Tuesday, March 13, 2018

గుణాత్మక మార్పు తప్పనిసరి! .... వనం జ్వాలా నరసింహారావు


గుణాత్మక మార్పు తప్పనిసరి!
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (14-03-2018)

తెలంగాణ రాష్ట్రం తన వినూత్న పథకాలు, కార్యక్రమాల ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు జాతీయ ఎజెండా అయితే గుణాత్మక మార్పు కోసం ఏర్పడే రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.

రాజకీయాలలో గుణాత్మక మార్పు దిశగా, భారతదేశం గొప్పదిగా కావాలంటే, తెలంగాణా తరహాలోనే జాతి పునర్నిర్మాణం, పునర్ నిర్వచనం, పునః సృష్టి జరిగాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదట చేయాల్సింది, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో అమల్లో వున్న ఉత్తమ విధానాలను, పద్ధతులను, అలవాట్లను, నడవడులను సేకరించి, అధ్యయనం చేసి, వాటిని మన దేశ స్థితిగతులకు అనుగుణంగా ఉపయోగించుకోవడమే! దేశ ఆర్ధిక పరపతిని గణనీయంగా పెంచి, ఏ ఏ రంగాలలో మనం వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకుని తదనుగుణంగా తప్పొప్పులు సరిచేసుకుంటూ ముందడుగు వేయడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం అనే విషయం కూడా సీఎం మాటల్లో స్పష్టమవుతున్నది. ఈ నేపధ్యంలో, ఇవన్నీ దృష్టిలో వుంచుకుని, జాతీయ అభివృద్ధి ఎజెండా రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. అది కూడా దేశంలోని వివిధ రాష్ట్రాల, సమాజంలోని వివిధ వర్గాల, అవసరాలను ప్రతిబింబించేదిగా వుండాలని ముఖ్యమంత్రి ఉద్దేశంగా కనిపిస్తున్నది.

పలు రంగాల నిపుణులు, సీనియర్ పాలనాదికారులు, ఆర్ధిక శాస్త్రవేత్తలు, సమాజ అభ్యున్నతి కోరే ప్రతి ఒక్కరు, తమవంతు పాత్రగా, ప్రస్తుతం అమల్లో వున్న చట్టాలను, విధానాలను, శాసనాలను, పద్ధతులను, అభ్యాసాలను అధ్యయనం చేసి, సంస్కరణల కోణంలో అవసరమైన మార్పులు-చేర్పులు చేసి, మార్పు దిశగా మార్గదర్శకాలను-రోడ్ మ్యాప్ ను రూపొందించి ముందుకు సాగాలి. ఈ ప్రయత్నంలో అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజలు చురుగ్గా భాగస్వాములు కావాలి. ఇదే క్రమేపీ జాతీయ అభివృద్ధి ఎజెండా రూపకల్పనకు దారితీస్తుంది. సీఎం కేసీఆర్ అంటున్న రాజకీయాలలో గుణాత్మక మార్పుకు ఇవి పునాదులవుతాయి.

