Showing posts with label హ్యూస్టన్. Show all posts
Showing posts with label హ్యూస్టన్. Show all posts

Friday, August 10, 2012

అంగారకుడిపై రోవర్: వనం జ్వాలా నరసింహారావు


అంగారకుడిపై రోవర్
సూర్య దినపత్రిక (11-08-2012)
వనం జ్వాలా నరసింహారావు

మానవజాతి కొనసాగిస్తున్న మహాన్వేషణలో అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం "నాసా" మరో అడుగు ముందుకు వేసింది. ఆ సంస్థ అంతరిక్షంలోకి పంపిన రోవర్ "క్యూరియాసిటీ" అంగారకుడిపై విజయవంతంగా కాలు మోపడంతో, నాసా మరో కీలక మైలురాయిని అధిగమించినట్లయింది. అమెరికా కాలిఫోర్నియా సమీపంలోని నాసా కేంద్రంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలలో మందహాసం తొణికిసలాడింది. కరతాళ ధ్వనులు మారుమోగాయట. క్యూరియాసిటీ లాండింగును న్యూయార్క్ లోని టైం స్క్వేర్‌లో నాసా ఏర్పాటు చేసిన ప్రత్యేక తెరపై లైవ్‍లో వీక్షించిన అమెరికన్ల ఆనందోత్సవాలకు అవధులే లేవంటున్నారు. అంగారకుడిపై కాలుమోపిన క్యూరియాసిటీ అక్కడ జీవ పదార్ధం ఉనికిని కనుగొనే వేటలో మునిగిపోయింది. అంగారకుడి చిత్రాలను భూమికి పంపింది. సుమారు తొమ్మిది వందల కిలోగ్రాముల బరువున్న క్యూరియాసిటీ రోవర్ ముప్పై ఐదు కోట్ల మైళ్ల సుదూర ప్రయాణం చేసి అంగారకుడిని చేరుకుంది. మొత్తం మీద గ్రహాంతర జీవం కోసం మానవుడు జరుపుతున్న శతాబ్దాల అన్వేషణ కీలక దశకు చేరుకుంటుంది. ఈ నేపధ్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, హ్యూస్టన్ "నాసా" కేంద్రం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు  ఎన్నో వున్నాయి.

1957 లో, అలనాటి సోవియట్ యూనియన్, కృత్రిమ అంతరిక్ష నౌకను మొదటిసారిగా ప్రయోగించడంతో, స్పందించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్హోవర్, ఏడాది తిరక్కుండానే, 1958 లో "నేషనల్ ఎయిరో నాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్"-"నాసా" ను, స్థాపించాడు. వాస్తవానికి మార్చ్ 3, 1915 న ఆ దేశంలో నెలకొల్పిన "నేషనల్ అడ్వైజరీ కమిటీ ఫర్ ఎయిరోనాటిక్స్"-"నాకా" సంస్థ నుంచి "నాసా" ఆవిర్భావం జరిగిందనాలి. అంతరిక్ష యానానికి సంబంధించిన సాంకేతిక నైపుణ్యం, తమ దేశంలో అభివృద్ధి చేయడానికి, "నాసా" స్థాపనకు నలభై సంవత్సరాల ముందు నుంచే "నాకా" పరిశోధనలను విజయవంతంగా నిర్వహిస్తున్నది. తోటి అగ్రరాజ్యం సోవియట్ యూనియన్ సాధించిన ఫలితాలను అధిగమించేందుకు, అంతరిక్ష రంగంలో మరింత పట్టు సాధించేందుకు, ఐసెన్హోవర్ "నాసా" ను స్థాపించాడు. జాన్ కెన్నెడీ అధ్యక్షుడిగా వున్నప్పుడు, "నాసా" పైనా, అంతరిక్షంలోకి పంపాల్సిన వ్యోమగాముల శిక్షణ-అభివృద్ధి పైనా, ముఖ్యంగా "చంద్ర మండలం" మీద పాదం మోపడం కొరకూ, భారీగా నిధులను కేటాయించింది నాటి అమెరికన్ ప్రభుత్వం. అవి సత్ఫలితాలనిచ్చి, జులై 20, 1969 , అమెరికా అంతరిక్ష నౌక "అపోలో" లో ప్రయాణించిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఆల్విన్ అడ్రిన్ లు కెన్నెడీ విసిరిన సవాలుకు ప్రతిగా, చంద్రుడి మీద పాదం మోపిన తొలి మానవులయ్యారు. ఆయన వాంఛను నెరవేర్చారు.


"నాసా" ఒక వైపు అంతరిక్ష యానం దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే, ఇంకో వైపు, గతంలో "నాకా" చేపట్టిన "అంతరిక్ష పరిశోధన" కు సంబంధించిన ఫలితాలలోను గణనీయమైన పురోగతిని సాధిస్తూ వచ్చింది. "స్పేస్ టెక్నాలజీ" కి సంబంధించిన వాతావరణ-సమాచార రంగాల్లో అభివృద్ధికి అంతరిక్ష నౌకలను అనుసంధానం చేయడంలో కూడా విజయం సాధించింది. వాషింగ్టన్ లోని "నాసా" ప్రధాన కేంద్ర కార్యాలయం, అంతరిక్ష యానానికి సంబంధించిన పరిశోధన-అభివృద్ధి-శిక్షణలకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడం-అమలుకు చర్యలు తీసుకోవడం తీసుకుంటుంది.

"నాసా" కార్య కలాపాల ప్రధాన అధిపతిని "అడ్మినిస్ట్రేటర్" అంటారు. అమెరికా అధ్యక్షుడు ఎంపిక చేసి, నామినేట్ చేసిన వ్యక్తిని, సెనేట్ ఆమోదించాల్సి వుంటుంది. ప్రస్తుతం జులై 17, 2009 నుంచి ఆ పదవిలో వున్న పన్నెండవ అడ్మినిస్ట్రేటర్, మేజర్ జనరల్ ఛార్లెస్ ఫ్రాంక్ బోల్డెన్ జూనియర్ ను, ప్రెసిడెంట్ ఒబామా నామినేట్ చేశాడు. 34 సంవత్సరాల తన సుదీర్ఘ అనుభవంలో 14 సంవత్సరాలు "నాసా" అంతరిక్ష పరిశోధన కేంద్రంలో సభ్యుడుగా వుంటూ, 1986-1994 మధ్య కాలంలో నాలుగు పర్యాయాలు అంతరిక్ష నౌకలో స్పేస్ వాక్ చేశాడు.  "నాసా" లో వివిధ కీలక పదవులను గతంలో నిర్వహించిన బోల్డెన్ 1946 సంవత్సరంలో ఆగస్ట్ నెల 19 వ తేదీన జన్మించాడు. బోల్డెన్ హ్యూస్టన్ నగర వాసి.

