Thursday, December 14, 2023

విజయానికి తిరుగులేదు, ఓటమి శాశ్వతం కాదు! ..... వనం జ్వాలా నరసింహారావు

 విజయానికి తిరుగులేదు, ఓటమి శాశ్వతం కాదు!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (15-12-2023)

          నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్’ అంటాడు ‘ద కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టే’, ‘ద త్రీ మస్కేటీర్స్’ గ్రంథ రచయిత అలెగ్జాండర్ డ్యూమాస్. విజయాన్ని మించిన విజయం లేదు, విజయం మరింత విజయాన్ని అందిస్తుంది అని దీని అర్థం. కాకపోతే, ఎల్లప్పుడూ సంఘటితమైన కృషి అవశ్యం. అలాగే, ‘ఫెయిల్యూర్స్ ఆర్ ది పిల్లర్స్ టు సక్సెస్’ అని మరో ఆసక్తికరమైన సామెత ఉంది. అపజయాలే విజయానికి మూలస్తంభాలని, ‘వైఫల్యం జీవితానికి గొప్ప గురువు అనీ అర్థం. అంటే ఓడిపోయిన వ్యక్తి తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, విజయం దిశగా మార్గం సుగమం చేసుకోవడానికి ఆ ఓటమిని ఒక అవకాశంగా వాడుకోవచ్చు. విజయపథంలో సాగుతున్న వ్యక్తికి ఓటమి అనేది నిజానికి ‘తాత్కాలికంగా అచేతనావస్థలో ఉన్న విజయం’ మాత్రమే అనుకోవచ్చు.

విజయం మున్ముందు తప్పక చేయాల్సిందేమిటో స్పష్టంగా తెలియపరుస్తుంది. అపజయానికి దారితీసిన కారణాలను, దానికి ముందు తీసుకున్న నిర్ణయాలను, నిష్పాక్షికమైన మనస్సుతో, అంతరాత్మ సాక్షిగా, విమర్శనాత్మకంగా విశ్లేషించి పాఠాలు నేర్చుకుంటే, విజయావకాశాలు మెరుగుపడే వీలుంది. అలాగే, ‘వైఫల్యం పురోగతిలో విజయం’ అనీ, అయితే ఆ సాధన దిశగా లక్ష్యాన్ని వదలకుండా నిరంతరం పోరాడుతూనే వుండాలనీ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. అలెగ్జాండర్ డ్యూమాస్ అయినా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయినా, డేల్ కార్నెగీ అయినా, మరెవరైనా చెప్పేదాని సారాంశం ఒక్కటే. జయాపజయాలు రెంటిలోనూ విజయం ఉన్నదన్న వాస్తవాన్ని.

         ఇటీవల వెల్లడైన రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలలో ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ భారీ విజయం, కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ అపజయం, ఈ రెండింటికీ కూడా ‘నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్, ‘ఫెయిల్యూర్స్ ఆర్ ది పిల్లర్స్ టు సక్సెస్  పై రెండు సామెతలనూ వర్తింప చేయవచ్చు. లక్ష్యాన్ని, ధ్యేయాన్ని వదలకుండా నిరంతరం పోరాడుతూ, కృతనిశ్చయంతో కోరుకున్న విజయాన్ని సాధించారు రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్ విషయానికొస్తే ఎన్నికల్లో సంభవించిన ఈ ఓటమి, ‘తాత్కాలికంగా అచేతనావస్థలో ఉన్న విజయం’ మాత్రమే. ఒక స్థిరమైన వ్యూహాత్మక ఆలోచన ద్వారా, గతంలోలాగా శ్రమిస్తూ, సరైన సమయం కొరకు ఎదురు చూస్తూ, పునరాగమనానికి మార్గం సుగమం చేసుకోమనే సూచనే. సమతుల్యమైన జయాపజయాలు నాయకులిద్దరికీ ఒక అనుభవమనేది వాస్తవం.

