Showing posts with label బెజవాడ గోపాలరెడ్డి. Show all posts
Showing posts with label బెజవాడ గోపాలరెడ్డి. Show all posts

Friday, February 3, 2017

"అయ్యదేవర" చలవతో అద్భుత పదకోశం : వనం జ్వాలా నరసింహారావు

"అయ్యదేవర" చలవతో అద్భుత పదకోశం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (04-02-2017)

ఐదు దశాబ్దాల క్రితం, అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం- నాటి అసెంబ్లీ స్పీకర్ ఆయ్యదేవర కాళేశ్వరరావు ఆదేశాల మేరకు (1963 లో) ప్రచురించిన 820 పేజీల శాసన, న్యాయ, పరిపాలనా సంబందమైన (తెలుగులో) పారిభాషిక పదకోశం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. బహుశా అప్పటికీ, ఇప్పటికీ, తత్సంబంధమైన మొట్టమొదటి, చిట్ట చివరి పుస్తకం ఇదే కావచ్చునేమో! ఆ తరువాత తెలుగులో అలాంటి పుస్తకాలు ప్రభుత్వ పరంగా కాని, ప్రయివేట్ పరంగా కాని, ప్రచురించిన దాఖలాలు లేవు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం రాజకీయ శాస్త్రం విభాగంలో రిజిస్ట్రార్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఎనబై ఏళ్ల ఆచార్య మారంరాజు సత్యనారాయణరావుకు ఈ పుస్తకం కాపీ ఒకటి, హైదరాబాద్ ఆబిడ్స్ సెకండ్ హాండ్ బుక్ స్టాల్ లో దొరికింది ఓ మూడేళ్ల క్రితం. అప్పటినుంచి ఆయన దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి, ఎవరైనా పునర్ముద్రణ చేయిస్తారేమోనని చాలా మంది దగ్గర ప్రస్తావించినా ఫలితం లేకపోయింది. ఆయన దగ్గర ఆ పుస్తకాన్ని తెచ్చుకుని చూసి, కొంత చదివిన తరువాత పుస్తకానికి సంబంధించిన అంశాలను పదిమందితో పంచుకోవాలనిపించింది.

పుస్తక ప్రచురణ పూర్వ రంగంలో చాలా కృషి జరిగింది. శాసన, న్యాయ, పరిపాలనా సంబంధమైన పారిభాషిక పదాలకు తెలుగులో "సమానార్థకాలు" రూపొందించేందుకు తొలుత తెలుగు పారిభాషిక పదకోశ సంఘం ఏర్పాటైంది. మొదట, 24 మంది సభ్యులుగా, 6 మంది సహ సభ్యులుగా, ఈ సంఘాన్ని, శాసనసభ అధ్యక్షుడిగా వున్న స్వర్గీయ ఆయ్యదేవర కాళేశ్వరరావు అక్టోబర్ 30, 1957 న నియమించారు.  దానికి అధ్యక్షుడుగా శాసన సభ స్పీకర్ గా వున్న కాళేశ్వరరావు వ్యవహరించారు. సంఘానికి నిర్దేశించిన అంశాలలో ప్రధానమైంది శాసనసభ ఆధ్వర్యం కింద ప్రచురించేందుకు తెలుగులో పదకోశం తయారు చేయడమే కాగా, మరోటి సాధారణంగా సమావేశాలు హైదరాబాద్ లోనే జరగాలనేది. శాసనసభ కార్యదర్శిగా పనిచేస్తున్న జీవీ చౌదరిని సంఘానికి కార్యదర్శిగా నియమించారు.

సంఘంలో సభ్యులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, చాలామంది ప్రముఖులుండడం విశేషం. వారిలో....డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి (నాటి ఆర్థిక మంత్రే కాకుండా సాహిత్య అకాడమీ అధ్యక్షుడు కూడా), జెవి నరసింగరావు (మంత్రి), డి సంజీవయ్య (మంత్రి), ఎమ్మెల్యేలు పీవీ నరసింహారావు (తరువాతి కాలంలో ప్రధాన మంత్రి), రావి నారాయణరెడ్డి, సాహిత్య అకాడమీ కార్యదర్శి దేవులపల్లి రామానుజరావు, పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు, బోయి బీమన్న (అప్పట్లో ప్రభుత్వ అనువాదకుడు), డాక్టర్ గిడుగు సీతాపతి, మామిడిపూడి వెంకటరంగయ్య, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కాళోజీ నారాయణరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, ఖండవల్లి లక్ష్మీ రంజనం, మాడపాటి హనుమంతరావులు వున్నారు. ఒక ఏడాది తరువాత, నిర్దేశించిన కార్యక్రమం పురోగతిలో వుండగానే, పని మరింత వేగవంతంగా కొనసాగేందుకు, మొదట నియమించిన కమిటీని రద్దు చేసి 14 మంది సభ్యులుతో కొత్త సంఘాన్ని డిసెంబర్ 12, 1958 న ఏర్పాటు చేశారు సభాపతి కాళేశ్వరరావు. మొదటి కమిటీ సభ్యుల్లో కొందరు, కొత్తవారు కొందరు అందులో వున్నారు. భీమన్న, రావి, దేవులపల్లి, కాళోజీ, పీవీ లాంటి వారు ఈ కమిటీలోనూ కొనసాగారు. మొదట ఏర్పాటు చేసిన సంఘంలోని సభ్యుడు బెజవాడ గోపాలరెడ్డి రాజీనామా చేయడం వల్ల ఆయన స్థానంలో వేమరాజు భానుమూర్తిని నియమించారు స్పీకర్.

పుస్తకానికి తొలిపలుకు నాటి శాసనసభ కార్యదర్శి జీవీ చౌదరి రాయగా, తెలుగు పారిభాషిక పదకోశ సంఘం నివేదిక పేరుతో మలిపలుకు సభాపతి అయ్యదేవర రాశారు. ఆలోచన నుంచి కార్యాచరణవరకు, చివరకు పుస్తకంగా వెలువడేందుకు దోహదపడ్ద అనేక అంశాలను ఆయన అందులో ప్రస్తావించారు. "" నుంచి "జడ్" వరకున్న దాదాపు 26, 000 ఆంగ్ల పదాలకు హిందీ సమానార్థకాలతో పార్లమెంటరీ సంఘం పదకోశం తయారు చేసిందనీ, దీనిని లోక సభ సచివాలయం ప్రచురించిందనీ, ఆ ఆంగ్లపదాలే తెలుగులో ప్రచురించిన పదకోశానికి ప్రామాణికమని, ప్రాతిపదిక అనీ కాళేశ్వరరావు పేర్కొన్నారు.

