Sunday, February 6, 2022

మేనకను మోహించిన విశ్వామిత్రుడు ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-94 : వనం జ్వాలా నరసింహారావు

 మేనకను మోహించిన విశ్వామిత్రుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-94

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (07-02-2022)

         "వెయ్యేళ్లు విశ్వామిత్రుడిలా ఘోరమైన తపస్సు చేయడంతో, బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి మునీశ్వరుడిని చూసేందుకొచ్చి, అతడు చేసిన తపస్సు వలన-తప ఫలంగా ఆయన ఋషి అయినాడని చెప్పి అంతర్థానమయ్యాడు. ఆ మాటలకు తృప్తి చెందని విశ్వామిత్రుడు, అంతకంటే ఘోరమైన-కఠోరమైన తపస్సు చేయసాగాడు. అలా చేస్తున్న సమయంలో, సమీపంలోని తీర్థంలో స్నానమాడేందుకు, అతి మనోహరమైన సౌందర్యంతో-మన్మథుడి ఆయుధమేమోనని అనుకుండే విధంగా కనిపిస్తున్న ఒక అప్సరస, విశ్వామిత్రుడిని మోసగించే ఉద్దేశంతో వచ్చింది. కమలాల లాంటి కళ్లతో, పూవువలె మనోహరమైన మెచ్చుకోవాల్సిన శరీరంతో, రతిక్రీడలో ఆసక్తితో, మేఘాలలాంటి నల్లటి కురులతో, మొగ్గలలాంటి దంతాలతో, చంద్రుడిలాంటి ముఖంతో అందంగా వున్న ఆ అప్సరస, మేఘాల మధ్య మెరుపుతీగలాగా నీళ్లల్లో స్నానం చేస్తుంటే విశ్వామిత్రుడు చూశాడు. చూసి, కామ బాణ పీడితుడై, మనస్సు కలవరపడగా, తామరాకుమీద పడిన నీళ్లు చలించినట్లు మనస్సు చలించడంతో, ఆ అందగత్తెను సమీపించాడు. ’అప్సరసకు శోభనమగు కాక’ అని అంటూ, ఆమెను చూసినప్పటినుండి మన్మథుడు దయ లేకుండా బాణాలతో తనను తూట్లుపడేటట్లు పొడుస్తున్నాడని, ఆ వేదనను సహించలేనని, మనసార ఆమె అక్కడే వుండి ప్రేమాతిశయంతో తనను పాలించమని కోరతాడు. ఆమెకు నమ్మిన బంటులాగా ప్రవర్తిస్తానని, తన మాట నమ్మమని, మోసం చేయనని విశ్వామిత్రుడు అప్సరసను ప్రార్థించాడు".

         "విశ్వామిత్రుడి అభ్యర్థనను సరేనని అంగీకరించిన అప్సరస, ఋషీశ్వరుడి ఆశ్రమంలో వుండిపోయింది. వారిద్దరూ భార్యా-భర్తలలాగా పది సంవత్సరాలు గడిపారు. అప్పటికి, విశ్వామిత్రుడి మదన తాపం తగ్గి, తను చేసిన పనిగురించి ఆలోచించసాగాడు. ఎట్లైనా బ్రాహ్మణ్యం సంపాదించాలని ఆశతో వైరాగ్యం పూనిన విశ్వామిత్రుడెక్కడ-వ్యాకులపడక జితేంద్రియుడై మహా తపస్సు చేయడమేంటి-ఇప్పుడీ బోగందిలా తోడుగా వుండడమేంటి? బ్రాహ్మణులు వింటే ఫక్కున నవ్వరా అని ఆలోచించాడు. చపల మనస్సుతో మన్మథుడి బారిన పడితినేనని, పది సంవత్సరాలు వృధాచేసానేనని బాధపడ్డాడు. సుఖాలు వదిలిన రాజని, విరాగి అని, బ్రాహ్మణ్యం కొరకు అడవుల్లో ఏళ్లతరబడి తపస్సు చేస్తున్నాడని తనను గురించి అనుకునే వారందరూ ఇప్పుడు, బోగందానికి వశపడ్డాడనీ-వీడికి బుద్ది లేదని అనుకుంటారని విచారపడ సాగాడు. ఈ జంజాటానికి కారణం, తన తపస్సు నాశనం చేసేందుకు ఇది దేవతలు పన్నిన పన్నాగంగా అర్థంచేసుకుంటాడు. దేవతలవల్ల మోసపోయాను కదా అని ఆలోచిస్తున్న విశ్వామిత్రుడిని చూసి భయపడింది అప్సరస మేనక. తను శపిస్తాడేమోనని భయపడుతున్న దేవకన్య మేనకతో, ఆమె తప్పులేదని, దోషం ఆమెదికాదని, బుద్ధిలేనివాడినైన తాను కామానికి దాసుడనై ఆమె సాంగత్యంతో చెడిపోయానని అంటాడు. ఆమెను దూషించి ప్రయోజనం లేదని చెప్పి ఇక వెళ్లమంటాడు. అమెను పంపి కామాన్ని జయించేందుకు విశ్వామిత్రుడు హిమవత్పర్వతం దగ్గరున్న కౌశికీ తీరంలో కఠినమైన తపస్సుచేసేందుకై పోయాడు".

