Thursday, July 12, 2012

ఎవరికీ కాని పీవీ నరసింహారావు: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు

బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పీవీ బాధ్యుడా? పీవీకి, నెహ్రూ-గాంధీ వారసత్వ కుటుంబానికి బేధాభిప్రాయాలున్నాయా? ఆయన భారతీయ జనతా పార్టీతోను, ఎన్డీయే తోను కుమ్మక్కయాడా? పీవీ మతతత్వ వాదా? ఎందుకు పీవీ ఎవరికీ కానివాడయ్యాడు? అసలు సోనియాకు పీవీకి ఎందుకు-ఎక్కడ చెడింది? పీవీ మంచోడా? చెడ్డోడా? అన్న విషయాలపై ఇటీవల మాజీ కేంద్రమంత్రి అర్జున్ సింగ్, సీనియర్ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ ఆత్మకథలలో పేర్కొన్న అంశాల ఆధారంగా ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. వారు రాసిన ఆత్మకథలు "ఏ గ్రెయిన్ ఆఫ్ శాండ్ ఇన్ ద అవర్‌గ్లాస్ ఆఫ్ టైమ్", "బియాండ్ ద లైన్స్" లలో పేర్కొన్న అంశాలలో వాస్తవికత ఎంత? ఇలాంటి విషయాలపై మాట్లాడడానికి మన మధ్య అర్జున్ సింగ్ కాని, పీవీ నరసింహారావు కాని, కులదీప్ నయ్యర్‍కు చెప్పిన మధు లిమాయే కాని బ్రతికి లేరు. చెప్పాల్సిన వారు, వారి సమకాలీనులే. అదే జరుగుతోందిప్పుడు. పీవీ ప్రధానిగా వున్నప్పుడు ఆయన మీడియా సలహాదారుడు గాను, ఆయనకు ఆంతరంగికుడు గాను పనిచేసిన మన రాష్ట్రానికి చెందిన మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి పీవీఆర్‍కె ప్రసాద్ ఆ పుస్తకాలలో పేర్కొన్న పలు వివాదాంశ అంశాలపై వివిధ ఛానళ్లలో మాట్లాడడమే కాకుండా, హైదరాబాద్‌లో పాత్రికేయ సంఘాలు నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కూడా వివరించారు.
జరుగుతున్నదంతా పీవీ పైన ఆశ్చర్యకరమైన, బాధాకరమైన ఆరోపణలనక తప్పదు. వాస్తవమేంటో, బాబ్రీ మసీదు కూల్చివేత నేపధ్యంలో అక్కడ పీవీ ఇంట్లో జరిగిందేంటో చెప్పాల్సిన బాధ్యత తన మీద వుందంటూ, జరిగిన విషయాలన్నీ పూస గుచ్చినట్లు బహిరంగ పరిచారు పీవీఆర్‍కె. దాని సారాంశమే వ్యాసం. అర్జున్ సింగ్, కులదీప్ నయ్యర్ చెప్పిన దాంట్లో రాజకీయ కోణాలున్నాయి. అసలా మాటకొస్తే ఇవేవీ కొత్తగా చేస్తున్న వ్యాఖ్యానాలు కానే కావు. కాకపోతే చేసే పద్ధతే మారింది. ఇందులో రెండు-మూడు విషయాలు ప్రధానంగా చెప్పుకోవాలి. అసలు చేస్తున్న వ్యాఖ్యానాలు వాస్తవాధారంగా వున్నాయా? లేనప్పటికీ చేశారంటే, ఏదో ఒక కారణం-ప్రణాళిక వుండి తీరాలి. ఇదేదో మామూలుగా జరుగుతున్న విషయంలాగా కనిపించడం లేదు. అర్జున్ సింగ్ కానీ, కులదీప్ నయ్యర్ కానీ సంఘటనా స్థలంలో (పీవీ ఇంట్లో) లేరప్పుడు. అక్కడ జరిగింది ప్రత్యక్షంగా ఇద్దరూ చూడలేదు. ఇద్దరు కూడా ఎవరో చెప్పారని మాత్రమే అంటున్నారు. పీవీకి తాను టెలిఫోన్ చేసానని, అందుబాటులోకి రాలేదని అంటున్నారు అర్జున్ సింగ్. ఆయనకు ప్రధాని పీవీ కార్యాలయంలో-ఇంట్లో పనిచేస్తున్న వారందరూ తెలుసు. అందరి పేర్లూ తెలిసే వుండాలి. ఆయన ఎవరితో మాట్లాడారో చెప్పకుండా డొంక తిరుగుడుగా పీవీ అందుబాటులోకి రాలేదంటే ఎలా? ఆయన ఉద్దేశం పీవీ దొరకలేదనే అంశాన్ని హై లైట్ చేయడమే తప్ప అసలు వాస్తవం-నిజం తెలియచేయడం కానే కాదు. కులదీప్ నయ్యర్ లాంటి సీనియ పాత్రికేయుడు-పెద్ద మనిషి కూడా అర్జున్ సింగ్ తరహాలోనే రాయడం విడ్డూరం.
బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజు ఉదయం నుంచి, రాత్రి పొద్దు పోయేంతవరకూ, మీడియా సలహాదారు హోదాలో పీవీఆర్‍కె ప్రసాద్ ప్రధాని ఇంట్లోనే ఆయన సమక్షంలోనే అధికారిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ వున్నారు. పీవీ గదిలో తలుపులు వేసుకుని "నీరో” లా పూజలు చేస్తున్నారనడం అసత్య ఆరోపణ. బాబ్రీ మసీదు చివరి ఇటుక కూలేంతవరకూ, ఆ విషయం తలుపులు తీసుకుని ఆయన చెవిలో ఎవరో చెప్పేంతవరకూ పీవీ పూజ చేస్తూనే వున్నారట! ఇంతకన్నా కాకమ్మ కథ ఇంకోటి లేదు. ఆనాడు, ఆ టైమ్‌లో చోటు చేసుకున్న సంగతులు, జరిగిన వ్యవహారం, తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమం అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తే, పీవీ గదిలో కూర్చుని పూజ చేశాడో? వ్యవహారాలు చక్కదిద్దుతున్నాడో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. పీవీ నిరంతరం హోం కార్యదర్శి మాధవ్ గోడ్బోలేతోను, కాబినెట్ కార్యదర్శి తోను, ఆయన వ్యక్తిగత కార్యదర్శితోను మంతనాలు చేస్తూనే వున్నాడు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో వారి ద్వారా కాంటాక్ట్ లో వున్నాడు. ముందస్తు జాగ్రత్తగా కేంద్రం పంపిన బలగాల గురించి ఆరా తీసి, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని ఉత్తర్వులు కూడా ఇప్పించారు పీవీ. న్యాయ శాఖ కార్యదర్శి పీసీ రావు గారిని, ఇతర అధికారులను పిలిపించుకుని, ఒక వేళ పరిస్థితి అలానే కొనసాగితే, కేంద్రం ఏం చెయ్యాలనేది కూడా బేరీజు వేసుకుంటున్నారు. 


ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయలేమని చేతులెత్తేసి ఆ విషయాన్ని కేంద్రానికి తెలియచేసింది. రాష్ట్ర ప్రభుత్వం అడగకుండానే ముందస్తు జాగ్రత్తగా కేంద్రం పంపిన బలగాలను, బాబ్రీ మసీద్ కట్టడం దగ్గర కాకుండా, మూడు కిలోమీటర్ల ఆవల వుంచింది రాష్ట్ర ప్రభుత్వం. వాటిని అప్పుడు కదిలించమని ఉత్తర్వులు ఇవ్వడమంటే, వేలాదిమంది కరసేవకులను చంపుకుంటూ పోవడమే! దానికీ పీవీ గారే బాధ్యుడా? ఆయన ఒకదానికి మాత్రం బాధ్యుడు. ముందుగానే రాష్ట్రపతి పాలన విధించక పోవడానికి బాధ్యుడు! అదే జరిగి వున్నట్లయితే మసీదు కూలకపోయేదేమో! కాకపోతే పీవీ రాష్ట్రపతి పాలన విధించాలా? వద్దా? అన్నది చాలా "ట్రిక్కిష్" ప్రశ్న. రాష్ట్రపతి పాలన విధించడానికి కొన్ని నిబంధనలున్నాయి-నియమాలున్నాయి-రాజ్యాంగ విలువలున్నాయి. శాంతి-భద్రతల సమస్య క్లిష్టతరమైందా ఒక రోజు ముందర, అంటే, అలాంటిదేమీ జరగలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ స్వయంగా వచ్చి ప్రభుత్వానికి, ఎన్డీయేకు ఏమీ జరగదని నమ్మకంగా చెప్పాడు. ప్రధానికీ అలానే చెప్పాడు. సుప్రీం కోర్టు ముందు కూడా చెప్పాడు. శాంతి-బధ్రతలను కాపాడుతానని వాగ్దానం చేశాడు. తనతో పాటు బీజేపీ జాతీయ నాయకులను కూడా పీవీ దగ్గరకు తీసుకొచ్చి మరీ నమ్మబలికాడు కల్యాణ్ సింగ్.
అర్జున్ సింగ్ ఇప్పుడే మంటున్నాడు? పీవీ బిజెపిని నమ్మాడని! ఆయన అందరితో మంచిగా వుండాలని ప్రయత్నం చేశాడని! పీవీ చేసింది అందరితో మంచిగా వుండే ప్రయత్నం కన్నా రాజ్యాంగపరంగా ఏం చేస్తే మంచిదనేది. పీవీ అంతటితో ఆగలేదు. సమస్యను సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాడు. రాజ్యాంగపరంగా శాంతిబధ్రతలు రాష్ట్రం చూసుకోవాలి. కేంద్రం వెనుకనుంచి మద్దతు ఇస్తుంది. పరిస్థితుల నేపధ్యంలో, బాబ్రీ మసీదు కట్టడాన్ని కాపాడే బాధ్యతను కేంద్రానికి అప్పచెప్పాలని సుప్రీం కోర్టును కోరింది పీవీ ప్రభుత్వం. న్యాయ స్థానం దానికి అంగీకరించలేదు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దానికి బాధ్యత తీసుకుంటానంటే ఎందుకు కేంద్రానికి ఆతురత అని ప్రశ్నించింది. మరో అడుగు ముందుకు వేసి, ఒక కమీషన్‌ను ఏర్పాటు చేసి, పరిశీలకుడిని నియమించింది.  మరి, ఆ పరిశీలకుడు ఏం చేస్తున్నట్లు? కేంద్ర పంపిన బలగాలను వినియోగించుకోవడంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తతతో వ్యవహరించిందో ఆ పరిశీలకుడు ప్రశ్నించాడా? అందుకే, మొత్తం వ్యవహారంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్నన్నా తప్పు పట్టాలి, లేదా, పరిశీలకుడినన్నా తప్పు పట్టాలి. మధ్యలో పీవీ ఏం తప్పు చేశాడు? రాష్ట్రపతి పాలన విధించక పోవడమేనా?
రాష్ట్రపతి పాలన విధించాలంటే, శాంతిబధ్రతల వైఫల్యం వుండాలి. అలాంటిదేమీ లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ నాయకులు నమ్మకంగా చెప్పారు. కేవలం వారి మీద ఆధార పడకుండా గవర్నర్ నివేదిక ప్రామాణికంగా తీసుకున్నారు పీవీ. గవర్నర్ తన నివేదికలో అలాంటిదేమీ లేదని స్పష్టంగా తెలియచేశారు. చాలామంది కరసేవకులొచ్చారనీ, అంతా శాంతియుతంగా జరుగుతుందనీ, అప్పుడు గనుక కేంద్రం జోక్యం చేసుకుంటే-రాష్ట్రపతి పాలన విధించితే, గొడవలు జరిగే అవకాశం వుందనీ గవర్నర్ నివేదిక సారాంశం. మరి ఆ గవర్నర్ గారి "లాయల్టీ" ఎలాంటిదో! అది వేరే విషయం. కానీ, రాజ్యాంగపరంగా నిర్ణయం తీసుకోవాలంటే వీలు కాని పరిస్థితి. న్యాయ శాఖ కార్యదర్శి పీసీ రావుగారు రాష్ట్రపతి పాలన రాజ్యాంగ విరుద్ధ మన్నారు. ఈ విషయాలన్నీ కేవలం పీవీ ఒక్కడిదే కాదు-అర్జున్ సింగ్‌తో సహా అక్కడున్న యావత్తు మంత్రి మండలి తీసుకున్న సమిష్టి నిర్ణయం. ఆనాడు తలెత్తిన ప్రశ్నలకు ఎవరిదగ్గరా సమాధానాలు లేవు. పీవీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రధాని అయినంత మాత్రాన బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చాలని ఎక్కడా లేదు. ఆయనకు రాజ్యాంగం మీద ఎనలేని గౌరవం. ఆయన రాజ్యాంగాన్ని అనుసరించి నిర్ణయం తీసుకున్నాడన్న నింద మోపవచ్చు! పోనీ, కల్యాణ్ సింగ్ మోసం చేశాడందామా? నమ్మక ద్రోహం చేశాడందామా? ఇచ్చిన మాట నిలబెట్టుకోక పోవడానికి అనేక కారణాలుండవచ్చు! బహుశా బీజేపీకి కూడా అలా జరుగుతుందన్న సమాచారం వుండి వుండకపోవచ్చు! ఆ తరువాత పార్లమెంటులో వాజ్‌పేయి-ఇతర బీజేపీ నాయకులు మాట్లాడిన దానిని బట్టి చూస్తే, అదే అర్థం స్ఫురిస్తుంది. వాళ్లు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారని. చివరకు కల్యాణ్‌తో సహా వారి నాయకత్వం దెబ్బ తింది-పీవీని దెబ్బ కొట్టారు!
పీవీ దెబ్బ తినడానికి ప్రధాన కారణం ప్రతిపక్షాల వ్యాఖ్యానాల కంటే స్వపక్షం వారి దాడే! పీవీ ప్రధానిగా ఏదో మూణ్ణాళ్ల ముచ్చటగా-ఆపద్ధర్మ ప్రధానిగా మాత్రమే పదవిలో కొనసాగుతాడని భావించాడు అర్జున్ సింగ్. అయన తరువాత తానే ప్రధాని అవుతానని కలలు కన్నాడు. పీవీని దింపుదామంటే, ఆయనేమో పావులు చాకచక్యంగా కదిపి, ఏకు-మేకై కూర్చున్నాడు. పాతుకు పోయాడు. కాంగ్రెస్ పార్టీ వారందరూ కలిసి బీజేపీని నిందించడానికి మారుగా, సొంత మనిషి పీవీని నిందించడం ఎంతవరకు సబబు? అంతే కాకుండా, బీజేపీతో పీవీ జతకట్టాడు అనే దాకా వెళ్లాడు అర్జున్ సింగ్. ఆ వ్యవహారం ఎంతవరకు వెళ్లిందంటే: చివరకు, పదిహేను సంవత్సరాల అనంతరం కూడా, అదీ, లిబర్హాన్ కమీషన్ పీవీని నిర్దోషి అని తేల్చిన తరువాత కూడా, కాంగ్రెస్ నాయకుడైన అర్జున్  సింగ్ తన ఆత్మకథలో ఇలా రాయడం, దానికి కులదీప్ నయ్యర్ లాంటి వారు వంత పలకడం విడ్డూరం. బాబ్రీ మసీదు కూల్చివేతకు తన పార్టీ-తమ ప్రధాని బాధ్యుడనే స్థితికి దిగజారాడు అర్జున్ సింగ్. ఆయన మైండ్ సెట్, అజెండా, ఒక రకంగా పీవీ మీద ద్వేషం-మరొక రకంగా ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కకుండా పోవడం. ఆయన ఆర్థిక సంస్కరణలైనా, భూసంస్కరణలైనా, నెహ్రూ-గాంధీ విధానాలను కొనసాగించడమే కాని దానికి విరుద్ధమెలా అవుతుంది? పీవీ తీసుకున్న ప్రతి నిర్ణయం దేశం కోసం మాత్రమే. ఆయనే కనుక తనకోసం నిర్ణయం తీసుకుంటే, మరో మారు ప్రధాని కావడం ఏ మాత్రం కష్టమయ్యేది కానే కాదు.
సోనియా వ్యతిరేకత విషయం ప్రస్తావించిన అర్జున్ సింగ్ పీవీ "ఎమోషనల్ ఔట్ బరస్ట్" గురించి రాశాడు. పీవీ తత్వం అర్థం చేసుకున్న చాలామందికి ఆయనకసలు అలాంటి గుణమే లేదనే వాస్తవం తెలుసు. ఇవన్నీ సోనియాకు-పీవీకి సంబంధాలు చెడగొట్టే ప్రయత్నం చేయడమే! బ్రతికుండగా అర్జున్ అస్తమానం పీవీ మీద సోనియాకు పితుర్లు మోయడమే పనిగా పెట్టుకున్నాడు. ఇప్పటికీ అలానే చేస్తున్నాడు. పీవీకి లాయల్టీ అంటే, విధానాలకా? వ్యక్తులకా? లాయల్టీకి సైకోఫెన్సీకి తేడా తెలియని అర్జున్ సింగ్ అలా రాయడంలో ఆశ్చర్యం లేదు. అర్జున్ సింగ్ తన అవసరాలకొరకు, స్వలాభం కొరకు, పీవీకి సోనియాకి మధ్య అగాధం సృష్టించాడు. అసలు పీవీని సోనియా కాని, ఆ నాటి కాంగ్రెస్ పెద్దలు కాని ప్రధాని చేయడానికి కారణం ఆయనకు నెహ్రూ-గాంధీ కుటుంబంపై లాయల్టీ కాదా? ఇప్పుడిలా సమయం సందర్భం లేకుండా పుస్తకాలలో ఏదో రాసి, రాసింది అంతవరకే బహిర్గతం చేసి పీవీని బదనాం చేయడం ఎంతవరకు సబబు? అసలు పీవీకి ఇంట్లో పూజ గదే లేనప్పుడు పూజ చేయడమనే ప్రశ్నే ఉదయించదు! అసలా రోజున ప్రధానిగా పీవీ ఇంటికి ఎవరెవరు-ఎప్పుడెప్పుడు వచ్చింది మొత్తం రికార్డై వుంటుంది కదా! అదెందుకు పరిశీలించరు? మరి ఎందుకీ రాతలు?
ఈ మధ్య కాలంలో మన దేశం దౌర్భాగ్య స్థితిలోకి పోతోంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని ఒక వైపు, ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసిన పీవీ ప్రభుత్వాన్ని మరో వైపు పోల్చి చూపే ప్రక్రియ మొదలైంది. ఇదే మన్మోహన్, పీవీ హయాంలో అలా ఎలా చేయగలిగాడు? అన్న చర్చ మొదలైంది. ఇప్పుడాయన ప్రధాని ఐతే కూడా ఎందుకు పని చేయలేకపోతున్నాడన్న ప్రశ్న అడుగుతున్నారు. పీవీ చేసిన మంచి పనంతా బయటకొస్తుందేమోనన్న భయం పట్టుకుంది కొందరు కాంగ్రెస్ వారికి. నిజంగా కాంగ్రెస్‌కు సద్భుద్దే వుంటే, పీవీ పనితీరును చెప్పి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలచుకోవాలి! దురదృష్టం ప్రతిపక్షాలకంటే కూడా కాంగ్రెస్ పార్టీలోనే పీవీ వ్యతిరేకులు ఎక్కువమంది వుండడం. తర-తమ బేధం లేని పాములపర్తి వెంకట నరసింహారావు పేరు అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో వుంటుందో-లేదో చెప్పలేం కాని, భారత దేశ చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడడం ఖాయం. ఆయన పేరు చిర స్థాయిగా నిలవడం నిజం!

