Saturday, January 26, 2019

ప్రియాంక ఆగమనం నెహ్రూ-గాంధీ వారసత్వం కొనసాగింపే:వనం జ్వాలా నరసింహారావు


ప్రియాంక ఆగమనం నెహ్రూ-గాంధీ వారసత్వం కొనసాగింపే!
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (25-01-2019)
వారసత్వ రాజకీయాల కొన సాగింపుకు మరో మారు రంగం సిద్ధమౌతోందిఅఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా వున్న సోనియా తనయుడునెహ్రూ-గాంధీ కుటుంబ వారసత్వ పరంపరలో ఐదోతరంవాడైన రాహుల్ గాంధీ, పార్టీలోకి తన చెల్లెలును ఒక బాధ్యతాయుతమైన పదవిలోకి తీసుకున్నారు. ప్రధానకార్యదర్శి పదవిని ఆమెకు కట్టబెట్టాడు...అదీ...ఎక్కడో అమెరికాలో వున్న ఆమెను ఒప్పించి మరి అప్పగించాడు. ఇలా ఆమెకు పదవి ఇచ్చారో, లేదో, కాని ఆమెకు మరింత కీలక బాధ్యతలు, నిర్ణయాత్మకమైన బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ సీనియర్ నేతలు క్యూ కట్టుకుని మరీ డిమాండు చేస్తున్నారువారిలో కొందరు నేతలు మరొక్క అడుగు ముందుకు వేసి, 2019 ఎన్నికలలో ఆమెను  ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని అన్నా ఆశ్చర్యం లేదు.

ఏదేమైనా నెహ్రూ-గాంధీ వారసత్వాన్ని పదిలంగా వుంచే ప్రయత్నాలు కొనసాగుతూనే వున్నాయి. 'రావాలి... రావాలి...రావాలి...' అని అందరూ ఆహ్వానిస్తుంటే ఎందుకు రాకూడదని అనుకున్నదేమో ఏమో కానివచ్చేస్తున్నానంటూ బదులు పలకనే పలికింది ప్రియాంక. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడానికి తాను సిద్ధం అని ఆమె అన్నట్లే లెక్క. 1999 లో ఏ విధంగానైతేపార్టీ అవసరాల దృష్ట్యా సోనియా గాంధీకి మొదలు సభ్యత్వంఆ తరువాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కట్టబెట్టారోఅదే తరహాలోఆమె వారసుడిగా మొదలు రాహుల్ గాంధీ ఎంపిక, ఇప్పుడు ప్రియాంక గాంధీ ఎంపిక జరిగందనాలి.  నెహ్రూ-గాంధీ వారసత్వ రాజకీయాలు భారత దేశానికి కొత్తేమీ కాదు.

రాజకీయాలలో వారసత్వంగా ఎదగ గలిగిన వారు అనేకమంది వున్నారు. దానికి కారణాలు అనేకంఎన్.టీ రామారావు లాంటి వారు పటేల్-పట్వారీ వ్యవస్థనైతే రద్దు చేయగలిగారు కానివారసత్వంగా ఎదుగుతున్న రాజకీయ పటేల్-పట్వారీలను ఆపు చేయలేకపోయారు.ఇదేదో ఒకరిద్దరి విషయంలోనో-లేక కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి విషయంలోనో జరుగుతే ఆశ్చర్యపడాల్నేమో కానిభారత దేశ రాజకీయాల్లో సర్వ సాధారణ విషయమై పోయిప్రజాస్వామ్యానికే పెను సవాలుగా మారుతుంటే ఆశ్చర్యపడక తప్పదురాజకీయాల్లో కీలకమైన పదవులను పొందిఉన్నత స్థాయికి చేరుకున్న వారి బంధుగణం అతి పిన్న వయసులోనేరాజకీయ ప్రవేశం చేసిచకచకా ఎదగడం సంప్రదాయంగా మారుతోంది

