అంతర్మధనం-11
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం
ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు
అధునాతన సౌకర్యాలున్న రెండంతస్తుల ఇ.ఎం.ఆర్.ఐ ప్రధాన కార్యాలయం-ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ లో "ఉన్నత శిక్షణ” ను ఇచ్చేందుకు నిర్వహిస్తున్న పోస్టు గ్రాడ్యుయేట్ తరగతి విద్యార్థుల వసతి కొరకు నిర్మించిన (అర్థాంతరంగా ఆగిపోయిన) భారీ హాస్టల్ భవన సముదాయం-అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్-సత్యం పబ్లిక్ స్కూల్ నాటి (తర్వాత ఆధునీకరించిన) ప్రధాన కార్యాలయం-ఇండిపెండెంట్ ’తరగతి గదులు’-కొంతమంది ఉద్యోగులుండడానికి అనువుగా వున్న రెసిడెన్షియల్ క్వార్టర్స్..... ...... ఇలా "విలువైన ఆస్తులు"న్న, కోట్లాది రూపాయల విలువ చేసే, సుమారు నలభై ఎకరాల భూమి పూర్వాపరాల గురించి తెలుసుకునే ముందర, రాజు గారి సారధ్యంలో రూపు దిద్దుకున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ "నియమావళి" గురించి, "సంఘం స్థాపన పత్రం" లోని చిత్ర-విచిత్రమైన అంశాల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఇంతకు ముందే తెలియచేసినట్లు, తన కుటుంబీకులే ప్రమోటర్ సభ్యులుగా సంస్థను రిజిస్టర్ చేయించడమే కాకుండా, సంస్థ నియమావళికి, భవిష్యత్ లో ఎంత ప్రయత్నం చేసినా, అంత సులభంగా సవరణలు తేలేని విధంగా, అతి చాకచక్యంగా దాన్ని తయారు చేయించారు రాజు గారు. యాదృచ్చికంగా అలా జరిగిందో, లేక, కావాలనే ఆయనో-ఆయన సలహాదారులో అలా చేయించారో తెలుసుకోవాలంటే, సమాధానం చెప్పాల్సింది రాజు గారే. సంస్థ "ఉజ్వల భవిష్యత్" ను దృష్టిలో వుంచుకుని, "నీతి విచక్షనలేని"వారి చేతుల్లోకి అది ఎట్టి పరిస్థితుల్లోనూ జారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుగా అలా చేసి వుండాలి రాజు గారు బహుశా. రామ లింగరాజు గారి "వ్యూహాత్మక ఆలోచన" కు సరితూగే ఆలోచన చేయగలవారు బహుశా అరుదుగా వుంటారేమో ! ఈ సందర్భంగా "వ్యూహం-వ్యూహ రచన" అంటే కొంత తెలుసుకోవాల్సిన అవసరముంది.
సీ.ఇ.ఓ వెంకట్, అక్కడ పనిచేసే సీనియర్ లీడర్లలో ఆత్మ స్థయిర్యాన్ని పెంపొందించే దిశగా తీసుకున్న చర్యల్లో ప్రధానమయింది "వ్యూహాత్మకంగా సంస్థ ఎలా ముందుకు సాగాలి" అన్న అంశంపై ప్రొఫెసర్ రంజన్ దాస్ తో ఇప్పించిన శిక్షణా పరమైన ఉపన్యాసం అని ఇంతకుముందు పేర్కొన్నాను. అదిక్కడ మరి కొంచెం వివరంగా తెలుసుకుందాం. "సరైన అసలు-సిసలు వ్యూహ రచనే లక్ష్యసాధనకు తొలి మెట్టు" అన్న సందేశం ఆ ఉపన్యాసంలో రంజన్ దాస్ వివరించారు.
