Showing posts with label సిలికాన్ వాలీ. Show all posts
Showing posts with label సిలికాన్ వాలీ. Show all posts

Wednesday, December 26, 2012

తెలుగు భాష - సాహిత్యాల కలయిక నేపధ్యమే మానవతావాదం: వనం జ్వాలా నరసింహారావు


తెలుగు భాష - సాహిత్యాల 
కలయిక నేపధ్యమే మానవతావాదం

వనం జ్వాలా నరసింహారావు

 మానవతావాదం అనాదిగా సాగుతున్న ఒక మహోద్యమం. సంస్కృతీ-సాహిత్యాల సాంప్రదాయిక నేపధ్యం మీద ఆధారపడి వుండే రీతిలో మానవతావాద ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. మేధావులు, సాహిత్యాభిలాషులు, శాస్త్రీయ దృక్ఫధంతో ఆలోచన చేసిన పలువురు, శతాబ్దాల పూర్వమే, మానవ విలువల పరిరక్షణకు ఆరంభించిన ఆ మహోద్యమం ఈ నాటికీ ప్రత్యక్షంగా-పరోక్షంగా వాటిని కాపాడేందుకు దోహదపడుతూనే వుంది. క్రైస్తవమత మానవతావాదమనీ, సాంస్కృతిక మానవతావాదమనీ, సాహితీ మానవతావాదమనీ, రాజకీయపరమైన మానవతావాదమనీ, మతపరమైన మానవతావాదమనీ రకరకాల పేర్లతో-ఎవరికి నచ్చిన విధంగా వారు పిలువసాగారు. రామరాజ్యమైనా, గ్రామరాజ్యమైనా, కార్మికరాజ్యమైనా, శ్రామికరాజ్యమైనా.. .. ... ... మానవతా దృక్పథం కలిగిందైతేనే, మానవ విలువలకు అర్థముంటుంది. అలా కానప్పుడు, ఏదో ఒక రూపంలో, మానవ విలువలు కాపాడబడేందుకు నిరంతర పోరాటం జరుగుతూనే వుంటుంది. ఆ పోరాటానికి మొదలు-చివర అంటూ ఏమీలేదు. మానవ విలువల పరిరక్షణకు అసలు-సిసలైన సాధనం మాత్రం సాహిత్యమే. పండితులైనా-పామరులైనా సంభాషించుకునేది వ్యావహారిక భాషలోనే గాని గ్రాంథికంలో కాదు. రచయితకు, పాఠకుడికి మధ్య వుండాల్సిన సంబంధం సంభాషణ లాంటిదే. ఇరువురు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరు చెప్పేది ఇంకొకరికి అర్థంకాకపోతే సంభాషణకు అర్థంలేదు. రచయిత రాసింది పాఠకుడికి అర్థంకాకపోతే అసలు భాషే కాదంటాడు జీన్ పాల్ సాత్రే "సాహిత్యం అంటే ఏంటి" అన్న తన పుస్తకంలో. "వాక్యం రసాత్మకం కావ్యం" అన్న విషయం అందరికీ తెలిసిందే. రచయిత తన మేథస్సునుండి పెల్లుబుకిన ఆలోచనను, పాఠకులు అర్థంచేసుకుని-ఆకళింపు చేసుకునే రీతిలో వాక్యంగా మలిచినప్పుడే, ఆ రచనకు గుర్తింపు వస్తుందంటాడు జీన్ పాల్ సాత్రే. నలుగురితో చదివించలేని రచన చిత్తుకాగితంతో సమాన మంటాడు. రచనంటే కేవలం సాహితీ ప్రక్రియ మాత్రమే కాదు-ఉత్పత్తిదారుడుకీ (రచయిత), వినియోగదారుడుకీ (పాఠకుడు) మధ్య తలెత్తనున్న ఘర్షణ.

