Showing posts with label అతిరాత్రం. Show all posts
Showing posts with label అతిరాత్రం. Show all posts

Thursday, November 5, 2015

ఆయుత చండీ యాగంపై అనవసర రాద్ధాంతం : వనం జ్వాలా నరసింహారావు

ఆయుత చండీ యాగంపై అనవసర రాద్ధాంతం
వనం జ్వాలా నరసింహారావు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేయ తలపెట్టిన ఆయుత చండీ యాగంపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అలాగే, తెలంగాణాలో అనాదిగా జరుపుకుంటున్న బతుకమ్మ, బోనాలు, దసరా లాంటి పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడాన్ని కూడా వాళ్లు విమర్శిస్తున్నారు. వీరి మాటలు మెజారిటీ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విగా, వాళ్ల నమ్మకాలకు వ్యతిరేకంగా వున్నాయి. అనాదిగా, సృష్టి ఆరంభం నుంచీ, మనిషి అనే వాడు, దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, రకరకాల ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను, నమ్మకాలను అనుసరిస్తూ రావడం జగమెరిగిన సత్యం. శ్రీరాముడే దేవుడని నమ్మేవాళ్లున్నారు, కాదు శ్రీ కృష్ణుడే అనేవాళ్లున్నారు. వారిద్దరూ కాదు పరమశివుడని మరికొందరంటారు. క్రమేపీ అనేక మతాలు, విధానాలు ఆచరణలోకి రావడంతో మనిషి కూడా మార్పులకు చేర్పులకు లోనవుతూ వస్తున్నాడు. సనాతన ధర్మాలను, ఆచారవ్యవహారాలను పాటించే వారు కొందరైతే, ఆస్తికత్వం నుంచి నాస్తికత్వం వరకూ మారిన వారు మరికొందరున్నారు.

ఇంతకీ ఎవరి నమ్మకం వాళ్లది. తమ నమ్మకమే గొప్పదనీ, ఇతరుల నమ్మకాలు తప్పనీ వాదించే ప్రయత్నం మంచిది కాదు. నమ్మకం విషయానికొస్తే యాగాలు-యజ్ఞాలు చేయడం కొందరికి అదో నమ్మకం. వాటివల్ల లోక శాంతి, ప్రజా ప్రయోజనం వుంటుందని భావించడం కూడా ఒక నమ్మకమే. అది నిజం కావచ్చు-కాక పోవచ్చు. కాని చేసే వాళ్లను తప్పు చేస్తున్న వాళ్లగా చిత్రీకరించడం అంతకన్నా గొప్ప తప్పు. చివరికి విమర్శకుల మాటలు ఎంతవరకు పోయాయంటే, ప్రజలను చంపడానికే యాగాలు అనేంతవరకూ పోయింది. భారతదేశంలోను, అనేక ప్రపంచ దేశాలలోను, అనేక మతాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు ఆచరణలో వున్నాయి. చైనా లాంటి  కమ్యూనిస్ట్ దేశాలలో కూడా ఇప్పటికీ మావో కు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అంతే ప్రాధాన్యం బుద్ధుడికీ ఇస్తున్నారు. కంబోడియాలో ప్రపంచంలో కెల్లా అతిపెద్దదైన అంగ్కార్ వాట్ దేవాలయం వుంది. బాంకాక్ లో రహదారుల పేర్లన్నీ రామ అక్షరంతో మొదలవుతాయి. ఎవరి నమ్మకం వాళ్ల ది.

యజ్ఞయాగాదులనేవి ఈ నాటివి కావు. మన భారతీయ సంస్కృతీ-సంప్రదాయాలతో పెనవేసుకునిపోయాయవి. విదేశాలలో కూడా ప్రాచుర్యం పొందిన మన వేదాలలో యజ్ఞాలు ప్రతిపాదించబడ్డాయి. యజ్ఞయాగాదుల విధి-విధానాల గురించి వివరంగా చెప్పడం కూడా జరిగింది. మానవాళిని అహర్నిశలూ రక్షించేవి కూడా యజ్ఞ ఫలాలే. మానవ జాతి జీవన విధానం ఆరంభానికి కారణం కూడా యజ్ఞ యాగాలే. మానవ జాతి సృష్టే యజ్ఞ సహితంగా జరిగిందంటారు. యజ్ఞం సాక్షాత్తు భగవత్ స్వరూపమే. జగత్ కళ్యాణానికి కారణం కూడా యజ్ఞయాగాదులే. దేవతార్చనతోనే హిందూ జీవన విధానం ముడిపడి వుంది. మానవ జీవితాన్ని ఫలవంతం చేసుకునేందుకు, తనను తాను సంస్కరించుకుని, ఆత్మోన్నతిని పొంది విశ్వ శ్రేయస్సుకు పాటుపడేందుకు యజ్ఞయాగాదులు చేయాలని పూర్వకాలం నాటి మహాఋషులు చెప్పారు. జీవుడు తల్లి గర్భంలో చేరినది మొదలుకుని, భూమిమీద అడుగుపెట్టినప్పటినుంచి, వివిధ సంస్కారాలతో సంస్కరించబడాలని వైదిక సాంప్రదాయాలు ఘోషిస్తున్నాయి. అలా సంస్కరించబడడానికి అమూల్యమైన ప్రక్రియ యాగాలు, యజ్ఞాలు చేయడం, చేయించడం. యజ్ఞాలు మహత్వ పూర్ణాలు, అవశ్యం ఆచరణీయాలు. పూర్వకాలంలో మాదిరిగానే ఈ నాటికీ సాధన, సంపద, నిబద్ధత, సంస్కారం, పూర్వ జన్మ పుణ్యం, నలుగురికి మేలు చేయాలన్న ఆలోచన కలవారు, యజ్ఞ యాగాలు చేస్తూనే వున్నారు. అలాంటివాటిలో రుద్ర యాగాలు, సూర్య యాగాలు, గణేశ యాగాలు, చండీ యాగాలు, శాంతి యాగాలు లాంటివి బహుళ ప్రచారంలో వున్నాయి. మనం చేయలేని దాన్ని మరొకరు చేస్తుంటే వారిని ప్రోత్సహించడం మన కనీస ధర్మం. విమర్శించకుండా వున్నా చాలు.