వ్యక్తైనా, వ్యవస్థ అయినా, లాభాపేక్ష లేని ఇ.ఎం.ఆర్.ఐ లాంటి స్వచ్చంద సంస్థ అయినా, లాభాలను ఆర్జించే చిన్నా-పెద్దా వ్యాపారమైనా, చివరకు రాజకీయ పార్టీ అయినా-రాజకీయేతర కార్య కలాపాలైనా... ... ఆ మాటకొస్తే, లక్ష్యం-గమ్యం-ధ్యేయం ఎంచుకున్న ఎవరైనా, వాటిని చేరుకునేందుకు-అధిగమించేందుకు, రూపొందించుకునే ప్రణాళికాబద్ధమైన-శాస్త్రీయ పద్ధతిలో అనుసరించాల్సిన కార్యక్రమాన్ని, మేనేజ్మెంట్ పరిభాషలో "వ్యూహం" అనో, "వ్యూహ రచన" (Strategy) అనో అంటారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించిన సత్యం కంప్యూటర్స్ సంస్థ చైర్మన్ "జనవరి 7, 2009 నాటి ప్రకటన" దరిమిలా, ఆయన సమకూర్చిన "వ్యక్తిగత నిధులతో", ఆయనే వ్యవస్థాపక అధ్యక్షుడిగా నెలకొల్పబడి-అచిరకాలంలోనే లక్షలాది ప్రాణాలను కాపాడేందుకు దోహద కారైన ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ, భవిష్యత్ లో, రాజు గారు లేని లోటు కనపడకుండా అత్యవసర సహాయ సేవలు అందించడానికి అవసరమైన నిధుల సేకరణకు, ఎలాంటి వ్యూహం అనుసరించాలనేదే నాటి ఉపన్యాసం ముఖ్య ఉద్దేశం. ఆంధ్ర ప్రదేశ్ తో సహా సహాయ సేవలు పొందుతున్న ఇతర రాష్ట్ర ప్రజలు కూడా ఏం జరుగబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపధ్యంలో వెంకట్ గారు "వ్యూహాత్మకంగా" ఏర్పాటు చేసిన కార్యక్రమం అది.
సేవా దృక్ఫదంతో అత్యవసర సహాయ సేవలను అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ లాంటి సంస్థలు, "ప్రభుత్వం పైనా", "నిధులను సమకూర్చే ఒకరిద్దరి దాతృత్వ విరాళాల పైనా" ఎల్లకాలం ఆధార పడడం కంటే, "వ్యూహాత్మకంగా" ఆదాయ వనరుల సేకరణకు పూనుకోవాలని ఆ రంగంలో నిష్ణాతుడుగా పేరున్న రంజన్ దాస్ అన్నారు. అంబులెన్సుల "సరాసరి నిర్వహణ వ్యయం" ప్రభుత్వం భరించినంత మాత్రాన అదే “శాశ్వత పరిష్కారం అని” అనుకోకూడదని ఆయన హెచ్చరించారు. ఇ.ఎం.ఆర్.ఐ కేవలం అంబులెన్సుల నిర్వహణ మాత్రమే చేపట్టలేదని, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్-పరిశోధన-శిక్షణ కూడా సంస్థ కార్యకలాపాల్లో ప్రధానమయినవేనని, అన్నింటికీ నిధులను ఒక వ్యక్తో-సంస్థో-ప్రభుత్వమో సమకూర్చడం కష్టమని ఆయన అభిప్రాయ పడ్డారు.
ఇ.ఎం.ఆర్.ఐ ప్రధాన లక్ష్యాలను-ధ్యేయాలను ఎంతమాత్రం నీరు కార్చమంటూ నిధులను సమకూర్చేందుకు ముందుకొచ్చే దాతలు, సంస్థ విలువలను గౌరవించినప్పటికీ-మంచి మనసుతో, సేవా దృక్ఫదంతో నిధులిచ్చినప్పటికీ, అంతర్లీనంగా, తద్వారా తమకు కలగబోయే లాభం ఏంటని తప్పక ఆలోచిస్తారని స్పష్టం చేస్తూ, "సొంత కాళ్ల మీద నిలబడ గలగడమే" మెరుగైన పద్ధతిగా పేర్కొన్నారు రంజన్ దాస్. అదో సవాలుగా వర్ణించిన ఆయన, సీనియర్లు ఆ సవాలును స్వీకరించి, మారిన పరిస్థితుల్లో సంస్థ మనుగడకు తమవంతు తోడ్పడగలిగినప్పుడే "లీడర్లు-నాయకులు" కాగలుగుతారని, "మేధావి" గా పిలువబడతారని, అలాంటి వారికే ఇ.ఎం.ఆర్.ఐ లో స్థానం వుండాలని నిర్ద్వందంగా-నిర్మొహమాటంగా చెప్పారు. సవాలును స్వీకరించడమంటే "బిక్షాపాత్ర"తో ప్రయివేట్ భాగస్వామిని అన్వేషించడం కానే కాదని, "నిధులను సమీకరించగల కార్యాచరణ పథకాన్ని ఎందుకు నేను రూపొందించి అమలు చేయలేను" అని ప్రశ్నించుకుని, సమాధానం వెతుకు తే, అదే క్రమేపీ "వ్యూహ రచన" గా మారి లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడుతుందని తొలి పాఠం చెప్పారు రంజన్ దాస్. అదే జరిగినప్పుడు ఆబాల గోపాలానికి అత్యవసర సహాయ సేవలు దేశవ్యాప్తంగా మరింత మెరుగ్గా లభించి, మరెన్నో ప్రాణాలను కాపాడగలిగే వీలు కలుగుతుంది.
