Showing posts with label రామలింగ రాజు. Show all posts
Showing posts with label రామలింగ రాజు. Show all posts

Tuesday, September 6, 2011

108 అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ట్రస్టీ ఏర్పడాలి: వనం జ్వాలా నరసింహారావు

108 అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ట్రస్టీ ఏర్పడాలి

108 ఒడిదుడుకుల వాస్తవాలు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (07-09-2011)

వనం జ్వాలా నరసింహారావు

ఇ.ఎం.ఆర్.ఐ - 108 ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య మాజీ కన్సల్టెంటు

అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 సర్వీసులను నడిపే శక్తి ప్రభుత్వానికి లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్నట్లు వార్తలొచ్చాయి. అంబులెన్సుల నిర్వహణ విషయంలో సర్కారు ఇరకాటంలో పడిందన్న వార్తలూ పొక్కాయి. రెండేళ్లుగా వీటిని నిర్వహిస్తున్న జీవీకే సంస్థనుంచి వాటిని తొలగించే అవకాశం వున్నట్లు కూడా సమాచారం. ఎవరు-ఎలా నిర్వహిస్తారో అనే విషయం పక్కన పెడితే, తిరగవలసిన 802 అంబులెన్సుల్లో సుమారు 300 వరకు ఏమైనా యో-ఎక్కడున్నాయో అంతుపట్టకుండా పోయింది. 108 సేవల కొన సాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఒక్కో అంబులెన్సుకు నెలకు ఇంతవరకు ఇస్తున్న రు. 1, 12, 499 కంటే తక్కువగా కేవలం రు. 95 వేల చొప్పున మాత్రమే చెల్లించాలని సూచించినప్పటికీ, .ఎం.ఆర్.ఐ అంగీకరించడం వెనుక కారణాలు అర్థం చేసుకోవడం కష్టమే! రు. 42 కోట్ల బ్యాంకు రుణాన్ని తీర్చేందుకు కూడా జీవీకే సంస్థ ఒప్పుకున్నదట! 108 నిర్వహణ అధ్వాన్నంగా మారిన విషయం జగమెరిగిన సత్యం. అసలు ఆ సంస్థకు అంబులెన్సులు నడవడం కన్నా, ఆ సేవలను ఎలాగైనా నిర్వహించడమే ప్రధానంగా కనిపిస్తోంది.

ఒక్కో 108 అంబులెన్సు ప్రతి రోజూ కనీసం 3-4 పర్యాయాలైనా ఎమర్జెన్సీ సేవలందించేందుకు సంఘటనా స్థలానికి వెళ్లాలి. సగటున అవి ఇప్పుడు 1-2 సార్లన్నా చేస్తున్నాయో-లేదో అనుమానమే! కాల్ సెంటర్ కు వచ్చే ఫోన్లు కూడా గణనీయంగా పడిపోతున్నట్లు సమాచారం. ప్రతిసారీ రామలింగ రాజు హయాంలో యాక్సెస్‌ బ్యాంకు నుంచి తీసుకున్న రు. 42 కోట్ల రుణానికి సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తుంటారు. అదేదో ఘన కార్యం చేస్తున్నట్లు తాను ఆ రుణానికి పూచీకత్తు పడతానని సంస్థ చైర్మన్ అనడం గమనించాల్సిన విషయం. సంస్థ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఇప్పటివరకు రు. 60 కోట్ల నిధులను (రాజు హయాంలో చేసిన అప్పుల కింద?) సమకూర్చానని సీఎం వద్ద ఆయన వాదిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ కు అదనంగా మరో 9 రాష్ట్రాలకు సహాయ సేవలను విస్తరించానని, జీవికే అనడం హాస్యాస్పదం. సంస్థ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయన చొరవతో కనీసం ఒక్క టంటే ఒక్క రాష్ట్రం కూడా కొత్తగా 108 సేవల నెట్‌వర్క్ లోకి రాలేదనే ది వాస్తవం. పైగా అంతకు ముందున్న రాజస్థాన్ రాష్ట్రం ఇ.ఎం.ఆర్.ఐ పరిధి నుంచి వైదొలగింది కూడా.

"లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం" ప్రక్రియను ఆరోగ్య వైద్య రంగంలో ప్రవేశపెట్టి యావత్ భారతదేశానికి మార్గదర్శకంగా మలిచిన ఘనత ఆంధ్ర ప్రదేశ్ దే. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అధ్యయనంలో "కరుణామయి-కారుణ్య దేవతగా" అభివర్ణించబడిన 108 అంబులెన్స్-అత్యవసర సహాయ సేవలు, ఇతర రాష్ట్రాలలో అంచలంచలుగా అభివృద్ధి చెందుతుంటే, అవి ఆవిర్భవించిన రాష్ట్రంలో, కుంటుపడడం దురదృష్టం. 108 సేవలను తన సొంత నిధులతో ఆరంభించిన రామలింగ రాజు, సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో జైలుకెళ్లిన తర్వాత తలెత్తిన పరిస్థితులను సమీక్షించిన ప్రభుత్వం, అప్పటివరకూ భరిస్తున్న 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి నూరు శాతానికి పెంచడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇది రెండున్నరేళ్ళ క్రితం తీసుకున్న నిర్ణయం. దానికి ప్రత్యక్ష సాక్షులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే. సత్యనారాయణలతో సహా పలువురు ఇ.ఎం.ఆర్.ఐ-ప్రభుత్వ ప్రతినిధులు.

.ఎం.ఆర్.ఐ సొంత నిధులతో ఆగస్ట్ 15, 2005 న హైదరాబాద్ లో అంబులెన్సులను ప్రవేశ పెట్టింది. తర్వాత తిరుపతి-విశాఖపట్నం-విజయవాడ-వరంగల్ పట్టణాలకు, రాష్ట్రంలోని అన్ని జిల్లా-రెవెన్యూ డివిజన్ కేంద్రాలకు మొత్తం 70 వాహనాలతో విస్తరించింది. జనవరి 2007 లో గ్రామీణ ప్రాంతాలకు సేవలు విస్తరించడం, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 502 అంబులెన్సులు సేవలందించడం జరిగింది. మే నెల 2008 లో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం మేరకు, 2008-2009 ఆర్థిక సంవత్సరం నుండి, నిర్వహణ వ్యయంలో 95% ప్రభుత్వం భరించాలని, అంబులెన్సుల సంఖ్యను దశలవారీగా 802 కు పెంచాలని నిర్ణయించింది. అప్పటినుంచి ఇంతవరకు 108-అత్యవసర సహాయ సేవలు కొనసాగినప్పటికీ, నాణ్యతా లోపం, పౌరులకు గతంలో మాదిరి సేవలు లభ్యం కాకపోవడం మొదలైంది.అత్యవసర సహాయ సేవలు ఒడిదుడుకుల్లో పడడం నిజమేనా?ఒడిదుడుకులకు కారణాలు ఏమై వుండొచ్చు? మరెందుకీ సంస్థ-అది అందిస్తున్న అత్యవసర సహాయ సేవలు ఇబ్బందులకు లోను కావాలి? అసలేం జరుగుతున్నది?ప్రభుత్వ హామీలు కాగితాలకే పరిమితమా? యాజమాన్య నిర్వహణలో లోపాలున్నాయా? ఇటీవల కింది స్థాయి సిబ్బందికి కూడా సకాలంలో జీతాలు చెల్లించడం లేదని వార్తలొస్తున్నాయి. కనీసం నాలుగొందల వాహనాలు సేవలను అందించలేని పరిస్థితుల్లో నిరుపయోగంగా పడి పోయాయంటున్నారు. ఏది నిజం?

