Thursday, August 17, 2023

సత్యనారాయణ స్వామి వ్రత కథ ఏకైక సామ్యవాద కథ ...... (శ్రీ స్కాంద పురాణే, శ్రీ రేవా ఖండే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే) : వనం జ్వాలా నరసింహారావు

 సత్యనారాయణ స్వామి వ్రత కథ ఏకైక సామ్యవాద కథ

(శ్రీ స్కాంద పురాణే, శ్రీ రేవా ఖండే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక చింతన కాలమ్ (18-08-2023)

శ్రీ స్కాంద పురాణం, శ్రీ రేవా ఖండం’ లో చెప్పినదని భావిస్తూ, ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తూ, అపర శ్రీమహావిష్ణువు ప్రతిరూపంగా స్మరించుకుంటూ, సత్యనారాయణ వ్రతం చేసుకుని, ఐదు అధ్యాయాలోని కథలను వినడం, దేశంలో నివసిస్తున్న భారతీయులే కాకుండా, వివిధ దేశాలలో వున్న ప్రవాస భారతీయులు సహితం అనాదిగా ఆచరిస్తూ వస్తున్న పవిత్రమైన, సంప్రదాయబద్ధమైన, సార్వజనీనమైన మహత్తర జీవనవిధానం. కథ చెప్పే బ్రాహ్మణ పూజారి, శ్రీ స్కాంద పురాణే, శ్రీ రేవా ఖండే, (ఫలానా) అధ్యాయే, అని ఆరంభించి, ఒక్కొక్క కథ పూర్తిచేసి, వ్రతం చేసుకునేవారితో కొబ్బరికాయ కొట్టించి, సత్యనారాయణస్వామి ఫోటో మీద అక్షింతలు వేయించి, తీర్థప్రసాదాలు ఇస్తారు. సాధారణంగా శుభకార్యాలకు సత్యనారాయణ వ్రతం చేసుకోవడం ఆచారం.

భారతీయ సంప్రదాయాన్ని, ధర్మశాస్త్రాన్ని, మానవజాతి చారిత్రిక పరిణామక్రమాన్ని, త్రిమూర్తులనబడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ద్వారా జరిగే విశ్వం సృష్టి, స్థితి, లయల శాశ్వత చక్రభ్రమణం గురించిన వివరాలను తెలియచేసే అష్టాదశ (బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, శ్రీమద్భాగవత, నారద, మార్కండేయ, అగ్ని, భవిష్యోత్తర, బ్రహ్మవైవర్త, లింగ, వరాహ, వామన, కూర్మ, మత్స్య, గరుడ, బ్రహ్మాండ, స్కాంద) మహాపురాణాలన్నిటినీ గ్రంథస్థం చేసిన మహానుభావుడు వేదవ్యాసుడు. అతిపెద్దదైన స్కాంద పురాణం 81100 శ్లోకాలతో, అరుణాచల, వేంకటాచల, కార్తీకమాస, మార్గశీర్ష మాస, భాగవత, వైశాఖమాస, ద్వారక మహత్మ్యంలు, శివుడిని గురించి, స్కంధ జననం గురించి వున్నాయి.

వేదవ్యాసుడు రచించిన శ్రీ స్కాంద పురాణంలో రేవా ఖండం, దానితో సత్యనారాయణ వ్రతానికి సంబంధం లేదని కొందరి అభిప్రాయం. ఏదేమైనా, ఆబాలగోపాలం చేసుకుంటున్న సత్యనారాయణ వ్రతం, అందులోని కథ చాలా ఆసక్తికరంగా వుంటుందనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. కథ చెప్పే వారి నైపుణ్యం మీద, చతురత మీద వినేవారికి మరింత ఆసక్తి కలిగడం జరుగుతుంది. ఒక దశాబ్దం క్రితం పద్మశ్రీ ఆవార్డ్ గ్రహీత, మహాసహస్రావధాని, గరికపాటి నరసింహారావు, మెదక్ జిల్లా మర్కూక్ గ్రామంలో, దర్శనమ్ శర్మ ఆధ్వర్యంలో, 1108 మంది దంపతులు చేసుకున్న సామూహిక  సత్యనారాయణ వ్రతాల సందర్భంగా అద్భుతంగా, అమోఘంగా చెప్పిన కథ శ్రోతలను అలరించింది.