         విజయం దిశగా రాజకీయ ప్రస్థానాన్ని జడ్పీటీసీ సభ్యుడిగా, ఆ వెంటనే స్వతంత్ర అభ్యర్థిత్వంతో ఎమ్మెల్సీగా ప్రారంభించిన రేవంత్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గం శాసనసభ స్థానానికి 2009, 2014 ఎన్నికలలో వరుస విజయాలు సాధించారు. అదే కొడంగల్ నియోజకవర్గం నుంచి తన మొదటి ఓటమిని 2018 శాసనసభ ఎన్నికల్లో రుచి చూశారు. ‘ఫెయిల్యూర్స్ ఆర్ ది పిల్లర్స్ టు సక్సెస్’ అన్నట్టుగా ఆ తరువాత ఆరు నెలలకే జరిగిన లోక్‍సభ ఎన్నికలలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి గెలిచి, విజయం వైపు గొప్ప పునరాగమనం చేశారు.

         క్రమేపీ రేవంత్ రెడ్డి ‘విజయం మరింత విజయాన్ని అందిస్తుంది’ అన్న నానుడిని నిజం చేస్తూ రెండున్నరేళ్ళ క్రితం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడుగా నియమితులైనప్పటి నుంచి ఒక స్థిరమైన, ఆచరణాత్మకమైన రాజకీయ వ్యూహంతో ముందుకు సాగుతూ కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించారు. ఏ కొడంగల్ శాసనసభ స్థానంలో 2018లో ఓటమిపాలయ్యారో అక్కడి నుంచే అఖండ విజయం సాధించారు. ఎన్టీఆర్ టీడీపీని 1989 ఎన్నికలలో ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబు నాయుడు టీడీపీని 2004 ఎన్నికలలో ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలకు దీటుగా, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని 2023 ఎన్నికలలో ఓడించి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు రేవంత్ రెడ్డి.        

తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా, రెండు పర్యాయాలు ఎన్నికై అత్యంత విజయవంతమైన ముఖ్యమంత్రిగా పాలన అందించిన కేసీఆర్ రాజకీయ ప్రస్థానం 1983 శాసనసభ ఎన్నికలలో సిద్దిపేట నియోజకవర్గం నుంచి పరాజయంతో మొదలైంది. అయితే ఆ తరువాత కేసీఆర్ విజయ పరంపర నిరాటంకంగా ఇటీవలి 2023 ఎన్నికల వరకూ కొనసాగింది. ఏ ఎన్నికల్లోనూ, ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. తన మొదటి ఓటమి నుంచే తర్వాతి విజయాలకు మార్గం నిర్దేశించుకున్నారు. మొదటి ఎన్నికల విజయాన్ని 1985 శాసనసభ మధ్యంతర ఎన్నికలలో సిద్దిపేట నియోజకవర్గం నుంచే నమోదు చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆయన ప్రస్థానం ‘నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్’ అన్న రీతినే సాగింది.

         ఆ తరువాత కేసీఆర్ వరుసగా నాలుగు పర్యాయాలు 1985 నుంచి 1999 వరకు జరిగిన ఎన్నికలలో సిద్ధిపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాలలో పనిచేశారు. కొంతకాలం ఉపసభాపతిగానూ పని చేశారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తరువాత కేసీఆర్ విజయగాథ కొనసాగి స్థిరపడ్డది. 2004 ఎన్నికలలో ఐదవసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా, మొదటిసారి కరీంనగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీ స్థానాన్ని ఉంచుకుని, కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ విసిరిన సవాలుకు దీటుగా రాజీనామా చేసి 2006 ఉపఎన్నికలో గెలిచారు. 2009 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానం నుండి లోక్‍సభకు ఎన్నికయ్యారు.

         తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అనంతరం 2014 ఎన్నికలలో గజ్వేల్ శాసనసభ స్థానానికి, మెదక్ పార్లమెంట్ స్థానానికి పోటీచేసి రెండు చోట్లా విజయం సాధించారు. ఆయన నేతృత్వంలోని టీఆర్ఎస్ తెలంగాణలోని 119 స్థానాలకు గాను 63 (మెజారిటీ), 17 లోక్‍సభ స్థానాలకు గాను 11 గెలిచింది. జూన్ 2, 2014న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, నాలుగున్నర సంవత్సరాల తరువాత శాసనసభను రద్దుచేసి నవంబర్ 2018లో జరిగిన ఎన్నికలలో 88 స్థానాలను గెలిచి అఖండ విజయం సాధించారు. మరోమారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

