Saturday, March 28, 2026

War, Peace, and Future of (United) Nations >>>>> Moral Courage in Troubled World Essential : Vanam Jwala Narasimha Rao

 War, Peace, and Future of (United) Nations

Moral Courage in Troubled World Essential

Vanam Jwala Narasimha Rao

The Hans India (March 29, 2026)

{The 193-member UN’s record in preventing wars and sustaining peace remains deeply contested with limited successes. It is more a forum for debate than decisive action. A significant gap persists between the UN's founding ideals and present realities. The structure of the Security Council, particularly the veto power enjoyed by the five permanent members, frequently renders the organization ineffective in moments of crisis. It often becomes a passive platform for deliberation rather than decisive intervention} - Editor’s Synoptic Note

Despite varying geographical conflicts, patterns of rivalry, strategic interest, and human suffering remain similar. Reflections drawn from earlier global crises represent decades of inquisitiveness concerning war, peace, and international responsibility. Consequences of tensions between nations, often with little regard for civilian safety, transcend borders. An old Turkish saying that, ‘The horse kicked the mule, the mule kicked the horse, and it is the poor donkey that gets the shot’ is apt in modern geopolitical conflicts. The vulnerable, especially in the developing world, caught between the strongest powers, face untold misery.

The United Nations Organization (UNO) was born out of the ashes of the Second World War, when humanity resolved that another catastrophe must never occur. Sequence of historic developments, culminating in the San Francisco Conference on June 26, 1945, adopted the UN Charter. The UNO formally came into existence on October 24, 1945. The intention was to create a permanent global forum where disputes could be resolved through dialogue and diplomacy rather than war, embodying the collective conscience of humanity.

Tehran that figured in early diplomatic efforts during formation of UNO now finds itself at the Center of grave tensions. It faces disruption and uncertainty amid ongoing hostilities, with civilians struggling to maintain normalcy. The situation once again illustrates how regions, central to diplomacy in one era, can become theatres of conflict in another.

Meanwhile, the statesmanlike approach of Prime Minister Narendra Modi deserves applaud. Briefing the Lok Sabha on March 23, 2026, he described the West Asia war as ‘deeply concerning,’ cautioning that its consequences are likely to be felt for longtime.

In a world increasingly marked by fragmented responses and reactive policies, such clarity, restraint, and emphasis on national unity stand out as a model of responsible leadership. Equally noteworthy were the Centre's measures on nation’s energy needs, demonstrating foresight and preparedness amid global uncertainty.

Significantly, he urged Members of Parliament to rise above differences and ensure that India speaks in a ‘united and unanimous voice’ on the issue. This call reflects Modi’s political maturity and profound understanding of India’s moral responsibility in global affairs. These elements represent a policy response, as one of the finest examples of balanced and statesmanlike leadership in recent times.

Interestingly, the same day, a contrasting development unfolded in the United States. Donald Trump, known for his uncharacteristic ‘point of no return’ decision-making style, who had earlier issued a 48-hour ultimatum to Iran to reopen the Strait of Hormuz or face strikes on its power infrastructure, in an unexpected U-Turn, postponed his own decision by five days, citing what he described as ‘very good and productive talks with Iran.’  

Equally motivating was Narendra Modi’s X Post the following day that, for ensuring that the strait of Hormuz remains open, secure, and accessible, which is essential for the whole world, he and Trump agreed to stay in touch. Next day, Iran dismissed US proposal to end the war, and set out its own terms for peace. Israel continued strikes on Lebanon. USA Military was preparing to deploy additional troops. Meanwhile, Iran while thanking India for its ‘Significant Help’ in the context of its sunken vessel in US attack, allowed its ships through Hormoz Straits, along with three other countries.

193-member UN’s record in preventing wars and sustaining peace remains deeply contested with limited successes. It is more a forum for debate than decisive action. A significant gap persists between UN’s founding ideals and present realities. Member Nations continue to pursue strategic interests overriding collective decisions. The structure of the Security Council, particularly the veto power of permanent members, frequently renders the organization ineffective in moments of crisis. It often becomes a passive platform for deliberation rather than decisive intervention.

History offers numerous examples of how regional leadership and global power politics intersect. In the Middle East, figures such as Gamal Abdel Nasser, Anwar Sadat, and Muammar Gaddafi shaped their nations’ trajectories while navigating complex global dynamics. Similarly, leadership in the United States has long influenced international relations through diplomacy, alliances, sanctions, and, at times, military action. These leaders emerged during periods of transformation. Their decisions reflected both national priorities and the pressures of an evolving global order. The interplay between power, ideology, and strategic interest continues to shape international outcomes.

A deeper philosophical question persists: why does humanity repeatedly return to war despite centuries of painful lessons? Part of the answer lies in the nature of power itself. Nations pursue security, influence, and prestige. In this context, ethical reflection becomes essential. Bertrand Russell devoted much of his intellectual life to the cause of peace, warning that technological progress, particularly nuclear weapons, fundamentally altered the nature of war.

At this juncture, it is both relevant and enriching to recall that long before modern political theory evolved, the Adi Kavya Valmiki Ramayana articulated profound insights into the conduct of power and responsibility. The epic never glorified war as an end in itself, but presented it as a last resort, guided by dharma. Strategy, in this classical narrative, was in service of balance, not domination. The vision of a cosmic order, where actions are inseparable from universal consequences, urges leaders to think beyond narrow identities and immediate gains. In a contemporary context, this translates into a deeper sense of civic and global responsibility during times of conflict, where decisions taken by a few reverberate across millions.

Movements for peace often arise from courageous intellectuals, scientists, writers, and civil society leaders. Among them, recipients of the Nobel Peace Prize hold a unique moral position. Their voices serve as reminders that the ultimate purpose of power and diplomacy must be the preservation of human dignity. When they advocate restraint and dialogue, they help restore perspective in moments of crisis. Education, public discourse, and responsible leadership all play vital roles in this transformation. If the international community truly seeks lasting peace, institutions designed to safeguard it must evolve.  

When peace is seen as strength rather than weakness, leaders are more likely to pursue diplomatic solutions. In an interconnected world, conflicts produce ripple effects far beyond their immediate regions. Human history demonstrates both the tragedy of war and the possibility of peace. Institutions created after the Second World War were built on the hope that humanity had learned from its past. Whether that hope endures, depends on the choices made today by nations and their leaders. A renewed commitment to dialogue, restraint, and mutual respect remains essential.

In reflecting on future, the enduring relevance of Valmiki Ramayana offers a subtle yet powerful reminder that the true strength of any civilization lies not merely in its capacity for power, but in its ability to exercise restraint with wisdom, the Modi way. As the world grows more complex, these lessons encourage the cultivation of inner weaponry, wisdom, compassion, restraint, and resolve.

Such qualities are indispensable in shaping a balanced and humane global order. Ramayana thus, ceases to remain a story of the past, and instead emerges as a living guide for the present and the future.

Despite its limitations, the United Nations continues to represent one of humanity’s most ambitious efforts to maintain global peace. Its humanitarian work, peacekeeping missions, and diplomatic platforms continue to serve millions. The real challenge lies not in its existence, but in the willingness of member states to strengthen and reform it for the collective good.

In the evolving international landscape, the role and outlook of leadership in major powers naturally attract global attention. The policy approach of Donald Trump, once again entrusted with high office, is observed with interest. Understanding the broader framework guiding such leadership, its goals, methods, and long-term vision, remains essential for strengthening global stability and the collective pursuit of peace.

భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం, సందర్భోచితంగా వాల్మీకి ప్రస్తావన >>>>> భవిష్యత్తులో ఆంధ్రవాల్మీకి వర్ణన వినిపించాల్సిన ఆవశ్యకత : వనం జ్వాలా నరసింహారావు

 

భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం, 

సందర్భోచితంగా వాల్మీకి ప్రస్తావన

భవిష్యత్తులో ఆంధ్రవాల్మీకి వర్ణన 

వినిపించాల్సిన ఆవశ్యకత

వనం జ్వాలా నరసింహారావు

‘విదియనాడు కనిపించని చంద్రుడు, తదియనాడు తానే కనిపిస్తాడు’ అనేది తెలుగు సామెత. అమావాస్య తర్వాత వచ్చే విదియ నాడు చంద్రుడు సన్నగా ఉండడంవల్ల, ఆ రోజు కనిపించకపోయినా, తరువాతి తదియ రోజున తప్పక దర్శనమిస్తాడని తెలిసిన విషయమే. అమావాస్య రోజున చంద్రుడు పూర్తిగా కనిపించడు. పాడ్యమి నాడు కూడా తక్కువగా ఉంటాడు. విదియ నాడు కూడా అలాగే కావచ్చు. మబ్బుల వల్ల ఆకాశంలో కనిపించకపోవచ్చు కూడా. అకారణంగా కొంతకాలం పాటు ఏదైనా విషయం పక్కదారి పట్టినా, మరుగునపడ్డా, కాలక్రమేణా అది ఖచ్చితంగా వెలుగులోకి వస్తుందని సామెత తెలియజేస్తుంది. అలాగే అనుకున్నది సాధించలేకపోవడం సహితం తాత్కాలికమని, మంచి రోజులు వస్తాయని దీని అర్థం. సామెతను సందర్భానుసారంగా ఉపయోగించుకోవడం అనేది, ఆయా అంశాల మీద ఆధారపడి వుంటుంది.

