Showing posts with label చండ్ర రాజేశ్వరరావు. Show all posts
Showing posts with label చండ్ర రాజేశ్వరరావు. Show all posts

Monday, November 14, 2011

డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి బాల్యం-కుటుంబ నేపధ్యం: వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం I

డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి బాల్యం-కుటుంబ నేపధ్యం

వనం జ్వాలా నరసింహారావు

మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ(ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చెసే అవకాశం కలిగింది నాకు. 36 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో మొదటి అధ్యాయం ఇది.

డాక్టర్ గారి కుటుంబ సభ్యులంతా కలిసి వంద మంది పైన వుంటారు. అన్నలు-తమ్ములు, అక్కలు-చెల్లెళ్లు, తల్లి వైపు-తండ్రి వైపు సమీప బంధువులు, బావా-మరుదులు, వదినా-మరదళ్లు, మామయ్యలు, బాబాయిలు, చిన్నాయనలు-పెద నాన్నలు, కజిన్లు....అందరూ కలుస్తుంటారు అప్పుడప్పుడు. సందడే-సందడి. అంతా కలుపుగోలుగా వుంటారు. కలవడానికి సందర్భం కొరకు వేచి చూస్తుంటారు. పెళ్లిళ్లలో-పేరంటాలలో, ప్రత్యేక సందర్భాలలో కలవడానికి అదనంగా, అడపాదడపా కూడా కలుస్తుంటారు. కలిసినప్పుడు గతంలోకి పోతుంటారు. అలాంటి గత స్మృతులు డాక్టర్ వై ఆర్ కె వర్ణిస్తుంటే, వినేవారు పరాయివాళ్లైనా సరదాగా వుంటుంది. ప్రముఖ రచయిత బోడెలె చెప్పిన "బాల్యం అనుభవాలను (తెలిసిన వారంతా) కలిసినప్పుడల్లా స్మరించు కోవడమే మేలు" అన్న వాక్యాలను, ఇటీవల అనుపమ్ ఖేర్ చెప్పిన "The memories of our happy days work as powerful trigger" (ద మెమొరీస్ ఆఫ్ అవర్ హాపీ డేస్ వర్క్ యాజ్ పవర్ ఫుల్ ట్రిగ్గర్) అన్న వాక్యాలను జ్ఞప్తికి తెచ్చుకునే డాక్టర్ గారు, "Memories can also be painful" (మెమొరీస్ కెన్ ఆల్సొ బి పెయిన్ ఫుల్) అంటారు. చిన్నతనంలో చదువుకున్న మాధవపెద్ది గారి ఖండ కావ్యం "పంచవటి"లోని ఊహాజనిత సన్నివేశంలో, కవి లక్ష్మణుడుని ఉద్దేశించి "ఎప్పుడు ఒకే సుఖంబై యుండెడి దేవతలకన్న కష్ట సుఖముల కలగల్పు గల్గు మనుజులన్నచే ప్రీతి జనించు లక్ష్మణా!" అన్న పద్యభాగాన్ని ప్రస్తావించారు. రామ-లక్ష్మణులకు ఎలా కష్టాలు-సుఖాలు ప్రాప్తించాయో, ఆయన జీవితంలోనూ, అలానే కష్ట-సుఖాలు కలగాపులగంగా ఎదురయ్యాయన్న భావం ఆయన మాటల్లో వ్యక్తమైంది.

రాధాకృష్ణమూర్తి స్వగ్రామం, కృష్ణా జిల్లా, గుడివాడకు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో వున్న "జమీ దింటకుర్రు". అదొక్కప్పుడు ఒక జమీందారుకు చెందిన వూరు. అక్కడి గ్రామ ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను నూజివీడు జమీందారుకు పంపడం ఆనవాయితీగా వుండేది. కుగ్రామంలాంటి ఆ వూరి జనాభా వంద కుటుంబాలకు మించదు. అందులో చాలా వరకు కమ్మ కులానికి చెందిన వారే కావడం, ఒకరికొకరు బంధువులు కావడం విశేషం. ఇక పన్నులు వసూలు చేసుకుని తీసుకుపోయే జమీందారు, మేకా రంగయ్యప్పారావుగారి పూర్వీకులైన రాజా రంగయ్యప్పారావుగారు. ఆ వూరి సరిహద్దు గ్రామం పెదపారుపూడు ("ఈనాడు" అధినేత రామోజీరావు సొంత వూరు), మరోవైపు "వానపాముల" వుండేవి. చుట్టూ సారవంతమైన-నల్ల రేగడి వ్యవసాయ భూములు, మాగాణి భూములు వున్నాయి. పుష్కలంగా సాగు నీరు లభ్యమయ్యే వసతి కూడా వుంది. జమీ దింటకుర్రుకు చెందిన కొల్లి రామయ్య-నాగరత్నమ్మ దంపతుల పదకొండు మంది సంతానంలో రాధాకృష్ణమూర్తి రెండో వారు.

జమీ దింటకుర్రులో చిన్న రామాలయం వుంది. అందుకేనేమో, ఆ వూళ్లో చాలా మంది రామయ్యలున్నారు. వాళ్లను పిలవాల్సి వచ్చినప్పుడు, పేరు ముందర గుర్తుగా, ఇంటి పేరో-తండ్రి పేరో-అలవాట్లో... ఏదో ఒకటి కలిపేవారు. డాక్టర్‍గారిది మధ్య తరగతి కుటుంబం. అన్నదమ్ములు ఎనిమిది మంది, అక్కచెల్లెళ్లు ముగ్గురు. వారికున్న చిన్న మామిడి తోట, ఏడెనిమిది ఎకరాల మాగాణిపై వచ్చే ఆదాయంపైనే కుటుంబ జీవనాధారం. తల్లి పెద్దమ్మ అచ్చమ్మగారు-భర్త సీతారామయ్యగారు, రాధాకృష్ణమూర్తిని తొమ్మిది (9) మాసాల పిల్లవాడుగా దత్తత తీసుకుని పెంచుకున్నారు. ఆమెను అచ్చమ్మగారని కొందరు, లక్ష్మీ నర్సమ్మగారని మరి కొందరు సంబోధించే వారు. వారిది కూడా అదే గ్రామం. వారింటి పేరు "యలమంచిలి" కావడంతో, డాక్టర్‍గారి పేరు యలమంచిలి రాధాకృష్ణమూర్తి అయింది. సీతారామయ్య దంపతులు ఆయనను కన్న బిడ్డకంటే ఎక్కువగా చూసుకుని, పెంచి పెద్ద చేశారు. పెంచుకున్న వారిని అమ్మ-నాన్నని పిలవడం అలవాటై, సొంత తలిదండ్రులను చిన్నమ్మ-చిన్నాన్న అని పిలిచే వారు.

తీపి గుర్తులు - చేదు అనుభవాలు

జన్మనిచ్చిన తండ్రికి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మెండుగా వుండేది. ముక్కు సూటిగా మాట్లాడే మనస్తత్వం. పొదుపరి. బంధు ప్రీతి-దాతృత్వ హృదయం కలవాడు. స్వయంకృషి ఆయన నినాదం. రైతుగా స్వయానా కృషీవలుడైన కొల్లి రామయ్యగారు ఆ రోజుల్లోనే వరి నారు మడిని వాణిజ్యపరంగా మార్కెట్ చేసిన వ్యవసాయదారుడు. సమీప బంధువులందరూ ఆయనను "పెద్ద మనిషి" గా పిలిచే వారు. తన ఇంటికి వచ్చిన వారందరి ముందు తన పని తాను చేసుకుంటూ, వారిని కూడా పని చేయమని పురమాయించేవాడు. అదొక తరహా క్రమశిక్షణకు ఆయన పర్యాయపదం అనాలి. "రామయ్యగారు పందిరి గుంజకు కూడా పని చెబుతాడు" అనేవారు! సొంత తలితండ్రులిద్దరికీ భూదేవికున్న సహనం-ఓర్పు వుండేది.

దత్తత తీసుకున్న తండ్రి మరో రకమైన గొప్పవాడు. అయన తరహా, శైలి నిరుపమానమైందనాలి. బాగా చదువుకున్న వ్యక్తి. పండితుడు. స్వచ్చమైన భాష ఆయన సొంతం. స్వామి దయానంద సరస్వతి సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైనారు. ఆర్య సమాజం ప్రభావం కూడా అయన మీద పడింది. త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రభావం వుంది. "స్వసంఘ పౌరోహిత్యం" అలవరచుకుని, షోడశ కర్మలతో సహా, పౌరోహిత్యం చేసేవారాయన. బ్రాహ్మణ వేషధారణతో, కమ్మ బ్రాహ్మణుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయనతో పౌరోహిత్యం చేయించుకోవడానికి ఎక్కడెక్కడివారో తీసుకెళ్లేవారు. ఒక అధ్యాపకుడుగా పక్కనున్న వేంట్రప్రగడ గ్రామంలో, ఘంటశాల గ్రామంలో చాలామందికి వేద పాఠాలు నేర్పేవారు. గొట్టిపాటి బ్రహ్మయ్య లాంటి రాజకీయ మిత్రులు, గొర్రెపాటి వెంకట సుబ్బయ్యగారి లాంటి సాహితీ మితృలతో పరిచయాలుండేవి. ఘంటసాలలోని శివాలయంలో అర్చకత్వం కూడా రెండు సంవత్సరాల పాటు చేశారు. ఆయన చనిపోయేంతవరకు ఘంటసాల గ్రామంతో, గ్రామస్తులతో సంబంధాలు పెట్టుకున్నారు.

