Saturday, June 5, 2010

VIII-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-8) : వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-8
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

ఆగస్ట్ 14, 2007 న, (దివంగత) ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్వహణ వ్యయం విషయం చర్చకొచ్చింది. సమావేశానికి చైర్మన్ రాజు, సీ.ఇ.ఓ వెంకట్ లతో నేను కూడా హాజరయ్యాను. రాజశేఖర రెడ్డి వారసులు రోశయ్య ఆర్థిక మంత్రి హోదాలో హాజరయ్యారు. వాస్తవానికి ఆ సమావేశానికి మేమెవరం హాజరవ్వాలన్న నిర్ణయం మొదలు లేదు. కేవలం, అవసరమైన వివరణలు ఇవ్వడానికి బయట వేచి వుండమనే అడిగారు మమ్మల్ని. అయితే, సమావేశం జరిగే సమయంలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు-అవసరమైతే వివరణ ఇచ్చేందుకు తాను కూడా సమావేశం మందిరం వెలుపల వేచి వుండడానికి అనుమతి కోరారు రాజు గారు. ముఖ్యమంత్రి ఆనాటి సమీక్షా సమావేశం జరగడానికి సరిగ్గా మరో ఐదారు గంటల వ్యవధి మాత్రమే వుందనగా, వెంకట్ గారి దగ్గర్నుంచి నాకు ఫోనొచ్చింది. చైర్మన్ రాజు కూడా మన లాగే సమావేశం జరిగే సమయంలో బయట వేచి వుండాలని అనుకుంటున్నారని, అందుకు అవసరమైన అనుమతులు పొందాలని నాకు చెప్పారు వెంకట్. అందుకు కారణం వుంది. పదిహేను రోజుల క్రితం, హెచ్.ఎం.ఆర్.ఐ కి సంబంధించి, ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కూడా వుండడం, ఆ సందర్భంలో హెచ్.ఎం.ఆర్.ఐ తో పాటు ఇ.ఎం.ఆర్.ఐ కి కూడా సరాసరి నిర్వహణ వ్యయంలో నూటికి 95% ప్రభుత్వం సమకూరుస్తుందని రాజశేఖర రెడ్డి అనడం జరిగింది. దానికి సాక్ష్యం రాజు గారు. నేనా విషయాన్ని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అగర్వాల్ దృష్టికి తెచ్చాను. ఆయనను బయట వేచి వుంచడం బదులు, సమావేశానికి రమ్మనడం, ఆయనతో పాటు మేమూ వెళ్లడం జరిగింది. అదీ అప్పట్లో అత్యవసర సహాయ సేవలన్నా-ఆ సంస్థకు చెందిన వారన్నా వుండే గౌరవం.

సమీక్షా సమావేశంలో, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో, ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందానికి అనుగుణంగా, 108-అత్యవసర సహాయ సేవలందించడానికి ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. మరింత స్పష్టమైన "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ" లో ఈ సేవలను విస్తరించాల్సిన సమయం ఆసన్నమయిందని, దానికి అనుగుణంగా లోగడ ఎంఓయు లో పేర్కొన్న కొన్ని అంశాలను, మార్చాల్సి వుంటుందని ఆయన అన్నారు. స్థూలంగా, 108-అత్యవసర సహాయ సేవలందించడానికి ఇ.ఎం.ఆర్.ఐ కి, "ప్రత్యక్ష నిర్వహణ వ్యయం" కింద 95% వరకు ప్రభుత్వం భరించడానికి అంగీకరించిందని, యాజమాన్య పరమైన వ్యయాన్ని సంస్థ భరించాల్సి వుంటుందని అంటూనే, 2007-2008 ఆర్థిక సంవత్సరంలో మాత్రం, ప్రధాన కార్యదర్శి తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఆ వ్యయం కింద రు. 68, 700 ప్రభుత్వం భరిస్తుందని, 2008-2009 ఆర్థిక సంవత్సరం నుండి 95% నిర్ణయం అమల్లోకి వస్తుందని, అప్పటికి 502 అంబులెన్సులు రాష్ట్ర వ్యాప్తంగా సేవలందిస్తాయని అన్నారు ముఖ్యమంత్రి. అత్యవసర సహాయ సేవలను "రాజీవ్ ఆరోగ్య శ్రీ" పథకం గొడుకు కిందకు తేవాలన్న నిర్ణయం కూడా ఆ రోజునే తీసుకున్నారు రాజశేఖర రెడ్డి. ఈ అంశాలను పొందు పరుస్తూ ఎంఓయు తయారు చేసేందుకు ఆదేశించారాయన.