హ్యూస్టన్ నగరంలో, 1961 లో "ప్రయాణీకుల అంతరిక్ష నౌకా కేంద్రం" గా అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ రూపకల్పన చేసి నెలకొల్పిన ఇక్కడి "నాసా" కార్యాలయం పేరును, జాన్సన్ మరణానంతరం, ఆయన స్మృతి చిహ్నంగా, "లిండన్ బి జాన్సన్ స్పేస్ సెంటర్" గా మార్చారు. గత నాలుగైదు దశాబ్దాలుగా మానవ అంతరిక్ష యానానికి సంబంధించిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి-విజయవంతంగా అమలుకు రంగం సిద్ధం చేసిన సంస్థల్లో, ప్రపంచంలో అగ్రగామిగా పేరు తెచ్చుకుంది

హ్యూస్టన్లోని ఈ కేంద్రం. అమెరికా అంతరిక్ష పరిశోధన మొదటి కార్యక్రమమైన జెమిని కార్యకలాపాలు పూర్తయి పోయి, అపోలో కార్యక్రమం ఆరంభమవడంతో, యావత్ ప్రపంచం దృష్టి దానిమీద పడింది. కెన్నెడీ విసిరిన సవాలుకు ప్రతిస్పందనగా చేపట్టిన చంద్రుడిపై కాలుమోపే కార్యక్రమం విజయవంతంగా ముగిసి, వ్యోమగాములు సురక్షితంగా భూమి పైకి తిరిగొస్తుంటే, ప్రపంచం కళ్లన్నీ హ్యూస్టన్ మీదనే కేంద్రీకృతమయ్యాయి. జులై 20, 1969 రోజున చంద్రమండలం మీద కాలిడిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, అక్కడ నుంచే, "హ్యూస్టన్, ఈగిల్ లాండయింది" అనడం, కొన్ని గంటల్లోనే, అపోలో నౌక "లూనార్ మాడ్యూల్‌" నుంచి ఆయన సహచర వ్యోమగాములు, నిచ్చెన ద్వారా దిగి అంతరిక్షంలో పాదం పెట్టి, "మానవుడికి ఇదొక చిన్న అడుగే కాని, మానవజాతి మనుగడ దిశగా వేసిన పెద్ద అడుగు" అని ప్రకటించడం, ఇక్కడి వారికి మరుపు రాని సంఘటన.

భూత-భవిష్యత్-వర్తమానాలకు చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధనలు, సాధించిన విషయాలు, మానవజాతి మనుగడకు సాధించనున్న సత్ఫలితాలు కళ్లకు కట్టినట్లు చూడొచ్చిక్కడ. సాక్షాత్తు అంతరిక్ష యానం చేస్తున్న అనుభూతినీ పొందవచ్చు. ఈ భూమండలంలో-యావత్ ప్రపంచంలో, మరెక్కడా లేని విధంగా, మరో ప్రపంచంలోకి సాహసోపేతమైన ప్రయాణం చేయించగల సౌకర్యమున్న ప్రదేశం కూడా బహుశా హ్యూస్టన్లోని అంతరిక్ష కేంద్రం ఒక్కటేనోమో. ఇక్కడ ప్రదర్శనలో వుంచిన వివిధ అంశాలు, ఆకర్షణలు, ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు, ఇంతవరకు జరిపిన అంతరిక్ష ప్రయాణాలకు సంబంధించిన అలనాటి "ప్రత్యక్ష ప్రసారాలు", వ్యోమగాముల శిక్షణా వివరాలు, మిషన్ కంట్రోల్ కేంద్రం, చంద్ర మండలం నుంచి తెచ్చిన శిలలు, "నాసా" వాహనంలో పర్యటన, అంతరిక్షంలో నౌకను పంపే సమయంలో అడుగడుగునా చోటు చేసుకునే సంఘటనలు, చిన్న పిల్లల వినోద కార్య క్రమాలు.. ... ఇలా ఎన్నో ఆసక్తికరమైన వినోద-విజ్ఞాన ప్రదేశం హ్యూస్టన్లోని "నాసా" కేంద్రం.

Wednesday, January 27, 2010

జ్వాలా మ్యూజింగ్స్-22 (అమెరికాలో సొంత ఇల్లు)


జ్వాలా మ్యూజింగ్స్-21 (సాహిత్యం-మానవతావాదం - మానవ విలువలు)
ఈ బ్లాగ్ లో ఇంతకుముందే పెట్టడం జరిగింది

అమెరికాలో సొంత ఇల్లు
షుగర్ లాండ్ టెల్ ఫెయిర్‌ లో కిన్నెర-కిషన్ నూతన గృహ ప్రవేశం
బంధు-మిత్రుల మధ్య సత్యనారాయణ వ్రతం, హోమం, విందు భోజనం

వనం జ్వాలా నరసింహారావు

మేం అమెరికాకు వచ్చిన రెండు కారణాలలో ఒకటి మా ఆదిత్య-పారుల్ కు పుట్టబోయే కూతురును చూడడం, రెండోది కిన్నెర-కిషన్ ల నూతన గృహ ప్రవేశం. ఎదురు చూస్తున్న రెండూ, రెండు రోజుల తేడాతో జరిగాయి. నవంబర్ 24 ఉదయం 8-36 కు (విరోధి నామ సంవత్సరం-మార్గ శిర మాసం-సప్తమి తిథి-ధనిష్ఠ నక్షత్రం) ఆదిత్య-పారుల్ కూతురు-మా మూడో మనుమరాలు కనక్ పుట్టిందన్న వార్త విని ఆనందంతో ఒక పని అయిందనుకున్నాం. ఇక, కిన్నెర వాళ్లు గృహప్రవేశం కావాలంటే, నవంబర్ 26 లోపు అయిపోవాలి. ఆ తర్వాత మంచిరోజులు రెండు-మూడు నెలల వరకు లేవు. అమెరికాలో వుంటున్నా, ఇక్కడివారు చాలామంది, ప్రతి విషయంలో తిథి-వార-నక్షత్రాలతో సహా ఇల్లు కొనేటప్పుడు వాస్తుకూడా చూస్తుంటారు. కిన్నెర ఇంటికి ప్రవేశ ద్వారం తూరుపు దిక్కుగా వుండాలని అలాంటిది దొరికేంతవరకూ ఆగారు. ఇక గృహప్రవేశం నవంబర్ 26 లోపు జరగాలంటే, ఇల్లు కట్టడం దగ్గర్నుంచి, ఒప్పందంలో పేర్కొన్నవన్నీఇంట్లో అమర్చడం జరిగిపోవాలి. ఇరు పక్షాల "వాక్ థ్రూలు" అయిపోవాలి. ఇవేవీ కాలేదింకా. నిబంధనల ప్రకారం ఇల్లు పూర్తిగా హాండోవర్ చేసేంతవరకు ఇంట్లోకి వెళ్లనివ్వరు. అయితే, మన నమ్మకాలపై గౌరవం వుంచి, నిబంధనలను సడలించి, ఆ ఒక్క రోజుకు తాళంచేతులివ్వడానికి, ఒక్క రాత్రి ఇంట్లో వుండడానికి బిల్డర్ అంగీకరించాడు. ఈ విషయం సరిగ్గా నవంబర్ 24 సాయంత్రం తెలిసింది. ఇక వెంటనే ఏర్పాట్లు చేసుకోవడం మొదలెట్టారు కిన్నెర-కిషన్ లు.

