Showing posts with label పారడైజ్ లాస్ట్. Show all posts
Showing posts with label పారడైజ్ లాస్ట్. Show all posts

Sunday, June 30, 2013

హైదరాబాద్ నగరంలో తొలి అనుభవాలు- కాలేజీ కబుర్లు-Part THREE: వనం జ్వాలా నరసింహారావు

హైదరాబాద్ నగరంలో తొలి అనుభవాలు
కాలేజీ కబుర్లు-Part THREE
వనం జ్వాలా నరసింహారావు

న్యూ సైన్స్ కాలేజీ, బీ ఎస్సీ (ఎం.పీ.సీ) క్లాస్‍లో 150 మందికి పైగా విద్యార్థులుండే వారు. ఎప్పుడూ, సందడిగా, సరదాగా, గలగలా పారే సెలయేరులా వుండేది మా క్లాస్. బయటేమో ఎప్పుడూ..ఏదో ఒక నిర్మాణం జరుగుతుండేది మా కాలేజీలో. కాలేజీకి వున్న మంచి పేరు వల్ల, విద్యార్థుల తాకిడి బాగా వుండేది. అంత మందిని చేర్చుకోవాలంటే, అధిక సంఖ్యలో క్లాస్ రూమ్‌లు కావాలి. అందుకే, ఎప్పుడూ, ఏదో ఒక భవన నిర్మాణం జరుగుతుండేది. ఒక విద్యార్థి...పేరు గుర్తుకు రావడం లేదిప్పుడు...తన దగ్గర ఎప్పుడూ, ఒక "టిక్-టిక్" ధ్వని చేసే టాయ్ వుంచుకునే వాడు. బహుశా...ఆ రోజుల్లోనే అనుకుంటా "దేవాంతకుడు" అనే సినిమా వచ్చి వుండాలి. అందులో హీరో దాన్ని ఉపయోగించేవాడు. ఎవరూ చూడకుండా దాంతో ధ్వని చేయడం అతడికో హాబీ. "సీటింగ్ అరేంజ్ మెంట్" అని రాసి వుంటే, అందులోంచి "ఎస్" అక్షరం తొలగించి, దాన్ని "ఈటింగ్" అని చేసేవాడు. అతడి అల్లరి అంతా-ఇంతా కాదు.

మరి కొందరి క్లాస్ మేట్స్ పేర్లు కూడా గుర్తుకొస్తున్నాయి. ఖమ్మంలో నాతో పాటు పియుసి చదువుకున్న బాల మౌళి (ఇప్పుడో పెద్ద ఛార్టెడ్ అకౌంటెంట్) ఇక్కడ కూడా క్లాస్ మేట్ అయ్యాడు. రాం ప్రసాద్ (ఆయన భార్య గీత..ఆ తరువాతి కాలంలో నాకు స్నేహితురాలైంది) మరొక క్లాస్ మేట్. అతడిప్పుడు ఒక ప్రయివేట్ కంపెనీలో పని చేసి రిటైరై బెంగుళూరులో వుంటున్నాడు. అలానే...రంగ రామానుజం, కుల్ కర్ణి (అతివాద-తీవ్ర వాద భావాల విద్యార్థి), జ్యోతి ప్రసాద్, ఎర్రం రాజు, మల్లికార్జున్, బాబ్జి, సుబ్బా రావు (సీనియర్ సైంటిఫిక్ అధికారిగా పదవీ విరమణ చేశాడు), వి.ఎస్.పి. శాస్త్రి, మల్లాడి వెంకట సుబ్బయ్య, కపాడియా, త్యాగరాజన్, టి. ఆర్. శ్రీనివాసన్ (ప్రస్తుతం షికాగోలో స్థిరపడ్డాడు)...తదితరులు కూడా నాకు క్లాస్ మేట్సే. నిజాం కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం పూర్తి చేసిన వల్లూరి శ్రీ రాం అనే అతడిని, ప్రిన్సిపాల్ సుదర్శన్ నచ్చ చెప్పి ఫైనల్ ఇయర్ లో మా కాలేజీలో, మా క్లాస్ లో చేర్పించాడు. అతడికి లాంగ్వేజెస్ లో యూనివర్సిటీ ఫస్ట్ రావడంతో, ఫైనల్ డిగ్రీలో కూడ అతడికే రాంక్ వచ్చే అవకాశాలున్నాయని భావించిన సుదర్శన్ గారు అలా చేశారు. ఆయన గెస్ నిజమైంది. డిగ్రీలో అతడికే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. క్రెడిట్ న్యూ సైన్స్ కాలేజీకి దక్కింది. ఆయన పక్క నంబరైన నేను కనీసం పాసు కూడా కాలేదు! అసలు పరీక్షలే రాయలేదు! ఇంటర్ నెట్‌లో చూస్తే, శ్రీ రాం అమెరికాలో పని చేస్తున్నట్లు అర్థమైంది.

