Saturday, February 4, 2012

ఎమ్మార్లోు రాజకీయ హస్తం లేదా?: వనం జ్వాలా నరసింహారావు


సూర్య దినపత్రిక (04-02-2012)
వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్ర రాజకీయాలకన్నా రంజుగా, పసందుగా, రసకందాయంలో సాగుతోంది సిబిఐ దర్యాప్తు. ఇలా రాయడమంటే సిబిఐని తప్పుపడుతున్నట్లు అర్థం తీస్తే అది వేరే సంగతి. గాలి జనార్దనరెడ్డి ఓబులాపురం గనుల అక్రమాలతో, ఎమ్మార్ కుంభకోణంతో, జగన్ అక్రమాస్తుల ఆర్జన నేరారోపణతో, వైఎస్ విజయమ్మ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడుపై వేసిన పిటీషన్‌తో, సిబిఐకి చేతి నిండా పని దొరికిందనాలి. ప్రభుత్వం చేయాల్సిన పని చేయకపోవడంతో, న్యాయస్థానాల జోక్యంతో ఈ మూడు కేసులు సిబిఐ చేపట్టాల్సి వచ్చింది. దర్యాప్తు కొనసాగుతున్న విధానం, ముద్దాయిలుగా ఇంతవరకు నిర్ధారించిన వారిని విచారించిన తీరు, అరెస్టుల తతంగం, సాక్షులుగా కొందరిని పిలిచి విచారించిన వైనం, వారిలో ఒకరిద్దరిని నిందితులుగా దరిమిలా పేర్కొన్న వ్యవహారం, ఒక కేసుతో సంబంధం వుందనుకున్నవారిని మరో కేసులో సాక్షిగానో-భవిష్యత్ ముద్దాయిగానో విచారించిన తీరు నిశితంగా పరిశీలించిన వారికి కొంత గందరగోళంగా కనిపించినా, విషయం మాత్రం అంతో-ఇంతో అవగతమవుతోందనే అనుకోవాలి. ఒక కేసుతో మరో దానికి "ముందు-వెనుకల అనుబంధాన్ని" అన్ని కేసుల పరిపూర్ణ దర్యాప్తు చివరలో నిర్ధారించే దిశగా విచారణ సాగుతోందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. గాలి కేసులో సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని పిలిచారు. ఎమ్మార్ కేసులో ముద్దాయిగానో-సాక్షిగానో పిలిచిన వారిలో జగన్ సన్నిహితుడు సునీల్ కుమార్ రెడ్డి వున్నారు. ఎమ్మార్‍లో సాక్షిగా పిలిచిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను ముద్దాయిని చేశారు. స్టయిలిష్ హోం అధినేతను అప్రూవర్‌గా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎమ్మార్ కేసులో చంద్రబాబును ఎందుకు ముద్దాయిని చేయడం లేదని ప్రశ్నిస్తున్న నేపధ్యంలో ఆయనపైనే మరో ఫిర్యాదు చోటుచేసుకుంది. చివరకు కనీసం కొందరన్నా ఒకదానికంటే ఎక్కువ కేసులలో ముద్దాయిలు కాక తప్పదేమో!.
ఈ నేపధ్యంలో ఇటీవల జరిగిన ఒకటి-రెండు సంఘటనలు ప్రసార-మాధ్యమాలలో ప్రముఖంగా చోటుచేసుకున్నాయి. అందులో ఒకటి వైఎస్ విజయమ్మ ఫలానా న్యాయమూర్తి ముందుకు చంద్రబాబు నాయుడుపై ఆమె వేసిన పిటీషన్ విచారణకు రాకుండా కోరిన వ్యవహారం. అలానే ప్రధాన మంత్రికి ఆమె రాసిన లేఖ. ఇంకోటి ఎమ్మార్ చార్జ్ షీట్‌లో ముగ్గురు ఐఏఎస్ అధికారులను ముద్దాయిలుగా పేర్కొనడం. మరో అంశం, ఒక మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా, పలువురు మాజీ-తాజా ఐఏఎస్ అధికారులను ఏదో ఒక కేసులో సాక్షులుగా (ప్రస్తుతానికి) విచారణకు పిలవడం. ఇదంతా చూస్తున్న కొందరు అధికారులు, తాము వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తప్పు చేశామా? ఒత్తిడులకు లొంగి చేయరాని పని చేశామా? తప్పు చేయకపోయినా తమను ఇరికించే ప్రయత్నం జరుగుతోందా? ఇలా సాగితే తమ పరువు-ప్రతిష్టలు ఏం కావాలి? అన్న మీమాంసలో పడిపోయారు. ఎమ్మార్ కేసులో ఇరికిన (పోనీ ఇరికించిన) ఎల్వీ సుబ్రహ్మణ్యం తానే తప్పు చేయలేదనీ, ఏదన్నా అర-కొర జరుగుతే ఆ చిన్న తప్పును భూతద్దంలో చూపే ప్రయత్నం సిబిఐ చేస్తోందనీ, సాక్షిగా తనను పిలిచి ముద్దాయిగా చేసారని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. వాస్తవానికి నీతి-నిజాయితీ పరుడైన అధికారిగా, ఏ ఫైలునైనా క్షుణ్ణంగా పరిశీలించకుండా నిర్ణయం తీసుకోని అధికారిగా, సమర్ధత-దక్షత గల అధికారిగా, ఎల్వీ సుబ్రహ్మణ్యంకు పేరుంది. ఆయన చేసింది నేరమే అయితే, ఆ నేరం వెనుకనున్న వ్యక్తుల సంగతేంటి? అన్న ప్రశ్నలనూ వేస్తున్నారు చాలామంది. కనీసం ఒక్కరన్నా-ఒక్కరు రాజకీయ నాయకుల పేర్లు ముద్దాయిల జాబితాలో లేకుండా ఎమ్మార్ కుంభకోణం కేసులో చార్జ్ షీట్ దాఖలైందంటే వింతగానే వుంది. ముద్దాయిలుగా పేర్కొన్న వారందరికీ శిక్షలు పడాలని లేదు. కాకపోతే, న్యాయస్థానంలో శిక్ష పడాలంటే, ముద్దాయిల జాబితాలో పేరుండి తీరాల్సిందే కదా! ఏ ఒక్క రాజకీయ నాయకుడి పేరు ఇంతవరకు లేదంటే, ఎమ్మార్ కేసులో శిక్షార్హుడైన రాజకీయ నాయకుడు ఒక్కరు కూడా లేదనేగా అర్థం? ఇదెక్కడి న్యాయం? ఇది ముద్దాయిలతో దోబూచులాటకాదా?
ఈ నేపధ్యంలో జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి వేసిన పిటీషన్‌పై విచారించిన సుప్ర్రేం కోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. టు. జి స్పెక్ట్రం కేసులో లైసెన్సులను రద్దు చేస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఇది ఒక విధంగా కార్పొరేట్ ప్రపంచాన్ని ఖంగు తినిపించిందనవచ్చు. లైసెన్సుల జారీలో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ సిపిఐ ఎల్‌ అనే స్వచ్ఛంద సంస్థ, జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కేసులో హోం మంత్రి చిదంబరంను కూడా సహ నిందితుడిని చేయాలంటూ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్‌ పై నిర్ణయాన్ని సుప్రీం కోర్టు గురువారం ట్రయల్‌ కోర్టుకే వదిలేస్తూ, విషయంపై ట్రయల్‌ కోర్టు రెండు వారాలలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇదిలా వుండగా, తీర్పు ప్రధానిని లేదా 2008లో లైసెన్సుల జారీ జరిగినప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఇప్పటి హోమ్‌ శాఖ మంత్రి పి చిదంబరాన్ని అభిశంసించడమే అవుతుందన్న వాదనను మాత్రం ప్రభుత్వం తిరస్కరించింది. ఇంత పెద్ద కుంభకోణంలో అధికారులను, ప్రత్యక్షంగా ఒకరిద్దరు మంత్రులను, పరోక్షంగా ప్రధానమంత్రిని తప్పుబట్టగా లేంది, మన రాష్ట్రంలో జరుగుతున్న అలాంటి వ్యవహారాలలో, కనీసం ఒక్క రాజకీయ నాయకుడినైనా తప్పుబట్టక పోవడం హాస్యాస్పదం.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్-సిబిఐ-ఆవిర్భావం, 1941లో భారత ప్రభుత్వం ద్వారా స్థాపించబడిన "స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్" తో ఆరంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో, యుద్ధానికి సంబంధించిన యుద్ధ సామాగ్రి కొనుగోళ్ల లావాదేవీలలో జరగడానికి ఆస్కారమున్న అవినీతి కేసుల దర్యాప్తుకే స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ బాధ్యతలను పరిమితం చేసింది ప్రభుత్వం. దరిమిలా, యుద్ధం ముగిసిన తరువాత, కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన అవినీతి ఆరోపణల కేసుల దర్యాప్తుకు మాత్రమే పరిమితం చేస్తూ, 1946 లో, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. క్రమేపీ, దాని పరిధిని యూనియన్ టెరిటరీలకు, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతో సంబంధిత రాష్ట్రాలకు విస్తరింపచేయడం జరిగింది. ఏప్రిల్ 1963 లో, హోం మంత్రిత్వ శాఖ తీర్మానంతో, దాని పేరును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మార్చడం జరిగింది. అలా పేరు మార్పిడి జరిగిన తొలిరోజులలో, కేవలం, కేంద్ర ప్రభుత్వ సిబ్బందిపై వచ్చిన అవినీతి ఆరోపణలు మాత్రమే విచారించడం దానికి అప్పజెప్పిన బాధ్యత. క్రమేపీ, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బందిని, బాంకుల జాతీయ కరణ తరువాత ఆ సిబ్బందినీ సిబిఐ పరిధిలోకి తెచ్చింది ప్రభుత్వం.
సిబిఐ వ్యవస్థాపక డైరెక్టర్ డిపి కొహిలి, దాని ఆవిర్భావపు రోజులలోనే, అదొక జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థగా ఎదుగుతుందని జోస్యం చెప్పాడు. ఆయన సుదీర్ఘ నేతృత్వంలో, ఇంతింతై-వటుడింతై అన్న చందాన, నేటి ఈ స్థితికి చేరడానికి అన్ని విధాల పటిష్టమైన పునాదులు వేశారాయన. సిబిఐ నుంచి అత్యున్నత ప్రమాణాల సమర్ధతను-దక్షతను, సత్యనిష్ఠను భవిష్యత్‍లో పౌరులు సిబిఐ నుంచి ఆశిస్తారని, వారి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాల్సిన బాధ్యత దానిపై వుందని కొహిలి అనేవారు. చిత్తశుద్ధితో, రాగద్వేషాలకు అతీతంగా, కష్టపడి పనిచేయాల్సిన విద్యుక్త ధర్మం కూడా అందులో పనిచేసే అధికారులపైనుందని ఆయన అభిప్రాయపడ్డారు. "లాయల్టీ టు డ్యూటీ" ని ఆయన ప్రబోధించారు. ఇవన్నీ ఎంతవరకు జరుగుతున్నాయనేది వేరే సంగతి. కాకపోతే, దీనిని మించిన చిత్తశుద్ధి గల దర్యాప్తు సంస్థలు మరేవీ లేవని ఘంటాపథంగా చెప్పొచ్చు. సిబిఐ డైరెక్టర్లుగా పనిచేసిన వారిలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన విజయరామారావు ఒకరు. 
1965 నుంచి ఆర్థికపరమైన నేరాల పరిశోధన అంశాన్ని కూడా సిబిఐ పరిధిలోకి తెచ్చింది ప్రభుత్వం. సిబిఐ వ్యవహరిస్తున్న నిష్పాక్షిక ధోరణిని, నైపుణ్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, దాని పరిధిని మరింత విస్తరించ సాగింది. హత్యా నేరాలు, కిడ్నాపులు, తీవ్రవాద కార్యకలాపాల లాంటి విషయాలలో కూడా సిబిఐతో దర్యాప్తు జరగాలన్న డిమాండు రాసాగింది. వ్యక్తులు, వ్యవస్థలు తమకు జరిగిందని భావిస్తున్న అన్యాయాల విషయంలో న్యాయం కలిగించమని కోర్టులను ఆశ్రయించినప్పుడు, కోర్టులు కూడా సిబిఐకి దర్యాప్తు అప్పచెప్తే స్థాయికి దాని పనితీరుకు గుర్తింపు వచ్చింది. ఈ నేపధ్యంలో 1987 లో సిబిఐ లో రెండు విభాగాలను ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఒకటి: అవినీతి నిరోధక విభాగం, మరొకటి: ప్రత్యేక కేటగిరీ నేరాల విభాగం. అలా పరిధి మరింత విస్తరించసాగింది. కాకపోతే, ఏ రాష్ట్రంలోనైనా, సిబిఐ ద్వారా దర్యాప్తు చేయాలంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరిగా వుండాలి. సుప్రీం కోర్టులకు, హైకోర్టులకు ఆ నిబంధన వర్తించదు, ఏ రాష్ట్రంలోనైనా, ఏ విషయంలోనైనా సిబిఐతో దర్యాప్తుకు కోర్టులు ఆదేశించవచ్చు. ఇప్పుడదే జరిగింది.
ఇదీ సిబిఐ నేపధ్యం. ఇలాంటి నేపధ్యం వున్న సంస్థ ఎవరికీ , ఏ విషయంలోనూ అన్యాయం చేయదన్న నమ్మకం, అటు ప్రభుత్వాలకూ, ఇటు పౌరులకూ ఇంతవరకూ కలిగిస్తూ వస్తుంది. మరి అలాంటప్పుడు, వైఎస్ విజయమ్మ ఎందుకలా ప్రధానికి వుత్తరం రాయాలి? రాసినందుకు తప్పు ఆమెదా? ఆ అవకాశం ఇచ్చిన సిబిఐ దా? జగన్మోహన్ రెడ్డిపై జరుగుతున్న దర్యాప్తును ఆమె తన వుత్తరంలో ఒక "రాజకీయ క్రీడ" గా పోల్చారు. తన తనయుడిని ఏదో ఒక తీరుగా అభాసుపాలు చేయడానికి, కేసుల్లో ఇరికించడానికి సిబిఐ ప్రయత్నిస్తోందని ఆరోపించిందామె. అవన్నీ ఉద్దేశపూర్వకంగానే సిబిఐ చేస్తోందంటున్నారు. జగన్ కేంద్రంలోనూ-రాష్ట్రంలోనూ ఎన్నడూ మంత్రిగా పనిచేయకపోయినా ఆయనను కేసుల్లో ఇరికించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడును ఎందుకు విచారించడం లేదన్న వాదనలనూ ఆమె లేవనెత్తారు. మరోవైపు రాష్ట్ర ఐఏఎస్ అధికారులలో అలజడి మొదలైంది. తమను అధికారులు పావులుగా వాడుకొని ఇప్పుడు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారిలో కొందరు కలిసి చర్చించుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఏదేమైనా, ఇంతవరకు నిష్పాక్షిక దర్యాప్తు సంస్థగా పేరు తెచ్చుకున్న సిబిఐ తన పేరును పది కాలాల పాటు నిలబెట్టుకోవాలి. అది చేస్తున్న దర్యాప్తు ఏ ఒక్కరికో, ఏ ఒక్క సంస్థకో వ్యతిరేకంగా కాదని, బహుళ ప్రయోజనాలను, ప్రజాహితాన్ని కోరి మాత్రమే అది దర్యాప్తు చేస్తుందని, దోషులు ఎంత పెద్ద వారైనా పట్టించి కోర్టు బోనులో నిలబెట్టుతామని నమ్మకం కలిగించాలి.

