Saturday, March 4, 2023

ఆ రోజుల్లో పెళ్లిళ్ళంటే ..... ఎన్ని ఆచారాలూ! ..... వనం జ్వాలా నరసింహారావు

 ఆ రోజుల్లో పెళ్లిళ్ళంటే ..... ఎన్ని ఆచారాలూ!

మారోజులనాటి నిశ్చితార్థం, లగ్న నిశ్చయం, పెళ్లిపనులు

(గుర్తుకొస్తున్నాయి)

వనం జ్వాలా నరసింహారావు

సాక్షిదినపత్రిక (05-03-2023)  

వివాహాల సందర్భంగా అప్పటి రోజులకూ, ఇప్పటి రోజులకూ, సంప్రదాయాల విషయంలో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. అర్థ శతాబ్దం క్రితం చూసిన ఆచారాలు నాకింకా గుర్తున్నాయి. ఉదాహరణకు, పాత రోజుల్లో వివాహం పూర్వరంగంలో సాంప్రదాయబద్ధంగా వరుడి ఇంట్లో జరిగే మొదటి దశ అయిన మాటా-మంతీ అయిపోయి, ఒకరి వంశ క్రమం గురించి మరొకరు అవగాహన కొచ్చిన తర్వాత, ఆచారం ప్రకారం తర్వాత జరగవలసిన కార్యక్రమాన్ని ఖరారు చేసుకునేవారు. వీలునుబట్టి ఒకటి-రెండు నెలల తరువాత మంచిరోజు చూసుకుని, ఆడపిల్ల వారింట్లో కలిసి, ముహూర్తాలు పెట్టుకోవాలని, సూత్రప్రాయంగా నిర్ణయించుకునేవారు. పురోహితుడిని సంప్రదించి పెళ్లి ఎన్నడు, ఏ ముహూర్తాన జరుగుతే యోగ్యమైనదో, మంచిగుంటుందో అనే విషయంలో తుది నిర్ణయం తీసుకునేవారు.

అప్పట్లో, వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది వాగ్ధానం. అంటే: పెళ్ళి ఖాయపరచుకోవడం లేదా నిశ్చితార్థం. ఆ తర్వాత వర-వరణం. అంటే: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం. నిశ్చితార్థానికే మరోపేరు ‘నిశ్చయ తాంబూలం’. వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం. అందరికీ ఆమోదయోగ్యమైన శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్నపత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లితండ్రులు లగ్నపత్రికలు, తాంబూలాలు మార్చుకునేవారు. పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుక అప్పట్లో సర్వసాధారణంగా వధువు ఇంటిలోగాని, అరుదుగా వారేర్పాటుచేసుకున్న చిన్నపాటి వసతి గృహంలోగాని, లేదా బంధువుల ఇంటిలో కాని జరిగేది. దీన్నే ఇప్పుడు ‘ఎంగేజ్ మెంట్’ అంటున్నారు. కొందరు ఇటీవలి కాలంలో ఈ తంతును పెళ్లికంటే ఘనంగా, తమ సంపదను బాహాటంగా ప్రదర్శించే వేడుకగా, భారీ ఫంక్షన్ హాల్సులో జరుపుకుంటున్నారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టు గానే భావిస్తారు. ఇప్పుడు దండల మార్పిడితో సహా దాదాపు ఒక పెళ్ళిలాగా జరుగుతున్నది.  

సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి, పుచ్చుకోవడాలు అందరి ఇళ్లల్లో ఒకే రకంగా వుంటాయి. తాహతును బట్టి కొంచెం మార్పులు, చేర్పులు వుండొచ్చు. ఇరుపక్షాల వాళ్ళు మరిచిపోవడానికి ఆస్కారం లేకుండా, అరమరికలు లేకుండా, ఒక కాగితం మీద ఇచ్చి, పుచ్చుకోవడాలకు సంబంధించిన వివరాలన్నీ రాసుకోవడం కూడా సంప్రదాయమే.

సాధారణంగా ఆడపెళ్లివారిచ్చేవి లేదా సాంప్రదాయబద్ధంగా విధిగా ఇవ్వాల్సినవి: స్నాతక ద్రవ్యాలు, వరుడి ధోవతులు, మధుపర్కాలు (వరుడుకి ఇవ్వాల్సిన బట్టలు), ఉత్తర జంధ్యాలు, భటువు, కాళ్లుగడిగే పళ్లెం, బిందెలు, కల్యాణ వేదికపై వరుడిని కూచోబెట్టే చిన్న బల్ల, వివాహంలో వివిధ సందర్భాలలో (స్థాళీపాకం, నాగవల్లి, సదశ్యం, అప్పగింపులు, మేజువాణి లాంటివి) వరుడికి పెట్టాల్సిన బట్టలు (ధోవతులు, పట్టు బట్టలు, సూట్, పాంట్, షర్ట్ లు లాంటివి), వరుడివైపు బంధువులకు పెట్టాల్సిన బట్టలు, అప్పగింతల బట్టలు, పెళ్ళైన తర్వాత మగ పెళ్ళివారింట్లో గృహప్రవేశం సందర్భంగా, సత్యనారాయణ వ్రతమప్పుడు వధూవరులకు పెట్టవలసిన బట్టలు, ఆడ బిడ్డలకు, అత్తగారికి ఇవ్వదల్చుకున్న లాంఛనాలు, పెళ్ళి కూతురుకు ఇచ్చే సారె ముఖ్యమైనవి. (సారె పెట్టెలో పెట్టాల్సిన వస్తువులు: ఏభై ఒక్క కొబ్బరి చిప్పలు, ఐదు రవికె గుడ్డలు, రెండుంపావు కిలోల శనగ-సున్నిపిండి, కిలోంబావు పసుపు, అందులో సగం కుంకుమ, చీరె, ధోవతులు, ఐదు రకాల తీపి పదార్థాలు, ఇత్యాదులు)

