Showing posts with label చిదంబరం. Show all posts
Showing posts with label చిదంబరం. Show all posts

Friday, May 18, 2012

ఎన్సీుటీసీ ఏర్పాటు వ్యవహారంలో తప్పుడు సంకేతాలిచ్చిన చిదంబరం: వనం జ్వాలా నరసింహారావు


ఎన్‍సీటీసీ ఏర్పాటు వ్యవహారంలో తప్పుడు సంకేతాలిచ్చిన చిదంబరం
సూర్య దినపత్రిక (12-05-2012)
వనం జ్వాలా నరసింహారావు
"జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం"-ఎన్‍సీటీసీ ఏర్పాటు వ్యవహారాన్ని కూలంకషంగా చర్చించి అనుకూలమైన నిర్ణయం రాబట్టేందుకు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల ఐదో తేదీన కేంద్ర ప్రభుత్వం ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో వాడిగా-వేడిగా చర్చలు సాగాయి. ఎన్‍సీటీసీ ఏర్పాటు ప్రతిపాదనపై సీఎంల ఆమోదం పొందేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. తన ముందున్న సమస్త  అవకాశాలను ఉపయోగించుకుంది. వివిధ రాష్ట్రాలలో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‍సీటీసీ చర్య ప్రారంభించే ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తామని కేంద్రం హామీ ఇచ్చినా, కాంగ్రేసేతర పాలనలోని రాష్ట్రాలు విశ్వసించడం లేదు. ఎన్‍సీటీసీని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులకు దానిపట్ల ఉన్న భయాందోళనల్ని తొలగించేందుకు ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌, హోంమంత్రి చిదంబరం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాష్ట్రాల అధికారాలను కబళిస్తుందని, ఫెడరల్‌ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆందోళన చెందిన ముఖ్యమంత్రులు తమ పట్టు వీడలేదు. సమావేశం జరగడానికి ముందే, ఎన్‍సీటీసీ అమలుకు సంబంధించి రెండు ముసాయిదా పత్రాల్ని రాష్ట్రాలకు పంపింది కేంద్రం. ముఖ్య మంత్రులు ఆ ముసాయిదాల్ని చదివితే వారి సందేహాలు చాలావరకు తీరిపోతాయని హోంమంత్రి చిదంబరం భావించారు. ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం అధికారాలు, విధు లేమిటో ఆ ముసాయిదాలలో వున్నాయి. అలాగే ఎన్‍సీటీసీ ఏర్పాటు చేయాల్సిన అవసరం గురించి, ఎన్‍సీటీసీ అమలుచేయబోయే వివిధ సెక్షన్లు ఏంటి అన్నది కూడా ముందస్తుగానే వివరణ ఇచ్చింది కేంద్రం.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సహా పది రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి అభ్యంతరాలు రావడంతో "జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం"-ఎన్‍సీటీసీ ప్రస్తుతానికి ఆగిపోయింది. ముఖ్యమంత్రుల సబ్‌ కమిటీ వేసి.. దాని నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు, ఒడిసా సీఎంలు జయలలిత, నవీన్ పట్నాయక్ డిమాండ్ చేయగా, అసలు ఇది వద్దే వద్దని కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మమతా బెనర్జీ పట్టుబట్టారు. అసలు ఎన్‍సీటీసీ అనేది అక్కర్లేదని చెబుతూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకించారు. అరెస్టులు, స్వాధీన అధికారాలతో ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటుచేయడం వల్ల దేశంలోని సమాఖ్య స్ఫూర్తి దారుణంగా దెబ్బతింటుందని, ఇది రాష్ట్రాలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కానందున కేంద్రం దాని ఏర్పాటు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆమె అన్నారు. చివరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన తరుణ్‌ గొగోయ్ కూడా, కొన్ని సవరణలు చేసిన తర్వాత మాత్రమే ఎన్‍సీటీసీని ఆమోదిస్తామని స్పష్టం చేశారు. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ లాంటివారి నుంచి దీనికి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. కేంద్రం పురాతన కాలం నాటి వ్యవహారాలు చేస్తోందని, ఎన్‍సీటీసీ ఏర్పాటు వల్ల కేంద్రం అన్ని రాష్ట్రాల్లో పాలిస్తున్నట్లు, రాష్ట్రాలు దానిమీద ఆధారపడినట్లు తయారవుతుందని ఆయన అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్‍సీటీసీని పూర్తిగా సమర్థించారు. ఉగ్రవాదం విషయంలో రాజకీయాలకు అతీతంగా పరస్పర సర్దుబాటు చేసుకోవాలని, భౌతిక సరిహద్దులకు అతీతంగా ఆలోచించినప్పుడే ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోగలమని ఆయన చెప్పారు.  ఎన్‍సీటీసీని సమర్థించుకోడానికి కేంద్రం యథాశక్తిగా ప్రయత్నించింది. అయినా, విస్తృత ఏకాభిప్రాయం సాధనలో ప్రధాని మన్మోహన్‌సింగ్, హోం మంత్రి చిదంబరం విఫలం కావడంతో ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను పక్కన పెట్టక తప్పలేదు. కేంద్ర హోం మంత్రి చిదంబరం మానస పుత్రిక ఇక ఇప్పటికి ఇలా కొనసాగాల్సిందే! ఉగ్రవాద నిరోధం అనేది అందరూ పంచుకోవాల్సిన విషయమని, రాజ్యాంగం కూడా ఇదే చెబుతోందని, ఇదే బాధ్యతాయుతమైన మార్గం అని చిదంబరం అంటే, కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఉన్న అధికారాల పంపిణీని మార్చాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని ప్రధాని మన్మోహన్ అన్నారు. ఎన్‍సీటీసీ ఉగ్రవాదాన్ని నిరోధించడానికే గానీ, రాష్ట్రాల అధికారాలను అతిక్రమించేందుకు కాదని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారాయన.
అంటే దానర్థం ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు కేంద్ర హోంమంత్రి చిదంబరం తలపెట్టిన ఎస్‌సీటీసీకి చికాకులు తొలగలేదని. సీఎంల అనుమానాలను నివృత్తి చేయడానికి నిర్వహించిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదర లేదనేది స్పష్టమైంది. ముఖ్యంగా కాంగ్రేసేతర పార్టీల సీఎంలు గట్టిగా వ్యతిరేకించారు. దీంతో ఎన్‍సీటీసీ ఏర్పాటు అనిశ్చితిలో పడింది. ముంబయిలో ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత, ఇకముందు ఇలాంటి దాడులు జరగకుండా, ఉగ్రవాదంపై పోరాటానికి "జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం"-ఎన్‍సీటీసీ (నేషనల్‌ కౌంటర్‌ టెర్రరిజం సెంటర్‌) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచించింది. కేంద్ర హోంమంత్రి పి చిదంబరానికి ఎంతో ఇష్టమైన ఈ ప్రాజెక్టుకు ముంబయి దాడుల తర్వాత రూపకల్పన చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు నిజానికి మార్చి 1న ప్రారంభం కావలసి ఉంది. కానీ, ఎన్‍సీటీసీ పట్ల భయాలు, సందేహాలు వ్యక్తం చేస్తూ, దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రికి రాయడంతో దీనికి బ్రేక్‌ పడింది. "జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం"-ఎన్‍సీటీసీ, ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఒక విభాగంగా పనిచేస్తుంది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను నిర్వహిస్తుంది. ఉగ్రవాదానికి సంబంధించిన వివరాల్ని సేకరిస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి వివిధ ఏజెన్సీల ద్వారా ఉగ్రవాద సమాచారాన్ని సేకరిస్తుంది. టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. భారతదేశంలో ఎక్కడైనా, ఉగ్రవాదానికి సంబంధించి సోదాలు జరిపేందుకు, అరెస్టులు చేసేందుకు ఎస్‌సీటీసీకి అధికారం ఉంటుంది. అయితే, ఎస్‌సీటీసీకి ఉండే అధికారాలపట్ల రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఎన్‍సీటీసీ వేర్పాటు విషయంలో, రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి నెలలో నిర్వహణ పరమైన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌‍ను విడుదల చేయడం ఒక విధంగా ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమే. రాష్ట్రాల పరిధిలో ఉండే విషయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం అంత సబబు కాదేమో! ఇలాంటి చర్యలు కేంద్రం-రాష్ట్రాల మధ్య విశ్వాస రాహిత్యాన్ని ఎక్కువ చేస్తుంది. అందుకే వివాదాస్పద జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. కాంగ్రేసేతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ ప్రతిపాదనను ససేమిరా అంగీకరించడం లేదు. యూపీఏ సంకీర్ణంలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు సైతం తమ వ్యతిరేకతను వెలిబుచ్చాయి. ఈ ప్రాజెక్టును ఎప్పటిలోగా అమలు చేస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నలకు హోం మంత్రి చిదంబరం దగ్గర సమాధానం లేదు. సమాధానాన్ని దాటవేశారు. ఎన్‍సీటీసీ అధికారాల పై ముఖ్యమంత్రులు వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని చిదంబరం తెలిపారు. రాష్ట్రాలపై కేంద్రం ఆధిక్యత పొందటానికి ఇది ఏర్పాటు చేయటం లేదని ప్రధాని మన్మోహన్ ఎంతగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా, ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించటానికే దేశం చేసే ఉమ్మడి ప్రయత్నాల్లో ఎన్‍సీటీసీ ఏర్పాటు ఒక భాగమని తెలియచెప్పినా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో రాష్ట్రాల సామర్థ్యాలకు ఇది అదనపు బలం చే కూరుస్తుందని నమ్మ బలికినా, ఉగ్రవాదాన్ని నిర్మూలించటంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అభ్యర్థించినా ఫలితం కనపడలేదు.
ఏదేమైనప్పటికీ, ఒకటి మాత్రం వాస్తవం. చిదంబరం చెప్పినట్లు, ఉగ్రవాదం ఎదుర్కోవడం తప్పకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యతే. చిదంబరం మాటల్లో అర్థం చేసుకోవాలంటే, ప్రధాని మన్మోహన్ ప్రతిపాదన మేరకే ఎన్‍సీటీసీ ఏర్పాటుకు కేంద్రం సమాయత్తమయింది. ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉగ్రవాదులు సరిహద్దులను గుర్తించరు. దేశ రక్షణ కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిందే. అదే విధంగా, ప్రతిపక్షాలు- ప్రభుత్వం, పౌర సమాజ సంస్థలు-ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేసినప్పుడే, దేశానికి మరింత రక్షణ కల్పించడానికి వీలవుతుంది. అందులో సందేహం ఏ మాత్రం లేదు. అదే కాకుండా, చిదంబరం చెప్పినట్లు, ఉగ్రవాద కేసులు నమోదయినప్పటికి, సామర్థ్యం-నిర్ణయాత్మక శక్తి లోపించటంతో భద్రత ఏజెన్సీలు క్రియాశీలంగా పనిచేయలేక పోతున్నాయి.  ఈ పరిస్థితులలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలంటే జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం ఆవశ్యకత ఎంతైనా వుంది. ఎన్‍సీటీసీ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఉగ్ర వాదాన్ని తిప్పికొట్టే బలమైన వ్యవస్థగా రూపొందాల్సిందే. కాకపోతే, నిఘా సంస్థల సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకుంటూ బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. ఉగ్రవాద నిరోధానికి చేస్తున్న ప్రయత్నాలలో కేంద్ర, రాష్ట్రాల మధ్య వాహకంగా ఎన్‍సీటీసీ పనిచేయాలి. ఎన్‍సీటీసీ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపట్టే రాష్ట్రాలకు అనుబంధంగా పనిచేయాలి. జాతీయ భద్రతకు తీవ్రవాదం అత్యంత ముప్పుగా పరిణమించుతున్న నేపధ్యంల్లోనే, జాతీయ, రాష్ట్రాల స్థాయిలో సమర్ధవంతమైన తీవ్రవాద వ్యతిరేక యంత్రాంగం ఏర్పాటు సముచితమే.
ఇంత సముచితమైన, సహేతుకమైన నిర్ణయాన్ని, దేశ బధ్రత దృష్ట్యా తీసుకొస్తున్న ఈ చట్టాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలకు-ముఖ్యంగా కాంగ్రేసేతర రాష్ట్ర ప్రభుత్వాలకు, సరైన పద్ధతిలో వివరించడంలో కేంద్ర హో మంత్రి చిదంబరం పూర్తిగా విఫలమయ్యారు. ఆ మాటకొస్తే ఈ ఒక్క విషయంలోనే కాదు చిదంబరం అలా విఫలమవుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాని, అధిష్టానం వైఖరిని కాని సంబంధిత వ్యక్తులకు, రాజకీయ పార్టీలకు వివరించడంలోనూ చిదంబరం పూర్తిగా విఫలమయ్యారు. చంద్రబాబు నాయుడు తనను కలిసిన విషయాన్ని, తెలంగాణ వ్యవహారాన్ని తనతో సంప్రదించిన విషయాన్ని విశదీకరించడంలోనూ తప్పుడు సమాచారాన్ని సాక్షాత్తు పార్లమెంటుకే అందచేసిన ఘనత చిదంబరానిది. చిదంబరమే కనుక, ఉగ్రవాద నిరోధానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను, జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం ఆవశ్యకతను సరైన రీతిలో, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయానా వివరించి వున్నట్లైతే ఈ సమస్య తలెత్తేదే కాదు. భవిష్యత్‍లో ఎన్‍సీటీసీ అమలు జాప్యమైనా, అసలు చట్టంగా రాలేకపోయినా దానికి పూర్తి బాధ్యత చిదంబరానిదే. అందుకే ఎన్‍సీటీసీ ఏర్పాటు వ్యవహారంలో తప్పుడు సంకేతాలిచ్చిన చిదంబరం ఇప్పటికైనా జాగ్రత్త వహించి తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చే చర్యలు చేపట్టాలి. End 

Tuesday, March 8, 2011

"తెలంగాణ" వైకుంఠ పాళి": వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్ర కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిన అధినేత్రి వ్యూహం;
సొంత పార్టీ వారే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్న వైనం
శాసన సభలోనూ అదే పరిస్థితి;అప్పుడే తెలంగాణ ఏర్పడే పరిస్థితి లేదన్న సంకేతం
మళ్ళీ మొదటికి వచ్చిన ఆట!;తెలుగు దేశంలో మరో కుంపటి

చిన్నతనంలో వైకుంఠపాళి ఆట ఆడనివారు అరుదుగా వుంటారు. ఆ ఆటనే "పరమపద సోపాన పటం" అని కూడా కొందరనేవారు. ఇక ఇప్పటి ఆంగ్ల మాధ్యం పిల్లలు "పాముల-నిచ్చెనల" ఆట అంటున్నారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా అది ఆడడానికి అందరికీ ముఖ్యంగా కావాల్సింది, ఒక అట్టపై కాని, లేదా చిన్నగా ఉండే బోర్డుపై కాని, రంగు రంగుల గళ్ళతోనన్నా-నలుపు, తెలుపు రంగులలో నన్నాతయారు చేసిన పటం. ఆ పటం పెట్టడానికి పావులు-ఆడడానికి గవ్వలు. ఈ ఆటలో 1 నుంచీ 100 వరకూ అంకెలు, అడ్డు వరుసకు 10 గళ్ళ చొప్పున, నిలువుగా పది వరుసలు వుంటాయి. ఈ పటంలో అక్కడక్కడా పాములూ, నిచ్చెనలూ వ్యాపించి ఉంటాయి. పావు చేరుకున్న గడిలో పాము తల ఉంటే, దాని నోట బడి మింగడంతో, ఆ గడి నుంచి పాము తోక ఉన్న కింది గడి దాకా పావు దిగుతుంది. పావు పడిన గడిలో నిచ్చెన కింది చివర ఉంటే, అది నిచ్చెన ఎక్కి, పై చివర వరకూ చేరుకోవచ్చు. పాము నోట్లో పడకుండా-దాటుకుంటూ, నిచ్చెనలు ఎక్కు కొంటూ, 100వ గడికి ముందుగా చేరుకున్నవారు ఆటలో విజేత. నూరవ గడికి చేరుకునే ముందు కూడా, చిట్ట చివరి గడి వరకూ వ్యాపించి ఉండే అతి పెద్ద పాముండే ఏర్పాటు వైకుంఠపాళి ఆట ప్రత్యేకత. ఈ ఆట ఆడడం తెలిసిన ప్రతి వారికీ, అందునా చిన్నా-పెద్దా పాముల బారిన పడి ఓడిన వారికి, చాకచక్యంగా ఆడి నిచ్చెనలను అధిరోహించుకుంటూ పైకెదిగి, గెలవబోతున్నామనుకున్న సమయంలో, "అతి పెద్ద పాము" నోట బడి, మళ్ళీ ఆట మొదలెట్టిన వారికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎప్పుడొస్తుందో ఊహించడం అంత కష్టం కాదు. బహుశా గత కొద్ది రోజుల పరిణామాలు నిశితంగా గమనించినవారికి, చిన్ననాటి పరమపద సోపాన పటం ఆట జ్ఞప్తికి వస్తుండవచ్చు.

డిసెంబర్ 9, 2009 న కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్లే అని భావించారందరూ. 1971 సార్వత్రిక ఎన్నికల్లో, అలనాటి తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థులుగా పోటీచేసిన వారిలో, దాదాపు అందరూ గెలిచినా, కించిత్తైన చెక్కు చెదరని అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, "తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే ప్రసక్తే లేదు" అని ఎంత స్పష్టంగా ప్రకటించిందో, అదే స్పష్టతతో, "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ" ను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు చిదంబరం. ఇందిరా గాంధి ప్రకటన, వైకుంఠపాళి ఆటలో గెలిచేవారి తరహాలో గవ్వలు విసిరి-పావులు కదిపి, పాము నోట్లో పడకుండా నిచ్చెనలెక్కి, పెద్ద పామును కూడా తప్పించుకుని విజేతగా నూరవ గడికి చేరుకున్న రీతిలో వుంటే దానికి పూర్తి భిన్నంగా వుంది చిదంబరం ప్రకటన. ఒక ఔచిత్యం లేకుండా చిదంబరం చేసిన ప్రకటన, గవ్వలు విసరడం చేతకాని-పావులు కదపడం రాని ఆటగాళ్లు పరమపద సోపాన పటంలో పాము నోట్లో తలదూర్చిన వారి రీతిలో వుంది. చిదంబరం నిర్ణయం దరిమిలా చోటు చేసుకున్న సంఘటనలు, ఒక వైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాల్సిందే అని ఆందోళన చేసిన వారికి కాని, సమైక్యాంధ్రే వుండాలని కోరుకుంటున్న వారికి కాని అనుకూలంగా లేవు.

తాను ఆడుతున్నది రాజకీయ వైకుంఠపాళి అని, జాగ్రత్తగా పావులు కదపకపోతే, పరిణామాలు తీవ్రంగా వుంటాయని చిదంబరం గ్రహించకపోవడం దురదృష్టం. ఇక ఆ తర్వాత, శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయడంతో, తానేదో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నానన్న భ్రమలో పడ్డారాయన. మరో ఏడాదిపాటు తెలుగు వారితో తన ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చని భావించాడు. ఆయన భావనకు అనుగుణంగానే, రాష్ట్రంలో, కమిటీ నివేదిక వచ్చేంతవరకు, చిదంబరం పావులు పరమపద సోపాన పటంపైన నిచ్చెనలెక్కుకుంటూ పోయాయి. డిసెంబర్ 31, 2010 వరకు-ఆ తర్వాత బహుశా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసే దాకా, నిచ్చెనలను అధిరోహించిన పావు "పెద్ద పాము నోట్లో పడింది". మళ్లీ కధ మొదటికొచ్చింది. ఇందిరా గాంధీ తన రాజకీయ చతురతతో, తెలంగాణ ప్రజా సమితి టికెట్ పై పోటీ చేసి గెలిచిన వారందరినీ, దాని నాయకుడు మర్రి చెన్నారెడ్డితో సహా, కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురాగలిగితే, చిదంబరం వ్యూహం-ఆయనకు అండగా నిలిచిన ప్రణబ్ ముఖర్జీ వ్యూహం, వారి అధినాయకురాలు సోనియా గాంధీ వ్యూహం దానికి పూర్తి భిన్నంగా, కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతోంది. సొంత పార్టీ వాళ్లే, పార్లమెంటును స్థంబింప చేసే దాకా పోయింది. చివరకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి, పరమపద సోపాన పటంలో, చిట్ట చివరి గడికి పావు చేరుకున్న చందాన తయారయింది.