ఆశయం గొప్పది కావచ్చు. అమలు పరిచేవారు నిష్ణాతులే కావచ్చు- నిబద్ధత, అంకిత భావాలకు సాక్షాత్తు చిరునామా కావచ్చు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, "లోకోపకార దాతృత్వభావంతో పలు సంక్షేమ కార్యక్రమాలకు తన వంతు నిధులను సమకూరుస్తున్న జీ.వి.కృష్ణారెడ్డి, చైర్మన్ గా రావడంతో, అత్యవసర సహాయ సేవలు అందచేయడంలో ఏ సమస్యలు రావని లబ్దిదారులు భావించారు. ఐనా సమస్యలు కొనసాగడంతో, ప్రభుత్వం నియమించిన కమిటీ, ఆర్థిక శాఖ కొంచెం లోతుగా అధ్యయనం చేయడం మొదలెట్టింది. 05.05.08 న కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం స్థానంలో ఇంకొక ముసాయిదాను తయారు చేసి, పరిశీలన కొరకు ప్రభుత్వానికి సమర్పించింది సంస్థ. గతంలో ప్రభుత్వం-.ఎం.ఆర్.ఐ మధ్య కుదుర్చుకున్న మొదటి, రెండో, మూడో ఎంఓయు విషయంలో గాని, నాలుగో (మే 5, 2008) ఎంఓయు విషయంలో గాని ఏ విధమైన అభ్యంతరాలను ప్రభుత్వం చెప్పలేదు. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య పక్షాలకు చెందిన అధికార ప్రతినిధులు కూర్చొని-చర్చించి ముసాయిదాను ఖాయపరిచే సాంప్రదాయం వుండేది. "విశ్వాసం-నమ్మకం" అనే ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రాతిపదిక ఆధారంగా ఎంఓయు లన్నీ ఖరారయ్యాయి. మొట్టమొదటి సారిగా "కొర్రీల సాంప్రదాయానికి" అవకాశం ఇచ్చింది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. ఇలా జరగకుండా వుండాల్సింది.

ముసాయిదా ఒప్పందం ప్రతిపాదనలో ప్రధానమైంది నెల-నెలా సగటున ఒక్కో అంబులెన్సుకు ప్రభుత్వ పరంగా ఇస్తున్న ప్రత్యక్ష నిర్వహణ వ్యయానికి సంబంధించిన విషయం. 2008-2009 ఆర్థిక సంవత్సరానికి, అప్పట్లో ఇ.ఎం.ఆర్., ఒక్కో అంబులెన్సుకు సగటున ప్రతినెలా రు. 1, 18, 420 వ్యయమవుతుందని ప్రతిపాదించగా, దాన్ని పరిశీలించి-అంగీకరించిన ప్రభుత్వం, తన వంతు 95% వాటాగా రు. 1, 12, 499 చొప్పున ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. 502 అంబులెన్సులున్నప్పుడు అంగీకరించిన ఆ మొత్తం (రు. 1, 12, 499), తర్వాత సంఖ్య 652 కు చేరినప్పటికీ, ఆ తర్వాత ఆ సంఖ్య 802కు పెరిగినప్పటికీ, "విశ్వాసంతో-నమ్మకంతో" పునఃపరిశీలించకుండా చెల్లిస్తూ వస్తున్నారు. అది కూడా మొదట్లో మూడు నెలల అడ్వాన్సు ఒకే సారి ఇచ్చే సాంప్రదాయం వుండేది. దరిమిలా నెల-నెలా అడ్వాన్సుల సాంప్రదాయానికి అంగీకరించింది యాజమాన్యం. 108 అత్యవసర సహాయ సేవల ఒడిదుడుకులకు ఇదో ప్రధాన కారణం. ముసాయిదాలో 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి 100% పెంచి, ప్రతి నెలా ఒక్కో అంబులెన్సుకు రు. 1, 18, 420 వంతున ప్రభుత్వం భరించాలని ప్రతిపాదించింది కొత్త ముసాయిదాలో. అదనంగా మరో రు. 10 కోట్లు "మూల ధన వ్యయం" కావాలని కోరింది. సంవత్సరానికి రు. 12 లక్షల కంటే ఎక్కువ (నెలకు లక్ష రూపాయలు !) వేతనం ఇవ్వాల్సిన ఉద్యోగుల జీత భత్యాలను మాత్రమే (జీ.వి.కె) .ఎం.ఆర్.ఐ యాజమాన్యం భరిస్తుందని, మిగతా వారికి ప్రభుత్వమే ఇవ్వాలని మరో ప్రతిపాదన ఇచ్చింది. ఆర్థికంగా ప్రభుత్వంపై మరింత భారాన్ని పరోక్షంగా సూచించింది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. అడపాదడపా ఏదన్నా ఊహించని వ్యయం జరిగితే దాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని కోరింది. శిక్షణా కార్యక్రమాలన్నింటికీ అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని మరో ప్రతిపాదన. రాజు చైర్మన్ గా తొలగిన సమయానికి ఇ.ఎం.ఆర్.ఐ ఇరుక్కుపోయిన సుమారు రు. 120 కోట్ల "అప్పుల ఊబి" వ్యవహారం కూడా ఆర్థిక శాఖకు ఎంతమాత్రం రుచించలేదు. అసలు విషయాలిలా వుంటే ఎంఓయు ఎలా కుదురుతుంది?

లక్షలాది ప్రాణాలను కాపాడుతున్న అత్యవసర సహాయ సేవలను రాజు ఎందుకు ప్రారంభించ దలిచాడు? నిర్వహణ బాధ్యతను లాభాపేక్ష లేని ఒక స్వచ్చంద సంస్థ చేతుల్లో ఎందుకు పెట్టాడు? కేవలం కుటుంబీకులనే ఆ సంస్థ ప్రమోటర్ సభ్యులుగా ఎందుకు ఎంపిక చేశారు? రు. 34 కోట్లు వారందరి పక్షాన సంస్థకు ఎందుకిచ్చారు? ఆ తర్వాత ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు? బాంక్ రుణం ఎందుకు తీసుకున్నారు-తీసుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా వుందా? ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను ఆరంభించి అచిర కాలంలోనే సంస్థ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటే నిధులను సమకూర్చే విషయంలో నిరాసక్తత-నిర్లిప్తత ఎందుకు వహించారు? ఇతర రాష్ట్రాల నిధులను సంస్థ దైనందిన కార్యకలాపాలకు వినియోగించడం "ప్రభుత్వ నిధుల తాత్కాలిక దుర్వినియోగం" అని తెలిసి కూడా ఎందుకలా చేశారు? చేస్తుంటే ఇది తప్పని చెప్పాల్సిన బాధ్యత వున్న వారు చెప్పకపోవడానికి-చెప్పలేక పోవడానికి బలీయమైన కారణాలేంటి.... ?

