Sunday, January 23, 2022

వశిష్ఠుడి కుమారులను శపించిన విశ్వామిత్రుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-92 : వనం జ్వాలా నరసింహారావు

 వశిష్ఠుడి కుమారులను శపించిన విశ్వామిత్రుడు

 శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-92

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (24-01-2022)

"దీనాలాపనలతో మాట్లాడుతున్న త్రిశంకుడిని చూసి విశ్వామిత్రుడు, అతడికి మేలు జరుగుతుందని ధైర్యం చెప్పాడు. అతడిని భయపడ వద్దనీ, అతడు మంచి నడవడిగలవాడని తనకు తెలుసనీ, అతడి మనస్సులో వున్న కోరికను తాను నెరవేరుస్తానని అంటాడు విశ్వామిత్రుడు. యజ్ఞం చేసేందుకు శీఘ్రంగా మునీశ్వరులందరినీ పిలుస్తానని చెప్పి, వశిష్ఠుడి పుత్రుల శాపాన్ని తప్పించడం సాధ్యపడనందున, చండాల రూపంలోనే త్రిశంకుడిని స్వర్గానికి పంపించి కీర్తిమంతుడిని చేస్తానని అభయమిస్తాడు. తనను శరణుజొచ్చిన కారణాన స్వర్గం అతడికి అరచేతిలో ఉసిరికాయ సమానంగా చేస్తానని హామీ ఇస్తాడు. తన కొడుకులను పిల్చి యజ్ఞానికి కావాల్సిన సామాగ్రిని సమకూర్చమని చెప్పాడు. తన ఆజ్ఞగా-తనపై గౌరవంతో, మునీశ్వరులందరు శిష్యులతో-ముఖ్య హితులతో-బహుశ్రు తులతో-ఋత్విజులతో రమ్మని పిలవాల్సిందిగా శిష్యులకు చెప్పాడు. ఎవరన్నా తన మాటను వినకపోతే, వారి సంగతి తనకు తెలియచేయాలన్న గురువు ఆజ్ఞానుసారం, శిష్యులు దేశ దేశాల్లో తిరిగి, బ్రహ్మ వాదులందరినీ పిలిచారు. విశ్వామిత్రుడికి భయపడి, ఇష్టమున్నా-లేకపోయినా అందరూ యజ్ఞాన్ని చూడడానికి వచ్చారు".

"ఇదిలా వుండగా వశిష్ఠుడి కుమారులకీ విషయం తెలిసి కోపంతో యజ్ఞాన్ని తప్పుబట్టారు. యజ్ఞం చేసేవాడు చండాలుడనీ, చేయించేవాడు రాజర్షైన క్షత్రియుడనీ, సద్బ్రాహ్మణులందరు చండాలుడి అన్నం ఎలా తింటారనీ, దేవతలెలా సంతోషంతో వస్తారనీ, చండాలుడు స్వర్గానికెలా పోతాడనీ, వాడుపోయే స్వర్గం ఎలాంటిదనీ మహోదయుడు-మిగిలిన వశిష్ఠుడి కుమారులన్నారని శిష్యులు గురువుతో చెప్పడంతో విశ్వామిత్రుడి కోపం తారాస్థాయికి చేరింది. విశేష ధ్యానంతో ధర్మాసక్తుడైన తనను పాపపు పలుకులతో దూషించిన వారందరూ మసైపోవాల్సిన వారని, వారందరూ చచ్చి నరకానికి పోయి-యమభటుల కఠిన పాశాలకు వశ పడి, ఏడొందల జన్మలవరకు పీనుగులుతినేవారిగా పుట్టాలని శపించాడు. కుక్క మాంసం తింటూ, దిక్కులేకుండా-దయాహీనులైన దుర్జాతివారిగా, నీచులుగా, వికార వేషాలతో భూమ్మీద అపూజ్యులై తిరగాలని కూడా శపించాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడి కొడుకులను. తిట్టగూడని తిట్లు తిట్టిన మహోదయుడిని, బోయవాడిగా పుట్టి-భూమ్మీద తిరిగి, ఆత్మహత్య చేసుకుని, చివరకు తన కోపకారణాన దుర్గతులలో కూలిపోవాలని శపించాడు".

త్రిశంకుడిని స్వర్గానికి పంపిన విశ్వామిత్రుడు

         "ఈ విధంగా వశిష్ఠుడి కొడుకులను శపించిన విశ్వామిత్రుడు, తన పిలుపు మేరకు యజ్ఞం చూసేందుకొచ్చిన మునుల సమూహంతో, ఇక్ష్వాక వంశం రాజైన త్రిశంకుడనే ధర్మాత్ముడిని-మహాభాగ్య సంపన్నుడిని-దేహంతో స్వర్గానికి పోదల్చి తన సహాయం కోరినవాడిని వారికి పరిచయం చేస్తున్నానంటాడు. తమందరం కలిసి, ఆలోచించి, ఏ యజ్ఞం చేస్తే అతడి కోరిక నెరవేరుతుందో ఆ యజ్ఞాన్నే చేద్దామంటాడు. పరమ కోపిష్టైన విశ్వామిత్రుడికి భయపడిన వారందరూ, ఆయన మాట ఎందుకు కాదనాలని-ఆ మూర్ఖుడికెందుకు అడ్డు చెప్పాలని-ఆయన రాజు కోరిక నెరవేరుస్తుంటే తమ కొచ్చే నష్టమేంలేదని అనుకుని, ఆయన చెప్పినట్లే కార్య నిర్వహణకు పూనుకున్నారు. విశ్వామిత్రుడు యాజకుడై యాగం నిర్వహిస్తుండగా, మునులందరు తమకప్పచెప్పిన పనులను కడు హెచ్చరికతో చేసారు. యజ్ఞం సాగుతున్నప్పుడు, హవిర్భావాలను తీసుకెళ్లాల్సిందిగా విశ్వామిత్రుడు దేవతలను కోరినప్పటికీ, పిలిచిన వారెవరూ రాలేదక్కడికి. దాంతో ఆయన కోపంతో కళ్లెర్రచేశాడు. వెంటనే యజ్ఞం దగ్గరున్న కొయ్యగరిటను చేత్తో తీసుకుని, ప్రస్తుతానికి ప్రయోజనంలేని యజ్ఞంతో నిమిత్తం లేకుండా, తన తపశ్శక్తితో, దేహంతో స్వర్గానికి పంపిస్తానని త్రిశంకుడితో అంటాడు విశ్వామిత్రుడు".