మహర్షి ఐన విశ్వామిత్రుడు

"అక్కడ ఉత్తరానున్న మంచు కొండమీద వెయ్యి సంవత్సరాలు నిశ్చలుడై-నిర్విఘ్నంగా తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. ఆయన తపస్సుకు లోకాలన్నీ కలవరపడుతున్నాయని, సజ్జన శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు మహర్షి కావడానికి సరిపడేంత తపస్సు చేశాడని, ఆ మాటతడికి చెప్పి ఆయన్ను సమాధానపర్చాలని దేవతలందరు బ్రహ్మను కోరారు. బ్రహ్మదేవుడు వారు చెప్పినట్లే విశ్వామిత్రుడి దగ్గర కొచ్చి, ఆయన మహర్షి అయ్యాడని అంటాడు. ఆయన మాటలకు విశ్వామిత్రుడు పొంగిపోలేదు. తను జితేంద్రియుడనయ్యానా అని బ్రహ్మను ప్రశ్నించాడు. ఆయనింకా జితేంద్రియుడు కాలేదని, దానికొరకు ఇంకా ప్రయత్నంచేయాలని, ఆయన మనస్సు వికారం పొందేందుకు అవకాశమున్నప్పటికీ అలా కానీయకుండా చేయగలిగినప్పుడే జితేంద్రియుడవుతాడని జవాబిచ్చాడు బ్రహ్మ. అల్ప కారణంతో కొడుకులను శపించినవాడు జితేంద్రియుడెలా అవుతాడనంటూ బ్రహ్మ వెళ్లిపోయాడు. విశ్వామిత్రుడు తిరిగి కామాన్ని జయించడంకొరకు, రెండు చేతులు పైకెత్తి, గాలినే ఆహారంగా తీసుకుంటూ, నిరాహారంగా కదలక-మెదలక ఆశ్చర్యకరమైన తపస్సు చేశాడు. మండుటెండల్లో పంచాగ్నుల మధ్య, జోరుగా వానలు కురుస్తున్నప్పుడు ఆరుబయట, మంచులాంటి శీతాకాలంలో చల్లటి నీళ్లల్లో నిలిచి రాత్ర్రింబగళ్లు తపస్సు చేశాడు. విశ్వామిత్రుడిలా ఘోర తపస్సు చేస్తుంటే, ఆ వేడికి ప్రపంచమంతా తల్లడిల్లింది. దేవతలు-ఇంద్రుడు ఆయన తపస్సు భంగం చేయడానికి ఈ సారి రంభను ఉపయోగించుకోవాలనుకుంటారు".

 

Saturday, February 5, 2022

భీష్ముడు దుర్యోధనుడికి చెప్పిన అంబోపాఖ్యానం ..... ఆస్వాదన-58 : వనం జ్వాలా నరసింహారావు

భీష్ముడు దుర్యోధనుడికి చెప్పిన అంబోపాఖ్యానం

 ఆస్వాదన-58

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (06-02-2022)

పాండవ పక్షంలో వున్న శిఖండిని చంపలేనని భీష్ముడు తనకు చెప్పగానే దానికి కారణం ఏమిటని కుతూహలంగా ఆయన్ను ప్రశ్నించాడు దుర్యోధనుడు. ఆ పూర్వాపరాలన్నీ వివరంగా చెప్పాడు భీష్ముడు.

భీష్ముడి తండ్రి శంతను మహారాజు దాశరాజు కూతురు సత్యవతిని వివాహం చేసుకుని చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులను కన్నాడు. వారు పెద్దవారు కాకముందే ఆయన చనిపోయాడు. భీష్ముడు సత్యవతీ-శంతనుల పెద్ద కుమారుడైన చిత్రాంగదుడిని రాజ్యాభిషిక్తుడిని చేశాడు. రాజైన కొద్ది కాలానికే చిత్రాంగదుడిని ఒక గంధర్వుడు యుద్ధంలో సంహరించాడు. తదనంతరం, భీష్ముడు విచిత్రవీర్యుడిని కౌరవ రాజ్యానికి అభిషిక్తుడిని చేశాడు. అతడికి వివాహం చేయాలని భావించాడు భీష్ముడు.

కాశీరాజు తన ముగ్గురు కూతుళ్లకు స్వయంవరం చాటించడం విన్న భీష్ముడు అక్కడికి వెళ్లి, స్వయంవరంలో అలంకరించబడి వున్న అంబ, అంబిక, అంబాలిక అనే ఆ ముగ్గురు కన్యలను తన రథంమీద ఎక్కించుకుని, తన తమ్ముడికి వారిని వివాహం చేయడానికి తీసుకుపోతున్నానని ప్రకటించాడు. తనను ఎదుర్కున్న రాజులందరినీ పరాజితులను చేశాడు. సాల్వపతి సాళ్వుడు మాత్రం భీష్ముడిని వెంబడించాడు కాని యుద్ధంలో ఓడిపోయి తన పట్టణానికి వెళ్లిపోయాడు. ఆ ముగ్గురు కన్యలతో హస్తినాపురం చేరుకున్న భీష్ముడు వారిని తన తల్లి సత్యవతికి అప్పగించాడు. ఆ ముగ్గురిని విచిత్రవీర్యుడికిచ్చి వివాహం జరిపించాలని యత్నిస్తుండగా, వారిలో అంబ, తాను సాల్వపతి సాళ్వుడిని ప్రేమించానని, అతడి దగ్గరికి తనను సాదరంగా పంపమని వేడుకున్నది భీష్ముడిని. ఆమె కోరినట్లే భీష్ముడు అంబను సాళ్వుడి దగ్గరికి పంపాడు. అంబిక, అంబాలికలను విచిత్రవీర్యుడికి ఇచ్చి వివాహం జరిపించాడు.

తన దగ్గరికి వచ్చిన అంబను సాళ్వుడు తిరస్కరించాడు. ఆమె భీష్ముడి వల్ల అపహరించబడిన కులటవన్నాడు. ఆమెను పత్నిగా స్వీకరించడం న్యాయం కాదని, ఆమెకు కన్యాత్వం పోయిందని, ఆమెను భార్యగా వరించడం తగదని, ఇక తన దగ్గర నిలవ వద్దని సాళ్వుడు చెప్పడంతో అంబ అక్కడి నుండి వెళ్లిపోయింది. తన బతుకు చట్టు బండలైందని, ఇక అప్పుడు భీష్ముడి దగ్గరికి వెళ్లినా ప్రయోజనం లేదని, అతడిని సాధించి తీరాలని నిర్ణయించుకుని తపస్సు చేయడానికి నిశ్చయించుకున్నది.