మార్చ్ 27, 2026 శుక్రవారం శ్రీరామనవమినాడు, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర దేవస్థాన అధికారులు, విశిష్ట వశిష్ట అర్చక మహాశయులు, గత 14 సంవత్సరాలుగా (శ్రీరాముడి వనవాసం కూడా 14 సంవత్సరాలే!) నిర్వహించిన మాదిరిగానే, కన్నులపండుగగా, అంగరంగ వైభోగంగా, సీతారాముల కళ్యాణ సందర్భంగా, సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపుడిని, శ్రీమహాలక్ష్మీదేవిని, ఆబాలగోపాలం దర్శించుకునే (ప్రవర, గోత్రాల మాద్యమం ద్వారా!) మహద్భాగ్యం కలిగించింది. అయితే విదియనాడు కనిపించని చంద్రుడు, తదియనాడు తానే కనిపిస్తాడన్న సామెత ప్రకారం, మరుసటిరోజు, శనివారం నాడు, అద్భుతమైన రీతిలో, సందర్భోచితంగా వాల్మీకి రామాయణంలోని పట్టాభిషేకం ఘట్టాన్ని ఒకింత ఉటంకిస్తూ, రామచంద్రమూర్తిని, సీతాదేవిని, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమాన్, సుగ్రీవ, విభీషణ తదితరుల ప్రస్తావన తెచ్చారు అర్చక మహాశయులు. అభినందనలు. నమస్సులు. కాళిదాసు రఘువంశం కావ్యాన్ని కూడా పేర్కొన్నారు. ఒక అడుగు ముందుకు, వెనక్కు వేసి, ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు ప్రస్తావన తెస్తే, బాగుండేది.   

వాల్మీకి మహర్షి రామాయణాన్ని అనుగ్రహించారు. 24 గాయత్రీ మంత్రాక్షరాలను భద్రంగా నిక్షిప్తం చేసారు. మహా మహానుభావులూ, మహావిద్వాంసులూ, శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు గారు) వాల్మీకి రామాయణాన్ని యధాతధంగా మంత్రమయం చేస్తూ, ఛంధః యతులను ఆయా స్థానాలలో నిల్పి, వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి రామాయణానికి తుల్యమైన స్థాయినీ, పారమ్యాన్నీ, ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించి, ‘మందరం’ అని దానికి ప్రాచుర్యాన్ని కలిగించారు.

ఆంధ్ర పాఠకలోకం అపారంగా మందరాన్ని అభిమానించింది. ఆదరించింది. శ్రీరామానుగ్రహ ప్రాప్తమయింది. కాలం గడచి పోతున్నది. వాసుదాసు గారు మారిపోతున్న తరాలకు గుర్తురావటం కూడా కష్టమై పోతున్నది. వ్యాస మహాభారతాన్ని తెనిగించిన నన్నయ ఆదికవైతే, వాల్మీకి రామాయణాన్ని యధా వాల్మీకంగా పూర్వకాండలతో సహా ఉత్తరకాండను కూడా మొట్ట మొదట తెనిగించిన శ్రీ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు గారు) కూడా ఆదికవే కదా! నన్నయంతటి గొప్పవాడే కదా!

ఇక విషయానికి వస్తే: ‘అష్టాక్షరి’ మంత్రంలో ‘ప్రణవం, నమస్సు, నారాయణపదం’ వున్నాయి. ‘ప్రణవం’ అంటే జీవాత్మ పరమాత్మకే వుపయోగ పడాలనీ, ఆయన సేవకే వినియోగపడాలనీ అర్ధం. ‘నమస్సు’ అంటే స్వాతంత్ర్య రాహిత్యాన్నీ, పారతంత్రాన్నీ తెలుపుతుంది. ‘నారాయణపదం’ భగవత్ప్రియమైన భాగవత సేవను తెల్పుతుంది. ‘ప్రణవం లక్ష్మణుడు. యావజ్జీవితం అన్నకు శుశ్రూష చేసాడు. లక్ష్మణుడిని వాల్మీకి మహర్షి ‘లక్ష్మీవర్ధనుడు’ అని సంబోధిస్తాడు. లక్ష్మి అంటే ఇక్కడ సేవచేసే భాగ్యం అని పెద్దలు తేల్చేశారు. అతడు భగవదతారమైన శ్రీరాముడి సేవానిరతుడనీ, భగవత్ కైంకర్యాన్ని అవిఛ్చన్నంగా సాగించే కైంకర్య లక్ష్మీవర్ధనుడు.

‘నమస్సు’ భరతుడు. పరతంత్రుడై రాముడులేని అయోధ్యలో, వానప్రస్థుడి లాగా ఉన్నాడు. భగవంతుడికి చేసిన శరణాగతికి ముఖ్య ఫలం, భగవత్ సన్నిధానంలో చేరి, భగవంతుడికి సేవ చేయడమే. ఇతర ఫలాలన్నీ అనుషంగకాలని రామాయణం చెప్తుంది. ఇట్టి శరణాగతికి పురుషకారం అవశ్యం. పురుషకారానికి కావాల్సిన ముఖ్యగుణం శరణాగతుడిపట్ల దయ. ఈ గ్రంథంలో పురుషకారం ప్రధానమైంది. శరణాగతుని అనుష్టించు అధికారికి శేషత్వం పారతంత్ర్యం స్వరూపం. భరతుడి చర్యవలన పారతంత్ర్యం స్పష్టంగా కనిపిస్తుంది.

‘నారాయణపదం’ శత్రుఘ్నుడు. రామ పరతంత్రుడై, భాగవతుడైన భరతుడికి ప్రీతిగా ప్రవర్తించాడు. శత్రుఘ్నుడి చర్యలు భాగవత పారతంత్ర్యాన్ని తెలియచేస్తుంది. శరణాగతుడికి అర్థపంచకజ్ఞానం ఆవశ్యకం. అతడు అకించనుడు, అనన్య గతుడై వుండాలి. అతడు సదా జపం చేయాల్సింది రామాయణమే. అందుకే, ఇందుకే, శ్రీరామాయణం మహా మహా కావ్యం. ఈ విషయాలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాద్రాచలం శ్రీరామ పట్టాభిషేకం జరిగిన సందర్భంగా, వాల్మీకి సంస్కృత రామాయణం ఆధారంగా అద్భుతంగా వివరణ ఇచ్చినట్లు నా పరిమిత జ్ఞానానికి అవగతమైనది. అప్పుడనిపించింది, అదనంగా కొంచెం మాలాంటి వారికోసం ఆంధ్ర వాల్మీకి వాసుదాసుగారిని ప్రస్తావించి, ఆయన రాసిన పట్టాభిషేక ఘట్టం ఉదహరిస్తే బాగుండేదేమోనని.

వాసుదాసుగారి ‘శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవ ఘట్టము పూర్వ రంగంలో, అయోధ్య చేరిన శ్రీరాముడు ఇక్ష్వాకువంశరాజుల నివాసమైన దశరథుడి ఇంట్లోకి ప్రవేశించాడు. ముగ్గురు తల్లులకు సాష్టాంగనమస్కారం చేసి, సుగ్రీవుడికి తన ఇంట్లోనే విడిది ఏర్పాటు చేయమని  భరతుడికి చెప్పాడు. హనుమంతుడు, వేగదర్శి, జాంబవంతుడు, ఋషభుడిని పిలిచి, నాలుగు బిందెలు ఇచ్చి, నాలుగు సముద్రాల నుండి నీళ్ళు తీసుకుని ఉదయంలోపు రావాలని ఆదేశించాడు సుగ్రీవుడు. వారు తక్షణమే, దివ్య నదీ తీర్థాలతో నిండిన బిందెలు తెచ్చారు. మరికొందరు ఐదొందల నదుల తీర్థాలు తెచ్చారు. తూర్పు, దక్షిణ, పడమటి, ఉత్తర సముద్రాల నుండి సుషేణుడు, మరో ఋషభుడు, గవయుడు, నలుడు బంగారు బిందెలలో సముద్ర జలాలను తెచ్చారు.

{{ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని ‘యుద్ధకాండ మందరం లో ప్రస్తావించారు వాసుదాసుగారు. ఆ మహానుభావుడు 108 మార్లు శ్రీమద్రామాయణము పారాయణం చేసి, ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వాములవారికి సామ్రాజ్య పట్టాభిషేకం చేసినప్పుడు ఆయన మిత్రులను పోయి, పట్టాభిషేకానికి ఉత్తర సముద్ర జలం తప్ప తక్కిన 500 తీర్థాలను తెచ్చి స్వామికి సమర్పించారు. అష్టోత్తర సహస్ర కలశాలతో వేలాది మంది ప్రజల సమక్షంలో శ్రీ సీతారాముల అభిషేకం చేశారు. హిరణ్మయ పాదుకలు స్వామికి వాసుదాసుగారు సమర్పించారు. స్వామి కైంకర్య సాధనభూత నారికేళ (టెంకాయ శతకం) బిక్షాపాత్రాన్ని సమర్పించారు}}.

శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవ ఘట్టం వివరణ మరో అద్భుతం. శాంతచిత్తుడు, బ్రాహ్మణ శ్రేష్టులతో కూడిన వసిష్టుడు, రామచంద్రమూర్తిని, సీతాదేవిని రత్నపీఠం మీద కూర్చోబెట్టాడు. వసిష్టుడు, కాత్యాయనుడు, జాబాలి, కాశ్యపుడు, విజయుడు, గౌతముడు, వామదేవుడు, సుయజ్ఞుడు మొదలైన ఎనిమిదిమంది బ్రాహ్మణ శ్రేష్ఠులు పరిమళాలు ఘుమ్మని వీస్తున్న  జలాలతో వారిని అభిషేకించారు. ఋత్విజులు, బ్రాహ్మణులు, కన్యకలు, మంత్రులు, యోధులు, వైశ్యులు దివ్యమైన గొప్ప మూలికల రసంతో ఆకాశాన గుంపులుగా చేరి చూస్తున్న దేవతల, నలుగురు దిక్పాలకుల సమక్షంలో అభిషేక కార్యక్రమం అంతా జరిపించారు.’ వాసుదాసుగారి వ్యాఖ్యానుసారం, ఈ పట్టాభిషేకం 24వ మహాయుగంలో, త్రేతాయుగంలో జరిగిందని హరివంశంలో వున్నట్లు రాశారు.


·      ఇక్కడ వాసుదాసుగారు రాసిన సీస పద్యం:

ఆవల వశిష్ట కాత్యాయన జాబాలి, కాశ్యప విజయులు గౌతముండు

వామదేవ సుయజ్ఞ వర్యులు వసువులు, శక్రుని నభిషిక్తు జలుపుభంగి

గమ్మని వలవుల ఘమ్మను నిర్మల, జలముల నభిషిక్తు జలిపి రెలమి

నవల ఋత్విక్ క్ష్మాసురాళి కన్యామంత్రి, యోధులతో నర్య యూద యుక్తి


దివ్యమౌ మహౌష ధీరసంబుల చేత, దివిని మూగియున్న దేవతతుల

తో దిశాధిపతి చతుష్కంబుతో నభి, షేక కార్యమెల్ల జేయ బిదప

****

ఇంకా ఇలా రాశారు: ‘బ్రహ్మ నిర్మితమై, అనేక రత్నాలతో, తేజస్సుతో ప్రకాశిస్తూ, మనువు పూర్వం అభిషిక్తుడైన సమయంలో ధరించినదై, అది మొదలు వంశపారంపర్యంగా పట్టాభిషేక సమయంలో ధరించేదైన, వెలలేని మణులతో ప్రకాశిస్తున్న కిరీటాన్ని రత్న పీఠంమీద కూచున్న రామవిభుడి అంగీకారంతో వేదాధ్యయనపరులైన ఋత్విజులతో కలిసి వసిష్టుడు అలంకరించాడు. శత్రుఘ్నుడు శ్వేతఛ్చత్రం పట్టాడు. తెల్లటి చామరాన్ని సుగ్రీవుడు, మరొక చామరాన్ని విభీషణుడు వీచారు. వాయుదేవుడు బంగారు సరాన్ని, సమస్త రత్నాలతో కూడిన మంచి ముత్యాల మనోహరమైన సరాన్ని అర్పించాడు. గంధర్వులు దివిలో ఆడారు, పాడారు.’

·      ఇక్కడ వాసుదాసుగారు రాసిన రెండు సీస పద్యాలు:


బ్రహ్మ నిర్మితమయి బహురత్న శోబిత, మై దీప్త తేజుడై యలరు మనువు

మున్నభిషిక్తుడై  చెన్ను మీరిన వేళ, దాల్చినయది యయి తరతరంబు

త ద్వంశ్యులెల్లరు దప్పక యభిషేకమున దాల్చునది యయి తనరుదాని

సకలమహాజన సంశోభితంబయి, కాంచన క్లుప్తంబు కమ్రతరము


బహువిదామూల్య మణిగణ భాసమాన, మైన సభయందు దేదీప్యమాన రత్న

పీఠమున శాస్త్రచోదిత విధిని నిల్పి, యర్చితము చేసి పదపడ హర్షమార


*****

శత్రుఘ్ను డన్నకు శస్తమంగళకర, పాండురచ్చత్రంబు బట్టె భక్తి

వెల్లనిచామర విసరె సుగ్రీవుండు వేరొండు  సంపూర్ణ విధునిభంబు

బట్టెను రాక్షస  ప్రభువు విభీషణు౦, డమరేంద్ర చోదితుం డగుచు బవను

డర్పించె శతకమ లాంచితం బయి ధగ, ద్దగిత తేజం బయి, తనరు కనక


మాలికయును సకల మణి సమాయుక్తంబు, దివ్యరత్న తరల దీప్యమాన

మౌక్తిక ప్రకాండ మంజుల హారంబు, గొంచు వచ్చి యిచ్చె గొమరుమిగుల

         రామచంద్రమూర్తి విరివిగా బ్రాహ్మణులకు, తక్కిన వారికి వస్త్రాలు, ఇతర దానాలు ఇచ్చాడు. బంగారు హారాన్ని ప్రీతిగా సుగ్రీవుడికి ఇచ్చాడు. వజ్ర వైడూర్యాలతో చిత్రించబడ్డ విశేష కాంతికల భుజకీర్తులను అంగదుడికి ఇచ్చాడు. రత్న శ్రేష్టాలతో కూడినదైన, మనోహరమైన, ఉత్తమోత్తమమైన, ఆణిముత్యాలతో కూడిన శ్రేష్టమైన హారాన్ని ప్రేమతో సీతాదేవికి ఇచ్చాడు రామచంద్రమూర్తి. పరిశుభ్రమైన దువ్వలువలు, బంగారు భూషణాలు, సీతాదేవి భర్త అనుమతితో ఆంజనేయుడికి ఇచ్చింది. ఇవన్నీ ఆంజనేయుడికి ఇచ్చి కూడా సంతృప్తి చెందలేదు సీత. తన మెడలో వున్న ఒక అందమైన హారాన్ని సంతోషంగా చేతిలో తీసుకుని ఎవరికీ ఇస్తే బాగుంటుంది అన్న విధంగా భర్తవైపు చూసింది.’

‘సమాధానంగా ఆయన “ఓ అలివేణీ! ఎవరు తన గుణాలతో నిన్ను మెప్పించాడో, ఎవరిలో మంచి బుద్ధి పరాక్రమాలు కలవో అలాంటివాడికి దీన్ని ఇవ్వు” అని అన్నాడు. భర్త అలా చెప్పగానే ఆ హారాన్ని సీతాదేవి హనుమంతుడికి ఇచ్చింది. అది ధరించి హనుమంతుడు కాంతితో ప్రకాశించాడు. ఆ తరువాత మైందుడికి, ద్వివిదుడికి, నీలుడికి వారికిష్టమైన బహుమానాలు రాముడిచ్చాడు. అలా వానరనాథులందరికీ ఇచ్చాడు. ఈ ప్రకారం విభీషణ, సుగ్రీవ, జాంబవంత తదితర వానరులంతా వారివారికి తగిన బహుమానాలు, గౌరవాలు తృప్తితీరా పొంది రామచంద్రుడి ఆజ్ఞ తీసుకుని తమతమ ప్రదేశాలకు వెళ్లిపోయారు. వానరనాథులంతా కిష్కింధకు పోయారు.’

‘రామచంద్రమూర్తి నీతి విధానం తప్పకుండా రాజ్యమంతా పరిపాలించాడు. రామచంద్రమూర్తి లక్ష్మణుడితో “ధర్మజ్ఞుడా! నువ్వు ధర్మాన్ని అనుసరించి నాతో పద్నాలుగు సంవత్సరాలు దుఃఖం అనుభవించావు. ఇక సుఖాలు కూడా అనుభవించాలి. కాబట్టి ఈ రాజ్యానికి నువ్వు యువరాజై నాతో సమానంగా అనుభవించు అని ఎన్నెన్నో విధాల చెప్పాడు. కాని, లక్ష్మణుడు దానికి అంగీకరించ లేదు. పరతంత్రుడైన భరతుడికి యౌవరాజ్యాన్ని ఇచ్చి, అశ్వమేధయాగం, పౌండరీకం, వాజపేయం లాంటి యజ్ఞాలను చేశాడు. రామచంద్రమూర్తి యుద్ధం లాంటి ఘోర కార్యాలు లేకుండా మనోహరంగా పదివేల సంవత్సరాలు భూమిని పాలించి నూరు అశ్వమేధ యాగాలు చేసి, తమ్ములతో, చుట్టాలతో, ఆప్తులతో, మిత్రులతో కలిసి అనేక విధాలైన యజ్ఞాలు చేశాడు.’

శ్రీరామచంద్రమూర్తి రాజ్యం ఏలుతున్నప్పుడు ప్రజలు మనోవేదనలు లేకుండా వున్నారు. ఒకరితో ఒకరు స్నేహభావంతో వుండేవారు. కలహించుకోలేదు. దొంగతనం అంటే తెలియదు. దారిద్ర్యం అసలే లేదు. రామా! రామా! అని రామచంద్రమూర్తిని సర్వ వేళల ధ్యానిస్తూ సమస్త జీవకోటి ధర్మ బుద్ధితో సంతోషంగా, సుఖంగా వుండేది. ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు ఏనోట విన్నా రామశబ్దమే! ఏకథ విన్నా రాముడి కథే! ప్రపంచం అంతా రామమయం అయింది.

