Showing posts with label మోహిత్ సేన్. Show all posts
Showing posts with label మోహిత్ సేన్. Show all posts

Wednesday, October 24, 2012

వామపక్ష ఐక్యత-ఆవశ్యకత: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు

"ఆ ఐక్యత కుందేటి కొమ్మే" శీర్షికతో చెరుకూరి సత్యనారాయణరావు ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం చదివిన తరువాత వామపక్ష ఐక్యత ఆవశ్యకతను గురించి రాయాలనిపించింది. ఇటీవల నేను  ఖమ్మం జిల్లా మార్క్సిస్ట్ నాయకుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి జీవితచరిత్రను "అనుభవాలే అధ్యాయాలు" పేరుతో ప్రచురించిన దాంట్లో ఈ విషయానికి సంబంధించి చర్చించడం జరిగింది. చెరుకూరు తన వ్యాసంలో కొంత నిరాశాజనకంగా కనిపించినప్పటికీ, ఐక్యతను కుందేటి కొమ్ముతో పోల్చడం గమనిస్తే, అది సాధించడం కొంత కష్టతరమైనప్పటికీ, సాధించ వీలుకలుగుతుందని, ఆ సుభాషితం చదివినవారికి అర్థమవుతుంది. ఎటొచ్చీ సాధించలేంది, ఆ వామపక్షాలకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తుల "మనస్సు రంజింపజేయడమే"! వామపక్ష ఐక్యత అంటే, ఐక్యంగా ముందుకు పోయి ప్రజా ఉద్యమాలను ఎలా నిర్మించాలన్నదే. పది-పదిహేను గ్రూపులుగా విడిపోయిన కమ్యూనిస్టులందరూ, ఒకే ఎర్ర జండాను పట్టుకుని ఉద్యమిస్తుంటే, ప్రజలు ఎవరిని నమ్మి వారివెంట నడవాలి? ఏం?...కాసేపు సిద్ధాంతాలను....అవి కూడా అసలంటూ వుంటే, పక్కన పెట్టి ప్రజల సమస్యలను తీర్చే ప్రయత్నం చేయకూడదా? ఈ దిశగా, అక్టోబర్ ఏడున విజయవాడలో, వామపక్ష పార్టీలను-ముఠాలను ఐక్యం కమ్మని, ఉమ్మడిగా ప్రజా సమస్యలపై పోరాటం సలపమని కోరుతూ, కొందరు కమ్యూనిస్ట్ పెద్దలు నిర్వహించిన సదస్సు కొంత మేరకు ఫలితం సాధించిందనే అనాలి. ఆ సదస్సు జరిగిన కొన్నాళ్లకు, ఓంకార్ వర్ధంతి సభ పేరుతో, సిపిఐ, సిపిఎం లతో సహా కొన్ని వామపక్షాలు ఒకే వేదిక పైకొచ్చి, వామపక్ష ఐక్యత గురించి మాట్లాడడం జరిగింది. 


వామపక్ష విలీనం, ఐక్యత గురించి ఇటీవలి కాలంలో, తీవ్రంగానే చర్చ నడుస్తోందిఈ చర్చ కొత్తగా ప్రారంభం అయిందేమీ కాదుఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించినంతవరకు, ఒకప్పుడు ఉచ్ఛస్థితిలో ఉండి ఇప్పుడు  పూర్తిగా వామపక్షాలు బలహీనపడి ఉన్న నేపధ్యంలో, ఏదో ఒక పార్టీ ఆసరా లేకుండా ఎన్నికలలో పోటీ చేయలేని పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో, ఈ చర్చ మరోసారి విజయవాడ సదస్సు రూపంలో, ముందుకు రావడం హర్షణీయందీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందివామపక్ష ఉద్యమం ఈనాడు అనేక గ్రూపులుగా, పార్టీలుగా విడివడి ఉన్న మాట వాస్తవం.ఇందులో కొన్ని క్రమేపీ బలహీనపడుతున్న మాట-ఒక విధంగా కనుమరుగవుతున్న మాట కూడా నిజమేఈ నేపధ్యంలో వామపక్ష పార్టీల ఐక్యతకు ఉన్న అవకాశాలను పరిశీలిద్దాం



