Thursday, May 19, 2022

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు ఎలా సాధ్యం? : వ‌నం జ్వాలా న‌ర‌సింహారావు

 ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు ఎలా సాధ్యం?

వ‌నం జ్వాలా న‌ర‌సింహారావు

సాక్షిదినపత్రిక (20-05-2022)

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు (రేపు) జ‌రిగితే తెలంగాణ రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అమిత్ షా అంటున్నారు. హైద‌రాబాద్ స‌మీపంలోని తుక్కుగుడాలో ఇటీవ‌ల జ‌రిగిన భారతీయ జనతా పార్టీ బ‌హిరంగ స‌భ‌లో త‌న స్వ‌ప్నం సాకార‌మ‌వుతుందన్న రీతిలో ఆయన వ్యాఖ్యానించారు. అక్క‌డితో ఆగ‌కుండా ఆయ‌న తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ‘రేపే’ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించాల‌ని స‌వాలు చేశారు. ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనేందుకు తాము స‌ర్వ‌స‌న్నద్ధంగా ఉన్నామ‌న్నారు కేంద్ర హొం మంత్రి అమిత్ షా. ఈ వ్యాఖ్య‌ల‌లో ఆయ‌న‌కు రాజ్యాంగ ప్రకరణాలు కానీ, ఎన్నిక‌ల క‌మిష‌న్ చ‌ట్టాల గురించి కానీ ఏమాత్రం అవగాహన లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నది.

రాష్ట్రానికి సంబంధించినంతవరకు ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన బీజేపీ జాతీయ నాయ‌కుడు డిమాండ్ చేసిన వెంట‌నే ఎన్నిక‌లు నిర్వ‌హించే ప‌రిస్థితి ఉండ‌ద‌ని ఆయ‌నకు తెలియదా? రాష్ట్ర శాసనసభలో మెజారిటీ వున్నప్పుడు ఎప్పుడు ఎన్నికలకు పోవాలా అన్న విషయం, ముంద‌స్తుగా శాసనసభను రద్దు చేయాలా వద్దా అన్న విషయం, శాసనసభాపక్ష నాయకుడు, ముఖ్య‌మంత్రి ఇష్టా అయిష్టాల మీద ఆధార‌ప‌డి ఉంటుంద‌నేది జగమెరిగిన స‌త్యం. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ పూర్తి మెజారిటీని కలిగి వున్నప్పుడు అలా ముంద‌స్తుకు ఎందుకు మొగ్గు చూపుతారు? చూపాల్సిన అవసరం వున్నదా? అసెంబ్లీ ర‌ద్ద‌యిన మ‌రుస‌టి రోజే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అసాధ్యం కదా? ఎందుకంటే ఎన్నిక‌ల‌ నిర్వహణకు ఒక సుదీర్ఘ ప్ర‌క్రియ ఉంటుంది.

ఎన్నిక‌ల షెడ్యూలును ప్ర‌క‌టించే ముందు ఎన్నిక‌ల క‌మిష‌న్ అందులో ఉన్న మంచి చెడుల‌ను బేరీజు వేసుకుంటుంది. కాబ‌ట్టి, అసెంబ్లీ ర‌ద్ద‌యిన మ‌ర్నాడే ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డ‌మ‌నేది క‌ల్ల‌. కేంద్ర హోం మంత్రి స్థాయిలో ఇలా మాట్లాడ‌డం ఆయ‌న‌కు త‌గ‌దు. ఇది గార‌డీ మాట‌గా భావించాల్సి ఉంటుంది. అమిత్ షా ఎప్పుడు హైద‌రాబాద్ లేదా తెలంగాణ రాష్ట్రంలో ప‌ర్య‌టించినా అదోరకమైన విచిత్రంగా మాట్లాడుతుంటారు. కొంత మేరకు హ‌ద్దులు మీరి మాట్లాడతారని అన్నా అతిశయోక్తి కాదేమో! ఇలా మాట్లాడి త‌న బేల‌త‌నాన్ని వెల్ల‌డించుకుంటుంటారు.