         "తను సంపాదించిన తపఃఫలంలో, వశిష్ఠాదుల శాపంవల్ల ఖర్చయింది పోగా ,ఇంకా మిగలనున్నదాని బలంతో, బొందితో ఎవరికీ వెళ్లడానికి సాధ్యపడని స్వర్గానికి పొమ్మని త్రిశంకుడినంటాడు. విశ్వామిత్రుడలా అంటుండగానే, ఋషులందరు చూస్తుండగా, త్రిశంకుడు ఆకాశ మార్గంలో స్వర్గం చేరువలోకి పోయాడు. అప్పుడు దేవతా సమూహంతో వున్న ఇంద్రుడు, త్రిశంకుడిని చూసి, అతడు స్వర్గంలో వుండతగినవాడు కాదని, తిరిగి భూమిమీదకే పొమ్మని అంటాడు. గురువు శాపంతో చండాలుడైనవాడనీ, మూఢుడనీ, ఏ లోపంలేని మానవుడికే స్వర్గప్రాప్తిలేనప్పుడు వాడెలా స్వర్గంలోకి రాగలుగుతాడనీ కోపంతో, త్రిశంకుడిని తలకిందులుగా భూమిమీద దొర్లమని అంటాడు ఇంద్రుడు”.

తనను రక్షించమని వేడుకుంటాడు కిందకు పడుతున్న త్రిశంకుడు. అతడి దీనాలాపాలను విన్న విశ్వామిత్రుడు తీవ్రకోపంతో విజృంభించి, పడిపోతున్న త్రిశంకుడిని, ఆకాశం మధ్యలోనే నిలవమని-కింద పడొద్దని అంటూ, తన తపశ్శక్తితో ఆపు చేస్తాడు. అంతటితో ఆగకుండా, ఆకాశంలో దక్షిణదిక్కున సప్తర్షులను (నక్షత్రాలు) సృష్టించి, అక్కడో స్వర్గలోకాన్ని, మరో ఇంద్రుడిని-దేవతలను సృష్టించేందుకు సిద్ధమవుతాడు. తననుకునే విధంగా సృష్టించడం కుదరకపోతే, లోకంలో ఇంద్రుడే లేకుండా చేసేందుకు పూనుకుంటున్న సమయంలో దేవతలు, మునులు విశ్వామిత్రుడిదగ్గరకొచ్చి ప్రార్థించారు. తన తపశ్శక్తిని లోకోపకారానికి ఉపయోగించాలేగాని అలా చేయడం తగదనీ, గురు శాపంతో నిహతుడయినవాడిని స్వర్గానికి పంపడం తగదనీ, స్వర్గం పాడైపోకూడదనీ, అలా జరిగితే శాస్త్రాలన్నీ ధ్వంసమైపోవాల్సిందేననీ, అలా కావడానికి అతడు కారణం కారాదనీ అంటూ, విశ్వామిత్రుడిని శాంతించమని వేడుకుంటారు. రాజర్షైన వాడే ఇంత పనికి పూనుకుంటే, బ్రహ్మర్షులు కూడా శాస్త్ర  మర్యాద మీరితే ఏం కావాలని అడుగుతూ, శాస్త్ర మర్యాదను ఉల్లంఘించవద్దని అంటారు దేవతలు. అలా చెప్పిన వారితో, త్రిశంకుడిని స్వర్గానికి పంపిస్తానని తను మాటిచ్చానని, ఇచ్చిన మాటెలా తప్పాలని ప్రశ్నించి, తనొక ఉపాయం చెప్తానంటాడు. తాను సృష్టించిన నక్షత్రాలను ధ్వంసం చేయొద్దనీ-శాశ్వతంగా వుండనియ్యాలనీ, త్రిశంకుడు తలకిందుగా-అతడిని అనుసరించి ఆ నక్షత్రాలను అక్కడే వుండనివ్వాలని వారికి చెప్పాడు. వారొప్పుకోగానే, విశ్వామిత్రుడు శాంతించాడు. త్రిశంకుడు స్వర్గంలో లాగానే అక్కడే సుఖపడే వీలు కలిగించారు దేవతలు".

Saturday, January 22, 2022

ధృష్టద్యుమ్నుడు పాండవులకు, భీష్ముడు కౌరవులకు సర్వసేనాధిపత్యం ...... ఆస్వాదన-56 : వనం జ్వాలా నరసింహరావు

 ధృష్టద్యుమ్నుడు పాండవులకు, భీష్ముడు కౌరవులకు సర్వసేనాధిపత్యం

ఆస్వాదన-56

వనం జ్వాలా నరసింహరావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (23-01-2022)

రాయబారం అనంతరం సంధి పొసగలేదని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పిన తరువాత యుద్ధం చేయడమే కర్తవ్యం అని నిర్ణయించారు పాండవులు. పాండవుల పక్షాన వున్న ఏడక్షౌహిణుల సైన్యాన్ని నడిపించగలిగి, భీష్ముడిని ఎదుర్కునే శక్తి-సామర్థ్యాలు కల మేటి విలుకాడెవ్వరని ఆలోచన చేశారు ధర్మరాజాదులు. అలాంటివాడికే సర్వసేనాధిపత్యం ఇచ్చి అభిషేకించాలని నిశ్చయించారు. నకుల, సహదేవులు తమ అభిప్రాయం చెప్పిన తరువాత అర్జునుడు, ద్రోణాచార్యుడిని నిర్మూలించడానికే ఉద్భవించి, బాహుబలం, ప్రతాపం కలవాడైన ధృష్టద్యుమ్నుడు సర్వసైన్యాధిపతిగా  వుండడానికి తగినవాడని అన్నాడు. అతడు తప్ప మరొకడు భీష్ముడి ధాటికి తట్టుకోలేరన్నాడు. అలాగే భీష్ముడి పాలిటి మృత్యువై పుట్టిన శిఖండిని దళవాయిగా చేయవచ్చన్నాడు.

ధర్మరాజు శ్రీకృష్ణుడి అభిప్రాయం అడిగాడు. ధృష్టద్యుమ్నుడు సేనాధ్యక్షుడిగా వుండదగినవాడని, అతడిని ఏడక్షౌహిణుల సైన్యానికి నాయకుడిగా అభిషేకించమని చెప్పాడు శ్రీకృష్ణుడు. దానికి అంగీకరించిన ధర్మరాజు, ఏడక్షౌహిణుల సైన్యానికి విడివిడిగా అధిపతులను శ్రీకృష్ణుడినే నిర్ణయించమని కోరాడు. వెంటనే శ్రీకృష్ణుడు, సాహసోపేతులైన ద్రుపదుడిని, విరాటుడిని, సాత్యకిని, సహదేవుడిని (జరాసంధుడి కుమారుడు), చేకితానుడిని, ధృష్టకేతువుని (శిశుపాలుడి కొడుకు), శిఖండిని ఏడక్షౌహిణులకు అధిపతులుగా నియమించమని సలహా ఇచ్చాడు.

