Tuesday, April 26, 2022

రాజనీతిజ్ఞతే అభివృద్ధికి ఆలంబన : వనం జ్వాలా నరసింహారావు

 రాజనీతిజ్ఞతే అభివృద్ధికి ఆలంబన  

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (27-04-2022)

         రెండు దశాబ్దాలకు పైగా జైత్రయాత్ర సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి మరోమారు ప్లీనరీ ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు, పార్టీకి అద్భుతమైన నాయకత్వాన్ని అందించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, రాష్ట్ర శాసనసభకు రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికలలో పార్టీకి అఖండ విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని స్థాపించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన రాజనీతిజ్ఞుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, సమకాలీన రాజకీయ నాయకులలలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న థీశాలి అని నిర్వచించడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదనాలి. ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన నాటినుండి అధికారంలో వున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేయలేని, చేతకాని అభివృద్ధిని, అమలుపర్చలేని సంక్షేమ పథకాలను, తన ఎనిమిది సంవత్సరాల  పాలనలో అలవోకగా చేసి చూపించి, ప్రజల మెప్పు పొందుతున్నారు తెరాస అధినేత చంద్రశేఖర్ రావు.

తన సారధ్యంలోని ప్రభుత్వం రూపకల్పన చేసి, కార్యాచరణ పథకం తయారుచేసి, చేపట్టి, విజయవంతంగా అమలుచేసిన పలు అభివృద్ధి-సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అనేక సందర్భాలలో ప్రజలకు గణాంకాలతో సహా సవివరంగా తెలియచేస్తున్నారు కేసీఆర్. కేసీఆర్ ప్రభుత్వ ప్రగతి  నివేదిక తెలంగాణ అబాలాగోపాలానికి ఆసాంతం తెలుసు. ఒక నాయకుడిగా, ఒక రాజనీతిజ్ఞుడిగా, ఒక వ్యూహకర్తగా, ఒక రాజకీయవేత్తగా, ఒక అభివృద్ధి-సంక్షేమ పథకాల రూపకర్తగా, ఒక దార్శనికుడిగా, ఒక యదార్థవాదిగా, ఒక మేథావిగా ప్రజల మనసు చూరగొన్నాడు. ఫలితంగా కేసీఆర్ అన్నిరంగాలలో అఖండ విజయాన్ని తన సొంతం చేసుకుంటున్నారు. రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆయన నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి మరోమారు (హాట్రిక్) బ్రహ్మాండమైన విజయాన్ని సాధించి, ప్రజలకు మరిన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు పరచడం తథ్యం. తెలంగాణ మోడల్ దేశమంతా ఎప్పుడో ఒకప్పుడు అనుసరించడం కూడా తథ్యం.  

         వాస్తవానికి, అందుబాటులో వున్న, పదిమంది అంగీకరించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు, వర్తమాన-భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, అందునా ఒక క్రమ పద్ధతిలో వాటిని అన్వయించుకుంటూ, వారి సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడే పథకాల రూపకల్పన-అమలు జరుగుతేనే అది అసలు-సిసలైన అభివృద్ధి అనడానికి వీలవుతుంది. ప్రజల మనసులు చూరగోనడానికి వీలవుతుంది. అదే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్ నెలనుండి. అదే భవిష్యత్ లొ కొనసాగనుంది. కేసీఆర వ్యూహం, ఆలోచన కార్యరూపం దాలిస్తే దేశమంతా ఆయన ఆశించిన ప్రత్యామ్నాయ నాయకత్వంలో అమలు కావడం కూడా అతత్యం.

అమలు చేయడానికి అలవికాని వాగ్దానాలు చేసుకుంటూ, సైద్ధాంతిక భావజాలాన్ని ప్రదర్శించుకుంటూ, "ప్రాక్టికల్" అవగాహనతో కాకుండా "థియరీ" తో సరిపుచ్చుకుంటూ కాలం వెళ్లబుచ్చడం అభివృద్ధిని సాధించడం అనరు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏం చెయ్యాలనేది ఆలోచన చేసి, దానికి అవసరమైన ప్రణాళికను రూపొందించి, అమలుకు పటిష్ఠమైన కార్యాచరణ పథకాన్ని తయారుచేసి, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేస్తేనే అభివృద్ధి సాధ్యమౌతుంది. దీనికి పర్యాయ పదం కేసీఆర్.