లెక్చరర్ల విషయానికొస్తే, బహుశా, అంత నైపుణ్యం కల అధ్యాపకులు, మరే కాలేజీలోను వుండరంటే అతిశయోక్తి కాదేమో! తెలుగు బోధించడానికి ఇద్దరుండేవారు. ఒకరి పేరు "మంజు శ్రీ"...మరొకరి పేరు "అరిపిరాల విశ్వం". మాకు తెలుగు పాఠ్య పుస్తకంగా "ఆంధ్ర మహాభారతోపన్యాసాలు", నాన్-డిటేల్‍గా "పురుషోత్తముడు", నాటకంగా "హాలికుడు" వుండేవి. ఆంధ్ర మహాభారతోపన్యాసాలు లో, ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్న సందర్భంలో ఆయనను ఆక్షేపిస్తూ శిశుపాలుడు పద్య రూపంలో అన్న మాటలు "అవనీ నాధు లనేకు లుండఁగ విశిష్టారాధ్యు లార్యుల్ మహీ దివిజుల్ పూజ్యులు పల్వు రుండఁగ ధరిత్రీనాథ! గాంగేయుదుర్వ్యవసాయంబునఁ గృష్ణు గష్టచరితున్ వార్ష్ణేయు బూజించి నీ యవివేకం బెఱిఁగించి తిందఱకు దాశార్హుండు పూజార్హుఁడే" ఇంకా గుర్తున్నాయి. పద్య భాగం పుస్తకం పేరు గుర్తుకు రావడం లేదు కాని ఒక పాఠం..."గంగావతరణం" ఇంకా గుర్తుంది. అందులోని ఒక పద్యం...."ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సుశ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి యస్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గంగా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్".....కొంచెం..కొంచెం గుర్తుకొస్తోంది. అరిపిరాల విశ్వం గారి తమ్ముడు రామ్మోహన రావు కూడా నా క్లాస్ మేట్.