మర్నాడు ఆగస్ట్ 15, 2007 హోటల్ తాజ్ కృష్ణాలో జరిగిన బ్రహ్మాండమైన సదస్సులో రాజీవ్ ఆరోగ్య శ్రీ "లోగో" ను మాజీ రాష్ట్రపతి-ఇ.ఎం.ఆర్.ఐ గౌరవ అధ్యక్షులు ఏ.పి.జె అబ్దుల్ కలాం విడుదల చేశారు. అలాగే అత్యవసర సహాయ సేవలను జాతికి అంకితం చేశారు. ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ చైర్మన్ రాజు తో పాటు పలువురు ఉన్నతాధికారులు-అనధికారులు సమావేశానికి హాజరయ్యారు. ప్రతిపక్షానికి చెందిన సీ.పి.ఐ నాయకులైన కె. నారాయణ గారి లాంటి వారు కూడా హాజరయ్యారు. ఆ సమావేశంలో అతిధులను వేదిక పైకి ఆహ్వానించడంతో సహా, సభా కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను వెంకట్ గారు నాకు అప్పగించారు ఆఖరు క్షణంలో. ఏ తాజ్ కృష్ణాలో ఆ సమావేశం జరిగిందో, అదే హోటల్ యజమాని, అది జరిగిన రెండు సంవత్సరాల లోపునే, ఇ.ఎం.ఆర్.ఐ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని ఆయనతో సహా బహుశా ఎవరూ ఊహించి వుండరు. అంత గొప్ప సమావేశం మళ్లీ జరుగుతుందా అన్నది సందేహమే !

ఇ.ఎం.ఆర్.ఐ పై ప్రభుత్వానికున్న "విశ్వాసం-నమ్మకం" మరికొంత కాలం కొనసాగుతూనే వుందనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. డిసెంబర్ 18, 2007 న (దివంగత) ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మరో సమీక్షా సమావేశంలో ఇ.ఎం.ఆర్.ఐ ఆధ్వర్యంలో అమలవుతున్న అత్యవసర సహాయ సేవల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం సూత్రప్రాయంగా మరో నిర్ణయం తీసుకుంది. అప్పటికి, అంబులెన్సులన్నీ కలిసి ప్రతి రోజు తిరుగుతున్న 2870 ట్రిప్పులను, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా 8000 ట్రిప్పుల సామర్థ్యానికి పెంచాలని, దానికి సంబంధించిన దశలవారీ ప్రతిపాదనలను ఇ.ఎం.ఆర్.ఐ తయారు చేసి కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కు అందచేయాలని, అందుకు కావాల్సిన నిధులను జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద, రాష్ట్ర బడ్జెట్ కింద సమకూర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ నిర్ణయానికి కట్టుబడ్డ ప్రభుత్వం, సంబంధిత అధికారులు, అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి సంభాని చంద్రశేఖర్, దరిమిలా తొలుత 150 అంబులెన్సులు, మలి విడతగా మరో 150 అంబులెన్సులు, మొత్తం 802 అంబులెన్సులు సమకూర్చారు. అయితే వీటిలో కనీసం 100 వరకు తిరగక పోవడం విచారకరం.

