Showing posts with label ఆంధ్ర వాల్మీకి రామాయణం. Show all posts
Showing posts with label ఆంధ్ర వాల్మీకి రామాయణం. Show all posts

Tuesday, January 5, 2010

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందో ప్రయోగాలు -5

ఆంధ్ర వాల్మీకి- కవి సార్వభౌమ

శ్రీ వావిలి కొలను సుబ్బారావు- వాసుదాస స్వామి

రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణం

అరణ్య కాండ-- ఛందో ప్రయోగాలు-- వనం జ్వాలా నరసింహా రావు

శ్రీ సీతా రామలక్ష్మణులు అరణ్యవాసం కొనసాగిస్తున్న తొలినాళ్లలో, అడవిలో పోతున్నప్పుడు పర్వత శిఖరంలా పొడవైన దేహమున్న భయంకరాకారుడైన ఒక క్రూరుడిని చూశాడు రామచంద్రమూర్తి. విరాధుడనే వాడు, సీతా రామలక్ష్మణులను చూసి కోపంతో వారిమీద పడి సీతను చంకలో పెట్టుకొని, తన పేరు వారికిచెప్పి, "పాపాత్ములైన వారిని" చంపి, ఆమెను పెళ్లిచేసుకుంటానని బెదిరించాడు. భయపడుతున్న సీతాదేవిని చూసిన రాముడు ఆమెకెంత ఆపదొచ్చిందో చూడమని తమ్ముడు లక్ష్మణుడితో అంటాడు. స్పష్ఠమైన తన భుజబలంతో వాడిని చంపుతానని అన్నతో అంటూ లక్ష్మణుడు, విరాధుడిని, వాడెవడని, వాడి పుట్టు పూర్వోత్తరాలేంటని అడుగుతాడు. విరాధుడిచ్చిన జవాబును "వసంతమంజరి" లో పద్యంగా రాసారు వాసు దాసుగారు ఈ విధంగా:

వసంతమంజరి: వినుము నా జనకుండు జయుఁ డను వీరుఁ డంబ శతహ్రదా

ఖ్య నిఖిలావనిఁ గల్గుదనుజని కాయ మెల్ల విరాధుఁ డం

చును వచించును నన్నుఁ దపమున సూర్యవంశ్య ! వరంబునేఁ

గొనితి శస్త్రముచేత మరణముఁ గూర కుండఁ గ బ్రహ్మచేన్ -41

తాత్పర్యం: నా తండ్రి జయుడు. నా తల్లి శతహ్రద. భూమిపైనున్న తనుజులందరు నన్ను విరాధుడని పిలుస్తారు. నేను తపస్సుచేసి శస్త్రంతో చావులేకుండా బ్రహ్మ వరం పొందాను. (ఆ తర్వాత విరాధుడు రామలక్ష్మణుల చేతిలో చస్తాడు).

ఛందస్సు: వసంతమంజరికి న-భ-భ-న-ర-స-వ గణాలు. పదమూడో అక్షరం యతి స్థానం.

విరాధుడిని వధించిన తర్వాత సీతా రామలక్ష్మణులు శరభంగాశ్రమానికి పోతారు. అరణ్యవాసంలో తాము నివసించుటకు నివాసయోగ్యమైన స్థలమేదో సూచించమని రాముడు కోరగా, శరభంగుడు వారుండుటకు తగిన స్థలం సుతీక్ష్ణుడను మునీంద్రుడు తెలియచేస్తాడని అక్కడికి పొమ్మని చెప్పి తన దేహం వదిలినతర్వాతే అక్కడనుండి వెళ్లమని ప్రార్తించాడు. అక్కడున్న మునులందరూ తమకష్టాలను చెప్పి తమను కాపాడమని కోరడంతో వారికి రాముడు అభయ హస్తమిచ్చిన తర్వాత, బయలుదేరి సుతీక్ష్ణాశ్రమానికి చేరుకుంటారు ముగ్గురూ. ఆ రాత్రి అక్కడే గడుపుతారు వారందరూ. ఆయన సలహామేరకు పంచవటికి ప్రయాణమైపోతుంటారు. బయల్దేరేముందర దాచిపెట్టిన ఆయుధాలను రామలక్ష్మణులకు అందచేస్తుంది సీత. దారిలో సీతాదేవి శ్రీరాముడికి వెంటవస్తున్న లక్ష్మణుడు వింటుండగానే రాబోయేకాలంలో సంభవించనున్న పరణామాలను గ్రహించినదానివలె కొన్ని హితబోధలు చేస్తుంది. ఆ క్రమంలోనే సీత రాముడికి శస్త్ర సాంగత్య దోషాన్ని తెలియచేసే ఇతిహాసాన్ని చెపుతుంది. శస్త్రాన్ని ధరించినట్లైతే దాన్ని ఉపయోగించాలన్న కోరిక పుటుతుందనీ, కాబట్టి అడవుల్లో వాటిని ధరించవద్దనీ, అయోధ్యకు చేరిన తర్వాత ధర్మ రక్షణార్థం శస్త్రం ధరించవచ్చనీ హితబోధచేస్తుంది. ఇక్కడ "మంజుభాషిణి" వృత్తంలో ఒక పద్యాన్ని రాసారు కవి ఈ విధంగా:

మంజుభాషిణి: సిరిఁ యున్ ధరన్ విడిచి చేరి కానలన్

జరియించునీ విపుడు సం యమింబలెన్

దిరుగం దపోనియతి దేవ మోదముం

బరఁ గించు నత్తకును మామగారికిన్ -42

ఛందస్సు: మంజు భాషిణీ వృత్తానికి స-జ-స-జ-గ గణాలుంటాయి. 9వ అక్షరం యతి. సీత "మంజు భాషిణి" అయినందున ఇక్కడ "మంజుభాషిణి" వృత్తంలో పద్యం రాయడం సమంజసమే అంటారు వాసు దాసుగారు.

తాత్పర్యం: అనుభవించాల్సిన ఐశ్వర్యం, పాలించాల్సిన భూమి వదిలిపెట్టి, మునిలాగా అడవులకు చేరిన నువ్వు మునుల్లాగానే తపస్సు చేస్తుంటే రాముడు యదార్థ వాది - తనతో చెప్పినట్లే చేస్తున్నాడని కైక సంతోషిస్తుంది. తన కొడుకు విశేష శ్రమ పడకుండా సుఖంగా వున్నాడని కౌసల్య కూడా సంతోషిస్తుంది. వీరే కాకుండా స్వర్గంలోని మామగారు తన కొడుకు తనను సత్యవాదిని చేస్తున్నాడని సంతోషిస్తాడు. కావున అలానే చేయి.

సీత హితోపదేశాన్ని విన్న రాముడు ఆర్త రక్షణే పరమ ధర్మమని అంటాడు. అడవుల్లో తపస్సు చేసుకుంటున్న మునుల రక్షణ కూడా ధర్మ రక్షణార్థమేనంటాడు. మునులను కాపాడుతానని ప్రతిజ్ఞ చేసానని, బ్రాహ్మణులకిచ్చిన మాటతప్పి తన ప్రతిజ్ఞ విడువనని సత్యాన్ని రక్షించేందుకు ప్రాణాలనైనా, భార్యనైనా, తమ్ముడినైనా విడుస్తానని స్పష్ఠంగా తెలియచేశాడు సీతకు. ఇలా చెప్పుకుంటూ ముగ్గురూ పయనమై పోతుంటారు. వాళ్లలా పోవడాన్ని ప్రణవ స్వరూపం-ప్రణవార్థం వచ్చే విధంగా తేటగీతిలో రాసిన పద్యం ఇలా సాగుతుంది: "అగ్రవర్తియై శ్రీరాముడరుగుచుండె, నువిదతనుమధ్యమధ్యమందుండెసీత, మహిత కోదండదండసంభరణహస్తు, డోలి వెన్నంటె లక్ష్మణుడొప్పుప్రేమ". మొదటిపాదం మొదటి అక్షరం "అ" కారం, రెండవ పాదం మొదటి అక్షరం "ఉ" కారం, మూడోపాదం మొదటి అక్షరం "మ" కారం వున్నాయి. మూడు కలిసి "ఓం" అయిందని, అలానే నాలుగోపాదం మొదటి-కడపటి అక్షరం కలిసి "ఓం" అయిందని కవి వివరించారు. ఈ విధంగా ఈ పద్యం ప్రణవ స్వరూపమని అంటారాయన. ఈ ప్రణవార్థం పరమార్థ తత్త్వాన్ని విపులంగా చూపిస్తుంది. ఇక్కడ "మానిని" వృత్తంలో , అక్కడి పరిసరాలను వర్ణిస్తూ, ఒక పద్యాన్ని రాసారు వాసు దాసుగారిలా:

మానిని: సారము లౌనవసారసకై రవ సౌరభవాసితభాసితకా

సారములుం దటినీతటసై కత సంచరదంచితచక్రయుగీ

వారములున్ గిరిసుందరకందర పాతసుపూతఝరీలహరీ

పూరములున్ సుమమంజులకుంజక పుంజితగుంజదళీంద్రములున్ -43

ఛందస్సు: మానిని వృత్తానికి సప్త "భ" గణాలుంటాయి. ఒక గురువు. 13 వ అక్షరం యతి.

తాత్పర్యం: సారవంతాలై కొత్తగా వికసించిన కమలాల కలువల పరిమళాల గుంపులతో ప్రకాశించే కొలకులతో, నదీతీరంలోని ఇసుక దిబ్బల్లో తిరిగే అందమైన చక్రవాక దంపతుల సమూహాలతో, కొండల్లోని సుందరమైన గుహల్లో పడుతున్న నీళ్లున్న పవిత్రమైన కొండవంకల ప్రవాహాలనే పూలతో, అందమైన పొదల్లోని గుంపుల తుమ్మెదలతో (నిండిన ప్రదేశం).

అగస్త్యాశ్రమానికి పోవడానికి సుతీక్ష్ణుడి అనుమతి తీసుకొంటాడు శ్రీరాముడు. తానే వారిని అక్కడికి పొమ్మమనమని చెప్పదల్చుకున్నానని, దక్షిణంగా నాలుగు యోజనాలు వెళ్తే అగస్త్యుడి సోదరుడి ఆశ్రమం వస్తుందని, అక్కడినుంచి మరో ఆమడ దూరంలో అగస్త్యుడి ఆశ్రమం వుంటుందని అంటాడాయన. అలా ఆయన ఆజ్ఞ తీసుకొని పోతున్న సందర్భాన్ని "తరలము" వృత్తంలో రాసారు వాసు దాసుగారిలా:

తరలము: ముని వచించినత్రోవచొప్పున మువ్వురున్ వనిఁ బోవుచున్

గనిరి త్రోవల క్రేవలన్ ఘన కంధరాకృతబంధురం

బును ధరప్రచయంబునున్ సుమ పూర్ణరమ్యవనంబులన్

గొనబుమీరినవంకలం దమి గూర్చు మేలికొలంకులన్ -44

ఛందస్సు: తరలము వృత్తానికి న-భ-ర-స-జ-జ-గ గణాలుంటాయి. పన్నెండో ఇంట యతి.

తాత్పర్యం: సుతీక్ష్ణ మహాముని చెప్పిన తోవ పట్టుకొని అడవిలో ముగ్గురు బయలుదేరి పోతూ, మార్గ మధ్యంలో, ఇరుపక్కల కారుమబ్బులాగా విస్తారమైన కొండలగుంపును, పూలతో నిండిన మనోహరమైన వనాలను, అందమైన వంకలను, సంతోషం కలిగించే సరస్సులను చూసారు.

సీతారామ లక్ష్మణులు అగస్త్యాశ్రమానికి చేరుకొని, ఆయన దర్శనం చేసుకుంటారు. ఆయన ఇచ్చిన వైష్ణవాయుధాలను తీసుకొంటాడు రాముడు. అక్కడికి రెండామడల దూరంలో "పంచవటి" అనే సుఖప్రదమైన ప్రదేశం వుందని, అక్కడొక ఆశ్రమం నిర్మించుకొని, అరణ్యవాసాన్ని పూర్తిచేసి, తండ్రి వాక్యాన్ని పాలించమని సలహా ఇస్తాడు. పంచవటికి పోయే మార్గాన్నికూడా వివరంగా చెప్తాడు. ఆయన చెప్పిన మార్గంలో పోతుంటారు వాళ్లు. దారిలో జటాయువును చూస్తారు. అక్కడినుండి బయల్దేరి "పంచవటి" చేరుకుంటారు. అక్కడికి చేరుకున్నప్పుడు, ఆ ప్రదేశంలోని చెట్లను రాముడిద్వారా వర్ణించడాన్ని "మత్తకోకిలము" వృత్తంలో పద్యంగా మలిచారిలా కవి:

మత్తకోకిలము: సాలతాలత మాలతుంగర సాలజాల మధూకకు

ద్దాల వంజుల నక్తమాలవి తానసిందుక చందనో

ద్దాలచంపకపారిజాతక దంబనింబకపిత్థత

క్కోలకేసరజంభకింశుక కూటపాటలకోటులన్ -45

ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.

తాత్పర్యం: మద్దిచెట్లు, తాటిచెట్లు, చీకటి మ్రాకులు, తియ్య మామిడిచెట్లు, ఇప్ప, కాంచన చెట్లు, అశోక, కానుగు, సిందుక చెట్లు, సంపంగి, పారిజాత, వేప, వెలగ, పొన్న, నిమ్మ, మోదుగు.. .. చెట్ల సమూహాలతో కూడిన ప్రదేశం.

లక్ష్మణుడు పంచవటిలో పర్ణశాల నిర్మిస్తాడు. అందులో వారు ముగ్గురు మిక్కిలి సుఖంగా నివసిస్తుంటారు. వనవాసం చేద్దామని రాముడు సంకల్పించుకున్న పద్నాలుగు సంవత్సరాలలో పదమూడో సంవత్సరం జరుగుతుంటుంది. ఆ సంవత్సరపు మార్గశిర మాసంలో ఒకనాడు, గోదావరి స్నానం చేసి వచ్చి, పర్ణశాలలో ముగ్గురూ ముచ్చటించు కుంటుంటారు. ఆ సమయంలో శ్రీరాముడిని చూసిన శూర్ఫణఖ ఆశ్రమంలో కొస్తుంది. రాముడిని మోహిస్తుంది. తన కోర్కెను వెల్లడిస్తుంది. పరిహాసంతో రాముడు, తమ్ముడు లక్ష్మణుడిని చూపించి ఆయన దగ్గరకు పొమ్మంటాడు. ఆమె లక్ష్మణుడి వెంట బడుతుంది. లక్ష్మణుడు తనకంటే రాముడే తగినవాడని అక్కడకు పంపుతాడు. రాముడి వద్దకు పోయిన శూర్ఫణఖ సీతను మింగుతానని భయపెడుతూ ఆమె మీదకు పోతుంటే, ఒక పద్యాన్ని "తరలము" వృత్తంలో రాసారు వాసు దాసుగారిలా:

తరలము: అని కురంగకిశోరలోచన నాయలాతనిభాక్షి హు

మ్మనుచు రోహిణిమీఁ ద బారు మహత్తరోల్క యనంగ రాఁ

గని మహాబలశాలి రాముఁ డు గ్రక్కునం బిగఁ బట్టి కిం

కను సుమిత్రతనూజుతో ననుఁ గంటె లక్ష్మణ రక్కసిన్ -46

ఛందస్సు: తరలము వృత్తానికి న-భ-ర-స-జ-జ-గ గణాలుంటాయి. పన్నెండో ఇంట యతి.

తాత్పర్యం: ఈ ప్రకారం చెప్పి, జింకపిల్ల కళ్లలాంటి కళ్లున్న సీతపై, కొరివితో సమానమైన కళ్లున్న శూర్ఫణఖ రోహిణిమీదకు కొరివి నక్షత్రం పోయినట్లు పోవడం చూసిన శ్రీరాముడు దాన్ని బిగబట్టి కోపంతో లక్ష్మణుడి తో ఇలా అంటాడు.

నీచులతో పరిహాసాలాడడం తప్పనీ, శూర్ఫణఖను సరైన రీతిలో శిక్షించాలనీ, దానిని విరూపనుగా చేయమనీ లక్ష్మణుడిని ఆదేశించాడు రాముడు. లక్ష్మణుడు ఆమె ముక్కు-చెవులు తెగగోసి వికార రూపంగా చేశాడు. ఆ వికృత రూపాన్ని చూసిన దాని తమ్ముడు ఖరుడు కోపగించుకుంటాడు. ఆమె వికార రూపానికి కారణమైన సీతారామలక్ష్మణుల వృత్తాంతాన్నితెలుసుకుంటాడు. పగ తీర్చుకునేందుకు పద్నాలుగు మంది రాక్షసులను శ్రీరాముడి మీదకు యుద్ధానికి పంపగా వారందరూ ఆయన చేతిలో చస్తారు. వెంటనే శూర్ఫణఖ ఖరుడిని రాముడిపై యుద్ధానికి ప్రేరేపించడంతో వాడు తన పద్నాలుగు వేలమంది సైన్యంతో పోతాడు. సింహనాదం చేస్తూ యుద్ధానికి సన్నద్ధమౌతున్న ఖరుడిపై గెలవాలని కాంక్షిస్తూ ఆకాశం నుండి వీక్షిస్తున్న దేవతలు, సిద్ధులు, మునులు రాముడికి శుభం కలగాలని కోరుకుంటున్న విధానాన్ని "మాలిని" వృత్తంలో పద్యంగా రాసారిలా:

మాలిని: జయతు జయతు రామ స్సం యుగే సర్వదై త్యా

న్న యగుణహీతచక్రీ వాశరా న్నంచు మింటన్

రయమునఁ జనుదేరన్ రాక్షసక్రూరసేనా

చయములఁ గని రంతన్ సంభ్రమోత్సాహదీప్తిన్ -47

ఛందస్సు: మాలినికి న-న-మ-య-య గణాలు, తొమ్మిదో ఇంట యతి.

తాత్పర్యం: లోకహితం గోరి శుభకార్యాలు చేసే సుదర్శన చక్రధారైన విష్ణువు రాక్షసులను జయించిన విధంగా, శ్రీరామచంద్రుడు సర్వ రాక్షసులను యుద్ధంలో జయించాలని అంటూ, ఆకాశం నుండి (వీక్షిస్తున్న దేవతలు, సిద్ధులు, మునులు) రాక్షస సేన సంతోషంతో-ఉత్సాహంతో ప్రకాశిస్తుండగా చూసారు.

శ్రీరామచంద్రుడు ఖరదూషణాదులతో యుద్ధంచేస్తున్న సమయంలో నెలకొన్న పరిస్థితిని వివరించడానికి వాసు దాసుగారు ఎంచుకున్న వృత్తాలలో మూడు సుగంధి, స్రగ్ధర, కవిరాజవిరాజితములు. ఆ పద్యాలిలా సాగుతాయి.

సుగంధి: మానవేంద్రము క్తశాత మార్గణాసహిష్ణులై

వైనతేయపక్షజాత వాతధూతభూజసం

తానరీతి భీతయాతు ధాన కోటి యోటమై

దీనవృత్తిఁ బారఁ జొచ్చె దేవవైరి డాయఁ గన్ -48

ఛందస్సు: సుగంధికి ర-జ-ర-జ-ర గణాలు. తొమ్మిదింట యతి.

స్రగ్ధర: ఘోరప్రాసాసిఖడ్గా కుటిల శరశతుల్గుప్పగా మీఁ ద గుప్పన్

జ్యారావోద్భిన్న శత్రూచ్చయహృదయపుటీ సద్ముఁ దై కంఠ రావో

దారుం డై శత్రుఘాతార్థముగ భయదగాం ధర్వనారాచ్ మేసెన్

నీరంద్రం బై దిశాళుల్ నిశితఖగతితిన్ నిండ సీతేశుఁ డంతన్ -49

ఛందస్సు: స్రగ్ధరకు మ-ర-భ-న-య-య-య గణాలు. ఎనిమిదింట ఎనిమిదింట యతులు.

కవిరాజవిరాజితము: విరిగినతేరులు గూలినశూరులు వ్రీలినకేతువులున్ గొడుగుల్

తెరచిననోరులు పారెడివీరులు ద్రెళ్లినగౌరులు పొర్లుహరుల్

తరిగినచేతులు తున్గినమూతులు తారెడిభీతులు మిక్కుట మై

తెరఁ గరి రాక్షససైన్యము సర్వము దీరుచు నుండఁ గ దూషణుడున్ -50

ఛందస్సు: కవిరాజవిరాజితమునకు ఒక్క "న" గణం, ఆరు "జ" గణాలు, "వ" గణం. పద్నాలుగవ ఇంట యతి.