          వామపక్షాల బలం తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయిఅంతర్జాతీయ, జాతీయ పరిణామాలు కూడా ఇందుకు దోహదం చేశాయిప్రధానంగా సోవియట్ యూనియన్ విచ్చిన్నం కావడం అదే కాలంలో కమ్యూనిస్టు రాజ్యాలుగా ఉన్న తూర్పు యూరప్ దేశాల్లో వచ్చిన ప్రతికూల పరిణామాలు మరో అంశంరాష్ట్రంలో తెలుగుదేశంతో కొంతకాలం, కాంగ్రెస్ పార్టీతో కొంతకాలం వామపక్షాలు స్నేహం చేశాయిఒక అధికారపార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మధ్య ఉండాల్సిన విభజన రేఖ ఆ కాలంలో చెరిగిపోయిందిముఖ్యకారణాల్లో ఇది కూడా ఒకటి. జాతీయంగా చూసినప్పుడు అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ ఉద్యమాలు ఊపందుకున్నాయిఫలితంగా సున్నితమైన స్థానిక అంశాలు, అభిమతాల వల్ల ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయిఅస్సాం గణపరిషత్, ఉత్తరప్రదేశ్ సమాజ్ వాది పార్టీ, బీహార్ రాష్ట్రీయ జనతాదళ్, సమతా పార్టీ, ఒరిస్సాలో బిజూ జనతాదళ్, మన రాష్ట్రానికి వస్తే తెలుగుదేశం, తమిళనాడులో డిఎంకె, అన్నా డిఎంకె లాంటి అనేక పార్టీలు ఉనికిలోకి వచ్చాయిజాతీయ అంశాలకంటే స్థానిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారుమతాన్ని, కులాన్ని ఆధారం చేసుకుని సంకుచిత భావాలతో వచ్చిన పార్టీలు, ఒకప్పుడు సోషలిస్టులమని చెప్పుకుని ఆ తర్వాతికాలంలో అధికారమే పరమావధిగా ఏర్పడిన పార్టీల గురించి కూడా ప్రస్తావన ఇక్కడ అవసరం. ఉత్తరప్రదేశ్ లో బహుజనసమాజ్ పార్టీ కుల ప్రాతిపదికన ఏర్పాటైనదే. ఒకప్పుడు కార్మిక నేతలమని, సోషలిస్టులమని చెప్పుకున్న జార్జ్ ఫెర్నాండెజ్, శరద్ యాదవ్ లాంటివాళ్లు తర్వాతికాలంలో అవకాశవాదానికి పాల్పడి సొంత పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. సమతా పార్టీ ఇలాగే ఏర్పాటైంది. వామపక్షాల బలం తగ్గడానికి ఉన్న ముఖ్య కారణాల్లో ఆర్ధికవ్యవస్థలో వచ్చిన మార్పులు కూడా ఒకటి.  


          కమ్యూనిస్టు ఉద్యమాల్లో వస్తున్న చీలికలు కూడా రాష్ట్రంలో వామపక్ష బలం తగ్గడానికి మరో ముఖ్య కారణమని అనడంలో సందేహం లేదు.  1964లో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయిందిఅనంతరం 1968లో నక్సలైట్ల చీలిక సంభవించింది. 1964లో దాని తర్వాత కొద్ది కాలానికే సిపిఐలో ఒక చీలిక, సిపిఎంలో ఒక చీలిక సంభవించాయిఒకటి మితవాద చీలిక, మరొకటి అతివాద చీలికసిపిఐ నుండి డాంగే, మోహిత్ సేన్ వంటి నాయకులు ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేసుకున్నారువీరు పూర్తిగా కాంగ్రెస్ తో మమేకం కావాలన్న ఆలోచనతో విడిపోయారు. సిపియం నుండి 1968లో నక్సలైట్ల పేరుతో ఒక గ్రూపు విడిపోయింది. కేవలం తక్షణ సాయుధ పోరాటం ద్వారా దేశ విముక్తి సాధించాలన్న సిద్ధాంతంతో వారు విడిపోయారుతప్పో ఒప్పో ఈ చీలికలు ఒక సిద్ధాంత ప్రాతిపదికపై జరిగినవేఆ తర్వాత కాలంలో జరిగిన చీలికలకు చెప్పుకోదగిన సిద్ధాంత ప్రాతిపదిక ఉన్నట్లు కనిపించదు. ఇన్ని పార్టీలు, గ్రూపులు ఉన్నా రాజకీయ స్రవంతిలో జాతీయ స్థాయి ప్రధాన వామపక్ష, రాజకీయ పార్టీలుగా, సిపిఐ, సిపిఎం ఈనాటికి మిగిలి ఉన్న మాట వాస్తవం. కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడటానికి ఈ ఉద్యమంలో వచ్చిన చీలికలు కూడా కారణమే. 


