Showing posts with label జవహర్లాల్ నెహ్రూ. Show all posts
Showing posts with label జవహర్లాల్ నెహ్రూ. Show all posts

Friday, January 24, 2014

అలనాటి ప్రపంచ స్థాయి మహా నాయకులను మరచిపోతున్నామా?:వనం జ్వాలా నరసింహారావు

మహా నాయకులను మరచిపోతున్నామా?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (26-01-2014)

శాంతి దూత జవహర్‌ లాల్‌ నెహ్రూ, సైనిక పరంగా ప్రతిష్ఠ తెచ్చిన ఇందిర, అమెరికా అధ్యక్షుల్లో కెనడీకి విశేష గుర్తింపు, జర్మనీ ఐక్యతకు కృశ్చేవ్‌ కృషి, చైనా విప్లవ నేత మావో సె టుంగ్‌, వియత్నాం విప్లవ నేత హో చి మిన్‌, తిరుగులేని నాయకుడు ఫిడల్‌ కాస్ట్రో, దక్షిణాఫ్రికా మహాత్మా గాంధీ- మండేలా 

          అలనాటి అంతర్జాతీయ స్థాయి "రోల్ మోడల్" నాయకత్వం, ఈ రోజుల్లో, ఒకనాటి లీలా జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతోంది. ఇక, ఇప్పుడే ఇలా వుంటే, బహుశా భవిష్యత్‍లో వారిని గుర్తుంచుకునే వారు అసలు మిగలరేమో! అలాంటి ఉద్దండ నాయకులు ప్రస్తుతం లేనే లేరని అనలేం కాని, ఆ స్థాయి రాజనీతిజ్ఞత, వారి తరహాలో తమ-తమ దేశాలకు ప్రాతినిధ్యం వహించిన తీరు, తమ దేశాల వాణినే కాకుండా వారి-వారి ప్రాంతాల గురించి ఆ మహా నాయకులు పడ్డ ఆరాటం, వ్యక్తిగతంగా, ఉమ్మడిగా తాము పోరాడుతున్న అంశాల విషయంలో వారు ప్రదర్శించిన నిబద్ధత, బహుశా, ప్రస్తుత అంతర్జాతీయ స్థాయి నాయకుల్లో లోపించిందనడం అతిశయోక్తి కాదు. దురదృష్టవశాత్తు, రాజనీతి శాస్త్రం అధ్యయనం చేసే నేటి తరం విద్యార్థులు కాని, వర్తమాన చరిత్ర కారులు కాని, ఆ మాటకొస్తే సాధారణ చదువరి కాని, యువత కాని, గత కాలం నాటి మహా నాయకుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్న దాఖలాలు అంతగా కనిపించడం లేదు. అప్పట్లో, అంతర్జాతీయ స్థాయిలో ఒక గోష్టి కాని, సమావేశం కాని, సదస్సు కాని, ప్రపంచ దేశాల సమ్మేళనం కాని, ఎప్పుడు-ఎక్కడ ఏ మూల జరిగినా, ఆ నిర్వహణలో కనిపించిన హంగూ-ఆర్భాటం, ఆనందం, అంగరంగ వైభవం ఇప్పట్లో లోపించిందనాలి. ఉదాహరణకు, బెల్ గ్రేడ్‌లో 1961 లో, జవహర్లాల్ నెహ్రూ, సుకర్ణో, నాజర్, ఎన్ క్రుమా, టిటో ల సారధ్యంలో పురుడు పోసుకున్న అలీనోద్యమ సదస్సు పేర్కొన వచ్చు. ఆ ఐదుగురు ప్రపంచ నాయకులు, అగ్రరాజ్యాల ఆధిపత్యం తగ్గించడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నం, అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధాన్ని నివారించడానికి తెర పైకి తెచ్చిన అలీనోద్యమం తీరుతెన్నులు, నేటి తరంవారు, కనీసం తెలుసుకోవాలన్న-అవగాహన చేసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయడం లేదే? అలానే 1955 నాటి జెనీవా సదస్సు గురించి కాని, ఆ రోజుల్లో జరిగిన ఐక్య రాజ్య సమితి సర్వ సభ్య సమావేశాల గురించి కాని, కామన్ వెల్త్ దేశాధి నేతల సమావేశాల గురించి కాని, బాండుంగ్ సమావేశంగా పిలుచుకునే ఆప్రో-ఏషియన్ సమావేశం కాని, 1954 లో జరిగిన జెనీవా సమావేశం కాని, అలాంటి మరెన్నో అంతర్జాతీయ సమావేశాల గురించి కాని నేటి తరం యువత తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం విచారకరం.

అలనాటి అంతర్జాతీయ స్థాయి అగ్ర నాయకుల పేర్లలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి: జవహర్లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరా గాంధీ, జాన్ ఫిట్జ్ గెరాల్డ్ కెన్నెడీ, నికితా కృశ్చేవ్, చార్లెస్ డి గాలె, డేవిడ్ బెన్ గ్యూరియన్, ఆయన వారసురాలు గోల్డా మీర్, మార్షల్ టిటో, గమాల్ అబ్దుల్ నాజర్, చౌ-ఎన్-లై, మావో సేటుంగ్, సిరిమావో బండార నాయికే, విల్లీ బ్రాండ్ట్, సుకర్ణో, క్వామే ఎన్ క్రుమా, ఫిడల్ కాస్ట్రో, హోచిమిన్, నెల్సన్ మండేలా.....లాంటి వారు.

వివరాల్లోకి పోతే....జవహర్లాల్ నెహ్రూ, భారత ప్రప్రధమ ప్రధాన మంత్రి. ఆ పదవిలో ఆయన ఆగస్ట్ 15, 1947 నుంచి మే 27, 1964 వరకు-ఆయన మరణించేంత వరకున్నారు. ఐక్య రాజ్య సమితి విధానాలకు ఆయన తన సంపూర్ణ మద్దతిచ్చేవారు. ప్రపంచ వ్యాప్తంగా, శాంతిత్వ వాదనకు, ఆయన పేరు పర్యాయపదం అనవచ్చు. అలీనోద్యమ వ్యవస్థాపకుడిగా, అలనాటి అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యా దేశాల ఆధిపత్యాన్ని ఎదిరించిన వాడిగా, ఆ రెండు దేశాలకు చెందకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలు మధ్యే మార్గాన్ని అనుసరిచేట్లు చేసిన వాడిగా, చరిత్రలో ఆయనో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. 1954 లో పొరుగునున్న చైనా దేశంతో "పంచశీల" పేరుతో శాంతి-సహజీవనం దిశగా ఒప్పందం చేసుకున్నాడాయన. ఆయన కూతురు ఇందిరా గాంధీ కూడా తండ్రి మార్గంలోనే అంతర్జాతీయ స్థాయి నాయకురాలిగా ఆయన తదనంతరం పేరు తెచ్చుకుంది. భారత దేశానికి మొదటి పర్యాయం మూడో ప్రధాన మంత్రిగా 1966-1977 మధ్య కాలంలో, ఆ తరువాత ఆరవ ప్రధాన మంత్రిగా 1980 నుంచి 1984 లో ఆమె హత్యకు గురయ్యేదాకా ఇందిరాగాంధీ పని చేశారు. ఆమె కాలంలో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దేశంగా భారత దేశానికి పేరొచ్చింది. రాజకీయ, ఆర్థిక, సైనిక పరంగా దక్షిణ ఏషియా ప్రాంతంలో ఒక గొప్ప రాజ్యంగా అవతరించింది భారత దేశం. బంగ్లాదేశ్ ఆవిర్భావం, పాకిస్తాన్ పై భారత్ గెలుపు ఆమె నేతృత్వంలో సాధించినవే. అలీనోద్యమానికి కూడా అమె చేసిన కృషి అమోఘం. అలానే పాలస్తీనా విమోచనోద్యమానికి ఆమె ఇచ్చిన మద్దతు మరువరానిది.


జాన్ కెన్నెడీ జనవరి 20, 1961 నుంచి నవంబర్ 22,1963 వరకు, అమెరికా దేశపు 35 వ అధ్యక్షుడుగా, తాను హత్యకు గురయ్యేవరకు పనిచేశారు. ఆయన కాలంలోనే "బే ఆఫ్ పిగ్స్" దాడి, క్యూబన్ మిస్సైల్ సంక్షోభం, బెర్లిన్ గోడ నిర్మాణం, ఆఫ్రికా-అమెరికా పౌర హక్కుల ఉద్యమం తో సహా వియత్నాం పైన యుద్ధంలో అమెరికా మితిమీరిన జోక్యం చోటు చేసుకున్నాయి. అతి పిన్న వయసులోనే అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన కెన్నెడీ, అచిర కాలంలోనే ప్రపంచ స్థాయి అగ్రనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన కుటుంబం మీద పెరల్. ఎస్. బక్ రాసిన పుస్తకంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఆయన తదనంతరం అమెరికాకు ఎంతో మంది అధ్యక్షులు వచ్చినప్పటికీ ఆయన కొచ్చిన గుర్తింపు ఇంతవరకు మరెవ్వరికీ రాలేదనవచ్చేమో! అగ్రరాజ్యంగా అమెరికా ఆయన నేతృత్వంలోనూ, ఆ తరువాత కాలంలోనూ వెలుగొందుతున్న నేపధ్యంలో, మరో అగ్ర రాజ్యంగా, అమెరికాకు పోటీగా వున్న సోవియట్ యూనియన్‌కు ప్రధాన మంత్రిగా నికితా కృశ్చేవ్ వుండేవారు. మార్చ్ 14, 1953 నుంచి అక్టోబర్ 14, 1964 వరకు ఆయన ఆ పదవిలో వున్నారు. జర్మనీ ఐక్యత కొరకు కృశ్చేవ్ నిరంతరం కృషి చేసేవారు. నవంబర్ 1958 లో ఆయన ఆ దిశగా అమెరికాకు, ఇంగ్లాండుకు, ఫ్రాన్స్ దేశానికి ఒక అల్టిమేటం కూడా ఇచ్చారు. తక్షణమే, ఆరు నెలలు గడిచే లోపున తూర్పు-పశ్చిమ జర్మనీ దేశాలతోను, సోవియట్ యూనియన్ తోను శాంతి ఒప్పందం చేసుకోమని కోరాడు కృశ్చేవ్. అలా జరగని పక్షంలో, సోవియట్ యూనియన్ తనంతట తానే తూర్పు జర్మనీతో శాంతి ఒప్పందం చేసుకుంటుందని కూడా హెచ్చరించాడు.