         తొమ్మిదిన్నరేళ్ళలో కేసీఆర్ సారథ్యంలోని ‘ఎనేబ్లింగ్ గవర్నెన్స్’ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అపూర్వమైన సంపద, శ్రేయస్సు చేకూరినప్పటికీ, అన్ని ప్రామాణికాలలో అసాధారణమైన వృద్ధి నమోదు అయినప్పటికీ, ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఇచ్చి విజయాన్ని చేకూర్చారు. కేసీఆర్ స్వయంగా నలభై ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యేగా రెండో ఓటమిని చవి చూశారు. కామారెడ్డిలో ఓడి, గజ్వేల్‌లో గెలిచారు. బహుశా ప్రజలు కోరుకున్న దానికంటే, అవసరాలను మించి కేసీఆర్ వారికి ఇచ్చారేమో! ప్రభుత్వాలు పథకాల రూపకల్పనకు ముందు, అమలుకు ముందు, అవి ప్రజలకు ఏ మేరకు అవసరమో అనే విషయంలో శాస్త్రీయ విశ్లేషణ చేయాలేమో!

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చేసిన ఆరు గ్యారంటీల అమలుకు ముఖ్యమంత్రి చేసిన మొదటి సంతకం ద్వారా, కేబినెట్ తీర్మానం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేసీఆర్ బాటలోనే (బహుశా) సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోకుండా, వర్తమాన ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేయకుండా, అవసరాల అంచనా లేకుండా, ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా ఆరు గ్యారంటీల అమలుకు ముందుకు పోవడం కొంచెం విశ్లేషించాల్సిన అంశమే. కాకపోతే, కొంచెం జాగ్రత్తగా, ఆరు గ్యారంటీలలో రెండు మాత్రమే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యపరిమితి రూ.10 లక్షలకు పెంపు మాత్రమే, ప్రస్తుతానికి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించడం హర్షించదగ్గ విషయం.  ప్రజాస్వామ్యంలో నిరంతర మార్పు సర్వసాధారణం. మకుటంలేని మహారాణిగా మన్ననలు అందుకున్న ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’, ‘బ్యాంకుల జాతీయీకరణ’ వంటి ప్రజాకర్షక నినాదాలు ఇచ్చినప్పటికీ, ఎమర్జెన్సీ అనంతరం 1977లో జరిగిన ఎన్నికలలో తాను పోటీ చేసిన స్థానంలో పరాజయం పాలవడమేగాక, కాంగ్రెస్ పార్టీని పరాజయం దిశగా నడిపించింది. అయితే ఆమెను, ఆమె పార్టీని ఓడించిన జనతా అంతర్గత కుమ్ములాటలో బలహీనపడి, ప్రభుత్వం కూలిపోవడంతో, ఇందిరాగాంధీ దిగ్విజయంగా తిరిగి అధికారంలోకి రాగలిగింది. 1983 ఎన్నికల్లో ఎన్టీరామారావు అఖండ విజయం సాధించినప్పటికీ, 1989 ఎన్నికల్లో ఆయన స్వయంగా ఒక నియోజకవర్గంలో ఓటమి పాలై, కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పారు.

         ‘ఆంగ్లంలో భగవద్గీత  సందేశ సారం’ గా కుష్వంత్ సింగ్ వర్ణించిన, రడ్యార్డ్ కిప్లింగ్ అనే ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రాసిన ‘ఇఫ్’ ఆనే సందేశాత్మక గేయ కవితలోని ప్రతిపదం ఏ రంగంలోనైనా గెలుపు ఓటములను చవిచూసే ప్రతివ్యక్తీ చదవాల్సినంత గొప్పది. ముఖ్యంగా, ‘జయాపజయాలను సమతుల్యంగా పరిగణించి, ఓటమి ఎదుర్కొన్నా తిరిగి ఆదినుండి ఆరంభిస్తూ విజయానికి బాటలు త్రొక్కు’ అనే మాటలు. ఇలా ఎవరికైనా జయాపజయాలు మాములే. కాకపోతే ఎందుకు ఒకరు గెలుస్తారు, మరెందుకు ఇంకొకరు ఓడుతారు అనేది జవాబులేని ప్రశ్న. ఎవరైనా చేయగలిగింది జయాపజయాలను సమతుల్యంగా పరిగణించి ముందుకు సాగిపోవటమే! ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలే.