"లీడర్లు” గా పిలిపించుకున్న మాలో సంస్థ పెరుగుదలకు-ఆదాయ వనరుల సేకరణకు వ్యూహాత్మకంగా ఎంతమంది తోడ్పడగలిగారనేది ప్రశ్నార్థకం. తోడ్పడగల నైపుణ్యం వున్న ఒకరిద్దరిని, యాజమాన్యం ఎంతవరకు ప్రోత్సహించి-అవకాశం ఇచ్చిందనేదీ ప్రశ్నార్థకమే. మేధావులని, నిపుణులని, నిష్ణాతులని సంస్థలో తీసుకున్న వారు-కష్ట కాలంలో సంస్థను అంటిపెట్టుకుని వున్న వారు, యాజమాన్యం మారిన అతి కొద్ది కాలంలోనే వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి ? వీటన్నిటి సమాధానాలలోనే "ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు కూడా వుంటాయి". ఆ వివరాలు మరో సందర్భంలో తెలుసుకుందాం.
వ్యూహ రచనకు ప్రధానమైన మౌలికాంశాలను నిర్ధారించిన ఆ రంగంలోని నిపుణులు, ఐదు రకాల "షరతులను (నిబంధనలు-నియమాలు)" ఆ ప్రక్రియలో భాగంగా విధిగా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. వ్యూహ రచనను తయారుచేసేవారు చేయాల్సిందల్లా, ఆ ఐదు రకాల షరతులను, సంస్థను విజయపథంలో నడిపించు కోవడానికి, సందర్భోచితంగా అన్వయించు కోవడమే. ఇక్కడ "సందర్భం" అనేది చాలా ముఖ్యమైంది. "సమయం-సందర్భం" లేకుండా చేప్పేది-చేసేది అప్రస్తుతంగా భావించాలి. ఆ ప్రధాన షరతులను ఇ.ఎం.ఆర్.ఐ కి అన్వయించి విశ్లేషించారు రంజన్ దాస్.
