Showing posts with label కాంగ్రెస్. Show all posts
Showing posts with label కాంగ్రెస్. Show all posts

Monday, April 8, 2013

రాహుల్ కోసం అధిష్ఠానం ఆరాటం: వనం జ్వాలా నరసింహారావు


రాహుల్ కోసం అధిష్ఠానం ఆరాటం

వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (22-04-2013)

        కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో మారు రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారించారనడానికి నిదర్శనం, ఈనెల 18న ఢిల్లీకి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలకు ఆయన దగ్గరనుంచి పిలుపు రావడమే. ఏ క్షణాన్నైనా జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు, తదనుగుణంగా రాష్ట్రంలో ఎన్నికలు, రాష్ట్ర మంత్రులపై సీబీఐ కేసులు, ఇతరత్రా సమస్యల నేపథ్యంలో రాహుల్ రాష్ట్రంపై దృష్టి సారించవచ్చు.  ఈ సమావేశంలో, రాహుల్ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అలానే తెలంగాణ అంశానికి సంబంధించి కూడా ఆయన కొన్ని సూచనలు చేయవచ్చేమో. కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రాహుల్ పార్టీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో కొన్నాళ్ల క్రితం భేటీ అయ్యారు. రాహుల్‌గాంధీ ఇప్పటికే 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులతో సమావేశమై పార్టీ పరిస్థితులను సమీక్షించారు. ఆ కొనసాగింపుగా, ఈనెల 17, 18, 19 తేదీల్లో పలు రాష్ట్రాల సీఎంలు, పీసీసీ నేతలతో భేటీ కావాలనుకుంటున్నారట. ఇందులో భాగంగానే 18వ తేదీన ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు నేతలతో రాహుల్ సమావేశమవుతున్నారు.
రాష్ట్ర-దేశ రాజకీయాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న పరిశీలకులు అసలేం జరుగుతోంది? జరుగబోతోంది? అన్న మీమాంసతో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రానికి సంబంధించినంతవరకు, మరి కొద్ది రోజుల్లో తేలనున్న జగన్ వర్గ కాంగ్రెస్-తెలుగుదేశం అసంతృప్తి ఎమ్మెల్యేల అనర్హత భవితవ్యంలో, ఆ తరువాత తేలనున్న ఉప ఎన్నికల ఫలితాలను ఇప్పటి నుంచే వివిధ కోణాలనుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు విశ్లేషకులు. ఈ మొత్తం వ్యవహారంలో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చాలా తేలికగా కనిపించవచ్చు కాని వాస్తవానికి అంత చిన్న విషయమేమీ కాదనాలి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతావనికిప్రభుత్వ పదవి లేకపోయినా-ప్రధాని కాకపోయినామకుటం లేని మహారాణిగా చెలామణి అవుతున్న సోనియా గాంధీ, ఆమె కుమారుడు-ఢిల్లీ పీఠం బావి వారసుడు రాహుల్ గాంధీల ఆధిపత్యం ఏం కాబోతున్నదా అన్న అనుమానం రాబోయే రాష్ట్ర ఉప ఎన్నిక-దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాల ద్వారా కలగక మానదంటున్నారు ఆ పరిశీలకులు. ఆంధ్ర ప్రదేశ్ లో పాద రసంలాగా ఎగబాకుతున్న యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగు రీతిలో రాజకీయ గుణపాఠం చెప్పి తీరాల్సిందే అన్న పట్టుదలతో యావత్ కాంగ్రెస్ అధిష్ఠానం ముందడుగు వేస్తోంది. జైలుపాలైన జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరిని-తిరుగుబాటు ధోరణిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సహించే స్థితిలో లేదు. ఆయనకు ముక్కుతాడు వేసే ప్రయత్నం చేసింది-ఇంకా చేస్తూనే వుంది. గతంలో జరిగిన ఉప ఎన్నికలను కూడాతమకు అనుకూలంగాఒక ఆయుధంలాగా మలచుకుందామనిజగన్ పార్టీలోకి వలసలను ఆపు చేద్దామని అపోహపడింది అధిష్ఠానం. కాని దురదృష్ట వశాత్తు అది సాధ్యపడలేదు. వీటన్నింటి నేపధ్యం ఒకటే! సామ-దాన-భేద-దండోపాయాలను ఉపయోగించి సోనియా-నెహ్రూ-గాంధీ కుటుంబాల వారసత్వానికిఆధిపత్యానికి తిరుగులేని అవకాశం కలిగించిరాహుల్ గాంధీని ఢిల్లీ గద్దె ఎక్కించడమే! భావి భారత ప్రధానిగా చూడడమే! అది సాధ్యపడుతోందాలేదాఅంటే అది వేరే సంగతి!