చార్లెస్ డి గాలె ఫ్రాన్స్ ఐదవ గణతంత్ర రాజ్య వ్యవస్థాపకుడి గాను, ఆ దేశానికి 1959-1969 మధ్య కాలంలో అధ్యక్షుడి గాను, ఫ్రెంచ్ సైన్యాధినేతగాను, ప్రముఖ రాజనీతిజ్ఞుడిగాను, ఆ రోజుల్లో యావత్ ప్రపంచానికి చిరపరిచితుడు. 1958 లో ఫ్రెంచ్ రిపబ్లిక్ స్థాపన జరగడానికి చాలా కాలం క్రితమే, ఆ దేశానికి, 1945 లోనే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి కారణ భూతుడు డి గాలె. నాటో సైనిక కూటమి నుంచి ఫ్రాన్స్ దేశాన్ని ఉపసంహరించుకోవడమే కాకుండా, ఐరోపా సమాజంలో బ్రిటన్ దేశానికి ప్రవేశం కలగకుండా వీటో అధికారాన్ని ఉపయోగించిన వ్యక్తి డి గాలె. అమెరికా, సోవియట్ యూనియన్ దేశాల మధ్య సమతుల్యం పాటించుకుంటూ, ఒక పటిష్టమైన దేశంగా ఫ్రాన్స్ ను అభివృద్ధి చేయాలన్న విషయంలో డి గాలె ఎన్నడూ రాజీపడలేదు. అలాగే...ఇజ్రాయిల్ కు చెందిన గోల్డా మీర్, బెన్ గ్యూరియన్ లు. ఆ దేశ నాల్గవ ప్రధాన మంత్రిగా మార్చ్ 17, 1969 నుండి జూన్ 3, 1974 వరకు అధికారంలో వున్న గోల్డా మీర్ ను ఇజ్రాయిల్ రాజకీయాలలో "ఐరన్ లేడీ" గా అభివర్ణించే వారు. 1969 లోను, 1970 తొలినాళ్లలోను, గోల్డా మీర్ అనేక మంది ప్రపంచ నాయకులను కలిసి ఆమె కలలు కన్న రీతిలో, మధ్య ప్రాచ్య ప్రాంతంలో శాంతి స్థాపనకు కృషి చేశారు. ఆమెకు ముందు ప్రధానిగా పని చేసిన డేవిడ్ బెన్ గ్యూరియన్ ఇజ్రాయిల్ రాజనీతిజ్ఞుడిగాను, జాతి పిత గాను ప్రసిద్ధికెక్కాడు. ప్రప్రధమ ఇజ్రాయిల్ ప్రధాన మంత్రిగా మే 17, 1948 నుండి జనవరి 26, 1954 వరకు, ఆ తరువాత కొంత విరామం తీసుకుని తిరిగి నవంబర్ 3, 1955 నుండి జూన్ 26, 1963 వరకు బెన్ గ్యూరియన్ పనిచేశారు. 1948 లో జరిగిన అరబ్-ఇజ్రాయిల్ యుద్ధంలో తన దేశానికి నాయకత్వం వహించడమే కాకుండా, వివిధ జ్యూయిష్ సైనిక సంస్థలను, ఇజ్రాయిల్ సైన్యాన్ని కలిపి సమైక్యంగా పోరు సల్పారు.


యుగోస్లేవియా విప్లవకారుడిగా, ఆ దేశ రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందిన మార్షల్ టిటో, 1945 నుండి 1980 లో ఆయన చనిపోయేంత వరకు వివిధ హోదాలలో తన దేశానికి ఎనలేని సేవ చేశాడు. నెహ్రూ, నాజర్, ఎన్ క్రుమా, సుకర్ణో లతో కలిసి అలీనోద్యమ ప్రధాన నాయకుడిగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. అలీనోద్యమ ప్రప్రధమ సెక్రటరీ జనరల్ గా ఆయన ఎంపికయ్యారు. 1943-1963 మధ్య కాలంలో, సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియా ప్రధాన మంత్రిగా, ఆ తరువాత 1953-1980 మధ్య కాలంలో తొలుత అధ్యక్షుడిగా, పిదప యావజ్జీవిత అధ్యక్షుడిగా అధికారంలో వున్న ఆయన అంతర్జాతీయ స్థాయిలో కూడా తిరుగులేని నాయకుడని పేరు తెచ్చుకున్నాడు. ఇక గమాల్ అబ్దుల్ నాజర్ విషయానికొస్తే...ఆయన, ఈజిప్ట్ దేశానికి రెండవ అధ్యక్షుడిగా జూన్ 23, 1956 నుండి సెప్టెంబర్ 28, 1970 న చనిపోయేంత వరకు వున్నారు. అగ్ర రాజ్యాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, 1956 లో "సూయజ్‌ కెనాల్ కంపెనీ"  ని జాతీయం చేయడంతో ఈజిప్ట్ లోను, మొత్తం అరబ్ ప్రపంచంలోను తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందాడు. సిరియాతో కలిసి "యునైటెడ్ అరబ్ రిపబ్లిక్" ను స్థాపించాడాయన. ఆయన మరణం ప్రపంచ నాయకులనెందరినో కదిలించింది. యావత్ అరబ్ ప్రపంచానికి చెందిన నేతలు ఆయన అంత్య క్రియలకు హాజరయ్యారు. జోర్డాన్ రాజు హుస్సేన్, పాలస్తీనా విమోచనోద్యమ నాయకుడు యాసర్ అరాఫత్ బహిరంగంగా కంట తడి పెట్టుకున్నారు. లిబియాకు చెందిన కల్నల్ గడాఫి ఉద్వేగంతో రెండు పర్యాయాలు స్పృహ తప్పి పడిపోయాడు!

"పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా" ప్రప్రధమ ప్రధాన మంత్రిగా చౌ-ఎన్-లై అక్టోబర్ 1949 నుండి జనవరి 1976 లో చనిపోయేంతవరకు పదవిలో కొనసాగారు. కొరియా యుద్ధం నేపధ్యంలో, పశ్చిమ దేశాలతో శాంతి కొరకు ఆయన పాకులాడాడు. 1954 లో జరిగిన జెనీవా సమావేశంలో ఆయన కూడా పాల్గొన్నారు. అమెరికాతో, తైవాన్‌తో, సోవియట్ యూనియన్‌తో, భారత దేశంతో, వియత్నాంతో తలెత్తిన సంఘర్షణల నేపధ్యంలో, చౌ-ఎన్-లై సామరస్య పూరకంగా సమస్యలను పరిష్కరించుకునే దిశగా కొన్ని విధాన పరమైన నిర్ణయాలను తీసుకున్నాడు. ఆయన మెంటర్...నాయకుడు, మావో సేటుంగ్ 1949 లో "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా" వ్యవస్థాపకుడు. 1921 లో ఆవిర్భవించిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులలో మావో ఒకరు. మార్క్స్, లెనిన్‌ల సరసన కమ్యూనిజాన్ని వ్యాపింప చేయడంలో కృషి చేసిన త్రిమూర్తులలో ఆయనొకరు. ప్రపంచ చరిత్రకు ఆయన చేసిన తోడ్పాటు చరిత్ర గతినే మార్చిందనాలి. పాలస్తీనా నాయకుడిగా, పాలస్తీనా విమోచన సంస్థ అధ్యక్షుడిగా యాసర్ అరాఫత్ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. పాలస్తీనా జాతీయ అథారిటీకి ప్రధమ అధ్యక్షుడిగా ఆయన జులై 5, 1994 నుండి నవంబర్ 11, 2004 వరకు పనిచేశారు. పాలస్తీనా స్వయం ప్రతిపత్తి కొరకు తన జీవితాంతం ఇజ్రాయిల్‌తో ఆయన పోరాటం సాగించాడు. అసలు ఇజ్రాయిల్ ఉనికే వద్దన్న అరాఫత్ ఆ తరువాత రాజీపడి, ఐక్య రాజ్య   సమితి తీర్మానానికి అనుగుణంగా తన విధానాన్ని 1988 లో మార్చుకున్నాడు. శ్రీలంక ప్రధానిగా సిరిమావో బండారు నాయిక ఎన్నో సార్లున్నారు. 1960-1965, 1970-1972, 1972-1977, 1994-200 మధ్య కాలంలో ఆమె ప్రధానిగా పనిచేయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

విల్లీ బ్రాండ్ట్ జర్మనీ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు. 1969-1974 మధ్య కాలంలో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఛాన్స్ లర్‍ గా పనిచేశారు. పశ్చిమ జర్మనీ, సోవియట్ అనుకూల దేశాల మధ్య సయోధ్య కుదిరించడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, 1971 సంవత్సరానికి విల్లీ బ్రాండ్ట్ కు నోబెల్ శాంతి బహుమానం లభించింది. ఇండోనేషియా ప్రధమ అధ్యక్షుడిగా పనిచేసిన సుకర్ణో, ఆ పదవిలో 1945 నుండి 1967 వరకు, అంటే 22 సంవత్సరాల పాటు కొనసాగారు. 1960 వ దశకంలో ఇండోనేషియాను వామపక్ష భావాల దిశగా మళ్లించి, ఇండొనేషియన్ కమ్యూనిస్ట్ పార్టీకి తన పూర్తి మద్దతిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో తన దేశానికి ప్రాముఖ్యత-గుర్తింపు తెచ్చేందుకు, సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా మూడో ప్రపంచ దేశాలను కూడగట్టాడాయన. అలీనోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. క్వామే ఎన్ క్రుమా ఘనా దేశానికి తిరుగులేని నాయకుడుగా వుండేవారు. బ్రిటీష్ వలస రాజ్యంగా వున్న ఘనాకు 1957 లో స్వాతంత్ర్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించిన ఎన్ క్రుమా ఆ దేశానికి ప్రధమ అధ్యక్షుడి గాను, ప్రధమ ప్రధాన మంత్రి గాను పనిచేశారు. ఆఫ్రికన్ యూనిటీ సంస్థ వ్యవస్థాపకుల్లో ఆయనొకరు. 1963 సంవత్సరంలో లెనిన్ శాంతి బహుమతిని అందుకున్నారు ఎన్ క్రుమా. వియత్నాం కమ్యూనిస్ట్ విప్లవ నాయకుడిగా ప్రసిద్ధికెక్కిన హో చి మిన్ ఆ దేశాధ్యక్షుడిగా 1945-1969 మధ్య కాలంలోను, ప్రధాన మంత్రిగా 1945-1955 మధ్య కాలంలో పనిచేశారు. వియత్నాం స్వాతంత్ర్యం కొరకు 1941 నుంచి పోరాటం సాగించిన హో చి మిన్, కమ్యూనిస్ట్ పాలనలోని వియత్నాం ప్రజాస్వామ్య రిపబ్లిక్ ను 1945 లో స్థాపించారు. 1954 లో ఫ్రాన్స్ దేశాన్ని ఓడించిన ఘనత ఆయనదే.

ఎలిజబెత్ రాణి తర్వాత బహుశా ఎక్కువ కాలం అధికారంలో వున్న వ్యక్తి ఫిడల్ కాస్ట్రోనే. లాటిన్ అమెరికాలో కాస్ట్రోను మించిన కమ్యూనిస్ట్ నాయకుడు మరొకరు లేరు. కమ్యూనిస్ట్ విప్లవ పంథాపై ఆయనకు గట్టి పట్టుంది. జనవరి 9, 1959 నుండి ఫిబ్రవరి 19, 2008 వరకు ఆయన క్యూబాకు తిరుగులేని నాయకుడు. అప్పటి నుంచి తానే పదవిని ఆశించనని, చేపట్టనని ప్రకటన చేశారు. ఇటీవలే చనిపోయిన నెల్సన్ మండేలా గురించి ఎంత చెప్పినా తక్కువే. దక్షిణాఫ్రికా మహాత్మా గాంధీగా ఆయన్ను పిలిచేవారు. అలాంటి మహా నాయకులు అరుదుగా వుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే, గత కాలంలో ఇలాంటి మహా నాయకులు మరికొందరుండవచ్చు....ఏరీ అలాంటి నాయకులిప్పుడు?


Saturday, May 18, 2013

కాంగ్రెస్‌ చీలికలతో నీలం సంజీవరెడ్డి అనుబంధం: వనం జ్వాలా నరసింహారావు


నీలం సంజీవరెడ్డి శత జయంతి ఉత్సవాలు ఆరంభం కానున్న నేపధ్యంలో....

కాంగ్రెస్‌ చీలికలతో నీలం సంజీవరెడ్డి అనుబంధం
వనం జ్వాలా నరసింహారావు

 (ఇందిరాగాంధి ప్రధాన మంత్రిగా తాను అమలు పరచాలనుకున్న విధానాలను
పటిష్టంగా అమలు పరిచే అవకాశం లభించిన 1969 నాటి పరిణామాలు)

అవి నేను నాగపూర్ లో ఎం. ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న రోజులు. 1969-1971 మధ్యకాలం. ప్రత్యేక తెలంగాణ-జై ఆంధ్ర ఉద్యమాల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లోని కళాశాలలు, విశ్వ విద్యాలయాలు మూత బడడంతో డిగ్రీ పూర్తి చేసుకున్న నాలాంటి కొందరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొరకు నాగపూర్ లాంటి ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో ఇందిరాగాంధి ప్రధానమంత్రిగా తనదంటూ రాజకీయాలలో ఒక ముద్ర వేసుకుంటున్న రోజులు. సిండికేట్ గా పిలువబడే అతిరథ-మహారథులైన కాంగ్రెస్ ఉద్దండ పిండాలను ఆమె మట్టికరిపిస్తున్న రోజులవి. భారతదేశ చరిత్రలో మొట్ట మొదటిసారి-చివరిసారి, ప్రధాన మంత్రిగా, దేశంలోని అత్యున్నత పదవికి తన పార్టీ పక్షాన తానే ప్రతిపాదించిన వ్యక్తికి వ్యతిరేకంగా తనపార్టీవారినే ఓటేయమని ఇందిరాగాంధి ప్రోత్సహించిన రోజులవి. ఒక విద్యార్థిగా, రాష్ట్రపతి పదవికి ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఎలెక్టోరల్ కాలేజి అంటే ఏమిటి లాంటి విషయాలతో పాటు, రాజకీయాలలో సమీకరణలు ఎలా వుంటాయో అర్థం చేసుకుంటున్న రోజులవి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలపై నేను రాసుకున్న నోట్స్ ఆధారంగా ఇప్పుడు రాసిన వ్యాసం ఇది.

ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలకు ఎంతో విలు వుంది. నిర్ణయాలు మెజార్టీ సభ్యుల ఆమోదంతో తీసుకున్నవైనప్పటికీ, సంఖ్యా పరంగా అతి కొద్దిమంది ఆలోచనలను, సూచనలను గౌరవించినప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపిస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం జరిగినప్పటినుంచికూడా, మోడరేట్లనీ-అతివాదులనీ భిన్నాభిప్రాయాలవారున్నప్పటికి, వారందరి ధ్యేయం-లక్ష్యం స్వాతంత్ర్య సాధనొక్కటే. స్వాతంత్ర్యం వచ్చిన పిదప కూడా కాంగ్రెస్ పార్టీలోని భిన్నాభిప్రాయాలవారందరు కలివిడిగా జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో పనిచేశారు. వారిలో అతివాద, మితవాద భావాలవారున్నారు. అతివాద సిద్ధాంతాలకు దగ్గరైన సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా పాలన చేసిన నెహ్రూ, పార్టీలోని మితవాద భావాల వారినుండి అడపాదడపా ఎదురైన ప్రతిఘటనలను అధిగమించుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకుపోయారు. పార్టీని నడిపించారు. నాటి పరిస్థితుల్లో పార్టీపరంగా ఆయన అవలంబించిన మధ్యేమార్గం చక్కగా పనిచేసింది. ఆయన మరణానంతరం, పార్టీలోని బలీయమైన మైనార్టీ మితవాద శక్తులు, అభివృద్ధి మార్గాన్ననుసరిస్తున్న నాటి ప్రధాన మంత్రికి అడ్డంకులు-అవరోధాలు కలిగించడంతో, భారత జాతీయ కాంగ్రెస్ లో చీలి కొచ్చి, దరిమిలా కాంగ్రెస్ (ఐ) ఆవిర్భవించి, ఈ నాటికీ దేశ రాజకీయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని, వర్తమాన రాజకీయాల్లో ఒక అతి ముఖ్యమైన ఘట్టంగా పరిణమించిందనవచ్చు.

అయితే భారత జాతీయ కాంగ్రెస్ లో అంతకుముందు చీలికలు లేవనిగాని-రాలేదనికాని అనలేం. 1907 లో నాగపూర్ లో జరగాల్సిన అఖిలభారత కాంగ్రెస్ సభలు వాయిదాపడి, తర్వాత, సూరత్ లో జరిగాయి. అతివాద భావాల వారికి నాయకత్వం వహిస్తున్న బాలగంగాధర తిలక్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎంపికకావడం ఇష్టపడని మాడరేట్లు, సభలను సూరత్ కు మార్చి, రాష్ బిహారీ ఘోష్ కు నాయకత్వం అంటగట్టారు. సభా ప్రాంగణంలో వాగ్యుద్ధాలు తీవ్రస్థాయిలో జరిగాయి. పాత తరం నాయకత్వమని-కొత్తతరం నాయకత్వమని, రెండు వర్గాలుగా పార్టీ చీలిపోయింది. అతివాద భావాల వారు వేరుకుంపటి లాంటిది పెట్టుకొని, తమను తాము అసలైన జాతీయ వాదులుగా వర్ణించుకున్నారు. ఇక ఆ తర్వాత ఏడెనిమిది సంవత్సరాల వరకు పార్టీపై మాడరేట్లే ఆధిపత్యం. దరిమిలా పరిస్థితుల్లో మార్పు కనబడ సాగింది. అతివాదులుగా ముద్రపడిన వారంతా మాతృసంస్థైన కాంగ్రెస్ లో తిరిగి చేరడంతో, భవిష్యత్ లో జరుగనున్న పరిణామాలకు సూచనలు పొడచూపాయి. నాయకత్వంలో కూడా మార్పులు-చేర్పులు చోటుచేసుకోవడం ఆరంభమయింది.


1969నాటి చీలిక, 1951లో సంభవించిన నాసిక్ సంక్షోభం, ఓ మోస్తారు అనాలి. కాకపోతే, అధ్యక్ష పదవికి అతి తీవ్రంగా జరిగిన పోటీలో, ఆచార్య జె. బి. కృపలానీని ఓడించిన పురుషోత్తమ దాస్ టాండన్, దరిమిలా చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా, రాజీనామా చేశారు. చేసి తన రాజనీతిజ్ఞతను చాటుకున్నారు. కాంగ్రెస్ లో చీలికను నివారించారప్పట్లో. 1969లో దీనికి విరుద్ధంగా, నాటి అధ్యక్షుడు నిజలింగప్ప వ్యవహరించడంతో, చీలిక అనివార్యమయింది.

నవంబర్ 1969లో భారత జాతీయ కాంగ్రెస్ చీలిపోవడానికి ప్రధాన కారణం, అంతకు కొద్ది నెలలక్రితం, జులై నెలలో, బెంగుళూర్ లో జరిగిన పార్టీ సమావేశంలో తలెత్తిన వివాదమే. అప్పట్లో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. స్వాతంత్ర్యోద్యమ కాలంలోను, జవహర్లాల్ నెహ్రూ హయాంలోను, సామాజిక-ఆర్థిక-విధానపరమైన విషయాలలో భేదాభిప్రాయాలు-భిన్న ధృక్ఫధాలున్నవారు అనేకమంది వున్నప్పటికీ, వారంతా కాంగ్రెస్ గొడుగు కింద పనిచేసి, ఐకమత్యంగా పార్టీ బలపడేందుకు ఉమ్మడిగా కృషిచేశారు. నాలుగో సాధారణ ఎన్నికలనంతరం, ముఖ్యంగా 1969లో జరిగిన మధ్యంతర ఎన్నికల తర్వాత, దేశ రాజకీయాల్లో సంభవించిన పరిణామాల నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీలోపలా-వెలుపలా, తరచూ, "అతివాద-మితవాద" శక్తుల-వ్యక్తుల ప్రస్తావన రావడం ఆరంభమయింది.