అతి ప్రాచీనకాలంనాటి నుంచి ఇప్పటికీ వాడుకలో వుండి, వ్యావహారిక భాషగా, సాహిత్యంగా ఉపయోగంలో వున్న వాటిలో తమిళం, తెలుగు భాషలను పేర్కొనాలి. సంస్కృతం, లాటిన్ భాషల్లో సంభాషించు కోవడం దాదాపు లేనట్లే. కొద్ది మార్పులతో గ్రీకు భాష ఇంకా వాడుకలో వుందనాలి. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో తెలుగు ఒకటి. తెలుగు వారుంటున్న ప్రాంతంలోనే ఆది మానవుడు తొలుత సంచరించాడని, దక్షిణా పథానున్న తూర్పు కోస్తా ప్రాంతంలో తిరిగి, తర్వాత పంజాబుకు తరలిపోయాడని చరిత్రకారులంటారు. రాతియుగం నాటి మానవుడు సంచరించిన ప్రీతిపాత్రమైన ప్రదేశంగా కూడా ఆంధ్ర ప్రాంతాన్ని పేర్కొన్నారంటారు. తెలుగువారిప్పుడు నివసించని ప్రదేశమంటూ లేదు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు, అమెరికాతో సహా ప్రపంచంలోని పలు దేశాల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న తెలుగువారు ఎందరో వున్నారు. ముక్కోటి ఆంధ్రులల్లా ఆరుకోట్లకెదిగి, ఎనిమిదికోట్లు దాటి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది కోట్లకు చేరుకున్నారని. అమెరికా కాలిఫోర్నియా లోని సిలికాన్ వాలీనిప్పుడు ఆంధ్రా వాలీగా-తెలుగువాడి వాలీగా పిలవాలి. ఇదిలా వుంటే, తెలుగువారుండే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ పేర్లతో పిలిచే మూడు ప్రాంతాలున్నాయి. ఈ మూడు ప్రాంతాల్లో భిన్నమైన యాసలో తెలుగు మాట్లాడే వారుకూడా వున్నారు.


నవంబర్ 1, 1956న తెలుగువారుండే ప్రాంతాలన్నీ కలపాలని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం నివేదిక ఆధారంగా విశాలాంధ్ర ఏర్పాటయింది. తెలుగు వారందరూ కలిసుందామని అనుకున్నారో-లేదో తెలియదుగాని, కలిసుందామనుకున్న అలనాటి మద్రాస్ తెలుగువారు-తమిళులు మాత్రం విడిపోయారు. భాషాపరంగా ఒకరిమీద పడ్డ ఇంకొకరి ప్రభావం అలానే చెక్కు చెదరకుండా వుంది. ఆంధ్ర ప్రదేశ్ లో నివసించే ఏ ప్ర్రాంతం వారైనా మాట్లాడే భాషను "ఆంధ్రము" అని, "తెనుగు" అని, "తెలుగు" అని అంటాం. ప్రాచీనకాలంనాటి సంస్కృత రచనల్లో ఆంధ్రులను గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు "ఆంధ్ర" అనో, "అంధక" అనో పేర్కొనేవారు. ఆ ప్రాంతంలో నివసించేవారిని ఒక తెగగానో, సమాజంగానో, దేశీయులుగానో గుర్తించేందుకు బహుశా అలాంటి పదప్రయోగం చేసుండాలి. భాషాపరమైన పదప్రయోగాలు చాలాకాలం తర్వాతే వాడబడ్డాయి. ఆంధ్ర ప్రాంతం గురించిన ప్రస్తావన రామాయణంలోను, బౌద్ధాయనంలోను, మనుస్మృతిలోను, మత్స్యపురాణంలోను కనిపిస్తుంది. దక్షిణ దిక్కును తెలిపే "తెన్" అనే ద్రావిడ పదం ఆధారంగా "తెనుగు" ఉత్పన్నమైందని కొందరు భాషా కోవిదుల అభిప్రాయం. ద్రావిడులు తెలుగుదేశానికి ఉత్తర దిక్కుగా నివసించారని తెలియచేసే ప్రయత్నంలోనే, దక్షిణాది వారు మాట్లాడే భాషను "తెనుగు" అని సూచించారు. కాకపోతే శాస్త్రీయమైన సాక్ష్యాధారాలు ఆ సూచనకంతగా లభ్యంకాలేదు. "త్రి లింగ" నుండి తెలుగు ఆవిర్భవించిందని అందరూ అనుకుండేదే. త్రి లింగ కూడా "త్రి-కళింగ" నుండి వచ్చిందే. ఆంధ్రులను "మస్సాలియ" అని, "మైసోలియ" అను గ్రీకులు సంబోధించేవారు. కృష్ణానదిని కూడా వారు అలానే పిలిచేవారు "మసూలీపట్నం", "మచిలీపట్నం", "బందర్" అన్న పేరుతో ఇప్పటికీ కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రాన్ని పిలుస్తాం.