అధిష్ఠానంకు ఈ తరహా ఆలోచన రావడంఅమలుచేయడం,కొత్తేమీకాదు. గతంలో కూడాఅధిష్ఠానానికి ఎదురుతిరిగిన మహామహులను-ఉద్దండ పిండాలను నిరంకుశంగా కాల రాసింది. ఎంతో మంది అతిరథ-మహారథులను అర్థ రధులుగా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, "సమిష్ఠి నాయకత్వం" అన్న మాటే గిట్టదు అధిష్ఠానానికి. అధిష్ఠానం అంటే ఎవరో కాదు. ఒకనాడు నెహ్రూ అయితేఆ తర్వాత ఇందిరరాజీవ్ (మధ్యలో సంజయ్) లు కాగా ఇప్పుడు సోనియా. ఆ ఏక వ్యక్తుల అభిప్రాయమే ఏకాభిప్రాయం-సమిష్ఠి అభిప్రాయం. ఆ సుప్రీం లీడర్‌కు అంతా సలాం కొట్టాల్సిందే! అడుగుజాడలలో నడవాల్సిందే!వారెంత ప్రజాదరణ కల నాయకులైనాపరిణితి చెందిన నాయకులైనాఎన్ని రకాల శక్తి సామర్ధ్యాలున్న వారైనాతలవంచక-దాసోహం అనక తప్పదు. ఏడాది తరువాత రానున్న సార్వత్రిక ఎన్నికలలోకాంగ్రెస్ పార్టీకి అంతగా అనుకూలంగా లేని ప్రస్తుత పరిస్థితులలోమరో ప్రాంతీయ పార్టీని బ్రతికి బట్ట కట్టనిస్తుందా? ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే ఒకటి-రెండు ఉప ఎన్నికల ఫలితాల ద్వారాపరువు-ప్రతిష్ఠలను పూర్తిగా కోల్పోయిన కాంగ్రెస్ అధిష్ఠానంజగన్ పార్టీని మనుగడ చేయనిస్తుందాపోనీ ఏం చేయగలుగుతుందిఅన్నింటికన్నా ముఖ్యమైందిపవర్ పాలిటిక్స్ ను అర్థం చేసుకోగలగడం. పవర్ పాలిటిక్స్ ను అనుసరించాలంటేఊహ కందని వ్యూహాలను పన్నాలి. వాటికి నైతికత అక్కర లేదు. పవర్ పాలిటిక్స్ ఆట ఆడడంలో ఢిల్లీ అధినాయకత్వానికి తెలియని కిటుకు లేదు. ఆ ఆట ఆడడానికి అనుసరించని నిరంకుశ ధోరణి లేదు. "నెహ్రూ-ఇందిర-గాంధీ" వారసత్వ సంపదను పదికాలాలపాటు పదిలంగా ఉంచడానికికాంగ్రెస్ అధిష్టానంపవర్ పాలిటిక్స్ నుఅవసరమైతే, జాతీయ అవసరాలను పక్కన పెట్టినా సరేతమకు అనుకూలంగా మలచుకుంటూ వస్తున్నది. కాకపోతేఅన్నివేళలా అధిష్ఠానం ఆలోచనలు విజయవంతమవుతున్నాయా అంటేబెడసి కొట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ ఆటలో ఏకైక వ్యూహం ఒక్కటే. ఏదో విధంగా రాహుల్‌ను ప్రధాని పీఠం ఎక్కించడమే! దానిని అడ్డగించినవారికి చుక్కలు చూపించే ప్రయత్నం చేయడమే!
ప్రధాన మంత్రి పదవికి ప్రణబ్ కుమార్ ముఖర్జీ కంటే అర్హుడు మరెవ్వరూ లేరనాలి. ఆయన ఆ పీఠాన్ని అధిరోహించితే అడ్డు చెప్పేవారు కానిచెప్పగలిగేవారు కాని పార్టీలో ఎవరూ లేరు. అందుకేరాహుల్‍కు దారి సుగమం చేయడానికి ప్రణబ్‌కు మరో విధంగా పదోన్నతి కలిగించి రాష్ట్రపతి పదవి కట్టబెట్టింది నెహ్రూ-ఇందిర-గాంధీ వారసత్వం. ఇప్పుడిప్పుడే రాజకీయ పాఠాలు నేర్చుకునేవారు సైతం ఈ కుట్రను అర్థం చేసుకోవడం తేలికే! యుపిఎ భాగస్వామ్య పార్టీల ప్రస్తుత-మాజీ నాయకులు శరద్ పవార్అజిత్ సింగ్మమతా బెనర్జీములాయం సింగ్ యాదవ్లాలూ ప్రసాద్ యాదవ్కరుణానిధి లాంటి కాకలు తీరిన యోధుల పాదాలు చల్లబడేట్లు చేసింది సోనియా నిర్ణయం. ఒకవేళ వీరిలో ఎవరన్నా నోరు మెదిపితేఎల్లప్పుడూ వాడే సిబిఐ దర్యాప్తు లాంటి బ్లాక్ మెయిల్ ఆయుధం వారిపై కూడా ప్రయోగించే వీలుందని అందరికీ తెలిసిన విషయమే! ఇక రాష్ట్రం విషయానికొస్తేజగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు బావుటాను ఎదుర్కునేందుకు అధిష్ఠానం తనముందున్న తురుఫ్ ముక్కలన్నింటినీ బయటకు తెచ్చింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన తీవ్ర పదజాలంతో కూడిన వ్యాఖ్యలు కూడా అందులో భాగమే. గతంలో, ఎప్పుడైతే పద్దెనిమిది మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యులు పార్టీ ఫిరాయించనున్నారని పసికట్టిందో, అప్పుడేచిరంజీవిని తనవైపు గుంజుకుంది. ఆ తరువాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టింది. కీలకమైన (గత) ఉప ఎన్నికల సమయంలో జగన్‌ను జైలు పాలు చేసిందిఇంకా జైలులోనే కొనసాగించే వ్యూహం పన్నింది.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకుఒక వైపు జబ్బు ముదురుతుండగామరోవైపురోగ లక్షణాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. రోజు-రోజుకూ ఇన్‌ఫెక్షన్ వేగంగా పాకుతుండడంతోవ్యాధిని నియంత్రించడం కష్ట తరమై పోతోంది. బహుశా నూట ఇరవై ఎనిమిదేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ పరిస్థితినిఇంతకంటే మంచిగా ఎవరూ వర్ణించలేరేమో! స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచీఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచీకాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వుంటూ వస్తోందీ దక్షిణ భారత ప్రాంతం. కాకపోతే మొట్ట మొదటిసారి 1983-89 లోఆ తరువాత 1994-2004 మధ్యలోప్రాంతీయ పార్టీ తెలుగుదేశం చేతిలో ఓటమి పాలైనప్పటికీఅస్తిత్వాన్ని మాత్రం ఏ నాడూ కోల్పోలేదు. 1983-89 లో అధికారాన్ని కోల్పోయినాడాక్టర్ మర్రి చెన్నారెడ్డి సమర్ధవంతమైన నాయకత్వంలో 1989 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అదే విధంగా 1994-2004 మధ్య కాలంలో అధికారంలో లేకపోయినా డాక్టర్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2004 లో మళ్లీ పూర్వ వైభవాన్ని పొంది 2009లో మరో మారు ఎన్నికల్లో గెలిచి ఇంతవరకూ అధికారంలో కొనసాగుతోంది. దురదృష్టవశాత్తు అలాంటి రాజకీయ స్టాల్వార్ట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేకపోవడంఆద్యతన భవిష్యత్‍లో అలాంటి వారు దొరుకుతారన్న నమ్మకం కుదరకపోవడంపార్టీని అపజయ పరంపరలకు గురిచేస్తోంది.
అలనాడు నీలం సంజీవరెడ్డిఆయన తరువాత ఆయన వారసుడుగా వచ్చిన బ్రహ్మానందరెడ్డి, 1978-1989 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, 2004-2009 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన డాక్టర్ రాజశేఖర రెడ్డి మినహాఈ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య మంత్రులుగా పనిచేసిన వారందరూ, "దిగుబడి సరుకే"!. అధిష్ఠానం నమ్మిన వారోఅధిష్ఠానాన్ని నమ్మించిన వారోఅధిష్ఠానాన్ని ఆ కట్టుకోగలిగిన వారోలాబీయింగ్ చేయగలిగిన వారో మాత్రమే ముఖ్యమంత్రులు కాగలిగారుఆ ఆచారం జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి సోనియా హయాం వరకూ అలాగే కొనసాగుతూ వస్తోందిదామోదరం సంజీవయ్య నుంచి నేటి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ అదే వరసవీరిలో సమర్ధులు లేరని కాని, "దిగుబడికి సమర్ధత కొలమానం కాదని కాని భావన కాదుఇదంతా ఒక ఎత్తైతే, కాంగ్రెస్ ఓట్ బాంక్ వ్యవహారం మరో ఎత్తు. ఎన్టీ రామారావు ప్రభంజనంలో ఓడినప్పుడు కానిఆ తరువాత చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం హయాంలో ఓడినప్పుడు కానిత్రి ముఖ పోటీ జరిగినప్పుడు కానికాంగ్రెస్ ఓటు బాంక్ 35-40 శాతానికి తగ్గకుండా పదిలంగా వుంటూ వస్తుంది. మొట్టమొదటి సారిగా దానికి భారీ గండి పడింది. గతంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పాయి. తెలంగాణ ప్రాంతంలో తెరాస గండి కొడుతుంటేసీమాంధ్రలో జగన్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆ పని చేసింది. ఓటింగు శాతం ఇరవైకి పడిపోయి ఘోర పరాజయం పాలైంది కాంగ్రెస్ పార్టీ. డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 లో ఎదురు కానున్న పరిస్థితి అగమ్య గోచరంగా కనిపించసాగింది
2009 ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణ భూతుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణానికి గురైన దరిమిలా పార్టీకి ఈ దుస్థితి క్రమేపీ ఏర్పడ సాగింది. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర సమితిసిపిఐభారతీయ జనతా పార్టీల సారధ్యంలో ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ను మట్టి కరిపిస్తుంటేమరో పక్క కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ సీమాంధ్ర ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఎదగ సాగింది. నెత్తి మీద కుంపటి దించుకున్న చందానచిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినా ఫలితం శూన్యం.
"టీ"-"జే" ల ఒత్తిడి మధ్య కొట్టు మిట్టాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలి మధ్య వున్నట్లుంది. ఇదే పరిస్థితి దాదాపు జాతీయ స్థాయిలో కూడా నెలకొని వుంది. కళ్ల ముందరఈ పరిస్థితిని అధిగమించడానికిమార్గాలేవీ కనిపించడం లేదు. గత ఎన్నికల్లో యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదపడేందుకుదేశంలోనే అధిక సంఖ్యలో-33 మంది ఎంపీలను సమకూర్చిన రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ప్రభావం జాతీయ స్థాయిలో పార్టీ మీద పడక తప్పదు. పార్టీ-యుపిఎ అధికారానికి దూరం కాక తప్పదు. ఈ నేపధ్యంలోమన్మోహన్ సింగ్ నుంచి అత్యంత అలవోకగా ప్రధాని పదవిని తనయుడు రాహుల్ గాంధీకి బదలాయించాలని తాపత్రయ పడుతున్న సోనియా గాంధీ ముందున్న సవాళ్లు ఏంటివాటిని ఆమె ఏ విధంగా అధిగమించగలరుకాంగ్రెస్ పార్టీ గడ్డు కాలం ఎదుర్కుంటుందన్నది వాస్తవం. సవాళ్లను సోనియా ఎదుర్కునే ముందర,రాష్ట్రంలో అందరికీ అర్థం అవుతున్న కొన్ని నగ్న సత్యాలను అధిష్ఠానం సహితం అర్థం చేసుకుంటే మంచిదేమో! మంచికో-చెడ్డ కో రోశయ్యను మార్చి కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని అంటగట్టిన అధిష్ఠానంఏ నాడన్నా ఆయనకు పరిపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చిందాఆయన మంత్రి వర్గాన్ని ఆయనే ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చిందాపదవుల పందేరం చేయనిచ్చిందా?ఆయనకిష్ఠమైన వారిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎంపిక చేసుకునే వీలు కలిపించిందాతన మంత్రివర్గంలో అనునిత్యం తనను ఎదిరిస్తున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం వుందాముందు వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం అధిష్ఠానానికి ఉంది.
బహుశాతమిళనాడు తరహాలోఏదో ఒక ప్రాంతీయ పార్టీతో అవగాహన కుదుర్చుకోక తప్పని పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్‌కు తప్పదాఅలాంటప్పుడుఆ ప్రాంతీయ పార్టీ ఎలాగూ తెలుగుదేశం కాదు కాబట్టితెరాసతోను-వైఎస్సార్ సీపీ తోను అవగాహన వుండే అవకాశాలున్నాయారాష్ట్ర విభజన చేయక తప్పదాప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఏదో ఒక నిర్ణయం ప్రకటించక తప్పదా?  
2014 లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్‌ను సన్నద్ధం చేసేందుకు-బలోపేతం చేసేందుకుజాతీయ స్థాయిలో పార్టీ అధి నాయకత్వం-అధిష్జ్ఠానం చేపడుతున్న చర్యల్లో భాగంగాఅఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడుఏఐసీసీ ఉపాధ్యక్షుడు, భావి భారత ప్రధానిగా భావించబడుతున్న రాహుల్‌గాంధీముఖ్య భూమిక పోషించేందుకు సమాయత్త మౌతున్నారుయువ నాయకుడు రాహుల్ గాంధీ కాయ కల్ప చికిత్స మొదలు పెట్టారంటున్నారుఅందులో భాగంగానేఢిల్లీలో తల్లిని కలవడానికి వచ్చిన పెద్దా-చిన్నా పనిలో పనిగా రాహుల్ గాంధీని కూడా కలిసి పోతున్నారుఅంతే కాదురాహుల్ గాంధీనే స్వయంగా ఎంపిక చేసిన కొందరికి ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారురాష్ట్రంలోని సీనియర్‌ నేతలు పలువురితో వ్యక్తిగతంగా మంతనాలు జరిపారుఅధినేత్రి సోనియా ఆదేశాలతోనే రాహుల్‌ రంగ ప్రవేశం చేశారాలేక స్వయంగా ఆయన తనంతట తానే చొరవ తీసుకుని ఇలా చేస్తున్నారాఅనేది ఇంకా తేలాల్సిన విషయమే.
ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగయ్యే సూచనలు కనిపించడం లేదు. End

