Sunday, June 30, 2024

శ్రీరాముని ధర్మబోధ : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరాముని ధర్మబోధ

వనం జ్వాలా నరసింహారావు

భక్తి పత్రిక (జూలై నెల, 2024)  

శ్రీరాముడు వనవాసానికి వెళ్లాడు. ఆ తరువాత భరతుడు వచ్చి ఆయనను తిరిగి రమ్మని బతిమాలాడాడు. శ్రీరాముడు అంగీకరించకపోవడం వల్ల ఆయన ప్రతినిధిగానే భరతుడు పాలన సాగించాడు. చిత్రకూట పర్వతంమీద తనను కలిసిన భరతుడికి శ్రీరాముడు అనేక రాజధర్మాలను బోధించాడు. శ్రీరాముడు వనవాసానికి వెళ్లిన ఆరవరోజు అర్థరాత్రి దశరథుడు ప్రాణాలు విడిచాడు. నలుగురు కుమారులలో ఎవరూ అందుబాటులో లేనందున, రాజు దేహాన్ని నూనె కాగులో వుంచి భద్రపరిచారు. రాజును నిర్ణయించే అధికారంకల గౌతముడు, ఏమి చేయాలన్న విషయంలో, మౌద్గల్యుడు, కాత్యాయనుడు, మార్కండేయుడు, జాబాలి, కాశ్యపుడు, వామదేవుడు, మంత్రులతో, వసిష్ట మహర్షితో ఆలోచనచేశారు. దూతలను పిలిచి మేనమామ వూరిలో వున్న భరతుడి దగ్గరకు పోయి ఆలశ్యం చేయకుండా వెంటబెట్టుకుని రమ్మని వశిష్టుడి మాటగా ఆజ్ఞాపించారు. అయోధ్యలో జరిగిన సంగతులను భరతుడికి తెలియచేయోద్దని దూతలకు చెప్పారు.

భరతుని భ్రాతృప్రేమ

ఏ రాత్రయితే దూతలు భరతుడున్న నగరం ప్రవేశిoచారో, అదే రోజు తెల్లవారు ఝామున భరతుడికి వచ్చిన ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కల ఫలితం దశరథుడో, రాముడో, లక్ష్మణుడో, తానో మరణించడమని అనుమానపడ్డాడు భరతుడు. రామాయణంలో దశరథ, భరత, త్రిజటల స్వప్నాలు అత్యద్భుతమైన ఘట్టాలు. మూడు కలలూ నిజమైనట్లు వాల్మీకి చెప్పడం విశేషం.

వసిష్ఠుడు తొందరగా రమ్మని పిలిచినప్పుడు దానికేదో కారణం వుండాలని భరతుడు అనుమానించాడు. మర్నాడే అయోధ్యకు ప్రయాణమై పోయాడు. అయోధ్యలో ప్రవేశిస్తూనే దాని రూపురేఖలు గమనించి కీడును శంకించాడు. తల్లి కైకేయి ఇంటికి పోయి, తండ్రి మరణం, దాని నేపధ్యం తెలుసుకుని, తండ్రిని, తండ్రితో సమానమైన శ్రీరామచంద్రమూర్తిని విడనాడిన ఐశ్వర్యం నాకెందుకు? రాజ్యం ఎందుకు? అని కైకను తూలనాడాడు. ‘నేను నీ ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తాను. ఆ శ్రీరాముడిని పట్టణానికి మరల వచ్చేట్లు చేస్తాను. ఆయన్నే రాజుగా చేసి స్థిరమైన అంతఃకరణతో ఆయనకు దాసుడనై, చత్రచామరాదుల సేవ చేస్తూ, ఆయనకు సంతోషం కలిగిస్తాను. ఇది నా స్వరూపస్వభావం. నా స్వరూపం వల్లే నేను ఆయనకు దాసుడిని’ అంటాడు. అదే విషయాన్ని పెత్తల్లి కౌసల్య దగ్గరికి, పినతల్లి సుమిత్ర దగ్గరికి పోయి చెప్పాడు.

