Sunday, April 10, 2022

పరశురాముడిని శాంతించమని ప్రార్థించిన దశరథుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-103 : వనం జ్వాలా నరసింహారావు

 పరశురాముడిని శాంతించమని ప్రార్థించిన దశరథుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-103

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (11-04-2022)

         "రామా, దశరథ రామా! అద్భుతమైన నీ గొప్పబలాన్ని గురించి విన్నాను. నువ్వు శివుడి ధనుస్సును విరచడం గురించి కూడా లోకులందరు చెప్పుకుంటుంటే విన్నాను. శివుడి విల్లు విరచడం ఆశ్చర్యకరమైన విషయమే. ఇంత గొప్పదని చెప్పలేందది. ఇదివిన్న నేను, ఆ విల్లుకంటే గొప్పదైన మరోదాన్ని, నీ బలం పరీక్షించేందుకు తీసుకొచ్చాను. ఇదిగో-ఇదే పరశురాముడి విల్లు. దీన్ని చూస్తుంటేనే గుండెలు ఝల్లుమంటాయి. దీన్ని నువ్వు ఎక్కుపెట్టి, భయపడకుండా, నీబలమెంతో-వీర్యమెంతో చూపించు. ఈ విల్లు నువ్వు ఎక్కుబెట్టితే, నీ పరాక్రమం ఎంతో చూసి, నీతో ద్వంద్వ యుద్ధంచేస్తాను" అని శ్రీరాముడితో అంటాడు పరశురాముడు.

         పరశురాముడి మాటలు విన్న దశరథుడు, వెలవెలబోయిన ముఖంతో-దీనంగా, కాళ్లల్లో వణుకుపుట్తుంటే, మాటలు తడబడుతుంటే పరశురాముడిని ప్రార్థించాడీవిధంగా: "అయ్యా, మహాత్మా. నువ్వు జాతిబ్రాహ్మణుడివి. రాచజాతిమీద కోపం మాని శాంతించావు. అస్త్రం పట్టనని ఇంద్రుడికి మాటిచ్చావు. ఇప్పుడిలా అనడం న్యాయమేనా? ఈ నా కొడుకులు బాలులు. ఇంకా ఆటలాడడంలోనే ఆసక్తిగలవారు. ఏదో పిల్లతనంతో శివుడి విల్లు విరిచాడు. నువ్వా తప్పును క్షమించు. భృగువంశంలో పుట్టి, వేదాధ్యయన వ్రతంబూని, శీలంగలిగిన నీలాంటివారు శాంతం వహించాలి గాని కోపబడవచ్చా? భూమంతా కశ్యప మహర్షికి ధర్మ మార్గంలో దానం చేసి, ఈ దేశంలోనే వుండకుండా, మహేంద్ర పర్వతాన్ని నివాసంగా చేసుకొని వుంటున్న నీవు కోపించవచ్చా? ఓ మునీశ్వరా, నా గొప్ప పురుషార్థాలన్నీ నాశనం చేయడానికి వచ్చావా? రామచంద్రుడిని ఒక్కడిని చంపితే, మేమందరం అతడితో పోవాల్సినవాళ్లమే". ఇలా అంటున్న దశరథుడి మాటలు వినిపించుకోకుండా-పెడచెవిన పెట్టిన పరశురాముడు, శ్రీరామచంద్రమూర్తికి ధనుస్సుల వృత్తాంతాన్ని చెప్పసాగాడు.