యజ్ఞ యాగాలు చేయడం ఫ్యూడలిజం లక్షణాలుగా కొందరు ఎద్దేవా చేస్తున్నారు. రాజులు-రాజ్యాలు పోయినా పరిపాలన పోలేదు అనే విషయం సామాన్యుడికి కూడా అర్థం అవుతుంది. రాచరికం పోయి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డప్పటికీ, పాలకులు-ప్రజలు అనే పద్ధతి కొనసాగుతూనే వుంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వారు ప్రజల సంక్షేమ-అభివృద్ధికి బాటలు వేస్తూనే, అనేక రకాలుగా వారి ఆలనా పాలనా చూడాల్సిన బాధ్యత కూడా వుంది. ఉదాహరణకు వర్షాలు కురవకపోతే కృత్రిమంగా వర్షాలు కురిపించడం ఒక పద్ధతైతే, ఆధ్యాత్మిక పద్ధతిలో యజ్ఞ యాగాలు కూడా చేయొచ్చు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే రాలొచ్చు, రాలక పోవచ్చు. కాని, ప్రజల నమ్మకాలకు అనుగుణంగా నడచుకుంటే తప్పు లేదు కదా! ఆ బాధ్యత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వారిదే.

ఓ మూడేళ్ల క్రితం భద్రాచలంలో అతిరాత్రం అనే ఒక మహా యజ్ఞం నిర్వహించారు కొందరు. నేను కూడా అందులో కొంత పాత్ర పోషించాను. విపరీతంగా ఎండలు కాస్తున్న ఏప్రియల్ చివరి, మే నెల మొదటి వారం రోజులవి. పన్నెండు రోజులు నిర్విఘ్నంగా సాగిన యజ్ఞం ఆరంభం నుంచీ, చివర వరకూ అడపదడప కుండపోతగా వర్షం కురుస్తూనే వుంది. అది కాకతాళీయం కూడా కావచ్చు. కాని భద్రాచలం చుట్టుపక్కల అంత మోతాదులో వర్షాలు ఆ క్రితం పది-పన్నెండేళ్లలో ఎప్పుడూ కురవలేదని ఇప్పటికీ అక్కడి వారు చెప్పుకోవడం జరుగుతోంది. శాస్త్రీయంగా, యజ్ఞం జరిగనన్ని రోజులు, ఆ తరువాత కూడా పరిసర ప్రాంతాలలో పరిశోధనలు చేశారు కొందరు సైంటిస్టులు. అద్భుతమైన ఫలితాలొచ్చాయి. అంతకు ఒక ఏడాది క్రితం, హిందువుల సంప్రదాయాలకు, నమ్మకాలకు, ప్రత్యక్ష సాక్ష్యంగా అద్భుతంగా సాగింది ఇలాంటి అతిరాత్రం పుణ్య యజ్ఞం కేరళలోని పంజాల్ గ్రామంలో. అప్పుడక్కడున్నది కమ్యూనిస్ట్ ప్రభుత్వం. మంత్రాలకు చింతకాయలు రాలుతాయని వాదించే ప్రబుద్ధులను నిశ్చేష్టులను చేస్తూ యాగం పరి సమాప్తమైన కొద్ది నిమిషాలలోనే, ఆకాశం మేఘావృతమై, కుండపోతగా వర్షం కురిసింది. యజ్ఞాన్ని తిలకిస్తున్న పదిలక్షలమంది జనం పులకించి పోయారు. ఇదొక నమ్మకం. ఫ్యూడలిజం లక్షణం కానేకాదు. భద్రాచలంలో జరిగిన యజ్ఞం తిలకించిన వారిలో అన్ని రకాల నమ్మకస్తులు వున్నారు. కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే సారధ్య సంఘం సభ్యుడు కూడా. స్వయంగా ఆయన ఒకరోజు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆయనే కాదు అనేక మంది పెద్దలు, అన్ని రాజకీయ పార్టీల వారు కూడా పాల్గొన్నారు.

