‘అరసం’ నుంచి ‘విరసం’ వరకు
తెలుగు సాహిత్య ప్రస్థానం
వనం జ్వాలా నరసింహారావు
ప్రజాతంత్ర దినపత్రిక (మే నెల, 31, 2026)
{భావ
కవిత్వం’ నుండి ‘విరసం’ వరకు సాగిన తెలుగు సాహిత్య ప్రస్థానం, సంప్రదాయం-ఆధునికత, భక్తి-తిరుగుబాటు,
వ్యక్తివాదం-సమష్టివాదం వంటి విభిన్న ధోరణుల మధ్య జరిగిన
చైతన్యవంతమైన సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. ప్రతి దశ కూడా తెలుగు మాట్లాడే ప్రజల
మారుతున్న ఆకాంక్షలను పోరాటాలను అద్దం పట్టి చూపింది. క్రమంగా, సాహిత్యం వర్గ పోరాటానికి ఒక ఆయుధంగా రూపుదిద్దుకుంది; అది భూస్వామ్య వ్యవస్థను, పెట్టుబడిదారీ విధానాన్ని,
కుల వ్యవస్థను విమర్శిస్తూనే, సామాజిక
చైతన్యాన్ని నిరంతరం పునర్నిర్మించింది.} – ప్రజాతంత్ర సంపాదకుడి క్లుప్త వ్యాఖ్య
2026 మే 23, 24 తేదీలలో తిరుపతిలో ఇటీవల
రెండు రోజుల పాటు జరిగిన అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 20వ
రాష్ట్ర స్థాయి సమావేశాలు, ప్రసార,
ప్రింట్ మాధ్యమాలలో నివేదించిన విధమైన కార్యకలాపాల కంటే చాలా లోతైన సందేశాలను
కలిగి ఉన్నాయి. అయితే వాటిని ‘అంతరార్థంలో’ శోధించినప్పుడు మాత్రమే ఇవి అర్థమవుతాయి.
సామాజిక బాధ్యతతో కూడిన సృజనాత్మకత పట్ల నిరంతర నిబద్ధతకు ‘అరసం ‘ ప్రతీకగా
నిలుస్తూనే ఉందనేది నేను అవగాహన చేసుకున్నాను. ప్రజాస్వామ్య విలువలు,
పౌర స్వేచ్ఛలు, బహుళత్వం, రాజ్యాంగ రక్షణలు
జాగృత ప్రజా భాగస్వామ్యాన్ని కోరుతున్న తరుణంలో, వారి చర్చలు
సామూహిక సాంస్కృతిక భాగస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలను
ప్రతిబింబిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, సుమారు నాలుగున్నర దశాబ్దాల క్రితం, 1982 జూన్ నెలలో హైదరాబాద్ నగరంలోని మా నివాసంలో జరిగిన ఒక సంఘటన నాకు ఇప్పటికీ
గుర్తుకు వస్తోంది. ఆ సాయంత్రం ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారిని మా కుటుంబ
అతిథిగా ఆతిథ్యం ఇచ్చే అదృష్టం నాకు కలిగింది. చింతపండు, ఉల్లిపాయలు,
మిరపకాయలు, బెల్లం, కొత్తిమీర,
కరివేపాకు, వెల్లుల్లి వంటి తేలికపాటి స్థానిక
సుగంధ ద్రవ్యాలతో తయారుచేసే, అప్పుడప్పుడు కాలానుగుణంగా
చింతపండుకు బదులుగా ఉడికించిన పచ్చి మామిడికాయను కూడా వాడే, ప్రత్యేకమైన
‘పచ్చి పులుసు’ను నా భార్య కాళోజీ నారాయణరావు గారికి వడ్డించగానే, ఆక్షణందాకా అక్కడు నెలకొన్న
ఉల్లాసభరితమైన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
అప్పటి వరకు మేమిద్దరం సాధారణ
సంభాషణలలో మునిగిపోయి, ఎక్కువగా కాళోజీ గారు సాహిత్య విషయాలపై
చెప్పే విషయాలను వింటూ ఉన్నాము. కానీ పచ్చిపులుసు వంటకాన్ని ముట్టుకోగానే,
ఆయన గొంతు భావోద్వేగంతో నిండిపోయింది, దుఃఖంతో
గొంతు పూడుకుపోయింది. అంతేకాదు ఆ సాయంత్రం అనుకోకుండా నిశ్శబ్దంలోకి జారిపోయింది.