రామచంద్రమూర్తి రాజ్యం ఏలుతున్నప్పుడు వృక్షాలు, ఋతువులు, నియమం లేకుండా సర్వదా పుష్పాలతో, పండ్లతో, కొమ్మలతో కూడి వుండేవి. కరువు భయం లేనేలేదు. సకాలంలో వానలు పడేవి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వారివారి వర్ణాశ్రమ ధర్మాలను నియమం ప్రకారం పాటిస్తూ శుభలక్షణాలు కలిగి వుండేవారు. ఈ విధంగా శ్రీ రామచంద్రమహారాజు పదకొండు వేల సంవత్సరాలు తమ్ములతో శ్రీమంతుడై జగత్ప్రసిద్ధిగా ప్రపంచాన్ని పాలించాడు.

చాలా గొప్పగా, అద్భుతంగా, ఆనందభరితంగా, కోలాహలంగా కాకుండా జరిగిన భద్రాచల క్షేత్ర శ్రీరామనవమి మర్నాటి రామపట్టాభిషేక మహోత్సవంలో, కొంచెమైనా ఆంధ్రవాల్మీకి రామాయణం యుద్ధ కాండ మందరంలోని శ్రీరామ పట్టాభిషేకం అంశాలను, వారి పేరు ప్రస్తావిస్తూ చెప్పినట్లైతే బాగుండేదేమో!!

Friday, March 27, 2026

శ్రీరామ పట్టాభిషేకం, శ్రీమద్రామాయణ ఫలశ్రుతి >>>>> వనం జ్వాలా నరసింహారావు

 ఈ రోజున భద్రాచలంలో, ముత్తవరంలో జరిగే 

శ్రీరామ పట్టాభిషేకం సందర్భంగా

శ్రీరామ పట్టాభిషేకం, శ్రీమద్రామాయణ ఫలశ్రుతి

వనం జ్వాలా నరసింహారావు  

ప్రజాతంత్ర దినపత్రిక (మార్చ్ 20, 2026)

శనివారం, మార్చ్ 28, 2026 న భద్రాచలంలో సీతారామ (రామనారాయణ, మహాలక్ష్మి) కల్యాణం జరిగిన మరుసటిరోజు రామపట్టాభిషేకం జరుగుతుంది. శ్రీరామాయణంలో అత్యద్భుతమైన ఘట్టం శ్రీరామ పట్టాభిషేకం. రావణుడి వధ, విభీషణుడి పట్టాభిషేకం, సీతాదేవికి విముక్తి, తనవారందరితో కలిసి శ్రీరాముడు, సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్య సమీపానికి రావడం, తదనంతర అంశాలు ఆసక్తికరమైనవే కాకుండా, అవశ్య పఠనీయం. శ్రీరామ పట్టాభిషేకం నాడు మరీముఖ్యంగా చదవాల్సిన సన్నివేశాల సమాహారం.

నమస్కారం చేసిన భరతుడిని ప్రేమగా, ఆనంద భాష్పాలు రాలుతుంటే కౌగలించుకుని, ఆయన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాడు శ్రీరామచంద్రుడు.  భరతుడు సీతాదేవికి నమస్కారం చేసి, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని, జాంబవంతుడిని, అంగదుడిని, మైంద, ద్వివిదులను, గంధమాదనుడిని, ఇతర వానర వీరులను ప్రేమగా కౌగలించుకున్నాడు. ఆపత్కాలంలో సహాయం చేసిన సుగ్రీవుడిని ప్రత్యేకంగా ప్రశంసించాడు. తమ నలుగురు సోదరులలో సుగ్రీవుడిని కూడా కలుపుకుని మొత్తం ఐదుగురమని అన్నాడు. విభీషణుడు సహాయం వల్లే అసాధ్యకార్యం సాధించగలిగామని గౌరవంగా ఆయనకు చెప్పాడు. శత్రుఘ్నుడు కూడా సీతారామలక్ష్మణులకు అభివాదం చేశాడు.

         శ్రీరామచంద్రుడు తల్లి కౌసల్యకు సాష్టాంగ నమస్కారం చేశాడు. సుమిత్రకు, కైకకు, వశిష్టుడికి మొక్కాడు. పురజనులంతా రాముడికి స్వాగతం పల్కారు. కుశల ప్రశ్నల తరువాత భరతుడు తన దగ్గరున్న ‘బంగారు పాదుకలను’ రాముడి పాదాలకు తొడిగి, చేతులు జోడించి, రాజ్యమంతా ఆయనదేనని, ఆయన లేని కారణాన రక్షణగా వుండి, అప్పగిస్తున్నానని, ధనాగారం, ధాన్యాగారం పరీక్షించమని, తన సామర్థ్యం వల్ల కాకుండా, రాముడి తేజస్సు వల్ల అవన్నీ పదింతలై పెరిగాయని, సర్వం గ్రహించమని, అన్నాడు. భరతుడితో కలిసి శ్రీరాముడు సైన్యంతో సహా నందిగ్రామంలోని అతడి ఆశ్రమానికి బయల్దేరి పోయాడు. నందిగ్రామంలో పుష్పక విమానాన్ని వెనక్కు పంపాడు. వశిష్టుడి పాదాలను తాకగా, వారిద్దరూ వేర్వేరు పీటలమీద ఆసీనమయ్యారు.

         తన తల్లి వాక్యాన్ని పాలించి రాజ్యాన్ని, లక్ష్మిని వదిలి ఆమెను గౌరవించానని, రాముడికి ఆయన రాజ్యమంతా అప్పచెప్తున్నానని, రాజ్యభారం మోయలేనని, గొప్పదైన ప్రయత్నం చేస్తేనే కాని రక్షించలేని రాజ్యాన్ని మహాత్ముడైన రాముడే పాలించ సమర్ధుడని, పట్టాభిషిక్తుడైన రాముడినిలోని సౌశీల్య, సౌలభ్య, వాత్సల్య, కారుణ్య, పరమోదారత్వ, మధురభావ గుణాలను చూసి ప్రజలంతా సంతోషిస్తారని భరతుడు అంటాడు. ఎంతవరకు భూమ్యాకాశాలు, నక్షత్ర మండలం వుంటాయో అందాకా రాముడి ప్రభుత్వం వర్ధిల్లుతుందని అన్న భరతుడి మాటలకు సరే అన్నాడు రామభద్రుడు.

         ఆ తరువాత క్షురకులు శ్రీరామ లక్ష్మణ భరతులకు మీసాలు కత్తిరించి, గడ్డాలు, క్షౌరం చేశారు. స్నానానంతరం, శ్రీరాముడు వెలగల వస్త్రాలను ధరించి, అలంకరించుకుని, త్రిలోకాభిరాముడై వుండగా, రామలక్ష్మణులకు శత్రుఘ్నుడు ఆభరణాలు తొడిగాడు. సీతాదేవిని స్వయంగా, ఆమె అత్తగార్లే మనోహరంగా అలంకరించారు. అప్పుడు, ఒక దివ్యరథాన్ని సిద్ధం చేసి సుమంత్రుడు తీసుకొచ్చాడు. రామచంద్రమూర్తి దాన్ని ఎక్కి అయోధ్యకు పయనించాడు. ఆ రథం వెంట సుగ్రీవుడు, హనుమంతుడు ఇతరులు పయనించారు. వారివెంట సుగ్రీవుడి భార్యలు, వారి పరిచారికలు బయల్దేరారు. శ్రీరామాదులు ప్రయాణ సన్నాహంలో వుండగానే మంత్రులు అశోకుడు, సుమంత్రుడు, విజయుడు (వారితో పాటు దశరథుడి భార్యలు) ముందుగా అయోధ్యకు పోయి వసిష్టుడితో, రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి అన్నీ సిద్ధం చేసుకొమ్మని చెప్పారు.

  రామచంద్రమూర్తి  ఆకుపచ్చ గుర్రాలు కట్టిన రథం మీద ఎక్కి అయోధ్యా పురంలో రాచబాటల వెంట పయనించసాగాడు. భరతుడు రథానికి సారథ్యం చేశాడు. ఉత్తమ శ్వేతఛ్చత్రం శత్రుఘ్నుడు పట్టుకున్నాడు. లక్ష్మణుడు రామచంద్రమూర్తి శిరస్సుమీద విసనకర్రతో కుడి చేత్తో విసురుకుంటూ నిలబడ్డాడు. ఎడమ చేత్తో లక్ష్మణుడు వింజామర పట్టుకున్నాడు. సుగ్రీవుడు శత్రుంజయమనే ఏనుగునెక్కి బయల్దేరి వచ్చాడు. వానర శ్రేష్ఠులు మనుష్యుల ఆకారంలో ఏనుగులమీద బయల్దేరారు. నగారా ధ్వనులు, శంఖాల మోతలు, వీణెల ధ్వనులు మోగుతుంటే రామచంద్రమూర్తి మేడలు, మిద్దెలు చూసుకుంటూ పోయాడు. రామచంద్రమూర్తిని అమాత్యులు, పురజనులు, బ్రాహ్మణులు సేవిస్తూ వుంటే, విశేషంగా ప్రకాశించాడు. మంగళవాద్యాలు మోగసాగాయి. పచ్చటి అక్షింతలు తీసుకుని బ్రాహ్మణులు, కన్యకలు, ఆవులు ముందు పోయారు.