మరో సంఘటన కూడా ఈ సందర్భంగా ఉదహరించడం మంచిదేమో! 1979 లో తిరుమల కొండ మీద భయంకరమైన నీటి కొరత ఏర్పడింది. రిజర్వాయర్లే కాకుండా బావుల్లో కూడా నీరు లేని పరిస్థితి ఏర్పడింది. యాత్రీకులను కొండ పైకి రావద్దని హెచ్చరించే ఆలోచన కూడా కలిగిందట. పరిష్కార మార్గాలు అన్వేషిస్తూనే అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీవీఆర్‍కె ప్రసాద్ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం ఏమన్నా వుందా అని శోధన సాగించారు. వేద వేదాంగ పారంగతుడు, భారత ప్రభుత్వం నుంచి పద్మ విభూషన్ గౌరవ పురస్కార గ్రహీత ఉప్పులూరి గణపతి శాస్త్రిని సంప్రదించారు. ఇలాంటి సమస్యలకు వేదాల్లో పరిష్కార మార్గాలున్నాయని, భగవంతుడి పట్ల పరిపూర్ణ విశ్వాసంతో, త్రికరణ శుద్ధిగా యజ్ఞం ఆచరిస్తే ఫలితం తప్పకుండా వుంటుందనీ ఆయన సలహా ఇచ్చారు. వరుణ జపం నిర్వహించి, వరుణ దేవుడి కరుణ పొందాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజున శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లోని బంగారు వాకిలిలో, అర్థరాత్రి ఏకాంత సేవ పూర్తయ్యాక, తలుపులన్నీ వేశాక, హఠాత్తుగా భారీ గంటలు గణ-గణ మోగాయి. తెల్లవారుతూనే వరుణ జపానికి అన్నీ సన్నాహాలు అప్పటికే జరిగాయి. నవంబర్ 7 న ప్రారంభమైన వరుణ జపం, ఋత్విక్కుల వేద మంత్రోఛ్ఛారణల మధ్య మూడు రోజులు జరిగింది. ఆ సాయంత్రం వరకూ ఏ విశేషమూ జరగలేదు. హేళనలు మొదలయ్యాయి. విమర్శలు పుంజుకున్నాయి. ఇంతలో, క్షణాల్లో ఆకాశం ఉరిమింది. కుండపోతగా వర్షం కురిసింది. మర్నాడు ఉదయం ఏడు గంటల సమయంలో సహస్ర కలశాభిషేకం ఆరంభమయ్యే దాకా అలా కురుస్తూనే వుంది. ఇంతలోనే సమాచారం వచ్చింది. రిజర్వాయర్లన్నీ పొంగి పొర్లుతున్నాయని. విచిత్రం ఏంటంటే, ఒక్క తిరుమలలో తప్ప చుట్టుపక్కల ఎక్కడా వర్షం ఛాయలు కూడా కాన రాలేదు.  ఇదంతా కాకతాళీయమా? వేద మంత్రాల శక్తి ప్రభావమా? భక్తులు నమ్ముకున్న దేవ దేవుడి అనుగ్రహమా? ఈ విషయాలను స్వయంగా పీవీఆర్‍కె ప్రసాద్ గారు తన పుస్తకం (నాహం కర్తా, హరిః కర్తా) లో వివరంగా రాశారు.

యాగాలు చేయడం వల్ల ఫలితాలు స్పష్టంగా కనిపించిన మహత్తర నేపధ్యంలో, లోక కళ్యాణం కొరకు, విశ్వ శాంతి కొరకు, యాగాలన్నింటిలో శ్రేష్ఠమైన ఆయుత మహా చండీ యాగం చేయడానికి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంకల్పించు కోవడం అభినందించాల్సిన విషయం. శత, సహస్ర చండీ యాగాలు చాలామంది చేశారు, చేయించారు కాని, ఇంతవరకు, ఒక్క శృంగేరి పీఠాధిపతి మినహా మరెవ్వరూ ఆయుత మహా చండీ యాగం చేసిన దాఖలాలు లేవు. బహుశా ఆయుత మహా చండీ యాగ నిర్వహణ కష్టతరమైంది కావడం మూలాన ఎవరూ సాహసించక పోయి వుండవచ్చు. మూడు వేల మందికి పైగా బ్రాహ్మణులు యాగ స్థలంలో వుంటూ నిత్యం పది వేల పర్యాయాలు దుర్గా పారాయణం చేయాలి ఈ యాగం సందర్భంగా. రెల్లు గడ్డితో భారీ యాగ శాల తయారు చేయాలి. వంద యజ్ఞ హోమ గుండాలు ఏర్పాటు చేయాలి.  ఆయుత మహా చండీ యాగం లక్ష చండీ యాగాలతో సమానం. ఆయుత చండీ యాగాన్నే శత సహస్ర చండీ యాగంగా కూడా అంటారు. ఒక చండీ యాగం కోటి యజ్ఞాల ఫలం, ఆయుత మహా చండీ యాగం లక్ష కోట్ల యజ్ఞాల ఫలంగా వేద పండితులు అంటారు. అత్యంత నియమ, నిష్ఠలతో ఈ యాగం చేయాల్సి ఉంటుందని కూడా వేద పండితులు చెపుతారు. యాగ పరిసమాప్తం ఐన తరువాత పూర్ణాహుతి వుంటుంది.

యజ్ఞ-యాగాలకు సంబంధించిన అనేక విషయాలను యధాతధంగా రికార్డు చేసి, భావితరాల వారికొరకు భద్రపరిచిన అమెరికా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఇండాలజిస్ట్ స్వర్గీయ డాక్టర్ ఫ్రిట్స్ స్టాల్ అన్న వాక్యాలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. "దేవాలయాలు, చర్చిలు, ఆకాశ హర్మ్యాలు నిర్మించడం, కాలం గడిచే కొద్దీ అవన్నీ శిథిలం కావడం తెలిసిందే. భాషలు-మతాలు పుట్టాయి, గిట్టాయి. ప్రపంచంలో అనేకానేక యుద్ధాలు జరిగాయి. అవన్నీ తాత్కాలికమే. వేదాలు, వైదిక సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అనాదిగా మౌఖికంగా  ఒకరి నుంచి మరొకరికి, గురువు నుంచి శిష్యుడికి-తండ్రి నుంచి కుమారుడికి, శాశ్వతంగా ప్రచారం-ప్రసారం అవుతున్నాయి. పదార్థం-భౌతిక శరీరాలకున్న హద్దులకు అతీతంగా మానవ స్ఫూర్తి సాధించిన విజయం అమోఘం!". అందుకే, ఇందుకే యజ్ఞ యాగాలు చేయడం అవశ్యం. END 

Saturday, March 10, 2012

భద్రాచలంలో జరుగనున్న అత్యంత ప్రాచీన వైదిక పుణ్య యజ్ఞం: వనం జ్వాలా నరసింహారావు


"అతిరాత్రం"

