Saturday, February 18, 2012

ఆర్థిక మంత్ర (త్రి) పఠనం: వనం జ్వాలా నరసింహారావు


నెల్లూరు జిల్లా బెజవాడ గోపాలరెడ్డి నుంచి అదే జిల్లాకు చెందిన ఆనం నారాయణరెడ్డి వరకు
వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపధ్యంలో, ఆదాయ వనరులు అంతగా ఆశాజనకంగా లేని తరుణంలో, "రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కుంటున్న నేపధ్యం" లో,  "వర్షాభావ పరిస్థితులు చోటు చేసుకున్న తరుణం" లో, ఆటుపోటులకు ఎదురు నిల్చి-సాహసోపేతంగా ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర శాసనసభలో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందరూ ఊహించినట్లే లక్షా నలబై ఐదు వేల కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్‌ను రూపొందించడంతో పాటు వ్యయాన్ని కూడా లక్షకోట్లు మార్కు దాటినట్లు ప్రకటించడం విశేషం. ప్రణాళికేతర వ్యయం రు. 91 లక్షల కోట్లుగా, ప్రణాళిక వ్యయం రు. 54 లక్షల కోట్లుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో మొట్ట మొదటిసారి "పేపర్ లెస్ బడ్జెట్‌ను" ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆనం రామనారాయణరెడ్డికి దక్కింది. ఉపాధి కల్పనకు, రాజీవ్ విద్యా ఉపాధి మిషన్‌కు, రాజీవ్ యువ కిరణాలకు పెద్ద పీట వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏటేటా సాగుతున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి (త్ర) పఠనకు ఏబైఏడేళ్ల సుదీర్ఘ చరిత్ర వుంది.

బడ్జెట్‌లో పన్నుల ప్రస్తావన లేకపోయినప్పటికీ, పరోక్షంగా చెప్పకనే చెప్పారు మనసులో మాట ఆర్థిక శాఖామాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి. ఉదాహరణకు వాణిజ్య పన్నుల శాఖ ఆదాయాన్ని పెంచుకుంటామని అనడం అంటే, పన్నులు విధించబోతున్నట్లే కదా! మద్యం అమ్మకాల ద్వారా మరి కొన్ని కోట్ల అదనపు వనరుల సేకరణ జరుపుకుంటాం అని చెప్పడమంటే, ప్రజల నెత్తిన మరికొంత భారాన్ని వేయడమే కదా! మరి, ఇవేవీ లేకుండా లక్షా నలబై ఐదు కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించడమంటే, కనీసం రాష్ట్రాన్ని రుణ వూబిలోకి నెట్టడమే కదా! ఆదాయ వనరుల సేకరణ సజావుగా సాగడానికి, పన్నులన్నా వుండాలి, అప్పులన్నా చేయాలి. ఈ రెండింటి లో ఏం చేయదల్చుకున్నారో ఆర్థికామాత్యులు ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, చెప్పదల్చుకున్నది దాచగలిగినా, చెప్పకుండా మాత్రం వుండలేకపోయారు.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి, నేటి వరకూ: 1955-56 నాటి బెజవాడ గోపాలరెడ్డి ప్రసంగం నుంచి 2012-2013 ఆనం రామనారాయణరెడ్డి ప్రసంగం వరకు, ఆసక్తికరంగా పరిశీలించుకుంటూ-పరిశోధించుకుంటూ పోతే, అర్థశాస్త్రంలో-సామాజిక-రాజకీయ శాస్త్రాలలో ఎంతో మంది డాక్టరేట్లు పొందే అవకాశం వుంది.

ఏక కాలంలో, జరిగిపోయిన సంవత్సరం ఆదాయ వనరులను సమీక్షించుకుంటూ, రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ-వ్యయ అంచనాలతో మొదలవుతుంది బడ్జెట్ ప్రసంగ ఉత్సవాల సంరంభం. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అవసరాలు, ఆదాయ వనరులకు సంబంధించిన గణాంక వివరాలే బడ్జెట్. సంక్షిప్త బడ్జెట్, అర్థశాస్త్ర పరిశీలన, సంవత్సర వార్షిక ప్రణాళిక, శాఖలవారీ వివరాలు, బడ్జెట్ విశ్లేషణ, ఇలా ఎంతో సమాచారాన్ని ఒకప్పుడు పుస్తకాల ద్వారా, ఇప్పుడు పేపర్ లెస్ ప్రక్రియ ద్వారా, తయారుచేసి, సంబంధిత లెక్కలను బహిర్గతం చేస్తుంది ప్రభుత్వం. ఇవన్నీ ఒక ఎత్తైతే, బడ్జెట్‌ను ప్రవేశపెట్తూ, ఆర్థిక మంత్రి చేసే ప్రసంగం మరో ఎత్తు. ఒక్కో ఆర్థిక మంత్రి, ఒక్కో రకంగా, తనదైన విశిష్ట శైలిలో, సభ్యులను-ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించే పలువురిని ఆకట్టుకునే రీతిలో, బడ్జెట్ ప్రసంగాన్ని తయారు చేసుకుంటారు. ఆయన ప్రసంగాన్ని, ఆ సమయంలో ఆయన ప్రదర్శించే మానరిజమ్స్ ను ఆసక్తిగా గమనిస్తుంటారెందరో. ఆర్థిక మంత్ర(త్రి) పఠనంలో, శ్లోకాలలోని బీజాక్షరాలలా, ప్రతి ఒక్క వాక్యానికి, బలీయమైన అర్థం-కారణం వుంటుంది. ఒక్కో సారి భావగర్భితంగా, నిగూఢంగా, స్పటికంలా కఠినంగా వుంటాయి మాటలు.

బెజవాడ గోపాలరెడ్డి జులై 8, 1955న చేసిన తన తొలి బడ్జెట్ ప్రసంగంలో నాటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రస్తావన తెచ్చారు. పంచవర్ష ప్రణాళికల ప్రస్తావన తెచ్చి, దేశ చరిత్రలో అవి ఒక నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టాయన్నారు. మార్చ్  2, 1956 న చేసిన ఆ తరువాతి ప్రసంగంలో "విశాలాంధ్ర" గురించి ప్రస్తావించారు. ప్రప్రధమ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన ఘనతా ఆయనదే. రెవెన్యూ ఖాతా కింద మితిమీరిన వ్యయాన్ని చూపించి, భావితరాల వారిపై రుణభారం మోపడం ఏ మాత్రం సమంజసం కాదని ఆయన ఆనాడన్న మాటలు నేటికీ వరాల మూటలు. ఆంధ్ర ప్రాంతంలో సరితూగేలా తెలంగాణ ప్రాంత అభివృద్ధి అచిర కాలంలోనే జరగాలని, ఈ లక్ష్య సాధనకు ఆదిలో అదనంగా వ్యయం చేయాల్సి వుంటుందని, తెలంగాణ ప్రాంతంలో వసూలైన ప్రతి పైసా ప్రత్యేకంగా లెక్క కట్టి, తెలంగాణ నిధులను తెలంగాణకే ఉపయోగించుతామని ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారప్పుడే! "తెలంగాణ ప్రాంతం వారికిచ్చిన వాగ్దానాలను గుర్తుంచుకోవడమే కాదు అమలు పరుస్తాను" అని బెజవాడ గోపాలరెడ్డి స్పష్టం చేసారు.  రాజనీతిజ్ఞతతో ఆనాడు బెజవాడ గోపాలరెడ్డి తెలంగాణ ప్రాంతానికిచ్చిన వాగ్దానాన్ని కాని, భావితరాల వారిపై రుణభారం మోపడం తప్పన్న విషయాన్ని కాని, రాష్ట్ర ప్రణాళిక విషయం కాని ఈ నాటి నేతలు గుర్తుంచుకుంటే అంతకన్నా ఏం కావాలి?ఎనిమిదవ సారి, ఆర్థిక మంత్రిగా చివరిసారి, (మద్రాస్ శాసన సభలో నాలుగు సార్లు, ఆంధ్రలో రెండు సార్లు, ఆంధ్ర ప్రదేశ్‌లో రెండు సార్లు) 1958-59 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 26, 1958 న బడ్జెట్ ప్రసంగం చేశారు బెజవాడ గోపాలరెడ్డి. అదే రాష్ట్రానికి సంబంధించినంతవరకు ప్రప్రధమ మిగులు బడ్జెట్. ఇక ఆ తరువాత "కాసు పర్వం" మొదలైంది. "పరిమిత రెవెన్యూ ఆదాయంతో, మితిమీరిన ప్రభుత్వ రుణభారంతో, బంగారు భవిష్యత్‌పై ఊహాగానాలతో" రాబోయే ఏడాది గురించి మూడు ముక్కలతో కాసు బ్రహ్మానందరెడ్డి 1959-60 సంవత్సరపు ఆర్థిక మంత్ర పఠనం మొదలైంది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, పిడతల రంగారెడ్డి లాంటి ఉద్దండ పిండాలు కూడా అదే తరహాలో ప్రసంగాలు తమదైన శైలిలో చేశారు. అదే ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది.

ఇంతకీ ఏమిటీ బడ్జెట్? ఇది కేవలం ఆర్థిక శాఖకు సంబంధించిన అంశమేనా? ఇతరులకు దాని విషయంలో-వివరాలు తెలుసుకోవడంలో ఏ అవసరం లేదా? ఇలాంటి ఆలోచనలన్నీ అపోహలే. బ్రిటన్ ఆర్థిక మంత్రిని "ఛాన్సలర్ ఆఫ్ ద ఎక్స్ చెక్కర్" అని సంబోధిస్తారు. ఆయన ప్రతి ఏడాది, రాబోయే ఆర్థిక సంవత్సరపు ఆర్థిక అవసరాలు, ఆదాయ-వనరుల వివరాలున్న కాగితాలను "చిన్న తోలు సంచీ” లో వేసుకుని, పార్లమెంటుకు వెళ్లే ఆచారం అనాదిగా జరుగుతోంది. ఫ్రెంచ్ భాషలో బడ్జెట్ అంటే "చిన్న సంచీ" అని అర్థం అంటారు కొందరు. మనది బ్రిటీష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వారసత్వం. వాస్తవానికి చాలా విషయాలలో, బ్రిటీష్ కాలం నాటికీ, నేటికీ, బడ్జెట్ స్వరూప-స్వభావాలలో విప్లవాత్మకమైన మార్పులు అంతగా లేవంటారు ఆర్థిక నిపుణులు. చంద్రబాబునాయుడు కాలంలో "జీరో బేస్డ్‌ బడ్జెట్" అని పిలిచినా, ఇప్పుడు "పేపర్ లెస్" అని పిలిచినా, బడ్జెట్ స్వరూపం మాత్రం, తెలుగు దేశమైనా-కాంగ్రెస్ పార్టీ ఐనా, రేపు మరో పార్టీ అధికారంలోకి వచ్చినా కాపాడడం తప్పనిసరి అని భావించక తప్పదు. ప్రణాళికా కేటాయింపులంటే ఏమిటి? కేంద్రం విడుదల చేసే నిధులకు, మాచింగ్ గ్రాంట్‌లకు ఒక తీరు-తెన్ను అనేది వుందా? ఏ రంగానికి-ఎప్పుడు-ఎందుకు-ఎంత మేరకు నిధుల కేటాయింపులు పెంచాలి, లేదా, తగ్గించాలి అన్న విషయం గురించి సవివరమైన అధ్యయనం వుందా? వాస్తవ పరిస్థితులకు, ఎన్నికలలో చేసిన వాగ్దానాలకు, అనుకోకుండా ఎదురయ్యే సమస్యలకు, బడ్జెట్ అంచనాలకు-ఏడాది చివరలో జరిగిన వ్యయానికి పొంతన అనేది వుంటుందా? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఎప్పుడూ దొరకదు. ఐనా, ఏటా ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వ ఆర్థిక శాఖామాత్యుడు, బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం ఆగదు. బడ్జెట్ బాగా లేదని ప్రతిపక్షాల విమర్శలు, బాగుందని స్వపక్షాల పొగడ్తలు ఎప్పుడూ పరిపాటే. పన్నులు విధించని ప్రభుత్వం వుండదు. వేసినందుకు విమర్శించని ప్రతిపక్షమూ వుండదు. చివరకు, ఇవన్నీ ఒక పక్కకు పోయి, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌కే, శాసన సభ ఆమోదం లభించడం ఖాయం. ఇటీవలి కాలంలో చర్చ జరగకుండానే "గిలెటిన్" పద్ధతిన సభ ఆమోదం లభిస్తోంది.