2018లో కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ళిన‌ప్పుడు అదెంతో ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని అంటూ విమ‌ర్శించిన ఇదే అమిత్ షా ఇప్పుడు ఆయ‌నంత‌ట ఆయ‌నే రేపే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోర‌డం వింత‌గా ఉంది. అప్పుడప్పుడు ఆయ‌న మాట్లాడే మాటల‌లో హేతుబ‌ద్ధ‌త ఉండ‌దు. లాజిక్ లేకుండానే మాట‌లు తూటాలు వ‌దులుతుంటారు. రాష్ట్ర అసెంబ్లీని ర‌ద్దు చేయాల‌ని పరోక్షంగా అడ‌గ‌డం దీనికి ఒక మంచి ఉదాహ‌ర‌ణ‌. ముందస్తు ఎన్నిక‌లు జ‌రిగితే త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని షా క‌ల‌లు కంటున్నారు. 2014, 2018లో నిర్వ‌హించిన తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో బీజేపీ ద‌క్కించుకున్న‌ స్థానాలు అతి స్వల్పం. అలాంటప్పుడు ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న ఆయన వ్యాఖ్య ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మో ఆ దేవుడికే తెలియాలి.

గతంలో కేసీఆర్ ఎందుకు ముందస్తుగా ఎన్నికలకు పోయారన్న ప్రశ్న తలెత్తవచ్చు. అప్పుడు కేసీఆర్ అసెంబ్లీని ర‌ద్దు చేయాల‌ని ఎందుకు సిఫార్సు చేశార‌నే అనుమానం అంద‌రికీ రావ‌చ్చు. రాజ్యాంగ స‌భ‌ల‌ను ర‌ద్దు చేసే అంశంలో రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చింది. ఈ స్వేచ్ఛ‌ను కేసీఆర్ ఉప‌యోగించుకున్నారు. అప్ప‌టి రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు చెక్ పెట్ట‌డానికీ, ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు కొన‌సాగించ‌డానికీ ఆయ‌న ముంద‌స్తు ఎన్నిక‌ల నిర్ణ‌యం తీసుకున్నారు.

కేసీఆర్ గ‌తంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ళ‌డం ముమ్మాటికీ స‌హేతుకం, రాజ్యాంగ‌బ‌ద్ధం, చ‌ట్ట‌బ‌ద్ధం, న్యాయం. ఆ సంద‌ర్భంలో కేసీఆర్ నిర్ణ‌యాన్ని షా త‌ప్పు ప‌ట్టారు. అసెంబ్లీని ర‌ద్దుచేసి, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ళాల‌ని నిర్ణ‌యించిన మొట్ట‌మొద‌టి సీఎం కేసీఆర్ మాత్ర‌మేన‌నీ, ఈ ఎన్నిక‌ల వ‌ల్ల ఎంతో ప్ర‌జాధ‌నం ఖ‌ర్చువుతుంద‌నీ విమ‌ర్శించారు. ఈ అంశాన్ని ఇక్క‌డ ప్ర‌స్తావించ‌డం అసంద‌ర్భం కాబోదు. ఎందుకంటే రెండు ర‌కాలుగా మాట్లాడుతున్న‌ది అమిత్ షానే క‌దా? అప్పటి ఆయ‌న మాట‌లు వింటే దేశంలో ఎప్పుడూ ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌న‌ట్లే ఉంది.