అసలు ప్రజాస్వామ్యమే వారసత్వంగా మారుతున్నదా?ఔననక తప్పదునెహ్రూ-గాంధీ కుటుంబం జాతీయ స్థాయిలో(మంచికో-చెడుకోఈ ప్రక్రియకు బీజాలు నాటితేదేశవ్యాప్తంగా వాటి మొక్కలు పెరిగిభారీ వట వృక్షాలుగా వూడలు పెంచిపెకలించడానికి సాధ్యపడని స్థితికి చేరుకుంది. "వారసత్వం జన్మ హక్కుఅని వాదించే స్థాయికి చేరుకుందిసుమారు తొంబై సంవత్సరాల క్రితం బ్రిటీష్ ఇండియాలోన్యూఢిల్లీ నుంచి "సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ"కి ఆ కుటుంబం మొదటి తరం నాయకుడు మోతీలాల్ నెహ్రూ ఎన్నికైన తర్వాతఆ కుటుంబానికి సంబంధించిన దాదాపు అందరూ చట్ట సభల్లో అడుగు పెట్టారుకాకపోతేఅందులో పలువురు వారి-వారి సామర్థ్యాన్ని బట్టే ఆ పదవులకు చేరుకుని వుండవచ్చు. కుటుంబ నేపధ్యం తప్పక ఉపయోగపడిందనాలి.

ఒక తరం నుంచి మరో తరానికి రాజకీయాధికారం బదిలీ అవుతోందిలా. వారసత్వ రాజకీయాలు-కుటుంబ రాజకీయాలు దేశ భవిష్యత్ ను శాసించే దిశగా కదులుతున్నాయిరాచరిక వ్యవస్థకు సంబంధించిన రాజకీయాలకు అలవాటు బడిన భారతీయులకుఅనాదిగారాజులు-మహారాజులు-చక్రవర్తులు తమ తమ కొడుకులను-కూతుళ్లను తమ తదనంతరం సింహాసనం అధిష్టింప చేసేందుకు పన్నే వ్యూహాల గురించిన కథలను విన్నారుప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతాలను ఇంకా సరిగ్గా అవగాహన చేసుకోలేని అమాయక భారతీయులుబహుశా వర్తమాన రాజకీయాలలోనూవారసత్వంగాతమ సంతానం నాయకత్వం చేపట్టడంలో తప్పులేదని భావిస్తుండవచ్చుఅలా మొదటి తరం నాయకులు తమ వారసులుగా సంతానాన్ని తేవడంలో అ నైతికం లేదనే వారి భావన కావచ్చుఅందుకేస్థానిక సంస్థల నుంచిప్రధాన మంత్రి స్థాయి వరకువంశ పారంపర్యంగా కొన్ని కుటుంబాలకు చెందిన వారికే రాజకీయాధికారం లభిస్తోంది


ఒక్క సారి అధికారంలోకి రావడంతోనేతమ సర్వ శక్తులను ఒడ్డిబయట వారెవరినీ రాకుండాతమ వారినే తమ వారసులుగా చేసే ప్రజాస్వామ్య రాచరిక వ్యవస్థ వేళ్లూనుకోసాగిందిదీని పర్యవసానం ఏంటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదుదీనికి అడ్డు కట్ట వేయడం సాధ్యమేనాభారత దేశంలోని రాజకీయ పార్టీలన్నీఅవినీతిని ఉత్పత్తిచేసేవంశపారంపర్య కుటుంబ వ్యవస్థలువీటిని పెంచి పోషించే వ్యక్తులుతమ కుటుంబీకులను తప్పవెలుపల వారిని,తమ గుప్పిట్లో వుంచుకున్న పార్టీలోకి అడుగుబెట్టనివ్వరులోపలున్న వారి గొంతు నొక్కేసిఅసమ్మతి రాగాన్ని వినిపించకుండా జాగ్రత్త పడతారుఫలితంగా అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోవడం,ధన బలం-కండ బలం-కులమత బలం ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర పోషించడం జరుగుతుందిప్రజ్ఞా పాటవాలు-శక్తి సామర్థ్యాలున్న సాటి-తోటి పౌరులుసమాజానికి ఎంతో సేవ చేయాలని వున్నాదానికి కావాల్సిన రాజకీయ కుటుంబ నేపధ్యం లేకపోవడంతోఎన్నికల్లో పోటీ చేయలేక పోవడంచేసినాగెలిచి చట్ట సభల్లో ప్రవేశించలేక పోవడం కష్టమై పోతోందిఈ పరిస్థితి ఇలా కొనసాగితేభారత ప్రజాస్వామ్యంప్రజల భాగస్వామ్యం లేనిది గాను-ప్రజల సాధికారత కొరవడేదిగాను కావడం తథ్యంప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సారధ్యంలో ఆయా రాజకీయ నాయకుల కుటుంబ పాలన కొనసాగి, "ప్రజాస్వామ్య సంస్థానాలుఆవిర్భవించే ప్రమాదం పొంచి వుంది.

