Friday, March 23, 2012
ఉప సమరం నేర్పిన గుణపాఠాలు: వనం జ్వాలా నరసింహారావు
Sunday, January 1, 2012
బొత్స కల 2012 లో ఫలించేనా?: వనం జ్వాలా నరసింహారావు
Thursday, December 29, 2011
భయపెట్టిన కేంద్ర పాలన: వనం జ్వాలా నరసింహారావు
Thursday, September 8, 2011
అంతం కాదిది ఆరంభమే(నా) !: వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (09-09-2011)
ఆలోచింపచేస్తున్న సీబీఐ అరెస్టులు, కొందరికి వందల వేల రెట్ల ఆదాయం ఎలా సాధ్యం?, శిక్షల దాకా వ్యవహారం కొనసాగుతుందా?, ప్రజల్లో కొనసాగుతూనే ఉన్న అపోహలు, విచారణలకు రాజకీయ కారణాలేనా!, నివారణ కంటె నిరోధం ముఖ్యం....ఎడిటర్
స్వతంత్ర భారత దేశంలో, విభజించి-పాలించు అనే ఆంగ్లేయుల పరిపాలనా వారసత్వాన్ని, పోకడలో అవినీతి మయమైన కొన్ని ప్రపంచ దేశాల విధానాన్ని, అక్షరాలా పాటిస్తూ వస్తున్న ఈ దేశ రాజకీయ నాయకుల ఆటలకు మధ్య-మధ్య అంతరాయం కలిగించి, ఆట కట్టించడానికి కారణమైన ప్రజాస్వామ్య వ్యవస్థలను - ఆ వ్యవస్థల పుణ్యమా అని నెల కొన్న సంస్థలను - అందులో (అందరూ కాకపోయినా) నిబద్ధతతో పని చేస్తున్న అధికారులను మనసార అభినందించాలి. వాస్తవానికి ఆ వ్యవస్థలు-సంస్థలు-వ్యక్తులు నిరంతరాయంగా కనుక తమ బాధ్యతలను పరిపూర్ణమైన నిష్ఠతో నిర్వర్తిస్తున్నట్లయితే (అధికారంలో వున్న రాజకీయనాయకులు అడ్డుపడకుండా వుంటే!) అవినీతిపరుల అరెస్టులతో మాత్రమే ఆగకుండా-వారి గుండెల్లో అనుక్షణం గుబులు పుట్టే పరిస్థితులను కలిగించ గలిగే వారు. ఒక వైపు పౌర సమాజం నాయకుడు అన్నా హజారే-ఆయన బృందం గత కొన్ని నెలలుగా అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పడం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, తరతమ భేదం లేకుండా, కాంగ్రెస్-కాంగ్రేసేతర-బీజేపి-బీజేపేతర అవినీతి సామ్రాట్టులను అంచలంచలుగా అదుపులోకి తీసుకుని విచారించడం, సామాజిక-రాజకీయ-ఆర్థిక విశ్లేషకులను ఆలోచింపచేస్తున్నాయి. ఏదేమైనా, స్వతంత్రం వచ్చి అరవై నాలుగు సంవత్సరాలు నిండిన సందర్భంలో తలఎత్తుతున్న ఈ పరిణామాలను సగటు భారతీయ పౌరుడు స్వాగతిస్తుంటే, ఈ దేశ పరిణామాలను ఆసక్తితో యావత్ ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. భారత దేశ ప్రజాస్వామ్యం ఇంత గట్టిగా పని చేస్తుందా? అని ఆశ్చర్యపోతున్నారు వారంతా.
ఆ సంస్థకు ఎవరిష్టమొచ్చిన పేర్లు వారు పెట్టారు. కొందరేమో "కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్" అన్నారు. అలా అన్నవారు సహితం జగన్మోహన్ రెడ్డిపై అ సంస్థ విచారణను మనసార స్వాగతించారు. మరికొందరేమో అదే సంస్థను "కాంగ్రెస్ బచావో ఇన్ స్టిట్యూట్" అని సాక్షాత్తు చట్టసభలోనే నామకరణం చేశారు. అలా చేసి వారం రోజులు తిరక్కుండానే, ఎవరిని "బచావ్" చేయడానికి జరిగిందో కాని, ఆమె అనుంగు అనుచరుడు గాలి జనార్థన్ రెడ్డి కటకటాల పాలయ్యాడు. మధ్యలో పేర్లు పెట్టడానికి తామూ తీసి పోమన్న తరహాలో కొందరు మహా నాయకులు, తమ పార్టీని దూషించిన ప్రత్యర్థి పార్టీకి "భారతీయ జగన్ పార్టీ" అని, "బచావో జగన్ పాలసీ" అని మారు పేర్లు తగిలించారు. ఇవేవీ తమకు పట్టదన్న ధోరణిలో, గుట్టుచప్పుడు కాకుండా, తమపని తాము చేసుకుపోతున్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు - ప్రస్తుతం వారికి ఆంధ్ర-కర్నాటకలలో నాయకత్వం వహిస్తున్న జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ఆ అధికారి మన తెలుగువాడు కావడం, ఆరోపణలొచ్చిన వ్యక్తి ఎంత మహా-మహానుభావుడైనా, ఏ స్థాయిలో అండ-దండలున్నా, కాంగ్రెస్ వారైనా-ప్రతిపక్ష నాయకులైనా, తన కర్తవ్యాన్ని తాను నిర్వహించుకుని పోవడం, ఆబాల గోపాలం అభినందించాల్సిన-ఆనందించాల్సిన విషయం.