Monday, July 9, 2012

పీవీపై నింద మోపడమంటే ఈర్ష్య-అసూయలకు పరాకాష్టే!: వనం జ్వాలా నరసింహారావు


పీవీపై నింద మోపడమంటే 
ఈర్ష్య-అసూయలకు పరాకాష్టే!
వనం జ్వాలా నరసింహారావు

పీవీపై అసత్య కథనాలు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (12-07-2012)

స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాజకీయ ప్రత్యర్థి "కీర్తి శేషులు" అర్జున్‌ సింగ్ "ఆత్మకథ-ఏ గ్రెయిన్ ఆఫ్ శాండ్ ఇన్ ద అవర్‌ గ్లాస్ ఆఫ్ టైమ్" పేరిట, పీవీతో అంతగా పరిచయమే లేని సీనియర్ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ పుస్తకం "బియాండ్ ద లైన్స్" పేరిట, ఆ మహనీయుడిపై బురద చల్లే కార్యక్రమానికి కొందరు ఇటీవల పనిగట్టుకుని మరీ శ్రీకారం చుట్టారు. పీవీ నరసింహారావు అంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు కోపమని, సోనియా అంటే పీవీకి సదభిప్రాయం లేదని, రాజీవ్ హత్యా-మరణానంతరం సోనియా గాంధీని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని చేద్దామన్న సూచనకు పీవీ వ్యతిరేకమని, ఇంజనుకు తగులుకుని రైలు పెట్టెలన్నీ దాని వెనకాలే వెళ్లినట్టు నెహ్రూ-గాంధీ కుటుంబం వెనుకే కాంగ్రెస్ పార్టీ వెళ్లడం దేనికని పీవీ ఆ సందర్భంగా ప్రశ్నించాడని, బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంలో ఆయన ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని కూర్చోవడమంటే రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో ఫిడేలు వాయిస్తున్న దృశ్యం తనకు గుర్తుకొచ్చిందని అర్జున సింగ్ ఆరోపించారు తన ఆత్మకథలో. అసంపూర్తి గా మిగిలిపోయిన అర్జున సింగ్ గ్రంథాన్ని ఆయన సన్నిహితుడైన అశోక్ చోప్రా పూర్తి చేసే ప్రయత్నంలో భాగంగా మరికొన్ని సంచలనాత్మక విషయాలున్నాయి. సోనియా పట్ల పీవీ ప్రవర్తన తనకు రాజకీయాలంటేనే అసహ్యం వేసే స్థితికి తీసుకెళ్లిందని, ఐతే, కొద్ది సేపటికే పీవీ మనసు మార్చుకుని తానిచ్చిన ఆలోచనకు సానుకూలంగా స్పందించారని అర్జున సింగ్ పేర్కొనడం జరిగింది. రాసిన అర్జున సింగ్ కాని, ఎవరినుద్దేశించి రాయడం జరిగిందో ఆ నాయకుడు పీవీ నరసింహారావు కాని ఇప్పుడు మన మధ్య లేరు. ఆ పుస్తకంలోని నిజా-నిజాలు వారిద్దరన్నా చెప్పాలి, లేదా, వారి సమకాలీనులన్నా చెప్పాలి.

బాబ్రీ కూల్చివేత వార్త వినగానే తన మనసులో ఆ దృశ్యాలు కదిలాయని, ఆ విషాద ఘటన తాలూకు పరిణామాలు దేశ చరిత్రలో అంచనా వేయలేని స్థాయిలో ఉంటాయని తన మనసుకు అనిపించిందని, భారతదేశ "లౌకిక వ్యవస్థ" తీవ్రంగా దెబ్బతిన్నదన్న బాధ కలిగిందని, ఆ మనస్తాపంతోనే పీవీకి ఫోన్ చేస్తే, ఆయన అందుబాటులో లేరని సమాచారం అందిందని అర్జున్ సింగ్ పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా, మరొక్క అడుగు ముందుకు వేసి, బాబ్రీ మసీదును కూల్చడానికి ఒక రోజు ముందే, ఆ విషయాన్ని తాను పీవీకి చెప్పానని అర్జున్ రాసుకున్నారు. అయితే ఆయన ఆ అంశాన్ని అంత తీవ్ర విషయంగా పరిగణించడం లేదనే భావన తనకు కలిగిందని పేర్కొన్నారు. బీజేపీ, ఇతర హిందూత్వ అనుకూల సంస్థల కుట్రలు, కుతంత్రాలను ఎందుకు పట్టించుకోవడం లేదని పీవీని ఆయన ప్రశ్నించారట! ఒక విధంగా పీవీకి "కమ్యూనల్ కలర్" ఇచ్చే ఆరోపణ ఇది.