Sunday, October 9, 2011

కళ్లున్న కబోదులకు ఏదీ కనిపించదు! : వనం జ్వాలా నరసింహారావు

కళ్లున్న కబోదులకు ఏదీ కనిపించదు!

వనం జ్వాలా నరసింహారావు

మూసుకున్న ఢిల్లీ కాంగ్రెస్-యుపిఎ సారధ్య నాయకుల (నాయకీమణుల) కళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అవును మరి! ఇంకా కొద్ది రోజులు మూసుకునే వుంటే, వారింక ఎప్పటికీ తెరవలేమోనన్న భయం పట్టుకుంది. అప్పుడో మాట, ఇప్పుడో మాట - అక్కడో మాట, ఇక్కడో మాట - అమ్మ ముందో మాట, వెనుకో మాట - సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులతో ఒక మాట, తెలంగాణ వారితో మరొక మాట - తమ పార్టీ రాష్ట్ర నాయకులతో చెప్పేదొకటి, ఇతర పార్టీల వారితో చెప్పేదొకటి - ఇలా ఎప్పటికప్పుడు పబ్బం గడుపుకుంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చిన ఢిల్లీ (కాంగ్రెస్ అధిష్టానం బృందగానం ఆలాపించే) నాయకులకు సకల జనుల సమ్మె వేడి నపాళానికెక్కింది. మింగలేక, కక్క లేక, అధినేత్రి సోనియాకు మొర పెట్టుకుని వుండవచ్చు. జ్ఞానోదయం కలగడం ఆమె దగ్గర నుంచి ఆరంభమైందా? లేక ఆమె సూచనతో బృందగాన భజన పరులకు స్వయానా కలిగిందా? అర్థం చేసుకోవడం కష్టమే! కాని, రాదనుకున్న కదలిక కనపడడం (కనీసం వినపడడం) మాత్రం మొదలైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవడం తధ్యమనే విషయం, దాంతో పాటే, మూడు వారాలకు పైగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సకల జనుల సమ్మె ప్రభావం నుండి బయటపడే అవకాశాలు మటుకు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. అలా జరగకపోతే, ముఖ్యమంత్రి మొదట్లో చెప్పినట్లు, సమ్మె ప్రభావం ఒక్క తెలంగాణ ప్రాంతం పైనే కాకుండా, యావత్ ఆంధ్ర ప్రదేశ్ తో సహా, భారత దేశంలోని పలు రాష్ట్రాలపై పడే అవకాశాలున్నాయనే సంగతి కేంద్రం ఈ పాటికే గ్రహించి వుండాలి.

అరవై ఏళ్లుగా - పోనీ నలభై ఏళ్ళుగా - కనీసం గత పదకొండేళ్లు గా నన్నా - అధమ పక్షం రెండేళ్లకు పైగా - ఇవేవీ కాకపోయినా ఇటీవల మూడు వారాలకు పైగా జరుగుతున్న సకల జనుల సమ్మె ప్రభావం నేపధ్యంలోనైనా, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కళ్ళున్న కబోదుల మాదిరిగా, చూసీ చూడనట్లు -అంటీ ముంటనట్లుగా వ్యవహరించిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (నాటి నుంచి నేటి వరకున్న) అధిష్ఠానం, ఆ పార్టీ ఈ నాటి అధినేత్రి, ఆమె భజన బృందం, కనీసం ఇప్పటికైనా తెలంగాణ సమస్యపై సముచిత స్థాయిలో దృష్టి పెట్టడం ఆహ్వానించ దగ్గ పరిణామం. దాని పర్యవసానమే, బహుశా, తమలో తాము విస్తృతంగా చర్చించుకోవడం, రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ ను ఢిల్లీకి రమ్మనడం - ప్రదాన మంత్రితో భేటీకి పిలవడం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహను, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ ను కూడా రమ్మనడం కావచ్చు. కోర్ కమిటీలు, మినీ కోర్ కమిటీలు ఎడతెరిపి లేకుండా సమావేశమవుతున్నాయి. ఏం జరుగబోతుందోనన్న అంశం ఇంకా అస్పష్టంగా వున్నప్పటికీ, ఏదో జరుగడం ఖాయం అన్న విషయంలో మాత్రం స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఎవరి (కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ) నోటి నుండి తెలంగాణ విషయంలో ఒక అసంబద్ధమైన మాటలు రెండు రోజుల క్రితమే వెలువడ్డాయో, ఆ వ్యక్తికే కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను అధినేత్రి సోనియా గాంధి అప్ప చెప్పడం విశేషం. దసరా పండుగ (తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా ఈ ఏడాది జరుపుకోని పండుగ!) పూర్తయిన వెంటనే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై దృష్టి సారించడమంటే, కనీసం దీపావళి కానుకగా నన్నా, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను భౌగోళికంగా విడదీసి - రాబోయే తర తరాల తెలుగు వారు కలిసి మెలిసి సహజీవనం సాగించే విధంగా, చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించవచ్చన్న ఆశలు ఇరు ప్రాంతాలలో చిగురిస్తున్నాయనవచ్చు.