         అయోధ్య చేరిన శ్రీరాముడు ఇక్ష్వాకువంశరాజుల నివాసమైన దశరథుడి ఇంట్లోకి ప్రవేశించాడు. ముగ్గురు తల్లులకు సాష్టాంగనమస్కారం చేసి, సుగ్రీవుడికి తన ఇంట్లోనే విడిది ఏర్పాటు చేయమని  భరతుడికి చెప్పాడు. హనుమంతుడు, వేగదర్శి, జాంబవంతుడు, ఋషభుడిని పిలిచి, నాలుగు బిందెలు ఇచ్చి, నాలుగు సముద్రాల నుండి నీళ్ళు తీసుకుని ఉదయంలోపు రావాలని ఆదేశించాడు సుగ్రీవుడు. వారు తక్షణమే, దివ్య నదీ తీర్థాలతో నిండిన బిందెలు తెచ్చారు. మరికొందరు ఐదొందల నదుల తీర్థాలు తెచ్చారు. తూర్పు, దక్షిణ, పడమటి, ఉత్తర సముద్రాల నుండి సుషేణుడు, మరో ఋషభుడు, గవయుడు, నలుడు బంగారు బిందెలలో సముద్ర జలాలను తెచ్చారు.

శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవ ఘట్టం

         శాంతచిత్తుడు, బ్రాహ్మణ శ్రేష్టులతో కూడిన వసిష్టుడు, రామచంద్రమూర్తిని, సీతాదేవిని రత్నపీఠం మీద కూర్చోబెట్టాడు. వసిష్టుడు, కాత్యాయనుడు, జాబాలి, కాశ్యపుడు, విజయుడు, గౌతముడు, వామదేవుడు, సుయజ్ఞుడు మొదలైన ఎనిమిదిమంది బ్రాహ్మణ శ్రేష్ఠులు పరిమళాలు ఘుమ్మని వీస్తున్న  జలాలతో వారిని అభిషేకించారు. ఋత్విజులు, బ్రాహ్మణులు, కన్యకలు, మంత్రులు, యోధులు, వైశ్యులు దివ్యమైన గొప్ప మూలికల రసంతో ఆకాశాన గుంపులుగా చేరి చూస్తున్న దేవతల, నలుగురు దిక్పాలకుల సమక్షంలో అభిషేక కార్యక్రమం అంతా జరిపించారు.

బ్రహ్మ నిర్మితమై, అనేక రత్నాలతో, తేజస్సుతో ప్రకాశిస్తూ, మనువు పూర్వం అభిషిక్తుడైన సమయంలో ధరించినదై, అది మొదలు వంశపారంపర్యంగా పట్టాభిషేక సమయంలో ధరించేదైన, వెలలేని మణులతో ప్రకాశిస్తున్న కిరీటాన్ని రత్న పీఠంమీద కూచున్న రామవిభుడి అంగీకారంతో వేదాధ్యయనపరులైన ఋత్విజులతో కలిసి వసిష్టుడు అలంకరించాడు. శత్రుఘ్నుడు శ్వేతఛ్చత్రం పట్టాడు. తెల్లటి చామరాన్ని సుగ్రీవుడు, మరొక చామరాన్ని విభీషణుడు వీచారు. వాయుదేవుడు బంగారు సరాన్ని, సమస్త రత్నాలతో కూడిన మంచి ముత్యాల మనోహరమైన సరాన్ని అర్పించాడు. గంధర్వులు దివిలో ఆడారు, పాడారు.

శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేక ఉత్సవం జరగగా పచ్చిటి పైరులు భూమంతా నిండాయి. చెట్లన్నీ పరిమళాలతో పూచాయి, కాచాయి. రామచంద్రమూర్తి విరివిగా బ్రాహ్మణులకు, తక్కిన వారికి వస్త్రాలు, ఇతర దానాలు ఇచ్చాడు. బంగారు హారాన్ని ప్రీతిగా సుగ్రీవుడికి ఇచ్చాడు. వజ్ర వైడూర్యాలతో చిత్రించబడ్డ విశేష కాంతికల భుజకీర్తులను అంగదుడికి ఇచ్చాడు. రత్న శ్రేష్టాలతో కూడినదైన, మనోహరమైన, ఉత్తమోత్తమమైన, ఆణిముత్యాలతో కూడిన శ్రేష్టమైన హారాన్ని ప్రేమతో సీతాదేవికి ఇచ్చాడు రామచంద్రమూర్తి.

         పరిశుభ్రమైన దువ్వలువలు, బంగారు భూషణాలు, తన మెడలో వున్న ఒక అందమైన హారాన్ని, సీతాదేవి భర్త అనుమతితో ఆంజనేయుడికి ఇచ్చింది. వాస్తవానికి హారాన్ని ఎవరికీ ఇస్తే బాగుంటుందని భర్తను అడిగినప్పుడు, ఎవరు తన గుణాలతో ఆమెను మెప్పించాడో, ఎవరిలో మంచి బుద్ధి పరాక్రమాలు కలవో అలాంటివాడికి ఇవ్వమని అన్నాడు. అది ధరించి హనుమంతుడు కాంతితో ప్రకాశించాడు. ఆ తరువాత మైందుడికి, ద్వివిదుడికి, నీలుడికి వారికిష్టమైన బహుమానాలు రాముడిచ్చాడు. అలా వానరనాథులందరికీ ఇచ్చాడు. విభీషణ, సుగ్రీవ, జాంబవంత తదితర వానరులంతా వారివారికి తగిన బహుమానాలు, గౌరవాలు తృప్తితీరా పొంది రామచంద్రుడి ఆజ్ఞ తీసుకుని తమతమ ప్రదేశాలకు వెళ్లిపోయారు.

రామచంద్రమూర్తి భరతుడికి యౌవరాజ్యాన్ని ఇచ్చి, అశ్వమేధయాగం, పౌండరీకం, వాజపేయం లాంటి యజ్ఞాలను చేశాడు. ఆయన రాజ్యం ఏలుతున్నప్పుడు ప్రజలు మనోవేదనలు లేకుండా, ఒకరితో ఒకరు స్నేహభావంతో వుండేవారు. కలహించుకోలేదు. దొంగతనం అంటే తెలియదు. దారిద్ర్యం అసలే లేదు. ఏనోట విన్నా రామశబ్దమే! ఏకథ విన్నా రాముడి కథే! ప్రపంచం అంతా రామమయం అయింది. వృక్షాలు, ఋతువులు, నియమం లేకుండా సర్వదా పుష్పాలతో, పండ్లతో, కొమ్మలతో కూడి వుండేవి. కరువు భయం లేనేలేదు. సకాలంలో వానలు పడేవి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వారివారి వర్ణాశ్రమ ధర్మాలను నియమం ప్రకారం పాటిస్తూ శుభలక్షణాలు కలిగి వుండేవారు. ఈ విధంగా శ్రీ రామచంద్రమహారాజు పదకొండు వేల సంవత్సరాలు తమ్ములతో శ్రీమంతుడై జగత్ప్రసిద్ధిగా ప్రపంచాన్ని పాలించాడు.

ఫల శ్రుతి

         నారద మహర్షి వాల్మీకికి రామాయణాన్ని ఉపదేశించినప్పుడు ముందు భూతకాలం చెప్పి, తరువాత భవిష్యత్కాలం చెప్పాడు, వాల్మీకి ప్రశ్న వేయడానికి ముందే “ఎవ్వడీ ధారుణిని యీకాలంలో” అనే ప్రశ్నించాడు కాని, గడిచినవారి గురించి కాని, రాబోయేవారిని గురించి కానీ ప్రశ్నించలేదు. అవతారానికి ముందే రామాయణం రచించినట్లయితే కొంత భూతార్థకంలో, కొంత వర్తమానార్థకంలో, కొంత భవిష్యత్ అర్థకంలో చెప్పాల్సిన పనిలేదు. అవతారానికి ముందే రామాయణం రచించడం జరిగిందని అంటే చాలా విరోధాలు వస్తాయి. అలా చెప్పడానికి ఒక్క ఆధారమైన రామాయణంలో లేదు. రామాయణం వేదంలాగా స్వతఃప్రమాణం. దానిలోని విషయాలను ఋజువు చేయడానికి ఇతర ప్రమాణాలు లేవు.

         రామాయణమే ఆదికావ్యం. వేదార్థం ఇందులో విస్తరించి చెప్పడం జరిగింది. వాల్మీకి మహర్షి దీన్ని అశ్వమేధయాగం చేయడానికి పూర్వం రచించి బహిర్గతం చేశాడు. ఇది పుణ్యం కలిగించి ఆయువును వృద్ధి చేస్తుంది. ఇది మిక్కిలి కీర్తికరం. రాజులకు గెలుపు కలిగిస్తుంది. దీన్ని చదువుతే (పఠిస్తే) సకల పాపాలు తొలగిపోతాయి. కొడుకులు కావాలనుకున్నవారికి కొడుకులు, ధనం కోరినవారికి ధనం లభిస్తుంది. రామాభిషేక విధానం విన్న రాజు శత్రువులను గెలిచి రాజ్యం పాలిస్తాడు. రామాయణం ప్రజలు వింటే, వారి ఆయువు వృద్ధి అవుతుంది.

కోపాన్ని జయించి, శ్రద్ధగా, ఏకాగ్ర మనస్సుతో, వేదార్థం విస్తరించిన, వాల్మీకి మహర్షి చెప్పిన రామాయణాన్ని మంచి మనసుతో చదివేవాడు సమస్త దుఃఖాలను దాటుతాడు. మరణించిన తరువాత మోక్ష సుఖం కలుగుతుంది. జీవించిన కాలంలో శ్రీరామ కటాక్షం వల్ల వాడి కోరికలన్నీ నెరవేరుతాయి. ఇది సత్యం సత్యం అని స్వానుభవం వల్ల ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు ఆయన రచించిన ఆంధ్రవాల్మీకి రామాయణంలో పేర్కొన్నారు. ఆయనగారు సంకల్పించిన మహాకార్యం అతడి శక్తికి మించినవైనా లోకోత్తరంగా అన్నీ నెరవేరాయి.

