Saturday, August 18, 2018

లక్ష్మణుడికి వాతాపీల్వలుల చరిత్ర చెప్పిన శ్రీరాముడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-22 : వనం జ్వాలా నరసింహారావు


లక్ష్మణుడికి వాతాపీల్వలుల చరిత్ర చెప్పిన శ్రీరాముడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-22
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (19-08-2018)

పూర్వం ఒకప్పుడు వాతాపి, ఇల్వలుడు అనే సోదరులు బ్రాహ్మణ వేషం వేసి బ్రాహ్మణులను చంపుతుండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ వేషం వేసుకుని, బ్రాహ్మణుల దగ్గరకు పోయి, ఆ రోజున తన ఇంట్లో శ్రాద్ధం వుందనీ, నిమంత్రణకు రమ్మనీ, సంస్కృత భాషలో పిలుస్తాడు. పిలిచింది నిజమైన బ్రాహ్మణుడే అని మోసపోయి అంగీకరిస్తారు బ్రాహ్మణులు. వాడు తన తమ్ముడిని మేకగా చేసి, చంపి, ఆ మాంసాన్ని బ్రాహ్మణులకు వడ్డించేవాడు. (పూర్వకాలంలో మాంసం తినేవారు బ్రాహ్మణులు కూడా. దానిలోని చెడు గుణాలను, ఇలాంటి మోసాలను తెలుసుకొని దానిని నిషేధించారు). బ్రాహ్మణులు నోరారా తిని పొట్టలు తడవుకొంటూ కూర్చోగానే, ఇల్వలుడు "వాతాపీ రమ్ము...అని పిలిచేవాడు. అలా పిలవగానే వాతాపి వారి పొట్టలు చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఆ బ్రాహ్మణులు చనిపోయేవారు. వారిని వారిరువురూ పీకి తినేవారు.

ఈ విధంగా రాక్షసులవల్ల వేలాది మంది బ్రాహ్మణులు చనిపోయారు. అప్పుడు దేవతలు ప్రార్థించగా అగస్త్యుడు వారిని తన తపఃప్రభావం వల్ల శాంతింప చేశాడు. ఒకనాడు వీరు అగస్త్యుడికి నిమంత్రణం చెప్పగా అయన అంగీకరించి, భోజనానికి వెళ్ళి సర్వం బక్షించాడు. శ్రాద్ధం ముగించిన తరువాత ఎప్పటిలాగా ఇల్వలుడు వాతాపీ అని పిలిచాడు. అగస్త్యుడు అప్పుడు “నీ తమ్ముడి మీద రాక్షసాధమా, ఎందుకు భ్రాంతి? నీ తమ్ముడు జీవించి వున్నాడని అనుకుంటున్నావా? నీ భ్రాత చచ్చిపోయాడని తెలియదా? నా కడుపులోంచి బయటకు రావడం సాధ్యమా? నీ తమ్ముడు ఎక్కడ వున్నాడో చెప్తా విను. మేకలాగా నా కడుపులో పడి జీర్ణమై నరకానికి పోయాడు తెలియదా?” అని మందహాసంతో పలికాడు.

తన తమ్ముడు చనిపోయాడని తెలుసుకున్న ఇల్వలుడు కోపంతో అగస్త్యుడిని చంపడానికి ఆయన మీదకు పోవదానికి ప్రయత్నించగా, ఆ ముని, నిప్పులు కక్కే చూపులతో అతడిని భస్మం చేశాడు. అలాంటి మహిమ కలవాడి ఆశ్రమం ఇదే లక్ష్మణా, అని చెప్పాడు శ్రీరాముడు. ఇలా చెప్తున్న సమయంలో సూర్యుడు అస్తమించే సమయం కావడంతో, సాయం సంధ్య వార్చి, మునీశ్వరుడు ఇచ్చిన పళ్లను తిని, ఆ రాత్రి అక్కడె గడిపారు సీతారామలక్ష్మణులు. ఆ తరువాత మునీశ్వరుడి అన్నను దర్శించడానికి పోవడానికి అనుమతి కోరారు. అనుమతి లభించగానే, సుతీక్ష్ణుడు చెప్పిన దారి వెంట పోసాగారు. దారిలో రకరకాల చెట్లను, పొదలను, తోపులను, మద్దులను, తాటిచెట్లను, తుమ్మ చెట్లను, పూల చెట్లను, ఆ వనంలో చూసారు. అలా పోతూ అగస్త్యుడి ఆశ్రమం పొలిమేరలకు చేరుకున్నారు.


