యేక హక్కులు కావాలని వారనడం లేదు. అడగడమూ లేదు. తమను అందరితో సమానంగా చూడమనే అడుగుతున్నారు. ఆర్థికంగా చితికి పోయిన తాము కూడా వెనుకబడిన వర్గాల వారిమే అంటున్నారు. అందరితో పాటు వారినీ సమానంగా చూడడం సమాజం కర్తవ్యం!

Friday, October 1, 2010

అయోధ్య వివాదంపై సెక్యులర్ తీర్పు : వనం జ్వాలా నరసింహారావు

అయోధ్య వివాదంపై సెక్యులర్ తీర్పు
వనం జ్వాలా నరసింహారావు

చరిత్రాత్మక సెక్యులర్‌ తీర్పు
ఇంతటితో ఆగని న్యాయప్రక్రియ
అంతిమ నిర్ణయం కోసం వేచిచూడాల్సిందే
భయాందోళనలను తొలగించిన భారతీయులు
సామరస్యానికి ప్రతీక

శ్రీరాముడి కథకు ప్రామాణికమైన (శ్రీమదాంధ్ర) వాల్మీకి రామాయణం బాలకాండలో అయోధ్యా పుర వర్ణనకు సంబంధించిన సర్గ వుంది. సరయూ నదీతీరంలో వున్న కోసల దేశంలో, మనువు స్వయంగా నిర్మించిన అందమైన-రమ్యమైన, పన్నెండామడల పొడవు-మూడామడల వెడల్పు కలిగి, వంకర టింకర లేని రాజ వీధులతో అలరారుతుండే అయోధ్యా నగరమనే మహా పట్టణం వుండేడట. చక్కగా తీర్చి దిద్దిన వీధి వాకిళ్లతో, తలుపులతో, విశాలమైన అంగడి వీధులతో, అందాలొలికే అయోధ్యా పురం "లక్ష్మీ పురం" నే మరిపించే దిగా వుండేదట. "అయోధ్యా పురి" ని స్వర్గ నగరమైన అమరావతితో పోల్చారు వాల్మీకి మహర్షి. భగవంతుడు అక్కడ పుట్టినందువల్లే, ఆ పుణ్య నగరం "అయోధ్య" గా కీర్తించబడిందని వాల్మీకి భావన. భగవంతుడైన విష్ణువు ఎక్కడుంటాడో, అదే పరమ పదం-ఆయన సేవే మోక్షం-అదే సర్వ కర్మలను ధ్వంసం చేస్తుంది. అయోధ్యలో మహా విష్ణువు పుట్టినందువల్లే మనుష్యులందరూ ముక్తులయ్యారని శివుడు పార్వతికి చెప్పినట్లు రామాయణ గాధలో వుంది. ఆ అయోధ్యలోనే, దశరథుడికి సూర్య కిరణాలలాంటి శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించారు. అందుకే అయోధ్యను "రామ జన్మ భూమి" అని పేరు. అదే అయోధ్యలోని ఒకానొక చారిత్రక వివాదంపై అలహాబాద్ హైకోర్టు సెప్టెంబర్ 30, 2010 న చరిత్రాత్మక "సెక్యులర్" తీర్పిచ్చింది. "ప్రపంచం మొత్తం మీద రామాలయాలున్నప్పటికీ, రామ జన్మ భూమి దేవాలయం మాత్రం ఒక్క (అయోధ్యలో) ప్రదేశంలో మాత్రమే వుంది" అని తీర్పిచ్చిన ముగ్గురు న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ సుధీర్ అగర్వాల్ ఒక సాక్ష్యాధారాన్ని ఉటంకిస్తూ పేర్కొన్నారు.

