Showing posts with label చిరంజీవి. Show all posts
Showing posts with label చిరంజీవి. Show all posts

Tuesday, January 24, 2012

ఈ మంత్రివర్గ విస్తరణ...సి. ఎం. కు ప్లస్సా, మైనస్సా?: వనం జ్వాలా నరసింహారావు




సూర్య దినపత్రిక (19-01-2012)
వనం జ్వాలా నరసింహారావు
(ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి; మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రికి స్వేచ్ఛ అవసరం; మధ్యేమార్గం పార్టీకి శ్రేయస్కరం కాదు; పద్ధతి మార్చుకోవాల్సిన అధిష్టానం; అప్పుడే రాష్ట్రంలో పార్టీకి గౌరవం....ఎడిటర్)


సమిష్టి బాధ్యతారాహిత్యానికి, సమన్వయ లోపానికి నిలువెత్తు నిదర్శనమైన రాష్ట్ర మంత్రి మండలిలో మరో ఇద్దరు-ముగ్గురు చేరవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. కష్ట కాలంలో కాంగ్రెస్ శాసనసభాపక్షానికి అండగా నిలిచిన నాటి ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరు చిరంజీవి అనుయాయులు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారని, వారీపాటికే బంధు మిత్రులకు తమ ప్రమాణ స్వీకారానికి రమ్మంటూ ఆహ్వానాలు కూడా పంపారని, మీడియాలో కబుర్లొచ్చాయి. సర్వసాధారణంగా మంత్రివర్గ విస్తరణ గురించి చెప్పాల్సిన ముఖ్యమంత్రికి బదులుగా, ఆ విషయాన్ని, తాజా కాంగ్రెస్ నాయకుడు-మాజీ ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవి ప్రకటించడం కొంత ఎబ్బెట్టుగా వున్నప్పటికీ, వార్త బయటకు పొక్కడానికి మాత్రం ఆయనదే బాధ్యత అనాలి. అసలాయనకు వారిద్దరిమీదనే ఎందుకంత ప్రేమ అన్నది అంతుచిక్కని విషయం. ఇక వారిద్దరిలో కనీసం ఒక్కరికి ఎట్టి పరిస్థితుల్లోను, మంత్రిపదవి దక్కకుండా చేయాలని, కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవి మాట నెగ్గేలా చూసేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగితే, ఆయనకు వ్యతిరేకంగా, కొందరు మంత్రివర్గ సభ్యులతో సహా కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, పలు ఎన్నికల బహిరంగ సభలలో అశేష జనాన్ని ఆకర్షించి, ముఖ్యమంత్రి కావాలని కలలు కన్న చిరంజీవికి ఆ కోరిక నెరవేరలేదు. పోనీ పార్టీని బతికించుకుని, కనీసం వచ్చే ఎన్నికల నాటికన్నా, మళ్ళీ తన కోరిక నెరవేర్చుకునే ప్రయత్నంలో వున్నాడా అంటే, అదీ చేయలేకపోయాడు. నెత్తిమీద కుంపటి దించుకుని, పార్టీని-పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేశారు. తనకు కేంద్రంలో మంత్రి పదవి వస్తుందన్న ఆశలు పెంచుకుంటున్నాడు. అదిప్పట్లో నెరవేరే అవకాశం లేనప్పుడు, తన అనుయాయులకు రాష్ట్ర మంత్రి మండలిలో స్థానం కలిపించమని అడిగే బదులు, తానే రాష్ట్ర మంత్రివర్గంలో చేరకూడదా? రాష్ట్ర మంత్రి పదవి తన స్థాయికి తగదనుకుంటున్నాడా? లేక, ఏకంగా కేంద్రమంత్రిగా నో, అవకాశం చిక్కితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నో కావాలని కలలు కంటున్నాడా? మించిపోయిందేమీ లేదు! తాను చేరదలుచ్కున్నట్లు ముఖ్యమంత్రికి, గులాంనబీ ఆజాద్‌కు సంకేతం ఇచ్చి, అటు కిరణ్‌కుమార్‌కు, ఇటు బొత్స సత్యనారాయణకు కొంత ఊరట కలిగించడం మంచిది. కడప కాంగ్రెస్ నాయకులకూ మంచిది కూడా!


ఏదేమైనా, కాంగ్రెస్ రాజకీయం, ఎక్కడ జరగాలో అక్కడికే మళ్లీ చేరింది. ఆ మాటకొస్తే, కాంగ్రెస్ రాజకీయాలెప్పుడూ ఢిల్లీలోనే జరుగుతాయి. మధ్య-మధ్య రాష్ట్ర రాజధానికి, అప్పుడప్పుడూ జిల్లాలకూ చేరుకుంటాయి. మంత్రివర్గ విస్తరణ విషయంలో సంప్రదింపులకు ముఖ్యమంత్రి ఢిల్లీకి చేరుకునే లోపునే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్లడం గులాంనబీ ఆజాద్‌తో మాటామంతీ జరపడం జరిగిపోయాయి. చెరో మాట అనడంతో, సీను సోనియాగాంధీ దగ్గరకు మారింది ప్రస్తుతానికి. ఫలానావారికి మంత్రివర్గంలో చోటు దక్కనుందన్న వార్తలూ గుప్పుమంటున్నాయి. ఇంతకూ విస్తరణా? పునర్వ్యవస్థీకరణా? చిరంజీవి చెప్పినట్లు కేవలం ఆ ఇద్దరికి మాత్రమే చోటు కలిగించడమా? ముఖ్యమంత్రికి-సహచర మంత్రివర్గ సభ్యులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఒకరిద్దరికి మాత్రమే ఉద్వాసనా? శాఖల్లో సమూలంగా మార్పులు-చేర్పులా? అనే విషయమన్నా ఈ సారి తేలుతుందేమో చూడాలి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ రాబోయే ఉపఎన్నికలలో, అలానే 2014 ఎన్నికలలో పరువు-ప్రతిష్టలతో బయట పడాలంటే, కనీసం గౌరవప్రదమైన ప్రతిపక్షంగానన్నా ఎన్నికవాలంటే, అధిష్టానం తన పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం వుంది. ఏ అధిష్టానమైతే, కనీసం ఒక్కసారన్నా మంత్రిపదవి అనుభవం పొందని కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చో పెట్టిందో, అదే అధిష్టానం, ఆయనా పీఠం మీద పటిష్టంగా వుండడానికి చర్యలు తీసుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తరువాత అనేక సమస్యలను ఢీ కొన్నప్పటికీ, తడబడుతూ అడుగులు వేసినప్పటికీ, గత ఏడాది కాలంలో, కష్టాల కడలిని అధిగమించు తూ, ఆత్మ విశ్వాసంతో ముందుకు పోతున్నారనే ది వాస్తవం. అలాంటప్పుడు, ఆయనను బలపర్చాల్సిన అధిష్టానం, సమాంతరంగా దానికి విరుద్ధంగా ఏ చర్యను ప్రత్యక్షంగానో-పరోక్షంగానో ప్రోత్సహిస్తే నష్టం పార్టీకే! అందుకే, తప్పో-ఒప్పో, మంత్రివర్గ విస్తరణలో ఆయనకు పూర్తిగా కాకపోయినా, పరిమిత మోతాదులోనన్నా స్వేచ్ఛ ఇవ్వాలి. అధిష్టానం అభీష్టం మేరకు, ఢిల్లీ నాయకులు చెప్పిన ఒకరిద్దరికి మంత్రి మండలిలో స్థానం కలిగించమని కిరణ్ కుమార్ రెడ్డిని ఆదేశించడంతో సహా, ఆయన కావాలనుకున్న "టీం" ను ఏర్పాటు చేసుకునే వీలు కలిగించాలి. ఆయన తొలగించాలనుకుంటున్న మంత్రులను, అధిష్టానం దృష్టిలో ఏదో ఒక ప్రత్యేకమైన కారణం వుంటే తప్ప, అలా చేసే వీలు కిరణ్ కుమార్ రెడ్డికి కలిగించాలి. అవసరమైతే, అల నాడు అంజయ్య విషయంలో ఇందిరాగాంధీ అవలంబించిన విధానాన్నే, నేడు సోనియాగాంధీ కూడా పాటించి తీరాలి. హైదరాబాద్ రావాలి. వచ్చి ఆయనకు మద్దతుగా తానూ-తన అధిష్టానం నూటికి-నూరు పాళ్లు వుందన్న సంకేతాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న వారిని తొలగించనన్నా తొలగించాలి-లేదా-తప్పు ముఖ్యమంత్రి దే అని భావిస్తే తదనుగుణంగా చర్యలన్నా చేపట్టాలి. మధ్యేమార్గం మంచిదికాదు. పార్టీకి శ్రేయస్కరం కానే కాదు.