ఆ విధంగా రాధాకృష్ణమూర్తి చదువు-సంస్కారం పెంపకపు తండ్రి దగ్గర నేర్చుకుంటే, శారీరక కష్టం చేయడం, వ్యవసాయం పనులు చేయడం సొంత తండ్రి దగ్గర నేర్చుకున్నారు. సమాజంలో ఆయన ఉన్నత స్థితికి చేరుకోవడానికి, తలిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు ఎంతో సహాయం చేశారంటూ, ఘంటసాలలోని లక్ష్మయ్య మాస్టారును జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఆయన ప్రేమాభిమానాలను కూడా గుర్తుచేసుకున్నారు. దయాకరరావు, వెంకటేశ్వర్లుగార్లు తమతో నాటకాలు వేయించిన విషయం గుర్తు చేసుకున్నారు. చింతామణిలో చిన్ని కృష్ణుడు వేషం, బొబ్బిలి యుద్ధంలో రంగారావు కుమారుడు వేషం వేసారాయన చిన్నతనంలో . పెంచిన తండ్రికి చదువు విలువ బాగా తెలుసు. అందుకే రాధాకృష్ణమూర్తిని బాగా చదివించారు. ఇంగ్లీష్ విద్యతో పాటు భారతీయ ప్రాచీన గ్రంధాలలోని అంశాలను నేర్పించారు. బాల్యంలో గుండెలమీద పడుకోబెట్టుకుని, సుమతీ శతకంతో అనేక శతకాలను, మంత్ర పుష్పాన్ని కంఠతా పాఠం చేయించారు. పుస్తక పఠనం అలవాటు ఆయన చలవే. చిన్నతనంలోనే గోరా రచించిన "దేవుడు లేడు", త్రిపురనేని రాసిన "శంభుక వధ", "సూత పురాణం" లాంటివి చదవ గలిగారు.

విద్య:

వై.ఆర్.కె మూడు-నాలుగు తరగతుల వరకు ఘంటసాలలో పూర్తి చేసి, వానపాములలో మాధ్యమిక విద్యనభ్యసించారు. శెలవుల్లో, తీరిక సమయాల్లో సొంత తండ్రి పురమాయించుటతో వ్యవసాయ పనులు చేయడంలో ఆయనకు తోడ్పడే వారు. నాట్లు వేయడం, కోతలు కోయడం, ఎరువులు చల్లడం, నారు మళ్లు తడపడం, పశువులకు మేత వేయడం అలవాటైంది. కుప్పనూర్పుళ్లకు వెళ్లేవారు. ఎండాకాలం తాటి ముంజలు తినడం సరదాగా వుండేదని, తాటికాయ పండ్లు వేరుకుని, ఇంటికి తెచ్చుకుని వుడకబెట్టుకుని తింటుంటే మహదానందంగా వుండేదని రాధాకృష్ణమూర్తిగారు చెప్పారు. కుటుంబ వ్యవసాయ కార్మిక పనుల్లో చేదోడుగా-వాదోడుగా వుండడం ఆయనకు చాలా ఇష్టంగా వుండేది. వాస్తవానికి, అందులో భాగంగా, వరి పొలానికి "యాతాంతో నీళ్లు తోడి పారిస్తుంటే" తనకు మెడికల్ కాలేజీలో సీటొచ్చిన సంగతి తెలిసిందని గర్వంగా తెలిపారాయన.

జన్మస్థలమైన జమీదింటకుర్రు నుండి, రెండు మైళ్ల దూరంలో ఉండే ఎస్.ఆర్.ఆర్. మిడిల్ స్కూల్లోనే 5 నుండి 8 తరగతుల వరకు చదువు సాగింది. ఆ పాఠశాల చుట్టుపక్కల 4-5 గ్రామాల నుండి (పెద పారుపుడి, దింటకుర్రు, వానపాముల, వెంట్రప్రగడ, అప్పికట్ల, ముదునూరు) పిల్లలు వస్తుండేవారు. మంచి స్కూల్ అని పేరుండేది. పగలు స్కూల్, సాయంకాలం (శెలవుల్లో రోజంతా) పొలం పని. రాత్రిళ్లు కిరసనాయిలు లాంతరుతో చదువు. ట్యూషన్లు అంటూ లేవుకాని, ఆ వూరిలోనే వుండే, జాస్తి పున్నయ్య గారింటికి వెళ్ళి ఇంకా మరికొందరితోపాటు చదువు చెప్పించుకునేవారు. ఆయన అప్పటికే స్కూల్ ఫైనల్ పాసయ్యారు.

బంధువులు:

ఊరిలో కమ్యూనిస్ట్ కార్యకర్తలుండేవారు. మిక్కిలినేని వెంకటేశ్వరరావు, కొల్లి (అంజయ్యగారి)సుబ్బారావు, జాస్తి పున్నయ్య, ఎన్.వీ.ఎస్.ప్రసాదరావు వీరిలో ముఖ్యులు. "స్వతంత్ర భారత్" అనే సైక్లో పత్రిక రహస్యంగా పంచేవారు. ఆసక్తి కొద్దీ దాచుకుని చదువుతుంటే (ఏమీ అర్థం అయ్యేది కాదు) తండ్రిగారు చూసి, "నీకవన్నీ ఎందుకు? పుస్తకాలు చదువుకో" అని మందలించేవారట. ఆ సమయంలో జిల్లా బోర్డు ఎన్నికలు వచ్చాయి. జస్టిస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ వుండేదని, అభ్యర్థులెవరో మాత్రం గుర్తు లేదనీ అన్నారు డాక్టర్‍గారు. ఆ రోజుల్లో జస్టిస్ పార్టీ అంటే చల్లపల్లి రాజావారు. ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకుల్లో ముదునూరు గ్రామానికి చెందిన అన్నె అంజయ్యగారి పేరు చెప్పుకునేవారు. (ఆయనగారి కుమార్తే, "అన్నే రాజ్యం సిన్హా". భగత్ సింగ్ సహచరుడు విజయ్‍కుమార్ సిన్హాను వివాహం చేసుకుని రాజ్యం సిన్హా అయ్యారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో సమాచార పౌర సంబంధాల డైరెక్టర్‍గా పనిచేశారు). అలానే, పక్క వూరు - పెద పారుపూడిలోని మాలపల్లెకు చెందిన వేముల కూర్మయ్యగారి పేరు ప్రముఖంగా వినపడేది. (ఆయన తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. ఐనా ఆయన నివాసమైన గుడిసెలో ఏ మార్పు కనిపించలేదు). ఓటింగ్‍కు రెండు పెట్టెలుండేవి. ఒకదానికి ఎర్ర కాగితం అంటించి వుండేది. అది జస్టిస్ పార్టీ రంగు. రెండో దానికి పసుపు రంగు కాగితం వుండేది. అది కాంగ్రెస్ గుర్తు. ఎక్కువమంది పసుపు రంగు కాగితం వున్న పెట్టెలోనే వేసినట్లు చెప్పుకునేవారు.

స్కూల్‍లో మంచి ఉపాధ్యాయులుండేవారు. ప్రధాన ఉపాధ్యాయులు చెన్నుంబొట్ల గోపాలరావుగారు, దింటకుర్రులోనే తాత్కాలికంగా వుండేవారట. అలాగే తెలుగు మాస్టారు, డ్రిల్లు, డ్రాయింగ్ మాస్టార్లు కూడా వుండేవారు. లెక్కలు "పొట్టి వెంకటేశ్వర్లుగారు" చెప్పేవారు. రాధాకృష్ణమూర్తిగారికి లెక్కల్లో 30-35 శాతం మించి మార్కులు ఎన్నడూ వచ్చేవి కాదట. ఆ పంతులు గారు ఆయనను, "ఏరా కమ్మ బ్రాహ్మడూ!" అని సరదాగా పిలిచేవారట. అది కోపంతో కాదు, బహుశా వేళాకోళమేమో అంటారు డాక్టరుగారు.

పక్క వూరు ముదునూరు - గోపరాజు రామచంద్ర రావు (గోరా) గారి స్వగ్రామం. ఒకటి రెండు సార్లు ఆయన బందరు కాలేజీ నుండి డిస్మిస్ అయిన తరువాత, ఆ స్కూల్‍లో మీటింగ్ పెట్టారట.

పాఠశాలకు రెండొందల గజాల దూరంలో కాలవ గట్టు మీద, ఒక పొట్టి తాటి చెట్టుండేదట. దాని కింద కూర్చొని, కొందరు పిల్లలు, మధ్యాహ్నం పూట అన్నాలు తిని, కాలవలో చేతులు కడుక్కునేవారు. ప్రత్యేకత ఏమిటంటే, ఆ చెట్టుకు తలలో ఎన్నో మొవ్వులుండేవట. దానిని "నూరు మొవ్వుల తాడి" అనేవారు. కొన్నాళ్లకు పక్క పొలంలో ఆసామి, దానికి దైవత్వం వుందని ప్రచారం చేసి, పూజలు మొదలు పెట్టారు. జనం విరివిగా రావడం మొదలైంది. ఒక రాత్రి ఎవరో (గోరా గారి శిష్యుల పనే అని చెప్పుకునేవారట!) ఆ చెట్టును నరికేశారు.

మరొక విశేషం - స్కూల్ కు ఒకటి-రెండు మైళ్ల దూరంలో, ఒక చెట్టేదో, పగలు సగం వంఘి వుండి, రాత్రికి నిలువుగా వుండేదని, ప్రచారం సాగి, దానికి దైవత్వం ఆపాదించడం మొదలెట్టారు కొందరు. గోరాగారు దానికి శాస్త్రీయమైన కారణం చెప్పి, వరసగా కొన్నాళ్లు నీళ్లు పోయించిన తరువాత, అది ఎప్పుడూ తిన్నగా నిలబడే వుండేదని చెప్పుకునేవారట!

ఎన్.వీ.ఎస్ ప్రసాదరావును (కారణం తెలియదు) కమ్యూనిస్ట్ పార్టీ బహిష్కరిస్తే, కాంగ్రెస్‍లో చేరి, మరో ఇద్దరితో సహా (భూపతి రావు, రాజ్యం) యువజన కాంగ్రెస్ నేతలుగా - మంచి ఉపన్యాసకులుగా పేరు తెచ్చుకున్న విషయం చెప్పారు డాక్టర్‍గారు. ఆయన తరువాత కాలంలో, గోపాలరెడ్డిగారి ప్రాపకంతో, కొంతకాలం రేడియో కేంద్రంలో పనిచేసి, కొన్నాళ్లు రవీంద్రభారతి మేనేజరుగా పని చేశారట.

ఉన్నత పాఠశాల (1941-43) - గుడివాడ:

వానపాములలో ఎనిమిదో తరగతి వరకే వుంది. హైస్కూల్ చదువుకు గుడివాడ వెళ్లాలి. తండ్రి సీతారామయ్యగారు, దత్తుడుని ఒంటరిగా పంపడం ఇష్టం లేక, కాపురం గుడివాడకే మార్చారు. ’పాటిమీదకొల్లి కోటయ్య గారి ఇళ్ల కాంప్లెక్స్‍లో ఒక ఇంట్లో అద్దెకు చేరారు. కోటయ్యగారు ధరణికోట ఆశ్రమం నిర్వహిస్తూ, వేదాంతిగా పేరు తెచ్చుకున్నారు. కాని అక్కడంతా కమ్యూనిస్ట్ వాతావరణం. వారి పెద్దబ్బాయి డాక్టర్ గురునాధరావు, రెండొతను ప్రత్యగాత్మ, మూడవవాడు హేమాంబరం. (ప్రత్యగాత్మ, హేమాంబరం తరువాత సినీరంగంలో డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు). అల్లుడు మల్లిఖార్జునరావు. అందరూ పార్టీ వారే! వారి మధ్యనే మూడు సంవత్సరాలు గడిపారు డాక్టర్‍గారు. గుడివాడలో చదువుతున్నప్పుడు జరిగిన రెండు-మూడు ముఖ్య ఘటనలను కూడా గుర్తు చేసుకున్నారాయన.

మొదటిది, 1942, 8 ఆగస్టున మొదలైన క్విట్ ఇండియా ఉద్యమం. పట్టణమంతా గొడవలు - అల్లర్లు జరుగుతుండేవి. వీళ్లను బయటకు వెళ్లకుండా ఇంట్లో కట్టడి చేశారు పెద్ద వాళ్లు. అప్పుడు గుడివాడలో కాంగ్రెస్ నాయకులుగా వినిపించే పేర్లలో ముఖ్యమైనవి లాయర్ కేతవరపు నర్సింహంగారిది, ఫొటో స్టూడియో స్వామి (తరువాత ఖమ్మంలో "మెట్రో స్టూడియో"గా అభివృద్ధి చేసుకున్నారు)గారిది, హోమియో డాక్టర్ గుర్రాజు (గుడివాడ హోమియో కళాశాల స్థాపకులు) గారిది. రెండో సంఘటన, రవీంద్రనాథ్ టాగోర్ మరణం ( ఆగస్ట్ 7, 1941) నాడు తమ హైస్కూల్ లో జరిగిన సంతాప సభ. ఉపాధ్యాయులు కొందరు ఆయనను గురించి చాలా గొప్పగా చెప్పడంతో, టాగోర్ రచనలను ఎప్పుడైనా చదవాలన్న ఆలోచన తన మనసులో పడిందంటారు. మూడవది, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారి గజారోహణ ఉత్సవం. వారి రచనలను విరివిగా అందుబాటులోకి తెచ్చారు. రాధాకృష్ణమూర్తిగారి తండ్రి ఆయన అభిమాని కావడంతో, ఆ పుస్తకాలన్నీ తమ ఇంట్లో వుండేవట. అప్పట్లో కొన్ని, తరువాత చాలా వరకు చదివినట్లు చెప్పారు డాక్టర్‍గారు.

హైస్కూల్ ఉపాధ్యాయులలో కొందరిని మర్చిపోలేమన్నారు. ముందుగా తెలుగు పండితులు బసవ కోటిలింగంగారి ప్రస్తావన తెచ్చారు. ఈయన తన మీద ప్రత్యేక శ్రద్ధ చూపించే వారట. ఆయన శైవుడు (మెడలో జంగాలకు వుండే లింగం వుండేది). కాని బుద్ధుడి మీద చాలా అభిమానం. వీలున్నప్పుడల్లా బౌద్ధ మత విశేషాలు వివరించేవారట. తెలుగు భాషపై శ్రద్ధ కలగడానికి ఆయన మొదటి కారణంగా చెపుతారు. తరువాత ఎస్.ఎస్.ఎల్.సీ లో "ఇంగ్లీషు చెప్పిన మాస్టారు" గురించి చెప్పారు. ఆయన భాషతో పాటు "రెన్ అండ్ మార్టిన్" ఇంగ్లీష్ గ్రామర్‍తో పూర్తి కసరత్తు చేయించేవారట. ఇక లెక్కల మాస్టారు ఆచారిగారు చక్కగా బోధించడంతో తనకు 30% అత్తెసరు మార్కుల నుండి 70% మార్కులు రావడంమొదలైందట. ఎస్.ఎస్.ఎల్.సీలో అప్పుడొక ఐఛ్చిక (Optional) సబ్జెక్ట్ కూడా వుండేది. డాక్టర్‍గారు కెమిస్ట్రీ తీసుకున్నారు. దాన్ని మాణిక్యాలరావు మాస్టారు ఎంతో బాగా చెప్పేవారు. రసాయన శాస్త్ర ప్రయోగాలు చేసి చూపించేవారట. వారికిఈ ఈనంటే చాలా ఆప్యాయత. ట్యూషన్ అంటే ఎరుగరట. గొప్ప ఉపాధ్యాయుల పుణ్యం కావచ్చు, ఆయన శ్రమ కావచ్చు.... ఎస్.ఎస్.ఎల్.సీ లో హైస్కూల్ లో ప్రధముడుగా ఉత్తీర్ణుడయ్యానని, ఆనాడది ఒక సంతృప్తిగా వుండేదని చెప్పారు.

ఇంటర్ (1943-45) - బందరు:

అప్పట్లో కృష్ణా జిల్లాలో రెండే కాలేజీలుండేవి. ఒకటి బందరులోని హిందూ కాలేజీ, రెండోది బెజవాడలోని ఎస్ ఆర్ ఆర్ కాలేజీ. హిందూ కాలేజీకి మంచి క్రమ శిక్షణ, మంచి అధ్యాపక-ఇతర సిబ్బంది కలదన్న పేరుండేది. అది పూర్తిగా "వైదికుల" కాలేజీ అనేవారు. దానికి తగినట్లే, బందరు కాలేజీలో పనిచేసే ఒక్క లెక్చరర్ కూడా మీసాలుండేవి కాదట. ఒకే ఒక మినహాయింపు పువ్వాడ శేషగిరిరావుగారని చెప్పారు. అంతకు ముందు కొంత కాలంగా ఒక వెలుగు వెలిగిన క్రిస్టియన్స్ నోబుల్ కాలేజీ, జాతీయోద్యమంలో పుట్టిన నేషనల్ కాలేజీ మూతపడి వున్నాయి. ఆ కాలేజీలో ఇంటర్ లో చేరడంతో, రాధాకృష్ణమూర్తిగారి తల్లితండ్రులు తమ కాపురం కూడా - ఆయన కోసం- బందరుకు మార్చారు. "ఇంగ్లీషు పాలెం" లో, కాలేజీకి దగ్గరలో, ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు.

