Tuesday, October 30, 2012

తనదైన విదేశాంగ విధానంతో చరిత్ర సృష్టించిన ఇందిరాగాంధీ: వనం జ్వాలా నరసింహారావు


అక్టోబర్ 31, 2012 న 
ఇందిరాగాంధీ 28 వ వర్ధంతి సందర్భంగా

తనదైన విదేశాంగ విధానంతో 
చరిత్ర సృష్టించిన ఇందిరాగాంధీ
Surya Daily on 04-11-2012
వనం జ్వాలా నరసింహారావు

ఇందిరా గాంధి హత్యకు గురై  28 సంవత్సరాలు దాటినా జాతీయ-అంతర్జాతీయ రంగాలలో ఆమె మిగిల్చిన గుర్తులు అజరామరంగా అశేష ప్రజానీకం గుండెల్లో గూడుకట్టుకున్నాయి. కోట్లాది ప్రజలు అమెనెంతగా అభిమానించేవారో, అంత మోతాదులోనే, ఆమెలోని మంచి చెడులను నిశితంగా విమర్శించేవారు ఇప్పటికీ చాలామంది వున్నారు. ఆమె దో అరుదైన వ్యక్తిత్వం.


అణుయుగంలో, అంతరిక్ష యుగంలో భారతదేశాన్ని అడుగు పెట్టించిన ఘనత ఇందిరా గాంధీదే. సోవియట్ వ్యోమ నౌకలో భారతీయులను పంపడానికి చొరవ తీసుకుంది ఆమే. ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ను ఘోరంగా ఓడించి, దానిలో అంతర్భాగంగా వున్న ప్రాంతాన్ని విడిపోయేందుకు దోహదపడి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారకురాలై, ప్రపంచంలో భారతదేశాన్ని ఒక బలీయమైన శక్తిగా రూపుదిద్దిన ఘనత కూడా ఇందిరా గాంధీదే. పోఖ్రాన్‍లో మొదటిసారిగా భూగర్భ అణ్వాయుధ ప్రయోగం జరిపించడం ద్వారా, ప్రపంచ అణ్వాయుధ పటంలో భారతదేశానికి ఒక స్థానం ఏర్పరిచిన ఘనత ఇందిరా గాంధీదే. అగ్ర రాజ్యాల అణ్వాయుధ నిబంధనలకు తమ దేశం కట్టుబడి వుండదన్న సంకేతాలను పరోక్షంగా ఇచ్చింది ఇందిర. అంతర్జాతీయ రంగంలో ఎవరి పక్షం వహించదని, తమ విదేశాంగ విధానం "భారత అనుకూల విధానం" అనీ ఎలుగెత్తి చాటి చెపుతూ, అలీన విధానాన్ని పాటించే దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్ళింది ఇందిరా గాంధీ. సోవియట్ యూనియన్ తో మైత్రి చేసినప్పటికీ, అమెరికా వ్యతిరేకిగా ముద్ర పడకుండా జాగ్రత్త పడింది. అవసరమైనప్పుడు, తప్పదనుకున్నప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఎదురు తిరిగి తన సత్తా ఏమిటో నిరూపించింది.


ఇందిరాగాంధీ పేరు-ప్రతిష్టలు, దూరదృష్టి, ఖండ-ఖండా తరాలు దాటిపోయింది. మానవాళి మొత్తం ఆమె విదేశాంగ విధానం వల్ల లబ్ది పొందింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశానికి ప్రధానమంత్రిగా వున్న ఆమె విధానాలు-నిర్ణయాల మూలంగా, అంతర్జాతీయ సంబంధాలలో గణనీయమైన పురోగతి కనిపించింది. అంతర్జాతీయ స్థాయిలో అమెకు అరుదైన గౌరవం, మర్యాదలు దక్కాయి. ఆమె అతి పిన్న వయసులోనే అంతర్జాతీయ సంబంధాలకు చెందిన కార్యకలాపాలకు పరిచయం కాబడింది. జవహర్లాల్ నెహ్రూ కుమార్తెగా, చిన్నతనం నుండే ఇందిరాగాంధీ, తన చుట్టూ వుండే పరిసరాల ప్రభావం వల్ల, నెలకొన్న రాజకీయ వాతావరణం కారణాన, అహర్నిశలూ దేశీయ వ్యవహారాలతో పాటు అంతర్జాతీయ సంబంధాలకు చెందిన చర్చలలో పాల్గొనే అవకాశం తన ఇంట్లోనే లభించేది. నెహ్రూ ప్రధానమంత్రిగా వున్న రోజుల్లో, ఇందిరాగాంధీ తీన్ మూర్తీ భవనానికి వచ్చే పలువురు విదేశీ ప్రముఖులకు అధికారిక ఆతిధ్య దాతగా వ్యవహరించేది. అలా వచ్చిన వారిలో ప్రధానులు, రాష్ట్రపతులు, విదేశాంగ మంత్రులు, రాజకీయ పార్టీల నాయకులు, రాజ్యాధినేతలు, అనేక రంగాలలో నిష్ణాతులైన కీలక వ్యక్తులు వుండేవారు. దానికి తోడు తండ్రి విదేశీ పర్యటనలలో ఇందిర తప్పకుండా వెంట వుండేది. ఆమె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులలోనే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, భారత విదేశాంగ విధానాన్ని ఆసాంతం అర్థం చేసుకో గలిగింది


ఇందిరాగాంధీ చరిత్రను ప్రభావితం చేయడమే కాకుండా, చరిత్ర సృష్టించింది కూడా. ఆమె రాజనీతిజ్ఞతతో అగ్రరాజ్యాలు ఒకదానిపై మరొకటి నిరంతరం కత్తులు దూసుకోకుండా చేయగలిగింది. అలీనోద్యమం ద్వారా అ రెండింటి మధ్య సమతుల్యం పాటించే ట్లు చూడగలిగింది. విదేశీ వ్యవహారాలలో- విదేశాంగ విధానం అమలు పరచడంలో ఇందిరాగాంధీ, అంతర్జాతీయ శాంతి-సౌభ్రాతృత్వం, నిరాయుధీకరణ, వలస వాద వ్యతిరేకత, జాతి వివక్షత వ్యతిరేకత అనే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. కామన్వెల్త్, అలీన దేశాల, ఐక్య రాజ్య సమితి వేదికలను తన కనుకూలంగా, తన వాణిని వినిపించేందుకు ఉపయోగించుకుంది ఇందిరాగాంధీ. ఆమె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో, ప్రపంచం దాదాపు రెండు బృందాలుగా విడిపోయింది. ఒక బ్లాక్‌కు అమెరికా, మరో దానికి సోవియట్ యూనియన్ దేశాలు నాయకత్వం వహించేవి. ఇరు దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధం నిరంతరం సాగుతుండేది. అణ్వాయుధ పోటీ నెలకొని వుండేది. వలస వాద-సామ్రాజ్యవాద జ్ఞాపకాలు ఇంకా మిగిలే వున్నాయప్పటికి. జాతి వివక్షత పూర్తి స్థాయిలో చోటు చేసుకుంది. ప్రపంచ శాంతి అందని ద్రాక్ష పండులాగా వుండేది. ఆ నేపధ్యంలో, అలీన సిద్ధాంతాన్ని ఆమె అమలు చేయసాగింది. దాన్నే ఒక ఆయుధంలాగా ఉపయోగించసాగింది. అచిర కాలంలోనే, ఇందిరాగాంధీకి అలీన ఉద్యమ నేతగా, శాంతి కాముకురాలిగా, స్వాతంత్రాభిలాషిణిగా ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. 1983 లో న్యూఢిల్లీలో జరిగిన అలీన దేశాల ఉద్యమ ఏడవ సమావేశంలో ఛైర్ పర్సన్‌గా ఎన్నిక కావడంతో ఆమె పేరు-ప్రతిష్టలు ఇనుమడించాయి. అదొక చారిత్రాత్మక సమావేశం. ఇందిర రాజనీతిజ్ఞతకు, దూరదృష్టికి ఆ సమావేశం అద్దం పట్టింది. త్వరలోనే, అలీనోద్యమం వూపందుకోసాగింది. ఆమె మూడేళ్ల కాలపరిమితిలో ఆ ఉద్యమం అంచలంచలుగా అభివృద్ధి చెందింది.


ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చిన కొత్తలో అంతర్జాతీయ రంగంలో ఇబ్బందుల్లో పడి వుంది భారతదేశం. చైనాతో యుద్ధం ముగిసి దాని ప్రభావం ఇంకా తొలగిపోని రోజులవి. అంతర్జాతీయ సంబంధాలలో కొంత నిర్లిప్తత చోటు చేసుకోవడం కూడా జరిగింది. ఇందిరాగాంధీ పదవిలోకి వస్తూనే మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందనవచ్చు. ఆమె ప్రధానమంత్రి పదవి చేపట్తూనే "అలీన విధానానికి" తన పూర్తి మద్దతును ప్రకటించింది. యుగోస్లేవియా అధ్యక్షుడు మార్షల్ టిటో, యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ అధ్యక్షుడు గమాల్ అబ్దుల్ నాజర్, ఇందిర ప్రధాని ఐన కొద్ది రోజులకే, జులై 1966 లో తమ దేశాలకు ఆమెను ఆహ్వానించి ఆమెతో సమావేశమయ్యారు. అది జరిగిన కొద్ది నెలలకే అక్టోబర్‌లో, ఆ ముగ్గురు దేశ నాయకుల త్రైపాక్షిక సమావేశం ఢిల్లీలో జరిగింది. సామ్రాజ్యవాదం, వలస వాదం వివిధ మార్గాల ద్వారా ప్రపంచంలో ఇంకా ప్రబలి పోవడం విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన ఆ ముగ్గురు నాయకుల సమావేశం, ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాలలో ఏదైనా అగ్ర రాజ్యం జోక్యం చేసుకోవడమంటే శాంతికి విఘాతం కలిగించినట్లే అని ఒక సంయుక్త ప్రకటన విడుదల చేయడంతో ముగిసింది. అదే సమయంలో ఉత్తర వియత్నాంపై జరుగుతున్న బాంబు దాడుల విషయంలోను ఆందోళన వ్యక్తం చేసిన ముగ్గురు నాయకులు, తక్షణమే ఆ దాడులను నిలుపుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఆ ముగ్గురు మధ్య కుదిరిన ఒడంబడిక ఒక విధంగా అమెరికా, చైనా దేశాలకు అప్పట్లో హెచ్చరిక లాంటిదే.


భారత-పాకిస్తాన్ యుద్ధంలో, ఇందిర నేతృత్వంలోని భారతదేశం అఖండ విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఉపఖండంలో తిరుగులేని శక్తిగా భారత దేశానికి పేరు తెచ్చింది. ఇందిరా గాంధీని ద్వేషించే అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ తన సంపూర్ణ మద్దతును పాకిస్తాన్ కు ఇచ్చిన నేపధ్యంలో, యుద్ధానంతరం ఆయనకొక ఘాటైన ఉత్తరం రాసిందామె. లక్షలాది మంది తూర్పు పాకిస్తాన్ శరణార్థులు సరిహద్దులు దాటి భారత దేశానికి వచ్చి పడుతుంటే, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమకుందని, ఆ కర్తవ్య నిర్వహణలో యుద్ధం చేయాల్సి వస్తే, తాను చేసిన తప్పేమిటో స్పష్టం చేయాలని నిక్సన్ ను ప్రశ్నించింది. తనను, తన దేశాధ్యక్షుడు నిక్సన్‍ను ఇందిరాగాంధీ చావు దెబ్బ తీయగలిగిందని సాక్షాత్తు హెన్రీ కిస్సింజర్ తన ఆత్మకథలో రాసుకున్నా డంటే, బంగ్లాదేశ్ విజయానికి అంత కంటే పెద్ద అభినందన అక్కర్లేదు. అలనాటి భారత పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు అటల్ బీహారీ వాజ్‍పాయ్ ఇందిరను దుర్గ మాతతో పోల్చాడు. ఆమె కేవలం చరిత్రనే సృష్టించలేదని, భూగోళాన్ని కూడా సృష్టించిందని మరో ప్రతిపక్ష నాయకుడు వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ మీద ఘన విజయం సాధించి, సిమ్లా ఒప్పందం కుదుర్చుకుని ఆమె తన రాజనీతిజ్ఞతను చూపింది. పాకిస్తాన్ విషయంలో భారతదేశం సత్సంబంధాలు కలిగి వుండాలని భావించిన ఇందిరాగాంధీ, ఇతర పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్ విషయంలోను అదే తరహాలో నడచుకుంది. చైనాతో కూడా మంచి సంబంధాలుండాలనే కోరుకునే ది ఇందిరా గాంధీ. రెండవ సారి ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక, 1980 లో బెల్గ్రేడ్‍లో నాటి చైనా ప్రధాని హువాగూఫెంగ్ తో సమావేశమైంది. ఆ తరువాత కూడా ఆయన వారసుడు చైనా ప్రధాని ఝావ్ జియాంగ్ తో 1981 లో కాంకన్‍లో సమావేశమైంది. ఆ తరువాత ఆమె మార్గంలోనే శాంతిని కోరుకున్న చైనా దేశం తమ దూతగా, సీనియర్ ఉప ప్రధాని హువాంగ్‌హోని భారత దేశానికి అదే సంవత్సరం పంపింది


భారతదేశానికి సన్నిహితంగా, స్నేహంగా మసులుకుంటున్న సోవియట్ యూనియన్, అలీన విధానానికి కట్టుబడిన అఫ్గానిస్తాన్ పైన దాడికి దిగడంతో ఎవరికి మద్దతు ప్రకటించాలన్న విషయంలో సందిగ్ధంలో పడిపోయింది ఇందిరాగాంధీ. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా భారతదేశం మాట్లాడుతుందని భావించిన అమెరికాకు నిరాశ మిగిలింది. అదే సందర్భంలో పాకిస్తాన్‌కు ఆయుధాలను అమెరికా సమకూర్చే విషయంలో భారత-అమెరికా దేశాల మధ్య అభిప్రాయ భేదాలు బాగా పొడచూపాయి. అమెరికాకు తన తీవ్ర ఆక్షేపణ తెలియచేసింది ఇందిరాగాంధీ. తరువాత కొద్ది కాలానికి కాంకన్ సమ్మిట్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, భారత ప్రధాని ఇందిరాగాంధీల కలయిక పరిస్థితిలో కొంత మార్పుకు దోహదపడింది. 1982 లో నిర్వహించబడిన ఆసియా క్రీడలు, ఆ తరువాత 1983 కామన్వెల్త్ అధినేతల సమావేశం కూడా ఆమెకు ఒక విజయమే