అవినీతి సామ్రాట్టులను అదుపులో తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని (వున్నదున్నట్లు చెప్పాలంటే... న్యాయ స్థానాలను-సిబిఐని) అభినందించాల్నా? లేక ఇంతకాలం వారి అవినీతితో ప్రజాధనం కొల్లగొడుతుంటే, ప్రేక్షక పాత్ర వహించినందుకు-సీబీఐ తన కర్తవ్యాన్ని నెరవేర్చకుండా పరోక్షంగానన్నా అడ్డుకున్నందుకు అదే ప్రభుత్వాన్ని అభిశసించాల్నా? ఆలశ్యంగానైనా, మరింత దుర్మార్గం జరగనివ్వకుండా ఆపుదల చేసినందుకు, ప్రస్తుతానికి మెచ్చుకోవడమే మంచిదే మో! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో-సరిహద్దు కర్నాటక రాష్ట్రంలో, ఇంచుమించు ఏక కాలంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలకు లింకు వుండే అవకాశాలు చాలానే వున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలు వాస్తవమైతే-కనీసం వాస్తవానికి చేరువలో వుంటే (వుండే అవకాశాలే ఎక్కువ అనక తప్పదు), దశాబ్దం కింద వారి సొంతం అనుకున్న ఆస్తిపాస్తులకు, నేటి వారి ఆస్తులకు, నక్కకు-నాగ లోకానికి వున్న తేడా వుంది. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి కాని-ఒక వ్యాపార సంస్థ కాని ఆస్తులు సమకూర్చుకోరాదన్న నిబంధన కాని, ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెంపొందించుకోరాదన్న చట్టం కాని లేదన్నది ఒపుక్కోవాల్సిందే. వచ్చిన చిక్కల్లా, ఆ ఆదాయ వనరులు ఎలా సమకూరాయన్న విషయంలో అవలంబించిన మార్గాలే. రూపాయి ఆదాయం-పది రూపాయల ఆస్తులు-పాతిక రూపాయల ఖర్చులున్న వారికి, ఏడాది-రెండేళ్లు-మూడేళ్లు తిరక్కుండానే, వందల-వేల రెట్ల ఆదాయం పెరగడం-దానికి రెట్టింపు ఆస్తులు సమకూరడం, ఖర్చులే మో తగ్గడం ఎలా సంభవమనే దే అంతుచిక్కని ప్రశ్న. అదే జరిగింది-జరుగుతున్నది వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి విషయంలోను, వారికి అత్యంత సన్నిహితుడు-అవునన్నా, కాదన్నా వ్యాపార భాగస్వామి గాలి జనార్థన్ రెడ్డి వ్యవహారంలో.

బహిర్గతమైన ఆదాయ-వ్యయ వనరుల లెక్కల ప్రకారం, వీరిరురివురి ఆర్థిక పరిస్థితి దశాబ్దం క్రితం ఎంతనేది జగమెరిగిన సత్యం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాక మునుపు, ఐన కొత్తలో జగన్మోహన్ రెడ్డి ఆదాయమెంత? ఆదాయపు పన్నెంత కట్టారు? పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఎన్ని ఆస్తులు అఫిడవిట్ లో చూపించారు? అన్న సంగతి బహిరంగ రహస్యమే కదా? అలానే సుష్మా స్వరాజ్ కర్నాటక నుంచి లోక్ సభకు పోటీ చేసిన రోజుల్లో-అంతకు కొన్నాళ్ల, కొన్నేళ్ళ క్రితం గాలి జనార్థన రెడ్డి ఆస్తులెన్నో మీడియాలో వస్తున్నాయి కదా. వారిరువురూ న్యాయసమ్మతంగా-ధర్మ సమ్మతంగా వ్యాపారాలు చేసి తమ ఆస్తులను పెంచుకున్నారా? లేక రాజకీయాధికారాన్ని (తమది-తమ ఆప్తులది) ఆసరాగా చేసుకుని ఆస్తులను కూడగట్టుకునారా? మైక్రో సాఫ్ట్ బిల్ గేట్స్, గూగుల్-ఒరాకిల్-ఫేస్ బుక్ సంస్థల అధినేతలు కూడా అతి తక్కువ సమయంలోనే ఆస్తులు సమకూర్చుకున్నప్పటికీ వారిపై అవినీతి ఆరోపణలెందుకు రావడం లేదు? బహుశా వారేమో ఫక్తు వ్యాపార సరళిలో మిలియనీర్లు-బిలియనీర్లు అయ్యుండాలి...వీరేమో... అందినంత దండుకో! అన్న చందాన కోటీశ్వరులై వుండాలి. ఐనా, ఇప్పుడిప్పుడే అలా మాట్లాడక పోవడం మంచిదే మో! ఎలాగూ, విచారణ జరుగుతోంది కదా! ఎటొచ్చీ..చిక్కల్లా, విచారణ చేసినంత కాలం చేసి, ఆ తర్వాత, సరైన సాక్ష్యాధారాలు లేవని వదులు తే ఏం కావాలన్నదే సామాన్యుడి మదిలో మెదిలే అంతులేని వింత ప్రశ్న. అరెస్టులు ఆరంభం కావాలే కాని అంతం కారాదు.
న్యాయస్థానాల ఆదేశాల మేరకే, సిబిఐ దర్యాప్తు ప్రారంభమై, త్వరితగతిన సాగుతున్నప్పటికీ, ప్రజల్లో అపోహలు ఇంకా కొనసాగుతూనే వుండడానికి కారణం...ఇన్నాళ్లూ-ఇన్నాళ్లూ, ఇంత అవినీతి జరుగుతున్నా, చేస్తున్న వారినెవరినీ నిలుపుదల చేయలేకపోవడం వెనుకనున్నబలీయమైన కారణాలేంటి? అని. ఏ అధికారులను-అనధికారులనైతే సిబిఐ ప్రస్తుతం విచారణ చేస్తున్నదో, వారితో సహా, చేయని ఇతర అధికారులకు-అనధికారులకు ఈ విచారణ ఒక కనువిప్పు కావాలంటే ఏం చేయాలనేది కూడా ఆలోచన జరగాలి. ఇప్పుడు జరుగుతున్న విచారణ కాని, సోదాలు కాని, రాజకీయ కారణాల వల్ల కానేకాదు అన్న నమ్మకం కూడా ప్రజల్లో కలగాలి. కేవలం విచారణతో ఆగకుండా శిక్షల దాకా వ్యవహారం (తప్పు జరిగిందని తేలితే-తేల్చగలిగితే) కొనసాగాలి. అదెంతవరకు వీలుంటుందోకాని, గత రెండు-మూడు రోజులుగా ఉన్నత స్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు గమనిస్తుంటే, అవినీతికి పాల్పడినట్లు భావించి విచారణకు గురవుతున్న వారు తమను వేధించడానికి రాజకీయ కారణాలే తప్ప మరేమీకాదన్న అభిప్రాయం బలంగా కలిగించడానికి దేశ రాజధానిలో కాలికి బలపం కట్టుకుని ఎక్కని గడప-దిగని గడప లేకుండా బిజీ-బిజీగా గడుపుతున్నారట.