సంస్థను ఆరంభించిన నాటినుంచి జనవరి 9, 2009 వరకు, అత్యవసర సహాయ సేవల నిర్వహణ ఎలా రూపాంతరం చెందింది-ఎలా నిర్వహణ నిధులు సమకూరుతున్నాయి-ఆర్థిక పరమైన భారం తనపై ఎంత మేరకు తగ్గుతుంది-పెరుగుతుంది లాంటి విషయాలను రాజు బహుశా ఎప్పటికప్పుడు అంచనా వేసుకునే వుంటారు. ఒక వైపు నిర్వహణ వ్యయంలో అధిక భారం ప్రభుత్వాలపై పడ్డప్పటికీ, ఇతర రాష్ట్రాలకు సేవలు వ్యాపించడంతో యాజమాన్య పరమైన వ్యయ భారం రాజుపై పడడం కూడా ఎక్కువైంది. ఆయన వంతు సమకూర్చాల్సిన నిధులను ఇ.ఎం.ఆర్.ఐ కి సకాలంలో విడుదల చేయడం బహుశా తలకు మించిన భారం అయ్యుండాలి. మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా, తొలుత బాంక్ ద్వారా రుణాన్ని- ఓవర్ డ్రాఫ్టును తీసుకోవడం మేలని భావించి, లోటును పూడ్చే ప్రయత్నం చేశారాయన. అయితే, ఆయన ఊహించని రీతిలో అత్యవసర సహాయ సేవలు ఒకటి వెంట-మరో రాష్ట్రానికి వ్యాపించడంతో, ఆయనపై అదనపు భారం పడ సాగింది. దాన్ని తట్టుకోవడానికి సమాధానం కూడా అందులోనే దొరికింది.

కొత్తగా సహాయ సేవలను కోరుకునే ప్రతి రాష్ట్రం ముందస్తుగా నిధులను విడుదల చేయడం జరిగింది. గుజరాత్ నిధుల విడుదలకు బోణీ కొట్టింది. అవగాహనా ఒప్పందం కుదిరిన మరుక్షణమే నాలుగు కోట్ల రూపాయలను అడ్వాన్సుగా విడుదల చేసింది. ఆ తర్వాత కాలంలో ప్రతి రాష్ట్రం పది కోట్ల రూపాయల మేరకు అడ్వాన్సుగా ఎంఓయు పై సంతకాలు చేసిన నాడే విడుదల చేయడం పరిపాటి అయిపోయింది. ఎంఓయు నిబంధనల ప్రకారం ఆ నిధులను, ఆ రాష్ట్రంలో ఆరంభించనున్న అత్యవసర సహాయ సేవల "మూల ధన వ్యయం" కొరకు ప్రధానంగా ఉపయోగించాలి. సంస్థ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" నిధులను ఉపయోగించే సాంప్రదాయం మొదలయింది. అలా చేయడం "దుర్వినియోగం" కింద కు రాదని, కేవలం అవసరార్థం సంస్థ "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా నిధుల వాడకమేనని సర్ది చెప్పుకుంది యాజమాన్యం.

ఇ.ఎం.ఆర్.ఐ కున్న రుణ భారం గురించి మాట్లాడే బదులు సంస్థ సేకరించుకున్న"ఆస్తులు" చేసిన "అప్పులు" కలిపి సమగ్ర విశ్లేషణ జరగాలి. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు "అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ". అప్పుల భారాన్ని నెత్తిన వేసుకుంటున్నామని-సంస్థను ఇబ్బందుల నుంచి కాపాడుతున్నామని-అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నామని చెపుతున్న వారి ఆంతరంగం "దాతృత్వ వైఖరికి నిదర్శనమా ?" లేక ఆ పేరుతో "సంస్థ ఆస్తులను కైవసం చేసుకోవాలన్న ఆలోచనా ?" బేరీజు వేయడం జరిగుండాల్సింది. ఇ.ఎం.ఆర్.ఐ కి అత్యంత ఖరీదైన సుమారు నలభై ఎకరాల భూమి, సుమారు రు. 30-40 కోట్ల భవనాలు, అంతర్జాతీయ ప్రమాణాల అనుగుణంగా నెలకొల్పిన (విలువ కట్టలేని)ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ లాంటి విలువైన ఆస్తులున్నాయి. ఇవేవీ ఏ ఒక్కరి "సొత్తో-సొమ్మో" కారాదు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి "ఒడిదుడుకులకు ఆస్కారం లేని" అత్యవసర సహాయ సేవల అమలు "ట్రస్ట్" కు శ్రీకారం చుట్టాల్సిందే.

రామలింగ రాజు జైలుకెళ్లే ముందర తన వారసులెవరైతే బాగుంటుందన్న విషయం కుటుంబ సభ్యులకు సూచించి వుండవచ్చు. రాజు గారి కుటుంబ సభ్యులకు పిరమల్-జీ.వి.కె సంస్థలలో ఇదమిద్ధంగా ఎవరిపైనా ఎక్కువ ఆసక్తి వున్నట్లు లేదు మొదట్లో. కాకపోతే, ఎంత కాదనుకున్నా వారిదనుకున్న "స్థిరాస్తి" అన్యాక్రాంతం కాకూడదన్న పట్టుదల వుండడం సహజం. బహుశా మొదట్లో పిరమల్ కావాలనుకున్నారే మో, అటు వైపు ఎక్కువ మొగ్గు చూపారు. ఆ తర్వాత జి.వి.కె. రెడ్డిపై మనసు మళ్లి వుండవచ్చు. పిరమల్ అధినేత, జి.వి.కె. లేవనెత్తిన ఒక ప్రధాన అంశం ఇ.ఎం.ఆర్.ఐ కార్యాలయం, భవన సముదాయం వున్న సుమారు నలభై ఎకరాల భూమి వ్యవహారం గురించి.

రాజు సారధ్యంలో రూపు దిద్దుకున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ "నియమావళి" గురించి, "సంఘ స్థాపన పత్రం" లోని చిత్ర-విచిత్రమైన అంశాల గురించి తెలుసుకోవడం అవసరం. తన కుటుంబీకులే ప్రమోటర్ సభ్యులుగా సంస్థను రిజిస్టర్ చేయించడమే కాకుండా, సంస్థ నియమావళికి, భవిష్యత్ లో ఎంత ప్రయత్నం చేసినా, అంత సులభంగా సవరణలు తేలేని విధంగా, అతి చాకచక్యంగా దాన్ని తయారు చేయించారు రాజు. యాదృచ్చికంగా అలా జరిగిందో, లేక, కావాలనే ఆయనో-ఆయన సలహాదారులో అలా చేయించారో? సంస్థ "ఉజ్వల భవిష్యత్" ను దృష్టిలో వుంచుకుని, "నీతి విచక్షణ లేని" వారి చేతుల్లోకి అది ఎట్టి పరిస్థితుల్లోనూ జారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుగా అలా చేసి వుండాలి రాజు.

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మీద, "సిద్ధాంతపరంగా" ఎన్నో వ్యాసాలు-మరెన్నో పరిశోధనలు పుంఖానుపుంఖాలుగా లభ్యమయినప్పటికీ, "ప్రయోగాత్మకంగా"-"ఆచరణాత్మకంగా" ఆ ప్రక్రియకు భాష్యం చెప్పింది 108-అత్యవసర సహాయ సేవలను అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ, అందుకు ప్రోద్బలం-ప్రోత్సాహం అందిస్తున్న భారత దేశంలోని పది రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే. "లాభాపేక్ష లేకుండా" ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మనుగడ సాగించడం తేలికైన విషయం కాదు. అలా సాధ్య పడాలంటే భాగస్వామ్య పక్షాలైన ఇరువురి లో నిబద్ధత కావాలి. ఒకరిపై ఇంకొకరికి "విశ్వాసం-నమ్మకం" వుండాలి. "విశ్వసనీయత" కు ప్రాధాన్యత ఇవ్వాలి కాని, "వంచన" కు ఏ ఒక్కరు పాల్పడినా ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. పలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం సడలుతున్న వర్తమాన పరిస్థితులలో సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రక్రియకు కూడా విఘాతం కలిగితే ఇబ్బందులకు గురయ్యేది సామాన్య ప్రజలే-వారిలోను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారే. ఆ ప్రమాదం పొంచి వుంటే, దానికి బాధ్యులైన వారందరూ, అధిగమించడానికి చర్యలు చేపట్టాలి.

ఇంతవరకూ జరిగిందే దో జరిగింది. ఇక ముందైనా, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో, ప్రయివేట్ సంస్థ కాని-వ్యక్తి కాని ఏ ఒక్కరో కాకూడదన్న నిబంధన రావాలి. పటిష్టమైన "ట్రస్టు" చేతుల్లో ప్రయివేట్ పరమైన యాజమాన్య బాధ్యతలు వుంచాలి. ఇ.ఎం.ఆర్.ఐ అప్పులను, దానికున్న ఆస్తులతో కలిపి విశ్లేషించాలి. అవెవరివో తేల్చాలి. అప్పుడే మరో అడుగు ముందుకు వేయాలి. అంతవరకు, 108-అత్యవసర సహాయ సేవలు ఆగకుండా-నాణ్యతతో నిర్వహించాలి. ప్రభుత్వానికి వాటిని నడిపే శక్తి లేదని సంబంధిత మంత్రి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం. 104 కాల్ సెంటర్ సేవలను, నిర్ధారిత తేదీ సహాయ సేవలను హెచ్.ఎం.ఆర్.ఐ నుంచి తొలగించి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపగలిగిన శక్తి వున్న ప్రభుత్వానికి 108-అత్యవసర సహాయ సేవలు నడపగలిగే సామర్థ్యం లేదా?


Sunday, June 27, 2010

X-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-10) : వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-10
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు

వనం జ్వాలా నరసింహారావు

రామలింగ రాజు, తాను తలపెట్టిన, మహత్తరమైన "బృహత్తర ప్రాణ రక్షణ యజ్ఞం" నిర్వహించగల సమర్థుడైన "ఋత్విజుడు" కొరకు అన్వేషిస్తున్న సమయంలో, జర్మనీకి చెందిన ఒక బహుళ జాతీయ సంస్థలో, చెన్నై ప్రధాన కార్యాలయంగా, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న వెంకట్ చంగవల్లి తారస పడ్డారు. అలా తారసపడ్డ వెంకట్ పుట్టు-పూర్వోత్తరాల గురించి, నైపుణ్యం-అర్హతల గురించి, తనతో పాటు యజ్ఞాన్ని నిర్వహించగల సత్తా వున్న తోటి "ఋత్విక్కులను" నియామకం చేసుకోగల సామర్థ్యం గురించి ఇంతకు ముందే కొంత తెలుసుకున్నాం. ఋత్విజుడుగా యజ్ఞ భారాన్ని మోయడమే కాకుండా, కష్ట కాలంలో తోటి ఋత్విక్కులలో స్థయిర్యాన్ని పెంపొందించేందుకు వెంకట్ చేసిన కృషి ముందు ముందు తెలుసుకుందాం. వెంకట్ 108-అత్యవసర సహాయ సేవల సంస్థ సిఇఓ గా పనిచేసిన-చేస్తున్న కాలాన్ని నాలుగై దు ప్రధాన దశలుగా విభజించి చూడాలి. ఆయా దశల్లో, ఆయన నిర్వహించిన పాత్ర, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ఎదుగలకు ఎంత మేరకు తోడ్పడింది-ఒడిదుడుకులకు ఏ మోతాదులో కారణమైంది, విశ్లేషణ చేయడానికి, ఆ దశలకు సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మొదటి దశ: సంస్థ సిఇఓ గా వెంకట్ ఏప్రిల్ 15, 2005 న బాధ్యతలు చేపట్టడానికి పూర్వం; రెండవ దశ: బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఆగస్టు 15, 2005 న అత్యవసర సహాయ సేవలను లాంఛనంగా హైదరాబాద్ నగరంలో ఆరంభించడం వరకు; మూడవ దశ: ఆగస్టు 15, 2005 నుంచి జులై-ఆగస్టు 2006 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇ.ఎం.ఆర్.ఐ తో గ్రామీణ ప్రాంతాలలో సేవలందించడానికి ఒప్పందం కుదుర్చుకునేందుకు చొరవ చూపించడం వరకు-ఆ తర్వాత; నాలుగవ దశ: రామలింగ రాజు జనవరి 8, 2009 న చైర్మన్ గా తప్పుకోవడం-తదనంతర పరిస్థితులు, దరిమిలా మే నెల 26, 2009 న (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చొరవతో జీవికే సంస్థ యాజమాన్య బాధ్యతలు స్వీకరించే వరకు; ఐదవ దశ: వర్తమాన-భవిష్యత్ కాల పరిస్థితులలో ఆయన పాత్ర. ఆయా దశల్లో వెంకట్ నిర్వహించిన పాత్ర, ఆయన పట్ల అలనాటి రాజు గారికి-ఈ నాటి డాక్టర్ జీ. వి. కె. రెడ్డి గారికి వున్న అపారమైన విశ్వాసం పూర్వాపరాలు పలు రకాలుగా ఆసక్తికరమైన వనే అనాలి.

మద్రాస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సదస్సుకు సంబంధించిన అంశాలను చర్చించడానికి, జనవరి 21, 2005 ఉదయాన, చెన్నైలో రాజు బసచేస్తున్న హోటల్ లో ఆయనతో "బ్రేక్ ఫాస్ట్" సమావేశమయ్యారు వెంకట్ తొలుత. ఆ నాడు జరుగనున్న సదస్సులో రాజు గారికి ఇష్టమైన "బియాండ్ క్రియేటింగ్ వేల్యూ" అన్న అంశంపైన చర్చ జరుగనుంది. అత్యవసర సహాయ సేవల పేరుతో "అపారమైన విలువను" తాను సృష్టించగలడు గాని, ఆ విలువకు తగ్గ మూల్యానికి అతీతంగా-అవధులకు మించి, ఆ సేవల ఫలితాలను కావల్సినవారికి అందచేయడం ఎలా సాధ్యమవుతుందని ఆయన అనుకుంటున్న సమయంలోనే, దానికి సంబంధించిన అంశంపై సదస్సులో చర్చించబోవడం రాజు గారికి అనుకోని అవకాశంగా కలిసి వచ్చింది. నిర్వహణ బాధ్యతలను అప్ప చెప్పేందుకు నాయకత్వ పటిమగల వ్యక్తిగా వెంకట్ ఆయనకి కనిపించారు. ఆయన అనుభవం, విధి నిర్వహణ దక్షత, సంబంధ-బాంధవ్యాలను ఏర్పాటు చేసుకోగల నేర్పరితనం, నిబద్ధత, నైపుణ్యం, విశ్వసనీయత లాంటి అంశాలను కాసేపట్లోనే నిశితంగా గమనించారు రాజు. సదస్సు నిర్వహిస్తున్న సమయంలో మద్రాస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ చైర్మన్ మహాపాత్ర, వెంకట్ గురించి-ఆయన "వినయ-విధేయతల" గురించి రాజు తో గొప్పగా చెప్పారు. హైదరాబాద్ తిరిగొస్తూనే రాజు తన సంస్థలో పనిచేస్తున్న ఉమ్మడి స్నేహితుడి ద్వారా వెంకట్ ను కదిపారు. వెంకట్ తక్షణ స్పందన రాజు ప్రతిపాదనకు అనుకూలంగా రాలేదు. తన సహోద్యోగులను, తండ్రిని సంప్రదించిన తర్వాత వెంకట్ లో మార్పు రాసాగింది. అమెరికా 911 స్థాయిలో అత్యవసర సహాయ సేవల నిర్వహణ గురించి, లాభాపేక్ష లేని సంస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి వెంకట్ లాంటి వారి అవసరాన్ని గురించి, ఆయన నిర్వహణా దక్షత గురించి పదే పదే ప్రస్తావించసాగారు రాజు. "మీరు తెలుగు వారు. విజయవంతంగా ఇతర ప్రాంతాలలో తెలుగే తర సంస్థలలో పని చేస్తున్నవారు. ప్రాణ రక్షణకు ప్రారంభిస్తున్న అత్యవసర సహాయ సేవల నిర్వహణను చేపట్టండి" అని అనేవారు. సూత్రప్రాయంగా ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు సారధ్యం వహించడానికి అంగీకరించి, ఫిబ్రవరి 3, 2005 న రాజు ఆహ్వానం మేరకు భార్యా సమేతంగా హైదరాబాద్ వచ్చి కలిశారు వెంకట్. "వివరించనలవి కాని ఆకర్షణ శక్తి" వుంది రాజుగారిలో అంటారు వెంకట్. అతిథి మర్యాదల విషయంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఒకరోజు ముందర హైదరాబాద్ చేరుకున్న వెంకట్ దంపతులకు విమానాశ్రయంలో స్వాగతం ఏర్పాటు చేసిన పద్ధతి, వాహనం పంపిన విధానం, సరాసరి సత్యం సంస్థకు తీసుకెళ్ళడం, అక్కడ ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు.... లాంటివి.... వెంకట్ ను ఆకట్టుకున్నాయి.

రాజు-వెంకట్ మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. మర్నాడు వెంకట్ దంపతులను తమ ఇంటికి సాదరంగా ఆహ్వానించిన రాజు దంపతులు (రామలింగ రాజు, నందిని) హైదరాబాద్ లో వారెక్కడ వుండ దల్చుకుంది అడిగి తెలుసుకున్నారు. వారు కోరినట్లే జూబ్లీ హిల్స్ లో ఆకర్షణీయమైన భవనంలో అద్దె కుండే ఏర్పాటు స్వయంగా చేశారు రాజు. ఇక అప్పటినుంచి, ఉద్యోగంలో చేరేవరకు వారం-వారం (ఆ తర్వాత ప్రతిరోజు-ప్రతి గంట-ప్రతి నిమిషం) ప్రాజెక్ట్ గురించి, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో దానిని నిర్వహించడం గురించి ఫోన్లో మాట్లాడే వారు రాజు. ఆయన సంస్థకు సిఇఓ గా వస్తున్న సంగతి చేరేంతవరకు గోప్యంగా వుంచాలని కూడా అనేవారు. ఫిబ్రవరి 10, 2005 న వెంకట్ పెళ్లి రోజు సందర్భంగా, తిరుపతికి కారులో పోతున్న ఆయనకు శుభా కాంక్షలు తెలిపిన రాజు, పనిలో పనిగా, జీత-భత్యాల విషయంలో ఆయన మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనకు 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కేవలం ఒక్క రూపాయి జీతానికే పని చేస్తానని, మిగతా విషయాలు రాజుగారికే వదిలేస్తున్నానని జవాబిచ్చారు వెంకట్. అయితే జర్మనీకి చెందిన బహుళ జాతి సంస్థలో పనిచేస్తున్న వెంకట్ జీతం-బోనస్ కలిపి అప్పటికే సుమారు కోటి రూపాయల వర కుంది. 2003 నుంచి ఆయన పనిచేస్తున్న సంస్థలోనే 2007 వరకు కొన సాగినట్లయితే, షేర్ల రూపంలో వెంకట్ గారికి కనీసం మూడు కోట్ల రూపాయలకు పైగా లభించేది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న రాజు గారు, ఒక లాభాపేక్ష సంస్థలో పనిచేసేందుకు ఎంత మేరకు వీలవుతుందో, అంత మేరకు వెంకట్ జీత-భత్యంగా ఏర్పాటు చేశారు.

ఆ కమిట్ మెంట్ ను రాజు స్థానంలో వచ్చిన డాక్టర్ జీ. వీ. కే. రెడ్డి కూడా అమలు పరిచారు. కాకపోతే, 34 కోట్ల రూపాయలను సమకూర్చి, మరో 42 కోట్ల రూపాయల బాంక్ రుణం తీసుకుని సంస్థను నడిపిన రాజు, సంస్థ చైర్మన్ గా రాజీనామా చేసినప్పుడు ఎలా అయితే సుమారు 120 కోట్ల లోటును మిగిల్చారో, అలానే వెంకట్ గారికి ఇస్తానన్న "కాంపన్సేషన్" విషయంలోను కొంత బకాయి పడి వుండవచ్చు. రాజు ఎంత ఇస్తానన్నారు-ఎంత ఇచ్చారు, భవిష్యత్ లో ప్రస్తుత యాజమాన్యం ఎంత ఇస్తుంది, అన్న విషయాలు ప్రాధాన్యత సంచరించుకున్నవే అయినప్పటికీ, అవేవీ, వెంకట్ కమిట్ మెంటుకు, ప్రతిబంధకాలు కాలేదు. 2005 లో ఇ. ఎం.ఆర్.ఐ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి 2009 సంక్షోభం వరకు, ఆ తర్వాత సంక్షోభం కొనసాగుతున్నప్పుడు, తీవ్ర ఇబ్బందులను అధిగమించి ఐదారు నెలల తర్వాత యాజమాన్యం మార్పిడి జరిగిన తర్వాత సంస్థ నిర్వహణ పట్ల-నిధులను సమకూరుస్తున్న ప్రభుత్వాల పట్ల వెంకట్ వైఖరిలో మార్పు లేదు. కాకపోతే, అలనాటి రాజు మార్గదర్శకత్వానికి, ఈ నాటి రెడ్డి గారి మార్గదర్శకత్వానికి అనుగుణంగా కొన్ని సందర్భాలలో ఆయన నిర్వహించిన-నిర్వహిస్తున్న "ఉద్యోగపరమైన బాధ్యత" లో అపశృతులు దొర్లి వుండవచ్చు. ఆ అపశృతులు ఒడిదుడుకులకు దారి తీసి వుండవచ్చు. అలానే ప్రభుత్వంలో వున్న వారితో సంబంధ బాంధవ్యాల విషయంలోనూ జరిగుండాలి. బహు జాగరూకతతో ఆయన నియమించిన "లీడర్సులో కొందరు" సంబంధ బాంధవ్యాల విషయంలో చేసిన పొర పాట్లు సరిద్దిద్దడంలో జాగు జరిగుండాలి. ఆ జాగు ఒడిదుడుకులకు దారి తీసి వుండాలి.

అత్యవసర సహాయ సేవలను సంబంధిత ప్రభుత్వ-ప్రయివేట్ పరమైన ఇతర ఆరోగ్య-వైద్య సేవలతో సంఘటిత పరిచే విషయంలో గాని, దశల వారీగా దేశ వ్యాప్తంగా విస్తరింప చేసే విషయంలో గాని, నాణ్యత విషయంలో గాని, సహచరుల విధి నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే విషయంలో గాని, వేగవంతంగా సహాయ సేవల కల్పన విషయంలో గాని వెంకట్ దృక్ఫదం అప్పుడు-ఇప్పుడూ ఒకే మాదిరిగా వుందనాలి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కోట్లాది రూపాయలు నిర్వహణ-మూలధనం వ్యయం కింద పొందుతున్నప్పటికీ, ఒక్క నాడు కూడా, అలా పొందడానికి ఒక్క పైసా ఖర్చు చేయలేదు. అధికార-అనధికారులెవరు కూడా వెంకట్ ని కాని-ఆయన సహచరులను కాని ఈ విషయంలో ఎటువంటి ఒత్తిడి చేయలేదు. ఇ.ఎం.ఆర్.ఐ లో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలను గిరించి కదిపినప్పుడు, ఆవిర్భావ కాలం నాటి విలువలను అప్పటి యాజమాన్యం ఎలా గౌరవించేదో, ఇప్పటి యాజమాన్యం కూడా అలానే గౌరవిస్తున్నదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సిఇఓ వెంకట్. విధి నిర్వహణలో వెంకట్, గతంలో మాదిరి "స్వతంత్రంగా వ్యవహరించ లేకపోతున్నాడన్న" కొందరి అభిప్రాయం సరైంది కాదని, జీ. వి. కే ప్రయివేట్ భాగస్వామిగా ప్రవేశించిన కొత్తలో సంస్థకు సంబంధించిన కొందరు వ్యక్తుల అనవసర జోక్యం తనను ఇబ్బందికి గురిచేసినప్పటికీ, క్రమేపీ అది తగ్గిందని అంటారు వెంకట్.

జర్మనీకి చెందిన బహుళజాతి సంస్థలో నిర్వహిస్తున్న పదవికి రాజీనామాచేసిన వెంకట్ కు 31, 2005 న సింగపూరులో వీడ్కోలు ఏర్పాటు చేశారు సహచరులు. ఏప్రిల్ 2, 2005 న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంటున్నందున, ఆ రోజు కల్లా హైదరాబాద్ చేరుకోవాల్సిందిగా వెంకట్ ను రామలింగ రాజు కోరారు. వీడ్కోలయితే ఇచ్చారు గాని, ఏప్రిల్ 15, 2005 వరకు బాధ్యతలు నిర్వహించాల్సిందిగా సంస్థ యాజమాన్యం కోరడంతో, హైదరాబాద్ రావడంలో ఇబ్బంది వున్నా వెంటనే బయల్దేరి మొదటి తేదీ కల్లా వచ్చారు. దాదాపు ఇక ఆ రోజునుంచే అనధికారికంగా ఇ.ఎం.ఆర్.ఐ బరువు-బాధ్యతలు వెంకట్ కు అప్పగించారు రాజు. సత్యం టెక్నాలజీ కేంద్రంలో అప్పటికే ఇ.ఎం.ఆర్.ఐ లో సీనియర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న అనిల్ జంపాల, వై.ఎన్.ఎస్. కిశోర్, వారణాసి సుధాకర్ ప్రభృతులను వెంకట్ కు పరిచయం చేశారు రాజు. ఆయన సంస్థ కొత్త కార్య నిర్వహణాధికారి అని కూడా చెప్పారు. మర్నాడు, ఏప్రిల్ 2, 2005 న, (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సమక్షంలో, మొదటి ఎంఓయు పై ప్రభుత్వం పక్షాన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమీషనర్ ఆసుతోష్ మిశ్రా-ఇ.ఎం.ఆర్.ఐ పక్షాన వారణాసి సుధాకర్ సంతకాలు చేశారు. రామలింగ రాజు తన సమీప బంధువులను, కొందరు స్నేహితులను ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. కాబోయే సిఇఓ గా వెంకట్ ను ముఖ్యమంత్రికి రాజు పరిచయం చేయగానే, "మన రాష్ట్రానికి ఇలాంటి తరహా సేవలందించడానికి మీ లాంటి వాళ్లు ఎందరో రావాలి" అని ఆప్యాయంగా అన్నారని వెంకట్ ఎప్పుడూ గుర్తుచేసుకుంటారు. తన జీవితంలో కలిసిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారని కూడా అంటాడాయన. ఆ తర్వాత ఆగస్ట్ 15, 2005 న లాంఛనప్రాయంగా అంబులెన్సులను హైదరాబాద్ లో ప్రారంభించేంతవరకు ముఖ్యమంత్రిని కలవలేదని, అప్పటి నుంచి ఎన్నో పర్యాయాలు కలవడం జరిగిందని, ప్రతి కలయికలోను "అత్యవసర సహాయ సేవల కార్యక్రమం సామాన్యుడికి ఎంతగా తోడ్పడుతుందనే" విషయం గురించే ప్రస్తావించే వాడని, మాటల్లోను-చేతల్లోను త్రి కరణ శుద్ధిగా కార్యక్రమం అమలుకు ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు ఆయన తీసుకున్నారని కూడా అంటారు వెంకట్. ఎంఓయు పై సంతకం చేసిన నాడే, ఆగస్ట్ 15, 2005 న సేవలు ఆరంబించుతామని ముఖ్యమంత్రికి వాగ్దానం చేశారు రాజు. ఆ దిశగా కార్యాచరణ పథకాన్ని రూపొందించమని కోరారు వెంకట్ ను.

వెంకట్ ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారిగా ఏప్రిల్ 15, 2005 చేరడానికి పది రోజుల ముందర, ఒక సారి హైదరాబాద్ వచ్చి, ఆగస్ట్ 15, 2005 న లాంఛనప్రాయంగా అంబులెన్సులను ప్రారంభించడానికి, అవసరమైన కనీస సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టారు. ఉద్యోగంలో చేరిన మరుక్షణం నుంచే, చైర్మన్ రాజు-సిఇఓ వెంకట్ ల మధ్య ముఖాముఖి సమావేశాలు గాని, సంస్థకు సంబంధమున్న ఇతరులతో కూడిన సమావేశాలు గాని క్రమం తప్పకుండా జరిగేవి. వాస్తవానికి ఆ తరహా సమావేశాలు, సత్యం కుంభకోణం వెలుగులోకి రావడానికి పక్షం రోజుల క్రితం వరకు కొనసాగాయనే అనాలి. అయితే, ఏ సమావేశంలోను, నిధుల ప్రస్తావన "స్పష్టంగా" వచ్చేది కాదు. అంబులెన్సులు ఎన్ని వుండబోతున్నాయన్న విషయంలోను అసందిగ్ధత వుండేది. ఎంత సేపు "ఉత్తర ధృవం" (నార్త్ స్టార్) గురించి, ఆరు "పి" లు-ఐదు "ఆర్" ల గురించి, అంతర్జాతీయ ప్రమాణాల గురించి-విధానాల గురించి, భారత దేశంలోని ఇతర ప్రాంతాలలో సంబంధిత సేవల అమలు-ఆచరణల గురించి మాట్లాడుతుండేవారు రాజు. "ధృవ తార"-నార్త్ స్టార్ (North Star), సిక్స్ పి-ఫైవ్ ఆర్ (Six "P" s and Five "R" s) ల గురించి వివరంగా మరో సందర్భంలో తెలుసుకుందాం. వాస్తవానికి రాజుగారు ప్రారంభించి ప్రపంచంలోనే అగ్రగామి కంప్యూటర్ సంస్థల సరసన నిలిపిన "సత్యం కంప్యూటర్స్" నిర్వహణా విధానం "సత్యం పంథా" (Satyam Way) అనే పేరుతో పేర్కొనేవారు. ఈ అంశాలలో "నిష్ణాతుడు", అత్యవసర సహాయ సేవల ఆలోచన చేసినప్పుడు రాజు గారికి తన వంతు సూచనలు-సలహాలు ఇచ్చిన డాక్టర్ బాలాజి దగ్గర, వాటిని గురించి క్షుణ్ణంగా తెలుసుకోమని వెంకట్ కు చెప్పారు రాజు. సత్యం కంప్యూటర్స్ సంస్థ మాదిరిగానే, ఇ.ఎం.ఆర్.ఐ లో కూడా ఆ పంథానే అనుసరించి, సహాయ సేవల నిర్వహణ-అమలు విషయంలో ముందుకు సాగేవారు యాజమాన్య-ఇతర సిబ్బంది.

అప్పట్లో, చైర్మన్ సమీక్షా సమావేశాల్లో, వెంకట్ తో పాటు తప్పనిసరిగా, డాక్టర్ అనిల్ జంపాల, వై ఎన్ ఎస్ కిశోర్, వారణాసి సుధాకర్, డాక్టర్ ఎ పి రంగారావు, శ్రీనివాసరావు ప్రభృతులు హాజరయ్యేవారు. ఆఫీస్ కార్యకలాపాలన్నీ జూబ్లీ హిల్స్ కార్యాలయం నుంచే జరిగేవి. జులై 29, 2005 న ప్రస్తుతం వుంటున్న మేడ్చల్ రోడ్ లోని కార్యాలయంలోకి మారారు. సమావేశాలు సాధారణంగా ఉదయం తొమ్మిది గంటలకు మొదలై, మూడు గంటల పాటు జరిగేవి. డాక్టర్ అనిల్ జంపాల నిస్వార్థంగా సంస్థ పురోగతికి కృషి చేసే తరహా వ్యక్తని, అపారమైన నిబద్ధతతో పని చేసేవాడని, అనుభవజ్ఞుడని, ఎటువంటి పరిస్థితుల్లోను ఎవరినీ కించపరిచే స్వభావం లేనివాడని అనిల్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వెంకట్ అంటుంటారు. ఏ పనైనా, ఏదో విధంగా సాధించగల నేర్పరితనం కిశోర్ కుందని కూడా అనేవారు వెంకట్. వారణాసి సుధాకర్ పట్ల వ్యక్తిగతంగా గౌరవం వ్యక్త పరిచేవారు వెంకట్. సుధాకర్ ఏర్పాటు చేసిన "టెక్నాలజీ టీం"-దాని లీడర్ రంగనాథం గురించి, ఆ బృందంలోని శ్రీకాంత్ - మరో ముప్పైమంది గురించి, వారు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ను నెలకొల్పిన తీరు గురించి, అత్యంత గర్వంగా-గౌరవంగా ప్రస్తావించేవారు వెంకట్. అనుకున్న ఆగస్ట్ 15, 2005 న లాంఛనప్రాయంగా అంబులెన్సులను ప్రారంభించడానికి టెక్నాలజీ టీమ్ తో పాటు అహర్నిశలు కృషి చేసిన మరికొందరిని ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే వుంటారు వెంకట్. మెడికల్ ప్రోటోకాల్స్, ఎమర్జెన్సీల గుర్తింపు విధానం, గ్రామీణ ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన విధానం లాంటి విషయాలను డాక్టర్ రంగారావు చూసేవారు. ప్రాజెక్ట్ ప్రణాళిక, సిబ్బంది నియామకం, అంబులెన్స్ డిజైన్, 108 నంబర్ కేటాయింపు లాంటి విషయాలను కిశోర్ చూసుకునేవారు. ఎంఓయు కు సంబంధించిన అంశాలు, ప్రభుత్వ సంబంధాలు, అంతర్జాతీయ సంబంధాలు-విధానాలు అనిల్ పర్యవేక్షణలో జరిగేవి. ఇ.ఎం.ఆర్.ఐ-వివిధ అంతర్జాతీయ సంస్థల మధ్య కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలన్నీ అనిల్ చొరవతోనే జరిగాయి. డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ-ప్రయివేట్ ఆసుపత్రులతో ఒప్పందాలను కుదుర్చుకోవడానికి కృషి చేసేవారు. ఉన్న కొద్ది మంది సిబ్బందిలో స్థైర్యాన్ని-అత్యవసర సేవలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించే దిశగా వెంకట్ వారికి అధ్యయన తరగతులు నిర్వహించేవారు. ఉదాహరణకు ఒకసారి ఆయన అంబులెన్సుకు సంబంధించిన అధ్యయన తరగతి నిర్వహించారు. 108- అంబులెన్సులో "స్ట్రెచ్చర్" విషయంలో రాజీ మార్గానికి తావులేదన్న విషయం, ఇతర అంబులెన్సులకు-108 అంబులెన్సులకు తేడా వుండే పరికరాల ఆవశ్యకత అంశం, "కుయ్-కుయ్" ధ్వని అమర్చడం లాంటి వాటిపై అవగాహన కలిగించారు వెంకట్. సత్యం సంస్థలో పనిచేసే డిజైన్ బృందం 108-అంబులెన్స్ ను డిజైన్ చేశారు.