         రామాయణ కావ్యం వినేవారిని గురించి దేవతలు సంతోషిస్తారు. వారి ఇండ్లలో దుష్టగ్రహాలు నిలవలేక పారిపోతాయి. రాజు వింటే భూమిని జయిస్తాడు. పరదేశంలో వున్నవాడు ఆపదలేక ప్రయాణం చేస్తాడు. స్త్రీ వింటే ఆమెకు ఉత్తమ గుణాలుకల కొడుకులు పుట్తారు. ఎవరైతే ఈ రామాయణాన్ని ఇష్టంగా పఠిస్తాడో వాడి పాపాలన్నీ హరిస్తాయి.

శ్రీరాముడు ఏనాడో మరణించాడు కదా! అలాంటివాడు తనను సేవించినవారికి ఎలా సహాయం చేస్తాడు? అని ప్రశ్నించేవారికి సమాధానం రామాయణంలోనే వుంది. రామచంద్రమూర్తి నారాయణుడు. సమస్త భూతాలకు స్థానమై సర్వం తానై వుండేవాడు. కాబట్టి ఆనాడున్నాడు, నేడు లేడని అనకూడదు. సమస్త ప్రపంచానికి ప్రభువైన రాముడు లేకపోతే లోకం అనాయకమౌతుంది. అవతారానికి ముందు కాని, తరువాత కాని రామచంద్రమూర్తి లేకపోలేదు. రామచంద్రమూర్తి లేడంటే భగవంతుడు లేడని అర్థం. ఎందుకంటే ఆయనే ఆదిమదేవుడైన హరి.

బ్రహ్మరుద్రాదులు లేనికాలంలో ఆయన వుండి వీరందరి జన్మకారకుడైనాడు. ఆయనే ఒక కాలంలో లేడంటే ఇక వుండేది ఏమిటి? దీర్ఘబాహుడైన యితడు సాకారుడు కాని నిరాకారుడు కాదు. ఈయన లక్ష్మీపతి. ఒంటరివాడుకాదు. లక్ష్మీ విశిష్టుడు. నరసింహాతారంలో లాగా సర్వాంతర్యామి అయివుంటాడు. ఒక కాలంలో వుండి వేరే కాలంలో లేకుండా వుండడు. ఇలాంటివాడు శ్రీరామచంద్రమూర్తి.

శుభకరమైన ఈ కావ్యాన్ని వింటే ధనధాన్య వృద్ధి, సంతాన వృద్ధి కలుగుతుంది. సద్గుణాల స్త్రీ సాంగత్యం, ఉత్తమ సౌఖ్యం లభిస్తుంది. పరమార్థమైన మోక్షం ప్రాప్తిస్తుంది. క్షేమ పద్ధతిన ఆయువు, కీర్తి, ఆరోగ్యం లభిస్తాయి. ఇది సోదర స్నేహం, సౌఖ్యం, సాదుబుద్ధి, తేజస్సు కలిగిస్తుంది. పుణ్యలాభం కోరి దీన్ని వినే సత్పురుషులు నియమంగా చపలత లేని మనస్సుతో గ్రంథమంతా వినాలి. రామాయణ శ్రవణ పఠనం వల్ల దుష్ట రోగాలు మానుతాయి. ఇది ప్రమాణానుభవ సిద్ధం.

రామాయణం పురావృత్తమణి అని చెప్పడం జరిగింది. పురావృత్తాలెన్నో వున్నాయి. అవి రామాయణానికి సరికావు. ఎందుకంటే, శ్రీమద్రామాయణం బ్రహ్మ అనుమతితో వాల్మీకి మహర్షి రచించాడు. ఈ కావ్యంలో అనృతం కొంచెమైనా వుండదని బ్రహ్మ వరం. ఇది వేదం స్వరూపం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి యోగ్యత, మహాత్మ్యం, గాయత్రీ ప్రణవ మంత్రాది సంపుటీకరణ ఇతర గ్రంథాలలో లేవు. సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో వున్నప్పుడు రాసింది కాబట్టి ఇది పురాతన చరిత్ర అన్నారు.

రామాయణ పఠనం వల్ల, రామ కథా శ్రవణం వల్ల సర్వ సుఖాలు కలుగుతాయి. ఈ విధంగా వేదార్థం తెలిపే ఈ రామాయణ కావ్యం పూర్వం వాల్మీకి మహర్షి లోకులకు ఉపకారం చేయడానికి దాన్ని సంహితగా రచించాడు. (ఇది ఈ రోజున పఠించినవారికి మంచి జరుగుతుందని అంటారు)

అంగరంగ వైభోగంగా, భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణం >>>>> విశిష్ట వశిష్ట అర్చక మహాశయులకు అభినందనలు : వనం జ్వాలా నరసింహారావు

 అంగరంగ వైభోగంగా, భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణం

విశిష్ట వశిష్ట అర్చక మహాశయులకు అభినందనలు

వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి, ఆశాఖ ఉన్నతాధికారులు, పలువురు మంత్రుల సమక్షంలో, అంగరంగ వైభోగంగా, ఆబాలగోపాలం అపరిమితమైన భక్తిభావనతో వీక్షిస్తుండగా, భద్రాచలం శ్రీసీతారామ కల్యాణాన్ని శుక్రవారం, మార్చ్ 27,2026 న కన్నులపండుగగా, ఎప్పటిమాదిరిగానే నిర్వహించిన శ్రీసీతారామచంద్ర దేవస్థాన అధికారులను, విశిష్ట వశిష్ట అర్చక మహాశయులను మనస్ఫూర్తిగా, మనసారా అభినందించాలి. సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపుడిని, శ్రీమహాలక్ష్మీదేవిని, శ్రీరామనవమి పర్వదినాన, సీతారాముల కళ్యాణ సందర్భంగా, బుల్లితెరమీద చూసే  భాగ్యం కలిగించిన నిర్వాహకులకు, వివాహ తంతు జరిపించిన అర్చక మహాశయులకు ధన్యవాదాలు.

శ్రీరామనారాయణస్వామి, శ్రీమహాలక్ష్మీ పేర్లతో, గోత్ర ప్రవరలతో, జీలకర్ర బెల్లం పెట్టేశారు. వందల సంవత్సరాల నుండీ శ్రీలక్ష్మీనారాయణుల కళ్యాణమే భద్రాచలంలో జరుపడం ఆనవాయితీ అంటూ స్పష్టంగా ప్రకటిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలానే జరుపుతామని నొక్కి వక్కాణిస్తూ ప్రకటన కూడా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక, వారి ముందు శ్రీరామచంద్రస్వామినే వరాయ అని చెబుతూ, శ్రీలక్ష్మీనారాయణుల గోత్ర ప్రవరలైన అచ్యుత, సౌభాగ్య గోత్రాలు చెప్పి, శ్రీసీతారామచంద్రుల నామాలతో, శ్రీరామచంద్రస్వామినే వరాయ అంటూ కళ్యాణ తంతు ముగించారు. చాలా ఆనందం కలిగిందని చెప్పాలి. వినరో భాగ్యము...విష్ణు కథా...

ప్రముఖ  కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గుర్తుకు వచ్చారు. వారి 'కృష్ణపక్షం' లోని స్వేచ్ఛాగానం, ఆసక్తికరమైన, అహరహం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన పంక్తి ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు ... నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు’ కూడా పదే పదే గుర్తుకువచ్చింది. లోకం ఏమనుకున్నా, ఇతరులు నవ్వినా సరే, తన ఆశయానికి, అభిరుచికి కట్టుబడి, దేనికీ భయపడకుండా తనదైన బాటలో సాగిపోవాలనే దేవులపల్లివారి నిశ్చయాత్మక భావనను ఈ వాక్యం తెలుపుతుంది. ఇతరుల విమర్శలు, హాస్యాన్ని పట్టించుకోకుండా తన ఇష్టానుసారం జీవించడమే దీని వాస్తవిక భావం. దేవులపల్లిగారి వ్యక్తిగత స్వేచ్ఛను, నిర్భయత్వాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛాగానం. విశేషమేమిటంటే, ఈ వాక్యాన్ని సామాజిక, రాజకీయ సందర్భాల్లో విమర్శలను లెక్కచేయని ధోరణిని తెలపడానికి ఉపయోగించడం తరచు జరుగుతుంది. అన్వయించుకునేవారిని బట్టి అర్థాలుంతాయి!!!

ఇంకో విషయం కూడా గుర్తుకొచ్చింది. అది, రాముడికి, భరతుడికి మధ్య చిత్రకూటంలో జరిగిన సంభాషణను రామాయణం అయోధ్యకాండలో పేర్కొన్న విధానం. ‘కార్య నిర్వహణలో పురుషుడే స్వతంత్ర కర్త అన్న అభిప్రాయం సరైంది కాదని, పురుషుడు తన ఇష్టానుసారం లోకంలో సంచరించే స్వాతంత్ర్యం కలవాడుకాదని, దైవం పురుషుడిని ఈ పక్కకు, ఆ పక్కకు లాగి బాధిస్తుందని, పురుషుడే స్వతంత్రుడైతే, ఎప్పుడూ తన శ్రేయస్సునే కోరుకుంటూ, ఏహాని రాకుండా చేసుకోవచ్చని, ఏపనికైనా, ఏదితలపెట్టినా పురుష ప్రయత్నం చాలక కాదని, అన్నిటికీ దైవమే కారణమీ, అలా అని ప్రయత్నం చేయడం ఆపకూడదని, ‘ప్రయత్నించు, ప్రయత్నించు, లక్ష్యం సాధించినదాకా ప్రయత్నించు’ అనేది అచంచలమైన పట్టుదలకు, నిరంతర కృషికి చిహ్నమని భావించాలని’ ఆ సందర్భంలో రాముడు భరతుడికి చెప్పినదాని సారాంశం. దీన్ని కూడా ఎలాగైనా అన్వయించుకోవచ్చు. అర్థమూ చేసుకోవచ్చు.