శైవ వైష్ణవ ధనుస్సుల వృత్తాంతం

         "నీవు విరిచిన విల్లు, ఇప్పుడు నాచేతిలో వున్న విల్లు-రెండు కూడా- మిక్కిలి బలిష్ఠమైనవి. దేవతలు చెప్పి చేయించినవి. మిగుల శ్రేష్ఠమైనవి. మిక్కిలి దృఢమైనవి. గొప్ప ప్రయత్నంతో విశ్వకర్మ వీటిని తయారుచేశాడు. అందులో ఒకదాన్ని, త్రిపుర సంహార సమయంలో శివుడికి దేవతలిచ్చారు. నువ్వు విరిచింది దాన్నే. ఇది రెండోది. దీన్ని దేవతలు విష్ణువుకిచ్చారు. ఇదీ మిక్కిలి బలిష్ఠమైనదే. బలంలో శైవచాపంతో సమానమైంది. ఇలా కొంతకాలం జరిగింతర్వాత దేవతలు బ్రహ్మ దగ్గరకు పోయి, శివకేశవులలో ఎవరు బలవంతులని ప్రశ్నించారు. వారి అభిప్రాయం తెలుసుకున్న బ్రహ్మ, క్రియా రూపంలో వారి సందేహం తీరుస్తానని చెప్పి, శివుడికి, విష్ణువుకు విరోధం కలిగించాడు. శివుడు దగ్గరకు పోయి, త్రిపురాలను నాశనం చేసిందెవరని అడిగాడు బ్రహ్మ. తానేనని జవాబిచ్చిన శివుడితో, చేతగాని ప్రగల్భాలు పలకొద్దని, విష్ణువు బాణమై పోయినందున కదా త్రిపురాలను కాల్చిందని అంటాడు. ఆయన చేసిందేమీ లేదని-త్రిపురాలను కాల్చి బూడిద చేసింది తానేనని-శివుడు నిమిత్తమాత్రుడేనని విష్ణువంటున్నాడని రెచ్చగొట్టాడు శివుడిని బ్రహ్మ. కార్యం చేసేవాడిని కర్తని చెప్పాలా?-లేక-సాధనాన్ని చెప్పాలా? అని అడిగిన శివుడు, విష్ణువుకు ఆ శక్తి వుంటే తనకు బాణంగా ఎందుకు నిలిచాడు? అని, శివుడు ఎదురు ప్రశ్న వేశాడు బ్రహ్మను. శివుడన్న మాటలను విష్ణువుకు చెప్పి, పరస్పర ద్వేషం కలిగించి, ఇరువురినీ యుద్ధానికి సిద్ధంచేశాడు బ్రహ్మ. ఒకరిపై మరొకరు కోపించి, వారిద్దరూ భయంకరమైన యుద్ధంచేశారు. ఆ యుద్ధంలో శివుడికి నువ్వు విరిచిన వింటిని, విష్ణువుకు నాదగ్గరున్న వింటిని ఇచ్చారు దేవతలు. ఆయుధాలలో తేడాలుంటే, ఇరువురి బలాబలాలు నిర్ణయించడం సాధ్యంకాదని, సరిసమానమైన ధనుస్సులను ఇచ్చారిద్దరికి. ఇద్దరూ జయించాలనే యుద్ధంచేశారు. యుద్ధంలో విష్ణువు హుంకరించగానే, ఆగాలి దెబ్బకు, శివిడివిల్లు పెట్లిపోయింది. ముక్కంటి-మహా దేవుడైన శివుడు పౌరుషం చెడి స్తబ్దుడయ్యాడు. ఇదంతా చూస్తున్న దేవతలు-మునులు-చారణులు, వృథా కలహం మాని, హరిహరులిద్దరు యుద్ధం ఆపు చేయమని ప్రార్థించారు. వారుకూడా శాంతించారు. విష్ణువు బల వేగంతో శివుడి విల్లు పెట్లిపోవడం చూసిన దేవతలు-మునులు, విష్ణువే శివుడికంటే బలవంతుడని తమ మనస్సులో అనుకున్నారు".

         "దేవతల అభిప్రాయాన్ని గ్రహించిన రుద్రుడు, ధనుస్సుపై కోపంతో, బాణాలతో సహా దాన్ని దేవరాతుడికిచ్చాడు. విష్ణువు ధరించిన వింటిని ఆయన, భృగువంశభవుడైన ఋచీకుడికిచ్చాడు. ఋచీకుడు తన కొడుకైన జమదగ్నికి ఇచ్చాడు. ఆ జమదగ్ని నా తండ్రి. జమదగ్ని శస్త్ర సన్యాసం తీసుకొని తపస్సు చేస్తున్నప్పుడు, గర్విష్ఠుడైన కార్త్యవీర్యార్జునుడు, నీచ బుద్ధితో, నా తండ్రిని చంపాడు. దారుణమైన పితృమరణవార్త విన్న నేను క్రూరుడనై, రాజులను పలుమార్లు వధించాను. రాజులందరినీ చంపి, యజ్ఞం చేసి, యజ్ఞాంతంలో భూమినంతా కశ్యపుడికి దానం చేసి, మహేంద్ర పర్వతం నా నివాసంగా చేసుకొని, తపస్సు చేసుకుంటూ సుఖంగా దేవతా సంఘసేవితుడనై వున్నాను. నువ్వు, నీ మహాబలంతో, శివుడి విల్లు విరిచావని విని పరుగెత్తుకుంటూ వచ్చాను. ఆ వైష్ణవ చాపం ఇదే. నువ్వు క్షత్రియ వంశంలో పుట్టినవాడివైతే, నీ తండ్రి-తాతల క్షాత్రం స్మరించి, ఈ విల్లు ఎక్కుపెట్టి నీ భుజబలం చూపించు. నువ్వు విల్లెక్కుబెట్టి, బాణం సంధించగలిగితే, నీతో ద్వంద్వ యుద్ధం నేనొక్కడినే చేస్తాను. త్వరగా కానివ్వు" అని పరశురాముడన్న మాటలకు శ్రీరాముడు కోపించాడు.

