Wednesday, May 1, 2019

డాక్టర్ గారి కృషితో ఖమ్మంలో పార్టీకి తప్పిన ప్రమాదం ..... నక్సల్ ఉద్యమం .... అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


డాక్టర్ గారి కృషితో ఖమ్మంలో పార్టీకి తప్పిన ప్రమాదం
నక్సల్ ఉద్యమం
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (02-05-2019)
నక్సల్‍బరీ ఉద్యమ నేపధ్యంలో, 1967లో, సీపీఎం నుంచి కొంతమంది బయటకు పోయి ఆ సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారు. ఖమ్మం జిల్లాలో కూడా, కొందరు ఉత్సాహవంతులైన యువకులు అటువైపు వెళ్లారు. అలా వెళ్లిన వారిలో ముఖ్యుల పేర్లను గుర్తు చేసుకున్నారు డాక్టర్‍గారు. వారు: బత్తుల వెంకటేశ్వరరావు(సత్తుపల్లి), విజయ కుమార్(ఎం. వెంకటాయపాలెం), రాయల సుభాస్ చంద్రబోస్(పిండిప్రోలు), చీకటి రోశయ్య(లెక్చరర్, ఖమ్మం), జీవన్(రచయిత, ఖమ్మం), వడ్డెల్లి కృష్ణమూర్తి(అడ్వకేట్, ఖమ్మం), వాసిరెడ్డి కోటేశ్వరరావు(మధిర), డాక్టర్ వాసిరెడ్డి రామనాధం(మధిర) ప్రభృతులు.

రాష్ట్రస్థాయిలో నక్సల్ ఉద్యమంవైపు వెళ్లిన ప్రముఖుల పేర్లనూ చెప్పారు డాక్టర్‍గారు. వారిలో, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్లా వెంకయ్య, మాదాల నారాయణస్వామి, వజ్రవేలుశెట్టి, ఎ.బి.కె. ప్రసాద్, సనకా బుచ్చికోటయ్యలు సీపీఎం పాలకొల్లు రాష్ట్ర ప్లీనరీ జరిగిన తరువాత, పార్టీని వీడి నక్సల్ ఉద్యమం వెళ్ళిన ముఖ్యులు.


రాష్ట్రంలో ఎక్కువగానే నక్సల్ ఉద్యమ ప్రభావం పడింది ఆ రోజుల్లో. పలువురు విద్యార్థి నాయకులు, గ్రామ-పట్టణ నాయకులు, ఆ ఉద్యమంలోకి వెళ్లకుండా వుండడానికి కారణం డాక్టర్‍గారి పైనున్న గౌరవం. బత్తుల వెంకటేశ్వరరావు లాంటి చురుకైన సీపీఎం కార్యకర్తలు వెళ్లినప్పటికీ, వెళ్దామనుకున్న గండ్లూరి కిషన్‍రావు, వనం నరసింగరావు లాంటి వారిని ఆయన ఆపు చేశారు. ఆ తర్వాత వారిలో ఒకరు ఖమ్మం సమితి ఉపాధ్యక్ష స్థాయికి, మరొకరు పాలేరు సహకార చక్కెర కర్మాగారం చైర్మన్ స్థాయికి ఎదిగారు. పార్టీలో పలు బాధ్యతలు నిర్వహించారు. కిషన్‍రావు హత్యకు గురికాగా, నరసింగరావును పార్టీ సస్పెండ్ చేసింది. డాక్టర్ వై.ఆర్.కె కృషి వల్ల, అప్పట్లో, ఖమ్మంలో పార్టీకి ప్రమాదం తప్పిందనాలి. 1964 చీలిక-సీపీఎం నాయకుల అరెస్ట్ దరిమిలా రూపు దిద్దుకున్న పౌరహక్కుల ఉద్యమ ఆద్యులలో, మేధావిత్రయంలో ఒకరైన అడ్వకేట్ కె. వి సుబ్బారావు తీవ్రవాదం వైపు తొలుత ఆకర్షితులైనప్పటికి, మైదానంలో ఉద్యమానికి పోలేదు.

No comments:

Post a Comment