Wednesday, February 1, 2012

“సహ చట్టం” కమీషనర్ల ఎంపికలో "సంభావనా విధానం": వనం జ్వాలా నరసింహారావు


 వనం జ్వాలా నరసింహారావు

సమాచార హక్కు చట్టాన్ని అక్షరాలా తు. చ. తప్పకుండా అమలు పరచడానికి, హైకోర్టు ఆదేశాలమీద, ఎట్టకేలకు, ఎనిమిది మంది కమీషనర్లను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన త్రి సభ్య సంఘం ఎంపికచేసింది. ఇంకా మరొకరికి అవకాశం వుంది. ఎవరికోసం దీనిని ప్రస్తుతానికి ఖాళీగా వుంచారో, ఎప్పుడు భర్తీ చేస్తారో, అసలు చేయరో అన్న విషయం మిలియన్ డాలర్ల ప్రశ్న. (లాంఛనంగా గవర్నర్ ఆమోదముద్ర పడింది?). అంటే, ఈ ఎనిమిది మంది కమీషనర్లు, ఐదు సంవత్సరాల పాటు-లేదా వారికి అరవై ఐదు సంవత్సరాల వయసొచ్చేంతవరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాతో సమానమైన హోదా కలిగి బాధ్యతలను నిర్వహించుతారు. కమీషనర్లను ఎంపిక చేయడానికి ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్‌ చంద్రబాబు నాయుడు భేటీ అయి "ఏకగ్రీవం" గా వారిని ఎంపిక చేశారన్న వార్తలు ఎంతవరకు వాస్తవమోకాని, ఇంతవరకు ప్రతిపక్షనేత నుంచి, ఎలాంటి విమర్శలు అధికారికంగా మాత్రం వెలువడలేదు.

ఈ ఎనిమిదిని మందిని, ఎంతవరకు-ఏ మేరకు, సమాచార హక్కు చట్టంలో సూచించిన విధి-విధానాలకు అనుగుణంగా ఎంపిక చేశారనే విషయాన్ని పక్కన పెడితే, రాజకీయాలకు అనుగుణంగా, "సంభావనా విధానానికి", "పోషక విధానానికి" (అమెరికా దేశంలోని "స్పాయిల్స్ పద్ధతి") నూటికి నూరుపాళ్లు సరిపడే పద్ధతిలో మాత్రం ఎంపికచేసారనడంలో అతిశయోక్తి లేదు. అలానే వివిధ రంగాలకు చెందిన వారూ వున్నారన్న అర్థం స్ఫురించే రీతిలో జరిగిందీ ఎంపిక! అధికారులుగా పనిచేసిన వారు, అనధికారులుగా ముద్ర పడినవారు, సామాజిక కార్యకలాపాలలో పాలు పంచుకున్నట్లు అంతో-ఇంతో గుర్తింపు తెచ్చుకున్న వారు, వ్యవసాయ రంగంలో పేరు గడించినట్లు చెప్పుకో వీలున్న వారు, పాత్రికేయులు; కాపు, మాల, రెడ్డి, బీసీ, మాదిగ, మైనారిటీ వర్గాలకు చెందిన వారు; ....ఇలా రకరకాలుగా చెప్పుకోదగ్గ విధంగా సవివరంగా-సముచితంగానే ఎంపిక జరిగింది!. రాజకీయాలకు అచ్చు గుద్దినట్లు సరిపోయే విధంగా, రిజర్వేషన్లకు అనుగుణంగా, సామాజిక న్యాయం చేకూర్చే విధంగా, ఒక్క మాటలో చెప్పుకోవాలంటే సంభావనా విధానానికి, పోషక విధానానికి అద్దం పట్టే దిగా వుందీ ఎంపిక. ఇక సమాచార హక్కు చట్టం అమలు ఆ భగవంతుడికే తెలియాలి. వ్యక్తులుగా ఎవరి మీద సంధించిన విమర్శ ఇది కాకపోయినా, ఆయా రంగాలలో ఎంతో నిష్ణాతులైన వ్యక్తులనే ఎంపిక చేయాల్సిన కనీస బాధ్యతను విస్మరించిందే ప్రభుత్వం అన్న ఆరోపణ మాత్రం చేయకుండా వుండడం కష్టమే. ఏదేమైనా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకిష్టులైన వారిని ఎంపిక చేసుకోవడానికి, తనను ధిక్కరిస్తుండే ఉప ముఖ్యమంత్రిని, సాక్షాత్తు ప్రధాన ప్రతిపక్షనేతను, ఒప్పించ గలగడం అభినందించాల్సిన విషయమే. 

మెరికా దేశ రాజకీయాలలో అనాదిగా అనుసరిస్తున్న సాంప్రదాయిక-చట్టబద్ధ విధానాలలో "స్పాయిల్స్ సిస్టం" అత్యంత ప్రాధాన్యమైంది. దీన్నే అక్కడ "సంభావనా విధానం" గా, "పోషక విధానం" గా (పాట్రనేజ్ సిస్టం) పిలుస్తారు. ఈ విధానం ప్రకారం, అధ్యక్ష-ఇతర ఎన్నికలలో గెలిచిన అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఎన్నికలలో వారి విజయానికి కృషిచేసిన తమ పార్టీకి చెందిన ఓటర్లలో కొందరికి, వివిధ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో నియమిస్తారు. ఒక్కోసారి తమకు వ్యతిరేకంగా పనిచేసినా, తమతో పోటీ చేసి ఓడిపోయినా, తమ-తమ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్‍లో పనిచేస్తారన్న నమ్మకంతో, పదవులను కట్టబెడతారు. ఇలా పదవులను తమ వారికి కట్టబెట్టడంలో "మెరిట్" విధానానికి స్వస్తి పలకడం, తమకు అనుకూలురని భావించినవారికి మాత్రమే ఒక "బహుమానం" గా, ఇవ్వడం సాంప్రదాయం. ఇది అక్కడ అందరూ చేస్తుండే పనే. ఏ పార్టీ కూడా దీనిని ఆక్షేపించదు. "స్పాయిల్స్" అంటే "దోపిడీ ధనం" అని అర్థం. "గెలిచిన వాడిదే ఓడిపోయిన శత్రువుకు చెందిన దోపిడీ ధనం"  అని ఈ విధానానికి నిర్వచనం చెప్తూ, 1828 అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాట్ అభ్యర్థి జాక్సన్ విజయాన్ని పురస్కరించుకుని నాటి న్యూయార్క్ సెనేటర్ విలియం మెర్సీ వ్యాఖ్యానించారు. వారసత్వ పరంపరగా అధికారంలోకి వచ్చే ఆటవిక జాతుల, రక-రకాల నియంతృత్వ పోకడల ప్రభుత్వాలున్న దేశాలలో కూడా ఈ విధానం అమలులో వుంది. ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికాలో ఇదెందుకు అమల్లో వుందో అర్థంకాదు. అమెరికాలో అమల్లో వున్న ఈ పోషక విధానం, కేవలం చిన్న ఉద్యోగాలకే పరిమితం కాకుండా, అత్యంత ఉన్నత స్థాయి ఉద్యోగాల విషయంలో కూడా జరుగుతుంటుంది. ఇప్పుడదే జరిగింది సమాచార హక్కు చట్టం కమీషనర్లుగా ఎంపిక చేసిన వారి విషయంలో.

సామాన్యుల, ఆ మాటకొస్తే, అసామాన్యుల చేతికి సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధం లాంటిది. 2005 లో భారత పార్లమెంటు తెచ్చిన ఈ చట్టం అమలులో కొన్ని అవకతవకలున్నా, కొన్ని రాష్ట్రాలలో కొంత నిర్లిప్తత వున్నా, దేశవ్యాప్తంగా దాని పనితీరు గమనిస్తే, అంత నిరాశాజనకంగా అనిపించదనే అనాలి. భారతదేశంలోని ప్రతి పౌరుడి కీ, "పబ్లిక్ అథారిటీ" గా నిర్వచించిన ప్రతి సంస్థ-వ్యవస్థ నుండి, ఆచరణాత్మకంగా-అనుభవ పూర్వంగా, తమకు కావాల్సిన ఎలాంటి సమాచారాన్నైనా, ఒక క్రమపద్ధతి ప్రకారం రాబట్టుకొనే హక్కు కలిగించిందీ చట్టం. ప్రతి పబ్లిక్ అథారిటీ పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేసేందుకు వీలు కలిగించిందీ చట్టం. సమాచార హక్కు చట్టం అమలును సులభతరం చేయడానికి నిర్దేశించిన అనేక విధై విధానాలలో అత్యంత ప్రాముఖ్యమైంది కేంద్ర స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో "సమాచార కమీషన్ల" ఏర్పాటు. వాటితో నిబద్ధతతో పని చేయించడానికి పది మందికి మించకుండా సమాచార కమీషనర్ల-ఒక ప్రధాన సమాచార కమీషనర్ నియామకం. చట్టంలో పబ్లిక్ అథారిటీ అంటే ఏమిటో, సమాచారం అంటే ఏమిటో స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ప్రజాస్వామ్య-లౌకిక-సామ్యవాద-సార్వభౌమాధికార గణతంత్ర దేశంలో ఇవన్నీ పది కాలాల పాటు మనుగడ సాగించడానికి, భారత పౌరుడికి, తాను కోరుకున్న ప్రభుత్వ సమాచారం అందుబాటులోకి తేవాలన్న ఆకాంక్షే సహ చట్టం తేవడానికి కారణం. అవినీతి తొలగాలంటే, పాలితులకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా పాలన అందివ్వాలంటే, సహ చట్టం, త్రి కరణ శుద్ధిగా అమలు కావాలి. ఈ నేపధ్యంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, సహ చట్టం రాక ముందు-వచ్చిన తరువాత ప్రభుత్వేతర పరంగా గణనీయమైన ప్రగతి సాధించినప్పటికీ, ప్రభుత్వ పరంగా, కుంటి నడక నడుస్తుందనడంలో సందేహం లేదు. అల నాడు దివంగత ముఖ్యమంత్రి ఒక రిటైర్డు ఐఏఎస్ అధికారిని ప్రధాన కమీషనర్‌గా, రాజకీయాలతో ప్రత్యక్షంగానో-పరోక్షంగానో సంబంధం వున్న మరో ఇద్దరిని కమీషనర్లుగా, ఒక యువ పాత్రికేయుడిని ఇంకో కమీషనర్‌గా నియమించింది. వారి పని తీరు గురించి ఎవరి విశ్లేషణ వారే చేసుకోవచ్చు. మొత్తం మీద అంతో-ఇంతో సహ చట్టం అమలు మాత్రం జరిగిందనాలి.

రాజశేఖర రెడ్డి నియమించిన వారి పదవీ కాలం ముగిసిన తరువాత ఇంకా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా, బాధ్యతాయుతమైన పదవిలో వున్న మరో ఐఏఎస్ అధికారిని ప్రధాన కమీషనర్‌గా నియమించింది ప్రభుత్వం. అప్పట్లో అది వివాదాస్పదమైంది కూడా. ఆయనకు తోడుగా మరెవ్వరినీ నియమించక పోవడంతో గత కొద్ది కాలంగా కుంటి నడక నడుస్తున్న కమీషన్‌కు పూర్తి స్థాయిలో కమీషనర్ల నియామకం జరగాలని హైకోర్టు సూచించడంతో, ఆ ప్రక్రియను లాంఛనంగా పూర్తి చేసింది ప్రభుత్వం. ఒక రిటైర్డ్ ఐఎఫ్ఎస్‌ అధికారిని, మరో రిటైర్డ్ ఐపిఎస్‌ అధికారిని, అంతంత మాత్రంగా అతి కొద్ది సర్క్యులేషన్‍తో నడుస్తున్న ఒక దినపత్రిక సంపాదకుడిని, ఒక న్యాయవాదిని, (రాజకీయ) సామాజిక కార్యకర్తగా చెప్పుకుంటూన్న మరొకరిని, మరో (రాజకీయ) న్యాయవాదిని,  (రాజకీయాలలో వున్న) రిటైర్డ్ సివిల్‌ జడ్జిని,  విద్యావేత్తగా పిలిపించుకుంటున్న ఇంకొకరిని, పదవిలో వున్న ఒక ఐపిఎస్‌ అధికారిని  కమిషనర్లుగా నియమించారు. దీనికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు. వ్యక్తిగతంగా వీరందరూ పలుకుబడి కలిగిన వారే. కాని, సమాచారహక్కు చట్టం ఇలాంటి వారిని ఎంపిక చేయమని చెప్పలేదే! మరెందుకిలా జరిగింది? అందుకే దీనిని "అమెరికా తరహా స్పాయిల్స్ సిస్టం" అనాలి.

ఇంతకూ సహ చట్టం ఈ విషయంలో ఏం చెప్తోంది? మొదటిది: కేంద్రంలోను, రాష్ట్రాలలోను సమాచార కమీషన్ల ఏర్పాటు జరగాలి. రెండోది: ఆయా స్థాయిలలో ఒక ప్రధాన కమీషనర్‌ను, పది మందికి మించకుండా కమీషనర్లను నియమించాలి. మూడోది: ఈ సమాచార కమీషన్‌లకు స్వతంత్ర ప్రతిపత్తి వుండాలి. మరే ప్రభుత్వ సంస్థ నుంచి కూడా ఎలాంటి అధికారిక ఆదేశాలను-నిర్దేశాలను పాటించాల్సిన అవసరం లేదు. నాలుగోది: ప్రజా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగి, పేరు-ప్రఖ్యాతులు తెచ్చుకుని ప్రసిద్ధి చెందిన వారే కమీషనర్ల పదవులకు అర్హులు. అదనంగా, న్యాయ శాస్త్రంలో, విజ్ఞాన-సాంకేతిక శాస్త్రాలలోసామాజిక రంగంలో, యాజమాన్య రంగంలో, పాత్రికేయ వృత్తిలో, మాస్ మీడియా రంగంలో, పరిపాలనా రంగంలో, గవర్నెన్సులో నిష్ణాతులై వుండాలి. ఆయా రంగాలలో కేవలం "ప్రవేశం" కాకుండా, "ప్రావీణ్యం" వుండి తీరాలి. ప్రసిద్ధి చెందిన వారై వుండాలి. పార్లమెంటు ఉభయ సభలలో సభ్యులై వుండరాదు. ఏ "రాజకీయ పార్టీతో ను" సంబంధం వుండకూడదు.
అలాంటప్పుడు కేవలం ఒక పునరావాస కేంద్రంగా, ఏదో ఇతర నామినేటెడ్ పోస్టులను కట్టబెట్టినట్లుగా, సమాచార హక్కు చట్టంతో ఎలాంటి సంబంధం ఎన్నడూ ఏ విధంగా లేనటువంటివారిని, పదవీ విరమణ చేసిన వారిని, చేయడానికి సిద్ధంగా వున్న వారిని, రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం వున్న వారిని, రక-రకాల ఒత్తిడులకు లొంగి ఇలా సమాచార కమీషనర్లను నియమించడం ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం?. కిరణ్ కుమార్ రెడ్డి చేస్తుంటే ఎలా ప్రతి పక్ష నాయకుడు అంగీకరించాడు? విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల ఎంపిక ఎంతో రసాభాస చేసిన గవర్నర్ ఆమోద ముద్ర  ఎలా వేశారు? End
(Added on 22-02-2012: (ఎనిమిదిని సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎంపిక చేయగా, ఆ నిర్ణయానికి ప్రతిపక్షనేత మద్దతు ఇచ్చీ-ఇవ్వనట్లు వుండగా, వారిలో నలుగురు ఈ పదవులకు అర్హులు కాదంటూ గవర్నర్ నరసింహన్ ఫైలును తిప్పి పంపారు. తాంతియా కుమారి, ముత్తంశెట్టి విజయ నిర్మల, వర్రె వెంకటేశ్వర్లు, ఇంతియాజ్ అహ్మద్‌ల నియామకం విషయంలో పునః పరిశీలన అవసరమని స్పష్టం చేశారు. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రెడ్డి, ఐపీఎస్ అధికారి రతన్, మాజీ ఐఎఫ్ఎస్ మధుకర్‌రాజు, సీనియర్ జర్నలిస్టు విజయబాబుల ఎంపిక విషయంలో గవర్నర్ అభ్యంతర పెట్టలేదు. సమాచార కమిషన్‌లో పార్టీలతో సంబంధం ఉన్న వారికి చోటు దక్కడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపధ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు). 