ఈ నేపధ్యంలో, బడ్జెట్ స్వరూప-స్వభావాలు, పుట్టు-పూర్వోత్తరాలు, పూర్వా-పరాలు, తెల్సుకోవడం అవసరం. భారత రాజ్యాంగంలోని 266(3) ప్రకరణ, ప్రభుత్వ వ్యయంపై అటు లోక్ సభ-ఇటు శాసన సభల ఆధిపత్యాన్ని-నియంత్రణను స్పష్టం చేస్తుంది. మన రాష్ట్రం విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నియమ-నిబంధనల సంపుటి (మాన్యువల్) లోని మూడు భాగాలు స్థూలంగా ఈ విషయాలను తెలియచేస్తాయి. మొదటి భాగంలో బడ్జెట్‌ను ఎలా రూపొందించాలనేది, రెండులో వివిధ పత్రాలను క్షేత్ర స్థాయి నుండి సచివాలయం వరకు తెప్పించుకునే విధానం, మూడులో అనుబంధాలకు సంబంధించిన సమాచారం వుంటుంది. ప్రభుత్వ ఖాతాలకు చెందిన పద్దులు ఎలా వుండాలి? ఖాతా పద్దు-శీర్షిక (హెడ్ ఆఫ్ అకౌంట్) అంటే ఏమిటి? మేజర్-మైనర్ హెడ్ అంటే ఏమిటి? అనే అంశాలు కూడా వుంటాయి. బడ్జెట్ మాన్యువల్ లోని నియమాలను "పేరాలు" అని పిలుస్తారు. బడ్జెట్‌కు సంబంధించిన మరి కొన్ని వివరాలు అకౌంట్స్ కోడ్‌లోను, ఫైనాన్షియల్ కోడ్‌లోను వుంటాయి.

ప్రభుత్వం అంటే అతిపెద్ద వ్యవస్థ. అందులో వివిధ శాఖలు, ఉప శాఖలు, వందల-వేల సంఖ్యలో కార్యాలయాలు, వీటి ద్వారా ప్రజలకు చేరాల్సిన లక్షలాది పనులు వుంటాయి. వీటన్నిటి నిర్వహణకు, రకరకాల కార్యక్రమాల అమలుకు, వనరుల సేకరణ జరగాలి. అందుకే బడ్జెట్‌ను, "వార్షిక ఆర్థిక వివరణ", "వార్షిక విత్త వివరణ" గా పిలుస్తారు. వివిధ శాఖల అవసరాల మేరకు, ఆయా శాఖాధిపతుల సూచన మేరకు ఆర్థిక శాఖ రూపొందించిన బడ్జెట్ కేటాయింపులకు శాసనసభ ఆమోదం తప్పనిసరి. బడ్జెట్‌ను మూడు రకాలుగా విభజించుతారు. "సంచిత నిధి", "ఆకస్మిక వ్యయ నిధి", "ప్రభుత్వ ఖాతా" అని వీటిని అంటారు. వివిధ శాఖల ద్వారా ప్రభుత్వానికి సమకూరే నిధులు-వనరులు, పన్నుల రూపేణా వచ్చే ఆదాయం, పన్నుల రూపేణా కాకుండా వచ్చే ఆదాయం, రుణ సేకరణ నిధులు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం లాంటివి "సంచిత నిధి" కిందకు వస్తాయి. ఒక శాఖ నుంచి వచ్చే నిధులు-వనరులు ఆ శాఖకే ఖర్చు చేయాలని నియమం లేదు. ఐన వసూల్లన్నీ సంచిత నిధి కిందకు జమ అవుతాయి. అలా సమకూరిన నిధులను బయటకు తీసి ఖర్చు చేయాలంటే శాసన సభ ఆమోదం కావాలి. కొన్ని సందర్భాలలో, కొన్ని పథకాలను, అత్యవసరంగా రూపొందించి అమలు చేయాల్సిన అవసరం కలగవచ్చు. ఆర్థిక సంవత్సరం మధ్యలో కాని, బడ్జెట్లకు శాసనసభ ఆమోదం పొందిన తరువాత కానీ, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగని పథకానికి ఖర్చు చేయాల్సిన అవసరం కలగవచ్చు. ఇందుకొరకు రాజ్యాంగపరంగా కలిగించిన వెసులుబాటునే "ఆకస్మిక వ్యయ నిధి" అంటారు. ఇదొక రకమైన శాశ్వత అడ్వాన్స్. ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే "కార్పస్" లాంటిది. పథకాల అమలుకు దీని నుండి తీసుకుని, ఆ తరువాత అనుబంధ బడ్జెట్‌లో మంజూరు చేయించుకుంటుంది ప్రభుత్వం. వాడుకున్న మొత్తాన్ని తిరిగి అందులో జమ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక రకమైన బాంక్ లాంటిది. బాంకర్‍గా కొన్ని లావాదేవీలుంటాయి. ఉద్యోగుల భవిష్యత్ నిధికి, భీమా ప్రీమియంకు, కాంట్రాక్టర్ల నుండి సేకరించాల్సిన డిపాజిట్ల వంటివి "ప్రభుత్వ ఖాతా" లో జమ చేస్తుంది ప్రభుత్వం. ఏదో ఒక రోజున ఆ డబ్బును తిరిగి వాపస్ చేయాల్సి వుంటుంది. అందుకే దీనిని వేరే ఖాతాగా చూపించడం జరుగుతుంది.

సంచిత నిధిలో మూడు ఖాతాలుంటాయి. రెవెన్యూ, మూల ధనం, రుణ ఖాతాలుగా వీటిని పిలుస్తారు. ప్రభుత్వ నిర్వహణ కయ్యే ఖర్చులన్నీ రెవెన్యూ ఖాతా నుంచి చేస్తారు. భవనాల, రహదారుల నిర్మాణానికి, ప్రాజెక్టుల-ఇతర రకాల ప్రజల మేలుకోరి చేసే పనులకొరకు కావాల్సిన పెట్టుబడులను మూల ధనం ఖాతాలోకి చేర్చుతారు. గత సంవత్సరం రెవెన్యూ ఖాతాలోకి రావాల్సినవి మరుసటి సంవత్సరం వస్తే అవీ మూల ధనం ఖాతాలోకే పోతాయి. రుణ ఖాతాలోకి చేసిన అప్పులు, విడుదల చేసిన రుణాలు వస్తాయి. స్థానిక సంస్థలకు, రైతులకు ప్రభుత్వం విడుదల చేసే రుణాలన్నీ రికవరీ వివరాలతో సహా రుణ ఖాతా లోకి చేరతాయి. ప్రభుత్వానికి చెందిన ఆదాయ-వ్యయాలన్నీ ఈ మూడు విభాగాల్లోనే వుంటాయి. బడ్జెట్ పరంగా "సెక్టోరియల్ క్లాసిఫికేషన్" (వర్గీకరణ) పేరుతో ప్రభుత్వ శాఖలను నాలుగు తరగతులుగా విభజించుతారు. అవి: సాధారణ సేవల శాఖలు, సాంఘిక-సామాజిక సేవల శాఖలు, ఆర్థిక సేవల శాఖలు, ఆర్థిక సహాయక సేవల శాఖలు. ఈ సేవలన్నీ ఖాతాలలో పద్దుల రూపేణా చూపించడానికి మరో రకమైన విభజన వుంటుంది. వివిధ రకాలైన పద్దులను "మేజర్, మైనర్" హెడ్‌లుగా పిలుస్తారు. బడ్జెట్ పరిభాషలో వీటిని "ఏడంచెల" విభజన అంటారు. మొదటి అంచెలో ఏ శాఖ ఏ విభాగం కిందకు వస్తుందో నిర్ణయిస్తారు. ఆ శాఖకు ఒక నంబరు కేటాయిస్తారు. తదుపరి మిగిలిన ఐదు శాఖలను ప్రధాన పద్దు, అనుబంధ ప్రధాన పద్దు, చిన్న పద్దు, సవివరమైన పద్దులుగా పిలుస్తారు. కొత్తగా అనుబంధ సవివరణ పద్దును కూడా చేర్చారు. ఉదాహరణకు రెవెన్యూ ఖాతా పద్దులకు 1-1999 నంబర్లుంటాయి. ఒక్క హెడ్ ఆఫ్ అకౌంట్-ఖాతా పద్దు తెలుస్తే మిగిలినవన్నీ సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఈ విభజన మన ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు. అఖిల భారత స్థాయిలో అన్ని చోట్ల ఒకే రకంగా, యూనిఫాంగా వుంటాయి.

బడ్జెట్‌లో ఒక యూనిట్‌కు కేటాయించిన మొత్తాన్ని వినియోగం (అప్రోప్రియేషన్) అంటారు. బడ్జెట్ సంవత్సరం అంటే ఏప్రిల్ మొదటి తేదీ నుంచి వచ్చే సంవత్సరం మార్చ్ 31 వరకు. ఏ సంవత్సరానికి ఆమోదించిన మొత్తాన్ని అదే సంవత్సరం ఖర్చు చేయాలి. చేయక పోతే మురిగి పోతుంది. ప్రతి శాఖ మంత్రి తన శాఖ నిర్వహణకు కొంత మొత్తాన్ని మంజూరు చేయాల్సిందిగా శాసన సభను కోరడాన్నే "డిమాండు" అంటారు. శాసన సభ ఆ డిమాండును ఆమోదించిన తరువాత దాన్ని "గ్రాంట్" అంటారు. ఇలా అన్ని శాఖల గ్రాంటులు కలిపి, బడ్జెట్ సమావేశాల చివరలో "ద్రవ్య వినియోగ బిల్లు" (అప్రోప్రియేషన్ బిల్) ప్రవేశ పెట్టి సభ ఆమోదం పొందుతారు. సభ ఆమోదం పొందిన దాన్ని "అప్రోప్రియేషన్ యాక్ట్" అంటారు. ప్రభుత్వం చేసే ప్రతి ప్రతిపాదనను క్షుణ్ణంగా చర్చించే అవకాశం-అధికారం శాసనసభ్యులకు వుంది. బడ్జెట్‍పై చర్చ ఇంకా ప్రారంభం కావాల్సి వుంది. ప్రారంభమైనా చర్చ పూర్తిగా కొనసాగుతుందా అనేది ప్రశ్నార్థకమే! చివరకు డిమాండ్లన్నీ ఎప్పటిమాదిరిగా గిలెటెన్ అయ్యే ప్రమాదమే ఎక్కువా కనిపిస్తోంది!

