Sunday, December 26, 2021

వశిష్ఠుడి ఆశ్రమానికి పోయిన విశ్వామిత్రుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-88 : వనం జ్వాలా నరసింహారావు

 వశిష్ఠుడి ఆశ్రమానికి పోయిన విశ్వామిత్రుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-88

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (27-12-2021)

"వశిష్ఠుడి ఆశ్రమాన్ని చూసిన విశ్వామిత్రుడు, సంతోషంతో లోపలికి పోయి, వినయ విధేయతలతో వశిష్ఠుడికి నమస్కరించగా, అయన క్షేమ సమాచారాలు తెలుసుకున్న ముని ఆయన్ను ఆసనం మీద కూర్చోమంటాడు. వశిష్ఠుడిచ్చిన తియ్యటి ఫలాలను స్వీకరించిన రాజు ముని శ్రేష్ఠుడిని కుశల ప్రశ్నలడిగాడు. ఆయన శిష్యులెలా వున్నారని, తపస్సు చక్కగా జరుగుతున్నదానని, వారికి కావాల్సిన పళ్లు-ఫలాలు లభిస్తున్నవానని వశిష్ఠుడినడిగాడు. జవాబుగా మహర్షి విశ్వామిత్రుడిని: రాజా, నీకు-నీ సేవకులకు-బంధువులకు-మిత్రులకు-అందరికీ క్షేమమేనా? ధర్మం తప్పక, రాజనీతిననుసరించి ప్రజలను రక్షిస్తున్నావా? నీ సేవకులు నీ మాటకు లోబడి ప్రవర్తిస్తున్నారా? నీవూ వారిని దయతో చూస్తూ, వారి యోగక్షేమాలను విచారిస్తున్నావా? శత్రువులందరినీ జయించావా? చతుర్విధ సేనలు-బొక్కసం-స్నేహితులు నిండుగా వున్నారా? భార్యా-కొడుకులు-మనుమలు క్షేమంగా వున్నారా? అని అడగ్గా అందరూ కుశలమేనని చెప్పాడు విశ్వామిత్రుడు. ఇట్లా వీరిద్దరు సంతోషంతో ఒకరినొకరు పలుకరించుకుంటూ, పుణ్య కథలు చెప్పుకుంటూ సమయం గడిపారు కొంత సేపు".

విశ్వామిత్రుడికి విందుచేసిన వశిష్ఠుడు

"సమయమలా గడిచిపోతుంటే, జపశీలుడైన వశిష్టుడు, అతిథుల్లో గుణంవల్లా-పదవి వల్లా శ్రేష్టుడైన విశ్వామిత్రుడు పూజ్యుడనీ, అందువల్ల సేనలతో సహా అతడికి ఆతిథ్యమిచ్చి గౌరవించదల్చుకున్నాననీ, హిత బుద్ధితో అంగీకరించమనీ కోరాడు. వశిష్ఠుడి ప్రియ వాక్కులతో, అమృత సమానమైన కందమూల ఫలాలు తినడంతో ఆయన ఆతిథ్యం స్వీకరించినట్లేనని, ఆయన దర్శనంతో ధన్యుడనయ్యానని, సెలవిస్తే వెళ్తానని అంటాడు విశ్వామిత్రుడు. అయినా వశిష్ఠుడు బలవంతం చేయడంతో, ఆయన ఇష్ట ప్రకారమే ఆతిథ్యం తీసుకునేందుకు అంగీకరించాడు. వెంటనే వశిష్ఠుడు తన కామధేనువైన శబలను పిలిచి, తను రాజుకు-ఆయన సేనలకు విందు భోజనం పెట్టదల్చుకున్నానని, శీఘ్రంగా వారందరికి, తియ్యని అన్నాన్ని-పానకాన్ని-రసాయనాల్ని-లేహ్యాల్ని, ఇతర భోజ్యాల్ని ఏర్పాటుచేయమని ఆదేశించాడు". 