సరిగ్గా ఇలాంటిదే-ఇదే సమయంలో, సందర్భం అనేదేదీ లేకుండా, బహుశా ఇలా కలిమిడిగా చేద్దామని ఆలోచించి మరీ చేశారన్న భావన కలిగే విధంగా, కులదీప్ నయ్యర్ పుస్తకంలోని కొన్ని భాగాలను మీడియాకు వెల్లడించడం జరిగింది. బురదజల్లుడు కార్యక్రమం ఆ విధంగా కొనసాగించే ప్రక్రియకు ఆయనా తయారయ్యారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో, అర్జున్ సింగ్ చేసిన ఆరోపణను కులదీప్ నయ్యర్ మరి కొంచెం విస్తరించి చెప్పారు. పీవీ "నిష్క్రియగా" కూర్చొన్నారనేదే వారిరువురి ఆరోపణ. తనకున్న సమాచారం ప్రకారం "బాబ్రీ మసీదు కూల్చివేతకు పీవీ మౌనంగా అంగీకారం తెలిపారు" అనేది కులదీప్ నయ్యర్ ఆరోపణ. ఆ సమాచారమేంటో ఇదమిద్ధంగా చెప్పకుండా డొంక తిరుగుడుగా చెప్పే ప్రయత్నం చేశారు ఆయన స్థాయి సీనియ పాత్రికేయుడు. కరసేవకులు మసీదును కూల్చడం మొదలుపెట్టగానే పీవీ పూజలో కూర్చున్నారని, చిట్టచివరి రాయిని కూడా తొలగించిన తర్వాతే ఆయన పూజనుంచి లేచారని, పూజ జరుగుతుండగా పీవీ అనుచరుడొకరు వచ్చి ఆయన చెవిలో మసీదు కూల్చివేత అయిపోయిందని చెప్పారని తన పుస్తకంలో రాసుకున్నారు. తనకందిన సమాచారానికి ఆధారంగా దివంగత సోషలిస్టు నాయకుడు మధు లిమాయేను పేర్కొన్నారు. తన పుస్తకంలోని "నరసింహారావు ప్రభుత్వం" అనే అధ్యాయంలో మసీదు కూల్చివేతకు నిరసనగా మత కల్లోలాలు జరుగుతున్నప్పుడు పీవీ కొందరు సీనియర్ పాత్రికేయులను తన ఇంటికి పిలిచిన విషయం; మసీదు కూల్చివేతను ఆపడానికి తన ప్రభుత్వం వీలైన ప్రతి ప్రయత్నమూ చేసిందని చెప్పిన విషయం; తాను లక్నోకు సీఆర్ పీ దళాలను పంపినా వాతావరణం అనుకూలించని విషయం; లాంటివి పేర్కొన్నారు. పీవీ అంటే సోనియా గాంధీకి ఇష్టం లేని విషయాన్ని కులదీప్ నయ్యర్ సహితం రాశారు. పార్టీ పగ్గాలు, ప్రధాని పదవిని పీవీ చేపట్టడం సోనియాగాంధీకి ఎప్పుడూ ఇష్టం లేదనే సంగతినీ వెల్లడించారు. సోనియా "మత తత్వ శక్తులు రాజకీయాలను ఆక్రమిస్తున్నాయని" వెలిబుచ్చిన ఆవేదనకు ప్రాధాన్యం ఇస్తూ రాసిన కులదీప్ నయ్యర్, మతతత్వంపై పోరాడాలంటే సోనియా రాజకీయాలలో చేరక తప్పదని, అందుకు ఆమె చేతుల్లో వున్న ఏకైక ఆయుధం కాంగ్రెస్ పార్టీనే నని ఆనాడే తాను అంచనా వేశానని నయ్యర్ రాసుకున్నారు. దీని సారాంశం కూడా పీవీ కమ్యూనలిస్టేనని!

అర్జున సింగ్, కులదీప్ నయ్యర్ తమ ఆత్మకథలలో రాసిన మాటలను వాస్తవాలుగా ఎంతవరకు పరిగణించవచ్చు? వాస్తవ దూరం ఐతే అవి నిజాలు కావని చెప్పేదెవరు? అర్జున్ సింగ్ కాని, పీవీ నరసింహా రావు కానీ, కులదీప్ నయ్యర్ ప్రస్తావించిన మధు లిమాయే కాని మన మధ్య లేరు. కాకపోతే, పీవీ హయాంలో బాధ్యతాయుతమైన స్థానాలలో పనిచేసిన వారిలో పలువురు ఇంకా జీవించే వున్నారు. బాబ్రీ మసీదు సంఘటన కూల్చివేత పూర్వ రంగంలో, ఉత్తర రంగంలో ఆయనతో ఆ విషయాలను ప్రత్యక్షంగానో-పరోక్షంగానో పంచుకున్న వారూ లేకపోలేదు. మధులిమాయేను కోట్ చేసిన కులదీప్ నయ్యర్, అసలాయన ఆ క్షణంలో పీవీ సమీపంలో వున్నారా? లేరా? అన్న విషయాన్ని కూడా ధృవీకరించుకున్నట్లు లేదు. సరిగ్గా ఇవే విషయాలను పీవీ హయాంలో (మరో ఐదుగురు ప్రధాన మంత్రులతో సహా) న్యాయ శాఖ కార్యదర్శిగా పనిచేసి ఆయనకు "రాజ్యాంగ పరమైన" అనేక విషయాల్లో నిర్మొహమాటమైన సూచనలిచ్చిన పీసీ రావు, అదే విధంగా పీవీకి మీడియా సలహాదారుగా మాత్రమే కాకుండా ఆయనకు అనేక విషయాలలో ఆంతరంగికుడుగా పనిచేసిన పీవీఆర్‍కె ప్రసాద్ స్వయానా హైదరాబాద్ మీడియాకు వివరించడం జరిగింది. అర్జున సింగ్-కులదీప్ నయ్యర్ రాసినవన్నీ అసత్య కథనాలేనని, పీవీపై కడుపు మంటతో వారీ పని చేశారని వారి మాటల్లో వ్యక్తమైంది. బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన సమయంలో, అలనాటి వాస్తవాలకు వీరు ప్రత్యక్ష సాక్షులు. తమతో పాటు నాటి కేంద్ర హోం శాఖ కార్యదర్శి మాధవ్ గోఖలే, కాబినెట్ కార్యదర్శి రాజగోపాల్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్ వైద్య, పీవీ ఆంతరంగిక కార్యదర్శి ఏఎన్ వర్మ, కేంద్ర హోం మంత్రి ఎస్‍బీ చవాన్ వున్నారని వీరన్నారు. మరి వారందరికీ తెలియని విషయాలు మధులిమాయేకు ఎలా తెలిశాయో అర్థం కాని ప్రశ్న.  వారి రాతలన్నీ పీవీ ప్రతిష్టను దిగజార్చేటందుకేనన్నది కూడా వారి మాటల్లో వ్యక్తమైంది. ప్రధాని పదవి ఆశించి భంగపడిన అర్జున్ సింగ్‌కు పీవీపై ఎప్పుడూ కోపమేనని అంటూ ఆయన అలా రాశారంటే ఆ కోణంలో అర్థం చేసుకోవచ్చు కాని, కులదీప్ నయ్యర్ కూడా లా రాయడం దురదృష్టం అన్నారు.

బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో పీవీ పూజ గదిలో వున్నారని చేసిన ఆరోపణ చాలా హాస్యాస్పదమైంది గా పీవీఆర్‍కె, పీసీ రావులు పేర్కొన్నారు. అర్జున్ సింగ పీవీ వ్యతిరేకైతే, కులదీప్ నయ్యర్ పీవీని ఏనాడూ దగ్గరనుంచి చూడలేదని, అలనాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ చేసిన తప్పులకు పీవీని బాధ్యుడుగా చేయడం తగదని అన్నారు. వారన్నట్లుగా పీవీని రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరోతో పోల్చడం చాలా తప్పు. అసలు పీవీ నరసింహారావు ఇంట్లో పూజ గదే లేదట. కూల్చివేత సంఘటన జరిగిన డిసెంబర్ ఆరవ తేదీన పీవీ రోజంతా ఉన్నతాధికారులతో సమీక్ష జరుపుతూనే వుంటే ఇక పూజ గదిలో కూర్చోడం ఎలా జరిగింది? పీవీ ఏ పని చేసినా రాజ్యాంగ బద్ధమైందేతేనే చేసేవారట. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని దింపి రాష్ట్రపతి పాలన ఒక రోజు ముందట విధించడమంటే, రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేయడమే! అలా చేయనందున ఈ రోజున ఆయనపై అసత్య ఆరోపణలు చేసి "కమ్యూనలిస్ట్" అనే ముద్ర వేయడం తగని పని. పీవీ ఏ నాడూ రాజ్యాంగాన్ని అతిక్రమించలేదు.