ఈ నేపధ్యంలో, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలతో సహా, చిన్నా-చితకా పార్టీలు కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతిరోజూ, ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు, ఏదో ఒక పేరుమీద యాత్ర చేపట్టడమో, పనిగట్టుకుని ప్రత్యర్థుల మీద దాడికి దిగడమో, లేదా ఎదురుదాడి చేయడమో, అదేమీ కాకపోతే టెలివిజన్ ఛానళ్ల పుణ్యమా అని చర్చలలో పాల్గొన్నప్పుడు అందివచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా, తమ-తమ వ్యూహాలను కాసింత బహిర్గతం చేయడమో గమనించాల్సిన విషయం. గతకొన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు సమన్వయ కమిటీ ఏర్పాటు; తెలుగుదేశం పార్టీకి చెందిన రైతు పోరుబాట; జగన్ రైతు దీక్షా శిబిరం; తెరాస-ఐకాస సమైక్యతా వాదుల యాత్రలను అడ్డుకునే ప్రయత్నాలు; భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పాగా వేయడం అనే విషయాలు ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. అధిష్టానం నియమించిన సమన్వయ కమిటీ సాధించిదేమిటో కాని, కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కలహాలు-కుమ్ములాటలు మాత్రం బహిర్గతం అయ్యాయి. కిరణ్‍కూ, బొత్సకూ; ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి విభేదాలున్న ట్లు స్పష్టమైనాయి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కొందరు గులాంనబీ ఆజాద్‌కు ఫిర్యాదు చేస్తే, బొత్సను అడ్డుకునే ప్రక్రియకు కిరణ్ శ్రీకారం చుట్టారనుకుంటున్నారు. కొందరు మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా, విడతలవారీగా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలను (సూర్య దినపత్రిక) ప్రముఖంగా ప్రచురించారు. వారికి కొందరు ఎంపీల మద్దతుకూడా వుందని అంటున్నారు. ఇదంతా గమనించిన ఆజాద్‌కు ఆగ్రహం కూడా కలిగిందట. ఈ వ్యవహారాలపై కాంగ్రెస్ ఎంత సీరియస్‌గా వుంటుందో కాని, ప్రతిపక్షాలు మాత్రం ఒక కన్నేసి వుంచాయి. కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు సడలిందని ప్రచారం చేయసాగాయి. ప్రజా సమస్యలను ఆయన అసలే పట్టించుకోవడం లేదని ఆరోపించాయి. ముఖ్యంగా రైతు సమస్యలను ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజం ఎత్తాయి. చివరకు మీడియా కూడా ప్రతిపక్షాలతో చేతులు కలిపాయి.


ఇందులో భాగంగా, ఒకానొక పాపులర్ టెలివిజన్ ఛానల్, రైతు ఆత్మహత్యలపై-సమస్యలపై, అన్ని రాజకీయ పార్టీల-రాజకీయేతర ప్రముఖుల-పాత్రికేయుల-సామాజిక కార్యకర్తల సమక్షంలో, వారి భాగస్వామ్యంతో ఒక ఆసక్తికరమైన గోష్టిని నిర్వహించిందిటీవల. గోష్టిలో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఎన్నో ఆసక్తికరమైన, ఆలోచనలను రేకెత్తించే అంశాలను తెరమీదకి తెచ్చారు. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో గ్రామీణ-వ్యవసాయదారుల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సంపాదకుడు పాలగుమ్మి సాయినాథ్ బహిర్గతం చేసిన విషయాలను ప్రభుత్వం పట్టించుకుని తీరాల్సిందే. వెలుగులోకి వస్తున్న రైతు ఆత్మహత్యలను, సాధారణ ఆత్మహత్యలుగా వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రతి మూడు గంటలకు దేశవ్యాప్తంగా సంభవిస్తున్న చోటుచేసుకుంటున్న ఆరు రైతు అత్మ హత్యలలో, ఒకటి ఆంధ్ర ప్రదేశ్‌కు చెందినదే అని ఆయన అన్నారు. మద్దతు ధర లేక, సాంప్రదాయ పద్దతులకు స్వస్తి పలికిన నేపధ్యంలో, పూర్తిగా రసాయనిక ఎరువులపై ఆధారపడడం వల్ల కూడా రైతు ఆత్మహత్యలు సంభవిస్తున్నట్లు వక్తలు పేర్కొన్నారు. మరి ఈ నేపధ్యంలో, చంద్రబాబు నాయుడు చేపట్టిన రైతు పోరుబాట కాని, జగన్ రైతు దీక్షా శిబిరం కార్యక్రమం కాని, ఎంతవరకు రైతు సమస్యలను ప్రతిబింబించాయో ప్రశ్నార్థకమే!
          
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నానని భావనలో వున్న కిరణ్ కుమార్ రెడ్డికి, అందుకే, అధిష్టానం మరింత మద్దతు ఇవ్వాలి. రైతు సమస్యలతో అనేక ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పార్టీపరంగా ఆయనకు వ్యతిరేకతను తగ్గించాలి. కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలంటే ఈ విషయాలపై అధిష్టానం దృష్టి సారించాలి.