ఇంత సుదీర్ఘమైన ప్రక్రియలో బడ్జెట్‌ను రూపొందించి, ఆమోదం లభించినా "బడ్జెట్‌లో" చూపించింది ఖర్చు చేయరని, ఖర్చు చేసింది బడ్జెట్‌లో చూపించరని (What is budgeted is not spent and what is spent is not budgeted!) ఆర్థిక నిపుణులు అంటుంటారు. End



Friday, February 17, 2012

అలనాటి ఆర్థిక మంత్రుల బడ్జెట్ స్ఫూర్తి ఇదేనా?: వనం జ్వాలా నరసింహారావు


అలనాటి ఆర్థిక మంత్రుల బడ్జెట్ స్ఫూర్తి ఇదేనా?


రాష్ట్ర శాసనసభలో 2012-2013 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌లో పన్నుల ప్రస్తావన లేకపోయినప్పటికీ, పరోక్షంగా చెప్పకనే చెప్పారు మనసులో మాట ఆర్థిక శాఖామాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి. ఉదాహరణకు వాణిజ్య పన్నుల శాఖ ఆదాయాన్ని పెంచుకుంటామని అనడం అంటే, పన్నులు విధించబోతున్నట్లే కదా! మద్యం అమ్మకాల ద్వారా మరి కొన్ని కోట్ల అదనపు వనరుల సేకరణ జరుపుకుంటాం అని చెప్పడమంటే, ప్రజల నెత్తిన మరికొంత భారాన్ని వేయడమే కదా! మరి, ఇవేవీ లేకుండా లక్షా నలబై ఐదు కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించడమంటే, కనీసం రాష్ట్రాన్ని రుణ వూబిలోకి నెట్టడమే కదా! ఆదాయ వనరుల సేకరణ సజావుగా సాగడానికి, పన్నులన్నా వుండాలి, అప్పులన్నా చేయాలి. ఈ రెండింటి లో ఏం చేయదల్చుకున్నారో ఆర్థికామాత్యులు ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, చెప్పదల్చుకున్నది దాచగలిగినా, చెప్పకుండా మాత్రం వుండలేకపోయారు. అది ఆయన ఒక్కడి తప్పు కాదు. ఆ పాపం ఆనాటి నుంచీ నేటిదాకా కొనసాగిస్తున్న గత ప్రభుత్వాలది కూడా. ఏళ్ల తరబడి పాలన సాగించిన కాంగ్రెస్ ప్రభుత్వ రధ సారధులది, ఆ ప్రభుత్వాలలో పని చేసి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆయన పూర్వీకులది, కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మంత్రుల అడుగు జాడలలో నడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రులదీ కూడా! ఏదేమైనా కిరణ్ కుమార్ రెడ్డిని, ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కొంత అభినందించాల్సిందే.
కిరణ్ సర్కారు మానస పుత్రికలైన మూడు పథకాలు... యువజనులకు ఉపాధి సంక్షేమం, మహిళల కోసం స్త్రీ నిధి, రైతుల కోసం వడ్డీలేని రుణాలకు ఆర్థిక మంత్రి బడ్జెట్ ద్వారా సాధికారత కల్పించారు. కిరణ్ కుమార్ రెడ్డి-ఆనం రామనారాయణ రెడ్డిలు రాష్ట్ర బడ్జెట్‌ను సమ్మోహనాస్త్రంగా ప్రయోగించారు. ఎన్నికల నాటికి వైఎస్‌ను మరిపించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. "యువజనులు, స్త్రీలు, రైతులు" లక్ష్యంగా తీర్చిదిద్దిన బడ్జెట్ ఇది అన్న ముద్ర పడే విధంగా జాగ్రత్త పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంతో పాటు నిరుపేద వర్గాల కోసం ఆరోగ్య శ్రీ, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలకు ప్రాధాన్యం ఇవ్వగా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వాటిని కొంత మేరకు కొనసాగిస్తూనే, యువజనులు, రైతులు, మహిళలను ఆకట్టుకునే కొత్త పథకాలపై దృష్టిపెట్టారు. అలానే "రాజీవ్ యువ కిరణాల" కు పెద్ద పీట వేశారు. లక్షకు పైగా ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ చెప్తున్న ముఖ్యమంత్రి మాటలకు అనుగుణంగా కొత్త ఉద్యోగుల వేతనాలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు. అంటే చెప్పింది చెయ్యబోతున్నారన్న మాట. మహిళలకు పావలా వడ్డీని కూడా తీసివేసి "వడ్డీ లేని రుణాలు" ఇస్తామంటూ ప్రకటించారు. స్వయం సహాయ బృందాల సభ్యులు, రైతులు బ్యాంకుల నుంచి తెచ్చుకునే లక్ష రూపాయల లోపు రుణానికి జీరో వడ్డీ అని, రైతులు పావలా వడ్డీకే రూ.3 లక్షల వరకు రుణం తెచ్చుకోవచ్చని, దానికి అనుగుణంగానే బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. బడ్జెట్ అంకెల్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. రూపాయికే కిలో బియ్యం పథకం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. విద్యుత్ సబ్సిడీని పెంచారు. స్కాలర్‌షిప్‌‍లకు, ఫీజు రీ ఇంబర్స్ మెంట్‌కు, బీసీ సంక్షేమానికి, సాంఘిక సంక్షేమానికి, గిరిజన సంక్షేమానికి, మైనారిటీ సంక్షేమానికి, విద్య, వైద్యం, గృహ నిర్మాణంకు కేటాయింపులు కొద్ది మొత్తాలనుంచి, భారీ మొత్తాలకు పెంచడం జరిగింది. రాజకీయంగా పట్టు సాధించేందుకు "ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి" ని మరింత బలోపేతం చేశారు. ఇంతకీ ఈ కేటాయింపులలో వాస్తవికత ఎంత? బడ్జెట్‌లో కేటాయించిందే సంబంధిత శాఖలకు ఖర్చు చేస్తారా? కేటాయించని వాటి కింద అసలు ఖర్చే కాదా? అన్న ప్రశ్నలకు మళ్లీ వచ్చే ఏడాదే సమాధానం దొరకాలి. ఉదాహరణకు గత ఏడాది జలయజ్ఞంకు కేటాయించిన నిధులలో మూడు వంతులు మాత్రమే వినియోగించడం జరిగింది. మిగాతావి మురిగిపోయినట్లే కదా? అలా ఎందుకు జరిగిందో వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో, నీటి పారుదల రంగానికి, పాఠశాల విద్యకు అధికంగా కేటాయింపులు జరిగాయనేది వాస్తవం. అవి ఖర్చు చేస్తే మంచిదే!
ఇలా కేటాయింపులు చేయడం, రాజకీయాలను దృష్టిలో వుంచుకుని ప్రాధాన్యతలను నిర్ధారించడం, బడ్జెట్‌లో రాజకీయ ఉపన్యాసాలు చేయడం, ఆనవాయితీగా వస్తున్నదే. ఈ విషయంలో తెలుగుదేశం వారు, కాంగ్రెస్ వారు ఒకరికంటే మరొకరు మిన్న అని చెప్పక తప్పదు. ఉదాహరణకు 2001-2002 ఆర్థిక సంవత్సరానికి నాటి తెలుగుదేశం హయాంలో, అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్తూ, విజన్ 2020 భవిష్యత్ దర్శిని లక్ష్య సాధనకు కంకణం కట్టుకున్న తమ ప్రభుత్వ నిబద్ధతకు ప్రతిరూపమే ఆ సంవత్సరపు బడ్జెట్ అన్నారు. అప్పట్లో రాష్ట్ర వార్షిక ప్రణాళిక అంచనా తొమ్మిదివేల కోట్ల రూపాయల లోపే! కాకపోతే అప్పటికే రుణభారం సుమారు ఏబై వేల కోట్ల రూపాయలకు చేరుకునే సూచనలు ప్రస్ఫుటంగా కనిపించాయి. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికే వున్న ఆ రుణ భారం దిన-దినాభివృద్ధి చెంది, నేటికి తీర్చలేని స్థితికి చేరుకుంది. ఆర్థికాభివృద్ధి అంటే ఇదే! దీనికి ఏ ప్రభుత్వం నుంచీ సమాధానం లేదు-రాదు.
మన రాష్ట్రంలో శాసనసభలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి సుమారు అరవై ఏళ్ల చరిత్ర-నేపధ్యం వుంది. 1955-56 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి, నేటి వరకు, 57 పర్యాయాలు పలువురు ఆర్థిక మంత్రులు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. వారిలో రోశయ్య లాంటి కొందరు రికార్డు స్థాయిలో పదమూడు సంవత్సరాలు, బెజవాడ గోపాలరెడ్డి లాంటి వారు ఎనిమిది సంవత్సరాలు (మద్రాసు రాష్ట్రంతో కలుపుకుని) బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఘనత వుంది. జులై 8, 1955 న బెజవాడ గోపాలరెడ్డి మొట్టమొదటి సారిగా ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్తూ, రెవెన్యూ ఆదాయం కేవలం రు. 2, 198 లక్షలుగా, రెవెన్యూ వ్యయం రు.  2, 564 లక్షలుగా, రెవెన్యూ లోటు రు. 366 లక్షలుగా, నికర లోటు రు.  434 లక్షలుగా చూపించారు. ఇప్పటి లక్షన్నర కోట్ల రూపాయల బడ్జెట్లకు, లక్ష కోట్ల వ్యయానికి, నాటి బడ్జెట్లకు పోలికే లేదు! అలానే ఆయన, మరుసటి సంవత్సరం రాష్ట్ర శాసనసభకు బడ్జెట్ సమర్పిస్తూ చేసిన ప్రసంగం నేటికీ స్ఫూర్తిదాయకమే. దానిని ఎరలా తీసుకున్నా వాస్తవం తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం వుంది. మార్చ్ 2, 1956 నాటి ఆ బడ్జెట్ ఉపన్యాసంలో, విశాలాంధ్ర ప్రస్తావన తెచ్చారు బెజవాడ గోపాలరెడ్డి. విశాలాంధ్ర ఏర్పడితే అదే ఆయన ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్న చివరి బడ్జెట్ ప్రసంగం అని ప్రారంభించారు. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక రూపు దిద్దుకుంటున్న తరుణంలో రాష్ట్రాల పునర్విభజన నివేదికపై జరుగుతున్న చర్చల సారాంశాన్ని సభ్యులకు తెలియచేశారాయన. అలానే, తెలుగు మాట్లాడే వారందరికీ, ఒకే రాష్ట్రం వుంటే బాగుంటుందన్న విషయాన్నీ, వుండాల్సిన అవసరాన్నీ ఆయన స్పష్టం చేసారు (ఆయన భావాలతో నేను ఏకీభవిస్తున్నట్లు అర్థం కాదు). తన సుదీర్ఘ ప్రసంగంలో ఉద్దండ కవులైన అల్లసాని పెద్దన్న, బమ్మెర పోతన్న, రామరాజ భూషణుడు, తిక్కన సోమయాజిల పేర్లను ప్రస్తావిస్తూ, ఆ మహానుభావులు నడిచిన నేలలో నివసించే తెలుగు వారందరూ, వారి అడుగుజాడలలో ఐకమత్యంతో మెలుగుతారన్న విశ్వాసాన్ని బెజవాడ గోపాలరెడ్డి వెల్లడించారు. విశాలాంధ్ర స్థాపనకు కష్టాలు భరించాల్సి వుంటుందనీ, తరువాత బాధ్యతలు పెరుగుతాయనీ, ప్రజలు సర్దుబాటు ధోరణిలో మసలుకుంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన హెచ్చరించారా నాడే!
అంతటితో తన బాధ్యత తీరిందనుకోలేదు బెజవాడ గోపాలరెడ్డిగారు. ప్రప్రధమ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను జులై 3, 1957 న రాష్ట్ర శాసన సభలో ప్రవేశ పెట్టిన ఘనత కూడా ఆయనే దక్కించుకున్నారు. సాంప్రదాయానికి భిన్నంగా తన బడ్జెట్ ప్రసంగం వుంటుందని మొదలే విశదపర్చారాయన ఆనాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ప్రత్యేకించి తెలంగాణ ప్రాంత ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా వివరించి, దానిపైన శాసనసభ, పత్రికారంగం, దేశ ప్రజల స్పందన తెలుసుకోవాలనుకుంటున్నట్లు అన్నారు. రెవెన్యూ ఖాతా కింద మితిమీరిన ఖర్చును చూపడం ఆయన ఆనాడే వ్యతిరేకించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికో, విద్యుత్ ఉత్పాదన కొరకో, అప్పులు చేస్తే పరవాలేదని, శాంతిభద్రతలకు-ఆరోగ్య విద్యా సదుపాయాలకు-కమ్యూనికేషన్స్ రంగానికి, ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసి ఆ ఖర్చును భావితరాల వారిని భరించమనడం కన్నా, మనమే ఆ బరువు మోయడం సమంజసమని ఆయన అన్నారు. ఆయన ఉద్దేశం, ఫలితాలు ఇప్పుడు అనుభవించి, భారాన్ని కొడుకులకు, మనుమలకు, ముని మనుమలకు అందచేయడం తప్పుడు విధానమని. అలానే కేంద్ర ప్రభుత్వాన్ని కాని, రిజర్వ్ బాంకును కాని, రాష్ట్ర ఆర్థిక భారాన్ని మొత్తానికి-మొత్తం నెత్తిన వేసుకోమనడం సరైంది కాదని కూడా ఆయన ఆనాడే సూచించారు. ఇక్కడో చక్కటి మాట చెప్పారు. రాష్ట్రాలలో అమలు కావాల్సింది, ఇక్కడి ప్రభుత్వాలు అమలుపర్చే కేంద్ర ప్రణాళిక కాదని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రుణాలతో-నిధులతో-ఆర్థిక సహాయంతో అమలు పరిచే రాష్ట్ర ప్రణాళిక అని స్పష్టం చేసారు. మన ఆర్థిక వనరులతో, మన పన్నుల విధానంతో, పొదుపు చర్యలతో, స్వయంగా రుణాలు సమకూర్చుకోవడంతో, కేంద్ర ప్రభుత్వ సహాయానికి అదనంగా ప్రణాళికను రూపొందించుకోవాలని బెజవాడ గోపాలరెడ్డి అన్నారు.
ఆంధ్ర ప్రాంతంలో సరితూగేలా తెలంగాణ ప్రాంత అభివృద్ధి అచిర కాలంలోనే జరగాలని, ఈ లక్ష్య సాధనకు ఆదిలో అదనంగా వ్యయం చేయాల్సి వుంటుందని, తెలంగాణ ప్రాంతంలో వసూలైన ప్రతి పైసా ప్రత్యేకంగా లెక్క కట్టి, తెలంగాణ నిధులను తెలంగాణకే ఉపయోగించుతామని ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారప్పుడే! "తెలంగాణ ప్రాంతం వారికిచ్చిన వాగ్దానాలను గుర్తుంచుకోవడమే కాదు అమలు పరుస్తాను" అని బెజవాడ గోపాలరెడ్డి స్పష్టం చేసారు.
 రాజనీతిజ్ఞతతో ఆనాడు బెజవాడ గోపాలరెడ్డి చెప్పిన విశాలాంధ్ర విషయం కాని, తెలంగాణ ప్రాంతానికిచ్చిన వాగ్దానాన్ని కాని, భావితరాల వారిపై రుణభారం మోపడం తప్పన్న విషయాన్ని కాని, రాష్ట్ర ప్రణాళిక విషయం కాని ఈ నాటి నేతలు గుర్తుంచుకుంటే అంతకన్నా ఏం కావాలి?
ఈ నేపధ్యంలో అల నాడు తన జిల్లాకే చెందిన బెజవాడ గోపాలరెడ్డి బడ్జెట్ ప్రసంగాల స్ఫూర్తిని, ప్రవేశ పెట్టిన తీరును, ఈ నాటి ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంతవరకు అనుకరించారనేది నిర్ణయించాల్సింది పాఠకులే! 