  ఇందిరాగాంధి-యాసర్ అరాఫత్‌


ఇందిరాగాంధీ అనుసరించిన విదేశాంగ విధానంలో అత్యంత ప్రాముఖ్యమైంది అరబ్ దేశాలతో నెలకొల్పిన మైత్రీ సంబంధాలు. ఆమె కాలంలో భారత-అరబ్ సంబంధాలలో ఒక నూతనాధ్యాయం ప్రారంభమైంది. అరబ్ ప్రపంచం వ్యవహారాలలో అత్యంత శ్రద్ధ కనబర్చ సాగింది ఇందిరాగాంధి. ప్రపంచ దేశాలలో తమకు సరైన ప్రాతినిధ్యం కావాలన్న అరబ్ దేశాల డిమాండుకు ఇందిర తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. పశ్చిమాసియా సమస్యలలో అత్యంత కీలకమైన పాలస్తీనా విమోచన విషయంలో ఇందిర తన ఆందోళనను అన్నిరకాల కనపర్చేది. వారికి మద్దతుగా ప్రపంచ వేదికలైన ఐక్య రాజ్య సమితి, ఆఫ్రో-ఆసియా, అలీన దేశాల సమావేశాలలో మాట్లాడుతుండేది. ఎమర్జెన్సీ తరువాత జరిగిన ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ఇజ్రాయిల్‌కు అనుకూలమైన విదేశాంగ విధానాన్ని పాటించారు. ఆమె తిరిగి అధికారం చేపట్టగానే, ఆ విధానాన్ని చెత్త బుట్టలో పడేసి, పాలస్తీనా-అరబ్ అనుకూల విధానానికి మళ్లీ శ్రీకారం చుట్టింది. స్వదేశంలోను, అంతర్జాతీయం గాను ఇందిరపై ఎన్నో రకాల ఒత్తిడులు వచ్చినప్పటికీ, పాలస్తీనా విమోచన సంస్థ నాయకుడు యాసర్ అరాఫత్‌ను న్యూఢిల్లీకి ఆహ్వానించి, దౌత్య సంబంధాలను నెలకొల్పింది ఇందిరాగాంధీ. అరబ్ దేశాలకు చెందిన గమాల్ అబ్దుల్ నాజర్ కోడలుగా, సౌదీ రాజు కూతురుగా, యాసర్ అరాఫత్ సోదరిగా, అరబ్ దేశాలు ఇందిరాగాంధీని అభివర్ణించేవి. అమెను "అల్‍సయ్యిదా ఇందిరాగాంధీ" అని పిల్చుకునేవారు వాళ్లు.


ఇందిరాగాంధీ, ఆమె తండ్రి జవహర్లాల్ నెహ్రూ అనుసరించిన విదేశాంగ విధానం ఈ నాటికీ ఒక విధంగా అమల్లోనే వుందనాలి. ఆమె తరువాత అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రులు రాజీవ్ గాంధీ కాలంలోను, అటల్ బిహారీ వాజ్‍పాయ్ కాలంలోను, పీవీ నరసింహారావు కాలంలోను, ఇప్పటి మన్మోహన్ సింగ్ కాలంలోను ఇంకా అవే విధానాలు కొనసాగుతున్నాయి. ఆమె పేరు వాడకుండా వారెవరి హయాంలోను విదేశాంగ విధానాన్ని విశ్లేషించ లేదంటే అతిశయోక్తి కాదు. తండ్రి నెహ్రూ లాగా కాకుండా, ఒక పటిష్టమైన-నిర్ణయాత్మక దౌత్యవేత్తగా ఇందిరాగాంధీ తనదంటూ ఒక శైలిని అనుసరించేది. జనవరి 24,1966 న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే, మార్చ్ లో, తన మొదటి అధికారిక విదేశీ పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో భాగంగా పారిస్, లండన్, వాషింగ్టన్, మాస్కో నగరాలను దర్శించింది. అక్కడి ప్రభుత్వ విధానాలను ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేసింది. ఉత్తర వియత్నాంపై అమెరికా బాంబ్ దాడులను ఆపేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్‌కు విజ్ఞప్తి చేసింది. జెనీవా సమావేశాన్ని మరో మారు ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేసింది. జాన్సన్‌కు ఆమె డిమాండ్ రుచించలేదు. టిబెట్ విషయంలో నెహ్రూ అనుసరించిన మెతక విధానానికి విరుద్ధంగా, సిక్కింను భారత్ల దేశంలో విలీనం చేసింది


ఇందిరాగాంధీ పెత్తనం చేస్తుంటే, ఎదురు తిరిగే ధైర్యం, అంతర్జాతీయ రంగంలో ఎవరికీ లేదంటే అతిశయోక్తి కాదేమో! వియత్నాం, గ్రెనెడా, పశ్చిమాసియా, మధ్య అమెరికా, ఆఫ్రికా దేశాలపైన, హిందూ మహాసముద్రం మీద, ఫాక్‍లాండ్స్ మీద అమెరికా దురాక్రమణను ఇందిర ఖండిస్తే, వ్యతిరేకించే సత్తా ఆ దేశానికి లేదు. మరో వైపు తన మిత్రదేశమైన సోవియట్ యూనియన్ జెకొస్లోవేకియా, అఫ్గానిస్తాన్ దేశాలపై చేసిన దాడిని కూడా అమె ఖండించింది. కంపూచియా, నమీబియా స్వాపో ప్రభుత్వాలను భారత దేశం గుర్తించడం ఇందిర పట్టుదలకు చిహ్నాలు. గర్వపడడం ఇందిరాగాంధీ సహజ సొత్తు. తనమీద తనకు ఎనలేని విశ్వాసం. తాను ఇబ్బందులలో వున్నప్పటికీ కూడా రాజీ పడని మనస్తత్వం. 1971 లో నెలకొన్న క్లిష్ట పరిస్థితులలో, అత్యవసరంగా సోవియట్ యూనియన్ సైనిక సహకారం-రాజకీయ మద్దతు కోరాల్సి వచ్చింది ఆమెకు. ఐనప్పటికీ, ఆమె తన మాస్కో పర్యటనలో కించిత్తు కూడా వెనుకడుగు వేయలేదు. నాటి సోవియట్ ప్రధాని కొసిజిన్‍తో మొదటి రోజు తన పర్యటనలో చర్చలకు ఆమె విముఖత చూపింది ఇందిర. కారణం ఆ దేశంలో అప్పుడాయన నంబర్ వన్ కాదు-నంబర్ టు మాత్రమే. అధ్యక్షుడు బ్రెజ్నేవ్‍తో మరుసటి రోజున చర్చలకు అంగీకరించింది. ఇందిర అధికారంలో లేని 1977-1979 మధ్య కాలంలోనూ ఆమె ప్రవర్తనలోను, పట్టుదలలోను మార్పు రాలేదు. ఆ కాలంలో ఆమె లండన్ పర్యటనకు పోయిందో సారి. అప్పుడు కూడా ఆమె పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. అమెను కలిసివారిలో ప్రపంచ నాయకులు, అధికారిక-అనధికారిక వ్యక్తులు పలువురున్నారు


ఇందిరా గాంధీలో సహనం, అసహనం సమపాళ్లలో వుండేవి. ఒకరిని చేరదీయడంలోను, ఇంకొకరిని పక్కన పెట్టడంలోను, ఆమెకు ఆమే సాటి. ఇదే విధానాన్ని ఆమె విదేశాంగ నీతిలో కూడా పాటించింది. అమెరికా అధ్యక్షుడుగా పనిచేసిన రిచర్డ్ నిక్సన్ ఆ దేశ ప్రయివేట్ పౌరుడిగా, ప్రధాని ఇందిరను కలిసిన సమయంలో, ఇరవై నిమిషాలు గడిచిన తర్వాత, ఇంకెంత సేపు ఆ సమావేశం కొనసాగుతుందని, నిక్సన్ వెంట వచ్చిన విదేశాంగ ప్రతినిధిని హిందీలో అసహనంగా ప్రశ్నించింది. ప్రశ్న హిందీలో వేసినా, దాని గూడార్థాన్ని గ్రహించిన నిక్సన్ సంభాషణను త్వరగా ముగించి వెళ్ళాడని అనధికార వార్తగా పత్రికలు ప్రచురించాయి అప్పట్లో. అందులోని నిజానిజాలు ఎంతవరకో గాని, ఆమెలోని అసహనం పాలు ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువై, ఇంటర్వ్యూలలో ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడమో, నిశ్శబ్దం పాటించడమో, అదో రకంగా నవ్వు ముఖం పెట్టడమో, ఎదురు ప్రశ్నలు వేయడమో చేసేదని విశ్లేషకులు అంటుండేవారు.