అగస్త్యాశ్రమానికి చేరువవుతూనే శ్రీరాముడు లక్ష్మణుడితో, "లక్ష్మణా! ఇక్కడికి సమీపంలోనే తన మహిమవల్ల అగస్త్యుడని ప్రసిద్ధికెక్కిన మునీశ్వరుడి ఆశ్రమం వుంది. ఈ వనం హోమధూమంతో నిండి వుంది. అలసిపోయినవారికి విశ్రాంతినిస్తుంది. నారచీరెలతో అందంగా వుంది. శాంతమైన మృగాలున్నాయి. రమ్యమైన పక్షుల ధ్వనులు వినిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఋష్యాశ్రమాలలో చేరిన ప్రదేశమే. ఈ పుణ్యాత్ముడు ఈ దక్షిణ దిక్కికు వచ్చిన తరువాత రాక్షసులు క్రూర స్వభావం వదలి భయంతో ఋషులను సమీపించి హింసించడం లేదు. దక్షిణ దిశకు అగస్త్య దిశ అని పేరుంది. సూర్యుడిని అడ్దగించాలనుకున్న వింధ్యపర్వతం ఈయన ఆజ్ఞతో నేలతో సమానమైంది. అగస్త్యుడు చిరకాలం జీవించి వుండేవాడు. ఇతడి ఆశ్రమంలో అందరూ వినయవంతులు...భయభక్తులున్నవారు. ఈయనను వీరు-వారు అనే భేధం లేకుండా అందరూ సేవిస్తారు. కాబట్టి మనం సేవిస్తే మనకూ మేలు కలుగుతుంది. మనం వనవాసం చేయాల్సిన పద్నాలుగేళ్లలో గడచిపోయిన కాలం పోగా, మిగిలిన కాలం ఈయనను కొలిచి ఈ ఆశ్రమంలోనే వుందాం. ఈయన ఆహార నియమాలు కలవాడై అల్పాహారమే త్స్సుకుంటాడు కాబట్టి ఈయనను గంధర్వులు వచ్చి చూసి పోతుంటారు. వంచకులు, అసత్యవాదులు ఈ ఆశ్రమంలో బతకలేరు. దేవ-యక్ష-గంధర్వులు కూడా ఇక్కద ఆహార నియమలు పాటిస్తారు. ధర్మంలో ప్రేమగా వుంటారు. ఇక్కడ తపస్సు చేసిన అనేకమంది తమ తపస్సిద్ధి వల్ల దేహం వదలి సూర్య తేజంతో విమానాల మీద దేవలోకాలకు పోయారు. ఇక్కడికి ఋషులు మాత్రమే కాకుండా ఇతర భూతాలు కూడా వస్తు-పోతూ వుంటాయి. దేవతలను దర్శించి, వారిని స్తుతించి, నమస్కారం చేయడం వల్ల, దేవతలు వారికీ దేవత్వాన్ని, యక్షత్వాన్నీ అనుగ్రహిస్తారు. లక్ష్మణా, అగస్త్య్డి ఆశ్రమానికి వచ్చాం. నువ్వు ముందుగా పోయి, నేను, జానకి వచ్చామని చెప్పు. త్వరగా పో" అనగా లక్ష్మణుడు అలాగే చేశాడు.

No comments:

Post a Comment