Showing posts with label కుముద్ బెన్ జోషి. Show all posts
Showing posts with label కుముద్ బెన్ జోషి. Show all posts

Wednesday, November 28, 2012

గవర్నర్‍ వ్యవస్థను విమర్శించడం ఎంతవరకు సబబు?: వనం జ్వాలా నరసింహారావు


గవర్నర్‍ వ్యవస్థను విమర్శించడం 
ఎంతవరకు సబబు?
    వనం జ్వాలా నరసింహారావు
రాజ్యాంగ వ్యవస్థలపై రాజకీయాలు వద్దు ! 
నమస్తే తెలంగాణ (4-12-2012)                     

రాష్ట్ర గవర్నర్‌ను కలవడానికి తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు మూడు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయన సమయం ఇవ్వడం లేదని, ధర్మాన కేసు లో తమ పార్టీ నాయకుల విజ్ఞప్తిని వివరించడానికి అవకాశం కల్పించడం లేదని, గవర్నర్ రాజ్యాంగ రక్షకునిగా వ్యవహరించాలి కాని, సోనియా ఏజెంటుగా వ్యవహరిస్తే తాము గవర్నర్ల వ్యవస్థపైనే పోరాడాల్సి ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగానే పరిగణించాలి. గవర్నర్ రవీంద్ర భారతికి వెళ్లినా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నా తమకు అభ్యంతరం లేదని, ఢిల్లీ యాత్రలు చేసినా పరవాలేదని, రాజ్యాంగబద్ధంగా గవర్నర్ చేయాల్సిన పని చేయాలని, చేయకపోతే తమ పార్టీ నిలదీయడం ఖాయమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, గతంలో రహస్య గూఢచారి ఉద్యోగం చేసిన నరసింహన్ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో కూడా అదే పని చేస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. గవర్నర్ ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని, రాష్ట్రపతులను కలవడంలో తప్పు లేదు కాని, సోనియాను ఎలా కలుస్తారని ప్రశ్నించారు. రాజ్‌భవన్‌ను గాంధీ భవన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఒక సారి, నలుగురు రాష్ట్ర మంత్రుల, ఇద్దరు పార్లమెంట్ సభ్యుల సమక్షంలో, కొందరు గ్రామ సర్పంచులను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ నరసింహన్, తనను తాను "చెడ్డ గవర్నర్" గా అభివర్ణించుకున్నారు. అంతటితో ఆగకుండా, ఇక ముందు ఎక్కువ కాలం తను రాజ్‌భవన్ లో గడపనని, ప్రజల మధ్య గడుపుతానని, వారి కష్ట సుఖాలను విచారిస్తానని హామీ కూడా ఇచ్చారు. గవర్నర్ తరచూ ఢిల్లీకి వెళ్లి నివేదికలు ఇస్తున్నారన్న విమర్శలూ వున్నాయి. పాలనలో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శా వుంది. ధర్మాన కేసును ఆయన ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే! కొన్ని కొన్ని విషయాలలో ఆయన నిర్ణయం ఎలా వుంటుందో నని ఎదురు చూడని పార్టీ రాష్ట్రంలో లేదు. ఆయన నిర్ణయాలు ఒక్కోసారి ఒక్కో పార్టీకి సంతోషకరం గా వుంటున్నాయి. మరి కొందరికి ఇబ్బందులు కలగ చేస్తున్నాయి. 



కొందరు గవర్నర్లు ఇలా వ్యవహరించడం ఈ దేశంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో కొత్తే మీ కాదు. 1977-78 మధ్య కాలంలో రాష్ట్ర గవర్నర్ గా పదిహేను నెలలు పనిచేసిన శారదా ముఖర్జీ, 1985-90 మధ్య కాలంలో నాలుగు సంవత్సరాలకు పైగా పనిచేసిన కుముద్ బెన్ జోషి, భిన్న రీతుల్లో వ్యవహరించినప్పటికీ, ప్రస్తుత గవర్నర్ తో పోల్చదగిన వారని అనాలి. దివి సీమను అతలాకుతలం చేసిన భీకరమైన తుఫాను నేపధ్యంలో, స్వచ్చంద సంస్థల పనితీరుకు మార్గదర్శకంగా-ధీటుగా పనిచేసే తరహాలో "చేతన" సంస్థను స్థాపించి, సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టి, రాష్ట్ర ప్రజల-పాలకుల అభినందనలు అందుకున్నారు శారదా ముఖర్జీ. చేతన సంస్థకు, గవర్నర్ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రి ఉపాధ్యక్షులుగా వ్యవహరించే పద్ధతిలో సంస్థ నియమ నిబంధనలను అప్పటి గవర్నర్ కార్యదర్శి మోహన్ కందా తోడ్పాటుతో రూపొందించారా మె. దరిమిలా మోహన్ కందా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. శారదా ముఖర్జీ గుజరాత్ గవర్నర్‍గా వెళ్లిపోయిన తర్వాత చేతన కార్యకలాపాలు అనతి కాలంలోనే ఆగిపోయాయి. ఏడేళ్ల తర్వాత గవర్నర్ గా వచ్చిన కుముద్ బెన్ జోషి, చేతన సంస్థను పునరుద్ధరించడంతో పాటు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (నీసా) అనే మరో స్వచ్చంద సంస్థను స్థాపించి, పలు ప్రజోపయోగమైన కార్యక్రమాలను చేపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో అనేక సందర్భాల్లో విభేదించిందన్నపేరు తెచ్చుకున్న కుముద్ బెన్ జోషి, ఆ రెండు సంస్థల కార్య కలాపాల విషయంలో ఆయన సలహా సంప్రదింపులను "కూడా" తీసుకునేవారు. జోగినిల దురాచారం రూపుమాపే దిశగా రాజ్ భవన్ దర్బార్ హాలులో ఆ అభాగినులకు వివాహం జరిపించడం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు, కుముద్ బెన్ జోషి ఆధ్వర్యంలోని స్వచ్చంద సంస్థలు చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు.

2009 సెప్టెంబర్ నెలలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు రోశయ్య ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత, ఆ తరువాత ఆయన వారసుడిగా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తదుపరి, సహేతుకమైనా-కాకపోయినా, స్వపక్షాల-విపక్షాల విమర్శలకు దారితీసే పద్ధతిలో ప్రభుత్వ పాలన సాగుతోంది. దానికి బాధ్యుడు అలనాటి ముఖ్యమంత్రి రోశయ్యా? నేటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డా? అయిష్టంగా ఆయన మంత్రివర్గంలో కొనసాగుతున్న కొందరు మంత్రులా?ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరని రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్సార్సీపి నాయకుడు జగనా? ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చి ముఖ్యమంత్రిని ఇరుకున పెడుతున్న కొందరు కాంగ్రెస్ నాయకులా? తెలంగాణా వాదులా? సహకరించని ప్రకృతా? ఆర్థిక ఇబ్బందులా? కిరణ్ కుమార్ రెడ్డికి సంపూర్ణ అధికారాలు ఇవ్వని కాంగ్రెస్ అధిష్టానమా?. కారణాలు ఏమైనా వీటికి సంబంధం లేని ప్రజలై తే ఇబ్బందులకు లోనవుతున్న మాట వాస్తవం.

పలు సందర్భాలలో-వేరు, వేరు సందర్భాలలో, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంబంధిత గవర్నర్ వ్యవహారం నచ్చనప్పుడు, గవర్నర్ పాత్రను విమర్శించడంతో సరిపుచ్చుకోకుండా, గవర్నర్ వ్యవస్థనే రద్దుచేయమని కోరడం అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా, అధికారంలో లేనప్పుడు ప్రతి పార్టీ చేసిన పని అదే. గవర్నర్లు తప్పుచేయలేదని కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన గవర్నర్లు లేరనీ కాదు. అంత మాత్రాన ఆ వ్యవస్థనే రద్దు చేయాలని కోరడం సమంజసం కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి-ప్రకరణాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్న గవర్నర్లను పదవినుంచి తొలగించమని అడిగే హక్కుందికాని, వ్యవస్థనే ప్రశ్నించే విధంగా రాజకీయ నాయకులు ప్రకటనలు ఇవ్వడం తగదు. రాజ్యాంగపరంగా ఏర్పడ్డ రాష్ట్రపతి, గవర్నర్ పదవులు ఎల్లవేళలా "అలంకారప్రాయమైనవేనని" భావించడం తప్పు. ఎన్టీ రామారావును 1984 లో నాటి గవర్నర్ రామ్ లాల్ తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యంపై దెబ్బతీశారని అభియోగం మోపుతూ, న్యాయం కావాలని కోరుతూ తెలుగుదేశం నాయకత్వం రాష్ట్రపతి వద్దకు పోయింది గాని, ప్రధాన మంత్రి వద్దకు కాదే ! గవర్నర్ ను, గవర్నర్ వ్యవస్థను విమర్శించడానికి, సొంత కోణం నుంచి చూడకుండా, రాజ్యాంగ కోణం నుంచి చూడడం మంచిది. ప్రధాన మంత్రి వద్దకు కాకుండా, న్యాయం కొరకు రాష్ట్రపతి వద్దకు పోవడానికి కారణం, ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించే వాడు కాబట్టే.

కష్ట కాలంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధి (ప్రధాన మంత్రి స్థాయి వారైనా సరే) కంటే, రాజ్యాంగానికి బద్ధుడైన అధినేత (రాష్ట్ర పతి, గవర్నర్) అవసరమని, న్యాయం కోసం, ముఖ్యమంత్రి స్థాయి వాడే, ఎన్నికైన ప్రజా ప్రతినిధి-ప్రధాన మంత్రి వద్దకు పోలే దో, అలానే, రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అవసరమైనప్పుడు-న్యాయం జరగలేదని భావించినప్పుడు, గవర్నర్ వైపు దృష్టి సారించడం తప్పు కాదు. వారు గవర్నర్ దగ్గరకు పోయినా, లేక, గవర్నరే వారి దగ్గరకు వచ్చినా, ఉద్దేశం ఒకటే. కష్ట కాలంలో, గవర్నర్ నుంచి సహాయం కోరుకునే వారు, కేవలం ఎన్నికైన ప్రజా ప్రతినిధులే కావాలని లేదు. సామాన్య ప్రజానీకం కూడా కావచ్చు. బహుశా రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలను, రాజ్యాంగ అధినేతగా, తరచూ కేంద్రానికి-ప్రధానికి-రాష్ట్రపతికి తెలియచేయడం మంచిదని గవర్నర్ నరసింహన్ భావిస్తుండవచ్చు. ఆయన చర్యలను ఆక్షేపించడం గాని, వాటికి దురుద్దేశం ఆపాదించడం కాని, అపార్థాలు వెతకడం గాని చేయడం భావ్యం కాదు. భారత దేశంలో రాజకీయ పార్టీలు కోకొల్లలు. ఒక్కో పార్టీకి, ఒక్కో అవసరానికి, ఒక్కో రకమైన సిద్ధాంతం వుంటుంది. ప్రాంతీయ పరమైన, భాషా పరమైన, కుల-మత పరమైన పార్టీలెన్నో వున్నాయి. ఆ పార్టీల పక్షాన ఎన్నికై అధికారంలోకి వచ్చినవారు-ప్రతిపక్షంలో కూర్చున్న వారు, వారి-వారి పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా వ్యవహరించే ఆస్కారం లేదు. మత విద్వేషాన్ని, భాషా దురభిమానాన్ని, ఒక ప్రాంతం వారు మరో ప్రాంతం వారిని దోపిడీకి గురి చేయడాన్ని రెచ్చగొట్టినప్పుడు, కలిగే దుష్ఫలితాలను అదుపులో పెట్టడంలో ప్రజా ప్రతినిధులు (ముఖ్యమంత్రి-మంత్రి వర్గ స్థాయి వారితో సహా) విఫలమైతే, రాజ్యాంగానికి కట్టుబడ్డ గవర్నర్ పరిస్థితిని చక్కదిద్దడానికి, నెలకో-వారానికో ఢిల్లీకి వెళ్లి వస్తే తప్పేంటి?