తాత్పర్యం: రామభద్ర భూపాలుడిచే విడువబడిన పదునైన బాణాలను సహించలేక, గరుడుడి రెక్కలగాలిలో ఎగిరిన చెట్ల గుంపుల మాదిరిగా, భయపడిన రాక్షస సమూహాలు, పరాభవంతో-దుఃఖంతో ఖరుడి చాటున దాక్కున్నారు. భయంకరమైన ఈటెలు, కత్తులు, బాణపరంపరలు, కుప్పలు-కుప్పలుగా వారు (ఖరుడి సైనికులు) తనమీద పడవేస్తుంటే, రామభద్రుడు ధనుష్టాంకారంతో వారిగుండెలు పగిలేలా సింహనాదంచేసి, శత్రుసంహారానికై దిక్కుల్లో సందులేకుండా కరకుబాణాలు నిండే విధంగా గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. (ఫలితంగా) విరిగిన రథాలు, చనిపోయిన శూరులు, నేల కూలిన ధ్వజాలు, గొడుగులు, తెరిచిన నోళ్లు, పరుగిడుతున్న వీరులు, పడిపోయిన ఏనుగులు, దొరులుతున్న గుర్రాలు, తెగినచేతులు, తునకలైన మూతులు, పక్కకొదిగిన పిరుదులు పెరుగిపోతుండడాన్ని- రాక్షస సైన్యం సర్వనాశనం కావడాన్ని గమనించిన దూషణుడు (యుద్ధానికి సిద్ధమౌతున్నాడు).

దూషణుడు శ్రీరాముడితో యుద్ధంచేసి చనిపోతాడు. తదుపరి తనమీదకొచ్చిన రాక్షసులను, వారి సేనానాయకులను చంపాడు రాముడు. అలా పదునాలుగు వేలమందినీ చంపేశాడు రాముడాయుద్ధంలో. ఆ తర్వాత ఖరుడి మరో సేనా నాయకుడు త్రిశిరుడనేవాడు కూడా భయంకరమైన యుద్ధంచేసి చివరకు అతడూ నేలకూలుతాడు. అదిచూసిన సేనలోని వారంతా తలోదిక్కుకు పారిపోతారు. చివరకు ఖరుడే స్వయంగా రణంలోకి దిగి, శ్రీరాముడి కవచాన్ని భేదించడంతో, రాముడు అగస్త్యుడిచ్చిన వైష్ణవ ధనస్సుతో బాణాలను సంధించాడు అతడిపైకి. చివరకు ఇంద్రుడిచ్చిన అమోఘమైన బాణాన్ని ప్రయోగించి ఖరుడిని వధించాడు రాముడు. మహర్షుల ప్రశంసలందుకుంటాడు రాముడు. జనస్థానంనుండి అకంపనుడనే రావణుడి వేగులవాడు లంకకు పోయి, ఖర-దూషణాదుల మరణవార్తను తెలియచేశాడు. శ్రీరాముడి పరాక్రమాన్ని కూడా వర్ణించి చెప్పాడు రావణాసురుడికి. చెప్పి, శ్రీరాముడిని చంపాలంటే, సీతాపహరణమే తగిన ఉపాయమంటాడు. ఇంతలో లంకకెళ్లిన శూర్ఫణఖ రావణుడితో తనగోడు చెప్పుకుంటుంది. తన దుఃఖాన్ని చూసికూడా ఓదార్చని రావణుడిని నిందిస్తుంది. రాముడివల్ల తనకు జరిగిన అవమానాన్ని, దుఃఖాన్ని తెలిసికూడా ఓదార్చని రావణుడిని ఆయన కొలువులోనే-మంత్రుల సమక్షంలోనే శూర్ఫణఖ నిందించిన విధానాన్ని ఒక "మత్తకోకిలం" లో రాసారీవిధంగా:

మత్తకోకిలము: ఎండుకట్టెల మంటిపెళ్లల నేనియున్ మరి దుమ్ముచే

నొండు కార్యము కల్గుఁ గాని స మూహ చేయఁ గ రాజుగా

నుండి భ్రష్టత నొందినట్టిన రోత్తముం డొకగవ్వకేన్

ఖండితాహితసంచయా ! కొరగాఁ డు నిక్కము నమ్ముమీ -51

ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.

తాత్పర్యం: లోకంలో దేనికీ పనికిరాని అల్పమైన ఎండుకట్టెలు, మట్టిపెళ్లలు, నేలదుమ్ములాంటివి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడవచ్చేమోగాని, ఎంత ఆలోచించినా, రాజైవుండి-రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు గవ్వకైనా కొరాగడనేది వాస్తవం.

ఒకవైపు రాముడిని, రావణుడిని దూషిస్తూనే, శ్రీరాముడిని గురించి వివరంగా వర్ణించి చెపుతుంది శూర్ఫణఖ. ఖర-దూషణాది పదునాలుగు వేలమందిని, మూడు గడియల్లో ఒంటరిగా బాణాలతో నాశనం చేశాడని పొగుడుతుంది. సీతనూ వర్ణించి చెపుతుంది. అందమైన గమనం కలదని, సమస్త సద్గుణాలవల్ల గొప్ప కీర్తిగాంచినదని అంటుంది. రాముడి చేతిలో చచ్చిన ఖర-దూషణాదుల మీద ఏ మాత్రం ప్రేమున్నా రాముడిని, అతడికి సహాయం చేస్తున్న వారందరిని చంపమంటుంది. ఇవన్నీ విన్న రావణుడు రహస్యంగా మారీచాశ్రమానికి పోతాడు. నిర్మలమైన ఒక ప్రదేశంలో, మితాహారుడై, ఇంద్రియనిగ్రహంతో, జింకచర్మం ధరించి, నార వస్త్రాలు కట్టుకొని తపస్సుచేస్తుంటాడు మారీచుడు. జనస్థానం వృత్తాతంతాన్ని చెప్పి, సీతాపహరణంలోతనకు సహాయం చెయ్యమని మారీచుడిని వేడుకుంటాడు రావణుడు. సమాధానంగా మారీచుడు, శ్రీరాముడి బలపరాక్రమాలను గురించి రావణుడికి తెలియ చెప్పుతాడు. ఆయన ధర్మమూర్తంటాడు. "జనకాత్మ జ సంబంధం, బున రాముం డప్ర మేయ పురుతేజుం డ య్యెను నట్టిరాముచాపము, తను గాపగ నున్న సీత దరమాతేరన్" (సీతాదేవి సంబంధం వల్ల రాముడు, ఛేదింపగరాని గొప్పతేజం కలవాడయ్యాడు. అలాంటి రాముడి విల్లు రక్షిస్తుంటే, సీతను తేవడం నీకు సాధ్యమా ?) అంటాడు మారీచుడు. శ్రీరాముడితో తాను పడ్డపాట్లను రావణుడికి తెలియచేస్తూ, అందగత్తెలైన తనభార్యలతో దీర్ఘకాలం సుఖపడాలన్న కోరికుంటే, రామచంద్రుడికి కీడుచేసే పని చేయొద్దనీ-సీతను ఎత్తుకొని రావద్దనీ హితబోధచేసే సమయంలో, "మాలిని" వృత్తంలో ఒక పద్యాన్ని రాసారీవిధంగా కవి.

మాలిని: వలదు వలదు సీతా వారిజాక్షిన్ గ్రహింపన్

జెలిమికలిమి నీకుం జెప్పెదం, గాదటుంచున్

బలిమిని గ్రహియింపన్ బంధుమిత్రాళితోడన్

గలవు కలనఁ గూలన్ క్ష్మాసుతానాధుచేతన్ -52

ఛందస్సు: మాలినికి న-న-మ-య-య గణాలు, తొమ్మిదో ఇంట యతి.

తాత్పర్యం: రావణా ! సీతాదేవిని నీవు హరించవద్దు. నేను ఈ మాటను నీ మీద నాకున్న ప్రేమవల్ల, నీ క్షేమం కోరి చెపుతున్నాను. నా మాట వినకుండా, బలాత్కారంగా సీతను తీసుకొస్తే, బంధువులతో-మిత్రులతో రాముడి చేతిలో యుద్ధంలో చస్తావు.

తాను రాముడిబారినుండి ఎలా తప్పించుకున్నది వివరించాడు మారీచుడు రావణాసురుడికి. ఇన్ని చెప్పినా మనసుకెక్కని రావణుడు మారీచుడిని పరుషాలాడి, బలాత్కరించి, తనకు తోడ్పడాడినికి ఒప్పించాడు. తనకు సహాయం చేయాల్సిన విధానాన్ని తెలిపాడు. వెండి చుక్కల బంగారు జింక ఆకారాన్ని ధరించి, రాముడి ఆశ్రమం దగ్గర తిరుగుతుంటే, సీత నిజమైన జింకని నమ్మి పట్టుకొని రమ్మని కోరుతుందనీ, ఆతర్వాత సీతను ఎత్తుకొని పోవచ్చనీ వివరించాడు మారీచుడికి. అదివిన్న మారీచుడు రావణుడిని నిందిస్తూ, హితవాక్యాలు కొన్ని చెప్తాడు. అప్పుడు "వసంతతిలక" వృత్తంలో ఒక పద్యం రాసారు వాసు దాసుగారీవిధంగా:

వసంతతిలక: నీ మేలు గోరి యిటు నేను హితంబుఁ బల్కన్

నామాట నీ వెద న నాదృతిఁ జేసె దయ్యో

యే మందు రావణ సు హృజ్జనపథ్యవాక్యం

బేమాడ్కి మృత్యువశుఁ డేర్పడ నాలకించున్ -53

ఛందస్సు: వసంతతిలక కు త-భ-జ-జ-గ-గ గణాలు. ఎనిమిదింట యతి.

తాత్పర్యం: రావణా ! నీ మేలుగోరి నీకు హితమైనదానిని బోధించగా, నామాటను నీవు అలక్ష్యం చేస్తున్నావు. అయ్యో ! నేను నిన్నేమి చేయగలను ? మృత్యువునకు వశపడి చావదల్చుకున్నవాడు మితృలు చెప్పే మంచిమాటలు వింటాడా ?

రావణ-మారీచులు పంచవటికి ప్రయాణమై పోతారు. మారీచుడు మాయా జింక వేషాన్ని ధరించాడు. రాముడుండే తపోవనంలోకి ప్రవేశించాడు. జానకి మాయామృగాన్ని చూస్తుంది. రావణుడు ఊహించినట్లే మాయామృగాన్ని పట్టితెమ్మని సీత కోరుతుంది రాముడుని. దాన్ని సులభోపాయంతో పట్టితెమ్మని, ఒకవేళ ప్రాణాలతో దొరక్కపోతే దాని చర్మంతోనన్నా ఆడుకోవాలని వుందని అంటుంది. అంగీకరించిన రాముడికి అది మారీచుడి మాయేనన్న అనుమానంకూడా కలుగుతుంది. అలాంటప్పుడు దానివధ అవశ్యమనుకుంటాడు. అదే విషయాన్ని లక్ష్మణుడితో చెప్పి, ఒక్క వాడి బాణంతో జింకను చంపి చర్మాన్ని తీసుకొని వస్తానని, తానొచ్చేవరకు సీతను "జటాయువు" సహాయుడుగా వుండగా రక్షింపమని అంటాడు రాముడు. అది చెప్పడానికి "మత్తకోకిలము" వృత్తంలో పద్యాన్ని రాసారీవిధంగా కవి:

మత్తకోకిలము: దక్షుఁ డున్ దృఢసత్త్వుఁ డున్ మతి ధైర్యయుక్తుఁ డు లక్ష్మణా !

పక్షిరాజు జటాయు వియ్యెడ బాసటై చరియింపఁ గా

రక్షణంబు ఘటింపుమీ యుడు రాజబింబసమాస్యకున్

దీక్షఁ బూని ప్రమాద మేది ప్ర తిక్షణంబును శంకి వై -54

ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.

తాత్పర్యం: పక్షిరాజైన జటాయువు కార్యసాధన సమర్థుడు. మిక్కిలి బలవంతుడు. కార్యాలోచన, కార్యంచేయగల ధైర్యంగలవాడు. ఆయన నీకు సహాయకుడుగా సీతాదేవిని అనుక్షణం, ఏ మూలన ఏమి ఆపద వస్తుందోనని, శంక గలవాడై-పొరపాటుపడకుండా, ఒక వ్రతంగా భావించి రక్షించు.

లక్ష్మణుడితో సీతను కాపాడమని చెప్పిన శ్రీరాముడు మాయామృగం వెంట పోతాడు. చేత్లో ధనస్సుతో వస్తున్న రాముడిని చూసిన మారీచుడు తనకు చావు తధ్యమనుకున్నాడు. మాయలుచేస్తూ రాముడికి చిక్కకుండా తిరగసాగింది జింక. అలా ఆ జింక వినోదంగా తిరుగుతున్న విధానాన్ని "మాలి" వృత్తంలో ఒక పద్యంరాసారిలా:


మాలి: కనఁ గ గనఁ గ గాంతుల్ గ్రక్కుచున నిల్చుధ్వనిన్
గనుచుఁ గనుచుఁ బాఱు న్దవ్వుగాఁ జిక్కకుండన్
మునుఁ గు వెఱను బాణంబుం గనున్ మింట నాడున్
వనుల దరుల డాఁ గున్ వంచనన్ గాసిమ్రాఁ గున్ – 55

తాత్పర్యం: రామచంద్రమూర్తి చూస్తుండగానే, కాంతులు విరజిమ్ముతున్నదానివలె, మెరుస్తూ నిలుస్తుంది. ఆయన విల్లెత్తగనే దృష్టి దానిమీదనే వుంచి, దూరంగా చిక్కకుండా పరుగెత్తుతుంది. భయపడుతున్నట్లు నటించుకుంటూ బాణం వైపు చూస్తుంది. ఆకాశంలోనే గంతులుపెట్టుకుంటూ ఆడుతుంది కాసేపు. అడవుల్లో చెట్లచాటున గుహల్లో దాక్కుంటుంది. అలసిపోయిందానిలాగా వంచనతో సోలుతుంది.

ఇలా తనతో దోబూచులాడుతున్న మాయా మృగంపై కోపగించిన రామచంద్రుడు, దాన్ని చంపాలనుకొని, బ్రహ్మాస్త్రాన్ని గురిచూసి వేశాడు. ఆ దెబ్బకు మరణించబోతున్న మారీచుడు, రావణుడికి సహాయపడదలిచి, రాముడి గొంతును అనుకరిస్తూ, "హా సీతా లక్ష్మణా" అని అఱచి చనిపోయాడు. రాముడు మారీచుడిని చంపిన తర్వాత ఆశ్రమానికి బయల్దేరి పోతుంటాడు. రాముడి గొంతువిన్న సీత లక్ష్మణుడిని అతడికి సహాయంగా పొమ్మంటే, అన్న ఆజ్ఞ ప్రకారం వెళ్లకుండేసరికి ఆమె కోపగించుకుంటుంది, నిష్టూరాలాడుతుంది. చివరకు లక్ష్మణుడు రాముడుని వెతుక్కుంటూ పోతాడు. ఆ తర్వాత రావణుడు యతి వేషంలో సీతాపహరణానికి వస్తాడు. వచ్చినవాడు రాక్షసుడని తెలిసి కూడా, కొంతసేపు ఆలశ్యంచేస్తే రామ లక్ష్మణులు రాకపోతారా అని ఎదురుచూస్తున్న సందర్భంలో తరలము వృత్తంలో ఒక పద్యం రాసారీవిధంగా:


తరలము: వనికి వేఁ టకు జన్న భర్తయు భ్రాతతోఁ జనుదెంచునా

యనుచు నాలుగు దిక్కులున్ జలజాయతాక్షి వనీదిశన్

గనియెఁ గ్ాని రఘోత్తముల్ పొడకట్టరైరి, యథాస్థితిన్

వనకుజంబులు దోఁ చు చుండెను భామచిత్తము కందఁ గన్ -56

ఛందస్సు: తరలము వృత్తానికి న-భ-ర-స-జ-జ-గ గణాలుంటాయి. పన్నెండో ఇంట యతి.
తాత్పర్యం: మాయా మృగాన్ని వేటాడేందుకు అడవికి పోయిన రామచంద్రమూర్తి లక్ష్మణుడితో వస్తాడా అని, అడవి వైపు నాలుగు దిక్కులా చూసినప్పటికీ వాళ్లు కానరాలేదు. యథాప్రకారం అడవిచెట్లు మాత్రం కనిపించాయి. అది తెలుసుకొన్న సీత మనస్సు భయ సంతాపాలతో వాడిపోయింది.

రావణుడికి సీత తన వృత్తాంతాన్నంతా వివరంగా చెపుతుంది. రావణుడూ తన వృత్తాంతాన్ని చెప్పి ఆమెను దుర్భాషలాడుతాడు. సీత నిష్ఠూరాలాడుతుంది. బెదిరిస్తుంది. మరణకాలం ఆసన్నమయిందంటుంది. సీతకు తన నిజస్వరూపం చూపించి భయపెట్తాడు రావణుడు. సీత రావణుడిని నిందిస్తూ చెప్పినమాటనే మళ్లీ మళ్లీ చెపుతుండడాన్ని "మత్తకోకిలము" వృత్తంలో పద్యంగా మలిచారిలా వాసు దాసుగారు:

మత్తకోకిలము: దుష్టచిత్తుఁ డ వజ్రహస్తుని తోయజాక్షిఁ బులోమజన్

భ్రష్టశీలుడ ! యాహరించి మ నంగవచ్చును గాక యు

త్కృష్టతేజుఁ డు రామచంద్రుని యీశ్వరిన్ ననుబోఁ టి నీ

కష్టవాక్యము లాడి మోక్షము కానవున్ సుధఁ ద్రావినన్ – 57

ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.

తాత్పర్యం: ఓరీ చెడ్డ మనస్సుగలవాడా ! ఇంద్రుడి భార్యను హరించైనా బ్రతకవచ్చునుగాని, రామచంద్రుడి భార్యనైన నా లాంటి దానిని, నీచవాక్యాలాడడంతో నువ్వు అమృతం తాగినా నీకు మోక్షం కలగదు. ఇక హరించితే ఏమవుతుందో తెలుసా ? మృత్యువునుండి నీకు విడుదలలేదు. మిక్కిలి మలినమైన అంతఃకరణం కలవాడివైనందునే జ్ఞానం వల్ల కలగాల్సిన మోక్షం నీకు కలగలేదని అర్థం.

సీతాదేవి మాటలను లెక్కచేయకుండా, రావణుడు ఆమెను కఠిన వాక్యాలతో దూషించుకుంటూ అపహరించుకొని పోతాడు. రథం మీద తీసుకొని పోబడుతున్న సీత పిచ్చిపట్టిన దానివలె, రామలక్ష్మణులను పేర్కొంటూ దుఃఖిస్తుంది. అలా విలపిస్తున్న సీతకు జటాయువు కనిపించడంతో, పెద్దగొంతుకతో గట్టిగా పిలుస్తుంది. పాపాత్ముడైన రావణుడు దయాహీనుడై ఎత్తుకొనిపోతున్నాడని అంటుంది. జటాయువును ఉద్దేషించి ఆమె అన్న పలుకులను "మత్తకోకిలము" వృత్తంలో ఇలా పద్యంగా రాసారు కవి:

మత్తకోకిలము: అన్న ! తండ్రి ! జటాయువా ! దురితాత్ముఁ డీయసురుండు న

న్ని న్నెఱిన్ హరియించి యేగెడి నిట్టినాదురవస్థలన్

విన్నవింపఁ గదయ్య యిప్పుడ వేగ మేగి సమస్త మా

యన్నదమ్ముల కోమహాత్మక యార్తనన్ దయఁ బ్రోవుమా -58

ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.

తాత్పర్యం: అన్నా ! తండ్రీ ! జటాయువా ! పాపాత్ముడగు ఈ రాక్షసుడు, నన్నీవిధంగా బలవంతంగా పట్టుకొనిపోతున్నాడు. యుద్ధంచేయ వలదంటివే. ఇక నేనేమి చేయగలనందువేమో ? ఇప్పుడే శీఘ్రంగా పోయి, నా కష్టస్థితిని సమస్తం రామలక్ష్మణులకు చెప్పు. మహాత్మా ! ఈ మాత్రం సహాయం చేసి ఈ దీనురాలిని రక్షించు.

సీత చేస్తున్న మొరను విన్న జటాయువు, రావణుడిని సంబోధిస్తూ, తానెవరో-తన బలం ఏమిటో, శ్రీరామచంద్రుడనగా ఏమిటో తెలియచేసి, వాడికి రాముడు చేసిన కీడేమీ లేనప్పుడు ఏ పాపం ఎరుగని రాముడి విషయంలో ఎందుకు దోషం చేస్తున్నావని-దాని వల్ల అతడికి అపాయం జరుగుతుందని హెచ్చరించాడు. ఇలా ప్రశ్నిస్తూ, మగతనం వుంటే శ్రీరాముడితో యుద్ధం చేయమంటాడు. ఈ సందర్భంలో రావణుడిని వారిస్తూ జటాయువు చేసిన హెచ్చరికను "మాలిని" వృత్తంలో పద్యంగా రాసారీవిధంగా:

మాలిని: వలదు వలదు రక్షో వల్లభా నీవు సీతన్

బలిమిని గొనిపోవం బాప మాభూపరుండున్

దెలిసినయెడ నిన్నున్ దృష్టిచేనే దహించున్

గులిశమునను వృత్రుం గూల్చు జంభారిమాడ్కిన్ – 59

ఛందస్సు: మాలినికి న-న-మ-య-య గణాలు, తొమ్మిదో ఇంట యతి.