విశ్వామిత్ర మహర్షి కోపానికి గురై, దేశ బహిష్కృతులైన ఆయన ఏభైమంది కొడుకుల వారసులే ఆంధ్రులయ్యారని అయితరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. వారందరు ఆర్యావర్తం సరిహద్దుల్లోకి, తూర్పు-దక్షిణ ప్రాంతాల్లోకి వ్యాపించారు. ఆర్యులనీ, ద్రావిడులనీ వాడుకలో వున్న పదాలు ఎందుకు ఉపయోగించారో ఇదమిద్ధంగా తెలియదు. ఒక తెగవారినో, భాష మాట్లాడేవారినో, సంస్కృతిని పాటించేవారినో పరోక్షంగా ప్రస్తావించడానికి అలా వాడి వుండవచ్చు. లేదా గుర్తించడంలోనే పొరబడి వుండవచ్చు. ఇదిలా వుండగా, ఆంధ్ర వాల్మీకి రామాయణంలో, తురకలపూర్వీకులైన ఇరానీయులు ఆర్య శబ్దంనుండి పుట్టినవారేనని రాయబడింది. ఆర్యన్ కు వికృతి "అయిరాన్: అనీ, అదే ఇరాన్ గా మారిందనీ చెప్పబడింది. మధ్య ప్రాంత ద్రావిడ జాతికి చెందిన గోండ్-భిల్లీ భాషలకు, తెలుగుకు అవినాభావ సంబంధముందని కొందరంటారు. ప్రాచీనకాలంలో ఆంధ్ర రాజ్యానికి శ్రీకాకుళం రాజధానిగా వుండేదట. మతపరంగా అధ్యయనం చేసి, విశ్లేషణ చేసిన మరికొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మౌర్యులకు పూర్వమే ఆంధ్ర ప్రాంతంలో జైనమతం ప్రచారంలో వుంది. అశోక చక్రవర్తి కాలంలో వైభవంగా వర్ధిల్లిందని అనుకునే బౌద్ధమతం కంటే ముందే జైనమతాన్ని అనుసరించినవారెందరో వున్నారు. క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం-క్రీస్తు శకం ఆరవ శతాబ్దం మధ్య కాలంలో ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధమత ప్రభావం ఎక్కువగా వుండేది. బౌద్ధమతం బోధించిన సర్వ మానవ సిద్ధాంతం, మానవ విలువలు, ప్రజలమధ్యనున్న అంతరాలను తొలగించి, అన్నిజాతులవారిని-తెగలవారిని కులమతాలకు అతీతంగా ఐకమత్యం చేసింది. అత్యంత బలీయమైన, శక్తివంతమైన శాతవాహన రాజుల పాలన స్థాపనకు దారితీసింది.