మొదట ఏర్పాటు చేసిన సంఘం డిసెంబర్ 2, 1957 న పని ప్రారంభించి, మొత్తం 18 సమావేశాలు జరిపింది. కడపటి సమావేశం జులై 25, 1958 న జరిగింది. ఆంగ్ల పదాలతో సమగ్రమైన ఒక జాబితాను రూపొందించి, వాటికి సరైన తెలుగు పదాలను తయారు చేసేందుకు, సంఘం తన మొదటి సమావేశంలో ఆరుగురు సభ్యులుతో ఒక ఉపసంఘాన్ని నియమించింది. పద్మభూషణ మాడపాటి హనుమంతరావు అధ్యక్షుడుగా, భోయి భీమన్నసమావేశకర్తగా ఏర్పాటైన ఉపసంఘంలో హేమాహేమీలైన ఖండవల్లి లక్ష్మీరంజనం, దేవులపల్లి రామానుజరావు, కాళోజీ నారయాణరావు, పీవీ నరసింహారావు సభ్యులు. డిసెంబర్ 16, 1957 నుంచి డిసెంబర్ 28, 1957 వరకు ఉపసంఘం ఆరు సమావేశాలు జరిపి తెలుగు సమానార్థకాలతో వంద ఆంగ్ల పదాల పట్టికను రూపొందించింది. లోక్ సభ సచివాలయం ప్రచురించిన పదకోశంలోని కొన్ని పదాలకు కూడ ఈ ఉపసంఘం తెలుగు సమానార్థకాలను రూపొందించింది. జనవరి 4, 1958 న జరిగిన సమావేశంలో పదకోశాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అవలంభించవలసిన పద్ధతులను గురించి చర్చ జరిగిన అనంతరం, ఉపసంఘం రద్దు చేయడం జరిగింది. దాని స్థానంలో నాలుగు వేరే ఉపసంఘాలు ఏర్పాటయ్యాయి. వీటిలో రెండు హైదరాబాద్ లోను, మరో రెండు విజయవాడలోను ఏర్పాటయ్యాయి. అదనంగా కొద్ది రోజుల తరువాత ఒక సంపాదకీయ ఉపసంఘం కూడా ఏర్పాటైంది. ఒక ఉపసంఘానికి విశ్వనాథ సత్యనారాయణ, రెండో దానికి జీవీ సీతాపతి, మూడో దానికి-సంపాదకీయ ఉపసంఘానికి మాడపాటి హనుమంతరావు, నాలుగో దానికి ఖండవల్లి లక్ష్మీ రంజనం అధ్యక్షులుగా నియామకం జరిగింది.

విజయవాడ ఉపసంఘాలు రెండు కలిసి 60 సమావేశాలు, హైదరాబాద్ ఉపసంఘాలు 62 సమావేశాలు నిర్వహించింది. ఆంగ్ల వర్ణమాల లోని "ఏ" కింద వున్న అన్ని పదాలకు, "సీ" కింద వున్న 603 పదాలకు హైదరాబాద్ ఒకటవ ఉపసంఘం తెలుగు సమానార్థకాలను రూపొందించగా, రెండవ ఉపసంఘం "బీ", "డీ" ల కింద గల పదాలన్నింటికీ సమానార్థకాలను రూపొందించింది. ఇక విజయవాడ మొదటి ఉపసంఘం "సీ" కింద గల చాలా పదాలకు, రెండవ ఉపసంఘం "సీ" కింద గల 700 పదాలకు సమానార్థకాలను రూపొందించింది. సంపాదకీయ సంఘం 19 సమావేశాలు జరిపి "ఏ" నుంచి "డీ" వరకు గల ఆంగ్ల పదాలకు మూడు ఉపసంఘాలు రూపొందించిన సమానార్థకాలను సంకలనం చేసి తుది రూపమిచ్చింది. "" నుంచి "డీ" వరకు ఒక సంపుటిగా ప్రచురించాలని మొదట అనుకున్నప్పటికీ, పునఃపరిశీలన తరువాత, "ఇ" నుంచి "జడ్" వరకు గల పదాలకు కూడా సమానార్థకాలను రూపొందించిన తరువాతే అంతా కలిపి ఒకే సంపుటిగా వేయాలని నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. అందుకొరకే మొదట నియమించిన కమిటీని రద్దు చేసి 14 మంది సభ్యులుతో కొత్త సంఘాన్ని డిసెంబర్ 12, 1958 న ఏర్పాటు చేశారు సభాపతి.


రెండవ సారి ఏర్పాటైన తెలుగు పారిభాషిక పదకోశ సంఘం ఫిబ్రవరి 9, 1959 న పని ప్రారంభించి, జూన్ 4, 1960 వరకు మొత్తం 14 సార్లు సమావేశమైంది. తొలి సమావేశంలో హైదరాబాద్ లో రెండు, విజయవాడలో ఒకటి, మొత్తం మూడు ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. అలాగే నవంబర్ 28, 1959 న జరిగిన తొమ్మిదో సమావేశంలో మరొక ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఖండవల్లి లక్ష్మీ రంజనం అధ్యక్షుడుగా వున్న హైదరాబాద్ ఉపసంఘం 94 సమావేశాలు జరిపి. "ఇ, ఎఫ్, ఆర్, ఎస్" కింద గల పదాలకు, అలానే సాధారణ పరిపాలన శాఖ సూచించిన అనుబంధ జాబితాలోని "ఏ" నుంచి "ఓ" వరకు గల పదాలకు తెలుగు సమానార్థకాలను రూపొందించింది. కాళోజీ నారాయణరావు అధ్యక్షతన ఏర్పాటైన హైదరాబాద్ ఉపసంఘం 85 సమావేశాలు జరిపి "జీ, హెచ్, , పీ" కింద గల పదాలకు, జీఏడి సూచించిన అనుబంధ జాబితాలోని "పీ" నుంచి "జడ్" వరకు గల అన్ని పదాలకు సమానార్థకాలను తయారుచేసింది. డీ శివరావు అధ్యక్షతన గల విజయవాడ ఉపసంఘం 133 సమావేశాలు జరిపి "జె, కె, ఎల్, ఎమ్, ఎన్, , క్యు, టి, యు, వీ, డబ్ల్యు, ఎక్స్, వై, జడ్" ల కింద గల ఆంగ్ల పదాలకు సమానార్థకాలను రూపొందించింది.

బోయి భీమన్న అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక ఉపసంఘం 107 సమావేశాలు జరిపి, మిగతా ఉపసంఘాలు రూపొందించిన, రెండు ప్రధాన సంఘాలు పరిశీలించిన అన్ని తెలుగు సమానార్థకాలను సంకలనం చేసి, వాటికి తుది రూపమిచ్చింది. పదాలన్నింటినీ క్షుణ్ణంగా చదివి, ముద్రణకు వీలుగా చేసి, రాత తప్పులను సవరించి, వచ్చిన పదమే తిరిగి రాకుండా చేసి, అవసరమైన చోట్ల ఆయా పదాలను సవరించి, చివరలో ఈ ఉపసంఘం కీలకమైన పని చేసింది. పదకోశ ముద్రణా కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యత, పదకోశం తొలి కూర్పును తగిన రూపంలో వెలువరించే బాధ్యత కూడా ఈ ఉపసంఘమే తీసుకుంది. ఈ ఉపసంఘంలోని ఇతర సభ్యులలో కాళోజీ, పీవీ, దేవులపల్లి రామానుజరావులు కూడా వున్నారు. జులై 20, 1960 కల్లా అప్పగించిన పనిని పూర్తి చేసిందీ ఉపసంఘం.