95% నిర్వహణ వ్యయం కింద ప్రభుత్వం ఎంత భరించాలన్న నిర్ణయం తీసుకోవడంలో నాటి ఆరోగ్య-వైద్య శాఖల ముఖ్య కార్యదర్శి పి. కె. అగర్వాల్ తీసుకున్న చొరవ ఇ.ఎం.ఆర్.ఐ పై ప్రభుత్వానికున్న"విశ్వాసానికి-నమ్మకానికి" మరో నిదర్శనం. ఊహించని సమయాన్ని దీని కొరకు కేటాయించిన అగర్వాల్ గారు, స్వయంగా, మేమిచ్చిన ప్రతిపాదనలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, నిశితంగా మాతో గంటల తరబడి చర్చించి, ఆ మొత్తాన్ని ఒక్కో అంబులెన్సుకు రు. 1, 12, 499 గా నిర్ణయించి, ప్రభుత్వ పరమైన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 502 అంబులెన్సులున్నప్పుడు సగటున అయ్యే వ్యయం, 652కు-తర్వాత 802 కు పెరిగినప్పుడు, తగ్గుతుందన్న విషయం తెలిసిందే అయినప్పటికీ, బయటపడకుండా జాగ్రత్త పడ్డది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. 2008-2009 ఆర్థిక సంవత్సరం అమలవ్వాల్సిన ఈ నిర్ణయం పూర్తిగా ఆర్థిక సంవత్సరం ముగియకుండానే, రాజు గారి నిష్క్రమణం జరగడంతో, ఊహించని కొన్ని విషయాలు బయటకు పొక్కి, పలు అనుమానాలకు దారి తీసింది. పారదర్శకతతో ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం వ్యవహరించి, వాస్తవ లెక్కలను ఏదో ఒక సందర్భంలో బహిర్గతం చేసినట్లయితే బాగుండేదేమో !

రెండో విడత అధికారం చేపట్టి, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిపించిన మర్నాడు-మే నెల 26, 2009 న, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇజ్రాయిల్ పర్యటనకు బయల్దేరడానికి ముందర, ఆ ఉదయం మమ్మల్ని అత్యవసర సహాయ సేవల సంగతి తెలుసుకునేందుకు రమ్మన్నారు. ఇక్కడొక విషయం చెప్పాలి. అంతకు నాలుగైదు రోజుల క్రితం ముఖ్యమంత్రికి వెంకట్ గారు ఒక లేఖ రాశారు. మే నెల 5, 2008 న ఇ.ఎం.ఆర్.ఐ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్తూనే, సంస్థ అప్పట్లో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంలో, ప్రభుత్వ పరంగా సంస్థకు అదనపు నిధుల ఆవశ్యకతను వివరిస్తూ రాసిన లేఖ అది. ఆ రోజు వరకు అత్యవసర సహాయ సేవల ద్వారా 26 లక్షల మంది లబ్ది పొందారని, సుమారు 47 వేల ప్రాణాలు కాపాడ కలిగామని, ప్రభుత్వ సహాయంతో 752 అంబులెన్సులను నిర్వహిస్తూ ప్రతి రోజూ సుమారు సగటున 5420 ఎమర్జెన్సీలకు స్పందిస్తున్నామని-ఆసుపత్రులకు చేరుస్తున్నామని లేఖలో వివరించారు. రాజు గారు సంస్థ చైర్మన్ గా రాజీనామా చేసిన అనంతరం, జనవరి 8, 2009 న జరిగిన సమీక్షా సమావేశంలో, సరాసరి నిర్వహణ వ్యయంలో, అవసరమైతే 95% కు బదులు నూటికి 100% ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని లేఖలో గుర్తు చేశారు వెంకట్. అయితే అసలు-సిసలైన ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియలో విశ్వాసం వున్న ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం (రాజు గారు చైర్మన్ గా తొలిగానా) తమ వంతు వ్యయం చేయాల్సిన 5% నిర్వహణా పరమైన నిధులను-ఇతర యాజమాన్య పరమైన ఖర్చులను సమకూర్చే దాతల అన్వేషణ కొరకు నాలుగు నెలల వ్యవధి కోరిన విషయం కూడా లేఖలో గుర్తు చేశారు వెంకట్.