గవర్నర్ పేరుపైన ప్రభుత్వ నిర్ణయాలు, ప్రకటనలు, ఉత్తర్వులు జారీ కావడం తెలిసిన విషయమే. రాజకీయ నాయకులు ఎన్ని చెప్పినప్పటికీ, గవర్నర్ పాత్రకు ప్రాధాన్యత వుందని, ఏ ఐఏఎస్ అధికారిని అడిగినా ఒప్పుకోవడానికి క్షణం కూడా ఆలోచించరు. గవర్నర్ కేవలం రాజ్యాంగంలో పొందుపరచిన వ్యక్తి మాత్రమే కాదు. "రబ్బర్ స్టాంపు" అసలే కాదు. పలు సాంఘిక-సంక్షేమ కార్యక్రమాలకు రాజ్యాంగ రీత్యా పర్యవేక్షకుడు. ఆయన ఆధ్వర్యంలో రెడ్ క్రాస్, హరిజన-గిరిజన సంక్షేమం, కుష్టువారి పునరావాసం, విలువ కట్టలేని తర-తరాల వారసత్వ సంపద పరిరక్షణ, విశ్వ విద్యాలయాల వ్యవహారాలు, రక-రకాల రాజ్యాంగం నిర్దేశించిన సహాయ కార్యక్రమాలు అమలు చేయాల్సి వుంటుంది. బడుగు వర్గాల అభ్యున్నతి ఆయన కనీస ధర్మం. రాష్ట్ర ప్రజల్లో ఐకమత్యానికి, సమగ్రతా భావాలకు, స్థిరత్వానికి కూడా గవర్నర్ బాధ్యుడు.

రాజ్యాంగం నిర్దేశించిన విధంగా, గవర్నర్ ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సహచరులకు కష్ట-సుఖాలలో తోచిన సలహాలు ఇవ్వడం తప్పే మీ కాదు. ఆ మధ్యన ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యదర్శి స్థాయి అధికారులను రప్పించుకుని, శాఖాపరంగా తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు గవర్నర్. దాన్నీ విమర్శించిన వారున్నారు. తన ప్రభుత్వ కార్య కలాపాలను తెలుసుకుంటున్నాడే తప్ప అందులో దురుద్దేశం ఏమీ లేదు కదా ! గవర్నర్ మంత్రివర్గం సభ్యులకు ఇచ్చిన సలహాలను వారెంతవరకు పాటించుతారనేది, గవర్నర్ ఇచ్చే విషయం పైన-మంత్రులు ఆ సలహాను ఏ కోణం నుంచి చూస్తారన్న అంశంపైన ఆధార పడి వుంటుంది. త్రివేది గవర్నర్ గా వున్నప్పుడు, దైనందిన పాలనా వ్యవహారాల్లో ఆయన మంత్రులకు సలహాలను ఇచ్చేవారని-వాటిని వారు మరో ఆలోచన లేకుండా తిరస్కరించే వారని చెప్పుకునేవారు. బహుశా ఆ నేపధ్యంలో, సలహాలను ఇచ్చే శైలిలో మార్పొచ్చిందేమో ! పట్టం థాను పిళ్లై గవర్నర్ గా వున్నప్పుడు, హరిజన వసతి గృహాల విషయంలో జోక్యం చేసుకుని, వాటి స్థితిగతుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆ సలహాను వారు పాటించారు. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ఒకసారి తన ఏలూరు పర్యటనలో భాగంగా, నిర్మల్ పురస్కారాలను అందుకున్న గ్రామాలకు కేంద్ర ప్రోత్సాహానికి అదనంగా మరో లక్ష రూపాయలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఆయన కోరికను వెంటనే అంగీకరించిన వ్యవసాయ మంత్రి రఘువీరా రెడ్డి దానికి సంబంధించిన ప్రకటన తక్షణమే చేశారు. ఏ విధానమైనా, ఆచరణలో పెట్టేవారి నిజాయితీని బట్టి సానుకూలమవుతుంది. వ్యక్తిగతమైన అభిమానాలకు-దురభిమానాలకు పాల్పడితే దేశ శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు దెబ్బతింటుంది.

ఏదేమైనా, తొందరపడి గవర్నర్‌ను విమర్శించడం, వ్యవస్థనే కించపరచడం భావ్యం కాదు. రాజ్యాంగ బాధ్యతలు తెలియకుండా గవర్నర్ వ్యవహరిస్తాడని విమర్శించడం పొరపాటు.

Sunday, February 6, 2011

మల్లు అనంతరాములు-స్వయం కృషితో జాతీయ స్థాయికెదిగిన దళిత నాయకుడు:వనం జ్వాలా నరసింహారావు

ఫిబ్రవరి 7, 2011 న మల్లు అనంతరాములు 21 వ వర్ధంతి సందర్భంగా....
మల్లు అనంతరాములు-స్వయం కృషితో జాతీయ స్థాయికెదిగిన దళిత నాయకుడు
వనం జ్వాలా నరసింహారావు

ఫిబ్రవరి 7, 1990 ఉదయం రాజ్ భవన్ ప్రాంగణంలో నివసిస్తున్న మా ఇంటికి "బ్రేక్ ఫాస్ట్ అతిథి" గా వచ్చిన డాక్టర్ మల్లు అనంతరాములు ఎంతో ఉల్లాసంగా-ఉత్సాహంగా కనిపించారు. రాజీనామా చేసిన కుముద్ బెన్ జోషి స్థానంలో నియమితులైన కృష్ణకాంత్, ఆంధ్ర ప్రదేశ్ నూతన గవర్నర్ గా, అదే రోజున, మరి కొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాజ భవన్ కు మల్లు వస్తున్నందున, నేను ఆయనను మా ఇంటికి ఆహ్వానించాను. డాక్టర్ చెన్నారెడ్డిని రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఎన్నుకోవడంతో, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా రాజీనామా చేసిన ఆయన స్థానంలో, అధిష్ఠానం మల్లును పీసీసీ అధ్యక్షుడుగా నియమించింది. ఆ హోదాలో ఆయన గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. పీసీసీ అధ్యక్షుడుగా నియామకం కావడానికి రెండు నెలల పూర్వం, 1989 చివర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, రెండో పర్యాయం, మహబూబ్ నగర్ జిల్లా-నాగర్ కర్నూల్ రిజర్వు డు నియోజక వర్గం నుంచి లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు మల్లు. ఉదయం బ్రేక్ ఫాస్టులోను, ఆ తర్వాత గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవంలోను, ఎప్పటిలాగా చురుగ్గా-సరదాగా అందరితో కబుర్లు చెప్పుకుంటూ గడిపిన మల్లు అనంతరాములు, ఆ మధ్యాహ్నమే హఠాత్తుగా మరణించారన్న వార్తను ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారితో సహా ఎవరూ నమ్మలేక పోయారు. మల్లు మరణ వార్త తెలిసిన వెంటనే ముఖ్య మంత్రి చెన్నారెడ్డి స్వయంగా ఆయన మాటల్లో చెప్పిన సంతాప సందేశాన్ని సీఎం పీఆర్వోగా పత్రికల వారికి, ఆయన కుటుంబ సభ్యులకు పంపాను. రాష్ట్ర శాసన సభకు, దేశ వ్యాప్తంగా లోక్ సభకు, జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాల్లో మల్లు వహించిన పాత్రను అప్పటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ గాంధి, ఘనంగా పొగుడుతూ మల్లుకు నివాళులు అర్పించారు.

పెద్దవాళ్ల మధ్య పెద్దవాడి గాను, చిన్న వాళ్ల మధ్య పెద్ద తరహా గాను మలగుతూ, అందరినీ తన వారిగా భావించే మనస్తత్వమున్న అనంతరాములు మల్లు, స్వయం కృషితో అంచలంచెలుగా ఎదిగిన అరుదైన దళిత నాయకుడు. పదవిలో వున్నా-లేకపోయినా, సన్నిహితులకు-అంతగా పరిచయం లేని ఇతరులకు, తన చేతనైన సహాయం చేయడానికి ఎప్పుడూ వెనుకాడేవాడు కాదు మల్లు. ఒకే జిల్లాకు చెందిన మా ఇద్దరికి, రెండు దశాబ్దాల పరిచయం. మొట్టమొదటి సారి, మా జిల్లా నుంచి కాకుండా, మహబూబ్ నగర్ జిల్లానుంచి 1980 లో లోక్ సభ కు ఎన్నికైన తర్వాత, రాజకీయంగా కూడా మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఢిల్లీ నుంచి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా, నాకు-మితృడు భండారు శ్రీనివాస రావుకు ముందస్తుగా సమాచారం ఇవ్వడం, వచ్చిన తర్వాత, ఇక్కడున్నన్ని రోజులు కలిసి మెలిసి వుండడం తప్పని సరిగా జరిగేది. ఒక సాధారణ "వీ ఎల్ డబ్ల్యూ" గా పని చేసి, కాంగ్రెస్ సంస్థలో ఉన్నత పదవులను అలంకరించిన అతి కొద్దిమంది దళితుల్లో మల్లు ఒకరు. అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిలో పడడం ఆయన కార్య దక్షతకు, పట్టుదలకు నిదర్శనం. వీ ఎల్ డబ్ల్యూ యూనియన్ క్రియాశీలక వ్యక్తిగా మల్లులో నిబిడీకృతమైన నాయకత్వ లక్షణాలు, ఖమ్మం జిల్లా నాయకులతో సహా రాష్ట్ర స్థాయి నాయకులకు ఆయనను చేరువ చేసింది. ఆయన ఉపన్యాసాలు శ్రోతలను ఉర్రూతలూగించేవి. ఎమర్జెన్సీ నేపధ్యంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర స్థాయిలో అధికారం, రాష్ట్ర స్థాయిలో పట్టు కోల్పోయిన ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి మల్లు లాంటి వారి అవసరం కలిగింది.

1978 లో జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో, ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఎన్నో ఎన్నికల సభల్లో ఆయన ఉపన్యాసాలు, కాంగ్రెస్ కార్యకర్తలను ప్రోత్సహించడంతో పాటు, రాష్ట్ర నాయకత్వాన్ని మెప్పించాయి. అప్పటి ముఖ్య మంత్రి చెన్నారెడ్డి మల్లు నాయకత్వ లక్షణాలను గుర్తించి, ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో, నాగర్ కర్నూల్ నియోజక వర్గం లోక్ సభ టికెట్ ఇప్పించారు. ఆయన ఘన విజయం సాధించడంతో, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడం ఆరంభమయింది. పార్లమెంటు సభ్యుడుగా ఢిల్లీలో అడుగు పెడుతూనే, కేంద్ర నాయకులతో సాన్నిహిత్యం పెంచుకుంటూ, దాన్ని తన స్వప్రయోజనాలకు వాడుకోకుండా, నియోజక వర్గం అభివృద్ధికి ఉపయోగించుకుంటూ, ప్రజలకు చేరువయ్యారు. నాటి ఆర్థిక సహాయ మంత్రి జనార్థన్ పూజారి తోడ్పాటుతో, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పలు ప్రదేశాల్లో రుణ మేళాలు ఏర్పాటు చేసి, షెడ్యూల్డు కులాల వారికి-తెగల వారికి-వెనుక బడిన వర్గాల వారికి ఎన్నో రకాల ఆర్థిక సహాయం అందేలా చూశారు మల్లు. నాగర్ కర్నూలు తో సహా, స్వస్థలమైన ఖమ్మం జిల్లా వాసులకు కూడా సహాయ పడే వారాయన. కార్య శీలతకు, కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలూ అంకితమై పనిచేస్తున్న వారికి పార్టీలో గుర్తింపు దొరకడం కష్టం కాదని మల్లు నిరూపించారు. ఖమ్మం జిల్లా స్వంత గ్రామం లక్ష్మీపురంలో, ఆత్మీయుల మధ్య పార్టీ వ్యవహారాలు చర్చిస్తున్న సందర్భంలో, నాటి ప్రధాని-అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజీవ్ గాంధి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పాతికేళ్ల క్రితం, దేశ రాజధాని నుంచి కుగ్రామానికి ప్రధాన మంత్రి దగ్గర నుంచి నేరుగా పిలుపు రావడం సాధారణ విషయం కాదు. మల్లు ప్రతిభే దానికి కారణం. పదమూడు రాష్ట్రాల పార్టీ బాధ్యతలను అప్పగించు తూ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మల్లును నియమిస్తున్నట్లు రాజీవ్ గాంధి నుంచి సమాచారం అలా చేరింది ఆయనకు.

న్యూ ఢిల్లీలోని మల్లు కార్యాలయం ఎప్పుడూ అత్యంత కోలాహలంగా వుండేది. గత పది-పదిహేనేళ్లలో జాతీయ స్థాయికెదిగిన పలువురు కాంగ్రెస్ నాయకులను మల్లు అనంతరాములు దగ్గర కలిసే అవకాశం కలిగింది. తన దగ్గర కొచ్చిన ప్రతి వారినీ, బయట వరకు వచ్చి పంపడం ఆయన అలవాటు. ఎప్పుడన్నా పని ఒత్తిడుల వల్ల అలా వీలు కాకపోతే తప్ప, సాధారణంగా ఆయన ఆ మర్యాద పాటించేవారు. ఇతరులకు పరిచయం చేసేటప్పుడు, తన స్నేహితుల గురించి చాలా గొప్పగా చెప్పడం మల్లు లోని సద్గుణం. అడిగిన పని తనకు సాధ్యం కాదని అనే అలవాటు ఆయనలో లేదు. ప్రయత్న లోపం వుండదని దానర్థం. మల్లు పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా, రాజీవ్ గాంధి ఆయనను నేషనల్ ఫార్మ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడుగా నియమించారు. ఆ పదవిలోనూ మల్లు రాణించారు. రాజీవ్ గాంధీకి మరింత చేరువ కావడానికి ఆ పదవి తోడ్పడింది. పార్టీ ప్రయోజనాలకై చాలా మందికి తెలియని ఎన్నో గురుతర బాధ్యతలను రాజీవ్ గాంధి ఆయనకు అప్ప చెప్పారు. ఎంఏ వరకు చదువుకున్న మల్లు పార్లమెంటు సభ్యుడైన తర్వాత రీసెర్చ్ చేసి, పీ హెచ్ డి తెచ్చుకుని, డాక్టర్ అనంతరాములు మల్లు ఐపోయారు.

ఎన్ టీ రామారావు సారధ్యంలో రాష్ట్రంలో అధికారంలో కొచ్చిన తెలుగు దేశం పార్టీని ఓడించడానికి చెన్నారెడ్డి నాయకత్వంలో 1989 లో ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ, మరో పర్యాయం, మల్లు అనంతరాములుకు నాగర్ కర్నూలు లోక్ సభ టికెట్ ఇచ్చింది. వాస్తవానికి ఆయనకు శాసన సభకు పోటీ చేయాలని మనసులో కోరికగా వుండేది. వీలుంటే ఖమ్మం జిల్లాలో ఏదైనా నియోజక వర్గం నుంచి టికెట్ వస్తే బాగుండేదనుకునేవారాయన. కాకపోతే, ఖమ్మంలోని రిజర్వుడు నియోజక వర్గాల నుంచి గతంలో పోటీ చేసిన వారు కాని, సిట్టింగ్ అభ్యర్థులు కాని పోటీ చేస్తుండడంతో మల్లుకు అవకాశం దొరకడం కష్టమైంది. రాజీవ్ గాంధీ ఆదేశం కూడా లోక్ సభకు పోటీ చేయమనే. తనకు పార్టీ విజయం ముఖ్యమని, రాష్ట్రంలోను-దేశంలోను, ప్రత్యేకించి తనకప్పగించిన పదమూడు రాష్ట్రాలలోను, అభ్యర్థుల విజయానికి తన పూర్తికాలం వినియోగిస్తానని చెప్పినప్పటికీ, రాజీవ్ గాంధీ మల్లును నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయాల్సిందిగా ఆదేశించారు. తన నియోజక వర్గంతో పాటు, ఇతర నియోజక వర్గాలలోను మల్లు ప్రచారం చేశారు. లోక్ సభకు మరో మారు గెలిచారు. కాకపోతే, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. రాష్ట్రంలో అధికారంలోకొచ్చింది. 1989 ఎన్నికల్లో, మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారం కొరకు రాజీవ్ గాంధీ కూడా వచ్చారు.

మర్రి చెన్నారెడ్డి స్థానంలో పీసీసీ అధ్యక్షుడుగా నియామకం జరిగిన నాటి రాత్రి పది గంటల సమయంలో మర్నాడు హైదరాబాద్ వస్తున్న సంగతి ఫోన్ చేసి మరీ చెప్పారు మల్లు అనంత రాములు స్వయంగా. పీసీసీ అధ్యక్షుడుగా ఆయన నియామకం చేయడానికి బలవత్తరమైన కారణం వుండొచ్చు. బ్రతికున్నట్లయితే, మర్రి చెన్నారెడ్డి తర్వాత, బహుశా మల్లుకు ముఖ్య మంత్రి అయ్యే అవకాశం వచ్చి వుండేదేమో! నేను ముఖ్య మంత్రి చెన్నారెడ్డి పీఆర్ వో గా పని చేస్తున్నప్పటికీ, మల్లు పీసీసీ అధ్యక్షుడుగా హైదరాబాద్ మొదటిసారి వచ్చినప్పుడు బేగంపేట విమానాశ్రయానికి పోవడమే కాకుండా, ఆయన వెంట వూరేగింపులో కొంత సేపు ప్రయాణం కూడా చేశాను. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా మల్లు పలువురి మన్ననలను, ప్రశంసలను అందుకోవడమే కాకుండా, ఎన్నో నూతన ఒరవడులకు నాంది పలికారు. ముఖ్య మంత్రికి, ఇతర మంత్రులకు, గాంధీ భవన్ కు మధ్య వారధిగా పని చేశారు. ముఖ్య మంత్రిని కలవడానికి వచ్చినప్పుడు ఇతర సందర్శకులలాగానే వ్యవహరించేవారు తప్ప, తన కంటూ ఒక ప్రత్యేకత కావాలని కోరేవారు కాదు.

అది యాధృఛ్చికమో, దైవ సంకల్పమో కాని, మల్లు అనంతరాములు హఠాత్తుగా మరణించడానికి కొన్ని గంటల ముందు, ఆయన తమ్ముడి మామగారు, అప్పట్లో రాష్ట్ర కాబినెట్ మంత్రి కోనేరు రంగారావు పదవికి రాజీనామా చేశారు. అనంతరాములు సోదరుడు మల్లు రవి ఆయన స్థానంలో నాగర్ కర్నూలు లోక్ సభ సభ్యుడుగా రెండు సార్లు ఎన్నికకాగా, మరో సోదరుడు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా, మధిర శాసన సభ సభ్యుడుగా ఎన్నికై ప్రస్తుతం ప్రభుత్వ ఛీఫ్ విప్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

గవర్నర్ ప్రమాణ స్వీకారం, కాబినెట్ మంత్రి రాజీనామా, పీసీసీ అధ్యక్షుడి హఠాన్మరణం అన్నీ ఒక్క నాడే, ఫిబ్రవరి 7, 2011 న సంభవించాయి. మల్లు మరణించి సరిగ్గా 21 సంవత్సరాలైంది. సాధారణ ఉద్యోగిగా జీవితం ప్రారంభించి, పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికై, నేషనల్ ఫార్మ్స్ డెవలప్ మెంట్ చైర్మన్ పదవిని పొంది, అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా-పదమూడు రాష్ట్రాల ఇన్-చార్జ్ గా బాధ్యతలు నిర్వహించిన మల్లును, ఒక దళిత నాయకుడిని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మరిచిపోయినట్లే కనిపిస్తోంది. భావి తరాల వారు-ఆ మాటకొస్తే నేటి తరం వారుకూడా, ఆయన్ను గుర్తుంచుకునే ట్లు, ఆయన జ్ఞాపకార్థం ఏదైనా కార్యక్రమం చేపట్టి తే బాగుంటుందేమో!

Wednesday, September 29, 2010

కమ్యూనిస్టు గాంధి-దెందులూరు పెద్దింటివారి కె.బి.తిలక్ : వనం జ్వాలా నరసింహా రావు

(ఆంధ్ర ప్రభ దినపత్రిక 29-09-2010)
(సూర్య దినపత్రిక 29-09-2010)
వనం జ్వాలా నరసింహా రావు
పాతికేళ్లుగా పరిచయమున్న తిలక్ మరణ వార్త (23-09-2010) తెలిసినప్పటినుంచి, ఆయన జ్ఞాపకాలు పదే-పదే గుర్తుకొస్తున్నాయి. "తిలక్ జ్ఞాపకాలు" శీర్షికతో "ప్రజాతంత్ర" వారపత్రికలో పది సంవత్సరాల క్రితం అయనను గురించి రాసే రోజుల నాటి సంగతులు మరీ గుర్తుకొచ్చాయి. పత్రిక తాజా సంచిక మార్కెట్లోకి వచ్చిన ప్రతిసారీ, ఆ శీర్షికపై కొంత చర్చ జరిగే ది. సినిమాలకు సంబంధించిన "తిలక్ జ్ఞాపకాల"పై కొందరు స్నేహితులు ఏకీభవించడం, మరికొందరు విభేదించడం జరిగే ది. చర్చలో పాల్గొన్న వారిలో దేవులపల్లి అమర్, డి. వెంకట్రామయ్య, చలసాని ప్రసాదరావు, భండారు శ్రీనివాసరావు, ఆర్.వి.వి. కృష్ణారావు...తదితరులుండే వారు. చలసాని తాను చెప్పదల్చుకున్నవి కాగితంపై రాస్తే అందరం చదివేవాళ్లం. ఒకానొక సందర్భంలో ఆయన ఆ జ్ఞాపకాలను "తిలకాష్ట జీవన బంధనం" పేరుతో పుస్తకంలాగా ప్రచురించమని సలహా కూడా ఇచ్చారు. చివరకు, "అనుపమ గీతాల తిలక్" పేరుతో హాసం వారు దాన్ని ప్రచురించారు. కాకపోతే సీరియల్‌గా రాసినవన్నీ అందులో లేవు. కేవలం సినిమాలకు సంబంధించినంతవరకే ఆ పుస్తకం పరిమితమయింది. వాస్తవానికి తిలక్ ని సినిమాలకు మాత్రమే పరిమితం చేయడం సమంజసం కాదు. ఆయనో బహుముఖ ప్రజ్ఞాశాలి.