తెలంగాణ సమస్యకు పరిష్కారం అంత సులభమైంది కాదని, ఐనా అందుకు తామందరం యత్నిస్తున్నామని, ఎప్పటి లోపు సమస్య తేలుతుందోనని, అసలు ఏ దిశగా అది పరిష్కరించబడుతోందని, చూద్దాం - చేద్దాం అని, క్లిష్టమైన సమస్యను మరింత సంక్లిష్టంగా - భూతద్దంలో చూపించే ప్రయత్నం "రాజనీతిజ్ఞుడు" అని అందరూ భావించే ప్రణబ్ ముఖర్జీ కూడా చేశాడంటే, ఏదో జరుగబోతుందోనన్న సంకేతం ఇచ్చినట్లే! భారతదేశంలో, రాష్ట్రాల ఏర్పాటులో, ఒక పద్ధతిని అనుసరించలేదని, అలా అలవోకగా చరిత్ర -భూగోళం కలిపి కలగాపులగంగా ఓ ప్రైవేట్ చానల్ ఇంటర్వ్యూలో, ప్రణబ్ ఏదేదో మాట్లాడడం వెనుక అనేకానేక గూడార్థాలుండే వుండాలి. యాదృచ్చికంగానే జరిగిందో? లేదో? కాని, సరిగ్గా అదే సమయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఇచ్చిన జవాబులో (ఆయన రాసిన లేఖకు ప్రతిగా) తెలంగాణ అనే సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన అంశంపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం చేయ దగ్గ కృషి అంతా చేస్తున్నది అని సంజాయిషీ ఇచ్చుకున్నారు. ప్రధాని ఈ విషయాన్ని తెలంగాణ విషయంలో ఏ అభిప్రాయం చెప్పని ఒక పార్టీ నాయకుడికే ఎందుకు రాశారో అర్థం కాని అంశం.

తెలంగాణ అంశం సున్నితమైనదని, సంక్లిష్టమైనదని, దాన్ని నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించలేమంటూ ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేపాయి. కాంగ్రెస్‌లోని తెలంగాణ నేతలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఐనా, ఆ వ్యాఖ్యలలో తప్పేమీ లేదని సర్దుకుపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ప్రణబ్ వ్యాఖ్యలలో తెలంగాణ అనుకూలమైన అర్థాలను వెతికే ప్రయత్నమే చేశారు. దీంతో.. అసలు ఆ వ్యాఖ్యలు కావాలని చేసినవా? లేక నోరు జారి చేసినవా? అన్న సంశయం కూడా కలిగింది. ప్రణబ్ వ్యాఖ్యలను ఆషామాషీగా తీసుకోలేమని ఇదంతా వ్యూహాత్మకమేనని మెజారిటీ నేతలు అంటున్నారు. తెలంగాణ అంశంపై త్వరలో నిర్ణయం వెలువడుతుందంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని కట్టడి చేసే వ్యూహంలో భాగంగానే ప్రణబ్ ఇలా మాట్లాడి ఉంటారని కొందరు విశ్లేషకులు భావిస్తుంటే, మరి కొందరు తెలంగాణ ఏర్పాటు కొరకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసారని ఘంటాపథంగా చెప్తున్నారు. ఏదేమైనా, ఆ వ్యాఖ్యలు చేసిన అతి కొద్ది సమయంలోనే ఢిల్లీలో చర్చల ప్రక్రియకు శ్రీకారం చుట్టడం శుభపరిణామాలకు దారితీయవచ్చని అందరి ఆశగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఇవ్వడం - ఇవ్వకపోవడం కాదు సమస్య. సకల జనుల సమ్మె ప్రభావంగా దినదినం దుర్భరమవుతున్న సామాన్య-అసామాన్య పౌరుల జీవనం ఒకింత కుదుట బడే వీలుంటుందన్న నమ్మకం కలుగుతోంది.

ఈ నేపధ్యంలో గత వారం రోజులుగా ఢిల్లీలో నాటకీయంగా జరిగిన పరిణామాలు రాజకీయ విశ్లేషకులకు, రాజకీయాలలో వున్న నాయకులకు, రాజకీయం చేసే వారికి, ఆసక్తి కలిగించినప్పటికీ, చిత్తశుద్ధితో తెలంగాణ సమస్యకు పరిష్కారం త్వరలో లభించాలని కోరుకుంటున్న ప్రజానీకానికి మాత్రం అసహ్యంగా, అతి జుగుప్సాకరంగా వున్నాయనక తప్పదు. సమస్య పరిష్కారానికి ఇంకా కొంత సమయం ఎందుకు కావాలి? ఎవరి కొరకు కావాలి? ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నందున సకల జనుల సమ్మెను విరమించమని అడిగే వారికి వారెందుకు సమ్మె చేస్తున్నారో అర్థం కావడం లేదా? సమస్యకు పరిష్కారం కావాలంటే ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో వ్యవహరించాలంటున్న వారి ఉద్దేశం ఒక ప్రాంతం వారికే ఈ సూత్రం వర్తిస్తుందా? ఎప్పటికీ ఒకరే ఇచ్చుకోవాల్నా? పుచ్చుకోవాల్నా? ఎవరూ నష్టపోని రీతిలో విన్-విన్ సిచ్యువేషన్ పరిస్థితి వుండాలనడం ఎంతవరకు సమంజసం? "విన్" అంటే ఒకరి "విన్నా"? ఇద్దరి "విన్నా"? భాగస్వాములందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలంటున్నారు. తెలంగాణ విషయంలో "భాగస్వాములు" (స్టేక్ హోల్డర్స్) అంటే ఆ ప్రాంతంలో వుండే ప్రజలు -ప్రజా ప్రతినిధులు - రాజకీయ పార్టీల నాయకులు - పౌర సమాజం నాయకులు - ప్రభుత్వ, ప్రభుత్వేతర సిబ్బంది, సిబ్బంది నాయకులే కాని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ససేమిరా ఇష్టపడని పొరుగు వారు, పొరుగు రాష్ట్రాల వారు, ఈ ప్రక్రియలో పాలుపంచుకునేందుకు ఎలా అర్హులవుతారు? ఇంకా నయం...సరిహద్దు దేశాల వారిని, ఐక్య రాజ్య సమితి సభ్యులను కూడా "స్టేక్ హోల్డర్స్" చేద్దామని అనడం లేదు!

అన్నింటికన్నా వింతైన వార్తలను గత వారం కొన్ని పత్రికలు ప్రచురించాయి. వాటిలో నిజా-నిజాలెంతవరకో కాని, అందులో ఏ మాత్రం వాస్తవం వున్నా, పరిస్థితి గందరగోళం అనక తప్పదు. తెలంగాణ సమస్యను వేగంగా పరిష్కరించమని, లేకపోతే, తాము తమ-తమ నియోజక వర్గాల్లో తిరగడం కష్టమని, తమ మనుగడ - కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందని, మొర పెట్టుకోవడానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గరకు వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు-ప్రజా ప్రతినిధులకు, మన్మోహనే తన మొర వినిపించాడట. అదో వింత అనుభవం అంటున్నారు కాంగ్రెస్ నాయకులు కొందరు. తానూ-తన సంకీర్ణ కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగడం ఇబ్బందికరంగా వుందని, ప్రధాని వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాకపోతే, తన మొర ఎలా వున్నా, తెలంగాణ నాయకుల మొరను అధినేత్రి సోనియా దృష్టికి, కోర్ కమిటీ దృష్టికి తీసుకెళ్తానని మంచి మనసుతో అన్నారు పాపం ప్రధాని! తాను, తన పార్టీ కేంద్ర స్థాయి నాయకులు, తన సారధ్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, తెలంగాణ ఏర్పాటు విషయంలో తీసుకుంటున్న చొరవకు సంబంధించిన అన్ని సంగతులు వివరించారట ప్రధాని.

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎలా వచ్చారో, అలానే తిరుగు ప్రయాణం కట్టారు కేసీఆర్ అని కొందరనడం హాస్యాస్పదం. ఆయన వెళ్లి వచ్చిన తర్వాతే ఈ తతంగం అంతా జరుగుతుందంటే, ఆయన ప్రమేయం ఏదీ లేకుండా ఎలా వుంటుంది? తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమైన నిర్ణయం రాని పక్షంలో, రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు, కాంగ్రెస్ తెలంగాణ నాయకులు, తెలుగుదేశం తో సహా ఇతర పార్టీ నాయకులు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో, కారణాలేవైనా, తెలంగాణ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనక తప్పదని కాంగ్రెస్ అధిష్ఠానం ఓ స్పష్టమైన అంచనాకు వచ్చిందనేది స్పష్టం. ఇక ఎంతమాత్రం నాన్చడం మంచిది కాదని నిర్ణయించుకుంది. రాష్ట్రంలో పరిస్థితి రోజురోజుకు తీవ్రంగా మారుతోందని అర్థమవుతోంది కాంగ్రెస్ అధిష్టానానికి. కళ్లున్న కబోదులకు, మూసిన కళ్లను తెరవక తప్పలేదు. ఒకరి వెంట మరొకరిని ఢిల్లీకి రమ్మని కబురు పెట్టారు. గవర్నర్ నరసింహన్ ప్రధానిని, రక్షణ మంత్రి ఆంటోనీని కల్సినట్లు సమాచారం. మరోపక్క, ముఖ్యమంత్రి కిరణ్, ఉపముఖ్యమంత్రి రాజనర్సింహ, ఇతర నాయకులు ఆజాద్ ను, ఇతర ప్రముఖులను కలుస్తున్నారు. ఉక్కు పిడికిలితో ప్రజాభిప్రాయాన్ని అణచి వేయడం అసాధ్యం అనే సంగతి స్పష్టమైంది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందనాల్సిందే. ఆటకు ముగింపు రానున్నది.