భగవంతుడికి కుల భేదం లేదని, అగ్రవర్ణాలు, అల్పవర్ణాలు అనే మాటలు సత్యనారాయణ వ్రతం దగ్గర అసలే పనికిరావని,ప్రపంచం మొత్తం మీద సామ్యవాద కథ ఏదన్నా వుందంటే అది సత్యనారాయణ స్వామి వ్రత కథ ఒక్కటే.’ అని అన్న గరికిపాటి గారి వ్యాఖ్యానం సదా స్మరణీయం. సత్యనారాయణ వ్రతం అన్న మాటలో ‘సత్యం, నారాయణుడు, వ్రతం’ అనే మూడు శబ్దాలున్నాయని, చివరి రెండూ కలిపితే ‘సత్యవ్రతం’ అవుతుందని, ఆడినమాటకు కట్టుబడి ఎవరుంటారో వారే సత్యనారాయణవ్రతం చేయడానికి అర్హులని, ఆడినమాట తప్పితే ఫలితాన్ని కూడా సత్యనారాయణస్వామి కథ ద్వారా తెలుసుకోవచ్చని, కులాలకు అతీతంగా మహారాజు మొదులుకుని గొల్లవాడి వరకు, ఆడినమాట నిలబెట్టుకున్నవాడికి సత్ఫలితాన్ని, ఆడినమాట తప్పిన వాడికి తక్షణమే శిక్షను విధించడం కూడా సోదాహరణంగా తెలుసుకోవచ్చని గరికిపాటి గారు అన్నారు.

నైమిషారణ్యంలో శౌనకాది మహా మునులు, కలిగియుగంలో మానవుడికి ఉపకారం జరిగే విధానం, తరించాలంటే సులభమైన మార్గాలు, ఆచరించాల్సిన వ్రతాలు, అతి సూక్ష్మమైన ఉపాయం వివరించమని సూతమహాముని అడిగారు. జవాబుగా, నారాయణమూర్తే స్వయంగా చెప్పిన మాటలే చెబుతానన్నాడు సూతుడు. త్రిలోకసంచారైన నారదుడు ఒకసారి వైకుంఠానికి వెళ్లి, భూలోకంలో మానవులు ముక్తి పొందాలంటే, బుద్ది జ్ఞానాలు కలగాలంటే  ఏమి చేయాలో చెప్పమనీ, విష్ణుమూర్తిని అడిగిన విషయం, కలియుగంలో తాను అన్నవరం క్షేత్రంలో ఆవిర్బవిస్తున్నానని చెప్పి,  అన్నమాట ప్రకారం సత్యదేవుడనే రూపంలో విలిస్న విషయం, తన పేరు మీద సత్యనారాయణ వ్రతం చేసి, ప్రసాదం స్వీకరించినట్లయితే దోషాలన్నీ క్షమిస్తానని అన్న విషయం సూతుడు వివరించాడు. సత్యదేవుని వ్రతం  చాలా సులభమైనదని, జీవితంలొ ఎప్పుడైనా, ఎవరైనా చేయవచ్చని, ఫలాన తిధి నాడు, పలనా మాసం నాడు చేయాలని లేదని, వ్రతం ముగిసిన వెంటనే స్వామి అనుగ్రహించి, బాధల్నుంచి విముక్తులను చేస్తాడని కూడా చెప్పాడు. అలా ఎవరెవరిని విముక్తులను చేశాడో కథల రూపంలో వున్నది.

మొదటి కథలో పేదరికంలో వున్నా, ఐశ్వర్యంలో వున్నా ఆత్మధ్యానాన్ని మానకూడదనే సందేశం వున్నది. వేదం నమ్ముకుని కాశీ నగరంలో నివసిస్తున్న ఒక పేద బ్రాహ్మణుడికి సంతానం ఎక్కువ. సత్యదేవుడికి ఆయన మీద దయకలిగింది. ఒక వృద్ధ బ్రాహ్మణుడి  రూపంలో ప్రత్యక్షమై  కనిపించాడు. శ్రేష్టమైన సత్యనారాయణ వ్రతాన్ని యధాశక్తి  చేయమని, అలా చేసినట్లయితే దుఖాలు తొలిగిపోతాయని చెప్పాడు. బ్రాహ్మణుడు తెలిసినవాళ్ల ఇంట్లో స్వామి పటాన్ని తెచ్చిపెట్టుకుని, వ్రతం చేసి, స్వామికి సమర్పించడానికి దారిద్య్రం తప్పితే తనదగ్గర ఏమీలేదని అంటూ, భక్తితో సమర్పిస్తే, స్వామి దాన్నే ఆనందంగా స్వీకరించి, అతన్ని ఐశ్వర్యవంతుడిని చేశాడు. దారిద్ర్యాన్ని సహితం భగవంతుడికి భక్తితో సమర్పించవచ్చనేది ఇక్కడ సందేశం. ఐశ్వర్యవంతుడయినా బ్రాహ్మణుడు వ్రతం చేయడం మానలేదు.

