Tuesday, February 26, 2013

2013-2014 రైల్వే బడ్జెట్ పై టీవీ 5 లో జరిగిన చర్చలో పాల్గొన్న జ్వాలానరసింహారావు

Please click here for a debate on Railway Budget 2013-2014: Jwala



Jwala Narasimha Rao Participating in a debate on Railway Budget 2013-2014 on TV 5: http://www.youtube.com/watch?feature=player_detailpage&v=v9aWDJdluW4

Jwala Participating in the debate on Railway Budget 2013-2014:http://www.youtube.com/watch?feature=player_detailpage&v=hN8a-2glL-Y

Friday, February 22, 2013

హైదరాబాద్ బాంబ్ పేలుళ్ల సంఘటనలో ఎవరు తప్పు చేశారు?: వనం జ్వాలా నరసింహారావు


హైదరాబాద్ బాంబ్ పేలుళ్ల సంఘటనలో 
ఎవరు తప్పు చేశారు?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (24-02-2013)

          రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందంటూ కేంద్ర నిఘా సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ముందుగానే హెచ్చరించామని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే పదే-పదే ఎందుకు చెప్తున్నారు? గురువారం నాడు జంటపేలుళ్ళు జరిగిన దిల్‌షుక్‌ నగర్‌ ప్రాంతాన్ని,  హుటాహుటిన ఢిల్లీ నుంచి వచ్చిన షిండే ఆ మర్నాడు సందర్శించారు. ఆ తరువాత ప్రయివేట్-ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌, ముంబాయి, గోవాలతో పాటు మరికొన్ని ప్రాంతాలలో భారీ ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు కేంద్ర నిఘా విభాగానికి పక్కా సమాచారం అందిందని, తమకందిన సమాచారం ఆధారంగా, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వాలను-పోలీసులను హెచ్చరించామని చెప్పారు. గురువారం ఉదయం కూడా హెచ్చరికలు జారీ చేశామని ఆయన చెప్పారు. కాకపోతే, పేలుళ్లు జరిగే అవకాశం మాత్రమే ఉందంటూ తాము హెచ్చరించాం కాని, ఫలానా ప్రాంతాలలో జరిగే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పలేదని ఆయన అన్నారు. కేంద్రం హెచ్చరికలు రాష్ట్ర పోలీసులు పట్టించుకోలేదన్న భావన ఆయన మాటల్లో వ్యక్తమైంది. రాష్ట్ర పోలీసుల వైఫల్యంపై కూడా ఆయన ఆచి-తూచి స్పందించడమే కాకుండా, ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం చేసే విచారణలో బయటపడుతుందని అన్నారు. ఐతే పార్లమెంట్ ఉభయ సభలలో షిండే ప్రకటన చేస్తూ, పరోక్షంగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని-పోలీసులను తప్పు బట్టారు.

          పార్లమెంట్ ఉభయ సభలు హైదరాబాద్ బాంబ్ పేలుళ్ల విషయంలో పలుమార్లు వాయిదా పడ్డాయి. హైదరాబాద్‌లోని ఘటన స్థలాన్ని, ఆసుపత్రులను ఉదయాన్నే సందర్శించిన హోంశాఖ మంత్రి షిండే, మధ్యాహ్నానికల్లా ఢిల్లీకి చేరుకుని, రెండు గంటల ప్రాంతంలో పార్లమెంటుకు హాజరయ్యారు. ఉభయ సభల్లో ప్రకటన చేశారు. నిఘా సంస్థల సమాచారం విషయం, ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకున్న విషయం సభ్యులకు తెలియచేశారాయన. పనిలో పనిగా మరికొన్ని మాటలు చెప్పారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో మరింత దృఢ నిశ్చయంతో మరిన్ని కఠిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. 16 మంది మరణానికి, 117 మంది గాయపడటానికి కారణమైన హైదరాబాద్ పేలుళ్ల దోషులను పట్టుకునేందుకు సాధ్యమైన అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారాలు లభించాయన్నారు. అజ్మల్ కసబ్, అఫ్జల్ గురు ఉరితీతల నేపథ్యంలో పాకిస్థాన్ కేంద్రంగా గల ఉగ్రవాద గ్రూపులు దాడులకు పాల్పడవచ్చని తమకు ముందస్తు సమాచారం వుందన్నారు. తమ హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా తీసుకోలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన నగరమైన హైదరాబాద్‌లో ఉగ్రవాద గ్రూపులు దాడి చేయవచ్చంటూ ఫిబ్రవరి 16, 19, 20 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాం అని కూడా హోంమంత్రి చెప్పారు. ఇంటెలిజెన్స్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ తేలికగా తీసుకుంటుంటారు అని పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు బడుతూ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోందని ముగించారు తన ప్రకటనను.

          ఇంతకీ తప్పెవరిది? ఒప్పెవరిది? ఆరేడేళ్లగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోక పోవడానికి మన పోలీసులను అభినందించాలా? నిఘా సంస్థల సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి-పోలీసులకు కేంద్రం చేరవేసినా, బాంబు పేలుళ్లను నిరోధించడంలో విఫలమై నందుకు  వారిని అభిశంసించాలా? ఏదేమైనా అమాయకుల ప్రాణాలు పోయాయి. మరెందరో క్షతగాత్రులయ్యారు. మామూలుగా, ఎప్పటి లాగానే, ప్రభుత్వం సహాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఆరేడు లక్షల రూపాయలు, గాయ పడినవారికి లక్ష రూపాయల వరకు, నష్ట పరిహారం ప్రకటించడంతో తన బాధ్యతను కొంతవరకు తీర్చుకున్నట్లు ప్రభుత్వం భావించింది. దానికి తోడు ఆసుపత్రులలో చికిత్స కయ్యే వ్యయమంతా భరిస్తామని కూడా ప్రభుత్వం చెపుతోంది. కాకపోతే, గతంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు, ఇలానే ప్రకటించిన నష్టపరిహారం ఇంతవరకూ ఎవరికీ అందలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఐతే, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారానికి అదనంగా ప్రధాన మంత్రి కూడా కొంత ఇస్తామని పార్లమెంటులో షిండే ప్రకటన చేయడం కొస మెరుపు.
            ఇలాంటి సందర్భాలలో ఎవరైనా కాని, ముఖ్యంగా, బాధ్యతాయుతమైన వ్యక్తులు ఆచి-తూచి మాట్లాడడం మంచిది. ఎవరికి తోచింది వారు మాట్లాడితే, ఘటనలో గాయపడ్డవారు, మృతుల కుటుంబీకులు ఆవేదనకు గురయ్యే ప్రమాదముంది. ఘటన జరిగీ-జరగక ముందే, ఫలానా వారు దీనికి బాధ్యులంటూ అధికార వర్గాలు తమ దగ్గర సమాచారం వుందని అంటున్నారు. అంత తొందరగా సమాచారం సంపాదించగలిగిన వారు, పేలుళ్లను నిరోధించడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాల్సిన బాధ్యత వుంది. మీడియా కూడా తక్కువేమీ తినలేదు. ఫలానా వ్యక్తులు దీనికి సూత్రధారులంటూ, వారి ఫొటోలతో సహా బయట పెట్తున్నారు. ఒక విధంగా, అదే నిజమైతే, దర్యాప్తుకు విఘాతం కలగవచ్చని వారు ఆలోచించడం లేదు. ఫలానా వ్యక్తి కొన్నాళ్ల క్రితం రెక్కీ నిర్వహించారని తమ దగ్గర సమాచారం వున్నట్లు కొన్ని పత్రికలలో కధనాలొచ్చాయి. అలాంటి సమాచారం ఇప్పుడే వచ్చిందా? ఇంతకు ముందే వారి దగ్గర వుందా? వుంటే ఎందుకు బయట పెట్ట లేదు? తప్పొప్పులను ఎంచడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం కాదు కాని, తప్పొప్పుల బాధ్యత పంచుకోవడంలో బాధ్యతాయుతమైన అధికారులు తప్పటడుగు వేస్తున్నారని చెప్పక తప్పదు. ఆ దిశగా కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు.

            దిల్ షుక్ నగర్ సాయిబాబా గుడి ప్రాంతంలో లోగడ ఒక సారి ఇలాంటి దుర్ఘటన జరిగింది. మళ్లీ జరిగే అవకాశాలను పోలీసులు ఎప్పుడైనా నిశితంగా పరిశీలించారా? సర్వసాధారణంగా రద్దీ ప్రాంతాలైన దిల్ షుక్ నగర్ లాంటి ప్రదేశాల్లోనే ఇలాంటి సంఘటనలు జరిగే వీలుంది కనుక, కేంద్ర ప్రభుత్వ నిఘా విభాగం తమకు హెచ్చరికలు జారీ చేసిన పిదప, ఇలాంటి స్థలాలలో మరి కొన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేశారా? ఉదాహరణకు, దుండగులు సీసీ కెమేరాల తీగలను కత్తిరించి అవి పని చేయకుండా చేశారని వార్తలొచ్చాయి. అదే నిజమైతే, అవి పని చేయకపోవడమనే విషయం పోలీసులకు ఎందుకు తెలియదు? తెలుసుకోలేక పోయారా? అసలు, సీసీ కెమేరాల పనిని పర్యవేక్షించే అధికారి బాధ్యతలేంటి? మహా వుంటే హైదరాబాద్ మొత్తంలో ఒక వంద వరకు అలాంటివి వుండవచ్చు. వాటిలోంచి నాలుగైదు రోజులుగా ఫుటేజీ రాకపోతే, వాటిని పర్యవేక్షిస్తున్న అధికారికి ఆ విషయం తెలుసుకునే మార్గం లేదా? పోనీ, ఇలాంటి సౌకర్యాన్ని వికేంద్రీకరించి స్థానిక పోలీసు స్టేషన్ పరిధిలోకి తెచ్చి వుండవచ్చు కదా? సరే ఇదంతా జరగక ముందు జాగ్రత్త. అందులో విఫలమైతే, సంఘటన జరిగిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నా సక్రమంగా తీసుకున్నారా? అంటే, అదీ సరిగ్గా లేదు.

          వార్తా పత్రికల్లో వచ్చిన కధనాల ప్రకారం, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆ ప్రాంతం ఏ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందన్న మీమాంస వచ్చిందట. అదే నిజమైతే, అంతకన్నా ఘోరం ఇంకోటి లేదు. జరిగిందొక దుర్ఘటన. ఉగ్రవాద చర్య. దానికి గురైనవారు అన్ని ప్రాంతాల వారున్నారు. ముందు సహాయక చర్యలు ప్రారంభం కావాలి. అది అన్నింటికన్నా ప్రాముఖ్యత వున్న అంశం. అంతే కాని, ఏ పోలీసు స్టేషన్ పరిధిలోకి ఆ ప్రాంతం వస్తుందన్న విషయం అంత ముఖ్యమైంది కానే కాదు. అసలింతకీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ నిమిషంలో ఏం చేయాలి అన్న "బ్లూ ప్రింట్" అంటూ ఒకటే మన్నా వుందా? ఉదాహరణకు, ట్రాఫిక్ నియంత్రణే తీసుకుందాం. దిల్ షుక్ నగర్ జాతీయ రహదారిలో ఒక ప్రధాన కూడలి. నిత్యం-ఇరవై నాలుగు గంటలూ, వందలాది వాహనాలు అటు వైపునుంచి విజయవాడ దిక్కుగా, హైదరాబాద్ దిక్కుగా పోతుంటాయి. వీటన్నిటినీ తక్షణమే ఎలా దారి మళ్లించాలి అన్న విషయంలో ఏదన్నా ఒక బ్లూ ప్రింట్ ట్రాఫిక్ పోలీసుల దగ్గర వుందా? వుంటే దానిని ఎందుకు సరిగ్గా అమలు చేయలేదు. ఎవరి పని వారు సక్రమంగా అలాంటి సమయాల్లో చేయాల్సిన బాధ్యత అందరి పైనా వుంటుంది. అసలు వాళ్లేమీ చేయలేదని ఆరోపించడం లేదు కాని, చేయాల్సినంత వేగంగా చేశారా? లేదా? అనేదే ప్రశ్న!