Wednesday, January 26, 2011

కేంద్ర మంత్రివర్గంలో తెలుగు వారికి ఆది నుంచీ అన్యాయమే:వనం జ్వాలా నరసింహారావు

కేంద్ర మంత్రివర్గంలో తెలుగు వారికి ఆది నుంచీ అన్యాయమే
వనం జ్వాలా నరసింహారావు
(సూర్య దినపత్రిక:1-02-2011)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒకరు ప్రధాన మంత్రిగా పని చేసి వుండవచ్చు. ఇద్దరు రాష్ట్రపతి హోదాకు, ముగ్గురు లోక్ సభ స్పీకర్ పదవికి చేరుకుని వుండవచ్చు. అయినా ఢిల్లీ స్థాయిలో కీలక పదవుల పంపకంలో ఆది నుంచీ తెలుగు వారికి అన్యాయం జరుగుతూనే వుంది.

కేంద్ర మంత్రివర్గం ఏర్పాటులో కాని, విస్తరణలో కాని, పునర్ వ్యవస్తీకరణలో కాని, రాజ్యాంగపరమైన నిబంధనలు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతులు, పటిష్ఠమైన సాంప్రదాయాలు ఎన్ని వున్నప్పటికీ, అవన్నీ రాజకీయ అనుకూలతలు-వెసులుబాటుల ముందు దిగదుడుపే. వాటి విస్తృత పరిధులకు లోబడి పాటించాల్సిందే. అక్షర క్రమంలోను, కేంద్రంలో అధికారం చెలాయించే రాజకీయ పార్టీలకు అత్యధిక సంఖ్యాక పార్లమెంటు సభ్యులను గెలిపించడంలోను, ఢిల్లీ స్థాయిలో పెత్తనం సాగించే కీలకమైన రాజకీయ నాయకులకు "చేదోడు-వాదోడుగా" వుండడంలోను అగ్రభాగాన వుండే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కేంద్రంలో పలుకుబడి ఉపయోగించడానికి దోహదపడే కీలక స్థాయికి ఎదగడంలో మాత్రం వెనుకబడే వుంటూ వస్తుంది. కేంద్ర స్థాయిలో పాలనలో సరైన భాగస్వామ్యం లభించకపోవడంతో, అక్కడినుంచి నిధులను పొందడంలో కూడా విఫలమవుతూనే వుంది.

స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి, ఇంతవరకూ, కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందిన సుమారు 300 మందికి పైగా వున్న కాబినెట్ స్థాయి మంత్రులలో, ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారి సంఖ్య కేవలం 20 లోపే...అంటే 6% మాత్రమే. అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ నుంచి 42 లోక్ సభ స్థానాలు దక్కినప్పుడైనా, ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వాములైన తెలుగు దేశం-బిజెపి పార్టీలకు అత్యధిక స్థానాలు దక్కినప్పుడైనా, ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం నామ మాత్రమే. అదే విధంగా ఇప్పటి వరకు సుమారు 500 మందికి పైగా సహాయ మంత్రుల పదవులు పొందగా, అందులో ఆంధ్ర ప్రదేశ్ కోటా 25 కు మించలేదు..అంటే కేవలం 5% మాత్రమే. 64 సంవత్సరాల స్వతంత్ర భారత వర్తమాన రాజకీయ చరిత్రలో, రాష్ట్రానికి చెందిన కనీసం 50 మంది నాయకులు (అధిక శాతం అగ్ర కులాలకు చెందిన వారే!) కూడా, జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగి కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోలేక పోయారంటే...అంటే..సగటున ఏడాదికి ఒక్కరైనా లేరంటే, ఇంతకంటే అన్యాయం ఇంకోటి లేదనే అనాలి. కాకపోతే, ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా, వాటిని అధిగమించి, ఇదే రాష్ట్రానికి చెందిన పీవీ నరసింహారావు, ప్రప్రధమ దక్షిణ భారత ప్రాంత పౌరుడుగా, ప్రధాన మంత్రి పదవిని పొందగలిగారు. మొట్టమొదటి సారి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని వాడిగా, అయిదేళ్ల పూర్తి కాలం అధికారంలో వుండగలిగి, దేశ దేశాల మన్ననలను పొందిన ఆర్థిక సంస్కరణలను అమలు పరచగలిగాడు ఆయన. కేంద్ర మంత్రివర్గంలో తెలుగు వారికి ఆది నుంచీ ఇలా అన్యాయం చేయడంలో, కాంగ్రెస్ సారధ్యంలోని ప్రభుత్వమైనా, బిజెపి సారధ్యంలోని ప్రభుత్వమైనా కొద్ది తేడాతో ఒకే పద్ధతిని అవలంబించాయి.

రాజ్యాంగం ప్రకారం భారత ప్రధాన మంత్రిని, ఆయన సలహా మేరకు మంత్రివర్గ సభ్యులందరినీ, నియమించే అధికారం రాష్ట్రపతి కుంది. కాకపోతే, ప్రధాన మంత్రిగా నియమితులు కాబోయే వ్యక్తికి, పార్లమెంటు దిగువ సభకు ఎన్నికైన సభ్యుల్లో మెజారిటీ సభ్యుల మద్దతు తప్పనిసరిగా వుండాలి. అలా వున్న వ్యక్తిని-వుందని రాష్ట్రపతి భావించిన వ్యక్తినే ప్రభుత్వం ఏర్పాటు చేయమని రాష్ట్రపతి కోరుతారు. ఇది మనం అనుసరిస్తున్న బ్రిటీష్ పార్లమెంటరీ సాంప్రదాయం. పాలనా సౌలభ్యం కొరకు మంత్రులకు పోర్టుఫోలియోలు ప్రధాన మంత్రి సూచన మేరకు రాష్ట్రపతి కేటాయించినప్పటికీ, మంత్రులందరూ, వ్యక్తిగతంగా-సామూహికంగా ప్రధానికి, ప్రధాని ద్వారా రాష్ట్రపతికి-పార్లమెంటుకు బాధ్యులవుతారు. దీన్నే "మంత్రివర్గ ఉమ్మడి బాధ్యత" అంటాం. ఇష్టానుసారంగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకునే అధికారం, పోర్టుఫోలియోలను కేటాయించే అధికారం, పూర్తిగా ప్రధానిదేనని రాజ్యాంగం చెప్తున్నప్పటికీ, వాస్తవానికి, ఆ అధికారం కొన్ని హద్దులకు లోబడి వుంటుందని సాంప్రదాయాలు చెపుతున్నాయి. ప్రధాని, అధికార పార్టీ అధినేత వేర్వేరు వ్యక్తులైనప్పుడు, ఆ హద్దు స్పష్టంగా కనిపిస్తుంది. అదే విధంగా సంకీర్ణ ప్రభుత్వాలకు సారధ్యం వహించిన ప్రధాని కూడా ఇష్టానుసారంగా మంత్రివర్గం ఏర్పాటు కాని, విస్తరణ కాని, పునర్ వ్యవస్తీకరణ కాని చేయలేరు. ప్రస్తుతం ఈ రెండు రకాలైన పరిస్థితులు నెలకొని వుండడంతో ప్రధాని మన్మోహన్ సింగ్ సర్వ స్వతంత్రుడు కాదనే విషయం అర్థం చేసుకోవడానికి ఇటీవల జనవరి 19, 2011 న చేసిన విస్తరణే నిదర్శనం.