దురదృష్ట వశాత్తు తామెన్ని ప్రయత్నాలు చేసినా అంతవరకు అవి ఫలించలేదన్నారు. ఆ కారణాన తమ వంతు వాటాగా 2008-2009 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయాల్సిన 5% (సుమారు రు. 5 కోట్ల నిర్వహణ ఖర్చులు) నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయాలని విఙప్తి చేశారు. నిర్వహణ వ్యయం కింద అప్పటి వరకు 2008-2009 ఆర్థిక సంవత్సరంలో ఐన రు. 90 కోట్ల వ్యయంలో రు. 85 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందని, మిగతా రు. 5 కోట్ల విడుదలకు ఆదేశాలివ్వాలని కోరారాయన. అదనంగా యాజమాన్య జీత-భత్యాల కొరకు మరో రు. 4 కోట్ల 8 లక్షలు ఖర్చయ్యాయని వివరించారు. ఆ వ్యయాన్ని తమ వంతు వాటాగా భావించాలని కూడా కోరారు. అప్పట్లో సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, ఆ ఐదు కోట్లను-అదనంగా మూల వ్యయం కొరకు మరో మూడు కోట్లను, మొత్తం ఎనిమిది కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసి-విడుదల చేసేందుకు ఉత్తర్వులివ్వాల్సిందిగా వెంకట్ ముఖ్యమంత్రిని తన లేఖలో అభ్యర్థించారు. అందులోనే పిరమల్ ఫౌండేషన్ ప్రయివేట్ భాగస్వామిగా, ఇ.ఎం.ఆర్.ఐ బాధ్యతలు స్వీకరించడానికి ఆసక్తి కనబరిచిన విషయం-త్వరలోనే అది సఫలం కానున్న విషయం కూడా వివరించారు వెంకట్. కాకపోతే ఆ లేఖ పంపిన మర్నాడే, పిరమల్ ఫౌండేషన్ నిరాసక్తిని వ్యక్తపరుస్తూ వెంకట్ కు సందేశం ఇవ్వడం, ఆయన నిరాశకు గురి కావడం, ముఖ్యమంత్రితో సమావేశం జరుగుతే మంచిదని భావించడం, ఆయన కోరుకున్న విధంగానే-ఆయన అడగకుండానే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మే నెల 26, 2009 ఉదయం సమావేశం గురించి పిలుపు రావడం భగవదేఛ్చ అనుకోవాలి. లేదా వెంకట్ సంకల్ప బలం అనుకోవాలి !

ఆ ఉదయం సమావేశం జరిగిన తీరు "మరవలేని మరో అద్భుత సన్నివేశం". సమావేశం ఆరంభమవుతూనే వెంకట్ గారిని ఉద్దేశించి, తమ పార్టీ విజయానికి 108-అత్యవసర సహాయ సేవల అంబులెన్సుల పథకం ఎంతగానో తోడ్పడిందని అన్నారు (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. ఇంతకు ముందే రాసినట్లు, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు ప్రయివేట్ భాగస్వామ్య పరంగా నిధులను సమకూర్చే విషయంలో స్వయంగా జోక్యం చేసుకుని, అధికార బలాన్ని కాకుండా-వ్యక్తిగత ఆకర్షణ, పలుకుబడిని ఉపయోగించే పద్ధతిలో, జీ.వి.కె అధిపతి డాక్టర్. జీ. వి. కృష్ణారెడ్డి తో ఫోన్లో మాట్లాడి, బరువు-బాధ్యతలను ఆయన స్వీకరించేందుకు ఒప్పించారు రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆ నిర్ణయం పూర్వ-ఉత్తర రంగాల్లో అత్యవసర సహాయ సేవల విషయంలో విలువైన సూచనలు చేశారు. అందులో ఎన్ని అమలుకు నోచుకున్నయో-ఎన్ని నోచుకోలేదో అన్న విషయం తేల్చాల్సింది ప్రభుత్వం (ఏప్రియల్ 2010 లో) నియమించిన కమిటీనే. కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో ఆ ప్రస్తావన లేకపోవడానికి కారణాలేంటో ?

రాజీవ్ ఆరోగ్య శ్రీ గొడుగు కింద పనిచేస్తున్న 108, 104, ఆరోగ్య శ్రీ పథకాలకు సంబంధించి నిరంతర ప్రభుత్వ మానిటరింగ్ జరగాలని, ఇవన్నీ ఒకే శాఖాధిపతి కింద వుండే వీలు గురించి పరిశీలన జరగాలని ఆ రోజున ముఖ్యమంత్రి సూచించారు. ఇ.ఎం.ఆర్.ఐ, హెచ్.ఎం.ఆర్.ఐ, ఆరోగ్య శ్రీ లకు కలిపి ఒక ప్రత్యేకమైన "ట్రస్ట్" ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించారు. అలా చేస్తే సేవలందించడంలో నైపుణ్యం, సామర్థ్యం, వృత్తి పరమైన దక్షత పెరిగే అవకాశం వుందన్నారు. వీటి సాధ్య-అసాధ్యాలకు సంబంధించి “మేధ మథనం” జరుగు తే మంచిదని కూడా సూచించారాయన. అయితే సంస్థల ప్రత్యేకత, ఆనవాలు-గుర్తింపు (ఐడెంటిటీ) కు భంగం కలగని విధంగా చర్యలు చేపట్టాలని, నియంత్రణల విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్య-వైద్య శాఖలకు చెందిన ఒక ప్రభుత్వాధికారిని ఇ.ఎం.ఆర్.ఐ గవర్నింగ్ బోర్డు సభ్యుడిగా చేయాలని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయం వెలిబుచ్చారు. ఆర్థిక పరమైన యాజమాన్య వ్యవహారాలను, వ్యయ నియంత్రణలను, నిర్వహణ సమస్యలను, ప్రభుత్వంతో సమన్వయం-సంఘటితం విషయాలను, సంస్థాగత నిర్మాణాన్ని, అధికారాలను, విధులను, బాధ్యతలను, పారదర్శకతను, జవాబుదారీ తనాన్ని, సంబంధిత ఇతర విషయాలను పర్యవేక్షించేందుకు ఎలాంటి కమిటీ వుంటే బాగుంటుందో పరిశీలించమని అధికారులను-ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆ కమిటీ రూపు-రేఖలు ఎలా వుండాలో ఆలోచన చేయమని కోరారు ముఖ్యమంత్రి. ఒక వేళ "రాజీవ్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్" కు ఆ బాధ్యతలు అప్పగిస్తే, దరిమిలా ఆవిర్భవించనున్న "సంఘటిత (Integrated) పథకం" అమలు విషయంలో కుటుంబ సంక్షేమ శాఖ పాత్ర ఎలా వుండాలో నిర్ణయించాలని సూచించారాయన. ప్రభుత్వ పరంగా నిధులను సమకూర్చడంలో ఒక్కో ఏడాది గడిచినా కొద్దీ భారం పెరుగుతుంది కాబట్టి, అత్యవసర పరిస్థితి నుంచి ఆసుపత్రికి వైద్య సహాయం అందించే వరకు ప్రభుత్వ పరంగా-ఇ.ఎం.ఆర్.ఐ పరంగా సేవల ఉపయోగం విషయంలోను, మంచి-మంచి పద్ధతులను పంచుకోవడం విషయంలోను, మాన్యత (వాలిడేషన్) విషయంలోను, నిధుల సేకరణ విషయంలోను, కమ్యూనికేషన్ విషయంలోను, చేసిన తప్పులు సరి దిద్దుకునే విషయంలోను జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. ఆయన ఆనాడు చెప్పిన "ఆణి ముత్యాల లాంటి సూచనలు, సలహాలు, ఆదేశాలు" ఆ తర్వాత రూపొందించిన సమావేశ వివరణ పత్రం (మినిట్స్) లో కొన్ని మాత్రమే చోటు చేసుకున్నాయి. ఆ వివరాలు:

• మే నెల 5, 2008 న ప్రభుత్వంతో ఇ.ఎం.ఆర్.ఐ కుదుర్చుకున్న ఎంఓయు గడువు ముగిసినందున, దాని అమలును, తగు సవరణలతో అవసరమైనంత కాలవ్యవధి వరకు పొడిగించాలి. ఎంఓయు అమలు కాలంలో సంభవించిన పరిణామాలను సవరణలు రూపొందించేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి.