          ఇదిలా వుంటే కొందరు బాధ్యతాయుతమైన వ్యక్తుల ప్రకటనలు అతి జుగుప్సాకరంగా వున్నాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వీరిలో ప్రముఖుడు. ఈ దారుణమైన సంఘటనను అత్యంత స్వల్పమైన విషయంగా పోల్చి చూపే ప్రయత్నం చేశారాయన. అలా మాట్లాడడం వలన దెబ్బ తిన్న వారి మనోభావాలు మరింతగా దెబ్బ తింటాయన్న ఆలోచన కూడా ఆయనకు రాకపోవడం శోచనీయం. అలానే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ప్రకటన కూడా. ఇలాంటి సంఘటనలు జమ్ము-కాశ్మీర్‌లో నిత్యం పరిపాటని, తాను ముఖ్యమంత్రిగా పని చేస్తున్నప్పుడు ఎన్నో చూశానని ఆయన అనడం హాస్యాస్పదం. చారిత్రకంగా-భౌగోళికంగా జమ్మూ-కాశ్మీర్ పరిస్థితి వేరు. ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి వేరు. అక్కడ తీవ్రవాదం వేళ్లూనుకుని పోయింది. దానిని అంతమొందించడానికి ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తుంది. ఇక్కడ చోటు చేసుకున్న సంఘటన దాదాపు ఏడేళ్ల తరువాత మొదటిది. దీనికి-దానికీ లంకె పెట్టి పోల్చి చూపడం ఆజాద్ లాంటి బాధ్యతాయుతమైన పదవుల్లో వున్న వారు చేయాల్సిన పని కాదు.

          ఏదేమైనా, ఇది తప్పొప్పులు ఎంచుకునే సమయం కాదు. షిండే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి వుండవచ్చు. కాని దానిని ఆయన పదే పదే ఉచ్చరించడం భావ్యం కాదు. అలానే రాష్ట్ర ప్రభుత్వం తన తప్పును కప్పి పుచ్చుకోవడమూ సమంజసం కాదు. తమ బాధ్యతలను తాము గుర్తుంచుకోవడం బాధ్యతాయుతమైన స్థానాల్లో వున్న ప్రతి వారికీ మంచిది!

చీకటి గురువారం అను హైదరాబాద్ బాంబు పేలుళ్లు: వనం జ్వాలా నరసింహారావు

Please click here for a video telecast on DD Saptagiri today on : చీకటి గురువారం అను హైదరాబాద్ బాంబు పేలుళ్లు
వనం జ్వాలా నరసింహారావు

http://www.youtube.com/watch?feature=player_embedded&v=8m0aUCoK1iQ

Jwala

Thursday, February 21, 2013

సీమంతం-ప్రసవం-బారసాల-సత్యనారాయణ వ్రతం: వనం జ్వాలా నరసింహారావు


సీమంతం-ప్రసవం
బారసాల-సత్యనారాయణ వ్రతం
వనం జ్వాలా నరసింహారావు

అపురూపమైనది ఆడజన్మ.ఇంకో ప్రాణిని సృష్టించటానికి తన ప్రాణాలు పణంగా పెట్టి మాతృదేవత గా మారుతుంది స్త్రీ. అందుకే, ఆమెకు ఆ సమయంలో, కష్టం కలగకుండా ఉల్లాసంగా ఉంచుతూ, శాయశక్తులా సంతోష పెడుతుంటారు భర్త, అత్త-మామలు, తల్లి-తండ్రులు. హిందువుల ఆచారం ప్రకారం గర్భిణీ స్త్రీలకు "సీమంతం" జరిపించాలి. సాంప్రదాయం ప్రకారం,  స్త్రీ గర్భం ధరించిన తొమ్మిదో నెలలో తల్లి గారింట్లో సీమంతం జరుపుతారు. ప్రసవ సమయంలో తల్లి పక్కనుండాలని భారతదేశంలో పుట్టి-పెరిగిన వారందరూ సహజంగా అనుకుంటారు. హిందూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అది ఒక సర్వసాధారణ విషయం. గర్భిణీ స్త్రీకి తన తల్లి పక్కనుంటే అదో ధైర్యం. సీమంతం చేసే సమయంలో అందుకే గర్భిణీ స్త్రీ తల్లి తప్పకుండా కూతురు పక్కనే వుంటుంది.

ఈ సీమంతానికి గర్భిణి అత్తగారు చీర, రవిక, పూలు పండ్లు, తిను బండారాలతో సారెను పెడ్తారు. ఈ సారెను కడుపు సారెఅని కూడా అంటారు. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది సీమంతం. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె-భర్త పాటించవలసిన నియమాలు కూడా ఈ సంస్కారంలో భాగమే. గర్భవతికి సీమంతం చేసే రోజు సాయంత్రం జడను పూలతో కుట్టి అలంకరించి కుర్చీలో కూర్చొబెట్టి ఆశీర్వదింపజేస్తారు. సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం. సీమంతం నాడు ఉదయమే గర్భిణికి హారతి పట్టి, మంగళ స్నానం చేయించాలి. సాయంకాలం పట్టుచీర ధరింపచేసి కుర్చీలో కూర్చోపెట్టి, తల్లి  తాను చెచ్చిన తెల్ల పట్టుచీరను బొట్టుపెట్టి కూతురు చేతికిస్తుంది. అది కట్టు కొచ్చిన తర్వాత, ఆ చీరె పమిటను ఒడిలా చేసి, అందులో మొదలు చలివిడిని (బియ్యపు పిండితో చేసిన తీపి పదార్ధం) మూడు వుండలుగా చేసి తల్లి పెట్టాలి. తర్వాత అదే ఒడిలో, తొమ్మిదేసి చొప్పున, ఐదు రకాల తీపి పదార్ధాలను (ఉదాహరణకు: అరిసెలు, లడ్డులు, మైసూరు పాక్, పాలకోవా, బాదూషా), మూడు రకాల పండ్లను (ఉదాహరణకు: బత్తాయి, ఏపిల్, కమలా ఫలాలు), కొన్ని తమలపాకులు, పోకచెక్కలు (తాంబూలం) పెట్టి హారతిస్తారు. బంగారు ఆభరణాలను  (గాజులు) చేతికి తొడుగుతారు. హారతిచ్చిన తర్వాత ఆహ్వానిత బంధు-మిత్రులు తమకు తోచిన విధంగా కానుకలను గర్భిణి ఒడిలో వుంచి బహుమతులివ్వడం ఆనవాయితి. సాయంకాలం పేరంటంలో ఆమెకు రక రకాల గాజులు తొడిగి, వచ్చిన ముత్తైదువులకు ఆమెతో గాజులిప్పించుతారు. కొన్ని ప్రాంతాలలో ఇదే సీమంతాన్ని " గోద్ భరై" అని కూడా పిలుస్తారు. వేడుక మాత్రం అంతటా ఒకటే.

సీమంతం వేడుక జరిపిన తరువాత కొద్ది రోజులకే, ఎదురు చూస్తున్న రోజు రానే వస్తుంది. కాకపోతే కొంత ఆలస్యంగా కూడా రావచ్చు. ప్రసవం అయి, కూతురో, కొడుకో పుట్టడం జరుగుతుంది. ప్రసవం ఐన పదకొండో రోజున, శాస్త్రోక్తంగా చేయాల్సిన పనులు కొన్ని వుంటాయి. ఉదయాన్నే ఇంటిల్లిపాదీ పురిటి స్నానం చేయాలి. ముఖ్యంగా తల్లి తల స్నానం చేయాలి. అంతకంటే మొదలే, బాలింత తల్లి గారు బేబీకి స్నానం చేయించి పీట మీద తడితోనే పడుకోబెట్టాలి. నీళ్ల తడి వుండగానే పాపాయి బొడ్డు మీద బంగారపు గాజునుంచి, నీళ్లు చల్లి చేతుల్లోకి తీసుకుని తుడవాలి. ఆ తర్వాత పాపాయికి సరైన దుస్తులు ధరింపచేయాలి. దుస్తులేసిన తర్వాత తిరిగి ఆ బంగారపు గాజును మరో మారు పాపాయి మీదుంచాలి. ఈ తతంగం అంతా ముగిసాక (తల్లికి) నలుగు స్నానం చేయించి, బట్టలు మార్చుకున్న తర్వాత, పాపాయి దగ్గరకు తీసుకొస్తారు తల్లి-తండ్రులు. ఊయలలో నిద్ర పుచ్చే ముందర, పాపాయికి కొత్త దుస్తులేసి, తల్లితో బొట్టు పెట్టించి, అమ్మమ్మ మొలతాడు కడుతుంది. తల్లి మంచం మీద కాసేపుంచాలి పాపాయిని. మంచం నాలుగు కోళ్ల వైపున, కాళ్ల వైపున పొంగలి పెట్టాలి. వంశాభి వృద్ధి జరగాలని దీవించి, పాపాయిని ఎత్తుకెళ్లి ఊయలలో పడుకోబెట్టాలి. ఇవన్నీ శాస్త్రోక్తంగా చేయాలి. పురుడు అయిపోయింది కాబట్టి పసుపు నీళ్ళతో ఇల్లంతా చల్లి, శుద్ధి చేయాలి.

 ఇక ఆ తరువాత బారసాల ప్రయత్నాలు ప్రారంభించాలి. దీనిని అసలు "బాల సారె" అంటారు. అది వాడుకలోకి వచ్చే సరికి "బారసాల" అయింది. అసలు బారసాల అంటే పేరు పెట్టడం లేదా నామకరణం చేయటం అని అర్థం. ఈ వేడుకను పుట్టిన పాపాయికి (బాబు అయితే బాబుకు) పేరు పెట్టటానికి చేస్తారు. వాడుకలో వున్న పద్ధతి ప్రకారం, పుట్టిన 21వ రోజు నుండి 27 వ రోజు లోపల చేస్తారు. ఈ రోజులలో 21, 23, 25, 27 రోజులలో చాలా మంది చేస్తారు. అలానే బేసి సంఖ్యలు వచ్చే ఏ రోజైనా మంచిరోజు చూసుకొని చేసుకోవచ్చు. నెలలోపల చేసుకునే వీలు లేకపోతే, మూడో నెల వచ్చిన తర్వాత చేసుకుంటారు. పూజ చేయించేందుకు తగిన బ్రాహ్మణుడిని వెతుకుతారు. బ్రాహ్మణుడి సూచన మేరకు కావాల్సిన వస్తువులను సేకరిస్తారు. బారసాల-నామకరణం-సత్యనారాయణ వ్రతానికి కావలసిన వస్తువులు: పసుపు, కుంకుమ, తమలపాకులు, పోకచెక్కలు, ఖర్జూరపు పండ్లు, అగరు వత్తులు, హారతి కర్పూరం, అరటి పండ్లు, పూలు, కొబ్బరికాయలు-ఇవి పగులగొట్టే సౌకర్యం, ఎండు కొబ్బరి చిప్పలు, కొత్త తుండు గుడ్డ, కొత్త రవికె గుడ్డ, తేనె, పెరుగు, పాలు, నెయ్యి, పంచదారల మిశ్రమమైన పంచామృతం, సత్యనారాయణ స్వామి ఫొటో, తగు మోతాదులో కేసరి ప్రసాదం, బియ్యపు రవ్వ-అందులో కలిపేందుకు పంచదార, వేలకులు, జీడి పప్పు, కిస్‌మిస్ పండ్లు, దీపారాధనకు కావాల్సిన (దూది, నూనె, అగ్గిపెట్టె) సామాగ్రి, కొబ్బరి కాయనుంచే వీలున్న వెండి-రాగి-సిల్వర్ పాత్ర (చెంబు), పావలా బిళ్లలు (సెంట్లు), రెండు-మూడు కిలోల బియ్యం.