14 వ ప్రధాన మంత్రిగా, తొలి యూపీయే మంత్రులతో కలిసి, మే 22, 2004 న ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్, మొదటి ఐదేళ్ల కాలంలో ఒకటి-రెండు పర్యాయాలు మాత్రమే మంత్రివర్గంలో మార్పులు-చేర్పులు చేశారు. రెండో తడవ, సరిగ్గా ఐదేళ్ల తర్వాత, మే 22, 2009 న ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, 29 మంది కాబినెట్ మంత్రులతో, 48 మంది సహాయ మంత్రులతో మంత్రి మండలిని ఏర్పాటు చేశారాయన. ఇటీవలి విస్తరణలో, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారెవరూ లేకుండానే, కొత్తగా ముగ్గురి కి స్థానం కలిగించి, మొత్తం 37 మంది కాబినెట్ స్థాయి, 43 మంది స్టేట్ స్థాయి మంత్రులతో పునర్ వ్యవస్తీకరించారు. ప్రస్తుత మంత్రి మండలి సభ్యులతో కలుపుకుని, కేంద్ర మంత్రి మండలిలో జవహర్లాల్ నెహ్రూ కాలం నుండి ఇంతవరకు, 300 మందికి పైగా కాబినెట్ మంత్రి హోదా, సుమారు 70 మంది వరకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సహాయ మంత్రుల హోదా, మరో 360 మంది దాకా సహాయ మంత్రుల హోదా, 70 మందికి డిప్యూటీ మంత్రుల హోదా లభించింది. మొదట్లో మంత్రి మండలి మూడంచెల పద్దతిలో, కాబినెట్-సహాయ-డిప్యూటీ మంత్రులతో, ఏర్పాటు చేసే ఆనవాయితీ వుండేది. అయితే రాజ్యాంగంలో ఇలాంటి నిబంధనలంటూ ఏదీ లేదు. కేవలం బ్రిటీష్ సాంప్రదాయాన్ని అనుకరించే ఇది కూడా జరిగింది. పాలనా సౌలభ్యం కొరకు కూడా ఆ ఏర్పాటు పనికొచ్చింది. వాస్తవానికి, మంత్రులందరూ మంత్రి మండలి సభ్యులే. జీత భత్యాల విషయంలోనే కొంత తేడాలున్నాయి. కాకపోతే, ప్రధాన మంత్రి సమాన స్థాయి మంత్రులందరిలో ప్రథముడుగా పేర్కొంటారు. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా వున్నప్పుడు డిప్యూటీ మంత్రుల స్థాయికి స్వస్తి పలికారు. రాజీవ్ గాంధి మళ్లీ పునరుద్ధరించినప్పటికీ, అనతి కాలంలోనే, వారందరినీ సహాయ మంత్రులుగా పదోన్నతి కలిగించారు. ఇక ఆ తర్వాత అందరూ అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. కాకపోతే, సహాయ మంత్రులలో కొందరికి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించే ఆనవాయితీ మొదలైంది.

సర్దార్ వల్లభాయి పటేల్, అంబేడ్కర్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సీడి దేశ్ ముఖ్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, రాజగోపాలాచారి, బాబు జగ్జీవన్ రాం, కృష్ణ మీనన్, బహుగుణ, ఎంసీ చాగ్లా, కే ఎం మున్షి, అద్వాని, వీ వీ గిరి, వైబి చవాన్, రఫీ అహ్మద్ కిద్వాయ్, టీ టీ కృష్ణమాచారి, గోబింద్ వల్లభ్ పంత్, మోహన్ కుమార మంగళం, ఉమా శంకర్ దీక్షిత్, శంకర్ దయాళ్ శర్మ, జార్జ్ ఫెర్నాండెజ్, సుబ్రమణ్యం స్వామి, రామ్ జీత్మలాని, కరణ్ సింగ్, జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నా, ఆర్ వెంకటరామన్, గ్యానీ జైల్ సింగ్, అశోక మెహతా, ప్రణబ్ ముఖర్జీ లాంటి ప్రముఖులు కాబినెట్ మంత్రులుగా పనిచేశారు. కేఆర్ నారాయణన్, సంతానం, షీలా దీక్షిత్, ఓం మెహతా, ఎం జీకే మీనన్, నందినీ సత్పతి లాంటి ప్రముఖులకు మంత్రి మండలిలో స్థానం లభించినా, సహాయ మంత్రులుగానే పనిచేయాల్సి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కొత్త రఘురామయ్య, జలగం వెంగళ రావు, బెజవాడ గోపాల రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నీలం సంజీవ రెడ్డి, దామోదరం సంజీవయ్య, శివశంకర్, వెంకట స్వామి, కే చంద్ర శేఖర రావు, ఉపేంద్ర, వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, ఎర్రం నాయుడు, జైపాల్ రెడ్డిలకు కాబినెట్ హాదా లభించింది. టీ అంజయ్య, రేణుకా చౌదరి, మల్లికార్జున్, బంగారు లక్ష్మణ్, ఎస్ బీ పట్టాభి రామారావు, రంగయ్య నాయుడు, జగన్నాథరావు, కె ఎల్ రావు, విద్యాసాగర్ రావు, అంకినీడు ప్రసాద రావు, ఎస్ బీపిబికే సత్యనారాయణ రావు, కేవి రఘునాథ రెడ్డి, వెంకట సుబ్బయ్య, కృష్ణం రాజు, వేణుగోపాలాచారి, పనబాక లక్ష్మి, పళ్లంరాజు, సాయిప్రతాప్, పురంధరేశ్వరి లకు సహాయ మంత్రుల హోదా లభించింది. డిప్యూటీ మంత్రులుగా జేబీ ముత్యాల రావు, ఎం సంజీవ రావు, ఎం తిరుమల రావు, పీ వెంకట రెడ్డి లకు స్థానం లభించింది.

అత్యధిక కాలం-సుమారు 32 సంవత్సరాల పాటు కాబినెట్ మంత్రి హోదాలో పని చేసిన ఘనత బాబూ జగ్జీవన్ రాంకు దక్కింది. అతి తక్కువ కాలం-కేవలం ఐదు రోజులు మాత్రమే కాబినెట్ మంత్రిగా వుంది జస్టిస్ హెచ్ అర్ ఖన్నా. మన రాష్ట్రానికి సంబంధించి నంతవరకు ప్రధానిగా పని చేసిన పీవీ నరసింహారావు, కొత్త రఘురామయ్యలు సుమారు 15 సంవత్సరాల పాటు కాబినెట్ మంత్రులుగా వున్నారు. రఘురామయ్య అదనంగా మరో ఐదేళ్లు సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఉప ప్రధానులుగా సర్దార్ వల్లభాయి పటేల్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వై బి చవాన్, జగ్జీవన్ రాం, దేవీ లాల్, అద్వానీలు పని చేశారు. వీరిలో మొరార్జీ, చరణ్ సింగ్ ప్రధానులు కాగలిగారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఏ మాత్రం లేని రాజీవ్ గాంధి, చంద్ర శేఖర్ నేరుగా ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగారు.

ఆగస్ట్ 15, 1947 న స్వతంత్రం వచ్చిన తర్వాత, ఇప్పటి వరకు 14 మంది ప్రధాన మంత్రి పీఠాన్ని అధిష్టించారు. ప్రప్రధమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అత్యధిక కాలం-సుమారు 16 సంవత్సరాల 9 నెలలకు పైగా పదవిలో వుండి, 63 పర్యాయాలు మంత్రి మండలి విస్తరణలు-భారీ మార్పులు చేశారు. ఆయన కూతురు ఇందిరా గాంధి కూడా దాదాపు కొంచెం తక్కువగా, రెండు విడతలుగా, సుమారు 16 సంవత్సరాల కాలం ప్రధానిగా పనిచేసి, 67 సార్లు విస్తరణలు-భారీ మార్పులు చేపట్టారు. ఇక ఆ కుటుంబ వారసుడు, ఇందిరా గాంధి అనంతరం ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధి, కేవలం ఐదేళ్ల కాలంలోనే, 36 సార్లు మంత్రి మండలిలో మార్పులు చేయాల్సి వచ్చింది. అటల్ బీహారీ వాజ్ పాయ్ ఆరేళ్ల పాటు ప్రధానిగా వుండి, 27 పర్యాయాలు విస్తరణలు-భారీ మార్పులు చేశారు. ప్రధాన మంత్రులుగా పని చేసిన మొరార్జీ దేశాయ్ 2 సంవత్సరాల 4 నెలల కాలంలో, లాల్ బహదూర్ శాస్త్రి ఏడాదిన్నర కాలంలో చెరి పది సార్లు; చరణ్ సింగ్ ఆరు నెలల్లో ఆరు సార్లు; దేవె గౌడ పది నెలల పదవీ కాలంలో నాలుగు పర్యాయాలు; గుజ్రాల్ పది నెలల్లో రెండు సార్లు; వీపి సింగ్ 11 నెలల్లో, చంద్రశేఖర్ ఏడు నెలల్లో ఒకే ఒక్క సారి మంత్రి మండలిలో మార్పులు-చేర్పులు చేశారు. పీ వీ నరసింహారావు ఐదేళ్ల కాలం ప్రధానిగా వున్నప్పటికీ, కేవలం తొమ్మిది పర్యాయాలు మాత్రమే విస్తరణ చేపట్టారు. వీరందరితో పాటు, గుల్జారీలాల్ నందా రెండు సార్లు తాత్కాలిక ప్రధానిగా పనిచేశారు.