పీవీని అప్రతిష్ట పాలు చేయడం ఇవ్వాళ కొత్తేమీకాదు. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం, పీవీ నరసింహారావుకు వ్యతిరేకంగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు ముడుపులు ఇచ్చారన్న కేసులో పీవీ శిక్షార్హుడని న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పుడు మీడియాలో ఆ విషయం ప్రముఖంగా ప్రచురించారు. "అవినీతికి అర దండాలు" అని, "చెరసాలకు మాజీ ప్రధాని" అని, "ఆర్థిక సంస్కరణల శిల్పికి మూడేళ్ల జైలు శిక్ష" అని శీర్షికలు పెట్టారు. న్యాయమూర్తి అజిత్ బరెహోక్ తన తీర్పులో, కఠిన పదజాలాన్ని వాడి, పీవీ చేసిన ప్రయత్నం భారత రాజ్యాంగ స్ఫూర్తికే వ్యతిరేకమని, ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమనీ పేర్కొన్నారు. కాని ఆ తరువాత ఏమైంది? ఐదారు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో శతాబ్దాల అనుభవాన్ని సంపాదించి, పలువురికి పంచిపెట్టిన మేధావి, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చిరునవ్వు వీడని థీశాలి ముఖంలో కొన్ని సెకనులు మాత్రమే ఆందోళన కనిపించింది. పీవీ నేరం చేశారో-లేదో తరువాత వెలువడిన తీర్పులే తేల్చాయి. ఏ ఒక్క దాంట్లో నూ ఆయన నేరస్తుడుగా మిగలలేదు. కొన్నాళ్లకు పై కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. బహుశా ఇప్పుడు పీవీ జీవించి వున్నట్లయితే అర్జున్ సింగ్-కులదీప్ నయ్యర్ రాతలకు అలానే చిరునవ్వు నవ్వేవాడేమో!

ఇంతకీ పీవీ చేసిన తప్పేంటి? ఆలోచనలలో, అమలులో, విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనబడిన ఈ వ్యక్తి, అపర చాణక్యుడుగా అందరూ స్తుతించిన ఈ వ్యక్తి, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా ప్రతిపక్షాలతో సహా ఖండ-ఖండాంతర ఆర్థిక నిపుణులనుండి ప్రశంసలనందుకున్న ఈ వ్యక్తి చేసిన పెద్ద పొరపాటు, బహుశా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని-నెహ్రూ కుటుంబేతర వ్యక్తిగా-ఐదేళ్లు కలిగించడం, విశ్వాస ఘాతకులకు వందేళ్ల చరిత్రను అంకితం చేయడం! తొలి దక్షిణాది వ్యక్తిగా ప్రధాని పీఠాన్ని అందుకుని, అందులో ఐదేళ్ల పాటు కొనసాగడం చాలా మందికి అందునా ఉత్తరాది వారికి నచ్చలేదు. నెహ్రూ కుటుంబానికి చెందనివాడు, దక్షిణాది వాడు, ముఖ్యమంత్రిగా కూడా పూర్తికాలం పనిచేయలేనివాడు, కనీస మెజారిటీ సభ్యుల మద్దతు కూడా లేకుండా ప్రధాని పదవిని చేపట్టి నెగ్గు కొచ్చినవాడు కావడంతో, పీవీని దెబ్బతీసే ప్రయత్నం రవై ఏళ్ల కిందటే మొదలైందంటే అతిశయోక్తి కాదేమో!

భారతావనిలో కులాలు, మతాలు, భాషలు అటుంచి, ఉత్తరాదివారు-దక్షిణాదివారు అనే తేడాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అవగాహన చేసుకోవాలంటే, చరిత్రపుటల్లోకి ఎక్కి-విశ్వవ్యాప్త మన్ననలందుకున్న మహనీయుడు పీవీ లాంటి వ్యక్తిని ఎలా అధఃపాతాళానికి తొక్కే ప్రయత్నాలు చేసారో తెలుసుకోవడమే! అర్జున్ సింగ్‍లు, కులదీప్ నయ్యర్‍లు ఇప్పుడా కోవకు చెందిన వారే.

Thursday, July 5, 2012

"చేతులు" కాలుతున్న వేళ.... రాహుల్ మంతనాల ఆంతర్యం?: వనం జ్వాలా నరసింహారావు


"చేతులు" కాలుతున్న వేళ.... రాహుల్ మంతనాల ఆంతర్యం?
సూర్య దినపత్రిక (06-07-2012)
వనం జ్వాలా నరసింహారావు

స్వర్గీయ పివి నరసింహా రావు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కూడా, ఆయన చిరకాల వాంఛ ఏంటని ఎవరైనా రహస్యంగా అడుగుతే, వచ్చిన సమాధానం, మరొక్క సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వున్నదని అట. దానికి కారణం ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా తొలగించడమే. అలానే ప్రణబ్ ముఖర్జీని ఆయన చిరకాల వాంఛ ఏంటని ఎవరన్నా అడుగుతే ఠంఛన్‍గా వచ్చే సమాధానం, ఏ నాటికైనా ప్రధాన మంత్రి పీఠం అధిష్టించాలని వుందని. ఆ కోరిక ఇక తీరే అవకాశం లేదు. ఒక సారి రాష్ట్రపతి ఐన తరువాత ప్రధాని అయ్యేందుకు కుదరదని తెలిసినా, ఆయన ఆ పదవిని ఎంచుకోవడానికి కారణం, ఇప్పట్లో, కాంగ్రెస్ పార్టీ మరో మారు అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు లేనందునే. ఆ విషయం బాగా అర్థం చేసుకున్న ప్రణబ్, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే, తనకెలాగూ ప్రధాని అయ్యేందుకు వీలు కాదు అని భావించి రాష్ట్రపతి పదవికి అంగీకరించారు. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే, దేశంలోను, రాష్ట్రంలోను 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు లేనట్లే. దీనికి కారణాలు అనేకం. రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి కాయ కల్ప చికిత్స చేసినా, ఆంధ్రప్రదేశ్ చేయి జారిపోయినట్లే!
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు, ఒక వైపు జబ్బు ముదురుతుండగా, మరోవైపు, రోగ లక్షణాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. రోజు-రోజుకూ ఇన్‌ఫెక్షన్ వేగంగా పాకుతుండడంతో, వ్యాధిని నియంత్రించడం కష్ట తరమై పోతోంది. బహుశా నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ పరిస్థితిని, ఇంతకంటే మంచిగా ఎవరూ వర్ణించలేరేమో! స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచీ, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వుంటూ వస్తోందీ దక్షిణ భారత ప్రాంతం. కాకపోతే మొట్ట మొదటిసారి 1983-89 లో, ఆ తరువాత 1994-2004 మధ్యలో, ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం చేతిలో ఓటమి పాలైనప్పటికీ, అస్తిత్వాన్ని మాత్రం ఏ నాడూ కోల్పోలేదు. 1983-89 లో అధికారాన్ని కోల్పోయినా, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సమర్ధవంతమైన నాయకత్వంలో 1989 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అదే విధంగా 1994-2004 మధ్య కాలంలో అధికారంలో లేకపోయినా డాక్టర్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2004 లో మళ్లీ పూర్వ వైభవాన్ని పొంది 2009 లో మరో మారు ఎన్నికల్లో గెలిచి ఇంతవరకూ అధికారంలో కొనసాగుతోంది. దురదృష్టవశాత్తు అలాంటి రాజకీయ స్టాల్వార్ట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం, ఆద్యతన భవిష్యత్‍లో అలాంటి వారు దొరుకుతారన్న నమ్మకం కుదరకపోవడం, పార్టీని అపజయ పరంపరలకు గురిచేస్తోంది.