పరశురాముడిని ధిక్కరించి నిస్తేజుడిని చేసిన శ్రీరాముడు

         పరశురాముడిలా మాట్లాడుతుంటే కోపం తెచ్చుకున్న శ్రీరామచంద్రమూర్తి, సమీపంలో తండ్రి వున్నాడన్న కారణంతో-పెద్దవారి ఎదుట గట్టిగా మాట్లాడకూడదన్న నీతిననుసరించి-ఆయనమీదున్న గౌరవంతో, మెల్లని స్వరంతో, "ఏమన్నావు పరశురామా? నీకథంతా విన్నాను. శూరుడు పగ తీర్చుకోవడం న్యాయమే కాబట్టి జనకుడి ఋణం తీర్చుకునేందుకు నీవు చేసిన పని సరైందనే అంగీకరిస్తున్నాను. అంతవరకు బాగానే వుంది. కాకపోతే నేను దుర్బలుడని తలుస్తున్నావు నువ్వు. క్షాత్రధర్మంలో నేను తక్కువన్నట్లుగా నువ్వన్నమాటలను సహించను. నా తేజస్సు నువ్వు తెలుసుకోలేక పోతున్నావు. నా బలాధిక్యాన్ని చూపిస్తాను-చూడు" అని అంటూ, పరశురాముడి చేతిలోని భయంకరమైన వింటిని లాక్కున్నాడు. దాన్ని లాగి, ఎక్కుపెట్టిన బలశాలి రామచంద్రమూర్తి, ఒక బాణాన్ని సంధించి, కళ్లెర్రచేసి అమితమైన కోపంతో పరశురాముడిని చూసి "బ్రాహ్మణుడవైకూడా, శస్త్రాన్ని ధరించి వచ్చిన నిన్ను చంపవచ్చని శాస్త్రం అనుమతించినా, నీవు నా గురువైన విశ్వామిత్రుడి బంధువైనందున, నీమీద కోపంతో నీపై సంధించి-నిన్ను చంపగలిగిన ఈ బాణాన్ని నీమీద ప్రయోగించడానికి మనసొప్పుకోవడంలేదు. అందువల్ల, నువ్వింక ఎంతమాత్రం నడవ లేకుండా, ఒక దిక్కున పడే విధంగా నీ కాళ్ల గమనవేగాన్నిగానీ, నువ్వు తపస్సు చేసి సంపాదించిన పుణ్యలోకాలనుగానీ-ఏదికోరుకుంటే దాన్ని-ఈ బాణంతో ఖండిస్తాను. ఈ బాణం వృధాగా పోదు. ఇది విష్ణు సంబంధమైంది కనుక సంధించిన తర్వాత వ్యర్థంగా పోదు. సార్థకంగా లక్ష్యాన్ని భేదించిన తర్వాతే శాంతిస్తుంది. దీనిని ఖండించాలో చెప్పు" అంటాడు.

         దశరథరాముడిలా పరశురాముడిని భయపడేటట్లు మాట్లాడడం చూసిన దేవతలు-మునులు ఆకాశంలో గుంపులుగా చేరి అద్భుతమని అన్నారు. భయంకరాకారుడైన వీరుడు-రాముడిని, తీక్షణమైన బాణాలను ధరించినవాడిని చూసేందుకు బ్రహ్మ, చారణ-కిన్నెర సమూహంతో అక్కడకు చేరుకున్నాడు. భయంకరమైన రామబాణ వేగాన్ని చూసి, జగమంతా మొద్దుబారిపోయింది. పరశురాముడు జడపదార్థమై-వీర్య విహీనుడై-బొమ్మలాగా శ్రీరామచంద్రమూర్తిని చూడసాగాడు. శ్రీరామచంద్రుడి తేజంతో, పరాక్రమం నశించి-బలం పోయి-జడుడైన పరశురాముడు, మునుపటిలా కాకుండా-గౌరవంతో మెల్లగా ఇలా అన్నాడు రాముడితో.