మంత్రి మండలిలో మార్పులు చేసినప్పుడల్లా, విస్తరణ చేపట్టినప్పుడల్లా, అది జరిగిన వెంటనే, ప్రధాని మంత్రి సన్నిహిత వర్గాల నుంచి మీడియాకు ఒక సందేశం రావడం ఆనవాయితీ. అతి త్వరలో, మంత్రివర్గ విస్తరణ వుండబోతున్నదని, కొత్త వారికి అవకాశం కలిగిస్తామని, దాని సారాంశం. ఆశావహుల ఆశలు అలా సజీవంగా వుంచడం అనాదిగా జరుగుతున్నదే! అలా జరిగిన నాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సరైన న్యాయం జరుగుతుందని ఆశించడం తప్ప చేసేదేమీ లేదు!

Monday, September 13, 2010

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కుల రాజకీయాలు : వనం జ్వాలా నరసింహారావు


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు విడి-విడిగానే పనిచేసేవి. అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చొరవతో, జులై 1957 లో, అల్లూరి సత్యనారాయణ రాజు అధ్యక్షతన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆవిర్భవించింది. భారత జాతీయ కాంగ్రెస్ కి రాజకీయ పార్టీకుండాల్సిన లక్షణాలు లేవనే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితీ అంతే. ప్రజల మద్దతున్న పార్టీ అయినప్పటికీ, అందులో అంతా నాయకులే తప్ప సుశిక్షితులైన అనుచరుల (కాడర్) కొరతుందనే అనాలి. ఆవిర్భావం నుంచి, చాలా కాలం వరకు, పెద్ద చదువులు చదువుకున్న పట్టణ ప్రాంతం వారితో ను, అగ్ర కులాలుగా పిలువబడే వారితో ను-అందునా అధిక సంఖ్యా కులు బ్రాహ్మణ కులానికి చెందినవారితో ను, పార్టీ నాయకత్వం పనిచేసేది. పట్టాభి, అయ్యదేవర, ప్రకాశం, ముట్నూరి, దుగ్గిరాల, కొండా, వీవీ గిరి, మాడపాటి, బూర్గుల, నీలం, కాశీనాథుని, పింగళి, వామన్ నాయక్, మెల్కొటె, జమలాపురం, కెవి రంగారెడ్డి లాంటి వారిని ఆ జాబితాలో ఉదహరించవచ్చు. స్వతంత్రం రాక పూర్వం పరిస్థితి అలా వుంటే, ఇక ఆ తర్వాత, బ్రాహ్మణే తర కులాలకు చెందిన ధనిక భూస్వామి వర్గాలలోని కమ్మ, రెడ్డి, కాపు, క్షత్రియ, వెలమ వారి ఆధిపత్యం మొదలైంది. ఇంకా కొనసాగొతుందిప్పటికీ. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టడంతో, ఈ తరగతులకు చెందిన వారిదే పూర్తి పెత్తనంగా మారడం, వారే ముఖ్యమంత్రులు-మంత్రులు-జిల్లా పరిషత్ అధ్యక్షులు-ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కావడం మొదలైంది. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. అప్పటినుంచి కొంత మార్పొచ్చింది.

ఒక గురుమూర్తో, ఒక ముసలయ్యో, ఒక హనుమంతరావో, ఒక సంజీవయ్యో, ఒక అంజయ్యో తప్ప ముఖ్యమంత్రులైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనా, జిల్లా పరిషత్ చైర్మన్లు అయినా, అగ్ర వర్ణాల వారో, ధనిక వర్గాల వారో కావడమే కాని, వెనుకబడిన వర్గాల వారికి అవకాశాలు ఎక్కువగా రాలేదనే అనాలి. ఇందిరా గాంధి నాయకత్వంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో మొదటి సారి చీలి కొచ్చిన తర్వాత, జరిగిన మధ్యంతర ఎన్నికలప్పటినుంచి, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కొంత మార్పు కనబడ సాగింది. వెనుకబడిన వర్గాల వారికి, దళితులకు కొంత ప్రాధాన్యత లభించడం మొదలైంది. సంఖ్యాపరంగా వారు మెజారిటీలో వుండడం, వారి ఓట్లు గెలుపుకు ముఖ్యం కావడం, ఈ మార్పుకు ప్రధాన కారణం. అయితే, జన్మతః అందరు వెనుకబడిన వర్గాలకు చెందిన వారైనప్పటికీ, అవకాశాల విషయానికొచ్చేటప్పటికి, కొందరికే ప్రాధాన్యత లభించింది. సామాజికంగా-ఆర్థికంగా పుంజుకున్న వారు, విద్యాధికులకే పైకి పోయే అవకాశాలు లభించాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో వీరి అవసరం రీత్యా పలువురికి అవకాశాలు రాసాగాయి. అయితే, మొదటి నుంచి కూడా, కాంగ్రెస్ నాయకత్వం ధనికుల-అగ్ర వర్ణాల వారి చేతుల్లో వున్నప్పటికి, పార్టీకి మద్దతిచ్చే వారిలో అధికులు దళితులు, వెనుక బడిన వర్గాల వారు. మైనారిటీలు కావడం విశేషం. ఇప్పటికీ, పూర్తిగా అవకాశం చేతికందకపోయినా, 1972 ఎన్నికల అనంతరం, అధిక సంఖ్యలో వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, దళితులు చట్ట సభల్లో ప్రవేశించే వీలు కలిగింది. పీవీ నరసింహా రావు మంత్రివర్గంలో సగానికి పైగా ఆ వర్గాల వారికే స్థానం లభించడం విశేషం.

కాంగ్రెస్ పార్టీలో ప్రాంతీయ విభేదాలెంత మోతాదులో వుంటాయో, అంతకంటే ఎక్కువ మోతాదులో కుల-మత విభేదాలుంటాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎన్నుకొనేటప్పుడు (ఎంపికచేసేటప్పుడు), శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ల పంపకమప్పుడు, ఎన్నికల అనంతరం శాసనసభ పక్షం నాయకుడి ఎన్ని కప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల విషయంలో, జిల్లా పరిషత్-మునిసిపల్ చైర్మన్ ఎన్ని కప్పుడు కుల రాజకీయాలకు అధిక ప్రాధాన్యతుంటుంది. ఇంతవరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో, అడపాదడపా తప్ప, సర్వసాధారణంగా రెడ్డి, కమ్మ కులస్తులకే ఎక్కువ స్థానాలు ఎక్కువ సార్లు లభించాయి. స్థానిక సంస్థల్లో అంజయ్య పుణ్యమా అని రిజర్వేషన్లు కలిగించడంతో, వెనుకబడిన వర్గాల వారు అధిక సంఖ్యలో ఎన్నిక కాగలుగుతున్నారు. అంతకు ముందు, జిల్లా పరిషత్ చైర్మన్లు గాని, సమితి అధ్యక్షులు గాని ఒక పథకం ప్రకారం అగ్ర వర్ణాల వారే ఎన్నికయ్యేవారు. అందునా, తెలంగాణలో-రాయలసీమలో రెడ్లు, కోస్తాంధ్రలో కమ్మ వారు, ఉత్తరాంధ్రలో క్షత్రియులు ఎన్నికయ్యేవారు.