విశ్వాసాల ప్రాతిపదికగా, నమ్మకాల ప్రాతిపదికగా, చారిత్రాత్మక కట్టడాల నేపధ్యం ప్రాతిపదికగా, చారిత్రిక సాక్ష్యాధారాల ప్రాతిపదికగా, స్వాధీన అధీనం ప్రాతిపదికగా అనేకానేక పరిశోధనల సాక్ష్యాధారాలను ప్రామాణికంగా చేసుకుని వెలువరించిన ధర్మాసనం తీర్పిది. అరవై సంవత్సరాల-ఆ మాటకొస్తే సుమారు నూటాపాతికేళ్ల సుదీర్ఘ అనిశ్చిత స్థితికి ఎవరినీ నొప్పించకుండా... దాదాపు అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా, ఒకరు గెలిచామని పొంగిపోకుండా... వేరొకరు ఓడిపోయామని ఆవేదన చెందకుండా..ఎవరినీ అసంతృప్తికి గురిచేయకుండా ఇచ్చిన తీర్పిది.సంతృప్తికి హద్దులుండవు...అసంతృప్తికి పరిమితులుంటాయి...అందుకే అందరికీ అమోదయోగ్యమైంది. ఎక్కువమంది తగు మోతాదులో సంతృప్తి పడేందుకు అనుకూలమైంది.

ఈ కేసులో ముగ్గురు న్యాయమూర్తులు వేర్వేరుగా తమ తీర్పులు రాశారు. త్రి సభ్య ధర్మాసనంలోని జస్టిస్ ఎస్.యూ.ఖాన్, జస్టిస్ సుధీర్ అగర్వాల్ అనేక అంశాలపై ఏకీభవించారు. ధర్మాసనంలోని సీనియర్ న్యాయమూర్తి డి.వి. శర్మ, వివాదాస్పద స్థలం మొత్తం రామ జన్మభూమిగా ప్రకటించారు. అయితే... స్థలాన్ని మూడుగా విభజించి, ముగ్గురి కి కేటాయించాలన్న ఇద్దరు న్యాయమూర్తుల తీర్పు 'మెజారిటీ'గా నిలిచింది. అదే... హైకోర్టు అంతిమ తీర్పు అయ్యింది. ముగ్గురు కలిసి సుమారు 8000 పేజీలకు పైగా తీర్పు రాశారు. వివాదాస్పద కట్టడం మసీదే అని జస్టిస్ ఖాన్ భావిస్తే, దానికి మసీదు లక్షణాలు లేవని జస్టిస్ శర్మ అభిప్రాయపడ్డారు. మసీదు కోసం మందిరాన్ని కూల్చలేదని జస్టిస్ ఖాన్ పేర్కొనగా... మందిరాన్ని కూల్చి ఆ శిథిలాలపైనే వివాదాస్పద కట్టడం నిర్మించారని జస్టిస్ శర్మ తెలిపారు.

సుదీర్ఘమైన తీర్పులో న్యాయమూర్తులు అనేక ఆధారాలను చూపిస్తూ, ఎన్నో ఉదాహరణలను ఉటంకించారు. ఆ ఉదాహరణలు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృత భాషల్లో కూడా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. వివిధ న్యాయస్థానాలో ఇచ్చిన తీర్పులు, పత్రికల్లో-మాగజైన్లలో వచ్చిన సంపాదకీయాలు, వేదాలు, పురాణాల ఉదాహరణలు తీర్పులో చోటుచేసుకున్నాయి. కార్ల్ మార్క్స్ లాంటి మహనీయుల ప్రస్తావన కూడా వుంటుంది అక్కడక్కడ. జస్టిస్ సుధీర్ అగర్వాల్ తన తీర్పు పాఠాన్ని ఋగ్వేదంలోని సంస్కృత శ్లోకాలతో ఆరంభించారు. "ప్రళయావస్థలో శూన్యం తప్ప ఏమీ లేదు. కేవలం పంచ భూతాలు మాత్రమే వుండేవి. ఏ లోకమూ లేదు. భూమ్యాకాశాలూ లేవు. అలాంటప్పుడు ఎవరు ఎవరిని కదిలించారు? ఎలా కదిలించారు? అంతా అనిశ్చిత స్థితే!" అని మొదలవుతుందా శ్లోకం. అలా కొనసాగిస్తూ, చావు పుట్టుకలు అప్పుడు తెలియదని, సూర్యచంద్రులు వున్నారో-లేరో తెలియనందున రాత్రి-పగలు తేడా లేదని అంటూ, ఆ సమయంలో ఎవరికీ అంతుచిక్కని ఒక పర బ్రహ్మ స్వరూపం, తన శక్తితో సృష్టి ప్రక్రియను ప్రారంభించాడని, ఆ శక్తికి అతీతమైంది మరేదీ లేదని పేర్కొన్నారు. "సృష్టికి పూర్వం అంతా శూన్యమే. అంతా చీకటిమయం. అంతటా జలమయం. సృష్టి ఎలా, ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదు. అన్నీ తెలిసిన పండితులకు, మేధావులకు కూడా తెలిసే అవకాశం లేదు-ఎందుకంటే వారంతా సృష్టి తర్వాతే పుట్టారు కనుక. సృష్టికి కారకుడైన ఆ శక్తే సృష్టిని కొనసాగిస్తున్నదా, లేక, మరెవరన్నా చేస్తున్నారా? అనేదీ అంతుచిక్కని విషయమే. అసలా శక్తికి కూడా తెలుసో, లేదో?" అని ఆరంభించి, అరవై ఏళ్ల వివాదం విషయం ప్రస్తావిస్తారు న్యాయమూర్తి అగర్వాల్. ఇక అక్కడినుంచి స్థాన వర్ణన, వివాదాస్పద నిర్మాణం, కోర్టు దావాల వివరాలలోకి పోతారు.