Sunday, January 29, 2012

శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి దర్శించిన ముత్తారం శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం: వనం జ్వాలా నరసింహారావు


శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి దర్శించిన 
ముత్తారం శ్రీ సీతా రామచంద్ర స్వామి  ఆలయం
వనం జ్వాలా నరసింహారావు

ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, ముత్తారం గ్రామంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయాన్ని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఈ నెల (జనవరి, 2012) 21 వ తేదీ, శనివారం నాడు దర్శించారు. ఆయనను భక్తులు-పూజారి పూర్ణ కుంభ స్వాగతంతో ఆలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఆ సందర్భంగా చినజీయర్ స్వామి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ, ప్రతిఒక్కరు విగ్రహ రూపంలో వున్న ఆ దేవుళ్లను విశ్వసనీయతతో పూజించాలని సూచించారు. నిత్యం భగవన్నామ స్మరణతో, చింతనాతత్పరతతో, ఆధ్యాత్మిక జీవన సాధకులుగా ముందుకు సాగాలని భక్తులకు ఉపదేశించారు. వైష్ణవ సాంప్రదాయానికి కులమతాలు లేవని ఆయన అన్నారు. అన్నింటిలోనూ వైష్ణవ సంప్రదాయం ఉత్తమమైనదని ఆయన అన్నారు. ఆనాడు భక్త రామదాసు ఎన్నో కష్టాలు పడి భద్రాచలం లాంటి ఆలయాలు నిర్మించారని, వనం కృష్ణరాయలు శ్రీరాముడిని పూజించి ముత్తారం దేవాలయం నిర్మించి, రాముడిని ఇక్కడకు తీసుకొచ్చారని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులందరిదీ అని చినజీయర్ స్వామి అన్నారు.  చినజీయర్ స్వామి ఆలయాన్ని పరిశీలించి అక్కడున్న శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలను, ఆండాళ్ అమ్మవారి విగ్రహాన్ని, కృష్ణుడి విగ్రహాన్ని దర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముత్తారం చుట్టుపక్కల గ్రామాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి చినజీయర్ స్వామి సందేశాన్ని శ్రద్ధగా విన్నారు. ఆయా వెంట అహోబిల మఠం చినజీయర్ స్వామి కూడా వున్నారు. (ఆ కార్యక్రమంలో మా వూరి పెద్దలందరితో పాటు నేనూ పాల్గొన్నాను).

మా పూర్వీకులైన కృష్ణరాయల గారి కోరిక తీర్చేందుకు, శ్రీరామచంద్రుడు, భద్రాచలంలో వున్నట్లు మా గ్రామంలో కూడా వెలిసి, ముక్తి వరం ముత్తవరం - ముత్తారం రామాలయంగా దాన్ని ప్రఖ్యాతి గావించాడని చుట్టుపక్కల వారి నమ్మకం. దీనికి తగిన ఆధారాలు తెనాలి దగ్గరున్న అంగలకుదురు గ్రామంలోని శ్రీ కోదండ రామ సేవక ధర్మ సమాజం వారు ప్రచురించే "భక్తి సంజీవని" అనే ఆధ్యాత్మిక మాసపత్రికలో దొరికాయి. ఇటీవలే గ్రామస్తులంతా కలిసి జీర్ణావస్థలో వున్న ముత్తారం రామాలయాన్ని పునర్మించి, ఆ ప్రాంతంలో పెద్ద దేవాలయంలాగా చేసారు.

ప్రాచీన కాలం నాటి మా ముక్తి వరం-ముత్తవరం రామాలయాన్ని గురించి మా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కథలు-కథలుగా చెప్పుకుంటారు. ముత్తారం రెవెన్యూ గ్రామానికి మరో రెండు శివారు వూళ్లున్నాయి. ఒకదాని పేరు "కోదండరామపురం". చాలా చిన్న వూరనాలి. ఆవూళ్లో కేవలం వెలమ కులస్తులే వుండేవారు. అన్నీ కలిసి పదిహేను కుటుంబాలు కూడా వుండవు. అందరూ వెలమ దొరలే. సాగర్ కాలువ నీటితో ముంపుకు గురైన ఈ గ్రామాన్ని ఇటీవలే కొంచెం దూరంలో పునర్నించారు. మరో శివారు గ్రామం నేను పుట్టి పెరిగిన వనం వారి కృష్ణా పురం.

మా పూర్వీకుల్లో ప్రసిద్ధిచెందిన వనం కృష్ణ రాయలు గారు దాన్ని నిర్మించినందున దానికాపేరొచ్చింది. ఆయన అచంచలమైన శ్రీ సీతారామ భక్తుడు. ప్రతిఏటా భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు విధిగా హాజరయ్యే వాడట. కాలంగడుస్తున్నాకొద్దీ, వయసు మీరుతుండడంతో, వెళ్ళిరావడానికి ఇబ్బందిపడుతుండేవాడు. అప్పట్లో ఆయన గుర్రంమీద వెళ్లొచ్చేవాడు. చివర కో సంవత్సరం గోదావరి నది దాకా వచ్చి, ఇక ముందుకు వెళ్లలేక, అలసిపోయి అక్కడే పడిపోయాడు. భద్రాచలంలో రాముడి కల్యాణానికి వేళవుతుండడంతో, ఉత్సవ విగ్రహాలను కల్యాణ మంటపానికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఉత్సవ విగ్రహాలనుంచిన వాహనం లేపడం సాధ్యపడడం లేదు. ఎంతో బరువనిపించింది. చివరకు ఏం చెయ్యాలో పాలుపోని నిర్వాహకులకు, అశరీర వాణి అసలు విషయం బయటపెట్టింది. తన భక్తుడు గోదావరిలో అలసటతో పడిపోయాడని, అతడిని తోడ్కొనిరమ్మని దాని సారాంశం. నిర్వాహకులు అలాగే చేసి కృష్ణ రాయలుగారిని తీసుకొచ్చారు. ఆయన వస్తూనే తన చేయి వాహనం మీద వేయడంతో అది తేలికగా వాహకులకు మోసేందుకు అనువుగా మారింది. కృష్ణరాయలెంత భక్తుడో అందరికీ అర్థమయిందప్పుడు.

కల్యాణోత్సవం అయిపోగానే, ఎప్పటిలాగే తిరుగు ప్రయాణమయ్యారు కృష్ణ రాయలుగారు. కొంచం దూరం వెళ్లింతర్వాత ఆయనకు తన ముందు ఒక రథం పోతూ కనిపించింది. దాన్ని చేరుకుందామని ఆయన చేసిన ప్రయత్నమంతా వృధా అయింది. తన ముందు రథం-దాని వెనుక ఈయన గుర్రం వూరిపొలిమేరవరకు చేరుకున్నారు. ముత్తారం సమీపంలోకి చేరుతూనే-కృష్ణ రాయలుగారు చూస్తుండగానే ముందున్న రథం అదృశ్యమైపోయింది. మర్నాడుదయం జరిగిన విషయాన్నంతా గ్రామస్థులకు వివరించి, రథం అదృశ్యమైన ప్రదేశానికి సమీపంలో అన్ని వైపుల ఏదన్నా వుంటుందేమోనన్న ఆశతో గాలించారు. ఆశ్చర్యంగా కొంత దూరంలో, భద్రాచలంలోని రామాలయంలో వున్న సీతారామ లక్ష్మణ విగ్రహాల లాంటి విగ్రహాలే కనిపించాయి వారికి. వామాంకంమీద సీత కూర్చున్న రీతిలో, భద్రాచల రాముడి విగ్రహాలు దొరకడంతో ఏం చెయ్యాలన్నది ఆలోచించసాగారు.

ఆ రాత్రి కృష్ణ రాయలుగారి కలలో కనిపించిన శ్రీరామచంద్రమూర్తి, ఆయనకు వయసు మీరడంవల్ల భద్రాచలం రావడం కష్టమవుతుందని భావించిన తానే ఆయన దగ్గరకొస్తున్నానని, ముత్తారంలో తనకు గుడి కట్టించి యథావిధిగా పూజలు జరిపించమని చెప్పాడు. ఆయన ఆదేశానుసారం కృష్ణ రాయలుగారు ముత్తారం రామాలయాన్నీ-పక్కనే శివారు గ్రామమైన వనం వారి కృష్ణాపురాన్నీ నిర్మించారు. కృష్ణ రాయలుగారు నిజమైన భక్తుడై నందునే రాముడు ఆయనున్న చోటికి పోయాడు. అంటే భగవంతుడిని మనం వెతుక్కుంటూ పోవాల్సిన పనిలేదు. భక్తి మనలో వుంటే భగవంతుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడనడానికి అదొక నిదర్శనం.
భద్రాచలం రామాలయం కట్టిన కొన్నాళ్లకు ముత్తారం రామాలయం కూడా కట్టబడింది. అయితే మూడు-నాలుగువందల సంవత్సరాల క్రితపు కట్టడమై నందువల్ల శిథిలావస్థకు చేరుకుంది. గత ఐదారు ఏళ్లలో మరీ శిథిలమై గర్భగుడిలోకి వర్షపు నీరుకూడా వచ్చే స్థితి కలగడంతో గ్రామస్థులంతా ఆలయాన్ని పునర్నిర్మించేందుకు నడుంకట్టారు. అయితే అన్ని గ్రామాల్లో లాగానే, మా వూళ్లోనూ రాజకీయాలున్నాయి- వర్గాలున్నాయి-ఈర్షాసూయలున్నాయి. మా ఇంటి పేరున్న ఈతరం రామ భక్తుడు, వరసకు బాబాయి, వనం గోపాలరావు ఆలయ పునరుద్ధరణకు అంకితమైన వారిలో ముఖ్యుడు. నేనేమో హైదరాబాద్ లో ఉద్యోగ రీత్యా నివసిస్తుండడంతో, ప్రతినెలా మా వూరికి పోయి వస్తున్నప్పటికీ, గుడి కట్టించే విషయంలో చూపించాల్సిన శ్రద్ధ చూప లేకపోయాను. అయితే ఆలయ నిర్మాణం కేవలం మానవ సంకల్పమే అయితే ముందుకు సాగక పోవచ్చు గాని, దైవ సంకల్పం అయితే దాన్ని ఆపేవారుండరనేది అనుభవపూర్వకంగా జరిగింది ముత్తారం దేవాలయం విషయంలో. మా పూర్వీకులు కట్టించిన ప్రాచీన దేవాలయ పునర్నిర్మాణానికి, పరోక్షంగా నాలో జొరబడి, నా వంతు సేవ చేసే అవకాశమిచ్చాడు భగవంతుడు.

