సంస్కారం లేని సామాజిక
శాస్త్రవేత్త
వనం జ్వాలా నరసింహారావు
(ఒక సామాజిక వేత్త అర్థ
రాహిత్యం-ఆంధ్రజ్యోతి 7-7-2015)
రాష్ట్ర
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గవర్నర్కు, రాష్ట్రపతికి
పాదాభివందనం చేయడాన్ని వక్రీకరించి భాష్యం చెప్పిన సామాజిక శాస్త్రవేత్త కంచ
ఐలయ్యకు ఇలా రాయడం
(ఆంధ్రజ్యోతి-ఎడిట్ పేజి 05-07-2015), మాట్లాడడం కొత్తేమీ కాదు. తన వ్యాసాలలో, పుస్తకాలలో అను నిత్యం
బ్రాహ్మణ్యాన్ని, బ్రాహ్మణులను "బాపనోడు" అనే
పదాలతో కించపరిచే వ్యాఖ్యలు చేయడం, అది
తప్పని చెప్పిన వారితో వాగ్వాదానికి దిగడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. హిందూ
మతాన్ని అదే పనిగా అర్థం పర్థం లేని వ్యాఖ్యలతో విమర్శించడం కూడా ఆయనకు నిత్య
కృత్యం.
మొన్న
రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చినప్పుడు, హకీం
పేట విమానాశ్రయంలో ఆయన విమానం దిగిన తరువాత, రాష్ట్రపతికి
స్వాగతం పలికే క్రమంలో,
ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చిన
వెంటనే, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తలవంచి
ప్రణబ్ ముఖర్జీకి పాదాభివందనం చేశారు. వెంటనే రాష్ట్రపతి ఆయనను భుజం తట్టి
ఆశీర్వదించారు. ఆ తర్వాత చేతులు జోడించి ముఖ్యమంత్రి
రాష్ట్రపతికి నమస్కారం చేసారు. ఇదే రీతిలో కొన్నాళ్ల క్రితం మరో సందర్భంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్కు
యాదగిరిగుట్టలో చినజీయర్ స్వామి సమక్షంలో ముఖ్యమంత్రి పాదాభివందనం చేశారు. వీటిని
ఒక విడ్డూరంగా, ఇదేదో బ్రాహ్మణ్యాన్ని మాత్రమే గౌరవించినట్లు
చిత్రీకరించడం
కొందరు మేధావుల
కుసంస్కారానికి నిదర్శనం. నమస్కారం చేసేటప్పుడు కానీ, పాదాభివందనం
చేసేటప్పుడు కానీ, ఎవరికైతే
అలా చేస్తున్నామో,
ఆ వ్యక్తి బ్రాహ్మణుడా, బ్రాహ్మణేతరుడా అని ఎవరూ చూడరు.
నమస్కారానికి అర్హుడా?
కాదా? అనేదే చూస్తారు. పాదాభివందనం చేసే
విషయంలో ఆర్హత విషయాన్ని మరింత లోతుగా
ఆలోచించడం, బేరీజు వేయడం సమంజసం.
పాదాభివందనం
చేయడం అనేది ఎదుటి వ్యక్తుల వయస్సు, జ్ఞానం, పెద్దరికం, దైవత్వాలకు ఇచ్చే గౌరవం. వారి
నిస్వార్థపూరిత ప్రేమ,
సమాజం కోసం చేసే త్యాగాలకు
గుర్తుగా ఈ పాదాభివందనాన్ని చేస్తాం. ఇలా పాదాభివందనాలను నిత్యం కానీ, లేదా ముఖ్యమైన కొన్ని సందర్భాలలో
చేయడం కానీ భారతీయ సంస్కృతి-సంప్రదాయం. ఇలా భక్తితో తలవంచి వారి పాదాలకు
నమస్కరించినప్పుడు అనుకూల శక్తి రూపంలో వారి నుంచి మంచి కోరికలు, ఆశీర్వాదాలు అందుకుంటున్నట్లు
భావించాలి. కుటుంబంలో,
సమాజంలో ప్రజల మధ్య
సామరస్యాన్ని, పరస్పర ప్రేమ, గౌరవాలతో కూడిన వాతావరణాన్ని ఈ
సంప్రదాయం సృష్టించగలదని గుర్తించాలి. జ్ఞాన
వృద్ధులైన వారి పాదాలకు చేసే నమస్కారమే పాదాభివందనం. వయస్సుచే కాని, విద్యచేత కాని అధికు లైనవారికి
ఎదురుగా వెళ్లి నమస్కరిస్తే,
వారికి ఆయువు, విద్య, కీర్తి, బలం, వృద్ధి
లభిస్తాయని మను ధర్మశాస్త్రంలో ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి మొత్తం వ్యవహారాన్ని
బ్రాహ్మణ్యంతో, బ్రాహ్మణ కులంతో ముడిపెట్టి విమర్శలు
చేయడం తగని పని.