(ఈ ఆర్టికల్ 18-01-2012, మంత్రివర్గ విస్తరణ జరుగవచ్చన్న ఊహాగానాలకు పూర్వం రాసింది)

Thursday, September 1, 2011

వైఎస్‌ ఫోటో పుస్తకం - కథ కమామీషు ఎందుకీ అనాయాస ప్రయాస ?: వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (2-09-2011)

మనది వారసత్వ రాజకీయ భారతం, పార్టీ ఏర్పాటుకు అందరూ మీన మేషాలు లెక్కించిన వారే, నిముషాల్లో ఏర్పాటైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, అడ్డుకునేందుకే వైఎస్సార్‌ పుస్తకావిష్కరణ, జగన్‌కు చెక్‌ పెట్టే వ్యూహమేనా?-ఎడిటర్ సూర్య

రాజకీయాలతో పోటీపడగల (సరదా) క్రీడ బహుశా మరేదీలేదేమో! రాణించడం సంగతి పక్కన పెడితే, నేర్చుకోవడం కూడా అంతగా కష్టం కాని ఆట కూడా అదేనేమో! సాధారణంగా ఏ ఆట నేర్చుకోవాలన్నా, చిన్నతనంలోనే మొదలెట్టి తీరాలంటారు. మనిషి పెరిగి పెద్దయినాకొద్ది, నేర్చుకోవడానికి పిన్న వయసులో వుండే చురుకుదనం, తగ్గిపోతుందనేది నిపుణుల అభిప్రాయం. కొందరి విషయంలో-నేర్చుకోవడానికి అన్ని హంగులూ ఏర్పాటు చేసుకునే పుట్టు బంగారు బాతు కూనలకు, అంతో-ఇంతో జన్యుపరమైన నైపుణ్యం వున్న వారికి-మాత్రం, మరీ చిన్నతనంలో కాకపోయినా, ఏ వయసులోనైనా, అనుకున్నదే తడవుగా-కోరుకున్న ఆటలో ప్రావీణ్యం పొందడానికి అవసరమైన శిక్షణను పొందవచ్చు. అలా పొందినవారు మిగతా వారికంటే ఎక్కువగా రాణించవచ్చు కూడా. రాణించి, ఇతరుల అవకాశాలకు గండికొట్టవచ్చు. జాతీయ-అంతర్జాతీయ క్రీడల్లో వారి స్థానం పదిలం చేసుకోనూవచ్చు. మిగతా ఆటలకన్నా రాజకీయం ఆటలో మాత్రం ఇది నూటికి నూరుపాళ్లు నిజం. వారసత్వ రాజకీయాలకు నిలయమైన భారతావనిలో, అందునా ఆంధ్రా వనిలో, అది నూటికి వేయిపాళ్లు నిజం.

అశేష ప్రజాదరణ, లక్షలాది మంది అభిమానుల అండదండలున్న ఎన్ టీ రామారావు లాంటి గొప్ప వ్యక్తి రాజకీయాలలో దిగడానికి చాలాకాలం ఆలోచించాల్సి వచ్చింది. తెలుగు దేశం పార్టీ స్థాపించడానికి బహుశా ఎంతో తర్జన-భర్జన జరిగే వుంటుంది. సరే పెట్టిన తర్వాత ఏం జరిగిందో చెప్పాల్సిన పని లేదు. ఆ మహానుభావుడికి సైతం గెలుపు-ఓటములు తప్పలేదు. ఆయనంత కాకపోయినా, దాదాపు అంతే మోతాదులో అభిమానుల బలం అపారంగా వున్న, చిరంజీవి కూడా రాజకీయ పార్టీ పెట్టడానికి ఎంత వూగిసలాడిందీ అందరికీ తెలిసిందే. ఓటమి (స్వయంగా ఆయనే ఒక నియోజక వర్గంలో, ఆయన పార్టీ రాష్ట్రంలో) రుచితో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో విలీనం వరకు సాగిందిప్పటివరకు. ఇరవై సంవత్సరాల పాటు ఉన్నత పదవులను చేపట్టి, ఒక ఐఏఎస్ అధికారిగా రాష్ట్రంలోని వివిధ శాఖలలో పనిచేసి మంచి పేరు గడించి, పదవీ విరమణ చేసి, ప్రభుత్వేతర సంస్థ గొడుగు కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రజోపయోగమైన అనేక కార్యక్రమాలను నిర్వహించిన డాక్టర్ జయప్రకాశ్ నారాయణకు రాజకీయ పార్టీ పెట్టడానికి కనీసం నాలుగు సంవత్సరాల పాటు ఆలోచన చేయాల్సి వచ్చింది. గతంలో కాంగ్రెస్ నుంచి వేరుపడిన కొందరు నాయకులైనా, ఇతర పార్టీల నుంచి బయట కొచ్చిన మరికొందరైనా, వేరు కుంపటి పెట్టుకోవడానికి, మీన-మేషాలు లెక్కించే వారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ సంగతై తే, మిగిలిన రాష్ట్రాలలోనూ అంతే. అతిరథ-మహారథులనుకునే కురువృద్ధ రాజకీయ నాయకులు సహితం ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి చాలా సమయం తీసుకునే వారు. అలాంటిది, ఆంధ్ర ప్రదేశ్ లో, తనను కాదన్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీని లెక్క చేయకుండా, అర నిమిషమైనా ఆలోచించకుండా, దానికి ధీటుగా "వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ" ని స్థాపించి, అతి కొద్ది సమయంలోనే, ఆ పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు అఖండ మెజారిటీతో ఎన్నికై, అదే పార్టీ నుంచి అంతే భారీ మెజారిటీతో తన తల్లిని శాసనసభకు కూడా ఎన్నిక చేయించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే, కాంగ్రెస్ అధిష్టానానికి భయం లేకుండా వుంటుందా? భయాన్ని కప్పి పుచ్చుకుని, ఆయనను దెబ్బతీయడానికి, ఆ పార్టీ తన సర్వ శక్తులను ఫణంగా పెట్టకుండా వుంటుందా? అలా చేయడానికి, ధీటైన నాయకులను వెతుక్కోకుండా వుంటుందా? ఆ కోణంలో జరిగిన ఆలోచన పర్యవసానమే మొన్న ఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ సంరంభం.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించి, ఎప్పుడైతే సొంత కుంపటి పెట్టారో, ఆ మరుక్షణమే, వైఎస్ బతికున్నప్పుడు ఆయన దూరంగా పెట్టిన-ఆయనకు దూరంగా వున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయక మహాశయులు కొందరు, జగన్ బలం లేనివాడుగా చిత్రీకరించేందుకు "అధిష్టానం వందిమాగధుల" పంచన చేరారు. వారి ద్వారా సోనియాను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. రాజశేఖర రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డిని కూడా ముందుకు తోసారు. రాజకీయ క్రీడ ప్రారంభమైంది. "అధిష్టానం ఆదేశిస్తే" జగన్మోహన్ రెడ్డిని "ఢీ" కొంటానని డీఎల్ రవీంద్రారెడ్డి ముందుకొచ్చారు. అఖండ విజయం తనదేనని-జగన్ కు డిపాజిట్ కూడా రాదని తొలుత మాట్లాడిన డీఎల్, ఆ తర్వాత తన మెజారిటీని తానే తగ్గించుకుంటూ, చివరకు తన డిపాజిట్ కోల్పాయారు. పాపం వివేకాకు అదే గతి పట్టించారు. నైతిక విలువలంటూ మంత్రి పదవికి రాజీనామా చేసిన వివేకా రెంటికి చెడ్డ... సామెతకు గురయ్యారు. అధిష్టానానికి ఎవరేంటో తెలిసొచ్చింది. ఎవరి బలం ఎంతో అవగాహన కొచ్చింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలరో నిర్ణయానికొచ్చింది. పావులు కదపడం మొదలెట్టింది. కలిసొచ్చే రోజున...నడిచొచ్చే...అన్న చందాన, శంకర్ రావు కోర్టులో వేసిన కేసుతో సిబిఐ రంగంలోకి దిగడంతో, కాంగ్రెస్ పార్టీకి కొంత వెసులుబాటు వచ్చింది. దెబ్బమీద దెబ్బ కొట్టడానికి రంగం సిద్ధమైంది. రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం అనంతరం, క్రియాశీలక రాజకీయాలకు కొంత "బ్రేక్" ఇచ్చిన ఆయన సన్నిహితుడు-హితుడు కేవీపీ రామచంద్రరావు అధిష్టానం వేసిన "అంజనం" లో పెద్దలకు కనిపించారు. ఆయన కూడా అవకాశం కొరకు ఎదురు చూస్తుండడంతో, కార్యాచరణ ప్రణాళిక అమలు మొదలైంది. తొలి అంకం "పుస్తకావిష్కరణ" తో ప్రారంభమైంది. ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి జగన్ చేసిన తప్పిదాలను చట్టపరంగా వాడుకుంటున్న కాంగ్రెస్ ఆయన "రాజకీయ క్రీడ" కట్టడికి మరో దిక్కునుంచి ఈ విధంగా అడుగులు వేయ సాగింది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై రూపొందించిన "వైఎస్ ఆర్-మాన్ ఆఫ్ పీపుల్" అనే ఛాయాచిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా మారడానికి ప్రధాన కారణం, వైఎస్ రాజకీయ వారసత్వం ఎట్టి పరిస్థితుల్లోను జగన్మోహన్ రెడ్డిది కాదని చెప్పడానికే! జగన్ కేవలం రాజశేఖర రెడ్డి "ఆస్తులకు" మాత్రమే వారసుడని ఇన్నాళ్లూ చెప్తూ వస్తున్న వైఎస్ వ్యతిరేక కాంగ్రెస్ నాయకులు, ఆ వారసత్వం ఆయనకు ఆపాదించడానికి వెనుకనున్న కారణం, అదే ఆరోపణపై జగన్ ను ఇబ్బందుల పాలు చేయడమే. వ్యతిరేకుల వైఖరికి భిన్నంగా వైఎస్ అనుయాయులమని చెపుకుంటున్న వారి వ్యూహం మరో విధంగా వుంది. వైఎస్ రాజకీయ వారసత్వం తనదేనని ఆయన కుమారుడుగా జగన్ ప్రచారం చేసుకుంటున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీలోని వైఎస్ అభిమానులను- సన్నిహితులను, ఏదో ఒక కారణాన ఒకే వేదికపై తెచ్చి, సంఘటితం చేయడంతో పాటు, మరుగున పడిపోతున్న తన రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. ఆయనకు తెలియకుండానే, ఆయనతో ఈ కార్యక్రమం, ఆయనొక్కడే ఒంటి చేత్తో చేస్తున్నానన్న భావన కలిగించింది అధిష్టానం. ఫలితంగా భారీ స్థాయిలో పుస్తకావిష్కరణ తంతు నడిచింది. స్వయంగా కేవీపి పలువురిని ఆహ్వానించారు. సోనియాగాంధి కార్యక్రమంలో పాల్గొంటుందన్న ప్రచారమూ జరిగింది. వైఎస్ మరో దగ్గరి స్నేహితుడు, ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా, సోనియా సభకు రాలేకపోయిన విషయాన్ని బహిర్గతం చేశారు. యావత్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ యోధానయోధులు, కేంద్ర మంత్రి మండలిలోని ఉద్దండులు, రాష్టంలోని వైఎస్ అభిమాన భజన మండలి, వారు-వీరు అనే తేడా లేకుండా, సభలో ప్రత్యక్షమయ్యారు. వైఎస్ రాజకీయ వారసులం తామే అంటూ ఉపన్యాసాలిచ్చారు. అవును మరి! వైఎస్ వల్ల అంతో-ఇంతో లబ్ది పొందిన వీరంతా ఆయన వారసులమని చెప్పుకోకుండా వుండే ధైర్యం వుందా? సోనియా గాంధీ ఢిల్లీలో వుండి వున్నట్లయితే ఆమె ఆ సభకు హాజరై వుండేదా? అనుమానమే! సోనియా కోరుకుంటున్నది తన సారధ్యంలోని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, పార్టీలోని అందరినీ కూడగట్టుకుని జగన్ కు చెక్ పెట్టాలని తప్ప, వైఎస్ వారసులుగా మాత్రం కానే కాదు. ఒకవేళ ఆమె వైఎస్ వారసత్వంతో పటిష్టమయ్యే కాంగ్రెస్ పార్టీ మాత్రమే కావాలనుకుంటే, ఏనాడో ఒకనాడు జగన్మోహన్ రెడ్డినే ఆహ్వానింస్తుందికాని పరోక్షంగా ఇలా మాత్రం చేయదు. జగన్ ను, ఆయన ఎవరి వారసుడుగా చెప్పుకుంటున్నడో ఆ రాజశేఖర రెడ్డిని ఓడించడమే సోనియా లక్ష్యం అయ్యుండాలి.