అక్షరాలా, కాళోజీ నారాయణరావు గారు భావోద్వేగానికి లోనవుతూ
కన్నీటితో కుప్పకూలిపోయారు. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత, ఆయన తనంతట తానే తేరుకుని తన దుఃఖానికి గల కారణాన్ని వివరించారు. పైకి
చిన్న విషయంగా అనిపించినప్పటికీ, తనకు ఎంతో ఇష్టమైన ‘పచ్చి
పులుసు’ను చాలా కాలంగా రుచి చూడకపోవడం మొదటి కారణ. రెండవది, అలాంటి
పచ్చిపులుసు డిష్ తో వడ్డించిన బోజనాన్ని ఒకప్పుడు చెరబండ రాజు గారి ఇంట్లో తాను తిన్న
సంగతి గుర్తుకు రావడం.
యాదృచ్ఛికంగా, అదే రోజు అంతకుముందే కాళోజి అనారోగ్యంతో ఉన్న చెరబండ రాజును
పరామర్శించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటం చూసి తీవ్రంగా కలత చెంది, అది తన దుఃఖాన్ని మరింత పెంచింది. దురదృష్టవశాత్తు, కాళోజీ నారాయణరావు మమ్మల్ని పరామర్శించిన కేవలం ఒక నెల తర్వాత, చెరబండ రాజు జైలు శిక్ష అనుభవిస్తూ, 1982 జూలైలో 38 ఏళ్ల వయసులో మరణించారు. మా ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో, కాళోజీ అనేక ఇతర విషయాలతో పాటు, ‘తెలుగు సాహిత్య
ప్రస్థానం’ గురించి కూడా వివరించారు. అందులోని కొన్ని అంశాలు ఇప్పటికీ నాకు
అప్పుడప్పుడు గుర్తుకు వస్తుంటాయి. ప్రగతిశీల రాజకీయ ప్రభావాల నేపధ్యంలో పాక్షికంగా
రూపుదిద్దుకున్న ఇటువంటి సాహిత్య ప్రవాహాల పట్ల నాకున్న నిరంతర ఆసక్తి, ఆ తర్వాత వాటికి సంబంధించిన అంశాలను అడపాదడపా సేకరించి, నమోదు చేయడానికి నన్ను పురికొల్పింది.
అభ్యుదయ రచయితల సంఘం నుండి విప్లవ రచయితల సంఘం
(విరసం) వరకు దిగంబర కవిత్వం ద్వారా సాగిన ‘తెలుగు సాహిత్య ప్రస్థానం’
పుట్టుక, ఉద్దేశం, పరిణామాన్ని
విహంగ వీక్షణం రూపంలో అందించే ప్రయత్నమే ఇది. తెలుగు సాహిత్య పరిణామం ఎన్నడూ
సరళరేఖా మార్గంలో సాగలేదు. అది పెను మార్పులు, చైతన్యాలు,
అసమ్మతి, ఆత్మపరిశీలన, సామాజిక
ఆవశ్యకతల ద్వారా ముందుకు సాగింది. భక్తిరస శాస్త్రీయత నుండి శృంగారరస భావన వరకు,
ప్రగతిశీల మానవతావాదం నుండి తిరుగుబాటు ప్రతిఘటన వరకు,
తమతమ కాలంలోని ఆందోళనలను, ఆకాంక్షలను
ప్రతిబింబించే సాధనంగా తర్వాతి తరాలకోసం భాషను పునర్నిర్మించాయి.
కవిత్వం, గద్యం, నాటకం, విమర్శ, ప్రజా ప్రసంగం అనేవి సామూహిక చైతన్యానికి అద్దం పట్టాయి. అవి కేవలం
సౌందర్యాత్మక పరిణితిని మాత్రమే కాకుండా, ఆకలి, అన్యాయం, పరాయీకరణ, తిరుగుబాటు,
ఆశలను కూడా నమోదు చేశాయి. ఈ నిరంతర ప్రవాహంలోనే సృజనాత్మక
వ్యక్తీకరణను సామాజిక జోక్యంగా మార్చిన శక్తివంతమైన ప్రవాహాలు ఉద్భవించాయి.
సంస్కరణవాద భావజాలం సాంప్రదాయవాదాన్ని సవాలు చేసింది, ప్రగతిశీల
ఆలోచన సాహిత్యాన్ని శ్రామిక వర్గాలతో అనుసంధానించింది. దిగంబర కవిత్వం వ్యక్తీకరణ
కృత్రిమత్వాన్ని ఛేదించింది. విప్లవ స్వరాలు కవిత్వాన్ని సైద్ధాంతిక
ప్రకటనగా మార్చాయి.
కాళోజీ నారాయణరావు, శ్రీశ్రీ, చెరబండ రాజు, వరవరరావు, ఆరుద్ర వంటి మహనీయులు కేవలం పద్యాలు,
గేయాలు రచించడమే కాకుండా, సృజనాత్మకతకు, సమాజానికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా పునర్నిర్వచించారు. శతాబ్దాలుగా
తెలుగు మేధోసంస్కృతిలో జరిగిన పరివర్తన, భావోద్వేగపరంగా
ఆదర్శవాదం క్రమంగా వాస్తవికవాదానికి, అసమ్మతికి, అస్తిత్వ అన్వేషణకు, విప్లవవాత్మక నిమగ్నతకు ఎలా
చోటు కల్పించిందో చూపిస్తుంది. అరసం, విరసం వంటి సంస్థలు
కళాత్మక విశ్వాసం, రాజకీయ చైతన్యం, ప్రజా
బాధ్యత కలిసే వేదికలుగా మారాయి. తెలుగు సాహిత్యం అసమానత, అణచివేత,
నైతిక వైరుధ్యాలను ఎదుర్కొంటూనే, సాంస్కృతిక
స్మృతిని కాపాడుకుంటూ నిరంతరం తనను తాను పునరావిష్కరించుకుంది.
మారుతున్న ఈ యుగం ముఖ్య లక్షణాలలో అణగారిన వారి పట్ల ఆందోళన, సమానత్వంతో కూడిన వర్గరహిత సమాజం అనే దార్శనికత, ఆలోచనలో
వాస్తవికవాదం, భాషలో ఆధునికత ఉన్నాయి. శ్రీశ్రీ ‘ప్రగతిశీల
కవితా ఉద్యమ సారథి’గా నిలిచారు. స్వేచ్ఛా పద్యాన్ని అద్భుతమైన సులభత్వంతో
స్వీకరించిన ‘అభ్యుదయ కవిత’ తెలుగు సాహిత్యాన్ని గణనీయంగా మార్చివేసింది. అది ‘అరసం’
ఆవిర్భావానికి కూడా నాంది పలికింది. స్వాతంత్య్రం వల్ల సామాన్యుడు నిజంగా ఏమి
పొందాడు అనే దానిపై ఆత్మపరిశీలన మొదలైంది. బలహీన వర్గాల కోసం గళం విప్పాల్సిన
అవసరం స్పష్టంగా, అనివార్యంగా మారింది. ఆ గళమే కవిత్వంగా
రూపాంతరం చెంది ‘దిగంబర కవిత్వం’గా ప్రజలకు చేరింది.
ఇది తెలుగు సాహిత్యంలోని కపటత్వాన్ని
బద్దలు కొట్టి, నిజమైన మానవుడిని కనుగొనడానికి
ప్రయత్నించింది. కాళోజీ నారాయణరావు ప్రస్తావించిన చెరబండ రాజు (బద్దం భాస్కర
రెడ్డి), అరవయ్యవ దశాబ్దం చివరిలో ‘దిగంబర కవులు’
(నగ్న కవులు)గా ప్రసిద్ధి చెందిన మరో ఐదుగురు కవులతో పాటు ప్రాచుర్యం పొందిన ఒక
తెలుగు విప్లవ కవి, నవలా రచయిత, గేయరచయిత. వీరు నిఖిలేశ్వర్ (యాదవ రెడ్డి), జ్వాలా
ముఖి (వీర రాఘవాచార్యులు), నగ్న ముని (మానేపల్లి
హృషికేశ్వరరావు), మహా స్వప్న (కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు), భైరవాయ
(మన్మోహన్ సహాయ్) వంటి భావోద్వేగభరితమైన మారుపేర్లను స్వీకరించారు.
వారు తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా
నిలిచే, అత్యంత వినూత్నమైన, సాటిలేని
కవితా సంపదను సృష్టించారు. శ్రీకాకుళం గిరిజన పోరాటాల నేపథ్యంలో, విప్లవ కవిత్వం ఒక పెను తుఫానులా తెలుగు సాహిత్యంలోకి దూసుకొచ్చింది.
అభ్యుదయ కవిత్వం తన పోరాట స్ఫూర్తిని కోల్పోయిందని భావించిన ‘దిగంబర కవులు’,
క్రమంగా ‘విప్లవ రచయితలు’గా పరిణామం చెందారు. కాలక్రమేణా, చెరబండరాజు, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్,
నగ్నమునిలతో కలిసి మార్క్సిస్టు-లెనినిస్టు రచయితలుగా మారి, ‘విప్లవ రచయితల సంఘం (విరసం)ను కూడా స్థాపించారు.
వరవరరావు, శ్రీశ్రీ, కుటుంబరావు, రాచకొండ విశ్వనాథశాస్త్రి , రమణారెడ్డి వంటి ప్రముఖ
విప్లవ రచయితలు జూలై 4, 1970న ‘విరసం’ను స్థాపించినవారిలో
ఉన్నారు. శివసాగర్, గద్దర్, వంగపండు
వంటి ఇతర ప్రభావశీల గళాలు కూడా ఈ ఉద్యమంతో అనుబంధం కలిగి ఉన్నాయి. చెరబండరాజు తన
మరణం వరకు ఈ సంస్థలో క్రియాశీలకంగా కొనసాగారు. మార్క్సిస్టు తాత్విక పునాది నుండి
ఉద్భవించిన 1930ల నాటి అభ్యుదయ కవిత్వం, మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు), ఆరుద్ర,
అవంత్స సోమసుందర్, కుందుర్తి ఆంజనేయులు వంటి
ప్రముఖ కవులను తెలుగు సాహిత్యానికి అందించింది.
తన మార్గమే విప్లవ మార్గమని శ్రీశ్రీ
ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల అంతటా సాగిన విప్లవ ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం, వాటి చరిత్రను ప్రతిబింబించడం, విప్లవ
ఆదర్శాలను ప్రచారం చేయడం విప్లవ కవిత్వానికి ప్రధాన లక్షణాలుగా మారాయి. ప్రజలను
సమూల మార్పుల దిశగా ప్రేరేపించడం, జాతీయ, అంతర్జాతీయ
పరిణామాలకు స్పందించడం, పేదల జీవితాలను, గళాలను సాహిత్యంలోకి
తీసుకురావడం ఈ కవిత్వం ఆశయాలుగా నిలిచాయి. ఈ క్రమంలో విప్లవ కవిత్వం
భావనలోనూ, భాషలోనూ గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది.
‘భావ కవిత్వం’ నుండి ‘విరసం’ వరకు సాగిన
తెలుగు సాహిత్య ప్రస్థానం, సంప్రదాయం-ఆధునికత, భక్తి-తిరుగుబాటు, వ్యక్తివాదం-సమష్టివాదం వంటి
విభిన్న ధోరణుల మధ్య జరిగిన చైతన్యవంతమైన సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. ప్రతి దశ
కూడా తెలుగు మాట్లాడే ప్రజల మారుతున్న ఆకాంక్షలను పోరాటాలను అద్దం పట్టి
చూపింది. క్రమంగా, సాహిత్యం వర్గ పోరాటానికి ఒక ఆయుధంగా
రూపుదిద్దుకుంది. భూస్వామ్య వ్యవస్థను, పెట్టుబడిదారీ
విధానాన్ని, కుల వ్యవస్థను విమర్శిస్తూనే, సామాజిక చైతన్యాన్ని నిరంతరం పునర్నిర్మించింది.
క్రమమైన మార్పును ఆకాంక్షించిన అరసం, సాహిత్యంలోకి సాంఘిక చైతన్యాన్ని ప్రవేశపెట్టి పునాది
వేసింది. మానసిక లోతులను అన్వేషించిన దిగంబర కవులు, అస్తిత్వవాద,
ఆధునికవాద ఇతివృత్తాల వైపు ఒక మేధోపరమైన మార్పుకు ప్రాతినిధ్యం వహించారు.