సామాజిక
శాస్త్రవేత్తగా-విశ్లేషకుడిగా,
విద్యాధికుడిగా పేరున్న కంచ
ఐలయ్య దృష్టిలో, ఆయన ఆలోచనా ధోరణికి వ్యతిరేకంగా వున్న
ప్రతి చిన్నా-పెద్దా విషయం తప్పుగానే కనిపిస్తుంది. ఆయన తన
పుస్తకాలలో, వ్యాసాలలో బ్రాహ్మణులను హిందూ
మతాన్ని కించపరిచి రాసినట్లే, ఆయన కులాన్ని కాని, ఇతర కులాల వారిని కాని బ్రాహ్మణులు
కాని మరెవరైనా కాని విమర్శిస్తే ఆయన వూరుకుంటాడా? తమ
పేర్ల పక్కన కులాలను తగిలించుకుని తిరుగుతున్న ఈ రోజుల్లో బ్రాహ్మణుల ఆచార
వ్యవహారానికి సంబంధించిన జంధ్యం వేసుకుని పవిత్ర పుణ్య క్షేత్రంలో కనిపించిన గవర్నర్ను
పరుష పదజాలంతో విమర్శించిన ఆయన్నేమనాలి? ఒక్క
బ్రాహ్మణులే కాదు....చాలామంది ఇతర కులస్తులు కూడా దేవుడి గుళ్లోకి వెళ్లేటప్పుడు
వంటిపై నున్న అంగీ విప్పి వేయడం అనాదిగా వస్తున్న ఆచారం. జంధ్యం వేసుకునే వారిలో
కొందరు బ్రాహ్మణేతరులు కూడా వుంటారనే విషయం ఆ మేధావికి తెలియదా? పబ్లిక్గా బట్టలు లేకుండా శరీరం
పైభాగాన్ని చూపిస్తూ కులవృత్తులు చేసుకుంటున్న వారెందరు మనకు మన పల్లెల్లో
కనిపించరు? వారందరూ ప్రదర్శించని కులాన్ని ఒక్క
గవర్నరే ప్రదర్శించారా?
"1947లో భారత
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొట్ట మొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర
గవర్నర్, రాష్ట్రపతి
కాళ్లను పబ్లిక్గా మొక్కగా మనం చూస్తున్న మహత్తర ఘట్టం" అనడం
కూడా వాస్తవం కాదు. బ్రాహ్మణేతరుడైన సత్య సాయిబాబాకు దేశ
విదేశ ప్రముఖులెందరో పాదాభివందనం చేశారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి
వ్యక్తిగత వ్యవహారం కాదని మరో విమర్శ చేశారు ఐలయ్య. అలాగే ఆయన అన్నట్లు, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న సమస్య అంతకంటే కాదు. ఆత్మవంచన-విశ్వాసాలను ప్రదర్శించడం కూడా కాదు.