తెలుగు వారి ప్రత్యేకత-ఆ మాటకొస్తే భారతీయులందరి ప్రత్యేకత, వారి పేరులోనే వుంటుందనాలి. అదేంటోగాని, చాలామంది విషయంలో, తెలుగు వారి-భారతీయుల పేర్లు, వారి పేరును పట్టి, కొత్తగా పరిచయమైన వారు, సర్వసాధారణంగా ఒక అవగాహనకు వచ్చే విధంగా వుంటాయి. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఆ పేరును వారు పుట్టిన 21 వ రోజున, తల్లి పక్కనుండగా, బంధు-మిత్రుల సమక్షంలో, శాస్త్రోక్తంగా జరుపుకునే ఒక వేడుకలో, తండ్రి పెడ్తాడు. పేరును ఆనవాయితీగా ఆచరిస్తున్న పద్ధతుల ప్రకారం, బారసాల జరుపుకొని, "నామకరణం" ప్రక్రియ పూర్తిచేయని తెలుగు వారు గానీ, భారతీయులు గానీ వుండరు. అదో ఆచారం-వేడుక-సరదా-సామాజిక కలయిక. పేరు వ్యక్తులను గుర్తించేందుకు ఉపయోగించే ఒక నామ వాచకము. వ్యక్తులను ప్రత్యేకంగా గుర్తించడానికి లేదా వారి పూర్వీకుల గురించి తెలుసుకోవటానికి పేరుతో పాటు ఇంటి పేరు కూడా ఉంటుంది.

బారసాల నాడు పెట్టిన పేరే ఆ మనిషి పేరులా చెలామణి అవుతుంది. తమ పేర్లు రాసుకునేటప్పుడైనా, చెప్పేటప్పుడైనా భారతీయులందరూ ఒకేవిధంగా వ్యవహరించరు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన  సంప్రదాయాన్ని పాటిస్తారు. బారసాల నాడు పెట్టిన పేరు మొదట, ఇంటి పేరు తరువాత వచ్చేలా కొన్ని ప్రాంతాల వారు, ఇంటి పేరు మొదట, తరువాత బారసాల నాడు పెట్టిన పేరు వచ్చేలా మరికొన్ని ప్రాంతాల వారు పాటిస్తారు. సాధారణంగా ఏ ప్రాంతం వారికైనా ఇంటి పేరు తరతరాలుగా మారకుండా వుండి, వారి యొక్క వంశ నామంగా వుంటుంది. తెలుగు వారు సంప్రదాయం ప్రకారం బారసాల నాడు పెట్టిన పేరు ముందర ఇంటి పేరు తగిలించకుండా తమ పేరు చెప్పుకోరు. ఈ మధ్య కాలంలో తెలుగు వారి ఇంటి పేరు సంప్రదాయం, క్రమ క్రమంగా మార్పుకు యువతరం నాంది పలుకుతుంది అనుకోవచ్చు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు వారు, "ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా..." అన్న నా నుడిని పేరు చెప్పుకునే విషయంలో కొంచెం సడలించి, "బి ఎ రోమన్ వైల్ ఇన్ రోమ్" సంప్రదాయాన్ని పాటించడం నేర్చుకున్నారు. అమెరికా దరఖాస్తు పత్రాలలో  ఫస్ట్ నేమ్ అని, మిడిల్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని, పుంఖాను పుంఖంగా ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోసారి సర్ నేమ్ ఏమిటని మరో ప్రశ్న వేస్తారు. ఈ బాధలు తప్పించుకోవడానికి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు వారందరు కూడా వారి పద్ధతినే అనుకరిస్తున్నారు. తప్పదు కదా మరి !. దేశ-కాల మాన పరిస్థితులను బట్టి మారడం మంచిదే కదా !

మంత్రోచ్ఛారణల మధ్య, పురోహితుడుగా-పూజారిగా బారసాల-నామకరణం జరిపించడానికొచ్చిన బ్రాహ్మణుడు మొదట విఘ్నేశ్వరుడి పూజ చేయిస్తాడు. విఘ్నేశ్వరుడి పూజకంటే ముందు, పురుడు అయిపోయిన వెంటనే, శాస్త్రం ప్రకారం జీర్ణ యజ్ఞోపవీతాన్ని తీసివేసి-దాని స్థానంలో నూతన యజ్ఞోపవీతాన్ని పాపాయి తండ్రితో ధరింప చేసే కార్యక్రమాన్ని జరిపించాలి. తరువాత పుణ్యాహవాచనం (శుద్ధి) కార్యక్రమం వుంటుంది. తరువాత నామకరణం చేయించుతారు. పేరు అనేది ఎవరైనా జన్మ నక్షత్రం ఆధారంగా పెట్తారు. అయితే, అదనంగా, వ్యవహారిక నామంగా, తమకు ఇష్టమైన పేరు పెడతారు. కాని నక్షత్రం ప్రకారం పెడితేనే మంచిది. ఏ నక్షత్రానికి ఏ అక్షరాలు అనేవి శాస్త్రంలో చెప్పబడే వున్నాయి.

పాపైనా-బాబైనా, పిల్లలకు పెట్టవలసిన పేర్లకు సంబంధించిన నియమాలను గృహ్య సూత్రాలు పేర్కొన్నాయి. పరాశర గృహ్య సూత్రాల ప్రకారం పేరు రెండు లేక నాలుగు అక్షరాల పొడవుండి హ్రస్వ అచ్చుతో కూడిన హల్లుతో మొదలై చివర్లో దీర్ఘం కానీ విసర్గం కానీ ఉండాలి. వేర్వేరు గృహ్య సూత్రాల్లో ఈ నియమాలు వేర్వేరుగా ఉన్నాయి. పేరు పెట్టడానికి నాలుగు పద్ధతులున్నాయి. మొదటిది: జన్మ నక్షత్రాన్ని బట్టి; రెండోది: పుట్టిన నెల/రాశ్యధిపతిని బట్టి; మూడోది: ఇలవేల్పుని బట్టి; నాలుగోది అందరూ పిలిచే పేరును బట్టి. చివరి పద్ధతి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి, విద్యా స్థాయిని బట్టి ఉంటుంది. వెండి పళ్ళెంలో పోసిన బియ్యంపై తండ్రితో పేరు రాయించుతాడు బ్రాహ్మణుడు. నామకరణం తంతు ముగిసిన తర్వాత, కటి సూత్ర ధారణ అంటే మొలతాడు కట్టే కార్యక్రమం కూడా జరిపించాలి. పసుపు రంగు పులిమిన దారంతో తయారుచేసిన మొలతాడును పాపాయి మొలకు, బామ్మ గారితో కట్టించాలి. బంగారపు వుంగరాన్ని తేనెలో ముంచి, మొదలు తండ్రితో, తర్వాత తల్లితో, ఆ తర్వాత అమ్మమ్మ-బామ్మ-తాతయ్యలతో-ఇతర పెద్దలతో, పాపాయి నోట్లో వుంచే కార్యక్రమాన్ని కూడా జరిపించాలి

సాధారణంగా ఫలానా వారికి ఫలానా ఇంటి పేరుండడానికి ఏదో ఒక నేపధ్యం వుంటుందంటారు. వుండాలని లేదు కూడా. ఇంటి పేరు గ్రామనామమో, ఏదో ఒక శరీర అవయవమో, జంతువుల పేరో, పక్షుల పేరో, పూల పేరో, తిను పదార్థాల పేరో, వస్తువుల పేరో, వేదాల పేరో, వృత్తుల పేరో, ప్రకృతి సంబంధమైన పేరో, వృక్షాల పేరో, నదుల పేరో, ఇలాంటి మరింకేదో వుంటుంది. లోగడ కొందరు మాత్రమే ఇంటి పేరుగా వాడుకునే కులాలను, ఇటీవల కాలంలో "ఒక హక్కు" లాగా పలువురు ఉపయోగించుకుంటున్నారు. ఎవరెన్ని చెప్పినా, కుల-గోత్ర-నామాలు, ఎందరు ఒప్పుకున్నా-ఒప్పుకోక పోయినా మన సంస్కృతీ సంప్రదాయంలో చెరిపినా చెరగని అంతర్భాగాలు. తర-తరాల కుటుంబ నేపధ్యం, భావి తరాల వారికి తెలియచేయడానికి, మన గురించి మనం అర్థం చేసుకోవడానికి, ఈ కుల-గోత్ర-నామాలు వాడుకుంటే తప్పులేదు కాని, ఆ పేరుతో కులతత్వం-మతతత్వం-ప్రాంతీయ తత్వం, లేదా, మన సంస్కృతి గొప్ప-ఇతరుల సంస్కృతి తక్కువ అనే భావాలను రెచ్చగొడితే అంతకంటే ఘోరమైన పాపం మరింకోటి లేదు.
ఇంటి పేరుకు ఒకరకమైన నేపధ్యముంటే, వ్యవహారిక నామానికి కూడా మరో రకమైన నేపధ్యముంటుంది. ఒక తరంలో ఒక వ్యక్తికున్న పేరు, వారి మనుమల-మనుమరాళ్ల తరం వచ్చేసరికి ఎవరికో ఒకరికి పెట్టుకోవడం ఆనవాయితీ. తాతగారి పేరు మనుమడికి, అమ్మమ్మ-బామ్మ గార్ల పేర్లు మనుమరాళ్లకు కొన్నేళ్ళ క్రితం వరకు యథాతధంగా పెట్టుకునేవారు. ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతున్నా, కొంచెం ఆధునీకరించి పెట్టుకుంటున్నారు. దీని మూలాలు మన గోత్రాల్లో-ఋషుల్లో వున్నాయంటారు.

గోత్రం అంటే, వంశ పరంపరను తెలియచేసే రహస్యం లాంటిదనవచ్చు. బ్రాహ్మణుల్లో, పితృ-పితామహ-ప్రపితామహ...అంతకంటే తెలిసి నన్ని తరాల పూర్వీకులతో పాటు, వంశం ఎక్కడనుంచి ఆరంభమయిందో వారి గోత్రాన్ని బట్టి కొంతవరకు తెలుసుకోవచ్చు. ప్రతి గోత్రం ఒక మహర్షి పేరుతో వుంటుంది. వంశ పరంపర గురించి వివరించేటప్పుడు, మొదటగా ఏ మహర్షి పేరుమీద గోత్రం వుందో, ఆయన పేరు చెపుతారు. తర్వాత ప్రవర చెప్పాలి. ప్రవరంటే, గోత్రానికి ఆద్యుడైన ఋషి పేరు, ఆ ఋషి కుమారుడి పేరు, ఆయన కుమారుడి పేరు (కొంత మందికి ముగ్గురి తో ఆపగా, మరికొంతమంది ఏడుగురి వరకూ చెప్పాలి) చెప్పి, ఫలానా వాడి పౌత్రుడని, పుత్రుడని చెప్పుతారు. బ్రాహ్మణులు వివిధ వర్గాలుగా గుర్తింపు పొందడానికి బహుశా ఇదొక ఏర్పాటు కూడా కావచ్చు. మొట్ట మొదటిసారి గోత్రం అన్న పదాన్ని ఎప్పుడు వాడిందో ఇదమిద్ధంగా తెలవక పోయినా, క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దానికల్లా, అలనాటి మారుతున్న సామాజిక నియమ నిబంధనలు-చట్టాలు, గోత్రం చెప్పుకునే పద్ధతిని స్థిరపర్చాయని అంటారు. దరిమిలా ఆ వ్యవస్థ వేళ్లూనుకోసాగింది. గోత్రాల పుట్టుక సప్తర్షుల ఆవిర్భావంతో ముడిపడిందంటారు. అయితే ఆ సప్తర్షులు ఒక్కో మన్వంతరంలో, ఒక్కో పేర్లతో వ్యవహరిస్తుండవచ్చు. వైవస్వత మన్వంతరంలో బ్రహ్మ మానస పుత్రులైన మరీచి, అత్రి, అంగీరస, పులస్థియ, పులహ, క్రతు, వశిష్ట మహర్షులను సప్తర్షులనేవారట. అలానే, మరో నమ్మకం ప్రకారం, విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప, అగస్త్య అనే ఎనిమిదిమంది మహర్షుల సంతతిని-వంశ పరంపరను తెలిపే గోత్రాల పేర్లుగా పెట్టారంటారు.