ఆంధ్రప్రదేశ్‌లో వామపక్ష ఉద్యమం బలహీనపడిన మాట వాస్తవంఈ నేపధ్యంలో రాష్ట్రంలో అనేకమంది ఆలోచనాపరుల్లో వామపక్ష ఐక్యతావశ్యకతవైపు దృష్టి మళ్లుతోందిఈ కోరిక, ఆలోచన వామపక్ష అభిమానులు, వామపక్ష మేధావులలో ఉందివామపక్ష పార్టీలలోనే చాలామందిలో ఇలాంటి కోరిక లేకపోలేదుసాధారణ ప్రజానీకంలో కూడా అధికార పార్టీల పాలనా విధానంతో విసుగెత్తి మరొక ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూడటం ప్రారంభం అయ్యిందిఅది వామపక్ష ప్రత్యామ్నాయమైతే బాగుంటుందన్న అభిప్రాయమూ వెల్లడవుతోంది. కుల, మత, ప్రాంతీయ రాజకీయాల ప్రభావం పెరుగుతోందివిశాల దృక్పథంనుండి, సమస్యలకు కారణమైన ప్రాధమిక అంశాల నుండి ప్రజలను పక్క దోవ పట్టించేందుకు కుల, మత, ప్రాంతీయ అంశాలతో ఏర్పాటైన పార్టీలు, గ్రూపులు ప్రయత్నిస్తున్నాయి. పరిపాలనలో కూడా నిరంకుశ ధోరణులు ప్రబలుతున్నాయితమను కాదనేవారు లేరన్న అహంకారంతో కేంద్రంలోనూ అనేక రాష్ట్రాలలోనూ పరిపాలన సాగుతోంది.  


ఒకనాటి వామపక్షాలు చేసిన త్యాగాలు, పార్టీ వారి నిబద్ధత, సాధారణ జీవితం, కష్టపడి పనిచేసే మనస్తత్వం, అంకితభావం, ప్రజల మనస్సులో ఇంకా చెరిగిపోలేదువాటి ఘన కీర్తి ఇంకా గుర్తుందిఇతర పార్టీలతో పోల్చినప్పుడు వామపక్షాల సమరశీలతను శంకించేవారు లేరనే చెప్పాలి. పరిష్కారానికి నోచుకోని సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి నానాటికి పెరుగుతోందిసమస్యలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అసంతృప్తి కూడా అదే స్థాయిలో వ్యక్తమవుతోందిపాలకపార్టీల వల్ల నిరసన ధోరణి పెరుగుతోందిఇవన్నీ వామపక్ష ఐక్యతకు దోహదం చేసే అంశాలే. వామపక్ష పార్టీలకు వేరే ఏ పార్టీకీ లేని గొప్ప మేధో పెట్టుబడి ఉందివామపక్షాల సిద్ధాంత బలాన్ని ఎప్పటికప్పుడు పటిష్టం చేస్తున్నారు అనేకమంది వామపక్ష మేధావులుప్రజా ఉద్యమాలకు వీరు పెద్ద పెట్టుబడి వంటివారువామపక్ష ఐక్యతను కోరుకునేవారికి ఇది శుభపరిణామంవామపక్ష పార్టీలకు మంచి అవకాశం. కాకపోతే, ఈ తరం వామపక్ష నాయకులు, తాము ప్రజలకూ-ఉద్యమాలకూ మధ్య వారధులం అనే విషయం మర్చిపోతున్నారు.


          రాష్ట్రంలో ప్రధాన రాజకీయపక్షాలుగా సిపిఎం, సిపిఐ ఉన్నాయిఅదే సందర్భంలో ఎర్రజెండా కింద వేర్వేరు పేర్లతో మరికొన్ని చిన్న పార్టీలు ఉన్న సంగతి మర్చిపోలేంస్థూలంగా మార్క్సిజాన్ని ఆమోదిస్తున్నట్లు చెప్పుకునే పార్టీలుగా ఇవి ఉన్నాయిఐతే, మార్క్సిజం అంటే, ప్రధానంగా ఉద్యమాల నిర్వహణ అనే విషయం ఆ పార్టీలకు జ్ఞప్తికి రావడం లేదు. వామపక్ష ఐక్యత అన్నప్పుడు వాటన్నిటి మధ్య ఐక్యత సాధ్యమా అన్న ప్రశ్న ఉదయిస్తున్నది. ఉదాహరణకు పీపుల్స్ వార్, జనశక్తి లాంటి పార్టీలు, ఇందులో నుండి మళ్లీ చీలిన కొన్ని గ్రూపులుగా ఉన్నాయిఈ పార్టీలూ, గ్రూపులూ పూర్తిగా సాయుధ పోరాటం పేరుతో వ్యక్తిగత హింసావాదానికి అంకితమై పనిచేస్తున్నాయివారికి ప్రజలపైనా, ప్రజాతంత్ర పోరాటాలపైనా, ప్రజా ఉద్యమాలపైనా విశ్వాసం లేదువారితో ఐక్యత సాధ్యమని భావించలేము. ఐనా ప్రయత్నించడంలో తప్పులేదు. మరొక రెండు పార్టీలు ఒకవైపు సాయుధ దళాలను కలిగి ఉంటూనే మరోవైపు ప్రజా ఉద్యమాలు సాగిస్తున్నాయిమరికొన్ని చిన్న చిన్న గ్రూపులు వారి వారి ప్రజా సంఘాలద్వారా ప్రజల్లో పనిచేస్తున్నాయిఇటువంటి అనేక పార్టీలు లేక గ్రూపులతో గత కొంతకాలంగా ఏదో ఒక మాదిరి ఐక్య వేదిక పనిచేస్తూనే వుందికానీ కొన్ని గ్రూపులు లేక పార్టీలు మిగిలిన గ్రూపులు లేదా పార్టీలను కమ్యూనిస్టు పార్టీలుగా గుర్తించడానికి నిరాకరించే విచిత్రమైన పరిస్థితి కూడా నెలకొని ఉందికొన్ని పార్టీలు మరి కొన్నింటిని వామపక్ష పార్టీలుగా గుర్తించ నిరాకరించే పరిస్థితి కూడా ఉందిఇలాంటి రాద్ధాంతాల మధ్య అర్ధవంతమైన ఐక్యతఎంత కష్టమో ఊహించవచ్చుఅయినా కొన్ని సమస్యలు ముందుకు వచ్చినప్పుడు ఏ ఏ సమస్యలమీద ఉమ్మడి అవగాహన సాధ్యమైతే ఆ సమస్యపైనే ఐక్య ఉద్యమాలు ఆందోళనలు నడిపే ప్రయత్నం చేస్తే బాగుంటుంది