సభ్యతకు,
సంస్కారానికి, ఆచార వ్యవహారానికి, అనాదిగా వస్తున్న
నమ్మకానికి, మీదుమిక్కిలి
సాంప్రదాయానికి అసలు సిసలైన నిదర్శనం. పెద్దలకు పాదాభివందనం చేయడం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఆ
పదవిలోకి రావడానికి ముందునుంచే అలవాటుందనే విషయం ఆ సామాజిక శాస్త్రవేత్త
వ్యాసంలోనే వుంది. కాకపోతే, ఆయన అప్పట్లో పాదాభివందనం చేసిన జయశంకర్ బీసీ అనే విషయం
చంద్రశేఖర్ రావుకు తెలియదని చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. బహుశా ఈ రాష్ట్రంలో
బ్రాహ్మణులెవరో,
బ్రాహ్మణేతరులెవరో
ఒక్క ఆ సామాజిక శాస్త్రవేత్తకు తప్ప మరెవరికీ తెలియదేమో! ఆ
సామాజిక శాస్త్రవేత్త కుసంస్కారానికి మరో నిదర్శనం, చిన్నతనం నుంచే ఆయనకు
పెద్దలకు నమస్కరించాలన్న కనీస అవగాహన కూడా లేకపోవడం. కర్మకాండలు చేయించడానికి
పనికొచ్చిన బ్రాహ్మణుడు,
కాళ్లు
మొక్కడానికి పనికిరాడా?
అప్పటినుంచే
బ్రాహ్మణత్వంపై తన తిరుగుబాటు మొదలైంది అనడం కన్నా, ఆ విధంగా తన మూర్ఖత్వం, ఇతరులను కించపరచాలన్న భావన మొదలైంది అనడం సబబేమో! హిందూత్వం అనేది మతం
అయినా-కాకపోయినా, మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన
జీవనవిధానం అనే సంగతి కంచ ఐలయ్య గుర్తుచేసుకుంటే మంచిదేమో!
అహర్నిశలూ కంచ ఐలయ్య లాంటి వారి నుంచి విమర్శలనెదుర్కునే బ్రాహ్మణుల
విషయానికొస్తే, ఒక నాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా
కృషిచేసిన బ్రాహ్మణులను ఈ రోజుల్లో ప్రతి దానికీ టార్గెట్ చేస్తున్నారు
కొందరు. హైందవ మతంలో, ఆచారంలో, బ్రాహ్మణులు కూడా ఒక భాగం. ఇతర కులాల వారు,
వర్ణాల వారూ చేయలేని అనేక పనులను, వైదిక కర్మ
కాండలను చేయగల సామర్థ్యం కేవలం ఒక్క బ్రాహ్మణులకే నేటికీ వుందనడంలో అతిశయోక్తి
లేదు. పూజారులుగా, అర్చకులుగా, వేద
పండితులుగా, కర్మకాండలు నిర్వహించే వారిగా, సంబంధిత కార్యక్రమాల నిర్వాహకులుగా కొనసాగే విషయంలో వారికి ఇప్పటికీ పెద్ద
నష్టం జరగలేదు. వివాహాలలో, అంత్యక్రియలలో, ఇతర పూజా పునస్కారాలలో వారు లేకుండా వ్యవహారం నడవడం కష్టమే ఇప్పటికీ.
రాజకీయంగా కాని, సామాజికంగా కాని, ఆర్థికంగా
కాని ఎదుగుదలకు నోచుకోలేక, బీదరికంలోకి అడుగు పెట్టాల్సిన
పరిస్థితి ఎదురైంది చాలామందికి. దీనికి తోడు, బ్రాహ్మణులకు
వ్యతిరేకంగా అనుదినం చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వారిని కడు ఇబ్బందులకు గురి
చేయసాగింది. బ్రాహ్మణ వ్యతిరేకత చివరకు కులాల వ్యతిరేకతకు దారితీసింది. ఒక కులం
వారు, మరో కులాన్ని దూషించే పరిస్థితులొచ్చాయి. అగ్ర కులాలని,
వెనుకబడిన కులాలని, దళితులని బేధాలొచ్చాయి.
బ్రాహ్మణ ద్వేషం బాగా ప్రబలిపోయింది. చివరకు జరిగిందేంటి? ఆర్థికంగా
బ్రాహ్మణులు బాగా చితికి పోయారు. వ్యవసాయం మీద, భూమి మీద
ఆధారపడిన బ్రాహ్మణులు, చట్టాల పుణ్యమా అని ఆ రకమైన ఉపాధిని
కోల్పోయారు. ఒక నాటి పౌరోహిత్యం, పూజారి జీవితం, ఆయుర్వేద వైద్యం బ్రాహ్మణుల బ్రతుకు తెరువుగా కొనసాగడం కష్టమై పోయింది.