ఉదాహరణకు: మా గోత్రం "పరాశర". ఋషులు "వశిష్ట-శక్తి-పరాశర". వశిష్ట మహర్షి హిందూ పురాణాలలో ఒక గొప్ప యోగి. బ్రహ్మ సంకల్ప బలంతో జన్మించాడు. అందరు మహర్షుల వలె ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత-పతిభక్తి పరాయణురాలైన అరుంధతితో వివాహమైంది. వీరికి కలిగిన చాలా మంది కుమారులలో "శక్తి" జేష్టుడు. పరాశరుడు వశిష్టుడి మనుమడు. శక్తి పుత్రుడు. ఇతని తల్లి అదృశ్యంతి. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న వారికి, వివాహ సమయంలో ఆచరించే సంప్రదాయాలలో మహా పతివ్రత అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఒకటి. పరాశరుడు తాతగారైన వశిష్టుడి దగ్గర పెరిగాడు. పరాశరుడు ఒకనాడు తీర్థ యాత్రకు పోతూ, యమునా నదిలో పడవ నడుపుతున్న మత్స్య గంధి-సత్యవతిని చూసి-మోహించి, ఆమెతో సంగమించాడు. అలా వారి సంగమం కారణంగా యమునా నదిలో ఒక ద్వీపంలో ఆమె సద్యోగర్భాన (కన్యాత్వం చెడకుండా) జన్మించిన కొడుకే కృష్ణ ద్వైపాయనుడు లేదా వ్యాసుడు. ఆ పరాశరుడి వంశ క్రమంలో వాళ్లే మా "వనం" వారు.

ఇక ఆ తరువాత చేసుకునేది సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతాన్ని, తెలుగునాట ఇంటింటా, వీలున్నప్పుడల్లా చేసుకునేవారు ఎందరో వున్నారు. ఫలానా మాసంలో, ఫలానా తిథి నాడు, ఫలానా సమయంలో ఈ వ్రతం చేసుకుంటే మంచిదని పురాణాల్లో చెప్పినప్పటికీ, ఎప్పుడైనా-ఎన్నడైనా-ఎక్కడైనా, వీలుంటే మంచిరోజొక్కటి మాత్రం చూసుకొని వ్రతం చేసుకోవచ్చని పండితులు చెపుతుంటారు. శుభకార్యాలలో చేయటం నేడు ఆచారంగా వస్తున్నది. తెలుగువారింట్లో, ఏ శుభ కార్యం (వివాహం, గృహ ప్రవేశం, బారసాల, పుట్టిన రోజు, పెళ్లి రోజు, షష్టిపూర్తి, ప్రమోషన్, కొత్త ఉద్యోగం రావడం లాంటివి) జరిగినా-శుభ వార్త విన్నా, సత్యనారాయణ వ్రతం జరుపుకోవడం ఆచారం.   

అయితే, ఈ వ్రతాన్ని సాధారణంగా, వైశాఖ మాసంలో గానీ, మాఘ మాసంలో గానీ, కార్తీక మాసంలో గానీ ఏకాదశి-పౌర్ణమి, మకర సంక్రాంతి లాంటి శుభదినాల్లో కానీ చేసుకుంటారు చాలామంది. ఈ వ్రతాన్ని నెలకు ఒక సారి కానీ , సంవత్సరానికి ఒక సారి కానీ చేసుకునేవారు కూడా వున్నారు. బారసాలలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం.

వ్రతానికి ముందుగా, తూర్పు దిక్కుగా అనువుగా వున్న ప్రదేశంలో ఒక ఆసనం (వ్రతం పీట) లాంటిది వేసి, దానిపై కొత్త వస్త్రం (తెల్ల టవల్) పరిచి, దానిమీద బియ్యం పోసి, దాని మధ్యలో కలశం (వెండిది) ఉంచి, దాని మీద ఇంకో కొత్త వస్త్రం (జాకెట్ గుడ్డ) ఉంచటం జరుగుతుంది. ఆ వస్త్రం మీద సత్యనారాయణ స్వామి ప్రతిమనుంచి, వెనుక ఫొటోను పెట్టాలి. కలశం మీద వుంచేముందర ప్రతిమను పంచామృతములతో అభిషేకింప చేస్తారు పూజారి. ఆ మండపంలో బ్రహ్మాది పంచలోక పాలకులను, నవ గ్రహాలను, అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి పూజించడం జరుగుతుంది. తరువాత కలశంలో స్వామివారిని ఆవాహన చేసి పూజించే కార్యక్రమం జరిపించి, పూజానంతరం సత్యనారాయణ స్వామి కథ వినిపించి, ప్రసాదాన్ని పంచుతారు శాస్త్రిగారు. సత్యనారాయణ వ్రత కథని అయిదు అధ్యాయాలలో చెప్పడం జరుగుతుంది .ఒకో అధ్యాయం ముగియగానే అరటిపండు నైవేద్యం పెట్టి , కర్పూర హారతి ఇచ్చి రెండవ అధ్యాయం మొదలు పెట్టాలిచివరికి రవ్వతో చేసిన ప్రసాదం నివేదన చేయించాలి. చివరలో మంగళ హారతి కార్యక్రమం, అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడికి, కూతురికి, పాపాయికి బట్టలు- ఆభరణాలు పెట్టే తంతు వుంటుంది. సాంప్రదాయం ప్రకారం ఆహ్వానితులకు పండు-తాంబూలం, భోజనం పెట్టడం ఆనవాయితీ. 

అదే రోజున పాపాయిని ఉయ్యాలలో వేయడం, బావిలో చేద వేయడం అనే కార్యక్రమాలను కూడా చేస్తారు. ఈ రోజుల్లో ఉయ్యాలయితే వుంటుంది గాని, బావి సౌకర్యం వుండదు కదా ! అయినా వేడుక వేడుకే. అదే మన వాళ్లకు ఆనందం. వున్న దాంట్లో సర్దుకుపోవడంలో మరీ ఆనందం మనవాళ్లకి. ఉయ్యాలలో వేయడం అంటే పాపాయిని ఉయ్యాలలో వెయ్యాలి కాబట్టి సాంప్రదాయంగా పదకొండో రోజున మొదలు పెడతారు కొంత మంది. మరికొందరు, ఆ రోజున అసలే చేయకుండా 21 వ రోజున కానీ బారసాల జరుపుకున్న రోజున కానీ చేస్తారు. కొందరు అప్పుడు-ఇప్పుడూ చేస్తారు. ఇవ్వాళ-రేపు పిల్లలు పుట్టగానే, ఆసుపత్రుల్లో ఎలాగూ ఉయ్యాల్లో వేస్తున్నారు కాబట్టి, ఈ కార్యక్రమం కేవలం వేడుకే అనాలి.

ఇక ఆ రోజున మిగిలిన మరో కార్యక్రమం బావిలో చేద వేయటం.  బావిలో చేద వేయటం అంటే అంత వరకు ఆ అమ్మాయి (బాలింత-పాపాయి తల్లి) పనులేమి చేయదు కనుక ఆ రోజున బావిలో చేద వేయించి ఆమె అన్నీ పనులు చేయ వచ్చు అని చెప్పటం కోసం అన్న మాట. ఇదంతా సైన్స్ ప్రకారమే జరుగుతుందనాలి ఒక విధంగా.

కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత, శాస్త్రోక్తంగా, అంతా జరిపించిన బ్రాహ్మణుడిని శక్తి మేరకు సత్కరించడం మన ఆచారాల్లో అతి ముఖ్యమైంది.

Wednesday, February 20, 2013

బ్రాహ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక: వనం జ్వాలా నరసింహారావు


బ్రాహ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక
వనం జ్వాలా నరసింహారావు

"వివాహం"

ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా, అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై, సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి, భవిష్యత్ దంపతులుగా, కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ, జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం.

"పెళ్ళి చూపుల" సాంప్రదాయం

పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో, ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన "పెళ్లి పెద్దలు" సంధాన కర్తలుగా వ్యవహరించి, కాబోయే వియ్యంకుల మధ్య రాయభారాలు చేసి, ఒప్పించి, కార్యక్రమానికి నాంది పలుకుతారు. "పెళ్ళి చూపుల" సాంప్రదాయం ప్రకారం అబ్బాయికి చెందిన వారు బంధు-మిత్ర-సపరివార సమేతంగా అమ్మాయి ఇంటికి వెళ్ళి, అమ్మాయిని చూస్తారు. వధూవరులు పరస్పరం నచ్చాక, ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమవుతారు. పరస్పర సంప్రదాయాలు-కుటుంబ పద్ధతులు-ఆచార వ్యవహారాలు చర్చించుకుంటారు. వరకట్న నిషేధం లాంటివి అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రులు కట్న కానుకలు, ఇచ్చి-పుచ్చుకోవడాలు, లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకుంటారు.

నిశ్చితార్థం

వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది వాగ్ధానం. అంటే: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం). తర్వాత వర-వరణం. అంటే: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం. నిశ్చితార్థానికే మరోపేరు "నిశ్చయ తాంబూలం". వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం. అందరికీ ఆమోదయోగ్యమైన శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లి-తండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకుంటారు. పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుక వధువు ఇంటిలోగాని, వారేర్పాటుచేసుకున్న వసతి గృహంలోగాని జరుగుతుంది. దీన్నే ఇప్పుడు "ఎంగేజ్ మెంట్" అంటున్నారు. కొందరు ఇటీవలి కాలంలో ఈ తంతును పెళ్లికంటే ఘనంగా జరుపుకుంటున్నారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టు గానే భావిస్తారు.
సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు అందరి ఇళ్లల్లో ఒకే రకంగా వుంటాయి. తాహతును బట్టి కొంచెం మార్పులు-చేర్పులు వుండొచ్చు. ఇరుపక్షాల వాళ్ళు మరిచిపోవడానికి ఆస్కారం లేకుండా, అరమరికలు లేకుండా, ఒక కాగితం మీద ఇచ్చి-పుచ్చుకోవడాలకు సంబంధించిన వివరాలన్నీ రాసుకోవడం కూడా సంప్రదాయమే.