మునీశ్వరులు తపస్సు చేసుకునే ఒక పావన ప్రదేశానికి వెళ్లి, వారితో తనకు తపస్సు చేయాలని వుందని చెప్పింది. ఆమె ఆ విధంగా చెప్పుతున్న సమయంలో ఆ మునుల ఆశ్రమానికి హోత్రవాహనుడనే రాజర్షి వచ్చాడు. అంబ వృత్తాంతం విన్న ఆ రాజర్షి, ఆమె తనకు వరుసకు దౌహిత్రి అవుతుందని చెప్పి, ఆమెను పరశురాముడిని దర్శించమని సలహా ఇచ్చాడు. అలా ఆయన సలహా ఇస్తున్న సమయంలోనే యాధృచ్చికంగా పరశురాముడి శిష్యుడైన అకృతవ్రణుడు అనే ముని అక్కడికి వచ్చాడు. హోత్రవాహనుడిని చూడడానికి శిష్యులతో కూడి పరశురాముడు మర్నాడు అక్కడికి వస్తున్నట్లు చెప్పాడు అకృతవ్రణుడు. ఆయన చెప్పినట్లే మర్నాడు పరశురాముడు అక్కడికి వచ్చాడు.

హోత్రవాహనుడు పరశురాముడికి అంబను తన మనుమరాలిగా పరిచయం చేశాడు. ఆమె కథ వినమన్నాడు. అంబ ఆ మహానుభావుడికి తన సంగతంతా విపులంగా చెప్పింది. తన అవమానం బాపి తనను కాపాడమని పలికింది. సాళ్వుడిని శిక్షించాలా? లేక భీష్ముడిని దండించాలా? అని ప్రశ్నించాడు పరశురాముడు. తనను ఎత్తుకుపోయిన భీష్ముడి మీద చాలా కోపంగా వున్నదని, అతడిని చంపడానికి తపస్సు చేద్దామనుకున్నానని అన్నది అంబ. తాను చెప్పినట్లు భీష్ముడు చేస్తాడని, చేయకపోతే అతడిని తన బాణాలతో చంపుతానని, ఆమె తపస్సు చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు పరశురాముడు.

అంబను వెంటబెట్టుకుని పరశురాముడు కురుక్షేత్రానికి వచ్చాడు. ఆయన రాకను తెలుసుకున్న భీష్ముడు ఆయన దర్శనార్థం వెళ్లాడు. అంబను చూపించి ఆమెను కూడా విచిత్రవీర్యుడికిచ్చి వివాహం జరిపించమన్నాడు. అంబ కోరినట్లే ఆమెను సాళ్వుడి దగ్గరికి పంపిన తరువాత ఇప్పుడు విచిత్రవీర్యుడితో వివాహం జరిపించడం కుదరదన్నాడు భీష్ముడు. తన మాట వినకపోతే భీష్ముడిని, ఆయన స్నేహితులను, చుట్టాలను చంపుతానని హెచ్చరించాడు పరశురాముడు. భీష్ముడు ఎంత వేడుకున్నా తగ్గలేదు. యుద్ధానికి సిద్ధమై సేనావ్యూహాలు పన్నాడు. శీఘ్రమే యుద్ధానికి రమ్మన్నాడు భీష్ముడిని. యుద్ధానికి తాను ఒక్కడినే వస్తానని చెప్పి భీష్ముడు తల్లి సత్యవతి ఆశీర్వాదం తీసుకున్నాడు. యుద్ధానికి పోతున్న భీష్ముడిని అతడి అసలు తల్లి గంగాదేవి స్త్రీరూపంలో వచ్చి యుద్ధ కారణం తెలుసుకుని, పరశురాముడి దగ్గరికి వెళ్లి శాంతించమని చెప్పినా ఆయన ఒప్పుకోలేదు.

పరశురాముడికి, భీష్ముడికి యుద్ధం ప్రారంభం అయింది. పరశురాముడు భీష్ముడి మీద శరవర్షం కురిపించాడు. వాటన్నిటినీ అణచి వేశాడు భీష్ముడు. ఒక దశలో పరశురాముడు మూర్ఛపోయి మళ్లీ తేరుకున్నాడు. భీష్ముడు మారుతాస్త్రం ప్రయోగిస్తే పరశురాముడు గుహ్యకాస్త్రంతో దానిని నివారించాడు. పరశురాముడు ప్రయోగించిన దివ్యాస్త్రాలను భీష్ముడు వారించాడు. ఇలా గురుశిష్యులిద్దరూ ఇరవైరెండు రోజులు యుద్ధం చేశారు. మర్నాడు మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆనాడు పరశురాముడు వేసిన శక్త్యాయుధాన్ని భీష్ముడు నరికేశాడు. కాసేపటికి భీష్ముడు దీప్తి వికాసం కలిగిన అస్త్రాలను ప్రయోగించి పరశురాముడిని మూర్ఛపోయేట్లు చేశాడు.

మూర్ఛనుండి తేరుకున్న పరశురాముడు భీష్ముడిని స్మృతి తప్పి నేలకు వాలేటట్లు చేసి, ఆతడి రథసారథిని చంపాడు. భీష్ముడు మూర్ఛలో మునిగి వున్న సమయంలో గంగాదేవి, ఎనిమిదిమంది మునులు (వసువులు) అతడిని కాపాడారు. మళ్లీ యుద్ధం మొదలైంది. నాటి యుద్ధం ముగిసిన తరువాత, ఆ రాత్రి, భీష్ముడిని అంతకు ముందు కాపాడిన ఎనిమిదిమంది మునులు వచ్చి ఆయనకు మోహనాస్త్రం ప్రసాదించి వెళ్లిపోయారు. ఆ బాణం పరశురాముడిని జయించగలదని వారు చెప్పారు.

