Saturday, November 30, 2019

రామలక్ష్మణులను చూసి భయపడిన సుగ్రీవుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-6 : వనం జ్వాలా నరసింహారావు


రామలక్ష్మణులను చూసి భయపడిన సుగ్రీవుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-6
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (01-12-2019)
ఈ విధంగా ఆ రాజకుమారులు, రాముడు, లక్ష్మణుడు ఋశ్యమూక పర్వతం దరిదాపుల్లో సంచరిస్తుండగా, ఆశ్చర్యకరంగా, మిక్కిలి అందంగా, దేవతల్లాగా వున్న వారిని కొండమీద వున్న సుగ్రీవుడు చూసి భయంతో చేష్టలుడిగి, బాధపడసాగాడు. సుగ్రీవుడితో పాటు ఇతర వానరులు కూడా చూశారు. రామలక్ష్మణులను చూసిన వానరులకు వీరిని వాలి పంపగా తమను చంపడానికి వచ్చారని భావించారు. వెంటనే వారు దాక్కునే మతంగాశ్రమ గుహ దగ్గరకు పోయారు. పంపానదికి ఉత్తరాన రామలక్ష్మణులు, దక్షిణాన సుగ్రీవాదులు వున్నారు. మనోహరమైన ఆకారంకల రామలక్ష్మణులను విల్లు, బాణాలు, ఖడ్గం ధరించగా చూసిన సుగ్రీవుడు సందేహించాడు. గుండెలు కొట్టుకున్నాయతడికి. ఇంకా ఎవరైనా వస్తున్నారేమోనని నలుదిక్కులా చూశాడు. ఎటు పరుగెత్తాల్నా అని ఆలోచించసాగాడు. నిప్పుతొక్కిన కోతిలాగా అయిపోయాడు. ఒకచోట నిల్వలేకపోయాడు. ఏ పాపం ఎరుగని అన్నదమ్ములను చూసి తాన్నున్న స్థలాన్ని వదిలి భయపీడితుడు, శోకతప్తుడయ్యాడు. ఈ పర్వతం మీదే వుంటే శాపభయం లేనందున వాళ్లిక్కడికి వస్తారేమోనని భయపడ్డాడు సుగ్రీవుడు. ఇది విడిచి పోతే వాలి చంపుతాడేమోనని కూడా భయపడ్డాడు. తనతోటి వానరులను, మంత్రులను చూసి ఇలా అన్నాడు.

"మంత్రులారా! శుభకర రూపం కలవారిని చూశారుకదా? వారెవరో, ఏమో కాని నిజమైన మునుల్లాగా లేరు. వంచించడానికి నారచీరెలు కట్టారు. ఎవరిని వంచించడానికి ఇక్కడికి వచ్చారో? నామీద వైరం సాధించడానికి వాలి ఇక్కడికి రాలేడు. కాబట్టి ఎవరినో మనుష్యులను పిలుచుకుని వచ్చాడు. మునులని మనం దగ్గరకు పోతే, వెంటనే చంపుతారు. ఇది వారి ఉపాయం. అలాకాకపోతే తపస్సు చేసుకునేవారికి ఆయుధాలెందుకు?"

సుగ్రీవుడు ఇలా చెప్పగా వానరులు, మంత్రులు కూడా పెద్ద విల్లు-బాణాలు ధరించిన రామలక్ష్మణులను చూసి, గుండెలు అదరగా, ఒక కొండ మీదనుండి మరొక కొండ మీదికి దూకుతూ, ఒకడు పోయిన దారిలో ఇంకొకడు పోకుండా ఒక్కొక్కరొక దారిలో పోసాగారు. అందరూ చివరకు ఒక కొండ చాటున చేరి సుగ్రీవుడి దగ్గర నిలుచున్నారు.

సుగ్రీవుడి భయానికి కారణం అడిగిన హనుమంతుడు
ఆంజనేయుడు సుగ్రీవుడి దగ్గరకు పోయి "వానర రాజా! ఎందుకు నీకు భయం వేస్తున్నది? వాలి భయంతో ఎందుకు నువ్వీవిధంగా పరుగెత్తుతున్నావు? ఈ పర్వతం ఋష్యమూకం కదా! ఇక్కడ వాలివల్ల భయం లేదుకదా? ఒకవేళ భయపడడానికైనా వాలి ఇక్కడెక్కడా కనబడడం లేదే? కాబట్టి ఎందుకు తొట్రుపాటు పడుతున్నావు?క్రూరకర్మలు, పాపపు పనులు చెసే వాలి నాకిక్కడ కనబడడం లేదు. నీ పిరికితనానికి కారణం ఏమిటి? నీ కోతి స్వభావం సార్థకమైంది. నువ్వు గొప్ప మనస్సు లేనివాడివైనందున ముందు-వెనుకలు, సాధక-బాధకాలు పూర్తిగా ఆలోచించడం లేదు. జ్ఞానం, బుద్ధి, ఇంగితం లేని రాజు ప్రజలను ఎలా రక్షించగలడు? సుగ్రీవా! మొదట ఏది తోస్తుందో దాన్నే నమ్మి తటాలున ఏ పనీ చేయవద్దు. ఆ విషయంలో చక్కగా ఆలోచించు. ఎదుటివారి ముఖనయన చేష్టల వల్ల నీ అభిప్రాయం సరైందో, కాదో నిర్ణయించుకో".

పనులన్నీ చక్కదిద్దమని హితమైన మాటలు చెప్పిన తన హితుడైన ఆంజనేయుడితో సుగ్రీవుడు శుభకరమైన మాటలతో ఇలా జావబిచ్చాడు.  తన అభిప్రాయం తాను చెప్తాననీ, ఆ తరువాత హనుమంతుడు పోయి చాకచక్యంగా కార్యం సరిదిద్దమనీ అంటాడు.


"హనుమంతా! నా ఆలోచనా విధానం చెప్తా విను. కమలాల రేకుల్లాంటి కళ్లు కలవారిని, మోకాలిని అంటే చేతులు కలవారిని, గొప్ప విల్లు-బాణాలు-కత్తులు కలవారిని, స్తోత్రం చేయడానికి యోగ్యమైన తేజస్సు కలవారిని, దేవకుమారులతో సమానంగా వున్నవారిని చూస్తే భయం కలగదా? వారు శత్రువులని ఎందుకు భయపడాలి, వారికి నాకు విరోధం వుందా, లేదు కదా, ఏదో వాళ్ల పనిమీద వాళ్లు వచ్చారేమో, అని అనుకోకూడదా? అంటావేమో? వీళ్లు ఋషులా? రాచవీరులా? అయితే నారచీరెలు ఎందుకు కట్టుకోవాలి? ఋశీశ్వరులే అయితే విల్లు-బాణాలు ఎందుకు? నేనా వాళ్లను ఎరుగను. వారి సహాయం అడగలేదు. కాబట్టి నా పక్షాన రాలేదు. కాబట్టి దీంట్లో ఏదో వంచన వున్నదని అనుమానించాను. ఏ వంచన అంటావా? వాలి ఇక్కడికి రాకూడదు. నేనా దీన్ని విడిచి పోను. కాబట్టి ఇక్కడికి రాగలిగి, నన్ను చంపగల వారెవరినో ఇక్కడికి వాలి పంపాడని నిశ్చయించాను. కాబట్టి భయపడ్డాను”.

“రాజులకు స్నేహితులు ఎందరో వుంటారు. కాబట్టి రాజులను నమ్మకూడదు. వంచనతో రహస్యంగా తమ శత్రువులను చంపడానికి ఎవరినో పంపుతారు. వచ్చినవారు అవకాశం దొరికినప్పుడు తమ గుట్టు బయటపడకుండా శత్రువులను చంపుతారు. ఇది రాజ ధర్మం. వాలి అంటే సామాన్యుడు కాదు. ఉపాయాలన్నీ తెలిసినవాడు. అపాయం లేని నడవడి కలవాడు. దూరాలోచన కలవాడు. రాజులందరూ తమ శత్రువులను ఉపాయంతోనే కదా చంపుతారు? అలాగే వాలి కూడా చేస్తుండవచ్చు. అయినప్పటికీ ఇది ఇలాగే అని నేను చెప్పలేను. నా జాగ్రత్తలో నేను వుండడం మంచిదని ఇక్కడికి వచ్చాను. నా ఆలోచన సరైందా? కాదా? అని తెలుసుకోవాలి. దానికొరకు ఎవరో ఒక సామాన్యుడిని వారిదగ్గరకు పంపాలి. అధముడు పోతే పని పాడవుతుంది. కాబట్టి నువ్వే సామాన్య మనిషి వేషంలో వాళ్ల దగ్గరికి పోయి విషయం తెలుసుకో".

రామలక్ష్మణుల దగ్గరికి హనుమంతుడిని పంపిన సుగ్రీవుడు
"ఆంజనేయా!నువ్వు పో. మాటలవల్ల, ఆకారాల వల్ల, పలురకాలైన ముఖకవళికల వల్ల, వాళ్ల మనస్సు నిజంగా ఎలాంటిదో కనుక్కో, వారి మనస్సు శుద్ధమైందా? వంచనతో కూడిందా? ఇది వున్నది వున్నట్లుగా తెలుసుకో. ఆంజనేయా! నువ్వు ముందుగా చేయాల్సిన పని చెప్తా విను. నీ మాటల నేర్పుతో, నీ భావం వాళ్లకు సులభంగా అర్థమయ్యేట్లుగా, వాళ్లు నిన్ను నమ్మేట్లు ముచ్చట్లాడు. ఇలా నీమీద ముందుగా నమ్మకం పుట్టించుకుని ఆ తరువాత నామీద వాళ్లకు సదభిప్రాయం కలిగేట్లు చేయి. ఇలా చనువు కుదిరిన తరువాత వాళ్లు కత్తులు, బాణాలు, విల్లు ధరించి అడవుల్లో తిరగడానికి కారణం ఏంటో కనుక్కో. వాళ్లు నిర్మలమైన మనస్సు కలవారనీ, వంచన గుణం లేనివారనీ నీకు నమ్మకం కుదిరితే, వాళ్లు మాట్లాడే విధానం గమనించు. వారి మాటల్లో నిజమెంతో, మోసమెంతో తెలుసుకో".