 

9 comments:

  1. >>తొమ్మిదిన్నరేళ్ళలో కేసీఆర్ సారథ్యంలోని ‘ఎనేబ్లింగ్ గవర్నెన్స్’ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అపూర్వమైన సంపద, శ్రేయస్సు చేకూరినప్పటికీ, అన్ని ప్రామాణికాలలో అసాధారణమైన వృద్ధి నమోదు అయినప్పటికీ, ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఇచ్చి విజయాన్ని చేకూర్చారు.

    అలా అనటం భావ్యం కాదు.కెసీఆర్ ఎంతో గొప్పగా పాలించినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఇచ్చారని అనటం సబబు కాదు. ఆయన పాలన గొప్పగా ఏమీ లేదని భావించబట్టే ఆయన్ను ఓడించారని ఒప్పుకోవలసినదే.

    >>ప్రజలు కోరుకున్న దానికంటే, అవసరాలను మించి కేసీఆర్ వారికి ఇచ్చారేమో! ప్రభుత్వాలు పథకాల రూపకల్పనకు ముందు, అమలుకు ముందు, అవి ప్రజలకు ఏ మేరకు అవసరమో అనే విషయంలో శాస్త్రీయ విశ్లేషణ చేయాలేమో!

    ఇది దారుణమైన ఆరోపణ! ప్రజలకు అతిమేలు చేయటం అనేదే కేసీఆర్ చేసిన పొరపాటు అనటం తప్పు. పైగా ఎంత మేరకు మాత్రమే మంచిపాలన అందించటం మంచిదీ అని శాస్త్రీయ విశ్లేషణలు చేసుకోవాలీ అతి వర్జయేత్ అనటం ప్రజలవివేకాన్ని అవహేళన చేయటమే అవుతుంది.

    >>ప్రజాకర్షక నినాదాలు ఇచ్చినప్పటికీ, ఎమర్జెన్సీ అనంతరం 1977లో జరిగిన ఎన్నికలలో తాను పోటీ చేసిన స్థానంలో పరాజయం పాలవడమేగాక, కాంగ్రెస్ పార్టీని పరాజయం దిశగా నడిపించింది.

    ప్రజాకర్షణ అన్నది తప్పు. ఆమె స్వలాభానికి విధించిన ఎమర్జెన్సీ పెద్ద ప్రజాద్రోహం. అందుకే ప్రజలు ఆవిడకు బుధ్ధిచెప్పారు. అంతే కాని మీరు ముడిపెట్ట జూస్తున్నట్లు ఇందిరమ్మ చేసిన మేళ్ళేవో వెక్కసమై పోయి కాదండి.

    ఏది ఏమైనా మీయీవ్యాసం శ్రీమాన్ కేసీఆర్ గారికి ఎలాగైనా కొంచెం ఉపశమనం కలిగించటానికి వ్రాసినట్లుగా ఐతే ఉంది కాని మీరు హృదయపూర్వకంగా వ్రాసినట్లుగా అనిపించటం లేదు. నిర్మొగమాటంగా చెప్పాలీ అంటే ఈవ్యాసం బాగోలేదు.

    ReplyDelete
    Replies
    1. కేసీఆర్ ప్రభుత్వం లో తెలంగాణా మంచి అభివృద్ధి సాధించింది. అయితే ప్రజలు మార్పు కోరుకున్నారు.

      చేసిన మంచిని మెచ్చుకోకుండా ఏకపక్షంగా విమర్శించడం విజ్ఞుల లక్షణం కాదు.

      Delete
    2. ప్రజలు కేవలం సరదాకోసం మార్పును కోరుకోరు కదండీ? తగిన కారణం ఉందనుకుంటేనే కదా మార్పును కోరుకున్నది? గొప్ప అభివృద్ధి సాధించినా దించేసారూ అనటం ప్రజల వివేకాన్ని అవహేళన చేయటమే అవుతుంది.