మర్నాడు మళ్లీ యుద్ధం మొదలైంది. ఆనాటి యుద్ధంలో పరశురాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా, భీష్ముడు కూడా అదేపని చేశాడు. ఆ రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదాని నొకటి ఎదుర్కొని సకల జీవులకు సంక్షోభం కలిగించాయి. అదే సమయమని భావించిన భీష్ముడు మోహనాస్త్రాన్ని ఆవాహనం చేశాడు. అప్పుడు చేతనాచేతాలు ఆక్రందించాయి. ‘మోహనాస్త్రాన్ని ప్రయోగించవద్దు అని అంటూ నారద మహర్షి అక్కడికి వచ్చాడు. అదే సమయంలో తనకు మోహనాస్త్రం ఇచ్చిన ఎనిమిదిమంది మునులు కూడా అక్కడికి వచ్చి నారద మహర్షి పలుకులు వినమన్నారు. భీష్ముడు సమ్మోహనాస్త్రం విడవడం మానుకున్నాడు. పరశురాముడు అపజయం పొందినట్లు భావించాడు. ఆయన పితరులు వచ్చి పరశురాముడిని యుద్ధం విరమించమన్నారు. భీష్ముడిని యుద్దంలో జయించడం కష్టమని అన్నారు. చివరకు గంగాదేవి జోక్యం వల్ల ఇద్దరూ యుద్ధం చాలించారు.

ఎనిమిదిమంది వసువుల సూచన ప్రకారం భీష్ముడు పరశురాముడి దగ్గరికి పోయి ఆ మహానుభావుడికి నమస్కారం చేశాడు. ఇరువురూ కౌగలించుకున్నారు. అ ఆతరువాత అంబను చూసి, తనను భీష్ముడు జయించాడని, తానింతకన్నా ఎక్కువ ఏమీచేయలేనని చెప్పాడు. తాను తపస్సు చేసి తపోబలంతో భీష్ముడిని సాధిస్తానని అంటూ అంబ వెళ్లిపోయింది.

అంబ యమునా నదీతీరానికి వెళ్లి అక్కడ ఘోరమైన తపస్సు చేసింది. అక్కడినుండి వేరే ప్రదేశాలకు కూడా వెళ్లి తపస్సు చేసింది. అలా తీవ్రమైన తపోవృత్తిలో మత్స్యదేశ నివాసిగా వున్న సమయంలో, ఒకరోజు తన వ్రత ఫలంలో అర్ధభాగమైన అంబ అనే పేరుతో నదిగా మారి, మత్స్యధరణీ మండలంలో ప్రవహించింది. మిగిలిన సగభాగం తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి శంకరుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకొమ్మన్నాడు. భీష్ముడిని తాను చంపేట్లు వరం అనుగ్రహించమని వేడుకున్నది. ‘అట్లే అగుగాక’ అన్నాడు శివుడు. అదెలా సాధ్యమని ప్రశ్నించింది అంబ.

అంబ శరీరం విడిచిన తరువాత ద్రుపదుడికి మొదలు కూతురుగా జన్మించి, తరువాత కుమారుడివి అవుతావని, శిఖండి అనే పేరుతో పరాక్రమశాలివి అవుతావని, యుద్ధంలో భీష్ముడిని సంహరిస్తావని, తన మాట వ్యర్థం కాదని అన్నాడు శివుడు. ఆరోజునే చితిలో దూకి అంబ చనిపోయింది. అదే తరుణంలో భీష్ముడి మీద కోపం వున్న ద్రుపదుడు సంతానం కొరకు శివుడి గురించి తపస్సు చేశాడు. భీష్ముడిని చంపగల కుమారుడిని అనుగ్రహించమని ప్రత్యక్షమైన శివుడిని వేడుకున్నాడు.

ద్రుపదుడి ప్రార్థనకు స్పందించిన ఈశ్వరుడు ఆయన కోరిన వరం ఇచ్చాడు. మొదట కూతురుగా జన్మించి, ఆ తరువాత కొడుకుగా మారి, భీష్ముడిని యుద్ధ భూమిలో చంపగలిగిన చక్కటి సంతానం ఆయనకు కలుగుతుందని చెప్పాడు శివుడు. ఆ తరువాత ద్రుపదుడి భార్య కోకిలాదేవి గర్భం ధరించి, కుమార్తెను కన్నది. కాని, తమకు కొడుకు పుట్టాడని లోకులందరికి చెప్పారు. ఆ బిడ్డకు శిఖండి అని పేరుపెట్టి మగ పిల్లవాడిలాగా పెంచారు. మగబిడ్డకు చేయించాల్సిన సంస్కారాలన్నీ చేయించారు. అక్షరాభ్యాసం చేయించి ద్రోణాచార్యుడి దగ్గర శస్త్రాస్త్ర విద్యలు నేర్పించారు. ఉపాయంగా శిఖండికి వివాహం కూడా చేశారు. కోడలిని ఇంటికి తెచ్చుకున్నారు. కోడలికి అసలు విషయం తెలవడం, అది ఆమె తండ్రిదాకా పోవడం, ఆయన ద్రుపదుడి మీదికి యుద్ధానికి రావడం జరిగింది.

ఈ విషయం విని భయపడ్డ శిఖండి అరణ్యానికి పోయాడు. అరణ్యంలో స్థూలకర్ణుడనే ఒక యక్షుడున్న ప్రదేశంలో ప్రాణం తీసుకునే ప్రయత్నంలో వుండగా, దానికి కారణం ఏమిటని యక్షుడు అడిగాడు. తనకు మగతనం కావాలన్నాడు. తన మగతనం ఇస్తానన్నాడు యక్షుడు. అయితే పదిరోజుల తరువాత మళ్లీ వెనక్కు ఇవ్వాలన్న నిబంధన పెట్టాడు. అలాగే ఇద్దరూ వారి-వారి స్వరూపాలను మార్చుకున్నారు. ద్రుపదుడు తన వియ్యంకుడిని రప్పించి శిఖండి పురుషత్వాన్ని స్పష్ట పరిచాడు.