ఈ మొత్తం ప్రక్రియలో, ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సాంప్రదాయక, సహజసిద్ధమైన అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. సరిగ్గా ఇదే జరిగింది కేసీఆర్ అధికారంలో వున్న ఎనిమిది సంవత్సరాల  కాలంలో. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో-ఎన్నెన్నో అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు, అమలుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇలా జరగడానికి అన్నింటికన్నా ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజనీతిజ్ఞత, దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు, నిబద్ధత, ప్రతి అంశాన్నీ పదిమందితో కలిసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే విధానం, దేన్నైనా ఒకటికి పది సార్లు సమీక్షించిన తదుపరే నిర్ణయం చేసే సుగుణం...ఇలా మరెన్నో. వీటన్నిటి ఫలితమే అనేక పథకాల రూపకల్పన-అమలు. అభివృద్ధిని, విజయాన్ని సాధించాలంటే అన్నింటికన్నా ముఖ్యం లీడర్షిప్ లేదా పటిష్టమైన నాయకత్వం.

విశ్వవిఖ్యాత మేనేజ్‌మెంట్ రంగ నిపుణుడు జిమ్ కాలిన్స్, రాసిన "గుడ్ టు గ్రేట్" పుస్తకంలో  లీడర్షిప్ లక్షణాలను, లీడర్ నాయకత్వంలో నడుస్తున్న సంస్థ బలోపేతానికి అనుసరించాల్సిన పద్ధతులను, మేనేజర్ కు లీడర్ కు, అందునా ఉన్నత స్థాయి లీడర్ కు వుండే వ్యత్యాసాన్ని వివరిస్తాడు. ఆయన తన సిద్ధాంతంలో "గుడ్", "గ్రేట్" అనేవి, ఒకదానికి మరొక టి బద్ధ శతృవులని,  ఒక సంస్థను, వ్యవస్థను "సముచిత స్థాయి నుంచి సమున్నత స్థాయికి" తీసుకెళ్లడానికి కావలసిందల్లా ఐదో స్థాయి నాయకత్వమని, అది అందరికీ సాధ్యమయ్యేది కాదని సోదాహరణంగా వివరిస్తాడు. లీడర్ అనే వాడు మొదలు తనకు కావాల్సిన వ్యక్తులను ఎంపిక చేసుకుంటాడని, వారిలో ఎవరు-ఏమిటి అన్న ఆలోచన చేసి ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పాలో నిర్ణయిస్తాడని, నగ్న సత్యాల లాంటి పాశవిక వాస్తవాలను ధైర్యంగా విశ్లేషణ చేసుకుంటూ ఆ వాస్తవాలను వున్నదున్నట్లు పది మందికి తెలియచేస్తాడని, అర్హత-యోగ్యతల ప్రకంపనలను అధిగమించడమనే హెడ్గెహాగ్ సిద్ధాంతాన్ని తుచ తప్పకుండా పాటిస్తాడని, నిరంతరం సత్ఫలితాల సాధనకు క్రమశిక్షణతో కూడిన విధానాన్ని, సంస్కృతిని అలవరచుకుంటాడని, సాంకేతిక వేగ సాధనాలను సక్రమంగా ఉపయోగించుకుంటాడని, ఇవన్నీ చేసేవాడు ఐదో స్థాయి (అత్యున్నత స్థాయి) నాయకుడనిపించుకుంటాడని జిమ్ కాలిన్స్ అంటాడు. ఇవన్నీ కేసీఆర్ లో కనిపిస్తాయి.

అరుదైన ఐదో స్థాయి (అత్యున్నత స్థాయి) నాయకత్వ లక్షణాలున్న వారు, ఆ స్థాయికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా అంచలంచలుగా ఎదుగుతారు. అలా ఎదిగే నేపధ్యంలో వివిధ రంగాలలో వారు పొందిన అనుభవం, వ్యక్తిగత క్రమశిక్షణ, జీవితంలో ఎదురైన ఆటుపోటులు, అనుభం నేర్పిన గుణపాఠాలు, సహచరుల తోడ్పాటు, ఇలా ఎన్నో వారిని ఆ స్థాయికి తీసుకెళ్తాయి. అందరికీ ఇలా ఎదగడం కుదరదు. అతికొద్ది మంది మాత్రమే ఆ స్థాయికి చేరుకో గలరు. మరో విధంగా అలా ఎదిగినవారు, ఆ ప్రక్రియలో వివిధ స్థాయిలలో నాయకత్వ-యాజమాన్య (మేనెజీరియల్) లక్షణాలెలా వుంటాయో అవగాహన చేసుకోవాలి.