బందరు చాలా చరిత్ర కలిగిన పురాతన పట్టణం. అంతటా ఇసుక మైదానాలు, సరివి తోటలు, సముద్ర తీరం. ఓడ రేవున్నందున మొదలు డచ్చివారు, తరువాత ఫ్రెంచ్ వారు, ఆ తరువాత ఆంగ్లేయులు ఆ ఓడ రేవులతో వ్యాపారాలు కొనసాగించేవారు. అందుకే ఇప్పటికీ డచ్చి పేట, ఫ్రెంచి పేట, ఇంగ్లీషు పాలెంలు వున్నాయి. దానికి మఛిలీ పట్నం (మఛిలీ అంటే "చేప") అని పేరుంది. ఇంగ్లీషులో "మసులీపటం" గా పిలిచారు. ఉప్పు తయారీకి బందరు ఒక పెద్ద కేంద్రం. ఆప్పటికే ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ వుండేది. చాలా స్వచ్చమైన, కాలుష్యం లేని బీచుల్లో మంగినపూడి బీచ్ ఒకటి. ఆ ఊరిలోనే వున్న "చిలకల పూడి" రోల్డ్ గోల్డ్ ఆభరణాలకు ప్రసిద్ధి. "బందరు లడ్డూ" ఆంధ్ర దేశపు స్పెషాలిటీలలో ఒకటి! విశాఖ మెడికల్ కాలేజీలో, బందరు విద్యార్థులను, కొత్తలో చేరినప్పుడు, "బందరు లడ్డూ" అని రాగింగ్ చేసేవారట. అది జాతీయోద్యమ అగ్రనాయకులలో ఒకరైన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారి ఊరు. జాతీయోద్యమ పాత్రికేయులు మట్నూరి కృష్ణారావుగారు అక్కడ నుండే ప్రసిద్ధ "కృష్ణాపత్రిక" నడుపుతుండేవారు. ఆ పేర్లు, ఆ చరిత్ర, ఆనాడు వినడమే కాని, వారిని చూసే అవకాశం తనకు కలగలేదంటారు డాక్టర్ గారు.

ఇక కాలేజీ విషయానికొస్తే, ప్రిన్సిపాల్ శివరామకృష్ణయ్య గారంటే పిల్లలందరికీ హడల్. ఆయన క్రమశిక్షణకు మారుపేరని, కాస్తంత కోపంగా విద్యార్థులు ఆయనకు "అత్తరు సాయిబు" అని నిక్ నేమ్ పెట్టారని చెప్పారు డాక్టర్‍గారు. ఆయనకు మంచి స్ఫూర్తినిచ్చిన మరికొంతమంది లెక్చరర్లను గుర్తుచేసుకున్నారు. ముందుగా షేక్ స్పియర్ పాఠాలు చెప్పిన ముత్తు అయ్యర్ గారి విషయం చెప్పారు. ఆయన నల్లగా, పొట్టిగా, బొద్దుగా వుండేవారు. తల పాగా, ధోవతి లోకి చొక్కా, పైన బెల్టు, ఆపైన నల్ల కోటు వేసుకునే వారు. వేషం ఎలా వున్నా, ఆయన పాఠం చెప్పే తీరు మాత్రం అద్భుతం అంటారు డాక్టర్‍గారు. ఆయనకు షేక్‍స్పియర్ (Shakespeare) రచనలు - నలభై - నాటకాలు కంఠతా వచ్చట. ఇంటర్ పాఠ్య గ్రంధం "As You Like It" నాటకం కాని, "Othello", "Macbeth", "Merchant of Venice", కాని Extensive గా Quote చేస్తూ, ఆయా పాత్రలకు అనుగుణంగా స్వరం, Accent మార్చి నాటకీయంగా తరగతి నడిపేవారట. అలాగే శివకామయ్య మాస్టారు విషయం చెప్పారు. ఆయన ఇంగ్లీషు గద్య భాగం చెప్పేవారు. అతి కష్టంగా వుండే RL Stevenson రచనలను, పండు వలిచినట్లు చెప్పేవారట. ఆ ఇద్దరి పాఠాలు వింటుంటే, ఏ విద్యార్థికైనా ఇంగ్లీషు భాషపై ఆసక్తి కలగాల్సిందేనట!

తెలుగు అధ్యాపకుల ప్రస్తావన తెచ్చారు. సర్వా శేషయ్యగారు సంస్కృతం, తెలుగు రెండింటిలో ఎం.ఏ చేశారట. మనిషి వేష ధారణ పేద బ్రాహ్మణుడిలా వుండేది. మొహాన విభూతి రేఖలు, మధ్య కుంకుమ బొట్టు! ఆయన "గిరిజా కల్యాణం" పుస్తక పాఠం చెపుతుంటే, సాధారణంగా తరగతులు ఎగ్గొట్టే విద్యార్థులు కూడా తప్పకుండా హాజరయ్యేవారట. హాస్యం, వ్యంగ్యం, శృంగారం - సకల రసాలు ఆయన కంఠంలో అలవోకగా వచ్చేవంటారు. మరొక గొప్ప తెలుగు దిగ్గజం పువ్వాడ శేషగిరి రావు గారి గురించీ చెప్పారు. ఆయన వేషం సంప్రదాయ, ఆధునికతలు కల బోసి వుండేదట. అందమైన వ్యక్తి. "తిక్కన"పై ఆయనకు చెప్పలేనంత అభిమానం. తన కుమారుడి పేరు కూడా తిక్కన అని పెట్టుకున్నారు. స్వయంగా ఆయనొక కవి. అప్పటికే "గోవత్సం", "ముంతాజ్ మహల్" అనే ఖండ కావ్యాలు రాశారు. మొదటిది బి.. పాఠ్య గ్రంథంగా కూడా పెట్టారు. "పంచవటి" కావ్యాన్ని ఆయన శ్రావ్యంగా - రాగ యుక్తంగా వినిపిస్తూ, అద్భుతంగా చెబుతూనే, మధ్య - మధ్య తిక్కన గారి భారత పద్యాలు వినిపించి, వాటి విశిష్టత వివరించేవారు. నిజంగా అలాంటి మహానుభావుల నుండి పాఠాలు వినడం తనకు లభించిన గొప్ప అదృష్టంగా చెప్పారు డాక్టర్ గారు.

సైన్స్ సబ్జెక్ట్స్ - బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ - బోధించిన మాస్టర్లు కూడా గుర్తుంచుకోదగిన వారే నంటారు. వారి అధ్యాపక నైపుణ్యం వల్లే, తనకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో, ఆ మూడు సబ్జెక్ట్స్ ‍లో డిస్టింక్షన్ మార్కులు వచ్చాయన్నారు. అప్పటికి "ట్రిపుల్ డిస్టింక్షన్" ఒక గొప్పగా వుండేదట. ఐతే, తనకిష్టమైన తెలుగులో డిస్టింక్షన్ రెండు మార్కులతో మిస్ కావడం ఆ రోజుల్లో ఆయనను కాస్త బాధించిందట! తనకు పరీక్షల విషయంలో, తల్లిదండ్రుల నుండి ఎలాంటి వత్తిడి వుండేది కాదన్నారు. ట్యూషన్ల ప్రమేయమే లేదట. పాఠాలు శ్రద్ధగా వినడం, బుద్ధిగా చదువుకోవడం చేసేవారట! ఇంటర్‍లో మిత్రులుగా వుండి, ఆ తరువాత, వివిధ వృత్తులలో స్థిరపడిన ఆర్.వి. కృష్ణారావు, పోలవరపు వెంకటేశ్వరరావు, నాంచారయ్యలతో పాటు పలువురు స్నేహితుల పేర్లను గుర్తు చేసుకున్నారు డాక్టర్‍గారు.

1944 లో, ఆయన ఇంటర్ రెండో సంవత్సరంలో వున్నప్పుడు, పెద్ద ఎత్తున జరిగిన ఆ నాటి "బెజవాడ" అఖిల భారత రైతు మహా సభలను జ్ఞాపకం చేసుకున్నారు. అవి ఈ నాటికీ, కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ముఖ్య ఘట్టాలుగా చెప్పుకుంటారన్నారు. ఆ సందర్భంగా బందరు నుండి తన మిత్రులతో కలిసి, ఆ మహా సభలకు ప్రేక్షకులుగా వెళ్లడం, చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్య, చలసాని వాసుదేవరావుగార్లతో పాటు, బీహారుకు చెందిన ప్రసిద్ధ రైతు నాయకుడు స్వామీ సహజానందను (కాషాయ వస్త్రాలతో) వేదిక మీద చూసినట్లు గుర్తుచేసుకున్నారు. ఇంటర్ చదువుతున్నప్పుడే, ఆనాటి విద్యార్థి ఫెడరేషన్ (AISF) తో సంబంధాలుండేవి డాక్టర్‍గారికి. పార్టీతో పెద్దగా సంబంధాలు లేకపోయినా, పట్టణ విద్యార్థి ఫెడరేషన్ కమిటీలో తీసుకున్నారు డాక్టర్‍గారిని. అప్పటినుంచే, దాసరి నాగభూషణరావు (ఆ తరువాత ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్య నాయకుడుగా, రాజ్య సభ సభ్యుడుగా వున్నారు) గారితో పరిచయం ఏర్పడింది. ఆయన ఇంటర్‍లో హ్యుమానిటీస్ సెక్షన్‍లో చదువుతుండేవారట.

ఆ సందర్భంగా మరొక సంఘటన గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడుగా వున్న కాట్రగడ్డ నారాయణరావుగారిని, ఉపన్యాసకుడుగా, ఒక విద్యార్థి బహిరంగసభకు ఆహ్వానించారట. బెజవాడకు చెందిన కాట్రగడ్డవారి కుటుంబం (సోదరులు మధుసూధనరావు, నారాయణరావు, "నవయుగ" శ్రీనివాసరావుగార్లు)కాంగ్రెస్ పార్టీలో వున్నప్పటికీ, వామపక్ష అభిప్రాయాలతో ఏకీభవించుతూ, సుందరయ్య-రాజేశ్వరరావుగార్లతో సన్నిహిత సంబంధాలు కలిగుండేవారు. కాంగ్రెస్ అంతర్గత విభేదాలతో, నారాయణరావుగారు బహిరంగంగానే కమ్యూనిస్టులకు అనుకూలంగా మాట్లాడేవారు. ఆనాటి నారాయణరావుగారి ప్రసంగం తనకు కొంత స్ఫూర్తినిచ్చిందంటారు డాక్టర్‍గారు.

మంచి మార్కులతో ఇంటర్ పాసైన తరువాత, ఏం చేయాలో - ఏం చదువుతే భవిష్యత్ బాగుంటుందో గైడ్ చేసేవారు ఎవరూ లేరట అప్పుడు. స్నేహితులతో సంప్రదించి, ఆంధ్రా యూనివర్సిటీకి ఒక అప్లికేషన్, ఆంధ్రా మెడికల్ కాలేజీకి మరొక అప్లికేషన్, మార్కుల జాబితా జతపర్చి పంపించారట. కొన్ని రోజుల తరువాత ఆంధ్రా యూనివర్సిటీ నుండి వుత్తరం వచ్చింది. (అప్పుడు ఆంధ్రా యూనివర్సిటీ గుంటూరు నుండి పనిచేసేది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ యుద్ధ విమానాలు విశాఖ హార్బర్ మీద బాంబులు వేశాయి. ఆ భయంతో యూనివర్సిటీ గుంటూరుకు మార్చారు). బీ.ఎస్సీ. (ఆనర్స్), జియో ఫిజిక్స్ లో సీట్లు వచ్చినట్లు తెలవడంతో, ఏదో ఒకటి అనుకుని వెళ్లి ఫీజు కట్టి వచ్చారట. ఇంకా తరగతులు ప్రారంభం కాకముందే, మరో వారం లోపున, మెడికల్ కాలేజీనుండి సీటు వచ్చినట్లు ఉత్తరం వచ్చింది.

మెడికల్ కాలేజీలో సీటు రావడం ఇప్పట్లో చాలా కష్టమనీ, ఆ రోజుల్లో తేలిగ్గా వచ్చేదన్న కొందరి అభిప్రాయం సరైంది కాదన్నారు డాక్టర్ గారు. అది నిజం కాదని అంటూ, అప్పుడు సర్కారు - సీమ జిల్లాలకు కలిపి ఒకే ఒక్క మెడికల్ కాలేజీ వుండేదని, సీట్లు మొత్తం 54 మాత్రమే వుండేవని, వాటిలో ఎంపీసి (లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ) సబ్జెక్టులు తీసుకున్న వారికి - సైన్స్ లో బి., బి.ఎస్సీ చేసిన వారికి కూడా అవకాశం వుండేదని అన్నారు. రాధాకృష్ణమూర్తిగారి బాచ్ లో 54 మందికి గాను, 28 మంది గ్రాడ్యుయేట్లే. అందులో ఇద్దరు ఎమ్మెస్సీ చేసిన వారున్నారు. ఒకరు (విజయనగరానికి చెందిన రామ మోహన రావు గారు) పూనాలో ఇంటర్ + ఎల్ ఎల్ బి చేసి వచ్చారు.

· Marx to L. Krugman (9th October, 1866: Selected Works – Volume-I):

“In desperate situations, every human being feels the need of unburdening himself to somebody. But he does that only to persons in whom he places particular and exceptional confidence”

· Engles on Marx at his funeral:

“He may have many opponents – but he had hardly one enemy”

Thursday, June 10, 2010

బంగ్లాదేశ్ ఆవిర్భావం గురించి స్టాలిన్ జోస్యం-భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు విప్లవ పాఠాలు : వనం జ్వాలా నరసింహారావు

(జూన్ నెల 12, 13, 14 తేదీలలో
సీపీఐ జాతీయ సమితి సమావేశాలు
హైదరాబాద్ లో జరుపుకున్న నేపధ్యంలో)

వనం జ్వాలా నరసింహారావు

భారత దేశంలో పరిస్థితులు సోషలిస్ట్ విప్లవానికి అనుకూలంగా లేవని, ప్రాధమిక దశలో వ్యావసాయిక ప్రాధాన్యమైన విప్లవం చేపట్టడానికి వీలు కావచ్చునని, "బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోతుందని", గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు అసలే లేవని, చైనా పరిస్థితులను భారత దేశ పరిస్థితులతో పోల్చడం సరైందికాదని అరవై ఏళ్ల క్రితం, ఫిబ్రవరి 1951 లో సోవియట్ యూనియన్ ను సందర్శించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు స్పష్టం చేశారు స్టాలిన్. చి యాంగ్‌కై-షేక్ తో జవహర్ లాల్ నెహ్రూను పోల్చడం సరికాదని, నెహ్రూ బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా అయ్యే అవకాశాలు అసలే లేవని, ఆయనకు ప్రజల్లో అభిమానం బలంగా వుందని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని కూడా స్పష్టం చేశాడు స్టాలిన్.

హైదరాబాద్ లో మూడు రోజులు జరిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి సమావేశాలలో సమకాలీన జాతీయ-అంతర్జాతీయ రాజకీయాలు, పార్టీ భవిష్యత్ లో అవలంబించాల్సిన వైఖరికి సంబంధించిన విషయాలు చర్చకొచ్చాయి. యూపీఏ వైఫల్యాలను ఎండగట్టడంలో వామ పక్షాలు విఫలమయ్యాయని, పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి వామ పక్షాలకు పెద్ద ఎదురుదెబ్బని-పరాజయంగా భావించాలని, బెంగాల్ అనుభవం దృష్ట్యా కమ్యూనిస్ట్ పార్టీ విధాన-రాజకీయ వైఖరులను సమీక్షించుకోవాల్సిన అవసరముందని సమావేశాలను ప్రారంభించిన జాతీయ కార్యదర్శి బర్ధన్ అన్నారు. ఈ సందర్భంగా, మహోన్నత చరిత్రకు గుర్తుగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్న భారత కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి, పార్టీ ఆవిర్భావం-ఎదుగుదల గురించి, చీలికల గురించి, అభిప్రాయ భేదాల గురించి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