ఇదిలా వుండగా స్థూలకర్ణుడి భవన సమీపానికి కుబేరుడు వచ్చి విషయం తెలుసుకుంటాడు. స్థూలకర్ణుడిని అలాగే వనితగా ఉండుగాక అని పలికాడు. అతడిమీద కరుణ చూపమని మిగతా యక్షులు కోరగా, శిఖండి బతికున్నంతవరకు పడతిగా వుంది తరువాత నిజస్వరూపం తెచ్చుకుంటాడు అని చెప్పాడు కుబేరుడు. శిఖండి నియమం ప్రకారం స్థూలకర్ణుడి దగ్గరికి అతడి మగతనం తిరిగి ఇవ్వడానికి పదిరోజుల తరువాత వచ్చాడు. వచ్చినవాడిని అలాగే ఇంటికి పొమ్మని, ఇది అతడికి దైవం అనుగ్రహించిన రూపమని, జరిగిన విషయం చెప్పాడు. శిఖండి తన తండ్రి దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్పాడు. ద్రుపదుడు శిఖండిని ద్రోణాచార్యులకు అసాధారణ శిష్యుడిని చేశాడు.

ఈ విషయాన్ని ఆసాంతం చెప్పిన భీష్ముడు, దుర్యోధనుడితో, తాను ఆడువారిని, మొదలు ఆడువారిగా ఉన్నవారిని, ఆడువారి పేర్లు పెట్టుకున్నవారిని, ఆడువారిలాంటి ఆకారం కలవారిని చంపనని నియమం పెట్టుకున్నానని, శిఖండి మొదలు ఆడుదిగా వుండి తరువాత పురుషుడైనాడు కాబట్టి, అతడు యుద్ధంలో ఎదురైతే బాణప్రయోగం చేయనని చెప్పాడు. ఇది తన నిశ్చయం అన్నాడు. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

Sunday, January 30, 2022

శునస్సేపోఖ్యానం ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-93 : వనం జ్వాలా నరసింహారావు

 శునస్సేపోఖ్యానం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-93

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (31-01-2022)

"ఇలా అందరూ వెళ్లిపోగానే, తనింతవరకు తపస్సు చేస్తున్న వనంలో విఘ్నాలు కలుగుతున్నాయని, ఆ ప్రదేశాన్ని వదిలి మరింకెక్కడికైనా పోతానని అక్కడున్న వారితో అంటాడు విశ్వామిత్రుడు. ఏ దిక్కుకు పోతే బాగుంటుందని ఆలోచించి, విశాలమైన పడమటిదిక్కున మంచివనాలు, పుష్కరం వున్నందువల్ల, తీవ్రమైన తపస్సు చేయడానికి అక్కడకు పోతే తపస్సిద్ధికలుగుతుందని భావిస్తాడు. త్వరగా అక్కడకు పోవాలని, పోయి కేవలం ఫలాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, భయంకరమైన తపస్సు చేయాలనీ, అలా చేయడంద్వారా తపస్సిద్ధన్నాకలగాలి-లేదా-మరణమన్నా రావాలి, అని నిశ్చయించుకుంటాడు. ఉత్కృష్ట మార్గంలో, ఇతరులకు కనీసం అనుకోడానికైనా సాధ్యపడని, అతిగొప్పదైన-కఠినమైన నిష్ఠలతో తపస్సు చేయడం ఆరంభించాడు విశ్వామిత్రుడు”.

విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న రోజుల్లోనే, అయోధ్యా నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. మనువు మునిమనుమడు, నభగుడి మనుమడు, నాభాగుడి కొడుకైన అంబరీషుడు పెద్దల మన్ననలుపొందేవిధంగా మాట్లాడుతాడని, క్రోధాన్ని జయించినవాడని, శ్రేష్ఠమైన న్యాయ మార్గంలో దోషాలను జయించినవాడని, సద్గుణాలే భూషణాలుగా కలవాడని, రాజశ్రేష్టుడనీ ప్రసిద్ధికెక్కాడు. అలాంటి అంబరీషుడు ఒక యాగాన్ని చేయాలని అనుకొని, చేస్తున్న సమయంలో, ఇంద్రుడు యజ్ఞ పశువును దొంగిలించాడు. యజ్ఞ పశువు పోతే, పోకుండా రక్షించుకోలేక పోతే, యజ్ఞాన్ని చేసేవాడికి దోషం తగులుందని చెప్పాడు ఋత్విజుడు. యజ్ఞపశువునన్నాతెమ్మని, దొరక్కపోతే యజ్ఞం కొరకు బలి కావడానికి ఒక మనిషినైనా తెమ్మని అంబరీషుడిని ఆదేశించాడు ఋత్విజుడు. యజ్ఞపశువును వెతికేందుకు అన్ని ప్రదేశాలలో వెతకసాగాడు అంబరీషుడు. కనీసం యజ్ఞం పూర్తి చేయించేందుకు ఒక మనిషైనా దొరకకపోతాడానని స్వయంగా వెతకనారంభించాడు".

"ఇలా తిరుగుతూ, ఎవరినీ బలాత్కారంగా తేవడానికి ఇష్టపడని అంబరీషుడికి ఒకనాడు, భార్యా-పిల్లలున్న ఋచీకుడనే ముని (విశ్వామిత్రుడి తోబుట్టువు భర్త) కనిపిస్తాడు. అతడికి లక్ష ఆవులిస్తానని, తన యజ్ఞాన్ని రక్షించేందుకు ఆయన కొడుకుల్లో ఒకడినిఇవ్వమని ఆయనకు నమస్కరించి, ప్రార్తించాడు. పోయిన యజ్ఞపశువుకొరకు ప్రపంచమంతా గాలించినా ఫలితం లేకపోయిందని, దానికి బదులుగా మనిషిని వుంచాల్సి వచ్చిందనీ, తన ముగ్గురి కొడుకుల్లో ఒకడిని ఇవ్వమని అంటాడు. ఆయనేమిచ్చినా తన ప్రేమకు పాత్రుడైన పెద్దకొడుకునివ్వలేనని ఋచీకుడనగానే, ఆయన భార్య, శునకుడనే తమ కనిష్ట పుత్రుడంటే తనకెంతో ఇష్టమని కాబట్టి వాడినీ అమ్మమని అంటుంది. ఆ మాటలను విన్న వారి నడిమి కొడుకు శునస్సేపుడు, తన ప్రాణమిచ్చి రాజు యజ్ఞాన్ని కాపాడుదామనుకుంటాడు. తనను తీసుకొని పొమ్మని, ఆయనిస్తానని చెప్పిన లక్ష ఆవులను తండ్రికివ్వమని శునస్సేపుడనగానే, ఆలస్యం చేయకుండా, ధర్మ ప్రీతితో తన వెంట అతడిని తీసుకునిపోయాడు అంబరీషుడు. మార్గమధ్యంలో మధ్యాహ్నమైనందున వారిరువురు ఒక పుష్కర తీరం దగ్గర కాసేపు ఆగారు".

(లోకంలో సాధారణంగా పెద్దకొడుకుపై తండ్రికి, పిన్న వాడిపై తల్లికి ప్రేముంటుంది. నడిమి కొడుకుపై తల్లితండ్రులకిద్దరికీ ప్రీతి వుండదంటారు. ఈ విషయంలో ఋషీశ్వరులు కూడా అందరివలెనే ప్రవర్తిస్తారనడానికి ఇదొక ఉదాహరణ).

విశ్వామిత్రుడి శరణుజొచ్చిన శునస్సేపుడు

         "ఎండవేడికి తాళలేక మార్గమధ్యంలో ప్రయాణం ఆపు చేసి, రాజు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, శునస్సేపుడు పరుగెత్తుకుంటూ, సమీపంలో ఋషీశ్వరుల మధ్యనున్న మేనమామ విశ్వామిత్రుడి దగ్గరకు పోయాడు. అలసటతోనూ, ఎండవేడివల్లనూ, పరుగెత్తుకుంటూ రావడం వల్లా, తటాలున వస్తూనే మామ విశ్వామిత్రుడి ఒళ్లో వాలాడు. తనగతి ఏమని చెప్పాలని, తనను మన్నించి అతడే కాపాడాలని, తల్లితండ్రులున్నా వారు తనను రక్షించలేరని, వారున్నా లేనట్లేనని, ఏదో విధంగా ఆలోచించి రాజు కోరిక నెరవేరేటట్లు-తను తపస్సు చేసి స్వర్గానికి పోయేటట్లు చేయమని విశ్వామిత్రుడిని ప్రార్థించాడు శునస్సేపుడు. తను అర్థాయువుతో చనిపోకుండా, దీర్ఘాయువుగా జీవించేటట్లు చేయమంటాడు. తను బతకదల్చుకుంది కామంకోసం కాని, భోగంకోసం గాని కాదని, స్వర్గానికి పోవడానికి కావల్సినంత తపస్సుచేయడానికేనని అంటూ, తను ఆపదపాలుకాకుండా, ఆయన బిడ్డలను కాపాడినట్లే తనను కూడా రక్షించమని కోరాడు”.

అల్లుడి మాటలు విన్న విశ్వామిత్రుడు తన కొడుకులతో, అతడు బాలుడనీ-రక్షించమని అర్థిస్తున్నాడని-భయపడి తన శరణుజొచ్చాడని అంటూ, వాళ్లల్లో ఎవరైనా ఒకడు అతడి బదులుగా రాజువెంట పోయి, అతడికి ప్రాణబిక్ష పెట్టమని అంటాడు. తన మాట గౌరవించాలని కూడా అంటాడు. వారిలో ఎవరన్నా అతడి బదులుగా వెళ్తే రాజు యజ్ఞం నెరవేరుతుందని, దేవతలు సంతోషిస్తారని, అతడి ప్రాణం నిలుస్తుందని, తన మాటా దక్కుతుందని, కాబట్టి తను చెప్పినట్లు చేయమని కోరతాడు. విశ్వామిత్రుడి కొడుకులందరూ ముక్తకంఠంతో ఆయన కోరికను తిరస్కరించారు. తన బిడ్డలను బలిపెట్టి ఇతరుల బిడ్డను కాపాడడమంటే, స్వార్జిత మధురా హారం మాని, నిషిద్ధమైన కుక్క మాంసం తినడమేనని అహంకారంగా జవాబిచ్చారు వారు తండ్రికి".

"కొడుకులందరు ఒక్క మాటగా, తన కోరికను మన్నించక పోవడంతో, విశ్వామిత్రుడికి కోపమొచ్చింది. తను అవునన్నది వారెలా కాదంటారని, కొంచెమైనా వారికి భయం లేకుండా పోయిందనీ, తండ్రి మాట జవదాటడం ధర్మ విరుద్ధమనీ, తన మాట అతిక్రమించి వారింక బతకలేరని అంటూ, వశిష్ఠుడి కొడుకులలాగానే వాళ్లు కూడా కుక్క మాంసం తింటూ-నీచమైన మనస్సుతో, వెయ్యేళ్లు అల్లాడమని శపించాడు. అలా పట్టరాని కోపంతో కొడుకులను శపించి, విశ్వామిత్రుడు మంత్రించిన విబూదిని శునస్సేనుడికి పెట్టి అతడిని భయపడొద్దని చెప్పాడు. యజ్ఞంలో అతడిని విష్ణు సంబంధమైన యూపానికి కట్టినప్పుడు, అగ్నిని చూస్తూ-ఆలస్యం చేయకుండా, ’ఇమ మ్మే వరుణ’ అనే రెండు మంత్రాలను జపించమంటాడు. (ఒక మంత్రం ఇంద్రస్తుతి-ఇంకొకటి ఉపేంద్రస్తుతి)”.

మంత్రాలను ఉపదేశించి, తని చెప్పిన ప్రకారం అవి చదివితే, రాజు యజ్ఞం సఫలమవుతుందనీ, ఆయన జీవితాశయం నెరవేరుతుందని అంటాడు విశ్వామిత్రుడు. ఆ మంత్రాలను గ్రహించి, శెలవు తీసుకుని వెళ్లాడు శునస్సేపుడు. అంబరీషుడి దగ్గరకు పోయి, అతడిని యజ్ఞ దీక్ష వహించమని కోరాడు. పురోహితుడు చెప్పినట్లే దీక్ష వహించాడు అంబరీషుడు. బ్రాహ్మణులు శునస్సేపుడి మెడలో పూదండలు వేసి, ఎర్రటి వస్త్రాలను కట్టి, దర్భలతో అల్లిన తాళ్లతో అతడిని యూపస్తంబానికి కట్టారు. అతడేమాత్రం భయపడకుండా తనలోలోన మంత్రాలను స్మరించాడు. తనను ఆశ్రయించిన వారిని రక్షించే విష్ణువు, రాజుకు యజ్ఞ ఫలం-బాలుడికి దీర్ఘాయువు ఇమ్మని ఇంద్రుడికి చెప్పగా ఆయన ఆజ్ఞానుసారం ఇంద్రుడు మెచ్చి, శునస్సేనుడికి దీర్ఘాయువునిచ్చి, రాజుకు యజ్ఞ ఫలాన్నిచ్చాడు. అగ్నితేజుడైన విశ్వామిత్రుడు వెయ్యేళ్లు, ప్రపంచమంతా పొగిడే విధంగా, గాఢమైన తపస్సు చేశాడు".

Saturday, January 29, 2022

ఇరుపక్షాల వున్న అతిరథ, మహారథాదుల వివరాలు చెప్పిన భీష్ముడు .... ఆస్వాదన-57 : వనం జ్వాలా నరసింహారావు

 ఇరుపక్షాల వున్న అతిరథ, మహారథాదుల వివరాలు చెప్పిన భీష్ముడు

ఆస్వాదన-57

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (30-01-2022)

తీర్థయాత్రలకు పోవడం వల్ల బలరాముడు, కౌరవ-పాండవులు  ఇద్దరూ వద్దన్నందువల్ల రుక్మి మినహా జగతిలోని రాజులంతా కురుక్షేత్ర సంగ్రామంలో పోరాడేందుకు రెండు పక్షాలలో ఒక దాంట్లో చేరారు. ఈ నేపధ్యంలో దుర్యోధనుడు, దుశ్శాసన, శకుని, కర్ణులతో మంతనాలాడి శకుని కొడుకు ఉలూకుడిని పాండవులకు దగ్గరికి తన పక్షాన వెళ్లి కొన్ని కఠినమైన మాటలు చెప్పమన్నాడు. ఉలూకుడు ఆయన ఆదేశానుసారం ధర్మరాజు దగ్గరికి వెళ్లాడు.

దుర్యోధనుడు చెప్పమన్న కఠినమైన పలుకులను ఆయన మాటలుగా చెప్పాడు ఉలూకుడు. తన వారినందరినీ కూర్చుకుని యుద్ధ రంగానికి రమ్మని, ఇక తప్పించుకోవడానికి వీలుకాదని, భీష్మద్రోణుల బల పరాక్రమాలు పాండవులు తెలుసుకుంటారని, వారిబారి నుండి అర్జునుడు తప్పించుకుని బతకడం సాధ్యం కాదని, శ్రీకృష్ణుడితోనే అంతా చక్కబడదని, భీముడు ప్రతిజ్ఞ చేసినట్లు చేతనైతే దుశ్శాసనుడి నెత్తురు తాగమని, యుద్ధంలో తమ చేతికి చిక్కితే అతడు తప్పించుకుని పోలేడని, జరిగిన అవమానాలు పాండవులు మరిచారా అని, విరాటుడి కొలువులో దీనులై వుండడం శూర లక్షణమా అని, భూమిలో రవ్వంత కూడా చీల్చి ఇవ్వమని, యుద్ధం చెయ్యక మానమని, ఇలా ఏవేవో చెప్పాడు. ఆ మాటలు విన్న భీమార్జున నకుల సహదేవులు ఒకరి ముఖం ఇంకొకరు చూస్తుండగా, శ్రీకృష్ణుడు వారి పక్షాన ఘాటైన సమాధానం ఇచ్చాడు. యుద్ధం రేపే అని, వీరుడవై మరణించమని, మరణించక తప్పించుకోలేడని, కధనంలో భీముడు దుశ్శాసనుడి వక్షం చీల్చి రక్తం తాగుతాడని దుర్యోధనుడికి చెప్పమన్నాడు. భీమార్జున నకుల సహదేవులు కూడా తమ బలపరాక్రమాలను వివరించి దుర్యోధనుడిని హెచ్చరించారు.

పాండవుల దగ్గరినుండి తిరిగొచ్చిన ఉలూకుడు కృష్ణార్జునులు అన్న మాటలు వున్నవి వున్నట్లుగా చెప్పాడు. అక్కడే వున్న భీష్ముడు దుర్యోధనుడికి ధైర్య వచనాలు పలికాడు. భీష్మద్రోణులు వుండగా తనకు భయం లేదన్నాడు దుర్యోధనుడు. అప్పుడు దుర్యోధనుడు, కౌరవ పక్షంలో, పాండవుల పక్షంలో యుద్ధం చేయగల వీరుల ప్రత్యేకతలను వివరంగా చెప్పమని కోరాడు. సమాధానంగా భీష్ముడు ఇరు పక్షాల వారిలోని శక్తి-సామర్థ్యాలు, హెచ్చు తక్కువలు వున్నవి వున్నట్లుగా చెప్పాడు. భీష్ముడి ఉద్దేశంలో కౌరవ వీరుల ప్రత్యేకతలు ఇలా వున్నాయి.  