వ్యవస్థాగత విప్లవాన్ని లక్ష్యంగా పెట్టుకున్న విరసం, సాహిత్యాన్ని
ఒక విప్లవ సాధనంగా మార్చింది. ప్రతి ఉద్యమం దాని కాలంలోని సామాజిక-రాజకీయ
వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, సంస్కరణవాదం నుండి తీవ్రవాద
భావజాలాల వైపు ఒక ప్రగతిని సూచించింది. ఇవన్నీ కలిసి ఆధునిక తెలుగు సాహిత్య
ప్రస్థానంలోని ఒక సుసంపన్నమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి.
ఈ నేపథ్యంలో, అరసం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల రచయితల
విస్తృత భాగస్వామ్యంతో తన 20వ రాష్ట్ర స్థాయి సమావేశాలను
నిర్వహించింది. మీడియా నివేదికల ప్రకారం, ప్రముఖ
సాహిత్యవేత్తలతో కూడిన కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రగతిశీల
బృందాలు అంతర్గత విభేదాలు అధిగమించి, జాతీయ, సామాజిక
సమస్యలపై ఏకం కావాలని గట్టిగా విజ్ఞప్తి చేశారు. సాహిత్యం ద్వారా సాంఘిక
సంస్కరణ, ప్రజలను ఏకం చేయడంలో సాహిత్యానికి ఉన్న అద్వితీయ
శక్తి, ప్రజాస్వామ్య రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో
సాహిత్య సంస్థల ఆవశ్యకత అనేవి ప్రధాన ఇతివృత్తాలు.
మానవ బాధలు, నైతిక బాధ్యత, రాజ్యాంగ నైతికత, సామాజిక
పరివర్తనలతో ముడిపడి ఉన్నప్పుడే సృజనాత్మక వ్యక్తీకరణకు శాశ్వతమైన ప్రాసంగికత
లభిస్తుందని సమకాలీన తెలుగు మేధో చరిత్ర నిరూపిస్తుంది. ప్రతి దశ తనదైన ప్రత్యేక
సహకారాన్ని అందించింది. సైద్ధాంతిక విభేదాలు సామూహిక గమనాన్ని బలహీనపరిచినప్పటికీ,
ఈ ఉద్యమాల బృహత్తర కృషి సుస్పష్టంగా నిలుస్తుంది. అవి చర్చను ప్రజాస్వామ్యీకరించాయి, భాగస్వామ్యాన్ని
విస్తరించాయి, కుల, వర్గ శ్రేణులను
సవాలు చేశాయి, నిరంకుశ ధోరణులను ప్రశ్నించాయి.
సాహిత్యాన్ని ఒక ఏకాంత విద్యా
కార్యకలాపంగా కాకుండా ఒక సజీవ ప్రజాశక్తిగా స్థాపించాయి. అంతిమంగా, తెలుగు సాహిత్య క్రియాశీలత చైతన్యం
కేవలం వాక్చాతుర్యం పైనే కాకుండా, అది సానుభూతితో, సమ్మిళితంగా, స్వీయ-విమర్శనాత్మకంగా, భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండే దాని సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.
అందువల్ల, ‘అరసం’ ప్రాముఖ్యత
శాశ్వతంగా వివాదరహితంగా నిలిచి ఉంటుంది.
(My ‘The Telugu Literary Journey has incessantly reinvented
itself’ ఆంగ్ల వ్యాసానికి ప్రజాతంత్ర
పత్రిక వారు సుహృద్భావంతో చేసిన చక్కటి, స్వేచ్చానువాదం. సంపాదకుడు అజయ్
కు అనువాదకులకు హృదయపూర్వక ధన్యవాదాలు)


రామాయణం ఆంగ్లము లో వ్రాసిన మీరే అరసం విరసం పేరిట ఈ ఊకదంపుడు వ్యాసం వ్రాయడం ఏమిటి ?
ReplyDeleteరామ చరితము వ్రాసిన మీరు
వర వర ను పొగడుట ఏమి విచిత్రము ?
విధి వైపరీత్యము.