కిషన్ చెల్లెలు-కిన్నెర ఆడపడుచు మానస హ్యూస్టన్లోనే వుంటుంది. అన్నా-వదినలకు మంచి చేదోడుగా వుంటుంది. గురువారం, నవంబర్ 26 రాత్రి ఒంటి గంటకు-తెల్లవారితే 27 న గృహ ప్రవేశానికి ముహూర్తం నిశ్చయం చేసుకున్నారు. కిన్నెర-కిషన్ ల మిత్ర బృందాన్ని ఆహ్వానించారు. గురువారం సాయంత్రం వచ్చి ఒకసారి అన్ని పరిశీలించి వెళ్లాం. ఆ రాత్రికి ఏమేం తేవాలో నిర్ణయించుకున్నాం. చీకటి పడడానికి కొంచెం ముందు కిన్నెర-కిషన్-యష్విన్-మేథ-మానస-శ్రీనివాస్-హర్ష్-భవ్య అక్కడకు చేరుకున్నాం. ఇంటి ముందు నీళ్లు చల్లి, ద్వారానికి మామిడి తోరణం కట్టి, శాస్త్రోక్తంగా మానసతో ముగ్గువేయించి, చాలా సరదాగా కాసేపు గడిపి వెళ్లాం. తిరిగి ముహూర్తానికి కొంచెం ముందర, అందరం కలిసి అక్కడకు చేరుకున్నాం. కిన్నెర-కిషన్ దంపతులు, మానస-శ్రీనివాస్ దంపతులతో కూడి, మేమందరం వెంట వుండగా, బ్రాహ్మణుడి మంత్రోచ్ఛారణ మధ్య, శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. భారతదేశంలో-ఆంధ్ర ప్రదేశ్ లో, ఎవరైనా-ఏ విధంగా శాస్త్రం చెప్పిన పద్ధతిలో గృహప్రవేశం చేస్తుంటారో, అదే విధంగా ఆవగింజ తేడా లేకుండా, ప్రతి విషయంలోనూ శ్రద్ధగా కార్యక్రమాలు చేశారు. బ్రాహ్మణుడు అన్నీ సవ్యంగా జరిపించాడు. ద్వారం ముందు గడప వద్ద మంచి గుమ్మడికాయ పగల గొట్టడం, బూడిద గుమ్మడికాయ ఇంటి ముందరుంచడం, దేవుడిని ఈశాన్యంలో ఏర్పాటుచేయడం, పుణ్యాహవాచన, పాలు పొంగించడం, గణపతి పూజ లాంటి కార్యక్రమాలన్నీ యధా విధిగా జరిపించాడు బ్రాహ్మణుడు అచ్యుత రామ శాస్త్రి గారు. మానస పాడిన మంగళ హారతితో కార్యక్రమం ముగిసింది.

ఆ రాత్రి మేం కాకుండా, పేరి శర్మ-జానకి దంపతులు, బర్కిలీ నుంచి వచ్చిన జానకి చెల్లెలు-భర్త, శివ భార్య పల్లవి, అంబుజ్-రూపాళి దంపతులు, రామకృష్ణ-సునంద దంపతులు, రాచకొండ సాయి-లలిత దంపతులు వారి పిల్లలతో సహా వచ్చారు గృహ ప్రవేశానికి. మరికొన్ని గంటల్లో "బ్లాక్ ఫ్రైడే" అమ్మకాలు మొదలైతాయనీ, వీలైనంత త్వరగా మాల్స్ దగ్గరికెళ్లి క్యూలో నిలబడాలనీ వెళ్లిపోయారు కొందరు. పాలు పొంగించి-అందులో ఉడికించిన పొంగలి ప్రసాదాన్ని తీసుకున్నారందరు. చాలా సరదాగా గడిచిందా రాత్రి. కుటుంబ సభ్యులందరం ఆ రాత్రి నిద్ర చేసి, పొద్దున్నే వెళ్లాం. పూర్తిగా ఫార్మాలిటీస్ అన్ని అయిపోయి ఇల్లు రిజిస్టర్ అయింతర్వాత, స్వాధీనంలోకి వచ్చిన వెంటనే, ఫ్లాట్ ఖాళీ చేసి, అందులోకి డిసెంబర్ 11 న పూర్తి స్థాయిలో ప్రవేశించాం. తిరిగి అంగరంగ వైభోగంగా, ఆ మర్నాడే అశేష బంధువుల మధ్య సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం. హోమం కూడా జరిపించారు బ్రాహ్మణుడు ఉదయ కుమార్ గారు. విందు భోజనం ఎలాగూ ఉంటుంది గదా.

అమెరికాలో ఇల్లు కొనడమనేది కొంచెం కష్టం అనిపించినా, వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ పోతే, ఇంటి తాళం చేతులు చేతికందుకోవడానికి నాలుగైదు నెలల కంటే ఎక్కువ పట్టదు. మా అమ్మాయి కిన్నెర వాళ్లు ఐదారు ఏళ్ల క్రితం సిన్సినాటిలో వున్నప్పుడు, అమెరికాలో మొదటి సారి ఇల్లు కొనుక్కున్నారు. న్యూయార్క్-ఆల్బనీకి వెళ్లేటప్పుడు దాన్ని అమ్మి అక్కడ ఇంకో టి కొనుక్కున్నారు. హ్యూస్టన్ కు వచ్చిన తర్వాత కంపెనీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆల్బనీ ఇల్లు అమ్మి ఇక్కడ షుగర్ లాండ్ టెల్ ఫెయిర్‌ కమ్యూనిటీ కాలనీలో కొనుక్కున్నారు. ఇల్లు కొనడం-అమ్మడంలో కిషన్ కు అనుభవం వున్నందువల్లా, అదనంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్లా, వాళ్లు వెతకడం మొదలెట్టి, ఇంట్లోకి పూర్తిగా ప్రవేశించడానికి సుమారు నాలుగైదు నెలల కంటే ఎక్కువ పట్టలేదు.