ఆడ పెళ్లివారిచ్చేవి- మగ పెళ్లివారిచ్చేవి

సాధారణంగా ఆడ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతక ద్రవ్యాలు, వరుడి ధోవతులు, మధు-పర్కాలు (వరుడుకి ఇవ్వాల్సిన బట్టలు), ఉత్తర జంధ్యాలు, భటువు, కాళ్లుగడిగే పళ్లెం-బిందెలు, కల్యాణ వేదికపై వరుడిని కూచోబెట్టే చిన్న బల్ల, వివాహంలో వివిధ సందర్భాలలో (స్థాళీపాకం, నాగవల్లి, సదశ్యం, అప్పగింపులు, మేజువాణి లాంటివి) వరుడికి పెట్టాల్సిన బట్టలు (ధోవతులు, పట్టు బట్టలు, సూట్, పాంట్-షర్ట్ లు లాంటివి), వరుడివైపు బంధువులకు పెట్టాల్సిన బట్టలు, అప్పగింతల బట్టలు, పెళ్ళైన తర్వాత మగ పెళ్ళివారింట్లో గృహప్రవేశం సందర్భంగా-సత్యనారాయణ వ్రతమప్పుడు వధూ-వరులకు పెట్టవలసిన బట్టలు, ఆడ బిడ్డలకు-అత్తగారికి ఇవ్వదల్చుకున్న లాంఛనాలు, పెళ్ళి కూతురుకు ఇచ్చే సారె (సారె పెట్టెలో పెట్టాల్సిన వస్తువులు-ఏభై ఒక్క కొబ్బరి చిప్పలు, ఐదు రవికె గుడ్డలు, రెండుంపావు కిలోల శనగ-సున్నిపిండి, కిలోంబావు పసుపు-అందులో సగం కుంకుమ, చీరె-ధోవతులు, ఐదు రకాల తీపి పదార్థాలు) ముఖ్యమైనవి.

సాధారణంగా మగ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతకంలో బావమరిదికి పెట్టాల్సిన బట్టలు, పెళ్ళి కూతురుకు పెట్టాల్సిన పట్టు చీరెలు-ఇతర చీరెలు, నగలు-ఆభరణాలు, నల్లపూసలు, పుస్తె (ఒకటి పుట్టింటి వారు, ఇంకొకటి అత్తగారింటి వారు ఇవ్వాలి), మెట్టెలు, ముత్తవుతల్లి (వధువు అమ్మమ్మ) కిచ్చే కట్నం, వధువు తల్లి కడుపు చీరె-తండ్రికి బట్టలు, ప్రధానపు వుంగరం లాంటివి.

ముహూర్త నిశ్చయం

వధూవరుల తారా బలం-చంద్ర బలం చూసి ముహూర్తం నిశ్చయిస్తారు. "పెళ్లినాటి ప్రమాణాలు" భవిష్యత్ లో దంపతులు తు. చ తప్పకుండా అమలు చేయాలంటే "ముహూర్త బలం" ముఖ్యమని హిందువుల నమ్మకం. నిశ్చితార్థంలో ప్రధానంగా విఘ్నేశ్వరుడి పూజ వుంటుంది. వివాహ ప్రక్రియ ఆసాంతం విఘ్నాలు లేకుండా చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితి. నిశ్చితార్థానికి ముందు బంధువుల సమక్షంలో-పరోక్షంలో వధూవరుల తల్లి-తండ్రుల మధ్య కుదిరిన ఇచ్చి-పుచ్చుకునే ప్రతి చిన్న అంశం ఒక కాగితం మీద రాసుకోవడం కూడా సాంప్రదాయంలో భాగమే. ఇదంతా "ఆచారం-పద్ధతి".
పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతోంటే పెళ్లి సరంజామా కొనడం అనేది ఇరు పక్షాల వారికి కూడా పెద్దపని. పట్టుచీరలు, బంగారు ఆభరణాలు, నూతన వస్తువులు.. .. ఎన్నో కొంటారు.
నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి కులాచారానుసారం "శుభ లేఖలు"గా పిలువబడే ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. మంగళ సూచకంగా లేఖకు నాలుగు వైపులా పసుపు పూస్తారు. బంధుగణాన్ని పిలుచు కోవడం పెళ్లిళ్లలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అరుదుగా కలిసే చుట్టపక్కాలతో సహా బంధువులందరూ కలుసుకోగలిగే "సామాజిక ఏర్పాటు" పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళి వారి ఇల్లు (కల్యాణ మంటపం) మారిపోతుంది. ఎంత శ్రద్ధ తీసుకుని, అందరికీ "శుభ లేఖలు" పంపించే ఏర్పాటుచేసినప్పటికీ, ఆఖరు నిమిషంలో, ఒక్కోసారి ముఖ్యమైన వారితో సహా కొందరిని మరిచిపోవడం సహజంగా జరుగుతుంది. వాళ్లకు కోప-తాపాలు కూడా వస్తాయి. కాకపోతే వచ్చినంత త్వరగా తగ్గిపోతాయి కూడ. ఇవన్నీ సర్వసాధారణంగా ప్రతి పెళ్లిలోనూ-ప్రతివారింటిలోనూ జరిగే మామూలు విషయాలే. ఆ చిరు కోపాలు రాకుంటే పెళ్ళి శోభ రానట్లే.

"స్నాతకం"

పెళ్లిరోజుకు ఒకరోజు ముందర "స్నాతకం" అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని లేదా విడిదిలో గాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ "సంస్కారం", ప్రధానంగా, వరుడిని "బ్రహ్మచర్యం" నుండి "గృహస్థాశ్రమం" స్వీకరించడానికి సిద్ధంచేస్తున్న కార్యక్రమం. గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో-అంగీకారంతో "గృహస్థాశ్రమం" స్వీకరించే ఏర్పాటిది. ఆ సమయంలో గురువు చేయాల్సిన హిత బోధ తైత్తిరీయోపనిషత్తులోని "సత్యాన్న..." అన్న ఒక శ్లోక రూపంలో వుంటుంది.
"సత్యం విషయంలోను, ధర్మం విషయంలోను, తెలివితేటల విషయంలోను, పొరపాటు పడవద్దు" అన్న ఆదేశం అది. తల్లిని, తండ్రిని, అతిథిని దేవుడులా భావించాలని చెప్తారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించమని, దానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయమని, తాహతుకు మించి దానం చేయొద్దనీ-ఇంతకంటె ఎక్కువ దానం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని భావించమనీ బోధిస్తాడు పురోహితుడు. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని-వారనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ, "వరుడికి శుభం కలుగుగాక" అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు. హిందూ వివాహ సంప్రదాయ పద్ధతిలో భారతీయ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తాడు పురోహితుడిక్కడ.
స్నాతకానికి "సమా వర్తనం" అన్న పేరు కూడా వుంది. సమా వర్తనమంటే, తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమా వర్తనం అంటారు. కాశీ యాత్ర, హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం సాంప్రదాయంలో మరో ముఖ్యమైన ఆచారం. కాశీ ప్రయాణం - బాజా భజంత్రీల మద్య వరుడు గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావు కోళ్లు ధరించి, మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం స్వీకరించేందుకు, కాశీకి పోతున్నానని చెప్పి బయలు దేరుతాడు. వధువు సోదరుడు వచ్చి "అయ్యా, బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి" అని చెప్పి బొట్టు పెట్టి,బెల్లం (తీపి పదార్థం) నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను ఇచ్చి వెనుకకు తీసుకొని వస్తాడు.

కాశీ యాత్ర

కాశీ యాత్ర ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నానని, దానికి బంధు-మిత్రుల అనుజ్ఞ కావాలని వరుడు కోరతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైందికాదని, గృహస్థాశ్రమం స్వీకరించి, ధర్మ భద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాల్సిందిగా పురోహితుడు (గురువు) హితవు పలుకుతాడు. ఇక పెళ్ళి కూతురు వైపునుంచి వచ్చిన వారు (బావ మరిది-మేన మామ-తాత గారు లాంటి వారు) "బంగారు ఆభరణాలతో అలంకరించబడిన వారి "అమ్మాయి" నిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నామని, అగ్ని సాక్షిగా అమెను వివాహమాడమని, ముందుగా తమ ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వరుడికి నచ్చచెప్పి, కాశీ యాత్ర ఆలోచనను విరమింపచేసే ఘట్టం ఇది. చాలా కోలాహలంగా పెళ్ళికి "తరలి పోయే ముందర" జరిగే సరదా కార్యక్రమం ఇది. ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి చేసుకొని, వరుడి బంధు-మిత్రులందరు వధువు గృహానికి (వసతి గృహానికి) బయలుదేరుతారు. బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించు కోవడం, పల్లకి లాంటి వాహనాలు సిద్ధం చేసుకోవడం మామూలే. బయలుదేరే ముందర, శుభకార్యానికి బయలుదేరుతున్నామని, వెనక్కు పిలవడం నిందించడం - దగ్గడం, తుమ్మడం లాంటివి లేకుండా వుండాలన్న అర్థం వచ్చే మంత్రాన్ని చదువుతారు.

పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం

పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ, స్నాతకం-అంకురార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. వధూ-వరుల ఇళ్లలో, ఉదయం తెల-తెలవారుతుండగానే, మంగళ వాయిద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగుతుంది. వధువుకు, కన్యా దాత దంపతులకు, తోటి పెళ్ళి కూతురుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), తెల్లవారక ముందే, ముత్తైదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికి, తల్లి-తండ్రులకు, తోటి పెళ్ళికొడుకుకు (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది. స్నాతకం చేసుకున్న నాడే, లాంఛనంగా అక్కడ కన్యా దాత ఇంట్లో, వధువుని "పెళ్ళికూతురు" చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ముందు-వెనుకల కూడా జరగొచ్చు. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యా దాత దగ్గరి బంధువులందరూ వస్తారు. నవ ధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని "అంకురార్పణ" లో చేస్తారు.
స్నాతకం చేసుకున్న రోజునే మగ పెళ్లివారు ఆడ పెళ్ళివారి వూరికి తరలి పోతారు. ఒక్కోసారి అక్కడకు పోయి స్నాతకం చేసుకుంటారు.

విడిది మర్యాదలు

మగ పెళ్ళి వారు విడిదికి చేరుకోగానే, అప్పటికే వారికొరకు ఎదురు చూస్తున్న ఆడ పెళ్లి వారు, "ఎదురు కోలు" పలికే ఆచారం సరదాగా-సందడిగా జరుపుకునే మరో వేడుక. విడిదిలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసి (సబ్బులు, పేస్టులు, బకెట్లు, తుండు గుడ్డలు, వేడి నీళ్లు లాంటివి) ముందు (హాలులో) భాగంలో పెద్ద తివాచీ లాంటిది పరిచి ఎదురు చూస్తుంటారు ఆడ పెళ్ళి వారు. మేళ-తాళాలతో ఆహ్వానించి కాబోయే అత్తగారు, మామ గారు, వారి సమీప బంధువులు ఎదురుకోలలో భాగంగా, విడిదిలోకి ప్రవేశించే ముందర కాళ్లు కడుక్కోవడానికి మగ పెళ్ళి వారందరికీ నీళ్లిస్తారు. పెళ్ళికొడుకు ఆ పనిని బావమరిదితో చేయిస్తారు. ఈ కాళ్లు కడగడమనేది రెండు-మూడు పర్యాయాలు జరిపే వ్యవహారం. ఆ తర్వాత అందరికీ కాఫీ-పలహారాలిచ్చి మర్యాదలు చేసి, స్నానాలు ముగించుకొని సిద్ధంగా వుంటే, భోజనాలకు తీసుకెళ్తామంటారు. లేదా అక్కడే ఏర్పాటు చేస్తారు.
వివాహం ముహూర్తం నాడు పెళ్లికి ముందు-పెళ్ళిలో-పెళ్లైన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలెన్నో వున్నాయి. తెలుగు వారి పెళ్ళిళ్లలో ఉండే సందడి, సంతోషం ఎంత మోతాదులో వుంటుందో ఎవరూ చెప్పలేరు. సకుటుంబ పరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో ఒక మరవలేని సంఘటన. కొందరు కల్యాణ మండపాలను వాడితే మరికొందరు వాడరు. సాధారణంగా పల్లెటూర్లలో కొబ్బరి ఆకుల పందిరి వేయడం వలన మండపం ఆవశ్యకత తగ్గింది. పట్టణాలలో టిప్ టాప్ పందిరి మండపాలు తప్పని సరిగా వాడటం జరుగుతుంది.