Monday, February 6, 2012

పాలనా రథంలో సరిగమలు-పదనిసలు: వనం జ్వాలా నరసింహారావు


పాలనా రథంలో సరిగమలు-పదనిసలు
వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులు ప్రభుత్వంపై ప్రత్యక్ష-పరోక్ష యుద్ధం ప్రకటించారు. సిబిఐ జరుపుతున్న దర్యాప్తు వ్యవహార ప్రక్రియ కేంద్రంగా మొదలెట్టిన ఐఏఎస్‌ల సమరం దరిమిలా నేరుగా సర్కారుపైనే గురిపెట్టే వరకు పోయింది. వేల కోట్ల రూపాయల కుంభకోణంలో "సెక్షన్ ఆఫీసర్" స్థాయి నుంచి సెక్రటరీమంత్రుల-ముఖ్యమంత్రి(?) వరకు అంతో-ఇంతో అందరూ దంచుకుంటారన్న అర్థం స్ఫురించే రీతిలో మీడియా ముందు ఐఏఎస్‌ల యూనియన్ నాయకులు అక్కసు వెళ్లబుచ్చారు. పైగా ఈ విషయం మీడియాతో సహా అందరికీ తెల్సిందే అన్నట్లు మాట్లాడారు! వారి మాటలను బట్టి, తమలో (అధికారుల) కొందరితో సహా కొందరు అనధికారులు(మంత్రులు) భారీ మొత్తంలో అవినీతికి కారణమై వుండవచ్చనీ, అందరినీ సమ న్యాయంతో శిక్షించాలనీ అర్థం చేసుకోవచ్చు. తప్పు జరిగిన విషయం, పరోక్షంగానైనా నేరంలో పాలు పంచుకున్న విషయం ఒప్పుకున్నందుకు వారిని అభినందించాల్సిందే!

ఐతే, అసలు విషయం ఇంకొంత లోతుగా ఆలోచించాలి. అధికారుల-అనధికారుల మధ్య వుండాల్సిన సంబంధాలు, మంత్రివర్గ సమిష్టి బాధ్యత, కార్యదర్శి మంత్రికి ఫైలు పంపే విధానం, రొటీనా-ప్రత్యేకత సంతరించుకున్నదా? అన్న అంశాలను కూడా వారు ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. సిబిఐ జాయింటు డైరెక్టర్ వ్యవహార శైలినీ తప్పుబట్టారు. పాలనాపరమైన అంశాలలో ఆయనకు అవగాహన లేదంటూ కొన్ని ఉదాహరణలు చెప్పారు. జీవో ఇచ్చిన వాళ్లు దోషా? ఇప్పించిన వాళ్లు దోషా? అన్న మీమాంసలనూ లేవనెత్తారు. తెర వెనుక (ఏం జరిగిందో బయటపెట్టడానికి సిద్ధపడకపోయినా) ఎంతో తతంగం జరిగే ఆస్కారం గురించీ మాట్లాడారు ఐఏఎస్‌లు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాము ఎలాంటి పరిస్థితులలో "తప్పు" చేశారో చెప్పకనే చెప్పారు పాపం! మంత్రులు తీసుకునే "నిర్ణయాలను" తాము అమలు పరిచే వారమేనని "భాష్యం" చెప్పారు. స్వతంత్రంగా ఏ ఒక్క ఐఏఎస్ అధికారి నిర్ణయం తీసుకోలేరని మరో కొత్త సంగతిని బయట పెట్టారు. బిజినెస్ రూల్స్ ను, కోడ్ ఆఫ్ కండక్టును, బాధ్యతలను, మంత్రులు-కార్యదర్శులు-ముఖ్యమంత్రి ఎలా వ్యవహరించాలనే విషయాన్ని పూస గుచ్చినట్లు వివరించారు. ఇంతకూ తమదేమీ తప్పు లేదని, అంతా మంత్రులదే అన్న చందాన మాట్లాడారు. ఎవరు-ఎవరిని-ఎలా వేధిస్తున్నారన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ వ్యవహారమంతా అర్థం చేసుకోవడానికి ఐఏఎస్‌ల-మంత్రుల మధ్య ఎలాంటి అవగాహన వుండాలి, ఎవరు-ఎవరికి-ఎంత మేరకు జవాబుదారులు, నిర్ణయాల బాధ్యత సమిష్టి దా? కేవలం జీవోలను జారీ చేసినవారి దేనా? లేదా చివరగా "అప్రూవ్డ్‌" అని సంతకం పెట్టిన మంత్రి-ముఖ్యమంత్రిదా? అన్న ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలి.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఐఏఎస్ అధికారులలో ధిక్కారణ ధోరణి కొంత కనిపించింది. ఐతే, అది ఆయన మీద కాదు. ఆయన మంత్రివర్గ సభ్యులమీద మాత్రమే. అప్పట్లో చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులు తాము కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే జవాబుదారీ అన్న చందాన పనిచేయడం జరిగింది. దాని ఫలితమే ఇప్పుడు వారి ఆవేదనకు కారణమనొచ్చు. ఒకానొక సందర్భంలో, శాసనసభ ఆవరణలో, పలువురి సమక్షంలో, ఒక అమాత్యుడు, తన శాఖ కార్యదర్శి-శాఖాధిపతి (ఇద్దరూ ఐఏఎస్ అధికారులే) కుమ్మక్కై తనతో తప్పు చేయించారని బాహాటంగా విమర్శించారు. మరో మంత్రి, తన శాఖలో జరిగిన తప్పంతా అధికారుల మీద తోసేశాడు. ఇలా మంత్రులకు-అధికారులకు సంబంధాలు బెడిసికొట్టడం ఇప్పుడేమీ కొత్త కాదు. అనాదిగా జరుగుతున్నదే.