అలాగే నాస్తికుడని భావించిన జాబాలికి మంచిమాటలు చెప్పాడు రాముడు. ‘ప్రజలకు సత్యమే ఆత్మ. సత్యాన్ని విడిచిపెడితే జీవుడు విడిచిన శరీరం అవుతుంది. సర్వ జగాలకు సత్యమే ఆధారం. సత్యమే శ్రేష్ఠం. మోక్షాన్ని కోరేవాడు సత్యాన్నే పలకాలి. సత్యమే లక్ష్మీవాసస్థానం. ప్రపంచానికంతా సత్యమే నియంత. సత్యానికి లోబడి ప్రపంచం నడుస్తున్నది. సత్యమే ప్రపంచం నిలబడడానికి మూలాధారం. మోక్షప్రాప్తికి సాధనం. సత్యాన్ని మించింది ఏదీ లేదు. దానం, హోమం, వేదం, ధ్యానం, తాపం, నిష్ఠ, యాగం, ఇవన్నీ సత్యాన్ని ఆశ్రయించి వుంటాయి. సత్యం విడిచిన వారికి ఇవేవీ పనిచేయవు. కాబట్టి ప్రతివారూ సత్యమే ప్రధానంగా కలవాడు కావాలి.’

అసలు విషయం: సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, ఇవన్నీ ఉద్యోగాలే. మనుష్యులలో ఎవరే సంకల్పంతో ఏ కర్మ చేస్తాడో, ఆచరిస్తాడో, ఆ కర్మఫలంగా వాడే ఉద్యోగ పదవికి అర్హుడో వారికా పదవి ఇవ్వడం జరుగుతుంది. వీరంతా కొంతకాలం ఆ పదవుల్లో వుండి వేరేవారికి స్థానం కలిగిస్తారు. బ్రహ్మ రుద్రేంద్రాది పదవులన్నీ కర్మఫలాలే. ఫలదాత భగవంతుడైన విష్ణువే. భగవంతుడైన విష్ణువు తానే సృష్టికర్తగా సృజించుకుంటున్నాడు. పాలించేవాడై రక్షించుకుంటున్నాడు. సంహరించేవాడై సంహరింప బడుతున్నాడు. మనమెంత, మన పాండిత్యమెంత? మన అవగాహన ఎంత? ఏది, ఏపదవి శాశ్వతం.

         జాబాలి తాను నాస్తికుడిని కాదని, నాస్తికోక్తులను చెప్పనని, నాస్తి అనేది లోకంలో లేదని, సర్వం అస్తియే అని, రాముడికి చెప్పాడు. నాస్తికవాదం చేయడానికి కారణం, ధర్మానికి అపాయం సంభవించినప్పుడు, న్యాయంగానో, అన్యాయంగానో, ధర్మం చెడిపోకుండా కాపాడడం ఆపద్ధర్మమని స్పష్టం చేశాడు. తానే నాస్తికుడి నైతే దశరథుడు, వసిష్ఠాదులు ఎలా చేరదీసేవారని, నాస్తికవాదం చేసే వారిని తానే ఖండిస్తానని, ధర్మానికి హాని కలిగినప్పుడు ఎలాగైనా ధర్మ స్థాపన చేయాల్సి వస్తే, అప్పుడు నాస్తికవాదన తప్పక చేస్తానని గట్టిగా చెప్పాడు. ఒక పని నెరవేరాలంటే ఎన్ని విధాల ప్రయత్నించినా తప్పులేదన్నాడు. ఇక్కడ సందర్భం నాస్తిక వాదనైనా, రాముడులాంటివాడికే జాబాలి ధర్మం గురించి చెప్పదలచుకున్నాడంటే, ఎవరైనా తప్పుచేశారని మనం భావిస్తే ‘సరిదిద్దుకో అనడం పొరాపాటుకాదు. అలాగే రాముడంతటి వాడే జాబాలిని తప్పుగా భావించాడు.

          అప్పుడు వసిష్ఠుడు, తప్పొప్పులు తెలుసుకోవడమనే అంశాన్ని విజ్ఞానపరమైన కోణంలో అద్భుతంగా వివరించాడు.  ‘ఈ ప్రపంచం పుట్టుక ఆశ్చర్యకరం. బ్రహ్మాండమంతా జలంతో నిండి ఒక సముద్రంగా వున్నప్పుడు భూమి సృష్టించబడింది. పరబ్రహ్మం వల్ల దేవతలు, బ్రహ్మ కలిగారు. భూమి నీట్లో మునుగుతున్నప్పుడు విష్ణువు ఆదివరాహమై తన కొమ్ముతో దాన్ని పైకెత్తాడు. అప్పుడు అవ్యయుడు, నిత్యుడు, పరబ్రహ్మం వల్ల కలిగిన బ్రహ్మ తన కొడుకులైన మరీచ్యాదులతో ప్రపంచమంతా వ్యాపించాడు. ఆకాశమే పరబ్రహ్మం. ఆకాశమంటే సర్వత్రా ప్రకాశించేది. ఈ ప్రపంచం ప్రళయకాలంలో చీకట్లో మునిగి వుండేది. ఆ కాలంలో మహదాది అయిన ప్రకృతి సూక్ష్మ ప్రకృతైన తమస్సులో లీనమై తమస్సు భగవంతుడితో ఏకీభావంగా వుండేది. ఈ కారణం వల్ల అది ప్రత్యక్ష ప్రమాణానికి అగమ్యంగా, చీకట్లో వస్తువులు కళ్లకు కనబడని విధంగా, ఇది ప్రపంచమని గుర్తించగల చిహ్నాలు లేకుండా, శబ్దం వల్ల కూడా తెలియకుండా అంతా నిద్రావస్తలో వున్నట్లుండేది.’

         ‘భగవంతుడు అవ్యాకృతాత్ముడై రూపం, నామం, క్రియ లేనివాడై కొంతకాలం వుండి, మళ్లీ సృష్టిని సంకల్పిస్తాడు. ఆ సంకల్ప శక్తివల్ల ప్రకృతి క్షోభిల్లుతుంది. అప్పుడు మళ్లీ ఒకదానిలో నుండి ఇంకొకటి పుట్తాయి. ఈ విధంగా తమస్సు, ప్రకృతి, మహత్తు, అహంకారం, ఆకాశతన్మాత్రం, అగ్ని, జలతన్మాత్రం, జాలం, పృథివీ, పృథివినుండి ఔషదులు, వరుసగా ఉద్భవిస్తాయి. ఇది పరిణామం. Evolution అంటారు. మొదలు జరిగేది విపరిణామం. Involution. విపరిణామం చాప చుట్టడం లాంటిది కాగా, పరిణామం చాప విప్పి పరచడం లాంటిది. ఇవన్నీ వాటంతట అవే కావు. ప్రకృతి జడం కాబట్టి దానంతట అది పరిణామం చెందలేదు. జీవుడు కర్మబద్దుడైనందున, ఆకాలంలో ప్రకృతిలో కలసి వున్నందున అతడికి ఆ శక్తిలేదు. కాబట్టి ఇవన్నీ చేసేవాడు భగవంతుడే!’ ఈ విధంగా సర్వం భగవంతుడే అని అర్థం అవుతున్నది. అంతా నేనే, మేమే అనుకునేవారు నిమిత్తమాత్రులే.

          వసిష్ఠుడు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోయాడు: ‘బ్రహ్మకు మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపుడికి భాస్కరుడు, భాస్కరుడికి మనువు, మనువుకు ఇక్ష్వాకుడు పుట్టారు. అయోధ్యను మనువు ఇక్ష్వాకుడికి ఇచ్చాడు కాబట్టి శ్రీరాముడి వంశానికి ఇక్ష్వాకుడే మూలపురుషుడు. అతడికి కుక్షి, ఆ కుక్షికి వికుక్షి, అతడికి బాణుడు. బాణుడికి జన్మించిన సత్యధర్మ నిష్ఠుడు అరణ్యుడే రావణుడితో యుద్ధం చేసి శపించాడు. అరణ్యుడికి బృథువు కలిగాడు. అతడి కుమారుడే (సత్యవ్రతుడు) త్రిశంకుడు. త్రిశంకుడికి ధుంధుమారుడు లేదా యువనాశ్వుడు, అతడికి మాంధాత పుట్టారు. మాంధాత కొడుకు సుడంది. అతడి కొడుకులు ధ్రువసంధి, ప్రసేనజతుడు. ధ్రువసంధి కొడుకు భరతుడు. అతడి కొడుకు అసితుడు. ఆయనకు ఇద్దరు భార్యలు. వారిలో ఒకామె (కాళింది) గర్భవతిగా వున్నప్పుడు సవతి విషం పెట్టింది. ఆమెకు చ్యవనుడనే ముని వంశాన్ని ఉద్ధరించే సజ్జన స్తోత్రుడైన కొడుకు పుడుతాడని దీవించాడు.’