ఆమెకు ఆమే సాటి!

Wednesday, October 24, 2012

వామపక్ష ఐక్యత-ఆవశ్యకత: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు

"ఆ ఐక్యత కుందేటి కొమ్మే" శీర్షికతో చెరుకూరి సత్యనారాయణరావు ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం చదివిన తరువాత వామపక్ష ఐక్యత ఆవశ్యకతను గురించి రాయాలనిపించింది. ఇటీవల నేను  ఖమ్మం జిల్లా మార్క్సిస్ట్ నాయకుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి జీవితచరిత్రను "అనుభవాలే అధ్యాయాలు" పేరుతో ప్రచురించిన దాంట్లో ఈ విషయానికి సంబంధించి చర్చించడం జరిగింది. చెరుకూరు తన వ్యాసంలో కొంత నిరాశాజనకంగా కనిపించినప్పటికీ, ఐక్యతను కుందేటి కొమ్ముతో పోల్చడం గమనిస్తే, అది సాధించడం కొంత కష్టతరమైనప్పటికీ, సాధించ వీలుకలుగుతుందని, ఆ సుభాషితం చదివినవారికి అర్థమవుతుంది. ఎటొచ్చీ సాధించలేంది, ఆ వామపక్షాలకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తుల "మనస్సు రంజింపజేయడమే"! వామపక్ష ఐక్యత అంటే, ఐక్యంగా ముందుకు పోయి ప్రజా ఉద్యమాలను ఎలా నిర్మించాలన్నదే. పది-పదిహేను గ్రూపులుగా విడిపోయిన కమ్యూనిస్టులందరూ, ఒకే ఎర్ర జండాను పట్టుకుని ఉద్యమిస్తుంటే, ప్రజలు ఎవరిని నమ్మి వారివెంట నడవాలి? ఏం?...కాసేపు సిద్ధాంతాలను....అవి కూడా అసలంటూ వుంటే, పక్కన పెట్టి ప్రజల సమస్యలను తీర్చే ప్రయత్నం చేయకూడదా? ఈ దిశగా, అక్టోబర్ ఏడున విజయవాడలో, వామపక్ష పార్టీలను-ముఠాలను ఐక్యం కమ్మని, ఉమ్మడిగా ప్రజా సమస్యలపై పోరాటం సలపమని కోరుతూ, కొందరు కమ్యూనిస్ట్ పెద్దలు నిర్వహించిన సదస్సు కొంత మేరకు ఫలితం సాధించిందనే అనాలి. ఆ సదస్సు జరిగిన కొన్నాళ్లకు, ఓంకార్ వర్ధంతి సభ పేరుతో, సిపిఐ, సిపిఎం లతో సహా కొన్ని వామపక్షాలు ఒకే వేదిక పైకొచ్చి, వామపక్ష ఐక్యత గురించి మాట్లాడడం జరిగింది. 


వామపక్ష విలీనం, ఐక్యత గురించి ఇటీవలి కాలంలో, తీవ్రంగానే చర్చ నడుస్తోందిఈ చర్చ కొత్తగా ప్రారంభం అయిందేమీ కాదుఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించినంతవరకు, ఒకప్పుడు ఉచ్ఛస్థితిలో ఉండి ఇప్పుడు  పూర్తిగా వామపక్షాలు బలహీనపడి ఉన్న నేపధ్యంలో, ఏదో ఒక పార్టీ ఆసరా లేకుండా ఎన్నికలలో పోటీ చేయలేని పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో, ఈ చర్చ మరోసారి విజయవాడ సదస్సు రూపంలో, ముందుకు రావడం హర్షణీయందీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందివామపక్ష ఉద్యమం ఈనాడు అనేక గ్రూపులుగా, పార్టీలుగా విడివడి ఉన్న మాట వాస్తవం.ఇందులో కొన్ని క్రమేపీ బలహీనపడుతున్న మాట-ఒక విధంగా కనుమరుగవుతున్న మాట కూడా నిజమేఈ నేపధ్యంలో వామపక్ష పార్టీల ఐక్యతకు ఉన్న అవకాశాలను పరిశీలిద్దాం



          వామపక్షాల బలం తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయిఅంతర్జాతీయ, జాతీయ పరిణామాలు కూడా ఇందుకు దోహదం చేశాయిప్రధానంగా సోవియట్ యూనియన్ విచ్చిన్నం కావడం అదే కాలంలో కమ్యూనిస్టు రాజ్యాలుగా ఉన్న తూర్పు యూరప్ దేశాల్లో వచ్చిన ప్రతికూల పరిణామాలు మరో అంశంరాష్ట్రంలో తెలుగుదేశంతో కొంతకాలం, కాంగ్రెస్ పార్టీతో కొంతకాలం వామపక్షాలు స్నేహం చేశాయిఒక అధికారపార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మధ్య ఉండాల్సిన విభజన రేఖ ఆ కాలంలో చెరిగిపోయిందిముఖ్యకారణాల్లో ఇది కూడా ఒకటి. జాతీయంగా చూసినప్పుడు అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ ఉద్యమాలు ఊపందుకున్నాయిఫలితంగా సున్నితమైన స్థానిక అంశాలు, అభిమతాల వల్ల ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయిఅస్సాం గణపరిషత్, ఉత్తరప్రదేశ్ సమాజ్ వాది పార్టీ, బీహార్ రాష్ట్రీయ జనతాదళ్, సమతా పార్టీ, ఒరిస్సాలో బిజూ జనతాదళ్, మన రాష్ట్రానికి వస్తే తెలుగుదేశం, తమిళనాడులో డిఎంకె, అన్నా డిఎంకె లాంటి అనేక పార్టీలు ఉనికిలోకి వచ్చాయిజాతీయ అంశాలకంటే స్థానిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారుమతాన్ని, కులాన్ని ఆధారం చేసుకుని సంకుచిత భావాలతో వచ్చిన పార్టీలు, ఒకప్పుడు సోషలిస్టులమని చెప్పుకుని ఆ తర్వాతికాలంలో అధికారమే పరమావధిగా ఏర్పడిన పార్టీల గురించి కూడా ప్రస్తావన ఇక్కడ అవసరం. ఉత్తరప్రదేశ్ లో బహుజనసమాజ్ పార్టీ కుల ప్రాతిపదికన ఏర్పాటైనదే. ఒకప్పుడు కార్మిక నేతలమని, సోషలిస్టులమని చెప్పుకున్న జార్జ్ ఫెర్నాండెజ్, శరద్ యాదవ్ లాంటివాళ్లు తర్వాతికాలంలో అవకాశవాదానికి పాల్పడి సొంత పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. సమతా పార్టీ ఇలాగే ఏర్పాటైంది. వామపక్షాల బలం తగ్గడానికి ఉన్న ముఖ్య కారణాల్లో ఆర్ధికవ్యవస్థలో వచ్చిన మార్పులు కూడా ఒకటి.  


          కమ్యూనిస్టు ఉద్యమాల్లో వస్తున్న చీలికలు కూడా రాష్ట్రంలో వామపక్ష బలం తగ్గడానికి మరో ముఖ్య కారణమని అనడంలో సందేహం లేదు.  1964లో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయిందిఅనంతరం 1968లో నక్సలైట్ల చీలిక సంభవించింది. 1964లో దాని తర్వాత కొద్ది కాలానికే సిపిఐలో ఒక చీలిక, సిపిఎంలో ఒక చీలిక సంభవించాయిఒకటి మితవాద చీలిక, మరొకటి అతివాద చీలికసిపిఐ నుండి డాంగే, మోహిత్ సేన్ వంటి నాయకులు ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేసుకున్నారువీరు పూర్తిగా కాంగ్రెస్ తో మమేకం కావాలన్న ఆలోచనతో విడిపోయారు. సిపియం నుండి 1968లో నక్సలైట్ల పేరుతో ఒక గ్రూపు విడిపోయింది. కేవలం తక్షణ సాయుధ పోరాటం ద్వారా దేశ విముక్తి సాధించాలన్న సిద్ధాంతంతో వారు విడిపోయారుతప్పో ఒప్పో ఈ చీలికలు ఒక సిద్ధాంత ప్రాతిపదికపై జరిగినవేఆ తర్వాత కాలంలో జరిగిన చీలికలకు చెప్పుకోదగిన సిద్ధాంత ప్రాతిపదిక ఉన్నట్లు కనిపించదు. ఇన్ని పార్టీలు, గ్రూపులు ఉన్నా రాజకీయ స్రవంతిలో జాతీయ స్థాయి ప్రధాన వామపక్ష, రాజకీయ పార్టీలుగా, సిపిఐ, సిపిఎం ఈనాటికి మిగిలి ఉన్న మాట వాస్తవం. కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడటానికి ఈ ఉద్యమంలో వచ్చిన చీలికలు కూడా కారణమే. 


ఆంధ్రప్రదేశ్‌లో వామపక్ష ఉద్యమం బలహీనపడిన మాట వాస్తవంఈ నేపధ్యంలో రాష్ట్రంలో అనేకమంది ఆలోచనాపరుల్లో వామపక్ష ఐక్యతావశ్యకతవైపు దృష్టి మళ్లుతోందిఈ కోరిక, ఆలోచన వామపక్ష అభిమానులు, వామపక్ష మేధావులలో ఉందివామపక్ష పార్టీలలోనే చాలామందిలో ఇలాంటి కోరిక లేకపోలేదుసాధారణ ప్రజానీకంలో కూడా అధికార పార్టీల పాలనా విధానంతో విసుగెత్తి మరొక ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూడటం ప్రారంభం అయ్యిందిఅది వామపక్ష ప్రత్యామ్నాయమైతే బాగుంటుందన్న అభిప్రాయమూ వెల్లడవుతోంది. కుల, మత, ప్రాంతీయ రాజకీయాల ప్రభావం పెరుగుతోందివిశాల దృక్పథంనుండి, సమస్యలకు కారణమైన ప్రాధమిక అంశాల నుండి ప్రజలను పక్క దోవ పట్టించేందుకు కుల, మత, ప్రాంతీయ అంశాలతో ఏర్పాటైన పార్టీలు, గ్రూపులు ప్రయత్నిస్తున్నాయి. పరిపాలనలో కూడా నిరంకుశ ధోరణులు ప్రబలుతున్నాయితమను కాదనేవారు లేరన్న అహంకారంతో కేంద్రంలోనూ అనేక రాష్ట్రాలలోనూ పరిపాలన సాగుతోంది.  


ఒకనాటి వామపక్షాలు చేసిన త్యాగాలు, పార్టీ వారి నిబద్ధత, సాధారణ జీవితం, కష్టపడి పనిచేసే మనస్తత్వం, అంకితభావం, ప్రజల మనస్సులో ఇంకా చెరిగిపోలేదువాటి ఘన కీర్తి ఇంకా గుర్తుందిఇతర పార్టీలతో పోల్చినప్పుడు వామపక్షాల సమరశీలతను శంకించేవారు లేరనే చెప్పాలి. పరిష్కారానికి నోచుకోని సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి నానాటికి పెరుగుతోందిసమస్యలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అసంతృప్తి కూడా అదే స్థాయిలో వ్యక్తమవుతోందిపాలకపార్టీల వల్ల నిరసన ధోరణి పెరుగుతోందిఇవన్నీ వామపక్ష ఐక్యతకు దోహదం చేసే అంశాలే. వామపక్ష పార్టీలకు వేరే ఏ పార్టీకీ లేని గొప్ప మేధో పెట్టుబడి ఉందివామపక్షాల సిద్ధాంత బలాన్ని ఎప్పటికప్పుడు పటిష్టం చేస్తున్నారు అనేకమంది వామపక్ష మేధావులుప్రజా ఉద్యమాలకు వీరు పెద్ద పెట్టుబడి వంటివారువామపక్ష ఐక్యతను కోరుకునేవారికి ఇది శుభపరిణామంవామపక్ష పార్టీలకు మంచి అవకాశం. కాకపోతే, ఈ తరం వామపక్ష నాయకులు, తాము ప్రజలకూ-ఉద్యమాలకూ మధ్య వారధులం అనే విషయం మర్చిపోతున్నారు.


          రాష్ట్రంలో ప్రధాన రాజకీయపక్షాలుగా సిపిఎం, సిపిఐ ఉన్నాయిఅదే సందర్భంలో ఎర్రజెండా కింద వేర్వేరు పేర్లతో మరికొన్ని చిన్న పార్టీలు ఉన్న సంగతి మర్చిపోలేంస్థూలంగా మార్క్సిజాన్ని ఆమోదిస్తున్నట్లు చెప్పుకునే పార్టీలుగా ఇవి ఉన్నాయిఐతే, మార్క్సిజం అంటే, ప్రధానంగా ఉద్యమాల నిర్వహణ అనే విషయం ఆ పార్టీలకు జ్ఞప్తికి రావడం లేదు. వామపక్ష ఐక్యత అన్నప్పుడు వాటన్నిటి మధ్య ఐక్యత సాధ్యమా అన్న ప్రశ్న ఉదయిస్తున్నది. ఉదాహరణకు పీపుల్స్ వార్, జనశక్తి లాంటి పార్టీలు, ఇందులో నుండి మళ్లీ చీలిన కొన్ని గ్రూపులుగా ఉన్నాయిఈ పార్టీలూ, గ్రూపులూ పూర్తిగా సాయుధ పోరాటం పేరుతో వ్యక్తిగత హింసావాదానికి అంకితమై పనిచేస్తున్నాయివారికి ప్రజలపైనా, ప్రజాతంత్ర పోరాటాలపైనా, ప్రజా ఉద్యమాలపైనా విశ్వాసం లేదువారితో ఐక్యత సాధ్యమని భావించలేము. ఐనా ప్రయత్నించడంలో తప్పులేదు. మరొక రెండు పార్టీలు ఒకవైపు సాయుధ దళాలను కలిగి ఉంటూనే మరోవైపు ప్రజా ఉద్యమాలు సాగిస్తున్నాయిమరికొన్ని చిన్న చిన్న గ్రూపులు వారి వారి ప్రజా సంఘాలద్వారా ప్రజల్లో పనిచేస్తున్నాయిఇటువంటి అనేక పార్టీలు లేక గ్రూపులతో గత కొంతకాలంగా ఏదో ఒక మాదిరి ఐక్య వేదిక పనిచేస్తూనే వుందికానీ కొన్ని గ్రూపులు లేక పార్టీలు మిగిలిన గ్రూపులు లేదా పార్టీలను కమ్యూనిస్టు పార్టీలుగా గుర్తించడానికి నిరాకరించే విచిత్రమైన పరిస్థితి కూడా నెలకొని ఉందికొన్ని పార్టీలు మరి కొన్నింటిని వామపక్ష పార్టీలుగా గుర్తించ నిరాకరించే పరిస్థితి కూడా ఉందిఇలాంటి రాద్ధాంతాల మధ్య అర్ధవంతమైన ఐక్యతఎంత కష్టమో ఊహించవచ్చుఅయినా కొన్ని సమస్యలు ముందుకు వచ్చినప్పుడు ఏ ఏ సమస్యలమీద ఉమ్మడి అవగాహన సాధ్యమైతే ఆ సమస్యపైనే ఐక్య ఉద్యమాలు ఆందోళనలు నడిపే ప్రయత్నం చేస్తే బాగుంటుంది


          వామపక్ష ఐక్యత ప్రాముఖ్యతను ప్రధాన వామపక్ష పార్టీలైన సిపిఎం, సిపిఐలు గుర్తించినట్లే కనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో సాధ్యమైనంత వరకూ ఉమ్మడి అవగాహన కుదిరిన మేరకు అన్ని వామపక్ష పార్టీలను, గ్రూపులను కలుపుకుని వెళ్లేందుకు నిజాయితీగా, హృదయపూర్వకంగా ప్రయత్నిస్తున్నట్లే అనిపిస్తుంది. కాని ఎన్నికల వరకే ఒక్కో సారి ఈ ఐక్యత పరిమితమైనట్లు కనిపిస్తుంది.


వామపక్ష పార్టీల ఐక్యత కేవలం ఎన్నికల కోసమే కాదుఐక్యతా నినాదం పరమార్థం ఎన్నికల అవగాహన కారాదు. ప్రజా ఉద్యమాలు ప్రచార ఆందోళన కార్యక్రమాలు మిలిటెంట్ పోరాటాలు ఉమ్మడిగా నిర్వహించే ప్రయత్నాలు నిరంతరం జరగాలిప్రజా సమస్యలపై నిరంతరం ఐక్య కార్యాచరణకు ప్రయత్నాలు జరగాలిఐక్య కార్యాచరణకు ప్రాధాన్యం ఇస్తూనే స్వతంత్ర కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించాలికార్యకర్తల్లో నిర్లిప్తతను తొలగించాల్సిన అవసరం ఉందివారిలో సైద్ధాంతిక అవగాహన పెంచేందుకు కృషి జరగాలిపనిచేసే చోట ఆందోళనలు, ప్రచారోద్యమం నివాసిత ప్రాంతాల్లోనూ జరగాలిఅసంఘటిత రంగం కార్మికులను సమీకరించడం ఒక ముఖ్య కర్తవ్యం, అదే సందర్భంలో మహిళలపై కూడా కేంద్రీకరించి పనిచేయాలిప్రతి అడుగూ, ప్రతి చర్యా చిత్తశుద్ధితో ఉండాలిపట్టుదలతో కొనసాగాలిప్రత్యేకించి సిపిఎం, సిపిఐ నాయకత్వం మధ్య రాష్ట్రస్థాయిలో తరచుగా సమావేశాలు జరగాలిఈ చర్చలు పూర్తి సుహృద్భావ పూర్వక వాతావరణంలో జరగాలిఅభిప్రాయాలు, వాదనలు స్వేచ్ఛగా వినిపించుకోవాలిఉద్యమాల నిర్వహణపై అభిప్రాయాలను సమన్వయంతో మార్చుకోగలగాలిఇవన్నీ జరిగితే దాని ఫలితాలు, ప్రభావం పార్టీ శ్రేణులపై పడి భవిష్యత్ లో సానుకూల పరిణామాలకు స్పూర్తి కలిగిస్తాయిఈ మహోన్నతమైన కర్తవ్యాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు విజయవాడలో సదస్సు నిర్వహించిన పెద్దలు నడుం బిగిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది?

Tuesday, October 23, 2012

ఐక్య రాజ్య సమితి ఆవిర్భావం-పురోగతి: వనం జ్వాలా నరసింహారావు


అక్టోబర్ 24 న ఐక్య రాజ్య సమితి 67 వ ఆవిర్భావ దినం సందర్భంగా
వనం జ్వాలా నరసింహారావు

          అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక-సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమిష్టి కృషి లాంటి కార్యక్రమాలను చేపట్టి అమలు చేసేందుకు, ప్రపంచవ్యాప్తంగా వున్న పలు దేశాలు, సమష్టిగా ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితి. ప్రధమ ప్రపంచ సంగ్రామం ముగిసిన తర్వాత, ఏర్పాటు చేసుకున్న నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో విఫలం కావడంతో, దానికి ప్రత్యామ్నాయంగా, 1945లో ఐక్య రాజ్య సమితి స్థాపన జరిగింది. ప్రస్తుతం ఐక్య రాజ్య సమితిలో 193 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్య రాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. అవి: సర్వ ప్రతినిధి సభ, భద్రతా మండలి, సచివాలయం, ధర్మ కర్తృత్వ మండలి, ఆర్థిక-సాంఘిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం. సర్వప్రతినిధి సభలో ఐక్య రాజ్య సమితిలో చేరిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్లకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్. ఐక్య రాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం ఐక్య రాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు.


          రెండవ ప్రపంచ యుద్ధం ఇంకా జరుగుతున్న సమయంలోనే, 1941 ఆగష్టులో అమెరికా అధ్యక్షుడు థియోడోర్ రూజ్‌వెల్ట్, బ్రిటిష్ ప్రధాని విన్‌ స్టన్ చర్చిల్ అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమై అట్లాంటిక్ ఛార్టర్ అనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధ భయాన్ని తొలగించడం, శాంతిని నెలకొల్పడం, నిరాయుధీకరణ వంటి ఎనిమిది అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందమే తరువాత ఐక్య రాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందింది. తరువాత 1944లో వాషింగ్టన్ లోని డంబార్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి ప్రకటన పత్రం ముసాయిదాను రూపొందించారు. దరిమిలా, 1945 ఫిబ్రవరిలో యాల్టా సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా నేతలు ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానం చేశారు. ఆ తర్వాత చైనా, అలనాటి సోవియట్ యూనియన్-నేటి రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అమెరికా దేశాలు ఈ సమావేశం ఆధారంగా తయారుచేసిన ఛార్టర్‌కు ఆమోదముద్ర వేశాయి. నేటి వరకూ ఆ ఐదు దేశాలు భద్రతామండలిలో శాశ్వత  సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో 1945 ఏప్రిల్ 25నుండి జూన్ 26 వరకు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో 50 దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్య రాజ్య సమితి ఛార్టర్‌పై సంతకాలు చేశారు. 1945 అక్టోబర్ 24న న్యూయార్క్ నగరంలో ఐక్య రాజ్య సమితి లాంఛనంగా ప్రారంభమైంది.


           యుద్ధాలు జరగకుండా చూడటం, అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, సభ్య దేశాల మద్య స్నేహ సంబంధాలను పెంపొందించడం, అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించే ట్లు చూడడం, సాంఘిక అభివృద్ధి సాధించి మానవ జీవితాలను సుఖమయం చేయడం, ఐక్య రాజ్య సమితి ప్రధాన ఆశయాలు. 


ఐక్య రాజ్య సమితికి వున్న ఆరు ప్రధానాంగాలలో సర్వప్రతినిధి సభకు అత్యంత ప్రాముఖ్యముంది. ఈ సభలో సభ్యదేశాలన్నింటికీ ప్రాతినిధ్యం వుంటుంది. ప్రతి దేశానికి సమానంగా ఒక్క ఓటు ఉంటుంది. సమావేశాలకు ప్రతి సభ్యదేశం గరిష్టంగా ఐదుగురు సభ్యులను ప్రతినిధులుగా పంపవచ్చు. ఈ సభ సంవత్సరానికి ఒక పర్యాయం, సాధారణంగా సెప్టెంబరు మాసంలో, సమావేశమౌతుంది. సభ్యదేశాలు ఎన్నుకున్న వ్యక్తి సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కొత్తగా ఐక్యరాజ్యసమితిలో చేరదల్చుకున్న దేశాలకు ప్రవేశం కల్పించడానికి, భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశాలను ఎన్నుకోవడానికి ఈ సభకే అధికారముంది. సమితి ఆశయాలకు, లక్ష్యాలకు వ్యతిరేకంగా వ్యవహరించే సభ్యదేశాలను తొలగించే అధికారం కూడా ఈ సభకు ఉంది. అన్ని రంగాలలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం దీని కర్తవ్యం. ఈ సభ మూడింట రెండు వంతుల మెజారిటీతో నిర్ణయాలు చేస్తుంది. సర్వప్రతినిధి సభతో సమానంగా, ఆ మాటకొస్తే ఒకవిధంగా అధికంగా సమితిలో ప్రాధాన్యత వున్న మరో అంగం భద్రతా మండలి. సమితి ప్రారంభమయ్యేనాటికి ఇందులో సభ్యదేశాల సంఖ్య 11. ప్రస్తుతం 15 సభ్యదేశాలున్నాయి. అందులో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా 10 రెండేళ్ల కాలవ్యవధి కొరకు ఎన్ని కయ్యే తాత్కాలిక సభ్యదేశాలు. అమెరికా, రష్యా, ఇంగ్లాండు, చైనా, ఫ్రాన్సు లు ఇందులో శాశ్వత సభ్యదేశాలు. ఈ శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం వుంటుంది. సమితి ప్రారంభమైనప్పటి నుంచి ఇందులో ప్రధానమైన రెండు మార్పులు చేశారు. ప్రారంభంలో ఆరు తాత్కాలిక సభ్యదేశాలుండగా దాని సంఖ్యను దరిమిలా పదికి పెంచారు. వీరిలో ఆసియా-ఆఫ్రికా దేశాలనుండి ఐదుగురు, లాటిన్ అమెరికా దేశాలనుండి ఇద్దరు, పశ్చిమ యూరప్ నుండి ఇద్దరు, తూర్పు యూరప్‌నుండి ఒక్కరు ఎన్నికవుతుంటారు. నేషనలిస్ట్ చైనా స్థానంలో కమ్యూనిస్ట్ చైనాకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. తాత్కాలిక సభ్యదేశాలను సాధారణ సభ ఎన్నిక చేస్తుంది. ఏ దేశం కూడా వరుసగా రెండు పర్యాయాలు ఎన్నిక కాకూడదు. దీనికి అధ్యక్షుడు ప్రతి నెలా మారుతుంటాడు. భద్రతా మండలి ఆదేశాలను పాటించని సభ్య దేశాలపై అది ఆంక్షలు విధిస్తుంది. సైనిక చర్య కూడా చేపట్టే అధికారముంది.


          మూడో అంగం సచివాలయం. ఐక్యరాజ్యసమితి సచివాలయ కార్యాలయం సమితి వ్యవహారాలు నిర్వహించే కార్యనిర్వాహక విభాగం. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. ఇందులో పది వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తారు. సచివాలయ ప్రధానాధికారిని సెక్రటరీ జనరల్ అంటారు. సమితికీ-దాని వివిధ విభాగాలకు, అనుబంధ సంస్థలకు కావాల్సిన సమాచారం, అధ్యయనం, సదుపాయాలు వంటి విషయాలు సచివాలయం అధ్వర్యంలోనే నిర్వహించబడతాయి. ప్రతిభ, నిజాయితీ, పనితనం, వివిధ ప్రాంతాలకు సముచితమైన ప్రాతినిధ్యం అనే అంశాల ప్రాతిపదికగా సమితి ఉద్యోగుల ఎంపిక జరుగుతుంది. నాలుగో అంగం ధర్మ కర్తృత్వ మండలి. కొన్ని పాశ్చాత్య దేశాల వలస పాలన క్రింద కొనసాగిన భూభాగాల ప్రయోజనాలను కాపాడడం ఈ మండలి లక్ష్యం. ఇక్కడి ప్రజలను స్వీయ ప్రతిపత్తికి లేదా స్వయం పాలనకు లేదా స్వాతంత్ర్యానికి సిద్ధం చేయడం ఈ మండలి బాధ్యత. ఇది సంవత్సరానికి రెండు సార్లు సమావేశమవుతుంది. ఇందులో మూడు రకాల సభ్యత్వాలు ఉన్నాయి. అవి: ధర్మ కర్తలుగా కొన్ని దేశాలను పాలిస్తున్న దేశాలు, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు, మూడేళ్ల కాల పరిమితికి ఎన్నికైన దేశాలు. ఐదోది ఆర్థిక, సాంఘిక మండలి. ఇది సాధారణ సభ అధ్వర్యంలో పని చేస్తుంది. ఇందులో 54 మంది సభ్యులుంటారు. ఈ మండలి ఏటా రెండుసార్లు సమావేశమవుతుంది. ప్రజల జీవన స్థాయిని మెరుగు పరచడం, విద్య, సాంస్కృతిక, ఆరోగ్య రంగాలలో అంతర్జాతీయ సహకారానికి కృషి చేయడం, మానవ హక్కులను సమర్థించడం వంటివి ఈ మండలి ఆశయాలు. ఇక చివరిది-ఆరోది అంతర్జాతీయ న్యాయస్థానం. దీనిని సాధారణంగా "ప్రపంచ న్యాయస్థానం" అని అంటారు. ఐక్యరాజ్యసమితి యొక్క ప్రాధమిక తీర్పులను ప్రకటించే అంగం ఇది. దీని కేంద్రం నెదర్లాండ్ లోని హేగ్ నగరంలో గల, శాంతి సౌధం. దీని ప్రధాన కార్యక్రమం, సభ్యదేశాల ద్వారా సమర్పించబడిన "న్యాయపర వాదనలు" ఆలకించి తీర్పు చెప్పడం. అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రెండూ వేరు వేరు సంస్థలు. వీటి రెండింటికి ప్రపంచ పరిధి వుంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు 1945లో ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా స్థాపించబడింది. 1946 నుండి పనిచేయడం ప్రారంభించింది. 


          ప్రత్యేక ఒప్పందాల ద్వారా ఏర్పడిన ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థలు అంతర్జాతీయ ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా, వైద్య రంగాలలో పని చేస్తుంటాయి. ఐక్య రాజ్య సమితి అంగాలలో ఒకటైన "ఆర్ధిక, సామాజిక మండలి" ఈ అనుబంధ సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఇందులో యునెస్కో-ఐక్య రాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ ప్రధానమైంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని పారిస్. ఈ సంస్థను 1946 నవంబరు 4 స స్థాపించారు. విద్య, విజ్ఞానం, సంస్కృతి రంగాలలో అంతర్జాతీయ సహకారానికి, ప్రగతికి, శాంతియుత సంబంధాలకు ఈ సంస్థ కృషి చేస్తుంది. దీని ప్రధాన అంగాలు మూడు. మొదటిది: సాధారణ సభ (జనరల్ కాన్ఫరెన్సు), రెండోది: కార్యనిర్వాహక బోర్డు (ఎగ్జిక్యూటివ్ బోర్డు), మూడోది: మంత్రాలయం (సెక్రెటేరియట్). కార్యనిర్వాహక బోర్డు, సాధారణ సభ ద్వారా నాలుగేండ్ల కాలపరిమితి కొరకు ఎన్నుకోబడుతుంది. దీని డైరెక్టర్ జనరల్ కూడా నాలుగేండ్ల కాల పరిమితికి ఎన్నుకోబడతాడు. దీనిలో పనిచేసే సిబ్బందిలో మూడింట రెండు వంతుల మంది పారిస్ లోనే తమ కార్యక్రమాలను నిర్వహిస్తుండగా, మిగతా వారు ప్రపంచంలోని పలు దేశాలలో వున్న యునెస్కో కార్యాలయాలలో తమ విధులను నిర్వహిస్తారు. ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కావలసిన శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధిని యునెస్కో ప్రధానంగా ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం న్యూఢిల్లీ, కైరో, జకార్తా, మాంటివిడియో, వెనిస్ లలో కార్యాలయాలున్నాయి. ప్రస్తుతం యునెస్కో లో 192 దేశాలకు సభ్యత్వం ఉంది.


          ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి లేదా ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి-యునిసెఫ్, 1946 డిసెంబరు 11న ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూయార్కు నగరం. ప్రస్తుతం దీనిని ఐక్య రాజ్య సమితి బాలల నిధి అని మాత్రమే వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పిల్లలు, వారి తల్లుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. ఐక్య రాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం-యుఎన్డిపి అనే మరో సంస్థ 1965 నవంబరు 22న స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం న్యూయార్కు నగరం. అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటి సంపదను వృద్ధి చేసుకొనేందుకు అవసరమైన శిక్షణ, వైజ్ఞానిక సహాయ కార్యక్రమాలకు ఈ సంస్థ నిధులు సమకూరుస్తుంది. 1990 నుండి యు.ఎన్.డి.పి. యేటా మానవాభివృద్ధి నివేదికను విడుదల చేస్తుంది. ఐక్య రాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం-యుఎన్ఇపి, స్వీడన్ రాజధాని స్టాక్‌ హోమ్ లో 1972 జూన్ 5 న నిర్వహించిన పర్యావరణ సదస్సు ఫలితంగా రూప దిద్దుకొంది. ఆహార, వ్యవసాయ సంస్థ-ఎఫ్‍ఏ‍ఓ ప్రధాన కార్యాలయం రోమ్ నగరంలో ఉంది. 1945 అక్టోబరు 16న కెనడా దేశపు క్విబెక్ నగరంలో జరిగిన సమావేశంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ కారణంగానే ఏటా అక్టోబరు 16ను ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. పౌష్టికాహారం అందించడం, జీవన ప్రమాణాలు మెరుగు పరచడం, గ్రామీణ ప్రజల స్థితిగతులను అభివృద్ధి చేయడం, ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిని, పంపిణీని మెరుగు పరచడం ఈ సంస్థ లక్ష్యాలు. అంతర్జాతీయ కార్మిక సంస్థ-ఐఎల్ఓ కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండు దేశం జెనీవాలో ఉంది. 1919 ఏప్రిల్ 11న నానా జాతి సమితి అనుబంధ సంస్థగా ఈ సంస్థ ఏర్పాటయ్యింది. అనంతరం ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థగా రూపు దిద్దుకొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికుల జీవన ప్రమాణాలు స్థాయిని పెంపొందించడానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. 1969లో ఈ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.


          జెనీవాలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యు‍హెచ్‍ఓ, 1948 ఏప్రిల్ 7న ప్రారంభమైంది. స్విట్జర్లాండు దేశం జెనీవాలో దీని కేంద్ర కార్యాలయం ఉంది. అలెగ్జాండ్రియా, బ్రెజవిల్లే, కోపెన్ హెగెన్, మనీలా, న్యూఢిల్లీ, వాషింగ్టన్ నగరాలలో దీని ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందించడం, అంటు వ్యాధుల నివారణ ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. అందుకోసం వైద్య పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. మలేరియా, క్షయ, మశూచి వంటి వ్యాధులను నిర్మూలించడానికి ఈ సంస్థ కృషి చేసింది. ఎయిడ్స్ వ్యాధి నిరోధానికి ప్రస్తుతం చాలా కృషి చేస్తున్నది. ఐక్య రాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ-యునిడో, సమితి సాధారణ సభకు చెందిన అంగంగా 1966 నవంబరు 17న ఏర్పాటయ్యింది. 1985లో ప్రత్యేక సంస్థగా గుర్తించారు. ప్రధాన కార్యాలయం ఆస్ట్రియా దేశపు వియన్నాలో ఉంది. అభివృద్ధి చెందుతున్న, బాగా వెనుకబడిన దేశాల పారిశ్రామికీకరణకు, సంబంధిత పాలసీలకు ఈ సంస్థ సహకరిస్తుంది.


          ఇతర సంస్థలలో పేర్కొనాల్సింది: ఐక్య రాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్ (శరణార్థుల పరిరక్షణ ఈ సంస్థ ప్రధాన ధ్యేయం. ఈ సంస్థకు 1954, 1981 సంవత్సరాలలో నోబెల్ శాంతి బహుమతి లభించింది), విశ్వ తపాలా సంఘం - యూనివర్సల్ పోస్టల్ యూనియన్ప్రపంచ వాతావరణ సంస్థ - వరల్డ్ మీటియొరలాజికల్ ఆర్గనైజేషన్అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (2005లో ఈ సంస్థకు, దాని అధ్యక్షుడు మహమ్మద్ అల్-బరాదీకి సంయక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది), ఐక్య రాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సదస్సు, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్అంతర్జాతీయ పునర్వ్యవస్థీకరణ, అభివృద్ధి బ్యాంకు లేదా ప్రపంచ బ్యాంకుఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, మల్టిలేటరల్ ఇన్వెస్ట్ మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, అంతర్జాతీయ ద్రవ్య నిధి - .ఎమ్.ఎఫ్


          అఫ్గానిస్తాన్‍ నుంచి 1989 లో సోవియట్ సేనల ఉపసంహరణ విషయంలోను, 1992 లో కాంబోడియాలో యుద్ధ విరమణ పర్యవేక్షణ సందర్భంలోను, 1989 లో నికార్‍గుహలో ఎన్నికల పర్యవేక్షణ వ్యవహారంలోను, కాంగో విషయంలోను, సైప్రస్ వ్యవహారంలోను, ఇరాక్-ఇరాన్ యుద్ధంలో మిలిటరీ అబ్జర్వర్‌గా వ్యవహరించే విషయంలోను, ఇలాంటి మరి కొన్ని సందర్భాలలోను ఐక్య రాజ్య సమితి పాత్ర చెప్పుకో దగ్గది.  అదే విధంగా డిసెంబర్ 10, 1948 న సమితి ఆమోదించిన విశ్వవ్యాప్త మానవ హక్కుల పరిరక్షణ తీర్మానం, ఐక్య రాజ్య సమితి తీసుకున్న నిర్ణయాలలో అత్యంత ప్రాముఖ్యమైంది గా చెప్పుకోవాలి. ప్రతి ఏడాది ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల దినంగా జరుపుకుంటున్నాం. జనవరి 31, 1976 న ఆర్థిక-సామాజిక-సాంస్కృతిక హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక అమల్లోకి వచ్చింది. అదే విధంగా అంతర్జాతీయ సామాజిక-రాజకీయ హక్కుల ఒడంబడిక మార్చ్ 23, 1976 న అమల్లోకి వచ్చింది. 


అరవైయ్యేడేళ్ల ఐక్య రాజ్య సమితి చరిత్రలో మేలెంత జరిగిందో చెప్పడం కష్టమేమో కాని కీడు జరగలేదనే అనాలి.