ఇలాంటి పరిణామాల నేపధ్యంలో, సివిల్ సర్వెంట్లకు-అమాత్యులకు మధ్య ఎలాంటి సంబంధాలుండాలనే చర్చ ఏనాడో మొదలైంది. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఐనందున, చాలావరకు బ్రిటీషు సాంప్రదాయాలనే పాటిస్తున్నాం, అనుకరిస్తున్నాం, అన్వయించుకుంటున్నాం. కాకపోతే ఆచరణలోకి వచ్చేటప్పటికి, మనదైన శైలిలో భాష్యం చెప్పుకుంటున్నాం. వారి మధ్య సంబంధాలంటే, ఎవరికి తోచిన సంప్రదాయాలను వారు పాటించడం కాదు. తమదే సరైందన్న వాదన వినిపించడమూ కాదు. "సివిల్ సర్వెంట్ల కర్తవ్యాలు-బాధ్యతలు" అన్న అంశంపై బ్రిటన్‌లో, 1985 లో, "ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండం" రూపొందించి, వారి మధ్య వుండాల్సిన సంబంధాలను అందులో పొందుపరిచారు. మరో పదేళ్ల తరువాత ఆ మెమొరాండంకు 1995 లో కొన్ని సవరణలు చేశారు. వాటిని ఆధారంగా చేసుకుని మనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను సమీక్షించడం సబబేమో! మెమొరాండంలో పేర్కొన్నట్లు, మంత్రులు చట్టసభలకు ఎలా జవాబుదారీ అవుతారో, అలానే, సివిల్ సర్వెంట్లు (ఐఏఎస్ అధికారులు) మంత్రులకు జవాబుదారీగా వుండాలి. అంటే, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు జవాబుదారీగా వుండడం అని అర్థం. ఏ రాజకీయ పార్టీ అధికారంలో వున్నా, తమ శాఖను నిర్వహిస్తున్న మంత్రి విశ్వాసాన్ని చూరగొనడం అధికారి ప్రధమ కర్తవ్యం. సంబంధిత మంత్రికి అవసరమైన తగు సూచనలిస్తూ, పాలనాపరమైన విధాన నిర్ణయాలలో సహకరిస్తూండాలి. తమ ఇష్టా-అయిష్టాలకు అతీతంగా, విధానాల రూపకల్పనలో-నిర్ణయాల అమలులో తోడ్పడుతూ, ఎన్నికలలో చేసిన వాగ్దానాలను వాస్తవం చేయాలి. మంత్రులందరూ విద్యావంతులు కానక్కరలేదు. కేవలం విద్యావంతులు మాత్రమే మంత్రులు కావాలని అనుకోవడమంటే, మంత్రి మండలి మరో "బ్యూరోక్రసీ" అవుతుంది కాని "డెమొక్రసీ" వ్యవస్థ కాదు. మంత్రుల నిర్ణయం కార్యదర్శుల-శాఖాధిపతుల సలహా-సూచనల మేరకే అన్నది అక్షర సత్యం.

ప్రభుత్వమంటే, సమిష్టి బాధ్యతతో వివిధ శాఖలను నిర్వహిస్తున్న మంత్రి మండలి, దాని అధినేత ముఖ్యమంత్రి. ఏ ఒక్క మంత్రి పొరపాటు చేసినా, బాధ్యత అందరిది అన్న విషయాన్ని మరిచిపోయిన నేటి కాలం మంత్రులు, బాహాటంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ముఖ్యమంత్రినీ తప్పుపట్టుతున్నారు. పాలనాపరమైన విధాన నిర్ణయాలలో మంత్రికి రాజ్యాంగపరంగా ఎంత బాధ్యత వుందో, సివిల్ సర్వెంట్లకూ అంతే బాధ్యత వుంది. సంబంధిత శాఖ మంత్రికి సివిల్ సర్వెంటు తోడ్పడడమంటే, తనకు తెలిసిన సమస్త సమాచారంతో పాటు, తన అనుభవాన్నంతా రంగరించి, నిజాయితీగా-నిష్పక్షపాతంగా-రాగద్వేషాలకు అతీతంగా, సలహాలు-సూచనలు ఇవ్వాలి. వారిచ్చే సలహా మంత్రి ఆలోచనా ధోరణికి భిన్నమైనదైనా, అనువైన-శ్రేష్టమైన సలహా ఇచ్చి తీరాల్సిందే! సివిల్ సర్వెంట్లు ఉద్దేశపూర్వకంగానో, మరే ఇతర కారణాలవల్లనో, అలా చేయకుండా, వేరే విధంగా చేసి మంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని జాప్యం చేసినా, తప్పుదోవపట్టించినా, అది అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమవుతుంది. ఇంతా జరిగిన తరువాత, ఇదంతా రికార్డు అయిన తరువాత, మంత్రి తీసుకునే నిర్ణయంపై అధికారికి ఎటువంటి అభిప్రాయభేదాలున్నా, అరమరికలు లేకుండా, చిత్తశుద్ధితో, ద్విగుణీకృతమైన పట్టుదలతో , ఆ నిర్ణయాన్ని అమలు చేసితీరాలని ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండం స్పష్టంగా చెపుతోంది. ఎమ్మార్ కుంభకోణంలోగాని, జగన్ అక్రమాస్తుల సంపాదన ఆరోపణల విషయంలోగాని, ఓబులాపురం గనుల వ్యవహారంలో కాని, ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ చేపట్టి దర్యాప్తు చేస్తున్న మరే అంశం విషయంలో కాని, అధికారుల-మంత్రుల మధ్య ఇదంతా ఎంతవరకు చోటుచేసుకున్నదనేది బహిర్గతం కావాల్సిన సమయం వచ్చింది. అధికారికీ-మంత్రికీ మధ్య ఆంతరంగికత, పరస్పర విశ్వసనీయత నెల కొన్నప్పుడే, ప్రభుత్వ పనితీరు, పాలనలో సమర్ధత, దక్షత, నైపుణ్యం, సామర్ధ్యం మెరుగుపడతాయి.

అధికారులు సరైన సలహాను సరైన సమయంలో ఇవ్వకపోయినా, తప్పు జరగడానికి ఆస్కారమున్న సలహాను ఇచ్చినా, మంత్రులను మభ్య పెట్టినా, మంత్రులకు తెలియకుండా అత్యంత రహస్య సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేసినా, దాని దుష్ప్రభావం సంబంధిత మంత్రులపైనా, యావత్ మంత్రి మండలిపైనా, ప్రభుత్వ పాలనా రధం పైనా, పడుతుంది. పర్యవసానం ఏదైనా తప్పొప్పులకు బాధ్యుడు మాత్రం మంత్రే. సివిల్ సర్వెంట్ల (ఐఏఎస్ అధికారుల) పై రాజకీయ ఒత్తిడుల ప్రభావం కూడా పడవచ్చు. రాజకీయ లబ్దికోసమో, వ్యక్తిగత ప్రయోజనాలకోసమో, తమ ఆలోచనా ధోరణికి అనుగుణంగా వుండే సలహాను మాత్రమే ఇవ్వాలని-అలాంటిదే పొందాలని, సివిల్ సర్వెంట్లపైనా ఒత్తిడులు వచ్చే అవకాశాలు చాలా సార్లు వస్తాయి. బ్రిటన్ లాంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిణితి చెందిన దేశాలలో ఇది అరుదుగా జరగొచ్చు. మన దేశంలో ఇలాంటివి చాలానే. వృత్తి ధర్మానికి వ్యతిరేకంగా-విరుద్ధంగా, ఐఏఎస్ అధికారులతో తప్పు చేయించే ధైర్యం ఎంతమంది మంత్రులకు వుంటుందనేది ప్రశ్నార్థకం. మంత్రి ప్రోద్బలం లేకపోయినా అలాంటి తప్పులు అధికారులు చేసే అవకాశాలు లేవా?

ఏదేమైనా ఇటీవలకాలంలో, అఖిల భారత సర్వీసులకు చెందిన "ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్" అధికారులు కొందరు వివాదాలలో చిక్కుకోవడం, రాజకీయ ప్రభావాలకు లోను కావడం, మంత్రులకు వంతపాడడం, బెడిసికొట్టినప్పుడు మంత్రులదే తప్పని వాదించడం, పక్షపాత వైఖరితో ఉద్యోగ ధర్మాన్ని విస్మరించడం, నైతిక విలువలను పాటించకపోవడం, అలవాటుగా మారిందన్న సంకేతాలొస్తున్నాయి. ఒక ఎస్. ఆర్. శంకరన్ లాగా పిలిపించుకునే వారిని వేళ్లమీద లెక్కించాల్సి వస్తోంది. కారణం: అత్యంత బాధ్యతతో కూడిన పదవులు అతి పిన్న వయసులోనే చేపట్టి నందువల్ల కావచ్చు. మారుతున్న రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు. సంప్రదాయాలను పాటించకపోవడం కావచ్చు. సివిల్ సర్వీసులలో సంస్కరణలు అమలు కాకపోవడం వల్ల కావచ్చు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.

"ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్" (ఐఏఎస్) ను సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి "ఉక్కు వ్యవస్థ" గా అభివర్ణించారు. స్వాతంత్ర్యానంతరం, ప్రభుత్వ విధి-విధానాల రూపకల్పనలో సహాయపడేందుకు, నిర్ణయాలను కట్టుదిట్టంగా అమలుపర్చేందుకు, చేయూతనందించేందుకు, పటిష్టమైన పాలనా యంత్రాంగం అవసరమైన నేపధ్యంలో "ఐఏఎస్" ఆవిర్భవించింది. అంతకుముందు ఆంగ్లేయుల పాలనలో ఆ పనిచేస్తూ వచ్చిన, "ఇండియన్ సివిల్ సర్వీస్" కు విప్లవాత్మకమైన మార్పులు-చేర్పులు చేసి, ఆ నమూనాలోనే ఈ వ్యవస్థను రూపొందించింది ప్రభుత్వం. ఈ సర్వీసుకు ఎంపికైన అభ్యర్థులు పౌర పరిపాలనలోను, విధానాల రూపకల్పనలోను-నిర్ణయాలలోను, ఆంతరంగిక-విదేశీ సంఘర్షణలను చాకచక్యంగా  అంచనావేసి నివారించడంలోను, కీలక పాత్ర పోషించ దగ్గ వ్యక్తులై వుంటారు. సాహిత్యం నుండి వైద్య శాస్త్రం వరకు విభిన్న రకాల విద్యలలో తమదంటూ ఒక ప్రత్యేకత వుందని నిరూపించుకున్న తెలివైన, బాధ్యతాయుతమైన, సమర్ధులైన అభ్యర్ధులను ఒక క్రమ పద్ధతి ప్రకారం, విస్తృతమైన-కఠినమైన పరీక్షా విధానం ద్వారా ఈ సర్వీసుకు ఎంపిక చేస్తుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్. ఇలా ఎంపికైన వారి ఉద్యోగాలకు రాజ్యాంగపరమైన భద్రత వుంటుంది. కార్య నిర్వహణ అధికారాల విషయంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఒత్తిడులకు లోను కావాల్సిన అవసరం కూడా లేదు. దేశ సమగ్రత-సార్వభౌమాధికారాన్ని పరిరక్షించేందుకు ఈ వ్యవస్థ అత్యంత ఆవశ్యకమని సర్దార్ పటేల్ అనేవారు.

ఐఏఎస్‌కు ఎంపికైన వారికి సబ్ కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు, కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ స్థాయి వరకు, పనిచేసే అవకాశం వుంది. ఇవన్నీ వారి-వారి సమర్ధతను బట్టి లభించాలి. కాని, ఇటీవల కాలంలో, పలు సందర్భాలలో అర్హతలు కాకుండా, పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుల అండతో, వారితో వీరికున్న చనువు ఆధారంగా పదవులు పొందుతున్నారన్న ఆరోపణలు అనేకం వస్తున్నాయి. "సమర్ధత" కన్నా, "చొరవ", "పలుకుబడి" ప్రాతిపదికలుగా, ప్రాధాన్యతల పోస్టులు దక్కించుకుంటున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ, మంత్రుల ఆదేశాలకు అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటూ తాత్కాలిక లబ్ది పొందుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గణనీయంగా పెరిగింది. దాని ఫలితం ఇప్పుడు తెలుస్తోంది. ఏదైనా పాలనాపరమైన నిర్ణయం ప్రజోపయోగం కొరకు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, అధికారులు, మంత్రుల ఆలోచనా ధోరణికి అనుగుణంగా నడుచుకోవడం "ఒత్తిడి" కిందకు రాదు. అది సరైన సమయంలో సరైన స్పందన అనాలి. అలా కాకుండా మంత్రుల వ్యక్తిగత ప్రయోజనాలకొరకు తల ఊపితే దాని ఫలితం అనుభవించక తప్పదు. "ఆన్ రికార్డ్" అభ్యంతరం చెప్పాలి. అలా జరిగిందో, లేదో, తెలుసుకునే ప్రయత్నమే సిబిఐ దర్యాప్తు అని భావించాలి. కాకపోతే, సిబిఐ ఎందుకు రాజకీయ నాయకులను విచారించడం లేదో అనేదే అంతుచిక్కని ప్రశ్నదోషులైన వారు రాజకీయ నాయకులైతే తప్పకుండా విచారణ జరగాలు. శిక్షార్హులు కావాలి.

ఐఏఎస్ అధికారులు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజం ఎత్తడం ఇదే మొదటి సారి కాదు. లోగడ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, దాదాపు ఇంతే మోతాదులో, రాష్ట్రం వేధింపులనుండి రక్షించమని, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి, జనవరి 1989 లో అలనాటి ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి, హెచ్ కే బాబు  ఫిర్యాదు చేశారు. కాకపోతే, అప్పట్లో ఫిర్యాదుకు కారణం, ఇప్పటి లాగా సిబిఐ వేధింపులు కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుండే ఏసిబి సంస్థ సుమారు నలభైమంది ఐఏఎస్‍లపై దర్యాప్తు చేపట్టడమే. అప్పట్లో ఐఏఎస్ అధికారులతో కొందరి ఐపిఎస్ అధికారులు కూడా జతగా తమ గోడు మీడియా ముందు వెళ్లబుచ్చుకోవడం విశేషం. రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం 1989 లో చేసిన ఫిర్యాదుకు స్పందించిన అప్పటి కేంద్ర హోం శాఖ కార్యదర్శి కల్యాణ కృష్ణన్ నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. ఆర్. నాయర్‌ను ఢిల్లీకి పిలిపించారు కూడా . ఇప్పుడు కూడా రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగును కలిసి సిబిఐ మీద ఫిర్యాదు చేసే ఆలోచనలో వుంది. ఏం జరుగనున్న దో వేచి చూడాలి. 

Saturday, February 4, 2012

ఎమ్మార్లోు రాజకీయ హస్తం లేదా?: వనం జ్వాలా నరసింహారావు


సూర్య దినపత్రిక (04-02-2012)
వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్ర రాజకీయాలకన్నా రంజుగా, పసందుగా, రసకందాయంలో సాగుతోంది సిబిఐ దర్యాప్తు. ఇలా రాయడమంటే సిబిఐని తప్పుపడుతున్నట్లు అర్థం తీస్తే అది వేరే సంగతి. గాలి జనార్దనరెడ్డి ఓబులాపురం గనుల అక్రమాలతో, ఎమ్మార్ కుంభకోణంతో, జగన్ అక్రమాస్తుల ఆర్జన నేరారోపణతో, వైఎస్ విజయమ్మ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడుపై వేసిన పిటీషన్‌తో, సిబిఐకి చేతి నిండా పని దొరికిందనాలి. ప్రభుత్వం చేయాల్సిన పని చేయకపోవడంతో, న్యాయస్థానాల జోక్యంతో ఈ మూడు కేసులు సిబిఐ చేపట్టాల్సి వచ్చింది. దర్యాప్తు కొనసాగుతున్న విధానం, ముద్దాయిలుగా ఇంతవరకు నిర్ధారించిన వారిని విచారించిన తీరు, అరెస్టుల తతంగం, సాక్షులుగా కొందరిని పిలిచి విచారించిన వైనం, వారిలో ఒకరిద్దరిని నిందితులుగా దరిమిలా పేర్కొన్న వ్యవహారం, ఒక కేసుతో సంబంధం వుందనుకున్నవారిని మరో కేసులో సాక్షిగానో-భవిష్యత్ ముద్దాయిగానో విచారించిన తీరు నిశితంగా పరిశీలించిన వారికి కొంత గందరగోళంగా కనిపించినా, విషయం మాత్రం అంతో-ఇంతో అవగతమవుతోందనే అనుకోవాలి. ఒక కేసుతో మరో దానికి "ముందు-వెనుకల అనుబంధాన్ని" అన్ని కేసుల పరిపూర్ణ దర్యాప్తు చివరలో నిర్ధారించే దిశగా విచారణ సాగుతోందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. గాలి కేసులో సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని పిలిచారు. ఎమ్మార్ కేసులో ముద్దాయిగానో-సాక్షిగానో పిలిచిన వారిలో జగన్ సన్నిహితుడు సునీల్ కుమార్ రెడ్డి వున్నారు. ఎమ్మార్‍లో సాక్షిగా పిలిచిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను ముద్దాయిని చేశారు. స్టయిలిష్ హోం అధినేతను అప్రూవర్‌గా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎమ్మార్ కేసులో చంద్రబాబును ఎందుకు ముద్దాయిని చేయడం లేదని ప్రశ్నిస్తున్న నేపధ్యంలో ఆయనపైనే మరో ఫిర్యాదు చోటుచేసుకుంది. చివరకు కనీసం కొందరన్నా ఒకదానికంటే ఎక్కువ కేసులలో ముద్దాయిలు కాక తప్పదేమో!.
ఈ నేపధ్యంలో ఇటీవల జరిగిన ఒకటి-రెండు సంఘటనలు ప్రసార-మాధ్యమాలలో ప్రముఖంగా చోటుచేసుకున్నాయి. అందులో ఒకటి వైఎస్ విజయమ్మ ఫలానా న్యాయమూర్తి ముందుకు చంద్రబాబు నాయుడుపై ఆమె వేసిన పిటీషన్ విచారణకు రాకుండా కోరిన వ్యవహారం. అలానే ప్రధాన మంత్రికి ఆమె రాసిన లేఖ. ఇంకోటి ఎమ్మార్ చార్జ్ షీట్‌లో ముగ్గురు ఐఏఎస్ అధికారులను ముద్దాయిలుగా పేర్కొనడం. మరో అంశం, ఒక మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా, పలువురు మాజీ-తాజా ఐఏఎస్ అధికారులను ఏదో ఒక కేసులో సాక్షులుగా (ప్రస్తుతానికి) విచారణకు పిలవడం. ఇదంతా చూస్తున్న కొందరు అధికారులు, తాము వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తప్పు చేశామా? ఒత్తిడులకు లొంగి చేయరాని పని చేశామా? తప్పు చేయకపోయినా తమను ఇరికించే ప్రయత్నం జరుగుతోందా? ఇలా సాగితే తమ పరువు-ప్రతిష్టలు ఏం కావాలి? అన్న మీమాంసలో పడిపోయారు. ఎమ్మార్ కేసులో ఇరికిన (పోనీ ఇరికించిన) ఎల్వీ సుబ్రహ్మణ్యం తానే తప్పు చేయలేదనీ, ఏదన్నా అర-కొర జరుగుతే ఆ చిన్న తప్పును భూతద్దంలో చూపే ప్రయత్నం సిబిఐ చేస్తోందనీ, సాక్షిగా తనను పిలిచి ముద్దాయిగా చేసారని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. వాస్తవానికి నీతి-నిజాయితీ పరుడైన అధికారిగా, ఏ ఫైలునైనా క్షుణ్ణంగా పరిశీలించకుండా నిర్ణయం తీసుకోని అధికారిగా, సమర్ధత-దక్షత గల అధికారిగా, ఎల్వీ సుబ్రహ్మణ్యంకు పేరుంది. ఆయన చేసింది నేరమే అయితే, ఆ నేరం వెనుకనున్న వ్యక్తుల సంగతేంటి? అన్న ప్రశ్నలనూ వేస్తున్నారు చాలామంది. కనీసం ఒక్కరన్నా-ఒక్కరు రాజకీయ నాయకుల పేర్లు ముద్దాయిల జాబితాలో లేకుండా ఎమ్మార్ కుంభకోణం కేసులో చార్జ్ షీట్ దాఖలైందంటే వింతగానే వుంది. ముద్దాయిలుగా పేర్కొన్న వారందరికీ శిక్షలు పడాలని లేదు. కాకపోతే, న్యాయస్థానంలో శిక్ష పడాలంటే, ముద్దాయిల జాబితాలో పేరుండి తీరాల్సిందే కదా! ఏ ఒక్క రాజకీయ నాయకుడి పేరు ఇంతవరకు లేదంటే, ఎమ్మార్ కేసులో శిక్షార్హుడైన రాజకీయ నాయకుడు ఒక్కరు కూడా లేదనేగా అర్థం? ఇదెక్కడి న్యాయం? ఇది ముద్దాయిలతో దోబూచులాటకాదా?
ఈ నేపధ్యంలో జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి వేసిన పిటీషన్‌పై విచారించిన సుప్ర్రేం కోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. టు. జి స్పెక్ట్రం కేసులో లైసెన్సులను రద్దు చేస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఇది ఒక విధంగా కార్పొరేట్ ప్రపంచాన్ని ఖంగు తినిపించిందనవచ్చు. లైసెన్సుల జారీలో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ సిపిఐ ఎల్‌ అనే స్వచ్ఛంద సంస్థ, జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కేసులో హోం మంత్రి చిదంబరంను కూడా సహ నిందితుడిని చేయాలంటూ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్‌ పై నిర్ణయాన్ని సుప్రీం కోర్టు గురువారం ట్రయల్‌ కోర్టుకే వదిలేస్తూ, విషయంపై ట్రయల్‌ కోర్టు రెండు వారాలలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇదిలా వుండగా, తీర్పు ప్రధానిని లేదా 2008లో లైసెన్సుల జారీ జరిగినప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఇప్పటి హోమ్‌ శాఖ మంత్రి పి చిదంబరాన్ని అభిశంసించడమే అవుతుందన్న వాదనను మాత్రం ప్రభుత్వం తిరస్కరించింది. ఇంత పెద్ద కుంభకోణంలో అధికారులను, ప్రత్యక్షంగా ఒకరిద్దరు మంత్రులను, పరోక్షంగా ప్రధానమంత్రిని తప్పుబట్టగా లేంది, మన రాష్ట్రంలో జరుగుతున్న అలాంటి వ్యవహారాలలో, కనీసం ఒక్క రాజకీయ నాయకుడినైనా తప్పుబట్టక పోవడం హాస్యాస్పదం.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్-సిబిఐ-ఆవిర్భావం, 1941లో భారత ప్రభుత్వం ద్వారా స్థాపించబడిన "స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్" తో ఆరంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో, యుద్ధానికి సంబంధించిన యుద్ధ సామాగ్రి కొనుగోళ్ల లావాదేవీలలో జరగడానికి ఆస్కారమున్న అవినీతి కేసుల దర్యాప్తుకే స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ బాధ్యతలను పరిమితం చేసింది ప్రభుత్వం. దరిమిలా, యుద్ధం ముగిసిన తరువాత, కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన అవినీతి ఆరోపణల కేసుల దర్యాప్తుకు మాత్రమే పరిమితం చేస్తూ, 1946 లో, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. క్రమేపీ, దాని పరిధిని యూనియన్ టెరిటరీలకు, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతో సంబంధిత రాష్ట్రాలకు విస్తరింపచేయడం జరిగింది. ఏప్రిల్ 1963 లో, హోం మంత్రిత్వ శాఖ తీర్మానంతో, దాని పేరును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మార్చడం జరిగింది. అలా పేరు మార్పిడి జరిగిన తొలిరోజులలో, కేవలం, కేంద్ర ప్రభుత్వ సిబ్బందిపై వచ్చిన అవినీతి ఆరోపణలు మాత్రమే విచారించడం దానికి అప్పజెప్పిన బాధ్యత. క్రమేపీ, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బందిని, బాంకుల జాతీయ కరణ తరువాత ఆ సిబ్బందినీ సిబిఐ పరిధిలోకి తెచ్చింది ప్రభుత్వం.
సిబిఐ వ్యవస్థాపక డైరెక్టర్ డిపి కొహిలి, దాని ఆవిర్భావపు రోజులలోనే, అదొక జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థగా ఎదుగుతుందని జోస్యం చెప్పాడు. ఆయన సుదీర్ఘ నేతృత్వంలో, ఇంతింతై-వటుడింతై అన్న చందాన, నేటి ఈ స్థితికి చేరడానికి అన్ని విధాల పటిష్టమైన పునాదులు వేశారాయన. సిబిఐ నుంచి అత్యున్నత ప్రమాణాల సమర్ధతను-దక్షతను, సత్యనిష్ఠను భవిష్యత్‍లో పౌరులు సిబిఐ నుంచి ఆశిస్తారని, వారి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాల్సిన బాధ్యత దానిపై వుందని కొహిలి అనేవారు. చిత్తశుద్ధితో, రాగద్వేషాలకు అతీతంగా, కష్టపడి పనిచేయాల్సిన విద్యుక్త ధర్మం కూడా అందులో పనిచేసే అధికారులపైనుందని ఆయన అభిప్రాయపడ్డారు. "లాయల్టీ టు డ్యూటీ" ని ఆయన ప్రబోధించారు. ఇవన్నీ ఎంతవరకు జరుగుతున్నాయనేది వేరే సంగతి. కాకపోతే, దీనిని మించిన చిత్తశుద్ధి గల దర్యాప్తు సంస్థలు మరేవీ లేవని ఘంటాపథంగా చెప్పొచ్చు. సిబిఐ డైరెక్టర్లుగా పనిచేసిన వారిలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన విజయరామారావు ఒకరు. 
1965 నుంచి ఆర్థికపరమైన నేరాల పరిశోధన అంశాన్ని కూడా సిబిఐ పరిధిలోకి తెచ్చింది ప్రభుత్వం. సిబిఐ వ్యవహరిస్తున్న నిష్పాక్షిక ధోరణిని, నైపుణ్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, దాని పరిధిని మరింత విస్తరించ సాగింది. హత్యా నేరాలు, కిడ్నాపులు, తీవ్రవాద కార్యకలాపాల లాంటి విషయాలలో కూడా సిబిఐతో దర్యాప్తు జరగాలన్న డిమాండు రాసాగింది. వ్యక్తులు, వ్యవస్థలు తమకు జరిగిందని భావిస్తున్న అన్యాయాల విషయంలో న్యాయం కలిగించమని కోర్టులను ఆశ్రయించినప్పుడు, కోర్టులు కూడా సిబిఐకి దర్యాప్తు అప్పచెప్తే స్థాయికి దాని పనితీరుకు గుర్తింపు వచ్చింది. ఈ నేపధ్యంలో 1987 లో సిబిఐ లో రెండు విభాగాలను ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఒకటి: అవినీతి నిరోధక విభాగం, మరొకటి: ప్రత్యేక కేటగిరీ నేరాల విభాగం. అలా పరిధి మరింత విస్తరించసాగింది. కాకపోతే, ఏ రాష్ట్రంలోనైనా, సిబిఐ ద్వారా దర్యాప్తు చేయాలంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరిగా వుండాలి. సుప్రీం కోర్టులకు, హైకోర్టులకు ఆ నిబంధన వర్తించదు, ఏ రాష్ట్రంలోనైనా, ఏ విషయంలోనైనా సిబిఐతో దర్యాప్తుకు కోర్టులు ఆదేశించవచ్చు. ఇప్పుడదే జరిగింది.
ఇదీ సిబిఐ నేపధ్యం. ఇలాంటి నేపధ్యం వున్న సంస్థ ఎవరికీ , ఏ విషయంలోనూ అన్యాయం చేయదన్న నమ్మకం, అటు ప్రభుత్వాలకూ, ఇటు పౌరులకూ ఇంతవరకూ కలిగిస్తూ వస్తుంది. మరి అలాంటప్పుడు, వైఎస్ విజయమ్మ ఎందుకలా ప్రధానికి వుత్తరం రాయాలి? రాసినందుకు తప్పు ఆమెదా? ఆ అవకాశం ఇచ్చిన సిబిఐ దా? జగన్మోహన్ రెడ్డిపై జరుగుతున్న దర్యాప్తును ఆమె తన వుత్తరంలో ఒక "రాజకీయ క్రీడ" గా పోల్చారు. తన తనయుడిని ఏదో ఒక తీరుగా అభాసుపాలు చేయడానికి, కేసుల్లో ఇరికించడానికి సిబిఐ ప్రయత్నిస్తోందని ఆరోపించిందామె. అవన్నీ ఉద్దేశపూర్వకంగానే సిబిఐ చేస్తోందంటున్నారు. జగన్ కేంద్రంలోనూ-రాష్ట్రంలోనూ ఎన్నడూ మంత్రిగా పనిచేయకపోయినా ఆయనను కేసుల్లో ఇరికించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడును ఎందుకు విచారించడం లేదన్న వాదనలనూ ఆమె లేవనెత్తారు. మరోవైపు రాష్ట్ర ఐఏఎస్ అధికారులలో అలజడి మొదలైంది. తమను అధికారులు పావులుగా వాడుకొని ఇప్పుడు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారిలో కొందరు కలిసి చర్చించుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఏదేమైనా, ఇంతవరకు నిష్పాక్షిక దర్యాప్తు సంస్థగా పేరు తెచ్చుకున్న సిబిఐ తన పేరును పది కాలాల పాటు నిలబెట్టుకోవాలి. అది చేస్తున్న దర్యాప్తు ఏ ఒక్కరికో, ఏ ఒక్క సంస్థకో వ్యతిరేకంగా కాదని, బహుళ ప్రయోజనాలను, ప్రజాహితాన్ని కోరి మాత్రమే అది దర్యాప్తు చేస్తుందని, దోషులు ఎంత పెద్ద వారైనా పట్టించి కోర్టు బోనులో నిలబెట్టుతామని నమ్మకం కలిగించాలి.

Wednesday, February 1, 2012

“సహ చట్టం” కమీషనర్ల ఎంపికలో "సంభావనా విధానం": వనం జ్వాలా నరసింహారావు


 వనం జ్వాలా నరసింహారావు

సమాచార హక్కు చట్టాన్ని అక్షరాలా తు. చ. తప్పకుండా అమలు పరచడానికి, హైకోర్టు ఆదేశాలమీద, ఎట్టకేలకు, ఎనిమిది మంది కమీషనర్లను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన త్రి సభ్య సంఘం ఎంపికచేసింది. ఇంకా మరొకరికి అవకాశం వుంది. ఎవరికోసం దీనిని ప్రస్తుతానికి ఖాళీగా వుంచారో, ఎప్పుడు భర్తీ చేస్తారో, అసలు చేయరో అన్న విషయం మిలియన్ డాలర్ల ప్రశ్న. (లాంఛనంగా గవర్నర్ ఆమోదముద్ర పడింది?). అంటే, ఈ ఎనిమిది మంది కమీషనర్లు, ఐదు సంవత్సరాల పాటు-లేదా వారికి అరవై ఐదు సంవత్సరాల వయసొచ్చేంతవరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాతో సమానమైన హోదా కలిగి బాధ్యతలను నిర్వహించుతారు. కమీషనర్లను ఎంపిక చేయడానికి ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్‌ చంద్రబాబు నాయుడు భేటీ అయి "ఏకగ్రీవం" గా వారిని ఎంపిక చేశారన్న వార్తలు ఎంతవరకు వాస్తవమోకాని, ఇంతవరకు ప్రతిపక్షనేత నుంచి, ఎలాంటి విమర్శలు అధికారికంగా మాత్రం వెలువడలేదు.

ఈ ఎనిమిదిని మందిని, ఎంతవరకు-ఏ మేరకు, సమాచార హక్కు చట్టంలో సూచించిన విధి-విధానాలకు అనుగుణంగా ఎంపిక చేశారనే విషయాన్ని పక్కన పెడితే, రాజకీయాలకు అనుగుణంగా, "సంభావనా విధానానికి", "పోషక విధానానికి" (అమెరికా దేశంలోని "స్పాయిల్స్ పద్ధతి") నూటికి నూరుపాళ్లు సరిపడే పద్ధతిలో మాత్రం ఎంపికచేసారనడంలో అతిశయోక్తి లేదు. అలానే వివిధ రంగాలకు చెందిన వారూ వున్నారన్న అర్థం స్ఫురించే రీతిలో జరిగిందీ ఎంపిక! అధికారులుగా పనిచేసిన వారు, అనధికారులుగా ముద్ర పడినవారు, సామాజిక కార్యకలాపాలలో పాలు పంచుకున్నట్లు అంతో-ఇంతో గుర్తింపు తెచ్చుకున్న వారు, వ్యవసాయ రంగంలో పేరు గడించినట్లు చెప్పుకో వీలున్న వారు, పాత్రికేయులు; కాపు, మాల, రెడ్డి, బీసీ, మాదిగ, మైనారిటీ వర్గాలకు చెందిన వారు; ....ఇలా రకరకాలుగా చెప్పుకోదగ్గ విధంగా సవివరంగా-సముచితంగానే ఎంపిక జరిగింది!. రాజకీయాలకు అచ్చు గుద్దినట్లు సరిపోయే విధంగా, రిజర్వేషన్లకు అనుగుణంగా, సామాజిక న్యాయం చేకూర్చే విధంగా, ఒక్క మాటలో చెప్పుకోవాలంటే సంభావనా విధానానికి, పోషక విధానానికి అద్దం పట్టే దిగా వుందీ ఎంపిక. ఇక సమాచార హక్కు చట్టం అమలు ఆ భగవంతుడికే తెలియాలి. వ్యక్తులుగా ఎవరి మీద సంధించిన విమర్శ ఇది కాకపోయినా, ఆయా రంగాలలో ఎంతో నిష్ణాతులైన వ్యక్తులనే ఎంపిక చేయాల్సిన కనీస బాధ్యతను విస్మరించిందే ప్రభుత్వం అన్న ఆరోపణ మాత్రం చేయకుండా వుండడం కష్టమే. ఏదేమైనా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకిష్టులైన వారిని ఎంపిక చేసుకోవడానికి, తనను ధిక్కరిస్తుండే ఉప ముఖ్యమంత్రిని, సాక్షాత్తు ప్రధాన ప్రతిపక్షనేతను, ఒప్పించ గలగడం అభినందించాల్సిన విషయమే. 