ప్రధాన పదకోశ సంఘాలు, ఉపసంఘాలు, తమ కృషిలో భాగంగా అనేకానేక నిఘంటువులు, చారిత్రక, న్యాయ శాస్త్ర గ్రంథాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు, ఇతర రకమైన అనేక ప్రచురణల లోని పలు అంశాలను సందర్భానుసారంగా ఉపయోగించుకున్నారు. వాటిలో కొన్ని పేర్కొనాలంటే: ఆంధ్ర వాచస్పత్యము, సివిల్ ప్రొసీజర్ కోడ్, వార్డన్స్ లా లెక్సికన్, శబ్దార్థ చంద్రిక, కౌటిల్య అర్థశాస్త్రం, డిక్షనరీ ఆఫ్ లీగల్ టర్మ్స్, సంస్కృత-ఇంగ్లీష్ డిక్షనరీ, దస్తావేజోంకె నమూనే వున్నాయి. సంఘం సాధారణంగా తెలుగులో వాడుకలో వున్న పదాలనే సమానార్థకాలుగా నిర్ణయించడానికి ప్రయత్నించిందని, కొన్ని ఆంగ్ల పదాలను అలానే వుంచడం జరిగిందని, కొన్ని సందర్భాలలో దేశీయ ప్రత్యామ్నాయ పదాలు ఇవ్వబడ్డాయని, అయ్యదేవర కాళేశ్వరరావు తన మలిపలుకు లో రాశారు.

ఫిబ్రవరి 9, 1961 న స్పీకర్ ఆదేశాల మేరకు ఈ తెలుగు పదకోశం 5000 కాపీలు ముద్రించడానికి అంగీకరించి, రు.35, 200 మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 2000 కాపీలు శాసన మండలి సచివాలయానికి, 3000 కాపీలు సాధారణ పరిపాలన శాఖకు పంపకం చేయాలని స్పీకర్ ఆదేశాలిచ్చారు. పుస్తకం ధర కేవలం 12 రూపాయలే! ఆయన ఆదేశాల మేరకే పుస్తకం ముద్రణ జరిగింది. ఇప్పుడేమైనా కాపీలు మిగిలున్నాయో? లేదో?


అయ్యదేవర కాళేశ్వరరావు స్వాతంత్ర్య సమర యోధుడు. 1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయవాడకు ప్రాతినిధ్యం వహించాడు. విజయవాడ పురపాలక సంఘ అధ్యక్షుడిగానూ, మద్రాసు శాసనసభకు చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. 1939లో మద్రాసు శాసనసభకు విజయవాడ- బందరులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నికై, మద్రాస్ ప్రధానమంత్రి రాజగోపాలాచారికి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1955లో విజయవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు స్పీకర్‌గా ఎన్నికయ్యాడు. 1956 నుండి 1962 వరకు రాష్ట్ర శాసనసభ స్పీకరుగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1962లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు, కానీ ఫలితాలు వెలువడడానికి ముందురోజే తుదిశ్వాస వదిలాడు. ఆ మహనీయుడి కృషి ఫలితంగా, రూపుదిద్దుకున్న శాసన, న్యాయ, పరిపాలన పారిభాషిక పదకోశాన్ని అవసరమైన మార్పులు చేర్పులతో పునర్ముద్రిస్తే చట్ట సభల సభ్యులకు చాలా ఉపయోగంగా వుంటుంది. ఆ దిశగా గౌరవ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ స్పీకర్లు చొరవ తీసుకుంటే మంచిదేమో!   

Saturday, February 18, 2012

ఆర్థిక మంత్ర (త్రి) పఠనం: వనం జ్వాలా నరసింహారావు


నెల్లూరు జిల్లా బెజవాడ గోపాలరెడ్డి నుంచి అదే జిల్లాకు చెందిన ఆనం నారాయణరెడ్డి వరకు
వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపధ్యంలో, ఆదాయ వనరులు అంతగా ఆశాజనకంగా లేని తరుణంలో, "రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కుంటున్న నేపధ్యం" లో,  "వర్షాభావ పరిస్థితులు చోటు చేసుకున్న తరుణం" లో, ఆటుపోటులకు ఎదురు నిల్చి-సాహసోపేతంగా ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర శాసనసభలో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందరూ ఊహించినట్లే లక్షా నలబై ఐదు వేల కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్‌ను రూపొందించడంతో పాటు వ్యయాన్ని కూడా లక్షకోట్లు మార్కు దాటినట్లు ప్రకటించడం విశేషం. ప్రణాళికేతర వ్యయం రు. 91 లక్షల కోట్లుగా, ప్రణాళిక వ్యయం రు. 54 లక్షల కోట్లుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో మొట్ట మొదటిసారి "పేపర్ లెస్ బడ్జెట్‌ను" ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆనం రామనారాయణరెడ్డికి దక్కింది. ఉపాధి కల్పనకు, రాజీవ్ విద్యా ఉపాధి మిషన్‌కు, రాజీవ్ యువ కిరణాలకు పెద్ద పీట వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏటేటా సాగుతున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి (త్ర) పఠనకు ఏబైఏడేళ్ల సుదీర్ఘ చరిత్ర వుంది.

బడ్జెట్‌లో పన్నుల ప్రస్తావన లేకపోయినప్పటికీ, పరోక్షంగా చెప్పకనే చెప్పారు మనసులో మాట ఆర్థిక శాఖామాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి. ఉదాహరణకు వాణిజ్య పన్నుల శాఖ ఆదాయాన్ని పెంచుకుంటామని అనడం అంటే, పన్నులు విధించబోతున్నట్లే కదా! మద్యం అమ్మకాల ద్వారా మరి కొన్ని కోట్ల అదనపు వనరుల సేకరణ జరుపుకుంటాం అని చెప్పడమంటే, ప్రజల నెత్తిన మరికొంత భారాన్ని వేయడమే కదా! మరి, ఇవేవీ లేకుండా లక్షా నలబై ఐదు కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించడమంటే, కనీసం రాష్ట్రాన్ని రుణ వూబిలోకి నెట్టడమే కదా! ఆదాయ వనరుల సేకరణ సజావుగా సాగడానికి, పన్నులన్నా వుండాలి, అప్పులన్నా చేయాలి. ఈ రెండింటి లో ఏం చేయదల్చుకున్నారో ఆర్థికామాత్యులు ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, చెప్పదల్చుకున్నది దాచగలిగినా, చెప్పకుండా మాత్రం వుండలేకపోయారు.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి, నేటి వరకూ: 1955-56 నాటి బెజవాడ గోపాలరెడ్డి ప్రసంగం నుంచి 2012-2013 ఆనం రామనారాయణరెడ్డి ప్రసంగం వరకు, ఆసక్తికరంగా పరిశీలించుకుంటూ-పరిశోధించుకుంటూ పోతే, అర్థశాస్త్రంలో-సామాజిక-రాజకీయ శాస్త్రాలలో ఎంతో మంది డాక్టరేట్లు పొందే అవకాశం వుంది.