న‌డుస్తున్న చ‌రిత్ర‌ను అమిత్ షాలాంటి స్థాయి వ్య‌క్తి విస్మ‌రించి ఎలా మాట్లాడ‌గ‌ల‌రు. దేశంలో రాజ‌కీయ ప‌రిణామాలు ఆయ‌న‌కు తెలియ‌వు అంటే న‌మ్మాలా? అసాధ్య‌మైన కార్యాన్ని త‌క్ష‌ణం చేయాల‌ని షా డిమాండ్ చేయ‌డం దుర‌దృష్ట‌క‌రం. రాష్ట్రం ఎన్నిక‌లకు ఎప్పుడు వెళ్ళాలో నిర్ణ‌యించాల్సింది అమిత్ షా కాదు. ప్ర‌త్యేకించి అధికారంలో ఉన్న పార్టీ పూర్తి మెజారిటీని అనుభ‌విస్తున్న‌ప్పుడు ఇలా డిమాండ్ చేయ‌డం అస్స‌లు స‌రికాదు. త‌మ‌కు తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌నే క‌ల‌ను ప్ర‌జ‌ల‌కు వెల్ల‌డించ‌డానికే ఆయ‌న అలా వంక‌రగా ఎన్నిక‌లు పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. రేపే ఎన్నికలు పెట్టితే అధికారంలోకి వచ్చే పార్టీ మరో ఏడాదిన్నర ఆగవచ్చు కదా?

ఆయ‌న‌కు అంత ఉబ‌లాటంగా ఉంటే వెంట‌నే ప్ర‌ధానిని క‌లిసి, బీజేపీ పూర్తి మెజారిటీని అనుభ‌విస్తున్న లోక్ స‌భ‌ను ర‌ద్దు చేసి, ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోరాలి. గ‌డువు పూర్త‌యిన త‌ర‌వాత లేదా గ‌డువుకు ముందే అసెంబ్లీ లేదా పార్ల‌మెంటును ర‌ద్దు చేసి ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ లేదా రాష్ట్ర‌ప‌తిని కోర‌డం కొత్త అంశ‌మేమి కాదు. ఐదేళ్ళ పాటు పార్ల‌మెంటు, అసెంబ్లీలు కొన‌సాగ‌డానికి అనుమతిస్తున్న రాజ్యాంగం ఆర్టికిల్ 85, 174 ద్వారా రాష్ట్ర‌ప‌తి లేదా గ‌వ‌ర్న‌ర్‌ల‌కు ప్ర‌భుత్వాధినేత‌ల సిఫార్సుల‌పై వాటిని ముంద‌స్తుగా ర‌ద్దుచేసే అధికారాన్నీ క‌ట్ట‌బెట్టింది. అది కేవలం ప్ర‌భుత్వాధినేత‌ల హక్కు మాత్రమె. అలాంటప్పుడు, అమిత్ షా కేసీఆర్‌ను ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్ళాల‌ని ఎలా బ‌ల‌వంతం చేయ‌గ‌ల‌రు? అమిత్ షా డిమాండ్ వెనుక మూల కార‌ణం ఏమిటి? దానికి న్యాయ‌బ‌ద్ధ‌త ఏమిటి? ఇంకా తెలంగాణ అసెంబ్లీ కాల‌ప‌రిమితి ఏడాదిన్న‌ర పైనే ఉండ‌గా ఇలా కోర‌డం ఏమిటి?

దేశంలోని ప్ర‌తిప‌క్షాల‌న్నీ పార్ల‌మెంటును ముందే ర‌ద్దుచేసి, ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోరితే అమిత్ షాకు మింగుడుప‌డుతుందా? పూర్తి మెజారిటీని పొంది ఉన్న ముఖ్య‌మంత్రి లేదా ప్ర‌ధాన మంత్రికి మాత్ర‌మే స‌భ‌ను ర‌ద్దుచేయాల‌ని కోరే హ‌క్కు ఉంటుంది. ఒక‌రు కోరితే ర‌ద్దు చేయాల‌నుకోవ‌డం స‌రికాదు. అలా కోర‌డానికి కార‌ణం ఏదైనా కావ‌చ్చు. రాజ‌కీయ, ప‌రిపాల‌న‌, లేదా మ‌రేదైనా కావ‌చ్చు. అమిత్ షా లాంటి స్థాయి వ్య‌క్తి చేయాల్సిన వ్యాఖ్య‌లు కావు. స‌భ ఎప్పుడు ర‌ద్దు చేయాలి  అనేది ముఖ్యమంత్రికి రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు.