తాత్పర్యం: రాక్షసరాజా ! నువ్వు సీతను బలాత్కారంగా తీసుకొనిపోవద్దు. వలదు. అది అతి మిక్కిలి పాప కార్యం. నువ్విలా చేశావని రామచంద్రమూర్తికి తెలిస్తే, వజ్రంతో ఇంద్రుడు వృత్రుడిని వధించినట్లు చూపులతోనే నిన్ను దహించివేస్తాడు.

రావణుడిని హెచ్చరించిన జటాయువు, వాడు మగవాడైతే తనతో యుద్ధంచేయమంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నరావణాసురుడు, జటాయువుతో ఢీకొంటాడు. జటాయువు-రావణుల మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. యుద్ధం మధ్యలో రావణుడుని జటాయువు మరోమారు దూషిస్తాడు-పరుషోక్తులాడుతాడు. రావణుడు జటాయువు రెక్కలు నరికివేస్తాడు. (పర్ణశాలకు మైలు దూరంలో వున్న జటాయువు వృక్షం దగ్గర మొదలైన వారిద్దరి మధ్య యుద్ధం, ఐదారు మైళ్ల దూరంలో వున్న దుమ్ముగూడెం వరకూ కొనసాగి, జటాయువు రెక్కలు ఖండించబడేంతవరకూ సాగుతుంది). ఇది చూసిన సీత రామలక్ష్మణుల గురించి ఆక్రోశిస్తుంది. ఇదంతా పట్టనట్లు రావణుడు సీతనెత్తుకొని పరిగిడుతుంటాడు. రామలక్ష్మణుల కొరకు పరితపిస్తూనే, సీత రావణుడుని నిందిస్తుంటుంది. శ్రీరాముడిని మోసగించిన రావణుడు లంకలోనే కాదు స్వర్గ-పాతాళాలలో దాక్కున్నా రామచంద్రమూర్తి వాడిని వధించడం తధ్యమంటుంది. సీత అలా రావణుడుని నిందిస్తున్నప్పుడు ఆమె పరిస్థితిని "కరిబృంహితము" వృత్తంలో పద్యంగా రాశారిలా:

కరిబృంహితము: ఇట్టు పలుకుచుఁ బెక్కువిధముల నేడ్చి కరుణము దోఁ పగాఁ
దిట్టుచును ఘనశోక భరమున దీన యయి స్మృతి దప్పుచున్
గట్టిగను విలపించి పొరలుచుఁ గంప మొనరఁ దపించుచో
దిట్ట యయి యసురాధముఁ డు నృపు దేవి గొని చనె బాపియై – 60

ఛందస్సు: "కరిబృంహితము" నకు భ-న-భ-న-ర గణాలు. పదమూడో అక్షరం యతి.

తాత్పర్యం: ఈ విధంగా పలు విధాలుగా మాట్లాడుతూ, ఏడుస్తూ, తిట్తూ, శోకాతిశయంతో దీనురాలై స్మృతి తప్పి పడితూ-గట్టిగా ఏడుస్తూ, పొర్లుతూ, దేహం వణుకు పుట్టి తపిస్తుండగా, రాక్షసాధముడు దిట్టతనంతో సీతను తీసుకొని పారిపోయాడు.

పాపాత్ముడైన రావణాసురుడు అలా తననెత్తుకొని పారిపోతుంటే, తనను కాపాడేవాడు ఒక్కడుకూడా కనిపించక పోయేసరికి తపించిపోయిన సీతాదేవికి ఒక కొండ శిఖరం మీదున్న ఐదుగురు వానరులు కనిపించారు. కనీసం వాళ్లైనా తన దుస్తితిని గురించి రాముడితో చెప్పకపోతారా అని తలపోసి సీత తన ఆభరణాలను తీసి కొంగులో ముడివేసి, వారిముందు పడేటట్లు విసురుతుంది. ఆదరబాదరగ పోతున్న రావణుడది గమనించలేదు. సుగ్రీవాదులైన ఆ వానరులు "రామ రామ" అని ఏడుస్తున్న దానిని, రావణుడెత్తుకు పోవడం గమనించి కూడా భయంతో వూరుకుంటారు. రావణుడావిధంగా సీతతో లంక చేరుకుంటాడు. సీతను నిర్భందంలో వుంచి, రాక్షస స్త్రీలను కాపలా వుంచుతాడు రావణుడు. కొంచెం సేపైన తర్వాత సీతవద్దకు పోయి రావణుడు ఆమెను బలాత్కారంగా తీసుకొని తన నగరాన్ని చూపించసాగాడు. లంకను ఏలమని, తనను వరించమని వేడుకుంటాడు. ఇద్దరం చందనం రాసుకొని, బంగారు సొమ్ములు ధరించుదామంటాడు. సీతను తానెంతగానో ప్రేమిస్తున్నానని అంటూ, "జానకీ ! నీ పాద ధూళి నా శిరస్సున ధరించుతాను" అని చెపుతాడు రావణుడు సీతతో. ఇక్కడ రెండు పద్యాలను-ఒకటి "మత్తకోకిలము" వృత్తంలో, మరొకటి "తోటకము" వృత్తంలో రాశారిలా కవి:

మత్తకోకిలము: ఇంచుఁ బోణిరొ పుష్పకాఖ్యస మిద్ధ మైనవిమాన మ

భ్యంచదర్కవిభావికాసము యక్షు నగ్రజుఁ బోర ని

ర్జించి తెచ్చితి హృద్య మయ్యెడఁ జేరి ఇద్దఱ మెంతయున్

జంచదిష్టసుఖోపభోగముఁ జాన ! పొందుచు నుందమా ! -61

ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.

తాత్పర్యం: సీతా ! పుష్పకమని ప్రసిద్ధికెక్కిన ఈ విమానం నాలుగు దిక్కులా వ్యాపించే సూర్యకాంతి లాంటి కాంతిగలది. మా అన్న కుబేరుడుని జయించి దీన్ని తెచ్చుకున్నాను. ఇది మిక్కిలి మనోజ్ఞమైంది. దీంట్లో మనిద్దరం గడియ-గడియకు మారుతున్న సుఖభోగాలను అనుభవించుదామా !

తోటకము: అని యీగతిఁ బల్కి ద శాస్యుఁ డు దా

జనకాత్మజ నాత్మను సంతసిలెన్

వనితామణి దక్కెను నాకిఁ కఁ బో

యని యంతక పాశవ శాత్మకుఁ డై -62

ఛందస్సు: తోటకము నకు నాలుగు "స" గణాలు, తొమ్మిదో అక్షరం యతి వుంటాయి.

తాత్పర్యం: ఈ ప్రకారం సీతతో పలికిన రావణుడు తనలో తాను, ఈ స్త్రీరత్నం తనకు దక్కిందని, యమపాశానికి వశపడ్డవాడైనందున భావించాడు.

తనను బలాత్కారం చేయగల శక్తి రావణుడుకి లేదని, బలాత్కారాన్ని నిషేదించే శాపం రావణుడుకి వున్నదని తెలియని సీత వాడిని పరుషోక్తులాడుతుంది. వాడికి నాశనమైపోయే కాలం దాపురించిందని, వాడి రాక్షస సమూహం, కట్టుకొన్న స్త్రీలు ఏక కాలంలో నాశనమైపోతారని అంటుంది. కోపంతో మండిపడ్డ రావణుడు సీతను అశోకవనానికి తీసుకొనిపొమ్మని, కాపలాగా వున్న రాక్షస స్త్రీలు ఆమెను మచ్చికచేసుకొని తనకు స్వాధీనపరచమని ఆజ్ఝాపించాడు. ఇక్కడ లంకలో సీతాదేవి పరిస్థితి ఇలావుంటే, అడవిలో రాముడు మాయా మృగాన్ని చంపి వెనక్కు వస్తుండగా, అపశకునమైన నక్క కూత వినిపిస్తుంది. మారీచుడి కంఠధ్వని విన్న లక్ష్మణుడు తనను వెతికేందుకు వచ్చి వుంటాడనీ, ఒంటరిగా వున్న సీతకు ఏం కీడు జరిగిందోనని భయపడ్డాడు. ఇంతలో ఆశ్రమం సమీపానికి వచ్చిన రాముడికి ఒంటరిగా వున్న తమ్ముడు కనిపించాడు. కలత చెందినట్లు కనిపిస్తున్న లక్ష్మణుడితో, రాక్షస మాయ గురించి, తాను జింకను చంపడం గురించి చెప్పాడు రాముడు. తనకు ఎదురైన అపశకునం గురించి రాముడు లక్ష్మణుడికి చెప్పిన సందర్భంలో "తరలము" వృత్తంలో ఒక పద్యం రాశారు. సీత కనిపించనందుకు పరిపరివిధాల దుఃఖించాడు. సీత అసలు ప్రాణంతో వుందా-లేదా అని సందేహిస్తాడు. అలా సీతాదేవిని తలచుకుంటున్నప్పుడు "మంజుభాషిణి" లో మరో పద్యాన్ని రాశారీవిధంగా కవి:

తరలము: అదరె వామవిలోచనంబు, ప్ర హర్ష మేమియు లేదు నా

మదిని, నాశ్రమభూమి నిక్కము మానినీమణి లేదురా

సుదతినిన్ హరియించురో తమ సూడు దీఱఁ గ రక్కసుల్

ముది త దా మరణించెనో వని లోనఁ ద్రోవయె తప్పెనో – 63

ఛందస్సు: తరలమునకు న-భ-ర-స-జ-జ గణాలు. పన్నెండో అక్షరం యతి.

తాత్పర్యం: లక్ష్మణా ! ఎడమ కన్ను అదురుతున్నది. ఏ మాత్రం సంతోషం మనస్సులో లేదు. నాయనా, ఆశ్రమంలో సీత లేదురా. తమ పగ తీర్చుకొనేందుకై రాక్షసులు సీతను పట్టుకొనే పోయారో, లేక, వారి బాధ పడలేక తానే చనిపోయిందో, లేక, మనల్ని వెతుక్కుంటూ దారి తెలియక వేరే దారిలో పోయిండేమో.

మంజుభాషిణి: అని మంజుభాషిణిని నాత్మ నెంచుచున్

జనియెం బిపాస క్షుధ జాలి గొల్ప మో

మును వాడఁ గాఁ దొలఁ గ ముర్వు, స్వాశ్రమం

బున కింతిలేమి నటఁ బొక్కి యేడిచెన్ – 64

ఛందస్సు: మంజు భాషిణీ వృత్తానికి స-జ-స-జ-గ గణాలుంటాయి. 9వ అక్షరం యతి. సీత "మంజు భాషిణి" అయినందున, ఇంతకు ముందువలె, ఇక్కడ కూడా "మంజుభాషిణి" వృత్తంలో పద్యం రాయడం సమంజసం అంటారు వాసు దాసుగారు.

తాత్పర్యం: అని సీతాదేవిని తలచుకుంటూ, ఆకలి దప్పిక భాదించగా, అందం తొలగగా, తన ఆశ్రమంలో సీత లేనందుకు వెక్కి-వెక్కి ఏడిచాడు.

సీత కానరానందున పరితపించిన రాముడు, సీతను ఎందుకు విడిచివచ్చావని లక్ష్మణుడుని ప్రశ్నించాడు. వచ్చిన వాడు సీతను కూడా తీసుకొని రావల్సిందని అంటాడు. తానలా రావడానికి కారణం సీతేనంటాడు. వివరంగా జరిగిందంతా చెప్పినప్పటికీ, అలా విడిచిరావడం లక్ష్మణుడు చేసిన తప్పిదమని కూడా అంటాడు. లక్ష్మణుడి స్థితి శోచనీయమవుతుంది. మరో పక్క రాముడి దుఃఖం కొనసాగుతూనే వుంటుంది. ఆమెను వెతుక్కుంటూ ప్రతి చెట్టు చాటునా చూస్తాడు. కనిపించిన పశుపక్ష్యాదులను ఆమె గురించి అడుగుతాడు ఆవేశంతో. అలా ఆయన వెతకడాన్ని, ఆమెతో భ్రమపడి సంభాషించడాన్ని, "కవిరాజవిరాజితము" వృత్తంలో పద్యంగా రాశారు కవి ఇలా:

కవిరాజవిరాజితము: నిలు నిలు మేగకు మోకలికీ ! యెద ! నిర్దయమే మరుపూ ములికీ !

యలుఁ గఁ గ నేటికి ప్రాణసఖీ ! పరి యాచకమా యిది చంద్రముఖీ ?

కులుకుచుఁ గుల్కుచుఁ బర్విడెదే కనుఁ గొంటిని లే జిగిచీర యదే

పలుకవు కోపమ నీలకచా ! ననుఁ బాలన సేయుము ! కుంభకుచా ! -65

ఛందస్సు: కవిరాజవిరాజితమునకు ఒక్క "న” గణం, ఆరు "జ" గణాలు, ఒక్క "వ" గణం వుంటాయి. పద్నాలుగవ ఇంట యతి.

తాత్పర్యం: కాంతా ! పోవద్దు. పోవద్దు. నిలు-నిలు. మన్మధపుష్పబాణమా ! నీ హృదయ మింతదయలేనిదా ? ప్రాణసఖీ ! ఎందుకు నాపై అలిగావు ? ఇది పరిహాస సమయమా ! కులుకుతు-కులుకుతు పరిగెత్తుతున్నావు ? అదిగో నేను చూసానులే ! నీ చీరె నాకు కనిపించింది. నల్లని వెంట్రుకలున్నదానా ! ఇలా నిన్ను చూసి నేను పిలిచినా పలుకవేమి ? కోపమా ? నన్ను రక్షించు.

సీతను రాక్షసులు చంపేసి వుంటారని విలపించాడు రాముడు. లక్ష్మణుడు రాముడిని సమాధాన పరుస్తాడు. అయినాగాని రాముడు ఉన్మత్తుడిలా సీతకొరకు రోదించాడు. తన తల్లి కౌసల్య కోడలేదిరా అంటే ఏమని సమాధానం చెప్పాలని లక్ష్మణుడిని అడుగుతాడు. లక్ష్మణుడిని అయోధ్యకు పోయి భరతుడిని తన ఆజ్ఞలాగా శాశ్వతంగా రాజ్యాన్ని పాలించమని చెప్పమంటాడు. గోదావరీ తీరమంతా అన్న ఆజ్ఞ ప్రకారం మళ్లీ వెతుకుతాడు సీతకొరకు లక్ష్మణుడు. రాముడుని అర్థం చేసుకున్న అడవిమృగాలు, భూమిని-ఆకాశాన్ని-దక్షిణ దిక్కును చూపించి అటువైపుగా సీత పోబడిందని సూచించాయి. ఆ సమయంలో రాముడికి సీతాదేవి భూషణాదులు కనిపించాయి. జటాయువు రావణుడితో యుద్ధం చేస్తూ వాడికి జరిపిన నష్టం తాలూకు పదార్థాలన్నీ కూడా కనిపించాయి అక్కడక్కడ. రాక్షసులే సీతను అపహరించి వుండాలని భావించారు రామలక్ష్మణులు. రాక్షసులు తన సీతకు అపకారం చేస్తుంటే చూసిన దేవతలు ఆమెను ఆదుకోలేదని లక్ష్మణుడితో అంటూ, వాళ్లపై కోపించి జగత్సంహారం చేయడానికి సిద్ధమౌతాడు రాముడు. లక్ష్మణుడు శ్రీరాముడిని శాంతపరిచాడు. ఇద్దరం చేయాల్సిన పనంతా చేసి, అప్పటికీ దేవతల సహాయం లభించకపోతే, అప్పుడు రాముడు చెప్పినట్లే చేద్దామంటాడు. లక్ష్మణుడు రాముడితో చెప్పినదాన్ని, ఇక్కడ "మానిని" వృత్తంలో రాశారు కవి ఇలా:

మానిని: సామముచేతను శీలముచేతను సాధుమతీ ! వినయాదులచే

భూమితనూభవ చేపడ కున్నను భూవరనందన ! యాపయి సు

త్రామకఠోరసుసాధనసన్నిభ రాజతపుంఖశరౌఘములన్

సమదివచ్చిన చొప్పున లోకము నీఱుగఁ జేయుము యుక్తమగున్ – 66

ఛందస్సు: మానినికి ఏడు "భ" గణాలు, ఒక గురువు. పదమూడో అక్షరం యతి.

తాత్పర్యం: మంచిమాటలతో, మంచినడవడితో, వినయం మొదలైన వాటితో, సీతాదేవి లభించకపోతే, సాధుమనస్సుగల రాజనందనా, ఆ తర్వాత వజ్రాలవంటి కఠోరమైన-బంగారు పింజల బాణాలతో నీ ఇష్ట ప్రకారం లోకాన్ని భస్మం చేయి. అది తగిన కార్యమవుతుంది.

రామచంద్రుడిని పరిపరివిధాలుగా శాంతించే ప్రయత్నం చేశాడు లక్ష్మణుడు. లక్ష్మణుడి మాటలకు శాంతించిన రాముడు తిరిగి సీతను వెతికే ప్రయత్నంలో వుంటాడు. సీతను అపహరించినవాడిపై అమితమైన కోపంతో, ధనస్సులో బాణం సంధించి, చేతిలో ధరించి అడవిలోని జనస్థానంలో తమ్ముడితో కలిసి వెతకసాగాడు. అలా వెతుకుతున్న వారికి జటాయువు కనిపిస్తుంది. జటాయువు సీతాపహరణ వృత్తాంతాన్నంతా రామలక్ష్మణులకు వివరించాడు. జటాయువు దుస్థ్సితికి రాముడు దుఃఖించాడు. పాపాత్ముడైన రావణుడు సీతను ఎలా పట్టుకొని పోయాడని రాముడు జటాయువును ప్రశ్నించడాన్ని ఒక వినూత్నమైన "చంపకమాల" వృత్తంలో రాసారీవిధంగా వాసు దాసుగారు:

చంపకమాల: ఆమెయుఁ గొంచు నేగ దురితాత్ముఁ డు తన్ను ధరిత్రికన్య దా

నే మనుచుండె ? నప్పలుకు లేర్పడఁ జెప్పుమ, దైత్యుఁ డెట్టివాఁ

డేమెయివాఁ డు ? వానిపురమెయ్యది ? శౌర్యమ దెంతమట్టు ? తం

డ్రీ ! మన మారఁ గాఁ బలుకవే సతి నెట్లు హరించి యేగెనో ?

ఛందస్సు: రెండూ ప్లుతాక్షరాలే అయినప్పుడు సర్వ మైత్రి వుంటే చాలునంటారు కవి. వ్యంజనమైత్రితో పనిలేదని, దీనికి ప్లుత్లయుగ విశ్రామయతి అని పేరని కూడా అంటారు. పద్యంలో నాలుగో పాదంలో రెండూ ప్లుతాక్షరాలే.

తాత్పర్యం: ఆ విధంగా పాపాత్ముడు రాక్షసుడు తనను తీసుకొని పోతున్నప్పుడు, సీత ఏమంటున్నది ? ఆ మాటలు స్పష్టంగా చెప్పు. ఆ రాక్షసుడెట్టివాడు ? ఏ దేహం గలవాడు ? వాడుండే పురమేది ? వాడెంత మాత్రపు శూరుడు ? తండ్రీ, సీతను ఏ విధంగా పట్టుకొని పోయెనో సర్వం చెప్పు.

జటాయువు అన్నీ సవివరంగా రాముడికి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, రావణుడి పూర్తి పేరు చెప్పే లోపల, కుబేరుడి సోదరుడన్న మాటవరకు మాత్రమే అనగలిగాడు. మిగతాది చెప్పుతుండగానే ప్రాణం విడిచాడు. జటాయువు మృతికి రాముడెంతగానో శోకించాడు. తండ్రికి చేసిన విధంగానే జటాయువుకు అగ్నిసంస్కారాదులు చేస్తాడు. అక్కడనుండి సీతాన్వేషణకు బయలుదేరి నైరుతి మూలనున్న క్రౌంచారణ్యం చేరుకుంటారు. తర్వాత మతంగవనం ప్రవేశించారు. సమీపంలోనే కబంధుడనే రాక్షసుడి చేతులకు చిక్కుతారు. రామలక్ష్మణులు వాడి చెరొకచేతిని నరికేస్తారు. లక్ష్మణుడు కబంధుడికి తమ వృత్తాంత్తాన్నంతా చెప్పాడు. కబంధుడు కూడా తన శాపాన్ని గురించి చెప్పి, సీత అపహరణ విషయం తనకు తెలుసనీ, అయితే శాపగ్రస్తమైన వికార స్వరూపంతో ఏదీ స్ఫురించడంలేదనీ, తన దేహాన్ని కాల్చితే నిజస్వరూపం పొంది సీతను దాచినవాడి రహస్యం చెపుతాననీ అంటాడు. వాడు కోరినవిధంగానే అగ్నిలో వేసిన కాసేపటికి, మంటల్లోనుండి ఆకాశానికి ఎగిరి, సీతను కనుగొనే విషయం పరోక్షంగా తెలియచేశాడు. రామలక్ష్మణులిద్దరూ సమర్థులే అయినప్పటికీ, ప్రస్తుతం కష్టదశలో వున్నారనీ, సుగ్రీవుడితో మైత్రిచేసుకొని కార్యాన్ని సాధించమనీ అంటాడు. సుగ్రీవుడుండే ప్రదేశం ఋశ్యమూక పర్వతమనీ, పంప ఒడ్డున సంచరిస్తుంటాడని కూడా చెపుతాడు. రాముడిని ఎడబాసి దుఃఖిస్తున్న సీతను రావణుడుంచిన ప్రదేశాన్ని కనుగొనగల సమర్థుడు అతడేనంటాడు. సుగ్రీవుడుండే చోటుకు చేరే విధంకూడా చెప్పాడు. ఇక్కడ కబంధుడు రాముడికి పంపాసరస్సుని గురించి వర్ణించడానికి వాసు దాసుగారు "మానిని" వృత్తంలో పద్యంగా రాశారిలా:

మానిని: సారసరాజమరాళరథాంగక చారురసంబు, లశై నలవ

న్నీరములున్, సికతాతలరాజిత నిర్మలగాఢసమావను లౌ

తీరములున్, నవసారసకై రవ దివ్యసుగంధిఘమంఘమవాః

పూరములున్, విలసిల్లఁ గఁ బంప యపూర్వముదావహమై యొసఁ గున్ – 67

ఛందస్సు: మానినికి ఏడు "భ" గణాలు, ఒక గురువు. పదమూడో అక్షరం యతి.