అమెరికా "పట్టణాభి వృద్ధి-గృహ నిర్మాణ శాఖ", దేశంలో ఇళ్లు కొనుక్కోవాలనుకునే వారందరికీ తొమ్మిదంచెల సురక్షిత విధానాన్ని, ఆ శాఖ కార్యదర్శి పేరు మీద విడుదల చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అదనంగా కొనే వాళ్ల అవసరాల కను గుణంగా వుండే విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ ఆలోచించే కొంటారెవరైనా ఇక్కడ ఇళ్లను.
ఇల్లు కొనాలనుకునేవారి ఆదాయ వనరులు-అసలు ఆదాయం, దాని ఆధారంగా ఎంత ఋణ సౌకర్యం పొందే వీలుంది, నెలసరి ఖర్చెంత, దాచుకున్న డబ్బునుంచి కట్టగలిగేదెంత, తీసుకోదల్చిన ఋణం మీద చెల్లించే స్తోమతున్న వడ్డీ రేటు లాంటి విషయాల ప్రాతిపదికగా, అందులో అనుభవమున్న స్నేహితుల-నిపుణుల సలహా సంప్రదింపులతో ఆరంభించడం మంచిది. ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దె-భవిష్యత్ లో చెల్లించ బోయే బాంక్ వాయిదా తేడాను అంచనా వేసుకొని, చెల్లించే స్తోమతుందని నిర్ధారణ చేసుకోవాలి. "పిండికి తగ్గ రొట్టె" నే తయారు చేసుకోవాలి. సొంత ఇల్లు కొన్నుక్కోవాలనుకున్న ప్రతి వారూ, తమ హక్కులను గురించి తెలుసుకోవాలి. ఆస్తి కొనుగోలు-అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను, ఋణ సౌకర్యం నిబంధనలను అర్థం చేసుకోవాలి. అప్పు దొరుకుతుంది కదా అని ఎవరిస్తే వారి దగ్గర లోన్ తీసుకోకుండా, సరైన హోమ్ వర్క్ చేస్తే, వాయిదాలన్నీ చెల్లించే లోపు, ఎక్కడ తీసుకుంటే ఎక్కువ ఆదా చేయవచ్చో అధ్యయనం చేయాలి. వివిధ బాంకుల వారితో సంప్రదింపులు జరిపి, బేరమాడి, తక్కువ వడ్డీ ఇచ్చే చోటునే అప్పుచేయడం మంచిది. ఎంత ఋణం పొందుతామో, అంత మొత్తానికి మొదలే బాంకునుండి ఉత్తర్వులు తీసిపెట్టుకుంటే మరీ మంచిది. మొదటి సారి ఇల్లు కొనుక్కునే వాళ్లు తక్కువ డౌన్ పేమెంట్ అవకాశాలను అన్వేషించాలి. ఏ ప్రాంతంలో ఇల్లు కొంటే సౌకర్యంగా వుంటుందో, ఇరుగు-పొరుగు వాళ్లెవరో, మనదేశం వాళ్లు-మన ప్రాంతం నుంచి అమెరికాకు వచ్చిన వాళ్లు ఎంతమంది వున్నా రక్కడ చూసుకోవాలి.

ఇంతవరకు చెప్పుకున్నవన్నీ ఇల్లు కొనే ప్రతివారు తు. చ తప్పకుండా పాటిస్తూ, నిబంధనలకు సంబంధించిన ఏ విషయమైనా, అక్షరం ముక్క పొల్లు పోకుండా చదివి-అర్థం చేసుకుని, ఆ తర్వాత అడుగు వేస్తారు.

ఈ లోపుగా, భార్యా-భర్తలు ఉద్యోగం చేసే ఆఫీస్ నగరంలో ఎక్కడున్నా, ఆ విషయం పక్కన పెట్టి, పిల్లల చదువుకు అనువైన మంచి (ప్రభుత్వ) పాఠశాల-కళాశాల ఏ ప్రాంతంలో వుందో అన్వేషిస్తారు. ఒక కమ్యూనిటీ కాలనీ-ప్రాంతంలో నివసిస్తున్న వారి పిల్లలు, మరో ప్రాంతానికి చెందిన పాఠశాలలకు పంపేందుకు నిబంధనలు ఒప్పుకోవు. ప్రయివేట్ స్కూళ్లకు పంపొచ్చు గాని, అవి చాలా ఎక్కువ ఫీజులు వసూలుచేస్తారు. అదే విధంగా చంటి పిల్లలున్న వారు, డే కేర్ సెంటర్ల సౌకర్యం కూడా చూసుకుంటారు. భార్యా-భర్తల ఆఫీసు వేళలు-పాఠశాల, డే కేర్ సెంటర్ల వేళలు సమన్వయం చేసుకునేందుకు అనువైన ప్రాంతంలోనే ఇల్లు కొనుక్కుంటారు. ఒక్కో ప్రాంతానికి అక్కడ లభించే సౌకర్యాల ప్రాతిపదికగా ఒక్కోరకమైన ఆస్తి పన్నులు విధిస్తుంటారు. ఈ పన్నుల్లోనే, పిల్లల చదువుల ఖర్చు, వాళ్ల స్కూల బస్ రవాణా చార్జీల ఖర్చు లాంటివి చేర్చబడతాయి. సొంత ఇల్లు కొనుక్కునేవారు, వారుండబోయే ప్రాంతం తీర ప్రాంతమా, లోయా, థండర్ స్టార్మ్స్ లాంటి ప్రకృతి భీభత్సాలకు లోనయ్యే ప్రాంతమా అని కూడా విచారిస్తారు. అలాంటప్పుడు, అవసరమైనప్పుడు వాటి నుంచి వచ్చే ముప్పును అధిగమించేందుకు, సాంకేతికంగా సదుపాయాలను సమకూర్చే సమర్థవంతమైన-పేరొందిన గృహ నిర్మాణ సంస్థలను ఎంపిక చేసుకుంటారు. వీటన్నిటినీ దృష్టిలో వుంచుకొని, సంబంధిత రియల్ ఎస్టేట్ ఏజంటును ఎంపిక చేసుకుంటారు.

"ఇల్లు కట్టి చేసి చూడు-పెళ్లి చేసి చూడు" అన్న విషయం ఒక యూనివర్సల్ ట్రూత్. ఏ వ్యక్తికైనా, ఇల్లు కొనడమంటే, జీవితంలో తీసుకునే అతి కీలకమైన నిర్ణయమే కాకుండా, అతి ఖరీదైన కొనుగోలు కూడా అదేననాలి. ఇల్లు కొనుక్కుందామన్న నిర్ణయం తీసుకున్న మరుక్షణమే, మనకు తెలియకుండానే, దానికి సంబంధించిన రియల్టర్లు తారస పడుతారిక్కడ. కొనుగోలుదారు అవసరాలకు అనుగుణంగా, వారి పక్షాన బేరసారాలు చేస్తుంటారు వీరు. ఈ రియల్టర్ ఏజంటుకు లభించే కమీషన్ కొనుగోలుదారులనుంచి కాకుండా, అమ్మకం దారుల నుంచే లభిస్తుంది.