భద్రాచలంలో "అతిరాత్రం"
ఆంధ్రజ్యోతి దినపత్రిక (24-03-2012)
వనం జ్వాలా నరసింహారావు
("అతిరాత్రం-2012" సారధ్య సంఘం సమన్వయకర్త)

సుమారు నాలుగు వేల సంవత్సరాల పూర్వం నుండి కేరళ రాష్ట్రంలో మాత్రమే నిర్వహిస్తూ వస్తున్న, ప్రాచీన వైదిక సాంప్రదాయక పుణ్య యజ్ఞం "అతిరాత్రం", మొదటిసారి మన రాష్ట్రంలో జరిపేందుకు రంగం సిద్ధమౌతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి మే నెల 2 వరకు, బధ్రాచలం సమీపంలోని ఎటపాక జటాయువు మండపం దగ్గర, వైదిక సాంప్రదాయ క్రమానుగతిని అనుసరించి, పన్నెండు దినాలు నిర్విరామంగా నిర్వహించనున్న అపురూపమైన అతిరాత్రం విన్యాసాన్ని కన్నుల పండుగగా వీక్షించడానికి పలువురు దేశ-విదేశీ ప్రముఖులు హాజరు కానున్నారు. మౌలిక ప్రమాణాలుగా చెప్పుకునే  వేదాలు భగవత్ ప్రేరితమేనని, మానవుల రచనలు కావని సాంప్రదాయుల విశ్వాసం. వేదవ్యాసుడు నాలుగు భాగాలుగా వేదాలను విభజించి, ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలని పేర్లు పెట్టాడు. అనాదిగా వస్తున్న ఆ వేదాలకు సంబంధించిన మూల గ్రంథాల్లో పేర్కొన్న ఒకానొక అతి ప్రాచీనమైన సాంప్రదాయ కర్మకాండే "అతిరాత్రం". పన్నెండు రోజులు, తెల్లవార్లూ-రాత్రింపగళ్లూ, అగ్ని హోమంతో నిర్వహించే "అతిరాత్రం", వైదిక కర్మకాండలన్నింటిలోకి అత్యంత సంక్లిష్టమైనది, మహోన్నత మైనదని, కేరళ రాష్ట్రానికి చెందిన నంబూద్రి బ్రాహ్మణులు అంటారు. వాల్మీకి రామాయణం బాల కాండలో, 14 వ సర్గలో, అశ్వమేధ యాగం ప్రస్తావనలో అతిరాత్రం గురించి పేర్కొనడం జరిగింది.
            
వైదిక పుణ్య యజ్ఞాల సాంప్రదాయాలను, మానవ సమాజం ఆచరణలో పెట్టడానికి, రెండు రకాల పద్ధతులున్నాయి. మొదటిది "గ్రహ్య", రెండోది "శ్రుత". వ్యక్తిగత ఆచార వ్యవహారాలైన ఉపనయనం, వివాహం లాంటివి మొదటి పద్దతికి చెందినవి. సంస్కార పూర్వ కంగా, అత్యంత ఉన్నత స్థాయిలో, శ్రుతి సాహిత్యంలో పేర్కొన్న విధంగా, మౌఖిక సాంప్రదాయ బద్ధంగా, ఋగ్వేద-యజుర్వేద-సామవేదాలలో చెప్పినట్లు తూచ తప్పకుండా ఆచరించేదే రెండో పద్ధతి. కీలకమైన ఈ రెండో రకమైన వైదికాచారాలను, కొద్దిమంది, అక్కడో-ఇక్కడో అడపాదడపా పాటించడం జరుగుతోంది. అలా పాటిస్తున్న వారిలో కేరళ నంబూద్రి బ్రాహ్మణులు ముందు వరుసలో వున్నారు. శంకరాచార్యుడు నంబూద్రి బ్రాహ్మణ శాఖకు చెందినవాడు. నంబూద్రీ కేరళ బ్రాహ్మణుల గురించి ఆసక్తికరమైన సమాచారం ఉంది. శాతవాహనుల తరువాత ప్రసిద్ధి చెందిన రాజవంశం కాదంబ వంశం. కాదంబులలో ప్రసిద్ధుడైన రాజు మయూర శర్మ కేరళ ప్రాంతాన్ని పాలించాడు. ఆయన తన స్వస్థలమైన కోనసీమ (తూర్పు గోదావరి) నుండి ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబాలను కేరళకు తీసుకు వెళ్ళాడు. ఆ కుటుంబాల వారే తరువాత నంబూద్రి బ్రాహ్మణులుగా పేరు పొందారు. ఈ విషయం బ్రహ్మ వైవర్త పురాణంలోను, మద్రాసు ప్రభుత్వం ప్రకటించిన తెలుగు గ్రంథం సంపుటాలలోను లభిస్తుంది. శంకరుడు తెలుగువాడు ఐనప్పటికీ వల్లభుడు, నింబార్కుడు, త్యాగరాజు, మొదలైన అనేకమంది మహాపురుషుల లాగే ఆయనకు తెలుగు కంటే ఇతర ప్రాంతాల్లోనే ఆదరణ, ప్రసిద్ధి కలిగింది.
          