ఇది జరిగిన మర్నాడు ధర్మరాజు నిండు కొలువులో ముఖ్యులంతా వున్నప్పుడు, పరిజనులంతా వినే విధంగా యుద్ధం నిర్ణయమైనట్లు లాంఛనంగా ప్రకటించాడు. శ్రీకృష్ణుడి ఆదేశానుసారం ద్రుపదుడు మొదలైనవారిని వేర్వేరుగా అక్షౌహిణులకు నాయకులను చేశాడు. ధృష్టద్యుమ్నుడికి ప్రత్యేకంగా అభిషేకం చేసి, సర్వసేనాధిపత్యానికి పట్టం కట్టాడు. తరువాత వారందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ కౌరవులతో యుద్ధం చేయడానికి అంతా కలసి తరలిపోదాం అన్నాడు ధర్మరాజు. ఆ ఎనిమిదిమందిని అహర్నిశలూ కనిపెట్టుకుని వుండమని, కంటికి రెప్పలా కాపాడమని, కర్తవ్య దీక్షలో వుండమని, శ్రీకృష్ణుడే అతడికి రక్షకుడని అర్జునుడికి చెప్పాడు. వెంటనే ధర్మరాజు యుద్ధం చేయడానికి పూనిక వహించి, ప్రస్థాన భేరి మోగించమని ఆజ్ఞాపించాడు. ఆయన యుద్ధ ప్రస్థానభేరితో దిక్కులు బద్దలయ్యాయి.

ప్రయాణ భేరి మోగగానే యుద్ధయాత్రకు సమస్త సైన్యాలు సంసిద్ధమయ్యాయి. పాండవులు తమ పట్టపు రాణి అయిన ద్రౌపదీదేవికి వెళ్లి వస్తామని చెప్పి ఆమె దగ్గర వీడ్కోలు తీసుకున్నారు.

ధర్మరాజు రథాన్ని అధిరోహించాడు. అర్జునుడు ఆయన దగ్గరికి వచ్చి నమస్కరించాడు. తరువాత తన శంఖాన్ని పూరించాడు. శ్రీకృష్ణుడి సారథ్యంలోని రథం మీద ఎక్కాడు. ఆ రథం మీద హనుమద్ద్వజం రెపరెపలాడుతున్నది. భీముడు, నకులుడు, సహదేవుడు, అభిమన్యుడు, ఉపపాండవులు రథాలను అధిరోహించే ముందర ధర్మరాజుకు నమస్కరించారు. తక్కిన రాజులు కూడా ఆలాగే చేశారు. ధృష్టద్యుమ్నుడు ధర్మరాజుకు సాగిలపడి నమస్కరించి అశ్వాన్ని అధిరోహించాడు. అలా సేనతో కలిసి ధర్మరాజు కురుక్షేత్రాన్ని సమీపించాడు. చదునైన ఒక ప్రదేశంలో, హిరణ్వతి అనే ఒక పవిత్ర నది ఒడ్డున ఆగాడు. అది సైన్యం విడిది చేయడానికి సరైన చోటుగా నిర్ధారణ చేశాడు. అక్కడ సైన్యం దిగితున్నట్లు గుర్తుగా శ్రీకృష్ణుడు తన పాంచజన్యాన్ని పూరించాడు. ధర్మరాజాదులు కూడా అలాగే తమ వీరశంఖాలను పూరించారు.

ఇదిలా వుండగా వేగులవారి ద్వారా పాండవులు దండు విడిసినారని విన్నప్పటికీ ఏమీ తెలియనివాడిలా తనవారిని పిలచి, పాండవులు యుద్ధానికి వస్తారని, అందువల్ల, మర్నాడే దండయాత్ర అని చాటించమని ఆదేశించాడు. తాము సైన్యంతో విడిది చేయాల్సిన స్థలం కురుక్షేత్రమని అంటూ, దుశ్శాసనుడిని అన్ని పనులు చూసుకోమన్నాడు. ఆ మర్నాడు దుర్యోధనుడు కొలువు కూటానికి వచ్చాడు. ద్రోణాచార్యుడిని, రాధేయుడిని, అశ్వత్థామను, బాహ్లికుడిని, శల్యుడిని, కృపాచార్యుడిని, భూరిశ్రవుడిని, శకునిని, కృతవర్మను, కాంభోజరాజును, సైంధవుడిని కౌరవుల పదకొండక్షౌహిణులకు సేనానాయకులుగా నియమించాలని నిశ్చయించిన దుర్యోధనుడు వారందరినీ సభకు పిలిపించాడు. వారిని సేనాపతిత్వానికి అభిషిక్తులు కమ్మని కోరి, వారందరినీ వైభవంగా అక్షౌహిణీపతులుగా అభిషిక్తులను చేశాడు దుర్యోధనుడు.

 అక్షౌహిణీపతులందరిని తీసుకుని భీష్ముడి దగ్గరికి పోయాడు దుర్యోధనుడు. ఆయనకు నమస్కరించాడు. వారిని సేనానాయకులుగా పరిచయం చేశాడాయనకు. యావత్ యుద్ధానికి రణభారం వహించి సర్వసైన్యాధిపత్యం నిర్వహించడానికి అంగీకరించమని భీష్ముడిని ప్రార్థించాడు. తాను సర్వసేనాధిపత్యం వహిస్తానని, తనను ఎదుర్కోగల పురుషులెవ్వరూ భూమ్మీద లేరని, అయితే తాను ఆర్జునుడిని మాత్రం ఎదుర్కోలేనని అన్నాడు. పాండుకుమారులను సంహరించడానికి తనకు చేతులు రావని కూడా చెప్పాడు. ముందు తనను కాని, కర్ణుడిని కాని యుద్ధం చేయడానికి నియోగించమని అన్నాడు. అలా అయితేనే తాను సర్వసేనాధిపత్యం వహిస్తానని స్పష్టం చేశాడు. తానెలాగు భీష్ముడు రణరంగంలో నేలకూలేదాకా యుద్ధం చేయనన్నానుగా అన్నాడు కర్ణుడు. సరే అని భీష్ముడు కౌరవుల సర్వసేనాధిపతిగా పట్టం కట్టుకోవడానికి అంగీకరించాడు. దుర్యోధనుడు సర్వసేనాధిపత్యానికి భీష్ముడిని అభిషేకించాడు. సర్వసైన్యాధ్యక్ష పదవి ఆయనకు అప్పగించాడు.