2018 ఎన్నిక‌ల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కేసీఆర్ నెర‌వేర్చ‌లేదంటూ హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను కేసీఆర్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తోంద‌న్నారు. 57 సంవ‌త్స‌రాల జీవితంలో ఇంత అవినీతి ప్ర‌భుత్వాన్ని చూడ‌లేద‌ని కూడా అమిత్ షా అన్నారు. అర‌గంట సేపు సాగిన షా ప్ర‌సంగంలో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. గ‌తంలో మాదిరిగానే ఆ విమ‌ర్శ‌లు ఫ‌క్తు అబద్ధాలు.

ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో ఇచ్చిన హామీలను కేసీఆర్ నెర‌వేర్చ‌లేదంటూ చెప్పి, ఆయ‌న ప్ర‌జ‌ల‌ను త‌ప్పు దోవ ప‌ట్టించ‌డానికి ప్ర‌య‌త్నించారు. వాస్త‌వానికి ఒకరి తరువాత మరొకరు అధికారంలో వున్న కాంగ్రెస్ లేదా బీజేపీ ప్ర‌భుత్వాలు ఎప్పుడూ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఎన్నిక‌ల హామీల‌ను నెర‌వేర్చేలేద‌నేది ప‌చ్చి నిజం. 2014 టిఆర్ఎస్ ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో లేని ప‌థ‌కాల‌ను, ఇవ్వ‌ని హామీల‌ను కూడా టిఆర్ఎస్ అమ‌లు చేసింది. వీటిని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే టీఆర్ఎస్ ప్ర‌భుత్వం 200శాతం ఎన్నికల హామీల‌ను నెర‌వేర్చినట్లయ్యింది. ఈ విష‌యాల‌ను అమిత్ షా గారు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే మంచిది.

తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ స్థాయి నాయ‌కుడు అయిన అమిత్ షా భేష‌జాన్ని విడిచి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి. లేదంటే, తెలంగాణ ప్ర‌భుత్వాన్నీ, ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డమే కాగ‌ల‌దు. అమిత్ షా వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అమిత్ షా ను అబద్ధాల బాద్షాగా అభివ‌ర్ణించారు. అమిత్ షా వ్యాఖ్య‌లు నిరాధార‌మైన‌వ‌ని ఒక ప్రెస్‌మీట్లో కేటీఆర్ స్ప‌ష్టంచేశారు. ఆయ‌న మాట‌లు వాస్త‌వానికి దూరంగా ఉన్నాయ‌నీ, వ‌క్రీక‌ర‌ణ‌ల‌నీ పేర్కొన్నారు. తెలంగాణను కింద‌చ‌ప‌ర‌చ‌డానికి అమిత్ షా చేసిన దుష్ప్ర‌చారంగా కేటీఆర్ వివ‌రించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవ‌డానికి షా ఈ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన వినూత్న, సృజ‌నాత్మ‌క కార్య‌క్ర‌మాల‌కు ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌, కేంద్ర మంత్రుల‌తో పాటు ప్ర‌ధాన మంత్రి, నీతి ఆయోగ్ ఉపాధ్య‌క్షుని నుంచి ప్ర‌శంస‌లు అందుకున్న విష‌యాన్ని అమిత్ షా గుర్తుచేసుకోవాలి. తెలంగాణ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌కు దేశ విదేశాల నుంచి కూడా ప్ర‌శంస‌లు ల‌భించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. తెలంగాణ ప్ర‌భుత్వం కేవ‌లం రాష్ట్రాల‌తో, కేంద్రంతోనే కాదు ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌తో కూడా పోటీప‌డుతోంది. ప్ర‌తి ఒక్క‌రూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆద‌ర్శంగా తీసుకుంటున్నార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. యుఎన్‌డిపి, నీతి ఆయోగ్ సంస్థ‌లు మిష‌న్ కాకతీయ‌, మిష‌న్ భ‌గీర‌థ ప్రాజెక్టుల‌ను ప్ర‌శంసించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ ను గురించిన చర్చ జరుగుతున్నది కదా!

No comments:

Post a Comment