తాత్పర్యం: బెగ్గురుల-రాజహంసల-చక్రవాకముల మనోహర ధ్వనులతోను, పాచితీగలు లేని జలాలతోను, ఇసుకనేలతో ప్రకాశించే నిర్మలమైన గడ్డిగల చదరపు నేలల తీరాలతోను, కొత్తగా వికసించిన కమలాలతోను, కలువలతోను, మేలైన మంచివాసనలతో గుమగుమలాడు జలప్రవాహాలతోను నిండిన పంప ఇంతవరకూ అనుభవించని సంతోషాన్ని కలిగించేదవుతుంది.

పంపను వర్ణించి చెప్పిన కబంధుడు శబరికి దర్శనం ఇమ్మని అంటాడు. సదా తపస్సు చేస్తుండే శబరి రాముడి రాకకై వేచివున్నదని కూడా అంటాడు. కబంధుడు చెప్పినట్లే రామలక్ష్మణులు శబరిని కలుస్తారు. వారిద్దరికీ శబరి, మతంగాశ్రమంలోని వింతలను చూపిస్తుంది. చక్కటి ఆతిధ్యమిస్తుంది. అక్కడనుండి బయలుదేరి రామలక్ష్మణులు పంపాతీరం చేరుకుంటారు. చేరుకుంటూ, సుగ్రీవుడిని గురించిన ఆలోచన చేస్తారు. పంపాతీరానికి చేరుకుంటున్న రామలక్ష్మణులను గురించి "మానిని" వృత్తంలో రాశారిలా వాసు దాసుగారు:

మానిని: ఈ విధి దుఃఖకరంబులఁ గానల నెల్లను దాఁ టి క్రమంబుగ వి

ఘ్నావళిఁ బాయఁ గ జేయుచు దవ్వు ప్రయాణము చేసి మనోజ్ఞక నా

నావిధిపక్షిసమాకులఁ బంపను నవ్యజలాశయసత్తమ నా

భూవరనందనయుగ్మము గాంచి యపూర్వముదంబున నుల్లసిలెన్ -68

ఛందస్సు: మానినికి ఏడు "భ" గణాలు, ఒక గురువు. పదమూడో అక్షరం యతి.

తాత్పర్యం: ఈ ప్రకారం దుఃఖాలను కలిగించే అడవులన్నింటినీ వరుసగా దాటి, మధ్య-మద్య కలిగిన విఘ్నాలనన్నింటినీ తొలగించుకుంటూ, దూర ప్రయాణం చేసి, మనోహరమై-అనేక విధాలైన పక్షులతో నిండిన అందమైన కొలకగు పంపను చేరి, ఇన్ని రోజులుగా లేని సంతోషాన్ని రాజకుమారులిద్దరూ పొంది, ముఖ వికాసాన్ని కలిగినవారయ్యారు.

అరణ్య కాండాంత పద్యాల్లో ఒకదానిని "మందాక్రాంత" లో రాశారు వాసు దాసుగారు. మిగిలిన రెండు కాండలలో లాగానే, ఈ పద్యంలోని అర్థంలో, ఒకవైపు రామచంద్రమూర్తిని స్థుతిస్తూనే, అరణ్య కాండలో మొత్తం పద్యాలెన్ని వున్నాయో వివరీమ్చారు కవి. ఆ పద్యమిలా సాగింది:



మందాక్రాంత: ధీరా ! యూర్ధ్వేశ శుచినముచి ద్వేషిదిక్సాంఖ్యపద్యో

దారారణ్య ప్రథితచరితో ద్దామ వాత్సల్యసీమా

క్రూరారాతిక్రథనకలిత క్రూరకోపా యపాపా

వారాశీడ్జాకమలమధుపా భక్తహృత్పద్మసద్మా-69

తాత్పర్యం: ఊర్ధ్వ అంటే పది దిక్కుల్లో తొమ్మిదోదని, ఈశాన్యం దిక్కు ఎనిమోదదని, శుచి (ఆగ్నేయం) రెండోదని, సముచిద్వేషిదిన్ అంటే ఇంద్రిడి దిశ మొదటిదని-అన్నీ కలిపి చదివితే 9821 వస్తుందని-ఇది తలకిందుగా చదివితే 1289 వస్తుందని దీనర్థం. వాసు దాసుగారి ఆంధ్ర వాల్మీకి రామాయణం అరణ్యకాండలో 1289 పద్యాలున్నాయి.

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందో ప్రయోగాలు -4

ఆంధ్ర వాల్మీకి- కవి సార్వభౌమ

శ్రీ వావిలి కొలను సుబ్బారావు- వాసుదాస స్వామి

రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణం

అయోధ్యా కాండ - ఛందో ప్రయోగాలు-- వనం జ్వాలా నరసింహా రావు

దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనుకొని అందరినీ సంప్రదించి వారి సమ్మతిని పోందాడు. తనకు కలిగిన అభిప్రాయాన్ని రాముడికి తెలియచేస్తూ, అతడికి పుట్టుకతోనే వినయం-సుగుణాలు వచ్చాయని, అతనికి సమానులైన వారు మనుష్యులలో ఎవరూ లేరని అంటూ దశరథుడన్న మరికొన్ని విషయాలను చెప్పేందుకు "మత్తకోకిలము" వృత్తాన్ని ఎంచుకుంటారు వాసు దాసుగారు. ఆ పద్యమిలా సాగింది:

మత్తకోకిలము: నీ వెరుంగని యట్టినీత్యవి నీతు లున్న వె యెందునే ?

నేవి క్రొత్తగ నీకు నేర్పఁ గ నేను నేర్తుఁ గుమారకా !

భావితాదృతిఁ జేసి పుత్రక వత్సలత్వము పేర్మి నే

నేవియో యొకకొన్నిటిన్ వచి యించెద న్విను నందనా ! -18

ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.

తాత్పర్యం: కుమారా ! నీకు తెలియని నీతులు-అవినీతులు లేవు. నేను నీకు కొత్తగా ఏం నేర్పగలను? అయినా నీవు నా కొడుకువు కనుక, పుత్రవాత్సల్యం వల్ల కలిగిన ఆదరణతో, తండ్రులు కొడుకులకు హితోపదేశం చేయడం ధర్మం కనుక ఏవో కొన్ని విషయాలు చెప్పదల్చుకున్నాను. నువ్వు నా కొడుకువు కావడంవల్ల నన్ను సంతోషపర్చడం నీకు తగిన కార్యం. తండ్రి బతికున్నంతవరకు ఆయన చెప్పినట్లు నడుచుకొనేవాడినే పుత్రుడంటారు. కాబట్టి నేను చెప్పినట్లు నీవు నడుచుకుంటే సంతోషిస్తాను. అలా అయితే నన్ను ఏమి చేయమందువా?

శ్రీరామ పట్టాభిషేకానికి సన్నాహాలు జరుగుతుంటాయి. ఆ సంబరం చూద్దామనుకుంటున్న అయోధ్యా పురజనులు గుంపులుగా వీధుల్లో తిరుగుతుంటారు. జనులలా గుంపులుగా గూడిన విధానాన్ని వర్ణించిన తర్వాత, ఆ వివరాలన్నీ గురువర్యుడైన వశిష్ఠుడి ద్వారా తెలుసుకొని, ఆయన అనుమతితో తన ఇంటికి పోతున్న వైనాన్ని వర్ణిస్తూ "మానిని" వృత్తంలో రాసారీ పద్యాన్ని కవి ఇలా:

మానిని: వారల నెల్లరఁ బోవఁ గఁ బంచి నృపాలుఁ డు సింహము శైలగుహన్
జేరెడిరీతి సమగ్ర్యసువేషవి శేషవధూజనతాకులజం
భారినిశాంతమనోహరరాజగృ హంబును జొచ్చి సఋక్షగణో
దారనభంబును జందురునట్టులు దా వెలిఁ గించె స్వదీధితులన్ – 19

ఛందస్సు: 22 అక్షరాలతో, ఏడు "భ" గణాల గురువుతో, యతిస్థానంలో 7-13-19 అక్షరాలు కలిగి వుంటుంది. ప్రాస నియమం వుంది.
తాత్పర్యం: దశరథ మహారాజు (సభలోని) సభ్యుల నందరినీ వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చి, సింహం తన గుహలోకి పోయిన విధంగా, నానా విధాలైన నూతన అలంకారాలతో వుండి, స్త్రీ సమూహాంతో నిండిన, ఇంద్రుడి మేడలాంటి అందమైన తన గృహంలోకి ప్రవేశించి, తన (దశరథుడు) కాంతులతో, నక్షత్ర సమూహం మధ్య ఆకాశంలో వున్న చంద్రుడి లాగా ప్రకాశింప చేశాడు.

శ్రీరాముడికి దశరథుడు జరిపించదల్చుకున్న పట్టాభిషేకం గురించి తెలుసుకున్న కైకేయి ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది. ఆమె కోరిన వరాలకు పరితపించిన దశరథుడు కైకను దూషించాడు-శ్రీరాముడి గుణాలను వర్ణించాడు-కైకను వేడుకున్నాడు. చివరకు న్యాయ నిష్ఠూరాలాడాడు. రాముడిని అడవులకు పంపి జీవించ లేనన్నాడు. ఇలా కాదనుకొని మరొక్కసారి మెత్తని మాటలతో వేడుకోవడాన్ని"తరలము" వృత్తంలో చక్కగా రాసారీవిధంగా:

తరలము: వనజలోచన ! కాననంబుల పాలుగాఁ గ సుతుండు నే

మనుటె కల్ల నిజంబు, సౌఖ్యము మాట యేటికె చెప్పగా ?

మనితిఁ బో పని యేమి నీవు ? సు మాళి నౌదునె ? విప్రియం

బును ఘటింపకు నీదు కాళ్లకు మ్రొక్కెదన్ మరి మ్రొక్కెదన్ – 20

ఛందస్సు: న-భ-ర-స-జ-జ-గ గణాలు. పన్నెండో స్థానంలో యతి.

తాత్పర్యం: (ముఖ ప్రీతిమాటగా "కమలముల వంటి కన్నుల దానా-వనజలోచన" అని దశరథుడితో అనిపించాడు కవి). కోపం పట్టలేక తిట్టిన దశరథుడు, తిట్టడంవలన కార్యసాధన కాదని భావించి, మెత్తటి మాటలతో చెప్తున్నాడు. కమలాక్షీ ! నా కొడుకు అడవులకు పోతే, నేను జీవించడం అసత్యం. అలాంటప్పుడు నీతో ఎలా సుఖపడతాను ? ఒకవేళ బతికినా, శోకంలో మునిగి వుండేవాడినేగాని, సంతోషంతో వుండలేనుకదా ! అప్పుడు నీతో నాకేంపని ? కాబట్టి నాకు అప్రియమైన పని చేయకు. నీ కాళ్లకు మొక్కుతాను-మరీ, మరీ మొక్కుతాను.

కైక కోరిన విధంగా శ్రీరాముడు తండ్రి ఇచ్చిన మాట నెరవేర్చడానికి అడవులకు పోయేందుకు నిశ్చయించుకుంటాడు. తాను అడవులకు వెళ్తున్న సంగతిని తల్లి కౌసల్యకు తెలియచేస్తాడు. పట్టాభిషేకం గురించి చెప్పడానికి వచ్చాడని భావించిన కొసల్య ప్రియంగా-హితంగా ఇచ్చిన దీవెనలను అందుకున్నాడు రాముడు. మెల్లగా భయంకరమైన వార్తను తెలిపాడామెకు. భరతుడికి యౌవరాజ్యమిచ్చే విషయాన్నీ చెప్పాడు. ఆ విషయాన్ని విన్న కౌసల్య దుఃఖిస్తుంది. ఆ సమయంలో, లక్ష్మణుడు కౌసల్యతో, శ్రీరాముడు అరణ్యానికి పోరాదని చెప్పే క్రమంలో, ఆయన గుణగణాలను వర్ణించడానికి-లక్ష్మణుడితో చెప్పించడానికి "మత్తకోకిలము" వృత్తాన్ని ఎంచుకున్నారు వాసు దాసుగారీవిధంగా:

మత్తకోకిలము: దేవకల్పు ఋజున్ సుదాంతుని దేవి ! శత్రుల నైన స

ద్భావుఁ డై దయఁ జూచు వాని నితాంతపుణ్యునిఁ బూజ్యునిన్

భూవరుం డొకతప్పు లేక యుఁ బుత్రు నెట్టిస్వధర్మ సం

భావనం బురిఁ బాసి పొ మ్మనె ? బ్రాజ్ఞు లియ్యది మెత్తురే ? – 21

ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.

తాత్పర్యం: పరదైవంతో సమానుడై, చక్కటి నడవడిగలవాడై, ఇంద్రియ నిగ్రహం గలవాడై, శత్రువులనైన మంచి అభిప్రాయంతో దయతో చూసేవాడిని, మిక్కిలి పుణ్యవంతుడిని, ఎల్లవారికి పూజించేందుకు యోగ్యుడైనవాడిని, జ్యేష్ఠ పుత్రుడిని, ఒక్క తప్పైన చేయనివాడిని, మనుష్య మాత్రుడు-వక్రవర్తనుడు-ఇంద్రియ లోలుడు-నిష్కారణంగా భార్య కొరకై దండించేందుకు సిద్ధపడినవాడైన వాడు ఏ రాజధర్మాన్ని అనుసరించి నగరాన్ని విడిచి అడవులకు పొమ్మన్నాడు ? వివేకంగలవారు దీన్ని మెచ్చుకుంటారా ?

భాతృ భక్తితో లక్ష్మణుడు చెప్పిన మాటలు విన్న కౌసల్య, శ్రీరాముడిని ఉద్దేశించి తమ్ముడు చెప్పిన విషయాలను గుర్తుచేసి, అతడికేది ధర్మమని తోస్తే అదే చేయమని సలహా ఇస్తుంది. అడవులకు పోవడమే మంచిదనుకుంటే అలానే చేయమని అంటూ కౌసల్య తన మనసులోని మాటలను చెప్పడానికి ఒక పద్యాన్ని"కవిరాజవిరాజితము" లోను, రెండు పద్యాలను "మత్తకోకిలము" వృత్తంలోను రాసారు కావి ఈ విధంగా:

కవిరాజవిరాజితము: మనమున నాసవతాలు వచించిన మాటను బట్టి గృహంబున న

న్న నయము దుఃఖములందు మునుంగు మ టంటయు నీకును ధర్మమొకో ?

ఘనమతి ! ధర్మము సల్పఁ గ నీయెదఁ గల్గినచోఁ బరిచర్యల నన్

దనుపఁ గ రాదొకొ, తల్లిని గొల్చుట ధర్మము గాదె తనూజులకున్ ? -22

ఛందస్సు: "నగణము నారు జగణములు వగణము గలది కవిరాజ విరాజితము".

మత్తకోకిలము: నిండుబక్తి భజించి తల్లిని నిల్చి యింటనె మున్ను వి

ప్రుండు కాశ్యపుఁ డన్మునీశుఁ డు పొందఁ డే సురలోకమున్,

దండిగౌరవమందు రేనికిఁ దక్కు వౌనొకొ తల్లి ? నీ

వుండు మిందుఁ , బ్రవాసి వౌటకు నొల్ల నాజ్ఞనొసంగగన్ -23

మత్తకోకిలము: నిన్నుఁ బాసి వసింపఁ గల్గిన నిశ్చయం బిది పుత్రకా !

యన్న మేటికి నీర మేటికిఁ బ్రాణ మేటికి సౌఖ్య మం

చెన్న నేటికి ? నీవు గల్గిన నిన్ని యున్నటు దోఁ చుఁ గా,

తిన్న చో నునుఁ బచ్చికైన మదిం బ్రియం బొనరించురా ! -24

ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.

తాత్పర్యం: నిన్ను (రాముడిని) ఆజ్ఞాపించినవాడు తండ్రిగాడు. నాకు (కౌసల్యకు) సహజవిరోధైన నా సవతి చెప్పిన మాటను మనస్సున నిలిపి, కన్న తల్లినైన నన్ను శాశ్వత దుఃఖంలో మునగమనడం నీకు ధర్మమా ?. అర్థం నాకు పరమార్థం కాదు. ధర్మమే అంటావా, రాజ్యం లేకపోయినా నాకు శుశ్రూష చేసుకుంటూ నా ఇంట్లో వుండు. కొడుకులకు మాతృసేవ ధర్మమేకదా ! పూర్వకాలంలో, కశ్యపు వంశంలో పుట్టిన ఒక బ్రాహ్మణుడు, అందరిలాగా అడవులకు పోయి, ఏ తపస్సు చేయకుండా, ఇంట్లోనే వుండి, మాతృ శుశ్రూషచేసి, తపస్సుచేసి సాధించే స్వర్గసుఖాన్ని సాదించాడు. విశేష గౌరవంలో రాజుకంటే-తండ్రికంటే తల్లి తక్కువవుతుందా ? కాబట్టి నీ తండ్రి ఆజ్ఞకంటె నా ఆజ్ఞ తకువైందేమీకాదు. నువ్వింట్లోనే వుండమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. వూరు విడిచి పోయేందుకు నేను అనుజ్ఞనీయను. నిన్నొదలి నేను ఇంట్లో వుండడమే జరుగుతే, ఒకటి మాత్రం నిశ్చయం కుమారా ! నాకు అన్నమెందుకు ? నీళ్లెందుకు? చివరకు ప్రాణమెందుకు ? ఇక సుఖపడడం గురించి చెప్పాల్సిన పనేలేదు. రామచంద్రా, నువ్వు నాదగ్గరుంటే, ఇవన్నీ లేకున్నా వున్నట్లే. ప్రాణం సంతోషిస్తుంది-పచ్చిక తిన్నా నాకు సంతోషమే.

అడవులకు పోవాలనుకున్న కొడుకు నిశ్చయాన్ని, తండ్రి ఆజ్ఞ శ్రీరాముడు జవదాటడనే విషయాన్ని గ్రహించిన కౌసల్య కొడుకును ఆదరించి, దయతో దీవించాలనుకుని ఆశీర్వదించే ఘట్టంలో, శ్రీరాముడితో అన్న మాటలను ఒకచోట "మత్తకోకిలము" వృత్తంలో పద్యంగా మలుస్తారు కవి ఇలా:

మత్తకోకిలము: దేవతాయతనంబులన్ రుచి దేఋ చైత్యములందు నీ

చే వరం బగు మ్రొక్కు లందుచుఁ జెన్ను మీరినయామహా

దేవతల్ ఋషియుక్తులై వనిఁ ద్రిమ్మరం జనుచుండు ని

న్వేవిధంబులఁ గాచుచుందురు నిర్మలం బగుసత్కృపన్ – 25

ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.

తాత్పర్యం: దేవాలయాల్లో, నాలుగు బాటలు కలిసేచోట, నీచే (రాముడు) మొక్కులుగొంటున్న ఆ మహాదేవతలు, ఋషులతో సహా, అడవిలో తిరుగుతుండే నిన్ను వేయివిధాలుగా రక్షించుదురుగాక.

ఎట్టకేలకు శ్రీరాముడు అడవులకు పోవడానికి సమ్మతించాడు దశరథుడు. కొడుకుకు మేలుకలగాలని, శీఘ్రంగా తిరిగిరావాలని ఆశీర్వదించాడు. అయితే ఒక్క రాత్రి తనతో గడిపి అడవికి పొమ్మని కోరాడు. ఒక్కపూటైనా శ్రీరాముడితో హాయిగా గడపాలని వుందంటాడు. శ్రీరాముడు మరోసారి తన మనో నిశ్చయాన్ని తెలియచేశాడు తండ్రికి. ఆయన ప్రమాణం వ్యర్థం కాకుండా సార్థకమయ్యేవిధంగా తనను అడవికి పోనిమ్మని వేడుకుంటాడు. భరతుడికి రాజ్యభారం అప్పగించమని కోరాడు. అయోధ్యలో ఇంకేమాత్రం వుండి జాగుచేయ దల్చుకోలేదంటాడు. తనకొరకు తండ్రి క్రూరమైన నిట్టూర్పులు విడవొద్దంటాడు. ఇక్కడొక పద్యాన్ని "ఇంద్రవంశము" వృత్తంలో రాసారు కవి.