          ఈ ప్రమాదానికివారసత్వ సంస్కృతికి కారకులెవరంటే,జవాబుగా కాంగ్రెస్ పార్టీ అని ఎవరైనా వెంటనే చెప్తారుతండ్రి మోతీలాల్ నుంచి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని వారసత్వంగా పొందిన జవహర్లాల్ నెహ్రూవ్యూహాత్మకంగా-పకడ్బందీగా కుటుంబ వారసత్వ పాలనకుఆయన ప్రధానిగా వున్న కాలంలోనే పునాదులు వేశారుకూతురు ఇందిర ప్రధాని కావాలని నెహ్రూ భావించారుఆయన కోరిక నెరవేరిందిఇందిరా గాంధీ కూడా తండ్రి-తాత బాటలోనే పయనించిందిమొదట సంజయ్ గాంధీని,తర్వాత రాజీవ్ గాంధీని తెర పైకి తెచ్చింది తన వారసుడిగా. ఎమర్జెన్సీ ముందరతర్వాత సంజయ్ గాంధీ ప్రభావం ఇందిరపై బాగా పనిచేసిందివిమాన ప్రమాదంలో సంజయ్ దుర్మరణం తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే

సంజయ్ వస్తాడనుకున్న స్థానాన్ని రాజీవ్ఇందిర మరణం తర్వాత భర్తీ చేశాడుఆ తర్వాతమకుటం లేని మహారాణిగాసోనియా వారసత్వం స్వీకరించారుఇక ముందుంది రాహుల్, ప్రియాంకాగాంధీల పర్వంఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది కాదాఏమోరాచరికంలో లేని వారసత్వం ప్రజాస్వామ్యంలో సుసాధ్యం చేసిన ఘనత మనదేప్రజాస్వామ్యాన్ని మించిన పాలనా విధానం లేనే లేదుఅధికారంలో తమ వాళ్ళే వుండిపోవాలన్న కాంక్షతోకొందరు వ్యక్తులు "ప్రజాస్వామ్యాన్ని" "వారసత్వ స్వామ్యంగా మలిచేశారుప్రజాస్వామ్యాన్ని-రాజకీయ వ్యవస్థను గేలి చేసిహాస్యాస్పదం చేశారుప్రపంచంలో మనను చిన్న చూపు చూసే పరిస్థితి కలిగించారుఈ పాపంలో అన్ని రాజకీయ పార్టీలకు-నాయకులకు అంతోఇంతో భాగం వుందివారసత్వంగా ఎదిగిన-ఎదుగుతున్న వారిలో ఏ కొద్ది మందో తప్పచాలా మంది అలా ఎదగడానికి కేవలం రాజకీయ-కుటుంబ నేపధ్యమే కారణం అనక తప్పదుప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయిందీ కారణాన.

2 comments:

  1. వనంవారు, "వారసత్వ రాజకీయాల కొన సాగింపుకు మరో మారు రంగం సిద్ధమౌతోంది." అని మొదలుపెట్టారు. మరి కేటీఆర్ గారు మాత్రం కేసీఆర్ గారి వారసత్వం కాదా రాజకీయాల్లో? అంతా ఒకతాను ముక్కలేనండీ.

    ReplyDelete
    Replies
    1. వనంవారూ, మీరు ముక్తాయింపుగా అన్న మాటలు " ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయిందీ కారణాన" అన్నవి శ్రీమాన్ కేటీఆర్ గారికి కూడా వర్తిస్తాయి కదా నిస్సందేహంగా? కొంపదీసి వారికి మాత్రం మినహాయింపు ఇస్తున్నారా ప్రత్యేకంగా?

      Delete