కాంగ్రెస్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో అవతరించిన మరో రాజకీయ పార్టీ జనత పార్టీ. అంతకు ముందే కమ్యూనిస్ట్, ప్రజా సోషలిస్ట్, స్వతంత్ర లాంటి పార్టీలున్నప్పటికీ, ఇందిరా గాంధి విధించిన ఎమర్జెన్సీ నేపధ్యంలో మొట్టమొదటి కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి పార్టీగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా జనత పార్టీకి ప్రాధాన్యముందనాలి. ఆ పార్టీ కూడా అగ్ర కులాల ఆధిపత్యంలోనే పనిచేసింది. నీలం సంజీవరెడ్డి జనత ఆంధ్ర విభాగం ఏర్పాటును లాంఛనంగా ప్రకటించి, దాని అధ్యక్షుడుగా తెన్నేటి విశ్వనాథంను నియమించారు. ఇప్పటి జాతీయ స్థాయి నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు అప్పట్లో విద్యార్థి విభాగం కన్వీనర్. జనత పార్టీ రాష్ట్ర కమిటీలో కేవలం ఇద్దరు మాత్రమే షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు, నలుగురు వెనుకబడిన వర్గాలకు చెందిన వారుండగా, మిగిలిన 85% మంది ఇతరులున్నారు. కాకపోతే, వారిలో ఒక ముస్లిం, ఇద్దరు మహిళలు కూడా వున్నారు. 1977 ఎన్నికల ముందు ఏర్పాటుచేసిన అడహాక్ కమిటీ పరిస్థితి కూడా అంతే. అందులో షెడ్యూల్డ్ కులాల వారు, తెగల వారు, వెనుకబడిన వర్గాల వారందరు కలిసి కేవలం 23% మంది మాత్రమే సభ్యులయ్యారు. ఆ తర్వాత కొన్ని మార్పులు-చేర్పులు చేసినా, అవన్నీ రాజకీయ కోణం నుంచే కాని వెనుకబడిన వర్గాల వారి ప్రాధాన్యతను పెంచేందుకు కాదు. 1977 లోక్ సభ ఎన్నికల్లో ఇద్దరు వెనుకబడిన వర్గాల వారు, ఒక్క ముస్లిం అభ్యర్థి తప్ప మిగిలిన అందరూ ఇతరులే. ప్రజల-ఓటర్ల మద్దతు పొందేందుకు 1978 శాసనసభ ఎన్నికల్లో సుమారు 40% స్థానాలను ఆ వర్గాల వారికి కేటాయించింది జనత పార్టీ నాయకత్వం.

కమ్యూనిస్టు రాజకీయాలపై కూడా కుల ప్రభావం పడిందనాలి. ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ-సామాజిక-ఆర్థిక నేపధ్యంలో అవి తప్పవేమో! స్వతంత్రం రాక పూర్వం రాష్ట్రంలోని జాతీయోద్యమం బ్రాహ్మణుల నాయకత్వంలో చాలావరకు నడి చేది. రాయలసీమలోని రెడ్లు, కోస్తాలోని కమ్మ వారు, ఆధిపత్యం కొరకు బ్రాహ్మణులపై పోరాడారు. కోస్తాలోని కమ్మ వారికి, బ్రాహ్మణులను ఎదిరించేందుకు సరైన ఆయుధం కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో లభించింది. అలానే రాయలసీమ రెడ్డి వారు కూడా. నిజా-నిజాలెంతో కాని, 1952 లో జరిగిన ఎన్నికల్లో, కమ్యూనిస్ట్ వ్యూహం కాంగ్రెస్ పార్టీలోని కమ్మ-రెడ్డి విభేదాలను ఉపయోగించుకునే రీతిలో వుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కమ్యూనిస్టుల్లో కులం ముఖ్యమైనా-కాకపోయినా, చాలా కాలం వరకు అగ్ర కులాల వారి ఆధిపత్యంలోనే నాయకత్వం కొనసాగింది. ఇటీవలి కాలంలో పార్లమెంటరీ పంథాకు అలవాటు పడి, బూర్జువా పార్టీల ధోరణులన్నీ వంటబట్టించుకున్న అతివాద-మితవాద-తీవ్రవాద కమ్యూనిస్టులు, కులం విషయంలో కూడా ఏమీ తీసిపోలేదనిపిస్తున్నారు.

ఆంధ్రుల ఆత్మ గౌరవం ఢిల్లీ నడి వీధుల్లో తాకట్టు పెట్టారు కాంగ్రెస్ వారంటూ, ఆ పార్టీని ఓడించి, నేల నాలుగు చెరగు లా తెలుగు వాడి సత్తా నిరూపించాలని పిలుపిచ్చారు తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి ఆద్యుడు ఎన్ టీ రామారావు. ఆయన పిలుపునందుకొని వారు-వీరన్న తేడా లేకుండా ఆబాల గోపాలం ఆయన వెంట నడిచింది. కులమతాలకు అతీతంగా పార్టీ పక్షాన పోటీ చేసిన ప్రతి వారినీ విజయం వరించింది. అవినీతికి, అన్యాయానికి, వెనుకబడిన తనానికి వ్యతిరేకంగా ఎన్ టీ రామారావు మాట్లాడని రోజు లేదు. అంతవరకు బాగానే వుంది. మొదట్లో అవన్నీ పనికొచ్చాయి. క్రమంగా "ఆత్మగౌరవం" నినాదం స్థానంలో "రాజకీయ గౌరవం" ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్ టీ రామారావు ఆదర్శాలకు ఎదురుదెబ్బ తగిలి ప్రజాస్వామ్యం పరిహసించబడింది. ఆయన ప్రభుత్వాన్ని కూల దోసే నేపధ్యంలో కుల రాజకీయాలకే ప్రాధాన్యతుందనాలి. ఎన్ టీ రామారావును గెలిపించినప్పుడు కొందరు ఆయనను తమ కులానికి ప్రతినిధిగా మాత్రమే చూశారు. ఎప్పుడైతే అది కుదరలేదో, ఆ కులానికి చెందిన మరొకరిని ఆ పీఠంపై కూర్చొబెట్టే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన వ్యక్తులే, అదను చూసుకుని ఆయన అధికారంలో కొనసాగడం మంచిది కాదనుకుని నాయకత్వం చేపట్టారు. తెలుగు దేశం పార్టీ కూడా కుల ప్రాధాన్యత విషయానికొచ్చే సరికి అన్ని రాజకీయ పార్టీల మార్గాన్నే అనుసరించిందనాలి. లెక్కలు పక్కన పెట్టి తే, మూడు పర్యాయాలు ప్రభుత్వంలోకి వచ్చిన టిడిపి ఎమ్మెల్యేలలో కాని, మంత్రులలో కాని వెనుక బడిన వర్గాల వారి ప్రాధాన్యత మిగిలిన వారితో పోల్చి చూస్తే చాలా తక్కువే. నాయకత్వం సరిపడక పార్టీని వదిలి వెళ్ళి తిరిగొచ్చిన దేవేంద్ర గౌడ్ లాంటి వారు కూడా వెనుకబడిన వర్గాల వారి వాణిగా పేరు తెచ్చుకోలేక పోతున్నారు.

ఇక ఇటీవలి కాలంలో ధనవంతులైన కొందరు బీసీ నాయకులు పార్టీ పెట్టి తమ వారికి న్యాయం చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీ గా కూడా గెలిచారు. ఏమైందో-ఏమో, మళ్ళీ అవే రాజకీయాలు. కాంగ్రెస్ గూట్లో చేరారు. ఇలా ఉన్న ఒకటి-రెండు ఆశలను కూడా ఆ వర్గానికి చెందిన వారే అడియాసలు చేస్తుంటే ఎలా?

ఇవిలా వుండగా, కాంగ్రెస్ పార్టీని వీడిన వారు, అలిగి పోయిన వారు, రాజకీయ కారణాలతో కొంతకాలం బయటున్న వారంతా అగ్ర కులాల వారే. ఎన్జీ రంగా కేఎల్పీ పార్టీ, బ్రాహ్మణుల నాయకత్వంలో వెలిసిన కే.ఎం.పీ.పీ, మర్రి చెన్నా రెడ్డి డెమోక్రాటిక్ పార్టీ, స్వతంత్ర పార్టీ అలాంటివే. ఆధిపత్య పోరు కొరకే అవన్నీ. అందునా కుల ప్రాతిపదికన జరిగిన ఆధిపత్య పోరే అది. ఎదేమైనా-ఎవరెన్ని చెప్పినా, వెనుకబడిన వర్గాల వారికి రాజకీయ పెత్తనం అప్పగించడం ఇప్పటికీ ఇంకా మాటల్లోనే కాని ఆచరణలో కానే కాదు. ఒక వేళ వీరిలో ఎవరన్నా ఉన్నత స్థాయికి చేరుకోగల వారుంటే, వారికి కూడా ధన బలం తప్పని సరి. అది లేకపోతే, వారి వారే వెనక్కు పడవేయడం ఖాయం.