అవిభక్త భారత కమ్యూనిస్ట్ పార్టీ సారధ్యంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, 1951 సంవత్సరం అక్టోబర్ నెలలో ఉపసంహరించి సుమారు అరవై ఏళ్లు కావస్తోంది. ఉపసంహరణ పూర్వ రంగంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి వర్గం, సోవియట్ ప్రతినిధి వర్గానికి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలు యధాతధంగా, రష్యన్ భాషలో వున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఇంగ్లీషులో అనువదించి, గుంటూరు జిల్లాకు చెందిన ఒక ప్రముఖ వైద్యుడు (డాక్టర్ సీహెచ్ కె వి ప్రసాద్) బహిర్గతం చేశారిటీవల. చారిత్రక ప్రాధాన్యమున్న అందులోని విషయాలు తెలంగాణా సాయుధ పోరాటానికి సంబంధించినవి మాత్రమే కాకుండా, భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుసరిస్తూ వస్తున్న-భవిష్యత్ లో అనుసరించాల్సిన పంథాకు సంబంధించినవి కూడా. భారత కమ్యూనిస్ట్ పార్టీ అతివాద, మితవాద వర్గాలుగా, తర్వాత నక్శలైట్లగా-మావోఇస్టులుగా, మధ్యలో మితవాద వర్గం వారు డాంగేయులుగా-మొహిత్ సేన్ పక్షం వారిగా, చీలిపోవడానికి కారణాలు కూడా అంతర్లీనంగా ఆ డాక్యుమెంట్లలో వున్నాయి. చర్చలకు ముందు, సోవియట్ బృందం పరిశీలనకు తయారు చేసిన డాక్యుమెంటులో, ప్రతినిధి బృందం సభ్యుల వివరాలు, ప్రధమ పార్టీ మహాసభల నుంచి 1951 వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, రాజేశ్వరరావు-బసవ పున్నయ్యల, డాంగే-అజయకుమార్ ఘోష్ ల విడి-విడి అభిప్రాయాలు పొందుపరచడం జరిగింది. భారత దేశంలో విప్లవ మార్గం అవలంభించడానికి అనువైన పరిస్థితులున్నాయా-లేవా? సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకుని అధికారాన్ని హస్తగతం చేసుకోగల దా? చైనా తరహా విప్లవం సాధ్యమేనా? లాంటి పలు సందేహాలను డాక్యుమెంటులో చేర్చారు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ, పరిణామక్రమం గురించి ఆసక్తి గల పరిశోధకులకు డాక్యుమెంటులోని వివరాలు ప్రాముఖ్యత సంతరించుకున్న వనే అనాలి. అలనాటి "భారత కామ్రేడ్ల" మధ్య తలెత్తిన తీవ్ర విభేదాల నేపధ్యం ప్రస్తావిస్తూ, ప్రధమ పార్టీ మహాసభలో (1943 మే నెల) పీసీ జోషి సెక్రటరీ జనరల్ గా ఎన్నిక కావడం, ఐదేళ్ల తర్వాత జరిగిన రెండవ మహాసభలో (మార్చ్ 1948) ఆయన స్థానంలో రణదివే రావడం, జోషి ఆలోచనా విధానం మితవాద విధానంగా ముద్రవేసి ఆయనను పార్టీ నుంచి తొలగించడం, రణదివే ప్రతిపాదించిన "భారత జాతీయ ప్రజాస్వామ్య విప్లవ వ్యూహం తీరు తెన్నుల" ను పోలిట్ బ్యూరో ఆమోదించడం, ఆంధ్ర పార్టీకి చెందిన రాజేశ్వరరావు-బసవ పున్నయ్యలు రణదివే వ్యూహాన్ని విమర్శించడం, దరిమిలా 1950 మే నెలలో కేంద్ర కమిటీ రణదివే విధానాలను ఖండించి ఆయన స్థానంలో జూన్ నెలలో చండ్ర రాజేశ్వరరావును ఎన్నుకోవడానికి సంబంధించిన అంశాలున్నాయందులో. పార్టీ సభ్యులకు చండ్ర రాజేశ్వరరావు రాసిన ఉత్తరంలో, సాయుధ పోరాట పంథాను అనుసరించాలని-దానికి వారి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసారు. ఆ మార్గాన్ని వ్యతిరేకించిన డాంగే-ఘోష్ నాయకత్వం, కేంద్ర కమిటీ యాంత్రికంగా చైనా అనుభవాన్ని భారత దేశానికి అన్వయించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించింది. డిసెంబర్ నెలలో జరిగిన పార్టీ ప్లీనంలో తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తడంతో సోవియట్ నాయకుల సలహా కొరకు వచ్చిన విషయం కూడా డాక్యుమెంట్ లో పేర్కొనడం జరిగింది. చర్చలు ప్రారంభమైన మొదటి రోజున ప్రతినిధి బృందంలోని నలుగురు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు తొలుత. ఒక వైపు డాంగే-ఘోష్ లు విప్లవ సాయుధ పోరాట మార్గాన్ని వ్యతిరేకించగా, మరో వైపు ఆ పంథా సరైన మార్గమని రావు-పున్నయ్యలు వాదించారు. విప్లవ మార్గాన్ని బోధించిన చండ్ర రాజేశ్వరరావు కొన్నాళ్లకు మితవాద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కావడం, దాన్ని వ్యతిరేకించిన రణదివే సిపిఎం నాయకుడు కావడం ఆశ్చర్యకరమైన విషయం అనాలి.

ఇరవయ్యో శతాబ్దపు మలి దశాబ్దంలో, ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం, పలు దేశాలను కలవర పెట్టింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన బ్రిటన్ లాంటి దేశాలలో కార్మికుల సమ్మెలు సుదీర్ఘంగా సాగాయి. ఆ కాలంలోనే, భారత దేశంలో కూడా కార్మికవర్గ ఉద్యమాలు ఊపందుకుని, పలువురిని కమ్యూనిజం వైపు మళ్లడానికి ఊతమిచ్చాయి. అదే రోజుల్లో, 1917 నాటి రష్యన్ విప్లవ తదనంతర రాజకీయ-సామాజిక పరిణామాలు ఎన్నో దేశాలపై ప్రభావం చూప సాగాయి. 1919 లో మాస్కోలో ఆవిర్భవించిన మూడవ అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సంస్థ-కోమిన్టార్న్, ప్రపంచవ్యాప్తంగా, బూర్జువా వ్యవస్థకు వ్యతిరేకంగా, అన్ని రకాల పోరాటాలు సలిపి, అంతర్జాతీయ సోవియట్ రిపబ్లిక్ స్థాపనకు ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఎం ఎన్ రాయ్ మాస్కో సందర్శించిన సందర్భంలో, సోవియట్ కమ్యూనిస్ట్ నాయకుడు లెనిన్ కు ఆయన పట్ల ఏర్పడ్డ విశ్వాసం, ఆయనను కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు ప్రోత్సహించడం, అక్టోబర్ 17, 1920 న తాష్కెంటులో, భారత కమ్యూనిస్ట్ పార్టీని నెలకొల్పడం జరిగింది. భారత దేశాన్ని పాలిస్తున్న బ్రిటన్, దేశంలోని వామ పక్ష భావాలున్న వారిపై కూడా కోమిన్టకర్న్ ప్రభావం పడే ప్రమాదం వుందని భావించి, పలువురి పై తప్పుడు కుట్ర కేసులు పెట్టి జైళ్లలో పెట్టే ప్రయత్నాలు చేసింది. "కోమిన్టిర్న్" సంస్థకు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఎం ఎన్ రాయ్, వామ పక్ష భావాలకు ఆకర్షితులైన డాంగే, ముజఫర్ అహ్మద్, నళిని గుప్త, షౌకత్ ఉస్మాని, సింగరవేలు చెట్టియార్, గులాం హుస్సేన్ లాంటి పలువురు కమ్యూనిస్ట్ భావాల నాయకులపై "కాన్పూర్ కుట్ర కేసు" పెట్టి, బ్రిటీష్ ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది. మార్చ్ 17, 1924 న బనాయించిన చారిత్రాత్మక కాన్పూర్ కుట్ర కేసు, పరోక్షంగా, భారత దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావానికి దోహద పడిందనాలి.

వామ పక్ష భావాల పట్ల ఆకర్షితులైన పలువురు నాయకులు, తమ పట్ల బ్రిటీష్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా, డిసెంబర్ 1925 లో కాన్పూర్‌లో సమావేశమై, "వర్కర్స్ అండ్ పెజెంట్స్ పార్టీల" పేరుతో బహిరంగ ఐక్య వేదికను ఏర్పాటు చేసుకుని, కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయసాగారు. ఇదిలా వుండగా, వారి పురోగతిని అడ్డుకునేందుకు, వారందరి పైనా "మీరట్ కుట్ర కేసు" పెట్టింది బ్రిటీష్ ప్రభుత్వం. కాకపోతే, ప్రభుత్వం అంచనాలకు విరుద్ధంగా, ఆ కేసు విచారణ కమ్యూనిస్ట్ పార్టీ పట్ల కార్మికుల్లో అభిమానాన్ని పెంచ సాగింది. జనవరి 1933 లో, "బోల్షవిక్కులని" ప్రభుత్వం ముద్ర వేసిన కేసులోని నిందితులందరి కీ కఠిన శిక్షలు పడ్డాయి. నాలుగున్నర సంవత్సరాల పాటు సాగిన న్యాయస్థానం విచారణను, కమ్యూనిజం సందేశం ప్రజల్లోకి పంపే ఆయుధంగా ఉపయోగించుకున్నారు నిందితులు. కమ్యూనిజం ఉద్యమంగా బలపడ సాగింది.

స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న రోజుల్లో, మరి కొన్నాళ్లలో, స్వతంత్రం రాబోతుండగా, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పట్ల-జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం పట్ల అనుసరించాల్సిన విధానంలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి జోషి మితవాద వైఖరిని, అతివాద భావాల రణదివే అనుచరులు వ్యతిరేకించారు. ఫిబ్రవరి 1948 లో కలకత్తాలో జరిగిన ద్వితీయ పార్టీ సమావేశం, "స్వతంత్ర భారతదేశం" అంటే, "బ్రిటీష్ సామ్రాజ్య వాదుల పాక్షిక వలస ప్రాంతం" గా పేర్కొని, మితవాదిగా ముద్రవేసిన జోషిని తప్పించి, రణదివే ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. రణదివే "కలకత్తా సిద్ధాంతం" సాయుధ పోరాటాలను ప్రోత్సహించడంతో, వీర తెలంగాణా విప్లవ పోరాటానికి దోహద పడింది.

మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన వీరోచిత తెలంగాణా సాయుధ ప్రతిఘటన, ఎలా సాగిందో, సవివరంగా, స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య తన "వీర తెలంగాణా విప్లవ పోరాటం గుణపాఠాలు" పుస్తకంలో తెలియచేశారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం కావడంతో కమ్యూనిస్ట్ పార్టీకి చిక్కు సమస్య ఎదురైంది. ప్రతిఘటనను కొనసాగించడమా ? విడనాడి చట్ట సమ్మతమైన పోరాటాలను-ఆందోళనలను చేపట్టడమా? అన్న సందిగ్ధంలో కమ్యూనిస్ట్ నాయకత్వం పడింది అంటారు. ఆ జీవన్మరణ సమస్యపై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో పరస్పర విరుద్ధమైన తీవ్ర అబిప్రాయ భేదాలు తలెత్తడంతో, ఉపసంహరణ పూర్వ రంగంలో, స్వర్గీయ చండ్ర రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా పార్టీ నూతన పోలిట్ బ్యూరో ఏర్పాటయింది. దరిమిలా రూపొందించిన నూతన పార్టీ రాజకీయ విధానాన్ని వ్యతిరేకించే బలమైన వర్గానికి డాంగే ప్రభృతులు నాయకత్వం వహించారు. ఆ నాయకత్వానికీ-నూతన రాజకీయ విధానానికి మద్దతు పలికిన వారికీ, తెలంగాణా సాయుధ పోరాటాన్ని నిర్వహిస్తున్న వారికీ మధ్య తలెత్తిన విభేదాలతో పార్టీ రెండు ముఠాలుగా చీలిపోయిందని వివరించారు సుందరయ్యగారు తన పుస్తకంలో. భారత కమ్యూనిస్ట్ పార్టీలో భవిష్యత్ చీలికకు పునాదులు అలా పడ్డాయి.

చండ్ర రాజేశ్వరరావు చొరవతో, వివాదాస్పద సమస్యల్ని, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ నాయకులతోను, స్టాలిన్ తోను చర్చించడానికి ఆయనతో పాటు మాకినేని బసవ పున్నయ్య, అజయ కుమార్ఘోనష్, ఎస్ ఏ డాంగేలతో కూడిన ప్రతినిధి వర్గం మాస్కోకు వెళ్లింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందంతో చర్చించేందుకు స్టాలిన్ నాయకత్వంలో, మోలటోవ్, మాలెంకోవ్, సస్లోవ్ లతో ఒక కమీషన్ ను సోవియట్ పార్టీ నియమించింది. ఇరు బృందాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను సుందరయ్య గారు తన పుస్తకంలో కొంతవరకు పొందుపరిచారు. ఆ నాడు పార్టీలో ఏర్పడిన తీవ్ర సంక్షోభం కారణంగా, భారత విప్లవానికి సంబంధించిన సమస్యలు చర్చకొచ్చాయని, ఆ సమస్యలన్నీ తెలంగాణా సాయుధ పోరాటం సందర్భంగా వెలుగులోకి వచ్చాయని సుందరయ్య గారు వ్యాఖ్యానించారు. చర్చల సారాంశాన్ని భారత ప్రతినిధి బృందం కేంద్ర కమిటీకి వివరించడం, దరిమిలా అజయకుమార్ ఘోష్ ను, రాజేశ్వరరావు స్థానంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం, రైతాంగానికి భూమి హామీ వుంటుందని ప్రభుత్వం ఇచ్చిన మాట ఆధారంగా, పోరాటాన్ని విరమించుకోవడం మంచిదనే నిర్ణయానికి, తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించిన నాయకత్వం వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరించుకుంటూ చేసిన నిర్ణయం 1951 అక్టోబర్ 21 న బహిరంగంగా ప్రకటించటం జరిగింది.

భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం సమర్పించిన డాక్యుమెంటులో భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన అనేక విధానపరమైన ప్రశ్నలున్నాయి. అప్పట్లో భారత దేశంలో నెల కొన్న రాజకీయ స్థితిగతులను అంచనా వేయడం ఎలా? ఆ స్థితిగతులు విప్లవం వైపు పయనించే దిశగా వున్నాయా? అలా రాబోయే విప్లవాన్ని విశ్లేషించడం ఎలా? తెలంగాణా సాయుధ పోరాటం లాంటి పోరాటాలు దేశమంతా సాధ్యమేనా? సాయుధ పోరాట దిశగా ప్రజలను సిద్ధపర్చడానికి బూర్జువా తరహా ప్రజాస్వామిక విప్లవాలను, సామ్యవాద తరహా విప్లవాలను కలుపుకొని పోవాలా? చైనా తరహా గొరిల్లా విప్లవం భారత దేశంలో సాధ్య పడుతోందా? భూస్వామ్య-సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవంలో కార్మిక వర్గ పాత్ర ఎలా వుంటుంది? భారత స్వాతంత్ర్యాన్ని-సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకోవడమెలా? భారత విదేశాంగ విధానాన్ని కమ్యూనిస్ట్ దేశాలను దృష్టిలో వుంచుకుని ఎలా అర్థం చేసుకోవాలి?నవ భారత దేశంలో భూమిని జాతీయం చేయడం తగునా?పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి "మరణ దండన" విధించడం తగునా? లాంటి ప్రశ్నలను సోవియట్ పార్టీకి సంధించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ప్రశ్నలన్నిటి కి, తనదైన శైలిలో మర్నాడు జరిగిన చర్చల్లో స్టాలిన్ సమాధానం ఇచ్చాడు. భారత దేశంలోని పరిస్థితులు అప్పటికింకా సోషలిస్ట్ విప్లవానికి అనుకూలంగా లేవని స్పష్టం చేశాడు స్టాలిన్.

స్టాలిన్ నాయకత్వంలోని రష్యన్ల దృష్టిలో విప్లవమంటే, వ్యావసాయిక ప్రాధాన్యమయిందని, జమీందారీ వ్యవస్థను తొలగించి, రైతులకు భూమిని పంపిణీ చేయడం ఆ విప్లవం లక్షణమని, ఇది విప్లవంలో ప్రాధమిక దశని అంటాడు స్టాలిన్. దాన్నే ఆయన "పీపుల్స్ డెమోక్రాటిక్ రెవెల్యూషన్" అని వర్ణిస్తూ, అదే చైనాలో జరిగిందని చెప్పాడు. ఆ స్థితికి భారత దేశం అప్పుడప్పుడే వస్తుందన్నాడు. రెండో దశ, పారిశ్రామిక విప్లవం. ఆ దశకు భారత దేశం ఇంకా చేరుకోలేదని ఆయన అభిప్రాయం. రణదివే సిద్ధాంతాన్ని కూడా ఆయన తప్పుబట్టాడు. పోరాటం బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వుండాలని, అమెరికన్ సామ్రాజ్యవాదానికి కాదని కూడా అంటాడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది బ్రిటన్ నుంచేనని, భారత దేశం కామన్ వెల్త్ లో భాగమని ఘోష్ సందేహాన్ని నివృత్తి చేశాడు ఒక దశలో. ఒక్క ముద్దలోనే అన్నీ కలుపుకుని తినరాదని, ఒకే పర్యాయం శత్రువులందరినీ ఎదుర్కోవడం తగదని, తొలుత బ్రిటీష్ సామ్రాజ్య వాదులను-వాదాన్ని వదిలించుకోవాలని విప్లవ పాఠాలు బోధించాడు స్టాలిన్. అదే సిద్ధాంతం భూస్వామ్య జమీందారుల విషయంలోనూ వర్తిస్తుందన్నాడు. బ్రిటీష్ పాలన కాలంనాటి చిహ్నాలైన జమీందారీ వ్యవస్థను తొలుత వ్యతిరేకించాలన్నది ఆయన అభిప్రాయం.

"జాతీయ బూర్జువాలు" అంటే ఏమిటన్న బసవ పున్నయ్య ప్రశ్నకు, సామ్రాజ్యవాదమంటే, ఇతర దేశాలను ఆక్రమించుకోవడమేనని, జాతీయ బూర్జువాలకు అది చేత కాదని, చిన్న-పెద్ద-మధ్య కారు బూర్జువాలందరు (ధనికులు) జాతీయ సంపదను-వనరులను మాత్రమే దోపిడీ చేయగలరని, వారికి వ్యతిరేకంగా మూకుమ్మడిగా పోరాటం చేయ తగదని వివరణ ఇచ్చాడు స్టాలిన్. జాతీయ బూర్జువాలలో చాలా మంది, కమ్యూనిస్ట్ ఆలోచనా విధానంతో అంగీకరించే అవకాశం వుందని, వారిని కలుపుకుని పోవడం మంచిదని అంటాడు. అత్యంత సంపన్న వర్గాలకు చెందిన బూర్జువాలు బ్రిటీష్ తొత్తులుగా పనిచేసినందున వారిని వ్యతిరేకించాలంటాడు. "పాకిస్తాన్, భారత దేశం, శ్రీ లంక" లకు చెందిన ప్రజలు ఉమ్మడిగా తమ-తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి విప్లవంలో భాగస్వాములయ్యే అవకాశాల గురించి కూడా మాట్లాడుతూ, "బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోతుంది" అని జోస్యం చెప్పాడు. ఆయన చెప్పిన పాతికేళ్ళకు బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా వివరించుకుంటూ పోయిన స్టాలిన్, గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు అసలే లేవని, చైనా పరిస్థితులను భారత దేశ పరిస్థితులతో పోల్చడం సరైందికాదని అంటాడు. చైనా కు చెందిన చి యాంగ్కైు-షేక్ ఆ దేశంలో వున్నంతవరకు అమెరికన్ల కీలుబొమ్మ కాదని, ఎప్పుడైతే, ఫార్మోజా (తైవాన్) కు వెళ్లాడో, అప్పుడే కీలుబొమ్మగా మారాడని అంటూ, జవహర్ లాల్ నెహ్రూను ఆయనతో పోల్చడం సరికాదంటాడు. నెహ్రూ, బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా అయ్యే అవకాశాలు అసలే లేవని అంటాడు. ఆయన పట్ల ప్రజల్లో అభిమానం వుందని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని స్పష్టం చేశాడు స్టాలిన్.

భూస్వాములకు-జమీందారులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనను, వ్యవసాయ కూలీల సమ్మెను, కౌలు దార్ల హక్కుల పోరాటాన్ని, మిగులు భూముల ఆక్రమణను కమ్యూనిస్టుల ఉద్యమంలో భాగం కావాలని చెప్పాడు. కార్మికుల హక్కుల కొరకు కూడా పోరాడాలని అంటాడు. అలా కార్మిక-కర్షక వర్గాలను సమీకరించి పోరాటాలు సలపాలిగాని, "అంతర్యుద్ధం" చేయడానికి సమయం ఆసన్నమైందని భ్రమ పడవద్దని హెచ్చరించాడు. తెలంగాణా సాయుధ పోరాట ఫలితాలను కార్మిక-కర్షక వర్గాలు అనుభవించేందుకు నిరంతర పోరాటం సలపాలని సలహా ఇచ్చాడు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల పార్టీ వ్యతిరేక కలాపాలకు మరణ దండన విధించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత హింసను కూడా ఆయన వ్యతిరేకించాడు.

అప్పటివరకు అంతర్గతంగా వుండిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీలోని విధానపరమైన అభిప్రాయ భేదాలు, భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు బహిర్గతమయ్యాయి. డాంగే, ఆ సమయంలో పార్లమెంట్ లోక సభలో కమ్యూనిస్ట్ పక్షం నాయకుడు. చైనా పట్ల అవలంబించాల్సిన వైఖరి విషయంలో, పార్టీ నాయకత్వంలో తీవ్రమైన చర్చలు జరిగాయి. డాంగే, గోవిందన్ నాయర్, ముజఫర్ అహ్మద్ ల నాయకత్వం, ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు ఇచ్చిన మద్దతును తీవ్రంగా వ్యతిరేకించారు జోషి నాయకత్వంలోని మరో వర్గం. ఒకప్పుడు అదే జోషి నెహ్రూకు అనుకూలంగా మాట్లాడినప్పుడు ఆయనను తప్పుబట్టింది పార్టీ. డాంగే వర్గం లేవనెత్తిన "జాతీయ వాదన" కు అనుకోకుండా లోక్ సభలో పార్టీ ఉప నాయకుడు ఏ కే గోపాలన్ నుంచి మద్దతు లభించడం ఆశ్చర్యకరమైన విషయం. నెహ్రూ చర్యకు తమ పూర్తి మద్దతుంటుందని గోపాలన్ ప్రకటించారు. ప్రారంభ దశలో డాంగే వాదనకే మెజారిటీ సభ్యుల ఆమోదం లభించింది. ఎప్పుడైతే, "అంతర్జాతీయ కమ్యూనిజం" విషయంలో, డాంగే తనదైన నిర్వచనం చెప్పాడో, మౌలిక పరమైన కమ్యూనిజం విధానాలను వ్యతిరేకించడం ఇష్టపడని పలువురు, ఆయనకు తొలుత మద్దతిచ్చినప్పటికీ, క్రమేపీ ఆయనకు దూరమయ్యారు. సీపిఐ సెక్రెటేరియట్ లోని ఎనిమిది మంది సభ్యుల్లో రణదివే-జోషి లు చైనా అనుకూలురైన "అతివాదులుగా", డాంగే-గోపాలన్-ముజఫర్ అహ్మద్ లు నెహ్రూకు అనుకూలురైన "నిరోధక వాద శక్తులు" గా, అజయ్ ఘోష్-జ్యోతి బసులు మధ్యే వాదులుగా, భూపేష్ గుప్త ఎటూ తేల్చుకోని వాడిగా బయట పడ్డారు. చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ చేసిన తర్వాత, రాజీ మార్గంలో నడిచిన కమ్యూనిస్ట్ నాయకత్వం, మితవాద వర్గానికి చెందిన డాంగేను పార్టీ చైర్మన్ (అంతకు ముందు లేని పదవి) గా, మితవాద-అతివాద వర్గాలకు సమాన దూరంలో వున్న ఇఎంఎస్ నంబూద్రిపాద్ ను సెక్రెటరీ జనరల్ గా నియమించింది.

అదే సమయంలో, భారత-చైనా యుద్ధం నేపధ్యంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన "చైనా అనుకూల వాదులు" గా భావించబడిన పలువురిని దేశవ్యాప్తంగా పీడీ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అరెస్టయిన వారిలో పోలిట్ బ్యూరో సభ్యుల స్థాయినుండి, జిల్లా స్థాయి ముఖ్యనాయకుల వరకూ వున్నారు. డాంగే, ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో, మధ్యే మార్గంలో, అతివాద-మితవాద వర్గాలకు సమాన దూరంలో వున్న నంబూద్రిపాద్ లాంటి వారు, అతివాదుల వైపు మొగ్గడానికి దారితీసింది. క్రమేపీ సంభవించిన కొన్ని పరిణామాలు పార్టీ చీలిక దిశగా తీసుకెళ్లాయి. చీలిక అనివార్యమయింది. ఏప్రిల్ 11, 1964 న నంబూద్రిపాద్, జ్యోతిబసులతో సహా ముప్పై రెండు మంది డాంగే విధానాలను వ్యతిరేకిస్తూ, జాతీయ కౌన్సిల్ సమావేశాలనుంచి నిష్క్రమించడంతో, వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలిలో బహిష్కృత అతివాద వర్గం సమావేశమవడం, కలకత్తాలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరపాలని తీర్మానించడం జరిగింది. అక్టోబర్-నవంబర్ 1964 లో కలకత్తా కాంగ్రెస్ పేరుతో అతివాద వర్గం, సమాంతరంగా బాంబేలో డాంగే నాయకత్వంలోని మితవాద వర్గం సమావేశాలు జరుపుకున్నాయి. కలకత్తాలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గా అవతరించగా, బాంబేలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ గా వుండిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తొలి ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్యను ఎన్నుకున్నారు సమావేశంలో.

కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిపోవడంతో, కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడిందా, లేదా, అందరికీ తెలిసిన విషయమే. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలకు మాత్రమే కమ్యూనిస్టుల ప్రాబల్యం పరిమితమై పోయింది. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన "తెలంగాణా సాయుధ పోరాటానికి" నాయకత్వం వహించిన ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ సొంతంగా మనుగడ సాగించే స్థితిలో లేదిప్పుడు. పార్టీ ఎదుగుదలకు కష్టపడిన పలువురు పార్టీని వదిలిపెట్టడమో, పార్టీ వారిని వదిలించుకోవడమో జరిగింది. మే నెల 1981 లో కారణాలేమైనప్పటికి, భారత కమ్యూనిస్ట్ పార్టీ పరోక్ష వ్యవస్థాపకుల్లో ఒకరైన డాంగేను, ప్రపంచ స్థాయిలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పేరు తెచ్చుకున్న డాంగేను భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరించారు. డాంగేను ఆయన కూతురు సారధ్యంలో ఆవిర్భవించిన "అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీకి" ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు ఆ తర్వాత. ఆ పార్టీకి రాజకీయంగా ఎదుగుదల సాధ్య పడకపోవడంతో, మోహిత్ సేన్ నాయకత్వంలో పనిచేస్తున్న "ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ" తో కలిసిపోయి "యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ" తో విలీనమయింది. మరోవైపు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పరిస్థితీ అంతే అనాలి. అఖిల భారత స్థాయిలో సోమనాథ్ ఛటర్జీ స్థాయి నాయకులనుంచి, ఆంధ్ర ప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాలో పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్ట బడ్డ పలువురిని పార్టీ వదిలించుకుంది. మరోవైపు ఆ పార్టీ నుంచి నక్సల్బరీ ఉద్యమ ఫలితంగా విడిపోయిన తీవ్రవాదులు, మావోయిస్టులుగా సాయుధ పోరాటమే మార్గమని నమ్ముతున్నారింకా.

ఇందిరా గాంధికి, సోనియా గాంధికి అవసరమైనప్పుడల్లా, కాంగ్రెస్ పార్టీకి (ఉభయ) కమ్యూనిస్టులు అండగా నిలుస్తూ వస్తున్నారు. అసలా మాటకొస్తే, ప్రపంచంలోనే ప్రప్రధమంగా విప్లవం ద్వారా అధికారంలోకి వచ్చిన సోవియట్ యూనియన్ రూపు రేఖలే మారిపోయాయి. చైనా పార్టీలోను మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో భవిష్యత్ లో భారత కమ్యూనిస్ట్ పార్టీల వ్యూహం ఎలా వుంటుందో చూడాలి. (End)