ఏక కాలంలో, జరిగిపోయిన సంవత్సరం ఆదాయ వనరులను సమీక్షించుకుంటూ, రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ-వ్యయ అంచనాలతో మొదలవుతుంది బడ్జెట్ ప్రసంగ ఉత్సవాల సంరంభం. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అవసరాలు, ఆదాయ వనరులకు సంబంధించిన గణాంక వివరాలే బడ్జెట్. సంక్షిప్త బడ్జెట్, అర్థశాస్త్ర పరిశీలన, సంవత్సర వార్షిక ప్రణాళిక, శాఖలవారీ వివరాలు, బడ్జెట్ విశ్లేషణ, ఇలా ఎంతో సమాచారాన్ని ఒకప్పుడు పుస్తకాల ద్వారా, ఇప్పుడు పేపర్ లెస్ ప్రక్రియ ద్వారా, తయారుచేసి, సంబంధిత లెక్కలను బహిర్గతం చేస్తుంది ప్రభుత్వం. ఇవన్నీ ఒక ఎత్తైతే, బడ్జెట్‌ను ప్రవేశపెట్తూ, ఆర్థిక మంత్రి చేసే ప్రసంగం మరో ఎత్తు. ఒక్కో ఆర్థిక మంత్రి, ఒక్కో రకంగా, తనదైన విశిష్ట శైలిలో, సభ్యులను-ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించే పలువురిని ఆకట్టుకునే రీతిలో, బడ్జెట్ ప్రసంగాన్ని తయారు చేసుకుంటారు. ఆయన ప్రసంగాన్ని, ఆ సమయంలో ఆయన ప్రదర్శించే మానరిజమ్స్ ను ఆసక్తిగా గమనిస్తుంటారెందరో. ఆర్థిక మంత్ర(త్రి) పఠనంలో, శ్లోకాలలోని బీజాక్షరాలలా, ప్రతి ఒక్క వాక్యానికి, బలీయమైన అర్థం-కారణం వుంటుంది. ఒక్కో సారి భావగర్భితంగా, నిగూఢంగా, స్పటికంలా కఠినంగా వుంటాయి మాటలు.

బెజవాడ గోపాలరెడ్డి జులై 8, 1955న చేసిన తన తొలి బడ్జెట్ ప్రసంగంలో నాటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రస్తావన తెచ్చారు. పంచవర్ష ప్రణాళికల ప్రస్తావన తెచ్చి, దేశ చరిత్రలో అవి ఒక నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టాయన్నారు. మార్చ్  2, 1956 న చేసిన ఆ తరువాతి ప్రసంగంలో "విశాలాంధ్ర" గురించి ప్రస్తావించారు. ప్రప్రధమ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన ఘనతా ఆయనదే. రెవెన్యూ ఖాతా కింద మితిమీరిన వ్యయాన్ని చూపించి, భావితరాల వారిపై రుణభారం మోపడం ఏ మాత్రం సమంజసం కాదని ఆయన ఆనాడన్న మాటలు నేటికీ వరాల మూటలు. ఆంధ్ర ప్రాంతంలో సరితూగేలా తెలంగాణ ప్రాంత అభివృద్ధి అచిర కాలంలోనే జరగాలని, ఈ లక్ష్య సాధనకు ఆదిలో అదనంగా వ్యయం చేయాల్సి వుంటుందని, తెలంగాణ ప్రాంతంలో వసూలైన ప్రతి పైసా ప్రత్యేకంగా లెక్క కట్టి, తెలంగాణ నిధులను తెలంగాణకే ఉపయోగించుతామని ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారప్పుడే! "తెలంగాణ ప్రాంతం వారికిచ్చిన వాగ్దానాలను గుర్తుంచుకోవడమే కాదు అమలు పరుస్తాను" అని బెజవాడ గోపాలరెడ్డి స్పష్టం చేసారు.  రాజనీతిజ్ఞతతో ఆనాడు బెజవాడ గోపాలరెడ్డి తెలంగాణ ప్రాంతానికిచ్చిన వాగ్దానాన్ని కాని, భావితరాల వారిపై రుణభారం మోపడం తప్పన్న విషయాన్ని కాని, రాష్ట్ర ప్రణాళిక విషయం కాని ఈ నాటి నేతలు గుర్తుంచుకుంటే అంతకన్నా ఏం కావాలి?ఎనిమిదవ సారి, ఆర్థిక మంత్రిగా చివరిసారి, (మద్రాస్ శాసన సభలో నాలుగు సార్లు, ఆంధ్రలో రెండు సార్లు, ఆంధ్ర ప్రదేశ్‌లో రెండు సార్లు) 1958-59 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 26, 1958 న బడ్జెట్ ప్రసంగం చేశారు బెజవాడ గోపాలరెడ్డి. అదే రాష్ట్రానికి సంబంధించినంతవరకు ప్రప్రధమ మిగులు బడ్జెట్. ఇక ఆ తరువాత "కాసు పర్వం" మొదలైంది. "పరిమిత రెవెన్యూ ఆదాయంతో, మితిమీరిన ప్రభుత్వ రుణభారంతో, బంగారు భవిష్యత్‌పై ఊహాగానాలతో" రాబోయే ఏడాది గురించి మూడు ముక్కలతో కాసు బ్రహ్మానందరెడ్డి 1959-60 సంవత్సరపు ఆర్థిక మంత్ర పఠనం మొదలైంది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, పిడతల రంగారెడ్డి లాంటి ఉద్దండ పిండాలు కూడా అదే తరహాలో ప్రసంగాలు తమదైన శైలిలో చేశారు. అదే ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది.

ఇంతకీ ఏమిటీ బడ్జెట్? ఇది కేవలం ఆర్థిక శాఖకు సంబంధించిన అంశమేనా? ఇతరులకు దాని విషయంలో-వివరాలు తెలుసుకోవడంలో ఏ అవసరం లేదా? ఇలాంటి ఆలోచనలన్నీ అపోహలే. బ్రిటన్ ఆర్థిక మంత్రిని "ఛాన్సలర్ ఆఫ్ ద ఎక్స్ చెక్కర్" అని సంబోధిస్తారు. ఆయన ప్రతి ఏడాది, రాబోయే ఆర్థిక సంవత్సరపు ఆర్థిక అవసరాలు, ఆదాయ-వనరుల వివరాలున్న కాగితాలను "చిన్న తోలు సంచీ” లో వేసుకుని, పార్లమెంటుకు వెళ్లే ఆచారం అనాదిగా జరుగుతోంది. ఫ్రెంచ్ భాషలో బడ్జెట్ అంటే "చిన్న సంచీ" అని అర్థం అంటారు కొందరు. మనది బ్రిటీష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వారసత్వం. వాస్తవానికి చాలా విషయాలలో, బ్రిటీష్ కాలం నాటికీ, నేటికీ, బడ్జెట్ స్వరూప-స్వభావాలలో విప్లవాత్మకమైన మార్పులు అంతగా లేవంటారు ఆర్థిక నిపుణులు. చంద్రబాబునాయుడు కాలంలో "జీరో బేస్డ్‌ బడ్జెట్" అని పిలిచినా, ఇప్పుడు "పేపర్ లెస్" అని పిలిచినా, బడ్జెట్ స్వరూపం మాత్రం, తెలుగు దేశమైనా-కాంగ్రెస్ పార్టీ ఐనా, రేపు మరో పార్టీ అధికారంలోకి వచ్చినా కాపాడడం తప్పనిసరి అని భావించక తప్పదు. ప్రణాళికా కేటాయింపులంటే ఏమిటి? కేంద్రం విడుదల చేసే నిధులకు, మాచింగ్ గ్రాంట్‌లకు ఒక తీరు-తెన్ను అనేది వుందా? ఏ రంగానికి-ఎప్పుడు-ఎందుకు-ఎంత మేరకు నిధుల కేటాయింపులు పెంచాలి, లేదా, తగ్గించాలి అన్న విషయం గురించి సవివరమైన అధ్యయనం వుందా? వాస్తవ పరిస్థితులకు, ఎన్నికలలో చేసిన వాగ్దానాలకు, అనుకోకుండా ఎదురయ్యే సమస్యలకు, బడ్జెట్ అంచనాలకు-ఏడాది చివరలో జరిగిన వ్యయానికి పొంతన అనేది వుంటుందా? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఎప్పుడూ దొరకదు. ఐనా, ఏటా ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వ ఆర్థిక శాఖామాత్యుడు, బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం ఆగదు. బడ్జెట్ బాగా లేదని ప్రతిపక్షాల విమర్శలు, బాగుందని స్వపక్షాల పొగడ్తలు ఎప్పుడూ పరిపాటే. పన్నులు విధించని ప్రభుత్వం వుండదు. వేసినందుకు విమర్శించని ప్రతిపక్షమూ వుండదు. చివరకు, ఇవన్నీ ఒక పక్కకు పోయి, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌కే, శాసన సభ ఆమోదం లభించడం ఖాయం. ఇటీవలి కాలంలో చర్చ జరగకుండానే "గిలెటిన్" పద్ధతిన సభ ఆమోదం లభిస్తోంది.

ఈ నేపధ్యంలో, బడ్జెట్ స్వరూప-స్వభావాలు, పుట్టు-పూర్వోత్తరాలు, పూర్వా-పరాలు, తెల్సుకోవడం అవసరం. భారత రాజ్యాంగంలోని 266(3) ప్రకరణ, ప్రభుత్వ వ్యయంపై అటు లోక్ సభ-ఇటు శాసన సభల ఆధిపత్యాన్ని-నియంత్రణను స్పష్టం చేస్తుంది. మన రాష్ట్రం విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నియమ-నిబంధనల సంపుటి (మాన్యువల్) లోని మూడు భాగాలు స్థూలంగా ఈ విషయాలను తెలియచేస్తాయి. మొదటి భాగంలో బడ్జెట్‌ను ఎలా రూపొందించాలనేది, రెండులో వివిధ పత్రాలను క్షేత్ర స్థాయి నుండి సచివాలయం వరకు తెప్పించుకునే విధానం, మూడులో అనుబంధాలకు సంబంధించిన సమాచారం వుంటుంది. ప్రభుత్వ ఖాతాలకు చెందిన పద్దులు ఎలా వుండాలి? ఖాతా పద్దు-శీర్షిక (హెడ్ ఆఫ్ అకౌంట్) అంటే ఏమిటి? మేజర్-మైనర్ హెడ్ అంటే ఏమిటి? అనే అంశాలు కూడా వుంటాయి. బడ్జెట్ మాన్యువల్ లోని నియమాలను "పేరాలు" అని పిలుస్తారు. బడ్జెట్‌కు సంబంధించిన మరి కొన్ని వివరాలు అకౌంట్స్ కోడ్‌లోను, ఫైనాన్షియల్ కోడ్‌లోను వుంటాయి.

ప్రభుత్వం అంటే అతిపెద్ద వ్యవస్థ. అందులో వివిధ శాఖలు, ఉప శాఖలు, వందల-వేల సంఖ్యలో కార్యాలయాలు, వీటి ద్వారా ప్రజలకు చేరాల్సిన లక్షలాది పనులు వుంటాయి. వీటన్నిటి నిర్వహణకు, రకరకాల కార్యక్రమాల అమలుకు, వనరుల సేకరణ జరగాలి. అందుకే బడ్జెట్‌ను, "వార్షిక ఆర్థిక వివరణ", "వార్షిక విత్త వివరణ" గా పిలుస్తారు. వివిధ శాఖల అవసరాల మేరకు, ఆయా శాఖాధిపతుల సూచన మేరకు ఆర్థిక శాఖ రూపొందించిన బడ్జెట్ కేటాయింపులకు శాసనసభ ఆమోదం తప్పనిసరి. బడ్జెట్‌ను మూడు రకాలుగా విభజించుతారు. "సంచిత నిధి", "ఆకస్మిక వ్యయ నిధి", "ప్రభుత్వ ఖాతా" అని వీటిని అంటారు. వివిధ శాఖల ద్వారా ప్రభుత్వానికి సమకూరే నిధులు-వనరులు, పన్నుల రూపేణా వచ్చే ఆదాయం, పన్నుల రూపేణా కాకుండా వచ్చే ఆదాయం, రుణ సేకరణ నిధులు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం లాంటివి "సంచిత నిధి" కిందకు వస్తాయి. ఒక శాఖ నుంచి వచ్చే నిధులు-వనరులు ఆ శాఖకే ఖర్చు చేయాలని నియమం లేదు. ఐన వసూల్లన్నీ సంచిత నిధి కిందకు జమ అవుతాయి. అలా సమకూరిన నిధులను బయటకు తీసి ఖర్చు చేయాలంటే శాసన సభ ఆమోదం కావాలి. కొన్ని సందర్భాలలో, కొన్ని పథకాలను, అత్యవసరంగా రూపొందించి అమలు చేయాల్సిన అవసరం కలగవచ్చు. ఆర్థిక సంవత్సరం మధ్యలో కాని, బడ్జెట్లకు శాసనసభ ఆమోదం పొందిన తరువాత కానీ, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగని పథకానికి ఖర్చు చేయాల్సిన అవసరం కలగవచ్చు. ఇందుకొరకు రాజ్యాంగపరంగా కలిగించిన వెసులుబాటునే "ఆకస్మిక వ్యయ నిధి" అంటారు. ఇదొక రకమైన శాశ్వత అడ్వాన్స్. ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే "కార్పస్" లాంటిది. పథకాల అమలుకు దీని నుండి తీసుకుని, ఆ తరువాత అనుబంధ బడ్జెట్‌లో మంజూరు చేయించుకుంటుంది ప్రభుత్వం. వాడుకున్న మొత్తాన్ని తిరిగి అందులో జమ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక రకమైన బాంక్ లాంటిది. బాంకర్‍గా కొన్ని లావాదేవీలుంటాయి. ఉద్యోగుల భవిష్యత్ నిధికి, భీమా ప్రీమియంకు, కాంట్రాక్టర్ల నుండి సేకరించాల్సిన డిపాజిట్ల వంటివి "ప్రభుత్వ ఖాతా" లో జమ చేస్తుంది ప్రభుత్వం. ఏదో ఒక రోజున ఆ డబ్బును తిరిగి వాపస్ చేయాల్సి వుంటుంది. అందుకే దీనిని వేరే ఖాతాగా చూపించడం జరుగుతుంది.

సంచిత నిధిలో మూడు ఖాతాలుంటాయి. రెవెన్యూ, మూల ధనం, రుణ ఖాతాలుగా వీటిని పిలుస్తారు. ప్రభుత్వ నిర్వహణ కయ్యే ఖర్చులన్నీ రెవెన్యూ ఖాతా నుంచి చేస్తారు. భవనాల, రహదారుల నిర్మాణానికి, ప్రాజెక్టుల-ఇతర రకాల ప్రజల మేలుకోరి చేసే పనులకొరకు కావాల్సిన పెట్టుబడులను మూల ధనం ఖాతాలోకి చేర్చుతారు. గత సంవత్సరం రెవెన్యూ ఖాతాలోకి రావాల్సినవి మరుసటి సంవత్సరం వస్తే అవీ మూల ధనం ఖాతాలోకే పోతాయి. రుణ ఖాతాలోకి చేసిన అప్పులు, విడుదల చేసిన రుణాలు వస్తాయి. స్థానిక సంస్థలకు, రైతులకు ప్రభుత్వం విడుదల చేసే రుణాలన్నీ రికవరీ వివరాలతో సహా రుణ ఖాతా లోకి చేరతాయి. ప్రభుత్వానికి చెందిన ఆదాయ-వ్యయాలన్నీ ఈ మూడు విభాగాల్లోనే వుంటాయి. బడ్జెట్ పరంగా "సెక్టోరియల్ క్లాసిఫికేషన్" (వర్గీకరణ) పేరుతో ప్రభుత్వ శాఖలను నాలుగు తరగతులుగా విభజించుతారు. అవి: సాధారణ సేవల శాఖలు, సాంఘిక-సామాజిక సేవల శాఖలు, ఆర్థిక సేవల శాఖలు, ఆర్థిక సహాయక సేవల శాఖలు. ఈ సేవలన్నీ ఖాతాలలో పద్దుల రూపేణా చూపించడానికి మరో రకమైన విభజన వుంటుంది. వివిధ రకాలైన పద్దులను "మేజర్, మైనర్" హెడ్‌లుగా పిలుస్తారు. బడ్జెట్ పరిభాషలో వీటిని "ఏడంచెల" విభజన అంటారు. మొదటి అంచెలో ఏ శాఖ ఏ విభాగం కిందకు వస్తుందో నిర్ణయిస్తారు. ఆ శాఖకు ఒక నంబరు కేటాయిస్తారు. తదుపరి మిగిలిన ఐదు శాఖలను ప్రధాన పద్దు, అనుబంధ ప్రధాన పద్దు, చిన్న పద్దు, సవివరమైన పద్దులుగా పిలుస్తారు. కొత్తగా అనుబంధ సవివరణ పద్దును కూడా చేర్చారు. ఉదాహరణకు రెవెన్యూ ఖాతా పద్దులకు 1-1999 నంబర్లుంటాయి. ఒక్క హెడ్ ఆఫ్ అకౌంట్-ఖాతా పద్దు తెలుస్తే మిగిలినవన్నీ సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఈ విభజన మన ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు. అఖిల భారత స్థాయిలో అన్ని చోట్ల ఒకే రకంగా, యూనిఫాంగా వుంటాయి.

బడ్జెట్‌లో ఒక యూనిట్‌కు కేటాయించిన మొత్తాన్ని వినియోగం (అప్రోప్రియేషన్) అంటారు. బడ్జెట్ సంవత్సరం అంటే ఏప్రిల్ మొదటి తేదీ నుంచి వచ్చే సంవత్సరం మార్చ్ 31 వరకు. ఏ సంవత్సరానికి ఆమోదించిన మొత్తాన్ని అదే సంవత్సరం ఖర్చు చేయాలి. చేయక పోతే మురిగి పోతుంది. ప్రతి శాఖ మంత్రి తన శాఖ నిర్వహణకు కొంత మొత్తాన్ని మంజూరు చేయాల్సిందిగా శాసన సభను కోరడాన్నే "డిమాండు" అంటారు. శాసన సభ ఆ డిమాండును ఆమోదించిన తరువాత దాన్ని "గ్రాంట్" అంటారు. ఇలా అన్ని శాఖల గ్రాంటులు కలిపి, బడ్జెట్ సమావేశాల చివరలో "ద్రవ్య వినియోగ బిల్లు" (అప్రోప్రియేషన్ బిల్) ప్రవేశ పెట్టి సభ ఆమోదం పొందుతారు. సభ ఆమోదం పొందిన దాన్ని "అప్రోప్రియేషన్ యాక్ట్" అంటారు. ప్రభుత్వం చేసే ప్రతి ప్రతిపాదనను క్షుణ్ణంగా చర్చించే అవకాశం-అధికారం శాసనసభ్యులకు వుంది. బడ్జెట్‍పై చర్చ ఇంకా ప్రారంభం కావాల్సి వుంది. ప్రారంభమైనా చర్చ పూర్తిగా కొనసాగుతుందా అనేది ప్రశ్నార్థకమే! చివరకు డిమాండ్లన్నీ ఎప్పటిమాదిరిగా గిలెటెన్ అయ్యే ప్రమాదమే ఎక్కువా కనిపిస్తోంది!

ఇంత సుదీర్ఘమైన ప్రక్రియలో బడ్జెట్‌ను రూపొందించి, ఆమోదం లభించినా "బడ్జెట్‌లో" చూపించింది ఖర్చు చేయరని, ఖర్చు చేసింది బడ్జెట్‌లో చూపించరని (What is budgeted is not spent and what is spent is not budgeted!) ఆర్థిక నిపుణులు అంటుంటారు. End



Friday, February 17, 2012

అలనాటి ఆర్థిక మంత్రుల బడ్జెట్ స్ఫూర్తి ఇదేనా?: వనం జ్వాలా నరసింహారావు


అలనాటి ఆర్థిక మంత్రుల బడ్జెట్ స్ఫూర్తి ఇదేనా?


రాష్ట్ర శాసనసభలో 2012-2013 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌లో పన్నుల ప్రస్తావన లేకపోయినప్పటికీ, పరోక్షంగా చెప్పకనే చెప్పారు మనసులో మాట ఆర్థిక శాఖామాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి. ఉదాహరణకు వాణిజ్య పన్నుల శాఖ ఆదాయాన్ని పెంచుకుంటామని అనడం అంటే, పన్నులు విధించబోతున్నట్లే కదా! మద్యం అమ్మకాల ద్వారా మరి కొన్ని కోట్ల అదనపు వనరుల సేకరణ జరుపుకుంటాం అని చెప్పడమంటే, ప్రజల నెత్తిన మరికొంత భారాన్ని వేయడమే కదా! మరి, ఇవేవీ లేకుండా లక్షా నలబై ఐదు కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించడమంటే, కనీసం రాష్ట్రాన్ని రుణ వూబిలోకి నెట్టడమే కదా! ఆదాయ వనరుల సేకరణ సజావుగా సాగడానికి, పన్నులన్నా వుండాలి, అప్పులన్నా చేయాలి. ఈ రెండింటి లో ఏం చేయదల్చుకున్నారో ఆర్థికామాత్యులు ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, చెప్పదల్చుకున్నది దాచగలిగినా, చెప్పకుండా మాత్రం వుండలేకపోయారు. అది ఆయన ఒక్కడి తప్పు కాదు. ఆ పాపం ఆనాటి నుంచీ నేటిదాకా కొనసాగిస్తున్న గత ప్రభుత్వాలది కూడా. ఏళ్ల తరబడి పాలన సాగించిన కాంగ్రెస్ ప్రభుత్వ రధ సారధులది, ఆ ప్రభుత్వాలలో పని చేసి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆయన పూర్వీకులది, కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మంత్రుల అడుగు జాడలలో నడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రులదీ కూడా! ఏదేమైనా కిరణ్ కుమార్ రెడ్డిని, ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కొంత అభినందించాల్సిందే.
కిరణ్ సర్కారు మానస పుత్రికలైన మూడు పథకాలు... యువజనులకు ఉపాధి సంక్షేమం, మహిళల కోసం స్త్రీ నిధి, రైతుల కోసం వడ్డీలేని రుణాలకు ఆర్థిక మంత్రి బడ్జెట్ ద్వారా సాధికారత కల్పించారు. కిరణ్ కుమార్ రెడ్డి-ఆనం రామనారాయణ రెడ్డిలు రాష్ట్ర బడ్జెట్‌ను సమ్మోహనాస్త్రంగా ప్రయోగించారు. ఎన్నికల నాటికి వైఎస్‌ను మరిపించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. "యువజనులు, స్త్రీలు, రైతులు" లక్ష్యంగా తీర్చిదిద్దిన బడ్జెట్ ఇది అన్న ముద్ర పడే విధంగా జాగ్రత్త పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంతో పాటు నిరుపేద వర్గాల కోసం ఆరోగ్య శ్రీ, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలకు ప్రాధాన్యం ఇవ్వగా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వాటిని కొంత మేరకు కొనసాగిస్తూనే, యువజనులు, రైతులు, మహిళలను ఆకట్టుకునే కొత్త పథకాలపై దృష్టిపెట్టారు. అలానే "రాజీవ్ యువ కిరణాల" కు పెద్ద పీట వేశారు. లక్షకు పైగా ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ చెప్తున్న ముఖ్యమంత్రి మాటలకు అనుగుణంగా కొత్త ఉద్యోగుల వేతనాలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు. అంటే చెప్పింది చెయ్యబోతున్నారన్న మాట. మహిళలకు పావలా వడ్డీని కూడా తీసివేసి "వడ్డీ లేని రుణాలు" ఇస్తామంటూ ప్రకటించారు. స్వయం సహాయ బృందాల సభ్యులు, రైతులు బ్యాంకుల నుంచి తెచ్చుకునే లక్ష రూపాయల లోపు రుణానికి జీరో వడ్డీ అని, రైతులు పావలా వడ్డీకే రూ.3 లక్షల వరకు రుణం తెచ్చుకోవచ్చని, దానికి అనుగుణంగానే బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. బడ్జెట్ అంకెల్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. రూపాయికే కిలో బియ్యం పథకం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. విద్యుత్ సబ్సిడీని పెంచారు. స్కాలర్‌షిప్‌‍లకు, ఫీజు రీ ఇంబర్స్ మెంట్‌కు, బీసీ సంక్షేమానికి, సాంఘిక సంక్షేమానికి, గిరిజన సంక్షేమానికి, మైనారిటీ సంక్షేమానికి, విద్య, వైద్యం, గృహ నిర్మాణంకు కేటాయింపులు కొద్ది మొత్తాలనుంచి, భారీ మొత్తాలకు పెంచడం జరిగింది. రాజకీయంగా పట్టు సాధించేందుకు "ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి" ని మరింత బలోపేతం చేశారు. ఇంతకీ ఈ కేటాయింపులలో వాస్తవికత ఎంత? బడ్జెట్‌లో కేటాయించిందే సంబంధిత శాఖలకు ఖర్చు చేస్తారా? కేటాయించని వాటి కింద అసలు ఖర్చే కాదా? అన్న ప్రశ్నలకు మళ్లీ వచ్చే ఏడాదే సమాధానం దొరకాలి. ఉదాహరణకు గత ఏడాది జలయజ్ఞంకు కేటాయించిన నిధులలో మూడు వంతులు మాత్రమే వినియోగించడం జరిగింది. మిగాతావి మురిగిపోయినట్లే కదా? అలా ఎందుకు జరిగిందో వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో, నీటి పారుదల రంగానికి, పాఠశాల విద్యకు అధికంగా కేటాయింపులు జరిగాయనేది వాస్తవం. అవి ఖర్చు చేస్తే మంచిదే!
ఇలా కేటాయింపులు చేయడం, రాజకీయాలను దృష్టిలో వుంచుకుని ప్రాధాన్యతలను నిర్ధారించడం, బడ్జెట్‌లో రాజకీయ ఉపన్యాసాలు చేయడం, ఆనవాయితీగా వస్తున్నదే. ఈ విషయంలో తెలుగుదేశం వారు, కాంగ్రెస్ వారు ఒకరికంటే మరొకరు మిన్న అని చెప్పక తప్పదు. ఉదాహరణకు 2001-2002 ఆర్థిక సంవత్సరానికి నాటి తెలుగుదేశం హయాంలో, అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్తూ, విజన్ 2020 భవిష్యత్ దర్శిని లక్ష్య సాధనకు కంకణం కట్టుకున్న తమ ప్రభుత్వ నిబద్ధతకు ప్రతిరూపమే ఆ సంవత్సరపు బడ్జెట్ అన్నారు. అప్పట్లో రాష్ట్ర వార్షిక ప్రణాళిక అంచనా తొమ్మిదివేల కోట్ల రూపాయల లోపే! కాకపోతే అప్పటికే రుణభారం సుమారు ఏబై వేల కోట్ల రూపాయలకు చేరుకునే సూచనలు ప్రస్ఫుటంగా కనిపించాయి. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికే వున్న ఆ రుణ భారం దిన-దినాభివృద్ధి చెంది, నేటికి తీర్చలేని స్థితికి చేరుకుంది. ఆర్థికాభివృద్ధి అంటే ఇదే! దీనికి ఏ ప్రభుత్వం నుంచీ సమాధానం లేదు-రాదు.
మన రాష్ట్రంలో శాసనసభలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి సుమారు అరవై ఏళ్ల చరిత్ర-నేపధ్యం వుంది. 1955-56 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి, నేటి వరకు, 57 పర్యాయాలు పలువురు ఆర్థిక మంత్రులు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. వారిలో రోశయ్య లాంటి కొందరు రికార్డు స్థాయిలో పదమూడు సంవత్సరాలు, బెజవాడ గోపాలరెడ్డి లాంటి వారు ఎనిమిది సంవత్సరాలు (మద్రాసు రాష్ట్రంతో కలుపుకుని) బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఘనత వుంది. జులై 8, 1955 న బెజవాడ గోపాలరెడ్డి మొట్టమొదటి సారిగా ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్తూ, రెవెన్యూ ఆదాయం కేవలం రు. 2, 198 లక్షలుగా, రెవెన్యూ వ్యయం రు.  2, 564 లక్షలుగా, రెవెన్యూ లోటు రు. 366 లక్షలుగా, నికర లోటు రు.  434 లక్షలుగా చూపించారు. ఇప్పటి లక్షన్నర కోట్ల రూపాయల బడ్జెట్లకు, లక్ష కోట్ల వ్యయానికి, నాటి బడ్జెట్లకు పోలికే లేదు! అలానే ఆయన, మరుసటి సంవత్సరం రాష్ట్ర శాసనసభకు బడ్జెట్ సమర్పిస్తూ చేసిన ప్రసంగం నేటికీ స్ఫూర్తిదాయకమే. దానిని ఎరలా తీసుకున్నా వాస్తవం తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం వుంది. మార్చ్ 2, 1956 నాటి ఆ బడ్జెట్ ఉపన్యాసంలో, విశాలాంధ్ర ప్రస్తావన తెచ్చారు బెజవాడ గోపాలరెడ్డి. విశాలాంధ్ర ఏర్పడితే అదే ఆయన ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్న చివరి బడ్జెట్ ప్రసంగం అని ప్రారంభించారు. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక రూపు దిద్దుకుంటున్న తరుణంలో రాష్ట్రాల పునర్విభజన నివేదికపై జరుగుతున్న చర్చల సారాంశాన్ని సభ్యులకు తెలియచేశారాయన. అలానే, తెలుగు మాట్లాడే వారందరికీ, ఒకే రాష్ట్రం వుంటే బాగుంటుందన్న విషయాన్నీ, వుండాల్సిన అవసరాన్నీ ఆయన స్పష్టం చేసారు (ఆయన భావాలతో నేను ఏకీభవిస్తున్నట్లు అర్థం కాదు). తన సుదీర్ఘ ప్రసంగంలో ఉద్దండ కవులైన అల్లసాని పెద్దన్న, బమ్మెర పోతన్న, రామరాజ భూషణుడు, తిక్కన సోమయాజిల పేర్లను ప్రస్తావిస్తూ, ఆ మహానుభావులు నడిచిన నేలలో నివసించే తెలుగు వారందరూ, వారి అడుగుజాడలలో ఐకమత్యంతో మెలుగుతారన్న విశ్వాసాన్ని బెజవాడ గోపాలరెడ్డి వెల్లడించారు. విశాలాంధ్ర స్థాపనకు కష్టాలు భరించాల్సి వుంటుందనీ, తరువాత బాధ్యతలు పెరుగుతాయనీ, ప్రజలు సర్దుబాటు ధోరణిలో మసలుకుంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన హెచ్చరించారా నాడే!
అంతటితో తన బాధ్యత తీరిందనుకోలేదు బెజవాడ గోపాలరెడ్డిగారు. ప్రప్రధమ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను జులై 3, 1957 న రాష్ట్ర శాసన సభలో ప్రవేశ పెట్టిన ఘనత కూడా ఆయనే దక్కించుకున్నారు. సాంప్రదాయానికి భిన్నంగా తన బడ్జెట్ ప్రసంగం వుంటుందని మొదలే విశదపర్చారాయన ఆనాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ప్రత్యేకించి తెలంగాణ ప్రాంత ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా వివరించి, దానిపైన శాసనసభ, పత్రికారంగం, దేశ ప్రజల స్పందన తెలుసుకోవాలనుకుంటున్నట్లు అన్నారు. రెవెన్యూ ఖాతా కింద మితిమీరిన ఖర్చును చూపడం ఆయన ఆనాడే వ్యతిరేకించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికో, విద్యుత్ ఉత్పాదన కొరకో, అప్పులు చేస్తే పరవాలేదని, శాంతిభద్రతలకు-ఆరోగ్య విద్యా సదుపాయాలకు-కమ్యూనికేషన్స్ రంగానికి, ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసి ఆ ఖర్చును భావితరాల వారిని భరించమనడం కన్నా, మనమే ఆ బరువు మోయడం సమంజసమని ఆయన అన్నారు. ఆయన ఉద్దేశం, ఫలితాలు ఇప్పుడు అనుభవించి, భారాన్ని కొడుకులకు, మనుమలకు, ముని మనుమలకు అందచేయడం తప్పుడు విధానమని. అలానే కేంద్ర ప్రభుత్వాన్ని కాని, రిజర్వ్ బాంకును కాని, రాష్ట్ర ఆర్థిక భారాన్ని మొత్తానికి-మొత్తం నెత్తిన వేసుకోమనడం సరైంది కాదని కూడా ఆయన ఆనాడే సూచించారు. ఇక్కడో చక్కటి మాట చెప్పారు. రాష్ట్రాలలో అమలు కావాల్సింది, ఇక్కడి ప్రభుత్వాలు అమలుపర్చే కేంద్ర ప్రణాళిక కాదని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రుణాలతో-నిధులతో-ఆర్థిక సహాయంతో అమలు పరిచే రాష్ట్ర ప్రణాళిక అని స్పష్టం చేసారు. మన ఆర్థిక వనరులతో, మన పన్నుల విధానంతో, పొదుపు చర్యలతో, స్వయంగా రుణాలు సమకూర్చుకోవడంతో, కేంద్ర ప్రభుత్వ సహాయానికి అదనంగా ప్రణాళికను రూపొందించుకోవాలని బెజవాడ గోపాలరెడ్డి అన్నారు.
ఆంధ్ర ప్రాంతంలో సరితూగేలా తెలంగాణ ప్రాంత అభివృద్ధి అచిర కాలంలోనే జరగాలని, ఈ లక్ష్య సాధనకు ఆదిలో అదనంగా వ్యయం చేయాల్సి వుంటుందని, తెలంగాణ ప్రాంతంలో వసూలైన ప్రతి పైసా ప్రత్యేకంగా లెక్క కట్టి, తెలంగాణ నిధులను తెలంగాణకే ఉపయోగించుతామని ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారప్పుడే! "తెలంగాణ ప్రాంతం వారికిచ్చిన వాగ్దానాలను గుర్తుంచుకోవడమే కాదు అమలు పరుస్తాను" అని బెజవాడ గోపాలరెడ్డి స్పష్టం చేసారు.
 రాజనీతిజ్ఞతతో ఆనాడు బెజవాడ గోపాలరెడ్డి చెప్పిన విశాలాంధ్ర విషయం కాని, తెలంగాణ ప్రాంతానికిచ్చిన వాగ్దానాన్ని కాని, భావితరాల వారిపై రుణభారం మోపడం తప్పన్న విషయాన్ని కాని, రాష్ట్ర ప్రణాళిక విషయం కాని ఈ నాటి నేతలు గుర్తుంచుకుంటే అంతకన్నా ఏం కావాలి?
ఈ నేపధ్యంలో అల నాడు తన జిల్లాకే చెందిన బెజవాడ గోపాలరెడ్డి బడ్జెట్ ప్రసంగాల స్ఫూర్తిని, ప్రవేశ పెట్టిన తీరును, ఈ నాటి ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంతవరకు అనుకరించారనేది నిర్ణయించాల్సింది పాఠకులే!