కేంద్రంలో వ్యవహారం అలా వుంటే, రాష్ట్రంలో సంగతులు కూడా అలానే వున్నాయి. శాసన సభ సమావేశాలు ఆరంభం కావడానికి ముందు వరకు, అటు ప్రభుత్వం, ఇటు తెలంగాణ వాదులు, తమ తమ పావులను జాగ్రత్తగా కదుపుకుంటూ, (మాటల తూటాలనే) గవ్వలు ఆచితూచి విసురుకుంటూ, నిచ్చెనలు ఎక్కుకుంటూ-పాము నోట్లో పడుకుంటూ, పై గడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరూ చేరుకోలేక పోయారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు, హఠాత్తుగా (కాంగ్రెస్, తెరాస, తెలుగు దేశం) తెలంగాణ వాదులందరూ, విడి విడిగా గవ్వలు విసురుకుంటూ-పావులు కదుపుకుంటూ, నూరవ గడి దరిదాపుల్లోకి వచ్చే దిశగా చకచకా కదిలారు. వీరందరి కంటే ముందే, ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ కోదండ రామ్, నూరవ గడికి అతి సమీపంలోకి చేరుకున్నారు. విద్యార్థుల ఆందోళనలు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సహాయ నిరాకరణ, శాసన సభలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల జై తెలంగాణ నినాదాలు, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, బడ్జెట్ ప్రసంగాన్ని సాగనీయక పోవడం, కాంగ్రెస్ శాసన సభ సభ్యులు-మంత్రులు ఢిల్లీకి మకాం మార్చి పార్లమెంటు సభ్యులతో కలిసి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నాలు, పట్టాల పైకి పల్లెలు లాంటి చర్యలు, ఎవరి పరిధిలో వారి గవ్వలు సక్రమంగా విసిరిన రీతిలో-పావులు కదిపిన తరహాలో, పరిష్కారాన్ని చివరి అంకానికి వచ్చేలా చేయగలిగాయి. ఇంతలో తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర రావు-సహచర లోక్ సభ సభ్యురాలు విజయ శాంతి వ్యూహాత్మకంగా గవ్వలు విసిరి, పావులు కదిపి, లోక్ సభను స్థంబింప చేశారు. మరో మారు తెలంగాణ ఇచ్చినట్లే-వచ్చినట్లే కనిపించింది అందరికీ. అందరూ, ఫిబ్రవరి చివరి వారంలో అతి పెద్ద పాము నోటికి అతి చేరువలో, నూరవ గడికి, అతి సమీపంలో చేరుకున్నారు. మార్చ్ మొదటి వారంలో-ఆరంభంలో, గవ్వలు సరిగ్గా పడకుండా, అందరి పావులను పాము నోటికి చేర్చాయి. హఠాత్తుగా పరిస్థితిలో ఊహించని పరిణామం, అందరికి దాదాపు అర్థమయ్యేలా, చోటు చేసుకుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగేది లేదు అన్న సంకేతం స్పష్టంగా వెలువడింది.

మళ్ళీ ఆట మొదటి కొచ్చింది. పార్లమెంటును తెరాస సభ్యులు స్థంబింప చేసే ప్రక్రియలో, తెలుగు దేశం తెలంగాణ లోక్ సభ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు, "జై తెలంగాణ" నినాదాలతో అండగా నిలిచారు. ఎన్డీయే సారధి భారతీయ జనతా పార్టీ తన సంపూర్ణ మద్దతును తెలంగాణకు అనుకూలంగా ప్రకటించింది. పరిస్థితి చేజారి పోతున్న తరుణంలో, ప్రణబ్ ముఖర్జీ, తన మంత్ర దండాన్ని ఉపయోగించారు. గవ్వలు విసిరారు. తన పావులను కదిలించారు. కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంటు సభ్యులు అవాక్కయ్యారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకున్నారు. చేతిలో గవ్వలు జారి పోయాయి. తాత్కాలికంగా ఆట గెల్చారు ప్రణబ్. ఆట గెలుపు ధీమాతో, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ-ఆ మాటకొస్తే దానికి సంబంధించిన ప్రస్తావన తెచ్చే ప్రక్రియ, ఐదు రాష్ట్రాల ఎన్నికలయ్యేవరకు వాయిదా వేశారు. మే నెల చివరి వరకూ, కాంగ్రెస్ సభ్యులను సరాసరి-నేరుగా కట్టడి చేస్తూనే, పరోక్షంగా తెరాసకు సంకేతం పంపారు. మూడు నెలలు ఆగాల్సిందే-ఆగి తీరాల్సిందే అని స్పష్టం చేసారు ప్రణబ్ ముఖర్జీ.

ఢిల్లీ సంకేతాలు, సహాయ నిరాకరణ చేస్తున్న నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగుల పైన ప్రభావం చూపాయి. ఇంటర్ పరీక్షల సమస్య కూడా వారికి తల నొప్పైంది. మూడు నెలలు సహాయ నిరాకరణ కొనసాగించడం కష్టమైన పని అని భావించి, వ్యూహాత్మకంగా విరమించారు. ఆటలో మళ్లీ నిచ్చెనలు ఎక్కడం మొదలెట్టారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు-మంత్రులు-ఎమ్మెల్సీలతో సహా, ఢిల్లీకి పోయి సోనియాను కలిసే ప్రయత్నంలో పడ్డారు. వారి ఆటలో వారూ కొంత ముందుకు సాగుతున్నారు. పనిలో పనిగా చంద్రబాబు నాయుడు తన వర్గంలోని బలీయమైన తెలంగాణ వాది-నాగం జనార్ధన రెడ్డి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నంలో పడ్డారు. తెలుగు దేశం వారు ప్రత్యేక నినాదం వైకుంఠపాళి ఆటలో చేరడానికి మరికొంత సమయం పట్టొచ్చునేమో. ఎలాగూ, మూడు నెలల సమయం వుందికదా! ఇక ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు, తెరాస నాయకులు తేల్చుకోవాల్సింది మిలియన్ మార్చ్ వ్యవహారం. అలా వారూ పావులు కదుపుతున్నారు.