చివరకు ఈ పరిణామాలు ఎలాంటి రాజకీయ సమీకరణాలకు దారితీస్తా యో కాని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏ కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు వచ్చాడో, ఆ పార్టీ సారధ్యంలోని "యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్" పంచన చేరడానికి తన సంసిద్ధతను బహిరంగంగానే-అదీ పేరుపొందిన జాతీయ టెలివిజన్ ఛానల్ ద్వారా తెలియచేయడము విశేషం. తన సచ్ఛీలతను తెలియచేయడానికి, తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడయిన గాలి జనార్దన్రెడ్డి అరెస్టు విషయంలో సహితం మౌనంగా వుండి పోయారు. మరో వైపు, తనను లోక్ సభలో వెనకేసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మ స్వరాజ్ కు కూడా కృతజ్ఞతలు తెలియ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం, జగన్మోహన్ రెడ్డి కంటే కూడా గాలి జనార్దనరెడ్డి ఆమెకు సన్నిహితుడంటారు. తాను జగన్మోహన్ రెడ్డికి లోక్ సభలో మద్దతిచ్చినా తన సన్నిహితుడి విషయంలో ఆయన ఏమీ తెలియనట్లు మాట్లాడడం వెనుక గూడార్థం ఏమై వుంటుందో?
భారత దేశంలో అపారమైన కోటానుకోట్ల రూపాయల విలువ చేసే సంపద వ్యవసాయ పంటల రూపేణా నెలల తరబడి ఎటువంటి బధ్రత లేకుండా బహిరంగంగానే అందరి కళ్ల ముందర పడేసి వుంటుంది. ఐనా, అందులో కొంచెం కూడా దొంగల పాలవదు-ఎప్పుడో ఒకప్పుడు తప్ప. గాలి లాంటి ఘనులే కనుక అనాదిగా మన వ్యవస్థలో వుండి వున్నట్లయితే, పరిస్థితి వేరే విధంగా వుండేదేమో! ఇక ఇప్పడు అలా కాదు. భూగర్భంలో అనాదిగా నిక్షిప్తమై వున్న అపార సంపదను కూడా కొల్లగొట్టే మహానుభావులు పుట్టుకొచ్చారు. అలాంటివారికి ఆ నిక్షిప్తమైన సంపదను వెలికి తీసేందుకు లైసెన్సులను ఇచ్చిన "ప్రభుత్వ అధికారులను" ప్రధమ ముద్దాయిలుగా పేర్కొనాలి. వారిని అలా చేయమని వారిని ప్రోత్సహించిన అనధికారులను (మంత్రి వర్గ సభ్యులను) రెండవ ముద్దాయిలుగా పేర్కొనాలి. అప్పుడే ఇలాంటివి భవిష్యత్ లో జరగకుండా వుండే ఆస్కారముంటుంది. ఏ విధంగానైతే ఎమ్మార్ ప్రాపర్టీస్ లో స్థలం, విల్లాలు కొనుక్కున్న వారిని విచారణ చేయడానికి నిర్ణయం జరిగిందో, అదే విధంగా, పెద్దా-చిన్నా అన్న భేదం లేకుండా గాలి గనుల విషయంలో కాని, జగన్మోహన్ కంపెనీలలో పెట్టుబడుల వ్యవహారంలో కాని విచారణ జరగాలి.
వ్యాధి నివారణ కంటే, నిరోధం ఎంత ముఖ్యమో, అవినీతి జరిగిన తర్వాత చర్యలకంటే, ముందస్తుగానే నిరోధించగల వ్యవస్థలుండాలి. కావాల్సింది "పోస్ట్ ఆడిట్" కాదు.."ప్రీ ఆడిట్". లక్ష్మీ నారాయణ లాంటి అధికారులు లక్షలలో-వేలల్లో కాకపోయినా, వందల సంఖ్యలో నన్నా మన దేశంలో వుండే వుంటారు. భారీ కుంభకోణం జరిగేందుకు ఆస్కారముండే వ్యాపారాలకు లైసెన్సులు మంజూరు చేసే ముందర, ఇలాంటి అధికారులతో, లైసెన్సు కోరిన వారి పూర్వా-పరాలు, రాజకీయ సంబంధాల గురించి సమగ్ర దర్యాప్తు చేయించాలి. అంతటితో ఆగకుండా, ఆ లైసెన్సుకు సంబంధించిన వారి వ్యాపారం సాగేంతవరకూ, ఏడాదికో-ఆర్నెల్లకో వారు చట్ట పరిధిలో వ్యవహరిస్తున్నారో, లేదో, విచారణ జరగాలి. ఈ రెండూ రహస్యంగానన్నా-బహిరంగానైనా జరిగి తీరాల్సిందే. అప్పటికీ దొరకకుండా తప్పించుకుంటే, ఇక ఎలాగూ పోస్ట్ ఆడిట్ వుండనే వుంటుంది. కనీసం కొంతకాలమైనా, అవినీతి కొంతలో కొంతన్నా అరికట్టడానికి ఈ చర్యలు అమల్లోకి రావాలి. లోక్ సభలో చర్చకు రానున్న లోక్ పాల్ బిల్లులో ఈ అంశాలకూ ప్రాధాన్యతుండాలి. లేకపోతే, గాలి లాంటి వారు తమకున్న పలుకుబడితో అప్రతిహతంగా అవినీతి మార్గాలలో పయనిస్తూనే వుంటారు.
Friday, June 10, 2011
జనరిక్ ఔషధాలతో అందుబాటులో ఆరోగ్యం: వనం జ్వాలా నరసింహారావు
జనరిక్ ఔషధాలతో అందుబాటులో ఆరోగ్యం
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (10-06-2011)
అటకెక్కనున్న రాజీవ్ ఆరోగ్య శ్రీ?, నాలుగోవంతు వ్యయంతోనే జనరిక్ మందులు, ప్రభుత్వ రంగానికి అవకాశాలు, అవాంఛనీయ పోటీలో మందుల మార్కెట్, ఆసుపత్రులలో ఉచిత ఔషధాలకు అవకాశం….