ఇంద్రవంశము: ధీమజ్జనుల్ మెచ్చెడి దేవరానతిన్

నేమంబుమైఁ దీర్పఁ గ నేనుగోరిన

ట్లీ మేలిభోగంబుల నిచ్చగింపఁ జూ

భూమీశ నాకై యిటు పొక్క నేటికిన్ – 26

ఛందస్సు: ఇంద్రవంశ వృత్తానికి ద-త-జ-ర గణాలు తొమ్మిదో అక్షరం యతి.

తాత్పర్యం: బుద్ధిమంతులు మెచ్చే నీ (దశరథుడి) ఆజ్ఞను నియమంతో, వ్రతంగా బూని నెరవేర్చే నేను, ఈ శ్రేష్ఠమైన భోగాలను కోరను సుమా ! రాజా, ఎందుకు నాకోసం వ్యసనపడతావు ?

ఎవరెన్ని మాటలు చెప్పినా గౌరవంగా అవన్నీ తిరస్కరించి, అరణ్యవాసం చేయడానికి సిద్ధమౌతున్న సీతారామ లక్ష్మణులకు నారచీరెలిచ్చి కట్టుకోమంటుంది కైకేయి. ఆమె ఇచ్చిన నారచీరెలను సంతోషంతో రామ లక్ష్మణులిద్దరూ కట్టుకుంటారు మొదట. పట్టు వస్త్రాలను కట్టుకొని వున్న సీత వాటిని తీసుకొని ఎగా-దిగా చేతిలో పెట్టుకొని చూస్తూ, అవెలా కట్టుకోవాలోనని ఆలోచిస్తుంటుంది. ఆ సమయంలో సీత నారచీరెలు కట్టకూడదని వశిష్ఠుడు నిషేదిస్తాడు. కైకను దుర్భాషలాడుతాడాయన కొంతసేపు. ఆమె నారచీరెలు కట్టరాదనీ, శ్రీరాముడికి బదులుగా మగడెక్కవలసిన సింహాసనాన్ని అధిష్టించాలనీ సూచిస్తాడు. సీత దానికొప్పుకోకుండా మగనివెంట అడవులకు పోవడానికే సిద్ధమౌతే, యావత్తు అయోధ్యా నగరమే శ్రీరాముడి వెంట పోతుందని అంటాడు వశిష్ఠుడు. చివరకు కైక కొడుకు భరతుడు కూడా వెళ్తాడని అంటాడు. ఇవేమీ పట్టించుకోకుండా సీత సంతోషంగా నారచీరెలు ధరిస్తుంది. అందరూ అది చూసి దశరథుడిని ఈసడించుకుంటుంటే, కైకనుద్దేశించి ఆయన అన్న మాటలను "మత్తకోకిలము" వృత్తాల్లో రెండు పద్యాలుగా రాసారు వాసు దాసుగారిలా:

మత్తకోకిలము: భూపచంద్రముపుత్రి యై ధరఁ బుట్టి సాధుచరిత్ర యై

పాపమెద్ది యెరుంగ నట్టిది బాల శ్త్రీమతి యేరి కే

పాపముం బచరించెనే యిటు వల్కలంబులతోడుతన్

దాపసిం బలె నెల్లరుం గనఁ దా సభాస్థలి నిల్వఁ గన్ ! -27

మత్తకోకిలము: చేసినాఁ డనె నీకు బాసను సీత నారలతో వనీ

వాసముం బచరింప, నీగతి బంది పెట్టెద వేటికే ?

తా సుఖంబుగ సర్వరత్న వి తాన సంయుత యై చనున్,

గాసి యేటికి నొంద ? నారలు గట్ట కుండెడుఁ గావుతాత్న్- 28

ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.

తాత్పర్యం: మహారాజు కూతురై లోకంలోని వారివలె కాకుండా, భూమిలో పుట్టి, పతివ్రతై, ఏ పాపం ఎరుగని బాలశోభావతి సీత, ఈ ప్రకారం తాపసిలాగా నారచీరెలు కట్టి, అందరు చూస్తుండగా సభాప్రదేశంలో నిలబడడానికి, ఆమె చేసిన పాపం ఏంటి ? ఓసీ, సీతను నారచీరెలతో వనవాసానికి పంపుతానని నీకేమైనా నేను ప్రమాణంచేశానా ? ఎందుకిలా నిర్భందిస్తున్నావు ? యథా సుఖంగా, సమస్తాభరణాలతో పోవాల్చిందే. ఎందుకామె నిష్కారణంగా ఇబ్బందుల పాలుకావాలి ? కాబట్టి ఆమె నార చీరెలు కట్టుకోకూడదు.

శ్రీరామ లక్ష్మణులు సీతతో గూడి అడవులకు బయల్దేరుతారు. వెంట వస్తున్న పురజనుల కంటబడకుండా వారిని ఏమరిచి ఉత్తరాభిముఖంగా ప్రయాణమై పోతారు. అలా వెళ్తూ, ఉత్తర కోసలదేశాన్ని దాటి పోతారు. మార్గమధ్యంలో కనిపించిన వేదశ్రుతి నదిని, గోమతి అనే నదిని దాటుతారు. ఆ తర్వాత గంగానది కనిపిస్తుంది. గంగను వర్ణిస్తూ "లయగ్రాహి" వృత్తంలో ఒక పద్యాన్ని రాసారు ఈ విధంగా:

లయగ్రాహి: అంగుగ దినేశకుల పుంగవుఁ డు మోద మలరంగను గనుంగొనె నభంగతరభంగో

త్సంగను శివాంబుచయ రంగను మహాఋషినిషంగను శుభాశ్రమచ యాంగను సురీవ్యా

సంగనుత సుందరవిహంగకుల రాజిత తరంగకజలాశయవిభంగను సరౌఘో

త్తుంగభవభీహనన చంగను నభంగురశుభాంగను దరంగముఖరంగ నలగంగన్ – 29

ఛందస్సు: లయగ్రాహికి భ-జ-స-న-భ-జ-స-న-భ-య గణాలుంటాయి. తొమ్మిదో అక్షరం ప్రాసయతి. ఇలాంటివి పాదానికి నాలుగుండాలి.

తాత్పర్యం: పెద్ద-పెద్ద అలలు గలదైన, స్వఛ్చమైన జలాలు గలదైన, మహర్షుల సంభంధం కలదైన, పుణ్య కార్యాలు చేయాల్సిన ఆశ్రమాలను తనతీరంలో కలదైన, స్నానం చేసే దేవతాస్త్రీలు గలదైన, పొగడదగిన అందమైన పక్షిజాతులతో ప్రకాశించే అలలుగల మడుగులను అక్కడక్కడా కలదైన, మనుష్య సమూహాల అతిశయమైన జనన-మరణాలనే భయాన్ని పోగట్టే సామర్థ్యం కలదైన, అధిక శుభాన్నిచ్చే అవయవాలు కలదైన గంగ అనే పేరున్న ప్రసిద్ధ నదిని శ్రీరాముడు సంతోషంతో చూసాడు.

సీతా రామలక్ష్మణులు గంగానదీ సమీపంలో మిత్రుడు గుహుడిని కలుస్తారు. సీతాదేవిని, అన్నదమ్ములను విశ్రాంతి తీసుకొమ్మని-నిదురించమని, నిద్రాభంగం కాకుండా తాను రక్షణగా వుంటానని అంటాడు గుహుడు. శ్రీరామ వనవాసంవల్ల అయోధ్యలో కలుగనున్న పరిణామాల గురించి లక్ష్మణుడు గుహుడికి చెప్పుతాడు. ఆ తర్వాత శ్రీరామ లక్ష్మణులు, సీత గంగను దాటడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ గుహుడు చేస్తాడు. తమవెంట ఇంతదూరం వచ్చిన సుమంత్రుడిని అయోధ్యకు మరలిపొమ్మంటాడు శ్రీరాముడు. భరతుడు రాజ్యమేలుతున్న రాజ్యాన్ని కైక అనుభవించాలన్నదే తన ముఖ్యాభిప్రాయంగా దశరథుడికి ప్రియమైన విధంగా తెలియచేయమని సుమంత్రుడిని కోరుతాడు రాముడు. శ్రీరామ లక్ష్మణులు జడలు ధరిస్తారు-మునుల మాదిరిగా కనిపించారప్పుడు. గంగనుదాటేందుకు నావ ఎక్కిన పిదప సీతాదేవి తమనందరిని రక్షించమని గంగను ప్రార్తిస్తుంది. నావ అవతలి ఒడ్డుకు చేరిన తదుపరి అందరు కిందకు దిగుతారు. నిజమైన అరణ్యవాసం ఇక అప్పటినుండి మొదలవుతుంది. ఆ సమయంలో శ్రీరాముడు తల్లిదండ్రులను తలచుకొని దుఃఖిస్తుంటాడు. తనను గర్భంలో ధరించిన కౌసల్య నిర్భాగ్యురాలని బాధపడ్తాడు. అలా శ్రీరాముడు బాదపడడం, ఆయన్ను తమ్ముడు లక్ష్మణుడు ఓదార్చడం జరుగుతున్న క్రమంలో నాలుగు పద్యాలను (తోటకము, తోదకము, ఉత్సాహము, మత్తకోకిలము) రాసారీవిధంగా:


తోటకము: అని పెక్కు తెరంగుల నశ్రుయుతా
ననుఁ డై విజనంపు వనంబున నా
యనఘాత్మకుఁ డేడిచి యానిశ యం
దొనరన్ మునిపోలికి నున్న యెడన్ -30

ఛందస్సు: తోటకమునకు నాలుగు "స" గణాలు 9వ యింట యతి

తోదకము: అలలు చలింపని యంబుధినామం
టల పెను పార ధనంజయు నట్టుల్
నిలిపి విలాపము నివ్వెర నుండన్
లలివచనంబుల లక్ష్మణుఁ డాడెన్ -31

ఛందస్సు: తోదకమునకు న- జ- జ- య గణాలు. పాదమునకు 12 అక్షరములుంటాయి. ప్రాస నియమం వుంది.



ఉత్సాహము: నిక్కమింత రామచంద్ర నీవు వీడి వచ్చుటన్
దిక్కుమాలి యాయయోధ్య తేజు మాసి యుండెడిన్
జుక్కరేఁ డు లేని రేయి చొప్పునన్; వ్యథామతిన్
న్రుక్కఁ దగునె నేను సీత న్రుక్కమే నినుం గనన్ -32

ఛందస్సు: ఉత్సాహమునకు ఏడు సూర్య గణాలు, ఒక గురువు, ఐదవ గణం మొదటి అక్షరం యతి. ఇందులో అన్నీ "హ" గణాలే అవుతే అది "సుగంధి" వృత్తం అవుతుంది. సగణ-హగణాలకు సూర్య గణాలని పేరు.

మత్తకోకిలము: నిన్నుఁ బాసి ధరాతనూజయు నేను నొక్క ముహూర్తమే
ని న్ని లం గలవారమే తమ నీటి బాసిన చేఁ పల
ట్లన్న! యాజనకాఖ్యుఁ డేటికి నంబ యేటికిఁ దమ్ముఁ డేన్
నిన్నుఁ వాసిన స్వర్గమేటికి నిక్క మియ్యది రాఘవా -33

ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.

తాత్పర్యం: తన (రాముడి) వలన తల్లికి, లోకులకు కలిగిన దుఃఖాన్ని తలచుకొని అనేకవిధాలుగా పరితపించి, కన్నీళ్లతో కూడిన కన్నులు కలవాడై, ఓదార్చేందుకు జనులెవరూలేని అడవిలో ఏ పాపం ఎరుగని శ్రీరామచంద్రుడు ఆ రాత్రంతా ఏడిచి మౌనవ్రతం పూనిన వాడివలె వుండిపోయాడు. అలలు కదలని సముద్రంలాగా, మంటలు చల్లారిన అగ్నిహోత్రం లాగా ఏడుపును ఆపుచేసి కొంచెం కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పుడు, తమ్ముడు లక్ష్మణుడు "ఉత్సాహకరమైన" మాటలు చెప్పుదామనుకుంటాడు అన్నకు. ("నిలిపి విలాపము" అనడమంటే, తనంత తానే ఉపశమించుకున్నాడని భావం. "అలలు చలింపని అంబుధి" అంటే, వాయువు ప్రేరితమైనప్పుడే అలలు ఎగిసినట్లు, దుఃఖం ప్రేరించు వారెవరూ లేనప్పుడు ఉపశమనమే దారి అని భావన. ఒక విధంగా ఈ ఉపమానం పూర్తిగా శ్రీరాముడికి అన్వయించక పోవచ్చు). ఇలా అంటున్నాడు రాముడితో: రామచంద్రా ! నీవు చెపుతున్న మాటల్లో కొంత నిజం లేకపోలేదు. నువ్వు వదిలివచ్చిన కారణాన దిక్కులేనిదైన ఆ అయోధ్య, కాంతిహీనమై, చంద్రుడు లేని రాత్రిలాగా వుంటుందనడంలో సందేహం లేదు. కాని, వనవాసానికి రాకముందు చేయాల్సిన ఆలోచన, వనవాసం చేద్దామని నిశ్చయించుకున్న తర్వాత, ఇప్పుడు-ఇక్కడ ఆలోచించి దుఃఖపడడం తగిన పనికాదు. ముందు చేసిన కార్యం గురించి వెనుక ఆలోచించేవాడు బుద్ధిమంతుడనిపించుకోడు. వెనుక చింత వెర్రితనం లాంటిది. నువ్వు ధైర్యంగా వున్న కారణాన, ఆయనే ధైర్యంతో వుంటే మనమెందుకు దుఃఖించి ఆయనకు కష్ఠం కలిగించాలనుకొని, నీ కొరకు మేము నిబ్బరంగా వున్నాం. నువ్విలా దుఃఖపడితే, నీ కోసం మేమెంత దుఃఖపడాలో ఆలోచించు. రాఘవా ! నువ్విక్కడ దుఃఖపడుకుంటూ నన్ను వూరికి పొమ్మన్నావుగాని, నా మనస్స్థితిని ఆలోచించలేదు. నేనుగాని, సీతగాని మా సుఖం కొరకు నీ వెంట రాలేదు. సుఖపడాలనుకుంటే అయోధ్యలోనే వుండిపోయేవాళ్లం. అయోధ్య నుంచే ఆ సేవ చేసేవాళ్లం. అడవిలో వున్నా చేసేవాళ్లం. కాల దేశాలు మాకు ప్రధానం కాదు. ( ఆ తర్వాత రాముడామాటలకు సంతోషించాడు).

శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి అరణ్యవాసానికి పోయిన కొన్నాళ్లకు దశరథుడు దుఃఖంతో మరణించాడు. ఆయన మరణానికి అంతఃపుర స్త్రీలు ఏడుస్తారు. రాజకీయ వ్యవహారాలు తెలిసినవారు ఏడుస్తున్న కౌసల్యను ఓదార్చి, మృత దేహానికి చేయాల్సిన ధర్మ విధులగురించి తదుపరి చర్యలు చేపట్తారు. అంత దుఃఖంలో అంతఃపుర స్త్రీలు కైకను దుర్భాషలాడుతారు. భవిష్యత్ లో కైక పెత్తనంలో తామెలా అక్కడ వుండగలమోనని పొరలి-పొరలి ఏడుస్తుంటారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని, కాంతిహీనమైన అయోధ్యాపురుని గురించి, అక్కడి పరిస్థితి గురించి మూడు పద్యాలు - మాలిని, కలితాంతము, మానిని వృత్తాల్లో- రాసారీవిధంగా కవి.

మాలిని: కలయఁ గ జను లెందుం గార్పఁ గన్ బాష్పవారిన్

గులతరుణులు హాహా ఘోషముల్ నించు చుండన్

లలి నలుకులు మ్రుగ్గు ల్గానరా కెట్టి యింటన్

బొలుపు దొరఁ గి యుండెం బ్రోలు గుర్తింపకుండన్ -34

ఛందస్సు: మాలిని వృత్తానికి న-న-మ-య-య గణాలు. 9 వ అక్షరం యతి.

కలితాంతము: భూమీశ్వరుఁ డేడ్చుచు బొంది విడన్

భామాజన మార్తిని వ్రాలనిలన్

శ్రీమద్రవి యస్తముఁ జేర జనెన్

భూమిం బెనుఁ జీఁ కటి పొల్పెసఁ గెన్ -35

ఛందస్సు: కలితాంతమునకు త-ట-జ-వ గణాలు. 8 వ అక్షరం యతి.

మానిని: తామరసాప్తుఁ డు లేనినభం బనఁ దారలు లేని త్రియామ యనం

గా మహితాత్ముఁ డు భూపతి లేమిని గద్గదకంఠసమాకులితా

యామమహాపథచత్వరసంఘము నై పురి యొప్ప నరుల్ సతులున్

స్తోమములై చెడఁ దిట్టుచు నుండిరి ద్రోహి మొనర్చినకై కయినిన్ -36

ఛందస్సు: మానిని వృత్తానికి ఏడు "భ" గణాలు, గురువు, 13 వ అక్షరం యతి.

తాత్పర్యం: ఎక్కడ చూసినా ప్రజలు కన్నీరు కారుస్తుంటే, కుల స్త్రీలు హాహా కారాలు చేస్తుంటే, ఎవరి ఇంటి ముందు కూడా అందంగా అలకడం గానీ-ముగ్గులు వేయడం గానీ లేకుండా, ఇది అయోధ్యా పురమా అని గుర్తించ లేకుండా వుండి సౌందర్యం లేనిదయింది. పుడమి రాజు ఏడుస్తూ శరీరాన్ని వదిలి పెట్టగా, భార్యలందరు దుఃఖంతో నేలగూలారు. శోభాయమానంగా వుండే సూర్యుడు అస్తమించాడు. భూమంతా పెనుచీకటి వ్యాపించింది. సూర్యుడు లేని ఆకాశం-నక్షత్రాలు లేని రాత్రి అన్నట్లుగా, గొప్ప మనస్సు గల రాజు లేనందువల్ల, వ్యసనంతో డగ్గుత్తిక పడిన కంఠాల వారితో కలత చెందిన రాచ బాటలు, నాలుగు త్రోవలు కలిసే ప్రదేశాలు కనిపించాయి. స్త్రీ-పురుషులు గుంపులు-గుంపులుగా చేరి రాజద్రోహం, భర్తృ ద్రోహం, పుత్ర ద్రోహం, ప్రజా ద్రోహం చేసిన కైకేయిని నాశనమై పోవాలని నోటి కొచ్చినట్లు తిట్టారు.

దశరథుడికి ఉత్తరక్రియలు చేసిన భరతుడు, రాజకర్తలు అతడిని పట్టాభిషేకం చేసుకొమ్మని కోరినప్పటికీ, ఒప్పుకోక, అరణ్యవాసంలో వున్న శ్రీరాముడిని తీసుకొచ్చేందుకు అడవులకు ప్రయాణమైపోతాడు. పాదచారియైన భరతుడు రామాశ్రమాన్ని వెతికి, ఆయన్ను దర్శించుకుంటాడు. కుశల ప్రశ్నలనంతరం భరతుడు శ్రీరాముడికి దశరథుడు మరణించిన సంగతి తెలియచేస్తాడు. దశరథుడు మరణించిన విధానాన్ని రాముడికి చెప్పడానికి "తరలము" వృత్తంలో పద్యం రాసారు వాసు దాసుగారిలా:

తరలము: నినుఁ దలంచియ యేడ్చుచున్ మరి నీదు దర్శనకాంక్షి యై,

నినుఁ దలంగకయున్న బుద్ధిని నేర కేమియుఁ ద్రిప్పఁ గా,

ననఘ ! నీవిడనాడుటన్, భవ దార్తిపీడితుఁ డౌచు, నీ

జనకుఁ డక్కట యస్తమించెను జాల నిన్నె స్మరించుచున్ -37

ఛందస్సు: తరలమునకు స-భ-ర-స-జ-జ-గ గణాలు. 12 వ అక్షరం యతి.

తాత్పర్యం: అన్నా ! నీ తండ్రి నిన్ను తలచుకుంటూ, ఏడ్చి-ఏడ్చి, నిన్ను చూడగోరి అది లభించనందున, నీ పైనే బుద్ధి దృఢంగా నిలిపి, దానిని మరలించ లేక, నువ్వు వదిలి వచ్చిన కారణాన నీ వియోగ బాధవల్ల, కష్ట పడుతు, రామా-రామా అంటూ నిన్నే స్మరించుకుంటు అస్తమించాడు. (దశరథుడి మరణ వార్తను కైక భరతుడికి చెప్పిన విధానానికి, భరతుడు రాముడికి చెప్పిన పద్ధతికి తేడా వుంది. తండ్రి మరణానికి కారణభూతుడు రాముడేనన్న అర్థం స్ఫురిస్తుంది కూడా. ఆయన చేసిన పని సరైందికాదని భరతుడి అభిప్రాయంగా చెప్పించాడు కవి. రాముడవై లోకాన్ని సంతోషపెట్టే బదులు దుఃఖపెడుతున్నావని భావన).

అయోధ్యకొచ్చి రాజ్యమేలమన్న భరతుడి ప్రార్థనను తిరస్కరించిన శ్రీరాముడు, తనకు బదులుగా తన పాదుకలను ఇచ్చేందుకు అంగీకరించాడు. అవి తీసుకొని భరతుడు అయోధ్యకు ప్రయాణమై పోతూ, దారిలో యమునా నదిని, గంగను దాటి శృంగిబేరి పురం గుండా సాగిపోతూ, అన్న-తండ్రి లేని అయోధ్యను చూసి, సారథితో సంతోషహీనమైన అయోధ్య వున్న విధాన్ని వర్ణించడానికి "నిరానందయైన అయోధ్యాపురి వర్ణన" అన్న పేరుతో "మధురగతిరగడ" లో పద్యాన్ని రాసారు కవి ఇలా:

మధురగతిరగడ:

పిల్లలు గూబలు పెల్లవుదానిని, మల్లడిగొను కరి మనుజులదానిని

శ్రీ లరఁ జిమ్మని చీఁ క ట్లలమఁ గఁ , గాలనిశాగతిఁ , గ్రాలెడిదానిని

గ్రహపీడితశశి కాంతారీతిని, మహమరి తేజము మలిగినదానిని

నిగిరిన క్రాఁ గిన యించుకనీళ్లను, సెగలను బొగిలెడి చిరువిహగములను

విలయముఁ గాంచువి విధమత్స్యములను, సెలయే రనఁ గను జెలఁ గెడిదానిని

సవమున బంగరు చాయల మండుచు, హవిసున నణఁ గిన యగ్నిని బోలుచుఁ

జెదరినగజములు జిట్లినధ్వజములు, బదరినవాజులు బగిలిన తేరులుఁ

గలిగి విరోధులు కలఁ చిన బెగ్గిలి, కలఁ గినదం డనగా దగుదానిని

ఫేనము ధ్వానము పెల్లయి పెద్దతు, పానును గాలియు బరిశాంతముగా

స్తిమితతఁ గాంచిన సింధుతరంగము, గుమి నా మ్రోఁ తలు గూడనిదానిని

యజనాంతంబున యాజకయూథము, యజనాయుధములు నన్నియుఁ బాయగ

వీతరవం బగు వేదిని బోలుచు, వాతతజనశూన్యం బవుదానిని

దినఁ బచ్చికఁ దలదిరముగ వ్రాల్పక, పెనుగోడియచన వెతలం గొనియెడి

గోవులమందనఁ గూడినదానిని, శ్రీవిలసితమయి స్నిగ్దతరం బయి

తేజును గూడుచు దివ్యతరం బయి, రాజిలునుత్తమ రత్న శ్రేణులు

తీరఁ గ రాలినఁ దేజము దూలిన, హార మొయనఁ గొమ రారినదానిని

జలిపినపుణ్యము క్షయ మయి పోవఁ గ, నిలఁ బడు చుక్కను నెనసినదానిని

బంభర కోటులఁ బలుసూనంబుల, సంభరిత మయి వసంతముకడపలఁ

గారున నగ్గికి గమరినతీఁ గల, తీరునఁ గాంతులు దీరిన దానిని

బేరము సారము పేరును లేమిని, ద్వారము తెరవని పణ్యస్థలమై

మరుఁ గఁ గఁ జుక్కలు మబ్బున శశితో, నెరిమాసినయా నిశ నగుదానిని

నుత్తకడవలును నుత్తపిడుతలును, గత్తరఁ గెడసిన కలుమందిరమున

దొరలెడికుండలుఁ దూలెడి గోడలు, జరుగుచుఁ బాడరు చలిపందిలి యన

వీరుని బెడిదపు వింటను నెక్కిడ, నారసమో యన నరకఁ గ వైరులు

బిగి చెడి నేలను వ్రీలినజ్యాలత, వగ వగ చెడి జిగి పాసినదానిని

నాహవశూరుం డశ్వవిభాండస, మూహంబులచేఁ బొలుపుగఁ దీర్చియుఁ

గలనికి నుపయోగము గా కుండుట, తొలఁ చు కిశోరము తోఁ బో ల్దానిని

గఛ్చపమత్స్యని కాయములొప్పఁ గ, నఛ్చం బయి శుష్కాంబుక మగుచును

గూలము దొరలగ గువలము వెడలఁ గ, హాళి చెడినకూ పాళిని బోలుచు

వగపునఁ జిర్చా భరణ విహీనుని, జిగిచెడు మే ననఁ జెలఁ గిన దానిని

జడికారున బహు జలధరసంతతి, విడువక క్రమ్మ ర విప్రభ నాఁ గను

నొప్పుచు నున్నయయోధ్యనుగనుగొని, యప్పుడు భరతుండలమటఁ జొచ్చెను -38

ఈ విధంగా సీతారామలక్ష్మణులు లేని అయోధ్యా నగరం స్థితి వర్ణించబడింది.

ఛందస్సు: నాలుగు మాత్రలు నాటిన గణములు, నాలుగు రెంటికి నలి విరమణలు
గలసి మధురగతి కనలును జగణము, తొలగిన ధృతకౌస్తుభ కవిరమణము

అయోధ్యా కాండాంతంలో రెండు పద్యాలను "వనమంజరి" లోను, "కమల విలసితము" లోను రాసారు కవి. మొదటి పద్యంలో రాముడిని స్తుతిస్తూ రాయగా, రెండవ పద్యంలో కాండలో వున్న పద్యాల సంఖ్య 2604 అనే అర్థం స్ఫురించే విధంగా రాసారు.

వనమంజరి: గురుజనవాక్య సమాచరణాసమ కోపకామవిహీనధీ

పరమకృపాశ్రయ నిశ్చలచిత్తక భ్రాతృవత్సల కామదా

విరహిత దుఃఖసుఖాంతరచేతన విశ్వసన్నుత భూధవా

నిరుపమదర్మవిధాయి దయామయ నిత్యహర్ష గుణోజ్జ్వలా -39

ఛందస్సు: వనమంజరికి న-జ-జ-జ భ-ర గణాలు. 14 వ అక్షరం యతి.

తాత్పర్యం: తండ్రి వాక్యాన్ని పరిపాలించడంలో అసమానమైన వాడు-కీడుచేసిన వాడిమీదకూడా కోపంగాని, కామంగాని లేని బుద్ధిగలవాడు-ఉత్తమమైన దయకు నిలువనీడైనవాడు-ఎంత విపత్తు వచ్చినా, సంపత్తు వచ్చినా చలించని మనస్సుగలవాడు-సోదర ప్రీతికలవాడు-కోరినవారి కోర్కెలను తీర్చువాడు-ఇది సుఖమని, దుఃఖమని అంతఃకరణలో లేనివాడు-సమస్త ప్రపంచం పొగిడేవాడు-భూమికి భర్తైన వాడు-అసమానమైన ధర్మాన్ని అనుష్టానంతో విధించువాడు-దయాస్వరూపుడు-ఎప్పటికీ సంతోషమే కలవాడు-సౌశీల్య, సౌలభ్య కృతజ్ఞతాది కల్యాణగుణాలతో ప్రకాశించేవాడు శ్రీరాముడని అర్థం.

కమల విలసితము: భువనదిఖరజ ముఖనయనాంక

ప్రవిదితపురకృత ప్రథితచరిత్రా

దివిజమనుజనుత స్థిరతరచిత్తా

ధవవర భవహర దశరథపుత్రా -40

ఛందస్సు: కమల విలసితమునకు న-న-న-న-గ- గ గణాలు.

తాత్పర్యం: భువనధికి అర్థం సముద్రం-ఇది నాలుగవ (4) అంకెను సూచిస్తుంది. "ఖ" అంటే ఆకాశం-ఇది సున్నాను (0) సూచిస్తుంది. శరజముఖకు అర్థం కుమారస్వామి ముఖాలని-ఇది ఆరవ అంకెను (6) సూచిస్తుంది. నయనకు అర్థం కళ్లు-ఇది రెండు అంకెను (2) ను సూచిస్తుంది. ఇవన్నీ కలిపితే 4062 అని ఏర్పడుతుంది. దీన్ని తిప్పి చదివితే 2604 వస్తుంది. అయోధ్యా కాండలో 2604 పద్యాలున్నాయి.

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందో ప్రయోగాలు -3

ఆంధ్ర వాల్మీకి- కవి సార్వభౌమ

శ్రీ వావిలి కొలను సుబ్బారావు- వాసుదాస స్వామి
రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణం

బాల కాండ - ఛందో ప్రయోగాలు- వనం జ్వాలా నరసింహా రావు

శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల చరిత్రను, వీరు ఆచరించిన ధర్మాలను అన్ని లోకాలకూ శాశ్వతంగా చెప్పేందుకు, శత కోటి గ్రంథాత్మకమైన ప్రబంధంగా, ఓ బృహత్ గ్రంథాన్ని రచించి నారదుడికి, ఇతర మహర్షులకు ఉపదేశించాడు బ్రహ్మదేవుడు. అంతటితో ఆగకుండా భూలోక వాసుల కొరకై శ్రీరామ భక్తుడైన వాల్మీకికి ఉపదేశించమని నారదుడిని ఆదేశించాడు. వాల్మీకి రచించిన రామాయణం బ్రహ్మ ప్రేరేపించినదే.


శ్రీరామచంద్రుడు బాలుడుగా వున్నప్పుడు జరిగిన సంగతులు తెలిపేది కాబట్టి దీనికి "బాల కాండ" అని పేరు."కాండం"అంటే జలం-నీరు. శ్రీ రామాయణం మహార్ణవంగా చెప్పడంవల్ల, అందులోని జలం కాండమనబడింది. శ్రీ రామాయణంలోని ఏడు కాండలలో "ఏడు వ్యాహృతుల" అర్థం నిక్షిప్తమైంది. బాల కాండలో "ఓం భూః" అనే వ్యాహృత్యర్థం వుంది. అది గ్రంథ పఠనంలో తెలుస్తుంది. ఈ కాండలో శ్రీరామచంద్రమూర్తైన విష్ణువే "జగజ్జనన కారణభూతుడు" అని బోధపడుతుంది. జననం మొదలు ఇరవై అయిదు ఏళ్లు వచ్చేవరకూ రాముడు చేసిన చర్యలు ఈ కాండలో వున్నాయి. పన్నెండో ఏట పెళ్లైనప్పటినుండి పట్టాభిషేకం ప్రయత్నం జరిగే వరకు చెప్పుకోదగ్గ విశేషం ఏమీలేదు. బాల కాండ వృత్తాంతమంతా 12 సంవత్సరాల కాలంలో జరిగింది.


బాల కాండలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాల్సిన కారణం, అయోధ్య కాండలో స్థితి కారణం, అరణ్య కాండలో మోక్షమిచ్చే అధికారం, కిష్కింధ కాండలో గుణ సంపత్తి, సుందర కాండలో సర్వ సంహార శక్తి, యుద్ధ కాండలో వేదాంత వేద్యత్వం, ఉత్తర కాండలో సృష్టికి హేతువు లాంటి విషయాలను చెఫ్ఫడం జరిగింది. రామాయణంలో చెప్పబడిన పర తత్వం శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన విష్ణువేనని స్పష్టమవుతుంది. ఇటువంటి పర తత్వాన్ని స్థాపించి, పరమాత్మ అనుభవించే ఉపాయం శరణాగతని అర్థం చేసుకోవాలి. శరణా గతికి ముఖ్య ఫలం, భగవత్ సన్నిధానంలో చేరి, భగవంతుడికి సేవ చేయడమే. ఇతర ఫలాలన్నీ అనుషంగకాలనే ఈ గ్రంథంలో స్పష్టమవుతుంది. ఇట్టి శరణాగతికి పురుష కారం అవశ్యం. పురుష కారానికి కావాల్సిన ముఖ్య గుణం శరణాగతుడి పట్ల దయ. ఈ గ్రంథంలో పురుష కారం ప్రధానమైంది. శరణాగతుని అనుష్టించు అధికారికి శేషత్వం పారతంత్ర్యం స్వరూపం. భరతుడి చర్య వలన పారతంత్ర్యం స్పష్టంగా కనిపిస్తుంది. శత్రుఘ్నుడి చర్యలు భాగవత పారతంత్ర్యాన్ని తెలియచేస్తుంది. శరణాగతుడికి అర్థపంచక జ్ఞానం ఆవశ్యకం. అతడు అకించనుడు-అనన్య గతుడై వుండాలి. అతడు సదా జపం చేయాల్సింది రామాయణమే.


వేదాధ్యయనంలో సు సంపన్నుడు, వ్యాకరణాది వేదాంగాలను తెలిసిన నారదుడు వాల్మీకి దగ్గర కొచ్చి చెప్పిన రామ చరిత్రను విన్న వాల్మీకి సంతోషంతో ఆయన్ను పూజించి, ఆయన పోయిన తర్వాత, తమసా నదిలో స్నానం చేయడానికి పోతున్న సందర్భంలో "మత్తకోకిలము" వృత్తంలో చక్కటి పద్యాన్ని రాసారు వాసు దాసుగారీవిధంగా:

మత్తకోకిలము: రాజితద్యుతి వాల్మీకర్షియు రాఁ గ వెన్కొనిత న్భర
ద్వాజుఁ డన్ప్రియశిష్యవర్యుఁ డు వారి నాడఁ గ నేగి, పే
రోజమై నడిమింట రాజిల నుగ్రదీధితి, చార్వను
ద్వేజితాంబులఁ గాంచి యిట్లనుఁ బ్రీతుఁ డై నిజశిష్యుతోన్-1

తాత్పర్యం: బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించే ఆ మహర్షివెంట ఆయన ప్రియ శిష్యుడు భరద్వాజుడు వున్నాడు. వీరిరువురు కలిసి, మధ్యాహ్నిక కర్మానుష్ఠానానికి స్నానం చేద్దామని, తమసానదిలో దిగుతారు. తేటగా-నిర్మలంగా నదిలో వున్న నీళ్లను చూసి వాల్మీకి శిష్యుడు భరద్వాజుడితో ఇలా అన్నాడు.

ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.

అప్పుడాయన (వాల్మీకి) కంటికి సమీపంలో, మనోహరంగా కూస్తూ, వియోగం సహించలేని క్రౌంచ పక్షుల జంట కనిపించింది. ఆ సమయంలో, తాను చూస్తున్నానన్న లక్ష్యం కూడా లేకుండా, సహజంగా జంతువులను హింసించే స్వభావమున్న బోయవాడొకడు, రెండు పక్షులలో మగదాన్ని బాణంతో చంపి నేల కూల్చాడు. క్రూరుడైన బోయవాడిపై దయ వీడి శపించాడు వాల్మీకి. సంస్కృత రామాయణంలో ఆ శ్లోకం ఇలా వచ్చింది వాల్మీకి నోట:


"మానిషాద ప్రతిష్ఠాం త్వ! మగ మ శ్శాశ్వతీ స్సమాః
యత్క్రౌంచ మిథునాదేక! మవధీః కామమోహితం"

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసుదాసుగారిలా తెనిగించారు ఆ శ్లోకాన్ని:

"తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక
ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల
గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు
కామమోహిత ముం జంపు కారణమున"


రామాయణం రాద్దామని సంకల్పించిన వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకమిది. ఆంధ్ర వాల్మీకి రామాయణ రచనలో వాసు దాసుగారు మొట్టమొదట రాసిన పద్యమూ ఇదే. "మానిశాద" శ్లోకం అంతవరకు తెనిగించినవారు లేరంటారు కవి. వ్యాఖ్యాతలు రాసిన అన్ని అర్థాలు వచ్చేట్లు రాయడం కష్టమనీ, దీన్ని తెనిగించగలిగితే మిగిలిందంతా తెనిగించడం తేలికవుతుందనీ భావించి, తనను తాను పరీక్షించుకోదల్చి, తొలుత ఆ పద్యాన్ని రాసానంటారు వాసుదాసుగారు.


రామాయణం రాద్దామని సంకల్పించిన వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకంలో, ఆంధ్ర వాల్మీకి రామాయణ రచనలో వాసుదాసుగారు మొట్టమొదట రాసిన మొదటి పద్యంలో నాలుగు పాదాలున్నాయి. పాదానికి 13 అక్షరాలు. సాంఖ్యశాస్త్రం ప్రకారం 13 ప్రణవాన్ని బోధిస్తుంది. ఎందుకంటే, వర్ణసమామ్నాయంలో 13వ అక్షరం "ఓ" విష్ణు అనే అర్థమున్న "మానిషాద" శబ్దం "అ" కారాన్ని సూచిస్తుంది. "ప్రతిష్ఠ” స్త్రీ లింగం. ఇక్కడ స్త్రీ వాచకం ప్రకృష్టమైంది. ప్రతిష్ఠ అనేది లక్ష్మీ వాచకమైన "ఉ" కారాన్ని బోధిస్తుంది."నీక" అనేది "ఉ" కార మొక్క అవథారణార్థకాన్ని తెలుపుతుంది. "క్రౌంచ మిథునంబునందు నొక్కండు", ప్రకృతి పురుషుల్లో కుటిల గతి కలది ప్రకృతి అనీ, దాని సంబంధంవల్ల అల్పమైన జ్ఞానమున్నవాడు (బద్ధ జీవుడు) పురుషుడని అర్థం చేసుకోవాలి. ఇది "మ" కారాన్ని బోధిస్తుంది.


వాసుదాసుగారు రాసిన మొదటి పద్యం రామాయణార్థాన్ని సంపూర్ణంగా సూచిస్తుంది. "మానిషాదుండ... ... అంటే లక్ష్మికి నివాస స్థానమయిన శ్రీనివాసుడా, శ్రీరాముడా" అనే పదం బాలకాండ అర్థాన్ని సూచిస్తుంది. "ప్రతిష్ఠ నీక శాశ్వతంబగు" అనే పదం పితృవాక్య పరిపాలన, రాముడి ప్రతిష్ఠను తెలియచెప్పే అయోధ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది. "శాశ్వతహాయనముల" అనే పదంలో రాముడు దండకారణ్యంలో ఋషులకు చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చి నందువల్ల ఆయనకు కలిగిన ప్రతిష్ఠను తెలియచేసే అరణ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది. దాని ఉత్తరార్థంలో కిష్కింధ కాండార్థాన్ని సూచిస్తుంది. క్రౌంచ దుఃఖం సీతా విరహతాపాన్ని తెలియచేసే సుందర కాండ అర్థాన్ని సూచిస్తుంది. ఇలా రకరకాలుగా రామాయణార్థం సూచించబడిందీ పద్యంలో.


బోయవాడు చేసిన పనికి కలిగిన దుఃఖంతో బాధపడ్డ వాల్మీకి, వాడిని దూషిస్తూ చెప్పిన పద్యం గురించి, తదేక ధ్యానంతో ఆలోచిస్తున్న సమయంలో, ఆయన్ను చూడడానికి వచ్చాడు బ్రహ్మదేవుడు. పది దిక్కులకు తన తేజస్సును వ్యాపింపచేస్తూ, యోగి శ్రేష్ఠులు చేతులు జోడించి వెంబడి వస్తుంటే, వేలాది సంవత్సరాలు తపస్సు చేసినా కానరాని బ్రహ్మదేవుడు, తనంతట తానే, దేవతా సమూహం చుట్టూ చేరి సేవిస్తుండగా వచ్చాడు. ఇలా బ్రహ్మ తన ఇష్టులతో, శిష్టులతో రావడంతో, వాల్మీకి తటాలున లేచి, మిక్కిలి భక్తితో మ్రొక్కి, నిలబడి ఈయనెందుకొచ్చాడా అని కారణం వెతకసాగాడు. ఈ సందర్భాన్ని "పంచ చామరం" పద్యంలో చెప్పారు కవి ఎలా:

పంచ చామరం: ఇ టా చతుర్ముఖుండ రాగఁ నిష్ట శిష్టపాళితోఁ
దటాలున న్మునిప్రభుండు తద్దభక్తి యుక్తిమై
నిటాలమందుఁ గేలుదోయి నిల్చి మ్రొక్కి నిల్చితా
ని టేటికో ననుం గనంగ నేగుదెంచె ధాతయున్-2.

పంచ చామరం వృత్తానికి జ-ర-జ-ర-జ-గ గణాలు. పదో అక్షరం యతి. చతుర్ముఖ బ్రహ్మకు పంచ చామర సేవ చేశారు వాసు దాసుగారు.

రామాయణాన్ని రచించేందుకు వాల్మీకిని నియమించడానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆయన ఆశ్రమానికి వస్తాడు. అప్పటికే జంటగా పక్షులు కలిసున్న సమయంలో, ఒక దాన్ని కొట్టి చంపడం ధర్మం కాదని నిశ్చయించుకున్న వాల్మీకి ఆ పనిచేసిన బోయవాడిని శపించాడు. శపించిన మాటలే పద్య రూపంలో కావడం అర్థంకాని వాల్మీకి నోట వచ్చిన పద్యానికి కారణం తానేనని తెలియక తికమక పడుతున్నాడని తెలిసిన బ్రహ్మ, అది యాదృచ్ఛికంగా వచ్చింది కాదని, తన పనుపున సరస్వతీ దేవి వాల్మీకి నోటినుండి పలికించిందని అంటూ, రామాయణాన్ని కావ్యంగా రచించి, భూ లోకంలో దాన్ని ప్రచారంలోకి తెమ్మని చెప్పి వెళ్లిపోయాడు.