దుర్యోధనుడు భీష్ముడిని ముందుంచుకొని కురుక్షేత్రానికి నడిచాడు. కురుక్షేత్రానికి ప్రవేశించి, అక్కడ ఒక ప్రదేశంలో సేనలను దింపాడు. ఇలా కురుక్షేత్రంలో కౌరవ-పాండవ సేనలు చేరి యుద్ధానికి సిద్ధమయ్యాయి. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Sunday, January 16, 2022

త్రిశంకూపాఖ్యానం ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-91 : వనం జ్వాలా నరసింహారావు

 త్రిశంకూపాఖ్యానం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-91

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (17-01-2022)

         "వశిష్ఠుడితో తనకు కలిగిన విరోధం-పరాభవం, ఓటమికి కుమిలిపోతూ, శోకంతో ఏమీ చేయలేక లోలోపలే విశ్వామిత్రుడు బాధపడుతుండేవాడు. భార్యతో దక్షిణ దిక్కుగా పోయి, తీవ్రమైన తపస్సు చేస్తున్న సమయంలో, హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడనే నలుగురు కొడుకులు కలిగారు. అలానే వేయి సంవత్సరాలు తపస్సుచేసింతర్వాత, బ్రహ్మ ప్రత్యక్షమై, విశ్వామిత్రుడు తన తపస్సుతో రాజర్షులందరినీ మించిపోయాడని-ఆయన గూడా రాజర్షిగా  అయ్యాడని వరమిచ్చి తన లోకానికి వెళ్లిపోతాడు. తనింతకాలం తపస్సు చేసింది రాజర్షికావడానికానని పరితపించి, విచారపడి, సిగ్గుతో తలవంచుకుని దుఃఖంతోనూ-శోకంతోనూ కుమిలిపోయాడు. తనింతగా చేసిన తపస్సు వ్యర్థమయిందని భావించిన విశ్వామిత్రుడు, మునుపటికంటే గొప్పగా తపస్సు చేయాలని నిశ్చయించుకుని, అనుకున్న విధంగా చేయసాగాడు".

"అలా విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్న సమయంలో, అయోధ్యలో త్రిశంకుడు అనే రాజు, దేహంతో స్వర్గానికి పోవాలని-అక్కడ స్వర్గ సుఖాలనుభవించాలని అనుకొని, వశిష్ఠుడిని పిలిచి తన కోరిక తెలిపి, దానికొరకు తనతో యాగం చేయించమని అడుగుతాడు. వశిష్ఠుడు, అది సాధ్యపడదని అనగానే, త్రిశంకుడు ఆయన్ను వదిలి దక్షిణ దిక్కుగా వశిష్ఠుడి నూర్గురు కొడుకుల వద్దకు వెళ్తాడు. కీర్తితో ప్రసిద్ధికెక్కిన అసమాన తేజోవంతులైన ఆ గురుపుత్రులందరికీ చేతులు జోడించి నమస్కరించాడు త్రిశంకుడు. వారి శరణుజొచ్చానని, వారే తన రక్షకులని, దేహంతో స్వర్గానికి పోవాలన్న తన కోరికను తీర్చుకునేందుకు యజ్ఞం చేయించమని అడిగితే వారి తండ్రి ఒప్పుకోనందున అవమాన పడ్డానని అంటాడు. ’గురు పుత్రులారా, మీ పాదాలపై నా శిరస్సుంచి మొక్కుతాను. పరమ తపస్వులారా నన్ను రక్షించండి. నేను ఈ దేహంతో స్వర్గానికి పోయే యాగాన్ని నాతో చేయించండి. మీ తండ్రి నేను రాజునని మరిచి-రాజుల కార్యం నెరవేర్చడం పురోహితుల ధర్మమని ఆలోచించకుండా నన్ను ధిక్కరించాడు. ఇక మీరే నాకి దిక్కు. ఇక్ష్వాకుల రాజ వంశానికి పురోహితులైన మీరే ఈ కార్యం నాతో చేయించకపోతే, మీరు పురోహితులా వుండి ఏం ప్రయోజనం’ అని వశిష్థుడి కొడుకులతో నిష్టూరంగా మాట్లాడుతాడు త్రిశంకుడు".

త్రిశంకుడనే పేరు రావడానికి కారణం దైవ పౌరుష బల విచారం

         "ఇలా మాట్లాడుతున్న రాజు చెప్పిందంతా విన్న వశిష్ఠుడి నూర్గురు కొడుకులకు విపరీతమైన కోపమొచ్చింది. ’ఓరీ వివేక హీనుడా, సత్యం పలికిన గురువుగురించి ఇలా మాట్లాడవచ్చా? ఆయన్ను కాదని ఇంకొకరిని ఆశ్రయించవచ్చా? కుల గురువును విడవడం మర్యాదేనా? సూర్య వంశపు రాజులందరికి పురోహితుడే ఆచార్యుడు.ఆయన మాట జవదాటవచ్చా? ఆయన అబధ్ధాలాడుతున్నాడనుకుంటున్నావా? ఏమనుకుని ఆయన్ను వదిలావు? నిన్నొకిడినేకాదు-లోకాలన్నిట్లో ఏ యాగమైనా, ఎవరితోనైనా చేయించగల శక్తి ఆయనకుంది. వశిష్ఠుడు కాదంటే మేమెలా చేయిస్తామనుకున్నావు? చేయిస్తే ఆయన్ను అవమానించినట్లేకదా? అలాంటి పని మేం చేయొచ్చా’ అని అంటారు. కఠినంగా మాట్లాడిన వారితో, గురువుతో అవమానించబడ్డానని-ఆయన కుమారులతో కూడా అవమానించబడ్డానని, ఇంకొకరి శరణువేడి తన కార్యం సాధించుకుంటానని వెళ్లడానికి సిద్ధమవుతాడు. నిష్కారణంగా గురు ధిక్కారానికి పాల్పడ్డ త్రిశంకుడిని, చండాలుడు కమ్మని శపించి తమ ఆశ్రమానికి పోయారు వశిష్ఠుడి కొడుకులు. రాజు తన నగరానికి పోయాడు".

         "ఉదయం నిద్రలేచి తన ముఖం-శరీరం చూసుకుంటాడు రాజు. అందంగా సుతిమెత్తగా వుండే శరీరం నల్లబడిపోయింది.బంగారుకాంతితో అతిశయిస్తుండే అందమైనదేహం వానాకాలంమబ్బులా నల్లబడింది. మెత్తగా-నిడువుగావుండే తలవెంట్రుకలు, బిరుసుగా - చింపిరిగామారాయి. మణులుచెక్కిన బంగారు సొమ్ములన్నీ ఇనుపముక్కలై పోయాయి. మెడలో వేలాడే జందెంపోగు, ఇనుప తాడయింది. సహించనలవికాని మునుల శాపంవల్ల సర్వనాశనమైంది. అలా తయారైన తమ రాజును చూసిన పురప్రజలందరు దూరంగా పోసాగారు. అందరూ తన్నొదిలిపోయినా, ధైర్యం కోల్పోని రాజు దుఃఖంతో పరితపిస్తూ, విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. తనవద్దకొచ్చిన వాడు త్రిశంకుడనే రాజని గ్రహించిన విశ్వామిత్రుడు, అతనెందుకలా శాపవశాన మాలవాడయ్యాడనీ-ఎందుకు తన దగ్గరకు వచ్చాడని దయతో అడుగుతాడు. తనను తనగురువు-గురుపుత్రులు ఉపేక్షించారని, తన కోరిక తీరకపోగా ఇలా తయారయ్యానని, అవమానపడ్డానని, దేహంతో స్వర్గానికి పోవాలని వందలాది యజ్ఞాలు చేసినా ఫలితం కలగలేదని అంటాడు".

"తనింతవరకు ఎన్నడూ అసత్యం పలకలేదని, ఇప్పుడిలాంటి దశ వచ్చినా-మున్ముందు అసత్యమాడబోనని క్షత్రియ ధర్మంపై ప్రమాణం చేసి చెప్పుతున్నానన్నాడు. తాను రాజధర్మం విడవక ప్రజాహితమైన కార్యాలను చేసానని, కష్ఠకాలంలో కూడా సత్యమే పలుకుతానని అంటాడు త్రిశంకుడు. తానెన్నో యజ్ఞాలు చేసానని, మంచి నడవడితో గురువులను సంతోషపెట్టానని, కీర్తి సంపాదించానని, ఇంతచేసినా ఇప్పుడు తనుచేయదల్చిన యజ్ఞం చేయించడానికి వారు ఒప్పుకోవడంలేదని, తన పౌరుషం వ్యర్థమనీ-దైవమే శ్రేష్ఠమనీ తలుస్తున్నానని, సర్వం దైవానికి లోబడేవుంటుందని, ఉత్తమ గతికూడా దైవానుగ్రహమేనని, దైవం కరుణించకపోతే పౌరుషం ఫలించదని అంటూ, విశ్వామిత్రుడిని తప్ప ఇతరులను ఆశ్రయించననీ-అతడే నిశ్చయంగా తనకు రక్షకుడనీ, తను తలపెట్టిన కార్యాన్ని పురుష ప్రయత్నంతో సఫలం చేయమనీ ప్రార్తించాడు త్రిశంకుడు విశ్వామిత్రుడిని".

         (ఆంధ్ర వాల్మీకిరామాయణం బాల కాండ మందరంలో, అవసరమైన ప్రతిచోటా, మనుష్యులు ఆచరించాల్సిన ధర్మాలను సందర్భోచితంగా వివరించబడింది. త్రిశంకుడి కోరిక వక్రబుద్ధిగల శిష్య లక్షణంగా అర్థంచేసుకోవచ్చు. సరైన శిష్యుడు, తనకేది హితమో-పథ్యమో, అది చెప్పమని గురువులను కోరాలి గాని, నిర్భంధించి-తన ఇష్టప్రకారం, అసాధ్యమైన పనులు చేయించమని అడిగి-ఆయన చేయించనన్నాడని గురువును త్యజించడం దోషం. గురు శుశ్రూష చేసి, అతడి మనస్సును సంతోషపర్చి, తన కార్యాన్ని సాధించుకోవాలి శిష్యుడు. అలాచేయనందువల్లే త్రిశంకుడి ఆ గతి పట్టింది. వశష్ఠుడి కొడుకులు త్రిశంకుడి కోరిక తిరస్కరించడమంటే, పుత్రులు తండ్రి మార్గాన్ని అనుసరించి ప్రవర్తించాలని, ఆయనకు అవమానకరమైన పనులు చేయకూడదని అర్థం. గురువును నిందించినవాడు చండాలుడవుతాడన్న అర్థం కూడా స్ఫురిస్తుంది.

         త్రిశంకుడి అసలు పేరు సత్యవ్రతుడు. ఆయన భార్య సత్యవ్రత-కేకయ రాజు కూతురు. సత్యవ్రతుడు సూర్యారుణుడి కొడుకు. అతడు సత్యవ్రతను పెళ్లి చేసుకున్న తర్వాత, అయోధ్యా నగరంలో నివసిస్తున్న ఒక బాలికను-వివాహితను, రాజకుమారిడినన్న అదికా గర్వంతో, చెరిచాడు. రాజుకీవిషయం తెలిసి, కోపించి, తనదగ్గర వుండొద్దని సత్యవ్రతుడిని ఆజ్ఞాపించాడు. కుక్క మాంసం తిని బతకమని కూడా తండ్రి ఆదేశించాడు. తన పక్షాన పురోహితుడైన వశిశ్ఠుడు తండ్రితో మాట్లాడలేదని సత్యవ్రతుడికి ఆయనపై కోపమొస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి, సత్యవ్రతుడి తండ్రి అడవికి పోయి తపస్సు చేయసాగాడు. రాజ్యం, నగరం, అంతఃపురం ఇబ్బందులకు గురి కావద్దని, వశిష్ఠుడు స్వయంగా కాపాడసాగాడాసమయంలో. ఆ సమయంలోనే, విశ్వామిత్రుడు, భార్యా పిల్లలను వదిలి పశ్చిమ సముద్ర తీరంలో తపస్సు చేస్తుండేవాడు. ముగ్గురు పిల్లల్ని, తన్ను పోషించుకోలేక విశ్వామిత్రుడి భార్య, నడిమికొడుకు మెడకు పలుపు తగిలించి, వంద ఆవులిస్తే అమ్మడానికి బేరం పెట్టింది. ఆ విషయం తెలుసుకున్న సత్యవ్రతుడు, ఆమెను వారించి, వారందరినీ తన రక్షణలో వుంచుకున్నాడు. ప్రతిదినం జంతువులను వేటాడి వారందరికీ మాంసాహారం పెట్టి పోషించేవాడు. ఒక రోజున వేటాడేందుకు ఒక్క జంతువుకూడా దొరకలేదు. సమీపంలోనే వున్న వశిష్ఠుడి ఆవును చంపి దాని మాంసం తిన్నారారోజున. తండ్రికి అప్రియమైన పనులు చేయడం,  పాలిచ్చే గురువు గోవును చంపడం, అప్రోక్షిత మాంసాన్ని తినడం అనే మూడు చెడు కార్యాలను చేసినందున త్రిశంకుడు అనే పేరుతో వ్యవహరించమని-లోక నిందితుడైన అతడిని తనింకేమీ చేయనని అంటాడు కోపించిన వశిశ్ఠుడు. అప్పటినుండి సత్యవ్రతుడు త్రిశంకుడయ్యాడు. తపస్సు పూర్తయిన తర్వాత వచ్చిన విశ్వామిత్రుడు, తన భార్యా పిల్లలను కాపాడిన త్రిశంకుడితో, ఆయన కోరుకున్నప్పుడు కావాల్సిన సహాయం చేస్తానని హామీ ఇచ్చినందువల్లనే ఇప్పుడు యజ్ఞం చేయించేందుకు పూనుకుంటున్నాడు).

కర్ణుడి జన్మరహస్యం చెప్పి అతడిని పాండవులతో కలవమన్న శ్రీకృష్ణుడు, కుంతీదేవి-తిరస్కరించిన కర్ణుడు ..... ఆస్వాదన-55 : వనం జ్వాలా నరసింహారావు

 కర్ణుడి జన్మరహస్యం చెప్పి అతడిని పాండవులతో కలవమన్న

శ్రీకృష్ణుడు, కుంతీదేవి-తిరస్కరించిన కర్ణుడు

ఆస్వాదన-55

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (16-01-2022)

ధృతరాష్ట్రుడి సభ నుండి రాయబారానంతరం వెడలిపోతున్న శ్రీకృష్ణుడి వెంట ఆయనను సాగనంపడానికి ధృతరాష్ట్రుడు ఆయన పరివారంతో సహా కొంతదూరం వచ్చాడు. దారిమధ్యలో కుంతీదేవి ఇంటికి పోయి శ్రీకృష్ణుడు ఆమెకు పాదాభివందనం చేసి జరిగిన సంగతులు వివరించాడు. ధర్మరాజాదుల దగ్గరికి వెళ్లివస్తానని చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు. శ్రీకృష్ణుడి మరదులైన తన కొడుకులు, సంధికొరకు సకల విధాల శ్రమ పడ్డారని, సంధి తప్పిపోవడం కూడా మంచికే జరిగిందని, క్షత్రియజాతికి తగినది వీరవృత్తని, దేవుడు మేలు చేయగా సంధి భగ్నమైందని అన్నది కుంతి. ఆ తరువాత కుంతి దగ్గరనుండి బయల్దేరి పయనమై పోయాడు శ్రీకృష్ణుడు.

మధ్యలో శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్లాడు. కర్ణుడి జన్మ రహస్యం చెప్పాడు. కుంతీదేవి సూర్యుడివల్ల అతడికి జన్మనిచ్చిందని, అందువల్ల ఆయన పాండురాజు పెద్ద కుమారుడని, కర్ణుడు తమ అన్న అని ధర్మరాజుకు తెలిస్తే అతడికే రాజ్యభారం వహించడానికి పట్టం కడుతారని, కాబట్టి తనతో కలిసి పాండవుల దగ్గరికి కలిసి రమ్మని అన్నాడు. దేవేంద్ర వైభవంతో మహానీయుడివై మహీమండలాన్ని పరిపాలించమని పలికాడు. ద్రౌపది తన ఐదుగురు భర్తలతో పాటు కర్ణుడిని ఆరవ భర్తగా ఆప్యాయంగా స్వీకరిస్తుందని కూడా అన్నాడు.

తన జన్మ వృత్తాంతం కొంతమేరకు తనకు తెలుసనీ, కుంతీదేవి తనను కనికరం లేకుండా గంగలో తోసిందనీ, సూతదంపతులు తనను దయతో పెంచారనీ, తనను వారు కన్నకుమారుడిలాగా చూశారనీ, ఇప్పుడు వారిని వదిలితే ధర్మం తప్పినవాడిని అవుతాననీ బదులు చెప్పాడు కర్ణుడు. అలాగే సుయోధనుడు తనను ఇంత గొప్పవాడిని చేశాడని, అలాంటివాడిని యుద్ధం వచ్చే ముందర వదలడం న్యాయమా, ధర్మమా అని ప్రశ్నించాడు. తాను కుంతీ పుత్రుడినన్న రహస్యం బయటకు పొక్కకుండా భద్రంగా శ్రీకృష్ణుడు తన హృదయంలోనే వుంచుకొమ్మని కోరాడు కర్ణుడు. ధర్మరాజు లాంటి పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు కర్ణుడికి అయన తమ్ముడినని తెలుస్తే రాజ్యభారం వహించడని, అతడు రాజు కావడమే న్యాయమని అన్నాడు కర్ణుడు.

కర్ణుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు, అర్జునుడితో కర్ణుడికి జరగబోయే పోరాటంలో విజయం అర్జునుడిదేనని, అతడిని యుద్ధంలో ఎదుర్కోవడం కర్ణుడి శక్యం కాదని, కాబట్టి సర్వ విధాల పాండవులే జయిస్తారని అన్నాడు. ఏడెనిమిది రోజుల్లో అమావాస్య వస్తుందని, అది పుణ్య తిథి అని, ఆనాడు యుద్ధం ప్రారంభం కావాలని శ్రీకృష్ణుడు చెప్పి, ఆ విషయం దుర్యోధనాదులకు తెలియచేయమన్నాడు. అందుకు కర్ణుడు, కురుపాండవుల మధ్య జరగనున్న సంగ్రామంలో విజయుడిగా శ్రీకృష్ణుడిని దర్శిస్తానని, లేదా, చనిపోయి వీరస్వర్గం చేరి పరమేశ్వరుడైన ఆయన్ను చూస్తానని, తనకిక సెలవిప్పించమని అన్నాడు. సరేనన్న శ్రీకృష్ణుడు రథం ఎక్కి హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు.