వీటికి ఒకనాడు లభించిన గౌరవ మర్యాదలు కూడా కరవై పోయాయి. గత కొన్ని దశాబ్దాలుగా,
భారత ప్రభుత్వ రిజర్వేషన్ చట్టాల మూలంగా, కనీ
వినీ ఎరుగని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎప్పుడో, వేల
ఏళ్ల క్రితం, అప్పటి బ్రాహ్మణులు ఏదో చేశారన్న నెపంతో,
ఈ తరం బ్రాహ్మణులను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యమా? దోపిడీ చేసిన వారు, దోపిడీకి గురైన వారు అంతరించి
పోయారు. ఇప్పుడున్నది సమ సమాజం. అందరూ భారత రాజ్యాంగ కింద సమాన హక్కులు కలవారే
అంటున్నాం. అలాంటప్పుడు, సమాజంలోని ఒక వర్గం వారిని
బ్రాహ్మణులన్న కారణాన చిన్న చూపు చూడడం సమంజసమా? ప్రత్యేక
హక్కులు కావాలని వారనడం లేదు. అడగడమూ లేదు. తమను అందరితో సమానంగా చూడమనే
అడుగుతున్నారు. ఆర్థికంగా చితికి పోయిన తాము కూడా వెనుకబడిన వర్గాల వారిమే
అంటున్నారు. అందరితో పాటు వారినీ సమానంగా చూడడం సమాజం కర్తవ్యం!
ఇక "కులం" అంటే ఏమిటో
చూద్దాం. జాతులు పెరుగుతూ తరుగుతూ వస్తున్నప్పటికీ, వర్ణాలు మాత్రం నాలుగు
గానే వుండిపోయాయి. ఏదేమైనప్పటికీ, చాతుర్వర్ణ వ్యవస్థను
ఎవరు-ఎప్పుడు సృష్టించినప్పటికీ, అది ఎలా రూపాంతరం
చెందినప్పటికీ, ఒక విషయం మాత్రం వాస్తవం. అది ఒక సామాజిక
అవసరాన్ని, బాధ్యతను నిర్వహించింది. అందువల్ల ఎవరు కూడా తాము
ఫలానా కులంలో పుట్టామని బాధ పడాల్సిన అవసరం లేదు. గర్వ పడాల్సిన అవసరమూ లేదు. ఒక
కులంలో పుట్టినందుకు వేరే కులం వారిని తక్కువగా కాని, ఎక్కువగా
కాని చూడాల్సిన అవసరమూ లేదు. బ్రాహ్మణుల విషయానికొస్తే, వారు
సమాజంలో దైవ చింతనను పెంచాలని, సమాజ హితం కోరే
"పురోహితులు” గా వుండాలనీ, ఒకనాటి వ్యవస్థ
నిర్దేశించింది. సమాజం వారికి అప్పగించిన బాధ్యతను చాలా కాలంపాటు, బ్రాహ్మణులు సక్రమంగా నిర్వహించారు కూడా. కాలానుగుణంగా, సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా, బ్రాహ్మణులు
కూడా మార్పులకు లోనుకాక తప్పలేదు. ఒకటి మాత్రం వాస్తవం. బ్రాహ్మణులు కులవ్యవస్థకు
కారకులు కాదు. వారు కుల వ్యవస్థను పెంచి పోషించిందీ లేదు. సమాజం అవసరాల నేపధ్యంలో
అదే సమాజం సృష్టించుకున్నవే ఇవన్నీ. తమ పని తాము చేసుకుని పోతున్న బ్రాహ్మణులను,
తమ బ్రతుకేదో తాము బ్రతుకుతున్న బ్రాహ్మణులను చీటికి-మాటికీ
వేలెత్తి చూపుతూ, వారేదో తప్పు చేశారని చరిత్ర వక్రీకరించి
మాట్లాడడం ఎంతవరకు సబబు? ముఖ్యమంత్రి పాదాభివందనం చేసిన
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్ బ్రాహ్మణులు
కావడం వల్లనే అలా జరిగినట్లుగా, వాళ్లు బ్రాహ్మణులు కావడం
తప్పైనట్లుగా ఐలయ్య రాయడం అన్నింటికన్నా
పెద్ద తప్పు. End