అని సుగ్రీవుడు చెప్పగా అలాగే చేస్తానని మహాత్ముదైన హనుమంతుడు రామలక్ష్మణులున్న ప్రదేశానికి ఎలా పోవాలా అని ఆలోచన చేశాడు. తన స్వరూపంతోనే పోవాలా, పోయినట్లయితే, సుగ్రీవుడి దగ్గరనుండి వచ్చాడని అనుమానించి, వాళ్లు వంచకులే అయితే తనను వదిలరని భావించాడు. పోయిన పని వృధా అవుతుందనుకుంటాడు. సామాన్యులైన అడవి మనుష్యుల వేషంతో పోతే, వీడెవడో పామరుడని మనసు విప్పి మాట్లాడరేమో? ఎలా పోవాలా అని ఆలోచన చేశాడు.

Wednesday, November 27, 2019

The Valmiki Ramayana-1 .... Introduction to Valmiki Ramayana : Vanam Jwala Narasimha Rao


The Valmiki Ramayana-1
Introduction to Valmiki Ramayana
Vanam Jwala Narasimha Rao

(My 10-year-old granddaughter Kanak Vanam who lives in Redwood City, San Francisco, USA is a voracious reader even at this tender age. On seeing me writing Ramayana in Telugu whenever I come to USA, she asked me can’t it be in simple English so that she too can have the benefit of reading Ramayana. Once the same question was raised by my another granddaughter Mihira. Then I decided to do my best to write in English, as simple as possible. I made her to read first couple of paragraphs and confirmed that she understands. Hence this weekly serial for her and her aged children)   
  
            The Ramayana authored by the Great Sage Valmiki is undoubtedly the greatest and the best of all epics and classics. The lead role and the central character of Sri Ramayana namely Sitadevi is none other than Goddess Laxmi Devi. The hero of the classic Sri Ramachandramurthy is again the Maha Vishnu himself. The Incarnation of both of them in the era of Treta Yug was precisely for the purpose of annihilating the sinners and safeguarding the virtuous and innocent people and thereby establish Dharma, the righteousness. Had Valmiki not authored their story, the future generations would have lived in utter darkness and would have turned as sinners perhaps!  

            The Ramayana authored by Sage Valmiki was in Sanskrit (an ancient language from India) which is composed in verses called Shlokas and hence became difficult for many to read and understand. Though many translated it into several languages, they also, mostly were grammatical and linguistic and hence were equally difficult to understand. In English there are very few and mostly difficult to read as they were true translations many a times. This is precisely the reason for writing this in simple, lucid and easy to understand dialect Ramayana in English. Ramayana book is in Six parts known as Kandas in Sanskrit, namely Bala, Ayodhya, Aranya, Kishkindha, Sundara and Yuddha, besides one post script known as Uttara Kanda.          

            The reason as to why at the end of Treta Yuga (the era) Lord Srimannaarayana had a conversation in his abode Vaikunta with his wife Laxmi Devi and other saints on the subject of annihilating the sinners and safeguarding the virtuous and innocent people, was the Monster king Ravana. Subsequently Lord Srimannaarayana to accomplish his vow to King Dasharatha who worshipped him in his previous birth, born as his sons with the names Srirama, Bharata, Lakshmana and Shatrughna. This was the desire of the Lord.   


            The Lord Maha Vishnu in accordance with his will takes birth in four forms as son to King Dasharatha. In the form of Srirama commits himself to the word given by his father and living an ever-truthful life killed Monster King Ravana. As Lakshmana he was always at the behest of Rama and served him abiding by his command. In the form of Bharata he was always obedient to brother Rama and as Shatrughna he served his elder brother Bharat right from his childhood.       

            Lord Brahma, with a view, that the story of these four forms, the Rama, the Lakshmana, the Bharata and Shatrughna be exposed to generations and generations to come and for the people of whole universe, thought of a book and passed on the responsibility to Sage Narada and other sages. Brahma further proceeded and directed Sage Narada to instruct and enlighten Valmiki an ardent devotee of Srirama to author it for the benefit of inhabitants of the earth. Thus, the Ramayana written by Valmiki was enthused and inspired by none other than Lord Brahma.  

            Going into the details, background and context of this…. One day Sage Narada at the behest of Lord Brahma went to the hermitage of Sage Valmiki. He, in tune with the thought process of Saint Valmiki and having understood his view, tutored the story of Sri Sitarama coupled with the Gayatri Hymn. Later he informed Lord Brahma about what he did. Brahma in turn put Goddess Saraswathi the personification of all knowledge and learning on the tongue of Valmiki and directed him to take-up the writing of Sri Ramayana. Brahma also empowered him to do so in the form of a great legendary testament. With that strength bestowed on him by Brahma, Valmiki commenced writing Sri Ramayana. This is thus a Great Literature and Great Epic. Valmiki Ramayana is said to have been composed basing on each of the twenty-four letters of Gayatri Hymn, and a thousand verses are arranged into one book under the caption of each letter.

Genesis of Sri Ramayana and Narada tutoring Valmiki
One day Narada, the professor of theology and spirituality and also a leading Yogi, went to Valmiki. Valmiki who was in search of a suitable teacher, bowed to him and elicited from him whether there was any person who was a true virtuous and righteous in all aspects.

Valmiki thus wanted to know about such a person who has the qualities of: appropriate in disposition, interested in welfare of all beings, adept and also an able one, uniquely pleasant to look at, self-composed one, controlled his ire, brilliant, non-jealous and to whom even the gods fear when provoked to war etc.

Replying to Valmiki, Narada said that, “Oh! Great Sage! The righteous traits that you narrated are unparalleled and extraordinary. In each of these traits, implicitly there are many more such traits and thus they are doubled and tripled. These are seldom found in ordinary human beings. However, I will reveal the name of the person in whom all these great manners, behaviors and qualities do exist. Please listen. In the family lineage of Ikshvakas dynasty where the God has been prayed incessantly and relentlessly, Ramachandramurthy whom the whole world addresses as ‘Rama! Rama!’ was born. In him all the qualities and traits that you are expecting are in abundance”.    

Narada described Rama as the one who is with a controlled self, highly valorous, resplendent, steadfast, controller of his own senses, wise one, moralist, eloquent, glorious, destroyer of enemies, preserver of his own righteousness, scholar in the essence of Vedas etc. While lauding Rama, Narada gives an outline of Ramayana, truly highlighting those aspects that are the keynotes in this epic, like virtuosity, generosity, morality, chastity and the like.

Tuesday, November 26, 2019

మొదటి పర్యాయం గాంధీనగర్-బాకారం ఇంట్లో అద్దెకు .... జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-15 : వనం జ్వాలా నరసింహారావు


మొదటి పర్యాయం గాంధీనగర్-బాకారం ఇంట్లో అద్దెకు 
జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-15
వనం జ్వాలా నరసింహారావు
          పర్చా కిషన్ రావు గారింట్లో కూడా ఏడాదికి మించి వుండలేదు. అదేంటో గాని మేం ఎంత మంచిగా వున్నప్పటికీ మేం అద్దెకుంటున్న ఇంటి సొంతదారులు మమ్మల్ని ఏడాదికాగానే ఖాళీ చేయమని అనేవారు. దాదాపు చాలా ఇళ్లల్లో అలానే జరిగింది, ఒకటి-రెండు చోట్ల తప్ప. మమ్మల్ని హటాత్తుగా ఖాళీ చేయమన్న పర్చా కిషన్ రావు గారిమీద ఒకింత కోపం వచ్చినప్పటికీ, ఆయన ఇల్లు ఆయన ఇష్టం అనుకుని ఇల్లు వెతుక్కునే ప్రయత్నం చేశాం. ఎంత వెతికినా అశోక్ నగర్, చిక్కడ్పల్లి ఏరియాలలో అద్దెకు ఇల్లు దొరకలేదు. ఇంకా అప్పటికి ఫ్లాట్స్ కల్చర్ రాలేదు. ఇళ్ళ కొరతకూడా వుండేది. మొత్తం మీద వెతకగా, వెతకగా న్యూ బాకారంలో (గాంధీనగర్ అని కూడా అనేవారు) రెండు చిన్న గదులు దొరికాయి. అద్దె అరవై రూపాయలు. వెనక వైపు నుండి ఇంటి సందులో పోతే పక్క ద్వారం గుండా లోపలికి పోయే ఇల్లది. మేం తీసుకున్న ఇంటి పక్కనే మా ఆవిడ కజిన్ అయితరాజు జగన్మోహన్ రావు కుటుంబం అద్దెకుండేది. మాకు వాళ్ళు చాల తోడుగా వుండేవారు.