జస్టిస్ ఎస్ యు ఖాన్ తీర్పు ఆరంభం చేసిన విధానం అది చదివినవారికే తెలుస్తుంది. అవతారిక, ముందుమాటలతో ఆరంభించారాయన. అవతారికలో, పదిహేను వందల గజాల స్థలం ఒకచోట వుందని, అందులో దేవతలు వెళ్లడానికి కూడా జంకుతారని, ఎందుకంటే ఆ జాగా నిండా మందుపాతరలు అమర్చబడి వున్నాయని పేర్కొని ముందుకు సాగుతారు. "ఆ మందుపాతరలను తొలగించే బాధ్యత మాపై పడింది. వాటి జోలికి పోవద్దని ఉత్తములు కొందరు సలహా ఇచ్చారు. మాకు కూడా ఆదరాబాదరాగా వెళ్లి మూర్ఖుల ఆగడానికి బలి కావాలని లేదు. కాకపోతే, సాహసం చేయక తప్పదు-ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదు. అవసరం కలిగినప్పుడు, తప్పనప్పుడు, ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి రిస్క్ తీసుకోకపోవడమే, జీవితంలో మనకెదురయ్యే పెద్ద రిస్క్" అంటారు జస్టిస్ ఖాన్. "ఒకానొక సందర్భంలో మానవుడి ముందు దేవతలు మోకరిల్లాల్సి వచ్చిందట. తనకు లభించిన అరుదైన గౌరవానికి మానవుడు న్యాయం చేకూర్చాల్సిన బాధ్యతుంది. మాకు అలాంటి అవకాశం వచ్చింది. మేము సఫలమయ్యామా? విఫలమయ్యామా? తమ వ్యాజ్యంలో తామే న్యాయమూర్తులు కాలేరు" అని అంటూ, తాను చెప్పబోయే తీర్పుకు ముందుమాట చదువుతారు. తీర్పు పాఠం మధ్యలో, డిసెంబర్ 6, 1992 న మసీదు కూల్చివేత సంఘటనను పేర్కొంటూ, కార్ల్ మార్క్స్ ప్రస్తావన తెచ్చారు. చరిత్ర గమనానికి భాష్యం చెప్పిన మార్క్స్ వాదనను కేవలం ఆర్థిక స్థితిగతులకు మాత్రమే అనుసంధానం చేయడం సబబు కాదంటారు. అయితే ఆయన ప్రవచించిన విధానంలో పాక్షికంగానైనా వాస్తవం లేదని వాదించడం అపాయ కరం (పెరిలియస్) అంటారు. మసీదు కూల్చి వేసిన రోజుల్లో దేశంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఒక పత్రికలో వచ్చిన సంపాదకీయాన్ని ఉటంకిస్తూ పేర్కొన్నారు తన తీర్పులో. అంత క్లిష్ట పరిస్థితుల్లోను ప్రజలంతా ఐకమత్యంతో వుండడాన్ని వివరిస్తూ, "సారీ జహాః సే అచ్చా హిందుస్థాన్ హమారా" అన్న గీతాన్ని ఇనుమడించిన ఉత్సాహంతో ఆలపించా మంటారు. ముఖ్యంగా అందులోని "మజ్హాబ్ నహీ సిఖాతా ఆపస్ మె బైర్ రఖ్నాచ..." అనే చరణాలను గుర్తుచేసుకుంటారు.