          వామపక్ష ఐక్యత ప్రాముఖ్యతను ప్రధాన వామపక్ష పార్టీలైన సిపిఎం, సిపిఐలు గుర్తించినట్లే కనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో సాధ్యమైనంత వరకూ ఉమ్మడి అవగాహన కుదిరిన మేరకు అన్ని వామపక్ష పార్టీలను, గ్రూపులను కలుపుకుని వెళ్లేందుకు నిజాయితీగా, హృదయపూర్వకంగా ప్రయత్నిస్తున్నట్లే అనిపిస్తుంది. కాని ఎన్నికల వరకే ఒక్కో సారి ఈ ఐక్యత పరిమితమైనట్లు కనిపిస్తుంది.


వామపక్ష పార్టీల ఐక్యత కేవలం ఎన్నికల కోసమే కాదుఐక్యతా నినాదం పరమార్థం ఎన్నికల అవగాహన కారాదు. ప్రజా ఉద్యమాలు ప్రచార ఆందోళన కార్యక్రమాలు మిలిటెంట్ పోరాటాలు ఉమ్మడిగా నిర్వహించే ప్రయత్నాలు నిరంతరం జరగాలిప్రజా సమస్యలపై నిరంతరం ఐక్య కార్యాచరణకు ప్రయత్నాలు జరగాలిఐక్య కార్యాచరణకు ప్రాధాన్యం ఇస్తూనే స్వతంత్ర కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించాలికార్యకర్తల్లో నిర్లిప్తతను తొలగించాల్సిన అవసరం ఉందివారిలో సైద్ధాంతిక అవగాహన పెంచేందుకు కృషి జరగాలిపనిచేసే చోట ఆందోళనలు, ప్రచారోద్యమం నివాసిత ప్రాంతాల్లోనూ జరగాలిఅసంఘటిత రంగం కార్మికులను సమీకరించడం ఒక ముఖ్య కర్తవ్యం, అదే సందర్భంలో మహిళలపై కూడా కేంద్రీకరించి పనిచేయాలిప్రతి అడుగూ, ప్రతి చర్యా చిత్తశుద్ధితో ఉండాలిపట్టుదలతో కొనసాగాలిప్రత్యేకించి సిపిఎం, సిపిఐ నాయకత్వం మధ్య రాష్ట్రస్థాయిలో తరచుగా సమావేశాలు జరగాలిఈ చర్చలు పూర్తి సుహృద్భావ పూర్వక వాతావరణంలో జరగాలిఅభిప్రాయాలు, వాదనలు స్వేచ్ఛగా వినిపించుకోవాలిఉద్యమాల నిర్వహణపై అభిప్రాయాలను సమన్వయంతో మార్చుకోగలగాలిఇవన్నీ జరిగితే దాని ఫలితాలు, ప్రభావం పార్టీ శ్రేణులపై పడి భవిష్యత్ లో సానుకూల పరిణామాలకు స్పూర్తి కలిగిస్తాయిఈ మహోన్నతమైన కర్తవ్యాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు విజయవాడలో సదస్సు నిర్వహించిన పెద్దలు నడుం బిగిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది?