కెన్నెడీల వారసత్వంలో మరో అధ్యాయం
(అమెరికా ఆరోగ్య కార్యదర్శిగా రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్)
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (20-02-2025)
తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ఆకాశాన్నంటుతున్న వైద్య ఖర్చులు, బీమా సంస్థల ఆధిపత్యం, వైద్య సేవల అందుబాటు సమస్యలు, వైద్య లోపాలు వంటి సవాళ్లను అమెరికా ప్రస్తుతం ఎదుర్కొంటున్న తరుణంలో, ట్రంప్ ప్రభుత్వం ఆరోగ్య కార్యదర్శిగా రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ను నియమించడం సార్వజనీన ఆరోగ్య విధానంలో ఒక విప్లవాత్మక మార్పు. ఆయన నియామకాన్ని సెనేట్ 52-48 ఓట్ల తేడాతో అంగీకరించడం అనే అంశం, ‘అమెరికా రాజకీయ సాహిత్యంలో’ కెన్నెడీ కుటుంబం ప్రభావాన్ని, ఏమేరకు ప్రతిబింబిస్తుందో అవగాహన చేసుకోవచ్చు. ‘అపారమైన కెన్నెడీ వారసత్వం’, అమెరికా పరిపాలనా వ్యవస్థను ఇప్పటికీ ప్రభావితం చేస్తున్నాయంటే, దానికి కారణమైన ఆ కుటుంబ నేపధ్యమే.
ఆరోగ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తున్న రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ తండ్రి మాజీ అటార్నీ జనరల్ సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ సీనియర్, మేనమామలు అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ, టెడ్ కెన్నెడీ, తల్లి-మానవ హక్కుల కోసం పోరాడిన సామాజిక న్యాయ ఉద్యమకారిణి ఎథెల్ కెన్నెడీల రాజకీయ వారసుడు. 1968లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తన తండ్రి హత్యకు గురైనప్పటికీ, అది రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ రాజకీయ ప్రస్తానాన్ని ఆపలేకపోయింది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్రుడిగా పోటీ చేసిన జూనియర్ రాబర్ట్, పోటీ నుండి విరమించుకుని, ఎన్నికలలో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్కు మద్దతు ప్రకటించడం కీలక రాజకీయ మలుపుగా మారింది. అమెరికా ఆరోగ్య కార్యదర్శిగా ఆయన నియామకం, అమెరికా రాజకీయాల్లో అపూర్వమైన కెన్నెడీ కుటుంబ చరిత్రలో మరో నూతన అధ్యాయం.
అమెరికా రాజకీయాల్లో కెన్నెడీ కుటుంబానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తండ్రి కన్న కలలను వాస్తవం చేస్తూ, జాతికి జీవితాలను అంకితం చేసిన కొడుకులు, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక అపురూప వారసత్వ పరంపరకు చెరగని చిహ్నాలు. శక్తి, అధికారం, త్యాగం, బాధ్యత, రాజకీయ పరంపర, మరణాల ముసురుకు కూడా తలవంచని నిబద్ధత లాంటి అంశాలు కలగలిపిన అజరామరమైన వర్తమాన గాధ కెన్నెడీ కుటుంబం సొంతం. మరణాల, విపత్తుల, రాజకీయ కుదుపుల మధ్య జీవనయానం సాగించి, ఆదర్శాలను, ప్రజాస్వామ్యాన్ని నమ్మిన ఒక కుటుంబమే కెన్నెడీ కుటుంబం. ఈ కుటుంబ నేపధ్యంలో, రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ ప్రతిష్టాత్మక అమెరికా ఆరోగ్య కార్యదర్శిగా నియమితుడయ్యాడు. మరోసారి కెన్నెడీ కుటుంబం ప్రజాస్వామ్య విలువలకు అనుసంధానమై, అమెరికా పాలనా వ్యవస్థలో ముద్ర వేసిన ఘట్టం.
నేడునోబెల్ బహుమతి గ్రహీత ‘పర్ల్ ఎస్ బక్’ జీవించి ఉన్నట్లయితే, తాను ఐదున్నర దశాబ్దాల క్రితం రాసిన ప్రసిద్ధ పుస్తకం, ‘ది కెన్నెడీ ఉమెన్’ లో రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ రాజకీయ ఆరోహణను, భవిష్యత్తులో దాని ప్రభావాన్ని, మరో ఆసక్త్రికరమైన అధ్యాయంగా చేర్చేదేమో! ఈ పుస్తకంలో కెన్నెడీల రాజకీయ అస్తిత్వం, వారి ఎదుర్కున్న దురదృష్టకర సంఘటనలు, చైనా కుంగ్ కుటుంబంతో కెన్నెడీ కుటుంబం పోలికలు, ‘కర్స్ ఆఫ్ గ్రేట్నెస్’ (గొప్పతనపు శాపం) గురించి వివిధ కోణాలలో చర్చించారు. వాషింగ్టన్ పోస్ట్ పాత్రికేయుడు డేవిడ్ వాన్ డ్రెహ్లే, ఇరవై సంవత్సరాల క్రితం వ్యాఖ్యానిస్తూ, ‘అమెరికాలో ఓ షేక్స్పియర్ ఉన్నట్లయితే, అతను కెన్నెడీ కుటుంబ గాథను అద్భుతంగా రాసేవాడు’ అన్నారు.
మరో ఆసక్తికరమైన అంశం, కెన్నెడీ కుటుంబానికి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి గల కొన్ని సారూప్యతలు. ఇరు ‘ప్రజాస్వామ్య వారసత్వ కుటుంబాలూ’ తమ దేశ రాజకీయ ప్రస్తానాన్ని నిర్వచిస్తూ ముందుకు సాగాయి. అలాగే, వారసత్వ పాలనకు తలొంచిన రాజకీయ కుటుంబాల మాదిరిగానే, తీవ్రమైన విషాదాలను సహితం ఎదుర్కొన్నాయి. జాన్ ఎఫ్ కెన్నెడీ, రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ సీనియర్లు హత్యకు గురైనట్లే, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు హత్య చేయబడ్డారు. జెఎఫ్కె జూనియర్ విమాన ప్రమాదంలో మరణించడం, సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కూడా ఒక పోలికే. కెన్నెడీ కుటుంబ సభ్యులు ఎన్నో ముఖ్యమైన హోదాల్లో పని చేసినట్లు, నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు కూడా అత్యున్నత పదవులు అలంకరించారు.
కెన్నెడీ కుటుంబ రాజకీయ ప్రయాణం జోసెఫ్ పి కెన్నెడీ సీనియర్ ఇంగ్లాండ్ దేశానికి అమెరికా రాయబారిగా నియామకంతో ప్రారంభమైందనవచ్చు. 1914లో ఆయన వివాహం చేసుకున్న రోస్ ఫిట్జ్గెరాల్డ్ కెన్నెడీ, మరో అమెరికన్ రాజకీయ నాయకుడు జాన్ ఎఫ్ ఫిట్జ్గెరాల్డ్ కుమార్తె, కెన్నెడీ వంశానికి మూలాధిపతిగా నిలిచారు. పర్ల్ ఎస్ బక్ పుస్తకంలో ఆమెను కాథలిక్ ఆచార వ్యవహారాలకు ప్రతిరూపంగా, క్రమశిక్షణ, సహనానికి చిహ్నంగా చిత్రీకరించారు. తండ్రికి సాన్నిహిత్యంలో రాజకీయ అనుభవం గడించిన ఆమె, ఆత్మస్థైర్యాన్ని, సమతౌల్యాన్ని నేర్చుకున్నారు. జోసెఫ్, రోస్ దంపతులు తమ తొమ్మిదిమంది పిల్లలను క్రమశిక్షణ, పట్టుదల, ప్రజా సేవపై అపారమైన నిబద్ధత కలిగి ఉండేలా తీర్చిదిద్దారు. వారికి పుట్టిన నలుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు అమెరికా రాజకీయాలపై చెరగని ముద్రవేశారు.