కామధేనువును తనకిమ్మని వశిష్ఠుడిని అడిగిన విశ్వామిత్రుడు

"వశిష్ఠుడు చెప్పిన విధంగానే, కామధేనువు, తగు రీతిలో అనేకమైన పిండివంటలు-తేనె-సారాయి-కమ్మని రుచికరమైన కూరలు-పప్పులు-అప్పాలు-పాలు-పళ్లు-వేడి, వేడి అన్నం-తియ్యటి చక్కెర పానకం, మొదలైన రకరకాల భక్ష్యభోజ్యాలను-ఎవరేదికోరితే దాన్నిసృష్టించింది. అది చూసిన వశిష్ఠుడు అందమైన పీటలు వేసి,బంగారు చెంబుల్లో నీళ్లిచ్చి, వెండిపళ్లాలలో వడ్డించే ఏర్పాట్లుచేసాడు. అంతఃపుర స్త్రీలతోను, మంత్రులతోను,బ్రాహ్మణాదులతోను,సైన్యంతోను కలిసి రాజు సంతృప్తిగా-కడుపునిండా భోజనంచేసాడు. అందరి భోజనం ముగిసిన తర్వాత, తామందరం సంతుష్టి చెందామని, ఆయన శక్తికి-పూజకు చాలా మెచ్చామని ఋశీష్వరుడితో అన్నారు”.

వశిష్ఠుడిచ్చిన చనువుతో, ఆయనకొక మాటచెప్పదల్చానని అంటూ, విశ్వామిత్రుడు, తనకు కామధేనువు శబలనివ్వమని, దానికి బదులుగా నూరువేల మంచి ఆవులను ఇస్తానని అంటాడు. శ్రేష్ఠమైన పదార్థాలన్నీ రాజుల దగ్గర వుండాలని, అలానే ఆవులలో శ్రేష్ఠమైన శబల కూడా రత్నహారుడైన తనవద్దనే వుండాలని, అలాంటి అమూల్యమైన వస్తువు ఆయనకెందుకని వశిష్ఠుడితో అంటాడు. నూరువేలేకాదు, నూరుకోట్ల ఆవులనిచ్చినా-బంగారం కుప్పలు కుప్పలుగా ఇచ్చినా శబలను ఎడబాయనంటాడు వశిష్ఠుడు. ఆత్మజ్ఞానం కలవారిని కీర్తి ఎలా ఎడబాసి వుండదో, తనను విడిచి శబల కూడా వుండలేదన్నాడు. ఆ ఆవుపాలతోనే దేవతలకు కావాల్సిన హవ్యం, పితృదేవతలకు కావాల్సిన కవ్యం-బలి-అగ్ని కార్యాలు, హోమానికి కావాల్సిన పదార్థాలు-దేహయాత్ర, సర్వం కామధేనువుతోనే నెరవేర్చుకుంటున్నాననీ, దానికి ఎన్నో విద్యలు కూడా వచ్చనీ, తనకది అవ్యానందానికి కారణమైందని, అలాంటి దాన్ని తను విడిచి ఎలా వుండటాలన్నీ విశ్వామిత్రుడిని ప్రశ్నించాడు వశిష్థుడు. కామధేనువును తానివ్వకపోవడానికి మరెన్నో కారణాలను కూడా చెప్పాడు”.

బంగారు సొమ్ములతో అలంకరించబడిన పద్నాలుగువేల ఏనుగులను, నాలుగు తెల్లని గుర్రాలను కట్టిన మేలిమి బంగారపు రథాలను, అమిత వేగంతో పోగల పదకొండువేల విదేశీ గుర్రాలను, నానా వర్ణాల కోటి ఆవులను ఇస్తానని శబలను తనకివ్వమని వశిష్ఠుడిని కోరాడు విశ్వామిత్రుడు మరోసారి. అంతేకాకుండా, వశిష్ఠుడు కోరినన్ని ఆభరణాలను, మణులను, బంగారు నాణాలను, నానా దేశాలలో లభించే మంచి మంచి వస్తువులను, గ్రామాలను, మడులను, మాణ్యాలను, స్త్రీలను, ఏది కోరితే దాన్ని ఆయన తృప్తిమేరకిస్తానని కూడా అంటాడు. విశ్వామిత్రుడేం చెప్పినా, ఏమిస్తానన్నా శబలనివ్వనంటాడు వశిష్ఠుడు. ముక్కుపట్టుకుని జపం చేసుకునే వశిష్ఠుడికి ఈ జంజాట మెందుకని, భూమిని పాలించేవాడికి సర్వ వస్తువులు కావాలని, అందుకే శబల తనదగ్గరే వుండదగిందని రాజు అనడంతో, భూమిని పాలించేవారికి బ్రాహ్మణుల-తపస్వుల సొత్తు కోరవచ్చునానని ప్రశ్నించాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడిస్తానని అంటున్నవన్నీ కామధేనువు తనకివ్వగలదని, తను దానినివ్వనని స్పష్టం చేశాడు".

 

No comments:

Post a Comment