ఇదొక్క కాంగ్రెస్ కే పరిమితమై పోలేదు. అన్ని పార్టీలలోనూ ఈ సంఘర్షణ మొదలైంది. ఆ రోజుల్లో "సిండికేట్" గా సంబోధించబడే కాంగ్రెస్ నాయకులైన మొరార్జీ దేశాయ్, ఎస్. కె. పాటిల్, అతుల్య ఘోష్, నిజలింగప్ప (పార్టీ అధ్యక్షుడు), నీలం సంజీవరెడ్డి లాంటి వారితో, పార్టీలో అతివాదులుగా ముద్రపడిన వారు బహిరంగంగానే విభేదిస్తుండేవారు. బాంకులను జాతీయం చేయడానికి అతివాదులు మద్దతిస్తే, సిండికేట్ వర్గం వారు వ్యతిరేకించారు. బెంగుళూర్ సమావేశంలో ప్రభుత్వరంగ సంస్థల పనితీరుపై వచ్చిన విమర్శల లాంటివి ఇరువర్గాల మధ్య తీవ్ర అభిప్రాయభేదాలకు దారితీశాయి. ప్రధానమంత్రి ఇందిరాగాంధి నాయకత్వాన్ని పూర్తిగా బలపరుస్తున్న అతివాద వర్గం, సిండికేట్ వర్గం వారిని "సామ్యవాద-లౌకికవాద" విధానాలను వ్యతిరేకించేవారన్న నిర్ణయానికి వచ్చారు.

ఇందిరాగాంధి తీసుకున్న బాంకుల జాతీయం నిర్ణయాన్ని వ్యూహాత్మకంగా బలపరుస్తూనే, సిండికేట్ ఒక అడుగు ముందుకు వేసి, నీలం సంజీవరెడ్డి పేరును రాష్ట్రపతి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించాడు నిజలింగప్ప. ఇందిరాగాంధి సూచించిన వి. వి. గిరి పేరును గానీ, జగజీవన్ రాం పేరును గానీ పరిగణలోకి తీసుకోలేదు. ప్రధాన మంత్రిగా తాను సూచించిన అభ్యర్థిని కాకుండా వేరే వ్యక్తిని పార్లమెంటరీ బోర్డ్ ఎంపిక చేయడాన్ని, దాని వెనుక నున్న ఉద్దేశాన్ని తప్పుబట్టింది ఇందిరాగాంధి. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయాల్సిన అభ్యర్థి విషయంలో మెజారిటీ నిర్ణయంకన్నా ఏకాభిప్రాయం ముఖ్యమని తేల్చిచెప్పిందామె. దెబ్బకు దెబ్బగా, మొరార్జీ దేశాయ్ ని ఆర్థిక శాఖనుంచి తొలగిస్తూ నిర్ణయం ప్రకటించింది. భవిష్యత్ లో తాను తీసుకోదలచిన ఆర్థికపరమైన విధానాల అమలు బాధ్యతను మొరార్జీ మీద మోపలేనంటూ తన అభిప్రాయాన్ని వెల్లడిచేసింది. వేరే శాఖను నిర్వహించడానికి ఇష్టపడని మొరార్జీ రాజీనామా చేశాడు.

జులై 19, 1969న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, 14 భారీ వాణిజ్య బాంకులను జాతీయం చేయాలని నిర్ణయం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించ తల్చుకున్న విధానాలకనుగుణంగా, సమసమాజ నిర్మాణం జరగాలంటే, ఇలాంటి నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరముందని ఆమె ప్రకటించారు. ఇందిరాగాంధి తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు దారితీస్తే, వామపక్షాల సంపూర్ణ మద్దతు లభించిందామెకు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో సంభవించనున్న భారీ మార్పులకు-రాజకీయ సమీకరణలకు-పునరేకీకరణలకు తొలి సూచనలు కనబడసాగాయి. పార్టీ ప్రణాళికను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ వారిపై ఇందిరాగాంధి బహిరంగంగానే విమర్శలు చేయడంతో, ఆమెను నియంత్రించే ప్రయత్నాలు జరిగినా, అవేవీ ఫలించలేదు.

వి. వి. గిరి స్వతంత్ర అభ్యర్థిగా-వామ పక్షాల మద్దతుతో, రాష్ట్రపతి పదవికి పోటీకి దిగారు. ఆత్మ ప్రబోధం మేరకు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయమని, కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్-శాసనసభ సభ్యులకు ఆగస్ట్ 13, 1969, పిలుపునిచ్చింది ఇందిరాగాంధి. కాంగ్రెస్ అధ్యక్షుడుగా వున్న నిజలింగప్ప, తమ పార్టీ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తున్న స్వతంత్ర-జనసంఘ్ పార్టీల నాయకులకు, సంజీవరెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతూ లేఖ రాయడాన్ని తప్పుపట్టింది ఇందిరాగాంధి. ఆమె పక్షాన ఫకృద్దీన్ అలీ అహ్మద్, జగ్జీవన్ రాం కాంగ్రెస్ ఓటర్లకు ఆత్మ ప్రబోధం పిలుపివ్వడం జరిగింది. కాంగ్రెస్ విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్న వారి మద్దతు కోరడమంటే, ఏదో విధంగా ఎన్నికల్లో గెలుపు సాధించడమేనని, అది తప్పనీ, విలువలకు తిలోదకాలివ్వడమేననీ, ఇందిరాగాంధి స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీలో చీలికను నివారించడానికే తాను "ఆత్మ ప్రబోధం" నినాదాన్ని ఇచ్చానని ఆమె పేర్కొంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు వున్న కాంగ్రెస్ పార్టీ వారందరికీ ఆమె ఆగస్ట్ 18, 1969 న లేఖ పంపుతూ, అందులో, "సరళీకృత, సామ్యవాద, ఆర్థిక సంస్కరణలను తేవాలని-అమలుచేయాలని అనుకున్నప్పుడల్లా, స్వప్రయోజన పరులు వాటిని వ్యతిరేకిస్తుంటారు" అని పేర్కొని, వారందరి మద్దతు కోరింది ఇందిరాగాంధి. ఇదిలా వుండగా, పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపణ చేస్తూ, జగజీవన్ రాం, ఫకృద్దీన్ అలీ అహ్మద్ లకు కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప నోటీసులు పంపాడు. అయితే, పార్టీ విధానాలను పాటించనివారికి క్రమశిక్షణ గురించి మాట్లాడడంలో అర్థంలేదని ఇందిరాగాంధి పేర్కొంది. వివిధ రాష్ట్రాలలో కొందరు కాంగ్రెస్ నాయకులు తమ స్వప్రయోజనాల కొరకు అవలంబించిన విధానాల వల్ల, ఎలా అభిమానులు పార్టీని వీడిపోయారో వివరించిందామె. జగజీవన్ రాం, ఫకృద్దీన్ అలీ అహ్మద్ లు తామే నిజమైన కాంగ్రెస్ వాదులమని, కాంగ్రెస్ వాదులు, ప్రజలు తమ వెంటే వున్నారని అధ్యక్షుడిచ్చిన నోటీసును సవాలు చేశారు. పార్టీకి చెందిన మెజారిటీ పార్లమెంట్-శాసనసభ్యులు ఇందిరాగాంధికి మద్దతు పలకడంతో, వి. వి. గిరి రాష్ట్రపతిగా ఎన్నికవడం జరిగింది. పార్టీపై ఆమెకున్న ఆధిక్యత ఋజువైంది.

ఒక వైపు పార్టీలో ఆమెకు లభించిన ఆధిపత్యం, మరోవైపు వామపక్షాల నుండి లభిస్తున్న మద్దతు, ఇందిరాగాంధికి ముందుకు కొనసాగడానికి ధైర్యాన్నిచ్చింది. లౌకిక వాదం మీద, ప్రజాస్వామ్యం మీద, సామ్యవాద సిద్ధాంతాల మీద నమ్మకం వున్న వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపిచ్చిందామె. దేశాభివృద్ధిలో పాలు పంచుకోమని విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏ కొద్దిమంది హక్కుభుక్తం కాదని, పౌరులందరికీ దానిపై హక్కుందని స్పష్ట పరిచింది. మహాత్మాగాంధి, జవహర్లాల్ నెహ్రూల అడుగుజాడల్లో కాంగ్రెస్ పనిచేస్తుందని-దేశాభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పేందుకు, ప్రజల-పార్టీ శ్రేణుల మద్దతు కూడగట్టేందుకు, దేశవ్యాప్తంగా పర్యటించింది ఇందిరాగాంధి.

ఆమె తమిళనాడు పర్యటనకు కొద్దిరోజుల ముందు, కాంగ్రెస్ అగ్రనాయకుడు నిజలింగప్ప అనుకూల వాది కామరాజ్ నాడార్ తో వచ్చిన విభేదాలవల్ల, రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇందిరాగాంధి మద్దతుదారుడైన సి. సుబ్రహ్మణ్యం రాజీనామా చేశాడు. దాన్ని సాకుగా చూపి, ఆయన్ను వర్కింగ్ కమిటీ సభ్యుడుగా కొనసాగే విషయంలో పేచీ పెట్టాడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప. ఇరువర్గాలు కొద్దిరోజుల కింద కుదుర్చుకున్న ఐక్యతా ఒప్పందానికి నిజలింగప్ప తీసుకుంటున్న చర్యలు విరుద్ధమైన వని పేర్కొంటూ, ఇందిరాగాంధి, వై. బి. చవాన్, జగ్జీవన్ రాం, ఫకృద్దీన్ అలీ అహ్మద్, ఉమాశంకర్ దీక్షిత్, సి. సుబ్రహ్మణ్యంలు సంయుక్తంగా అధ్యక్షుడికి లేఖను పంపారు. ఇందిరాగాంధి, నిజలింగప్ప మద్దతు దారుల మధ్య విభేదాలు ముదిరిపోవడంతో, అక్టోబర్ 18, 1969, గడువుకంటే ముందే, నూతన అధ్యక్షుడు ని ఎన్నుకోవడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వర్కింగ్ కమిటీకి విజ్ఞప్తిచేశారు.

సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాసిన లేఖలో, గతంలో పార్టీ చేసిన తీర్మానాన్ని ఉదహరిస్తూ, సామ్యవాద-లౌకిక-అభివృద్ధికర విధానాలను ప్రభుత్వం పటిష్టంగా అమలు జరిపేందుకు పార్టీ ప్రజల మద్దతు కూడగట్టుకోవాలనీ-అందుకు పార్టీకి కొత్త అధ్యక్షుడు కావాలనీ, అందుకే అధ్యక్ష ఎన్నిక జరగాలనీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగడానికి ఒకరోజు ముందర, నవంబర్ 1, 1969, సి. సుబ్రహ్మణ్యం, ఫకృద్దీన్ అలీ అహ్మద్ లను సభ్యులుగా తొలగిస్తూ నిజలింగప్ప ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో, ఇందిరాగాంధి మద్దతు దార్లు సమావేశానికి హాజరు కాలేదు. ఏ. ఐ. సి. సీ సమావేశం జరపాలని లేఖ పంపిన వర్కింగ్ కమిటీ సభ్యులందరూ ఇందిరాగాంధి ఇంట్లో సమావేశమయ్యారు. మెజారిటీ ఏ. ఐ. సి. సీ సభ్యుల అభ్యర్థన మేరకు నవంబర్ 22--23,1969న ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహించాలని తీర్మానం చేశారా సమావేశంలో. నవంబర్ 12న ఇందిరాగాంధిని పార్టీనుంచి బహిష్కరించే చర్యలు నిజలింగప్ప చేపట్టడంతో, చీలికకు రంగం పూర్తిగా సిద్ధమయింది. అత్యధిక సంఖ్యాకులైన ఇందిరాగాంధి మద్దతు దారులు, నిజలింగప్ప ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని తప్పుబట్టి, నవంబర్ చివరి వారంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహించి, సి. సుబ్రహ్మణ్యంను తాత్కాలిక అధ్యక్షుడుగా ఎన్నుకోవడంతో భారత జాతీయ కాంగ్రెస్ చీలిపోయింది.

ఇందిరాగాంధి ప్రధాన మంత్రిగా తాను అమలు పరచాలనుకున్న విధానాలను పటిష్టంగా అమలు పరిచే అవకాశం లభించింది. అలా, అలనాడు, నీలం సంజీవరెడ్డి కారణాన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ చీలిపోయి, దరిమిలా కొన్నాళ్లకు, నేడు యుపిఎ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ (ఐ) గా అవతారమెత్తింది. ఆ తరువాత కాలంలో అదే సంజీవరెడ్డి ఏకగ్రీవ అభ్యర్థిగా రాష్ట్రపతి కాగలిగారు.

Sunday, August 5, 2012

సిద్ధాంతాలతో సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ ముఠా రాజకీయం: వనం జ్వాలా నరసింహారావు


సిద్ధాంతాలతో సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ ముఠా రాజకీయం
వనం జ్వాలా నరసింహారావు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ సోనియా గాంధీతో సమావేశమైనట్లు, రాజీ మార్గం గురించి చర్చించినట్లు మీడియాలో కధనాలొచ్చాయి. ఆ వార్తల్లో వాస్తవం లేదని వైఎస్సార్సీపి నేతలు ఖండించడం కూడా జరిగింది. కలవడం, కలవకపోవడం అటుంచి, రాజీ మార్గం ఎంచుకోవడంలో మాత్రం తప్పేంటి? జగన్మోహన్ రెడ్డికి ముందర ఎంతమంది కాంగ్రెస్ పార్టీని వీడి పోలేదు? ఎంతమంది వారిలో స్వగృహ ప్రవేశం చేయలేదు? ఇతర పార్టీలలో వుంటూ ఎంతమంది కాంగ్రెస్‌ను అనరాని మాటలని, ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరి ప్రధాన భూమిక పోషించడం లేదు? అదే విధంగా భవిష్యత్‍లో జగన్మోహన్ రెడ్డి చేసే అవకాశాలు లేవని ఎందుకు భావించాలి? ఎందుకు ఆ పార్టీ వారు భుజం తడుముకోవాలి? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి, అందులోకి రావాలని అనుకునేవారికి మామూలే!

స్వాతంత్రోద్యమం నాటి భారత జాతీయ కాంగ్రెస్ కు ఇప్పటి కాంగ్రెస్ () కు పోలికే లేదనాలి. అలనాటి కాంగ్రెస్‌లో అభిప్రాయ భేదాలకు, మైనారిటీ వ్యక్తుల సూచనలకు గౌరవం లభించేది. ఇక ఇప్పుడో, అధిక సంఖ్యాకుల మద్దతున్న వారిని, ప్రజా బలం వున్న వారిని, అధిక సంఖ్యాకుల ప్రజా ప్రతినిధుల ఆదరణ వున్న వారిని, ఏదో ఒక నెపంతో, పార్టీ దూరం చేసుకుంటున్నది. ఒక నాడు పార్టీ అనుసరించిన మద్యే మార్గం, అతివాద-మితవాద శక్తులను కలుపుకుని పార్టీని పటిష్టం చేయడమైతే, ఈ నాటి మద్యే మార్గం, భిన్నాభిప్రాయాలను వెల్లడించమని పరోక్షంగా అధిష్టానం ప్రోత్సహించడమే. అధిష్టానంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు, అధినేత్రి దగ్గర పలుకుబడిని సంపాదించుకునేందుకు, ప్రత్యక్షంగానో-పరోక్షంగానో ప్రతి రాష్ట్రంలోని, సమ్మతి-అసమ్మతి వాదులను పురికొల్పడం ఈ నాటి మద్యే మార్గం. కింది స్థాయినుంచి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనని వారిని, స్థానికంగా ప్రజల మద్దతు లేని వారిని, పోటీ చేసి గెలవలేని వారిని, అధిష్టానం దగ్గర చెవులు కొరుకుతూ తిరిగే వారిని చేర దీయడం పార్టీకి అలవాటుగా మారింది. కాంగ్రేసేతర పార్టీలలో ప్రముఖ పాత్ర పోషించి, అన్నీ అనుభవించి, అక్కడ తమ అవసరాలన్నీ తీర్చుకుని, అక్కడ వున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇష్టమొచ్చినట్లు తూలనాడిన వారంతా పార్టీలో ప్రముఖులవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అంటూ గొంతు చించుకుంటున్న వారంతా, ఎప్పుడో ఒకప్పుడు పార్టీని దుయ్యబట్టిన వారో, ఇతర పార్టీలనుంచి వలస వచ్చిన వారో కావడం విశేషం.

ఉదాహరణకు, ఈ నాడు కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన పదవిలో వున్న జైపాల్ రెడ్డి, రాజీవ్ గాంధిని, ఎన్ని రకాల దూషించడానికి వీలుందో అన్ని రకాలుగా, బోఫోర్స్-ఫెయిర్‌ ఫాక్స్ విషయాల్లో, దూషించారు. జనతా పార్టీనుంచి గెలిచి కేంద్రంలో మంత్రి పదవిని అనుభవించారు. మరిప్పుడాయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తి. సాక్షాత్తు ఇందిరా గాంధి మీద ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వీరేంద్ర పాటిల్, కాంగ్రెస్ () లో చేరి తన స్థానాన్ని బల పర్చుకోలేదా ? స్వర్గీయ పర్వత నేని ఉపేంద్ర మాటేంటి? ఈ నాడు సోనియాకు అతి సన్నిహితురాలిగా చెప్పుకుంటున్న రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంగతేంటి? తెలంగాణ ప్రజా సమితి పేరుతో కాంగ్రెస్ ను ధిక్కరించి, ఎన్నికల్లో పోటీ చేసి, పది మందికి పైగా అభ్యర్థులను పార్లమెంటుకు గెలిపించుకున్న స్వర్గీయ మర్రి చెన్నా రెడ్డిని అధిష్టానం ఏం చేయ గలిగింది. ఒక్క సారి కాదు ... కనీసం మూడు సార్లు ఆయన అధిష్టానాన్ని ధిక్కరించారు. ఇంతెందుకు.. ఎన్నికలు జరిగిన ప్రతి సారి, టికెట్ దొరకని పలువురు నేతలు, ఇండిపెండెంటుగా పోటీ చేయడం, ఆరేళ్లు బహిష్కరించ బడడం, స్వగృహ ప్రవేశం చేయడం, లోగడ కంటే, మంచి పదవులు పొందడం తెలిసిన విషయమే. జగ్జీవన్ రాం, ఎన్డీ తివారి, అర్జున్ సింగ్‌లను కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయగలిగింది ? ఇవ్వాళ శరద్ పవార్ లేకపోతే భారత జాతీయ కాంగ్రెస్ మనుగడే లేదు. మమత బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌ను కాదనే ధైర్యం సోనియా గాంధీకి వుందా? తమిళ నాడులో పీవీ నరసింహా రావు పొత్తుల నిర్ణయానికి వ్యతిరేకంగా "తమిళ మానిల కాంగ్రెస్" ను స్థాపించి, పార్లమెంటుకు ఎన్నికై, కాంగ్రేసేతర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిత్వ శాఖను నిర్వహించిన చిదంబరం కాంగ్రెస్ క్రమ శిక్షణకు లోబడినట్లా ? కాదా?




కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు, ముఠా పోకడలు, అధిష్ఠానాన్ని ధిక్కరించడం, పార్టీని వీడిపోవడం, స్వగృహ ప్రవేశం చేయడం, గతంలో కంటే ప్రాధాన్యత సంపాదించుకోవడం లాంటివి ఆది నుంచీ జరుగుతున్నదే. బాల గంగాధర్ తిలక్, గోపాల కృష్ణ గోఖలే, విభేదించినప్పటికీ దూషించుకోలేదు. గాంధీజీ నాయకత్వంలో యువకులైన నెహ్రూ, బోసులకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చినప్పటికీ, బోసు ధిక్కార ధోరణి గాంధీకి నచ్చలేదు. తనకిష్టమైన జవహర్లాల్ నెహ్రూను, స్వతంత్రం రాకమునుపు ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వానికి సారధిని చేసేందుకు, అబుల్ కలాం ఆజాద్‌తో రాజీనామా చేయించి, ఆయన స్థానంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నెహ్రూ వ్యవహరించేందుకు తోడ్పడ్డారు గాంధీజీ. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించినంతవరకు, రాగ ద్వేషాలకు, మహాత్ముడంతటి వాడే అతీతం కాదని అనుకోవడానికి నిదర్శనంగా భవిష్యత్‍లో వల్లభాయ్ పటేల్ ప్రధాని అయ్యే అవకాశాలను కూడా పరోక్షంగా దెబ్బ తీశారు గాంధీజీ. మధ్యంతర ప్రభుత్వంలో తనకిష్టమైన విదేశాంగ శాఖను నెహ్రూ వుంచుకుని, హోం శాఖను పటేల్‌కు కేటాయించడంతో తనకు తెలియకుండానే, భవిష్యత్‍లో తన ప్రాబల్యం పెరిగేందుకు అవకాశం కలిపించుకున్నారు నెహ్రూ.

1948-1950 మధ్య కాలంలో హోమ్ మినిస్టర్ గా వున్న వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. దాదాపు అన్ని ప్రొవిన్షియల్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పటేల్ మనుషులు ఎన్నికయ్యారు. ఈ లోపున రాజ్యాంగ శాసనసభకు సంబంధించి, సంస్థానాల విలీనం గురించి చర్చలు-చర్యలు మొదలయ్యాయి. జాతీయ గీతంగా జనగణమణ..” వుండాలా, “వందేమాతరం...” వుండాలా? అన్న విషయంలోనూ కాంగ్రెస్ నాయకత్వంలో విభేదాలు చోటుచేసుకున్నాయి. 1948 లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా గెలిచిన పట్టాభి సీతారామయ్య, ఆ తర్వాత పురుషోత్తం దాస్ టాండన్ చేతిలో ఓటమి పాలయ్యారు. వారిలో మొదటి వారు నెహ్రూ బలపర్చిన వ్యక్తికాగా, టాండన్ పటేల్ పక్షం మనిషి. గాంధీజీ మరణానంతరం, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా గవర్నర్ జనరల్ గా పనిచేసిన రాజగోపాలా చారికి నెహ్రూ మద్దతు లభించగా, పటేల్ మద్దతు వున్న రాజేంద్ర ప్రసాద్‌కు ఆ పీఠం దక్కింది. అవన్నీ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పోరాటాలే. అప్పట్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులలో నెహ్రూ అనుచరులని, పటేల్ అనుచరులని వేర్వేరుగా సంబోధించేవారు. నీలం సంజీవరెడ్డి నెహ్రూ అనుకూలుడుగా, టంగుటూరు ప్రకాశం పంతులు ఆయనకు వ్యతిరేకిగా చెప్పుకునేవారు.

మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న ప్రకాశం పంతులును దింపడానికి నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావులు ఒకటయ్యారు. నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయి, కాంగ్రెస్ వదిలి వెళ్లిపోయిన ప్రకాశం, స్వగృహ ప్రవేశం చేసి, అదే సంజీవరెడ్డి ప్రోద్బలంతో తిరిగి ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు. ఉప ముఖ్య మంత్రి పదవి దక్కించుకున్న నీలం సంజీవ రెడ్డి చక్రం తిప్పారు. కాంగ్రెస్‌ను వీడిన ఆయన ప్రత్యర్థి ఎన్జీ రంగా ఆ తరువాత స్వగృహ ప్రవేశం చేసి గుంటూరు లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. శాసన సభ సమావేశాలలో, మద్య నిషేధం సాకుగా ఓడిన ప్రకాశం రాజీనామా చేయడంతో గవర్నర్ పాలన విధించడం, శాసన సభను రద్దుచేయడం జరిగింది. అవన్నీ ముఠా రాజకీయాలే. దరిమిలా, నీలం సంజీవరెడ్డి స్థానంలో బెజవాడ గోపాల రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1955 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నాయకుడిగా నీలం-బెజవాడల మధ్య పోటీ వుండడంతో, అధిష్ఠానం బెజవాడ గోపాల రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకుని, పి డబ్ల్యు శాఖతో తృప్తి పడాల్సి వచ్చింది. మళ్ళీ ముఠా రాజకీయాలు మొదలయ్యాయి. గోపాలరెడ్డికి వ్యతిరేకంగా, కళా వెంకట్రావును, కల్లూరు చంద్రమౌళిని కలుపుకుని నీలం సంజీవరెడ్డి పనిచేయ సాగారు. అధిష్ఠానం దూతగా వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి వారి మధ్య తాత్కాలికంగా రాజీ కుదిరించారు.

బెజవాడ గోపాలరెడ్డికి పోటీగా, కాసు బ్రహ్మానందరెడ్డిని ప్రోత్సహించిన నీలం సంజీవరెడ్డి, తమతో అల్లూరి సత్యనారాయణ రాజును కలుపుకున్నారు. 1956 లో విశాలాంధ్రగా ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రం అవతరించింది. ముఖ్య మంత్రి పదవికోసం మరో మారు పోటీ మొదలైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి-మర్రి చెన్నారెడ్డి మద్దతు బెజవాడకు, బూర్గుల-విబి రాజుల మద్దతు నీలంకు లభించింది. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు నీలంకే మద్దతు పలికారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తన మంత్రివర్గంలోనే ఉప ముఖ్య మంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి కింద బెజవాడ గోపాలరెడ్డి ఆర్థిక శాఖను నిర్వహించాల్సి వచ్చింది. 1957 లో తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. నీలం వర్గానికి అధిక స్థానాలు వచ్చాయి. తన స్థానాన్ని పదిలపర్చుకోసాగాడు. కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పాగా పుల్లారెడ్డి, బొమ్మ కంటి సత్యనారాయణ రావు ప్రభృతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పార్టీని వదిలి, “డెమోక్రాటిక్ పార్టీని స్థాపించారు. విజయవాడలో నిర్వహించిన ఆ పార్టీ మహాసభలో ప్రసంగించిన మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరడం కంటె, కృష్ణా నదిలో పడడం మంచిదనిఅన్నారు. పార్టీ వదిలిన మర్రి చెన్నారెడ్డి అప్పుడే కాకుండా అలా మరి రెండు పర్యాయాలు వదలడం-స్వగృహ ప్రవేశం చేయడం, పదవులను అనుభవించడం అందరికీ తెలిసిందే.

నీలం సంజీవరెడ్డిని జాతీయ రాజకీయాల్లోకి లాగడమే మంచిదని భావించిన జవహర్లాల్ నెహ్రూ, పథకం ప్రకారం 1960 లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. సంజీవరెడ్డి స్థానంలో రాజీ అభ్యర్థిగా దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు. తనను వ్యతిరేకించిన ఏసీ సుబ్బారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు సంజీవయ్య. ఏ కొద్దిమందో తప్ప, దాదాపు కాంగ్రెస్ పార్టీలోని హేమా-హేమీలందరు సంజీవయ్యను ధిక్కరించిన వారే ! ఐనా పార్టీలో కొనసాగారు. 1962 లో ఎన్నిక లొచ్చే సమయానికల్లా సంజీవరెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకుని రావడం జరిగింది. ఆయన స్థానంలో సంజీవయ్యను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు. ఎన్నికలనంతరం 1964 లో కర్నూల్ బస్సుల జాతీయం కేసులో రాజీనామా చేసేంతవరకు బలీయమైన నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి కొనసాగారు.

1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయింతర్వాత, మళ్లీ ముఠా రాజకీయాలకు తెర లేచింది. కాసుకు వ్యతిరేకంగా ఏసీ సుబ్బారెడ్డి అసంతృప్తి కాంగ్రెస్ వర్గానికి బాహాటంగానే నాయకత్వం వహించారు. కాసు వర్గాన్ని మినిస్టీరియలిస్టులుఅని, ఏసీ వర్గాన్ని డిసిడెంట్లుఅని పిలిచేవారు. మర్రి చెన్నారెడ్డి మద్దతు కాసు వర్గానికుండేది. 1967 లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలిచిన మర్రి చెన్నారెడ్డి ఎన్నికల కేసులో సభ్యత్వాన్ని కోల్పోవడమే కాకుండా, ఆరేళ్లు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడవడంతో, 1969 తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం చేపట్టారు. కేంద్ర మంత్రివర్గంలో చేరిన నీలం సంజీవరెడ్డి, రాష్ట్ర రాజకీయాలలో తల దూర్చలేదు. చెన్నారెడ్డి ధిక్కార ధోరణి పుణ్యమా అని, కాసు ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో పీవీ నరసింహా రావు రావడం జరిగింది. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరించి, తెలంగాణ ప్రజా సమితి పేరుమీద ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు చెన్నారెడ్డి బలపర్చిన అభ్యర్థులు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో సస్పెన్షన్లకు లెక్కేలేదు. ముల్కీ కేసులో తీర్పుపై పీవీ వ్యాఖ్యలకు నిరసనగా తలెత్తిన ఉద్యమం ఫలితంగా ఆయన పదవి కోల్పోవడం, ఆయన స్థానంలో కొన్నాళ్లకు జలగం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో ఇందిర విధేయుడుగా, అత్యంత సమర్థుడైన ముఖ్య మంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం, ఆ తర్వాత కాలంలో, ఇందిర మంత్రివర్గంలో ఎమర్జెన్సీ హోం మినిస్టర్గా పనిచేసిన బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ లో చేరాడు. 1978 శాసనసభ ఎన్నికల్లో, ఇందిరా కాంగ్రెస్ (నేటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్-) ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విజయ పథంలో నడిపించగా, వెంగళ్ రావు నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలైంది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారి. వెంగళరావు మళ్ళీ ఇందిర పంచన చేరి కేంద్రంలో మంత్రి పదవి అనుభవించారు. పీసీసీ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. ఆయన బాటలోనే బ్రహ్మానందరెడ్డి నడిచారనాలి.

ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతో, సమ్మతి-అసమ్మతి రాగాల మధ్య, ముఖ్యమంత్రుల మార్పిడికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహిరంగంగానే, అసమ్మతికి అధిష్ఠానం ప్రోత్సాహం లభించేది. ఒకరి వెంట మరొకరు అంజయ్య, భవనం, విజయ భాస్కర రెడ్డి ముఖ్య మంత్రులయ్యారు అసమ్మతి పుణ్యమా అని. 1983 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ను, 1989 లో మరో పర్యాయం, పీసీసీ అధ్యక్షుడుగా గెలిపించిన చెన్నారెడ్డి, ముఖ్య మంత్రి కావడానికి అధిష్ఠానం ఆశీస్సులు తప్పనిసరైందని అనక తప్పదు. మళ్ళీ అసమ్మతి... మళ్ళీ ధిక్కార స్వరాలు.. ఏడాదికే ఆయన స్థానంలో.. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ముఖ్య మంత్రయ్యారు. ఆయన్నూ వుండనివ్వలేదు అధిష్ఠానం. మరో మారు విజయ భాస్కర రెడ్డిని ముఖ్య మంత్రిని చేసి, తెలుగు దేశం ఇంకో మారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. అప్పట్లో అసమ్మతిని, ధిక్కార స్వరాన్ని వినిపించిన డాక్టర్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసినా, కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి మరో పది సంవత్సరాలు పట్టింది. ఆయన రెండో పర్యాయం ముఖ్య మంత్రి అయింతర్వాత, ఆకస్మికంగా మరణించడంతో, ఆరేళ్లు వినిపించని ధిక్కార స్వరాలు మళ్లీ మొదలయ్యాయి. ఆయన వున్నప్పుడు ధిక్కారానికి అవసరం లేనందునో-వీలు కలగనందునో తాత్కాలికంగా ఆగినా, కాంగ్రెస్ లో అంతర్భాగమైన ధిక్కార పర్వాలు, అసంతృప్తి కాండలు మళ్ళీ మొదలయ్యాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటో విషయంలో ఈ రోజు ఆయనను బాహాటంగా విమర్శించే వారు, ఆయనున్నప్పుడు నోరు విప్పడానికే జంకేవారు.
          
నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో ఏదో విధంగా అధిష్ఠానాన్ని ధిక్కరించని నాయకులు అరుదు. పార్టీలో ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత వుంటుందో-ఎప్పుడు ఎవరికి వుండకుండా పోతుందో చెప్ప గల వారు లేరిప్పుడు. సుమారు పాతిక పర్యాయాలు పార్టీ పగ్గాలను చేజిక్కించుకుని, నలభై సంవత్సరాల పాటు అధ్యక్ష పీఠం అధిష్ఠించింది నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారే. అదే వారసత్వానికి చెందిన సోనియా గాంధీ నాయకత్వంలోని అధిష్ఠానం ప్రస్తుతం అవలంభిస్తున్నది మాత్రం విభజించి పెత్తనం సాగించడంఅనే బ్రిటీష్ పోకడలు. భవిష్యత్ లో పార్టీకి ఆ పోకడలు లాభం చేకూరుస్తాయనుకోవడం పొరపాటే. దీని ప్రభావం అన్ని రాష్ట్రాల మాదిరిగానే, ఆంధ్ర ప్రదేశ్‌పైనా పడక మానదు. యుపిఎ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పరంగా అత్యధిక స్థానాలను సంపాదించి పెట్టిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వారితో సంధి ప్రయత్నాలను చేయక తప్పని పరిస్థితి



కాకపోతే, ఆ పని ఇప్పుడు చేస్తే మంచిదా? 2014 ఎన్నికల తరువాత చేస్తే మంచిదా? అని ఆలోచించుకోవాలి. ఏదేమైనా, చేరేది లేదు-చేతులు కలిపేది లేదని తెగేసి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి! ఎవరి వ్యూహం ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.

Thursday, March 1, 2012

బడుగాగ్ని మండేలా: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు

కోలుకుంటున్న నల్ల జాతి మహాత్ముడు, వర్ణ- జాతి వివక్షపై పోరాటం, భారత రత్న’ అందుకున్న విదేశీయుడు, 27 సంవత్సరాల జైలు జీవితం, దూర విద్య ద్వారా న్యాయశాస్త్రంలో డిగ్రీ,  మండేలా పోరాటాలకు, భారత్‌ మద్దతు - ఎడిటర్ సూర్య

ఆరోగ్యం కుదుటబడిన నెల్సన్ మండేలా, జోహన్స్ బర్గ్ లోని తన స్వగృహంలో, నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఇటీవల కాలంలో మధ్య మధ్య క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు, దక్షిణాఫ్రికా మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం, ఆందోళనతో గమనిస్తోంది. దీర్ఘకాలంగా ఇబ్బందికి గురిచేస్తున్న ఉదర కోశ సంబంధమైన వ్యాధికి మండేలాకు లాపరోస్కోపిక్ చికిత్స చేశారు. జాత్యహంకార శ్వేత జాతి పాలకుల గుండెలలో నిద్రపోయిన నల్లజాతివారిపాలిట మహాత్ముడు నెల్సన్ మండేలా తొంబైనాలుగేళ్ల వయసులో పూర్తిగా తెల్లబడ్డ జుట్టుతో, బలహీనంగా, ఎంతో ముదుసలిగా కనిపిస్తున్నారని ఆయనను చూసిన విదేశీ పాత్రికేయులంటున్నారు. కర్ర సహాయంతో నడుచుకుంటూ, ఆయన నిత్యం అధ్యయనం చేసే గదిలోకి వెళుతుంటారు. కాళ్లకు చెప్పులు ధరించేటప్పుడు వణకుతుంటారు. అతికష్టం మీద కుర్చీలో కూర్చుని, వెనుకకు వాలి, ఒక్కో కాలుని ఇబ్బందికరంగా పైకి లేపి, ఎదురుగా వుంచిన చిన్న బల్లపై పెట్టుకుని దీర్ఘాలోచనలో మునిగిపోతే, ఆయన భార్య గ్రీసా ఆ సమయంలో ఆయన పాదాలను సవరిస్తుంటారు. ఆయన కుర్చీ పక్కనే, మండేలాను ఇరవయ్యేడు సంవత్సరాల పాటు జైలులో నిర్బంధానికి గురిచేసిన జాత్యహంకారుల ఆంగ్ల, ఆఫ్రికన్ భాషల వార్తాపత్రికలు, మాగజైన్లు ఒక బల్లపై పడివుంటాయి. ఆయన కుడి పక్కన, ఆయనకు వినిపించేంత దగ్గరలో, కబుర్లు చెప్పుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూచుంటారు. మండేలా జ్ఞాపక శక్తి తగ్గిపోతున్నా, పాత జ్ఞాపకాలను ఇంకా నెమరేసుకుంటూనే కాలం గడుపుతుంటారు. "ఆయనలో ప్రశాంతత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది".

జులై 18, 1918 న జన్మించిన నెల్సన్ ఆర్ మండేలా, దక్షిణాఫ్రికా మొట్టమొదటి ఎన్నికైన అధ్యక్షుడిగా, 1994-1999 మధ్య కాలంలో పనిచేశారు. అధ్యక్ష పీఠం అధిష్టించడానికి పూర్వం, దీర్ఘకాలం, వర్ణ-జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం సల్పిన ధీరుడు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సైనిక విభాగానికి నాయకుడు. 1962 లో అరెస్టు కాబడి, శిక్షకు గురై, జీవిత ఖైదీగా 27 సంవత్సరాల పాటు జైలులో గడిపారు. ఫిబ్రవరి 11, 1990 న విడుదలై, ప్రభుత్వంతో విజయవంతంగా చర్చలు జరిపి, 1994 లో "బహుళ జాతి ప్రజాస్వామ్యం" స్థాపనకు కారకుడైనాడు. ఆ ఏడాది జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించి దక్షిణాఫ్రికా అధ్యక్షుడయ్యారు. 1993 నోబెల్ శాంతి బహుమానం, అదే ఏడాది టైమ్స్ మాగజైన్ "మాన్ ఆఫ్ ద యియర్" గౌరవం, 1980 లో జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ బహుమతి, 1988 లో "లెనిన్ శాంతి బహుమతి", 1990 లో "భారతరత్న" ఆవార్డు అందుకున్నారు మండేలా. భారతదేశ పౌరుడు కాకపోయినా ఆయనకు "భారతరత్న" పురస్కారం ఇచ్చి గౌరవించింది ప్రభుత్వం. 1973 లో లీడ్స్ విశ్వవిద్యాలయంలో శాస్త్రజ్ఞులు కనుగొన్న ఒక అణు రేణువుకు "మండేలా పార్టికిల్" అని పేరు పెట్టారు. న్యూఢిల్లీలోని ఒక రోడ్డును నెల్సన్ మండేలా మార్గం అని పిలుస్తారు.

తింబు రాజ వంశానికి చెందిన మండేలా పితామహుడు కూడా ఒక రాజుగా ప్రసిద్ధిగాంచిన వాడే. తన తండ్రి పదమూడు మంది సంతానంలో పాఠశాలకు వెళ్లిన మొదటి వాడు మండేలానే. పాఠశాలలోనే ఆయన టీచర్ మండేలా పేరు ముందర "నెల్సన్" చేర్చింది. 1937 లో కళాశాలలో చేరిన మండేలా, ఫోర్ట్ హారే యూనివర్సిటీలో ఇంకా మొదటి సంవత్సరం చదువుతుండగానే, విశ్వవిద్యాలయం విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘం చేపట్టిన ఉద్యమంలో పాలు పంచుకోవడంతో, బహిష్కృతుడై, దూర విద్య ద్వారా డిగ్రీ చదువు పూర్తి చేశాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే, వర్ణ-జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విద్యార్థి నాయకులతో, స్నేహం ఏర్పడింది. అలనాటి ఆయన స్నేహితులు దరిమిలా యావజ్జీవిత స్నేహితులుగా మిగిలిపోయారు.

1948 లో దక్షిణాఫ్రికా దేశంలో జరిగిన ఎన్నికలలో, వర్ణ-జాతి వివక్షతను సమర్థిస్తున్న జాత్యహంకార ఆఫ్రికన్ల జాతీయ పార్టీ గెలుపొందడంతో, మండేలా రాజకీయాలలో చురుగ్గా పాల్గొనడం మొదలెట్టాడు. అదే రోజుల్లో మహాత్మా గాంధీ ప్రభావం మండేలా మీద బాగా పడింది. 150 మంది సహచరులతో సహా డిసెంబర్ 5, 1956 న మండేలాను అరెస్ట్ చేసి కొద్దికాలం తరువాత విడుదల చేసింది ప్రభుత్వం. 1961 లో, "ఎంకే" అన్న పేరుతో పిలువబడిన, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సైనిక విభాగానికి మండేలా నాయకు డయ్యారు. ప్రభుత్వ సైనికులకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. విద్రోహ-విధ్వంసక చర్యలకు కూడా సమన్వయకర్తగా వ్యవహరించారాయన. అవి కూడా ఫలితాన్నివ్వకపోతే, వర్ణ-జాతి వివక్షతను ఆపు చేయలేకపోతే, గొరిల్లా తరహా పోరాటానికి కూడా సిద్ధమవ్వాలని ఒకానొక సందర్భంలో పిలుపిచ్చారు మండేలా. ఏళ్ల తరబడి జాత్యహంకార శ్వేత జాతీయుల వర్ణ-జాతి వివక్షతకు అడ్డూ-అదుపూలేకపోవడంతో, అహింసా మార్గం వదిలి, హింసాయుత మార్గంలో పోతే మంచిదన్న ఆలోచన కూడా చేశారాయన. "ఎంకే" ఆధ్వర్యంలో వర్ణ-జాతి వివక్షత చూపుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మొదలెట్టిన గొరిల్లా పోరాటంలో, సాధారణ పౌరుల ప్రాణాలు కూడా పోవడంతో, మండేలా స్పందించారు. తన నాయకత్వంలోని కొందరిని ఆయన తీవ్రంగా విమర్శించడమే కాకుండా, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, వర్ణ-జాతి వివక్షతకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని అంగీకరించారు. ఇదిలా కొనసాగుతుండగానే, ఆగస్ట్ 5, 1962 న మండేలాను అరెస్ట్ చేసిఅక్టోబర్ 25, 1962 న తొలుత ఐదేళ్ల పాటు శిక్ష విధించింది ప్రభుత్వం. జూన్ 12, 1964 న ఇతర సహచరులతో సహా మండేలాకు యావజ్జీవ శిక్ష విధించింది న్యాయస్థానం.
ఇందిరా గాంధీ సమక్షంలోఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం 
న్యూ ఢిల్లీలో ప్రారంభోత్సవం చేసిన నాటి చారిత్రాత్మక ఫొటో

ఆయన 27 సంవత్సరాల జైలు జీవితంలో మొదటి 18 ఏళ్లు "రాబిన్ ఐలాండ్" జైలులో వుంచింది ప్రభుత్వం. దక్షిణాఫ్రికా శ్వేత జాతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నల్ల జాతీయుల హక్కులకొరకు పోరాడుతున్న యోధుడిగా, జైలులో వున్న రోజుల్లో, మండేలాకు, ప్రపంచ వ్యాప్త గుర్తింపు రావడం మొదలైంది. జైలులో వుండగా, ఒక సున్నపు క్వారీలో, కఠినతరమైన కూలీ పని చేయించారు మండేలాతో. జైలు జీవితం చాలా దుర్భరంగా వుండేది. నల్ల జాతి ఖైదీలని, శ్వేత జాతీయులని విడి-విడిగా వారిని చూసేవారు జైలు సిబ్బంది. ఆహార విషయంలోనూ వివక్షత పాటించేవారు. రాజకీయ ఖైదీలకు ప్రత్యేకించి ఏ హక్కులూ వుండకపోయేది. మండేలాను చూడడానికి ఆరు నెలలకు ఒకసారి ఒక విజిటర్‌ను, చదవడానికి ఆర్నెల్లకి ఒక్క సారి ఒక్క ఉత్తరాన్ని అనుమతించేవారు! వచ్చిన ఆ ఒక్క ఉత్తరమైనా, ఎన్నాళ్లకో కాని మండేలాకు చేర్చేవారు కాదు. అది కూడా పూర్తిగా చినిగి, చదవడానికి పనికిరాని విధంగా చేసేవారు జైలు అధికారులు. ఇంత నిర్బంధంలో కూడా, జైలులో దూర విద్య ద్వారా చదువుకుని, లండన్ విశ్వ విద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలో డిగ్రీ సంపాదించారు మండేలా. మార్చ్ 1982 లో, సహచర ఖైదీలతో సహా, మండేలాను, రాబిన్ ఐలాండ్ జైలు నుండి, పోల్స్ మూర్ జైలుకు మార్చింది ప్రభుత్వం.

"రాజకీయ ఆయుధంగా హింసాయుత మార్గాన్ని వ్యతిరేకించడానికి" నెల్సన్ మండేలా అంగీకరిస్తే, ఆయనను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు బోథా ఫిబ్రవరి 1985 లో సంసిద్ధత వ్యక్తం  చేసారు. ఆయన సూచనను మండేలా నిర్ధంద్వంగా తిరస్కరించారు. "ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మీద నిషేధం వున్నంతకాలం నాకు స్వేచ్ఛ ఇస్తాననడంలో అర్థం లేదు. స్వతంత్ర వాయువులు పీలుస్తున్న వారే చర్చలకు అర్హులు కాని, నా లాంటి జైలులో వున్నవారు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి వీలు కాదు" అని తన కూతురు ద్వారా ప్రభుత్వానికి ఒక సందేశం పంపారు మండేలా. చివరకు నవంబర్ 1985 లో బోథా నేషనల్ పార్టీ ప్రభుత్వ ప్రతినిధికి, మండేలాకు మధ్య మొదటి విడత సమావేశం చోటుచేసుకుంది. అదే రోజుల్లో సమావేశం జరిగిన వోల్క్స్ ఆసుపత్రిలో మండేలా ప్రొస్టేట్ సర్జరీ అనంతరం కోలుకుంటున్నారు. అలాంటి సమావేశాలు మరి కొన్నిమరో నాలుగేళ్లు జరిగినప్పటికీ, ఫలితం అంతగా కనపడలేదు. కాకపోతే, భవిష్యత్ చర్చలకు అవి పునాదులేశాయి.1988 లో మండేలాను "విక్టర్ వెర్స్ టర్" జైలుకు తరలించి, విడుదల చేసేంతవరకు అక్కడే వుంచారు.

"నెల్సన్ మండేలాను విడుదల చేయాలి" అన్న నినాదంతో, ఆయన జైలులో వున్నంత కాలం, జాతీయ-అంతర్జాతీయ స్థాయి ఒత్తిడులు దక్షిణాఫ్రికా ప్రభుత్వంపై వచ్చాయి పలుమార్లు. రెడ్ క్రాస్ సంస్థ అంతర్జాతీయ విభాగం ప్రతినిధులు ఎన్నో మార్లు మండేలాను జైలులో కలుసుకున్నారు. 1989 లో బోథా స్థానంలో ఫ్రెడెరిక్ విలియం క్లర్క్ దేశాధ్యక్షుడయ్యారు. ఏడాది తిరక్కుండానే, మండేలా విడుదల నిర్ణయాన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మీద, ఇతర వర్ణ-జాతి వివక్షత వ్యతిరేక సంస్థల మీద అంతవరకున్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తొలుత ప్రకటించి, ఆ తరువాత ఫిబ్రవరి 1990 లో మండేలాను విడుదల చేసింది ప్రభుత్వం. ఆయన విడుదల కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. విడుదలైన రోజున జాతినుద్దేశించి మండేలా ప్రసంగం చేశారు. శ్వేత జాతీయులతో సఖ్యతకు-సహ జీవనానికి, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి తన నిబద్ధతను వ్యక్త పరుస్తూనే, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సైనిక పోరాటం ఆగిపోలేదని ఇంకా కొనసాగుతుందని ప్రకటించారు మండేలా.

జైలునుంచి విడుదలైన మండేలా తిరిగి 1990-1994 మధ్య కాలంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఏప్రిల్ 27, 1994 న బహుళ జాతీయులందరూ పాల్గొన్న మొదటి ఎన్నికలు జరిగాయి. 62%  ఓట్లను పొందిన ఆఫ్రికన్ జాతీయ కాంగ్రెస్ నాయకుడు మండేలా, మే 10, 1994 , నల్ల జాతి వారికి చెందిన ప్రప్రధమ దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడయ్యారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నట్లు నిదర్శనంగా, క్లర్క్ కూడా మంత్రివర్గంలో చేరారు. "ట్రేడ్ మార్క్ బాటిక్ చొక్కాలను" ధరించుతూ, అంతర్జాతీయ స్థాయిలో దక్షిణాఫ్రికా గౌరవాన్ని ఇనుమడించే విధంగా ఆయన అధ్యక్ష పాలన కొనసాగింది. ఉచిత వైద్యం, సంక్షేమ పథకాలకు ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు, విద్యకు ప్రాధాన్యత, భూ సంస్కరణల అమలు, కార్మికులతో సత్సంబంధాలు లాంటివి ఆయన పాలనలో చెప్పుకోదగ్గవి. కల్నల్ గడ్డాఫీ లిబియాకు, అమెరికా-బ్రిటన్ దేశాలకు మధ్య విభేదాలను తొలగించేందుకు మండేలా కృషి చేశారు.

మండేలా మొదటి భార్యతో పదమూడేళ్లు కాపురం చేసి విడాకులిచ్చారు. దానికి ప్రధాన కారణం, మండేలా నిరంతరం ఉద్యమంలో పాల్గొనడమే! ఆ తరువాత రెండు సార్లు మళ్లీ పెళ్ళి చేసుకున్నారు. తన 80 వ పుట్టిన రోజున 1998 లో ఇప్పుడున్న మూడో భార్య గ్రీసా మాషెల్‍ను వివాహమాడారు మండేలా. ఆమె దివంగత మొజాంబిక్ అధ్యక్షుడు సా మోరా మాషెల్ భార్య. పెళ్లికి ముందు అది జరగడానికి ఎన్నో దఫాలుగా చర్చలు సాగాయి. రెండవ పర్యాయం ఎన్నికలలో పోటీ చేయరాదని నిర్ణయించుకున్న మండేలా, తన రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. అప్పటినుంచి, రకరకాల సాంఘిక-మానవ హక్కుల సంస్థలకు సలహాదారుడిగా పనిచేయడం ప్రారంభించారు మండేలా.   జులై 2001 లో మండేలాకు ప్రోస్టేట్ కాన్సర్ వున్నట్లు నిర్ధారణ ఐంది. చికిత్స కూడా జరిగింది. 2003 లో పొరపాటున ఆయన మరణ వార్తను సిఎన్ఎన్ ప్రసారం చేసింది. తప్పు సరి దిద్దుకుంది. 2007 లోనూ అలాంటి పొరపాటే మరో విధంగా జరిగింది. వాస్తవానికి మండేలా ఆ సమయంలో మొజాంబిక్ లో కులాసాగా గడుపుతున్నారు.

జూన్ 2004 లో, తన  85 వ ఏట, ప్రజా జీవనం నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు ప్రకటించారు మండేలా. ప్రజలకు తన అవసరం వుందని తాను అనుకున్నప్పుడు తానే ప్రజలకు పిలుపిస్తానని, వారి వద్దకు వస్తానని, తనను వారు పిలువ వద్దని విజ్ఞప్తి చేశారు. అన్నమాట ప్రకారం అలానే వుండి పోయారు. ఆగస్ట్ 22, 2007 న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మర్యాదపూర్వకంగా మండేలాను కలిసింది ఆమె దక్షిణాఫ్రికా పర్యటనలో. ఇరువురు బహుమతులను ఇచ్చి పుచ్చుకున్నారు. ఆ సందర్భంగా, 1967 లో, భారత దేశంలో, ఇందిరా గాంధీ సమక్షంలో, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం న్యూ ఢిల్లీలో ప్రారంభోత్సవం చేసిన నాటి చారిత్రాత్మక ఫొటోని మండేలాకు బహుకరించారు సోనియా గాంధీ. వాస్తవానికి, ఇందిరా గాంధీ, తన విద్యార్థి దశ నాటి నుంచీ, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, వారి పోరాటానికి మద్దతుగా ఎల్లప్పుడూ వుంటుండేవారు. అలనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రాయభార హోదా కలిగించింది కూడా. జనవరి 25, 1995 న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఉపన్యాసం ఇవ్వడానికి న్యూ ఢిల్లీకి వచ్చారు మండేలా.

మండేలా లాంటి అరుదైన మహా నాయకులు పది కాలాల పాటు ఆరోగ్యంగా వుండాలని కోరుకుందాం.