అనుకున్నట్లే-ఆహ్వానించింది ఎవరైనా-పరోక్షంగా అధిష్టానం ఆశీస్సులున్నా లేకపోయినా-పిలుపు అందుకున్న వారు, అందుకోనివారు-వై ఎస్ రాజశేఖర రెడ్డి మీద నిజమైన ప్రేమ వున్న వారు, లేనివారు, అందరూ పుస్తకావిష్కరణ సభకు వచ్చారు. ఒకరిని మించి (మనసులో వుద్దేశం ఏదైనప్పటికీ) మరొకరు వై ఎస్ ఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. పనిలో పనిగా రాజశేఖర రెడ్డి విజయాల వెనుక కెవిపి రామచంద్ర రావు వున్నారన్న భావన కూడా వచ్చే ట్లు మాట్లాడారు వారంతా. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి-కేవీపీ రామచంద్ర రావులేనని సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నొక్కి వక్కాణించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్, ప్రవాస వ్యవహారాల మంత్రి వాయలార్ రవి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, కోశాధికారి, సీనియర్ నేత మోతీలాల్ వోరా తదితరులంతా వైఎస్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన అసలు సిసలైన కాంగ్రెస్ వాది అని, సోనియాకు అత్యంత విధేయుడని కూడా పొగిడారు.

ఇంతకూ కెవిపి రామచంద్రరావు మనసులో ఏముంది? పుస్తకావిష్కరణ ఆలోచన ఆయనదేనా? రెండేళ్లు పనికిరాని ఆయన హఠాత్తుగా అధిష్టానానికి ఇప్పుదెందుకు అవసర మయ్యాడు? కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ "విభజించి పాలించు" అన్నదే వ్యూహం. జగన్ నుంచి వివేకాను విడదీసి లబ్ది పొందుదాం అనుకుంటే, అది బెడిసి కొట్టింది. రోశయ్యకు మొదలు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇస్తే ఆశించిన ఫలితాలు రావడం లేదు. శంకరరావు లాంటి వారి పాత్ర పరిమితమైనదే. రాజశేఖర రెడ్డి వ్యవహార శైలి పరిపూర్ణంగా తెలిసిన ఏకైక వ్యక్తి కెవిపి రామచంద్ర రావు మాత్రమే. జగన్ ఎలాగూ ఎదురు తిరిగాడు. ఆయనను సరాసరి యుద్ధంలో ఓడించడం అంత తేలికైన విషయం కాదనే ది అధిష్టానం పసికట్టింది. ఏ ఎత్తులు-జిత్తులతోనైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కెవిపి తెలివితేటలు తోడ్పడ్డాయో, వాటితోనే ఆయన కుమారుడికి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగానే, ఈ పుస్తకావిష్కరణ తతంగం సాగింది. ఎలాగూ కేవిపికి "చంద్రగుప్తుడు"లాంటి పదవిపై కోరిక-కాంక్ష లేదు. ఆయన కోరుకునే "చాణక్యుడి పాత్ర" ఎందుకు ఆయనకే ఇవ్వకూడదనేది అధిష్టానం ఆలోచన. చాణక్య నీతిలో విజయం సాధిస్తే జగన్ ను కట్టడి చేయగలమనే ఆశతోనే ఇదంతా. ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు!

Thursday, June 30, 2011

మంత్రివర్గ మార్పుల వేళ సీఎం వ్యూహం…ప్రత్యర్థులతో కలిసి కాపురం ?: వనం జ్వాలా నరసింహారావు

మంత్రివర్గ మార్పుల వేళ సీఎం వ్యూహంప్రత్యర్థులతో కలిసి కాపురం ?

సూర్య దిన పత్రిక (01-07-2011)

వనం జ్వాలా నరసింహారావు

బొత్స, రాజ నరసింహ తీరుతో ధోరణిలో మార్పు, పట్టు కోసం మంత్రివర్గ విస్తరణ ఆయుధం, చిరంజీవి విందు రాజకీయం ఆంతర్యం?, వ్యతిరేకులకు మంత్రివర్గంలో స్థానం?, కిరణ్‌ సవాళ్ళు ఎదుర్కొంటారా?

పిసిసి అధ్యక్షుడుగా బొత్స సత్యనారాయణ నియామకం-పార్టీపై ప్రత్యక్షంగా-పాలనపై పరోక్షంగా ఆయన పట్టు సాధించే ప్రయత్నాలు, ఉప ముఖ్య మంత్రిగా దామోదర రాజ నరసింహ రంగ ప్రవేశం-తెలంగాణ కాంగ్రెస్ నేతగా గుర్తింపు దిశగా ఆయన పయనం-ఢిల్లీ స్థాయిలో పలుకుబడి పెంచుకునే ప్రయత్నాలు, ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనా ధోరణిలో కొంత మార్పుకు దారి తీశాయనక తప్పదు. అపారమైన రాజకీయానుభవంతో, బలీయమైన సామాజిక వర్గం అండ దండల నేపధ్యంతో, సహజ సిద్ధమైన చొరవతో-పలుకుబడితో, బొత్స తన నియామక ప్రకటన వెలువడిన మరు నిమిషం నుంచే, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో తనదైన శైలిలో-తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వేగంగానే సంపాదించు కుంటున్నాడనాలి. తెలంగాణ ఏర్పాటుపట్ల సానుభూతి అపారంగా వున్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుడి వ్యవహార శైలి ఇలా వుంటే, దానికి ఒకింత భిన్నంగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉప ముఖ్య మంత్రి రాజ నరసింహ ఢిల్లీలో చక్రం తిప్పిన ధోరణి వుందనాలి. బొత్స సరాసరి, తానే భవిష్యత్ ముఖ్య మంత్రినన్న రీతిలో, పూర్తి స్థాయి కాకపోయినా, కొందరు మంత్రులతో కూడిన పరోక్ష కాబినెట్ సమావేశాలను జరుపుతున్న తీరు కూడా కిరణ్ కుమార్ రెడ్డికి నచ్చడం లేదంటున్నారు. రాజ నరసింహ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు పలువురు ఇతర సీనియర్ నాయకులను కలుసుకుని రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు, ప్రభుత్వం పనితీరు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై సమాలోచనలు జరపిన తీరు-ఆ తర్వాత వెలువడిన పత్రికా ప్రకటనల తీరు గమనిస్తే, అధిష్టానం ఆలోచనా ధోరణికి అనుగుణంగా రాష్ట్ర రాజకీయాలలో బొత్స, కిరణ్ కుమార్ రెడ్డిలతో పోటా-పోటీగా ఎదిగే పనిలో నిమగ్నమైన ట్లు అనుకోవాలి. ఈ పరిణామాల మధ్య, ఆర్నెల్ల క్రితం అధిష్టానం ఆశీస్సులతో, ముఖ్య మంత్రి పీఠాన్ని అధిష్టించిన కిరణ్ కుమార్ రెడ్డి, ఆదిలో ఎదురైన ఆటుపోట్లను అధిగమించి, పార్టీ పైన-పాలన పైన అంతో-ఇంతో గట్టి పట్టు సాధించి, ఆ పట్టు కోల్పోకుండా మరింత బలం కూడగట్టుకోడానికి, ఆయనకు రాజ్యాంగ పరంగా సంక్రమించిన "మంత్రి వర్గ విస్తరణ" ఆయుధాన్ని ఉపయోగించుకునే ప్రయత్నంలో వున్నారు.

బొత్స సత్యనారాయణ బలమైన ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి ఆయన వీరాభిమాని. వాస్తవానికి బొత్సను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా అధిష్టానం ఎంపిక చేయడంలో చిరంజీవి పరోక్ష పాత్ర-సహకారం కూడా వుందంటారు. అందుకేనేమో, బొత్స తన నియామకం అయిన వెంటనే కలిసిన ప్రముఖులలో ముందు వరుసలో వున్న వారిలో చిరంజీవి ఒకరు. అదలా వుంటే, చాలా కాలం తన నియోజక వర్గానికి దూరంగా వుంటున్న, చిరంజీవి, హఠాత్తుగా, బొత్స నియామకం తర్వాత, తిరుపతి పర్యటనకు వెళ్లారు. అంతవరకు ఆశ్చర్యం లేదు. ఆ పర్యటనలో భాగంగా, ముఖ్య మంత్రి బద్ధ విరోధిగా అందరూ భావించే, చిత్తూరు జిల్లాకు చెందిన శాసనసభ సభ్యుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి విందు భోజనానికి వెళ్లారు. విందు రాజకీయాలలో, చిరంజీవి పాత్ర కిరణ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా పెద్దిరెడ్డిని మార్చడానికా? లేక, ప్రతికూలంగా-మరింత ఘాటుగా ఆయన వుండేందుకు, ఆయనను బొత్స సరసన చేర్చడానికా? అన్నది బయట పడాల్సి వుంది. మధ్యలో, చిరంజీవి మరో సంచలన ప్రకటన చేసి వార్తల్లోకి ఎక్కారు. తానిక సినిమాలలో నటించనని, అది కూడా ముఖ్య మంత్రి పాత్రలో అసలే నటించనని, నిజ జీవితంలోనే ముఖ్య మంత్రిగా తనను చూడాలనుకుంటున్న ప్రజల కోరిక తీరుస్తానని దాని సారాంశం! ఇదిలా వుంటే, దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి మలి విడత మంత్రివర్గంలో పెద్దిరెడ్డిని చేర్చడానికి కారణ భూతుడైన అపర రాజకీయ చాణక్యుడు కెవిపి రామచంద్ర రావు ఇంటికెళ్లి మంతనాలు జరిపారు ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. అప్పట్లో, పెద్దిరెడ్డిని మంత్రి వర్గంలో తీసుకున్నందుకు కిరణ్ కుమార్ అలిగారని, స్పీకర్ పదవి చేపట్టడానికి విముఖత కూడా చూపారని వార్తలొచ్చాయి. నిజా-నిజా లేమైనా, ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో, తన బద్ధ శత్రువు పెద్దిరెడ్డిని, త్వరలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణలో, కిరణ్ కుమార్ రెడ్డి స్థానం కలిగించనున్నట్లు వార్తలొచ్చాయి. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడానికి గవర్నర్ నరసింహన్ ను కలిసిన ముఖ్య మంత్రి అధిష్టానం అనుమతి కోసం ఢిల్లీ వెళ్లారని అనుకుంటున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో, తన మంత్రి వర్గంలో, పూర్తిగా తనకు అనుకూలురైన వారిని మాత్రమే చేర్చుకోవాలని కాని-వ్యతిరేకులను పూర్తిగా దూరం పెట్టాలని కాని గతంలో ఏ ముఖ్య మంత్రి భావించలేదు. కొందరు సీజన్డ్ ముఖ్య మంత్రులు, తమకు అనుకూలంగా లేనివారిని, తమవైపు తిప్పుకోవడానికో-తమ గుప్పిట్లో పెట్టుకోవడానికో, తప్పకుండా తమ మంత్రివర్గంలో చేర్చుకున్న దాఖలాలున్నాయి. తండ్రి, దివంగత అమర్ నాథ్ రెడ్డి కాలంలో, రాజకీయాలను అంతో-ఇంతో దగ్గరగా గమనించే అవకాశమున్న ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పూర్వ కాలపు కాంగ్రెస్ ముఖ్య మంత్రుల తరహాలో వ్యవహరించడానికి, తనను వ్యతిరేకించేవారికి కూడా మంత్రి వర్గంలో స్థానం కలిగించి, పాత సాంప్రదాయాలను పునరుద్ధరించడం మంచిది.

1956 లో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పార్టీ నాయకుడిగా పోటీ పడిన నీలం సంజీవ రెడ్డి, బెజవాడ గోపాల రెడ్డి, ఆ తర్వాత విభేదాలున్నా కలిసి మెలిసి పనిచేశారు. నీలం సంజీవరెడ్డి ముఖ్య మంత్రిగా, తనను ఎదిరించిన గోపాల రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు-ఉప ముఖ్య మంత్రిని కూడా చేశారు. అంతకు ముందున్న మంత్రివర్గంలో, బెజవాడ ముఖ్య మంత్రైతే, నీలం కాబినెట్ మంత్రిగా-ఉప ముఖ్య మంత్రిగా పని చేశారు. ఇద్దరికీ పడక పోయినా, సహచర మంత్రులుగా, ఒకరి కింద మరొకరు పని చేసిన మొదటి ఉదాహరణ ఇదే. సంజీవ రెడ్డి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు, ఆయన స్థానంలో ముఖ్య మంత్రి పదవి పొందిన దామోదరం సంజీవయ్య, తన మంత్రి వర్గంలో, ఆయన బద్ధ విరోధి ఏసి సుబ్బారెడ్డికి స్థానం కలిగించారు. అదే విధంగా మలి విడత ముఖ్య మంత్రిగా నీలం సంజీవ రెడ్డి రాజీనామాచేసిన తర్వాత, ఆయన వారసుడుగా వచ్చిన కాసు బ్రహ్మానందరెడ్డి సహితం తన వైరి వర్గానికి చెందిన ఏసి సుబ్బారెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఆయన స్థానంలో ముఖ్య మంత్రైన పివి నరసింహా రావు, బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో వుండగా, తనను ఆసాంతం వ్యతిరేకించిన జలగం వెంగళ రావుకు, మొదట్లో చోటివ్వక పోయినా, రెండవ పర్యాయం ముఖ్య మంత్రి అయిన తర్వాత మంత్రి పదవి ఇచ్చారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి, తనను వ్యతిరేకించే పలువురు కాంగ్రెస్ నాయకులకు కూడా మంత్రి వర్గంలో చోటిచ్చారు. అలానే, జలగం వెంగళ రావు తన వ్యతిరేకులైన రాజమల్లు, రాజారాంలకు తన మంత్రి వర్గంలో స్థానం కలిగించారు. మర్రి చెన్నారెడ్డి మొదటి విడత ముఖ్య మంత్రిగా వున్నప్పుడు, ఆయన పదవి నుంచి వైదొలగడానికి కారణమైన రాజారాం, రాజమల్లు, గోకా రామస్వామిలను తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఇక ఆ తర్వాత ముఖ్య మంత్రులైన వారందరూ, అధిష్ఠానం సూచించిన వారికే సింహభాగం మంత్రి పదవులిచ్చినప్పటికీ, తన వారనుకున్న వారిని మంత్రులుగా చేసేందుకు వెనుకాడ లేదు-తనను వ్యతిరేకించిన వారికి పదవులు దక్కకుండా చూసేందుకు శాయశక్తులా కృషి చేశారు. తెలివిగల నాయకుడు తన ప్రత్యర్థులనుకునే వారికి కూడా పదవులిచ్చి, వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా అలానే చేస్తే బాగుంటుందేమో!

ఇదిలా వుంటే, డి శ్రీనివాస్ స్థానంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావాలని ఆశించి-కాలేక పోయిన కన్నా లక్ష్మీనారాయణ, ఆ పదవి దక్కించుకున్న బొత్స సత్య నారాయణ, చిరంజీవి నిజ జీవితంలో ముఖ్య మంత్రి కావాలనుందని చెప్పిన మాటల లోని గూఢార్థాన్ని విశ్లేషణ చేసే ప్రయత్నంలో సమావేశమైనట్లు వార్తలొచ్చాయి. వీరిలో ఎవరినుంచి-ఎటువైపు నుంచి తనకు ముప్పు, ఏ విధంగా రాబోతున్నదోనని అంచనా వేసే ప్రయత్నంలో-ఆ తర్వాత తన అంచనాలకు అనుగుణంగా వారికి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా, ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారా, లేక, మంత్రి వర్గ విస్తరణకే వెళ్లారా తెలుసుకోడానికి కొంత సమయం పట్టవచ్చు. బొత్స-కన్నా-చిరంజీవిల కలివిడి, విడి విడి ప్రకటనల పరిణామాలు; రాజ నరసింహ తన కంటూ ఒక ప్రత్యేక నాయకత్వ స్థానాన్ని దక్కించుకునేందుకు మొదలెట్టిన ప్రయత్నాలు; ముఖ్య మంత్రి పదవి ఆశించి ఉప-ముఖ్య మంత్రి పదవిని కూడా పొందలేక పోయిన తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో మంత్రి గీతారెడ్డి పరోక్ష హెచ్చరికలు; తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఉధృతం విషయంలో టీ ఆర్ ఎస్ అధినేత చంద్ర శేఖర రావు-జానారెడ్డిల సమావేశం-తదనంతర పరిణామాలు-రాజకీయ ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసి ఉమ్మడి పోరాటం చేయాలన్న నిర్ణయం; మరో వారం రోజుల్లో జరుగనున్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు-అందులో ఆ పార్టీ అధినేత తీసుకో బోయే కీలక (తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా?) నిర్ణయాలు; మధ్య-మధ్య బిజెపి, కమ్యూనిస్టు పార్టీల ప్రతిఘటనలు; వీటన్నిటినీ మించి ప్రతి పక్ష నేత-తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుక్షణం విసురుతున్న సవాళ్లు; ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆద్య తన భవిష్యత్ లో ఎదుర్కోనున్న క్లిష్టమైన సమస్యలు. వీటిని ఆయన వ్యూహాత్మకంగా అధిగమించి, ఢిల్లీ అధిష్టానం అండ దండలతో, తన స్థానాన్ని పదిలపరచుకుంటారో, లేక, మంత్రి వర్గంలో మార్పులు-కూర్పులు చేసి, తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా తన నాయకత్వాన్ని సవాలు చేస్తున్న వారికే ప్రతి సవాలు విసురుతారో చూడాలి.

Monday, August 9, 2010

కాంగ్రెస్‌లో ఎవరికి వారే, యమునా తీరే!-వనం జ్వాలా నరసింహారావు

-విభజించి పాలించే విధానం
-అధిష్ఠానాన్ని ఖాతరు చేయని రాష్ట్ర నేతలు
-సమ్మతి- అసమ్మతి ముఠాలు
-సీమాంధ్ర- తెలంగాణ విభేదాలు
-పార్టీని బలోపేతం చేసే దిశగా లేని చర్యలు
-ముదిరి పాకాన పడ్డ జగన్‌ వ్యవహారం

చివరికి, అనుకున్నది- అయినదీ ఒకటే అన్నట్లుగా ఉంది, నిన్న- మొన్న జరుగుతున్న సంఘటనలు విశ్లేషించి చూస్తే. జగన్‌ కాంగ్రెస్‌ను వదలక ముందే, ఆయనకు మద్దతుగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారనేది బయ టపడక ముందే, అలా పోవాలనుకున్న వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు ముందు కొచ్చారు చిరంజీవి. ఎలాగూ ఎంఐఎం అండ కాంగ్రెస్‌ పార్టీకి ఉండనే ఉంది. వాళ్లు మద్దతు ఇస్తామనడం బాగానే ఉంది కాని, రోశయ్య వెంటనే దానికి అంగీ కరించినట్లు మాట్లాడడమే కొంత అనుమానాలకు దారి తీస్తుందనాలి. ఒక వైపు తన ప్రభుత్వానికి ఏ ఢోకా లేదంటూనే, తక్షణం వచ్చిన ముప్పేమీ లేదంటూనే, ఔదార్యంతో ఎవరైనా మద్దతిస్తా మంటే తప్పకుండా తీసుకొంటామనడంలో అంతరార్థం మాత్రం- అసలు సిసలైన కాంగ్రెస్‌ వ్యవహార శైలిలోనే ఉందనాలి. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ పార్టీలో సంభవి స్తున్న పరిణామాలు పార్టీని బలోపేతం చేసే దిశగా ఎంతమాత్రం సాగడంలేదు.

ఆ పరి ణామాలకు ఫలానా వారే బాధ్యులనడం, ఫలానా వ్యక్తులనే ఎత్తి చూపడం సాధ్యం కాదు. శ్రీ కృష్ణ కమిటీకి అభిప్రాయం చెప్పి వచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులు- మంత్రులతో సహా, తెలంగాణ వాదులను దేశ ద్రోహులు గా అభివర్ణించడాన్ని టీఆరెస్‌తో సహా, కాం గ్రెస్‌ తెలంగాణ నాయకులందరూ తప్పు బట్టారు. తమది దేశ ద్రోహమైతే, తమ ఉమ్మడి నాయకురాలు సోనియా గాంధీదీ దేశ ద్రోహమే అనే వరకూ కాంగ్రెస్‌ జగడం సాగింది. ఇలా బాహాటంగా ఒకరి నొకరు విమర్శించుకున్నప్పటికీ, క్రమశిక్షణ చర్యలు మ్రాతం ఏ ఒకరిద్దరు కాంగ్రెస్‌ నాయకులకో పరిమితమై పోవడం గమ నార్హం. అయినా క్రమ శిక్షణకు, క్రమ శిక్షణా రాహిత్యానికి మారు పేరైన నూట ఇరవై అయిదేళ్ల కాంగ్రెస్‌ పార్టీకి ఇవన్నీ మామూలే నంటున్నారు విశ్లేషకులు. సాక్షాత్తు రాజీవ్‌ గాంధీనే పార్లమెంటులో ఉరి తీయాలని అన్న వారికే కాంగ్రెస్‌ లో ఉన్న తాసనం వేయగా లేనిది, ఇతరుల క్రమశిక్షణ గురించి మా ట్లాడే అర్హత క్రమశిక్షణా సంఘానికి ఎక్కడిది అని ఒక సీనియర్‌ కాంగ్రెస్‌ వాది ప్రశ్నించే దాకా వెళ్లింది.

భారత జాతీయ కాంగ్రెస్‌కు ఆంగ్లేయుల ‘విభజించి పాలిం చే విధానం’ వారసత్వంగా అబ్బిందనాలి. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకులతో సహా సాధారణ కార్యకర్తలకు కూడా అధిష్ఠానం అంటే ఏ మాత్రం భయం లేకుండా పోతుందేమో అనిపిస్తోంది. ఒక వైపు రోశయ్య- జగన్‌ వర్గాలుగా, మరో పక్క సీమాంధ్ర-తెలంగాణ వాదు లుగా, ఇంకో దిక్కున ఒకే ప్రాంతంలోని సమ్మతి- అసమ్మతి ముఠాలుగా, ఒకే జిల్లాలో రెండు చీలికలుగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు బాహాటంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. అధిష్ఠానం కూడా తన వంతు రెచ్చగొట్టే విధానం అవలంబి స్తున్నదేగాని, పరిస్థితులను చక్కదిద్దుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. కాకపోతే, అప్పుడప్పుడూ, ఒకరిద్దరి మీద తాత్కాలికంగానో- తాత్కాలిక శాశ్వతం గానో వేటు వేయడం జరుగుతున్నది. అంబటిపై తక్షణ చర్యైనా- పాల్వాయిపై అర్థంలేని మౌనమైనా, గోనె-యాష్కీల మధ్య తలదూర్చక పోవ డమైనా, రాయపాటి- కన్నా విభేదాలను నాన్చడమైనా, సర్వే- శంకర్రావులను పురిగొల్పడమైనా అధిష్ఠానం ఎత్తుగడల్లో భాగమేనేమో !

వైఎస్‌ జగన్మోహన రెడ్డి, ఏది జరిగినా తన మంచికేనన్న దృక్పథంతో, ఓదార్పు యాత్ర పేరుతో జనంలోకి దూసుకుపోతున్నాడు. ఈ సుదీర్ఘ యాత్రలో- చాలా భాగం సంయమనంతో ఉపన్యాసాలిచ్చినప్పటికీ, మనసులో మాట బయట పెట్ట దల్చుకున్నప్పుడు, వెనుకా-ముందు చూడకుండా మాట్లాడడం భవిష్యత్‌ సంకేతాలకు నిదర్శనమనవచ్చు. సహనం కోల్పోయే సమయం ఆసన్నమైందన్న సంకేతాలనూ ఇస్తున్నాడు. మొత్తమ్మీద జగన్‌ వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఓదార్పు యాత్రలో ఆయనేం మాట్లాడాడన్నది ప్రధానం కానేకాదు. ఆయన వేరు కుంపటి పెట్టినా- పెట్టక పోయినా మునుపెన్నడూ లేని విధంగా పార్టీ సంక్షోభంలో పడిపోతున్నదనడంలో అతిశయోక్తి లేదు. ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చిన ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ఒక్కసారి ఓడితే మళ్ళీ అధికారంలోకి రాలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే ఆ మినహాయిం ఉంది ఇంతవరకు. బహుశా ఇక ముందు ఇక్కడ కూడా, జాతీయ కాంగ్రెస్‌ మనుగడ ఏదో ఒక ప్రాంతీయపార్టీపై ఆధారపడే రోజు లు రాబోతున్నాయేమో!

ఆంధ్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి, దివంగత ముఖ్యమంత్రి తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సహచరుడు, కాపు వర్గానికి చెందిన నాయ కుడు అంబటి రాంబాబును, పార్టీనుంచి సస్పెన్షన్‌ చేసిన వైనం కాంగ్రెస్‌ శ్రేణుల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా విమర్శలు చేశాడన్న ఆరోపణతో రాంబాబును సస్పెండ్‌ చేసింది అధిష్ఠానం. అంతేకాదు, జగన్‌ ఓదార్పు యాత్రలో రోశయ్యపై చేసినట్లు మీడియాలో వచ్చిన వ్యాఖ్యలపై నివేదికలు కూడా తెప్పించుకుంటామని మొయిలీ అన్నారు. జగన్‌ ధిక్కార ధోర ణిని సహించబోమన్న సందేశం ఆయన మాటల్లో స్పష్ఠంగా వ్యక్తమైంది. అంత టితో ఆగకుండా జగన్‌ మరో వీరాభిమాని, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ కార్యదర్శి గట్టు రామచందర్రావుకు ఉద్వాసన జరిగింది. మరో జగన్‌ వీరాభిమాని కొండా సురేఖ- రోశయ్యను చేతకాని సీఎం అంటూ పత్రికలకెక్కారు. వీరందరినీ సస్పెండ్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది. వారిదే క్రమశిక్షణా రాహిత్యమంటూ అంబటి అండ్‌ కంపెనీ పత్రికలకెక్కింది. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్‌లో వినిపిస్తున్న ధిక్కార స్వరాలు, అసంతృప్తి జ్వాల లు భారత కాంగ్రెస్‌ నూట పాతికేళ్ల చరిత్ర గుర్తుకు తెస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీలో ముఠా పోకడలు, అధిష్ఠానాన్ని ధిక్కరించడం, పార్టీని వీడిపో వడం, స్వగృహ ప్రవేశం చేసి- గతంలో కంటే ప్రాధాన్యత సంపాదించుకోవడం వంటివి ఆది నుంచీ కనిపిస్తున్నవే. మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రకాశం పంతులును దింపడానికి నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావు ఒకటయ్యా రని అంటారు. నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో ముఖ్యమంత్రి పదవి కోల్పో యి, కాంగ్రెస్‌ను వదిలి వెళ్లిపోయిన ప్రకాశం, స్వగృహ ప్రవేశం చేసి, సంజీవరెడ్డి ప్రోద్బలంతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు. మద్య నిషేధం సాకుగా, సంజీవరెడ్డి బలపర్చిన ప్రకాశం పంతుల ఓటమి దిశగా కొందరు కాంగ్రెస్‌ నాయ కులు పావులు కదిలించారు. ఓడిన ప్రకాశం రాజీనామా చేయడంతో గవర్నర్‌ పాలన విధించడం, శాసన సభను రద్దుచేయడం జరిగింది. అవన్నీ ముఠా రాజకీ యాలే. దరిమిలా, నీలం సంజీవరెడ్డి స్థానంలో బెజవాడ గోపాల రెడ్డి పీసీసీ అధ్య క్షుడయ్యారు.

1956 లో విశాలాంధ్రగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అవతరించింది. ముఖ్య మంత్రి పదవికోసం పోటీ మొదలైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి మద్దతు బెజవాడకు, బూర్గుల, విబి రాజుల మద్దతు నీలం సంజీవరెడ్డికి లభించింది. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు నీలంకే మద్దతు పలికారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. బెజవాడ గోపాలరెడ్డి ఆర్థిక మంత్రిగా సర్దుకోవాల్సివచ్చింది. నీలం సంజీవరెడ్డి బలాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి లాగ డమే మంచిదని భావిం చిన జవహర్లాల్‌ నెహ్రూ, పథకం ప్రకారం యుఎన్‌ ధేబర్‌ స్థానంలో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా 1960లో నీలంను నియ మించారు. 1962 లో, ఎన్నిక లొచ్చే సమయానికల్లా సంజీవరెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి పంపారు. ఆయన వారసుడిగా 1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయింతర్వాత, మళ్లీ ము ఠా రాజకీయాలకు తెర లేచింది.

ముల్కీ కేసులో తీర్పుపై పీవీ వ్యాఖ్యలకు నిరసనగా తలెత్తిన ఉద్యమ ఫలితంగా ఆయన పదవి కోల్పోవడం, ఆయన స్థానం లో కొన్నాళ్లకు జలగం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఎమ ర్జెన్సీ కాలంలో ఇందిర విధేయుడుగా పేరు తెచ్చుకున్న జలగం, ఆ తర్వాత ఇందిర మంత్రివర్గంలో హోం మినిస్టర్‌ గా పని చేసిన బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్‌లో చేరాడు. 1978 శాసనసభ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్‌ (నేటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌-ఐ)ని మర్రి చెన్నారెడ్డి విజయ పథంలో నడిపించగా, వెంగళ రావు కాంగ్రెస్‌ పరాజయం పాలైంది. చెన్నారెడ్డి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన మాజీ ప్రధాని ఇందిరకు ఖమ్మంలో కనీసం గెస్ట్‌ హౌజ్‌ కూడా ఇవ్వని వెంగళరావు మళ్ళీ ఇందిర పంచన చేరి కేంద్రంలో మంత్రిపదవి అనుభవించారు. పీసీసీ అధ్యక్షుడుగా పని చేశారు.

ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతో, ముఖ్యమంత్రుల మార్పిడికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహిరంగంగానే, అసమ్మతికి అధిష్ఠానం ప్రోత్సాహం లభిం చేది. అసమ్మతి పుణ్యమా అని అంజయ్య, భవనం, విజయ భాస్కర రెడ్డి ముఖ్య మంత్రులయ్యారు. 1983 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ను, 1989లో మరో పర్యాయం పీసీసీ అధ్యక్షుడుగా, గెలిపించిన చెన్నారెడ్డి, ముఖ్య మంత్రి కావడానికి అధిష్ఠానం ఆశీస్సులు తప్పనిసరైంది. మళ్ళీ అసమ్మతి... మళ్ళీ ధిక్కార స్వరాలు.. ఏడాదికే ఆయన స్థానంలో, నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి ముఖ్య మంత్ర య్యారు.

ఆయన్నూ ఉండనివ్వలేదు అధిష్ఠానం. మరో మారు విజయ భాస్కర రెడ్డి ని ముఖ్య మంత్రిని చేసి, తెలుగు దేశం ఇంకో మారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. అప్పట్లో అసమ్మతిని, ధిక్కార స్వరాన్ని వినిపించిన డా రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసినా, కాంగ్రెస్‌ను అధికా రంలోకి తేవడానికి మరో పది సంవత్సరాలు పట్టింది. ఆయన రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయింతర్వాత, ఆకస్మికంగా మరణించడంతో, ఆరేళ్లుగా వినిపించని ధిక్కార స్వరాలు మళ్లీ మొదలయ్యాయి.