108-అత్యవసర సహాయ సేవలను పొందాల్సిన ఖాతాదారులకు-లబ్దిదారులకు (వినియోగదారులు), ఆ సేవలను మరింత మెరుగైన రీతిలో-నాణ్యమైన పద్ధతిలో పొందే హక్కుందని, ఆ విషయంలో "తుది అభిమతం-నిర్ణయం" వారిదే అవుతుందని ఇ.ఎం.ఆర్.ఐ గుర్తించడం మొదటి షరతు. ప్రభుత్వం అంగీకారంతో నోడల్ ఏజన్సీగా తమ సంస్థ అందిస్తున్న సహాయ సేవల తరహా సేవలనే అందించగల "పోటీదారులు" వున్నారని-వుండవచ్చని, ఆ పోటీ ముమ్మరం కానున్నదని, ఆ పోటీని వ్యూహాత్మకంగా సవాలు చేయాల్సిన అవసరం ఆసన్నమవుతున్నదని-లేదా ఆసన్నమయిందని ఇ.ఎం.ఆర్.ఐ గుర్తించి తీరాలి. ఒకవేళ పోటీకి ఎవరూ లేనిపక్షాన, సవాలు విసిరి మరీ పోటీదారులను తయారుచేయాలనేది రెండో షరతు. మానవ-ఆర్థిక వనరులు పోను-పోనూ, పరిమితంగానే లభ్యమయ్యే స్థితి కలగవచ్చని గుర్తించడం మూడో షరతు. సంస్థ కార్య కలాపాలకు (యాజమాన్య పరమైన-నిర్వహణా పరమైన-ఇతర అవసరాలకు) నిధులు (ప్రస్తుతం) సమకూరుస్తున్నవారు, ప్రభుత్వమైనా-ప్రయివేట్ వారైనా, వారి పెట్టుబడికి తగిన ప్రతిఫలం రావడం లేదని, సహనం కోల్పోయే ప్రమాదముందని ముందుగానే ఊహించడం మరో షరతు. లాభాపేక్ష లేని సంస్థల విషయంలో, ఆ ప్రతిఫలం "ధన రూపేణా" వుండాల్సిన అవసరం లేదు. "పేరు-ప్రతిష్టలు" కావచ్చు, తద్వారా మరో రకమైన "ప్రతిఫలం" కావచ్చు. హఠాత్తుగా భారీ నష్టమో-లాభమో (రాజు గారు బరువు-బాధ్యతలు వెంకట్ గారిమీద పెట్టి హఠాత్తుగా తప్పుకున్న తరహాలో!) సంభవించవచ్చని ఊహించడం ఐదో షరతు. వ్యూహాత్మకంగా సంస్థను "ఒడిదుడుకులకు" లోనుకాకుండా నడిపించాలంటే, ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్య స్థాయి "లీడర్లు" ఈ ఐదు షరతులను విధిగా పరిగణలోకి తీసుకుని ముందుకు సాగాలి. ఈ ఐదింటిలో ఒకటి గాని-ఒకటికంటే ఎక్కువగాని షరతులు సంస్థకు అన్వయించాల్సి వచ్చిందంటే, తదనుగుణంగా వ్యూహ రచన చేయాల్సిందే.
యాజమాన్య స్థాయి "లీడర్లు" సమిష్టి గా ఆలోచించి, ఒక్కో అంశంపై వివరణాత్మక వ్యూహ రచన చేయాలంటే, అందులోని ప్రతి వ్యక్తి, తనకు సంబంధించిన-తన వంతు బాధ్యతను నిబద్ధతతో-నైపుణ్యంతో చేపట్టాలి. "బాధ్యతారాహిత్యం" వున్న చోట వ్యూహరచనకు తావులేదు. వ్యూహరచన చేయడమంటే, పరోక్షంగా-ప్రత్యక్షంగా ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు సౌభాగ్యం కలిగించడమే. సందర్భాన్ని బట్టి వ్యూహరచన వుంటుందంటే, దానర్థం, ఎటువంటి అవసరానికి ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలన్న ఆలోచన చేయడమే. ఆలోచనలలోని వ్యత్యాసాలు, లేదా, భిన్నాభిప్రాయాలు వ్యూహరచనగా భావించరాదు. ఒకరి వ్యూహరచన మరొకరి దానికంటే భిన్నంగా వుండొచ్చు, అందుకే సందర్భ ప్రాధాన్యం చాలా ముఖ్యం. "వ్యూహ రచన బాధ్యత సంస్థదే-నాది కాదు" అని ఎవరికి వారే ప్రతి లీడర్ తప్పించుకుంటే వారిలో నాయకత్వ లక్షణాలు లేనట్లు గానే భావించాలి. సంస్థ అంతర్గత విధానాలు-నెల కొన్న పద్ధతి-నిర్మాణ వ్యవస్థ వ్యూహరచనకు తోడ్పడతాయి. నాయకుడన్న వాడు "సమస్యలో భాగస్వామి కాకుండా" "పరిష్కారంలో పాలుపంచుకోవాలి".