తన పుణ్యలోకాల మీద అస్త్రం వేయమని శ్రీరాముడిని ప్రార్థించిన పరశురాముడు

         "పుండరీకాక్షా, భూమినంతా కశ్యపుడికి దానంగా ఇచ్చాను. తనకిచ్చిన భూమిలో నేనుంటే, దానమిచ్చిన దానిని అనుభవించినట్లవుతుందని-వుండొద్దని ఆయన ఆజ్ఞాపించడంతో, పగలంతా తిరిగినా రాత్రివేళల్లో ఇక్కడుండకుండా వెళ్లిపోతుంటాను. మహానుభావా, నా నడకను నరకొద్దు. మనోవేగంతో పోయి మహేంద్ర పర్వతాన్ని చేరుకుంటాను. నా తపస్సుతో నేను సంపాదించుకున్న పుణ్య లోకాలను నీ బాణంతో ధ్వంసం చేయి. ఆ పుణ్యలోకాల అనుభవం నాకు లేకుండా చేయి. అజ్ఞానంతో తప్పుచేసాను. తెలివిలేక, నీవు రాజమాత్రుడవని అన్నానుగాని, నీవంతకంటే చాలా గొప్పవాడివి. నీ సత్తా తెలుసుకోలేక, అందరి లాగే నేను కూడా నిన్ను రాజమాత్రుడవనుకున్నాను. ఎప్పుడైతే నువ్వు నా చేతిలో వున్న విల్లు లాక్కొని బాణం సంధించావో, అప్పుడే, ఇతరులకెవరికీ సాధ్యంకాని పని నువ్వు చేసావనుకున్నాను. కాబట్టి నువ్వు నిర్వికారుడవు-అపరాజితుడవు, మధు వైరివైన శ్రీమన్నారాయణుడివి అని తెలుసుకున్నాను. నేను తెలివి మరిచి అపరాధం చేసాను. క్షమించు. నీకు శుభం జరగాలి. నీ ప్రతాపాన్ని దేవతలందరు చూసారు. నాకింతవరకు పరాభవమంటే ఏంటో తెలియదు. నా జన్మలో మొదటిసారి రాచబాలుడవైన నీచేతిలో ఓడిపోయానని బాధపడడంలేదు. అవమానంగా భావించడంలేదు. ఎందుకంటే, నువ్వు ముల్లోకాలను పాలించే ముఖ్యదేవుడివి. మనోహరమైన దయతో, హృదయ సమ్మతమైన దశరథ రామా, అసమానమైన వ్యర్థంగాని నీ బాణాన్ని విడువు. నా కీర్తి నాశనం కావడం-గతులు తప్పడం కళ్లారా చూసి, సమయం దాటకుండా మహేంద్ర పర్వతానికి పోతాను". పరశురాముడిలా చెప్పగానే, రామచంద్రమూర్తి బాణాన్ని విడవడంతో, తన పుణ్య గతులన్నీ దగ్దమై పోవడం చూసి, ఆయనకు ప్రదక్షిణ చేసి మహేంద్ర పర్వతానికి పోయాడు. పరశురాముడు పోగానే, కమ్ముకున్న చీకట్లు మాయమైనాయి. పరిమాణం చెప్పనలవికాని బలంగల శ్రీరాముడిని దేవతలు శ్లాఘించారు. సైనికులందరికీ తెలివొచ్చింది.

(పరమార్థ జ్ఞానం దేవతలు క్రియా రూపంగా తెలిపేందుకు బ్రహ్మ శివకేశవుల మధ్య పరస్పర ద్వేషం కలిగించి యుద్ధం చేయించాడు. ఒకరు చూసి చెప్పినదానిలా కాకుండా, కళ్లార చూసి, ఎవరెక్కువ బలవంతులో దేవతలు స్వయంగా తెలుసుకున్నారు. ఈ వాస్తవాన్ని తెలుసుకోకుండా, విష్ణువు ఎక్కువా-శివుడెక్కువా అని, తత్పక్షపాతులు విరివిగా గ్రంథాలు రాసారు. శివ కేశవులకు భేదం లేదని పురాణాలు ఘోషించాయి. భగవంతుడు-జనార్ధనుడు ఒకడే. సృష్టి-స్థితి-నాశనం చేసేందుకు బ్రహ్మని, విష్ణువని, శివుడని పేర్లు పెట్టుకున్నాడు. విష్ణువు అధికుడని దేవతలు గ్రహించారని పరశురాముడు శ్రీరాముడికి చెప్పాడు. వింటిని లాక్కుంటూ పరశురాముడిలో వున్న వైష్ణవ తేజస్సును కూడా శ్రీరామచంద్రమూర్తి లాక్కున్నాడని అర్థంచేసుకోవాలి. పరశురామావతారం ఆవేశావతారం. కార్యార్థమై, జీవుడిలో తత్కాలంవరకు, భగవంతుడి తేజస్సు ఆవహిస్తే అది ఆవేశావతారమవుతుంది. ఇక్కడ దేహం ప్రాకృతం. జీవుడు బద్ధుడు. ఇలాంటి ప్రకృతి సంబంధమైన అవతారాలు పూజ్యమైనవికావు-మోక్షమిచ్చేవీ కావు. శ్రీరామావతారం పూర్ణావతారం. ఈ రెండు అవతారాలు కలిస్తే, తక్కువ తేజస్సు, ఎక్కువ తేజస్సులో కలిసిపోతుంది. పరశురాముడిలోని వైష్ణవ తేజం బయటికొచ్చి దేవతలందరు చూస్తుండగా శ్రీరాముడిలో ప్రవేశించింది).

No comments:

Post a Comment