తిలక్‌ను చూడగానే పదహారణాల కాంగ్రెస్ నాయకుడన్న భావన కలుగుతుంది. ఆయన పార్లమెంటు భవనంలోకి పాస్ లేకుండా వెళ్లగలిగేవారన్న విషయం చాలామందికి తెలియదు. ఆయనలా లోనికి వెళుతుంటే పార్లమెంటు సభ్యుడనుకునేవారు. హైదరాబాద్‌కు వచ్చేంతవరకు ఆయనో సినిమా మనిషి. ఇక అక్కడినుంచి ఒక మానవతావాదిగా, సామాజిక కార్యకర్తగా, ఉద్యమకారునిగా, స్వాతంత్ర సమరయోధుల్లో ఒకడిగా, చిన్నల్లో చిన్నగా, పెద్దల్లో పెద్దగా....ఒక్కొక్కరికి ఒక్కొక్క అవతారంలో కనిపించేవాడు-అనిపించేవాడు. అవతారం ఏదైనా, అనుకున్నది సాధించేంతవరకు అలుపనేది లేకుండా సాగిపోవడం ఆయన నైజం. సినిమా కార్మికుల బాధా మయ గాథలు విని-చలించి, వారికోసం రంగంలోకి దిగిన సందర్భంలోను, "గాంధి" సినిమా విషయంలో భారతీయులకు న్యాయం చేకూర్చడానికి చేసిన న్యాయపోరాటంలోను. రాజభవన్ ప్రాంగణంలో కుముద్ బెన్ జోషి గవర్నర్‌గా వున్నప్పుడు తక్కువ ధర చేసే "డోమ్ హౌజ్" నిర్మాణం చేపట్టడంలోను, ఇండో-పాకిస్తాన్ మైత్రి సంబంధమైన కార్యక్రమాల నిర్వహణలోను, "ట్విన్సీ క్లబ్" స్థాపనలోను, కార్య దక్షతకు తిలక్ పర్యాయపదంగా వుండేవాడు. టీవీ ఛానళ్లు రాక పూర్వమే, ఏ రోజు వార్తలను ఆరోజే వీడియో కేసెట్లో రికార్డ్ చేసి కేబుల్ టీవీ ద్వారా ప్రసారం చేయించాలని ఆయన చేసిన ప్రయత్నం అద్భుతం. పాతరోజుల్లో తన మేధస్సు మధించిన అపురూపమైన చిత్రాలతో ప్రత్యేకించి తెలుగు చిత్ర రంగాన్ని, కొంత మేరకు హిందీ చలన చిత్ర రంగాన్ని ఒక మలుపు తిప్పిన మహనీయుడాయన. ఆయన్ను మొదట్లో తక్కువ అంచనా వేయడం మా లాంటి వారి అజ్ఞానం.

అనుపమ చలన చిత్ర దర్శక నిర్మాతగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, సామాజిక సేవకునిగా తిలక్ చాలామందికి సుపరిచితుడే. కాకపోతే ఆయన్ను గురించి తెలియని విషయాలూ ఎన్నో వున్నాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న తిలక్‍ జైలు జీవితం గడిపినప్పుడు ఎదురైన అనుభవాలు చెప్పినప్పుడు చలించిపోయాడు. దానికి కారణం ఆయన పడ్డ బాధలు కాదు. తోటి ఖైదీల బాధలు తీర్చలేని పరిస్థితిలో తానున్నందున. తిలక్ వున్నది "సింపుల్ ఇంప్రిజన్మెం ట్ సెల్" కాగా, పక్కనే, అచిర కాలంలో ఉరి శిక్షకు గురి కాబోయే వారి నుంచే "కన్డెమ్డ్ ఇంప్రిజన్మెంజట్ సెల్" వుండేదట. అందులో శిక్షను అనుభవించేవారు, తాము ఎదుర్కొన బోయే పరిస్థితిని తలచుకుని, రాత్రిళ్లు భోరున విలపిస్తుంటే, తిలక్ వాపోయేవాడు. ఖైదీలు, విసర్జించిన తమ మూత్రాన్ని కుండల్లో పట్టుకుని, జైలర్ అనుమతిచ్చినప్పుడు బయట పార పోయడం ఘోరంగా వుండేదనేవారు. తాము తినడానికి జైలు భోజనం ఏ మాత్రం అనువైంది కాదని కూడా అనేవారు. విడుదలైన తిలక్ "ఉషా మెహతా" స్వతంత్ర రేడియో ఉద్యమంలో పాల్గొని, స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని వాడ వాడలా ప్రచారం చేసారు.

ముదిగొండ జగ్గన్న శాస్త్రి పరిచయంతో ప్రజానాట్యమండలి వైపు ఆకర్షితుడైన తిలక్, అతివాద భావాల కళాకారులతో చేతులు కలిపాడు. నాటకాలు వేయడం, వేయించడం, డప్పులు వాయించడం, ప్రజానాట్యమండలి విప్లవ గీతాలను ఆలపించడం, వూరూరా తిరగడం చేసేవాడు. "పెద్దింటి వాళ్లం-తప్ప తాగి వచ్చి డప్పు కొట్తున్నాం-తప్పుకోండి" అంటూ కొంటెగా జానపద గీతం ఆలపిస్తుంటే, ప్రజల స్పందన విపరీతంగా లభించేదట. మేనమామ ఎల్వీ ప్రసాద్ బొంబాయి లో వుంటున్నందున తిలక్ అక్కడకు చేరుకున్నప్పటికీ, ఆయనలో అంతర్లీనంగా వున్న స్వతంత్ర సమరాభిలాష కొనసాగింది. అక్కడి "పీపుల్స్ థియేటర్" లో చేరి, బాలరాజ్ సహాని, రొమేష్ థాపర్ లాంటి వారితో సాన్నిహిత్యం పెంచుకున్నారు. వామపక్ష భావాల వారి కలయికకు వేదికైన "ఒపేరా హౌజ్" సినిమా టాకీస్ లో జరిగే "ప్రజానాట్యమండలి" సమావేశాలకు హాజరయ్యేవారు. తెలుగు విభాగం ఇన్-చార్జ్ గా కూడా వుండేవారు తిలక్. మిలిటరీ క్లబ్బులకు తంబోలా కూపన్లు అమ్మడం, ఎల్వీ ప్రసాద్ బాతు గుడ్ల వ్యాపారంలో పనిచేయడం ద్వారా నాలుగు డబ్బులు సంపాదించుకునేవారు. బాతు గుడ్ల వ్యాపారం వల్ల బొంబాయి లోని తెలుగు కార్మికులకు, కూలీలకు దగ్గరయ్యారు. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక పత్రిక "పీపుల్స్ వార్" కు పేపర్ బోయ్ గా పనిచేశారు. అలా కమ్యూనిస్టు పార్టీ వారితో సంబంధాలు పెట్టుకున్నారు. బొంబాయిలో వున్న రోజుల్లోనే, దిన ఖర్చుల కొరకు అదనంగా, నర్సాపూర్ లేసులను మార్కెటింగ్ చేశారు. స్వల్ప మొత్తంలో తనకవసరమైన ఆర్థిక వనరులను కష్టపడి సమకూర్చుకునే తిలక్‌కు ఒకరిపై ఆధారపడి జీవించడం ఎంతమాత్రం ఇష్టముండేది కాదు.

మాజీ మంత్రి స్వర్గీయ పరకాల శేషావతారంతో కలిసి యూత్ లీగ్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ, బాలానందం సంఘం స్థాపించారు. యూత్ లీగ్ బృందం సభ్యులతో కలిసి, రైల్వే ప్లాట్ఫాిమ్ల పై దొరికే అశ్లీల సాహిత్యంపై సమర భేరి మోగించారు. అలాంటి పుస్తకాల అమ్మకాలను వ్యతిరేకిస్తూ "అరసం" తరహా ఉద్యమానికి ఆ రోజుల్లోనే నాంది పలికారు. అంతటితో ఆగకుండా, అశ్లీల సాహిత్యం చదవకుండా, తమవంతు కర్తవ్యంగా యూత్ లీగ్ చక్కటి సాహిత్యం సేకరించి చదివించేవారు. పోరాట పటిమను, ఉద్యమ స్ఫూర్తిని నీరు కార్చే ప్రయత్నాలు ఆ రోజుల్లో కూడా జరిగేవనడానికి ఉదాహరణగా, అప్పటి పశ్చిమ గోదావరి కలెక్టర్ శేషాద్రి తనను తోటి సమరయోధుల నుంచి విడదీసే ప్రయత్నం ఎలా చేసింది వివరించారు. ఎక్కడున్నా, ఏం చేసినా, స్వాతంత్ర్య ఉద్యమంతో ప్రత్యక్ష-పరోక్ష సంబంధాలను కొనసాగించే తిలక్, జైలు నుంచి విడుదలై వస్తుండే ఉద్యమకారులను కలుసుకొని, మూడో కంటికి తెలియకుండా, అజ్ఞాతవాసానికి తరలించేందుకు దోహద పడేవాడు. కమ్యూనిస్టు పార్టీ అజ్ఞాత కార్యకలాపాల కోఆర్డినేటర్ ఎస్వీ నరసయ్య కాంటాక్ట్ పాయింట్‌గా వుండేవారు. ఒక పర్యాయం కామ్రేడ్ మద్దుకూరు చంద్రశేఖర రావును, మరో కమ్యూనిస్టు అభిమాని శాస్త్రి కారులో మద్రాస్ నుండి బెంగుళూరు తీసుకెళ్లి, అక్కడినుంచి మారు పేర్లతో విమానంలో హైదరాబాద్ కు చేర్చారు తిలక్. హైదరాబాద్ రాష్ట్రంలో అప్పట్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం వుంది. మద్దుకూరును కామ్రేడ్ గోళ్ల రాధాకృష్ణమూర్తికి అప్పగించారు. అదీ ఆయన ఉద్యమ స్ఫూర్తి.
తెలంగాణ విమోచన ఉద్యమం ఊపందుకుంటున్న రోజుల్లో, కమ్యూనిస్టు పార్టీతో సహా, ఉద్యమ నిర్మాణ-నిర్వహణలో కీలకపాత్ర వహిస్తున్న ప్రజానాట్యమండలిపైనా నిషేధం వుండేది. నిషేధం నీలినీడల్లో తిలక్‌తో సహా పలువురు ప్రజానాట్యమండలికి చెందిన వారు ఒక్కొక్కరు మద్రాసు చేరుకున్నారు. సాంస్కృతిక విభాగానికి చెందిన సుంకర, వాసిరెడ్డి, తుమ్మల, రాంభట్లలు; భవిష్యత్ సినీ దిగ్గజాలైన తాతినేని, వీరమాచనేని, మిక్కిలినేని, చదలవాడ, రాంకోటి, కోగంటి వారిలో ప్రముఖులు. వీరందరికీ తిలక్‍ ద్వారా ఎల్వీ ప్రసాద్ మద్రాస్‌లో కొంత ఆధారం ఏర్పాటుచేయడంతో పాటు, కొంతకాలం ఆంధ్ర ప్రజానాట్యమండలి అధ్యక్షునిగా పనిచేశారు. పీసీ జోషి కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా వున్న రోజుల్లో, సర్కారు జిల్లాల్లోని ఎగువ మధ్య తరగతి కుటుంబాల వారు చాలామంది పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. ఒకే ఇంట్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు అభిమానులుండడంతో ప్రతి ఇంటిపైనా ఇరు పార్టీల జండాలెగిరేవట. వారిలో చాలామంది ప్రజానాట్యమండలితో సంబంధాలు పెట్టుకుని, మద్రాసుకు వచ్చి స్థిరపడ్డారని చెప్పిన తిలక్, వారిలో పలువురు "క్యాపిటలిస్టులు" గా మారిపోయారని విచారం వ్యక్తంచేశారు. ప్రజానాట్యమండలి కళాకారులందరినీ ఒక వేదికపై తేవడానికి శాంతినికేతన్ లో విద్యనభ్యసించిన సి.వి.వి.ఆర్. ప్రసాద్, ఆయనతో పాటు ఎస్వీ నరసయ్య కృషిచేశారని అనేవారు తిలక్. అలా అభ్యుదయ కళాకారులందరూ ఒకే వేదికపై జమ కూడడం వల్లే, భవిష్యత్‌లో సినీరంగ అభివృద్ధికి పరోక్షంగా ఒక కీలక ఘట్టానికి నాంది పలికిందంటారు తిలక్.