New Science College

ఇంగ్లీష్ లెక్చరర్లుగా "షమీం" మేడం, "వి. వి. చారి" గారుండేవారు. పాఠ్య పుస్తకం-వాచకంగా ఇ.ఎఫ్.డాడ్ సంపాదకీయంలోని వ్యాసాల సంకలనం వుండేది. ఎ. జి. గార్డినర్ రాసిన వ్యాసం ఒకటుంది. ఇ. ఎం. ఫార్ స్టర్ రాసిన "పాసేజ్ టు ఇండియా" నాన్-డిటేల్ గా వుండేది. ఫార్ స్టర్ ఆ పుస్తకాన్ని 1924 లో భారత దేశంలో ఆంగ్లేయుల పాలన-1920 నాటి స్వాతంత్ర్య పోరాటం నేపధ్యంలో రాశారు. ప్రపంచంలోని వంద అత్యుత్తమైన ఇంగ్లీష్ లిటరేచర్ పుస్తకాలలో ఒకటిగా పాసేజ్ టు ఇండియాను "మాడరన్ లైబ్రరీ" ఎంపిక చేసింది. 1923-2005 మధ్య కాలంలో వచ్చిన అత్యుత్తమైన వంద ఇంగ్లీష్ నవలలో ఒకటిగా ఈ పుస్తకాన్ని "టైం మాగజైన్" ఎంపిక చేసింది. నవల మొత్తం కేవలం నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుంది. డాక్టర్ అజీజ్, ఆయన బ్రిటీష్ స్నేహితుడు సిరిల్ ఫీల్డింగ్, శ్రీమతి మూర్, కుమారి అడెలా క్వెస్టెడ్. ఇంగ్లీష్ పోయెట్రీలో కొన్ని పాఠాలు గుర్తున్నాయి. జార్జ్ హెర్బర్ట్ రాసిన "Virtue" (సద్గుణం, సత్ ప్రవర్తన) లో చక్కటి నీతి వుంది. ప్రపంచం మొత్తం కాల గర్భంలో కలిసి పోయినా మనిషి సత్ ప్రవర్తన, సద్గుణం అజరామరంగా వుంటుందని దాని భావన ("Only a sweet and virtuous soul, Like seasoned timber, never gives; But though the whole world turn to coal. Then chiefly lives"). మరో పోయెం 1608-1674 మధ్య కాలంలో జీవించిన "జాన్ మిల్టన్" రాసిన "పారడైజ్ లాస్ట్". ఆయనే రాసిన మరో పోయెం "ఆన్ హిజ్ బ్లయిండ్ నెస్". ఇంకో పోయెం కూడా గుర్తుంది. అది "విలియం వర్డ్ స్‌ వర్త్" రాసిన "సాలిటరీ రీపర్" (...."Alone she cuts and binds the grain, And sings a melancholy strain..."). జనరల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ను నాందేడ్కర్, సుబ్రహ్మణ్యం సార్లు చెప్పేవారు. చాలా ఇంటరెస్టింగ్ గా వుండేదా క్లాస్.