ఇదిలా వుండగా, శ్రీకృష్ణుడు వచ్చిపోయిన తరువాత కుంతీదేవి మనసులో ఒక ఆలోచన వచ్చింది. కర్ణుడిని కలిసి అతడి జన్మ వృత్తాంతం చెప్పి తోబుట్టువుల మీద ప్రేమ కలిగిద్దామనుకుంటుంది. కర్ణుడి దగ్గరికి వెళ్లాలని నిశ్చయించుకున్నది. కర్ణుడు ఆ సమయంలో గంగానది దగ్గర జపం చేసుకుంటున్నాడు. ఆమెను చూడగానే తన సూత గోత్రం, రాధేయ నామధేయం చెప్పి ఆమెకు పాద నమస్కారం చేశాడు. ఆమె రహస్యంగా కర్ణుడికి కొన్ని విషయాలు చెప్పింది.

కర్ణుడు సూత కులంలో పుట్టలేదని, తనకు సూర్యుడికి జన్మించాడని, ధర్మప్రకారం అతడు పాండురాజు పుత్రుడని, కాబట్టి కర్ణుడు రాదా తనయుడన్న హీనస్థితి నుండి బయటకు వచ్చి, పాండవులతో చేరి భూమినంతా పాలించమని చెప్పింది. ఆమె ఆ మాటలు చెప్తున్నప్పుడే సూర్యబింబం నుండి అశరీరవాణి కుంతి చెప్పిన మాటలు నిజమని పలికింది. ఆమె చెప్పింది సత్యమే అయినప్పటికీ క్షత్రియులకు జరగాల్సిన సంస్కారాలు తనకు జరగలేదని, సూర్య భగవానుడి వల్ల తన జన్మ రహస్యంగా వున్నదని, ఇప్పుడు దానిని వెల్లడి చేయడం మంచిదికాదని, తానిప్పుడు పాండవులతో కలిస్తే అర్జునుడికి భయపడి కలిశానని లోకులు హేళన చేస్తారని అన్నాడు కర్ణుడు. దుర్యోధనుడిని అవసర సమయంలో వదిలేయడం తనకు ధర్మం కాదన్నాడు. ఇదే తన నిశ్చయమని, అయితే ధర్మరాజాదులు యుద్ధంలో తన చేతికి చిక్కితే ఒక్క అర్జునుడిని తప్ప మిగతావారిని చంపనని మాట ఇచ్చాడు. తమ ఇద్దరిలో ఏ ఒక్కరు పోయినా కుంతికి అయిదుగురు కొడుకులు మిగులుతారని చెప్పాడు.

ఇది భగవత్ సంకల్పం అని అంటూ కుంతీదేవి, కర్ణుడిని కౌగలించుకుని, ఆర్జునుడిని తప్ప మిగతావారిని చంపవద్దని మళ్లీ చెప్పి, కర్ణుడు చెప్పినదానికి అంగీకరించింది. కర్ణుడు ప్రేమతో ఆమెకు నమస్కరించాడు. తరువాత ఇద్దరూ తమతమ నివాసాలకు వెళ్లిపోయారు.

శ్రీకృష్ణుడు హస్తినాపురం నుండి ఉపప్లావ్యానికి వచ్చి ధర్మరాజును కలిశాడు. కౌరవులు సంధికి అంగీకరించలేదని చెప్పాడు. హస్తినాపురంలో జరిగినదంతా వివరించాడు. కౌరవ సభలో జరిగిన విశేషాలను, దుర్యోధనుడు తనను గేలి చేయడాన్ని, సభనుండి లేచి పోవడాన్ని, అతడన్న మాటలను తెలియచేశాడు. ధృతరాష్ట్రుడు చెప్పిన మంచి మాటలను కూడా దుర్యోధనుడు లక్ష్యపెట్టలేదన్నాడు. దుర్యోధనుడు యుద్ధం చేస్తాడు కాని పాండవులకు రాజ్యం ఇవ్వడని స్పష్టం చేశాడు. అంతా విన్న ధర్మరాజు రణరంగానికి కదలమని తమ్ములను ఆదేశించాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Sunday, January 9, 2022

వశిష్టుడి విజయం గాయత్రీ విజయమే ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-90 : వనం జ్వాలా నరసింహారావు

                                      వశిష్టుడి విజయం గాయత్రీ విజయమే

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-90

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (10-01-2022)

అయినా ఆగని విశ్వామిత్రుడు పొగరుబోతు మాటలాడుతూ-అక్కడే నిలబడమని-ఇంకెక్కడికీ పోలేవని అంటూ, తనదగ్గరున్న ఆగ్నేయాస్త్రాన్ని మునిపై ప్రయోగించాడు. తనపైకొస్తున్న అస్త్రాన్ని చూసిన వశిష్ఠుడు, విశ్వామిత్రుడిని నీచ క్షత్రియుడా అని సంబోధిస్తూ: తనక్కడే నిలుచున్నాననీ-ఆతడి బలమెంతో, చలమెంతో, శస్త్రాస్త్రాల పాండిత్యమెంతో చూపమని-ముందు వాటన్నిటినీ భస్మం చేసి ఆతర్వాత ఆతడిని భూమి మీద లేకుండా చేస్తానని-క్షత్రియ బలానికి, బ్రాహ్మణ బలానికి తేడా అతడికి తెలియదని-దివ్యమైన బ్రాహ్మణ బలాన్ని ఇక చూపబోతున్నానని, అంటూనే, విశ్వామిత్రుడి ఆగ్నేయాస్త్రాన్ని తన బ్రహ్మ దండంతో చల్లార్చాడు".

         "అంతటితోనూ ఆగకుండా విశ్వామిత్రుడు, వారుణాస్త్రం-రౌద్రాస్త్రం-పాశుపతం-ఐషీకం-స్వాపనం-గాంధర్వం-మోహనం-మానవం-జృంభణం-మాదనం- సంతాపనం- విలాపనం- శోషణం- దారణం- జయించలేని వజ్రశరం – బ్రహ్మపాశం – కాలపాశం – వారుణపాశం - దండం-పైశాచం-దయితం-రెండశనులు-క్రౌంచాస్త్రం-శుష్కం-ఆర్థ్రం – పైనాకం - ధర్మచక్రం - భయంకరమైన కాలచక్రం – విష్ణుచక్రం – మథనం – వాయవ్యం – హయశిరం - రెండు శక్తులు – ముసలం - కంకాళం-కాలాస్త్రం-వైద్యాధరం-కాపాలం-త్రిశూలం-కంకణాస్త్రాలను వశిష్ఠుడి మీద ప్రయోగించాడు. వీటన్నిటినీ బ్రహ్మ సుతుడైన వశిష్ఠుడు తన బ్రహ్మ దండంతో హరించివేశాడు. తన అస్త్రాలన్ని వ్యర్థమై పోవడంతో, దీర్ఘమైన కోపంతో, భయంకరాకారుడై, దేవతా గణం-ముల్లోకాలు భయపడుతుండగా, బ్రహ్మాస్త్రాన్ని సంధించి విడిచాడు విశ్వామిత్రుడు”.