వైభవంగా హైదరాబాద్‌లో జరిగిన "రోజులు మారాయి" సినిమా శత దినోత్సవ వేడుకలు, నగరానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరలి రావడానికి, మొట్టమొదటి సినీ స్టూడియో నిర్మాణానికి దారితీసిన చారిత్రాత్మక సంఘటన అనేవారు తిలక్. ఆ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన అప్పటి రాష్ట్ర మంత్రి స్వర్గీయ కొండా వెంకట రంగారెడ్డి, నగరం సాహితీ-సంస్కృత రంగాలలో అభివృద్ధి చెందాలంటే, చలన చిత్ర రంగ ప్రముఖులు కలిసి కట్టుగా కృషిచేయాలని తన ఉపన్యాసంలో చెప్పారట. ఆయన సూచన మేరకు, రోజులు మారాయి యూనిట్ ప్రముఖులందరూ కలిసి కట్టుగా ఆలోచించి సారధీ స్టూడియో నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించడం, అచిర కాలంలోనే అమీర్‌పేటలో అది రూపుదిద్దుకోవడం జరిగింది. స్టూడియో నిర్మాణానికి స్థలం కావాలని (ఇప్పటి లాగా) ప్రభుత్వాన్ని కోరలేదప్పుడు. ప్రయివేట్ వ్యక్తుల దగ్గర కొన్న భూమిలో స్టూడియో నిర్మాణం, దానికి కొంత దూరంలో-ఖైరతాబాద్ సమీపంలో సారధి యూనిట్ కళాకారులందరూ నివసించడానికి ఇళ్ల స్థలాలు కొనుక్కునే ఏర్పాటు జరిగింది. విశ్వ విఖ్యాత నటసార్వభౌములను, నటసామ్రాట్టులను, పద్మశ్రీలను, పద్మభూషణ్‌లను ఆ స్టూడియో అందించినప్పటికీ, సినీ కాల గమనంలో ఎవరికివారే వేరై, ఎవరి "సినీ కుంపటి" వారే పెట్టుకోవడం తననెంతో కలచివేసిందనేవారు తిలక్.

ఆంధ్ర రాష్ట్రం కొరకు మద్రాసులోని మైలావూర్‌లో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షను గుర్తుచేసుకున్న తిలక్ "ఆయన్ను బలిచేశారు" అనేవారు. అప్పట్లో మద్రాస్ టీనగర్లోని సినీ నటుడు చంద్రమోహన్ మామగారు, ప్రముఖ వైద్యులు డాక్టర్ గాలి బాలసుందర రావు ఇంట్లో జరిగే రాజకీయ సమావేశాలకు తిలక్ క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. అక్కడే పద్మశ్రీ డాక్టర్ పి. తిరుమల రావుతో, బులుసు సాంబమూర్తితో పరిచయమైంది. తిలక్ తన కుర్ర కారు గాంగును వెంట పెట్టుకుని, కనిపించిన ప్రతినాయకుడి ఇంటికి వెళ్లి, శ్రీరాములు నిరాహార దీక్షను విరమింపచేయమని ఒత్తిడి తెచ్చేవారు. ఆయనొక్కరే ఎందుకు బలి కావాలని వాదించేవారు. అప్పట్లో తిలక్ నివాసం టంగుటూరు ప్రకాశం పంతులు పెద్ద కొడుకు ఇంటి ఆవరణ వెనుక నున్న ఒక కారు షెడ్డు. ప్రకాశం భోలా మనస్తత్వాన్ని, ఆయనతో తన భేటీని గుర్తుచేసుకుంటూ, ఒకనాడు ఆయన ఇండియన్ రిపబ్లిక్ పత్రిక కార్యాలయంలో కారు దిగుతుండగా ఘెరావ్ చేసిన విషయం చెప్పారు. అప్పటికి పొట్టి శ్రీరాములు ఆత్మ త్యాగానికి మరి కొన్ని గంటల వ్యవధి మాత్రమే వుందట. తిలక్ తనను పట్టుకుని లాగుతుంటే ప్రశ్నించిన ప్రకాశంకు, పొట్టి శ్రీరాములును అందరూ కలిసి బలిదానం చేస్తుంటే తాను పిచ్చివాడినైపోయానని జవాబిచ్చాడు. ప్రకాశం లాంటి గుండే ధైర్యం వున్న మనిషి కూడా ఆ సమయంలో తనను ఏం చేయకపోవడం ఆయన గొప్పతన మంటారు తిలక్.

ఇలా గుర్తు తెచ్చుకుంటూ పోతుంటే తిలక్ జ్ఞాపకాలు, తిలక్ తో పరిచయం అయిన తర్వాత జ్ఞాపకాలు ఎన్నో గుర్తొస్తుంటాయి. ఆయన చనిపోయిన నాలుగో రోజున జన చైతన్య వేదిక సంతాప సభ ఏర్పాటుచేసింది. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ గీతారెడ్డి, సిపిఎం నాయకుడు బివి రాఘవులు, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక మండలి అధ్యక్షుడు రమణమూర్తి ప్రభృతులు వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. సమాజంపై తనదంటూ విభిన్నమైన ముద్ర వేసిన తిలక్ భావి తరాల వారికి స్ఫూర్తి దాతగా నిలుస్తారని అంటూ, గీతారెడ్డి, తనకు "రాజకీయ ఆరంగేట్రం" చేయించిన గురువు గారు తిలక్ అని చెప్పారు. ఆయన ఆనాడు రూపొందించిన "భారత రత్న ఇందిరమ్మ" రూప వాణి కార్యక్రమంలో తనకు ఇందిరా గాంధి పాత్రను ఇవ్వడం వల్లే తనకు అమితమైన ప్రాచుర్యం వచ్చిందని, అది తాను రాజకీయంగా ఎదగడానికి దోహద పడిందని అన్నారు. సినీరంగంలో వున్న ప్రతి వ్యక్తి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. "కామ్రేడ్ తిలక్" అని ఆయనను సంభోదిస్తూ ప్రసంగం చేసిన రాఘవులు, జీవితాంతం ప్రజా ధర్మం కొరకు పోరాడిన తిలక్ తనకు "కమ్యూనిస్టు కోణం" లోనే తెలుసన్నారు. వామ పక్ష ఐక్యత కొరకు అహర్నిశలు కృషిచేసిన తిలక్, ఎప్పుడూ గట్టి ప్రతిపక్షం, అదీ వామపక్ష ప్రతిపక్షం వుండాలని కోరుకునేవారని గుర్తుచేసుకున్నారు.

అన్ని రాజకీయ పార్టీల వారు, తిలక్ తమ వాడే అనడం ఆయన గొప్పదనానికి నిదర్శనం. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో "పెద్దింటివారు" అని పిలువబడే కుటుంబంలో జన్మించిన కొర్లిపర బాలగంగాధర తిలక్ను "కమ్యూనిస్టు గాంధి" అనడం సమంజసమేమో!

Thursday, September 2, 2010

ఆత్మీయతకు మారుపేరు ముఖ్యమంత్రి రోశయ్య : వనం జ్వాలా నరసింహారావు

రెండు దశాబ్దాలుగా నేనెరిగిన-నాకు తెలిసిన కొణిజేటి రోశయ్య
వనం జ్వాలా నరసింహారావు

ముఖ్యమంత్రి రోశయ్యతో నాకున్న సాన్నిహిత్యం, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో లేదు. ఆయనతో నాకు కేవలం పరిచయం మాత్రమే. పది మందికి ప్రాణాపాయంలో అవసరానికొచ్చే 108 అత్యవసర సహాయ సేవలకు సంబంధించిన నా ఉద్యోగ నిర్వహణ విషయంలో, రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ప్రతి సమస్యను ప్రభుత్వ పరంగా పరిష్కరించబడడానికి ఆయనతో వున్న పరిచయానికంటే, రోశయ్యతో వున్న సాన్నిహిత్యమే ఎక్కువగా ఉపయోగ పడిందనాలి. బహుశా ఆ సాన్నిహిత్యంతోనే రోశయ్య ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగైదు రోజుల్లో, కలవడానికి సమయం కేటాయించమని కార్యాలయ సిబ్బందిని కోరకుండానే, ఆయనను కలిసేందుకు మితృడు భండారు శ్రీనివాస రావుతో కలిసి వెళ్లాను. సాధారణంగా లోగడ కలిసే సమయంలోనే, కలవడానికి ధైర్యంగా వెళ్ళిన మాకు, ఇంటిముందరకు పోయిన తర్వాత నిరాశ మిగిలింది. అప్పటికే విధుల్లో చేరిన సెక్యూరిటీ సిబ్బంది, అప్పాయింట్మెంవట్ లేకుండా వెళ్ళడం కుదరదన్నారు. లోపడున్నవారిని ఫోనులో సంప్రదించడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు.

ఈ నేపధ్యంలో లోనికి వెళ్లగలిగినా, ముఖ్యమంత్రిని కలవడం సాధ్యపడే విషయం కాదని అనుకుంటున్న సమయంలో, బాగా పరిచయమున్న ఒక పోలీసు ఉన్నతాధికారి, ముఖ్యమంత్రిని కలిసి బయటకు రావడం జరిగింది. ఆయన మమ్మల్ని పలకరించిన తీరు చూసి, బహుశా ఆయన సైగలను అర్థం చేసుకుని, సెక్యూరిటీ సిబ్బంది మా ఇద్దరిని లోనికి వదిలారు. మాకు తెలిసిన ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బంది ఇంకా రాలేదప్పటికి. ముందు గదిలో మేము కూర్చొన పోతుండగా, ముఖ్యమంత్రిని కలిసిన వ్యక్తి ఒకరు లోపలి నుంచి బయటకొస్తున్నప్పుడు తలుపు తీయడంతో, మమ్మల్ని చూసిన ఆయన, పేర్లు పెట్టి పిలిచి మరీ రమ్మనడంతో ఊపిరి పీల్చుకున్నాం. ముఖ్యమంత్రికి నమస్కారం చేసి, మర్యాదపూర్వకంగా ఆయనను కలవడానికి-అభినందనలు వ్యక్తిగతంగా చెప్పడానికి మాత్రమే వచ్చామని, ఆ రెండూ అయ్యాయి కనుక వెళ్తామని చెప్పాం. సున్నితంగా మా కోరికను తిరస్కరించి, మమ్మల్ని కూచోమని అనడమే కాకుండా, ఎప్పటి రోశయ్య గారి లాగానే, మాట్లాడారు చాలా సేపు. నేను 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణ సంస్థలో ఉద్యోగం మానేసిన విషయం, అమెరికా వెళ్తున్న విషయం చెప్పి, ఇద్దరం బయటకొచ్చాం. బహుశా మరొక రాజకీయ నాయకుడై తే అలా పిలవక పోయేవారేమో! అలా సాదాసీదాగా మాట్లాడకపోయేవారేమో! ఆ తర్వాత నేను అమెరికాలో మా పిల్లలతో వున్నప్పుడు దసరా, సంక్రాంతి పండుగలకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఫోన్ చేసినప్పుడు, ఇంకే ముఖ్యమంత్రి కూడా (బహుశా) కేటాయించనంత సమయం నాతోను-అక్కడుంటున్న మా అమ్మాయితోను మాట్లాడడానికి కేటాయించడం, ఆత్మీయంగా కుశల ప్రశ్నలు అడగడం, ఆయన నిరాడంబరానికి నిదర్శనం. ఒక ముఖ్యమంత్రి, అందునా అప్పట్లో వున్న పరిస్థితుల్లో, ఫోన్లో దొరకడం-సంభాషించడం నా లాంటివారెప్పుడూ మరిచిపోలేని మరుపు రాని సంఘటన.

సీఎం రోశయ్యతో నాకు మొదటిసారి దగ్గరగా పరిచయం 1989 లో అయింది. అంతకుముందు కలిసినా అంతగా పరిచయం చేసుకునే అవకాశం కలగలేదు. అప్పట్లో నేను గవర్నర్ కుముద్ బెన్ జోషి దగ్గర పనిచేస్తున్నప్పటికీ, పాత్రికేయ ప్రవృత్తితో వున్న సంబంధం నన్ను స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డితో పరిచయానికి దారితీసింది. అదే క్రమంలో, చెన్నారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావడంతో నేనాయనకు మరింత చేరువయ్యాను. ఎన్ టీ రామారావు సారధ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించడానికి పటిష్టమైన నాయకత్వం కొరకు పీసీసీ అధ్యక్షుడిగా చెన్నారెడ్డిని నియమించడంతో, ఆయనకు ఆ లక్ష్యంలో తోడ్పడిన ముఖ్యుల్లో ప్రథముడైన రోశయ్యతో పరిచయం కలిగింది. 1989 సంవత్సరాంతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చెన్నారెడ్డికి అన్ని విషయాల్లో చేదోడుగా వుండేవారు రోశయ్య. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం, చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కావడం, రోశయ్య ఆయన మంత్రివర్గంలో చేరడం జరిగింది. ఎన్నికల ముందు పరిచయమైన నన్ను చెన్నారెడ్డి నన్ను "ముఖ్యమంత్రి పౌర సంబంధాల అధికారి" గా నియమించారు. నా నియామకం గురించి మొట్టమొదట రోశయ్య గారికి తెలియచేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ముఖ్యమంత్రి పీఅర్ఓ గా ప్రతి దినం రోశయ్యను కలిసే అవకాశం, విధి నిర్వహణలో ఆయన సూచనలు-సలహాలు తీసుకోవడం నిరంతరం జరిగేది. ఆ తర్వాత రాజకీయాలకు సంబంధించిన ఉద్యోగం ఏదీ నేను చేయకపోయినా, ఆయనను మధ్య-మధ్య కలవడం జరుగుతుండేది. ఆయన మంత్రిగా లేనప్పుడు కూడా చాలా పర్యాయాలు కలిసి ఆయన సహాయం కోరితే కాదనలేదెప్పుడు. 1994-2004 మధ్య కాలంలో, కాంగ్రెస్ ప్రతిపక్షంలో వున్నప్పుడు శ్రీనివాసరావు తో కలిసి చాలా సార్లు కలిశాను. అప్పడు ఎలా కలివిడిగా మాట్లాడేవారో, ఇప్పుడూ అంతే.

2004 లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉద్యోగ విరమణ చేసి, ఏడాది తర్వాత, 108 అత్యవసర సహాయ సేవలు నిర్వహిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ఇన్-చార్జ్ గా చేరాను. ఆ మధ్యలో, నేను ఆయనను కలిసిన ప్రతిసారీ, నాకేమైనా సహాయం కావాలా అని అడిగేవారు. ఇ.ఎం.ఆర్.ఐ లో చేరిన మొదటి వారంలోనే, ఒకే కంపార్ట్ మెంటులో ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఆయన్ను కలవడం, నా ఉద్యోగం విషయం చెప్పడం, ఆ సేవల గురించి ఆయన నోటి వెంట వివరంగా వినడం జరిగింది. నేను చేరక ముందు, ఆగస్టు 15, 2005 న ఆ సేవలు లాంఛనంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రారంభించినప్పుడు ఆయన అక్కడున్న విషయం కూడా చెప్పారు రోశయ్య. ఆర్థిక శాఖకు అదనంగా, ఆరోగ్య-వైద్య-కుటుంబ సంక్షేమ శాఖకు కూడా రోశయ్య గారే మంత్రి. 108 అత్యవసర సహాయ సేవలకు సంబంధించి, అవసరమైనప్పుడల్లా ఆయనను కలిసే అవకాశం కలిగింది. తొలుత కేవలం ప్రయివేట్ నిధులతోనే నడుస్తున్న ఆ సేవలను ఒకే రోజున ఒంగోలు, చీరాలలో ఆయన ప్రారంభించారు. చీరాల సభలో మాట్లాడుతూ, జిల్లాకు కోటి రూపాయల వంతున 23 కోట్ల రూపాయలను బడ్జెట్లో మున్ముందు కేటాయించడానికి ప్రభుత్వ సంసిద్ధతను మొట్టమొదటి సారిగా బహిరంగంగా ప్రకటించింది రోశయ్య గారే. ఇచ్చిన మాట ప్రకారం 2007-2008 బడ్జెట్లో 23 కోట్లు కేటాయించారు. ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం ఉన్నప్పటికి, రాజశేఖర రెడ్డి దృష్టిలో అప్పటికింకా వివరంగా పడలేదాసేవల విషయం.

రోశయ్య ఆరోగ్య శాఖను నిర్వహిస్తున్నప్పుడే, అంతవరకు 108 అత్యవసర సహాయ సేవలకు అసలే అందని నిధుల స్థానంలో, నిర్ణీత మొత్తంలో కొంత నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వ పరంగా సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి-ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు మధ్య ఆయన సమక్షంలో సెప్టెంబర్ 2006 లో అవగాహనా ఒప్పందం కుదిరింది. రోశయ్య చొరవతో సాధ్యమైన ఆ సంఘటన అత్యవసర సహాయ సేవలకు సంబంధించినంతవరకు ఒక చారిత్రాత్మక మలుపు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయనకు సలహాదారుడుగా పనిచేస్తున్న అధికారి, పీకె అగర్వాల్, అప్పట్లో ఆరోగ్య-వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి. ఒప్పందం ప్రకారం నిధులకు తోడు 432 అంబులెన్సులను కూడా సమకూర్చింది ప్రభుత్వం. క్రమేపీ రోశయ్య ద్వారా దివంగత ముఖ్యమంత్రికి చేరువైన సేవల నిర్వహణకు, మరిన్ని అంబులెన్సులను చేర్చడంలోను, నిర్వహణ నిధులను 95% వరకు పెంచడంలోను కీలక పాత్ర పోషించింది రోశయ్యే. గ్రామీణ ప్రాంతాలకు సహాయ సేవలను విస్తరించడానికి జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం నుంచి, ఆ సేవలకు అంబులెన్సులను పెంచినప్పుడల్లా సంబంధిత కార్యక్రమంలో పాలు పంచుకోవడం వరకు, అడిగినప్పుడల్లా కాదనకుండా ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ప్రాంగణానికి రావడం దాకా, నిధుల విడుదలలో ఆలస్యమైనప్పుడల్లా తోడ్పడంతో సహా, ఎల్ల వేళలా ఆయన సహకారం కొరకు కలిసినప్పుడల్లా ఒకే రకమైన ఆత్మీయ స్పందన దొరికేది. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ రామలింగ రాజు జైలుకెళ్లడంతో, జనవరి 8, 2009 న, దివంగత ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలన్నీ రోశయ్య సలహాతోనే తీసుకున్నారు రాజశేఖర రెడ్డి. తిరిగి నాలుగు నెలల అనంతరం 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ప్రయివేట్ భాగస్వామిగా బాధ్యతలు చేపట్టమని జీవి కృష్ణారెడ్డితో రాజశేఖర రెడ్డి మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన సంప్రదించింది రోశయ్యనే. ఆ నాలుగు నెలల మధ్య కాలంలో వచ్చిన పెద్ద అవాంతరం రోశయ్య జోక్యం చేసుకోవడంతో తప్పింది. ఇ.ఎం.ఆర్.ఐ ఖాతాలో వున్న సంస్థ నిధులను యాక్సెస్ బాంక్ స్తంభింపచేయడంతో తలెత్తిన సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న రోశయ్యను కలవడం, ఆయన సహాయం కోరిన వెంటనే ఆయన దానిని పరిష్కరించడం జరిగింది. జీవీ కృష్ణారెడ్డి కంటే ముందు ప్రయివేట్ భాగస్వామిగా వచ్చేందుకు ఉత్సాహం చూపించిన పిరమల్ సంస్థ చైర్మన్ అజయ్ పిరమల్ కోరిక మేరకు, అడిగిన వెంటనే తన ఇంట్లో ఆయన కలుసుకునేందుకు సమయం కేటాయించడమే కాకుండా, అత్యవసర సహాయ సేవల గురించి "బ్రాండ్ అంబాసిడర్" లాగా ఆయనకు వివరించారు రోశయ్య. తనకున్న కొన్ని పరిమితుల వల్ల ఇ.ఎం.ఆర్.ఐ బాధ్యతలు స్వీకరించలేక పోయిన అజయ్ పిరమల్, మరో స్వచ్చంద సంస్థ పై ఆసక్తి కనబరిచి, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి ఇటీవల కలిసినప్పుడు నేను కూడా ఆ సంస్థ అధికారులతో కలిసి వెళ్లాను. మళ్ళీ అదే అత్మీయత చూపారు రోశయ్య గారు.