• నిర్వహణ వ్యయం భరించే విషయంలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం సిద్ధాంత ప్రక్రియకు అనుగుణంగా, ప్రభుత్వం-ఇ.ఎం.ఆర్.ఐ తమ-తమ వంతు వాటాగా 95%-5% నిష్పత్తి విధానాన్ని పాటించాలి. కాకపోతే, యాజమాన్య పరమైన వ్యయం కింద ఇ.ఎం.ఆర్.ఐ పెటుతున్న ఖర్చును సంస్థ సమకూర్చాల్సిన 5% వాటాగా పరిగణించాలి. ఇలా పరిగణించేటప్పుడు కింది నిబంధనలను పాటించాలి:

• ఆంధ్ర ప్రదేశ్ ఆపరేషన్సుకు సంబంధించి ఇ.ఎం.ఆర్.ఐ చేస్తున్న ఖర్చును స్పష్టంగా నమోదు చేసి ప్రభుత్వానికి తెలియచేయాలి.

• ఇతర రాష్ట్రాలలో కూడా ఇ.ఎం.ఆర్.ఐ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నది కాబట్టి, ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన యాజమాన్య పరమైన వ్యయాన్ని, తగు నిష్పత్తిలో నమోదు చేయాలి.

• ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్య నిర్వహణ బాధ్యతలు స్వీకరించబోయే భావి సంస్థల-వ్యక్తుల నుంచి, లోగడ ఇ.ఎం.ఆర్.ఐ కున్న రుణాల మొత్తాన్ని తీర్చేందుకు తగు ఆర్థిక సహాయాన్ని పొందే ఏర్పాటు చేసుకోవాలి.

• అత్యవసర సహాయ సేవల నిర్వహణకు నియమించబడిన ఆపరేషన్స్ సిబ్బంది జీతభత్యాలు, ప్రతి నెల మొదటి తేదీన చెల్లించే విధంగా, ప్రభుత్వం అంగీకరించిన నిధులను విడుదల చేస్తుంది. 2009-2010 సంవత్సరానికి బడ్జెట్ తయారు చేసేటప్పుడు, ప్రభుత్వం తన బాధ్యతగా అంగీకరించిన నిధులను సమకూర్చే పద్ధతిలో, తగు ఏర్పాటు చేస్తుంది.

• పారదర్శకతను మరింత స్పష్టంగా పాటించడానికి ఇ.ఎం.ఆర్.ఐ చొరవ తీసుకోవాల్సిన అంశాలు:

• 108-అత్యవసర సహాయ సేవల లబ్దిదారులకు ముఖ్యమంత్రి సంతకంతో ఉత్తరాలు పంపాలి. ఆరోగ్య శ్రీ పథకం లబ్దిదారుల నుండి ఎలా "ఫీడ్ బాక్" తీసుకుంటున్నారో అలాంటి పద్ధతి ఇ.ఎం.ఆర్.ఐ కూడా అమలు పరచాలి.
• పారదర్శకతను పెంపొందించేందుకు, ప్రజలందరు చూడడానికి అనువుగా "వెబ్ సైట్" ను రూపొందించి, అందులో ప్రతి ట్రిప్పుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరచాలి.
• జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ 108-అత్యవసర సహాయ సేవలకు సమకూరుస్తున్న నిధులను తగ్గించే ప్రయత్నం చేయకుండా-లోగడ మాదిరిగానే బడ్జెట్ కేటాయింపులు జరగాలని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి సంతకంతో ప్రధాన మంత్రికి లేఖ వెళ్లాలి.

మినిట్స్ లో పొందుపరిచిన వాటిలోని అంశాలు, పొందు పరచకపోయినా ముఖ్యమంత్రి చేసిన సూచనలు, అమలుకు ఎంతవరకు నోచుకున్నాయో అన్న విషయాన్ని ధృవీకరించాల్సింది అటు ప్రభుత్వం-ఇటు ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ అంశాలపై ఎంతవరకు దృష్టి పెట్టిందో? ఈ అంశాలన్నీ అమలు జరిగుంటే ఒడిదుడుకులకు ఆస్కారం వుండకపోయేదేమో !

2 comments:

  1. Sir,
    can't you make it short?
    Ramu
    apmediakaburlu.blogspot.com

    ReplyDelete
  2. I can... But... I am also serializing in "Prajatantra" weekly and I would like to finish it soon. At this rate it self, it might take at least 6-8 months. May be it is too long a period to serialize such stories. Let me any way try as suggested by you... may be after couple of weeks.
    Regards,
    Jwala

    ReplyDelete