దక్కన్ పీఠభూమినే దక్షిణాపథం అనేవారు. దానికి ఆగ్నేయ దిక్కుగా ఆంధ్ర ప్రాంతముంది. వింధ్య పర్వతాలను దాటి దక్షిణ ప్రాంతానికి తొలుత వలస వచ్చిన ఆర్యుడు అగస్త్య మహాముని అంటారు. శివలింగాన్ని మొదట కనుగొన్నది ఆయనేననీ, అందువల్లనే ఆంధ్రలోని ఎన్నో శివాలయాలలో వున్న శివలింగాలను అగస్త్యేశ్వరం అనికూడా పిలుస్తారని అంటారు. ఆపస్తంబ ధర్మ సూత్రాల ప్రకారం, క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో, ఆంధ్ర ప్రాంతంలో వైదిక మతం వేళ్లూనుకోసాగింది. భగవత్-భాగవత మతం కూడా ప్రచారంలోకి వచ్చింది. శ్రీకృష్ణుడి బోధనలను తెలియచేస్తూ, క్రమేపీ వైష్ణవ మతంగా రూపాంతరము చెందిందే భాగవత సిద్ధాంతం. సాంఖ్య-యోగ ఆధారంగా భాగవతమతం వుందని భావించినప్పటికీ, దాంట్లో తాత్త్విక చింతనకు సంబంధించిన పలు అంశాలు నిగూఢంగా వున్నాయి వాస్తవానికి. కులాలకు అతీతంగా, అన్ని కులాలవారు పాటించే మతంగా భాగవతం మొదట్లో ప్రచారంలో వున్నప్పటికీ, బ్రాహ్మణుల జోక్యంతో, బ్రాహ్మణ్యం ఆవిర్భవించడంతో, భాగవత మతం, బ్రాహ్మణ్యం కలిసిపోయాయి. కులాల గుర్తింపు మొదలయింది. ఆంధ్ర ప్రాంతంలో అతిపురాతనమైంది, ఎక్కువమంది అనుసరించేది శైవమతం. దాని ప్రభావం కూడా ఎక్కువే. అలానే శాక్తేయ మతాన్ని కొందరు అనుసరించేవారు. వీరశైవం వున్నా దాని ప్రభావం అంతగా లేదనవచ్చునేమో. బ్రాహ్మణుల మూలాన భాగవతమతం వారి చేతుల్లోకి పోయినప్పటికీ, బ్రాహ్మణుడి కర్తవ్యం సాధారణంగా వైదిక పూజలు జరిపించడానికే గాని, కులాధిక్యతకు ప్రతిరూపం కావడం మాత్రం కాదనాలి.

ఆంధ్రుల మతపరమైన నమ్మకాలు-సంప్రదాయాలు తెలుగు భాషమీద, అదేవిధంగా తెలుగు భాష మతపరమైన చారిత్రాకాంశాలమీద ప్రభావం చూపించి వుండాలి. రాజుల-చక్రవర్తుల ప్రోత్సాహంతో, స్వయంగా వాళ్లే ఒక మతాన్ని నమ్మి అనుసరించడంతో, దాని ప్రభావం జన బాహుళ్యం పైనా, వారి జీవన శైలి పైనా, మానవ విలువల పైనా స్పష్టంగా పడసాగింది. పర్యవసానంగా వైదిక మతం మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానంగా, ఎవరికైనా ఆ సిద్ధాంతాలు పాటించడం తేలికైనటువంటిదిగా, అందరికీ అందుబాటులోకి రావడం జరిగింది. అదే హిందు మతంగా వాడుకలోకొచ్చింది. బహుశా ఎన్నో మతాలకు మాతృకయింది. ప్రపంచ భాషలకు సంస్కృతం ఎలానో, ప్రపంచంలోని మతాలన్నిటికీ హిందు మతం అలానే మాతృకనాలి. అందుకేనేమో మార్క్స్ తన గతి తార్కిక భౌతికవాదంలో ఎన్నో సందర్భాల్లో పరోక్షంగా వైదిక సిద్ధాంతాలను అన్వయించుకుంటాడు.