గౌరీ పూజ-వర పూజ- మధు పర్కం

ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు సన్నాహాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని "లక్ష్మి,పార్వతి,సరస్వతి"ల ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని త్రిమూర్తుల దివ్యస్వరూపంగా, విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు.
వధువుకు నలుగు స్నానం చేయించి, పెళ్ళికూతురుగా అలంకరించి, కళ్యాణం బొట్టు దిద్ది, పాదాలకు పారాణిని పూసి, పూల జడ వేసి, నూతన వస్త్రాలను కట్టించి (పట్టు చీరె) "గౌరీ పూజ" కు తీసుకెళ్తారు. గౌరీ పూజకు వధువుని సిద్ధం చేస్తూనే, వర పూజ కొరకు విడిదికి వెళ్తారు ఆడ పెళ్ళి వారు. కన్యా దాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో వచ్చి మగ పెళ్ళి వారికి స్వాగతం పలికే వేడుక ఇది. పానకం వరుడికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. వరపూజలో భాగంగా, ఆడ పెళ్ళి వారు-వారి వైపు బంధువులు వచ్చి, వివాహం చేసుకోవడానికి రమ్మని మగ పెళ్ళివారిని ఆహ్వాని్స్తారు. వరపూజలోనే ఇరువైపువారు, ఒకరినొకరు లాంఛనంగా ఆహ్వానించు కోవడానికి "శుభలేఖలు" మార్చుకుంటారు. వరపూజ కార్యక్రమం జరుగుతుండగానే, కన్యా దాత ఇంట్లో, వధువు గౌరీ పూజ సమాంతరంగా కొనసాగుతుంటుంది.
మగ పెళ్లివారందరు కన్యా దాత ఇంటికి చేరుకునే సమయానికి, వధువు గౌరీ పూజ ఇంకా కొనసాగుతూనే వుంది. ఇది ఆచారం-సాంప్రదాయం. బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందేందుకు కన్యా వరణానికి వచ్చే వరుడికి ఎదురేగి "నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్లమని కన్యా దాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద జరగబోయే వేడుక మొదలవుతుంది. హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం, "నారాయణ స్వరూపుడైన వరుడికి" పాద ప్రక్షాళన లాంటివి జరిపించి, కన్యా దాత ఆతిధ్యం ఇస్తారు. దీనినే "మధు పర్కం" అని పిలుస్తారు.
మధుపర్కం:
మధువు అంటే తేనె. కుమార్తెకు భర్తగా వరుడి ఎంపిక తరువాత అతను వధువు తల్లి-తండ్రికి సంప్రదాయాన్ననుసరించి పుత్ర సమానుడౌతాడు. వివాహానంతరం "మధుపర్కం" అంటే తీయటి పానీయం అని అర్ధం. మధు పర్కాలుగా ఇచ్చిన నూతన వస్త్రాలను ధరించి వరుడు వివాహ వేదిక మీద జరగాల్సిన వేడుకకై వేచి వుంటాడు. వరుడు ఆ పనిలో వున్నప్పుడు, తర్వాత కార్యక్రమం జరిపించడానికి, కన్యా దాత వరుడు నాన్న గారిని తీసుకొని వధువు గౌరీ పూజ చేస్తున్న చోటుకెళ్తారు.

గోత్రం-ప్రవర

గౌరీ పూజ జరిగే చోట ఒక్క సారి, లాంఛనంగా, ఇరు పక్షాల వారి గోత్రం-ప్రవర చెప్పే కార్యక్రమం, పురోహితుల చాతుర్యాన్ని బట్టి అత్యంత ఆసక్తికరంగా-విన సొంపుగా వుంటుంది. "గోత్రం" అంటే వంశం, "ప్రవర" అంటే ఆ వంశం మూల పురుషుల సమాచారం. మీ అమ్మాయిని, మా అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించమని వరుడి తండ్రి, కన్యా దాతను కోరడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశం. "చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు-…. …. …. త్రయార్షేయ ప్రవరాన్విత యజుర్వేదినే, తైత్తిరీయ శాఖాధ్యాయినే, ఆపస్తంబ సూత్రిణే, ….. …. శర్మణో నప్త్రే, …. … శర్మణ పౌత్రాయ, … …. శర్మణ పుత్రాయ, .. … శర్మణే వరాయ, భవదీయాం కన్యాం ప్రజాసహత్వ కర్మభ్యో వ్రణీమహే" ("మూడు ఋషులున్న …… గోత్రం కలవాడూ, యజుర్వేదాన్ని అభ్యసించినవాడూ, ఆ వేదం ప్రకారం తన ఇంటి కార్యక్రమాలను నడిపించేవాడూ, తైత్తరీయ శాఖను-ఆపస్తంబ సూత్రాన్ని అభ్యసించి అనుసరించేవాడూ, … మునిమనుమడూ, …. మనుమడూ, …. పుత్రుడూ అయిన అనే వరుడికి మీ కూతురునిచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చాం") అని అడుగుతాడు. ఇలా వంశం వివరాలు చెప్పడం వల్ల కన్యా దాత చివరివరకూ ఆలోచించుకునే అవకాశం వుందింకా. ఇవేవీ తెలియకపోతే (అందరి సమక్షంలో), ఫలానావారి పిల్లవాడిని చేసుకున్నాం-ఇప్పుడు అనుభవిస్తున్నాం అని భవిష్యత్‌లో అనవచ్చు.
కన్యా దాత, వరుడి వివరాలు ముత్తాత తరం దగ్గర నుండి విన్న తర్వాత, ఆ సంబంధం తనకి ఇష్టమైతే, వెంటనే తన వధువు (కూతురు) వివరాలు కూడా చెప్పి అబ్బాయి తన కూతురుని చేసుకోమని అడుగుతాడు.

గంపలో వధువు-కాళ్లు కడగడం

గౌరీ పూజ దగ్గర గోత్రం-ప్రవరల వేడుక ముగిసిన పిదప, వధువు మేనమామలు పెళ్ళి కూతురిని గంపలో కూర్చొబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చాలా సరదాగా వుంటుంది. ఇందులోనూ ఒకరకమైన సామాజిక స్పృహ కనిపిస్తుంది. తల్లి తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియచేయడమే దీని అర్థం. గంపలో ధాన్యం కూడా పోస్తారు. కొబ్బరి బోండా మానసిక స్వచ్ఛతకు చిహ్నం. అలానే, అందులోని పీచులాగా, ఎల్లవేళలా ఇరువురు విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని-సత్ సంతానం కలవారమవుతామని సంకేతం కూడ ఈ వేడుకలో వుందంటారు పెద్దలు.
కళ్యాణ వేదిక పైన వున్న వరుడి కాళ్లు కడిగే కార్యక్రమం, వివాహంలో, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న మరో ముఖ్యమైన ఘట్టం. కన్యాదాతేమో వయసులో పెద్ద-వరుడేమో చిన్నవాడు. అయినా కాళ్లు కడిగే ప్రక్రియ వుందంటే దానికి సాంప్రదాయ బద్ధమైన అర్థం వుండి తీరాలి. కన్యా దాత వరుడి కాళ్ళు కడుగుతున్నప్పుడు ఆయన తేజస్సు తరిగి పోకుండా పురోహితుడు ఒక మంత్రాన్ని చెప్పుతాడు. "నా లోని తేజస్సు, శక్తి, కీర్తి, బలం సుస్థిరంగా వుండుగాక" అన్న అర్థం వచ్చే మంత్రం అది. అది కన్యా దాత ఉచ్చరిస్తూ, ఇచ్చిన "అర్ఘ్యాన్ని" (మంచి నీరు) స్వీకరిస్తాడు వరుడు. కన్యా దాత వరుడి కాళ్ళు కడిగి నందువల్ల, చిన్నవాడైన వరుడు, తనలోని కాంతి తరిగిపోకుండా వుండేందుకు, ఆచమనం చేసి, దానికి తగ్గ మంత్రాన్ని చదివిస్తారు. ఆచమనం చేస్తూ, వరుడితో, " ఓ ఉదకములారా, మీరు నాకు గొప్ప కీర్తిని-పాడి పంటలను ఇచ్చి, అందరు ఇష్టపడేవాడిని చేసి, రక్షించండి" అని చెప్పిస్తారు. వధువుని గంపలోనే వుంచి మహా సంకల్పంతో ఆరంభించి, తర్వాత జరగాల్సిన వేడుక మొదలు పెట్తారు పురోహితులు.
వధూవరులు సాక్షాత్తు "లక్ష్మీ-నారాయణ స్వరూపులు" గా భావించుతారు కాబట్టి, ఆ విధంగానే "లక్ష్మీ నారాయణుల కల్యాణం" లా జరిపించుతారు. "మహా సంకల్పం" చెప్పడం, సృష్టి క్రమంతో మొదలుపెట్టి, పరమేశ్వరుడి శక్తి-సామర్థ్యాలు అనంతమని-అచింత్యాలని, ఆయన అనుగ్రహంతోనే యావత్ సృష్టి జరిగిందని కొనసాగింది. మానవుడి మేథస్సు ఊహించనలవికాని పరిమాణంలో వున్న ఈ జగత్తు, పరమేశ్వరుడి ఆద్యంతాలు లేని రూపంలో ఒక అతి చిన్నదైందని పురోహితుడంటాడు. అఖిలాండ బ్రహ్మాండంలో, అనేకానేక చిన్న-చిన్న గోళాలున్న ఖగోళంలోని అత్యంత సూక్ష్మమైన భూగోళంలో, భరత ఖండంలో, మారు మూలనున్న మానవుడు, అణు పరిమాణంలో వున్న చిన్న భాగమని తెలియచేసే దే మహా సంకల్పం. ఇది చెప్పడం ద్వారా, పరమాత్మ స్వరూపాన్ని ఎరుక పరిచి, మానవుడి అహంకారాన్ని తగ్గించుకోమని, వినయ సంపదను పెంచుకోమని సూచించడం జరుగుతుంది.

మహా సంకల్పం

మహా సంకల్పం విశ్వ స్వరూపాన్ని, ఖగోళ స్థితిని చక్కగా వివరిస్తుంది. భూమండలాన్ని పరిపాలించిన షోడశ మహారాజులు, షట్చక్రవర్తులు, సప్త ద్వీపాలు, నవ వర్షాలు, నవ ఖండాలు, దశారణ్యాలు, యాభై కోట్ల విస్తీర్ణం గల జంబూ ద్వీపం, అందులో భరత వర్షం-భరత ఖండం, దానిలో ఈ కన్యాదానం ఎక్కడ చేస్తున్నది కన్యా దాత పేర్కొంటాడు. అలాగే బ్రహ్మ కాలమాన ప్రకారం యాభై సంవత్సరాలు పూర్వార్థం గడవగా, యాభై ఒకటవ సంవత్సరంలో, మొదటి మాసంలో, మొదటి పక్షంలో, మొదటి పగటిలో బ్రహ్మకు ప్రాణాయామ కాలం ప్రస్తుతం జరుగుతున్నట్లు చెప్పి తొమ్మిది కల్పాలలోని శ్వేత వరాహ కల్పంలో, పద్నాలుగు మన్వంతరాలలో ఏడవదైన వైవస్వత మన్వంతరంలో-శాలివాహన శకంలో-ఇరవై ఎనిమిదవ మహా యుగంలో-కలియుగంలో-ఫలానా సంవత్సరంలో-ఫలానా మాసంలో-ఫలానా తిది రోజున, ఈ సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ ప్ర్రీతి కోసం సర్వాలంకార భూషితైన ఈ కన్యను దానం చేస్తున్నాను అని కన్యా దాత చెప్పే సంకల్పం ఇది. ఈ కన్యాదానం వల్ల తనకు బ్రహ్మ లోకంలో నివసించే యోగ్యత సిద్ధించాలని, అగ్ని,స్తోమ, వాజపేయాది యాగాలు చేసిన పుణ్య ఫలం లభించాలని, తనకు వెనుక- ముందు పది తరాల వాళ్ళు బ్రహ్మ లోకంలో నివసించాలని కన్యా దాత సంకల్పం చేస్తాడు.