ఆయనేన  ఒక నాడు ఒక నదీ తీరంలొ  ఈ వ్రతాన్ని  చేస్తూ వుంటే ఒక కట్టెలమ్ముకొనేవాడు చూశాడు. కట్టెలు కొట్టుకుని నెత్తిమీద పెట్టుకుని అమ్ముకునే ఆయనకు బొటాబొటిగా నాలుగు డబ్బులు వస్తుంటాయి. బ్రాహ్మణుడు వ్రతం చేయడాన్ని వెనుకాల నుంచి చూసి ఆ వ్రతం వివరాలు అడిగాడు. వ్రతం అయిపోయిన తరువాత ప్రసాదం తాను సేవించి, ఆ కట్టెలమ్ముకొనేవాడికి కుడా ప్రసాదం పెట్టి, తాను ఈ వ్రతం చేయడం వల్లనే సమస్త దుఖాలు పొగొట్టుకుని సంపన్నుడినై, సంతృప్తిగా వున్నానని, అతడు కూడా ప్రసాదం తీసుకోమన్నాడు బ్రాహ్మణుడు. కట్టెలమ్ముకొనే తాను బ్రాహ్మణులలాగా యీ వ్రతం చేయవచ్చా? నియమాలు, ఇబ్బందులు వున్నాయా? అని అడిగాడు. సత్యనారాయణ వ్రతానికి అలా ఏమీలేన్నాడు బ్రాహ్మణుడు.

ఆరోజు సాయంత్రం వరకు కట్టెలమ్మగా ఎంత ద్రవ్యం లభిస్తుందో, దానితో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని కట్టెలు అమ్ముకునే వాడు మొక్కుకున్నాదు. వ్రతాన్ని వైభవోపేతంగా  చేయడానికి అవసరమైన డబ్బు దొరికింది. కట్టెలు అమ్ముకునేవాడు మరునాడు ఉదయన్నే  స్నానంచేసి,  సత్యదేవుడి సంకల్పం చేసి, వ్రతాన్ని చేసి  సర్వ సకల సౌభాగ్యాలు పొందాడు. సత్యదేవుని వ్రత మహిమ వల్ల  కట్టెలు కొట్టేవాడు అత్యున్నత స్థాయికి ఎదిగాడని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పాడు.

ఇంతవరకు తెలిసింది, మాట తప్పకుండా వుంటే సత్యదేవుడు కాపాడతాడు అనే విషయం. మరి తప్పితే ఏం జరుగుతుందో సత్యనారాయణ వ్రత కథలో కీలకమయిన మూడు, నాలుగు అధ్యాయాల్లో తెలుస్తుంది. వ్రతం చేసుకున్నవారు సుఖంగా వున్నారనే వార్త ఉల్కాముఖుడు అనే రాజుగారికి తెలిసింది. రాజుకు అంతవరకు  సంతానం కలగలేదు. బ్రాహ్మణుడి సలహా మేరకు, రాజుగారు భద్రశీల అనే నదీ తీరంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తలపెట్టి భక్తి శ్రద్దలతో  పూర్తి చేశాడు. సంతానం కలిగింది. మరోమారు రాజుగారు వ్రతం చేస్తూ వుంటే ఆ దేశంలో బాగా పేరుమోసినటువంటి సాధువు అనే వ్యాపారస్తుడు చూసి, వ్రతం అయిపోయాక ఆయన దగ్గర ప్రసాదాన్ని పుచ్చుకుని  సేవించి, మహారాజుని వ్రతం వివరాలు, ఫలితం అడిగి తెలుసుకున్నాడు.

షావుకారుకు కూడా సంతానం లేనందున, ఆయన కూడా సత్యనారాయణ వ్రతం  చేయడానికి సంకల్పించి, ఆ విషయం భార్య  లీలావతికి చెప్పగానే ఆమె తప్పక చేసుకందామన్నది. సత్యనారాయణస్వామి దయవల్ల తమకు సంతానం కలిగితే, ఆయన పేరు పెట్లుకుంటామని,  ఖచ్చితంగా వ్రతం చేస్తామని, సంకల్పం చేశారు. ఏడాది తరువాత లీలావతికి కూతురు పుట్టింది. ఆమెకు కళావతి అని పేరు పెట్టుకున్నారు. సత్యదేవుడి దయవల్ల కళావతి కలిగింది కాబట్టి వ్రతం చేసుకుందామని లీలావతి గుర్తు చేసింది. 21వ రోజు బారసాలనాడు వ్రతం చేద్దామని, ఆపైన అన్న ప్రాశన నాడని, రజస్వల నాడని, వివాహం నాడని వాయిదాలు వేశాడు భర్త. మమ్మల్ని క్షమించమని సత్యదేవుడిని ప్రార్దించింది ఆ ఇల్లాలు.  సత్యదేవుడు ఆమె ప్రార్థన ఆలకించి, కుటుంబం మీద కనికరంగానే వున్నాడు. కళావతికి పెళ్లి వయసు రాగానే కాంచన నగరంలోని వైశ్యులబ్బాయికిచ్చి వివాహం జరిపించారు.