ఆరోగ్య వైద్య రంగంలో సంస్కరణలంటే, ఇల్లు పీకి పందిరి వేయడమనే ఆలోచన తప్ప మరోటి కాదనే రీతిలో వ్యవహరిస్తోంది ప్రభుత్వం. ఆరోగ్య-వైద్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, కడప ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికే అన్నట్లు, దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమై, అశేష జనాదరణ పొందిన రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలను అటకెక్కించే దిశగా చర్యలు చేపట్టారు. కాకపోతే తద్వారా రాబోయే అపవాదునుంచి బయట పడేందుకు, మరో ఆచరణ సాధ్యం కాని ప్రణాళికను సిద్ధం చేసుకుని, దానికి ముఖ్య మంత్రి ఆమోద ముద్ర కూడా వేయించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మందు చీటీలు ఇవ్వడం కాకుండా, అన్ని రకాల మందులను ఉచితంగా అక్కడికక్కడే అందచేయడం దాని లక్ష్యం. ఇక ముందు, రోగులు మందులను బయట మార్కెట్ కు వెళ్ళి కొనుక్కోవాల్సిన పనిలేదు. ఇలా ఉచితంగా ఇవ్వాల్సిన మందులను, ఆసుపత్రులే కంపెనీల ద్వారా కొనుగోలు చేసి, రోగులకు ఇవ్వనున్నదన్న మాట. దీని కొరకు మందుల కొనుగోలు బడ్జెట్ ను రు. 400 కోట్లకు పెంచారు. ఇంతవరకు బాగానే వుంది కాని, నాలుగు వందల కోట్ల రూపాయలను వ్యయం చేసి, "బ్రాండెడ్" మందులను కొనుగోలు చేసే బదులు, దానిలో నాలుగో వంతు వ్యయం చేస్తే, "జనరిక్" మందులను కొనగలమని, తద్వారా, ప్రభుత్వానికి ఖర్చు తగ్గించవచ్చని ఆలోచన చేసి వుండాల్సింది. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా "జనరిక్" మందుల అమ్మకం చేసే పథకం అమలు చేయగలిగితే, ఆసుపత్రులలో మందులు నిల్వ వున్నా లేకపోయినా, సరసమైన ధరలకు అవి లభ్యమయ్యే సదుపాయం కలిగించినట్లవుతుంది. బీద-సాద, ఆర్థికంగా వెసులుబాటు లేనివారికి ఇదెంతో ప్రయోజనకారి అవుతుంది.
భారతదేశంలోని అలోపతి ఔషధ ఉత్పత్తుల పరిశ్రమ, ప్రపంచంలోని ఐదు పెద్ద పరిశ్రమలలో ఒకటిగా చెప్పుకుంటారు. ఆ పరిశ్రమలో వున్న సంస్థలన్నీ వారు ఉత్పత్తిచేసే మందులకు, ఆకర్షణీయమైన పేర్లను పెట్టి, మార్కెటింగ్ విధానాలను చేపట్టి, అమ్మకాల ద్వారా లాభాలు చేసుకుంటారు. ఒకే రకమైన రసాయన మిశ్రమానికి సంబంధించి, అనేక పేర్లతో మందులు మార్కెట్లో వుండడం, ఒకే రకమైన శరీర రుగ్మతకు, ఒక్కో డాక్టర్, ఒక్కో మందు పేరును సూచించడం, రోగులు కూడా మందును "బ్రాండెడ్" పేరుతోనే (ఉదాహరణకు క్రోసిన్, కాంబీ ఫ్లాం) గా గుర్తుంచుకోవడం ఆనవాయితీ. అలాగే ధరల నిర్ణయం కూడా ఉత్పత్తిదారుల ఇష్టా ఇష్టాల మీదే ఆధారపడి వుండేది. భారత దేశంలో అనుసరిస్తున్న ఆ విధానం, అలా ఉత్పత్తి చేయగల సామర్థ్యం ప్రపంచ ఔషధ ఉత్పత్తుల పారిశ్రామిక వేత్తల దృష్టిని ఆకర్షించింది. విదేశీ బహుళజాతి సంస్థలు భారత దేశంలో ఉత్పత్తులు చేసి లాభాలను ఆర్జించడం మొదలెట్టారు. 1979 లో ప్రభుత్వం ఔషధ విధానం రూపొందించింది. ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వు (డిపిసిఓ) గా పిలువబడే ఆ విధాన నిర్ణయం దరిమిలా, వివిధ రకాల మందుల ధరలను ఒక పద్ధతి ప్రకారం నియంత్రించింది ప్రభుత్వం. ఆ విధానానికి అడపాదడపా మార్పులు-చేర్పులు కూడా చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇక్కడో విషయం తెలుసుకోవాలి. అలోపతి ఔషధ విషయకమైన మందుల పరిధిలోని కీలక అంశాలపై అధ్యయనం చేసి, విచారణ జరిపి, దిద్దుబాటు చర్యలపై నివేదిక సమర్పించడానికి, 1974 సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం, రాజ్యసభ సభ్యుడు జైసుఖ్ లాల్ హాతి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. హాతీ కమిటీలోని అరవై మంది నిపుణులు, శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి రూపొందించిన సమగ్రమైన నివేదిక వాస్తవానికి వెలుగు చూడలేదనే అనాలి.
ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ ప్రజా వైద్యుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, సీపీఎం పక్షాన రాజ్యసభ సభ్యుడుగా వున్న రోజుల్లో, పదిమందితో కూడిన పార్లమెంటరీ హెల్త్ కన్సల్టేటివ్ కమిటీలో ఆరేళ్ల పాటు సభ్యుడుగా చేసింది ప్రభుత్వం. ఆ కమిటీ సభ్యుడుగా, డాక్టర్ రాధాకృష్ణమూర్తి, దేవెగౌడ, గుజ్రాల్, వాజ్పేయి ప్రభుత్వాలలో ఐదుగురు ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులతో సంప్రదింపులు చేసే అవకాశం కలిగింది.