         ఆతరువాత, ఆచార్యులు, ఋత్విక్కులు, పురోహితులు దశరథ మహారాజుకు అంత్యక్రియలు జరిపించారు. మౌని వశిష్ఠుడు సింహాసనానికి రాజును చేయడానికి అధికారం వున్న రాజకర్తలు, దశరథుడి (పరోక్ష) కోరిక మేరకు భరతుడిని రాజ్యపాలన చేయమని కోరారు. దానికి అంగీకరించని భరతుడు, శ్రీరాముడినే రాజును చేసి, ఆయన పక్షాన తానే అడవుల్లో పద్నాలుగేళ్లు వుంటానని చెప్పాడు. అరణ్యంలోనే శ్రీరాముడికి పట్టాభిషేకం చేసి అయోధ్యకు తీసుకువద్దామనీ, అంటూ అడవికి పోవడానికి ప్రయాణమయ్యాడు భరతుడు.


అడవిలో చిత్రకూటాన్ని, మందాకినీ నదిని గురించి సీతకు చెప్తున్న సమయంలో, దూరంనుండి వినవస్తున్న ధ్వనిని గమనించిన లక్ష్మణుడు పరుగుపరుగున వచ్చాడు. భరతుడు సైన్యంతో వస్తున్నాడని, అనుమానంగా చెప్పాడు. వెంటనే లక్ష్మణుడిని సరిదిద్దాడు శ్రీరాముడు. ఇంతలో రానేవచ్చిన భరతుడికి పర్ణశాలలో దర్భాసనం మీద కూర్చున్న శ్రీరాముడు కనిపించాడు. పరుగెత్తుకుంటూ ఆయన సమీపంలోకి పోయాడు భరతుడు. తనను చూడగానే దుఃఖిస్తున్న భరతశత్రుఘ్నులను ఓదార్చి, శ్రీరాముడు కుశల ప్రశ్నలు వేశాడు. తండ్రి చనిపోయిన వార్త భరతుడి ద్వారా విని ఎంతగానో దుఃఖించాడు. తండ్రికి పిండప్రదానం చేశాడు.   

ఆలోచన పంచుకోవాలి

ఆ తరువాత శ్రీరాముడిని అయోధ్యకు రమ్మని భరతుడు కోరాడు. రాముడు నిరాకరించాడు. ఇద్దరి మధ్యా వాదోపవాదాలు జరిగాయి. మధ్యలో రాజ ధర్మాన్ని వివరిస్తూ రాముడు భరతుడిని ప్రశ్నలు వేయడం జరిగింది. యజ్ఞయాగాలతో దేవతలను, శ్రాద్ధాదులతో పితృదేవతలను తృప్తి పరుస్తున్నావా అని, ప్రజల మాటలు అర్థం చేసుకుని వారిని సంతోషపరుస్తున్నావా అని, గురువులకు శుశ్రూష, పెద్దలకు నమస్కారాలు, విద్వాంసులకు, ఆయుర్వేదం తెలిసినవారికి, బ్రాహ్మణులతో సహా అవసరమైనవారికి  ధన సహాయం చేసి సంతోష పరుస్తున్నావా అని ప్రశ్నించాడు. మంత్రులందరూ శౌర్యవంతులు, నీతిశాస్త్రం చక్కగా చదివినవారే కదా?! బుద్ధిలో రాజుతో సమానమైనవారు, ఇంద్రియ నిగ్రహం వున్నవారే కదా అని అడిగాడు. శాస్త్రాన్ని తెలిసిన మంత్రులు రాజు ఆలోచనలు ముందుగానే బహిర్గతం చేయరు కదా అని అడిగాడు.

రహస్యాలను ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించాలి. వాటిని కేవలం ఒకడితోనే పంచుకుంటే వాడికి ఎవరనుకూలంగా వుంటే వారికే చెప్పే ప్రమాదం వుంది. పదిమందితో పంచుకుంటే, ఒకరు కాకున్నా మరొకరు ఇతరులకు చెప్పే అవకాశం వుంది. భిన్నాభిప్రాయాలు కలవారైతే వారిలోవారు కలహించుకుంటారని, రాజు ఆలోచనలు ఏవిధంగా వున్నా, పనికి ముందే ఎవరికీ చెప్పడం తగదు. నీతిశాస్త్రం ప్రకారం నడుచుకోవాలి. కార్యం చెడిపోయే విధంగా ఆలస్యం చేయకూడదు. నిర్ణయానికి పూర్వమే సామంతరాజులకు తెలియకుండా జాగ్రత్త పడాలి. వేయిమంది మూర్ఖులకంటే కార్యం ఆలోచించి చేయగల కనీసం ఒక్కడైనా రాజు దగ్గర వుండాలి.