ఎంపిక చేసుకున్న రియల్ ఎస్టేట్ ఏజంటుతో ఇల్లు కొనుగోలు చేయదల్చుకున్న వారు, తమ అవసరాలను వివరించి, అనువైన స్థలం, కావాల్సిన ఇతర సదుపాయాలు, ఇరుగు-పొరుగు వ్యవహారాలు, ఇంటి ధర, ఇంటి డిజైన్ లాంటి విషయాలను విచారిస్తారు. ఇంటి నిర్మాణంలో తీసుకోబోయే జాగ్రత్తలు, గారంటీ కాలం, మధ్యలో ఏ రకమైన సేవలు లభించనున్నాయి కూడా అడుగుతారు. ఏజంటుతో, ఆదినుంచి-అంతం వరకు, ఇల్లు కొనుగోలుకు ఏమేమి చేయాలో, ప్రతి చిన్న వివరాన్నీ అడిగి తెలుసుకుంటారు. ఇరువురు, అన్ని విషయాలలో అంగీకారానికి వచ్చేంతవరకు, చర్చలు కొనసాగుతుంటాయి. టర్మ్స్-కండీషన్స్ కుదుర్చుకుంటారలా. కొనదల్చుకున్న ఇంటికి సంబంధించి, అంగీకారానికి వచ్చిన ప్రతి విషయానికి సంబంధించిన ప్రతి అంశం విషయంలో, ఒప్పందాలను పొందుపరుస్తూ, తయారై వున్న ఒప్పంద పత్రంపైన సంతకాలు చేయడం జరుగుతుంది. ఇల్లు కొనుక్కునే ముందర ఋణ సౌకర్యం పొందేందుకు, బాంకులకు రెండు నుంచి అయిదేళ్ల కాలం, తనకు సంబంధించిన ఆర్థికపరమైన లావాదేవీల వివరాలన్నింటినీ అందచేస్తారు. ఉద్యోగం చేస్తున్న సంస్థ యాజమాన్యం నుంచి అవసరమైన ధృవీకరణ పత్రాలను కూడా ఇస్తారు.

రియల్టర్ ఏజంట్ సూచన-సలహా ప్రాతిపదికగా ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెడుతున్న సమయంలోనే కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సివుంటుంది. సాధారణంగా అది అతి తక్కువ మొత్తంలోనే-మొత్తం విలువలో ఒక శాతం మాత్రమే వుంటుంది. ఇది చెక్కు రూపేణా ఇస్తారు. ఈ చెక్కును "ఎస్ క్రో" ఏజంట్ వద్దనే వుంటుంది. డిజైన్ ఖరారు చేసుకున్న తర్వాత ఇంకో నాలుగు శాతం చెల్లిస్తారు. ఆ తర్వాత ఇల్లు పూర్తయి, ఇంటి తాళం చేతులు ఇచ్చినప్పుడే, మిగిలిన మొత్తాన్ని సరాసరి బాంకులే అమ్మకం దారుడికి చెల్లించే ఏర్పాటుంటుంది. ఇల్లు నిర్మాణం మొదలైనప్పటినుంచి అప్పగించేంతవరకు, మధ్యలో అవసరమైన అన్నిరకాల క్వాలిటీ పరీక్షలు ఇరు పక్షాల నిపుణులు జరుపుతారు. ఒప్పందంలో రాసుకున్న సౌకర్యాలన్నీ అమర్చిన తర్వాతే ఫైనల్ సెటిల్ మెంట్ జరుగుతుంది. ఇరవై ఏళ్ల వారెంట్, భీమా సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, గాస్-నీటి సరఫరా ఏర్పాట్ల లాంటివి అన్నీ అయిన తర్వాతే సొంతదారులు ఇంట్లో ప్రవేశిస్తారు.

ఇక ఇక్కడ అమెరికాలోని ఇళ్లన్నీ దాదాపు ఒకే రకమైన డిజైన్లలో వుంటాయనిపిస్తోంది. కాకపోతే పెద్దవి-చిన్నవి వుంటాయి. తుపాను లాంటి ప్రకృతి భీభత్సాలకు గురి కావచ్చనుకున్న ప్రాంతాలలో కొన్ని రకాల రక్షణలు, మంచు బాగా కురిసే ప్రాంతాలలో ఇంకో రకమైన రక్షణలు, అధిక వర్షపాతమున్న ప్రదేశాల్లో దానికి తగ్గ రక్షణలు.. ... ఇలా అవసరాలను బట్టి రక్షణలు ఏర్పాటు చేస్తారు బిల్డర్లు. సిన్సినాటిలో మా కిన్నెర వాళ్లుండె ఇంటికి సెల్లార్ సౌకర్యం కలిగించారు. అక్కడ "థండర్ స్టార్మ్స్-టార్నొడోస్" బాగా వస్తుండేవి. అవి రావచ్చని పసిగట్టి, వాతావరణ సూచన ఇవ్వగానే, అక్కడున్న వారు దాని తీవ్రతను బట్టి "అండర్ గ్రౌండ్’ లోకి కొంచెం సేపు వెళ్లి తలదాల్చుకుంటారు. డిజైన్ ఏదైనా నిర్మాణం మొత్తం అధికభాగం చెక్కలతోనే చేస్తారు. బహుశా ఏ పదో వంతో ఇటుకలతో వుంటుందేమో. డూప్లెక్స్ తరహా ఇళ్లల్లో, సర్వ సాధారణంగా లివింగ్ రూమ్, కిచెన్, డైనింగ్ సదుపాయం, అతిథుదులొచ్చినప్పుడు అందరూ కలిసి భోజనం చేసేందుకు అదనంగా మరో ఓపెన్ రూమ్, అతిథులకు వాష్ రూమ్ లతో సహా, "మాస్టర్ బెడ్ రూమ్" కింద వుంటాయి. గెస్ట్ బెడ్ రూమ్, పిల్లల పడక గదులు, పిల్లలు ఆడుకునే గదులు, స్టడీ రూమ్స్, వాళ్ల దైనందిన కృత్యాలకు కావాల్సిన ఇతర సౌకర్యాలు పై అంతస్తులో ఏర్పాటు చేస్తారు. డూప్లెక్స్ కాకపోతే అన్నీ కిందనే వుంటాయి. చిన్న సైజ్ ఇళ్లల్లో తక్కువ బెడ్ రూమ్స్ వుంటే, పెద్ద వాటిల్లో ఎక్కువుంటాయి. ప్రతి ఇండిపెండెంట్ ఇంటికి ముందు-వెనుకా విశాలమైన లాన్, దానికి తగ్గ బహిరంగ స్థలం వుంటుంది. ఇంటిని హాండ్ ఓవర్ చేసేటప్పుడే, లాన్ పూర్తిగా తయారుచేసి, అప్పటికే కొంచెం ఎత్తెదిగిన కొన్ని స్టాండర్డ్ రకాల చెట్లను నాటి, అవి నీటికొరకు ఇబ్బంది పడకుండా అవసరమైన స్ప్రింక్లర్ సౌకర్యాలను అమర్చి మరీ ఇస్తారు. ఇల్లు నిర్మాణ దశలో చూస్తే అగ్గిపెట్టెలాగా, పేకమేడలుగా అనిపిస్తుంది. కొన్ని ఇళ్లకు ఎకరం పైనా ఆవరణ ఇంటి చుట్టూతా వుంటుంది.