తాను రచించాలని నిర్ణయించుకున్న రామాయణం రసవంతంగా, వినడానికింపుగా, మననం చేయడానికి అమృత సమానంగా, రహస్యార్థాలకు ఆధారంగా, పఠించేవారికి-వినే వారికి నిర్మలమైన కీర్తినిచ్చేదిగా, భగవత్ ప్రాప్తికి విరుద్ధమైన పాపాలను హరించేదిగా వుండాలనుకుంటాడు మహర్షి. ఎలావుండాలో చెప్పడానికి వాసు దాసుగారు "కవిరాజ విరాజితము" లో పద్యాన్ని రాసారు ఈ విధంగా:

కవిరాజ విరాజితము: సరససమాసవిలాసవిభాసము సాధునుతంబు సుసంధిగమున్
వరమ ధురోపనతార్థ సువాక్యని బద్ధము యోగసమంజసము
న్ఖరదశకంఠవధాధికమున్ సుమ నస్సు ఖదంబు మునీరితమున్
స్ఫురదురుసద్గుణభూషణభూషిత మున్ గనుఁ డీ రఘురాము కథన్-3

కవిరాజ విరాజితము ఛందస్సు: "నగణము నారు జగణములు వగణము గలది కవిరాజ విరాజితము". దీనికి ఒక సిద్ధాంతం ప్రకారం 8-7-7 స్థానాలలోనూ, ఇంకో సిద్ధాంతం ప్రకారం 14వ స్థానంలోనూ యతి వుంటుంది. ఈ పద్యంలో యతి రెండో సిద్ధాంతాన్ని అనుసరించి రాయబడింది.

తాత్పర్యం: రసవత్తరమైన సమాసాలతో, సుకరమైన సంధులతో ప్రకాశించేదిగా-సజ్జనులతో స్తోత్రం చేయబడేదిగా-సమత్వం, మాధుర్యం,అర్థ వ్యక్తి లాంటి గుణాలు కల బోసి వాక్య బద్ధమైన కావ్యంగా-యోగం, రూఢ్యర్థాలతో కూడినదిగా-రావణాసురుడి వధను అధికరించి చెప్పేదిగా-మనస్సుకు సుఖమిచ్చేదిగా-పామర కవులకు బదులుగా మునీశ్వరుడు చెప్పిందిగా-చక్కటి కావ్య గుణాలతో అలంకరించినది గా, తాను రచించ బోయే రామాయణాన్ని-అందులోని శ్రీరామ చరిత్రను దర్శన సమానమైన ధ్యానంతో శ్రద్ధగా లోకులందరినీ వినమని కోరతాడు వాల్మీకి.


విలక్షణమైన ప్రబంధ గ్రంథమే రామాయణ కథనం అని అంటూ ఆ విషయాలను సోదాహరణంగా వివరిస్తారు వాసు దాసుగారు. లోక రక్షణ కొరకు భూమ్మీద అవతరించిన శ్రీరామచంద్రమూర్తి ప్రజా పాలన చేస్తున్న రోజుల్లో, భగవంతుడైన వాల్మీకి మహర్షి, లోకోపకారంగా, చిత్రమైన పదాలతో, ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణ రచన చేశాడు. పూర్వ రామాయణంలోని ఆరు కాండలలో ౫౩౭ (537) సర్గలుంటే, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత జరిగిన కథకు సంబంధించిన ఉత్తర కాండలో మరో ౧౧౦ (110) సర్గలున్నాయి. అదేవిధంగా శ్రీరామ పట్టాభిషేకం అనంతరం ఈ గ్రంథాన్ని లోకానికి ప్రకటించినవారు కుశ లవులు.


సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు

బాల కాండ ౭౭ (77) సర్గలు ౨౨౫౬ (2256) శ్లోకాలు
అయోధ్య కాండ ౧౧౯ (119) సర్గలు ౪౪౧౫ (4415) శ్లోకాలు
అరణ్య కాండ ౭౫ (75) సర్గలు ౨౭౩౨ (2732) శ్లోకాలు
కిష్కింధ కాండ ౬౭ (67) సర్గలు ౨౬౨౦ (2620) శ్లోకాలు
సుందర కాండ ౬౮ (68) సర్గలు ౩౦౦౬ (3006) శ్లోకాలు
యుద్ధ కాండ ౧౩౧ (131) సర్గలు ౫౯౯౦ (5990) శ్లోకాలు
ఉత్తర కాండ ౧౧౦ (110) సర్గలు ౩౨౩౪ (3234) శ్లోకాలు
-------------------------------------------------------------------------------------
ఏడు కాండలు ౬౪౭ (647) సర్గలు ౨౪,౨౫౩ (24,253)శ్లోకాలు


స్థూల దృష్టితో పెద్ద సంఖ్య చెప్పేటప్పుడు దాని పైనున్న చిల్లర సంఖ్య గణించాల్సిన పనిలేదు. అందుకే రామాయణంలో ౨౪ (24) వేల శ్లోకాలని చెప్పడం జరిగింది. ప్రబంధ వైలక్షణ్యాన్ని తెలియచేసే సర్గ ఇది. పరమ ఆప్తుడైన కవి రచించడం, కీర్తిమంతుడైన నాయకుడు ప్రతిపాద్యుడిగా వుండడం, మహాత్ములు దాన్ని అంగీకరించడం, సాక్షాత్తూ కథానాయకుడే దాన్ని శ్లాఘించడం లాంటి విషయాలను కలిగున్న గ్రంథాన్ని "ప్రబంధ వైలక్షణ్య" మున్న గ్రంథ మంటారు. సర్గలోని మొదటి పద్యంలోనే ఈ విషయం విశదమవుతుంది. సమస్త సద్గుణాలతో లోకులందరినీ ఆనందపర్చిన శ్రీరామచంద్రుడి చరిత్రై నందువల్ల, రామాయణం కడు ఆదరణీయమైంది. శ్రీరామ చరిత్ర అంటే మహాపురుష చరిత్రే.. అందుకే దీనివలన ఎన్నో లాభాలున్నాయన్న భావన కూడా మొదటి పద్యం లోనే వివరించబడింది. శ్రీరామచంద్రమూర్తి రాజ్యం చేసే రోజుల్లో, సీతాదేవి తన ఆశ్రమం చేరిన తర్వాతే, వాల్మీకి రామాయణ రచన చేశారన్న విషయం కూడా ఈ పద్యంలో స్పష్టంగా బోధపడ్తుంది. శ్రీరామచంద్రమూర్తి అవతరించడానికి పూర్వమే వాల్మీకి రామాయణం రచించాడనడం సత్యదూరం. రామాయణంలోని శ్లోకాలు, సర్గలు, కాండల వివరాలు కూడా మొదటి పద్యంలో చెప్పడం జరిగింది.

ఆ మొదటి పద్యం ఇదే:

సీ: భువనావనార్థంబు భూమిపై జన్మించి, ప్రాప్తరాజ్యుండయి ప్రజలరాము
డోముచు నుండ లోకోపకారంబుగ, భగవంతు డగు ఋషి వాల్మికుండు
శ్రీరాము చరితంబు చిత్రపదంబుల, వెలయ నిర్వదినాల్గు వేలు శ్లోక
సంఖ్యయు, వానిని సర్గముల్ గాగను, పూర్వరామాయణ మనను నూరు

తే: లేను, కాండంబులారుగ జానుమీర, వెండియునుబల్కె బదపడి కాండమొండు
పావనంబై న రఘురాము భావికథను, సో త్తరంబుగ నెల్ల రసోత్తరముగ.

ముని కుమారులవలె కనిపిస్తున్న కుశ లవులు ఎంతో సమర్థతతో, వాల్మీకి నేర్పిన విధంగానే, రామాయణాన్నంతా ముఖస్థం చేశారు. అయోధ్యకు పోయి, ప్రశస్త రీతిలో, కడు సంతోషంతో, మహర్షులు-సాదువులు-బ్రాహ్మణులున్న పెద్ద సభా మండపంలో ధర్మ సమ్మతమైన కావ్యాన్ని గానం చేయసాగారు. గుంపులు-గుంపులుగా జనాలున్న చోట, చిన్న-చిన్న వీధుల్లో, సందుల్లో-గొందుల్లో, రచ్చ బండల దగ్గర, అంగడి వీధుల్లో, సంతోషంగా పాడారు కుశ లవులు. వివిధ రకాల అభినయాలతో, నవ రసాల పలుకులతో కుశ లవులు గానం చేస్తుంటే, సంతోష సాగరంలో మునిగి తేలుతున్న జనావళి, వళ్లు మరిచి, వారిని భళీ-భళీ అని మెచ్చుకున్నారు.


అయోధ్య వీధుల్లో రామాయణ గానం చేస్తున్న కుశలవులను శ్రీరాముడు తన వద్దకు పిలిపించుకుంటాడు. మన్మధాకారంతో ముని వేషధారులైన కుశ లవులిద్దరు, ఒకే రకంగా వున్న విషయాన్ని - వారిని చూడగానే సమస్త విద్యలను సరిసమానంగా నేర్చుకున్నట్లుగా తెలుస్తున్న విషయాన్ని, శ్రీరామచంద్రుడు గమనించి, తన మనసులో అనుకుంటున్న దాన్ని తమ్ములతో ప్రస్తావిస్తాడు. తేనెలొలికే అందం తోనూ, అమృత రస ప్రవాహంలోని అలల లాగానూ, వేదార్థంలోని సదభిప్రాయం తోనూ, వింటున్న కొద్దీ బ్రహ్మానందం కలిగించే విధంగా కుశ లవులిద్దరు గానం చేస్తున్నారని అంటాడు. కుశలవుల గానాన్ని వినమని తమ్ముళ్లను ప్రోత్సహిస్తూ: "ఈ బాలకులు ఏ రసాన్నైతే అభినయిస్తూ పాడుతున్నారో, ఆ రసమే మనలో పుట్టి మనకూ అనుభవంలోకి వస్తున్నది. కవిత్వం విషయానికొస్తే, ఆసాంతం, విచిత్ర శబ్దాలతో కూడి వినసొంపుగావుంది. ఏ దోషాలు లేవు. ఇలాంటి నిర్దుష్టమైన-గుణవంతమైన-శ్లాఘ్యమైన కావ్యాన్ని చంద్ర బింబం లాంటి ఈ ముని కుమారులు గానం చేస్తున్నారు" అని సగౌరవంగా మాటలతోనే బహుకరిస్తూ అంటాడు శ్రీరాముడు.

ఈ సందర్భంలో వాసు దాసు గారు రాసిన ఉత్పలమాల పద్యానికి సంబంధించిన ఛందస్సు గురించి ఆయనే స్వయంగా కొన్ని వ్యాకరణ విషయాలను ప్రామాణికంగా ఉదహరిస్తారు. ఆయన రాసిన ఆపద్యం:

ఉత్పలమాల: సోదరులార వింటిరె ర సోదయకారణ మై విచిత్ర శ
బ్దాదరణీయ మై విమల మై చెలువారెడుకావ్య మిందిరా
సోదరమూర్తు లీతపసి సూనులు గాన మొనర్ప నద్ధిరా
మాదిరి మీరె నంచు బహు మానపురస్కృతవాక్కు లాడినన్

ఛందస్సు: మూడోపాదంలో "అఖండయతి" వాడబడింది. ఈ యతి విషయంలో భిన్నాభిప్రాయాలు వున్నాయని కవి అంటూ, "అఖండ యతి" ని అంగీకరించిన వారి పక్షాన తానున్నానని స్పష్టం చేశారు. అఖండ యతి సిద్ధాంతాన్ని నిరాకరించిన వారు లక్షణ-లక్ష్యాలను శోధించలేదని, భారాతాన్నైనా పూర్తిగా చదవలేదని ఆక్షేపించారు కవి. పూర్వ గ్రంథాలనుండి కొన్ని ఉదాహరణలిస్తూ, భీమకవి పేర్కొన్న పది యతులలో అఖండ యతి కూడా వుందని అంటారు. అప్పకవికి పూర్వులు, భీమకవికి ముందున్న కవులు ఎలా అఖండ యతిని ఆదరించారో సోదాహరణంగా పేర్కొన్నారు వాసు దాసుగారు.

రతీదేవిని మించిన సుందరమైన భార్యలు-అసమాన పరాక్రమం వున్నా, సంతానం లేనందున, సుఖాలెన్ని వున్నా-కుమారులవలన కలిగే భోగ భాగ్యాలతో సరితూగవని-తన తపస్సు వ్యర్థమనీ బాధపడేవాడు దశరథుడు. పుత్రులు కలిగేందుకు అశ్వమేథ యాగం చేస్తాననీ-అలా చేస్తే సంతానం కలగొచ్చనీ తన మంత్రులతో పురోహితులతో అంటాడు. అందులో భాగంగా పుత్రకామేష్టి యాగం కూడా చేయాలనుకుంటాడు.

పుత్ర కామేష్టి యాగం చేయ సంకల్పించిన దశరథుడితో ముఖ్యమంత్రి సుమంత్రుడు తనకు తెలిసిన ఒక ఉపాయాన్ని-దేన్నైతే సనత్కుమారుడు ఋషులందరూ వింటుండగా వెల్లడిచేశాడని వశిష్ఠాది మునులంటుండగా తాను విన్నాడో, దాన్ని చెపుతానని అంటాడు. ఆ ఉపాయంతో, పుత్రులు లేరన్న చింత తొలగిపోతుందని, అది పుత్రులు కలిగేందుకు నిర్విఘ్నమైన ఉపాయమని అంటాడు. కాశ్యపుడు అనే మునికి-హరిణిలకీ గొప్ప తపస్వి-పుణ్యవంతుడైన ఋశ్యశృంగుడనే కొడుకున్నాడనీ, అతడు పుట్టినప్పటినుండీ అడవుల్లోనే విహరించేవాడని సుమంత్రుడంటాడు. అడవుల్లో తిరిగే అతడు తన తండ్రిని చూడడానికి వచ్చే మునులను తప్ప ఇంకెవ్వరినీ చూడలేదు. ఎల్ల వేళలా తండ్రి ఆజ్ఞానుసారం తపస్సు చేస్తుండేవాడు. ఈ విషయాలను చెప్తూ బ్రహ్మచర్యం గురించి కూడా వివరిస్తాడు సుమంత్రుడు దశరథుడికి. ఇక్కడో పద్యాన్ని "తరలము" వృత్తంలో రాసారీవిధంగా:

తరలము: జననమాది రసాస్థలిన్ వన చారియై సతతంబు నా
మునివరేణ్యుఁ డు గానఁ దండ్రికి మ్రొక్క వచ్చెడియోగులన్
ఘనతపస్వులఁ గాని యన్యముఁ గానఁ డెద్దియు, నిత్య మ
య్యనఘుఁ డుగ్రతపంబులన్ జన కాజ్ఞచొప్పున వర్తిలున్-4

ఛందస్సు: న-భ-ర-స-జ-జ-గ గణాలు. పన్నెండో స్థానంలో యతి.

ఋశ్యశృంగుడి చరిత్రను సవివరంగా చెప్పమని కోరిన దశరథుడితో, సుమంత్రుడు, ఇంతకుముందు చెప్పినదాన్నే మరింత సమగ్రంగా తెలియచేస్తాడు. ఆ సందర్భంలో "మత్తకోకిలము" వృత్తంలో ఒక పద్యాన్ని, "తరలము" లో ఇంకొక పద్యాన్ని రాస్తారు. అవి:

మత్తకోకిలము: ఆ ఋషీంద్రుఁ డు పుట్టు వాదిగ నంబుజాయతనేత్ర ల
న్వార లెట్టిరొ యాలకింపఁ డు పల్క నేటికిఁ జూచుటల్
వారముఖ్యులు ధారణీశ్వర వంచనాపర లౌటచే
నేరుపుల్ పచరించి తేరఁ గ నేర్తు రెంతయుఁ దిన్నఁ గన్-5


తరలము: జనన మందిన దాదిఁ గా బుర సంభవంబు నేదేనియున్
జనపదోద్భవమైనఁ జూచిన జాడ లేదు, నెలంత ల
న్వినియు నేని నెఋంగఁ, డుగ్రసు నిష్ఠు డౌటఁ దపంబునన్
దనదునాశ్రమ భూమి వీడఁడు దండ్రిఁ దన్పు సపర్యలన్-6

ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి. తరలము నకు న-భ-ర-స-జ-జ-గ గణాలు. పన్నెండో స్థానంలో యతి.

తాత్పర్యం: పుట్టినప్పటినుండి ఇంతవరకూ స్త్రీలను ఋశ్యశృంగుడు చూడలేదు కనుక, వారెలా వుంటారో ఎరుగడని-అందువల్ల ఆయనను తీసుకునిరాగలిగేది స్త్రీలేనని మంత్రులంటారు. కుల కాంతలకు బదులు వార కాంతలైతే, ఏదో విధంగా వంచనతో వశపర్చుకుని, ఋశ్యశృంగుడిని తీసుకుని రాగలుగుతారని-ఈ పనికి వారినే పంపిద్దామని సలహా ఇస్తారు మంత్రులు. నగరంలోగాని-పల్లెల్లోగాని అందరికీ కనిపించే ఏ వస్తువునూ పుట్టినప్పటినుండి చూసినవాడు కాదు ఋశ్యశృంగుడు. స్త్రీలెలా వుంటారో అసలే తెలియదు. నియమ నిష్ఠలతో తపస్సు చేయడంలోనో-విరామం దొరికినప్పుడు తండ్రికి సేవలు చేయడంలోనో మాత్రమే సమయాన్ని గడిపేవాడు ఋశ్యశృంగుడు. ఆశ్రమాన్ని విడిచి ఎప్పుడూ-ఎక్కడకూ పోయినవాడు కాదాయన. ఇతిహాసాలు-పురాణాలు చదివి, స్త్రీలు ఎలా వుంటారోనని చదివిన వాడూ కాదు. అలాంటి ఋశ్యశృంగుడి దగ్గరికి వెళ్లాలంటే, అక్కడున్న విభండకుడు శపిస్తాడన్న భయంతో, వార కాంతలు చాలా దూరంలో వుండే, సరైన సమయం కొరకు ఎదురు చూశారు.

సుమంత్రుడి సలహా విన్న దశరథుడు, వశిష్ఠుడికి విషయాన్నంతా తెలియపరచి, ఆయన సూచన ప్రకారం ఋశ్యశృంగుడిని తన రాజ్యానికి తీసుకొచ్చేందుకు రోమపాదుడి దగ్గరకు పోతాడు. ఆయన పయనమై పోతున్న త్రోవను వర్ణిస్తూ "ప్రహరణకలిత" వృత్తంలో ఒక పద్యం రాసారు వాసు దాసుగారీవిధంగా:

ప్రహరణకలిత: వనములు నదులున్ వరుసగఁ గనుచున్
జనపతి చనెఁ ది న్న నిపయనములన్
మునికులతిలకున్ మును చని కనెఁ బా
వనశుచిరుచిన్ వరఋషి తనయున్-7

ఛందస్సు: "ప్రహరణకలిత" వృత్తానికి న-న-భ-న-వ గణాలుంటాయి. ఎనిమిదో అక్షరం యతి.

తాత్పర్యం: దారిలో నదులను-పర్వతాలను దాటుకుంటూ, రోమపాదుడి చంపా నగరానికి చేరుకుంటారు. వెళ్లిన వెంటనే, ముందుగా ఋశ్యశృంగుడి దర్శనం చేసుకుని, తర్వాత రోమపాదుడి వద్దకు వెళ్తాడు దశరథుడు.

సంతాన లాభం అనుగ్రహించమని దశరథుడు యజ్ఞం చేస్తున్న సమయంలో, అక్కడకు, గంధర్వులు-దేవతలు-సిద్ధులు-ఇతర దేవతలు, పరమ ఋషులు, తమ తమ హవిర్భావం కొరకై బ్రహ్మదేవుడితో కలిసి వచ్చారు. వచ్చిన వారంతా బ్రహ్మను చూసి, రావణాసురుడు తమను పెట్తున్న బాధలను ఆయనకు మొర పెట్టుకుంటారు. దశరథుడి అభీష్ఠాన్ని నెరవేర్చేందుకు, పరమ కరుణాలుడైన భగవంతుడు భూలోకంలో అవతరించదలచి దేవతలున్నచోటికే వచ్చాడు ఆ సమయంలో. వచ్చిన విష్ణుమూర్తి ఏకాగ్రమనస్సుతో బ్రహ్మ సమీపంలో వుండగా, దేవతలాయనకు నమస్కరించి, స్త్రోత్రం చేసి, ఆయన మనస్సును సంతోష పరిచి, భక్తితో తమ బాధలు చెప్పుకున్న విషయాన్ని "సుగంధి" పద్యంలో రాసారు కవి ఇలా:

సుగంధి: నిన్ను వేఁడు వార మయ్య నీరజాక్ష! మమ్ము నా
పన్నులం బ్రపన్ను లం బ్రపంచము న్దయామతిం
జెన్ను మీరఁ గావవే, ప్రసిద్ధుఁ డిద్ధకీర్తిసం
పన్నుఁ డున్ వదాన్యుఁ డుం దపస్వితుల్య తేజుఁ డున్-8

ఛందస్సు: సుగంధికి ర-జ-ర-జ-ర గణాలు 9 వ అక్షరం యతి.