         ‘కాళిందికి బ్రహ్మతో సమానుడైన సగరుడు పుట్టాడు. సముద్రాన్ని తవ్వించాడు. ఆయన కొడుకు అసమంజుడుకి అంశుమంతుడు పుట్టాడు. అతడికి దిలీపుడు, అతడికి భగీరథుడు, ఆయనకు కకుథ్సుడు, ఆతడికి రఘువు, అతడికి కల్మాషపాదుడు పుట్టారు. కకుథ్సుడు పేరుమీదే శ్రీరాముడి వంశంవారిని కాకుథ్సులు అని పిలుస్తారు. కల్మాషపాదుడి కొడుకు శoఖనుడు, అతడి కొడుకు సుదర్శనుడు. సుదర్శనుడికి నహుషుడు, నహుషుడికి, నాభాగుడు, అతడికి అజుడు, సువ్రతుడు పుట్టారు. అజుడి కుమారుడు దశరథుడు. ఆయన కొడుకుల్లో శ్రీరాముడు పెద్దవాడు.’ ఇదీ వశిష్టుడు చెప్పిన శ్రీరామచంద్రుడి వంశక్రమం. ఇవన్నీ అప్పుడు, ఆయన చెప్పడానికి కారణం, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవారిలో వంశపరంపరంగా పెద్దవాడే రాజవుతున్నాడు కాబట్టి, వంశధర్మాన్ని అనుసరించి, రాముడిని రాజ్యాభిషేకానికి అంగీకరించి ప్రజలను పాలించమని చెప్పడానికే.

అయోధ్యకాండలో ఇవన్నీ చదువుతుంటే, రామ జన్మభూమి అయోధ్య చారిత్రక వివాదంపై అలహాబాద్ హైకోర్టు సెప్టెంబర్ 30, 2010 న ఇచ్చిన ‘చరిత్రాత్మక సెక్యులర్ తీర్పు’ కూడా గుర్తుకు వచ్చింది. అప్పటి త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ యూ ఖాన్, జస్టిస్ సుధీర్ అగర్వాల్ వేర్వేరుగా తీర్పులు ఇచ్చినప్పటికీ, అనేక అంశాలపై ఏకీభవించారు. వారి తీర్పులో న్యాయమూర్తులు అనేక ఆధారాలను చూపిస్తూ, కొన్ని  ఉదాహరణలను హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృత భాషల్లో ఉటంకించారు. వేదాలు, పురాణాల ఉదాహరణలు తీర్పులో చోటుచేసుకున్నాయి. మాకే ఎంతో తెలుసు అనుకునే మేథావులు ఆ తీర్పు చదవాలి.

కార్ల్ మార్క్స్ లాంటి మహనీయుల ప్రస్తావన కూడా వుంటుంది అక్కడక్కడ. వారు చదివిన తీర్పు ముందు, వెనుక పేర్కొన్న దాంట్లో ఆసక్తికరమైన, పరిశోధనలకు కావాల్సిన అనేకానేక విషయాలున్నాయి. ఎనిమిదివేల పేజీల పైనున్న ఆ తీర్పు పాఠం ‘ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వం’ అనవచ్చేమో. యావత్ ప్రపంచానికి అందులోని ప్రధానాంశాలను కూర్చి పంచాలి. సంస్కృతం, హిందీ, ఉర్దూ, పర్షియన్, ఫ్రెంచ్, టర్కీ భాషలలోని చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, పురా తత్వ శాస్త్రం, ప్రాచీన శిల్ప శాస్త్రం, మతపరమైన విషయాలకు సంబంధించిన అనేక గ్రంధాలను, అసంఖ్యాకమైన ప్రాచీన హస్త కళా కృతులను పరిశీలించామన్నారు న్యాయమూర్తులు.

వాగ్మూలంలోని ఒక ప్రధాన అంశాన్ని ప్రస్తావించారు న్యాయమూర్తులు: ‘భగవదవతారమైన శ్రీరాముడు త్రేతాయుగాంతంలో, ద్వాపర యుగారంభంలో అవతరించారని, శిష్ట రక్షణ కొరకు మానవాకారంలో అవతరించిన భగవంతుడాయనని, ఆయన గుణగణాలను, సమకాలీనుడైన వాల్మీకి మహర్షి రామాయణంలోను, తర్వాత వ్యాస మహాభారతంలోని రామోపాఖ్యాన పర్వంలోను, పురాణాల లోను, ఇతిహాసాల లోను, కౌటిల్యుడి అర్థశాస్త్రం లోను, కాళిదాసు రఘువంశం లోను, భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లోను ప్రస్తావించారని, గోస్వామి తులసీదాస్ రచించిన "రామ చరిత్ర మానస్" లోను ప్రస్తావించడం జరిగింది.’ ఎంత పరిశోధన జరిగిందో?

అలాగే, స్వామి వివేకానంద రచనలు, ఆనంద రామాయణం, వాల్మీకి రామాయణం, రామ చరిత్ర మానస, భగవద్గీత, కాళిదాసు రఘువంశం, అధర్వ వేద సంహిత, రుగ్వేదం, రుగ్వేద సంహిత, సామవేదం, శుక్ల యజుర్వేదం, బృహదారణ్యక ఉపనిషత్తు, బృహస్పతి స్మృతి, మను స్మృతి, ధర్మశాస్త్రాలు, మత్స్య పురాణం, మేఘ దూత, నారదీయ ధర్మ శాస్త్రం, నారద స్మృతి, పురుష సూక్తం, శాకుంతలం, శుక్రనీతి, స్కంద పురాణం, యాజ్ఞవల్క్య స్మృతి లాంటివి వున్నాయి. ఇదీ, అదీ అనిలేదు. విజ్ఞాసర్వస్వాలన్నీ చదివారనాలి.

జస్టిస్ సుధీర్ అగర్వాల్ ఇదో ‘జైగాంటిక్, హెర్క్యూలియన్ టాస్క్’ అని వర్ణించారు. తన తీర్పు పాఠాన్ని ఋగ్వేదంలోని సంస్కృత శ్లోకాలతో ఆరంభించారు. ‘ప్రళయావస్థలో శూన్యం తప్ప ఏమీ లేదు. కేవలం పంచ భూతాలు మాత్రమే వుండేవి. ఏ లోకమూ లేదు. భూమ్యాకాశాలూ లేవు. అలాంటప్పుడు ఎవరు ఎవరిని కదిలించారు? ఎలా కదిలించారు? అంతా అనిశ్చిత స్థితే!’ అని మొదలవుతుందా శ్లోకం. చావు పుట్టుకలు అప్పుడు తెలియదని, సూర్యచంద్రులు వున్నారో, లేరో తెలియనందున రాత్రి, పగలు తేడా లేదని అంటూ, ఆ సమయంలో ఎవరికీ అంతుచిక్కని ఒక పర బ్రహ్మ స్వరూపం, తన శక్తితో సృష్టి ప్రక్రియను ప్రారంభించాడని, ఆ శక్తికి అతీతమైంది మరేదీ లేదని పేర్కొన్నారు.

‘సృష్టికి పూర్వం అంతా శూన్యమే. అంతా చీకటిమయం. అంతటా జలమయం. సృష్టి ఎలా, ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదు. అన్నీ తెలిసిన పండితులకు (తెలుసును అనుకున్న పండితులకు కూడా!), మేధావులకు కూడా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే వారంతా సృష్టి తర్వాతే పుట్టారు కనుక. సృష్టికి కారకుడైన ఆ శక్తే సృష్టిని కొనసాగిస్తున్నదా, లేక, మరెవరన్నా చేస్తున్నారా? అనేదీ అంతుచిక్కని విషయమే. అసలా శక్తికి కూడా తెలుసో, లేదో?’ అని అన్నారాయన.

జస్టిస్ ఎస్ యు ఖాన్ తీర్పు ఆరంభం చేసిన విధానం అది చదివినవారికే తెలుస్తుంది. అవతారిక, ముందుమాటలతో ఆరంభించారాయన. తీర్పు పాఠం మధ్యలో కార్ల్ మార్క్స్ ప్రస్తావన తెచ్చారు. చరిత్ర గమనానికి భాష్యం చెప్పిన మార్క్స్ వాదనను కేవలం ఆర్థిక స్థితిగతులకు మాత్రమే అనుసంధానం చేయడం సబబు కాదంటారు. ఆయన ప్రవచించిన విధానంలో పాక్షికంగానైనా వాస్తవం లేదని వాదించడం అపాయ కరం (పెరిలియస్) అంటారు. రాముడంటే త్యాగానికి మారు పేరని, ఆయన గుణగణాల్లో త్యాగానికే ప్రాధాన్యత అధికమని అంటారు జస్టిస్ ఖాన్. అందుకే, ఇందుకే, శ్రీరామచంద్రమూర్తికి, సీతాదేవికి, శ్రీరామనవమినాడు భద్రాచలంలో కల్యాణమంటే ఆబాలగోపాలానికి ఆధ్యాత్మికతతో కూడిన ఆసక్తి. ప్రవరలు, గోత్రాలు పట్టించుకునే ఆలోచన కూడా రాదు. ఇంకా చెప్పాలంటే, ఆలోచన కలగకుండా చేశారు అర్చక మహాశయులు. ధన్యవాదాలు.