కృతయుగంలో కూడా "ఆంధ్రము" అనే విషయానికి సంబంధించిన ప్రస్తావన వుంది. అగ్నిమిత్ర అనే ఒక రాజుండేవాడు. ఒక వేసవికాలంలో ఎండల తీవ్రతకు ఆయనకు దృష్టి లోపం వచ్చి, కళ్లు కనిపించలేదు. సూర్య భగవానుడిని ప్రార్థించాడట. అగ్నిమిత్రకు ఆయన ప్రత్యక్షమై, తనను కొలిచేందుకు ఒక కొత్త భాషను నేర్పాడంటారు. సూర్యుడిని అగ్నిమిత్ర అదే భాషలో ప్రార్థించడంతో, ఆ భాషకున్న పదజాల ప్రభావంతో, అగ్నిమిత్రకు పోయిన దృష్టి తిరిగొచ్చింది. సంస్కృతంలో "అంధ" అంటే "గుడ్డి" అని-చీకటి అని అర్థమొస్తుంది. చీకటిని తొలగించి, గుడ్డి తనాన్ని పోగొట్టగలిగింది కాబట్టి ఆయన నేర్చుకున్న భాషకు "ఆంధ్ర భాష" అని పేరొచ్చింది. ఒక్కో యుగంలో ఒక్కోరకంగా తెలుగు భాష వాడుకలో వుందని కొందరి నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగా కలియుగంలో తెలుగును "కళింగ ఆంధ్ర భాష" అనీ, "రౌద్ర ఆంధ్ర భాష" అనీ ఏర్పాటుచేసింది శాతకర్ణులకు చెందిన నంది వర్ధనుడు-ఆయన శిష్యుడు దేవల రాయ అని అంటారు. ఆంధ్ర భాషకు రావణాసురుడు వ్యాకరణం రాశాడంటారు. ఆ రాసిన రావణుడు, రామాయణంలో పేర్కొన్న రావణుడే కావాలని లేదు-కాకూడదనీ లేదు. ఆంధ్ర దేశానికి, సింహళ దేశానికి మధ్య మతపరమైన అవినాభావ సంబంధాలున్నందున, తెలుగు భాషకు ఆ దేశానికి చెందిన ఒకవ్యక్తి వ్యాకరణం రాశాడంటే నమ్మ దగ్గ విషయంగానే భావించాలి. ఈ నమ్మకాల్లో, గాథల్లో, మౌఖికంగా ప్రచారంలో వున్న వాటిల్లో, కొంతలో కొంత వాస్తవం వుందనేది మాత్రం వాస్తవమే. భాషకున్న వ్యాకరణ నిర్మాణం-నిబంధనలు-మౌలికమైన పదజాల ఒరవడిని పరిగణలోకి తీసుకొని, తెలుగు భాషను అతి ప్రాచీనమైన ద్రావిడ జాతి భాషలకు చెందినదిగా శాస్త్రవేత్తలు-పరిశోధకులు-భాషా కోవిదులు-పండితులు నిర్ణయించారు. మధ్య ప్రాంత ద్రావిడ జాతి భాషల్లో బహుశా తెలుగు ఒక్కటే అతిపెద్ద వాడుక భాషగానూ, భౌగోళికంగా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన భాషగానూ, ఉత్తర-దక్షిణాల మధ్య వారధిగా వుండే భాషగానూ, ఆర్యుల-ద్రావిడుల మధ్య వారధిగా వుండే భాషగానూ పేర్కొనడం అతిశయోక్తికాదేమో.

పింగళి లక్ష్మీకాంతం గారు చెప్పినదాని ప్రకారం, భాషాపరంగా, తెలుగు భాషారంభం-అభివృద్ధి నన్నయకు పూర్వం-క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో మొదలై, ఆధునిక కాలం నాటి క్రీస్తుపూర్వం 1875 వరకు, ఆ తర్వాత కొనసాగింది-కొనసాగుతూనే వుంది. ప్రాచీనకాలంలో నాటి తెలుగు నాలుగు దశల్లో అభివృద్ధి చెందిందనవచ్చు. అవి: తెలుగుకు పూర్వం నెలకొన్న దశ, గ్రాంథిక తెలుగుకు పూర్వం నెలకొన్న దశ, గ్రాంథిక తెలుగు దశ, సాహిత్య దశలుగా విభజించవచ్చు. తెలుగుకు పూర్వపు దశ అంటే క్రీస్తుశకం 200 వరకే సాగిందనాలి. క్రీస్తుశకం 200-600 మధ్యకాలం వరకు గ్రాంథిక తెలుగుకు పూర్వ దశ కొనసాగింది. గ్రాంథిక దశ-వివిధ రకాల వాడుక శైలి దశ క్రీస్తుశకం 600-900 మధ్య కాలానికి చెందింది. దీని ఆధారంగా, తెలుగు భాష దక్షిణాది ద్రావిడ భాషల్లోంచి ఉద్భవించిందేననీ, ఒక ప్రత్యేకమైన భాషగా క్రీస్తుపూర్వం ఎన్నో శతాబ్దాల క్రితంనుండే వాడుకలో వుందనీ, బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు. "సాలంకాయనులుల" శాసనాల ఆధారంగా, అతి పురాతనమైన తెలుగు లిపి "వెంగి"-"తెలుగు కన్నడ" లభ్యమయిందని తెలుస్తోంది. ద్రావిడ భాషకు చెందినదే అయినప్పటికీ, తెలుగుపై సంస్కృత భాష ప్రభావం అధికంగా వుంది. వాడుకభాషపైనా, గ్రాంథిక భాషపైనా కూడ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అచ్చ తెలుగులో రచనలు చేసినవారు అరుదనాలి. అందుకే మనందరికీ కవిత్రయం నన్నయ-తిక్కన-ఎర్రా ప్రగడ అయితే, శ్రీ శ్రీ గారి కవిత్రయం మాత్రం తిక్కన-వేమన-గురజాడలు. తెలుగు భాషపై సంస్కృతం ప్రభావం పడకుండా అభిమానం చూపిన మొదటి వాడు తిక్కన అని శ్రీ శ్రీ అభిప్రాయం. ఇక ఆధునిక కాలంలో తెలుగు భాష వాడకంలో-ఉపయోగంలో హద్దులనేవి గాని, ఎల్లలనేవి గాని అసలు లేనేలేవు. ఒక వైపు సంస్కృతం ప్రభావం ఇంకా తెలుగు మీద పడుతున్నప్పటికీ, ఎక్కువ ప్రభావం ఆంగ్ల భాషదే అనాలి. నాగరికులందరూ ప్రస్తుతం మాట్లాడుతుండే తెలుగును "తెంగ్లీష్" అనాలి-ఎందుకంటే, అది ప్రధానంగా తెలుగు-ఇంగ్లీషులు కలిపిన భాష కాబట్టి. తమిళం అంతే. ఇంగ్లీష్ పదజాలం లేకుండా ఈ రోజుల్లో బహుశా ఏ భాషా లేదేమో. "వేర్ సెంచరీస్ కో ఎగ్జిస్ట్" అనే భారత ఆంగ్ల సినిమాను రూపొందించిన కృష్ణస్వామి "ఇంగ్లీష్ భారతీయ భాషనీ-దక్షిణ భారతీయ భాషనీ" అంటాడు.