వివరాల్లోకి పోతే: వ్యక్తిగత ప్రజ్ఞతో, తెలివి తేటలతో, నైపుణ్యంతో, మంచి అలవాట్లతో, ఫలవంతమైన తోడ్పాటును సంస్థకు అందించగల వారే మొదటి స్థాయి "స్వయం సాధకులు". ఇక రెండో స్థాయికి చెందిన వారు, నలుగురున్న బృందంలోని "భాగస్వామ్య సభ్యులు". వీరు సామూహిక లక్ష్యాలను అధిగమించడానికి తమ-తమ వ్యక్తి గత సమర్థతలను జోడించి, తోటి బృంద సభ్యులతో కలిసి-మెలిసి పనిచేయగల వారై వుంటారు. మూడో స్థాయికి చెందిన "మేనేజర్స్-కార్య నిర్వాహకులు", ముందస్తుగా నిర్దారించిన లక్ష్యాలను సమర్థవంతంగా-సార్థకంగా చేరుకునే ప్రయత్నంలో భాగంగా, అవసరమైన మానవ-మానవేతర వనరులను ఏర్పాటు చేసుకోగల నైపుణ్యం కల వ్యక్తులై వుంటారు. నాలుగవ స్థాయి "సార్థక నాయకులు", శ్రేష్టమైన కార్యసాధక ప్రమాణాలను పాటించేందుకు, పురికొల్పే ప్రయత్నం-పట్టుదలతో, నిబద్ధతను ప్రోత్సహించే తరహా వ్యక్తులై వుంటారు. వీరు తమ వ్యక్తిగత నమ్రత-అణకువలను-అనుభవాన్ని-నైపుణ్యాన్ని వృత్తి పరమైన కార్య సాధనతో రంగరించి, ఒక అసంభవమైన మిశ్రమంగా తయారుచేసి, తద్వారా శాశ్వతమైన గొప్పదనాన్ని-సమున్నత స్థాయి సంస్థను నిర్మించగల సామర్థ్యం గల వ్యక్తి అయి వుంటారు. ఇలా వున్న అంచెలంచల వ్యవస్థలోనే, "గుడ్ టు గ్రేట్" ఆచరణ సాధ్యమవుతుంది.

ఐదో స్థాయి కార్యనిర్వహణాధికారి నాయకత్వ తీరుతెన్నులను అర్థం చేసుకోగలగడం ఆ స్థాయి వారికే తప్ప ఇతరులకు అంత త్వరగా అర్థంకాదు. తన కార్య సాధనలో భాగంగా సముచిత స్థాయి నుంచి సమున్నత స్థితికి సంస్థ రూపాంతరీకరణ చేసే దిశగా పతాక స్థాయి ఫలితాలను సాదించగలడు ఆ నాయకుడు. ఎంత కష్టమైనా-ఎన్ని అవాంతరాలెదురైనా సడలించని సంకల్పం ప్రదర్శించి దీర్ఘకాలిక ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తాడు. శాశ్వత సమున్నత స్థితి సంస్థను నిర్మించేందుకు, తగిన ప్రమాణాలను నిర్ణయించగలడు. తన కృషి ప్రతిబింబిస్తోందా, లేదా అన్న అంశాన్ని స్వయంగా పరిశీలించేందుకు అద్దంలో దృష్టి సారిస్తాడు గాని నాలుగు గోడల అవతల వాటి మధ్య నున్న కిటికీ బయట తలపెట్టి చూడడు. అలా చూసి, నిస్సారమైన ఫలితాల బాధ్యతను ఇతరులపై మోపి, వాళ్లపై నింద వేయడు. తన దురదృష్టమనో-కారణాంతరాల వల్ల అనుకున్నది సాధించలేక పోయాననో, తప్పు తనది కాదనో అనడు. వినయ-విధేయతలతో కార్యోన్ముఖుడవుతాడే గాని, గొప్పలు చెప్పడం-ముఖ స్తుతి కోరుకోవడం చేయడు. పట్టుదలతో, హంగు-ఆర్భాటం లేకుండా నిర్ధారించిన ప్రమాణాల ఆధారంగా ముందుకు సాగుతాడు. తన లాంటి ఇతరులను తయారుచేసి, భవిష్యత్ లో, రాబోయే తరం వారిలో మరిన్ని విజయాలను సాధించేందుకు తగిన వారసులను సృష్టించగలడు.