సుయోధనుడు అతిరథుడు, ఆయన తమ్ములంతా సమరథులలో ఉత్తములు. వారు ద్రుపదుడి సేనలను జయించగలరు. కృతవర్మ అతిరథుడు, భూరిశ్రవుడు అతిరథోత్తముడు, సింధు దేశాధీశుడైన జయద్రథుడు మహారథుడు. కాంభోజ దేశానికి రాజైన సుదక్షిణుడు సమరథుడు. మాహిష్మతీ నాయకుడైన నీలుడు అర్థ రథుడు. అవంతి దేశపతులైన విందాను విందులు ఇద్దరూ అర్థరథులు. త్రిగర్త దేశపు రాజులైదుగురు మహారథులు. దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణకుమారుడు సమరథుడు. బృహద్బలుడు సమరథుడు. దండదారుడు అర్థరథుడు. (అతిరథుడు అనేక రథికులతో ఒంటరిగా పోరాడగల ఉత్తమ రథికుడు).

కృపాచార్యుడు అతిరథులలో శ్రేష్టుడు. శకుని సమరథుడు. దివ్యాస్త్రాలు తెలిసిన అశ్వత్థామ అర్జునుడితో సమానమైనవాడు. అతడికి సమానులు భూలోకంలో ఎవరూ లేరు. ద్రోణాచార్యుడు అతిరథులలో శ్రేష్టుడు. బాహ్లికుడు అతిరథుడు. అతడి కుమారుడు సోమదత్తుడు కూడా ప్రసిద్ధమైన బలం కలవాడే. రాక్షస శ్రేష్టుడైన అలంబసుడు సమరథుడు. ప్రాగ్జ్యోతిష నగరాధిపతైన భాగాదత్తుడు సమరథుడు. గాంధార రాజులైన వృక్షుడు, అచలుడు సమరథులు. కయ్యానికి కాలుదువ్వే దుర్యోధనుడి గారాబు నెచ్చెలికాడైన కర్ణుడు అర్థరథుడు.

కర్ణుడు అర్థరథుడని భీష్ముడు చెప్పడాన్ని ద్రోణాచార్యుడు సహితం సమర్థించాడు. భీష్మద్రోణుల మాటలు విన్న కర్ణుడికి కోపం వచ్చింది. తనమీద వున్న ద్వేషంతో పరుషవచనాలు పలికి తనను అర్థరథుడు అని వారు చెప్పారని, తనలో ఏలోపం వుందో తెలియచేయమని అడిగాడు. భీష్ముడి శక్తిని, పరాక్రమాన్ని బట్టి తన దృష్టిలో అతడు అర్థరథుడే అని కర్ణుడన్నాడు. భీష్ముడు అర్జునుడి పట్ల పక్షపాతం కలవాడని, పూనికతో యుద్ధం చేయడని, అతడిని కౌరవ పక్షం నుండి తొలగిస్తే కలిగే నష్టం ఏమిటని దుర్యోధనుడితో అన్నాడు కర్ణుడు. దురహంకారైన భీష్ముడితో కలిసి అతడితో చేరి యుద్ధం చేయడానికి తాను అంగీకరించనని స్పష్టం చేశాడు. తన శక్తి ఏపాటిదో కర్ణుడు తన గురువైన పరశురాముడిని అడిగి తెలుసుకోమన్నాడు భీష్ముడు. తాను యుద్ధం చాలించిన తరువాత, అర్జునుడు మహావీరులందరినీ కూల్చిన తరువాత, కర్ణుడు కదన రంగం ప్రవేశం చేయక తప్పదని, అప్పుడు ఆయన పరాక్రమం చూపమని అన్నాడు భీష్ముడు. దుర్యోధనుడు కలిగించుకుని వాతావరణాన్ని చల్లబర్చాడు.

కౌరవుల పక్షంలోని వారిలాగే పాండవుల పక్షంలో వున్న వీరుల తారతమ్యాలు చెప్పమని దుర్యోధనుడు కోరాడు భీష్ముడిని. అప్పుడు భీష్ముడు చెప్పిన ఆ వివరాలు: ధర్మరాజు అతిరథుడు. భీముడు అతిరథులలో మేటి. నకుల సహదేవులు సమరథులు. పాండవులందరు ఏకకాలంలో తాకితే కౌరవ సైన్యం తట్టుకోలేదు. అర్జునుడి బలపరాక్రమం ‘ఇంత అని చెప్పశక్యం కాదు. అంతటి వాడు ఎప్పుడూ, ఎక్కడా కనిపించడం లేదు. పైగా ఆయనకు శ్రీకృష్ణుడి తోడ్పాటున్నది. ఉప పాండవులు ఐదుగురు మహారథులు. వారితో సమానుడు ఉత్తరుడు.

అభిమన్యుడు అతిరథులలో అగ్రేసరుడు. సాత్యకి అతిరథులలో సిగబంతి. అభిమన్యుడు, సాత్యకి ఇద్దరూ గండరగండలు. ద్రుపదుడు, విరాటుడు మహారథులు. శిఖండి మహారథుడు. ధృష్టద్యుమ్నుడు అతిరథుడు. ఆయన కుమారుడు ధృతవర్ముడు అర్థరథుడు. శిశుపాలుడి కుమారుడు ధృష్టకేతుడు మహారథుడు. భోజుడు, అజుడు మహారథులు. పాంచాల వంశాన్ని ప్రకాశింప చేస్తున్న ఏడుగురు కూడా మహారథులే. కేకయ దేశాధిపతులు అయిదుగురు మహారథులు. విరాటుడి నలుగురు దాయాదులు మహారథులు. చిత్రాయుధుడు, చేకితానుడు, చంద్రదత్తుడు, వ్యాఘ్రదత్తుడు మహారథులు. సేనాబిందుడు అతిరథుడు. పాండ్యరాజు అతిరథుడు. కాశ్యుడు సమరథుడు. కుంతిభోజుడు అతిరథుడు. రోచమానుడు మహారథుడు. ఘటోత్కచుడు అతిరథుడు.

తనకు జ్ఞాపకం ఉన్నంత మేరకు ఉభయ పక్షాలలో వున్న వారి వీర పరాక్రామలు చెప్పానని, ఇంకా ఎంతోమంది మేటి వీరులు ఉండవచ్చని అన్నాడు భీష్ముడు. తానైతే పాండవ పక్షంలో వున్న శిఖండిని మాత్రం చంపలేనని చెప్పాడు.    

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)