ఇలా మతం, భాష, సాహిత్యం దేని కవే మానవ విలువల పరిరక్షణకు దోహదపడుతున్నాయి. మనిషి తాను భగవంతుడితో మమేకం కావడానికి, తన మూర్తిని భగవంతుడిలో-ఆయన మూర్తిని తనలో చూసుకుంటూ, తద్వారా క్రమశిక్షణతో మెలుగుతూ, తోటి మానవ విలువలను కాపాడేందుకు నిరంతరం పాటుపడుతూనే వుంటాడని ఆశించుదాం.

Sunday, January 10, 2010

జ్వాలా మ్యూజింగ్స్-3 (శాంతా క్లారా టు లాస్ ఏంజల్స్)

శాంతా క్లారా నుండి లాస్ ఏంజల్స్ కు కారులో ప్రయాణం

వనం జ్వాలా నరసింహారావు

అమెరికా-ఉత్తర కాలిఫోర్నియాలోని "శాన్ ఫ్రాన్ సిస్కో" సాగర తీరానికి దక్షిణ భాగాన వున్న అందమైన లోయ ప్రదేశమే "శాంతా క్లారా వాలీ". శాంతా క్లారా కౌంటీ లోని ఎక్కువ భాగంతో సహా శానోజ్ నగరం కూడా ఈ లోయలోనే వున్నాయి. "హృదయాలను పులకరించే మధురమైన లోయ" గా ఒకప్పుడు కవులచే అభివర్ణించబడిన ఈ లోయ ప్రాంతమంతా, ఇప్పటికీ మైళ్ల పర్యంతం, అందమైన వృక్షాలు-పూల పొదలు-పళ్ల చెట్లు-కూరగాయల తోటలు, వ్యాపించి వుంటాయి. 1960 సంవత్సరం వరకు, ప్రపంచంలోనే అతి పెద్ద పళ్ల ఉత్పత్తి ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిందీ లోయ. చుట్టుపక్కలంతా సారవంతమైన భూమి వుండడంతో, వ్యవసాయ ప్రాధాన్యమైన ప్రాంతంగా ఒకప్పుడుండే శాంతా క్లారాలోని చాలా భాగం, క్రమేణ నగరంగా మారిపోయినప్పటికీ, ఇంకా గ్రామీణ ఛాయలు పరిసరాల్లో-ముఖ్యంగా లాస్ ఏంజల్స్ దిక్కుగా పోతుంటే ప్రస్ఫుటంగా దర్శనమిస్తాయి. వాస్తవానికి, "శాంతా క్లారా వాలీ", ఈనాడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన "సిలికాన్ వాలీ", ఒకదానిలో ఇంకోటి అంతర్భాగమే. శాంతా క్లారా వాలీ ఉత్తర కొనే, శాన్ ఫ్రాన్ సిస్కో సాగర తీరానికి దక్షిణాన చివరి ముక్క. వాలీకి నైరుతీ భాగాన అందమైన "శాంతా క్రజ్ పర్వత సముదాయం", ఈశాన్య భాగాన "డైబ్లో కనుమలు" వ్యాపించి వుంటాయి. శాంతా క్లారా నగర ప్రాంతంలోని లిక్ మిల్ రోడ్ లోని ఒక భవన సముదాయంలో మా అబ్బాయి ఆదిత్య వుండే ఫ్లాట్ వుంది.