అందరికన్నా పెద్దదైన రోస్మేరీ మాత్రం జీవితాంతం చిన్నపిల్లగానే మిగిలిపోవాల్సి వచ్చింది. 21 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాతే, దివ్యాంగుల కోసం స్థాపించిన పాఠశాలలో చేర్చారు. కుటుంబ విజయాలనూ, విపత్తులనూ సమానంగా స్వీకరించి, ముందుకు నడిపించిన శక్తివంతమైన మహిళగా రోస్ కెన్నెడీని చిత్రీకరించారు పర్ల్ ఎస్ బక్. జోసెఫ్ పి కెన్నెడీ తాత ప్యాట్రిక్ జోసెఫ్ కెనెడి 1849లో 26 ఏళ్ల వయస్సులో ఐర్లాండ్ నుంచి బోస్టన్కు వలస వెళ్లి బ్యారెల్ తయారీ నిపుణుడిగా ఎదిగారు. ఆయన వారసత్వాన్ని తన కుమారుడు రెండో ప్యాట్రిక్ కొనసాగించాడు.
జోసెఫ్ ప్యాట్రిక్ కెన్నెడీ అమెరికా అధ్యక్షుడు కావాలనుకున్న తన అభిలాషలను కుమారుల ద్వారా నెరవేర్చాలనే సంకల్పంతో, అ ధైర్యాన్ని వారికిచ్చారు. 1932 అధ్యక్ష ఎన్నికల సమయానికి ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ కు ఆర్థిక వనరులను సమకూర్చే కీలకవ్యక్తిగా మారాడు. 1937లో గ్రేట్ బ్రిటన్లో అమెరికా రాయబారిగా ఆయన నియామకం, కెన్నెడీ ప్రజాస్వామ్య రాజవంశం బలపడటానికి పునాది వేసింది. అమెరికా అధ్యక్షుడిగా అయ్యే అవకాశం ఉన్నా, రాజకీయంగా కొంతకాలం ప్రక్కన పడిపోయిన జోసెఫ్, తన కుమారుల భవిష్యత్తును దేశ రాజకీయాల్లో స్థిరపరిచే దిశగా పట్టుదలతో ప్రయత్నించారు. పెద్ద కుమారుడు జో జూనియర్ అమెరికా అధ్యక్షుడవుతాడనే గాఢమైన నమ్మకం ఏర్పడింది. అందుకు తగినట్లుగా అతనిని తీర్చిదిద్దాడు. కానీ, రెండో ప్రపంచ యుద్ధంలో కూలి, పేలిపోయిన సైనిక విమానంలో వున్న ఆయన మరణించాడు. దాంతో కుటుంబం ఆశలన్నీ జాన్ ఎఫ్ కెన్నెడీ వైపు మరలాయి. యుద్ధంలో తీవ్రంగా గాయపడి, జీవితాంతం శారీరిక బాధను భరించాల్సి వచ్చినా, కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాడు జాన్ ఎఫ్ కెన్నెడీ. అమెరికా రాజకీయాల్లో మెట్టు మెట్టుగా ఎదిగి, ప్రతినిధుల సభకు, సెనెట్కు ఎన్నికై, చివరికి అత్యంత పిన్న వయస్సులో 35వ అమెరికా అధ్యక్షుడయ్యాడు.
ఇక అప్పటి నుండి, కెన్నెడీ వారసత్వం, సాంస్కృతిక ఆర్భాటం, మనోధైర్యం రెండింటినీ కలిపిన విలక్షణ సంప్రదాయంగా నిలిచింది. ‘కెన్నెడీ’ అనే పేరు అధికార-అవకాశాల ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాదు, బాధ్యతతో కూడిన గొప్ప వంశపారంపర్యాన్ని సూచించసాగింది. జాన్ ఎఫ్ కెన్నెడీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, తండ్రి అతడికి కావాల్సిన ఆర్ధిక వనరులను సమకూర్చాడు. కుటుంబం ఆయన ప్రచారానికి అంకితమైంది. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో, కుమారుడి వెనుక తాను ఉన్నానన్న అపప్రధ కలగకుండా, తన కుమారుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అని ప్రపంచానికి చెప్పడానికి, జోసెఫ్ ప్యాట్రిక్ కెన్నెడీ హాజరవ్వలేదు. అధికారం చేపట్టి వెయ్యి రోజులు గడవకముందే జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు గురై, అమెరికా చరిత్రలో అత్యంత పిన్న వయసులో మరణించిన అధ్యక్షుడిగా నిలిచాడు.