మా నాన్న వనం శ్రీనివాసరావు గారు పదేళ్ల క్రితం చనిపోవడానికి మూడు రోజుల ముందర మా కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు. సందర్భం వచ్చిన ప్రతి చోట అవి ప్రస్తావించాల్సిన అంశాలు.
          నాన్నగారిని గురించి నాకు తెలిసినంతవరకు: బాల్యం తిరిగొచ్చినా రావచ్చునేమోగాని, బాల్యంలో నా వరకు నేననుభవించిన భోగభాగ్యాలు మాత్రం జ్ఞాపకాలుగా మిగిలిపోవాల్సిందే. ఆ జ్ఞాపకాలలోనే మా నాన్నగారి చిన్నతనం, ఆయన అనుభవించిన అష్టకష్టాలు, ఆ కష్టాల్లో ఆయనకు లభించిన అండదండలు, అవన్నీ నెగ్గు కొచ్చి-నిలదొక్కుకొని మా వూళ్లో-చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, సొంత వూళ్లోని గ్రామపెద్దలతోనూ-కరిణీకం చేస్తున్న అమ్మపేట గ్రామ పెద్దలతోనూ అవసరం మేరకే ఆయన వ్యవహరించిన తీరు, రాజకీయాలకు దూరంగా వుంటూనే గ్రామ రాజకీయాల్లో తన పలుకుబడికున్న విలువ నాయకులకు తెలియచేయడం, పొరుగూర్లో వున్న పెదనాన్నగారితో ఆయన మెలిగిన విధానం-తర తరాల వైరం మరిచిపోయేందుకు అందించిన స్నేహ హస్తం-స్నేహ ధర్మం తప్పిన ఆయనపై నాన్న గారి తిరుగుబాటు-సాధించిన తిరుగులేని విజయం, పురాతన-ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవసరాలకనుగుణంగా ఆయన ఆచరణలో పెట్టిన విధానం, తప్పని పరిస్థితుల్లో అజాత శతృవుగా పేరు తెచ్చుకున్న ఆయనే స్వయంగా ముల్లుగర్ర చేతిలో వుంచుకొని-నాగలి పట్టిన వైనం లాంటివెన్నో ఎల్లప్పుడూ మదిలో మెదులుతూనే వుంటాయి. ఇక ఆయన దైవభక్తి, భారత భాగవత రామాయణాలను పారాయణం చేయడం, అనుష్టానం చేసే విధానం, అమ్మపేట-ముత్తారం దేవాలయాల్లో ఆయన నిర్వహించిన పాత్ర, పట్వారీ హోదాలో జిల్లా ఉన్నతాధికారులతో ఆయనకున్న సత్సంబంధాలు-వారు ఆయనకిచ్చిన గౌరవం ఎప్పుడూ గుర్తుకొస్తూనే వుంటాయి. ఇందులో కొన్ని విషయాలను నాన్నగారు చెప్తే తెలుసుకున్నాను-కొన్ని స్వయంగా చూసాను. నా చిన్నతనంలో నాన్నగారు గుర్రం స్వారీ చేస్తూ, తెల్లటి కమీజు ధరించి-ధోవతి కట్టి బయటకు వెళ్లడం-వెళ్తున్నప్పుడు గ్రామ వీధుల్లో అరుగులమీద కూచున్న వారందరూ లేచి నిలబడి ఆయనకు అభివాదం చేయడం కూడా బాగా జ్ఞాపకం వుంది. ఆయన కమీజుకు పెట్టుకున్న బంగారపు గుండీలు కూడా గుర్తున్నాయి. ఆ తర్వాత కాలంలో సైకిల్ పై వెళ్లేవారు కొన్నాళ్లు.
మా నాన్న చెప్పిన ముఖ్యమైన అంశాలలో రామాలయ ప్రస్తావన కూడా వుంది.
ప్రతిఏటా రామాలయంలో గోదాదేవి కల్యాణం జరిపించడం మన కుటుంబం చేయాల్సిన పనుల్లో ఒకటని, అది నేను కొనసాగించాలనీ, అది సక్రమంగా జరగాలంటే దేవాలయంలో శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం (ఉత్సవ) ప్రతిష్టించాలనీ నాపై ఒక భాద్యతపెట్టారు నాన్నగారు. అయితే వివిధ కారణాల వల్ల ఆయన అప్పగించిన పని చాలాకాలం వరకు నెరవేర్చ లేకపోయాను. ఆర్థిక ఇబ్బందులు కూడా ఒక కారణం. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఉద్యోగ విరమణ చేయడానికి కొన్నాళ్లక్రితం ఒక మిత్రుడి ప్రోద్బలంతో వాసు దాసుగారి సుందర కాండ మందరాన్ని "మందర మకరందం" గా లఘు కృతిలో రాసిన కొద్ది రోజులకే శ్రీరాముడి దయ నాపై అపారంగా కలిగింది. జీవితంలో ఊహించని విధంగా, పదవీవిరమణ చేసిన ఏ ఉద్యోగికీ లభించని రీతిలో నాకు మంచి వేతనంతో 108-అత్యవసర సహాయ సేవల సంస్థలో ఉద్యోగం దొరికింది. ఆదాయం పెరిగి, అప్పులు తీరడం మొదలయింది. పిల్లలంతా ఎదిగి, ఉద్యోగాల్లో కుదుటబడి నెనెంతంటే అంత ఇచ్చేందుకు తయారయ్యే రోజులొచ్చాయి. సరిగ్గా అప్పుడే నాన్నగారు చనిపోయే ముందు అప్ప చెప్పిన భాద్యతను నెరవేరుద్దామన్న ఆలోచనొచ్చింది. అయితే ఆ ఆలోచనా క్రమంలో- ఆలోచన కార్యరూపం దాలుస్తున్న సందర్భంలో దేవాలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ జరుగనున్నదని ముందు నేనూహించలేదు.
2006 సంవత్సరం చివర్లో ముత్తారం దేవాలయంలో కృష్ణుడి ఉత్సవ విగ్రహం ప్రతిష్టించే ఆలోచన కార్యరూపం దాల్చడం మొదలైంది. మావూళ్లో మా పూర్వీకులనుండి సంక్రమించి, నాకింకా మిగిలిన ఆరెకరాలు వరి పొలాన్ని నా చిన్ననాటి స్నేహితుడు ఏటుకూరి నారాయణ కౌలు చేస్తుంటాడు ప్రతిసంవత్సరం. అతని సహాయంతో విజయవాడ సమీపంలో విగ్రహాన్ని తయారు చేయించి, 2007 లో ప్రతిష్టకు సన్నాహాలు చేశాం. ముత్తారం దేవాలయంలో పనిచేస్తున్న అర్చకుడు వాసు (శ్రీనివాసరావు) మహాపండితుడు. వేదాధ్యయనం చేసినవాడు. యువకుడు. ఆ చుట్టుపక్కల ఏ దేవాలయంలోనూ కళ్యాణోత్సవాలు చేయించగలవాడు కానీ, ప్రతిష్టలు చేయించగలవాడు కానీ, ఆగమశాస్త్రం తెలిసినవాడు కానీ లేరు. అందరు భుక్తికొరకు అర్చకత్వం చేస్తున్నవారే. వాసుకు దేవాలయానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ క్షుణ్ణంగా తెలుసు. ఆయన అధ్వర్యంలో మూడు రోజులపాటు అంగరంగవైభోగంగా ముత్తారం దేవాలయంలో కృష్ణుడి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట విజయవంతంగా జరిగింది. మా కుటుంబం ఆ మూడు రోజులూ అక్కడే వున్నాం. వూరిపెద్దలు-చిన్నలు, విభేదాలు మాని ఏదో సమయంలో కార్యక్రమం చూడడానికి వచ్చారు. నాటి జిల్లా కలెక్టర్ శశిభూషణ్ కుమార్, దేవాదాయ-ధర్మాదాయ శాఖ జిల్లా అధికారులు కూడా వచ్చారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత దేవాలయ పునర్నిర్మాణ విషయంలో కొంత చర్చ జరిగింది.
మా గ్రామ సర్పంచ్ ముండ్ర అప్పారావు, మా బాబాయి వనం గోపాలరావు, దేవాలయ అర్చకుడు శ్రీనివాసరావు, ఇప్పటికీ ఇంకా వూళ్లోనే ఎక్కువ సమయం గడుపుతున్న మా తమ్ముడు అప్పాజీ (శ్రీరామచంద్రమూర్తి), గ్రామంలోనే ఇటీవల వరకు వ్యవసాయం చేయించి ఆర్థిక ఇబ్బందులవల్ల హైదరాబాద్ చేరుకున్న మరో తమ్ముడు నరహరి కలిసి చేసిన ఆలోచనతో గ్రామస్తులలో పలుకుబడి కలిగిన వారందరూ దేవాలయానికి వచ్చారు. జీర్ణావస్థలో వున్న దేవాలయాన్ని ఎలా పునర్నిర్మించాలని అంతాకలసి ఆలోచన చేశాం. ప్రభుత్వం దగ్గర నుండి కొంత సహాయం పొందుదామనీ, విరాళాల రూపంలో కొంత వసూలు చేద్దామనీ నిర్ణయించాం. మా గ్రామంలో పుట్టి-పెరిగి, ఇంజనీరయ్యి, సంపాదనపరుడైన పరుచూరి ప్రసాద్ దేవాలయ పునరుద్ధరణకు పెద్దమొత్తంలో సహాయం చేస్తానని గతంలో మాటిచ్చాడు. అయితే ఎలా-ఎవరికి నిర్మాణ పనిని అప్పగించాలనే విషయంలో సందిగ్ధత వుండడంతో వాయిదాపడుతూ వస్తున్నది. మరో వారంరోజుల తర్వాత మళ్లీ గుడిలో కలుద్దామనుకుని నిర్ణయించాం అప్పటికి.
ఆ రోజున సమావేశానికి వచ్చిన వారందరికీ, కృష్ణుడొచ్చిన వేళా విశేషంవల్ల రాముడికి కూడా కొత్త ఆలయం తప్పక వస్తుందన్న నమ్మకం కుదిరింది. నాకూ ఆనందం వేసింది. నా వంతు విరాళంగా లక్షా నూటపదహారు రూపాయలు ప్రకటించాను. మరుక్షణమే ఒకరి తర్వాత ఇంకొకరు తాహతుకు మించి విరాళాలు ప్రకటించారు. కొంద రైతే దేవాలయంలోని కొన్ని నిర్మాణాలకు పూర్తి ఖర్చు తామే భరిస్తా మంటూ ముందుకొచ్చారు. తర్వాత జరిగిన సమావేశానికి పర్చూరు ప్రసాద్ హాజరై, దేవాలయానికి సంబంధించిన మొత్తం నిర్మాణానికి అయ్యే వ్యయమంతా భరిస్తానని మాటిచ్చాడు.
2009 ఫిబ్రవరి నెలవరకల్లా ఆలయ నిర్మాణం పూర్తయింది. దేవాలయం పూర్తికావడానికి సర్పంచ్ అప్పారావు చేసిన కృషి నిజంగా అభినందించాలి. ప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగవైభోగంగా, అశేష జనవాహిని మధ్య, శాస్త్రోక్తంగా నిర్వహించిన ఘనత అర్చకుడు వాసుగారి ది. నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా జరిగింది. ఉత్తర ద్వారం నిర్మాణంకూడా జరిగింది. పవళింపు సేవకు అద్దాలమేడ నిర్మాణంకూడా జరిగింది. సుమారు 50లక్షల రూపాయల వ్యయంతో చుట్టు పక్కల ఏ గ్రామంలో లేనంత గొప్ప దేవాలయం-రామాలయం మా ముత్తారంలో నిర్మించబడింది.
భద్రాచలంలో వలెనే ప్రతిసంవత్సరం శ్రీరామనవమి నాడు, ముత్తారంలో కూడా కళ్యాణోత్సవం అశేష జనవాహిని మధ్య జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలనుండి వేలాది భక్తులు ఆ వేడుకను చూసేందుకు తరలి వస్తారక్కడికి. భద్రాచలంలో మధ్యాహ్నం జరిగే కళ్యాణోత్సవం, ముత్తారంలో సాయంత్రం జరుగుతుంది. గోదాదేవి కళ్యాణం భోగి రోజున జరుగుతుంది. సాధ్యమయినంతవరకు ఈ రెండు కార్యక్రమాలకు హాజరవుతుంటాం. బాల్యంలో ఎద్దుల బండ్లు కట్టుకొని, వాటిలో శివారు గ్రామమైన మావూరినుండి దేవుడు పెళ్లి చూడడానికి ముత్తారం పొయ్యే వాళ్లం. కచ్చడపు బండ్లలో కూడా వెళ్తుండే వాళ్లం అప్పుడప్పుడు. దేవుడు పెళ్లికి కొన్ని గంటల ముందు-జరిగిన తర్వాత దేవాలయం పరిసరాలన్నీ కోలాహలంగా వుండేవి.
పల్లెటూళ్లల్లో ఆ సందడిని "తిరునాళ్లు" అని పిలిచే వాళ్లం. ఆ రోజున ఎక్కడెక్కడినుండో, చిరు వర్తకులు అక్కడ కొచ్చి, తమ దుకాణాలను పెట్టి సరకులమ్మేవారు. పట్టణాలలో ఎగ్జిబిషన్ సందడిలాంటిదే కాసేపు కనిపించేది. ఇప్పటికీ దుకాణాలు పెటుతున్నప్పటికీ, బాల్యం నాటి సందడికి మారుగా కొంచం పట్టణ వాతావరణం చోటుచేసుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది. ముత్తారం దేవుడి పెళ్లిలో మా పక్క గ్రామంలో నివసించే మా దాయాదులు, వరుసకు పెదనాన్న గారైన వనం శ్రీరాం రావుగారి కుటుంబమంతా వచ్చేది. అందరం కలిసి ఆనందంగా గడిపిన ఆ రోజులు జీవితాంతం గుర్తుంచుకునే మధురమైన జ్ఞాపకాలు.


Tuesday, January 24, 2012

ఈ మంత్రివర్గ విస్తరణ...సి. ఎం. కు ప్లస్సా, మైనస్సా?: వనం జ్వాలా నరసింహారావు




సూర్య దినపత్రిక (19-01-2012)
వనం జ్వాలా నరసింహారావు
(ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి; మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రికి స్వేచ్ఛ అవసరం; మధ్యేమార్గం పార్టీకి శ్రేయస్కరం కాదు; పద్ధతి మార్చుకోవాల్సిన అధిష్టానం; అప్పుడే రాష్ట్రంలో పార్టీకి గౌరవం....ఎడిటర్)


సమిష్టి బాధ్యతారాహిత్యానికి, సమన్వయ లోపానికి నిలువెత్తు నిదర్శనమైన రాష్ట్ర మంత్రి మండలిలో మరో ఇద్దరు-ముగ్గురు చేరవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. కష్ట కాలంలో కాంగ్రెస్ శాసనసభాపక్షానికి అండగా నిలిచిన నాటి ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరు చిరంజీవి అనుయాయులు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారని, వారీపాటికే బంధు మిత్రులకు తమ ప్రమాణ స్వీకారానికి రమ్మంటూ ఆహ్వానాలు కూడా పంపారని, మీడియాలో కబుర్లొచ్చాయి. సర్వసాధారణంగా మంత్రివర్గ విస్తరణ గురించి చెప్పాల్సిన ముఖ్యమంత్రికి బదులుగా, ఆ విషయాన్ని, తాజా కాంగ్రెస్ నాయకుడు-మాజీ ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవి ప్రకటించడం కొంత ఎబ్బెట్టుగా వున్నప్పటికీ, వార్త బయటకు పొక్కడానికి మాత్రం ఆయనదే బాధ్యత అనాలి. అసలాయనకు వారిద్దరిమీదనే ఎందుకంత ప్రేమ అన్నది అంతుచిక్కని విషయం. ఇక వారిద్దరిలో కనీసం ఒక్కరికి ఎట్టి పరిస్థితుల్లోను, మంత్రిపదవి దక్కకుండా చేయాలని, కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవి మాట నెగ్గేలా చూసేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగితే, ఆయనకు వ్యతిరేకంగా, కొందరు మంత్రివర్గ సభ్యులతో సహా కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, పలు ఎన్నికల బహిరంగ సభలలో అశేష జనాన్ని ఆకర్షించి, ముఖ్యమంత్రి కావాలని కలలు కన్న చిరంజీవికి ఆ కోరిక నెరవేరలేదు. పోనీ పార్టీని బతికించుకుని, కనీసం వచ్చే ఎన్నికల నాటికన్నా, మళ్ళీ తన కోరిక నెరవేర్చుకునే ప్రయత్నంలో వున్నాడా అంటే, అదీ చేయలేకపోయాడు. నెత్తిమీద కుంపటి దించుకుని, పార్టీని-పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేశారు. తనకు కేంద్రంలో మంత్రి పదవి వస్తుందన్న ఆశలు పెంచుకుంటున్నాడు. అదిప్పట్లో నెరవేరే అవకాశం లేనప్పుడు, తన అనుయాయులకు రాష్ట్ర మంత్రి మండలిలో స్థానం కలిపించమని అడిగే బదులు, తానే రాష్ట్ర మంత్రివర్గంలో చేరకూడదా? రాష్ట్ర మంత్రి పదవి తన స్థాయికి తగదనుకుంటున్నాడా? లేక, ఏకంగా కేంద్రమంత్రిగా నో, అవకాశం చిక్కితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నో కావాలని కలలు కంటున్నాడా? మించిపోయిందేమీ లేదు! తాను చేరదలుచ్కున్నట్లు ముఖ్యమంత్రికి, గులాంనబీ ఆజాద్‌కు సంకేతం ఇచ్చి, అటు కిరణ్‌కుమార్‌కు, ఇటు బొత్స సత్యనారాయణకు కొంత ఊరట కలిగించడం మంచిది. కడప కాంగ్రెస్ నాయకులకూ మంచిది కూడా!


ఏదేమైనా, కాంగ్రెస్ రాజకీయం, ఎక్కడ జరగాలో అక్కడికే మళ్లీ చేరింది. ఆ మాటకొస్తే, కాంగ్రెస్ రాజకీయాలెప్పుడూ ఢిల్లీలోనే జరుగుతాయి. మధ్య-మధ్య రాష్ట్ర రాజధానికి, అప్పుడప్పుడూ జిల్లాలకూ చేరుకుంటాయి. మంత్రివర్గ విస్తరణ విషయంలో సంప్రదింపులకు ముఖ్యమంత్రి ఢిల్లీకి చేరుకునే లోపునే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్లడం గులాంనబీ ఆజాద్‌తో మాటామంతీ జరపడం జరిగిపోయాయి. చెరో మాట అనడంతో, సీను సోనియాగాంధీ దగ్గరకు మారింది ప్రస్తుతానికి. ఫలానావారికి మంత్రివర్గంలో చోటు దక్కనుందన్న వార్తలూ గుప్పుమంటున్నాయి. ఇంతకూ విస్తరణా? పునర్వ్యవస్థీకరణా? చిరంజీవి చెప్పినట్లు కేవలం ఆ ఇద్దరికి మాత్రమే చోటు కలిగించడమా? ముఖ్యమంత్రికి-సహచర మంత్రివర్గ సభ్యులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఒకరిద్దరికి మాత్రమే ఉద్వాసనా? శాఖల్లో సమూలంగా మార్పులు-చేర్పులా? అనే విషయమన్నా ఈ సారి తేలుతుందేమో చూడాలి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ రాబోయే ఉపఎన్నికలలో, అలానే 2014 ఎన్నికలలో పరువు-ప్రతిష్టలతో బయట పడాలంటే, కనీసం గౌరవప్రదమైన ప్రతిపక్షంగానన్నా ఎన్నికవాలంటే, అధిష్టానం తన పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం వుంది. ఏ అధిష్టానమైతే, కనీసం ఒక్కసారన్నా మంత్రిపదవి అనుభవం పొందని కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చో పెట్టిందో, అదే అధిష్టానం, ఆయనా పీఠం మీద పటిష్టంగా వుండడానికి చర్యలు తీసుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తరువాత అనేక సమస్యలను ఢీ కొన్నప్పటికీ, తడబడుతూ అడుగులు వేసినప్పటికీ, గత ఏడాది కాలంలో, కష్టాల కడలిని అధిగమించు తూ, ఆత్మ విశ్వాసంతో ముందుకు పోతున్నారనే ది వాస్తవం. అలాంటప్పుడు, ఆయనను బలపర్చాల్సిన అధిష్టానం, సమాంతరంగా దానికి విరుద్ధంగా ఏ చర్యను ప్రత్యక్షంగానో-పరోక్షంగానో ప్రోత్సహిస్తే నష్టం పార్టీకే! అందుకే, తప్పో-ఒప్పో, మంత్రివర్గ విస్తరణలో ఆయనకు పూర్తిగా కాకపోయినా, పరిమిత మోతాదులోనన్నా స్వేచ్ఛ ఇవ్వాలి. అధిష్టానం అభీష్టం మేరకు, ఢిల్లీ నాయకులు చెప్పిన ఒకరిద్దరికి మంత్రి మండలిలో స్థానం కలిగించమని కిరణ్ కుమార్ రెడ్డిని ఆదేశించడంతో సహా, ఆయన కావాలనుకున్న "టీం" ను ఏర్పాటు చేసుకునే వీలు కలిగించాలి. ఆయన తొలగించాలనుకుంటున్న మంత్రులను, అధిష్టానం దృష్టిలో ఏదో ఒక ప్రత్యేకమైన కారణం వుంటే తప్ప, అలా చేసే వీలు కిరణ్ కుమార్ రెడ్డికి కలిగించాలి. అవసరమైతే, అల నాడు అంజయ్య విషయంలో ఇందిరాగాంధీ అవలంబించిన విధానాన్నే, నేడు సోనియాగాంధీ కూడా పాటించి తీరాలి. హైదరాబాద్ రావాలి. వచ్చి ఆయనకు మద్దతుగా తానూ-తన అధిష్టానం నూటికి-నూరు పాళ్లు వుందన్న సంకేతాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న వారిని తొలగించనన్నా తొలగించాలి-లేదా-తప్పు ముఖ్యమంత్రి దే అని భావిస్తే తదనుగుణంగా చర్యలన్నా చేపట్టాలి. మధ్యేమార్గం మంచిదికాదు. పార్టీకి శ్రేయస్కరం కానే కాదు.


ఈ నేపధ్యంలో, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలతో సహా, చిన్నా-చితకా పార్టీలు కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతిరోజూ, ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు, ఏదో ఒక పేరుమీద యాత్ర చేపట్టడమో, పనిగట్టుకుని ప్రత్యర్థుల మీద దాడికి దిగడమో, లేదా ఎదురుదాడి చేయడమో, అదేమీ కాకపోతే టెలివిజన్ ఛానళ్ల పుణ్యమా అని చర్చలలో పాల్గొన్నప్పుడు అందివచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా, తమ-తమ వ్యూహాలను కాసింత బహిర్గతం చేయడమో గమనించాల్సిన విషయం. గతకొన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు సమన్వయ కమిటీ ఏర్పాటు; తెలుగుదేశం పార్టీకి చెందిన రైతు పోరుబాట; జగన్ రైతు దీక్షా శిబిరం; తెరాస-ఐకాస సమైక్యతా వాదుల యాత్రలను అడ్డుకునే ప్రయత్నాలు; భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పాగా వేయడం అనే విషయాలు ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. అధిష్టానం నియమించిన సమన్వయ కమిటీ సాధించిదేమిటో కాని, కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కలహాలు-కుమ్ములాటలు మాత్రం బహిర్గతం అయ్యాయి. కిరణ్‍కూ, బొత్సకూ; ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి విభేదాలున్న ట్లు స్పష్టమైనాయి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కొందరు గులాంనబీ ఆజాద్‌కు ఫిర్యాదు చేస్తే, బొత్సను అడ్డుకునే ప్రక్రియకు కిరణ్ శ్రీకారం చుట్టారనుకుంటున్నారు. కొందరు మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా, విడతలవారీగా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలను (సూర్య దినపత్రిక) ప్రముఖంగా ప్రచురించారు. వారికి కొందరు ఎంపీల మద్దతుకూడా వుందని అంటున్నారు. ఇదంతా గమనించిన ఆజాద్‌కు ఆగ్రహం కూడా కలిగిందట. ఈ వ్యవహారాలపై కాంగ్రెస్ ఎంత సీరియస్‌గా వుంటుందో కాని, ప్రతిపక్షాలు మాత్రం ఒక కన్నేసి వుంచాయి. కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు సడలిందని ప్రచారం చేయసాగాయి. ప్రజా సమస్యలను ఆయన అసలే పట్టించుకోవడం లేదని ఆరోపించాయి. ముఖ్యంగా రైతు సమస్యలను ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజం ఎత్తాయి. చివరకు మీడియా కూడా ప్రతిపక్షాలతో చేతులు కలిపాయి.


ఇందులో భాగంగా, ఒకానొక పాపులర్ టెలివిజన్ ఛానల్, రైతు ఆత్మహత్యలపై-సమస్యలపై, అన్ని రాజకీయ పార్టీల-రాజకీయేతర ప్రముఖుల-పాత్రికేయుల-సామాజిక కార్యకర్తల సమక్షంలో, వారి భాగస్వామ్యంతో ఒక ఆసక్తికరమైన గోష్టిని నిర్వహించిందిటీవల. గోష్టిలో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఎన్నో ఆసక్తికరమైన, ఆలోచనలను రేకెత్తించే అంశాలను తెరమీదకి తెచ్చారు. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో గ్రామీణ-వ్యవసాయదారుల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సంపాదకుడు పాలగుమ్మి సాయినాథ్ బహిర్గతం చేసిన విషయాలను ప్రభుత్వం పట్టించుకుని తీరాల్సిందే. వెలుగులోకి వస్తున్న రైతు ఆత్మహత్యలను, సాధారణ ఆత్మహత్యలుగా వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రతి మూడు గంటలకు దేశవ్యాప్తంగా సంభవిస్తున్న చోటుచేసుకుంటున్న ఆరు రైతు అత్మ హత్యలలో, ఒకటి ఆంధ్ర ప్రదేశ్‌కు చెందినదే అని ఆయన అన్నారు. మద్దతు ధర లేక, సాంప్రదాయ పద్దతులకు స్వస్తి పలికిన నేపధ్యంలో, పూర్తిగా రసాయనిక ఎరువులపై ఆధారపడడం వల్ల కూడా రైతు ఆత్మహత్యలు సంభవిస్తున్నట్లు వక్తలు పేర్కొన్నారు. మరి ఈ నేపధ్యంలో, చంద్రబాబు నాయుడు చేపట్టిన రైతు పోరుబాట కాని, జగన్ రైతు దీక్షా శిబిరం కార్యక్రమం కాని, ఎంతవరకు రైతు సమస్యలను ప్రతిబింబించాయో ప్రశ్నార్థకమే!
          
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నానని భావనలో వున్న కిరణ్ కుమార్ రెడ్డికి, అందుకే, అధిష్టానం మరింత మద్దతు ఇవ్వాలి. రైతు సమస్యలతో అనేక ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పార్టీపరంగా ఆయనకు వ్యతిరేకతను తగ్గించాలి. కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలంటే ఈ విషయాలపై అధిష్టానం దృష్టి సారించాలి.


(ఈ ఆర్టికల్ 18-01-2012, మంత్రివర్గ విస్తరణ జరుగవచ్చన్న ఊహాగానాలకు పూర్వం రాసింది)

Wednesday, January 11, 2012

సిపిఎం ఆవిర్భావ నేపధ్యం: వనం జ్వాలా నరసింహారావు


జనవరి 11, 12 న హైదరాబాద్‌లో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో


సూర్య దినపత్రిక (12-01-2012)


వనం జ్వాలా నరసింహారావు

సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు బుధ, గురువారాల్లో (జనవరి 3, 4 తేదీల్లో) జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో పార్టీ రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో జరగనున్న నేపధ్యంలో కీలకమైన ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ కూడా వస్తున్నారు. పార్టీ జాతీయ మహాసభలో ప్రవేశపెట్టనున్న రాజకీయ తీర్మానం ముసాయిదా ఈ సమావేశంలో చర్చించే అవకాశం వుంది. ఖమ్మంలో జరగనున్న రాష్ట్ర మహాసభల్లో పార్టీకి నూతన కార్యదర్శిని ఎన్నుకోవచ్చన్న ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ఖమ్మం పట్టణంలో ప్రముఖ ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి జీవితచరిత్ర-"తీపి గుర్తులు-చేదు అనుభవాలు" లో పేర్కొన్న పార్టీ ఉమ్మడి మహాసభలు, పార్టీలో చీలిక, సిపిఎం ఆవిర్భావం లాంటి కొన్ని ఆసక్తికరమైన పరిణామాలను గురించి, ఆ పుస్తకాన్ని గ్రంధస్థం చేసిన రచయితగా పాఠకులతో పంచుకునే ప్రయత్నం ఇది. 

ఏబై మూడు సంవత్సరాల క్రితం భారత కమ్యూనిస్ట్ (ఉమ్మడి) పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎనిమిదవ మహాసభ, 1958 డిసెంబర్ 30, జనవరి 1-2 తేదీలలో ఖమ్మం పట్టణం వెంకట లక్ష్మీ టాకీసులో జరిగింది. 212 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత ఉన్నవ లక్ష్మీ నారాయణ, జోవియట్ క్యూరి, చక్రయ్య చెట్టియార్ల మృతికి సంతాపం ప్రకటించి, తెలంగాణ మృత వీరులకు జోహార్లు అర్పించారు. పార్టీ అఖిల భారత కార్యదర్శి అజయ్ కుమార్ ఘోష్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ప్రజాస్వామ్యవాదులందరితో కూడిన విశాల ఐక్య సంఘటన ఏర్పరచాలన్నారు. చండ్ర రాజేశ్వరరావు నివేదిక ప్రవేశ పెట్టారు. సోషలిస్టు నమూనా సమాజం గురించిన ఆశలు నెరవేరడం లేదనీ, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందనీ అన్నారు. 1955 లో జరిగిన ఎన్నికలలో పార్టీ తిన్న దెబ్బ నుండి తిరిగి కోలుకుంటున్నదని చెప్పారు. ఆంధ్ర ప్రభుత్వ అభివృద్ధి నిరోధక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా తంత్ర శక్తులతో కూడిన ఐక్య సంఘటన నిర్మించాలనీ, కుల-మత తత్వాలను ప్రతిఘటించాలనీ పిలుపునిచ్చారు. 7 గురు కార్యదర్శులతో సహా 21 మందితో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా చండ్ర రాజేశ్వరరావును, కార్యదర్శులుగా పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, మోటూరు హనుమంతరావు, బద్దం ఎల్లారెడ్డి, వై.వి. కృష్ణా రావు, తమ్మారెడ్డి సత్యనారాయణలను ఎన్నుకున్నారు. ప్రదేశ్ కమ్యూనిస్ట్ సమితి కార్యవర్గంలో కె. ఎల్. నర్సింహం, మగ్దుం మొహియుద్దీన్, గుంటూరు బాపనయ్య, చలసాని వాసుదేవరావు, నీలం రాజశేఖరరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సంకు అప్పారావు, వై. విజయకుమార్, కొల్లా వెంకయ్య, కడియాల గోపాలరావు, నెక్కలపూడి రామారావు, గోళ్ల రాధాకృష్ణమూర్తి, జి. యల్లమందారెడ్డి, నల్లమల గిరిప్రసాద్ లను తీసుకున్నారు. అజయ్ ఘోష్ తన ప్రసంగంలో, శాస్త్ర సాంకేతిక రంగంలో మానవుడు సాధించిన మహత్తర పురోభివృద్ధిని సమాజ పరం చేయడానికి మార్క్సిజం ఒక్కటే మార్గం అన్నారు. నాలుగవ తేదీ రాత్రి పెద్ద బహిరంగ సభ జరిగింది. మద్దుకూరి అధ్యక్షత వహించారు. సుందరయ్య, రావి నారాయణరెడ్డి, బసవ పున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు మాట్లాడారు. కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం -ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.