శాంతా క్లారా చేరుకోవడానికి, హైదరాబాద్ శంషాబాద్ నుంచి బయలుదేరిన మే మెక్కిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ విమానం, శాన్ ఫ్రాన్ సిస్కో విమానాశ్రయంలో లాండ్ అవుతుంటే అదో అద్భుత దృశ్యంలాగా వుంటుంది. సరాసరి సముద్రం మీదనుంచి, అందులో పడబోతోందా అన్న భయం కలిగే విధంగా, పక్కనే నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుంది. ఈ ఒక్కటే కాదు: చుట్టుపక్కలున్న, ఓక్ లాండ్, శాంతా క్లారా, శానోజ్ విమానాశ్రయాలు కూడా అలానే వుంటాయిక్కడ. చుట్టూ సముద్రం-మధ్యలో ఒక ద్వీప కల్పం లాగా విమానాశ్రయం.


శాంతా క్లారా నుండి లాస్ ఏంజల్స్ కు సుమారు 350 మైళ్ల దూరం. విమానాలు, బస్సులున్నప్పటికీ, అక్కడినుంచి డిస్నీ లాండ్ కు-హాలీవుడ్ స్టూడియోలున్న ప్రదేశానికి వెళ్లి రావడానికి నిర్ణయించుకున్నందున మేం (అబ్బాయి ఆదిత్య, శ్రీమతి విజయలక్ష్మి, మనుమడు అన్ష్, నేను) కారులో వెళ్లాం. అక్కడెలాగు మా శ్రీమతి అక్క కొడుకు ప్రశాంత్ ఉద్యోగ రీత్యా వుంటున్నందువల్ల వాడింట్లోనే వుండి చుట్టుపక్కల ప్రదేశాలను చూద్దామనుకున్నాం.


సుమారు ఐదున్నర గంటల ప్రయాణం ఆహ్లాద భరితంగా గడవడానికి కారణం ఆరు సంవత్సరాల వయసున్న మా మనుమడు అన్ష్. వాడికెందుకో నామీద ఆ ప్రయాణంలో కోపమొచ్చింది. హైదరాబాద్ నుంచి శాన్ ఫ్రాన్ సిస్కోకు చేసిన విమాన ప్రయాణంలో వాడికిష్టమైన వాడిని నేనైతే, ఈ ప్రయాణంలో, ఆ ఇష్టం వాడి అమ్మమ్మ మీదికి పోయింది. పైగా నాపై ప్రదర్శించిన కోపానికి వాడిదైన పరిభాషలో, నా పై సినిమా తీసే ప్రతిపాదన దాకా పోయింది. ఆ సినిమాకు వాడే పేరు పెట్టాడు. వాడు తీద్దామనుకున్న ఆ సినిమా పేరు: "అల్ట్రా నైట్రోజెన్ ఉల్టా తాతయ్య-ప్యార్ కర్నేసే వజే ట్రబుల్ కర్తా హై". దారి పొడుగూ, వాడెలా ఆ సినిమాకి కథ, మాటలు, పాటలు రాయ దల్చుకుంది, స్క్రీన్ ప్లే ఎలా వుండబోతుంది, సంగీతం ఎలా సమ కూర్చదల్చాడు అన్నీ వివరించాడు. సినిమాలో నన్ను విలన్ పాత్రకు, వాడి అమ్మమ్మను ప్రధాన పాత్రకు ఎంపిక చేశాడు. నన్నెలా వాడు తన ఆధీనంలో వుంచుకోదలిచాడో అసలు-సిసలైన అనుభవజ్ఞుడైన సినీ దర్శకుడిలా వర్ణిస్తుంటే ఆనందం-ఆశ్చర్యం కలిగింది. గర్వంగా కూడా ఫీలయ్యాం.