         సంస్థలో పనిచేసే వారిలో తాను నిర్దేశించిన ప్రమాణాలను-సంస్థ లక్ష్యాలను చేరుకోలేని వ్యక్తులను "సంస్థ వాహనం" నుంచి తక్షణమే దింపగల నేర్పరితనముంటుంది వారికి. "గొప్ప దూరదృష్టికి గొప్ప మనుషులే కావాలి" అన్న సిద్ధాంతాన్ని పాటించుతారు వీరందరు. తన కింది వారు నిబద్ధతతో పనిచేయలేరని అనుమానం వచ్చిన వెంటనే, సరైన వ్యక్తులను వారి స్థానంలో నియమించడం వారిలోని నైపుణ్యం. అలా నియమించబడిన "సరైన వ్యక్తుల" తెలివితేటలు-నేర్పరి తనం కంటే, వారిలోని సామర్థ్యం-ప్రవర్తన-నడత, సంస్థ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాంటి వారి పనితనాన్ని నిరంతరం అజమాయిషీ చేయడం కంటే, వారికి సరైన మార్గదర్శకాలను సూచించితే సరిపోతుంది. వారిని ముందుకు దూసుకుని పొమ్మని బోధించితే చాలు. "సముచిత స్థితి నుంచి సమున్నత స్థితికి" నడిపించగల బృంద సభ్యులు జీవితాంతం స్నేహితులుగానే నిలిచిపోతారు. ఐదో స్థాయి కార్య నిర్వాహక నాయకుడు చేయాల్సిందల్లా అలాంటి వారిని వెతికి పట్టుకుని, సంస్థ వాహనం ఎక్కించి సత్ఫలితాలను సాధించడమే. అవసరం అనుకుంటే వాహనంలోంచి దింపడంలోనూ చాకచక్యం చూపడమే !

         "గుడ్ టు గ్రేట్" నాయకత్వ సిద్ధాంతం కేవలం ప్రయివేట్ సంస్థలకు మాత్రమే కాదు. ప్రభుత్వ నిర్వహణకు కూడా అన్వయించాలి. ప్రభుత్వంలో, రాజకీయాలలో ఐదో స్థాయి "కార్యనిర్వహణాధికారి" నాయకత్వమంటే, "రాజనీతిజ్ఞుడు" అని చెప్పకనే చెప్పొచ్చు. ఒకప్పుడు "పరిపాలన" గురించి విన్నాం. ఆ తరువాత కాలంలో "సుపరిపాలన" అనేది పాపులర్ అయింది. అంతకంటే మెరుగైన పాలన కోరుకుంటున్నారు ప్రజలు. “రాజనీతిజ్ఞతతో కూడిన సుపరిపాలన" కావాలంటున్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల వర్తమాన అవసరాలను మాత్రమే తీరుస్తే సరిపోదు. దీర్ఘకాలిక ప్రణాళికలు వేయాలి. భవిష్యత్ కు బంగారు బాటలు (బంగారు తెలంగాణ) వేయాలి. కేసీఆర్ ఎనిమిది సంవత్సరాల పాలనా కాలంలో ఈ రాష్ట్రంలో జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది, భవిష్యత్ లో జరగబోయేది అదే. రాష్ట్ర వ్యాప్తంగా రూపొందించి, అమలు చేస్తున్న పథకాలు సార్వజనీనమైన పథకాలే! పది కాలాల పాటు మనుగడ సాగించి ప్రజల అవసరాలను తీర్చే పథకాలే! ఈ పథకాలన్నీ ముఖ్య మంత్రి "రాజనీతిజ్ఞత" కు నిదర్శనాలే! జిమ్ కాలిన్స్ సిద్ధాంతంలోని సమున్నత స్థాయికి రాష్ట్రాన్ని తీసుకుని పోవడానికి వేస్తున్న బంగరు బాటలే! ఉదాహరణలు కోకొల్లలు.

         అభివృద్ధి అంటే ఇలా వుంటుంది అని ప్రజలు అనుకునేలా ప్రణాళికలు రూపొందించి అమలు పరిచింది, పరుస్తున్నది ఈ ప్రభుత్వం. అందుకే...ఇప్పుడున్నది కేవలం "పరిపాలనో", లేక "సుపరిపాలనో" కాదు, "పరిపాలనలో రాజనీతిజ్ఞత". అదే అభివృద్ధికి పునాది. అందుకే, ఇందుకే, రాజనీతిజ్ఞతకు పర్యాయపదం కేసీఆర్. ఈ నేపధ్యంలో ఒక్కసారి వర్తమాన దేశ రాజకీయాలను నిశితంగా విశ్లేషించి గమనిస్తే ప్రస్తుతం కావాల్సింది కేసీఆర్ లాంటి రాజనీతిజ్ఞత, వ్యూహాత్మక నాయకత్వమే. మార్పు కోరుకుంటున్న ప్రజలకు ఇప్పుడు జరుగుతున్న తెరాస ప్లీనరీలో ఆ దిశగా కేసీఆర్ సందేశం ఇస్తారని ఆశిద్దాం.

No comments:

Post a Comment