ఇరవయ్యో శతాబ్దపు మలి దశాబ్దంలో, భారత దేశంలో కార్మికవర్గ ఉద్యమాలు ఊపందుకుని, పలువురిని కమ్యూనిజం వైపు ఆకర్షించాయి. ఎం.ఎన్ రాయ్ మాస్కో సందర్శించిన సందర్భంలో, సోవియట్ కమ్యూనిస్ట్ నాయకుడు లెనిన్‌కు ఆయన పట్ల ఏర్పడ్డ విశ్వాసం, ఆయనను కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు ప్రోత్సహించడం, అక్టోబర్ 17, 1920న తాష్కెంటులో, భారత కమ్యూనిస్ట్ పార్టీని నెలకొల్పడం జరిగింది. వామ పక్ష భావాల పట్ల ఆకర్షితులైన పలువురు నాయకులు, డిసెంబర్ 1925లో కాన్పూర్‌లో సమావేశమై, "వర్కర్స్ అండ్ పెజెంట్స్ పార్టీల" పేరుతో బహిరంగ ఐక్య వేదికను ఏర్పాటు చేసుకుని, కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయసాగారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాబోతుండగా, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పట్ల-జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం పట్ల అనుసరించాల్సిన విధానంలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. ఫిబ్రవరి 1948లో కలకత్తాలో జరిగిన ద్వితీయ పార్టీ సమావేశం, రణదివేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. రణదివే "కలకత్తా సిద్ధాంతం" సాయుధ పోరాటాలను ప్రోత్సహించడంతో, వీర తెలంగాణా విప్లవ పోరాటానికి దోహద పడింది. మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన వీరోచిత తెలంగాణా రైతాంగ సాయుధ ప్రతిఘటన, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడంతో కమ్యూనిస్ట్ పార్టీకి చిక్కు సమస్య ఎదురైంది. ప్రతిఘటనను కొనసాగించడమా ? విడనాడి చట్ట సమ్మతమైన పోరాటాలను-ఆందోళనలను చేపట్టడమా? అన్న సందిగ్ధంలో కమ్యూనిస్ట్ నాయకత్వం పడింది. ఆ సమస్యపై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో పరస్పర విరుద్ధమైన తీవ్ర అబిప్రాయ భేదాలు తలెత్తడంతో, ఉపసంహరణ పూర్వ రంగంలో, స్వర్గీయ చండ్ర రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా పార్టీ నూతన పోలిట్ బ్యూరో ఏర్పాటయింది. దరిమిలా రూపొందించిన నూతన పార్టీ రాజకీయ విధానాన్ని వ్యతిరేకించే బలమైన వర్గానికి డాంగే ప్రభృతులు నాయకత్వం వహించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీలో భవిష్యత్ చీలికకు పునాదులు అలా పడ్డాయి. ఆ నాడు పార్టీలో ఏర్పడిన తీవ్ర సంక్షోభం దరిమిలా అజయకుమార్ ఘోష్‌ను, రాజేశ్వరరావు స్థానంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం, రైతాంగానికి భూమి హామీ వుంటుందని ప్రభుత్వం ఇచ్చిన మాట ఆధారంగా, పోరాటాన్ని విరమించుకోవడం మంచిదనే నిర్ణయానికి, తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించిన నాయకత్వం వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరించుకుంటూ చేసిన నిర్ణయం 1951 అక్టోబర్ 21 న బహిరంగంగా ప్రకటించారు.

అంతర్గతంగా వుండిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీలోని విధానపరమైన అభిప్రాయ భేదాలు, భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు బహిర్గతమయ్యాయి. డాంగే, ఆ సమయంలో పార్లమెంట్ లోక్‌సభలో కమ్యూనిస్ట్ పక్షం నాయకుడు. చైనా పట్ల అవలంబించాల్సిన వైఖరి విషయంలో, పార్టీ నాయకత్వంలో తీవ్రమైన చర్చలు జరిగాయి. డాంగే ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు ఇచ్చిన మద్దతును తీవ్రంగా వ్యతిరేకించింది జోషి నాయకత్వంలోని మరో వర్గం. ప్రారంభ దశలో డాంగే వాదనకే మెజారిటీ సభ్యుల ఆమోదం లభించింది. ఎప్పుడైతే, "అంతర్జాతీయ కమ్యూనిజం" విషయంలో, డాంగే తనదైన నిర్వచనం చెప్పాడో, మౌలిక పరమైన కమ్యూనిజం విధానాలను వ్యతిరేకించడం ఇష్టపడని పలువురు, ఆయనకు తొలుత మద్దతిచ్చినప్పటికీ, క్రమేపీ ఆయనకు దూరమయ్యారు. సీపీఐ సెక్రెటేరియట్ లోని సభ్యుల్లో రణదివే-జోషిలు చైనా అనుకూలురైన "అతివాదులుగా", డాంగే నెహ్రూకు అనుకూలురైన "నిరోధక వాద శక్తుల ప్రతినిధి"గా, అజయ్ ఘోష్-జ్యోతి బసులు మధ్యే వాదులుగా, భూపేష్ గుప్త ఎటూ తేల్చుకోని వాడిగా బయట పడ్డారు. చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ చేసిన తర్వాత, రాజీ మార్గంలో నడిచిన కమ్యూనిస్ట్ నాయకత్వం, మితవాద వర్గానికి చెందిన డాంగేను పార్టీ చైర్మన్(అంతకు ముందు లేని పదవి)గా, మితవాద-అతివాద వర్గాలకు సమాన దూరంలో వున్న ఇ.ఎం.ఎస్ నంబూద్రిపాద్ ను సెక్రెటరీ జనరల్‌గా నియమించింది.

సోవియట్‌ యూనియన్‌, చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విబేధాల దరిమిలా కారణాలు ఏవైనా చైనా-భారత సరిహద్దు వివాదం మొదలైంది. ఆ వివాదంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్టు నాటి సోవియట్‌ ప్రభుత్వం ప్రకటించడం విశేషం. సరిహద్దు తగాదా పర్యవసానంగా భారత చైనా దేశాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. అప్పట్లో ఉమ్మడి భారత కమ్యూనిస్ట్ పార్టీలోని ఒక వర్గం భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించగా, మరో వర్గం (భవిష్యత్ లో సీపీఐ-ఎంగా పిలువబడ్డ)ఆ యుద్ధాన్ని "ఇంతకు పూర్వం ఖచ్చితంగా లేని సరిహద్దు విషయంలో ఏర్పడ్డ వివాదంతో ఏర్పడ్డ సంఘర్షణగా పేర్కొనడంతో, పరోక్షంగా చైనా సానుభూతిపరులుగా ముద్రపడ్డది.

1961 ముందు నుంచే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గతంగా తలెత్తిన సైద్ధాంతిక అభిప్రాయ భేదాలు, పరస్పర వ్యతిరేక భావ ప్రకటనలు, పార్టీలో చీలికకు దారి తీసేంతవరకూ వెళ్లాయి. భారత చైనా దేశాల మధ్య యుద్ధం జరిగిన తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలిక రావడంతో సోవియట్ యూనియన్-చైనాల రాజకీయ ప్రభావం వల్లో, ఉమ్మడి పార్టీలోని కొందరి మధ్య తలెత్తిన వ్యక్తిగత అభిప్రాయ భేదాల వల్లో పార్టీ చీలిందన్న ప్రచారం అప్పటి నుంచీ ఇప్పటి దాకా జరుగుతూనే ఉంది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా పార్టీలో 50వ దశకం నుండే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల-పార్టీ పట్ల, దాని వర్గ స్వభావం పట్ల అనుసరించాల్సిన వ్యూహం గురించిన చర్చ చాలా కాలం కొనసాగి, పరాకాష్ఠగా సైద్ధాంతిక విభేదాల ప్రాతిపదికపై చీలిక అనివార్యమయింది. సిపిఐ-సిపిఎంలుగా చీలి పోయింది పార్టీ. ఏప్రిల్ 11, 1964 న నంబూద్రిపాద్, జ్యోతిబసులతో సహా ముప్పై రెండు మంది డాంగే విధానాలను వ్యతిరేకిస్తూ, జాతీయ కౌన్సిల్ సమావేశాలనుంచి నిష్క్రమించడంతో, వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలిలో బహిష్కృత అతివాద వర్గం సమావేశమవడం, కలకత్తాలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరపాలని తీర్మానించడం జరిగింది. అక్టోబర్-నవంబర్ 1964లో కలకత్తాలో ఏడవ  కాంగ్రెస్ పేరుతో అతివాద వర్గం, సమాంతరంగా బాంబేలో డాంగే నాయకత్వంలోని మితవాద వర్గం సమావేశాలు జరుపుకున్నాయి. కలకత్తాలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గా అవతరించగా, బాంబేలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీగా వుండిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తొలి ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్యను ఎన్నుకున్నారు సమావేశంలో. డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి సుందరయ్య నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) అభిమానిగా, ఆచరణీయుడుగా వుండిపోయారు. ఆ నాడు (1964) ఖమ్మం జిల్లాలో గిరి ప్రసాద్ నాయకత్వంలో సిపిఐతో వెళ్లిన వారు చాలా కొద్దిమంది మాత్రమే!

నక్సల్‍బరీ ఉద్యమ నేపధ్యంలో, 1967లో, సీపీఎం నుంచి కొంతమంది బయటకు పోయి ఆ సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారు. ఖమ్మం జిల్లాలో సహితం ఉత్సాహవంతులైన కొందరు యువకులు అటువైపు వెళ్లారు. అలా వెళ్లిన వారిలో బత్తుల వెంకటేశ్వరరావు లాంటి వారు తొలినాళ్లలోనే ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. రాష్ట్రస్థాయిలో నక్సల్ ఉద్యమంవైపు వెళ్లిన ప్రముఖులలో తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్లా వెంకయ్య, మాదాల నారాయణస్వామి, వజ్రవేలుశెట్టి, ముఖ్యులు. రాష్ట్రంలో ఎక్కువగానే నక్సల్ ఉద్యమ ప్రభావం పడింది ఆ రోజుల్లో