ఉదాహరణకు, ఇ.ఎం.ఆర్.ఐ కి ప్రభుత్వమో, లేక, ప్రయివేట్ భాగస్వామో సమయానికి కావాల్సిన నిధులను విడుదల చేయకపోతే, ఆ సమస్యను "జటిలం" చేయకుండా, ఏం చేస్తే ఆ సమయానికి నిధుల కొరత లేకుండా చేయగలుగుతామని ఆలోచన చేయడమే "వ్యూహ రచన". అది చేయగల వారే "లీడర్లు". వ్యూహాత్మకంగా రూపొందించిన ప్రణాళికను సంస్థ (ఇ.ఎం.ఆర్.ఐ) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీ.ఇ.ఓ) అంగీకరించడంలేదనో-సూచనను వినిపించుకోవడంలేదనో, సాకులు చూపించడం నాయకత్వ లక్షణం కాదు. సరైన వ్యూహకర్త తాను చేసిన ఆలోచన మిగతా వారందరి ఆలోచనకంటే మెరుగైనదని ధృఢంగా విశ్వసించగలిగి, పై అధికారిని ఒప్పించగలగాలి. సందర్భాన్నిబట్టి వ్యూహరచనలో వ్యత్యాసం వుంటుంది. ఈ వ్యత్యాసం కనీసం మూడు అంశాల్లో వుండితీరుతుంది.
వినియోగదారుల పరిధి ఏమిటి-ఎలా నిరంతరం మార్పుచెందుతుంది అని ఆలోచన చేయడం మొదటి అంశం. వినియోగదారుల (ఇ.ఎం.ఆర్.ఐ అందిస్తున్న అత్యవసర సహాయ సేవలను పొందే లబ్దిదారుల) సంఖ్య పెరుగుతున్న కొద్దీ, సమస్యలు కూడా పెరుగుతాయి. వాస్తవ వినియోగదారులను గుర్తించడం కూడా క్లిష్టం కావచ్చు. ఉదాహరణకు, అత్యవసర సహాయం కొరకు ఎదురుచూచేవారు-అందులో ఖచ్చితంగా తక్షణం సహాయం కావల్సినవారు-సహాయం కావాలని ఫోన్ చేయగలవారు-ఫోన్ చేయలేనివారు-ఒక విధంగా పౌరులందరూ-ప్రభుత్వంలోని అధికార, అనధికార గణం-పోలీసు, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపకదళ సిబ్బంది.... ఇలా అందరు కూడా ఇ.ఎం.ఆర్.ఐ వినియోగదారులే. అత్యవసర సమయాల్లో "రోగి బంధువులు" కూడా వినియోగదారులే. వినియోగదార్ల పరిధిని అర్థం చేసుకున్న తర్వాత, వారికి లభించబోయే లాభాన్ని ఎలా "విలువ" కట్టాల్నో కూడా వ్యూహంలో భాగమే. ఇది రెండో అంశం. చిట్ట చివరలో, చిట్ట చివరి వినియోగదారుడి చిట్ట చివరి అవసరానికి లభించిన పరిష్కారానికి-మొట్టమొదటి సారి, మొట్టమొదటి వినియోగదారుడికి అలాంటి సమస్యకు లభించిన పరిష్కారానికి తేడా వుండకూడదు. అలాంటి వ్యూహరచనే "విలువ ప్రాధాన్యతగల ప్రతిపాదన" అంటారు.
"కస్టమర్" ఎల్ల వేళలా దేముడితో సమానమే. ఆ కస్టమర్ లబ్దిదారుడు కావచ్చు, లేదా, నిధులను సమకూరుస్తున్న ప్రభుత్వమే కావచ్చు. తనకు అర్థమయ్యే పరిభాషలో, సేవలు లభ్యమవ్వాలని వినియోగదారుడు కోరుకుంటాడు. తప్పైనా-ఒప్పైనా కస్టమర్ చెప్పిందే "వేదం". అంటే, ఇ.ఎం.ఆర్.ఐ "ప్రధాన కస్టమరైన" ప్రభుత్వం చెప్పింది, ఖండించకుండా, నచ్చచెప్పే ధోరణిలో ఇ.ఎం.ఆర్.ఐ వ్యవహరించాలి.
రంజన్ దాస్ సలహాలను-సూచనలను ఎంతమంది సీరియస్ గా తీసుకున్నారనేది-ఎంతమంది అమలులో పెట్టగలిగారనేది చెప్పడం అంత తేలికైన విషయం కాదు. బహుశా ఆయన చెప్పింది పాటించి వుంటే, ఒడిదుడుకులు కొన్నైనా తప్పేవేమో !