కష్టజీవులకు తోడ్పాటు

రాజు తనమీద ప్రేమగలవారిని, అనేక పరీక్షల్లో నెగ్గినవారిని, వంశపరంపరగా సేవ చేస్తున్న వారిని, త్రికరణ శుద్ధిగా సత్యంగానే వుండేవారిని, మాలిన్యం లేనివారినే మంత్రులుగా నియమించాలి. నిర్మలమైన మనసు లేనివారు, చెడునీతిని బోధించేవారు, ఇతరులమీద పిర్యాదులు చేసేవారు, రాజు అంటే భయం లేనివారు, ధనాశ వున్నవారు రాజు దగ్గర వుండతగరు. సేనానాయకుడు సుగుణాల కలిగినవాడు, శూరుడు, ధైర్యం వున్నవాడు, సమర్దుడు అయి వుండాలి.

నాస్తికవాదులైన చార్వాకులను ఆదరించరాదు. అలా చేస్తే, ఈ లోకానికి, పరలోకానికి వాళ్లు కీడు చేస్తారు. వాళ్లు వాస్తవానికి పండితులు కాకపోయినా తమను తాము పండితులమని అనుకుని సర్వజ్ఞత్వం తమ మీద వేసుకుంటారు. విపరీత బుద్ధులు నేర్పుతూ, తమను నమ్మినవారిని ఉభయ లోకాల్లో చెడగొడతారు. సత్సంప్రదాయ పరంగా చదవాల్సినవి చదవకుండా చేస్తారు. ధర్మశాస్త్రాలను విపరీత బుద్ధితో వక్రభాష్యం చెబుతారు. నిస్సారమైన, నిరర్థకమైన తర్క, యుక్తి వాదాలు చేసుకుంటూ వుండే చార్వాకులతో స్నేహం కీడు కలిగిస్తుందని స్పష్టం చేశాడు.

భూమి దున్ని జీవించే, పశువులను మేపి జీవించే కష్ట జీవులకు సహాయం చేయాలన్నాడు శ్రీరాముడు. కృషి, గోరక్షణ, వాణిజ్యం చేసేవారికి సహాయం చేస్తూ, వారి బాధలు తీర్చాలన్నాడు. సమస్త వర్ణాశ్రమ ధర్మాలవారిని శాస్త్రప్రకారం రక్షించాలని, స్త్రీలను గౌరవించాలని చెప్పాడు. ప్రతిరోజూ సభలో ఉదయాన ప్రజలకు దర్శనం ఇవ్వాలి. అలా చేయకపోతే రాజుకు అనారోగ్యమని ప్రజలు సందేహిస్తారు. సేవకులను ఇష్ఠానుసారంగా రాజు దగ్గరికి రానిస్తే వారు చులకనగా చూస్తారు. రానివ్వకాపోతే విపరీతార్థాలు తీస్తారు. అవసరానికి తగ్గట్టే వారిని మితంగా కలవాలి. జలదుర్గాలు, గిరిదుర్గాలు, వనదుర్గాలు అన్నీ ధనధాన్యాలతో, జలాలతో, ఆయుధాలతో కూడి ఎప్పుడూ రక్షణలో వుండాలి.

ఇవి రాజధర్మాలు

వ్యయం కంటే మించి ఆదాయం వుండాలి. అపాత్రదానం తప్పు. దేవతా కార్యాలు, పితృ కార్యాలు, చేసేవారికి ధన సహాయం చేయాలి. పుణ్యకార్యాలు చేసేవారికి సహాయం చేస్తే రాజుకూ పుణ్యం వస్తుంది. నేరం చేసినవాడిని వదిలిపెట్టడం వల్ల కలిగే పాపం కంటే నేరం చేయనివాడిని దండించడం వల్ల కలిగే పాపమే అధికమని రాజైనవాడు గ్రహించాలని శ్రీరాముడు చెప్పాడు. గురువులకు, వృద్ధులకు, తాపసులకు, అతిథులకు, మోక్షలాభం సిద్ధించినవారికి, భక్తితో, నిర్మల మనసుతో నమస్కారం చేయాలి. ధనం కోసం ధర్మాన్ని వ్యర్థం చేయకూడదు. ధనం సంపాదించాల్సిన సమయంలో ధర్మ విచారం చేస్తూ కాలయాపన చేయకూడదు. ధర్మ, అర్థ, కామాలను ఏవేళకు ఏది చేయాలో అదే చేయాలి.