ఎమర్జెన్సీ అమల్లో వున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నివేదికను తొక్కి పట్టింది ప్రభుత్వం. బడా పారిశ్రామిక వేత్తలకు లాభాలను ఆర్జించి పెట్టే పద్దతికి స్వస్తి చెప్పే రీతిలో నివేదిక వుందని వారంతా పసి గట్టారు. భారతీయ పద్దతులను అనుసరించి మందులను ఉత్పత్తి చేసే ఇతర పారిశ్రామిక వేత్తలకు సిఫార్సుల వల్ల మేలే జరుగుతుంది. హాతీ కమిటీ నివేదిక అమలవుతే, ఔషధాల ఉత్పత్తిలో నాణ్యత మెరుగయ్యే అవకాశాలతో పాటు, ధరల నియంత్రణకు మార్గం సుగమం అవుతుంది. ప్రయివేట్ రంగం వెనక్కు తగ్గి, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఎక్కువ అవకాశాలొచ్చే వీలు కూడా కలిగేది. భారతదేశ ప్రజల అవసరాలకు తగ్గట్లు ఔషధ ఉత్పత్తులు జరిగుండేవి. పటిష్టమైన ఔషధ నాణ్యతా పద్దతులను పాటించాలని, "బ్రాండ్ నేమ్" మిషతో రోగులను లూటీ చేసే విధానానికి స్వస్తి పలకాలని నివేదికలో సిఫార్సు చేసింది కమిటీ. ఎమర్జెన్సీ ఎత్తి వేసిన తర్వాత, అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం కూడా పారిశ్రామిక వేత్తల పక్షమే వహించి, నివేదికను కనుమరుగు చేసింది. నివేదిక ప్రతులను కొందరు స్వప్రయోజన పరులు తగుల బెట్టిన సందర్భాలు కూడా వున్నాయి. బహుశా ఆ నివేదిక ప్రతులు, ఒకటి-రెండే మైనా మిగిలి వుంటే, ఏదైనా మెడికల్ గ్రంథాలయంలో వుండొచ్చు.
హాతీ కమిటీ నివేదికలోని ఒక ప్రాముఖ్యతాంశం, ఆసుపత్రులలో వుంచాల్సిన "అత్యవసర ఔషధాల జాబితా" లో ఏమేమి వుండాలనేది. అదే విధంగా కెమికల్ ఫార్ములాతో కాకుండా, జనరిక్-బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి మందుల విడుదలకు సంబంధించిన అంశం. మార్కెట్లో ఇరవై ఐదు వేల రకాల మందులుండేవి. ఒక్క "బీ-కాంప్లెక్స్" ఫార్ములా మందు, వంద పేర్లతో లభ్యమవుతుంది. అలానే యాస్ప్రిన్, పారాసిటమాల్, యాంటీ బయాటిక్, ఇతర మందులు. ఏ విధమైన ఉపయోగం లేని మందులనేకం మార్కెట్లో వుంటాయి. టానికులు, మల్టీ విటమిన్ల సంగతి చెప్పాల్సిన పనే లేదు. అవాంఛనీయ పోటీలో మందుల మార్కెట్ ముందుంటుంది. అలాంటి లోపాలను అధిగమించే పలు చర్యలను కమిటీ సిఫార్సు చేసింది. ప్రాధమిక ఆరోగ్య రంగానికి సుమారు వందకు పైగా, ఆ పైన మరి కొన్ని అదనంగా, మొత్తం మీద వందల సంఖ్యలో మందులు సరిపోగా, మార్కెట్లో వేల సంఖ్యలో ఎందుకుండాలని కూడా నివేదిక ప్రశ్నించింది.
ఎప్పుడైతే ఆ నివేదికను-నివేదికలోని ముఖ్యమైన అంశాలను బుట్ట దాఖలా చేశారో, "ఢిల్లీ సైన్స్ ఫోరం", "మెడికో ఫ్రెండ్స్ సర్కిల్", ఫిజీషియన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్", సౌత్ ఇంటర్నెట్" లాంటి సంస్థలు, నివేదిక అమలుకు ఆందోళన చేయసాగాయి. ఆ సంస్థలన్నీ, నివేదిక సిఫార్సులు సమాజానికి అత్యంత లాభదాయకమైన వని విశ్వసించాయి. సీపీఎం వైద్య విభాగం, నెల్లూరుకు చెందిన డాక్టర్ జె. శేషా రెడ్డి, రాధాకృష్ణమూర్తి ప్రభృతులు ఆందోళనలో అగ్ర భాగాన నిలిచారు. పశ్చిమ బెంగాల్ సీపీఎం శాఖను సంప్రదించి వాళ్లనూ ఆందోళనలో దింపారు. నెల్లూరులో ఒక సమావేశాన్ని నిర్వహించి, పలువురు వైద్యులను ఆహ్వానించారు. వచ్చినవారిలో, పశ్చిమ బెంగాల్ నుంచి-కేరళ నుంచి ఇద్దరు డాక్టర్లు, ఒక అడ్వకేట్-డాక్టర్ బాంబే నుంచి వున్నారు. బాంబేకు చెందిన "శ్రీమతి డాక్టర్ అశోక్ ధవే అడ్వకేట్" ఎంబిబిఎస్ చేసి, ఎల్ ఎల్ డి పట్టా పుచ్చుకున్న అరుదైన వ్యక్తి.
రెండు రోజుల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ పథకాన్ని రూపొందించుకున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి, పలు రాష్ట్రాలలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి మరికొందరు వీరితో కలిశారు. కర్నూలుకు చెందిన డాక్టర్ బ్రహ్మానందరెడ్డి, నెల్లూరుకు చెందిన డాక్టర్ విజయకుమార్, విజయవాడకు చెందిన డాక్టర్ ఎం రామారావు, గుంటూరుకు చెందిన అధ్యాపకుడు లక్ష్మారెడ్డి లాంటివారిని కలుపుకుని, మరో మారు 1986 లో సమావేశమైన డాక్టర్ రాధాకృష్ణమూర్తి ప్రభృతులు, బుట్ట దాఖలు చేసిన హాతీ కమిటీ నివేదికను వెలుగులోకి తెచ్చే ఉద్యమ్నాన్ని ఉదృతం చేయాలని నిర్ణయించారు. వ్యక్తిగతంగా డాక్టర్ రాధాకృష్ణమూర్తి, పలు ప్రదేశాలలో తిరిగి, డాక్టర్లను ఉద్యమంలోకి దింపేందుకు ప్రోత్సహించి, వారి మద్దతు కూడగట్టుకున్నారు. ఆ సంవత్సరాంతానికి కలకత్తాలో అఖిల భారత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఆందోళనను తీసుకెళ్లారు.