దశాబ్దాల తరువాత, అతని 38 ఏళ్ల కుమారుడు జాన్ కెన్నెడీ జూనియర్ విమాన ప్రమాదంలో మరణించాడు. కుమార్తె క్యారోలైన్ కెన్నెడీ ఆస్ట్రేలియా, జపాన్లకు అమెరికా రాయబారిగా పనిచేసింది. కెన్నెడీ కథ ఇక్కడితో ముగియలేదు. జాన్ ఎఫ్ కెన్నెడీ తమ్ముడు రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ సీనియర్, అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రచారం చేస్తూ హత్యకు గురయ్యాడు. మరొక తమ్ముడు ఎడ్వర్డ్ ‘టెడ్’ కెన్నెడీ, సెనెట్లో ‘సింహం’గా దాదాపు 50 ఏళ్ల పాటు కుటుంబ రాజకీయ వారసత్వాన్ని స్థిరపర్చాడు. ఇప్పుడు రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ అమెరికా ఆరోగ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం, కెన్నెడీ వారసత్వం కొత్త దశలోకి ప్రవేశించిందనడానికి నిదర్శనం.
అమెరికా ప్రజాస్వామ్యంలో అనిశ్చితి, వారసత్వ రాజకీయాలు, త్యాగం, సిద్ధాంతపరమైన భేదాలు, వ్యక్తిగత విశ్వాసాలు, ఒక నిరంతర రాజకీయ సాహసం. వీటి సంగమంలో కెన్నెడీ కుటుంబ కథనం ఆవిర్భవించింది. చరిత్ర ముందుకు సాగుతున్నకొద్దీ, ‘కెన్నెడీ రాజకీయ వారసత్వం’ ప్రజా సంక్షేమం కోసం అప్రతిహతంగా సాగిపోతున్న ఒక శాశ్వత ప్రయాణమనవచ్చు. కెన్నెడీ కుటుంబం అనేది సాధారణంగా అధికార మదంతో దూసుకెళ్లే రాజకీయం కాదు, అది సేవా తత్వానికి నిలువెత్తు నిదర్శనం. జోసెఫ్ ప్యాట్రిక్ కెన్నెడీ, ఆయన కుమారులు జాన్ ఎఫ్ కెన్నెడీ, రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ సీనియర్, టెడ్ కెన్నెడీ, అందరూ దేశం కోసం త్యాగాలే చేశారని చరిత్ర చెబుతోంది. ‘ప్రజాస్వామ్యం వారసత్వం’ కాదు. ‘ప్రజాస్వామ్య వారసత్వం ఆషామాషీ’ కానే కాదు. అది గురుతర బాధ్యత. అధికారం గౌరవప్రదమైనది, కానీ అది ప్రజాసేవలోనే ఉన్నప్పుడే నిలుస్తుంది.
‘వంశపారంపర్యమే కీలకం కాదు, ప్రజల విశ్వాసమే అసలు ఆధారం’ అని తాజాగా రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ నియామకం మనకు చెబుతుంది. కెన్నెడీ కుటుంబం చేసిన త్యాగాలు, వారి ఆత్మసంఘర్షణలు, నమ్మకాలు, ఇవన్నీ సేవాగుణానికి, నిబద్ధతకు, ప్రజాస్వామ్య న్యాయానికి నిదర్శనం. కెన్నెడీ వారసత్వం ఒక కథ మాత్రమే కాదు, అది ఒక విలువైన సందేశం. అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాలలో, ఒకే కుటుంబం నుంచి రాజకీయంగా ఎదుగుతున్నవారి ప్రత్యేకతలు అవగాహన చేసుకోకుండా, ‘వారసత్వ రాజకీయాలను’ అసంబద్ధంగా విమర్శించడం తగదు. మంచిని మంచే అనాలి. తప్పుంటేనే నిష్పక్షపాతంగా ఎత్తిచూప్పాలి.