ఇలా ఎప్పుడు ఏది అడిగినా కాదనని రోశయ్య అనుకోని పరిస్థితుల కారణంగా, రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ప్రభుత్వ శాఖల పనితీరుపై అవసరమైనప్పుడు తక్షణమే సమీక్షలు నిర్వహిస్తారనడానికి నిదర్శనంగా ఇటీవలి నా అనుభవమే ఉదాహరణ. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో సేవలందిస్తున్న సంస్థలో పనిచేస్తున్న నేను, ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారితో కలిసి, సంస్థ ఎదుర్కొంటున్న సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాం. ఎంతో పని ఒత్తిడిలో వున్న ముఖ్యమంత్రి మాతో మాట్లాడడానికి నిమిషం కంటె ఎక్కువ సమయం కేటాయించ లేకపోయారు. అయినా ఆ ఒక్క నిమిషంలోనే సమస్య పరిష్కారం దిశగా ఆంతరంగిక సిబ్బందికి తగు ఆదేశాలిచ్చారు. సంబంధిత అధికారిని కలవమని కూడా సూచించారు. మేము ముఖ్యమంత్రి సూచన మేరకు ఆయన చెప్పినట్లే చేశాం. ఆ తర్వాత ఏం జరిగిందో కాని, నేను పనిచేస్తున్న సంస్థకు సంబంధించిన ప్రభుత్వ శాఖాధికారులతో, మర్నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి. సమస్యకు సంబంధించిన తక్షణ ఇబ్బందులు తొలగిపోయాయి.

అధికారంలో లేనప్పుడు ఎంత సమయం కేటాయించినా, ముఖ్యమంత్రి కానప్పుడు అధికారంలో వుండగా ఎంత సమయం కేటాయించినా, ముఖ్యమంత్రిగా పనుల ఒత్తిడివల్ల అతి తక్కువ సమయం కేటాయించినా, రోశయ్య కనిపించే ఆత్మీయతలో మార్పు కొంచెమైనా లేదు. హద్దులు మించని ఏ కోరిక కోరినా ఆయన స్పందనలో ఒకే రకమైన
ఆత్మీయత.

Also please click for more here:

Sunday, June 13, 2010

గవర్నర్లలో ఇక నుంచి రెండు రకాల (మంచి-చెడ్డ) వారుండ బోతున్నారా?:వనం జ్వాలా నరసింహా రావు

గవర్నర్లలో ఇక నుంచి రెండు రకాల
(మంచి-చెడ్డ) వారుండ బోతున్నారా?
వనం జ్వాలా నరసింహా రావు

ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు తాను నియమించి-శాఖలను కేటాయించిన నలుగురు రాష్ట్ర మంత్రుల, ఇద్దరు పార్లమెంట్ సభ్యుల సమక్షంలో, పరిణితి చెందిన 86 గ్రామాల సర్పంచులను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ నరసింహన్, తనను తాను "చెడ్డ గవర్నర్" గా అభివర్ణించుకున్నారు. అంతటితో ఆగకుండా, ఇక ముందు ఎక్కువ కాలం తను రాజ్‌భవన్ లో గడపనని, ప్రజల మధ్య గడుపుతానని, వారి కష్ట సుఖాలను విచారిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఏ రాష్ట్రంలో నైనా ప్రభుత్వం చేసే ప్రతి పని గవర్నర్ పేరు మీదే జరగడం రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం. ఆ ప్రకరణను కొంచెం విస్తరించి, బహుశా రాష్ట్ర గవర్నర్, ఇక నుంచి కేవలం నామ మాత్రంగా తన పేరుమీద కాకుండా, తానే-తన పర్యవేక్షణలోనే, ప్రజా సంక్షేమం గురించి స్వయంగా పర్యటనలు చేయబోతున్నారన్న అర్థం ఆయన మాటల్లో గోచరిస్తున్న ది. గవర్నర్ పేరుపై సాగే దే రాష్ట్రంలోని పాలనని, నెలకు మూడు రోజులు విస్తృతంగా రాష్ట్రంలో పర్యటిస్తానని, సర్పంచులు పంచాయితీలను దత్తత తీసుకోవాలనీ, నిర్మల్ పురస్కార గ్రామాలు స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దాలనీ అనడమే కాకుండా, ప్రజా ప్రతినిధులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఒక ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ కూడా చేశారు నరసింహన్. ఆయన ఉద్దేశం సమాంతర ప్రభుత్వం నడపడమో, లేక, "తన ప్రభుత్వం" నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు "అనుబంధంగా-అభినందనగా" (సప్లిమెంటరి-కాంప్లిమెంటరి) మరో మార్గంలో ప్రజల క్షేమం పట్టించుకోవడమో అయ్యుండాలి. రెండు పద్ధతులూ, రాజ్యాంగ పరిమితులకు-సాంప్రదాయాలకు లోబడి వున్నంతవరకు, అభిలషణీయమే.

కొందరు గవర్నర్లు ఇలా వ్యవహరించడం ఈ దేశంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో కొత్తే మీ కాదు. 1977-78 మధ్య కాలంలో రాష్ట్ర గవర్నర్ గా పదిహేను నెలలు పనిచేసిన శారదా ముఖర్జీ, 1985-90 మధ్య కాలంలో నాలుగు సంవత్సరాలకు పైగా పనిచేసిన కుముద్ బెన్ జోషి, భిన్న రీతుల్లో వ్యవహరించినప్పటికీ, ప్రస్తుత గవర్నర్ తో పోల్చదగిన వారని అనాలి. దివి సీమను అతలాకుతలం చేసిన భీకరమైన తుఫాను నేపధ్యంలో, స్వచ్చంద సంస్థల పనితీరుకు మార్గదర్శకంగా-ధీటుగా పనిచేసే తరహాలో "చేతన" సంస్థను స్థాపించి, సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టి, రాష్ట్ర ప్రజల-పాలకుల అభినందనలు అందుకున్నారు శారదా ముఖర్జీ. చేతన సంస్థకు, గవర్నర్ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రి ఉపాధ్యక్షులుగా వ్యవహరించే పద్ధతిలో సంస్థ నియమ నిబంధనలను అప్పటి గవర్నర్ కార్యదర్శి మోహన్ కందా తోడ్పాటుతో రూపొందించారా మె. దరిమిలా మోహన్ కందా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. శారదా ముఖర్జీ గుజరాత్ గవర్నర్‍ గా వెళ్లిపోయిన తర్వాత చేతన కార్యకలాపాలు అనతి కాలంలోనే ఆగిపోయాయి. ఏడేళ్ల తర్వాత గవర్నర్ గా వచ్చిన కుముద్ బెన్ జోషి, చేతన సంస్థను పునరుద్ధరించడంతో పాటు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (నీసా) అనే మరో స్వచ్చంద సంస్థను స్థాపించి, పలు ప్రజోపయోగమైన కార్యక్రమాలను చేపట్టారు. ఆ కాలంలో నాలుగు సంవత్సరాల పాటు చేతనకు నేను అడ్మినిస్ట్ర్రేటివ్ అధికారిగా-ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసాను. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో అనేక సందర్భాల్లో విభేదించిందన్నపేరు తెచ్చుకున్న కుముద్ బెన్ జోషి, ఆ రెండు సంస్థల కార్య కలాపాల విషయంలో ఆయన సలహా సంప్రదింపులను "కూడా" తీసుకునేవారు. జోగినిల దురాచారం రూపుమాపే దిశగా రాజ్ భవన్ దర్బార్ హాలులో ఆ అభాగినులకు వివాహం జరిపించడం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు, కుముద్ బెన్ జోషి ఆధ్వర్యంలోని స్వచ్చంద సంస్థలు చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు.

గత సెప్టెంబర్ నెలలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు రోశయ్య ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత, సహేతుకమైనా-కాకపోయినా, స్వపక్షాల-విపక్షాల విమర్శలకు దారితీసే పద్ధతిలో ప్రభుత్వ పాలన సాగుతోంది. దానికి బాధ్యుడు ముఖ్యమంత్రి రోశయ్యా? అయిష్టంగా ఆయన మంత్రివర్గంలో కొనసాగుతున్న కొందరు మంత్రులా?ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరని రాజశేఖర రెడ్డి కొడుకు జగనా? ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చి రోశయ్యను ఇరుకున పెడుతున్న కాంగ్రెస్ నాయకులా? తెలంగాణా వాదులా? సహకరించని ప్రకృతా? ఆర్థిక ఇబ్బందులా? రోశయ్యకు సంపూర్ణ అధికారాలు ఇవ్వని కాంగ్రెస్ అధిష్టానమా?. కారణాలు ఏమైనా వీటికి సంబంధం లేని ప్రజలై తే ఇబ్బందులకు లోనవుతున్న మాట వాస్తవం. రాజ్యాంగం రీత్యా ముఖ్యమంత్రిని-ఆయన మంత్రివర్గ సహచరులను నియమించిన గవర్నర్ కు, పాలనా సంబంధమైన కొన్ని లోపాలు కలవర పడే విధంగా వుండి ఉండాలి ! అలాంటప్పుడు, పరిపాలనా వ్యవహారాలలో ఎదురవుతున్న అనేకానేక ఇబ్బందుల జోలికి పోకుండా, కేవలం, ముఖ్యమంత్రి అధికారాలేంటి ? గవర్నర్ అధికారాలకు పరిమితులేంటి? గవర్నర్ పాత్ర ఏంటి? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గవర్నర్ విమర్శించ తగునా? అన్న విషయాలనే పదే-పదే ప్రస్తావించి, కొందరు రాజకీయ నాయకులు వారి పరిమిత దృష్టిని ప్రదర్శిస్తున్నారు ఇటీవల. కొంతకాలం క్రితం గవర్నర్ కేంద్రానికి రహస్యంగా నివేదిక పంపించారని (ధృవీకరించుకోకుండానే) ఆయన మీద నిప్పులు చెరిగారు. అలా పంపించడం ఆనవాయితీగా జరిగేదేనని, అందులో వింతేమీ లేదని తెలిసిన మేధావులు కూడా గవర్నర్ నరసింహన్ పై విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ నాయకులై తే మరీ రెచ్చిపోయారు. ప్రతి పక్షాల వారే మో, ఆయన రహస్య నివేదికను బహిర్గతం చేయాల్సిందేనని డిమాండు చేశారు. చివరకు కొన్నాళ్లకు సమస్య సమసిపోయింది.

పలు సందర్భాలలో-వేరు, వేరు సందర్భాలలో, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంబంధిత గవర్నర్ వ్యవహారం నచ్చనప్పుడు, గవర్నర్ పాత్రను విమర్శించడంతో సరిపుచ్చుకోకుండా, గవర్నర్ వ్యవస్థనే రద్దుచేయమని కోరడం అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా, అధికారంలో లేనప్పుడు ప్రతి పార్టీ చేసిన పని అదే. గవర్నర్లు తప్పుచేయలేదని కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన గవర్నర్లు లేరనీ కాదు. అంత మాత్రాన ఆ వ్యవస్థనే రద్దు చేయాలని కోరడం సమంజసం కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి-ప్రకరణాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్న గవర్నర్లను పదవినుంచి తొలగించమని అడిగే హక్కుందికాని, వ్యవస్థనే ప్రశ్నించే విధంగా రాజకీయ నాయకులు ప్రకటనలు ఇవ్వడం తగదు. రాజ్యాంగపరంగా ఏర్పడ్డ రాష్ట్రపతి, గవర్నర్ పదవులు ఎల్లవేళలా "అలంకారప్రాయమైనవేనని" భావించడం తప్పు. ఎన్టీ రామారావును 1984 లో నాటి గవర్నర్ రామ్ లాల్ తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యంపై దెబ్బతీశారని అభియోగం మోపుతూ, న్యాయం కావాలని కోరుతూ తెలుగుదేశం నాయకత్వం రాష్ట్రపతి వద్దకు పోయింది గాని, ప్రధాన మంత్రి వద్దకు కాదే ! కాకపోతే, 1995 లో అలాంటిదే జరిగినప్పుడు, ఆ పనిచేసిన నాటి గవర్నర్ కృష్ణకాంత్ కు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టడానికి చంద్రబాబు సహకరించారు. గవర్నర్ ను, గవర్నర్ వ్యవస్థను విమర్శించడానికి, సొంత కోణం నుంచి చూడకుండా, రాజ్యాంగ కోణం నుంచి చూడడం మంచిది. ప్రధాన మంత్రి వద్దకు కాకుండా, న్యాయం కొరకు రాష్ట్రపతి వద్దకు పోవడానికి కారణం, ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించే వాడు కాబట్టే.

కష్ట కాలంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధి (ప్రధాన మంత్రి స్థాయి వారైనా సరే) కంటే, రాజ్యాంగానికి బద్ధుడైన అధినేత (రాష్ట్ర పతి, గవర్నర్) అవసరమని, న్యాయం కోసం, ముఖ్యమంత్రి స్థాయి వాడే, ఎన్నికైన ప్రజా ప్రతినిధి-ప్రధాన మంత్రి వద్దకు పోలే దో, అలానే, రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అవసరమైనప్పుడు-న్యాయం జరగలేదని భావించినప్పుడు, గవర్నర్ వైపు దృష్టి సారించడం తప్పు కాదు. వారు గవర్నర్ దగ్గరకు పోయినా, లేక, గవర్నరే వారి దగ్గరకు వచ్చినా, ఉద్దేశం ఒకటే. కష్ట కాలంలో, గవర్నర్ నుంచి సహాయం కోరుకునే వారు, కేవలం ఎన్నికైన ప్రజా ప్రతినిధులే కావాలని లేదు. సామాన్య ప్రజానీకం కూడా కావచ్చు. బహుశా రాష్ట్రంలో ఇప్పుడు నెల కొన్న ప్రత్యేక పరిస్థితులు, తనను ప్రజల వద్దకు తరచుగా పోయేందుకు ప్రేరేపిస్తున్నాయని గవర్నర్ భావిస్తుండవచ్చు. ఆలానే, రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలను, రాజ్యాంగ అధినేతగా, తరచూ కేంద్రానికి-ప్రధానికి-రాష్ట్రపతికి తెలియచేయడం మంచిదని కూడా గవర్నర్ నరసింహన్ భావిస్తుండవచ్చు. ఆయన చర్యలను ఆక్షేపించడం గాని, వాటికి దురుద్దేశం ఆపాదించడం కాని, అపార్థాలు వెతకడం గాని చేయడం భావ్యం కాదు. భారత దేశంలో రాజకీయ పార్టీలు కోకొల్లలు. ఒక్కో పార్టీకి, ఒక్కో అవసరానికి, ఒక్కో రకమైన సిద్ధాంతం వుంటుంది. ప్రాంతీయ పరమైన, భాషా పరమైన, కుల-మత పరమైన పార్టీలెన్నో వున్నాయి. ఆ పార్టీల పక్షాన ఎన్నికై అధికారంలోకి వచ్చినవారు-ప్రతిపక్షంలో కూర్చున్న వారు, వారి-వారి పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా వ్యవహరించే ఆస్కారం లేదు. మత విద్వేషాన్ని, భాషా దురభిమానాన్ని, ఒక ప్రాంతం వారు మరో ప్రాంతం వారిని దోపిడీకి గురి చేయడాన్ని రెచ్చగొట్టినప్పుడు, కలిగే దుష్ఫలితాలను అదుపులో పెట్టడంలో ప్రజా ప్రతినిధులు (ముఖ్యమంత్రి-మంత్రి వర్గ స్థాయి వారితో సహా) విఫలమైతే, రాజ్యాంగానికి కట్టుబడ్డ గవర్నర్ పరిస్థితిని చక్కదిద్దడానికి, నెలకో-వారానికో రాష్ట్రంలో పర్యటిస్తే తప్పేంటి?

గవర్నర్ పేరుపైన ప్రభుత్వ నిర్ణయాలు, ప్రకటనలు, ఉత్తర్వులు జారీ కావడం తెలిసిన విషయమే. రాజకీయ నాయకులు ఎన్ని చెప్పినప్పటికీ, గవర్నర్ పాత్రకు ప్రాధాన్యత వుందని, ఏ ఐఏఎస్ అధికారిని అడిగినా ఒప్పుకోవడానికి క్షణం కూడా ఆలోచించరు. (గవర్నర్) ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు సంబంధించిన వివరాలు, గవర్నర్ కు తెలిసి వుండాల్సిన అవసరం వుంది. దాని మూలాన, ఆయనకు రాష్ట్రంతో పరిచయం పెంచుకోవడం తేలికవుతుంది. రాష్ట్ర ప్రజలకు అవసరమైనప్పుడు తన చేతనైన సహాయం చేసే వీలుకూడా కలుగుతుంది. అనుకోని పరిస్థితుల్లో, రాజకీయ అస్థిరత్వం ఏర్పడి (ఇప్పుడు ఏర్పడనున్నదని ఉద్దేశం కాదు !), రాష్ట్రపతి పాలన విధించి, గవర్నర్ పాలనా యంత్రాంగాన్ని నడపాల్సి వస్తే ఆ పరిచయం తోడ్పడుతుంది. గవర్నర్ కేవలం రాజ్యాంగంలో పొందుపరచిన వ్యక్తి మాత్రమే కాదు. "రబ్బర్ స్టాంపు" అసలే కాదు. పలు సాంఘిక-సంక్షేమ కార్యక్రమాలకు రాజ్యాంగ రీత్యా పర్యవేక్షకుడు. ఆయన ఆధ్వర్యంలో రెడ్ క్రాస్, హరిజన-గిరిజన సంక్షేమం, కుష్టువారి పునరావాసం, విలువ కట్టలేని తర-తరాల వారసత్వ సంపద పరిరక్షణ, విశ్వ విద్యాలయాల వ్యవహారాలు, రక-రకాల రాజ్యాంగం నిర్దేశించిన సహాయ కార్యక్రమాలు అమలు చేయాల్సి వుంటుంది. బడుగు వర్గాల అభ్యున్నతి ఆయన కనీస ధర్మం. రాష్ట్ర ప్రజల్లో ఐకమత్యానికి, సమగ్రతా భావాలకు, స్థిరత్వానికి కూడా గవర్నర్ బాధ్యుడు.

రాజ్యాంగం నిర్దేశించిన విధంగా, గవర్నర్ ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సహచరులకు కష్ట-సుఖాలలో తోచిన సలహాలు ఇవ్వడం తప్పే మీ కాదు. ఆ మధ్యన ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యదర్శి స్థాయి అధికారులను రప్పించుకుని, శాఖాపరంగా తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు గవర్నర్. దాన్నీ విమర్శించిన వారున్నారు. తన ప్రభుత్వ కార్య కలాపాలను తెలుసుకుంటున్నాడే తప్ప అందులో దురుద్దేశం ఏమీ లేదు కదా ! గవర్నర్ మంత్రివర్గం సభ్యులకు ఇచ్చిన సలహాలను వారెంతవరకు పాటించుతారనేది, గవర్నర్ ఇచ్చే విషయం పైన-మంత్రులు ఆ సలహాను ఏ కోణం నుంచి చూస్తారన్న అంశంపైన ఆధార పడి వుంటుంది. త్రివేది గవర్నర్ గా వున్నప్పుడు, దైనందిన పాలనా వ్యవహారాల్లో ఆయన మంత్రులకు సలహాలను ఇచ్చేవారని-వాటిని వారు మరో ఆలోచన లేకుండా తిరస్కరించే వారని చెప్పుకునేవారు. బహుశా ఆ నేపధ్యంలో, సలహాలను ఇచ్చే శైలిలో మార్పొచ్చిందేమో ! పట్టం థాను పిళ్లై గవర్నర్ గా వున్నప్పుడు, హరిజన వసతి గృహాల విషయంలో జోక్యం చేసుకుని, వాటి స్థితిగతుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆ సలహాను వారు పాటించారు. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ఏలూరు పర్యటనలో భాగంగా, నిర్మల్ పురస్కారాలను అందుకున్న గ్రామాలకు కేంద్ర ప్రోత్సాహానికి అదనంగా మరో లక్ష రూపాయలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఆయన కోరికను వెంటనే అంగీకరించిన వ్యవసాయ మంత్రి రఘువీరా రెడ్డి దానికి సంబంధించిన ప్రకటన తక్షణమే చేశారు. అమలవుతుందో, లేదో, వేచి చూడాలి. ఏ విధానమైనా, ఆచరణలో పెట్టేవారి నిజాయితీని బట్టి సానుకూలమవుతుంది. వ్యక్తిగతమైన అభిమానాలకు-దురభిమానాలకు పాల్పడితే దేశ శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు దెబ్బతింటుంది.

రాజ్యాంగం సంక్రమింప చేసిన అధికారాలను-బాధ్యతలను, అనేక సందర్భాల్లో, కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని అనిపిస్తోంది. "ఆర్థిక అత్యయిక పరిస్థితిని" కొన్ని రాష్ట్రాలలో అమలు చేయాల్సిన సందర్భంలో కూడా మౌనం వహించింది ప్రభుత్వం. అలా చేయడం వల్ల, కొన్ని రాష్ట్రాలు (ఆంధ్ర ప్రదేశ్ ?) యధేఛ్చగా, ఆర్థిక దోషాలకు పాలపడుతున్నాయి. వాస్తవానికి కొన్ని రాష్ట్రాలలో ఆర్థిక ప్రగతికి అవరోధం కూడా ఏర్పడుతుందనాలి. గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నెల రోజుల క్రితం "రహస్య నివేదిక" పంపడం వాస్తవమైతే, ఆ చర్యను విమర్శించకుండా, ఆయనను రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించడానికి వీలు కలిగేలా చేయాలి. రాజ్యాంగ బాధ్యతలు తెలియకుండా గవర్నర్ వ్యవహరిస్తాడని విమర్శించడం పొరపాటు. కాకపోతే, "నేను మంచి గవర్నర్ ను కాను.. చెడ్డ గవర్నర్ ను" అని అనకుండా వుండాల్సింది గవర్నర్ నరసింహన్. మంచి-చెడులు ప్రజలే నిర్ణయిస్తారు.(End)