      Delete
    3. జ్వాలా గారి భావం మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ పట్ల prejudice మీ వ్యాఖ్య లో కనపడుతుంది. అభివృద్ధి ఎంత జరిగినా ఇతర కారణాలు, fatigue ఉంటాయి. familiarity breeds contempt అంటారు. ప్రజలను అవ హేళన చేయడం ఏముంది ఇందులో. twisted logic సరికాదు. మీరు ఎవరినీ మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం చూడలేదు. ఆంధ్ర లో తెదేపా ఓడిపోయినప్పుడు ఇదే లాజిక్ ఎందుకు చెప్పలేదు. రాశి పోసినట్లు మంచి చెడూ ఉండవు. చెడును విమర్శించి మంచిని విస్మరించడం సరికాదు.

      Delete
    4. విషయానికి కట్టుబడి మాట్లాడండి అనామకులవారూ. వ్యాసంలో చెప్పినది కేసీఆర్ మంచి చేసినా ఓడించారని. ప్రజలు అలా మంచి జరిగింది అనుకుటే ఆయన్న గెలిపించే వారే కాని వారు అలా ఆనుకోలేదని అభిప్రాయం వెలిబుచ్చాను.

      అవసరానికి మించిన మంచి చేయటమే కేసీఆర్ పొరపాటు అనటం వ్యాసకర్త పొరపాటూ అసహనమూ అని చెప్పక తప్పదు.

      మధ్యలో మీరెవరో అనామకులు వచ్చి నాగురించి అనవసర వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం సబబు కాదు.

      Delete
    5. "అవసరానికి మించిన మంచి చేయటమే కేసీఆర్ పొరపాటు అనటం వ్యాసకర్త పొరపాటూ అసహనమూ అని చెప్పక తప్పదు." అయ్యా శ్యామలీయం గారు. దయచేసి ఇతరులను విమర్శించే ముందు ఒక్కసారి వారు రాసినదానిలోని భావాన్ని నిశితంగా పరిశీలించండి. నేను ఎన్ని రోజులనుండో మీ కామెంట్లను చోస్తున్నాను. ప్రతి చిన్న విషయంలోనూ అదేదో "రంద్రాన్వేషణ" అని అన్న చందాన ఎక్కడ తప్పు దొరుకుతుందా అని వెతకడమే తప్ప ఒక్క ఒప్పు కూడా మీ కంటికి, మనసుకు, భావనకు కనిపించగా నేను చూడలేదు. అయినా ఎప్పుడూ మీ విమర్శనను ఖండించే ప్రయత్నం చేయనూలేదు. ఇలాంటి వ్యాసాలూ కూడా మీకు నచ్చకపోతే, బహుశా .....మాటలు , పదాలు రావడం లేదు. మిమ్మల్ని కష్టపెడితే క్షంతవ్యుడను. కానీ, మీ ధోరణి మారాలి. మెచ్చుకునే మనస్తత్వం రావాలి. విశ్లేషణ సహేతుకంగా, భావయుక్తంగా వుండాలి. మీరు నచ్చడమే కాదు, పదుగురు నచ్చాలి. తదుపరి మీ ఇష్టం. నేను ఇలానే వుంటాను అంటే, అలాగే వుండాలని, భగవదనుగ్రహం మీకు సదా వుండాలనీ కోరుకుంటున్నాను.

      Delete
  2. I think every politician, especially, the ones who head the governments wants to do a good job. Here, a good job for some may not be the same for some other. Every leader's priorities are different, just like us. All of us won't buy the same thing if we have enough money, some buys flats/villas, some might buy luxury cars and some other gold or lands. We can't say who is right and who is wrong.

    Do what you think is required and true to yourself and leave the rest. It is like playing a game, you can't win always.

    Fundamentally, govern the state / country by the law of the land not by religious laws and give the people freedom of expression / speech.

    And finally, people should be rational and not blinded emotions.

    ReplyDelete
    Replies
    1. I meant, And finally, people should be rational and not blinded by emotions.

      Delete