వైదిక ఆచారాలు అంతరించి పోకుండా, కేరళ నంబూద్రి బ్రాహ్మణులు, ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్నారు. పన్నెండు రోజులు, అహోరాత్రులు, ఆరిపోకుండా అగ్నిహోత్రం వుంచడమనే ప్రక్రియ, నంబూద్రి బ్రాహ్మణులకు అత్యంత ఆకర్షణీయమైన విజ్ఞాన-వినోద దృశ్యం లాంటిది. సనాతన సంప్రదాయాన్ని ముమ్మూర్తులా ప్రతిబింబించే "అతిరాత్రం", భారతీయ మతాచారాలకు-నాగరికతకు అసలు-సిసలైన రూపురేఖగా నంబూద్రీలు భావిస్తారు. "అతిరాత్రం" నిర్వహణ శారీరక శ్రమతో కూడుకున్నది. క్రీస్తు పూర్వం పదవ శతాబ్దిలో మొదలైన ఈ ఆచారం, ఆరవ శతాబ్దం వరకూ కొనసాగింది. ఆ తర్వాత కాలంలో, ఎందరో, ఎన్ని విధాలుగానో దానిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేశారు. గుప్తుల, చోళుల కాలంలో పునరుద్ధరణకు నోచుకున్న అతిరాత్రాన్ని, పదకొండవ శతాబ్దం వచ్చే సరి కల్లా, కేరళ నంబూద్రి బ్రాహ్మణులు సజీవంగా కొనసాగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అదే ప్రక్రియ నేటికీ సాగుతోంది.

Poster Release by Endowments Minister
          
అతిరాత్రం ఆచారం ఒక రకమైన అద్భుత విన్యాసం. ఆ విన్యాసంలో ప్రధాన భాగమైన అగ్ని హోమం ప్రక్రియను నిర్వహించడానికి 17 మంది ఋత్విక్కులు (పూజారులు) వుంటారు. పన్నెండు రోజులపాటు జరిగే కార్యక్రమంలో మొదటి రోజున హోమం చేసే "యజమాని", ప్రత్యేకంగా తయారుచేసిన మూడు కుండలలో, పవిత్రమైన అగ్నిని నింపుకుని యజ్ఞ వాటికలో ప్రవేశిస్తాడు. "బంకమట్టి" తో తయారు చేసిన ప్రత్యేకమైన కుండలవి. నామ మాత్రంగా-లాంఛన ప్రాయంగా, వాయుదేవుడికి జంతు బలి జరిపించుతారు. ఐదుగురు ప్రధాన పూజారుల ఎంపిక జరుగుతుందప్పుడు. ఆ తర్వాత రాపిడి ద్వారా నిప్పు వెలిగించుతారు. యజమాని శిరస్సుకు తలపాగా లాంటిది కట్టుతారు. ఇక ఆ క్షణం నుంచీ, యజమానిని ప్రత్యేక రక్షణలో వుంచుతారు ఆ పన్నెండు రోజులు. పిడికిలి బిగించిన చేతులతో, మౌనంగా ఆ పన్నెండు రోజులు యజమాని యజ్ఞాన్ని చేయాలి. కాకపోతే, ఆయన చేయాల్సిన మంత్రోచ్ఛారణలకు మౌనం వీడవచ్చు. అలానే, స్నానం చేసేటప్పుడు పిడికిలి సడలించవచ్చు. అగ్నితో నింపిన ప్రధాన కుండను తీసుకుని, మూడడుగులు నడవాలి యజమాని ఆ తర్వాత. బధ్రాచలంలో జరుగనున్న యజ్ఞానికి యజమానిగా-ప్రధాన ఋత్విక్కుడుగా కేరళకు చెందిన బ్రహ్మ శ్రీ నడువం నారాయణన్ సోమయాజి, ఆయన ధర్మపత్ని సావిత్రి పఠనాడిని ఎంపిక చేశారు నిర్వాహకులు. అలానే జైమినీ సామ వేదంలో దిట్టలు, ఘనాపాఠీలు, ఋగ్వేదం-యజుర్వేదం ఆచారాలను-సాంప్రదాయాలను ఔపోసన పట్టిన వారైన బ్రహ్మ శ్రీ కృష్ణన్ నంబూద్రి, బ్రహ్మ శ్రీ కడలూర్ శ్రీ దాస్ నంబూద్రి అనే వైదిక పండితులిద్దరు అతిరాత్రం యజ్ఞాన్ని నిరాటంకంగా జరిపించేందుకు గత ఆరు మాసాలుగా దీక్షలో కూర్చున్నారు.

అతిరాత్రం యజ్ఞంలో భాగంగా, రెండో రోజున బంక మట్టితో ప్రత్యేకమైన కుండను తయారు చేస్తారు. మూడో రోజున నైవేద్యం కొరకు ప్రత్యేకంగా ఒక స్తంభాన్ని తయారు చేస్తారు. "మహావేది" గా పిలువబడే యజ్ఞ వాటిక కొలతల ప్రకారం, లాంఛనప్రాయంగా బలి ఇవ్వడానికి, పక్షి ఆకారంలో బలిపీఠం నమూనాను తయారు చేస్తారు అదే రోజున. నాలుగో రోజున దేవతల రాజైన ఇంద్రుడిని యాగానికి ఆహ్వానించే కార్యక్రమం జరుగుతుంది. మహావేది వున్న ప్రదేశాన్ని నాగలితో దున్ని, అందులో విత్తనాలు చల్లి, మొదటి రోజున తయారు చేసిన ప్రధాన కుండను భూమిలో పాతిపెట్టు తారు. పక్షి ఆకారంలో బలిపీఠం నిర్మాణం ఆరంభమవుతుంది అదే రోజున. ఐదు, ఆరు, ఏడు దినాల్లో, బలి పీఠం నిర్మాణాన్ని అంచలంచలుగా కొనసాగిస్తూ, రాత్రివేళల అగ్నిహోత్రం పనిని యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది. ఎనిమిదో రోజున, బలి పీఠంలో మరొక అంతస్తు వేయడంతో పాటు, దానికి ఉపయోగించిన ఇటుకలను గోవులుగా మారాలని యజమాని ప్రార్థన చేస్తాడు. రుద్ర పూజ కూడా జరిపించుతారు పూజారులు. అంతవరకూ ఉపయోగించిన పనిముట్లను, పూర్తి చేయబడిన బలి పీఠంలో, మానవ ఆకారంలో పేర్చుతారు తొమ్మిదో రోజున. ఆ ప్రదేశంలో మళ్లీ అగ్నిని వుంచడం జరుగుతుంది. మంత్రోచ్ఛారణల మధ్య అగ్ని హోమంలో నెయ్యి పోసుకుంటూ అతిరాత్రం కొనసాగుతుంది. లాంఛనప్రాయంగా-నామ మాత్రంగా జంతు బలి ఇవ్వడం ఆ తర్వాత ప్రక్రియ. చివరి మూడు రోజులు రాత్రింబగళ్ళు యాగం కొనసాగుతూనే వుంటుంది. బలిపీఠం చుట్టూ, పదవ రోజున, యజమాని పూజారులతో కలిసి, పాములాగా తిరగాలి. నామ మాత్రంగా (వాస్తవంగా కాదు) పదకొండు జంతువులను బలి ఇవ్వడం జరుగుతుంది. పన్నెండో రోజున యజమాని భార్యా సమేతంగా "అవభ్రత స్నానం" చేసి, మేక బలిని (వాస్తవంగా కాదు) ఇచ్చి, ఇంటికి తిరిగొచ్చి మూడు చోట్ల అగ్నిని పేర్చి, ఆ అగ్నిహోత్రాన్ని జీవితాంతం చేస్తూ పోతుండాలి. పన్నెండు రోజులు ఒకే రకమైన కర్మ కాండలుండవు. అగ్నిలో ప్రధానంగా సోమ రసం ఉపయోగించుతారు. వైదిక గ్రంధాల్లో చెప్పిన ప్రకారం రెండు రకాల కట్టెలను రాపిడి చేసి నిప్పు పుట్టిస్తారు.