శాంతా క్లారా-లాస్ ఏంజల్స్ మధ్య కారు ప్రయాణం చేస్తుంటే విస్తారమైన పంట భూములు, ట్రాక్టర్ల సహాయంతో వ్యవసాయం చేస్తున్న అమెరికన్లు, లారీలలో నింపుకొని తీసుకెళ్తున్న టొమాటోలు-బంగాళ దుంపలు, దారి పొడుగూ కనిపించే రోడ్ పక్కనున్న పంటపొలాల్లో ఏర్పాటు చేసిన కూరగాయల-పళ్ల అమ్మకం దుకాణాలు, సాగునీరు-తాగు నీరు సరఫరాకు సంబంధించిన చెరువులు-నదులు, వాటిపై నిర్మించిన ఆనకట్టలు-రిజర్వాయర్లు, అనేకం దర్శనమిస్తాయి. మన దేశంలో ప్రయాణం చేస్తున్నట్లే అనిపిస్తుంది మధ్య-మధ్యలో. ఆ సుందర దృశ్యాలను ఆస్వాదించుకుంటూ ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో బయలుదేరిన వాళ్లం, సాయంత్రం అయిదింటికల్లా ప్రశాంత్ వుండే ఫ్లాట్ కు చేరుకున్నాం. అమెరికాలో ఎవరినీ అడ్రెస్ అడగక్కరలేదు. జీ.పి.ఎస్ సహాయంతో సరాసరి ఇంటి ముందు వాలొచ్చు. వెళ్తూనే కాళ్లు-చేతులు కడుక్కొని, చీకటి పడగానే, ప్రశాంత్-వాడి భార్య-కూతురుతో సహా అందరం సమీపంలోని "మాలిబు బీచ్" చూడ్డానికి వెళ్లాం.


కాలిఫోర్నియా-పశ్చిమ లాస్ ఏంజల్స్ కౌంటీ లో, సుమారు 20 మైళ్ల నిడివున్నపసిఫిక్ సముద్ర తీరప్రాంతమే "మాలిబు" అని పిలువబడే చిన్న పట్టణం. పూనా-ముంబై మధ్యలో, ఖండాలా లోయలో, హిందీ సినిమా యాక్టర్లు కట్టుకున్నట్లే, హాలీవుడ్ కు చెందిన ఎందరో సినీ తారలు మాలిబు పరిసరాల్లో ఆకాశ హర్మ్యాలను నిర్మించుకున్నారు. మాలిబు బీచ్, లాస్ ఏంజల్స్ ప్రాంతంలో చలి వున్నప్పుడు కూడా, వేడిగా వుంటుందని ప్రతీతి. దక్షిణ ప్రాంత కాలిఫోర్నియాకు చెందిన ధనవంతులైన పారిశ్రామిక వేత్తల ఇళ్లు కూడా మాలిబు బీచ్ ప్రాంతంలోనే వుంటాయి. పసిఫిక్ మహాసముద్రం తీరానికి కేవలం వందల మీటర్ల దూరంలోనే, దాదాపు సముద్రాన్ని ఆనుకొనే వీళ్ల ఇళ్లుంటాయక్కడ. అలా అంత చేరువలో వుంటూ సముద్రాన్ని-బీచ్ నూ అనునిత్యం దర్శించుకొని ఆనందిస్తుంటారు.


మాలిబు బీచ్ కు మేం చేరుకొనేసరికి సుమారు రాత్రి ఎనిమిదయింది. అయినా వందల సంఖ్యలో పర్యాటకులున్నారింకా. సముద్రంలో దిగి కాసేపు, బీచ్ లో కూచొని ఇంకొంచెం సేపు, సరదాగా గడిపాం. మాకంటే కూడా చిన్న పిల్లలిద్దరు బాగా ఎంజాయ్ చేశారు. మర్నాడు ఉదయమే డిస్నీ లాండ్ ప్రోగ్రాం వుంది కనుక ఆలశ్యం చేయకుండా, త్వరగా ఇల్లు చేరుకున్నాం.