అలనాడు నీలం సంజీవరెడ్డి, ఆయన తరువాత ఆయన వారసుడుగా వచ్చిన బ్రహ్మానందరెడ్డి, 1978-1989 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, 2004-2009 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన డాక్టర్ రాజశేఖర రెడ్డి మినహా, ఈ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య మంత్రులుగా పనిచేసిన వారందరూ, "దిగుబడి సరుకే"!. అధిష్ఠానం నమ్మిన వారో, అధిష్ఠానాన్ని నమ్మించిన వారో, అధిష్ఠానాన్ని ఆ కట్టుకోగలిగిన వారో, లాబీయింగ్ చేయగలిగిన వారో మాత్రమే ముఖ్యమంత్రులు కాగలిగారు. ఆ ఆచారం జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి సోనియా హయాం వరకూ అలాగే కొనసాగుతూ వస్తోంది. దామోదరం సంజీవయ్య గారి నుంచి నేటి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ అదే వరస. వీరిలో సమర్ధులు లేరని కాని, "దిగుబడి" కి సమర్ధత కొలమానం కాదని కాని ఈ వ్యాస రచయిత భావన కాదు. ఇదంతా ఒక ఎత్తైతే, కాంగ్రెస్ ఓట్ బాంక్ వ్యవహారం మరో ఎత్తు. ఎన్టీ రామారావు ప్రభంజనంలో ఓడినప్పుడు కాని, ఆ తరువాత చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం హయాంలో ఓడినప్పుడు కాని, త్రి ముఖ పోటీ జరిగినప్పుడు కాని, కాంగ్రెస్ ఓటు బాంక్ 35-40 శాతానికి తగ్గకుండా పదిలంగా వుంటూ వస్తుంది. మొట్టమొదటి సారిగా దానికి భారీ గండి పడింది. తెలంగాణ ప్రాంతంలో తెరాస గండి కొడుతుంటే, సీమాంధ్రలో జగన్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆ పని చేసింది. ఓటింగు శాతం ఇరవైకి పడిపోయి ఘోర పరాజయం పాలైంది కాంగ్రెస్ పార్టీ. డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 లో ఎదురు కానున్న పరిస్థితి అగమ్య గోచరంగా కనిపించసాగింది. 
2009 ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణ భూతుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణానికి గురైన దరిమిలా పార్టీకి ఈ దుస్థితి క్రమేపీ ఏర్పడ సాగింది. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, భారతీయ జనతా పార్టీల సారధ్యంలో ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ను మట్టి కరిపిస్తుంటే, మరో పక్క కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ సీమాంధ్ర ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఎదగ సాగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీమాంధ్రలో జగన్ విజయం, తెలంగాణలో తెరాస అభ్యర్థి విజయం కాంగ్రెస్ పార్టీని ఖంగు తినిపించాయి. అధిష్ఠానానికి నెత్తి బొప్పి కట్టించేలా చేశాయి. నెత్తి మీద కుంపటి దించుకున్న చందాన, చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినా ఫలితం శూన్యం. కాకపోతే, చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు కాంగ్రెస్‌కు రెండు సీట్లిచ్చాయి. ఇదేదో తన ఘనతగా చాటుకుంటున్నాడు చిరంజీవి. ఆయన తన సినీరంగ పలుకుబడితో జనాలను ఆకర్షించుకోగలడేమో కాని, ఓటర్లను ఆకట్టుకోలేరనేది మరో మారు స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీకి తెలిసో-తెలియకో, ప్రత్యక్ష జోక్యంతోనో-పరోక్ష ఒత్తిడితోనో, ఆ పార్టీ రచించిన ప్రణాళికా వ్యూహం బెడిసికొట్టిందనాలి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్-తదనంతర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర ప్రతికూలతకు దారి తీశాయి. మరి ఈ దుస్థితి నుంచి గట్టెక్కాలంటే, నాలుగో కృష్ణుడి రూపంలో, జైపాల్ రెడ్డో-జానారెడ్డో-శషిధర రెడ్డో-డి. శ్రీనివాసో-లేదా, మరో వ్యక్తో రావాలి. కాకపోతే ఆ వచ్చే వారికి కూడా ఇదే పరిస్థితి ఎదురు కాదన్న నమ్మకం లేదు.
"టీ"-"జే" ల ఒత్తిడి మధ్య కొట్టు మిట్టాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలి మధ్య వున్నట్లుంది. ఇదే పరిస్థితి దాదాపు జాతీయ స్థాయిలో కూడా నెలకొని వుంది. కళ్ల ముందర, ఈ పరిస్థితిని అధిగమించడానికి, మార్గాలేవీ కనిపించడం లేదు. గత ఎన్నికల్లో యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదపడేందుకు, దేశంలోనే అధిక సంఖ్యలో-33 మంది ఎంపీలను సమకూర్చిన రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ప్రభావం జాతీయ స్థాయిలో పార్టీ మీద పడక తప్పదు. పార్టీ-యుపిఎ అధికారానికి దూరం కాక తప్పదు. ఈ నేపధ్యంలో, మన్మోహన్ సింగ్ నుంచి అత్యంత అలవోకగా ప్రధాని పదవిని తనయుడు రాహుల్ గాంధీకి బదలాయించాలని తాపత్రయ పడుతున్న సోనియా గాంధీ ముందున్న సవాళ్లు ఏంటి? వాటిని ఆమె ఏ విధంగా అధిగమించగలరు? కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలం ఎదుర్కుంటుందన్నది వాస్తవం. సవాళ్లను సోనియా ఎదుర్కునే ముందర, రాష్ట్రంలో అందరికీ అర్థం అవుతున్న కొన్ని నగ్న సత్యాలను అధిష్ఠానం సహితం అర్థం చేసుకుంటే మంచిదేమో! మంచికో-చెడ్డకో రోశయ్యను మార్చి కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని అంటగట్టిన అధిష్ఠానం, ఏ నాడన్నా ఆయనకు పరిపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చిందా? ఆయన మంత్రి వర్గాన్ని ఆయనే ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చిందా? పదవుల పందేరం చేయనిచ్చిందా? ఆయనకిష్ఠమైన వారిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎంపిక చేసుకునే వీలు కలిపించిందా? తన మంత్రివర్గంలో అనునిత్యం తనను ఎదిరిస్తున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం వుందా? ముందు వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం అధిష్ఠానానికి ఉంది.
బహుశా, తమిళనాడు తరహాలో, ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో అవగాహన కుదుర్చుకోక తప్పని పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్‌కు తప్పదా? అలాంటప్పుడు, ఆ ప్రాంతీయ పార్టీ ఎలాగూ తెలుగుదేశం కాదు కాబట్టి, తెరాసతోను-వైఎస్సార్ సీపీ తోను అవగాహన వుండే అవకాశాలున్నాయా? రాష్ట్ర విభజన చేయక తప్పదా? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఏదో ఒక నిర్ణయం ప్రకటించక తప్పదా?  
2014 లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్‌ను సన్నద్ధం చేసేందుకు-బలోపేతం చేసేందుకు, జాతీయ స్థాయిలో పార్టీ అధి నాయకత్వం-అధిష్జ్ఠానం చేపడుతున్న చర్యల్లో భాగంగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, భావి భారత ప్రధానిగా భావించబడుతున్న రాహుల్‌ గాంధీ, ముఖ్య భూమిక పోషించేందుకు సమాయత్తమౌతున్నారు. యువ నాయకుడు రాహుల్ గాంధీ కాయ కల్ప చికిత్స మొదలు పెట్టారంటున్నారు. అందులో భాగంగానే, ఢిల్లీలో తల్లిని కలవడానికి వచ్చిన పెద్దా-చిన్నా పనిలో పనిగా రాహుల్ గాంధీని కూడా కలిసి పోతున్నారు. అంతే కాదు. రాహుల్ గాంధీనే స్వయంగా ఎంపిక చేసిన కొందరికి ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన తెలంగాణ అంశంపైన, వైఎస్‌ఆర్సీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్‌ దూకుడు పైన రాహుల్‌ ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు మీడియా కధనాలొచ్చాయి. రాష్ట్రంలోని సీనియర్‌ నేతలు పలువురితో వ్యక్తిగతంగా మంతనాలు జరిపారు. ఇప్పటికే రాహుల్‌ రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఎంపీలతో విడివిడిగా సమావేశమై పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించారంటున్నారు. అధినేత్రి సోనియా ఆదేశాలతోనే రాహుల్‌ రంగ ప్రవేశం చేశారా? లేక స్వయంగా ఆయన తనంతట తానే చొరవ తీసుకుని ఇలా చేస్తున్నారా? అనేది ఇంకా తేలాల్సిన విషయమే.
సీనియర్ పార్టీ నాయకుడు పాల్వాయి గోవర్ధనరెడ్డికి రాహుల్ కబురు పంపి మరీ కలుస్తున్నాడు. ఈ కలయిక వెనుక కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలన్న ఆశయముందా? లేక తాత్కాలికంగా నాయకత్వ మార్పు గురించిన ఆలోచన వుంటుందా? ఇప్పుడిప్పుడే ఏమీ చెప్పలేం. ఇటీవల కాలంలో పాల్వాయి గోవర్ధన రెడ్డిని సంప్రదించడం కొంచెం ఎక్కువైపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక వేళ నాయకత్వం మార్చే అవకాశం వుంటే, సీనియర్ నాయకుడైన ఈ తెలంగాణ ప్రాంత వ్యక్తికి కూడా అవకాశాలుండవచ్చేమో! ఏదేమైనా ప్రత్యేక తెలంగాణ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు మెరుగయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగా, రాయల తెలంగాణాను ఏర్పాటు చేసి, తెరాసతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మిగిలిన సీమాంధ్ర ప్రాంతానికి మొదలు ఢిల్లీ నుంచి ఒక నాయకుడిని దిగుమతి చేసి ముఖ్యమంత్రిని చేయడం, ఆ తరువాత చిరంజీవిని పీఠం ఎక్కించడం జరగొచ్చని భావిస్తున్నారు.