హైదరాబాద్‌కు చెందిన బ్రహ్మ శ్రీ హరి హరనాథ్ శర్మ, ఆయన కుమారుడు-స్మార్త వేద పండితుడు రాజశేఖర శర్మ, వారు నెలకొల్పిన "సమతా లోక్ సేవా సమితి" ఆధ్వర్యంలో, స్వయంగా కేరళకు వెళ్లి పంజాల్‍లో జరిగిన యాగాన్ని చూసి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో కూడా దాన్ని నిర్వహించాలని నిశ్చయించుకున్నారు. హరి హరనాథ్ శర్మ ఈ పాటికే విజయవంతంగా పదహారు ఉత్కృష్ట యాగాలను నిర్వహించారు. ఇది పదిహేడోది. సమతా లోక సేవా సమితి నిర్వహించ తలపెట్టిన ఈ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిపేందుకు పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్య నిర్వహణ అధికారి పి.వి.ఆర్.కే. ప్రసాద్ అధ్యక్షతన పలువురు ప్రముఖులతో ఒక సారధ్య సంఘం ఏర్పాటైంది. ఈ ప్రముఖులంతా ఒక బృందంగా ఏర్పాటై, అతిరాత్రం ఆచారాన్ని మన రాష్ట్రంలో కూడా నెలకొల్పాలని సంకల్పంతో పనిచేస్తున్నారు. ఆ అద్భుత అపురూపమైన సనాతన సాంప్రదాయిక విన్యాసాన్ని మరో రెండు నెలలలో బధ్రాచలంలో ప్రదర్శించబోతున్నారు. ఏప్రిల్ 21-మే 2 మధ్య నిర్వహించనున్న అతిరాత్రం రిహార్సల్లు మొదలయ్యాయి. ఎటపాకలో జరుగనున్న ఈ కార్యక్రమాన్ని, నాలుగువేల ఏళ్ల క్రితం ఎలా జరిగిందో, అచ్చు అలానే జరపడానికి అన్ని జాగ్రత్తలు సారధ్య సంఘం తీసుకుంటున్నది. పనిముట్లన్నీ ఆ ప్రాంతంలో లభ్యమయ్యే కట్టెతోనే తయారవుతున్నాయి. ఏ రకమైన లోహ సామగ్రిని ఉపయోంచడం జరగదు. బలి పీఠానికి వాడే ఇటుకలు కూడా కట్టెతో తయారుచేసినవే. అవన్నీ కేరళలోనే తయారవుతున్నాయి. అతిరాత్రంలో పన్నెండు రోజులు కూచోగల సామర్థ్యం యజమానికి కలగడానికి చర్యలు చేపట్టారు. పుణ్య యజ్ఞంలో అతి భారమైన యజుర్వేద పఠన బాధ్యతను కాప్రా కుటుంబీకులు, బ్రహ్మ శ్రీ కాప్రా నారాయణన్ నంబూద్రి సారధ్యంలో, తమ భుజాలపై మోపుకున్నారు. ఋగ్వేదం నిర్వహణను నారాస్ కుటుంబీకులు, సామవేదాన్ని తోట్టం కుటుంబీకులు చేపట్టుతున్నారు.

బధ్రాచలం దేవాలయ ట్రస్టు బోర్డు అధ్యక్షుడు కురిచేటి పాండురంగా రావు తాత్కాలిక ప్రాతిపదికపైన విరాళంగా ఇచ్చిన సుమారు ఏబై ఎకరాల భూమిలో, అవసరమైన అనుమతులతో, కార్యక్రమం ఏప్రిల్ నెలలో నిర్విఘ్నంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. భౌగోళిక-వాస్తు పరమైన సిద్ధాంతాల ప్రాతిపదికగా యజ్ఞ వాటికను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులను, దేవా దాయ శాఖ మంత్రిని, తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులను, పారిశ్రామిక వేత్తలను, రాజకీయ ప్రముఖులను, దాతృత్వ స్వభావం వున్న లోకోపకారులను, సారధ్య సంఘం కలిసి, వారి సహాయాన్ని కోరుతోంది.