 వ్రతం సంగతి లీలావతి మళ్లీ గుర్తుచేసింది భర్తకు. మన పిల్ల కడుపులో ఒక కాయ కాయాలి కదా అని అంటూ వ్రతం చేయలేదు. సత్యదేవుడు వీడికి ఒక పరీక్ష పెట్టితే కానీ లాభం లేదనుకున్నాడు. కొంత కాలానికి మామా, అల్లుడు వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడుండే రత్నసాను పురానికి వెళ్ళారు. సత్యనారాయణ స్వామి శపించిన కారణాన, ఎవరో చేసిన దొంగతనం నేరానికి రాజుగారు మామాఅల్లుళ్లను కారాగృహంలో బంధించి వారి ధనాన్ని స్వాధీన పరచుకున్నాడు. సొంత ఇంట్లో కూడా దొంగలు పడి సొమ్మంతా అపహరించారు. బిక్షాటన చేసే పరిస్థితి కుటుంబానికి కలిగింది. ఆ నేపధ్యంలో కళావతి ఒకనాడు ఎవరింట్లోనో  సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసి, చివరి వరకు ఉండి, తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వస్తుంది. అప్పుడు లీలావతి తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం నిష్టగాచేసి, తన భర్తను, అల్లుడ్ని క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్తిస్తుంది సత్యదేవుడిని. తత్ఫలితంగా చంద్రకేతు మహారాజు ఆ వైశ్యులను చెఱనుండి విడిపించాడు. వారికి రెట్టింపు ధనం ఇచ్చి ఆశీర్వదించి పంపాడు.

   రాజు వద్ద సెలవు తీసుకుని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం కావడం, వారిని మరోమారు సన్యాసి వేషంలో సత్యనారాయణ స్వామి పరీక్షించడం, దాని ఫలితంగా వారి పడవ నిండా ధనానికి, సొమ్ములకు బదులు ఆకులు, అలములు వుండడం, మామ అల్లుడు తమ అపరాధాన్ని మన్నించమని సన్యాసిని వేడుకోవడం, వారి ప్రార్థనకు ఫలితంగా మళ్ళీ సొమ్ములతో నిండిన ఓడతో తిరుగుప్రయాణం కట్టడం, వారు తమ ఊరు సమీపిస్తున్న సమయంలో అక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తూ, భర్త అల్లుడు వస్తున్న వార్త విన్న వెంటనే లీలావతి పూజ ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళ్లడం, కళావతి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరుగెత్తుకుని పోవడం, ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి, వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగి పోయేలా చేయడం, సత్యదేవుడిని ప్రార్థించడం, ఆయన ప్రసన్నుడై అశరీరవాణిగా, కళావతిని ఇంటికి పోయి ప్రసాదం తినివస్తే అంతా సవ్యంగా జరుగుతుందని చెప్పడం, కళావతి అలాగే చేయడం కథ సుఖాంతం కావడం, తరువాత అధ్యాయంలోని కథ.

 ఐదవ అధ్యాయంలో తుంగధ్వజుడనే రాజు కథ వుంటుంది. ఒకసారి ఆయన వేటకి పోయి చెట్టుకింద సేద దీరుతున్న సమయంలో, అదే చెట్టు వద్ద గోపకులు సత్యనారాయణ పూజ చేసి, ప్రసాదం తెచ్చి రాజుకు ఇచ్చారు. వారు తక్కువ కులం వారని భావించి, ప్రసాదం తినకుండానే రాజు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఫలితంగా అతని నూరుగురు కొడుకులు మరణించడం, ధనధాన్యాలు నశించడం, తప్పు తెలుసుకుని రాజు గోపకులతో కలిసి సత్యదేవుని పూజించడం, కథ సుఖాంతం కావడం జరుగుతుంది.

సామాన్యుడు సామాన్యుడికి చెప్పినటువంటి వ్రతకథ కాదిది. మాన్యులైనటువంటి శ్రీమన్నారాయణ మూర్తి  స్వయంగా నారదుడికి చెప్పినటువంటి కథ. పదిరూపాయలు ఖర్చుపెట్టి  చేయోచ్చు, పది వేలు ఖర్చు పెట్టి చేయోచ్చు, పది లక్షలు ఖర్చు పెట్టి కూడా చేయవచ్చు.  అనవసరంగా ఆర్భాటాలు చేయమనీ చెప్పలేదు. వున్నవాడు వున్నట్లే, లేనివారు లేనట్లే  చేయాలి.

(నేడు సత్యదేవుని జన్మదినం)

No comments:

Post a Comment