Wednesday, June 27, 2012

రాహుల్ కోసం అధిష్ఠానం కౌటిల్యం!: వనం జ్వాలా నరసింహారావు


రాహుల్ కోసం అధిష్ఠానం కౌటిల్యం!
సూర్య దినపత్రిక (28-06-2012)
వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న పరిశీలకులు అసలా రాష్ట్రంలో ఏం జరుగుతోందా అన్న మీమాంసతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రత్యేకించి, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను వివిధ కోణాలనుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర-రాష్ట్రేతర విశ్లేషకులకు, ఆ ఫలితాల మర్మం ఏంటో? అన్న చిక్కుముడిని విప్పే పనిలో పడిపోయారానక తప్పదు. ఈ మొత్తం వ్యవహారంలో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చాలా తేలికగా కనిపించవచ్చు కాని వాస్తవానికి అంత చిన్న విషయమేమీ కాదనాలి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతావనికి, ప్రభుత్వ పదవి లేకపోయినా-ప్రధాని కాకపోయినా, మకుటం లేని మహారాణిగా చెలామణి అవుతున్న సోనియా గాంధీ-ఆమె కుమారుడు, ఢిల్లీ పీఠం బావి వారసుడు రాహుల్ గాంధీల ఆధిపత్యం ఏం కాబోతున్నదా అన్న అనుమానం ఈ ఉప ఎన్నిక ఫలితాల ద్వారా కలగక మానదంటునారు ఆ పరిశీలకులు. పాద రసంలాగా ఎగబాకుతున్న యువ నాయకుడు, వైఎస్సార్ తనయుడు, "రెబెల్" వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగు రీతిలో రాజకీయ గుణపాఠం చెప్పి తీరాల్సిందే అన్న పట్టుదలతో యావత్ కాంగ్రెస్ అధిష్ఠానం ముందడుగు వేస్తోంది. తాను నమ్ముకున్న-తననే నమ్ముకున్నారని భావిస్తున్న రాష్ట్ర ప్రజలను "ఓదార్పు యాత్ర" పేరుతో కలవాలనుకున్న జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరిని-తిరుగుబాటు ధోరణిని అల నాడు అధిష్ఠానం సహించే స్థితిలో లేదు. ఆయన కోరుకున్న విధంగా చేయడానికి ఆయనను అనుమతి ఇచ్చినట్లయితే, ప్రజల సానుభూతి-సహానుభూతి పొంది, ఒక ప్రజానాయకుడుగా జగన్ ఎదిగేందుకు దోహదపడుతుందని అప్పట్లో అధిష్ఠానం భావించి, ఆయనకు ముక్కుతాడు వేసే ప్రయత్నం చేసింది. మొన్న జరిగిన ఉప ఎన్నికలను కూడా, తమకు అనుకూలంగా, ఒక ఆయుధంలాగా మలచుకుందామని, జగన్ పార్టీలోకి వలసలను ఆపు చేద్దామని అపోహపడింది అధిష్ఠానం. వీటన్నింటి నేపధ్యం ఒకటే! సామ-దాన-భేద-దండోపాయాలను ఉపయోగించి సోనియా-నెహ్రూ-గాంధీ కుటుంబాల వారసత్వానికి, ఆధిపత్యానికి తిరుగులేని అవకాశం కలిగించి, రాహుల్ గాంధీని ఢిల్లీ గద్దె ఎక్కించడమే! భావి భారత ప్రధానిగా చూడడమే! అది ఇలా సాధ్యపడుతోందా? లేదా? అంటే అది వేరే సంగతి!