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వుండడం వల్ల దేశాభివృద్ధి కాని, దేశాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకుపోవడం కాని జరిగే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. ఇప్పటికే నాలుగేళ్ళు గడిచిపోయాయి. ప్రజలు ఒకవిధంగా నరేంద్ర మోడీ పాలనతో విసిగి వేసారి పోయారని చెప్పక తప్పదేమో! కనీసం ఒక్కటంటే ఒక్క ప్రాధాన్యత సంతరించుకున్న ప్రజలకు అవసరమైన కార్యక్రమం కాని, పథకం కాని మోడీ ప్రభుత్వం ఈ నాలుగేళ్ల కాలంలో ఆలోచించడం కాని, అమలు చేయడం కాని జరగలేదంటే బహుశా అతిశయోక్తి కాదేమో! దళితులకు కాని, రైతుకు కాని ఏదన్నా పథకం అమలయిందా? కాలేదన్న విషయం ప్రజలకు తెలియచేయగలిగితే, వాళ్లను చైతన్యవంతులను చేయగలిగితే, వాళ్లు ప్రశ్నించడం మొదలు పెట్టితే మార్పు రావడం కష్టం కానేకాదు. కాకపొతే ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో, మోడీ బీజేపీ ఓడితే, మరో ప్రత్యామ్నాయం లేదు కనుక, ఆయన స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు. రెంటికీ తేడా ఏముంది? సీఎం కేసీఆర్ చెప్పినట్లు, పథకాల పేర్లు మారుతాయి కాని గుణాత్మకమైన మార్పు వచ్చే అవకాశం లేనే లేదు. మన దేశం గురించి తక్కువగా అంచనా వేసుకుంటూ, ఫలానా దేశం ఇంత గొప్పది-అంత గొప్పది, అనే మాటలు ఎన్నాళ్ళు వినాలి? ఈ స్థితి మారదా? ప్రజలు ఇప్పుడున్న వ్యవస్థతో తీవ్ర ఆవేదన-అసంతృప్తి చెందుతున్నారు. గుణాత్మకమైన మార్పుకోసం ఎదురు చూస్తున్నారు. మార్పు రావాలి. వచ్చి తీరాలి. అదే అంటున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సారధ్యం వహించిన నాడు, ఆయనేంచేయలేడని వ్యాఖ్యానిస్తూ హేళన చేసారెందరో. చివరకు జరిగింది ఏంటి? ఆబాలగోపాలాన్ని, ఆసేతు హిమాచలంలోని రాజకీయ పార్టీలన్నిటినీ “జై తెలంగాణా” నినాదానికి అనుకూలంగా మలచుకున్నారాయన. ఇదే స్ఫూర్తి జాతీయ రాజకీయాలలో కూడా కొనసాగదా? బీజేపీలో కాని, కాంగ్రెస్ పార్టీలో కాని గుణాత్మక మార్పు తెచ్చే స్థాయి నాయకులు లేరనే చెప్పాలి. దానికితోడు వున్న వారందరికీ మితిమీరిన ఆత్మ విశ్వాసం, ఒక రకమైన అహంకారం, తమ పార్టీలను ఎవరూ ఏం చేయలేరనే ధీమా, ఆ రెండూ ఒకదానికి మరొకటే ప్రత్యామ్నాయం అనే గుడ్డి నమ్మకం, బీజేపీ లేదా కాంగ్రెస్ మాత్రమె అధికారంలోకి రాగలవనే దర్పం వున్నాయి. దేశంలో జాతీయ స్థాయిలో రాజకీయ దౌర్బల్యం, దుర్బలత్వం చోటుచేసుకున్నాయి. ఈ విషయాలన్నీ ఆకళింపు చేసుకున్న కేసీఆర్ దేశంలో రాజకీయాలలో గుణాత్మక మార్పు తేవడానికి సిద్ధమయ్యారు.

జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల పునరేకీకరణ జరగడానికి, ఒక ఆకృతిగా రూపుదిద్దుకోవడానికి సమయం ఆసన్నమైంది. అయితే, ఇది కేవలం రాజకీయ పార్టీల కలయిక మాత్రమే కాకుండా, ప్రజలు సమన్వితం కావడం జరగాలి. అందరూ ఏకతాటిపై నిలబడాలి. గుణాత్మక మార్పు కొరకు పిలుపిచ్చిన కేసీఆర్, ఆయన నాయకత్వంలోని దేశవ్యాప్త బృందం, ఇదే ఎజెండాగా జాతీయ రాజకీయాలలో క్రియాశీలకపాత్ర పోషించబోతోంది. అత్యంత అభ్యుదయకర, ప్రగతిశీల ఎజెండా దేశాభివృద్ధికి రూపుదిద్దుకోనుంది. భారతదేశం దేశం సంపన్న దేశంగా, సౌభాగ్యవంతంగా కావాలి. కేవలం రెండు దశాబ్దాల కాలంలో అత్యంత సంపన్నమైన దేశంగా రూపుదిద్దుకున్న చైనాను ఆదర్శవంతంగా తీసుకుని వారేం చేసారో అదే మనం చేయగలగాలి. భారతదేశంలోని సుప్రసిద్ధ ఆర్ధిక శాస్త్రవేత్తలు, వారితోపాటు దేశం కొరకు ఏం చేయడానికైనా సిద్ధపడే నిబద్ధతకల వ్యక్తులు, వాళ్ల ఆలోచనలను ఈ దిశగా కార్యరూపం దాల్చేలా చేయాలి. రాజకీయాలలో రాబోయే గుణాత్మక మార్పుకు శ్రీకారం చుట్టనున్న రాజకీయశక్తి మూడో ఫ్రంట్ కాని, ఫెడరల్ ఫ్రంట్ కానీ కాదు. ఇది కొత్తగా రూపుదిద్దుకోనున్న మరో ప్రత్యామ్నాయ “జాతీయ రాజకీయ పార్టీ”. ఇది ఏక సారూప్యత వున్న పలు రాజకీయ పార్టీల సహవ్యవస్థ (కన్సార్షియం), లేదా, కలయిక. ఇదే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలి. అలా జరగాలంటే, దాని ఎజెండా కాని, ఎన్నికల మానిఫెస్టో కాని అత్యంత జాగరూకతతో తయారు చేయాలి. దేశానికి ఒక మహత్తర-బృహత్తర ప్రణాళిక రూపొందించడం చాలా-చాలా అవసరం.     


మన రాజ్యాంగం సమాఖ్య స్ఫూర్తితో రాయడం జరిగింది. రాష్ట్రాలకు, కేంద్రానికి వేర్వేరు రకాల అధికారాలు పొందుపరచారు. అర్థం కాని విషయం...కేవలం రాష్ట్రాల పరిధిలోనే వుండాల్సిన అంశాలైన గ్రామీణాభివృద్ధికాని, గ్రామీణ రహదారులు కాని, వ్యవసాయం కాని, పట్టణాభివృద్ధి కాని, విద్య-వైద్యం కాని...ఇలాంటి మరికొన్ని అంశాలి కాని, కేంద్రం కింద ఎందుకుండాలి అని సీఎం కేసీఆర్ అడగడం సమంజసం. విదేశాంగ విధానమో, దేశ రక్షణకు సంబంధించిన అంశమో, దేశ సమగ్రత సార్వ భౌమత్వానికి సంబందించిన అంశమో కేంద్ర పరిధిలో వుంటే తప్పులేదు. సమాఖ్య జాబితా అని, రాష్ట్రాల జాబితా అని రెండు వుంటే సరిపోతుంది. ఉమ్మడి జాబితా అవసరం లేదు. ప్రభుత్వ విధానంలో, సంవిధానంలో, వ్యవస్థీకృత మార్పులతో పాటు న్యాయ వ్యవస్థలో కూడా సంస్కరణలు రావాలి. గుణాత్మక మార్పులో ఇవన్నీ భాగం కావాలి. ఏ వర్గానికి ఎంత మేరకు ఉపాధి అవకాశాలు కల్పించాలో సరిగ్గా తెలిసేది ఆయా రాష్ట్రాలకే కాబట్టి రిజర్వేషన్ల వ్యవహారం పూర్తిగా రాష్ట్రాల పరిధిలోనే వుండాలి. అసలు రాష్ట్రం అంటే ఏమిటి? సమాఖ్య అంటే ఏమిటి? అనే విషయంలో పునర్నిర్వచనం చేయడానికి కూడా సమయం ఆసన్నం అయింది. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు బదలాయించి, వాటికి సాధికారత కలిగించాలి. అదే విధంగా రాష్ట్రాలు కూడా సముచితమైన రీతిలో స్థానిక సంస్థలకు అధికారాలివ్వాలి. ఇదే అసలు-సిసలైన సమాఖ్య స్ఫూర్తి.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలైనా జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. ప్రజల అవసరాలు తీరలేదు. ప్రజలందరికీ కనీసం రక్షిత మంచినీటి వసతి కలిగించలేక పోయాయి ప్రభుత్వాలు. దేశంలో 70,000 టీఎంసీల నీటి లభ్యత వున్నా పూర్తి స్థాయి ఉపయోగంలోకి తేలేకపోయాం. అంతర్ రాష్ట్ర జలవివాదాలు పరిష్కారం కావడానికి ఏళ్ల తరబడి పడుతుంది. దేశం మొత్తం మీద 3.30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా, సగం దేశం అంధకారంలోనే వుంటుంది. ఇదేమన్నా పద్దతా? వ్యవస్థ ఇలా వుండాలా? ఒక రాష్ట్రంలో మిగులున్న వనరులను మరో తరుగు రాష్ట్రానికి ఇచ్చే పధ్ధతి ఎందుకు వుండకూడదు? మొట్టమొదటి సారి, నాలుగేళ్ల క్రితం, ఒక కాంగ్రెసేతర పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఎంతో ఆశించారు ఆ ప్రభుత్వం నుండి. వారి ఆశలు అడియాసలయ్యాయి. ఎంతకాలం ఈ దుస్థితి చూసి మౌన ప్రేక్షకులుగా వుండాలని ప్రజలడుగుతున్నారు. ఎందరో నిపుణులు, ఎన్నో కమీషన్లు కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో సూచించిన అంశాలు అమలుకు నోచుకోలేదు. సమాఖ్య స్ఫూర్తి పూర్తిగా కొరవడింది.