తనమీదకొస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసిన వశిష్ఠుడు, చేతిలో బ్రహ్మదండాన్ని పట్టుకొని, దేవతలంతా విభ్రాంతితో గమనిస్తుంటే, దాన్ని మింగాడు. బ్రహ్మాస్త్రాన్ని మింగిన వశిష్ఠుడు మిక్కిలిభయంకరంగా కనిపిస్తుంటే, ఆయన రోమకూపాలనుండి, అగ్నిజ్వాలలు ప్రవహించసాగాయి. ఆ మహా ఋషి శ్రేష్టుడిని, ఋషీశ్వరలందరు ప్రార్థించారు. వశిష్ఠుడి తపో బలమింతని చెప్పలేమని, సత్కీర్తిగల ఆయన తన తేజస్సును శమించజేయాలని, బ్రాహ్మణోత్తముడైన ఆయన చేతిలో విశ్వామిత్రుడు ఓటమి చెందాడని అంటారు వారంతా. ఇలా తనను ఋషీశ్వరులందరు కోరడంతో, వశిష్ఠుడు శాంతించాడు. ఇదంతా చూసిన విశ్వామిత్రుడికి ఏంచేయాల్నో తెలియక నిట్టూర్పులు విడిచి దుఃఖంతో తనలో తానే ఆలోచించసాగాడు. తన క్షాత్రం వ్యర్థమయిందని, అస్త్రాలన్నీ వ్యర్థమయ్యాయని, వాటితో తనకింక అవసరం లేదని, బ్రాహ్మణుడై-శాంత చిత్తుడై, ఇంద్రియాలను జయించినందువలనే కదా వశిష్ఠుడికింత మహాత్మ్యం కలిగిందని అనుకుంటాడు. తనుకూడా శాంత చిత్తుడై, ఇంద్రియాలను జయించి, బ్రాహ్మణుడు కావడానికి ప్రయత్నించాలని అనుకొని, తపస్సు చేసేందుకు సిద్ధమవుతాడు".

(వశిష్టుడి గురించి చెప్పేటప్పుడు వాసుదాసుగారు రాసిన పద్యాల్లో, ఆయన్ను "జపివర్యుడు", "జపశీలుడు" అనే విశేషణాలను ప్రయోగించారు. ఇలా ప్రయోగించడంలో వక్త-వ్యాఖ్యాత వుద్దేశం, వశిష్ఠుడి మహాత్మ్యానికి కారణం ఆయన నిరంతరం చేస్తున్న జపమే. ఆయన జపించే మంత్రం "గాయత్రి" యే. గాయత్రీ మంత్రమే బ్రహ్మాస్త్రం. అది జపించడం వల్లే, వశిష్ఠుడింతటి మహాత్మ్యంగలవాడయ్యాడు. ఇంకో క్షత్రియుడయితే, బ్రహ్మాస్త్రం తగిలితే చనిపోవాల్సిందే. ఒకవేళ అతడికి కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం వస్తే శత్రువు అస్త్రాన్ని అణచి వేయొచ్చు.ఇవేవీలేకుండా,వశిష్ఠుడు దాన్నిమింగి జీర్ణించుకున్నాడు. తపోబలంతో, జపబలంతో, బ్రాహ్మణ్యంతో వశిష్థుడి దేహమే బ్రహ్మమై వుండగా, ఆయన్నెవరేం చేయగలరు? కార్చిచ్చుమీద చిచ్చుబుడ్లు ప్రయోగిస్తే ఏం జరుగుతుందో అదేజరిగింది వశిష్ఠ-విశ్వామిత్రుల మధ్య జరిగిన "ఆత్మ-అనాత్మల" యుద్ధంలో. వశిష్ఠ విజయం నిజానికి గాయత్రీ విజయమే. అంతటి గొప్పదైన గాయత్రిని అధికరించి చెప్పబడిందే, శ్రీమద్రామాయణం-శ్రీ మధాంద్ర వాల్మీకిరామాయణం. అందుకే ఇవి సర్వోత్కృష్ట  గ్రంథాలని వేరే చెప్పాల్సిన పనిలేదు.

గాయత్రీ బీజసంయుతమైన వాల్మీకిరామాయణంలో, ప్రతి అక్షరానికి, గాయత్రీ మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి ఎంత మహిముందో, అంతే మహిముంది. వశిష్ఠ విశ్వామిత్ర యుద్ధం, బ్రాహ్మణ క్షత్రియ యుద్ధం మాత్రమేకాదు. ఆత్మవిద్యకు, అనాత్మవిద్యకు మధ్యజరిగిన యుద్ధం.సంపూర్ణంగా అనాత్మవిద్య నేర్చుకున్నప్పటికీ, వాడు,ఆత్మవంతుడిని గెలవలేడు. విద్యావంతుడి దౌష్ట్యం, ఆత్మవంతుడి సాధుస్వభావం కూడా ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుంది. వశిష్ఠుడు, ఆద్యంతం తనను తాను రక్షించుకునే ప్రయత్నమే చేశాడుకాని, తన ఉప్పుతిని-కృతఘ్నుడై-దివిటీ దొంగలా తన సొమ్ము అపహరించేందుకు పూనుకున్నవాడినీ, తన ఆశ్రమాన్నంతా పాడుచేసి తనను చంపే ప్రయత్నం చేసినవాడినీ, దెబ్బకు-దెబ్బ అనిగూడా కీడుతలపెట్టలేదు. ఇదే ఆత్మవంతుడైన బ్రాహ్మణుడి లక్షణం. బ్రాహ్మణుడు ఇతరులవల్ల నష్టపడినాగాని, పరులకు హానితలపెట్టడు. వశిష్ఠుడు ఇంతజరిగినా విశ్వామిత్రుడిని శపించలేదు).