ఎటపాక అద్భుత విన్యాసానికి ముస్తాబవుతోంది. హిందువుల నమ్మకాలుసంస్కృతీ సాంప్రదాయాలువైదిక కర్మ కాండలువేదాల్లో ఉటంకించిన విషయాలువాటిని ఆచరిస్తున్న కేరళ నంబూద్రి బ్రాహ్మణుల తరహా సంప్రదాయ నిబద్ధత లాంటివి అక్షరాలా ఆచరించడానికి రంగం ఏర్పాటవుతోంది. "మంత్రాలకు చింతకాయలు రాలు తాయా" అని వాదించే ప్రభుద్ధులకు ప్రత్యక్ష నిదర్శనం పంజాల్ గ్రామంలో గత ఏడాది నిర్వహించిన యజ్ఞం పరిసమాప్తమైన వెంటనే జరిగిన సంఘటనే! అతిరాత్రం పుణ్య యజ్ఞం సరిగ్గా పన్నెండు రోజులు నిర్విరామంగా-నిర్విఘ్నంగా, శాస్త్రోక్తంగా,  వేద పండితులు ఋత్విక్కులుగా వ్యవహరిస్తుండగా జరిగింది. ఏ రోజుఏ సమయంలోఏదిఎలా నిర్వహించాల్నో అనేది శాస్త్రోక్తంగా, ముందే ప్రణాళికా బద్ధంగాసిద్ధం చేసుకుని అలానే ముందుకు సాగారు. దాని ప్రకారంముగింపు రోజున యాగ శాలను అగ్నికి ఆహుతి చేయాల్సిన సమయం కొన్ని నిమిషాలు మాత్రమే ఆలశ్యమైంది. అయితేమరి కొన్ని నిమిషాలలోయాగ శాలను అగ్నికి ఆహుతి ఇవ్వ పోతుండగాఅనుకున్న సమయానికేఆకాశం చిల్లులు పడినట్లుగాకుండ వృష్టితోభారీ వాన పడింది పంజాల్ పరిసరాల్లో. పుణ్య యజ్ఞాన్నిఆ క్షణానకను లారా వీక్షిస్తున్న సుమారు పది లక్షల మందిఆ వర్షంతోయజ్ఞం పరిసమాప్తమవుతుంటేపులకించి పోయారు. అంటే, సరిగ్గా నాలుగువేల సంవత్సరాల క్రితం జరిగిన విధంగానే...గత ఏప్రిల్ నెలలో కూడా...అచ్చు.. అలానే "అతిరాత్రం" జరిగిందని చెప్పగల ధైర్యం, దాఖలాలు కూడా వున్నాయి. యజ్ఞం పూర్తవగానే, యజ్ఞ శాలపై ఆకాశంలో ఒకే ఒక గద్ద ఎగురుతూ కనిపించితే, ఆ క్షణంలో ఆకాశం మేఘావృతమై వర్షం కురిస్తే, దేవతలు సంతోషించారనడానికి నిదర్శనం అని అతిరాత్రం గట్టిగా విశ్వసించే నంబూద్రి బ్రాహ్మణులు అంటారు. అంతా అలానే జరిగింది.

దేశ విదేశాలకు చెందిన పలువురు పరిశోధకులు, ఘనాపాఠీలు, పండితులు, విద్యావేత్తలు అతిరాత్రం తీరుతెన్నులను అధ్యయనం చేసేందుకు బధ్రాచలం రానున్నారు. అతిరాత్రం వైదిక సాంప్రదాయ ఆచారాన్ని, దాన్ని జరిపించే తీరుతెన్నులను, అతిరాత్రం సంబంధించిన పలు ఇతర అంశాలను శాస్త్రీయ పరంగా అధ్యయనం  భావి తరాల వారికి పని కొచ్చే రీతిలో బధ్ర పరిచేందుకు కృషి జరుగుతోంది. వైదిక మంత్రోచ్ఛారణలు, యాగాలు, వ్యవసాయ రంగంపైన, సూక్ష్మ క్రిముల చూపే ప్రభావం గురించిన విషయాలపై పరిశోధనలు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పనిచేసి, ఇటీవలే మరణించిన ఇండాలజిస్ట్ డాక్టర్ ఫ్రిట్స్ స్టాల్, రాబర్ట్ గార్డినర్ "అతిరాత్రం" ఆచారానికి సంబంధించిన అనేక విషయాలను యధాతధంగా రికార్డు చేసి, భావితరాల వారికొరకు భద్రపరిచారు. ప్రొఫెసర్ స్టాల్ అన్న వాక్యాలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం మంచిది. "దేవాలయాలు, చర్చిలు, ఆకాశ హర్మ్యాలు నిర్మించడం, కాలం గడిచే కొద్దీ అవన్నీ శిథిలం కావడం తెలిసిందే. భాషలు-మతాలు పుట్టాయి, గిట్టాయి. ప్రపంచంలో అనేకానేక యుద్ధాలు జరిగాయి. అవన్నీ తాత్కాలికమే. వేదాలు, వైదిక సాంప్రదాయాలు-ఆచార వ్యవహారాలు, అనాదిగా మౌఖికంగా  ఒకరి నుంచి మరొకరికి-గురువు నుంచి శిష్యుడికి-తండ్రి నుంచి కుమారుడికి, శాశ్వతంగా ప్రచారం-ప్రసారం అవుతున్నాయి. పదార్థం-భౌతిక శరీరాలకున్న హద్దులకు అతీతంగా మానవ స్ఫూర్తి సాధించిన విజయం అమోఘం!"