కన్యాదానం

ఇక ఆ తర్వాత, "కన్యా దానం" తంతు, అంటే, ముహూర్తం సమయం దగ్గరపడుతున్నదని అర్థం. "కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషియా" !! అన్న వాక్యాలు పురోహితుడి నోటి వెంట వస్తాయి. దీని అర్ధం-"ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకం వంటి శరీర చాయ కలది. శరీరమంతా ఆభరణాలు కలిగినది. నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత ప్రాప్తి పొందినట్టు శృతి వలన విన్నాను. నేనూ ఆ శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నాను" అని కన్యా దాత అంటారు. ఇంకా ఇలా చెప్పాలి కన్యా దాత: " సమస్త ప్రపంచాన్ని, అఖిలాండ బ్రహ్మాండాలను భరించే శ్రీ మహావిష్ణువు-పంచభూతాల-సర్వ దేవతల సాక్షిగా, పితృదేవతలను తరింపచేసేందుకు, ఈ కన్యను దానం చేస్తున్నాను. సౌశీల్యం కలిగి, బుద్ధిమంతుడి వైన నీకు, ధర్మార్థ కామాలు సిద్ధించేందుకు, సాలంకృత సాధ్వియైన ఈ కన్యను సమర్పించుకుంటున్నాను". ఇలా అంటూ, మామ గారు (కన్యా దాత) (వరుడి) చేతిలో నీళ్లు పోసి మరో మాటంటారు. "నీకు దానం చేసినప్పటికీ, ఈ కన్య నా కుమార్తే సుమా!" అని. ఇలా అంటూనే, "ధర్మేచ, అర్థేచ, కామేచ, ఏషా నాతి చరితవ్యా" అని ప్రతిజ్ఞ చేయిస్తారు కన్యా దాత వరుడితో. దీనికి సమాధానంగా, "నాతి చ రామి" అని వరుడితో చెప్పించాలి. సుముహూర్తం వచ్చేస్తున్నదనె దీనర్థం.



"జీల కర్ర- బెల్లం"

వధూ-వరులను కళ్యాణ వేదికపై, తూర్పు-పడమర ముఖంగా కూచోబెట్టి, మధ్య ఉత్తర-దక్షిణ ముఖంగా తెరను అడ్డం పెట్టి, ఇరువురి చేతికి "జీల కర్ర- బెల్లం" కలిపిన ముద్దను ఇస్తాడు పురోహితుడు. పెళ్ళిచూపుల కార్యక్రమం పూర్తి అయిన పిదప, అమ్మాయి-అబ్బాయిల జాతకాల ననుసరించి జ్యోతిష్యంలో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించ బడుతుంది. వారు నిర్ణయించిన ముహూర్తానికి వరుడు-వధువు ఒకరి తలపై ఇంకొకరు "జీలకర్ర-బెల్లం" పెట్టడం జరుగుతుంది. నిజానికిదే సుముహూర్తం (జీల కర్ర-బెల్లం శిరస్సుపై వుంచడం). మంగళ వాయిద్యాలు మోగిస్తుంటే, పురోహితుడు మంత్రాలు చదువుతుంటే, గౌరీ దేవిని ధ్యానించుకుంటూ వధువు, వరుడు ఏక కాలంలో నిర్ణయించిన ముహూర్తానికి ఒకరి శిరస్సు మీద మరొకరం (బ్రహ్మ రంధ్రం మీద) జీల కర్ర-బెల్లం కలిపిన ముద్దను వుంచుకుంటారు. సుముహూర్త కాలంలో పెద్దల ఆశీర్వాదాన్ని పొందుతారు. పురోహితుడి తర్వాత, తల్లి-తండ్రులతో మొదలయ్యి, పెద్దలందరూ అక్షితలు చల్లుతారు దంపతులు మీద.
జీల కర్ర-బెల్లం ముద్దను వధూవరులు పెట్టుతున్న సమయంలో, పురోహితుడు చదివిన మంత్రానికి, "వరుణుడు, బృహస్పతి, మీకు శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చెదరు గాక ! అగ్ని దేవతలు మిమ్ములను దీవించెదరు గాక ! పంచభూతాలు స్థిరంగా వుండు గాక ! ఈ సుముహూర్తం మీకు శుభ ముహూర్తం అగుగాక !" అని అర్థం వస్తుంది. జీల కర్ర-బెల్లం మిశ్రమంలో పరస్పరాకర్షణ వుంటుందని మన పెద్దలు చెప్పడమే కాకుండా, శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు. ఇక వధూవరులమైన మేమిద్దరం, ఆ తర్వాత, సకల దేవతలకు నమస్కరించి, "నూతన దంపతులమైన మా ఇరువురి ప్రేమానుబంధం చాలా గొప్పది. మా బంధాన్ని పితృదేవతలు కూడా ఆశీర్వదించారు. వారి ఆశీస్సులతోనే మేం భార్యా-భర్తలం అయ్యాం. ఈ శుభ సమయంలో బంధువులైన మీరందరూ ఆనందంగా వుండండి. వధువు బంధువులు కొద్దిగా మానసిక ఆందోళనకు గురికావడం సహజమే" అని మంత్రాల ద్వారా పురోహితుడు అనిపిస్తాడు. ఇక ఇక్కడినుంచి మాంగల్య ధారణ తంతు మొదలవుతుంది.

మాంగల్య ధారణ-తలంబ్రాలు

వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ సూత్రం" ధరించడం భారతీయ సంప్రదాయం-హిందువుల ఆచారం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళి నాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. మంగళ సూత్రం అనే శబ్దం సంసృతం నుండి పుట్టింది. సంసృతంలో 'మంగళ' అంటే శోభాయమానం అని, శుభప్రదం అనీ అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు ఆధారమైందని అని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు దారాలతో (లేదా ఎవరెవరి ఆచారం ప్రకారం వారి పద్ధతిలో) తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్ర ధారణకు ముందు, మేనమామ గారు పెట్టిన "మధు పర్కం చీరె" ను, వధువుతో ధరింపచేస్తారు. వధూవరులు ఇద్దరూ మధుపర్క ధారణతో మంగళ సూత్ర ధారణ కార్య క్రమానికి సిద్ధమవడం ఆచారం.
సమస్త శుభాలకు, మంగళ ప్రదమైన కర్మలకు నిలయమైంది కాబట్టి, దీనికి, మంగళ సూత్రం అని పేరొచ్చింది. మంగళ సూత్రాలకు గౌరీ దేవి అనుష్టాన దేవత. దీన్నే "శత మానములు" అని కూడా అంటారు. బంగారంతో చేయబడ్తాయివి. రెండు సూత్రాలలో (శత మానములు) ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి వారు చేయించడం ఆచారం. మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, పురోహితుడు ""మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా ! కంఠే మిద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం !!"" అని చదువుతుంటే, వరుడితో మంగళ సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించుతారు, పురోహితుడు మూడు ముళ్లు వేయమంటారు. మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతం. చదివిన మంత్రానికీ అర్థముంది-"ఓ సుందరీ ! ఈ మంగళ సూత్రాన్ని, నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు" అని. మంగళ సూత్ర ధారణ అవుతూనే వేద పండితులు ఆశీర్వదించుతారు. "శతమానం భవతి, శతాయుః పురుష !" అనే మంత్రాన్నీ చదువుతారు. అందుకే, వీటికి "శత మానములు" అని పేరొచ్చింది.
పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవ మర్యాదలు-పరువు ప్రతిష్టలు స్త్రీల వలనే లభిస్తాయి. పుట్టింట్లో పెరిగి, అత్తగారింటికి చేరి, బరువు-బాధ్యతలు స్వీకరించిన స్త్రీకి పుట్టిల్లు-అత్త గారిల్లు రెండు కళ్ల లాంటివి. ఉభయ వంశాలకు మంచి కీర్తిని చేకూర్చి పెట్టగలను అని తెలియ చేసేందుకే రెండు సూత్రాలను మహర్షులు నిర్ణయించారని హిందువుల నమ్మకం. భర్త సుఖ దుఃఖాలు తనవేనని, పుట్టింటి-అత్తింటి వారి మంచి-చెడులు తనవేనని, ధర్మ మోక్షాలు-అర్థ కామాలు తన సంబంధం ద్వారా భర్తకు లభింప చేయనున్నానని, సంపదకు-సంతానానికి తనే కారణమవుతాననే విషయాలు ఎల్లవేళలా గుర్తుండే విధంగా ప్రవర్తించడానికి మంగళ సూత్రాలను వధువు ధరిస్తుందని హిందువుల నమ్మకం.
మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా-ఇరువైపు బంధుమిత్రుల మధ్య పోటీలాగా జరిగే తంతు వధూ-వరులు "తలంబ్రాలు" పోసుకోవడం. ఎందుకంటే, వధూవరులుతో పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని-ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మంగళ సూత్ర ధారణ పూర్తైన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం హిందూ సాంప్రదాయం. దీనిని అక్షతా రోహణం అని కూడా అంటారు కొందరు. 'క్షత' అంటే విరుగునది-'అక్షత' అంటే విరగనిది. అంటే, "వివాహ బంధం" విడదీయరాని బంధం కావాలని భావం. "తలన్+బ్రాలు" అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం. అర్థాలు ఏవైనా, ఇదొక ఆనంద ప్రదమైన ఆచారం. వధూవరుల గృహస్థా శ్రమ జీవితం శుభప్రదంగా, మంగళ ప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. పసుపు-బియ్యం-నెయ్యి-ఆవు పాలు అనే మంగళ ద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు.
కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని. తథాస్తు అనే వాడు వాయువు. దంపతులు చాలా బాగున్నారని అనే వాడు చంద్రుడు. ఇవన్నీ నిజమే అని వంత పలికే వాడు-ఆనందించే వాడు సూర్యుడు. ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెపుతున్న మంత్రాల మధ్య, వరుడి చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదలు పోయిస్తారు. "నీవలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, వరుడి లాగనే తలంబ్రాలు తీసుకొని, వరుడి శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు, "పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో అనిపించుతారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల మంత్రాల చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. చివరికి అదొక పోటీలాగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. తలంబ్రాల పళ్లెం ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది. ఈ తంతు ముగిసిన తర్వాత, "బ్రహ్మ ముడి" వేడుక జరుగుతుంది. వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసి-మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు" గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు.