ఇవి లేకుండా రాజ్యం చేయాలని బోధించాడు. దశవర్గం, పంచవర్గం, చతుర్వర్గం, అష్టవర్గం, త్రివర్గం, విద్యాత్రయం అనే లక్షణాలలో ఏవి అవసరమో, అనవసరమో ఆలోచించి, ఆచరించాలన్నాడు. దైవ, మానుష్య వ్యసనాల గురించి, కృత్యం గురించి, ప్రకృతి, మండలం, వింశతి వర్గాలు, షడ్గుణాలలో ముఖ్యమైన సంధి, విగ్రహం, యాత్ర, దండం గురించి ఆలోచించి గ్రహించాల్సిన వాటిని మాత్రమే గ్రహించాలని చెప్పాడు.

మంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాపతి, ద్వారపాలకుడు, అంతఃపురంలాంటి వాటిదగ్గర మేటి ద్వారపాలకుడు, అంతఃపుర కార్యనిర్వాహకుడు, కారాగారాధిపతి, అర్థసంచయికుడు, కార్యనియోజకుడు, రాజాజ్ఞాలను వెల్లడించేవాడు, ప్రాడ్వివాకుడు (న్యాయ విచారకర్త), సేనానాయకుడు, నగరాధ్యక్షుడు, కర్మాంతికులను (సైన్యేతర సిబ్బందికి జీతాలిచ్చేవాడు) నియమించాలన్నాడు శ్రీరాముడు. సభను అలంకరించే వాడిని, ధర్మాధ్యక్షుడిని, దండపాణి లేదా దండపాలుడిని, దుర్గపాలుడిని, రాష్ట్రంతపాలుడిని, నియమించాలని చెప్పాడు శ్రీరాముడు.

దోషం అంటనివాడు

ధర్మ పద్ధతిన రాజ్యపాలన ఎలా చేయాలో శ్రీరాముడు వివరించాడు. అసత్యం పలకడం, దేవుడు లేదనడం, పని చేయకుండా కాలం గడపడం, అనవసరంగా కోపగించుకోవడం కూడదు. వాటివల్ల బుద్ధిపొరపాటు, బుద్దిమాంద్యం కలుగుతాయి. శ్రేయస్కరమైన జ్ఞానుల దర్శనం చేసుకోకుండా వుండకూడదు. పంచేంద్రియాలకు లోబడి వుండడం, రాచకార్యాలను ఒక్కడే ఆలోచన చేయడం మంచిదికాదు. నీచులను గౌరవించడం, నిర్ణయించబడిన పని చేయక పోవడం అనర్థం. అర్థజ్ఞానం లేనివారితో కలిసి ఆలోచన చేయడం, ఆలోచనలను దాచుకోకుండా బయట పెట్టడం లాంటి దోషాలు రాజుకు వుండకూడదు.

ఇతరులతో ఆలోచించి చేయాల్సిన ప్రతిపనినీ ముగ్గురికి తక్కువ కాకుండా, నలుగురికి ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అది కూడా మొదట ఒక్కొక్కరితో వేర్వేరుగా, తర్వాత అందరిని కలిపి ఒక్కటిగా ఆలోచించాలి. వారి అభిప్రాయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఆ తరువాత మంచి, చెడులను భేరీజు వేసుకుని, రాజు స్వతంత్రంగా ఆలోచన చేయాలి.

‘నేను నీకు చెప్పినవన్నీ ధర్మార్థ కామాలతో కూడినవి. ఇహపరలోక సుఖం కలిగించేవి. మోక్షార్థికి కావాల్సిన దీర్ఘాయువు ఇచ్చేవి. ధర్మార్థ కామాలలో ధర్మానికే ప్రాధాన్యం ఇచ్చేవి. రాజైనవాడు ధర్మ మార్గాన నడుచుకుంటూ ప్రజలను పాలిస్తే మరణించిన తరువాత స్వర్గానికి పోయి అక్కడ దివ్యభోగాలను అనుభవించడానికి ఉపయోగపడేవి. ఎలాంటి సందర్భంలోనైనా, ప్రాణాపాయ స్థితిలో కూడా ధర్మాన్ని విడువకూడదు. ధర్మం శాశ్వతం’ అని భరతుడికి రాజధర్మాలను చెప్పడం పూర్తి చేశాడు శ్రీరాముడు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

 

 

No comments:

Post a Comment