జస్టిస్ ధరమ్ వీర్ శర్మ మాత్రం ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే తీర్పు రాశారు.

ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన అలహాబాద్‌ హైకోర్టు ధర్మాసనం వివాదాస్పద ప్రాంతాన్ని మూడు భాగాలుగా చేసి వాటి యాజమాన్య హక్కులను సున్నీ వక్ఫ్క బోర్డుకు, నిర్మోహీ అఖాడాకు, రామ్‌ లాలాకు అప్పగిస్తూ తీర్పిచ్చింది. బాబ్రీ మసీదుకున్న మూడు గుమ్మటాలను 1992లో కరసేవ చేసి కూల్చేసిన తర్వాత, ప్రధాన గుమ్మటం కింద రామ్‌లాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏర్పాటుచేసిన తాత్కాలిక ఆలయం వున్న స్థలాన్నే రామ జన్మభూమిగా కోర్టు నిర్ణయించింది. దీన్నే రామ జన్మభూమి న్యాస్ ట్రస్టుకు కేటాయించింది. ఆ స్థలానికి రెండువైపుల సీతా రసోయి, రామ్ చబూత్రా ఉండేవి. అవి దశాబ్దాల క్రితం నుంచి సాధువుల సంస్థ నిర్మోహి అఖారా అధీనంలో ఉండేవి. ఆ స్థలం తమదేనని ఆఖారా ఎప్పటి నుంచో పోరాడుతోంది. ఈ రెండు స్థలాలను నిర్మోహి అఖారాకు ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. రామ జన్మభూమికి, నిర్మోహి అఖారాకు ఇచ్చిన తర్వాత మిగిలిన స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకి ఇవ్వాలని, ఒకవేళ ఇతరులతో సమానంగా స్థలం లభించకపోతే పక్కనే కేంద్ర ప్రభుత్వం సేకరించిన భూమిలోంచి ఆ భాగాన్ని ఇవ్వాలని కూడా తీర్పిచ్చింది న్యాయస్థానం. ప్రస్తుతం విగ్రహాలు వున్న ప్రదేశంలో ఆలయం నిర్మించడానికి అవరోధాలు తొలగినా, మూడు నెలల వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించి నందువల్ల తదుపరి నిర్ణయం వెలువడేంతవరకు వేచిచూడాల్సిందే.

న్యాయ ప్రక్రియ ఇంతటితో ఆగిపోలేదు. అయినా సెప్టెంబర్ 30 నాటి తీర్పు ప్రాధాన్యత సామాన్యమైందేమీ కాదు. తీర్పు నేపధ్యంలో చోటుచేసుకున్న భయాందోళనలకు, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన భారతీయులు, తీర్పు తదనంతరం చోటు లేకుండా చేశారు. వి ద్వేషపు సెగలు తమను తాకబోవని నిరూపించింది. యావద్భారత దేశంలోని ప్రజానీకం నుంచి వ్యక్తమయిన ప్రతిస్పందన గమనించిన ఎవరికైనా, అరవై సంవత్సరాల అయోధ్య వివాదానికి పరిష్కారం సుసాధ్యమనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించాయి. ఏదేమైనా సంక్లిష్టమైన వివాదంపై న్యాయస్థానం సమయోచిత తీర్పు చెప్పింది. విశాల భారతావనిలో ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్యలు కూడా సత్ఫలితాలను ఇచ్చాయి.