ఇక ధరల విషయానికొస్తే, ప్రాంతాన్ని బట్టి, సౌకర్యాలను బట్టి, పన్నుల విధానాన్ని బట్టి, రాష్ట్రాన్ని బట్టి కనీసం రెండు లక్షల డాలర్ల నుంచి, రెండు మిలియన్ డాలర్ల వరకు సగటున వుంటాయి. అయితే మరీ ధనవంతుల ఇళ్ల విషయం వేరేగా వుండొచ్చు. నేను చూసిన-అంతో ఇంతో ఇతరులద్వారా తెలిసిన వాళ్ల ఇళ్ల సంగతి ఇది. హ్యూస్టన్ లో, ఒక ప్రాంతంలో మూడు-నాలుగు లక్షల డాలర్ల ఖరీదు చేసే ఇంటి తరహా ఇంటికి, మరో చోట దానికి రెట్టింపు ధర చెల్లించాల్సి వుంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లను "మిలియన్ డాలర్ల ఇళ్ల" ప్రాంతాలని పిలుస్తుంటారు. మా కిన్నెర వాళ్లుండే షుగర్ లాండ్ టెల్ ఫెయిర్‌, న్యూ టెరిటరీ ప్రాంతాల్లోనే అత్యధికంగా తెలుగు వారు-భారతీయులు కొనుక్కున్నారు. ఆ ఇళ్ల ధరలన్నీ సైజును బట్టి, మూడున్నర లక్షల డాలర్ల నుంచి, ఐదున్నర లక్షల డాలర్ల వరకున్నాయి. కాలనీలో ఒక మూలన నిర్మించే ఇళ్ల సైజు పెద్దగా, ధర ఖరీదైనవిగా వుంటాయి.

కిన్నెర వాళ్లుంటున్న హ్యూస్టన్ లోను, టెక్సాస్ రాష్ట్రంలోను ఇంటి ధరలు తక్కువంటారు. మా ఆదిత్య వుంటున్న కాలిఫోర్నియా రాష్ట్రంలోను, అందునా, శాన్ ఫ్రాన్ సిస్కో-శానోజ్-శాంతా క్లారా లోను ధరలు చాలా ఎక్కువ. అద్దె ఇళ్లకు కూడా ఎక్కువే ఖర్చవుతుంది. కాలిఫోర్నియాలో మిలియన్ డాలర్లు కనీస ధర వుంటుంది. చాలా మంది భారతీయులు ఉద్యోగం చేసినంత కాలం కాలిఫోర్నియాలో వుండి, సొంత ఇంటిని అమ్ముకొని, అందులో నాలుగోవంతు వెచ్చించి టెక్సాస్ లో ఇల్లు కొనుక్కొని, అక్కడ సెటిల్ అవుతుంటారట. మిగిలిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడపొచ్చు. అద్దె ఇళ్లకు ఇచ్చే రెంట్ కు అదనంగా మరో అయిదొందల డాలర్లు నెలసరి వాయిదాలకు చెల్లిస్తే, అద్దె ఇంటికన్నా పెద్ద సొంత ఇల్లు, దొరుకుతుందని, చాలా మంది ఇల్లు కొనుక్కుంటారు. ఏదేమైనా "కర్మ భూమి"నుంచి వచ్చి, "భోగ భూమి" లో సౌఖ్యాలనుభవిస్తున్న భారతీయులను అభినందించాలి. మా శ్రీమతి కజిన్, వల్లభి (స్వర్గీయ) అయితరాజు శేషగిరి రావుగారి కుమారుడు, వెంకట్ సురేష్ కాలిఫోర్నియా-శాన్ ఫ్రాన్ సిస్కోలో కొనుక్కున్న ఇల్లు, హ్యూస్టన్ లోని కిన్నెర ఇంటికన్నా చిన్నదైనా ఖరీదు మటుకు రెట్టింపు. సౌకర్యాలన్నీ ఒకే విధంగా వుంటాయి.

Thursday, January 21, 2010

జ్వాలా మ్యూజింగ్స్-15 (హ్యూస్టన్ కు వచ్చిన తొలి రోజులు)

(జ్వాలా మ్యూజింగ్స్ 13, 14 భాగాలు "అమెరికా ఎన్నికల్లోను అదే తంతు", "అమెరికా ఆరోగ్య సంస్కరణల చట్టం-భారతీయుడి అభిప్రాయం" అన్న శీర్షికలతో డిసెంబర్ 27, 2009 న ఈ బ్లాగ్ లో పెట్టాను)

హ్యూస్టన్ కు వచ్చిన తొలి రోజులు

వనం జ్వాలా నరసింహా రావు

నవంబర్ 9, 2009 న హ్యూస్టన్ లో వుంటున్న మా అమ్మాయి కిన్నెర దగ్గరకు రావడానికి-తిరిగి శాన్ ఫ్రాన్ సిస్కోకు వెళ్లడానికి, మా ఇంటర్ నేషనల్ ఎయిర్ టికెట్ లోనే ఏర్పాటుచేశాడు ఆదిత్య. శాన్ ఫ్రాన్ సిస్కోకు, హ్యూస్టన్ కు సరాసరి వెళ్లే విమానమైతే సుమారు నాలుగున్నర గంటల ప్రయాణం. మధ్యలో విమానం మారాల్సొస్తే మరో గంటన్నర గడపాలి. మొదటి సారి మా ప్రయాణం సరాసరి వెళ్లే విమానంలోనే. అక్కడకు-ఇక్కడకు టైమ్ కూడా తేడానే. హ్యూస్టన్లో రెండు గంటలు ముందుంటుంది. మేం ఈ తేడాలు పాటించకుండా మా ఏర్పాటు మేం చేసుకున్నాం. మా గడియారాల్లో ఇండియా టైమ్ ను మార్చకుండా, ఏ ప్రదేశంలో వున్నా, అక్కడి పగలును రాత్రిగా, రాత్రిని పగలుగా, అదే టైమ్ ను చూసుకుండే వాళ్ళం. ఉదాహరణకు, శాన్ ఫ్రాన్ సిస్కోలో వున్నప్పుడు (అక్టోబర్ వరకు) ఉదయం ఏడు గంటలవుతే, హైదరాబాద్ లో సాయంత్రం ఏడున్నర గంటలయ్యేది. మా దృష్టిలో శాన్ ఫ్రాన్ సిస్కోలో అప్పుడు ఉదయం ఏడున్నర గంటలయినట్లుగా భావించేవాళ్లం. అలానే హ్యూస్టన్లో అప్పుడు (మేం వచ్చేసరికల్లా) ఉదయం ఏడు గంటలవుతే, ఇండియాలో సాయంత్రం ఆరున్నర గంటలయ్యేది. మా వరకు మాకు, హ్యూస్టన్లో ఉదయం ఆరున్నర గంటల కింద లెక్కే. ఇండియాలో ఉదయాన్ని సాయంత్రం లాగా, సాయంత్రాన్ని ఉదయం టైమ్ లాగా చూసుకున్నాం కనుకనే జెట్ లాగుల లాంటివి మమ్మల్ని భాదించలేదు. గడియారంలో టైమ్ కూడా మార్చలేదు. తిన్నా-తాగినా-నిద్ర పోయినా-పొద్దున లేచినా, అవే టైమ్స్ పాటించాం.