పరమపద సోపాన పటంలో నూరవ గడికి ఎవరు ముందుగా చేరుకుంటారో ఊహించడం కష్టమైనా, మూడు నెలల వరకూ, నిచ్చెనలెక్కుతూ-పాము నోట్లో పడి కిందకు జారుతూ, వుండడం మాత్రం తధ్యం.

Sunday, January 2, 2011

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు - ఎక్కడి గొంగళి అక్కడే నా?: వనం జ్వాలా నరసింహారావు

జనవరి 6, 2011 న అఖిల పక్ష సమావేశం జరుగనున్న నేపధ్యంలో ...
తారు మారైన "అభిప్రాయం - అధ్యయనం - తీర్పు" ప్రక్రియ
వనం జ్వాలా నరసింహారావు
(ఆంధ్ర జ్యోతి, 4-01-2011)

ఏమిటీ జాగు? ఎందుకీ జాగు? ఏడాది క్రితమే చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని “ప్రభుత్వ తీర్పు” గా ప్రకటించి, వెనక్కు తగ్గి, మళ్లీ అభిప్రాయ సేకరణకు, అధ్యయనానికి తెర లేపారు. అంతవరకు బాగానే వుంది... అభిప్రాయం , అధ్యయనం జరిగిన తర్వాత, తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత కమిటీ దన్నా కావాలి, లేదా, ప్రభుత్వానిదన్నా కావాలి తప్ప, రాజకీయ నాయకులది ఎలా అవుతుందో అర్థం కావడం లేదు. పరిష్కారం ప్రభుత్వం చేతుల్లో వుంటే, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా, తీర్పు ప్రకటించాలి. అలా కాదు... రాజకీయ నాయకుల చేతుల్లో వుందని ప్రభుత్వం భావిస్తే, వారు శ్రీకృష్ణ కమిటీకి వెల్లడించిన అభిప్రాయాల సారాంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేయాలి. కాదు... తీర్పు ప్రజలదే అనుకుంటే, గతంలోకి ఒక్క సారి తొంగి చూడాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయ తల్చుకుంటే, పార్లమెంటులో సంబంధిత ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి.... పార్లమెంటులోని వివిధ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరపాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడమే ప్రభుత్వ నిర్ణయమైతే, ధైర్యంగా బయట పెట్టాలి... పర్యవసానానికి ఎదురు చూడాలి!