మెరికా దేశ రాజకీయాలలో అనాదిగా అనుసరిస్తున్న సాంప్రదాయిక-చట్టబద్ధ విధానాలలో "స్పాయిల్స్ సిస్టం" అత్యంత ప్రాధాన్యమైంది. దీన్నే అక్కడ "సంభావనా విధానం" గా, "పోషక విధానం" గా (పాట్రనేజ్ సిస్టం) పిలుస్తారు. ఈ విధానం ప్రకారం, అధ్యక్ష-ఇతర ఎన్నికలలో గెలిచిన అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఎన్నికలలో వారి విజయానికి కృషిచేసిన తమ పార్టీకి చెందిన ఓటర్లలో కొందరికి, వివిధ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో నియమిస్తారు. ఒక్కోసారి తమకు వ్యతిరేకంగా పనిచేసినా, తమతో పోటీ చేసి ఓడిపోయినా, తమ-తమ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్‍లో పనిచేస్తారన్న నమ్మకంతో, పదవులను కట్టబెడతారు. ఇలా పదవులను తమ వారికి కట్టబెట్టడంలో "మెరిట్" విధానానికి స్వస్తి పలకడం, తమకు అనుకూలురని భావించినవారికి మాత్రమే ఒక "బహుమానం" గా, ఇవ్వడం సాంప్రదాయం. ఇది అక్కడ అందరూ చేస్తుండే పనే. ఏ పార్టీ కూడా దీనిని ఆక్షేపించదు. "స్పాయిల్స్" అంటే "దోపిడీ ధనం" అని అర్థం. "గెలిచిన వాడిదే ఓడిపోయిన శత్రువుకు చెందిన దోపిడీ ధనం"  అని ఈ విధానానికి నిర్వచనం చెప్తూ, 1828 అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాట్ అభ్యర్థి జాక్సన్ విజయాన్ని పురస్కరించుకుని నాటి న్యూయార్క్ సెనేటర్ విలియం మెర్సీ వ్యాఖ్యానించారు. వారసత్వ పరంపరగా అధికారంలోకి వచ్చే ఆటవిక జాతుల, రక-రకాల నియంతృత్వ పోకడల ప్రభుత్వాలున్న దేశాలలో కూడా ఈ విధానం అమలులో వుంది. ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికాలో ఇదెందుకు అమల్లో వుందో అర్థంకాదు. అమెరికాలో అమల్లో వున్న ఈ పోషక విధానం, కేవలం చిన్న ఉద్యోగాలకే పరిమితం కాకుండా, అత్యంత ఉన్నత స్థాయి ఉద్యోగాల విషయంలో కూడా జరుగుతుంటుంది. ఇప్పుడదే జరిగింది సమాచార హక్కు చట్టం కమీషనర్లుగా ఎంపిక చేసిన వారి విషయంలో.

సామాన్యుల, ఆ మాటకొస్తే, అసామాన్యుల చేతికి సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధం లాంటిది. 2005 లో భారత పార్లమెంటు తెచ్చిన ఈ చట్టం అమలులో కొన్ని అవకతవకలున్నా, కొన్ని రాష్ట్రాలలో కొంత నిర్లిప్తత వున్నా, దేశవ్యాప్తంగా దాని పనితీరు గమనిస్తే, అంత నిరాశాజనకంగా అనిపించదనే అనాలి. భారతదేశంలోని ప్రతి పౌరుడి కీ, "పబ్లిక్ అథారిటీ" గా నిర్వచించిన ప్రతి సంస్థ-వ్యవస్థ నుండి, ఆచరణాత్మకంగా-అనుభవ పూర్వంగా, తమకు కావాల్సిన ఎలాంటి సమాచారాన్నైనా, ఒక క్రమపద్ధతి ప్రకారం రాబట్టుకొనే హక్కు కలిగించిందీ చట్టం. ప్రతి పబ్లిక్ అథారిటీ పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేసేందుకు వీలు కలిగించిందీ చట్టం. సమాచార హక్కు చట్టం అమలును సులభతరం చేయడానికి నిర్దేశించిన అనేక విధై విధానాలలో అత్యంత ప్రాముఖ్యమైంది కేంద్ర స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో "సమాచార కమీషన్ల" ఏర్పాటు. వాటితో నిబద్ధతతో పని చేయించడానికి పది మందికి మించకుండా సమాచార కమీషనర్ల-ఒక ప్రధాన సమాచార కమీషనర్ నియామకం. చట్టంలో పబ్లిక్ అథారిటీ అంటే ఏమిటో, సమాచారం అంటే ఏమిటో స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ప్రజాస్వామ్య-లౌకిక-సామ్యవాద-సార్వభౌమాధికార గణతంత్ర దేశంలో ఇవన్నీ పది కాలాల పాటు మనుగడ సాగించడానికి, భారత పౌరుడికి, తాను కోరుకున్న ప్రభుత్వ సమాచారం అందుబాటులోకి తేవాలన్న ఆకాంక్షే సహ చట్టం తేవడానికి కారణం. అవినీతి తొలగాలంటే, పాలితులకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా పాలన అందివ్వాలంటే, సహ చట్టం, త్రి కరణ శుద్ధిగా అమలు కావాలి. ఈ నేపధ్యంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, సహ చట్టం రాక ముందు-వచ్చిన తరువాత ప్రభుత్వేతర పరంగా గణనీయమైన ప్రగతి సాధించినప్పటికీ, ప్రభుత్వ పరంగా, కుంటి నడక నడుస్తుందనడంలో సందేహం లేదు. అల నాడు దివంగత ముఖ్యమంత్రి ఒక రిటైర్డు ఐఏఎస్ అధికారిని ప్రధాన కమీషనర్‌గా, రాజకీయాలతో ప్రత్యక్షంగానో-పరోక్షంగానో సంబంధం వున్న మరో ఇద్దరిని కమీషనర్లుగా, ఒక యువ పాత్రికేయుడిని ఇంకో కమీషనర్‌గా నియమించింది. వారి పని తీరు గురించి ఎవరి విశ్లేషణ వారే చేసుకోవచ్చు. మొత్తం మీద అంతో-ఇంతో సహ చట్టం అమలు మాత్రం జరిగిందనాలి.

రాజశేఖర రెడ్డి నియమించిన వారి పదవీ కాలం ముగిసిన తరువాత ఇంకా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా, బాధ్యతాయుతమైన పదవిలో వున్న మరో ఐఏఎస్ అధికారిని ప్రధాన కమీషనర్‌గా నియమించింది ప్రభుత్వం. అప్పట్లో అది వివాదాస్పదమైంది కూడా. ఆయనకు తోడుగా మరెవ్వరినీ నియమించక పోవడంతో గత కొద్ది కాలంగా కుంటి నడక నడుస్తున్న కమీషన్‌కు పూర్తి స్థాయిలో కమీషనర్ల నియామకం జరగాలని హైకోర్టు సూచించడంతో, ఆ ప్రక్రియను లాంఛనంగా పూర్తి చేసింది ప్రభుత్వం. ఒక రిటైర్డ్ ఐఎఫ్ఎస్‌ అధికారిని, మరో రిటైర్డ్ ఐపిఎస్‌ అధికారిని, అంతంత మాత్రంగా అతి కొద్ది సర్క్యులేషన్‍తో నడుస్తున్న ఒక దినపత్రిక సంపాదకుడిని, ఒక న్యాయవాదిని, (రాజకీయ) సామాజిక కార్యకర్తగా చెప్పుకుంటూన్న మరొకరిని, మరో (రాజకీయ) న్యాయవాదిని,  (రాజకీయాలలో వున్న) రిటైర్డ్ సివిల్‌ జడ్జిని,  విద్యావేత్తగా పిలిపించుకుంటున్న ఇంకొకరిని, పదవిలో వున్న ఒక ఐపిఎస్‌ అధికారిని  కమిషనర్లుగా నియమించారు. దీనికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు. వ్యక్తిగతంగా వీరందరూ పలుకుబడి కలిగిన వారే. కాని, సమాచారహక్కు చట్టం ఇలాంటి వారిని ఎంపిక చేయమని చెప్పలేదే! మరెందుకిలా జరిగింది? అందుకే దీనిని "అమెరికా తరహా స్పాయిల్స్ సిస్టం" అనాలి.

ఇంతకూ సహ చట్టం ఈ విషయంలో ఏం చెప్తోంది? మొదటిది: కేంద్రంలోను, రాష్ట్రాలలోను సమాచార కమీషన్ల ఏర్పాటు జరగాలి. రెండోది: ఆయా స్థాయిలలో ఒక ప్రధాన కమీషనర్‌ను, పది మందికి మించకుండా కమీషనర్లను నియమించాలి. మూడోది: ఈ సమాచార కమీషన్‌లకు స్వతంత్ర ప్రతిపత్తి వుండాలి. మరే ప్రభుత్వ సంస్థ నుంచి కూడా ఎలాంటి అధికారిక ఆదేశాలను-నిర్దేశాలను పాటించాల్సిన అవసరం లేదు. నాలుగోది: ప్రజా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగి, పేరు-ప్రఖ్యాతులు తెచ్చుకుని ప్రసిద్ధి చెందిన వారే కమీషనర్ల పదవులకు అర్హులు. అదనంగా, న్యాయ శాస్త్రంలో, విజ్ఞాన-సాంకేతిక శాస్త్రాలలోసామాజిక రంగంలో, యాజమాన్య రంగంలో, పాత్రికేయ వృత్తిలో, మాస్ మీడియా రంగంలో, పరిపాలనా రంగంలో, గవర్నెన్సులో నిష్ణాతులై వుండాలి. ఆయా రంగాలలో కేవలం "ప్రవేశం" కాకుండా, "ప్రావీణ్యం" వుండి తీరాలి. ప్రసిద్ధి చెందిన వారై వుండాలి. పార్లమెంటు ఉభయ సభలలో సభ్యులై వుండరాదు. ఏ "రాజకీయ పార్టీతో ను" సంబంధం వుండకూడదు.
అలాంటప్పుడు కేవలం ఒక పునరావాస కేంద్రంగా, ఏదో ఇతర నామినేటెడ్ పోస్టులను కట్టబెట్టినట్లుగా, సమాచార హక్కు చట్టంతో ఎలాంటి సంబంధం ఎన్నడూ ఏ విధంగా లేనటువంటివారిని, పదవీ విరమణ చేసిన వారిని, చేయడానికి సిద్ధంగా వున్న వారిని, రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం వున్న వారిని, రక-రకాల ఒత్తిడులకు లొంగి ఇలా సమాచార కమీషనర్లను నియమించడం ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం?. కిరణ్ కుమార్ రెడ్డి చేస్తుంటే ఎలా ప్రతి పక్ష నాయకుడు అంగీకరించాడు? విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల ఎంపిక ఎంతో రసాభాస చేసిన గవర్నర్ ఆమోద ముద్ర  ఎలా వేశారు? End
(Added on 22-02-2012: (ఎనిమిదిని సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎంపిక చేయగా, ఆ నిర్ణయానికి ప్రతిపక్షనేత మద్దతు ఇచ్చీ-ఇవ్వనట్లు వుండగా, వారిలో నలుగురు ఈ పదవులకు అర్హులు కాదంటూ గవర్నర్ నరసింహన్ ఫైలును తిప్పి పంపారు. తాంతియా కుమారి, ముత్తంశెట్టి విజయ నిర్మల, వర్రె వెంకటేశ్వర్లు, ఇంతియాజ్ అహ్మద్‌ల నియామకం విషయంలో పునః పరిశీలన అవసరమని స్పష్టం చేశారు. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రెడ్డి, ఐపీఎస్ అధికారి రతన్, మాజీ ఐఎఫ్ఎస్ మధుకర్‌రాజు, సీనియర్ జర్నలిస్టు విజయబాబుల ఎంపిక విషయంలో గవర్నర్ అభ్యంతర పెట్టలేదు. సమాచార కమిషన్‌లో పార్టీలతో సంబంధం ఉన్న వారికి చోటు దక్కడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపధ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు).