Sunday, January 2, 2022

కామధేనువును బలాత్కరించి ఎత్తుకునిపోతున్న విశ్వామిత్రుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-89 : వనం జ్వాలా నరసింహారావు

 కామధేనువును బలాత్కరించి ఎత్తుకునిపోతున్న విశ్వామిత్రుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-89

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (03-01-2022)

"వశిష్ఠుడలా కామధేనువును ఇవ్వనని చెప్పగానే, విశ్వామిత్రుడు బలవంతంగా దానిని తీసుకొని పోసాగాడు. అప్పుడా శబల మిక్కిలి విషాదంతో, తనేం తప్పుచేసానని, ఎందుకీ మునీశ్వరుడు తననీవిధంగా వదిలిపెడుతున్నాడని, దుఃఖపడుతూ అనుకుంటుంది. తను ఏడుస్తున్నా వదలకుండా ఈడ్చుకొనిపోతున్న భటుల కట్లు తెంచుకొని, తన్నీడుస్తున్నవారిని నేలపై పడవేసి-తన్ని, మునీశ్వరుడి వద్దకు పోతుంది. కళ్లలో నీళ్లు కారుతుంటే, ఎంతో బాధతో, గోలుగోలున ఏడుస్తూ, దేవ దుందుభిలాంటి ధ్వనితో, ’బ్రహ్మ కుమారా, ఆపదలో వున్నవారిని రక్షించే నువ్వు నన్నొదిలిపెట్టడానికి నేనేం తప్పు చేసాను? నీ దగ్గర వుండనివ్వకుండా రాజభటులు నన్ను ఈడ్చుకుపోతున్నారే?’ అని వశిష్టుడిని దుఃఖాతిశయంతో పరితపిస్తూ-వాడిపోయిన ముఖంతో తోడ పుట్టిన దానిలాగా అడుగుతుంది శబల”.

 ఆవిధంగా ప్రార్థించిన కామధేనువుతో, తాను బుద్ధిపూర్వకంగా దాన్ని వదిలిపెట్టలేదని, మోహంతో కళ్లు కనిపించక న్యాయంతప్పిన రాజు బలాత్కారంగా తీసుకొనిపోతున్నాడని,భూమికంతా ప్రభువు, దేహబలం, సేనాబలం, అస్త్రబలంకల వీరుడైన విశ్వామిత్రుడితో బలహీన బ్రాహ్మణుడినైన తాను ఆపలేక పోయానని అంటాడు వశిష్ఠుడు.విశ్వామిత్రుడికున్న రథాలు,గుర్రాలు, ఏనుగులు, అక్షౌణి సేన గురించి చెప్పిన వశిష్ఠుడితో,క్షత్రియ బలమొక బలమేకాదని,బ్రాహ్మణబలం లెక్కలేని మహిమగలదని,రాజెంత బలవంతుడైనా వశిష్ఠుడికంటే గొప్పవాడుకాదనీ,తనకాజ్ఞ ఇస్తే రాజు సేనంతా నాశనంచేస్తాననీ కామధేనువైన శబల అంటుంది. బలమే న్యాయమని దుష్టబుద్ధితో అనుకుంటున్న విశ్వామిత్రుడిని,బలహీనుడిగా,వశిష్ఠుడి మంత్రబలంతో బలంపొందిన తానుచేస్తానని,ఆజ్ఞ ఇవ్వమని అడుగుతుంది.ఆలా ప్రార్థించిన శబలను, శత్రువులు నివ్వెరపోయే ట్లు-వారి రూపం చెడిపోయే ట్లు చేయగల, అనేకమంది శూరులను సృష్టించమని ఆదేశించాడు వశిష్ఠుడు".

విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేసిన కామధేను కల్పిత సేన

"వశిష్ఠుడి ఆజ్ఞలభించగానే,శత్రు సమూహాలకు భయంకలిగించే పప్లవులనే శూరులను తన హుంభారవంతో శబల. కామధేను కల్పిత శూరులు విశ్వామిత్రుడి సైన్యాన్నంతా రూపుమాపి విజృంభించారు. అది చూసిన పరాక్రమవంతుడైన విశ్వామిత్రుడు, కోపంతో కళ్లెర్రచేసి, భయంకర బాణాలతో పప్లవ శూరులను చంపి నిస్సారంగా భూమ్మీద పడేటట్లు చేశాడు. విశ్వామిత్రుడిపై పగబట్టిన ఆవు, బట్టిసాలు ధరించి యుద్ధం చేయగల యవనశక సేనల గుంపులను అపారంగా సృష్టించింది. ఆ యవనులు-శకులు, కార్చిచ్చు అడవిలో పడ్డట్లు, రాజు సైన్యం మీదపడి దహిస్తుంటే, వాళ్లందరినీ విశ్వామిత్రుడు తన అస్త్రాలతో పీనుగుపెంటల్లా చేసాడు".