కథ మళ్లీ మొదటికొచ్చింది. కర్ణుడి చావుకు ఎందరో కారణమైనట్లు నేతి ఈ దుస్థితికి కూడా అందరూ కారకులే. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, నవంబర్ 2009 ఆఖరు వారంలో, తన చివరి పోరాటంగా ప్రకటించి, "తెలంగాణ రాష్ట్రం" ఏర్పాటు ప్రకటన వెలువడేంతవరకు, వెనక్కు తగ్గేది లేదని అంటూ, ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. దీక్షకు కూచునే లోపునే ఆయన్ను అరెస్టు చేయడం, ఖమ్మం జైలుకు తరలించడం, అక్కడి జైలులోనే ఆయన దీక్ష కొనసాగించడం-ఆసుపత్రిలో చేర్పించడం, దీక్ష విరమించాడని ప్రకటించడం, దాన్ని ఆయన ఖండించడం నాటకీయంగా ఒకదాని వెంట ఒకటి జరిగాయి. చివరకు, మానవ హక్కుల కమీషన్ ఆదేశాల మేరకు కె.సీ.ఆర్ ను హైదరాబాద్ నిమ్స్ కు 108 అంబులెన్స్ లో తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో, ఆందోళన చెందిన అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వం-యూపీఏ ప్రభుత్వం, డిసెంబర్ 9, 2009 న కేంద్ర హోం మంత్రి చిదంబరంతో కర్ర విరగ కుండా-పాము చావకుండా వుండే రీతిలో "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం" అన్న అర్థం వచ్చే ఒక ప్రకటన చేయించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు, "సమైక్యాంధ్ర-ప్రత్యేకాంధ్ర" ఉద్యమాల పేరుతో హింస చెలరేగడంతో మరో ప్రకటన వెలువడింది. అనంతరం, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి జనవరి 5, 2010 న చిదంబరం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి, సమస్య పరిష్కారాన్ని కనుగొనడం రాజకీయ పార్టీల బాధ్యతగా చిత్రీకరించి, తాత్కాలికంగా చేతులు దులిపేసుకున్నారు. ఆ నాడు సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధుల్లో (పార్టీకి ఇద్దరు చొప్పున) ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన వారు తప్ప మిగతా ఎవరూ, స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాల్సిందే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. కాకపోతే ఆ పార్టీ నాయకులతో సహా అందరు కూడా చర్చల కొన సాగింపుకు "ప్రత్యక్షంగానో, పరోక్షంగా నో" అంగీకరించడంతో దరిమిలా శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. కాలయాపనకు శ్రీకారం చుట్టడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన నాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదానికి శ్రీకారం చుట్టడం ద్వారా ఆ ప్రాంత ప్రజలు “తమ తీర్పు” ను ఆ నాడే ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగి ఐదు దశాబ్దాలు దాటినా, తెలంగాణ ప్రాంత వారందరిలో, విడిపోయి- "తెలంగాణ" రాష్ట్ర ఏర్పాటు జరిగి, ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే వుంటూ, అన్నదమ్ములలాగా మెలుగు తే మంచిదన్న భావన బలంగా నాటుకు పోయింది. ఆ నినాదమే, ఒక లక్ష్యంగా - ధ్యేయంగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాల్సిందే అన్న స్థాయికి చేరుకోవడం "తమ తుది తీర్పు" గా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారంటే, పాలకవర్గాలు ఆ నినాదానికున్న ఆదరణను సరిగ్గా అంచనా వేయడం లేదనే అనాలి. కాకపోతే డిసెంబర్ తొమ్మిదో తేదీన, అప్పట్లో నెలకొన్నపరిస్తితులు చేజారిపోతుంటే, వ్యూహాత్మకంగా చిదంబరంతో యు పీ ఏ సర్కారు ఒక కంటి నీటి తుడుపు ప్రకటన చేయించి, ఉద్యమాన్ని పక్కదారి మళ్లించి, రాష్ట్రంలో చిచ్చు రగిలించి, మళ్లీ వెనక్కు తగ్గి, మరో ప్రకటన ఆ చిదంబరంతోనే చేయించి చోద్యం చూస్తున్నది. శ్రీకృష్ణ కమిటీ వేయడాన్ని తెలంగాణ ప్రజలు ఓర్పుతో, సహనంతో, భవిష్యత్ మీద నమ్మకంతో సహించి అంగీకరించారే తప్ప రాష్ట్రాన్ని సాధించుకోవడం చేతకాక ఒప్పుకో లేదు. కమిటీ నివేదిక తర్వాత కూడా మళ్లీ ఆట మొదలెడితే ఫలితాలు ఎలా వుండబోతున్నాయో ఎవరూ వూహించలేరేమో!

తెలంగాణ రాష్ట్రం తప్ప ఇంకేమిచ్చినా అంగీకరించడానికి ససేమిరా ఒప్పుకోని ఆ ప్రాంతంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు, ప్రత్యేకమైన రాయితీలను చట్ట రీత్యా - రాజ్యాంగ పరంగా కలిగించడం ద్వారా, తెలంగాణ వే(ఏ)ర్పాటు నినాదాన్ని మరో మారు పక్కదారి పట్టించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే అంతకంటే దారుణం ఇంకోటి లేదు. పెద్దమనుషుల ఒప్పందమనీ, ఫజలాలీ సంఘం నివేదికనీ, ముల్కీ నిబంధనలనీ రకరకాల మార్గాలద్వారా తెలంగాణ కోరుకునే వారిలో కొన్ని ఆశలు రేకెత్తించి, కొన్నేళ్లు ఉద్యమాన్ని బలహీనపరచగలిగింది (కాంగ్రెస్) ప్రభుత్వం. ఇక ఇప్పుడా అవకాశం లేనే లేదు. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో "తెలంగాణ ప్రజా సమితి" పేరుతో, 1971 సాధారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీగా బరిలోకి దిగిన తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీచేసి, 11 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రజాభిప్రాయం తెలంగాణ ఏర్పాటేనని స్పష్టంగా ఓటర్లు తెలియచేశారు. అంత కంటే " తుది తీర్పు" ఇంకేమైనా వుందా? ఆ తీర్పు తర్వాత ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ, అధ్యయనం చేయాల్సిన అవసరం వుందా? ఐనా శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుకు పరిణితి చెందిన తెలంగాణ ప్రజలు ఒప్పుకున్నారు. ఆ కమిటీ తీర్పు తెలంగాణ ఏర్పాటుకు విరుద్ధంగా వుంటే వారు ఒప్పుకుంటారని ప్రభుత్వం భావించడం కన్నా పొరపాటు మరొక టి లేదు.

కె. చంద్రశేఖర రావు "తెలంగాణ రాష్ట్ర సమితి" (టీ ఆర్ ఎస్) ని స్థాపించి ప్రత్యేక రాష్ట్ర వుద్యమాన్ని వ్యూహాత్మకంగా, అహింసా మార్గంలో, మేధావులను కలుపుకుని పోతూ, యావత్ భారతదేశంలోని భిన్న దృక్పధాల రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలను నెలకొల్పుకుంటూ, ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తూ, పదేళ్లు గా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అడపాదడపా ఇతర పార్టీల మీద, పార్టీ నాయకుల మీద దురుసుగా విరుచుకుని పడినా, లక్ష్య సాధన కొరకు అందరితో రాజీ పడుతున్నారు. మహబూబాబాద్ పర్యటనకు వెళ్తున్న జగన్ ను అడ్డుకునే విషయంలోను, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తి వేయించే విషయంలోను, అలాంటి మరి కొన్ని ఉమ్మడి అంశాలలోను కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు ప్రకటించడానికి వెనుకాడ లేదు. తనకు అప్రతిష్ఠ తెస్తున్నదని భావించిన తాగుడుకు స్వస్తి చెపుతున్నట్లు టీవీ ఛానళ్లద్వారా ప్రకటించాడు. చావో-తెలంగాణా రాష్ట్ర సాధనో తేల్చుకుంటానన్నాడు. ఆమరణ నిరాహార దీక్ష చేబట్టబోతున్న విషయాన్ని నెలరోజులముందే ప్రకటించాడు. అనుకున్నట్లే-అనుకున్న రోజునే-అనుకున్న చోటునే నిరాహారదీక్ష చేసేందుకు వెళ్తున్న ఆయన్ను నిర్భందంలోకి తీసుకుంది ప్రభుత్వం. ఖమ్మం జైలుకు తరలించింది. నిరాహార దీక్ష కొనసాగుతుండగానే, ఆయన ఆరోగ్యం క్షీణించింది. హైదరాబాద్ "నిమ్స్" కు కోర్టు ఆదేశాల మేరకు-మానవహక్కుల సూచనమేరకు తీసుకొచ్చింది ప్రభుత్వం. తెలంగాణ అంతా నిరసన జ్వాలలు పెల్లుబుకాయి. శాంతి-భద్రతల పరిస్థితి క్షీణించసాగింది. పరిస్థితి చేజారిపోతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం-యూ పీ యే ఛైర్ పర్సన్ సోనియా, చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చిదంబరంతో "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలవుతుంది" అన్న ప్రకటన చేయించింది కేంద్రం. కేసీఆర్ దీక్ష విరమించాడు. తెలంగాణ వస్తుందని భావించిన వారందరికీ అప్పటికి నిరాశే మిగిలింది.

ఆంధ్ర ప్రాంతంలో, "ప్రత్యేక ఆంధ్ర" కావాలని కోరిన ఒకనాటి నాయకులు, పంథాను మార్చుకొని, "సమైక్య ఆంధ్ర" అన్న నినాదం లేవదీశారు. విజయవాడ లోక్ సభ సభ్యుడు ఒక అడుగు ముందుకు వేసి "సమైక్య ఆంధ్ర" కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం-మానుకోవడం జరిగిపోయింది. ఆంధ్ర-రాయలసీమకు చెందిన అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు-ఎంపీలు రాజీనామా అస్త్రాలను సంధించారు. సమావేశమైన రాష్ట్ర శాసనసభ అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఆంధ్ర-రాయలసీమలో శాంతి భద్రతలు క్షీణించాయి. కేంద్రం మీద ఒత్తిళ్లు పెరిగాయి. చిదంబరం మరో ప్రకటన చేయాల్సివచ్చింది. అన్ని వర్గాల వారిని సంప్రదించిన తర్వాత ఏకాభిప్రాయ సాధనతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని దాని సారాంశం. అదెప్పుడో అప్పటికీ-ఇప్పటికీ "చిదంబర రహస్యం" గానే మిగిలిపోయింది. ఇంతలో తెలంగాణకు చెందిన అన్ని పార్టీల వారు ఒకటయ్యారు. చట్ట సభలకు ఎన్నికైన వారితో సహా, అన్ని స్థాయిలలో ఎన్నికైన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు సమర్పించారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైంది.

ఎనిమిది వందల పేజీల శ్రీకృష్ణ కమిటీ నివేదికలో, అఖిల పక్షం సమావేశానికి చిదంబరం ఆహ్వానించిన రాజకీయ పార్టీల అభిప్రాయాలు లేవా? అవన్నీ క్రోడీకరించి, రెండు-మూడు పేజీల సంక్షిప్త సమాచారంగా చేసి, ప్రభుత్వ అభిప్రాయాన్ని- ముసాయిదా తీర్పును దానికి అనుబంధంగా చేర్చి, పార్లమెంటులోని వివిధ రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించి, తమ నిర్ణయం ప్రకటించి, వారి సమాధానం తెలుసుకొని, ముందుకు సాగుతే మంచిది. అలా కాకుండా, జనవరి 5, 2010 నే పునరావృతం చేస్తే ఫలితం శూన్యం. అంతగా పిలవ తల్చుకుంటే, ఇదే ప్రక్రియను రాష్ట్రానికి చెందిన ఎనిమిది రాజకీయ పార్టీల అధ్యక్షులతో మాత్రమే చేస్తే సరిపోతుంది. "ఒక పార్టీ-ఒక అభిప్రాయం" అన్న సిద్ధాంతాన్ని పాటించాలి తప్ప, అఖిల పక్ష సమావేశం ఒక చర్చా వేదికగా మార్చే ప్రయత్నం చేయకూడదు. అలా చేయడమంటే, ప్రభుత్వ నిర్ణయం వాయిదా వేసి, శాశ్వతంగా ఉద్యమానికి అంకురార్పణ చేయడమే! శాశ్వతంగా శాంతి భద్రతల సమస్యను ప్రభుత్వ పరంగా సృష్టించడమే! అంటే, ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చినట్లే!

చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి.... కాదను కుంటే...ధైర్యంగా చేయమని చెప్పాలి... జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాలి. నాన్చు డు ధోరణి ప్రజాస్వామ్యానికే విఘాతం.