అధిష్ఠానంకు ఈ తరహా ఆలోచన రావడం, అమలుచేయడం, కొత్తేమీకాదు. గతంలో కూడా, అధిష్ఠానానికి ఎదురుతిరిగిన మహామహులను-ఉద్దండ పిండాలను నిరంకుశంగా కాల రాసింది. రాజగోపాలాచారిని రాష్ట్రపతి కాకుండా చేయగలిగింది. ఎదురుతిరిగిన వైబి చవాన్ ను, మొరార్జీ దేశాయ్ ని, ఆ మాటకొస్తే ఎంతో మంది అతిరధ-మహారధులను అర్థ రధులుగా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, "సమిష్ఠి నాయకత్వం" అన్న మాటే గిట్టదు అధిష్ఠానానికి. అధిష్ఠానం అంటే ఎవరో కాదు. ఒకనాడు నెహ్రూ అయితే, ఆ తర్వాత ఇందిర, రాజీవ్ (మధ్యలో సంజయ్) లు కాగా ఇప్పుడు సోనియా. ఆ ఏక వ్యక్తుల అభిప్రాయమే ఏకాభిప్రాయం-సమిష్ఠి అభిప్రాయం. ఆ సుప్రీం లీడర్‌కు అంతా సలాం కొట్టాల్సిందే! అడుగుజాడలలో నడవాల్సిందే!వారెంత ప్రజాదరణ కల నాయకులైనా, పరిణితి చెందిన నాయకులైనా, ఎన్ని రకాల శక్తి సామర్ధ్యాలున్న వారైనా, తలవంచక-దాసోహం అనక తప్పదు. అలాంటప్పుడు జగన్ స్థాయి నాయకుడిని, ఆయన ఇష్టం వచ్చినట్లు చేయనివ్వడానికి అధిష్ఠానం ఎలా అంగీకరించుతుంది? అది గతం. ఇక ఇప్పుడో? రెండేళ్ల తరువాత రానున్న సార్వత్రిక ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీకి అంతగా అనుకూలంగా లేని ప్రస్తుత పరిస్థితులలో, మరో ప్రాంతీయ పార్టీని బ్రతికి బట్ట కట్టనిస్తుందా? ఇప్పటికే ఉప ఎన్నిక ఫలితాల ద్వారా, పరువు-ప్రతిష్ఠలను పూర్తిగా కోల్పోయిన కాంగ్రెస్ అధిష్ఠానం, జగన్ పార్టీని మనుగడ చేయనిస్తుందా? పోనీ ఏం చేయగలుగుతుంది? అన్నింటికన్నా ముఖ్యమైంది, పవర్ పాలిటిక్స్ ను అర్థం చేసుకోగలగడం. పవర్ పాలిటిక్స్ ను అనుసరించాలంటే, ఊహ కందని వ్యూహాలను పన్నాలి. వాటికి నైతికత అక్కర లేదు. సోక్రటీస్ దగ్గర నుంచి అరిస్టాటిల్ వరకు వాటి రుచి ఎరిగినవారే.
పవర్ పాలిటిక్స్ అనే ఆట ఆడడంలో ఢిల్లీ అధినాయకత్వానికి తెలియని కిటుకు లేదు. ఆ ఆట ఆడడానికి అనుసరించని నిరంకుశ ధోరణి లేదు. ఆ మాటకొస్తే, భారతీయ సంస్కృతీ-సాంప్రదాయాలలో పవర్ పాలిటిక్స్ అనాదిగా వస్తున్న ఆచారమేనేమో! రామాయణ , మహాభారత కావ్యాలలో, భగవద్గీతలో, చాణక్యుడి అర్థశాస్త్రంలో, కుటిల రాజకీయాల గురించి అనేకానేక విషయాలు చెప్పడం జరిగింది. "నారద మహా మునులు", "మామ శకునిలు", "కౌటిల్యులు" మనకు కనిపించుతారు సందర్భోచితంగా. "నెహ్రూ-ఇందిర-గాంధీ" వారసత్వ సంపదను పదికాలాలపాటు పదిలంగా ఉంచడానికి, కాంగ్రెస్ అధిష్టానం, పురాతన-ఆధునిక కాలపు పవర్ పాలిటిక్స్ ను , అవసరమైతే, జాతీయ అవసరాలను పక్కన పెట్టినా సరే, తమకు అనుకూలంగా మలచుకుంటూ వస్తున్నది. కాకపోతే, అన్నివేళలా అధిష్ఠానం ఆలోచనలు విజయవంతమవుతున్నాయా అంటే, బెడసి కొట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఉప ఎన్నికల ఫలితాలు దానికొక ఉదాహరణ మాత్రమే! ఈ ఆటలో ఏకైక వ్యూహం ఒక్కటే. ఏదో విధంగా రాహుల్‌ను ప్రధాని పీఠం ఎక్కించడమే! దానిని అడ్డగించినవారికి చుక్కలు చూపించే ప్రయత్నం చేయడమే! ఈ పరంపరలో జారి ప్రయోజనాలు దెబ్బతిన్నా పర్వాలేదు.
ఢిల్లీ దర్బారులో జగన్మోహన్ రెడ్డికి "గాడ్ ఫాదర్" గా కొందరు భావిస్తున్న బెంగాల్ దాదా ప్రణబ్ కుమార్ ముఖర్జీ, మరో నెల రోజుల లోపు భారత రాష్ట్రపతి కాబోతున్నారు. వాస్తవానికి, ప్రణబ్ కున్న అనుభవం రీత్యా, పరిణితి రీత్యా, సీనియారిటీ రీత్యా, రాజకీయ స్థితప్రజ్ఞత రీత్యా, ఏ కోణం నుంచి చూసినా, మన్మోహన్ సింగ్‌కు ఆయనే వారసుడు కావాలి. ప్రధాన మంత్రి పదవికి ఆయనకంటే అర్హుడు మరెవ్వరూ లేరనాలి. ఆయన ఆ పీఠాన్ని అధిరోహించితే అడ్డు చెప్పేవారు కాని, చెప్పగలిగేవారు కాని పార్టీలో ఎవరూ లేరు. అందుకే, రాహుల్‍కు దారి సుగమం చేయడానికి ప్రణబ్‌కు మరో విధంగా పదోన్నతి కలిగించి రాష్ట్రపతి పదవి కట్టబెట్తున్నది నెహ్రూ-ఇందిర-గాంధీ వారసత్వం. ఇప్పుడిప్పుడే రాజకీయ పాఠాలు నేర్చుకునేవారు సైతం ఈ కుట్రను అర్థం చేసుకోవడం తేలికే! యుపిఎ భాగస్వామ్య పార్టీల నాయకులు శరద్ పవార్, అజిత్ సింగ్, మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, కరుణానిధి లాంటి కాకలు తీరిన యోధుల పాదాలు చల్లబడేట్లు చేసింది సోనియా నిర్ణయం. ఒకవేళ వీరిలో ఎవరన్నా నోరు మెదిపితే, ఎల్లప్పుడూ వాడే సిబిఐ దర్యాప్తు లాంటి బ్లాక్ మెయిల్ ఆయుధం వారిపై కూడా ప్రయోగించే వీలుందని అందరికీ తెలిసిన విషయమే! ఇక రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరడానికి అన్నీ అడ్డంకులే. బిజెపి, దాని మిత్ర పక్షాలలో కూడా అలజడి రేగింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల్లోనే ఏకాభిప్రాయం లేదు. కుదరదు కూడా. ఇక రాష్ట్రం విషయానికొస్తే, జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు బావుటాను ఎదుర్కునేందుకు అధిష్ఠానం తనముందున్న తురుఫ్ ముక్కలన్నింటినీ బయటకు తెచ్చింది. ఎప్పుడైతే పద్దెనిమిది మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యులు పార్టీ ఫిరాయించనున్నారని పసికట్టిందో, అప్పుడే, చిరంజీవిని గుంజుకుంది. కీలకమైన ఉప ఎన్నికల సమయంలో జగన్ జైలు పాలయ్యాడు. ఆయన జైలుకు పోతే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ లబ్ది పొందేందుకు బదులుగా, సానుభూతి పవనాలతో భారీగా నష్టపోయింది. ఓటర్ల మనోగతాన్ని పసికట్టడంలో దారుణంగా విఫలమైంది. విజయమ్మ కన్నీళ్లు వైఎస్సార్ సీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లను సంపాదించిపెట్టాయి. షర్మిల హావభావాలు రాజశేఖర రెడ్డిని తలపించాయి. జగన్ కుటుంబ సభ్యులు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టనుందని కాంగ్రెస్ అధిష్ఠానం ఊహించలేకపోయింది. నష్టం జరిగిపోయింది. ఘోరంగా ఓటమి పాలైంది. పది స్థానాలలో డిపాజిట్ కోల్పోయింది. ఓటు బాంకుకు గండి పడింది. ప్రధాన ప్రతిపక్షం కూడా మట్టి కరిచింది.
జగన్ తల్లీ-కూతురు, గాయపడ్డ కొదమ సింహాలలా ఓటర్ల ముందు రెచ్చి పోయారు. భర్తను పోగొట్టుకుని, కొడుకును జైలు పాలు చేస్తుంటే ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో వున్నాననని విజయమ్మ అంటే, తండ్రిని పోగొట్టుకుని అన్నను జైలులో చూడాల్సి వస్తున్నదని షర్మిల వాపోయింది. ఓటర్లు సానుభూతి విపరీతంగా పోగైంది. మరో పక్కన జగన్‌పై సిబిఐ దర్యాప్తు కూడా ముమ్మరమైంది. దారుణ పరాభవం తప్పదనుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం జాతీయ-రాష్ట్ర స్థాయి కీలకమైన నాయకులను ప్రచార రంగంలోకి దింపింది. గులాం నబీ ఆజాద్, చిరంజీవి, పురంధరేశ్వరి, రేనుకా చౌదరి, వైలార్ రవి లాంటి వారెందరో తమ వంతు పాత్ర పోషించినా ఫలితం శూన్యం. జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు సంవత్సరాలు జైలులోనే వుంటాడన్న ప్రచారమూ జరిగింది. డబ్బు విషయంలో అటు కాంగ్రెస్ పార్టీకి కాని , ఇటు జగన్మోహన్ రెడ్డికి కాని ఎదురే లేదు. "ఓటుకు నోటు" అన్న నినాదం ఓటర్లను కించపరిచే స్థాయి వరకూ పోయింది. నిజంగా డబ్బు ఓట్లను తెచ్చిందా? లేదా? అన్నది ఎవరికి వారే ఊహించుకోవాలి. ఒక్క నెల్లూరు లోక సభ పరిధిలోనే వందల కోట్లు ఖర్చైందని వార్తలొచ్చాయి. పట్టుబడ్డ పైకమే అరవై కోట్లకు పగా వుందంటే ఖర్చైంది ఎంతో అంచనా వేసుకోవచ్చు. కేజీల కొద్దీ బంగారం, లీటర్ల కొద్దీ మద్యం కూడా పట్టుబడింది. ఇంత జరుగుతున్నా, న్యాయస్థానానికి వచ్చేటప్పుడు-పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి కులాసాగా నవ్వుకుంటూ-చేతులు ఊపుకుంటూ వుండడం గమనించాల్సిన విషయం.
ఇదంతా పరిశీలుస్తున్న విశ్లేషకులకు అంతా గమ్మత్తుగా వుంది.

Friday, June 22, 2012

Jwala and Bujji Family Photographs

 Kishan, Kinnera, Yashwin, Jwala, Medha and Bujji

 Kishan, Kinnera, Yashwin, Jwala, Medha and Bujji
 Kishan, Kinnera, Aditya, Parul, Bunti, Vijay, Jwala, Bujji,
Mihira, Kanak, Ansh, Medha and Yashwin
 Kishan, Kinnera, Aditya, Parul, Bunti, Vijay, Jwala, Bujji,
Mihira, Kanak, Ansh, Medha and Yashwin
Kishan, Kinnera, Aditya, Parul, Bunti, Vijay, Jwala, Bujji,
Mihira, Kanak, Ansh, Medha and Yashwin
 Aditya and Parul with Ansh and kanak
 Aditya, Parul, Ansh and kanak with Jwala and Bujji
 Jwala and Bujji
 Vijay and Bunti with Mihira
 Vijay, Bunti and Mihira with Jwala and Bujji
Jwala with Hyndavi