ఆప్షనల్ సబ్జెక్టులైన లెక్కలు, భౌతిక, రసాయన శాస్త్రాలు చెప్పే లెక్చరర్లు ఆయా విషయాలను అత్యంత ఆసక్తికరంగా బోధించే వారు. లెక్కల సబ్జెక్టులో మేం ఫైనల్ ఇయర్ పరీక్షల్లో మూడు పేపర్లు రాయాలి. ఒకటి "బీజ గణితం", రెండోది "రేఖా గణితం", మూడోది "త్రికోణమితి". రేఖా గణితం పుస్తకం "మాణిక్య వాచికం పిళ్లే" రాసిన దాన్ని ఉపయోగించే వాళ్లం. బీజ గణితాన్ని "షఫీ ఉల్ హక్", రేఖా గణితాన్ని "భాస్కర రావు", త్రికోణమితిని డాక్టర్ కుప్పుస్వామి బోధించేవారు. నాకు మొదటి నుంచి లెక్కల సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టంగా వుండేది. పరీక్ష రాసిన ప్రతి సారీ ఆ ఒక్క సబ్జెక్ట్ పాసయ్యేవాడిని మంచి మార్కులతో. మిగతావి (భౌతిక, రసాయన శాస్త్రాలు) రాయడానికే భయం వేసేది. భౌతిక శాస్త్రాన్ని "హరి లక్ష్మీపతి", "ప్రభాకర్" బోధించేవారు. భౌతిక శాస్త్రంలో "మాడరన్ ఫిజిక్స్" అనే నాలుగో పేపర్ కూడా వుండేది. డిమాన్ స్ట్రేటర్‌గా పి. వి. వి. ఎస్. మూర్తి మాతో ప్రయోగశాలలో ప్రాక్టికల్స్ చేయించేవారు. వాటిల్లో "వెలాసిటీ ఆఫ్ సౌండ్", "వర్నియర్ కాలి పర్స్", "స్క్రూ గేజ్"", ఫిజికల్ బాలెన్స్" లతో చేసిన ప్రయోగాలింకా గుర్తున్నాయి. అదే విధంగా రసాయన శాస్త్రం ప్రయోగాలను "రఘురాం" గారు చేయించేవారు. "వాల్యూ మెట్రిక్ అనాలసిస్", "పిప్పెట్, బ్యూరెట్ట్" ఉపయోగించడం తో పాటు "కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు" తయారు చేయించడం చేసే వాళ్లం. రసాయన శాస్త్రం థియరీలో మూడు భాగాలుండేవి. "ఆర్గానిక్", "ఇన్-ఆర్గానిక్", "ఫిజికల్" అనే ఆ మూడింటిని ముగ్గురు లెక్చరర్లు బోధించేవారు. "వై. సూర్యనారాయణ మూర్తి" ఆర్గానిక్ సబ్జెక్టు చెప్పేవారు. ఇప్పటికీ ఆయన బోర్డు మీద వేసిన "బెంజిన్ రింగ్" కళ్లలో మెదులుతుంది. ఇన్-ఆర్గానిక్ అంశాన్ని ప్రిన్సిపాల్ సుదర్శన్ గారు చెప్పేవారు. ఫిజికల్ కెమిస్ట్రీని కూడా వై.ఎస్.ఎన్ గారు చెప్పినట్లు గుర్తు. సర్కార్ అండ్ రక్షిత్ రాసిన ఆర్గానిక్ కెమిస్ట్రీ పుస్తకాన్ని, బాల్ అండ్ తులి రాసిన ఇన్-ఆర్గానిక్ కెమిస్ట్రీ పుస్తకాన్ని చదివే వాళ్లం. లైబ్రరీకి అడపదడప పోయే వాళ్లం. లైబ్రేరియన్‍గా పుల్లయ్య పని చేసేవాడు. తరువాత రోజుల్లో (1973-1974) ఉస్మానియా యూనివర్సిటీలో నేను లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ చేసేటప్పుడు, అతడు కూడా నాతోపాటు చదివాడు.


కాలేజీ చదువుతో పాటు క్రికెట్ ఆటకు క్రమం తప్పకుండా పోవడం కూడా అలవాటు చేసుకున్నాను. బర్కత్ పూరా సమీపంలోని ఆంధ్ర యువతీ మండలి మైదానంలో క్రికెట్ ప్రాక్టీసుకు వెళ్లేవాడిని. "జాలీ రోవర్స్ క్రికెట్ క్లబ్" ఆ రోజుల్లో హైదరాబాద్ "బి-లీగ్" మాచ్‍లు ఆడుతుండేది. నేను ఆ క్లబ్ పక్షాన ఆడేవాడిని. అంతగా ఆటలో రాణించక పోయినా ప్రాక్టీసు మానక పోయేవాడిని. నేను ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో ఆడిన పెద్ద క్రికెట్ క్రీడాకారుల్లో "అబ్దుల్ హాయ్", "సాయినాథ్", "ప్లహ్లాద్" వున్నారు. దరిమిలా వాళ్లంతా రంజీ ట్రోఫీ స్థాయి వరకు ఎదిగారు. నేను హైదరాబాద్‌లో ఆడడంతో, శెలవులకు ఖమ్మం వెళ్లినప్పుడు నాకు అదో రకమైన గౌరవం లభించేది. ఖమ్మం మామిళ్లగూడెం క్రికెట్ క్లబ్ పక్షాన టోర్నమెంటులకు వెల్లే జట్టులో నేనుండే వాడిని. ఖమ్మంలో వనం రంగారావు, నర్సింగరావు, శేషగిరి, మూర్తి, దిలీప్, శంకర్, దివాకర్, ప్లహ్లాద్, కళాధర్, రాధాకృష్ణ...లాంటి వారితో కలిసి ఆడాను.