ఆగస్ట్ 15, 2005 న లాంఛనప్రాయంగా అంబులెన్సులను హైదరాబాద్ లో ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రంలోని మరికొన్ని ప్రధాన కేంద్రాలలో ప్రారంభించేందుకు ఏప్రిల్-ఆగస్ట్ నెలల మధ్య, డాక్టర్ రంగారావు తోడ్పాటుతో-ఆయన తోడుండగా, పలువురు ప్రముఖులను కలిశారు వెంకట్. అనిల్ జంపాల కూడా వీరితో పాటే వుండేవారు. చిత్తూరు కలెక్టర్ రావత్ ను, కృష్ణా కలెక్టర్ నవీన్ మిట్టల్ ను, వైజాగ్ కలెక్టర్ ప్రవీణ్ ప్రకాశ్ ను, వరంగల్ కలెక్టర్ బెన్హర్ దత్ ఎక్కాను కలిశారు. విజయవాడ పోలీస్ కమీషనర్ ఉమేష్ ను, వైజాగ్ కమీషనర్ కౌముదిని ని, చిత్తూరు- వరంగల్ ఎస్పీలను కూడా కలిశారు. వెళ్ళిన ప్రతి చోట, డాక్టర్ రంగారావు స్థానిక ప్రభుత్వ-ప్రయివేట్ డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసేవారు. రాజధాని హైదరాబాద్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందాను, డిజిపి స్వరణ్‌జిత్ సేన్ ను, సీనియర్ పోలీస్ అధికారులైన ఏ కే ఖాన్ ను-మహేందర్ రెడ్డి ని-దినేష్ రెడ్డిని, డిజాస్ట్రర్ మేనేజ్‌మెంట్ శాఖ కార్యదర్శి-కమీషనర్ అశుతోశ్ మిశ్రాను, ఆరోగ్య-వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి ఐ వి సుబ్బారావు ను, కుటుంబ నియంత్రణ కమీషనర్ సీ బి ఎస్ వెంకటరమణ ను కలిశారు. భవిష్యత్ లో వీరు కలిసిన ప్రతి అధికారి, సంస్థ ఎదుగలకు ఎంతగానో తోడ్పడ్డారు. వెంకట్ గారి ఇ.ఎం.ఆర్.ఐ సిబ్బంది అప్పట్లో వేళ్లమీద లెక్కించ తగినంత మంది మాత్రమే వుండేవారు. వారిలో డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, జ్యోతి, స్వరూప్, శాస్త్రి, గురు రాజ్ లు ప్రధానంగా చెప్పుకోవాల్సిన వారు. ఢిల్లీ స్థాయిలో కలిసిన వారుకూడా వున్నారు. (దివంగత) ముఖ్యమంత్రి లేఖ సహాయంతో 108 టోల్ ఫ్రీ నంబర్ కొరకు రాష్ట్ర కాడర్ ఐఏఎస్ అధికారి శ్రీధర శర్మను, ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి దయానిధి మారన్ ను కూడా కలిశారు.

ఇదిలా వుండగా, అనుకున్న నాడు అంబులెన్సు సేవలను ఆరంభించాలంటే, అవి తయారు కావాలి. అంబులెన్స్ డిజైన్ లో, వైద్య పరమైన జాగ్రత్తలన్నీ డాక్టర్ రంగారావు-ఆయన సహచర వైద్యుల బృందం తీసుకుంది. తొలుత ప్రవేశపెట్ట దల్చిన 30 ఎ ఎల్ ఎస్ (అడ్వాన్స్ లైఫ్ సపోర్టింగ్) తరహా అంబులెన్సులై వుండాలని డాక్టర్ రంగారావు సూచన మేరకు, వెంకట్ చేసిన ప్రతిపాదనకు చైర్మన్ రాజు అంగీకరించారు. మరో తరహా అంబులెన్సులను బి ఎల్ ఎస్ (బేసిక్ లైఫ్ సపోర్టింగ్) అంబులెన్సులంటారు. వీటికి సంబంధించిన వివరాలు మరో సందర్భంలో తెలుసుకుందాం. రెండింటికి తేడా వుంది. ఎ ఎల్ ఎస్ తరహాలో ఏ ఇ డి, వెంటిలేటర్ పరికరాలు అదనంగా అమర్చుతారు. వీటి ఉపయోగం ప్రతి ఎమర్జెన్సీలోను వుండక పోయినప్పటికీ, వాటి అత్యవసర ప్రాధాన్యత దృష్ట్యా అవి అమర్చడం అభిలషణీయమని నిపుణుల అభిప్రాయం. కాకపోతే ఈ రెండు పరికరాల విలువ సుమారు ఆరు లక్షల రూపాయలు కావడంతో, ఎ ఎల్ ఎస్ అంబులెన్సు ధర రు. 21.5 లక్షలు కాగా, బి ఎల్ ఎస్ అంబులెన్స్ ధర రు. 15.5 లక్షలే అయిందప్పుడు. మామూలు బజాజ్ టెంపో ట్రావెలర్ వాహనం ఆరున్నర లక్షల బేసిక్ ధరకు కొనుగోలు చేసి, తొమ్మిది లక్షల రూపాయలు ఫాబ్రికేషన్-వైద్య పరికరాల కొరకు వ్యయం చేసి, రు. 15.5 లక్షలకు అంబులెన్సును రూపొందించారు మొదట్లో. నాణ్యత పరంగా ఏ మాత్రం రాజీ పడకుండా, దరిమిలా, అదే బి ఎల్ ఎస్ అంబులెన్స్ ధరను రు. 9.75 లక్షలకు స్థిర పరిచింది ఇ.ఎం.ఆర్.ఐ. ఒకప్పుడు అంబులెన్స్ అంటే, ఇంగ్లీషు అక్షరాలను తిప్పి వాహనం ముందర రాస్తే సరిపోయేది. ఎప్పుడైతే 108-అంబులెన్స్ డిజైన్ మార్కెట్లోకి వచ్చిందో, ఇక అప్పటినుంచి, ఇంచుమించుగా అందరూ, ఆ మోడల్ నే అనుకరిస్తున్నారు. అంబులెన్స్ సేవలను ఆరంభించడానికి పక్షం రోజుల ముందర, జులై 29, 2005 న మేడ్చల్ రోడ్ లో వున్న ఒకనాటి సత్యం పబ్లిక్ స్కూల్ ఆవరణలోకి ఇ.ఎం.ఆర్.ఐ ప్రధాన కార్యాలయం మారింది. మరో నెల రోజులకు, ఆగస్ట్ 29, 2005 న నూతన కార్యాలయ భవనాలకు భూమి పూజ జరగడం, ఏడు నెలల రికార్డ్ సమయంలో సమస్త హంగులతో తయారైన భవనంలోకి మార్చ్ 31, 2006 న మారడం జరిగింది.

ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి దయానిధి మారన్, గౌరవ అతిథిగా (దివంగత) ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి, కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు అప్పటి ఆరోగ్య-ఆర్థిక శాఖల మంత్రి (ఆ తర్వాత ముఖ్యమంత్రి) రోశయ్య వచ్చారు. ప్రధాన కార్యదర్శి మోహన్ కందా కూడా వచ్చారు. హైదరాబాద్ గ్రాండ్ కాకతీయ హోటల్ లో భారీ సంఖ్యలో హాజరయిన ఆహుతుల సమక్షంలో, ఆగస్ట్ 15, 2005 న, ఆద్య తన భవిష్యత్ లో, లక్షలాది ప్రాణాలను కాపాడనున్న అత్యవసర ఆరోగ్య, వైద్య-పోలీసు-అగ్నిమాపక దళ సహాయ సేవలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కేవలం పదిహేను అంబులెన్సులతో ఆరంభమయిన ఆ సేవలు, అచిర కాలంలోనే, "ఇంతై-ఇంతితై-వటుడింతై" అన్న చందాన దేశంలోని పది రాష్ట్రాలలో సుమారు మూడు వేలకు పైగా అంబులెన్సులను ప్రవేశ పెట్టడానికి దారితీసింది.