సాధారణంగా మగపెళ్లివారిచ్చేవి లేదా సాంప్రదాయబద్ధంగా విధిగా ఇవ్వాల్సినవి: స్నాతకంలో బావమరిదికి పెట్టాల్సిన బట్టలు, పెళ్ళి కూతురుకు పెట్టాల్సిన పట్టు చీరెలు, ఇతర చీరెలు, నగలు, ఆభరణాలు, నల్లపూసలు, పుస్తె (ఒకటి పుట్టింటి వారు, ఇంకొకటి అత్తగారింటి వారు ఇవ్వాలి), మెట్టెలు, ముత్తవుతల్లి (వధువు అమ్మమ్మ) కిచ్చే కట్నం, వధువు తల్లి కడుపు చీరె, తండ్రికి బట్టలు, ప్రధానపు వుంగరం లాంటివి.

వధూవరుల తారా బలం, చంద్ర బలం చూసి ముహూర్తం నిశ్చయిస్తారు. ‘పెళ్లినాటి ప్రమాణాలు’ భవిష్యత్ లో దంపతులు తుచ తప్పకుండా అమలు చేయాలంటే ‘ముహూర్త బలం’ ముఖ్యమని పాతరోజుల నాటి నమ్మకం. నిశ్చితార్థంలో ప్రధానంగా విఘ్నేశ్వరుడి పూజ వుంటుంది. వివాహ ప్రక్రియ ఆసాంతం విఘ్నాలు లేకుండా చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితి. నిశ్చితార్థానికి ముందు బంధువుల సమక్షంలో లేదా పరోక్షంలో వధూవరుల తల్లితండ్రుల మధ్య కుదిరిన ఇచ్చి-పుచ్చుకునే ప్రతి చిన్న అంశం ఒక కాగితం మీద రాసుకోవడం కూడా సాంప్రదాయంలో భాగమే. ఇదంతా ‘ఆచారం, పద్ధతి’.

పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతుంటే, పెళ్లి సరంజామా కొనడం అనేది ఇరు పక్షాల వారికి కూడా పెద్దపని. పట్టుచీరలు, బంగారు ఆభరణాలు, నూతన వస్తువులు, ఇలా ఎన్నో కొంటారు. అప్పట్లో ఇన్ని బంగారం దుకాణాలు వుండేవి కావు. బంగారం వస్తువులు తయారుచేసే కంసాలితో పెళ్ళి ఆభరణాలన్నీ తయారు చేయించేవారు. ఖమ్మంలో నివసించే మేము సాధారణంగా షాపింగ్ అంతా విజయవాడలో చేసేవాళ్లం.  

నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారివారి కులాచారానుసారం ‘శుభ లేఖలు’ గా పిలువబడే ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. మంగళ సూచకంగా లేఖకు నాలుగు వైపులా పసుపు పూస్తారు. బంధుగణాన్ని పిలుచు కోవడం పెళ్లిళ్లలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అరుదుగా కలిసే చుట్టపక్కాలతో సహా  బంధువులందరూ కలుసుకోగలిగే ‘సామాజిక ఏర్పాటు’ పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళివారి ఇల్లు (కల్యాణ మంటపం) మారిపోతుంది. ముహూర్తానికి కనీసం పది-పదిహేను రోజులముందునుంచే ఈ కార్యక్రమం ఆరంభమయ్యేది. స్వయంగా కలిసి శుభలేఖ ఇవ్వడమో, వ్యక్తులకు ఇచ్చి పంపడమో జరిగేది. ఇప్పటిలాగా ఫోన్ మెసేజులు లేవు. ఎంత శ్రద్ధ తీసుకుని, అందరికీ పంపించే ఏర్పాటుచేసినప్పటికీ, ఆఖరు నిమిషంలో, ఒక్కోసారి ముఖ్యమైన వారితో సహా కొందరిని మరిచిపోవడం సహజంగా జరిగేది. వాళ్లకు కోప-తాపాలు కూడా వచ్చేవి. కాకపోతే వచ్చినంత త్వరగా తగ్గిపోయేవి. ఇవన్నీ అప్పట్లో సర్వసాధారణంగా ప్రతి పెళ్లిలోనూ, ప్రతివారింటిలోనూ జరిగే మామూలు విషయాలే. ఆ చిరు కోపాలు రాకుంటే పెళ్ళి శోభ రానట్లే. ఇప్పుడు కోపం వచ్చినా పట్టించుకునేవారు లేరు!!!

1 comment:

  1. >> నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టు గానే భావిస్తారు. ఇప్పుడు దండల మార్పిడితో సహా దాదాపు ఒక పెళ్ళిలాగా జరుగుతున్నది.

    నిజానికి ఈఉంగరాలను మార్చుకోవటం కూడా సంప్రదాయం‌ కాదండీ - ఆధునికమేను. ఈమధ్య దండలుమార్చుకోవటం దాకా వచ్చింది!

    ReplyDelete