తాత్పర్యం: కమలాలలాంటి కళ్ళున్న మహానుభావా! ఆపదలతో బాధపడుతున్నాం. నిన్ను ప్రపత్తి చేసినవాళ్ళం. అందుకే నిన్నే ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని-ప్రపంచాన్ని దయతో రక్షించు. ప్రపంచంలో సత్ప్రవర్తనకలవాడని ప్రసిద్ధికన్నవాడు, మంచి కీర్తి సంపాదించినవాడు, దాత, ఋషితేజంకలవాడు, కకుత్థ్స వంశంలో పుట్టినవారిలో శ్రేష్ఠుడు దశరథుడు కొడుకులు కావాలని సంకల్పించి యజ్ఞం చేస్తున్నాడు.

రావణుడు వర గర్వంతో అన్ని లోకాలవారిని-ముఖ్యంగా వయసులో వున్న స్త్రీల మాన ప్రాణాలను-పురుషుల ప్రాణాలను నాశనం చేసాడని, వాడు మనిషి చేతులో తప్ప ఇతరుల వల్ల చావడని, సామాన్య మానవులెవరు వాడిని చంపలేరని, అందువల్ల విష్ణుమూర్తే మానవావతారంలో వాడిని చంపాలని దేవతలిచ్చిన సలహాను అంగీకరించిన మహావిష్ణువు దశరథుడు పుత్ర కామేష్ఠి యాగం చేస్తున్న ప్రదేశం నుండి అదృశ్యమయ్యాడు. విష్ణుమూర్తి యజ్ఞ సభనుండి అంతర్థానమైన తర్వాత ఆయనకు రామావతారంలో సహాయపడేందుకు, బలవంతులను - కామ రూపులను- గోళ్ళు, కోరలు ఆయుధాలుగా కలవారిని-అసహాయశూరులను సృజించమని, దేవతలను ఆదేశిస్తాడు బ్రహ్మ. ఇలా జన్మించిన వానరుల విషయం ప్రస్తావిస్తూ ఒక పద్యాన్ని "ఉత్సాహం" లోనూ, మరొకటి "మత్తకోకిలము" వృత్తంలోనూ, మూడోది "మనోహరిణి" వృత్తంలోనూ రాసారీవిధంగా కవి.

ఉత్సాహం: కామరూపధారులుం బ్ర కాశమాన తేజులున్
ధీమతుల్ ప్రధాయుతుల్ సుధీరతావిరాజియుల్
భీమవేగభూరిశౌర్య విక్రమేడ్యయూథపుల్
భూమిశతసహస్రశతము పుట్టి క్రాలు చుండఁ గన్-9

ఛందస్సు: ఉత్సాహం కు ఏడు సూర్య గణాలు, ఒక గురువు, ఐదవ గణం మొదటి అక్షరం యతి.

మత్తకోకిలము: అట్టిమర్కటయూథపాళుల యందు మిక్కిలి మేటులై
దిట్టలై రవిపుత్రుఁ డాదిగ దేజరి ల్లిరి యూథనా
థేట్టు లీ ప్లవగేంద్రులున్ జని యింపఁ జేసిరి ధీరతా
పట్టభద్రుల శౌర్య రుద్రుల స్వామికార్యవినిద్రులన్-10

ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.

మనోహరిణి: జలధర బృందా చలకూటనిభుల్
బలమదవంతుల్ ప్లవగ ప్రముఖుల్
వెలసిరి సీతా విభుసాహ్యముకై
బలకొని చక్షు ర్భయదాకృతులున్-11

తాత్పర్యం: వారు కోరిన రూపాలు ధరించగలరు.తేజంతో ప్రకాశిస్తూ-బుద్ధివల్ల పూజించబడుతూ-కీర్తిమంతులుగా-మంచి ధైర్యవంతులుగా-భయంకర వేగంతో- గొప్ప శౌర్యంతో-పరాక్రమంతో ఆ వానర సేనానాయకులందరూ భూమిపై తిరగసాగారు. ఆ సేనానాయకుల గుంపులలో,మిక్కిలి గొప్పవారైన సుగ్రీవుడులాంటివారు,వారికి నాయకుడై వుండసాగారు.ఈ వానరులకు కూడా ధైర్యవంతులు, శౌర్యవంతులు, స్వామికార్యధురీణులు పుట్టారు. మేఘ సమూహాలవలె బలసినవారై, కొండ శిఖరాలలాగా ఉన్నత దేహాలు కలిగి, బల గర్వాలతో, భయంకర ఆకారాలతో, శ్రీరాముడికి సహాయం చేసేందుకొరకు జన్మించారా వానర శ్రేష్ఠులు.

యజ్ఞం అయిన ఆరు ఋతువుల తర్వాత, పన్నెండో నెలలో, చైత్ర మాసం - శుక్లపక్షం - నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలో, అభిజిల్లగ్నం - కర్కాటక లగ్నంలో, చంద్రుడిని కూడిన బృహస్పతి కలిగిన ఉదయం (గురుడు కర్కాటకరాశిలో చంద్రుడితో చేరి వుండడం - చైత్రంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించడం కూడా ఉచ్ఛస్తానాలే), సూర్యుడితో సహా ఐదు గ్రహాలు (అంగారక, సూర్య, గురు, శని, శుక్ర) వాటి-వాటి ఉచ్ఛ స్థలాల్లో(సూర్యుడికి మేషరాశి - గురువుకు కర్కాటకం - శనికి తుల - శుక్రుడికి మీన రాశి - అంగారకుడికి మకర రాశి ఉచ్ఛస్తానాలు) వుండగా, కౌసల్యా దేవి జగత్ పాలకుడైన శ్రీమహావిష్ణువు యొక్క అర్థాంశమూర్తి - శుభ లక్షణాలు కలవాడైన రఘువంశ వర్ధనుడిని, సర్వ లోకాలు నమస్కారం చేసేవాడిని, రాముడిని కనింది.


శ్రీరాముడితో సహా నలుగురు రాజకుమారులు అల్లారుముద్దుగా పెరుగుతూ, విద్యలలో ఆసక్తిగలిగి, సమస్త విద్యలను శ్రేష్ఠులైన గురువుల దగ్గర నేర్చుకున్నారు. తన నలుగురు కుమారులకు వివాహం చేయాలని దశరథుడు ఆలోచన చేసే సమయంలో, ఆయన సంకల్పబలానికి అనుగుణంగానే, జగత్ప్రసిద్ధిగాంచిన - మహాతేజస్సుగల విశ్వామిత్ర మహర్షి ఆయనను చూడడానికి వచ్చాడు. యజ్ఞం చేద్దామని సంకల్పించుకొని దీక్ష పూనానని, దాన్ని విఘ్నం చేయాలని మారీచ - సుబాహువులు అనే ఇద్దరు రాక్షసులు పంతం పట్టారని, వారినుండి కాపాడేందుకు శ్రీరాముడిని తనవేంట అడవులకు పంపమని కోరాడు విశ్వామిత్రుడు. తనకిష్ఠం లేకున్నా, వశిష్ఠుడు చెప్పిందంతా విన్న దశరథుడు, సంతోషించి, లక్ష్మణుడితో సహా రామచంద్రుడిని మునివెంట పంపేందుకు ఒప్పుకుంటాడు. బల-అతిబల విద్యలను నేర్చుకుంటారు రామలక్ష్మణులు.

తాటక వధానంతరం యుద్ధభూమిలో జయించగల శ్రేష్ఠమైన అనేక అస్త్రాలను శ్రీరాముడికిచ్చి అవి ఎప్పుడు ఎలా ఉపయోగించాలో నేర్పుతాడు (తనవెంట అడవుల్లో తీసుకెళ్తున్న) విశ్వామిత్రుడు. శ్రీరామచంద్రుడు సంతోషంతో వాటిని స్వీకరించి, విశ్వామిత్రుడికి నమస్కరించి ప్రయాణమై పోతూ, తనకున్న సందేహాలను ఆయన్నడిగి తీర్చుకుంటాడు. తాను ప్రయోగించిన అస్త్రాన్ని తిరిగి ఉపసంహరించాలంటే ఏం చేయాల్నో, వివరంగా చెప్పమని శ్రీరాముడు అడిగిన విషయాలన్నిటికీ వివరణ ఇచ్చాడు విశ్వామిత్రుడు. తదుపరి, విశ్వామిత్రుడి ఆజ్ఞ ప్రకారం సంహారాస్త్రాలన్ని రామచంద్రమూర్తి లక్ష్మణుడికి ఇచ్చాడు. ఈ విధంగా వారిద్దరూ ఆ విద్యలనన్నీ నేర్చినవారైనారు.

విశ్వామిత్రుడి యాగరక్షణచేసిన రామలక్ష్మణులను మిథిలానగారనికి తీసుకొని పోతుంటాడు. రత్నాల లాగా శ్రేష్ఠమైన సద్గుణాలుగల ఆ బాలురు విశ్వామిత్రుడి వెంట పోయే సమయంలో సమీపంలోని కొండ పక్క అందమైన చెట్ల గుంపు కనిపించింది. ఆ సందర్భంలో "వనమయూరము" లో రాసారీ పద్యాన్ని:

వనమయూరము: మాణవకరత్నములు మౌనివరున్ వెంటన్
రాణమెయిఁ బోవునెడ రాముఁ డు మృదుశ్రీ
వాణి నిటు పల్కె ఋషి వర్య ! గిరిచెంతన్
బొణిమి నెసంగెఁ దరుపుంజ మది గంటే ? -12

ఛందస్సు: వనమయూరము నకు భ-జ-న-స-గగ లు గణాలు. తొమ్మిదింట యతి.


గంగ ఎందుకు భూలోకంలో ప్రవహించవలసి వచ్చిందో, దానికి కారణమేంటో చెప్పదల్చుకుని, రామ లక్ష్మణులతో సగరుడి వృత్తాంతాన్ని వివరించాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు సగర చక్రవర్తి వృత్తాంతాన్ని చెప్తూ ఆయనకు యజ్ఞంచేయాలన్న ఆలోచన కలిగిందంటాడు. యజ్ఞం మధ్యలో ఇంద్రుడు రాక్షస వేషంలో వచ్చి,యజ్ఞాశ్వాన్ని దొంగిలించాడు. దాన్ని వెతకడానికి వెళ్లిన సగరకుమారులు కపిలుడి కోపాగ్నిలో భస్మమై పోతారు. చనిపోయిన సగర పుత్రులు స్వర్గానికి పోవాలంటే గంగలో వారి బూడిదలను తడపాలి.

ఆ వంశంలోని భగీరథుడు రాజర్షిగా వుండి, పిల్లలులేనివాడైనందున, రాజ్యాన్ని మంత్రుల పరంచేసి, పూర్వీకులెవరికీ సాధ్యపడని గంగను తెచ్చేందుకు గోకర్ణానికి తపస్సు చేసేందుకు పోతాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు, అసమానమైన తపస్సు చాలించి ఆయనకోరికేదో తనకు తెలియచేయమని భగీరథుడితో అంటాడు. భగీరథుడు, తనననుగ్రహించి సగరకుమారులందరికి తాను తర్పణాలు వదిలేటట్లు చేయమని, బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. గంగా తీర్థంతో తన తాతల బూడిద రాసులను తడిపితే వారందరు స్వర్గానికి పోతారని-అలా వరమివ్వమనీ, తనకు పుత్రులనిచ్చి ఇక్ష్వాకుల వంశాన్ని నిలబెట్టమనీ బ్రహ్మనడిగాడు భగీరథుడు. ఇది వివరించేందుకు "తోటకము" వృత్తంలో రాసారో పద్యాన్నిలా:

తోటకము: జగదీశ్వర నాకు బ్ర సన్నుఁ డవే
నొగినాతపమున్ ఫల యుక్తమయే
న్సగరాత్మజులందరు నావల నన్
వగదీరఁగఁ గాంత్రు నివాపములన్-13

ఛందస్సు: తోటక వృత్తానికి నాలుగు "స" గణాలు, తొమ్మిదో అక్షరం యతి.

మిధిలానగరానికి ప్రయాణం కొనసాగిస్తూ, విశ్వామిత్రుడు, శ్రీరామ లక్ష్మణులతో-ఋషీశ్వరులతో కలిసి, గంగ దాటి, ఉత్తరం వైపున్న ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ, ప్రాకారాలతో, కుల పర్వతాలను మించిన మేడల గుంపుల కాంతులతో, తియ్య మామిడి లాంటి ఫల వృక్షాలతో స్వర్గాన్నే మరిపిస్తున్న విషాల నగరంలోకి ప్రవేశించగానే, రాజకుమారుడైన రామచంద్రమూర్తి, మహాత్ముడైన విశ్వామిత్రుడితో, ఆ నగరాన్ని ఏలే రాజెవ్వరని-ఏ వంశం వాడని, అడిగాడు. సమాధానంగా మునీంద్రుడు ఆ కథంతా చెప్పాడు.

పాలసముద్రం చిలికి-అందులోంచి పుట్టిన అమృతాన్ని భుజించినట్లైతే, తమకు మరణముండదని-ముసలితనం రాదని ఆలోచించి, మందర పర్వతాన్ని కవ్వంగా-వాసుకు తాడుగా, పాలసముద్రాన్ని చిలకడం మొదలెట్టారు దేవదానవులు. అలా వారు వేయి సంవత్సరాలు చిలకగా, ఆ రాపిడిని సహించలేక, వాసుకి విషాన్ని కక్కాడు. ఆ వేడికి కొండ రాళ్లు పగలడంతో పాటు, భయంకరమైన హాలాహలం రాక్షసులను, దేవతలను భస్మం చేయసాగింది. అంతులేని తాపాన్ని కలిగిస్తున్న హాలాహలాన్ని విష్ణువు చెప్పినట్లే మింగి, విషాన్ని కంఠంలో ధరించాడు. దేవతలు తిరిగి పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందర పర్వతం పుటుక్కున మునిగింది సముద్రంలో. అది చూసిన దేవతలు, ప్రపంచాన్ని-ముఖ్యంగా తమను రక్షించే విష్ణుమూర్తిని, కొండ మునుగుతున్నదని-దాన్ని పైకెత్తి పట్టగల సమర్థుడు ఆయనేనని-ఆయనను సేవిస్తుండే వారు ఆపదల పాలవుతుంటే వూరకుండరాదని-ఆశ్రిత రక్షణ చేసి, తమను కాపాడమని ప్రార్థించారు. ఈ సందర్భంగా "మత్తకోకిలము" వృత్తంలో రాసారీపద్యాన్ని కవి.

మత్తకోకిలము: ఆ హరించి విషంబు నిట్లు పురారి యేగిన, దేవతల్
మొహరించి మరిన్ మధింపఁ గ మున్గెఁ గొండ పయోనిధిన్
బాహి యందు నుతించి రంతటఁ బంకజాక్షుని నీజగ
ద్వ్యూహరక్షకు నందు మాకును బూఁ ట వీవ కదా హరీ ! -14

ఛందస్సు: మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.

ఆ తర్వాత విశాలదేశ వృత్తాంతాన్ని, గౌతమి ఆశ్రమ వృత్తాంతాన్ని, అహల్యని-ఇంద్రుడిని గౌతముడు శపించాల్సిన కారణాన్ని వివరించాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడిలా చెప్పడంతో, లక్ష్మణుడితో కలిసి రామచంద్రమూర్తి, విశ్వామిత్రుడు ముందు నడవగా, గౌతముడి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆశ్రమంలో శ్రీరామచంద్రమూర్తి ప్రవేశించగానే, శాపం తొలిగిన అహల్య, పూర్వరూపంలో లోకానికి కనపడింది. ఆ తర్వాత అంద్రౌ కలిసి మిథిలానగరం చేరుకుంటారు. విశ్వామిత్రుడొచ్చాడని తెలుసుకున్న జనక మహారాజు తన పురోహితుడైన శతానందుడుతో కలిసి వారున్న ప్రదేశానికి వచ్చాడు. శతానందుడు, శ్రీరామచంద్రుడికి స్వాగతం పలికి, విశ్వామిత్రుడి చరిత్రను-ఆయన గొప్పదనాన్ని వివరించాడు. వశిష్టుడు విశ్వామిత్రుడి విందు ఇవ్వడం, కామధేనువు గురించి ఇద్దరి మధ్య యుద్ధంజరగడం చెప్పాడు.


విశ్వామిత్రుడు అడిగినప్పుడు కామధేనువును ఇవ్వనని వశిష్టుడు చెప్పగానే, విశ్వామిత్రుడు బలవంతంగా దానిని తీసుకొని పోసాగాడు. అప్పుడా కామధేనువు-శబల మిక్కిలి విషాదంతో, తనేం తప్పుచేసానని, ఎందుకీ మునీశ్వరుడు తననీవిధంగా వదిలిపెడుతున్నాడని, దుఃఖపడుతూ అనుకుంటుంది. తను ఏడుస్తున్నా వదలకుండా ఈడ్చుకొనిపోతున్న భటుల కట్లు తెంచుకొని, తన్నీడుస్తున్నవారిని నేలపై పడవేసి-తన్ని, మునీశ్వరుడి వద్దకు పోతుంది. దీన్ని "సుగంధి" వృత్తంలో పద్యంగా రాసారు కవి ఇలా:

సుగంధి: ఇట్టు లామునీంద్రుఁ డాడి యీయ నన్న థేనువున్
బట్టి కట్టి కొంచుఁ బోవ బార్థివుండు బల్మి మైఁ
దొట్టఁ గన్ దురంతచింత దుఃఖితాత్మ యౌచు న
న్నిట్టు వాయఁగా మునీంద్రుఁ డేమి తప్పు చేసితిన్-15

ఛందస్సు: సుగంధి వృత్తానికి ర-జ-ర-జ-ర గణాలు. తొమ్మిదింట యతి.

విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలన్న తలంపుతో ఘోరమైన-కఠోరమైన తపస్సు చేస్తున్న సమయంలో,సమీపంలోని తీర్థంలో స్నానమాడేందుకు,అతి మనోహరమైన సౌందర్యంతో-మన్మథుడి ఆయుధమేమోనని అనుకుండే విధంగా కనిపిస్తున్న ఒక అప్సరస, విశ్వామిత్రుడిని మోసగించే ఉద్దేశంతో వచ్చింది. ఆమె సౌందర్యాన్ని వర్ణించేందుకు "కవిరాజవిరాజిత వృత్తం" లో ఒక పద్యాన్ని రాసారీవిధంగా వాసు దాసుగారు.

కవిరాజవిరాజితము: నళినవిలోచన నూనమనోహర నవ్యశరీర విహారరతన్
జలదవినీల శిరోరుహఁ గోరక చారురదన్ శిశిరాంశుముఖి
న్జలకము లాడ ఘనాంతరచంచల నాఁ గని మారశరాహతుఁ డై
కలఁ గుచుఁ దామరపాకుజలం బనఁ గాంతను డాసి వచించె నిటుల్-16

ఛందస్సు: కవిరాజ విరాజితము ఛందస్సు: "నగణము నారు జగణములు వగణము గలది కవిరాజ విరాజితము". దీనికి ఒక సిద్ధాంతం ప్రకారం 8-7-7 స్థానాలలోనూ, ఇంకో సిద్ధాంతం ప్రకారం 14వ స్థానంలోనూ యతి వుంటుంది.

తాత్పర్యం: కమలాల లాంటి కళ్లతో, పూవువలె మనోహరమైన మెచ్చుకోవాల్సిన శరీరంతో, రతిక్రీడలో ఆసక్తితో, మేఘాలలాంటి నల్లటి కురులతో, మొగ్గలలాంటి దంతాలతో, చంద్రుడిలాంటి ముఖంతో అందంగా వున్న ఆ అప్సరస, మేఘాల మధ్య మెరుపుతీగలాగా నీళ్లల్లో స్నానం చేస్తుంటే విశ్వామిత్రుడు చూశాడు. చూసి, కామ బాణ పీడితుడై, మనస్సు కలవరపడగా, తామరాకుమీద పడిన నీళ్లు చలించినట్లు మనస్సు చలించడంతో, ఆ అందగత్తెను సమీపించి ఇలా అన్నాడు.

బాల కాండ చివరి పద్యం "తరలము" వృత్తంలో ఈ విధంగా రాస్తూ కాండలో మొత్తం ఎన్ని పద్యాలున్నాయో వివరిస్తారు వాసు దాసుగారు.


తరలము: జలజవైరిమహీధరాగ్ని శశాంకపద్యనిరూపితా

తులితబాల్యవినోదఖేలన తోయజాక్ష ! రమాధవా !

కలశవారిధితుల్యసజ్జన కాండ చిత్తనివాసకా !

కలుషసంహార ! యొంటిమిట్టని కాయి ! జానకి వల్ల భా ! -17

ఛందస్సు: న-భ-ర-స-జ-జ-గ గణాలు. పన్నెండో స్థానంలో యతి.

తాత్పర్యం: జలజవైరి అంటే చంద్రుడు = 1 , మహీధర అంటే పర్వతాలు= 7, అగ్ని అంటే త్రేతాగ్నులు= 3, శశాంక అంటే చంద్రుడు= 1. బాల కాండలో వాసు దాసుగారు ఎన్ని పద్యాలు రాసారో ఈ చివరి పద్యంలో పరోక్షంగా చెప్పారు. ఈ కాండలో మొత్తం 1371 పద్యాలున్నాయి.