హ్యూస్టన్ విమానాశ్రయంలో దిగి, సామానులు తీసుకొని, బయటకొస్తుంటే, కిన్నెర-కిషన్-యష్విన్-మేథలు కనిపించారు. సాయంత్రం ఐదవుతుందప్పుడు. కిన్నెర వాళ్లు అప్పట్లో షుగర్ లాండ్ లోని "బ్రాడ్ స్టోన్ అపార్ట్ మెంట్స్" లో వుంటున్నారు. సిన్సినాటి నుంచి వెళ్లి, న్యూయార్క్ రాజధాని ఆల్బనీలో కొన్నాళ్లుండి, సుమారు ఏడాది క్రితం హ్యూస్టన్ కు మారి, షుగర్ లాండ్ లో వుంటున్నారు. మా అల్లుడు కిషన్ బ్రిటీష్ పెట్రోలియం సంస్థలో పర్యావరణానికి సంబంధించిన నిపుణుడిగా పనిచేస్తున్నాడు. కిన్నెర సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుండేది ఆల్బనీలో. పిల్లలిద్దరు ఇంకా చిన్నవాళ్లే కాబట్టి మధ్యలో కొన్నాళ్లు ఉద్యోగం మానేసింది. ప్రస్తుతం హ్యూస్టన్లో ఇంకా ఏ ఉద్యోగంలోను చేరలేదు. కిన్నెర వాళ్లుంటున్న షుగర్ లాండ్ ప్రాంతంలో, పక్క-పక్కనే వున్న, "న్యూ టెరిటరీ", "టెల్ ఫెయిర్‌" ప్రాంతాలలో నివసిస్తున్న వారిలో చాలా మంది భారతీయులే. అందులోను ఎక్కువమంది తెలుగు వారే. కిన్నెర ఆడపడుచు మానస కుటుంబం పదేళ్లకు పైగా ఇక్కడే వుంటున్నారు. మానస-భర్త శ్రీనివాస రావు, ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ల సొంత ఇల్లు "న్యూ టెరిటరీ" లో వుంది. విమానాశ్రయం నుంచి కిన్నెర వాళ్లుండే అపార్ట్ మెంట్స్ కు వచ్చే దారిలో, బాబా గుడుకి పోయి, పక్కనే వున్న ఇండియా స్టోర్స్ లో ఏదో కొన్నాం. టెల్ ఫెయిర్‌ లో వాళ్లు కొనుక్కున్న కొత్త ఇల్లు కూడా చూపించారు దారిలో.

షుగర్ లాండ్ సిటీ ఒక విధంగా హ్యూస్టన్లో భాగమే. ఎనభై వేలకు పైగా జనాభా వున్న ఈ నగరం టెక్సాస్ రాష్ట్రంలో-ఫోర్ట్ బెండ్ కౌంటీలో వుంది. హ్యూస్టన్-షుగర్ లాండ్-బే టౌన్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇదొక ముఖ్యమైన ప్రాంతం. టెక్సాస్ రాష్ట్రంలో అతి తొందరగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఇదొకటని అంటుంటారు. 1800 సంవత్సరం వరకూ ఈ ప్రాంతమంతా చెరకు సాగుచేసేవారట. 1959 లో కార్పొరేషన్ హోదా లభించిన షుగర్ లాండ్ ను, ఫోర్ట్ బెండ్ కౌంటీలో అతిపెద్ద సిటీగా-కీలకమైన ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా పేర్కొంటారు. టెక్సాస్ రాష్ట్రంలోని ప్రధాన చక్కెర ఉత్పత్తి-మార్కెటింగ్ సంస్థగా గుర్తింపు పొందిన "ఇంపీరియల్ షుగర్" కేంద్ర కార్యాలయం షుగర్ లాండ్ లోనే వుంది. ఫోర్ట్ బెండ్ కౌంటీ లో, మాస్టర్ ప్రణాళిక ఆధారంగా నిర్మాణాలు జరిగిన ప్రదేశాల్లో షుగర్ లాండ్ ను మించింది లేదు. ఫస్ట్ కౌంటీ, షుగర్ క్రీక్, రివర్ స్టోన్, న్యూ టెరిటరీ, టెల్ ఫెయిర్‌, గ్రేట్ వుడ్ లాంటి ఎన్నో మాస్టర్ ప్రణాళికల కమ్యూనిటీ కాలనీలతో అలరారే అందమైన అమెరికన్ "ఛండీగఢ్" నగరం షుగర్ లాండ్. నగర మునిసిపల్ కార్యాలయం "సిటీ కౌన్సిల్" హాలుండే ప్రదేశం చక్కటి విహార స్థలంలాగా వుంటుంది. చుట్టుపక్కల ఎన్నో భారతీయ-ఆంధ్రుల రెస్టారెంట్లుంటాయి. అసలా మాటకొస్తే, హ్యూస్టన్ పరిసరాల్లో ఎక్కడ తిరుగుతున్నా, భారతదేశంలోని ఏ హైదరాబాద్ లోనో తిరుగుతున్నట్లు వుంటుంది. వాతావరణం కూడా దాదాపు అలానే వుంటుంది. అలానే గుళ్లు-గోపురాలు, పెళ్లిళ్లు-పేరంటాలు, సాయంకాల సమావేశాలు, వీకెండ్ పార్టీలు, విందులు-వినోదాలు, అన్నీ అచ్చు హైదరాబాద్ లో మాదిరి అనుభూతే కలిగింది. మా అమ్మాయి కిన్నెర ఆల్బనీలోని ఇల్లు అమ్మి, ఇక్కడ నూతనంగా అభివృద్ధి చెందుతున్న "టెల్ ఫెయిర్‌" కమ్యూనిటీ కాలనీలో ఇల్లు కొనుక్కున్నారు. మేం వచ్చేసరికి అదింకా పూర్తిగా తయారవలేదు. మేం ఇక్కడ వుండగానే అందులోకి మారారు.

కిన్నెర వాళ్లుండే అపార్ట్ మెంట్స్ ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటిది. లోనికి రావాలంటే, గేట్ తెరుచుకోవాలి. దానికో పాస్ వర్డ్ వుంటుంది. అయితే అదొక బహిరంగ చిదంబర రహస్యం. ఏ మాత్రం తెలివితేటలున్నా లోపలికి రాజాలా రావచ్చు. పోవడానికి ఇబ్బంది అసలే వుండదు. శాంతా క్లారాలో ఆదిత్య వుంటున్న అపార్ట్ మెంట్స్ లో కూడా అంతే. కిన్నెర చిన్నతనంలో హైదరాబాద్ లో ఎలా స్నేహితుల బృందాన్ని పెంచుకుందో, సరిగ్గా అదే తరహాలో ఇక్కడకూడా చేస్తున్నది. పక్క-పక్క ఫ్లాట్లలో వుంటున్న పేరి శర్మ-భార్య జానకి-పిల్లలు స్నేహ, అమూల్య; ఉత్తర భారతీయులు అంబుజ్-భార్య రూ పాళి-పిల్లలు అనికా, అర్ష్; దగ్గర లో వుంటున్న శివ-పల్లవి-పిల్లలు ప్రణవ్, అనూహ్య; కొంచెం దూరంలో వుంటున్న రామకృష్ణ-భార్య సునంద-పిల్లలు భావన, సంజనా; దగ్గర లోని న్యూ టెరిటరీ లో వుంటున్న కిషన్ చెల్లెలు మానస-భర్త శ్రీనివాస్-పిల్లలు హర్ష్, భవ్య లతో సహా దాని ఇతర స్నేహితులు సుమన, అపర్ణ, గీత, సోనాలీ.. ... ... ఇలా ఎందరితోనో పరిచయాలు చేసుకొని, అంతటితో ఆగకుండా స్నేహంగా మెలుగుతుంటుంది. ఒకరి కష్ట సుఖాలు మరొకరు తెలుసుకుంటూ, అహర్నిశలు అండ-దండగా వుంటుంటారు. నిజంగా ఇక్కడ వీళ్లని చూసి, కలివిడిగా వుండే విధానం నేర్చుకోవాలనిపిస్తుంది. మేం వచ్చిన మర్నాడే పల్లవి వాళ్లు తమ కొత్త ఇంటిలో గృహప్రవేశమయ్యారు. తెల్లవారు ఝామున జరిగిందా ప్రోగ్రాం. గృహ ప్రవేశానికి తప్పకుండా కావాల్సిన "పాలు" మర్చిపోయింది ఆమె. కిన్నెరకు తెల్లవారుతుండగా, అది అప్పుడే బయలుదేరి అక్కడకు పొయ్యే సమయంలో పల్లవి దానికి ఫోన్ చేసింది. (హైదరాబాద్ లో శ్రీనివాస రావు భార్య దుర్గ-నిర్మలా దేవికి ఆపత్ సమయంలో వచ్చినట్లే దీనికి ఇక్కడ ఇలాంటి ఫోన్లు వస్తుంటాయి). ఏ మాత్రం విసుక్కోకుండా ఇది పాలు పట్టుకొని పోయింది. పల్లవి వాళ్లూ అలానే వుంటారు. ఆ మాటకొస్తే వీళ్ల బృందంలోని అందరూ అలానే.

కిన్నెర-కిషన్ నన్ను, మా శ్రీమతిని వాళ్లందరికీ పరిచయం చేశారు. మా తోనూ వీళ్లందరు అలానే స్నేహంగా మెలిగారు. మేం వచ్చిన నాడే పరిచయమైన శర్మ గారు, అంబుజ్ కలిసి, ఆ మర్నాడే వాళ్లింట్లో (ఇద్దరు పైనా-కిందా ఫ్లాట్లలో వుండేవారు. తర్వాత అంబుజ్ కిన్నెర కొత్త ఇంటికి సమీపంలోనే కొనుక్కున్న సొంత ఇంటికి మారాడు) మంచి పార్టీ ఏర్పాటు చేశారు. వాళ్లకంత త్వరగా నా అలవాటు ఎలా తెలిసిందో మరి. నాకంటే వయసులో చిన్నవారైనప్పటికీ, కలిసి-మెలిసి సమానంగా ఎంజాయ్ చేశారందరు. జానకి గారు-రూ పాళి విందు భోజనం పెట్టారు. ఇక ఇలాంటివి హ్యూస్టన్లో వున్నన్నాళ్లు "నిత్య దిన చర్య" కాకపోయినా "వారాంతపు ఆట విడుపులు" అయ్యాయి.

అమెరికాలో వున్న వారందరికీ-కనీసం మా లాగా అప్పుడప్పుడూ వెళ్తున్నవారందరికి, ఎదురయ్యే వాటిల్లో పెరుగు-తోడు గురించిన అనుభవం ఒకటి. కాక పోతే, మా భండారు శ్రీనివాసరావు తన మాస్కో అనుభవాల్లో రాసినట్లు, సోవియట్ యూనియన్-మాస్కో అంత ఘోరం కాదే మో అమెరికాలో. ఇక్కడ "యోగర్ట్" లని పాకేజ్ పెరుగు వివిధ పరిణామాలలో, వివిధ రుచుల్లో దొరికినా, దాని రుచి మన తోడేసిన పెరుగుకు (కనీసం మనలాంటి వారికైనా) సమానం కాదు. పైగా ఆ యోగర్టులలో ఎక్కువ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. మేం ఇక్కడ శాన్ ఫ్రాన్ సిస్కోలో అడుగు పెట్టగానే మా కోడలిని ఎంక్వైరీ చేసిన మొదటి విషయం పెరుగు-తోడు గురించే. అయితే మేం ఇండియా నుంచి తేకపోవడానికి కారణం ఇక్కడ (మాస్కో లా కాకుండా) తప్పక దొరుకుతుందన్న నమ్మకం. అయితే మా కోడలుకు అమెరికా జీవితం కొత్త-ఇంకా అలవాటు కాలేదు కాబట్టి వాళ్లింకా "యోగర్ట్" లే కొంటున్నారు. వాస్తవానికి ఆ పెరుగు రుచిగా, తియ్యగా, హైజినిక్ గా కూడా వుంటుంది. అయినా మన రుచి ప్రిఫరబుల్ కదా. రెండు-మూడు రోజుల తర్వాత మూడొందల మైళ్ల దూరంలో వున్న లాస్ ఏంజల్స్ కు వెళ్లాం దగ్గర లోని డిస్నీ లాండ్ చూడడానికి. ఆ వూళ్లో వుంటున్న మా శ్రీమతి అక్క కోడలు శిల్ప వాడే పెరుగు "తోడు పెరుగు". అంతే - ఎగిరి గంతేసి ఆ తోడు తెచ్చుకున్నాం. ఇప్పటికీ మా కోడలు అదే తోడు తో పెరుగు తయారు చేసుకుంటుంది. హ్యూస్టన్ కు వచ్చిన తర్వాత ఆ ఇబ్బందే లేదు. ఇదంతా పాడి-పశువులతో వర్ధిల్లే మన చిన్నతనం నాటి ఒక తెలుగు గ్రామం లాగా వుంటుంది. వీళ్లున్న ప్రాంతం పేరే: "షుగర్ లాండ్"- ఒకప్పుడు చెరకు తోటలు విస్తారంగా వుండేవట. ఇప్పటికీ అమెరికాలోని అతి పెద్ద చెరకు ఉత్పత్తి-వాణిజ్య కేంద్రం ఇక్కడే వుంది. ఇక్కడ దొరకని భారతీయ వస్తువు-తెలుగు సామాను ఏదీ లేదు. అందుకే అంటారేమో" "ఏ దేశమేగినా ఎందు కాలిడినా..... పొగడరా నీ పెరుగు తియ్యదనాన్ని" అని.