         మా ఆవిడ చిన్ననాటి స్నేహితురాలు కేసరి (అనుకుంటా) మేం అద్దెకున్న ఇంటికి సమీపంలోనే వుండేది. ఒకనాడు అనుకోకుండా కలవడం, మా ఆవిడ, కేసరి చిన్ననాటి కబుర్లు తిరగేసుకోవడం, రోజూ కలసి కబుర్లు చెప్పుకోవడం జరగసాగింది. అలాగే నేను పనిచేస్తున్న బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లోనే పనిచేస్తున్న రాజేశ్వరి నారాయణన్ కూడా ఆ దగ్గరలోనే వుండేది. నేను అక్కడి నుండి రోజూ అశోక్ నగర్ మీదుగా, హిమాయత్ నగర్ వరకు నడుచుకుంటూ (సుమారు పాతిక నిమిషాలు) పోయి స్కూల్ కు పోవడానికి అక్కడ బస్సెక్కే వాడిని. అది కూడా ఉదయం ఆరున్నరకే. మధ్యలో బీహెచ్ఇఎల్ కర్మాగారంలో పనిచేస్తున్న నరసింహారెడ్డి (కమ్మర్షియల్ సీనియర్ ఇంజినీర్) కలిసేవాడు. మా స్కూల్ లైబ్రరీ పేపర్లను నేను ఇంట్లో వేయించుకుని రోజూ తీసుకెళ్లేవాడిని. బస్సులో అంతా చదివేవారు. దిగేటప్పుడు అవి తీసుకునేవాడిని.

         బాకారంలో వుంటున్నప్పుడు మరిచిపోలేని ఒకటి-రెండు సంఘటనలు ఇప్పటికీ ఇంకా గుర్తున్నాయి. అందులో ఒకటి ప్రతిరోజూ ఉదయమే పాలు పోసేవాడి ధాష్టీకం. అప్పట్లో ఇప్పటిలాగా ఎప్పుడు పడితే అప్పుడు పాలు దొరక్క పోయేవి. పాలు కొనాలంటే ఒకటి-రెండే మార్గాలు. ఇంటి ముందర కొచ్చి మన కళ్ళ ముందు బర్రె పాలు పితికి పోయడం, లేదా, వాడి ఇంట్లో పితికి తెచ్చి మనకు మన ఇంట్లో పోయడం. ఇది ప్రయివేట్ వ్యవహారం. సర్కారు వారు పాల సీసాలు అమ్మేవారు. నాకు గుర్తున్నంతవరకు సీసా ఖరీదు పావలా (రూపాయిలో నాలుగో వంతు). నెలకు సీసాకు ఇంత అని మనకు ఎన్ని సీసాలు కావాల్నో అన్నింటికి ముందస్తుగానే డబ్బులు కట్టించుకుని కార్డు ఇచ్చేవారు. అప్పట్లో మా జీతం నెలకు సుమారు రు. 300. ముందస్తుగా కట్టలేక ఏరోజుకారోజు క్యూలో నిలబడి డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళం. దురదృష్టం ఏమిటో గాని క్యూలో నిలబడ్డ మా వంతు వచ్చేసరికి సీసాలు అయిపోయాయని అనేవారు. ఇంట్లో పిల్లలు ముగ్గురూ అప్పటికి పాలు తాగే వయసు వాళ్లే. ఇలా కాదనుకుని ఒకడిని ప్రతిరోజూ పాలుపోయడానికి కుదిరించుకున్నాం.

         అలా కుదిరించు కోవడానికి కారణం, డబ్బులు ఇవ్వడానికి ఒక నెల ఆలశ్యం అయినా పాలవాడు సర్దుకు పోతాడని. కాని మేం అనుకున్నట్లు జరగలేదు. పాలవాడు ఒక నెల డబ్బులు ఇవ్వక పోయేసరికి ఇవ్వమని డిమాండ్ చేయకుండా, పాలల్లో నీళ్లు కలిపి పోయడం మొదలు పెట్టాడు. కోప్పడితే, వెంటనే పాత బాకీ కట్టమన్నాడు. కట్టడానికి డబ్బుల్లేక, వాడు ఎలా పోస్తే అలాగే పోయమన్నాం గత్యంతరం లేక. పాలవాడు మమ్మల్ని బెదిరించిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ సంఘటన ఒక జ్ఞాపకం.


         మరో మరవలేని సంఘటన మా అబ్బాయి ఆదిత్యను ఆసుపత్రిలో చేర్పించడం. వాడికప్పుడు బహుశా రెండేళ్ళు ఇంకా నిండలేదనుకుంటా. హటాత్తుగా వాడికి విరోచనాలు విపరీతంగా కావడం మొదలయ్యాయి. వెంటనే మా ఆవిడ అన్నయ్య డాక్టర్ మనోహర్ రావును సంప్రదించాం. ఆయన ఇచ్చిన మందులకు వెంటనే నయం కాలేదు. ఆయన సలహామీద నారాయణగూడాలో వున్న స్నేహితుడు డాక్టర్ చారి ఆసుపత్రిలో చేర్పించాం. ఒక రాత్రి వుంచినా ఫలితం లేకపోయింది. విరోచనాలు ఆగలేదు. మర్నాడు మనోహర్ సలహా మీద నిలోఫర్ ఆసుపత్రికి మార్పించాం. అక్కడ మనోహర్ స్నేహితుడు డాక్టర్ సురేష్ పనిచేస్తున్నాడు. తక్షణమే చికిత్స మొదలెట్టారు. ఎంతకూ మందులకు తగ్గకపోతే సెలైన్ ఎక్కించడానికి ప్రయత్నం చేస్తే నరం దొరకలేదు. అప్పటికే డీహైడ్రేషన్ మొదలైంది. వెంటనే కాలు కింద చిన్నగా కోసి, నరం బయటకు తీసి సెలైన్ ఎక్కించారు. మొత్తం మీద ఒకటి-రెండు రోజుల్లో తగ్గిపోయింది.

         అప్పట్లో చికిత్స చేయించడానికి మా దగ్గర కావాల్సినంత డబ్బు కూడా లేదు. మనోహర్ రావు, భండారు రామచంద్ర రావు, ఆయన సతీమణి విమల, భండారు శ్రీనివాసరావు, ఆయన సతీమణి నిర్మల, తదితరులు చాలా సహాయం చేసారు. చాలా సార్లు ఆసుపత్రికి వచ్చారు. ధైర్యం చెప్పారు.

         బాకారంలో ఉన్నప్పుడే ఇందిరాగాంధీ విధించిన 1975 నాటి ఎమర్జెన్సీ ఎత్తివేయడం, 1977 లో పార్లమెంటుకు ఎన్నికలు జరగడం, ఇందిరాగాంధీ ఓడిపోవడం, ఆమె ఓటమిని తెల్లవారు ఝాముదాకా చెప్పకపోవడం, దరిమిలా జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడం, మొరార్జీ దేశాయ్ ప్రధాని కావడం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. మొరార్జీ ప్రధానిగా ఉన్నప్పుడే ఇందిరాగాంధీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని మరోమారు చీల్చి, ఇందిరా కాంగ్రెస్ (భారత జాతీయ కాంగ్రెస్-ఐ) స్థాపించడం, తనదే అసలు సిసలైన కాంగ్రెస్ అని ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్-ఐ పార్టీకి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సారధ్యంలో శాసనసభ ఎన్నికలు జరగడం, ఆయన గెలవడం, 1978 లో రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం జరిగింది. భండారు పర్వతాలరావు సీఎం పీఆర్వో అయ్యారు.  

         మేము, మా ఆవిడ కజిన్  అయితరాజు జగన్మోహన్ రావు కలసి చిక్కడపల్లిలో మా మామయ్య ఇంటి ఎదురుగా రాములమ్మ ఇంట్లో పై పోర్షన్ అద్దెకు తీసుకున్నాం. అలా మరో అద్దె ఇంటికి మారాం. చిక్కడపల్లిలో ఆ ఇల్లు వెంకటేశ్వర స్వామి గుడికి అతి సమీపంలో వుంది.

         బాకారంలో వుండగా సురభి స్కూల్లో చదువుకున్న మా బుంటి, కిన్నెర దరిమిలా హిమాయత్ నగర్లోని సెయింట్ యాంథనీ స్కూలుకు మారారు ప్రాధమిక విద్యకోసం. 

Monday, November 25, 2019

ఇందిరాగాంధి పాలన నాటి ఎమర్జెన్సీ విధింపు ..... జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-13 : వనం జ్వాలా నరసింహారావు


ఇందిరాగాంధి పాలన నాటి ఎమర్జెన్సీ విధింపు 
జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-13
వనం జ్వాలా నరసింహారావు
           మేం ఇంకా జూపూడి ప్రసాద్ (నరసింహారావు గారి) ఇంట్లో వుండగానే, 27 సంవత్సరాల సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక చీకటి అద్యాయానికి తెర లేచింది. ఆరోజులు ఇంకా చాలా స్పష్టంగా నాకు జ్ఞాపకం వున్నాయి. అప్పటి సంగతులు ఎప్పటికప్పుడు గుర్తుకు వస్తూనే వుంటాయి. 1975 జూన్‌ 26న (25వ తేదీ అర్ధరాత్రి) అలనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేసిన సిఫార్సుతో, అప్పటి రాష్త్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటింఛారు. 1977లో తిరిగి ఎన్నికలు జరిగే వరకూ, 21 నెలలపాటు ఎమర్జెన్సీ పాలన కొనసాగింది.