అభివృద్ధి పరంగా, సంక్షేమపరంగా, మౌలిక వసతుల కల్పనాపరంగా, తెలంగాణా రాష్ట్రం ఎన్నో మైలురాళ్ళను అధిగమించింది. తెలంగాణా రాష్ట్రం తన వినూత్న పథకాల ద్వారా, కార్యక్రమాల ద్వారా దేశానికి, ఇతర రాష్ట్రాలకు ఒక ఆదర్శవంతమైన-రోల్ మోడల్ రాష్ట్రంగా తయారైంది. ఎంతో మంది వీటిని అనుకరిస్తూ తమ రాష్ట్రాలలో కూడా అమలు చేసేందుకు సిద్ధమౌతున్నారు. తెలంగాణ పథకాలైన రైతుకు ఎకరానికి రు.8000 పెట్టుబడి మద్దతు, మిష భగీరథ, ఆశా, అంగన్వాడీ వర్కర్ల జీతాల పెంపుదల, ఉద్యోగుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, లాంటివి జాతీయ ఎజెండా అయితే గుణాత్మక మార్పుకొరకు ఏర్పడే రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అదనంగా మరిన్ని పథకాలు ఆలోచన చేయాలి. వ్యవస్థీకృత మార్పులనేకం రావాలి. రాజకీయ నాయకులు, వివిధ రంగాల నిపుణులు, పాలనానుభవం కలిగిన అధికారులు, ఇతరులు తమ సూచనలు సలహాలు ఇచ్చి ఈ బృహత్తర యజ్ఞంలో భాగస్వాములు కావాలి.   

ఈ విషయాలన్నీ ఒక గొప్ప మనసుతో, గొప్ప ఆలోచనతో, సూటిగా, స్పష్టంగా, అరమరికలు లేకుండా చెప్పగలిగే సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు, దేశం నలుమూలల తిరిగి ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేస్తుంటే, ఆయన మాటలు అణుబాంబుల వర్షాల్లా కురిసి, ఆశించిన దానికంటే ఎక్కువ స్థాయిలో గుణాత్మక మార్పు రావడం తధ్యం.    

No comments:

Post a Comment