కలకత్తాలో జరిగిన రెండు రోజుల సమావేశానికి ఎంపిక చేసిన సుమారు వంద మంది డాక్టర్లు హాజరయ్యారు. సీపీఎం నాయకుడు స్వర్గీయ ఇఎంఎస్ నంబూద్రిపాద్, పశ్చిమ బెంగాల్ శాఖ కార్యదర్శి చౌదరి కూడా వున్నారు. సమావేశంలో పార్టీ సహాయం-సలహా అడిగారు డాక్టర్లు. హాతీ కమిటీ నివేదికలోని "ఔషధ విధానం" తో పాటు, వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ లకు సంబంధించిన పలు అంశాలపై కూడా ఆందోళన చేపట్టమని పార్టీ సూచించింది. అయితే, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ను కలుపుకుని పోతే మంచిదని, నంబూద్రిపాద్ అభిప్రాయ పడ్డారు. వీలైనంత మందిని ఉద్యమంలో భాగస్వామ్యులను చేసి, వైద్య-ఆరోగ్య వ్యవస్థను ప్రక్షాళన చేసే చర్యలు కూడా చేపట్టి తే మంచిదని సూచించారాయన. సీపీఎం అనుబంధ సంస్థగా వుండే కన్నా, విస్తృత సంస్థగా, అందరినీ కలుపుకొని పోతే మంచిదన్న నిర్ణయం తీసుకున్నారు. అలా డాక్టర్ల విశాల వేదిక మొదలైంది. డాక్టర్ రాధాకృష్ణమూర్తి తన వంతుగా ఖమ్మం జిల్లాలో బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. జిల్లాలో జరిగిన ప్రతి ఐఎంఏ సమావేశంలో వైద్య-ఆరోగ్య వ్యవస్థను ప్రక్షాళనకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తి చర్చకు పెట్టేవారు. అయితే, ఐఎంఏ సభ్యుల్లో అతి కొద్దిమంది మాత్రమే ప్రజాస్వామ్య భావాలున్న వారని, స్వలాభం చూసుకునేవారు ఎక్కువ మందని, నైతిక విలువలకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా పలువురు వ్యతిరేకంగా మాట్లాడేవారని గ్రహించారు డాక్టర్ రాధాకృష్ణమూర్తి.
హాతీ కమిటీ ముఖ్యాంశాలు సజీవంగా వున్నప్పటికీ, బుట్ట దాఖలా మాత్రం అయ్యాయి. నివేదికలోని అంశాలు కనీసం కొంతవరకైనా వెలుగు చూసినట్లైతే బాగుండేదేమో. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, ఉచితంగా ఆసుపత్రులలో మందుల పంపిణీ చేయాలన్న నిర్ణయాన్ని, హాతీ కమిటీ సూచనలకు అనుగుణంగా చేసే ప్రయత్నం చేస్తే, అటు ప్రభుత్వానికీ లాభం-ఇటు ప్రజలకూ మేలు. ఆరోగ్య వైద్య శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి వైద్య పట్టా పుచ్చుకున్న వ్యక్తులై నందువల్ల ఈ విషయాలపై దృష్టి సారిస్తే మంచిదే మో! ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా మందులు పంపిణీ చేయాలన్న పథకం పది కాలాల పాటు అమలు కావాలంటే, ప్రభుత్వ నిధులు అనవసరంగా దుర్వినియోగం కాకుండా వుండాలంటే, జైసుఖ్ లాల్ హాతి కమిటీ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా అమలు చేయాలి.
Thursday, May 26, 2011
అయోమయం-అస్తవ్యస్తం-గందరగోళం:వనం జ్వాలా నరసింహారావు
అక్కడ పునరంకితం... ఇక్కడ దినదిన గండం
(సూర్య దిన పత్రిక:27-05-2011)
వనం జ్వాలా నరసింహారావు
కేంద్రంలో తొలి మలి విడతలు కలిపి ఏడేళ్లు; రాష్ట్రంలో సీఎంలు మారినా కాంగ్రెస్ దే పెత్తనం; అక్కడా, ఇక్కడా అధినేత్రే కీలకం; సమస్యల పరిష్కారంలో వైఫల్యమా, సాఫల్యమా?; అవినీతి విషయంలో ప్రజల ఆందోళన; ఇక్కడ పోగ్రెస్ రిపోర్టులూ లేవు, పునరంకితాలూ లేవు!; అంతా అయోమయం, అస్తవ్యస్తం, గందరగోళం!
అక్కడ, కేంద్రంలో మన్మోహన్ సింగ్ సారధ్యంలోని "యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలైన్స్" (యుపిఎ) తొలి-మలి విడతలు కలిపి అధికారంలో కొచ్చి ఏడేళ్లు, ఒక్క మలివిడత అధికారంలో కొచ్చి రెండేళ్లు పూర్తయ్యాయి. ఇక ఇక్కడ, ఆంధ్ర ప్రదేశ్ లో, పదేళ్ల విరామం అనంతరం, స్వర్గీయ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2004 ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, తొలి విడత పూర్తి కాలం-మలివిడత నాలుగు నెలలు ఆయనే ముఖ్య మంత్రిగా, ఆయన మరణానంతరం రోశయ్య కొన్నాళ్లు-ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత ముఖ్య మంత్రిగా, అధికారంలో కొచ్చి కూడా ఏడేళ్లు పూర్తయ్యాయి. కేంద్రంలో వున్నది, విభిన్న విధానాలను పాటించే "పలు భాగస్వామ్య రాజకీయ పక్షాల సంకీర్ణ ప్రభుత్వం" కాగా, రాష్ట్రంలో వున్నది విరుద్ధ భావాల-వ్యక్తిగత ఎజెండాల-ఎత్తులకు పైఎత్తులు వేయగల సామర్థ్యం గల "ఏక పార్టీకి (కాంగ్రెస్) చెందిన సంకీర్ణ ప్రభుత్వం". అక్కడ అధికార బాధ్యతలు వహించేది ప్రధాన మంత్రి మన్మోహన్ సింగే ఐనా, అధికారం చెలాయించేది యుపిఎ చైర్ పర్సన్-అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధి. ఇక్కడ, రాజశేఖర రెడ్డి వున్న రోజుల్లో కొద్ది మోతాదులో, రోశయ్య గారి హయాంలో తగు మోతాదులో, ప్రస్తుతం పూర్తి మోతాదులో, ఎవరు ముఖ్యమంత్రైనా అధికారం పరోక్షంగా నడిపించేది, సోనియా నాయకత్వంలోని అధిష్ఠానం. ఈ నేపధ్యంలో, ఎన్నికల వాగ్దానాలైనా, కనీస ఉమ్మడి ప్రణాళికలో పేర్కొన బడిన అంశమైనా, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనైనా, అమలైనా, పాలనా యంత్రాంగంపై పట్టు సాధించడమైనా, అవినీతిని అరికట్టడమైనా-ప్రోత్సహించడమైనా, పదవుల పందేరమైనా, పార్టీని-పభుత్వాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడమైనా, "భావ సారూప్యం-పరస్పర విరోధ భావం" ప్రాతిపదికగా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తులపైనే ఆధార పడివుంటుంది. అదే జరుగుతున్నదిప్పుడు.
కేంద్ర ప్రభుత్వ సాఫల్యాలపై ప్రధాని మన్మోహన్ ఏటేటా విడుదల చేసే "ప్రోగ్రెస్ రిపోర్టు" ఈ ఏడాది కూడా విడుదలైంది. తాము రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది పాలనలోని విజయాలను గత ఏడాది విడుదల చేసిన రిపోర్టులో ఆయన ప్రస్తావించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడంలో తమ సర్కారు విజయం సాధించిందని అప్పట్లో ప్రధాని తెలిపారు. గడిచిన సంవత్సరం 8.5 శాతం వార్షిక వృద్ధిరేటు సాధిస్తామన్న ధీమాను ఆయన అప్పట్లో వ్యక్తం చేశారు. ఇరుగు, పొరుగు దేశాలతో సత్సంబంధాలను పటిష్టం చేసుకోవడంలో ముందంజలో ఉన్నామన్నారు. నక్సల్స్ సమస్య తమ ముందున్న ప్రధాన అడ్డంకిగా ఆయన తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అయన గత ఏడాది చెప్పిన వాటిలో చేసినవి కొన్ని, చేయలేనివి మరి కొన్ని వున్నాయి. ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందే దిశగా, రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలోను, కేంద్ర మంత్రి వర్గంలోని కొందరు మంత్రుల సఫలతలను-విఫలతలను విశ్లేషించి చూపుతూ, యుపిఎ-2, మరో మారు ప్రోగ్రెస్ రిపోర్టు కార్డు విడుదల చేసింది. అవినీతి, ద్రవ్యోల్బణం, సంకీర్ణ కష్టాలు, ఆహార ధాన్యాల ధరల పెరుగుదల ప్రభుత్వాన్ని బాధిస్తున్న అంశాల్లో ముఖ్యమైనవిగా నివేదికలో పొందుపరచడం గమనిస్తే, వాటిని ఎదుర్కోవడంలో నాయకత్వం కొంత మేరకు విఫలమైన ట్లుగా భావించాల్సి వస్తుంది. ప్రధాని మన్మోహనే అయినప్పటికీ, ఆయన విడుదల చేసే రిపోర్టును మొదట యుపిఎ రధ సారధి, కాంగ్రెస్ అధినాయకి సోనియా గాంధీకి చూపి మరీ బహిర్గతం చేశారు ప్రధాని. ప్రభుత్వ విజయాలను గురించి విపులంగా పేర్కొన్నారు కూడా.
రిపోర్టులో ఏముందనేదాని కంటే, తాము చేసిందే దో చెప్పే ప్రయత్నమై తే చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక రాష్ట్రం విషయానికొస్తే, రాజశేఖర రెడ్డి హయాంలో, ఏటేటా, ఆయన ముఖ్య మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజున, "పునరంకిత సభలు" జరిగేవి. ఆ సందర్భంలో, తమ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో చేసినా వాగ్దానాల అమలులో, ఎలా వడి-వడిగా అడుగులు వేసుకుంటూ పోయింది సవివరంగా-సభా ముఖంగా, అఖిల భారత స్థాయి-రాష్ట్ర స్థాయి అతిరధ-మహారధ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి ప్రజలకు తెలియ చేసేవారు. ఆయన చేపట్టిన జలయజ్ఞం, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం లాంటివి ఎలా అమలవుతున్నాయో సగర్వంగా, బహిరంగసభ జరిపి చెప్పేవారు. ఆ పథకాల అమలులో జరుగుతున్నాయని భావించిన లోటుపాటులను కూడా ప్రజలు మరిచిపోయేలా, ఆయన వివరించేవారు. రెండో మారు ఆయన గెలిచి, ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలలోపే విమాన ప్రమాదంలో మరణించడంతో, ఆ మరుసటి ఏడాది పునరంకిత సభ జరగనట్లే. రెండేళ్ల క్రితం రాజశేఖర రెడ్డి నాయకత్వంలో, మే నెల 20, 2009 న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైందన్న సంగతే ఎవరికీ గుర్తున్న దాఖలాలు లేవు. పునరంకిత సభ దేవుడెరుగు! రాజశేఖర రెడ్డి రెండో విడత ప్రమాణ స్వీకారం చేసిన తేదీ కూడా ఆయనకు అత్యంత సన్నిహితులుగా చెప్పుకుంటూన్న వారికి సహితం గుర్తుకు రాలేదు. అంతెందుకు...ఆయన వారసులమని చెప్పుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు కూడా గుర్తున్నట్లు లేదు. ప్రభుత్వం పునరంకిత సభలు జరపక పోయినా "రాజశేఖర రెడ్డి రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని" పడగొట్టడం ఇష్ఠంలేని వారన్నా కనీసం మరో విధంగా నన్నా పునరంకితమై తే బాగుండేదేమో!
అసలు అక్కడా-ఇక్కడా (అటు కేంద్రం లోను, ఇటు రాష్ట్రం లోను) ఏం జరుగుతోందని నిశితంగా పరిశీలిస్తే, ఏదన్నా కనీసం జరుగుతోందా? అన్న అనుమానం వేస్తోంది. మన్మోహన్ సింగ్ నీతికి-నిజాయితీకి మారు పెరే కావచ్చు. ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడో-బాధ్యుడో కావచ్చు. సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడే కావచ్చు. మంత్రి మండలి సభ్యులందరి మన్ననలను పొందుతుండవచ్చు. దేశ-విదేశాల్లో తనకూ-భారత దేశానికీ పేరు-ప్రతిష్టలు తెచ్చి పెడుతున్నాడన్న గుర్తింపు పొందివుండవచ్చు. ఇవేవీ, సామాన్యులకు పట్టదు. అందునా మధ్య తరగతి ప్రజానీకానికి అసలే అవసరం లేదు. వాళ్ల దృష్టంతా, అతి తక్కువ సమస్యలతో, ఎలా జీవన యానం సాగించాలన్న అంశంపైనే. ఆ అంశానికి సరాసరి సంబంధమున్న, ప్రభుత్వంలోని అన్ని స్థాయిలలోని అధికార-అనధికార వ్యక్తుల్లో పేరుకుని-కూరుకుపోయిన అవినీతి అనే బ్రహ్మ పదార్థం గురించి మన్మోహన్ ఏం చేశాడన్నది వారి ముందున్న ప్రశ్న. రాజా టెలికాం స్కాం, సురేష్ కల్మాడి కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో పాల్పడిన అంతులేని అవినీతి లాంటి అంశాలు సామాన్యుడి మదిని అహర్నిశలు తొలి చేస్తుంటాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, నిత్యావసర వస్తువుల దరలు ధనవంతుడికి కూడా అందుబాటులోకి లేనంత ఘోరంగా పెరిగి పోతుంటే, తమ దగ్గర పన్నుల రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తున్న పైకం బాహాటంగా అవినీతి చక్రవర్తులు స్వాహా చేస్తుంటే, నిశ్శబ్దంగా-నిబ్బరంగా గమనించడం తప్ప చేయగలిగిందేమీ లేదన్న భావన ప్రజల్లో కలగడాన్ని, మన్మోహన్ రిపోర్టులో ఏ విధంగా వివరించబడిందో అర్థం కావడం లేదు. అహర్నిశలు భాగస్వామ్య పక్షాలను ఎలా మంచి చేసుకోవాలన్న తపన, మంచి చేసుకోక పోతే ప్రభుత్వం మనుగడ వుండదేమోనన్న ఆందోళనతో కాలం గడుపుతున్నదేమో కేంద్ర ప్రభుత్వం అన్న భావన పలువురి లో కలగడంలో తప్పులేదే మో!
ఇక మన రాష్ట్రం విషయానికొస్తే అంతా అయోమయం, అస్తవ్యస్తం, గందరగోళం! రాజశేఖర రెడ్డి అకాల మరణం రాష్ట్ర రాజకీయాలలో-అందునా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో అంతుచిక్కని శూన్యాన్ని తెచ్చి పెట్టింది. ఆయన బ్రతికున్నంత కాలం ఆయనతో ఎట్లా వేగాలో-ఆయన్నెట్లా అదుపుచేయాలా అని ఆలోచించిన కాంగ్రెస్ అఖిల భారత స్థాయి అధినాయకత్వం, ఆయన మరణానంతరం, ఆయనకు ధీటైన వారసులెవరో తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయింది. ఆయన ప్రారంభించిన పథకాలకు నిధులెలా సమకూర్చాలో అని మధన పడిన అలనాటి ఆర్థిక మంత్రి రోశయ్య, ముఖ్య మంత్రయ్యాక, ఆ పథకాలను ఎలా ఊడగొట్టాలో అన్న ఆలోచనలో పడిపోయారు. ఆయన తర్వాత ముఖ్య మంత్రిగా అధిష్టానం ఆశీస్సులతో బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుల మద్దతు కూడగట్టడంలోనే సమయమంతా గడిచిపోతుంది. మరో వైపు అధికార యత్రాంగం ఎవరికివారే యమునాతీరే అన్న చందాన వ్యవహరిస్తున్నారు. ఏ పథకం అమలు చేస్తే ప్రజలకు మేలు కలుగుతుందో, ఏ పథకం అమలు చేస్తే ప్రజాభిమానాన్ని చూరగొనొచ్చో, అన్న విషయం మంత్రులకు తెలియదు. తెలియ చేయాల్సిన అధికారులకు ఆ సంగతే పట్టదు. పట్టించుకున్న ఒకరిద్దరు అధికారులకు సముచితమైన గుర్తింపు వుండదు. అందుకే ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్టులు లేవు. పునరంకితం ప్రస్తావనే లేదు.
ఇవన్నీ ఇలా వుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్యం ప్రత్యేక రాష్ట్ర సాధన తప్ప మరేదీ కానందున, అన్ని పార్టీల వారికి చెందిన వారిలో వీలున్నంత మందిని, తమ వైపు ఆకర్షించుకునే కార్యక్రమంలో వారు నిమగ్నమై వున్నారు. సోనియా గాంధీని ఎదుర్కుని కడపలో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా విజయ భేరీకి కాచుక్కూచున్నారు. తమ పార్టీలో వున్న వారు తెలంగాణ పేరు మీదో-మరే కారణానో పార్టీ వదిలి పోకుండా జాగ్రత్త పడుతూ, రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలలో ఆధిక్యాన్ని పెంచుకునే పనిలో టీడీపి వుంది. అధికారం ఎట్టి పరిస్థితుల్లోను కోల్ఫొకుండా, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరకుండా వేయాల్సి నన్ని ఎత్తులు వేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బిజీగా వుంది. ఇక బీజేపీ, కమ్యూనిస్టులు, ఇతరులు ఇవేవీ తమకు పట్టనట్లు, వారి సహజ ధోరణిలో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నంలో వారున్నారు.
ప్రజలకు మాత్రం అంతా అయోమయం-అంతా అస్తవ్యస్తం-అంతా గందరగోళం గా కనపడుతున్నవి!