వశిష్ఠ విశ్వామిత్రుల యుద్ధం

         "విశ్వామిత్రుడి భయంకరమైన శస్త్రాస్త్రాలతో కాలిపోయిన తన సైన్యాన్ని చూసిన వశిష్ఠుడు, యోగ బలాన్ని ఆశ్రయించి శీఘ్రంగా శత్రు సేనలను సంహరించమని శబలను ఆజ్ఞాపించాడు. వెంటనే హుంకరించిన కామధేనువు తన పొదుగులోంచి కాంభోజ సేనలను, యోనినుండి పప్లవ సమూహాలను, పేడ పుట్టే ప్రదేశంనుండి యవనులను, రోమ కూపాల (వెంట్రుక గూళ్లు) నుండి శకులను, మ్లేచ్ఛులను, కిరాతులను సృజించింది. వారందరు శత్రు సేనలపై పడి, వారి రథాలను-ఏనుగులను-గుర్రాలను-సైన్యాన్ని నాశనం చేసారు. అది చూసిన విశ్వామిత్రుడి నూర్గురు కొడుకులు, మితిమీరిన కోపంతో, ఒకేసారి వశిష్ఠుడిమీదకు దూసుకొచ్చారు. ఆయన వెంటనే హుంకరించి నిమిషంలో వంద మందినీ బూడిద రాసులుగా చేశాడు. తన నూర్గురు కొడుకులు ఒకేసారి మరణించడంతో-సైన్యమంతా నుగ్గుకావడంతో, సిగ్గుతో కుమిలిపోయిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడిని గెలిచేదెలానని మధన పడి, విషాదంతో భూమిపై వాలాడు. వేగంలేని సముద్రంలా, కోరలు పీకిన సర్పంలా, గ్రహణం నాటి సూర్యుడిలా, రెక్కలూడిన పక్షిలా కాంతీహీనుడై-గర్వభంగమై, ఎలాగైనా వశిష్ఠుడిని జయించాలన్న పట్టుదలతో, రాజ్యభారాన్ని కొడుకుకప్పగించి, వీరుడైన విశ్వామిత్రుడు హిమవత్పర్వతానికి పోయి, శివుడికొరకు తపస్సు చేశాడు”.

శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాల్నో కోరుకొమ్మన్నాడు. భక్తజనుల సంకటాలను హరించేవాడని, పార్వతీ ప్రియుడని, కఠినాత్ములైన రాక్షసులను సంహరించేవాడని, హరా-త్రిపుర సంహారా అని, మన్మథుడి గర్వం హరించినవాడని, దేవతల పూజలందుకునే చరణాలుగలవాడని శివుడిని స్తోత్రం చేసి, నమస్కరించి, విలువిద్యనంతా అంగాలతో-ఉపాంగాలతో-మంత్రాలతో-వాటి రహస్యాలన్నిటితో తనకు ఉపదేశించమని చేతులు జోడించి ప్రార్థించాడు విశ్వామిత్రుడు. రాక్షసుల వద్ద, మునుల వద్ద, గంధర్వుల వద్ద, యక్షుల వద్ద, దేవతల వద్ద వున్న అస్త్రవిద్యలన్నీ తనకుపదేశించమని కోరాడు. ఆయన కోరినట్లే శివుడు ఉపదేశించి పోయాడు. అస్త్రాలన్నీ తన స్వాధీనంలోకి వచ్చాయన్న ధైర్యంతో-గర్వంతో విశ్వామిత్రుడు పున్నమినాటి సముద్రిడిలా పొంగిపోతూ, దూరపుటడుగులు వేసుకుంటూ, వశిష్ఠుడున్న ఆశ్రమానికి వచ్చాడు"

         "సకల శత్రువులను జయించిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడి తపోవనమంతా, స్వల్ప వ్యవధిలో, బలిష్టమైన తన దివ్యాస్త్రాల జ్వాలల్లో కాల్చి బూడిద చేశాడు. అది సహించలేని అక్కడి మునులందరు, నలు దిక్కులా పరుగెత్తారు. పక్షులన్నీ ఆకాశానికి ఎగిరిపోయాయి. శిష్యులు భయంతో వణికిపోయారు. రెప్పపాటులో ఆ వనమంతా అలా కావడంతో కోపగించిన వశిష్ఠుడు, సూర్యుడు మంచును కరిగించినట్లు, అవలీలగా విశ్వామిత్రుడిని రూపుమాపుతాననీ, ఎవరూ పోవద్దనీ అన్నా, ఆగకుండా వారంతా పరుగెత్తారు. ఎవరుకూడా అక్కడ నిలవకుండా పారిపోతుండడంతో, రోషావేశంతో కనుబొమలదురుతుంటే, విశ్వామిత్రుడిని మందలించాడు వశిష్ఠుడు. ఆతడి విజృంభణాన్ని ఆపలేనివాడిననుకొని, చిరకాలంనుండి పెంచుకుంటున్న తన తపోవనాన్నంతా కాల్చివేసిన చెడుబుద్ధిగల విశ్వామిత్రుడిని ఇక సహించలేనని అంటూ, సాధ్యంకాని తేజస్సుతో అతన్ని తేరిపార చూశాడు వశిష్ఠుడు. ఇంత చెప్పినా విశ్వామిత్రుడు వినిపించుకోకుండా, అస్త్రం వెంట అస్త్రాన్ని ప్రయోగిస్తుండడంతో, వశిష్ఠుడు తనదగ్గరున్న రెండవ యమదండంలాంటి-కాలాగ్ని జ్వాలలను చిమ్మే ప్రకాశవంతమైన బ్రహ్మ దండాన్ని చేతిలో పట్టుకొని మాట్లాడకుండా నిలబడ్డాడు”.

No comments:

Post a Comment