ఎమర్జెన్సీ విధింపు నేపధ్యంలో, రాయబరేలిలో గెలుపుకోసం ఇందిర అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కాబట్టి ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె చేతిలో ఓడిపోయిన అభ్యర్థి రాజ్‌ నారాయణ్‌ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖల్ చేశారు. ప్రధాని ఇందిరా గాంధీ లోక్ సభకు ఎన్నిక చెల్లదని, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్ మోహన్ లాల్ సిన్హా జూన్ 12, 1975 న చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఇందిర అనర్హురాలిగా న్యాయస్థానం ప్రకటించింది. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, యావత్ పాలనా యంత్రాగాన్ని తన గుప్పిట్లో పెట్టుకునే దిశగా అడుగులు వేసింది ఇందిరాగాంధి. యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బంధించే ప్రక్రియకు నాంది పలికింది. అలనాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆమె అనుంగు సహచరుడు సిద్ధార్థ శంకర రే సలహా మేరకు దేశ సమగ్రత-సమైక్యతలు ముప్పు వాటిల్లనున్నదన్న కారణం చూపుతూ, జూన్ 25, 1975 అర్థరాత్రి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇందిరా గాంధీ.

వాస్తవానికి 1971లో పాకిస్తాన్‍తో యుద్ధాన్ని బూచిగా చూపి, విధించిన ఎమర్జెన్సీని రద్దుచేయకుండానే, దేశానికి ఆంతరంగికంగా ముప్పు ఏర్పడిందంటూ 352 ఆర్టికల్‌ కింద తిరిగి ఇందిరాగాంధి ఎమర్జన్సీని ప్రకటించింది. దీనిపై కోర్టుకు వెళ్లటానికి వీలులేకుండా రాజ్యాంగానికి 39వ సవరణ తెచ్చింది. అసాధారణ అధికారాలను చేజిక్కించుకుని, పౌర హక్కులను కాల రాసింది. అంతర్గత భధ్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపింది ఇందిరా గాంధీ. అలహాబాద్‌ హైకోర్టు తీర్పుతో నియంతగా మారిన ఇందిరా గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థనే ఖూనీ చేస్తూ పలువురు ప్రజాస్వామ్య వాదులు ముందే హెచ్చరించినట్లుగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

అలహాబాద్‌ హైకోర్టు తీర్పు, జూన్‌ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును దృష్టిలో పెట్టుకుని ఇందిరాగాంధీ కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలోను, ముఖ్యమంత్రి వెంగళరావు పాలనలోని అలనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍లోను ఎమర్జెన్సీ దురాగతాలు పెద్దఎత్తున చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేశారు. పోలీసు నిఘా విభాగాన్ని తమ గుత్త సంస్థగా మార్చేశారు. దేశ వ్యాపితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరితో సహా, జయప్రకాష్‌ నారాయణ, మొరార్జీ దేశాయ్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు వేలాది మంది పేర్లతో జాబితాలు తయారు చేసి విచ్చలవిడిగా అరెస్టులు చేయసాగారు.

పలువురు ముఖ్య నాయకులు అజ్ఞాతంలో ఉండి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్‌ 25న అర్థరాత్రి విధించిన ఎమర్జెన్సీ వార్త ప్రముఖ పత్రికలలో రాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం విద్యుత్ సరఫరా ఆపుచేసే చర్యలకు పూనుకుందని ఆరోపణలొచ్చాయి. సంబంధిత అధికారులకు అలాంటి ఆదేశాలు అందాయని 'షా' కమీషన్‌ ముందు తరువాత సాక్ష్యాలిచ్చిన వారున్నారు.  క్రమంగా అన్ని పత్రికా వార్తలపైనా సెన్సారు వచ్చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ రాయటానికి వీలులేదు. మీసా వంటి చట్టాలను కాంగ్రెస్‌ అధిష్టానం యథేచ్ఛగా తమ కనుకూలంగా వాడుకుంది.

భారత రాజ్యాంగం హమీ ఇచ్చిన వ్యక్తి స్వాతంత్య్రాన్ని ఇందిరా కాంగ్రెస్‌ నిలువునా కాలరాచింది. ప్రముఖ నాయకుల ఫోన్‌లను ట్యాప్‌ చేయించింది. ప్రభుత్వంలో ఏ హోదాలేని ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడు. ఢిల్లీ నగరంలోని తుర్కమన్‌గేటు, ఇతర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న మురికివాడలను బుల్డోజర్లు పెట్టి కూల్చివేశారు. అలాగే పేదవాళ్లు ఎక్కువగా పిల్లలను కనడం వల్లనే దేశానికి సమస్యలొస్తున్నాయని చెప్పి మురికివాడలలో నిర్బంధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు.


దేశవ్యాప్తంగా అరెస్టయిన వారిలో, కాంగ్రెస్ పార్టీలో ఆమెను బలంగా వ్యతిరేకించిన ఒకరిద్దరితో సహా, సీపీఎం, జనసంఘ్, సంస్థాగత కాంగ్రెస్, ఇతర కాంగ్రేసేతర రాజకీయ నాయకులను చాలామందిని అరెస్ట్ చేయించింది. విమర్శలను లెక్క చేయని ఇందిర రాజ్యాంగాన్ని తిరగ రాసి, తనకు వ్యతిరేకంగా వచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పునుంచి ఊరట పొందింది. విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది. దేశ సమైక్యతకు-సమగ్రతకు ముప్పు వాటిల్లిందని, రోగికి చేదు మందిచ్చి బ్రతికించిన విధంగానే, అత్యవసర పరిస్థితి విధింపు తాత్కాలికమే అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆర్థిక, రాజకీయ సుస్థిరత కొరకు, జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. విదేశీ బూచిని చూపించడం పదే పదే చేయసాగింది. మీడియాపై మరిన్ని ఆంక్షలు విధించింది.

ఈ నేపధ్యంలో, దేశవ్యాప్తంగా అరెస్టయిన వారి సరసన ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, స్వర్గీయ డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిని చేర్చారు. అలనాటి కేంద్ర హోం మంత్రి స్వర్గీయ కాసు బ్రహ్మానంద రెడ్డి దృష్టిలో, లిస్టులో లేకపోయినా, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రోద్బలంతో డాక్టర్‍గారిని నిర్బంధంలోకి తీసుకుంది ప్రభుత్వం. డాక్టర్ రాధాకృష్ణమూర్తిని అరెస్ట్ చేసి, వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. ఆయనతో పాటు చిర్రావూరి లక్ష్మీనరసయ్య, బోడేపూడి వెంకటేశ్వరరావు, మంచికంటి రాంకిషన్‍రావు లను అరెస్ట్ చేసింది ప్రభుత్వం.

హఠాత్తుగా, జనవరి 1977 లో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరా గాంధీ. ప్రజలపై, ప్రజా శక్తిపై తనకు అపారమైన విశ్వాసం వుందని, మార్చ్ నెలలో ప్రజల నిర్ణయం కొరకు ఎన్నికలు జరుగుతాయని అన్నది. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. ఎమర్జెన్సీ దురాగతాలను ఎదుర్కోవాలని జైలు నుంచే జయప్రకాష్‌నారాయణ 'సంపూర్ణ విప్లవం' అంటూ ఇచ్చిన పిలుపు... దేశ రాజకీయాల దిశను మార్చివేసింది. అప్పటి వరకు చిన్న చిన్న పార్టీలుగా ఉన్న అనేక పార్టీలన్నీ ఒకే గొడుగుక్రిందకు వచ్చి జనతాపార్టీగా ఏర్పడ్డాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆమె అనుంగు సహచరుడు జగ్జీవన్ రామ్ కూడా బాంబు పేల్చాడు. ప్రతి పక్షాల సరసన చేరాడు.

లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. వామపక్షాల మద్దతు కూడా లభించింది. కాంగ్రెస్‍లోని యంగ్ టర్క్స్ కూడా వారితో జత కట్టారు. నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పాలని, మకుటంలేని మహారాణిని ఓడించాలని జనతా పార్టీ ఎన్నికల్లో పిలుపిచ్చింది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా, జనతా పార్టీ ఓటర్ల ముందుకు పోయింది. మార్చ్ 20, 1977 న జరిగిన లోక సభ ఎన్నికలలో ఇందిరా గాంధీని ఆమె నియోజక వర్గంలోను, ఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు ఓటర్లు. కలగాపులగం లాంటి కాంగ్రేసేతర పార్టీల కలయికతో ఏర్పడిన జనతా ప్రభుత్వానికి, ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో ఉప ప్రధాన మంత్రిగా చేసి, ఆ తర్వాత రెండేళ్లు ఆమెచే జైల్లో నిర్బంధించబడిన మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా సారధ్యం వహించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తానని, ప్రజల సేవలోనే గడుపుతానని అంటూ పదవికి రాజీనామా చేసింది ఇందిరా గాంధీ.

అప్పట్లో వార్తలు వినాలంటే రేడియో తప్ప వేరే ఆధారం లేదు. అప్పటికే మా స్నేహితుడు, బంధువు భండారు శ్రీనివాస రావు రేడియోలో పనిచేస్తున్నాడు. దూరదర్శన్ వచ్చినప్పటికీ ప్రజాబాహుళ్యానికి ఇంకా అందుబాటులోకి రాలేదు. మేం ఇందిరాగాంధీ ఓటమి పాలైనప్పుడు, ఆ ఎన్నికల ఫలితాన్ని తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో (అప్పట్లో బాకారంలో ఒక ఇంట్లో వుంటున్నాం) విన్నాం. అలా ఒక అధ్యాయం ముగిసింది భారత దేశ చరిత్రలో!

Sunday, November 24, 2019

అశోక్ నగర్ పర్చా కిషన్ రావు గారింట్లో : వనం జ్వాలా నరసింహారావు


అశోక్ నగర్ పర్చా కిషన్ రావు గారింట్లో
జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-13

వనం జ్వాలా నరసింహారావు 
మా పెద్ద అమ్మాయి బుంటి-ప్రేమ మాలిని, మా ఆవిడ చిన్నన్నయ్య డాక్టర్ మనోహర్ రావు వరంగల్ మెడికల్ కాలేజీలో మెడికోగా వున్నప్పుడు, వరంగల్ లో పుట్టింది. మా రెండో కూతురు కిన్నెర భద్రాచలం ఆసుపత్రిలో మా ఆవిడ పెద్దన్నయ్య డాక్టర్ రంగారావు మెడికల్ ఆఫీసర్ గా వున్నప్పుడు అక్కడ పుట్టింది. ఇలా వాళ్లిద్దరూ మా ఆవిడ పుట్టింటికి సంబంధించిన వారి పర్యవేక్షణలో, పుట్టింటి వారి (ఆసుపత్రి, తదితర) ఖర్చుతో పుట్టారు. మూడో కాన్పు పుట్టింటి వారి ఖర్చుతో కాకూడదని మా నాన్న, అమ్మ చెప్పడం వల్ల మూడో డెలివరీ ఖమ్మంలో అత్తింటి వారి పర్యవేక్షణలో జరగాలని నిర్ణయించాం. హైదరాబాద్ లో వుంటున్న మా ఆవిడ డెలివరీకి రెండు నెలల ముందు ఖమ్మం వెళ్లింది. వెళ్లి (అత్తగారి ఇంట్లో) మా ఇంట్లోనే మా అమ్మ దగ్గర వుంది. ఆలనా-పాలనా అంతా మా అమ్మే. డిసెంబర్ 24 మధ్యాహ్నం సమయంలో కొత్తగా పెట్టిన డాక్టర్ దంపతులు ఆంధ్రజ్యోతి-వైవీ రామారావు ఆసుపత్రిలో మా ఆవిడను అడ్మిట్ చేయడం, ఆ సాయింత్రమే నార్మల్ డెలివరీ అయ్యి ఆదిత్య పుట్టడం జరిగింది. మా ఇంటికి అతి సమీపంలోనే వున్న ఆసుపత్రి అది. ఆదిత్య పుట్టిన వార్తను మా నాన్న గారు ఇంట్లోనే వున్న అందరికీ తెలియ చేశాడు.

         యధావిధిగా గతంలో మా ఇద్దరు అమ్మాయిలకు చేసినట్లుగానే 21 వ రోజు బారసాల, నామకరణం తదిర కార్యక్రమాలు జరిపించారు మా అమ్మానాన్నలు. అబ్బాయి పేరు ఆదిత్య కృష్ణ రాయ్ అని పెట్టాం. బారసాల తరువాత నేను మామూలుగా ఉద్యోగంలో చేరడానికి హైదరాబాద్, మా ఆవిడ తల్లిగారి వూరు వల్లభికి పోవడం జరిగింది. అక్కడే మూడో నెల వచ్చిందాకా వున్నది. మధ్యమధ్యన నేను ఖమ్మం, వల్లభి వెళ్లి వస్తుండేవాడిని. అలా ఒక పర్యాయం వచ్చినప్పుడు బాణాపురం గ్రామ సర్పంచ్ గండ్లూరి కిషన్ రావును వనం నర్సింగరావుతో వెళ్లి కలియడం, ఆ రాత్రే ఆయన సెకండ్ షో సినిమా నుండి స్నేహితులతో ఇంటికి వస్తుండగా దారుణంగా హత్యకు (నాకు గుర్తున్నంత వరకు ఫిబ్రవరి 7, 1976) గురికావడం జరిగింది. ఖమ్మం సమితి గ్రామాల్లో కాంగ్రెస్-కమ్యూనిస్ట్ గొడవల్లో భాగంగా జరుగుతున్న హత్యల పరంపరలో ఆయనది కూడా ఒకటి. మూడో నెల ప్రవేశించడంతో ఆ ఆవిడ ముగ్గురు పిల్లలతో సహా హైదరాబాద్ చేరుకుంది. ఎప్పటిలాగే సంసారం సాగింది.

         ఇంతలో మా తోడల్లుడి తండ్రి జూపూడి నరసింహారావు గారు, నేను ఖమ్మలో ఉన్నప్పుడే ఒకరోజున నన్ను పిలిచి వారి ఇల్లు ఖాళీ చేయమని చెప్పాడు. మరో ఇల్లు వెతుక్కుంటూ వుంటే, అశోక్ నగర్ హనుమాన్ దేవాలయం దగ్గరలో వున్న పర్చా కిషన్ రావు గారి ఇంట్లో ఒక పోర్షన్ (మూడు చిన్న గదులు) దొరకడం, అందులో చేరడం చకచకా జరిగిపోయింది. మా ఇంటి పక్కనే, మా కాంపౌండు గోడకు ఆనుకునే స్వర్గీయ సి నారాయణ రెడ్డిగారు వుండేవారు. వారి నలుగురు ఆడపిల్లలు, గంగ, యమున, సరస్వతి, కృష్ణలు మా ఇంటికి రావడం మా పిల్లలతో సరదాగా గడపడం నాకింకా గుర్తు.


         ఆ రోజుల్లో మమ్మల్ని బాగా ఇబ్బందికి గురిచేసిన అంశం మా ఆబ్బాయి ఆదిత్యకు వచ్చిన “స్కిన్ ఎగ్జిమా” సమస్య. వాడి వళ్ళంతా చాలా చీకాకు కలిగించే విధంగా ఆ సమస్య వుండేది. మా ఆవిడ అన్న గారు (చిన్న పిల్లల) డాక్టర్ మనోహర్ రావు ఆ రోజుల్లో మా కుటుంబానికి చాలా అండగా వుండేవాడు. నేనేమో ఉదయం ఆరున్నరకే బీహెచ్ఇఎల్ స్కూల్ ఉద్యోగానికి పోవాల్సి వచ్చేది. మళ్లీ సాయంత్రం ఏడున్నర దాకా రావడం కుదరక పోయేది. ఆదిత్యను చర్మ వైద్య నిపుణుల దగ్గరకు తీసుకుపోవడానికి మనోహర్ రావు చాల సహాయపడేవాడు. ఏ మందు ఎలా వాడినా సమస్య తీరకపోయేది. ఎవరికి చూపించినా పెద్దయితేనే కాని (మూడు-నాలుగేళ్లు వయసు) తగ్గదని చెప్పేవారు. అలోపతి కాకుండా హోమియో వైద్యం కూడా చేయించాం. అయినా ఫలితం లేదు. ఎవరింటికీ పండుగలకు కాని, ఫంక్షన్లకు కాని వాడిని తీసుకు పోయేవాళ్లం కాదు. చివరకు వాడికి మూడేళ్లు వచ్చిన తరువాత, హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో చేర్పించిన తరువాత గాని అది తగ్గలేదు.

         మేం పర్చా కిషన్ రావు గారింట్లో వున్నప్పుడే అనుకోకుండా డైనింగ్ టేబుల్ కొనుక్కోవడం జరిగింది. అదే మా డబ్బుతో కొన్న మా మొట్టమొదటి, చివరి టేబుల్. అది, దాంతో పాటు కొన్న కుర్చీలు మా ఇంట్లో దాదాపు ఇరవై సంవత్సరాలు మాకు సర్వీసు చేసింది. రోజ్వుడ్ కలర్ టేబుల్ అది. చాలా ముచ్చటగా వుండేది.

ఇంతకూ ఆ టేబుల్ కొనడం, కొనగలగడం వెనక ఒక కథ వుంది. నేను ఖమ్మంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు నా జీతానికి అదనంగా ఆదాయం వుంటే బాగుంటుందని అనిపించి మా ఆవిడ పేరుమీద జీవిత భీమా కంపెనీ ఏజంటుగా నమోదు చేయించాం. మొదటి సంవత్సరమే మా తోడల్లుడు జూపూడి ప్రసాద్ పేరుమీద లక్ష రూపాయలకు ఇన్సూరెన్స్ చేయిస్తే భారీగా ఏజంట్ కమీషన్ లభించింది. అలా నేను ఖమ్మంలో ఉద్యోగం చేసినన్ని రోజులు, హైదరాబాద్ వచ్చిన తరువాత కూడా కొన్నాళ్లు ఇన్సూరెన్స్ ఏజన్సీ వుండేది మా ఆవిడకు. ఏజంట్ కమీషన్ గా మొదటి సంవత్సరం భీమా చేసిన వ్యక్తి కట్టే ప్రీమియంలో 25%, రెండు, మూడు సంవత్సరాలలో 15%, ఆ ఆతరువాత తగ్గుకుంటూ పోతుంది. పాలసీ లైవ్ లో వున్నంతకాలం కమీషన్ వస్తూనే వుంటుంది. మేము ఏజన్సీ వదిలిన తరువాత కూడా అలా కట్టిన వారి నుండి కొంత కమీషన్ లభించేది.

అనుకోకుండా 1976 జూన్-జులై నెలల్లో రు. 600 కమీషన్ చెక్ వచ్చింది. అది నా చేతికి వచ్చిన సమయంలో మా ఆవిడ మేనమామ, ఎస్బీఐ సీనియర్ అధికారి భండారు రామచంద్ర రావు గారు మాదగ్గరే వున్నారు. ఆయన దాన్ని వెంటనే తీసుకుని చెక్ కలెక్షన్ కు పోకుండానే తన అకౌంట్లో వేసుకుని, పైకం ఇచ్చాడు. దానివల్ల ఆయనకుఇబ్బంది అయింది కూడా. ఆ డబ్బుతో ఒక డైనింగ్ టేబుల్, మూడు కుర్చీలు కొన్నాం. నాలుగో కుర్చీకి డబ్బులు చాల లేదు. అప్పట్లో అదే పరిస్థితి మా అందరిదీ కూడా. నాలుగో కుర్చీ (బహుశా అప్పట్లో ఇరవై రూపాయలు అనుకుంటా!) తరువాత కొన్నాం. టీబీ ఆసుపత్రిలో పనిచేసిన చంద్రయ్యకు 1995 లో ఆ డైనింగ్ టేబుల్ సెట్ ఇచ్చాం.

Saturday, November 23, 2019

స్వర్గం మీద కాని, అయోధ్య మీద కాని మనసు పోని రాముడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-5 : వనం జ్వాలా నరసింహారావు


స్వర్గం మీద కాని, అయోధ్య మీద కాని మనసు పోని రాముడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-5
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (24-11-2019)
లక్ష్మణుడితో తన సంభాషణ కొనసాగిస్తూ శ్రీరాముడు ఇలా అంటాడు.
"నానా రకాల రంగులు కల పూలు, అంతటా రాలి మనోహరంగా, బంగారపు ఎరుపు, తెలుపు కలిగి, పరచిన పరుపులాగా ప్రకాశిస్తున్నాయి లక్ష్మణా చూశావా? లక్ష్మణా! ఈ వసంత సమయంలో చెట్ల సమూహాలలో ఎంత విస్తారంగా పూలున్నాయో చూశావా? అన్నా! ఏ పక్క చూసినా పూలు, కొమ్మల కొనల్లో బసకలిగి వున్నాయి. ఈ వృక్షాలు ఒకదానిలాగా మరొకటి పూయాలని, పోటీపడి, చక్కగా పూచి, తుమ్మెదల ఝంకారాల నెపంతో ఒకదానిని ఇంకొకటి అదే తక్కువ పూచిందని, తాను ఎక్కువగా పూసానని పరిహాసం ఆడింది. ఈ నీటికోడి తన భార్యతో నీళ్లలో మునిగి స్నానం చేసి నాకు మదన తాపం కలిగేట్లు రతికేళిలో నిమగ్నమైంది. గంగానదికి, ఈ పంపానది అందం లభించినందువల్లే కదా, మనోహర గుణాలతో లోకంలో ప్రసిద్ధికెక్కింది. నా భార్యను నేను కళ్లారా చూస్తూ నిండుమనస్సుతో వుండగలిగితే, నాకు స్వర్గం మీద కాని, అయోధ్య మీద కాని మనసుపోదు. స్వర్గం, వైకుంఠం మాట అలా వుండనియ్యి...సీతను చూస్తూ, మిసమిస మెరిసే ఈ పచ్చిక బయళ్లలో మనం వుండగలిగితే, పొద్దుపోవడానికి కూడా మిగతా విషయాల జోలికి ఎందుకు పోతాను? మనం ముగ్గురం తప్ప వేరే ఆలోచనే రాదు”.

"తమ్ముడా, లక్ష్మణా! చిగుళ్లతో, మొగ్గలతో, పూలతో, అందమైన ఆకులతో కాంతివంతంగా ప్రకాశిస్తూ, ఈ చెట్లున్న అడవుల కాంతితో నాకు పిచ్చెక్కుతున్నది. చక్రవాకాలు, బెగ్గురులు, నీటికోళ్లు, క్రౌంచాలు, కూసే పక్షులు, అనేక రకాల జింకలు, పందులు, మితిమీరి వున్నాయి. ఈ పంపానదిని చూశావా? యువతీరత్నం, చంద్రముఖి, కమలలోచన అయిన సీతాదేవిని, సంతోషంతో కూడిన పక్షి సమూహాలు నాకు స్మృతికి తెచ్చి మితిమీరిన కామాన్ని నాకు కలిగిస్తున్నాయి. ఆడ జింకలతో కలిసి చరియల్లో తిరిగే మగ జింకలను చూడు. ఆడ జింక కళ్లలాంటి కళ్లుకల సీతను విడిచి వున్న నన్ను చూడు. అవెంత సంతోషంగా వున్నాయో, నేనెలా ఏడుస్తున్నానో చూడు. మదించిన పక్షి గుంపులు పర్వతాలలోని బయళ్లలో కామంతో సంతోషంగా తిరుగుతుంటే ఇక్కడ నేను తత్తరపాటుగా వుండడాన్ని ఏమని చెప్పాలి? సీతాదేవితో కూడి ఈ మనోహరమైన వనంలో కామం చక్కబడే విధంగా ఇతర విచారం లేకుండా తిరిగినప్పుడు కదా నా మన్స్సు చక్కబడుతుంది. పావన పంపానదీ జలాలను, పిల్ల గాలులను, నేను పావని అయిన సీతాదేవితో కలిసి సేవిస్తేనే కదా నా దేహంలో ప్రాణాలు నిలుస్తాయి. అలా కాకపోతే నాకు క్షేమం కలదా? కమలాలతో, కలువలతో, పరిమళాలు కలదిగా చేయబడ్ద పంపా సమీపంలోని అడవుల గాలిని అలసట మాని సేవించగలవారే ఎంతో ధన్యులు”.

"ఆ కమలాక్షి, ఆ సుందరి, నిండు చంద్రుడిని పోలిన మోము కలది, వియోగం కలిగినందున, ఏ విధంగా ధైర్యంతో ప్రాణాలు నిలుపుకోగలదు? దానికొరకై నేను దుఃఖిస్తాను. వియోగం ఎలాగైనా సహించవచ్చు. అవమానం ఎలా సహించాలి? ఏం అవమానం వచ్చిందంటావా? సీతాదేవి తండ్రి జనక రాజు పాపరహితుడు. యదార్థం చెప్పుతాడు. గొప్ప పూజ్యమైన మనసున్నవాడు. ధర్మం అంటే ఆసక్తికల ఆచారం కలవాడు. ఇలాంటివాడు, నేను మళ్లీ తిరిగి అయోధ్యకు పోయిన తరువాత, ’అల్లుడా, నా కూతురు క్షేమంగా వుందా?’ అని కుశల ప్రశ్న వేస్తే, నేనేమని జవాబివ్వాలి? ’నీ కూతురును ఎవడో ఎత్తుకుని పోయాడు’ అని చెప్పాల్నా? ఇంతకంటే అవమానమైన మాట ఇంకోటి లేదుకదా? నన్ను కడుపార కన్న తండ్రే నా మీద ప్రేమ వదిలి, ’రామా! నువ్వు అడవుల పాలై పో’ అని చెప్పగా, సీతాదేవి భర్త వెంట భార్య అనే న్యాయాన్ని అనుసరించి నా వెంట వచ్చింది. దానివెంట నేను పోలేదు కదా? నేనేమి మగడిని? ఏమి కృతజ్ఞుడిని? ఎక్కడ, ఏ గతి పట్టిందో?”

"లక్ష్మణా! రాజునన్న పేరే కాని నాకు రాజ్యం లేదు. నా లాగా సంతోషహీనులై ఏడ్చేవారు ఎందరుంటారు? నవ్వుకుంటో, ఏడ్చుకుంటో ఏదో తిని కొంపలో పడి వుందామంటే, దరిద్రుల్లో శ్రేష్టుడనైతిని. ఇలాంటి నావెంట తన పుట్టింటికీ, బంధువుల ఇంటికీ కాకుండా, నాతో పాటు అడవులకు నన్ను వదలకుండా వచ్చిన ఆడపడుచును వదిలిన నేను దేన్ని చూసి ప్రాణాలు నిలుపుకోవాలి? లక్ష్మణా! సీతాదేవి ఘుమ-ఘుమ కమ్మటి వాసనలు వెదజల్లే అద్దంలాంటి ముఖాన్ని చూడగలనా? చెవులకింపుగా సమానమైన చిరునవ్వుతో కూడిన హాస్యపు మాటలను నేను వినగలనా? తనకు మనసులో బాధ వున్నప్పటికీ, ఏమీ లేనిదానిలాగా నా మదన తాపం చల్లారేట్లు పలుకగా జీవించగలనా? మెల్లటి నడకగల సీతాదేవిని కూడి సంతోషంగా హృదయంతో జీవించగలనా? తమ్ముడా! నేనేం చేయాలిరా ఇప్పుడు? అయోధ్యకు పోగానే కల్లాకపటం తెలియని మృధుస్వభావి మా తల్లి కౌసల్య ఎదురుగా వచ్చి, కుమారా! నా కోడలేదిరా? అని అడిగితే ఏమని జవాబు చెప్పాలి? లక్ష్మణా! నువ్వు అయోధ్యకు వెళ్లిపో. నాగతి ఏమిటంటావా? సీతను విడిచి నేను బతకలేను. ఒక్క బాధే అయితే ఎలాగైనా సహించవచ్చు. సీత నా సుఖానికి కారణమైంది. తన సుఖం లెక్కపెట్టకుండా నా సుఖం కొరకు నావెంట నన్ను నమ్మి అడవులకు వచ్చింది. అలాంటి దాన్ని విడిచి నేనెలా బతుకుతాను? సీతాపతి, సీతా భర్త, సీతా ప్రియుడు, సీతా మనోహరుడు, సీతా ప్రాణేశుడు అని ఎవరైనా అంటే, వాళ్ల ముఖం నేనెలా చూస్తాను? మొండి బతుకు బతికి అయోధ్యకు వచ్చాననుకో....మామగారికి ఏమని చెప్పాలి? కన్న తల్లికి ఏమని చెప్పాలి? వాళ్లు వద్దని వారించినా మగవాడిలాగా సీతను తీసుకుపోయానే? ఇప్పుడు వాళ్లేమంటారు? కామానికి ఏడ్వాలా? నా అనాథ తత్వానికి ఏడ్వాలా? అవమానానికి ఏడ్వాలా? దేనికని ఏడ్వాలి? కాబట్టి ఇన్ని దుఃఖాలతో ఈ శరీరం నిలవదు. నువ్వు అయోధ్యకు పోయి భరతుడి దగ్గర చేరు. ఆయన కైక కొడుకైనా నువ్వంటే ప్రేమకలవాడు. నిన్ను అలక్ష్యం చేయడు. వెళ్లు".


ఇలా రామచంద్రమూర్తి, ఎంతో సమర్థుడైనప్పటికీ, బేలవలె ఏడుస్తూ వుండడం చూసిన లక్ష్మణుడు సమాయనుకూలమైన నీతితో కూడిన హితబోధ చేసి సంతాపాన్ని ఉపశమింప చేద్దామని ఇలా అన్నాడు.

"అన్నా! ధైర్యం తెచ్చుకో. నీలాంటి ధీరుడు ఆపద్దశలో ఇలా దుఃఖించవచ్చునా? ఏడ్వ వచ్చునా? అన్నా, నా మనవి దయచేసి ఆలకించు. ఈ లోకంలో తనకు ఇష్టమైన వారు వదిలిపోతే తీవ్ర దుఃఖం కలుగుతుంది. ఇది లోక ధర్మమని నీ మనసుకు తెచ్చుకో. తెచ్చుకుని ఏం చేయాలంటావా? ఎవ్వరిమీదా, ఏ బంధువుల మీదా స్నేహభావం వుంచుకోవద్దు. అన్ని దుఃఖాలకు స్నేహభావమే కారణం. నీళ్లలో నానిన వత్తి కూడా చమురుతో స్నేహభావం వల్ల మండుతున్నది కదా? నీళ్లలో నానితే మండదు కాని చమురుతో నానితే మండుతుంది. వత్తిని కాల్చేది స్నేహమే కదా? అందుకే స్నేహం వదులుకో. అటైన సీత పోయిన పోనీలే అని వూరుకుందామా అని అంటావేమో? సీతను పోగొట్టుకుని వూరికే వుండమని నేననడంలేదు. ముందు మనం సీత ఎక్కడున్నదా అనే విషయం తెలుసుకోవాలి. దానికై మనం కృషి చేయాలి. ఆమె వునికి స్థానం మనకు తెలిస్తే, మనం చంపుతామని భయపడి, ఆమెను అపహరించినవాడు తనంతట తానే సీతను తెచ్చి నీకు సమర్పిస్తాడు. అలాకాకపోతే, వారెవరైనా సరే, జానకితో పాతాళలోకంలో దూరినా, ఇంద్రుడి తల్లి కడుపులో దాగినా వాడిని చీల్చి చెండాడుతాను. నువ్వు శ్రమించాల్సిన అవసరం లేదు. సీతాపహరణం వల్ల నాకు దుఃఖం లేదా? అవమానం నాకు లేదా? నువ్వు సీతకొరకు మాత్రమే దుఃఖిస్తున్నావు. నేను మీ ఇరువురికొరకు దుఃఖిస్తున్నాను. బహిరంగంగా ఏడ్వడం లేదు. కార్యసాధన ఉపాయం ఆలోచిద్దాం”.

"భార్య కొరకు, ఎంతో బుద్ధికలవాడివై కూడా, బుద్ధిమంతుల్లో శ్రేష్టుడవై కూడా, ఆలోచన లేనివాడిలాగా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడ్వ వద్దు. ఏడుస్తూ వూరికే కూర్చుంటే ఏ పనీ జరగదు. నీకు ఏడుపు ప్రధానమా? సీతను మళ్లీ పొందడం ప్రధానమా? రెండోది ప్రధానమైతే దానికై కృషి చేయి. ఆ కృషికి కావాల్సింది ధైర్యం. కాబట్టి ధీరుడివికా. ఏవిధంగానైనా సీతను సాధిద్దాం. ప్రయత్నం చేయకపోతే చెడిన పని ఎలా బాగవుతుంది? అన్నా! నువ్వు ఉత్సాహం వదలడం మంచిదికాదు. ఉత్సాహంకంటే బలం లేదు. ఉత్సాహమే శక్తి. ఉత్సాహవంతులకు సాధించనిది లేదు. ఉత్సాహంతో పనిచేసేవారికి కార్యాలు విఘ్నం కలగించలేవు. రామచంద్రా! నీకు ఉత్సాహం కలిగిందా....సీతను తప్పక తేగలవు....చూడగలవు.  శోకాన్ని తగ్గించుకో. కామవృత్తు వదులుకో. నువ్వు కోవిదుడివి. మహాత్ముడివి. సుకృతాత్ముడివి. రామచంద్రా! ఇలాంటి నిన్ను నువ్వే తెలుసుకోలేకపోతే నేనేమని చెప్పాలి?". అని ఇలా లక్ష్మణుడు చెప్పగా ఆయన చెప్పిన మాటలు సత్యమని భావించిన రాముడు దుఃఖాన్ని విడిచి ధైర్యం వహించాడు. ఆ తరువాత శీఘ్రంగా సెలయేళ్లు, అడవులు, గుహలు, చూసుకుంటూ నిర్భయంగా నడుస్తూ, తమ్ముడు ధర్మ వాక్యాలు చెప్తుంటే వినుకుంటూ ముందుకు సాగిపోయారు.

Saturday, November 16, 2019

మాజీ ఐఏఎస్ స్వర్గీయ చంద్రమౌళితో అనుబంధం .... వనం జ్వాలా నరసింహారావు


మాజీ ఐఏఎస్ స్వర్గీయ చంద్రమౌళితో అనుబంధం  
వనం జ్వాలా నరసింహారావు

“చంద్రమౌళి స్పీకింగ్....యీజ్ జ్వాలా దేర్?” అని ఫోన్లో కంచు గొంతుకతో అడిగే  మాజీ ఐఏఎస్ అధికారి శాశ్వతంగా కన్నుమూశారు. బుధవారం నవంబర్ 13 న హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారాయన. ఆయన మృతికి గవర్నర్ తమిలిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంతాపం తెలియచేశారు. ఎనబైరెండు సంవత్సరాలు జీవించిన ఆ బడుగుజన బాంధవుడు, బలహీనవర్గాల పెన్నిధి చివరి రోజుల్లో ఆనారోగ్యానికి గురైనందున ఆయన్ను కలవడానికి వెళ్లే నాలాంటి ఆయన సన్నిహితులతో ఎక్కువగా సంభాషణ చేయలేకపోయేవారు. చివరిసారిగా ఆయన్ను నేను ఏడాది క్రితం స్వర్గీయ డాక్టర్ ఏపీ రంగారావు (రంగారావుకు కాన్సర్ రావడంతో ఇక ఎక్కువకాలం బతకనని చంద్రమౌళి గారిని కలవడానికి వెళ్లాడు) తో కలసి వెళ్ళినప్పుడు ఒకింత బాధ కలిగింది. ఉద్యోగం చేసినంత కాలం, అది ఏ ఉద్యోగం అయినా సరే, ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా, ఎవరికో ఒకరికి ఏదో ఒక విధంగా సహాయ పడాలనే ఆర్భాటంతో, నవ్వుతూ-నవ్విస్తూ, వివిధ రకాలుగా ప్రతివార్నీ ప్రోత్సహిస్తూ వుండే చంద్రమౌళి ఆయనేనా అని బాధకలిగింది.

   డాక్టర్ వి చంద్రమౌళి 1937 సంవత్సరంలో తమిళనాడులో జన్మించారు. ఎంఏ ఆర్థికశాస్త్రంలో గోల్డ్ మెడలిస్ట్. హిస్టరీలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్. సోషల్ యాంత్రపాలజీలో డాక్టరేట్ పొందారు. రెండు సంవత్సరాలు మద్రాస్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారిగా 33 సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేశారు. వాటిలో రెవెన్యూ పాలన, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ, ఆహార-పౌర సరఫరాల శాఖ, కార్మిక సంక్షేమ శాఖలున్నాయి. గవర్నర్ కార్యదర్శిగా శంకర్ దయాళ్ శర్మ దగ్గర, కుముద్ బెన్ జోషి దగ్గర పనిచేశారు. అదే రోజుల్లో భారత రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ విభాగానికి చైర్మన్ గా కూడా వున్నారు. ఆంగ్లంలో తొమ్మిది పుస్తకాలు రాశారు. వాటిలో మూడు పుస్తకాలకు (హైదరాబాద్, చెన్నై, గోవా) నేను సహరచయితను. అప్పట్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ గా వ్యవహరించబడ్డ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధిసంస్థలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో డైరెక్టర్ జనరల్ గా ఆయన 1995 లో పదవీ విరమణ చేశారు.

చంద్రమౌళి గారిని మా బంధువు డాక్టర్ రంగారావు ద్వారా 1984-85 సంవత్సరంలో మొదటిసారిగా కలిశాను. అప్పట్లో ఆయన సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా, డాక్టర్ రంగారావు వికలాంగుల కార్పోరేషన్ ఎండీగా పనిచేసేవారు. ఎన్టీరామారావు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. హైదరాబాద్ లో అప్పట్లో నెలకొల్పిన ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హాండీకాప్డ్’ (ఎన్ఐఎంహెచ్) కు చంద్రమౌళి సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి హోదాలో ప్రత్యేక అధికారిగా, డాక్టర్ రంగారావు తాత్కాలిక ఎండీగా ప్రభుత్వం నియమించింది. ఎన్ఐఎంహెచ్ లో ఒక ‘డాక్యుమెంటేషన్ కమ్ లైబ్రరీ’ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో దానికి అవసరమైన ప్రాజెక్టు రిపోర్టును తయారుచేయమని అప్పట్లో బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో లైబ్రేరియన్ గా పనిచేస్తున్న నన్ను అడిగారు చంద్రమౌళి, రంగారావులు. నేను తయారు చేసిన తరువాత బాగుందని అంటూ, ఆ ఉద్యోగం నాకిస్తామని చెప్పారు. తర్వాత పత్రికలో ప్రకటన చేయడం, నాకన్నా ఎక్కువ అర్హతలున్న నా లైబ్రరీ సైన్స్ క్లాస్మేట్ హరికృష్ణరెడ్డికి ఆ ఉద్యోగం రావడం జరిగింది. అలా చంద్రమౌళి గారితో ఐన పరిచయం ఆయన చనిపోయేదాకా కొనసాగింది.

నాకు ఎన్ఐఎంహెచ్ లో ఉద్యోగం ఇవ్వలేకపోయాననే భావన చంద్రమౌలిగారిలో వుండేది. నవంబర్ 1985 లో శంకర్ దయాళ్ శర్మ స్థానంలో కుముద్ బెన్ జోషి గవర్నర్ గా నియామకం కావడంతో చంద్రమౌళి బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో లైబ్రేరియన్ గా పనిచేస్తున్న నాకు రాజ్ భవన్లో ఉద్యోగం ఇప్పించడానికి నిర్ణయించుకున్నారు. కుముద్ బెన్ జోషి, అంతకు ఏడేళ్ళ ల్రితం శారదా ముఖర్జీ గవర్నర్ గా వున్నప్పుడు స్థాపించిన చేతన స్వచ్ఛంద సంస్థను పునరుద్ధరించడంతో పాటు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (నీసా) అనే మరో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, పలు కార్యక్రమాలను చేపట్టారు. చేతన స్వచ్ఛంద సంస్థలో నన్ను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా నియమించారు చంద్రమౌళి. వాస్తవానికి నాకు అప్పగించిన పనుల్లో రాజ్ భవన్ లైబ్రరీ పునరుద్ధరణ కూడా వుంది. చంద్రమౌళి గారు నన్ను తక్షణమే రిలీవ్ చేయాలని, నా సేవలు అత్యంత ముఖ్యమని బీహెచ్ఇఎల్ అధికారులకు చెప్పడంతో నేను అక్కడ రిలీవ్ అయి రాజ్ భవన్లో జనవరి 1, 1986 న కొత్త ఉద్యోగంలో చేరాను. చేరిన కొద్దిరోజులకే రాజ్ భవన్ క్వార్టర్స్ లో నాకు ఇల్లు కూడా కేటాయించారు. కారణాంతరాల వల్ల నన్ను ఆ ఇల్లు ఖాళీ చేయమని కుముద్ బెన్ జోషి తరువాత వచ్చిన గవర్నర్ కృష్ణకాంత్ నన్ను అదేశించినప్పుడు ఆయన ఆదేశాలను నేను హైకోర్టులో సవాలు చేసిన సందర్భంలో చంద్రమౌళి నాకు ఎంతగానో సహాయ పడ్డారు. నా అఫిడవిట్ మొత్తం ఆయన సూచనతోనే రూపొందించుకున్నాను. 


చంద్రమౌళి రాజ్ భవన్లో అన్నీ ఆయనే. గవర్నర్ కుముద్ బెన్ జోషికి ఆయన సలహాలు, సూచనలు చాలా ఇష్టం. ఆమె చంద్రమౌళికి అమితమైన గౌరవం ఇచ్చేది. ‘నీసా స్వచ్ఛంద సంస్థ ఆరంభించడంలో, ‘చేతన’ స్వచ్ఛంద సంస్థను పునరుద్ధరించడంలో ఆయన పాత్ర కీలకం. ఆ రెండు సంస్థల ద్వారా చేసిన కొన్ని కార్యకలాపాలు ఇప్పటికీ గుర్తున్నాయి. జోగినీ వ్యవస్థ రూపుమాపడానికి నీసా ద్వారా చేసిన కృషిలో భాగంగా చంద్రమౌళి చొరవతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర్ణిలో లవణం, హేమలతా లవణంల తోడ్పాటుతో “చెల్లి నిలయం” కార్యాచరణ వ్యవస్థ ఏర్పాటు, దరిమిలా రాజ్ భవన్ దర్బార్ హాలులో నాటి సీఎం ఎన్టీఆర్, కేంద్ర మంత్రి జలగం వెంగళరావు,  గవర్నర్ కుముద్ బెన్ జోషి సమక్షంలో ముగ్గురు జోగిన్ల వివాహం, ధిల్లీలో జోగిన్ల సంక్షేమం మీద జాతీయ స్థాయి సదస్సు నిర్వహించడం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా వరద బాధితులకు సహాయం, వయోధికాశ్రామం ఏర్పాటు, ఉద్యమంలాగా మొక్కలు నాటడం, భారత-పాకిస్తాన్ బెనిఫిషరీ క్రికెట్ మాచ్ లాంటివి చంద్రమౌళి చొరవతోనే జరిగాయి. అలాగే ‘చేతన’ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం చంద్రమౌళి పుణ్యమే. అప్పటి పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరోకాదు, నేటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆ క్రికెట్ మాచ్ నిర్వహణలో మాజీమంత్రి గీతారెడ్డి, నేను చురుగ్గా పాల్గొన్నాం.

ఒకసారి ‘చేతన’ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న ఒక డ్రైవర్ రాజ్ భవన్ క్వార్టర్లలో నివసిస్తున్నప్పటికీ, తనకు 24 గంటలు పని వున్నందున అదనంగా హెచ్ఆర్ఏ (ఇంటి అద్దె అలవెన్స్) ఇవ్వమని అభ్యర్థించాడు. దానికి ఆమోదిస్తూ చంద్రమౌళి హెచ్ఆర్ఏ అంటే “హార్డ్షిప్ రెమ్యూనరేటివ్ అలవెన్స్” అని భాష్యం చెప్పారు. సహాయం చేయాలనుకుంటే ఎన్నో మార్గాలనేవారాయన. ఆయన వ్యక్తులకే కాకుండా ఎన్నో సంస్థలకు సహాయం అడక్కుండా చేశాడు. ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్ కు చంద్రమౌళి అంటే చాలా ఇష్టం.

చంద్రమౌళి ఎక్కడ ఉద్యోగం చేసినా నన్ను అక్కడికి ఎదో ఒక కారణంతో డిప్యుటేషన్ మీద తీసుకెళ్ళేవారు. రాజ్ భవన్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడే డిప్యుటేషన్ మీద మర్రి చెన్నారెడ్డి దగ్గర పీఆర్వోగా పనిచేసి, టర్మ్ అయిన తరువాత వెనక్కు వస్తే అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ పుణ్యమా అని నా ఉద్యోగం పోతే, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా వున్న చంద్రమౌళి తన శాఖ పరిధిలోని హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ గాయత్రి రామచంద్రన్ కు చెప్పి సీనియర్ మానేజర్ గా ఉద్యోగం ఇప్పించారు. ఇండస్ట్రీస్ కార్యదర్శిగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సుమారు మూడెకరాల భూమిని హస్తకళల అభివృద్ధి సంస్థకు కేటాయించారు ఆయన. అక్కడే ఇప్పుడు మనకు కనిపిస్తున్న (ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం) సుమారు వంద కోట్లకు పైగా విలువ చేసే గోల్కొండ హస్తకళల ఎంపోరియం కట్టడం జరిగింది.

హస్తకళల అభివృద్ధి సంస్థలో నేను పనిచేస్తున్నప్పుడే నాలుగేళ్ల తరువాత ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థకు డీజీగా వెళ్లడం, వెళ్ళిన కొన్నాళ్ళకే నన్ను అక్కడికి ఫాకల్టీ మెంబర్ గా డిప్యుటేషన్ మీద తీసుకుపోవడం జరిగింది. ఆ సంస్థ అభివృద్ధికి ఆయన రోజుల్లోనే అంకురార్పణ జరిగింది. ఇప్పుడున్న హాస్టల్, గెస్ట్ హౌజ్ భవనాల శంఖుస్థాపన ఆయన హయాంలోనే జరిగింది. అలాగే ఆయన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉన్నతాధికారిగా వున్నప్పుడు ప్రస్తుతం వున్న ఆ కార్యాలయ భవన సముదాయాన్ని కట్టించాడు. నిబంధనలకు విరుద్ధంగా కట్టించాడని ఆయన్ను ఆక్షేపించిన వారు కూడాలేకపోలేదు. కడప కలెక్టర్ గా ఆయన చేసిన సేవలు ఇప్పటికీ అక్కడి ప్రజలు గుర్తుంచుకుంటారు.

నిబద్ధతకు, నిజాయితీకి, సామర్థ్యానికి, నైపుణ్యానికి, బడుగు-బలహీన వర్గాలవారికి అండగా వుండడానికి స్వర్గీయ చంద్రమౌళి పర్యాయపదం అంటే అతిశయోక్తి కాదేమో!