స్థాళీపాకం-సప్తపది-నాగవల్లి-సదశ్యం

తలంబ్రాల కార్య క్రమం, బ్రహ్మ ముడి వేయడంతో ఇక వధూవరులను వివాహ వేదిక పైనుంచి కిందికి దింపుతారు. సాధారణంగా గౌరీ పూజ జరిపించిన చోటనో, లేకుంటే మరో అనువైన స్థలంలోనో, హోమం ఏర్పాటు చేసి స్థాళీపాకం వేడుక జరిపిస్తాడు పురోహితుడు. ఇందులో భాగంగా హోమం దగ్గర అన్నం వండించే పని, ఆ తర్వాత సప్తపది వుంటుంది.
వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం. పరమ పావన మూర్తి అగ్నిహోత్రుడి సాక్షిగా, అగ్నిహోత్రుడి చుట్టూ, పాణి గ్రహణం తర్వాత వధూవరులిద్దరు, వధువు కుడి కాలి అడుగుతో ఆరంభించి, ఏడు అడుగులు వేయిస్తారు. దీనిని సప్తపది అని అంటారు. వధువుతో కలిసి ఏడడుగులు వేస్తూ వరుడు, ఏడు కోరికలను వివరిస్తాడు. అనంతరం వధువు తన అంగీకారాన్ని తెలియ పరుస్తుంది. ఇది గృహస్థా శ్రమ స్వీకారానికి పరమావధి. సప్తపది పూర్తైన తర్వాతనే, వధువు గోత్రం-ప్రవర-ఇంటి పేరు, వరుడి గోత్రం-ప్రవర-ఇంటి పేరు గా మారుతుంది. వధూవరులు కలిసి అడుగులు వేస్తున్నప్పుడు, భారతీయ-హిందూ సాంప్రదాయ వివాహ విధానాన్ని, అందులోని గొప్పదనాన్ని విశదపరిచే మంత్రాన్ని చదువుతారు. అందులో, "ఓ చిన్నదానా ! నీవు నన్ను అనుసరించి నడువు. నీవు నడిచేటప్పుడు శ్రీ మహా విష్ణువు, మొదటి అడుగులో అన్నాన్ని-ఐశ్వర్యాన్ని, రెండవ అడుగులో శారీరక-మానసిక బలాన్ని, మూడవ అడుగులో మంచి పనులు చేయాలన్న సంకల్పాన్ని-ఉత్తమ కర్మనూ-శ్రద్ధనూ, నాలుగవ అడుగులో కర్మ ఫలాన్నీ-సుఖాన్నీ-ఆనందాన్నీ, ఐదవ అడుగులో పశు సమృద్ధినీ-ధన ధాన్యాలనూ, ఆరవ అడుగులో మంచి సంతానాన్నీ, ఏడవ అడుగులో ఇద్దరి ఆధ్యాత్మిక చింతనకు తగు రక్షణను మనకు కలిగించుగాక" అన్న అర్థం స్ఫురిస్తుంది.
వధువును అగ్నికి తూర్పునకుగానీ, ఉత్తరం నకుగానీ, ఏడు మంత్రాలతో, ఏడు అడుగులు నడిపించుతున్న వరుడితో జపం-హోమం చేయించుతారు. ఇక్కడే చెప్పిన మరో మంత్రంద్వారా వధూవరులిద్దరు, ఇకనుంచి స్నేహితులం అన్న అర్థం కూడా వుంటుంది. "మన ఇద్దరం స్నేహితులం. నీవు నాతో ఏడడుగులు నడవడంతో మన ఉభయులకు మైత్రి కలిగింది. నీ చేతిని నేనెప్పుడూ విడవను-నన్ను నీవు కూడా విడవవద్దు. మంచి మనస్సుతో అన్నోదకాలను స్వీకరించి ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని అనుభవించుదాం. పరస్పరం చర్చించుకొని కుటుంబ పనులను నెరవేరుద్దాం. అనుకూల దంపతులమై సంసార యాత్ర కొనసాగించుదాం. నువ్వు భూమివి-నేను ఆకాశాన్ని. నువ్వు వాక్కువు-నేను మనస్సును. నేను చేసే ధర్మ కార్యాలకు నీ సహకారం కావాలి. యోగ్యమైన సంతానాన్ని-సంపదను మనం ఇద్దరం కలిసి అనుభవించుదాం" అని దానర్థం. " రాత్రి గాని, పగలు గాని, ఎల్ల వేళలా సుఖ సంతోషాలతో నువ్వుండాలి నీకు ఎటువంటి ఇబ్బందీ కలగరాదు. సుమంగళివై-సత్ సంతానంతో గృహలక్ష్మివై, అభివృద్ధి చెందాలి" అని రక రకాలుగా అనునయించే మాటలివి.
సప్తపది తర్వాత మరో ముఖ్యమైన వివాహ వేడుకలు, నాగవల్లి-సదశ్యం. ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం. సదశ్యంలో బ్రాహ్మణులకు కానుకలు, వధూవరులకు బట్టలు పెట్టే కార్యక్రమం వుంటుంది. నాగవల్లిలో పెళ్లి కూతురుకు భర్తతో కాలి మెట్టెలు తొడిగించే కార్యక్రమం, గుచ్చిన నల్లపూసల తాడును వధువు మెడలో కట్టించే కార్యక్రమం జరిపించుతారు. నల్ల పూసలతాడును కూడా మూడు ముళ్లు వేయించుతారు. ఇక వధూవరులతో కలిసి సమీప బంధుమితృల కోలాహలం మధ్య "భుజం బంతి భోజనాల" హడావిడి వుంటుంది. వధూవరులిద్దరిని పక్క-పక్కన కూచోబెట్టి, వెండి కంచాలలో ఇరువురికీ భోజనాలు వడ్డించి, వరుసకు బావా-మరదళ్లలాంటి వారి వేళా-కోళాల మధ్య భోజన చేయడం ఆరంభించుతారు అందరూ. మధ్యలో పాటలు, వధూవరులు ఒకరి కంచంలోది మరొకరి కంచంలో వుంచడం, పక్క వారందరూ తినమని బలవంతం చేయడం అక్కడ జరిగే వేడుక.
ఉంగరాలు తీయడమనే "ప్రధానాంగుళీయకం" వేడుకలో మూత కురుచగా ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోసి, దానిలో మెట్టెలు, ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నించే తంతుంటుంది. వుంగరం దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. చూడటానికి సరదాగా కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం. ఇక్కడా బంధుమితృల కోలాహలం చోటుచేసుకుంటుంది. ఆ కాసేపు అది ఇరు పక్షాల వారి మధ్య ఒక నిజమైన పోటీలా జరుగుతుంది.

అప్పగింతలు-గృహ ప్రవేశం

కన్యా దాత ఇంట్లో జరిగే వేడుకల్లో "అప్పగింతలు" కార్యక్రమం అన్నింటిలోకి చివరిది-ఉద్వేగ భరితమైంది. సాధారణంగా పెళ్లి జరిగిన రోజున అర్థరాత్రి దాటింతర్వాత అప్పగింతల మంత్రంతో మొదలవుతుంది కార్యక్రమం. అయితే ఇటీవలి కాలంలో, వసతి గృహాల్లో పెళ్ళిళ్లు జరుపుకోవాల్సిన పరిస్థితుల్లో, వాళ్లిచ్చిన వేళకు మించి అక్కడ వుండడం కుదరనందున, అన్నీ ఆ టైంలోపల జరిపిస్తున్నారు. వధూవరులకు చూపాల్సిన "అరుంధతి" నక్షత్రాన్ని కూడా పట్ట పగలు చూపించి "కనబడిందా?" అని అడుగుతున్నాడు పురోహితుడు. కనబడిందని జవాబిస్తున్నారు వధూవరులు.
భజంత్రీలు అప్పగింతల పాట పాడుతుంటే, పెళ్ళి పీటపై వధువును మధ్యలో కూర్చుండ బెట్టి, పాలలో చేతిని ముంచిన తర్వాత అప్పగింతల తంతు జరుగుతుంది. అప్పగించిన పెద్దలందరికీ బట్టలు పెట్టే తంతుంటుంది. వధువు రెండు చేతులను పాలలో ముంచి వరుని చేతిలో పెట్టి అప్పగించాలి. అప్పగించుతూ: "అష్టవర్షాభవేత్ కన్యా, పుత్రవత్ పాలితా మయా, ఇదానీం తవ దాస్యామి, దత్తా స్నేహేన పాలయా" అంటాడు కన్యా దాత. అంటే, "పుత్రుడితో సమానంగా పెంచిన ఎనిమిది సంవత్సరాల వయసున్న ఈ కన్యను నీకిస్తున్నాను. నీవు ఈమెను ప్రేమాభిమానాలతో కాపాడు." అని దాని అర్థం. అదే మంత్రం చదువుతుంటే, అదే అర్థం వచ్చేలా, అత్తమామలు వరుడి ప్రక్కన కూర్చుని వుంటే, వారికి కూడా వధువు రెండు చేతులు పాలలో ముంచి వారి చేతులో అద్ది, "మీ పుత్రిక వలె కాపాడాలి" అని అప్పగిస్తారు. బహుశా అప్పగింతల ద్వారా, పెళ్లికూతురును అత్తవారింటి వైపు బంధువులందరికీ పరిచయం చేయడం కొరకు, ఈ వేడుకను జరిపిస్తుండవచ్చు.
అప్పగింతల ముందర "వడి కట్టు" వధువుకు కట్టు తారు. వడి కట్టులో శేరుంబావు బియ్యం, వెండి గిన్నె, కొబ్బరి చిప్ప వుంచుతారు. అప్పగింతల కార్యక్రమంలో వధువును అప్పగించే ముందర, "బొమ్మ"ను అప్పగించడమనే, చిన్న వేడుక జరిపారు. ఒక మంచం మీద జంఫఖానా పరిచి, జాకెట్ గుడ్డతో ఊయలలాగా చేసి, అందులో ఈ చెక్క బొమ్మను నిదురిస్తున్న భంగిమలో వుంచుతారు. వధూవరుల కొంగులను కలిపి, అందులో ఎర్ర నీరు ఊయలలోంచి పడే విధంగా పోస్తారు. వధువుతో వరుడికి ఆ బొమ్మనిప్పించి, తాను పనిమీద వున్నాననీ, బొమ్మ రూపంలో వున్న వాళ్ల పాప-బాబును జాగ్రత్తగా చూస్తుండమనీ అనిపిస్తారు. అలా మూడు సార్లనిపించిన తర్వాత, ఆడబిడ్డకు ఆ పనిని అప్పగించుతారు. ఆడ బిడ్డకు బొట్టు పెట్టి, చీరె ఇచ్చి, బొమ్మను చేతిలో వుంచుతారు. ఇదయిన పిదప, అయిదుగురు దంపతులకు వధూవరులతో, (దంపత) తాంబూలాలు ఇప్పించుతారు. పెద్దలందరికీ వీరిరువురితో దండాలు పెట్టిస్తారు.
ఈ అప్పగింతలు చేసేవారికి, చూసే వారిలో చాలామందికి కంట తడిపెట్టిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఇన్నాళ్లుగా పెంచి పోషించిన కూతురు తమను విడిచి అత్త వారింటికి వెళుతుందని ఆమెను వదలి వుండాలే అనే బాధ కన్నవారికి కలగడం సహజం. అప్పగింతల కార్యక్రమం అనంతరం, పెళ్ళికూతురును లోపటికి తీసుకునిపోయి, పెరుగు అన్నం పెట్టి, దేవుడికి దండం పెట్టించి, బయట ఇంటి సింహద్వారం దగ్గర తల్లి కడుపుపై మజ్జిగతో అద్దించి, గడపకు చేతులతో కొట్టించుతారు. ఇవన్నీఅయ్యాక విడిది గృహ ప్రవేశానికి పంపుతారు. ఇక అంతటితో కన్యా దాత ఇంటినుంచి ముందు జరగాల్సిన వేడుక, విడిదికి-అక్కడినుంచి పెళ్లికొడుకు ఇంటికి మారుతుంది.
హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.