మనం చేయాల్సిందల్లా, మన జీవితకాలంలో , మన రాష్ట్రంలో జరుగుతున్న అతిరాత్రం పుణ్య యజ్ఞం వీక్షించడమే! చేతనైతే మన వంతు భాగస్వాములం కావడమే!  End

Sunday, April 17, 2011

అంగరంగ వైభోగంగా ముగిసిన అతిరాత్రం పుణ్య యజ్ఞం:వనం జ్వాలా నరసింహారావు

అంగరంగ వైభోగంగా ముగిసిన అతిరాత్రం పుణ్య యజ్ఞం

వనం జ్వాలా నరసింహారావు

("అతిరాత్రం-ఏప్రిల్ లో కేరళలో జరుగనున్న అత్యంత ప్రాచీన వైదిక పుణ్య యజ్ఞం" శీర్షికన ఫిబ్రవరి 2, 2011 న బ్లాగ్ లో రాసిన ఆర్టికల్ కు అనుబంధంగా...)

శుక్రవారం (ఏప్రిల్ 15, 2011) రాత్రి, సుమారు తొమ్మిదిన్నర గంటల సమయంలో, కేరళ రాష్ట్రం పంజాల్ గ్రామంలో నిర్వహిస్తున్న అతిరాత్రం పుణ్య యజ్ఞాన్ని ఆరంభం (ఏప్రిల్ 4, 2011) నుంచి వీక్షిస్తూ, దేశ వ్యాప్తంగా వున్న పాత్రికేయులకు ప్రతి దినం పత్రికా ప్రకటనలను విడుదల పంపిస్తున్న జర్నలిస్టు సురేఖతో, యాగం ముగింపు విశేషాల గురించి అడిగాను. అడగడానికి ప్రత్యేకమైన కారణం కూడా వుంది. 1975 లో యజ్ఞం పూర్తైన వెంటనే, యాగ శాలను శాస్త్రోక్తంగా అగ్నికి ఆహుతి చేసిన మరు నిమిషంలోనే (అది కూడా అనుకున్న సమయానికే!) మేగావృతమై, వర్షం కురిసింది. నాలుగు వేల సంవత్సరాల క్రితం నుంచి ఆచరణలో వున్న, ఈ సాంప్రదాయ క్రతువు, నాడూనేడూ, ముగిసిన వెంటనే, వర్షించడం జరిగినప్పుడే, యాగం పరిపూర్ణంగా పరిసమాప్తమైనట్లు భావించాలి. అలానే జరుగుతున్నది కూడా. నేను ఆ విషయం కనుక్కుందామని అక్కడే వున్న సురేఖకు ఫోన్ చేసి వర్షం కురిసిందా అని అడగడమే కాకుండా, అదే రోజు సాయంత్రం, హైదరాబాద్ తో సహా ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రదేశాల్లో వర్షం (వడ గళ్ల వాన) పడిన సంగతి కూడా చెప్పాను. అప్పడికింకా అతిరాత్రం జరుగుతున్న పంజాల్ లో వర్షం కురవలేదని ఆమె సమాధానం ఇచ్చింది.

సరిగ్గా, తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు, సురేఖ నుంచి, మొబైల్ ఫోన్ లో సందేశం వచ్చింది. "కుండ పోతగా పంజాల్ పరిసర ప్రాంతాలలో వాన పడుతోంది" అన్న ఆ సందేశం చదివిన వెంటనే, హిందువుల నమ్మకాలు, సంస్కృతీ సాంప్రదాయాలు, వైదిక కర్మ కాండలు, వేదాల్లో ఉటంకించిన విషయాలు, వాటిని ఆచరిస్తున్న కేరళ నంబూద్రి బ్రాహ్మణుల తరహా సంప్రదాయ కుల నిబద్ధత లాంటివి మనసులో మెదిలాయి. "మంత్రాలకు చింతకాయలు రాలు తాయా" అని వాదించే ప్రభుద్ధులకు ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏం కావాలి? అని అనిపించింది. అసలు విషయం-నన్ను మరీ ఆశ్చర్య పరిచిన విషయం తెలుసుకుని మరింత విస్మయం కలిగింది. అతిరాత్రం పుణ్య యజ్ఞం సరిగ్గా పన్నెండు రోజులు నిర్విరామంగా-నిర్విఘ్నంగా, శాస్త్రోక్తంగా, వేద పండితులు ఋత్విక్కులుగా వ్యవహరిస్తుండగా జరుపుతారు. ఏ రోజు, ఏ సమయంలో, ఏది, ఎలా నిర్వహించాల్నో అనేది శాస్త్రోక్తంగా, ముందే ప్రణాళికా బద్ధంగా, సిద్ధం చేసుకుని అలానే ముందుకు సాగుతారు. దాని ప్రకారం, ముగింపు రోజున యాగ శాలను అగ్నికి ఆహుతి చేయాల్సిన సమయం కొంచం సేపు ఆలశ్యమై, రాత్రి తొమ్మిదిన్నర కు జరపాల్సింది, పది గంటలకు జరిగింది. అయితే, మరి కొన్ని నిమిషాలలో, యాగ శాలను అగ్నికి ఆహుతి ఇవ్వ పోతుండగా, అనుకున్న సమయానికే, తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు, ఆకాశం చిల్లులు పడినట్లు గా, కుండ వృష్టితో, భారీ వాన పడింది పంజాల్ పరిసరాల్లో. పుణ్య యజ్ఞాన్ని, ఆ క్షణాన, కను లారా వీక్షిస్తున్న సుమారు పది లక్షల మంది, ఆ వర్షంతో, యజ్ఞం పరిసమాప్తమవుతుంటే, పులకించి పోయారు.

అలా ముగిసింది అతిరాత్రం పుణ్య యజ్ఞం.

(ఏ రోజున ఎలా ఆ పుణ్య యజ్ఞం నిర్వహించింది, ముగిసింది... పూర్తి వివరాలతో, మరో ఆర్టికల్ లో...)